దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
సీతానగరం: జాతీయస్థాయిలో కార్మికులు, ఉద్యోగులు, ప్రజా సంఘాల సబ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించనందుకు నిరసనగా ఫిబ్రవరి 12న జరిగే సమ్మెలో అందరూ భాగస్వాములు కావాలని సీఐటీయూ రాష్ట్రకమిటీ సభ్యురాలు కె.సుబ్బరావమ్మ కోరారు. ఈ మేరకు పార్వతీపురం, సీతానగరం మండలాల్లోని పలుగ్రామాల్లో సీఐటీయూ, వ్యవసాయ కార్మికసంఘాల నాయకులతో కలిసి సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా సీతానగరం మండలంలోని మరిపివలస, చిన్నారాయుడుపేట, సీతానగరం గ్రామాల్లో ప్రచారం చేశారు.
బైక్ అదుపుతప్పి తీవ్ర గాయాలు
పార్వతీపురం రూరల్: ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లి వస్తుండగా అదుపు తప్పడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుచ్చిమి గ్రామానికి చెందిన గుత్తవల్లి మహేష్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయమైంది. గమనించిన స్థానికులు మహేష్ బంధువులకు సమాచారం ఇచ్చి 108 వాహనంలో పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్కు తరలించారు.


