పాపం... పసివాళ్లు..!
–8లో
బ్యాంకర్లు ఆర్థిక వృద్ధికి తోడ్పడాలి
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, రుణాల మంజూరు ప్రక్రియలో బ్యాంకర్లు ఉత్సాహంగా పాల్గొని జిల్లా ఆర్థిక వృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు.
జియ్యమ్మవలస రూరల్: ఇంటిలో రాజుకున్న కుంపటి పొగ.... ఆ చిన్నారులకు తల్లిదండ్రులను, తమ్ముడిని దూరం చేసింది. అనాథలను చేసింది. భవిష్యత్తుపై బెంగను పెంచింది. పాఠశాలలో పెట్టిన మధ్యాహ్న భోజనంతోనే కడుపునింపుకోవాల్సిన పరిస్థితి. సెలవులిస్తే.. వారి పోషణ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న.. వృద్ధులైన నాన్నమ్మ, తాతయ్యను ఆవేదనకు గురిచేస్తోంది.
జియ్యమ్మవలస మండలం వనిజ గ్రామంలో గత నెల 23న ఇంటిలో నిప్పుల కుంపటి పొగకు ఊపిరాడక మీనక మధుసూదనరావు, సత్యవతి దంపతులు, వారి కుమారుడు మోసు చనిపోయిన సంగతి తెలిసిందే. మధుసూదనరావు, సత్యవతి దంపతులకు నలుగురు సంతానం. వీరిలో ముగ్గురు ఆడపిల్లలు కాగా, ఒక బాబు. తాపీమేస్త్రి అయిన తండ్రి, వ్యవసాయ కూలీ అయిన తల్లి నిరంతరం కష్టపడుతూ పిల్లలకు ఏ లోటూలేకుండా సాకుతూవచ్చారు. అనుకోని ప్రమాదంలో కుమారుడితో పాటు వారు కూడా తనువు చాలించారు. ఆ ప్రమాదంలో గాయపడిన మరో చిన్నారి ఆయుష్ కేజీహెచ్లో చికిత్స పొందుతూ కోలుకుంది. ఇప్పుడు ఈ ముగ్గరి చిన్నారుల భవిష్యత్తుపై చీకట్లు అలముకున్నాయి. ప్రస్తుతానికి వృద్ధులైన నాన్నమ్మ మీనక సోములమ్మ, తాతయ్య గౌరు సాకుతున్నారు. పెద్దపాప మాధురి చినమేరంగిలోని కేజీబీవీలో ఏడోతరగతి చదువుతుండగా, మరో బాలిక మోక్ష బొమ్మికలో నాలుగో తరగతి చదువుతోంది. ఆయుష్ ప్రస్తుతం తాత, నాన్నమ్మ సంరక్షణలో ఉంది. వీరిది కూలిచేస్తే గాని కుండాడని కుటుంబం. తల్లిదండ్రులు కష్టపడి పిల్లలను సాకేవారు. ప్రస్తుతం ఆ భరోసా కరువైంది. పాఠశాలలో పెట్టిన మధ్యాహ్న భోజనంతోనే కాలంగడపాల్సిన పరిస్థితి. పాఠశాలలకు సెలవులిస్తే.. ముగ్గురు పిల్లలను సాకగలమా? లేదా? అంటూ ఇప్పటి నుంచే నాన్నమ్మ, తాతయ్యలు మనోవేదన చెందుతున్నారు. తాము మరణిస్తే ఆడపిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని కన్నీరుపెడుతున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డల భవితకు చక్కని దారిచూపాలని అధికారులు, పాలకులను వేడుకుంటున్నారు. ఆపన్నహస్తం అందించాలని దయార్థహృదయులను చేతులెత్తి ప్రార్థిస్తున్నారు.
కుంపటి పొగకు ఊపిరాడక తల్లిదండ్రులు, తమ్ముడు మృతి
అనాథలుగా మారిన ముగ్గురు
గిరిజన బాలికలు
తాముచనిపోతే వారికి దిక్కెవరంటూ తాత, నాన్నమ్మ ఆవేదన


