Andhra Pradesh
-
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు
మహారాణిపేట (విశాఖ)/సాక్షి నెట్వర్క్: ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. తాజాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ ద్రోణి వల్ల రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఉపరితల ఆవర్తనం వల్ల ఇప్పటికే నైరుతి రుతుపవనాల కదలిక జోరుగా ఉంది.రానున్న మూడు రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిప్రాంతాల్లో గంటకు 40 –50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. ఉమ్మడి కృష్ణాజిల్లాను 2 రోజులుగా వర్షాలు వీడటం లేదుమచిలీపట్నంతోపాటు కృష్ణాజిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం వర్షం కురిసింది. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. తాజాగా రాత్రి 8 గంటల సమయంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో జోరు వాన కురిసింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. » గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు గుంటూరు నగరంతోపాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గుంటూరులో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మే నెల 21 వరకు జిల్లా సాధారణ వర్షపాతం 42.8 మిల్లీ మీటర్లు కాగా, ఇప్పటి వరకు 106.2 మి.మీ వర్షపాతం నమోదైంది. » ప్రకాశం జిల్లాలో బుధవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. గిద్దలూరు, మార్కాపురం, వైపాలెం, కనిగిరి నియోజకవర్గాల్లో ఉరుము లు, మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి. అత్యధికంగా దోర్నాల మండలంలో 10.2 మి.మీ వర్షపాతం నమోదైంది. తీగలేరు పొంగిపొర్లడంతో మార్కాపురం–దోర్నాల మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. » శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో బుధవారం జోరు వాన కురిసింది. నెల్లూరులోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. -
కూటమి ప్రభుత్వ అరాచకాలను దీటుగా ఎదుర్కొందాం
సాక్షి, అమరావతి/తిరువూరు: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ జరుగుతోందని.. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా కూటమి నేతలు బరితెగించి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను దీటుగా ఎదుర్కొందామన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ను ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు కలిశారు. చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా తమపై టీడీపీ నాయకులు చేసిన దాడుల గురించి వివరించారు. పోలీసులు, కూటమి నేతలు, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన తీరును వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ అరాచకాలు, దాష్టీకాలను దీటుగా ఎదుర్కొందామని.. చట్టపరంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనేక ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా నిలబడ్డారంటూ కౌన్సిలర్లను అభినందించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్, తిరువూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాసు, కౌన్సిలర్లు తంగిరాల వెంకటరెడ్డి, పరసా శ్రీనివాసరావు, మోదుగు ప్రసాద్, ఇనపనూరి చిన్నారి, పాలం రమాదేవి, గుమ్మా వెంకటేశ్వరి, పరసా సత్యనారాయణ, వెలుగోటి విజయలక్ష్మి, షేక్ నదియా, రామవరపు మంజుల, జెడ్పీటీసీ సభ్యుడు యరమల రామచంద్రారెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ నల్లగట్ల సుధారాణి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కలకొండ రవికుమార్, సీనియర్ నాయకులు మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, నరెడ్ల వీరారెడ్డి, తిరువూరు మండలాధ్యక్షుడు తాళ్లూరి నవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారునేడు వైఎస్ జగన్ మీడియా సమావేశంసాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడతారు. -
స్లీపర్ సెల్స్ సంగతి తేల్చండి
సాక్షి, అమరావతి: పహల్గాం ఉగ్రదాడి అనంతరం కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్లీపర్ సెల్స్ను గుర్తించే విషయంలో విచారణ జరపాలని డీజీపీని ఆదేశించింది. రాష్ట్రంలో స్లీపర్స్ సెల్స్కు సంబంధించి తదుపరి విచారణ నాటికి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని తేల్చిచెప్పింది.ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.స్లీపర్ సెల్స్ ఉన్నా పట్టించుకోవడం లేదుపహల్గాం ఉగ్రదాడి తరువాత దేశవ్యాప్తంగా 20వేల మంది స్లీపర్ సెల్స్ రహస్యంగా పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నారని హైకోర్టు న్యాయవాది సూరపరెడ్డి గౌతమి, వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన ఎ.శివకుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్నారు. వీరిలో 1,200 మంది ఏపీలోని నంద్యాల, గుంటూరు, వైఎస్సార్ తదితర జిల్లాల్లో ఆశ్రయం పొందుతున్నారని, ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు నివేదికలిచ్చినా రాష్ట్ర హోంశాఖ, డీజీపీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై జస్టిస్ హరినాథ్ ఇటీవల విచారణ జరిపారు. గౌతమి తరఫున కోనపల్లి నర్సిరెడ్డి, శివకుమార్ తరఫున బూదాటి జ్ఞానేంద్ర కుమార్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పహల్గాం ఉగ్రదాడి తరువాత కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 20వేల మంది స్లీపర్ సెల్స్ ఉన్నట్టు, వారంతా పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చాయని న్యాయవాది నర్సిరెడ్డి పేర్కొన్నారు. ఏపీలో పోలీసు యంత్రాంగం ఈ హెచ్చరికలను పట్టించుకోవడం లేదన్నారు. ఉగ్రమూకలకు సహకరిస్తున్న వారి విషయంలో చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో విచారణ నిమిత్తం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు.ఎన్ఐఏకు నోటీసులుఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు నోటీసులు జారీ చేశారు. పిటిషనర్లు సమర్పించిన వివరాలను పరిగణనలోకి తీసుకుని, స్లీపర్స్ సెల్స్ విషయంలో విచారణ జరిపి నివేదికను తమ ముందుంచాలని డీజీపీని ఆదేశించారు. బాంబు పేలుళ్లు సృష్టించేందుకు కుట్ర పన్నారంటూ విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్, తెలంగాణకు చెందిన సమీర్లను పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. -
45 ఏళ్ల అజ్ఞాతం.. అడవిలోనే అంతం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/కాజీపేట అర్బన్: మావోయిస్టు పార్టీ తన ప్రస్థానంలో ఎన్నో ఎదురు దెబ్బలు కాసింది. కానీ.. ఆ పార్టీకి బుధవారం తగిలిన ఎదురుదెబ్బ మాత్రం అశనిపాతమే. పార్టీ సుప్రీం కమాండర్గా ఉన్న ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (ఎన్కే) అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్న ఎవరూ ఊహించని విధంగా ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసు తూటాలకు నేలకొరిగారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో దిట్టగా గుర్తింపు పొందిన నంబాల అనేక భారీ దాడులకు వ్యూహకర్తగా వ్యవహరించారు. విద్యార్థి దశ నుంచే.. కేశవరావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని జియ్యన్నపేట. వాసుదేవరావు, లక్ష్మీనారాయణమ్మ దంపతులకు 1955లో జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరులు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. తండ్రి ఉపాధ్యాయుడు కాగా 1 నుంచి 5 వరకు స్వగ్రామమైన జియ్యన్నపేటలోనే విద్యనభ్యసించారు. ఆ తర్వాత 6 నుంచి 10 వరకు టెక్కలి మండలం తలగాం ఎట్ నౌపడ ఆర్ఎస్లోను, టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్, టెక్కలి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. కబడ్డీ, వాలీబాల్ క్రీడాకారుడిగా రాణించిన కేశవరావు విద్యార్థి దశలోనే విప్లవ భావజాలానికి ఆకర్షితుడయ్యారు. విద్యార్థి దశలో తన స్వగ్రామం వచ్చి తనకు రావాల్సిన వాటాను ఆస్తిగా ఇస్తే, పేదలకు పంపిణీ చేస్తానని తండ్రిని అడిగినట్టు సమాచారం. వరంగల్లోని రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీలో (ఇప్పటి నిట్) బీటెక్ చేశారు. ఆ సమయంలోనే విప్లవ పార్టీలతో పరిచయాలు ఏర్పడ్డాయి. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్యూ) సభ్యుడిగా చేరిన ఆయనకు సీపీఐ (ఎంఎల్) అగ్రనేతలు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. మలుపు తిప్పినఎంటెక్..ఎంటెక్ చదువుతుండగా కళాశాలలోని మెస్లో జరిగిన చిన్నపాటి వివాదం కేశవరావు జీవితాన్ని మలుపు తిప్పింది. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా కేశవరావు ఉన్న సమయంలో మరో విద్యార్థి సంఘం ఏబీవీపీతో జరిగిన వివాదానికి సంబంధించిన కేసులో ఆయన చిక్కుకున్నారు. అరెస్టు చేస్తారన్న సమాచారంతో.. 1980లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కేశవరావు 1982లో చింతపల్లి ప్రాంతంలో పోలీసులకు పట్టుబడ్డారు. విశాఖపట్టణం సెంట్రల్ జైలులో ఉండి బెయిల్పై బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆయన ఆచూకీ లేదు.ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు..కేశవరావు విప్లవ పార్టీలో చేరిన తరువాత ఒక్కసారి కూడా తన స్వగ్రామం జియ్యన్నపేటకు రాలేదు. 1980లో పీపుల్స్ వార్ పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తొలుత గంగన్న అనే పేరుతో పీపుల్స్ వార్ ఈస్ట్ డివిజన్ కార్యదర్శిగా చేశారు. 1987లో ఈస్ట్ డివిజన్ను విస్తరించి ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ దండకారణ్య కమిటీ ఏర్పాటు ఆయన ఆలోచనే. ఆ కమిటీలో కేశవరావుతో పాటు మల్లోజుల కోటేశ్వరరావు, కటకం సుదర్శన్ కీలకపాత్ర పోషించారు.ఎల్టీటీఈ ద్వారా శిక్షణ1990లో కేశవరావు పీపుల్స్వార్ పార్టీ అగ్రనేతగా ఎదిగారు. ఆ తరువాత పీపుల్స్ వార్ పార్టీకి గుండెకాయ వంటి దండకారణ్య కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. కేశవరావు పేలుడు పదార్థాల తయారీ నిపుణుడిగా, మిలటరీ ఆపరేషన్ల వ్యూహ నిపుణుడిగా గుర్తింపు పొందారు. అప్పటి పీపుల్స్వార్ పార్టీ కీలక నేతలు మల్లోజుల కోటేశ్వరరావు, మల్లోజుల వేణుగోపాల్, మల్లా రాజిరెడ్డిలతో కలసి 1987లో మధ్యప్రదేశ్లోని బస్తర్ అడవుల్లో పేలుడు పదార్థాల ప్రయోగం, గెరిల్లా దాడుల్లో శిక్షణ పొందారు. ఎల్టీటీఈ ద్వారా వీరు ఈ శిక్షణ తీసుకున్నారు. దేశవ్యాప్త మిలటరీ ఆపరేషన్లకు నేతృత్వం పీపుల్స్వార్ పార్టీలో ప్రత్యేక మిలటరీ ఆపరేషన్స్ విభాగం ఏర్పాటు చేయాలని 1995లో గణపతి, కేశవరావు భావించారు. ఆ మిలటరీ ఆపరేషన్స్ విభాగానికి బసవరాజు, బీఆర్ పేర్లతో కేశవరావే నేతృత్వం వహించారు. 2001లో పీపుల్స్వార్ 7వ కాంగ్రెస్లో సెంట్రల్ మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా నియమితులయ్యారు. అప్పటివరకు దండకారణ్య ప్రాంతానికే పరిమితమైన ఆయన ఆ తర్వాత దేశవ్యాప్తంగా పీపుల్స్వార్ పార్టీ మిలటరీ ఆపరేషన్లను పర్యవేక్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి బిహార్, ఉమ్మడి మధ్యప్రదేశ్, ఒడిశాలో వేలాదిమందికి గెరిల్లా పోరాటంలో శిక్షణ ఇచ్చారు.2016లో సుప్రీం కమాండర్గా..పీపుల్స్వార్, మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ సెంటర్(ఎంసీసీ)ను విలీనం చేయడంలో గణపతి, కేశవరావు జోడీ ప్రధాన పాత్ర పోషించింది. గణపతి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేయగా.. కేశవరావు మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా వ్యవహరించారు. 2016లో వయోభారంతో గణపతి ఆ పదవి నుంచి వైదొలగడంతో ప్రధాన కార్యదర్శి హోదాలో కేశవరావు సుప్రీం కమాండర్గా నియమితులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో రెండు దశాబ్దాల పాటు పీపుల్స్వార్/మావోయిస్టు పార్టీ జరిపిన అన్ని ప్రధాన దాడుల వెనుక వ్యూహకర్త నంబాల కేశవరావే అని పోలీసులు చెబుతారు. గెరిల్లా వార్ఫేర్, ఆయుధాల తయారీ, మెరుపు దాడులు చేయడం వంటి అంశాల్లో నంబాల కేశవరావుకు దిట్టగా పేరుంది. స్వతహాగా ఇంజనీరింగ్ చదివి ఉండడంతో ఆ నైపుణ్యాన్ని పార్టీ బలోపేతానికి వినియోగించినట్టు చెబుతారు. పీపుల్స్వార్ చరిత్రలో తొలిసారి 1987లో తూర్పుగోదావరి జిల్లా దారగడ్డలో పోలీసు బలగాలపై గెరిల్లా దళం దాడికి కేశవరావు నేతృత్వం వహించారు. ఆ దాడిలో ఆరుగురు పోలీసులు మరణించారు. అలిపిరి ఘటనకు, ఇతర భారీ దాడులకు బాధ్యుడు 2003 అక్టోబర్ 1న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తిరుపతిలోని అలిపిరిలో క్లెమోర్ మైన్ దాడి వ్యూహం కేశవరావుదే. 2008లో ఒడిశా నాయగఢ్లో పోలీసుల ఆయుధాగారంపై దాడిచేసి వెయ్యికి పైగా ఆధునిక ఆయుధాలను అపహరించుకుపోయిన దాడికి నేతృత్వం వహించారు. 2010లో ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో 76 మంది సీఆర్పీఎఫ్ బలగాలను బలిగొన్న దాడికి వ్యూహకర్త నంబాల కేశవరావే. ఆ దాడికి హిడ్మా నేతృత్వం వహించాడు. 2013లో ఛత్తీస్గఢ్ మాజీ మంత్రి, మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వా జడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మతో పాటు కాంగ్రెస్ నేత నందకుమార్ మరో 27మందిని బలిగొన్న దాడికి కూడా కేశవరావే వ్యూహకర్త. విశాఖ జిల్లా అరకులో అప్పటి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య ఘటనలోనూ కేశవరావు ప్రమేయం ఉందన్న వాదనలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నయాగరా, చింతల్నార్, బలిమెల వంటి దాడులు కూడా ఆయన నేతృత్వంలోనే చోటుచేసుకున్నాయి. శత్రువులుగా భావించిన వారికి మాటల కంటే తూటాలతోనే ఎక్కువ బదులిస్తారనే పేరు మోశారు. కాగా బసవరాజు పేరు ఏపీ, తెలంగాణలో కంటే జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది.నీడను కూడా నమ్మని మావోయిస్టు పార్టీ గెరిల్లా పోరాట పంథానుఅనుసరిస్తుండటంతో మావోయిస్టు పార్టీ నీడను సైతం నమ్మకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. పార్టీలో ఏదైనా విభాగానికి నిర్దిష్టమైన పనులు తప్ప మొత్తం వ్యవహారంపై అవగాహన ఉండదు. అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిట్బ్యూరో, సెంట్రల్ మిలటరీ కమిషన్, రాష్ట్ర కమిటీలు, వివిధ డివిజన్ కమిటీలను సమన్వయం చేయడం, ఆర్థిక, ఆయుధ వ్యవహారాలను చక్కదిద్దడం వంటి పనులు చూస్తుంటారు.ఎక్కడ నుంచి ఆయుధాలు వస్తుంటాయి, ఆర్థిక వనరుల ఆనుపానులు ఎక్కడ ఉంటాయి, పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎక్కడ షెల్టర్లలో ఉన్నారనే అంశాలు కూడా ఆయనకే ఎక్కువగా తెలుస్తాయి. ఇప్పటికే పెరిగిన నిర్బంధంతో ఆ పార్టీ విభాగాలు, కీలక నేతలు చెల్లాచెదురయ్యారు. ఇప్పుడు కేంద్ర కార్యదర్శే చనిపోవడంతో పార్టీకి సంబంధించిన వివిధ విభాగాల మధ్య సమన్వయం దెబ్బతినే అవకాశముందని భావిస్తున్నారు. ఒక్కసారి చిక్కినా విదిలించుకుని.. నంబాల కేశవరావు విద్యార్థి సంఘాలు ఆర్ఎస్యూ, ఏబీవీపీ ఘర్షణల్లో ఒక్కసారి మాత్రమే అరెస్టయ్యారు. 1987లో విశాఖపటా్ననికి ఒంటరిగా వచ్చిన ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే కబడ్డీ క్రీడాకారుడు కావడంతో చాకచక్యంగా విదిలించుకుని పరారయ్యారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఆయనపై రూ.10 లక్షలతో మొదలైన పోలీసు రివార్డు రూ.1.50 కోట్లకు చేరుకుంది. పోలీసు శాఖ మోస్ట్వాంటెడ్ లిస్టులో అత్యధిక రివార్డు కేశవరావుపైనే ఉందని సమాచారం. 45 ఏళ్ల క్రితం విద్యార్థిథగా ఇంటిని వదిలివెళ్లిన కేశవరావు మావోయిస్టు అగ్రనేతగా ఎదిగి అప్పట్నుంచీ అజ్ఞాతంలోనే జీవితాన్ని గడిపారు. చివరకు అడవిలోనే ప్రాణాలు విడిచారు. కేశవరావు కుటుంబం విశాఖపట్నంలోనే స్థిరపడింది. -
ఆ వాఙ్మూలం ముమ్మాటికీ చెల్లదు!
ఆంధ్రప్రదేశ్ మద్యం విధానం కేసులో కె. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసే సమయంలో సహనిందితుల నేరాంగీకార వాఙ్మూలానికి సంబంధించి హైకోర్టు అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కేవలం సహనిందితుడి నేరాంగీకారం ఆధారంగా ఒక వ్యక్తి బెయిల్పై నిర్ణయం తీసుకోరాదని వ్యాఖ్యానించింది. సీఆర్పీసీ 161 సెక్షన్ కింద ఇచ్చిన వాఙ్మూలాన్ని మరొకరికి వ్యతిరేకంగా ఉపయోగించరాదన్నది ప్రాథమిక సూత్రమని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ‘భారతీయ సాక్ష్యాల చట్టం–1872’ సెక్షన్ 30 కింద తుది విచారణ సందర్భంగా ఏ వాఙ్మూలాలను అయితే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందో, వాటిని ముందస్తు బెయిల్, బెయిల్ మంజూరు సమయంలో కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని హైకోర్టు చెప్పడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది.ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో పిటిషనర్లకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఎందుకు నిరాకరించింది అనేది ముఖ్య మైన ప్రశ్న. రిజిస్టర్ చేసిన కేసులో ఆరోపణలు తీవ్రమైనవి. ఐపీసీ సెక్షన్ 409, 420, 12బి, రెడ్ విత్ సెక్షన్ 34, 37 కింద ఈ కేసు నమోదయ్యింది. అయితే, ముందస్తు బెయిల్ను కొట్టివేసే సమయంలో సహనిందితుని వాఙ్మూలానికి సంబంధించి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, సెక్షన్ 30కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అభిప్రాయాలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. సహనిందితుడి పోలీసు భయం ఆధారంగా నేరాంగీకార ప్రకటన నిలబడదనీ, కనుక అలాంటి అరెస్టు చెల్లదనీ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చెప్పారా, చెప్పించారా?నేరాలు చేసినప్పుడు సాక్ష్యాలు దొరకవు. పరిశోధనలో, దర్యా ప్తులో కొన్ని సాక్ష్యాలు దొరుకుతాయి. పోలీసులు న్యాయంగా సాక్ష్యాలు సేకరిస్తే, అందులో లంచగొండితనం లేకపోతే నిజాలు రుజువయ్యే అవకాశం ఉంటుంది. కానీ మన లోకంలో, లౌక్యంలో ఏం చెప్పగలం? అందరికీ తెలుసు, పోలీసులు నాలుగు తగిలిస్తే తప్ప నిజాలను కక్కడం సాధ్యం కాదు అంటారు. చాలా వరకు నిజం. కానీ తన్నినప్పుడు చెబుతున్నారా, లేక తంతున్నప్పుడు దెబ్బలు భరించలేక నేరాన్ని ఒప్పుకొంటున్నారా? ఈ రెండిటికీ చాలా తేడా ఉంటుంది. ‘దెబ్బలు నా వల్ల కాదు’ అనుకున్నపుడు, దానికన్నా నేరం ఒప్పుకొంటే కోర్టుకు పోయేదాకా బతికిపోవచ్చు అనుకుంటారు. కనుకనే పోలీసుల హింసలో చెప్పిన అంశాలను కోర్టులో చూపినప్పుడు, ఆ నిందితుడు ఇదంతా హింసించడం వల్ల రాసిందే గానీ నిజం కాదని చెప్పినప్పుడే తగాదా మొదలవుతుంది. అక్కడే లాయర్లు వస్తారు. నేరం రుజువు కాదు. నేరాంగీకారం రుజువు కాదు. సహ నింద భరించే గతి!నేర విచారణలో ఒక నిందితుడు, మరొక వ్యక్తి కూడా ఆ నేరంలో పాలు పంచుకున్నాడని వాఙ్మూలం ఇస్తే, సంబంధిత రెండవ వ్యక్తి సహ నిందితుడు అవుతాడు. పోలీసులు చెప్పించుకున్న నేరాంగీ కారం వాడుకుని మొదటి వాడినీ, తరువాత రెండో వాడినీ కూడా జైలుకు పంపిస్తారు. అప్పుడు బెయిల్ కోసం పోరాటం ప్రారంభ మవుతుంది. అది లాయర్ల భారీ ఫీజు ఆధారంగా, కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టుదాకా న్యాయ పోరాటం సాగుతూ ఉంటుంది. అందుకే తీర్పులు ఆలస్యమవుతాయి. వాయిదాలు వస్తాయి. అప్పీల్సు ఉంటాయి. మధ్యలో తాత్కాలిక ఆర్డర్స్ వస్తాయి. (అంటే అంతిమ నిర్ణయం వంటిది కాకుండా వచ్చే తాత్కాలిక ఉత్తర్వు ఇస్తారు. అక్కడ ఉన్నపుడే, తరువాతి స్థాయి, అంటే సెషన్స్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులలో అన్యాయంగా జైలుకు పోకుండా బెయిల్ హక్కుల్ని కాపా డుకుని విడుదల అవుతూ ఉంటారు. మన పత్రికా భాషలో ‘నిందితు డికి సుప్రీం నుంచి ఊరట’ అని అంటూ ఉంటాం.)సీఆర్పీసీ సెక్షన్ 161 కింద (ఇది పాత కేసు. పాత నేరం కావడం వల్ల కొత్త ఎన్డీఏ సర్కారు రచించిన భారతీయ న్యాయ చట్టాలను ఈ సందర్భంలో ఉటంకించడం లేదు. కూడదు. లేకపోతే అయోమ యంలో పడిపోతాం) అనుమానితుడి వాఙ్మూలానికి విలువ ఉన్న ప్పటికీ, పోలీసులకు చెప్పిన నేరాంగీకారాన్ని వాడుకుంటూ సహనిందితుడిని అరెస్టు చేయడం న్యాయమా? నేరారోపణ అనే గుడ్డ కాల్చి మొఖాన పారేసినప్పుడు జైల్లో పడేస్తారు. అందులో నిజా నిజాలు తేలకుండానే ఉన్నప్పుడు ఏం చేయాలి? బెయిల్ ఇవ్వాల్సిందే! రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని చెప్పగలిగితే, ఆయా అంశాలను కోర్టు విశ్వసిస్తే, పోలీసులను నమ్మని దశలో బెయిల్ దొరుకుతుంది. అంటే పోలీసులు సాధించిన నేరాంగీకారాల ఆధారంగా నిందితులు, అనుమానితులు అనే పేరుతో అమాయకులను జైలుకు పంపిస్తే, కోర్టే దిక్కు. న్యాయమూర్తులు, జిల్లా స్థాయి న్యాయాధికారులు... మంత్రుల వంటి పెద్దల వీవీఐపీ కేసులని భయపడకుండా ఉత్తర్వులు ఇస్తేనే బెయిల్ దొరుకుతుంది. న్యాయం లభిస్తుంది. ఊరట లభిస్తుంది. ఇది అటువంటి కేసు! వారి ఆరోప ణలు నిజమో కాదో ఇప్పుడే చెప్పలేము. కానీ మొదటి దశలోనే పోలీసుల భయం ఆధారంగా వచ్చిన నేరాంగీకారాలు తీసుకుని అరెస్టు చేయకూడదు.మన ‘కొత్త’ నేర చట్టాలుమన ‘భారతీయ’ సాక్ష్య చట్టం కొత్తది కాదు. ఇది ఆంగ్లేయులు రాసిపెట్టిన సాక్ష్యాల చట్టం... ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. భారతీయ సాక్ష్యాల చట్టం 1872 నుంచి... అంటే 153 ఏళ్ల నుంచి అమలులో ఉన్న చట్టం. (మనం అంతా కొత్త చట్టాలు చేశామని ప్రగల్భాలు పలుకుతున్నాం. పాత సాక్ష్య చట్టపు నియమం కొత్త న్యాయ చట్టంలోనూ ఉంది.) పోలీసుల ముందు నేరాన్ని ఒప్పుకొంటే అనుమానం ఉంటుంది. కనుక ఆ వాఙ్మూలానికి ఆమోద యోగ్యత ఉండదు. ఇది సెక్షన్లు 24, 25, 30 కింద అనుమానితమైన ప్రకటన అని 153 సంవత్సరాల నాటి సూత్రం. దీనిపైన ఎన్నో వందల కేసులలో సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది. నేరాంగీకారాన్ని అనుమానిస్తారు. పోలీసుల సమక్షంలో, లాకప్లో, లేదా మరెక్కడైనా సరే కొందరు పోలీసులు ఎదురుగా ఉండినప్పుడు ఈ అనుమానం బలవంతం అని అనుకుంటారు. చట్టం తెలియకపోయినా, సాధారణంగా మామూలు మనుషులకు కూడా ఈ విషయం తెలుసు. భారత శిక్షాస్మృతి (ఐపీసీ), భారతీయ సాక్ష్య చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ భారతదేశ న్యాయ వ్యవస్థలపైన, సమాజం పైన, న్యాయస్థానా ల్లోనూ ఇప్పటికీ నిలబడిన చట్టాలు. 153 సంవత్సరాల నుంచి ఈ సూత్రాలు ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇవి మౌలిక మైన సూత్రాలు. ప్రపంచంలోని అనేక దేశాల్లో కూడా అమలు చేయ వలసిన సూత్రాలు. బ్రిటిష్ వారి సూత్రాలు కాబట్టి పనికిరావని అనుకోవడానికి వీల్లేని నియమాలు ఇవి. ఆ సూత్రాలను కాపాడుకుంటూ కొన్ని మార్పులు చేశారు. అయితే, ఈ చట్టాలు మన న్యాయ వ్యవస్థకు పునాదిగా ఉన్నప్పటికీ, ఆధునిక భారతదేశ సంక్లిష్టతలను పరిష్కరించడానికి ఇబ్బంది పడ్డాయి. అందుకే 2020లో ప్రొఫెసర్ (డాక్టర్) రణ్బీర్ సింగ్ అధ్యక్షత వహించిన ‘కమిటీ ఫర్ రిఫార్మ్స్ ఇన్ క్రిమినల్ లాస్’ (సీఆర్సీఎల్) ఏర్పాటు చేశారు. ఆ కమిటీ రూపొందించిన కొత్త చట్టాల పేర్లు ఇవి: భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియమం, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత.బెదిరిస్తే, ప్రలోభ పెడితే...నేరారోపణకు గురైన వ్యక్తి చేసిన అంగీకారం ఏదైనా ప్రేరేపణ లేదా బెదిరింపు లేదా లాభం చేస్తామనే వాగ్దానంతో జరిగినట్లు కనిపిస్తే, ఆ వ్యక్తి నేరాంగీకారం అసంబద్ధం. ఇది కీలకమైన సూత్రం. పోలీసు కస్టడీలో నేరాంగీకరణ విషయంలో ఇది కీలకమైన సుప్రీంకోర్టు తీర్పు. తాజాగా 2022లో కూడా ఇంద్రేశ్ కుమార్ కేసులో సీఆర్పీసీ సెక్షన్ 161 కింద ఇటువంటి నేరాంగీకారాన్ని ఒప్పుకోవడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. మద్యం కేసులో కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, ‘వికాస్ సిమెంట్స్’ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్కై హైకోర్టుకు వెళ్లారు. ఆపై సుప్రీంకు అప్పీలు చేశారు. ‘నేర విచారణ ప్రక్రియలో ఓ నిందితుడి వాఙ్మూలాన్ని సహనిందితుడికి వ్యతిరేకంగా ఉపయోగించరాదన్నది ప్రాథమిక సూత్రం’ అని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించడమే కాక, దీనిపై సంపూర్ణ వివరణ ఇచ్చింది. బెయిల్ మంజూరు సమయంలో కోర్టులు ఆ యా అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలని నిర్దేశించింది. ముందస్తు బెయిల్, బెయిల్ మంజూరు సమయంలో సహనిందితుల వాఙ్మూలా లను పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది.మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ ‘స్కూల్ ఆఫ్ లా’ ప్రొఫెసర్ -
సంధ్యారాణి డౌన్ డౌన్
-
సాలూరులో గాఢ అంధకారం.. చిమ్మచీకట్లో ప్రజల ఆందోళన
పార్వతీపురం మన్యం జిల్లా: సాలూరులో గాఢ అంధకారం నెలకొంది. రెండు రోజులుగా విద్యుత్ కోతకు విసిగిపోయిన ప్రజలు చిమ్మచీకట్లో నడిరోడ్డుపై చేపట్టారు. ఆగ్రహంతో విద్యుత్ సిబ్బందిని రామాలయంలో నిర్భంధించారు. విద్యుత్ అధికారులు, మంత్రి గుమ్మడి సంధ్యారాణికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.48 గంటలుగా కరెంట్ లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. తాగునీటి సరఫరా కూడా నిలిచిపోయింది. ఇంటర్నెట్ కూడా ఆగిపోయింది. ఇళ్లలో నీరు లేక విద్యుత్ శాఖపై ప్రజలు ఎదురుతిరిగారు. విద్యుత్ను వెంటనే పునరుద్ధరించాలని ప్రజలు ఆందోళనకు దిగారు.మరోవైపు, జాతీయ రహదారిపై బైఠాయించిన ప్రజలు.. ఏఈ నాగేశ్వరరావు, ఏడీఈ రంగారావులను ఓ గదిలో నిర్బంధించారు. పరిస్థితి అదుపు తప్పడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున జనం రోడ్డుపైకి వచ్చారు. జనాన్ని అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. అదనపు బలగాలను రప్పించాలంటూ సాలూరు పోలీసులు ఉన్నతాధికారులను కోరారు. -
అనంత జెడ్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేల అత్యుత్సాహం
సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురం జెడ్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేల అత్యుత్సాహం ప్రదర్శించారు. జెడ్పీ ఛైర్పర్సన్ గిరిజమ్మ చాంబర్లో టీడీపీ ఎమ్మెల్యేలు హల్చల్ చేశారు. జడ్పీ సీఈవో రామచంద్రారెడ్డిపై ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, సురేంద్రబాబు, ఎంఎస్ రాజు బెదిరింపులకు దిగారు. వైఎస్ జగన్ ఫొటో తీసేయాలంటూ రాద్ధాంతం చేశారు. ఉద్యోగం తీసేయిస్తామంటూ జెడ్పీ సీఈవో రామచంద్రారెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.జెడ్పీ సీఈవో రామచంద్రారెడ్డిపై దౌర్జన్యం సరికాదు: వెన్నపూస రవీంద్రారెడ్డిఅనంతపురంలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి అన్నారు. జెడ్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేలు రౌడీల్లా వ్యవహరించారన్నారు. అనుమతి లేకుండా జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ ఛాంబర్లోకి టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లారంటూ ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రజా సమస్యలు పట్టవా?. చంద్రబాబు ఫోటోపై ఉన్న శ్రద్ధ... సూపర్ సిక్స్ హామీల అమలులో ఎందుకు చూపలేదు?. జెడ్పీ సీఈవో రామచంద్రారెడ్డిపై దౌర్జన్యం సరికాదని వెన్నపూస రవీంద్రారెడ్డి అన్నారు. -
తిరువూరు కౌన్సిలర్లను అభినందించిన వైఎస్ జగన్
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిరువూరు కౌన్సిలర్లు బుధవారం కలిశారు. తిరువూరు నగర పంచాయతీ ఛైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా తమపై టీడీపీ నాయకుల దాడి, దౌర్జన్యం గురించి వైఎస్ జగన్కు కౌన్సిలర్లు వివరించారు. పోలీసులు, కూటమి నేతలు, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించిన తీరును పార్టీ నేతలు వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా బరితెగించి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను ధీటుగా ఎదుర్కొందామన్నారు. చట్టపరంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందన్న వైఎస్ జగన్.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా నిలిచినందుకు అభినందనలు తెలిపారు. -
కీలక రాజకీయాంశాలపై వైఎస్ జగన్ ప్రెస్మీట్
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) రేపు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కీలక రాజకీయ అంశాలపై ఆయన మీడియా ద్వారా ప్రజలకు సందేశం ఇస్తారని పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో పాటు ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు తగినంత సమయం మైక్ ఇవ్వని పరిస్థితుల్లో తాను మీడియా ముందుకు వచ్చి మాట్లాడతానంటూ వైఎస్ జగన్(YS Jagan), కూటమి ప్రభుత్వం కొలువు దీరిన తొలినాళ్లలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అధికారంతో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను(Kutami Atrocities), ప్రతీకార రాజకీయాలను ఆయన ఎండగడుతూ వస్తున్నారు. అంతేకాదు.. గత వైఎస్సార్సీపీ హయాంలో కొనసాగిన సంక్షేమం ఆగిపోవడం, ఉద్దేశపూర్వకంగా అన్ని వర్గాల లబ్ధిదారులను కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుండడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేషన్ డెలివరీ వాహనాలను నిలిపివేయడం లాంటి.. తాజా అంశాలపైనా ఆయన మాట్లాడే అవకాశం కనిపిస్తోంది.ఇదీ చదవండి: రేషన్ డెలివరీ వాహనాలపై కుట్రలెందుకు? -
‘బాబూ.. రేషన్ డెలివరీ వాహనాలపై కుట్రలెందుకు?’
సాక్షి, అనంతపురం/తాడేపల్లి: కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైఎస్ జగన్ చేసిన సంస్కరణలను చంద్రబాబు సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. ఇంటింటికీ రేషన్ సరఫరా వాహనాలు రద్దు చేయడం సరికాదని హితవు పలికారు.వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది. భయపెట్టి పాలన చేయాలనుకోవడం మూర్ఖత్వం. ఇంటింటికీ రేషన్ సరఫరా వాహనాలు రద్దు చేయడం సరికాదు. వైఎస్ జగన్ పాలనలో మద్యం కుంభకోణం జరగలేదు. కట్టుకథలతో మద్యం కుంభకోణం జరిగిందని టీడీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది. వైఎస్ జగన్ చేసిన సంక్షేమ పథకాలు ఆపడం దారుణం. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కి విదేశీ నిధులు ఆపడం దుర్మార్గం. హంద్రీనీవా లైనింగ్ పనులపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి అని వ్యాఖ్యనించారు.వరదల్లో ఆదుకున్నవి ఇవే కదా: కారుమూరి తాడేపల్లిలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. కానీ, ఆ సంస్కరణలను చంద్రబాబు సర్వనాశనం చేస్తున్నారు. రేషన్ డెలివరీ వాహనాల వ్యవస్థను చంద్రబాబు తొలగించారు. ఈ వాహనాల ద్వారా పేదలకు ఎంతో ఉపయోగం జరిగింది. అలాంటి వ్యవస్థను చంద్రబాబు ఎలా నాశనం చేయగలుగుతున్నారు?. ఎండీయూల తొలగింపు ద్వారా 20వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 2.60 లక్షల మంది వాలంటీర్లను కూడా రోడ్డున పడేశారు.ఇంటింటికీ మద్యం సరఫరా చేస్తూ రేషన్ బియ్యాన్ని ఆపేయటం ఏంటి?. పేద, మధ్య తరగతి ప్రజలకు రేషన్ నిలిపేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఫస్ట్ ఎండీయూ వాహనాలు ఆ తర్వాత డిపోలు తొలగిస్తారు. చంద్రబాబుది శాడిస్టు బుద్ధి. అందుకే ప్రజలను పట్టి పీడిస్తున్నారు. గోదావరి వరదలు, విజయవాడ వరదల సమయంలో ఎండీయూ వాహనాలే ఆదుకున్నాయి. ఎండీయూ వాహనదారులకు మేము అండగా నిలుస్తాం. ఆ వాహనాలను కొనసాగించాల్సిందే. లేకపోతే వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఎండీయూ వాహనాల ద్వారా ఏం అక్రమాలు జరిగాయో ప్రభుత్వం చెప్పాలి?. సీజ్ ద షిప్ ఎపిసోడ్ ఏమైంది?. ఆ కేసులో ఎంత బియ్యం సీజ్ చేశారో ప్రభుత్వం ఎందుకు చెప్పటం లేదు?. జగన్ సంస్కరణలను నాశనం చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యం అని మండిపడ్డారు. -
ఇంటి వద్దకే టైలరింగ్ సేవలు..! ఐడియా మాములుగా లేదుగా..
ఇప్పడంతా ఆన్లైన్ పుణ్యామా అని డోర్డెలివరీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆహారం, షాపింగ్, కిరాణ సరుకులు వరకు అన్ని ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకోవడం..నేరుగా ఇంటికే డెలివరీ అవ్వడం టకటక జరిగిపోతోంది. చెప్పాంలటే..పెద్దపెద్ద బడా కంపెనీలన్నీ ఇంటివద్దకే వచ్చి సేవలందించే బాటలోకి వచ్చేశాయి. ఆ కోవలోకి టైలరింగ్ వంటి సేవలు కూడా వస్తే..ఇక పని మరింత సులవు కదూ..!. అలాంటి వినూత్న ఆలోచనకు కార్యరూపం ఇచ్చి..హాయిగా జీవనం సాగిస్తూ..అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు ఆంద్రప్రదేశ్లోని కృష్ణాజిల్లాకు చెందిన 58 ఏళ్ల దర్జీ ఎస్.కె. కలీషా. అతడికి ఈ ఆలోచన ఎలా వచ్చింది..?. ఈ ఆలోచనతో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడా అంటే..ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం వణుకూరు గ్రామంలో నివాసం ఉండే ఎస్.కె. కలీషా తొలుత గ్రామంలో ఓ దుకాణాన్ని అద్దెకు తీసుకుని టైలరింగ్ చేసేవారు. దశాబ్ద కాలం వరకూ కుటుంబ పోషణకు ఏ మాత్రం ఇబ్బంది పడేవారు కాదు. ఇద్దరు పిల్లలతో హాయిగా జీవించారు. అలాగే అక్కడ గ్రామస్థులు కూడా కాలేషా దుకాణం వద్దకు వచ్చి బట్టలు కుట్టించుకునేవారు. అయితే కాలం మారి రెడీమేడ్ ట్రెండ్ కావడం, యువత ఆ దుస్తులకే ప్రాధాన్యం ఇవ్వడంతో కలిషాకి బతుకుదెరువు భారంగా మారింది. ఇలా లాభం లేదనుకుని ఎలాగైనా తనకు తెలిసిన ఈ వృత్తి ద్వారానే అధిక ఆధాయం ఆర్జించాలని స్ట్రాంగ్గా డిసైడయ్యారు కలిషా. అలా పుట్టుకొచ్చింది ఇంటివద్దకే టైలరింగ్ సేవలందించాలనే ఆలోచన. ఎందుకంటే ప్రస్తుతం పలు రకాల సేవలూ ఇంటి వద్దకే వస్తున్నాయి. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండటం తోపాటు కొన్ని సంస్థలు ఈ తరహాలో లాభాలను ఆర్జిస్తున్న విధానాన్ని తెలుసుకుని ఆ పంథాలోకే తన వృత్తిని పట్టాలెక్కించారు కలీషా. ఇక తాను కూడా ఇంటి వద్దకే సేవలందించి ఆదాయాన్ని మరింతగా పెంచుకోవాలనుకున్నారు. అందుకు నాలుగు చక్రాల వాహనం అవసరమవుతుంది. కానీ అదికొనే స్థోమత లేకపోవడంతో ఓ రిక్షాను కొని దానికి కుట్టుమిషన్ను అనుసంధానించారు. ఎక్కడికైనా తీసుకుని వెళ్లేందుకు అనుగుణంగా మార్పులు చేశారు. తొలుత తన గ్రామంలోని కాలనీల్లో తిరిగి ఇంటివద్దకే వెళ్లి పాత, చిరిగిన బట్టలు కుట్టడం ప్రారంభించారు. దీంతో అతని ఆదాయం కూడా పెరిగింది, కుటుంబ పోషణ కూడా హాయిగా సాగిపోయింది. అయితే రానురాను ఆ రిక్షా తొక్కుకుంటూ వెళ్లడం కష్టమైపోవడంతో..కుటుంబ సన్నిహితులు, స్నేహితుల సాయంతో టీవీఎస్ కస్టమ్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసి, దానికి మొబైల్ టైలరింగ్ దుకాణంగా సవరించి సేవలందించడం ప్రారంభించానని చెప్పుకొచ్చారు. పెనమలూరు మండలంలో రోజుకో గ్రామం చొప్పున తిరుగుతూ ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు. అవసరం ఉన్న వాళ్లు నేరుగా కాలేషాకు ఫోన్ చేసి మరీ పిలింపించుకుని బట్టలు కుట్టించుకుంటారట. అలా రోజుకు నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు సంపాదిస్తున్నట్లు తెలిపారు. ఈ మొబైల్ టైలరింగ్ వల్ల అప్పులు బాధలు ఉండవని, ఆదాయం నేరుగా జేబులోకి వస్తోందని అంటున్నారు షేక్ కాలేషా. ప్రస్తుతం ఆయన పెనమలూరు, పోరంకి, వనకూరు ప్రాంతాల వరకే తన టైలరింగ్ సేవలు పరిమితం చేశానని అన్నారు. ఎందుకంటే ఈ వయసులో ఈ ప్రాంతాలను దాటి వెళ్లడం తనకు కష్టంగా ఉందని చెప్పుకొచ్చారు. చివరగా ఆయన.. ఎవ్వరూ కూడా తాము చేపట్టిన వృత్తిని ఆదరించడం లేదని ఆందోళన చెందకూడదని, వినూత్నంగా ఆలోచించి సేవలందిస్తే.. సత్ఫలితాలు వస్తాయని యువతకు చక్కటి సందేశాన్ని ఇచ్చారు కలేషా. అదే బాటలో మరో జంట..తిరువనంతపురంకు చెందిన అనిష్ ఉన్నికృష్ణన్ గాయత్రి కృష్ణ దంపతులు తమ "సీవ్ ఆన్ వీల్జ్" అనే వెంచర్తో మొబైల్ టైలరింగ్ సేవలందిస్తున్నారు. ఆ దంపతులు దీన్ని టెంపో ట్రావెలర్ సాయంతో నిర్వహిస్తున్నారు. వాళ్లు పెళ్లికూతురు దుస్తుల నుంచి అల్టరేషన్ వరకు అన్ని రకాల సేవలందిస్తారు. సాధారణంగా టైలర్లు ఆల్టరేషన్ పనులు చేపట్టడానికి ఇష్టపడరు , అయితే ఈ దంపతులు ఆల్టరేషన్ పనే ప్రధానంగా.. సేవలందించి కస్టమర్ల మన్ననలను అందుకుంటున్నారు.ఇదంతా చూస్తుంటే ముందు ముందు..ఇంటి వద్ద టైలరింగ్ సేవలు పొందొచ్చన్నమాట. అటు వారికి ఆదాయం, మనకు సమయం ఆదా అవ్వడమేగాక, నచ్చిన విధానంగా కుట్టించుకునే వెసులబాటు దొరుకుతుందన్న మాట. అంతేగాదు పరిస్థితులు సవాలుగా మారినప్పుడూ.. అవకాశాలను దొరకబుచ్చుకోవటం అంటే ఈ కలీషా, ఉన్ని కృష్ణన్ దంపతుల సక్సెస్ని చూస్తుంటో తెలుస్తోంది కదూ..!.(చదవండి: ఆధ్యాత్మికత నుంచి.. ఏకంగా కంపెనీ సీఈవోగా ప్రస్థానం..) -
పవన్.. ఇంతగమ్మున ప్రజా వ్యతిరేకతా?
ఏదైనా వస్తువు కొన్నాక కొన్నాళ్ళు వాడిన తరువాత దానిమీద.. దాని పనితీరు మీద అసంతృప్తి మొదలవుతుంది. అయ్యో బోలెడు డబ్బు పోసి కొన్నాను ఇది సరిగా పనిచేయడం లేదు. బాగుంది తీసుకెళ్లండి అంటూ షాపువాడు నన్ను మోసం చేసాడు అని తిట్టుకోవడం సహజం. కానీ చంద్రబాబు అనే నాసిరకం సరుకును తెచ్చుకున్న జనం దాన్ని ప్యాకింగ్ విప్పిన క్షణం నుంచీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయ్యో బయట మాటలు.. కలరింగ్.. మార్కెటింగ్ వాడి మాయ కబుర్లు నమ్మేసి ఈ దారిద్య్రాన్ని ఇంటికి తెచ్చుకున్నామే అన్నట్లుగా ప్రతి ఇంట్లోనూ తిట్టడం మొదలైంది. దుకాణంలో కౌంటర్లో చూపించేది ఒక రకం సరుకు.. మనకు పార్సిల్ చేసి ఇచ్చేది ఇంకో రకం సరుకు అన్నట్లుగా ఎన్నికల సభల్లో చంద్రబాబు.. లోకేష్.. పవన్ చెప్పింది ఒకటి. గెలిచాక చేస్తున్నది ఇంకోటి అని ఏడాది లోపే తేలిపోయింది. దీంతో పవన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి అనుకుని ఉన్న కాకినాడ ఎంపీ సెగ్మెంట్లోని తుని, ప్రత్తిపాడు, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ఇటీవల జరిపిన సర్వేలో చేదు నిజాలు వెలుగుచూశాయి. పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోనూ జనంలో వ్యతిరేకత ఎక్కువే ఉంది.ఎన్నికల సభల్లో ఆయన చేసిన ప్రసంగాలు.. అత్యుత్సాహంతో విరిసిన డైలాగులు.. ఊపిన చేతులు.. హావభావాలని గుర్తు చేసుకుంటున్న జనం ఏదీ ఆ జోరు ఇప్పుడు కనిపించదేమి అని ప్రశ్నిస్తున్నారు. పైగా తెలుగుదేశం నాయకుల రౌడీయిజం.. రుబాబు.. దోపిడీ వంటి వాటిని పవన్ ఏమాత్రం ప్రశ్నించకపోవడంతో జనం ఆయన మీద పెట్టుకున్న నమ్మకం వమ్మైనట్లు భావిస్తున్నారు. దీంతో ఇది కూడా నాసిరకం సరుకు.. ప్యాకింగ్ చూసి కోనేసాం.. లోపలంతా తాలు సరుకు అని తిట్టిపోస్తున్నారు. పైగా పవన్ కూడా పార్టీని గాలికి వదిలేసి తన అన్న నాగబాబుకు పదవి ఇప్పించుకోవడంతో సంతృప్తి చెంది ఇతర నాయకుల పొలిటికల్ కెరీర్ గురించి పూర్తిగా ఇగ్నోర్ చేయడంతో వారిలో అసంతృప్తి మొదలైంది.పైగా గ్రామాల్లో జనసేన కార్యకర్తల రౌడీయిజం వంటివి జనాల్లో చర్చకు వస్తున్నాయి. ఈ విషయాన్నే వైఎస్ జగన్ కూడా తాజాగా పార్టీ నేతల సమావేశంలో ప్రస్తావించారు. ఏడాదిలోపే ప్రభుత్వం మీద వ్యతిరేకత కమ్ముకొచ్చిందని.. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారి మద్దతు కూడగట్టాలని కేడర్కు సూచించారు. ఆయన చెప్పడం అని కాదు కానీ గ్రామాల్లో ఇప్పటికే చంద్రబాబు పాలనమీద పెదవి విరుపు మొదలైంది. ఇసుక ధరలు పెంపు.. పల్లెల్లో చిల్లర రాజకీయాలు.. రౌడీయిజం వంటివి జనంలో వ్యతిరేకతని పోగుచేస్తున్నాయి. -సిమ్మాదిరప్పన్న. -
గంటా రవితేజ నోట.. జోహార్ చంద్రబాబు.. జోహార్ లోకేశ్బాబు!
మధురవాడ(విశాఖపట్నం): భీమిలి నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడులో పార్టీ నేతల మధ్య అసమ్మతి సెగ బయటపడింది. పీఎంపాలెంలోని వి కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం జరిగిన ఈ సభకు కోరాడ రాజబాబు వర్గం డుమ్మా కొట్టింది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు కె.బాలాజీ, టీడీపీ నేతలు తొలుత దివంగత సీఎం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభాధ్యక్షత వహించిన 6వ వార్డు టీడీపీ అధ్యక్షుడు దాసరి శ్రీనివాసరావు ముందుగా గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజను నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా ప్రకటించారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ఇక్కడ ఏర్పాటవుతున్న ఐటీ పరిశ్రమల్లో స్థానిక యువతకు రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు. రాజబాబు వర్గం డుమ్మా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ముందుండి నడిపించిన భీమిలి టీడీపీ ఇన్చార్జ్ కోరాడ రాజబాబు, అతని వర్గం ఈ సభకు డుమ్మా కొట్టింది. ఆనందపురం ప్రాంత నాయకులు కూడా అరకొరగానే వచ్చారు. కొంత కాలంగా గంటా, కోరాడ మధ్య దూరం పెరిగిందన్న వార్తలకు ఈ సభ స్పష్టతనిచ్చింది. సభలో ఏర్పాటు చేసిన బ్యానర్లపై కూడా రాజబాబు ఫొటో ఎక్కడా కనిపించలేదు. రాజబాబును నియోజకవర్గ ఇన్చార్జిగా అనధికారికంగా ఇప్పటికే తప్పించినట్లు తమ్ముళ్లు గుసగుసలుపోతున్నారు. ఇప్పుడు సభలోనే గంటా రవితేజను ఇన్చార్జిగా ప్రకటించేశారు. స్థానిక కమిటీలపై అసంతృప్తి పార్టీ అభ్యున్నతికి కృషి చేసిన సీనియర్లకు గంటా వచ్చాక తగిన ప్రా«ధాన్యత దక్కట్లేదన్న విమర్శలున్నాయి. పదవులు, స్థానిక కమిటీల్లో కూడా వారికి చోటు దక్కలేదు. మధురవాడలో వార్డు కమిటీల ఏర్పాటు విషయంలో సీనియర్ నాయకులు అసమ్మతి ర్యాలీగా మహానాడుకు తరలి రావడం విశేషం. తమకు ప్రాధాన్యత ఇవ్వకపోతే తిరుగుబాటు తప్పదంటూ సంకేతాలు ఇస్తున్నారు.జోహార్ సీఎం సర్! గంటా రవితేజ తన ప్రసంగంలో జోహార్ ఎన్టీఆర్.. జోహార్ సీఎం సర్.. జోహార్ లోకేశ్బాబు అంటూ నినాదాలతో హోరెత్తించారు. వేదికపై ఉన్నవారితోపాటు, సభకు హాజరైన వారు అవాక్కయ్యారు. చనిపోయిన వారికి కదా జోహార్లు అరి్పంచేది అంటూ.. పక్కనే ఉన్న నాయకులు చెప్పడంతో.. పొరపాటున అలా అనేశానంటూ.. వివరణ ఇచ్చుకున్నారు. -
లేనివి ఉన్నట్టు.. ఉన్నవి లేనట్టు!
పచ్చ పత్రిక ఈనాడు చూస్తే ఆంధ్రప్రదేశ్లోకి పెట్టుబడుల ప్రవాహంలా వచ్చి పడుతున్నాయని అనిపిస్తుంది!. కానీ, బాబు వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు వీళ్లు చేస్తున్న విఫల ప్రయత్నాలు ఒక రకంగా ప్రజలను మోసం చేయడమే!. ఈ మధ్య కాలంలోనే రూ.33వేల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు వీటితో 34 వేల మందికి ఉపాధి దొరికేసినట్లు ఈనాడు ఒక కథనాన్ని వండి వార్చింది.రాష్ట్ర పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు ఇటీవల ఆమోదించిన ప్రాజెక్టుల్లో కొన్నింటికి జగన్ హయాంలోనే ఒప్పందాలు కుదిరినా వాటిని బాబు గారి ఖాతాలో వేసేసి తరిస్తున్నాయి ఎల్లో పత్రికలు!. తప్పులేదు కానీ.. ఈ క్రమంలో గత ప్రభుత్వంపై బురద జల్లేందుకు చేస్తున్న ప్రయత్నాలే రోత పుట్టిస్తున్నాయి. ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని కోల్పోయింది’ అని చంద్రబాబు అన్నట్టు.. పారిశ్రామికవేత్తలను తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు బాబు చెప్పారని రాసుకొచ్చింది ఈనాడు!. మొత్తం రూ.4.95 లక్షల కోట్ల పెట్టుబడులకు బోర్డు ఆమోదం తెలిపిందని, 4.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని కూడా బాబు చెప్పినట్లు ఈ కథనం చెబుతోంది. విచిత్రం ఏమిటంటే బోర్డు సమావేశం జరగడానికి ముందు రోజు టీడీపీ పాలిట్బ్యూరో సమావేశంలో రూ.8.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు వెల్లడించారని ఎల్లో మీడియానే రాసింది. వీటిలో దేనిని నమ్మాలి?.తాజాగా ప్రకటించిన 19 ప్రాజెక్టులలో కొన్ని గత ప్రభుత్వంలోనే ఆమోదం పొందాయన్నది వాస్తవమా? కాదా? ఉదాహరణకు సత్యసాయి జిల్లాలో బీఈఎల్ యూనిట్, అనకాపల్లి వద్ద టైర్ల ప్యాక్టరీ, శ్రీసిటీలో డైకిన్ సంస్థలన్నీ ఇవన్ని గత ప్రభుత్వ హయాంలో వచ్చినవే. ప్రభుత్వం అన్నది ఒక నిరంతర ప్రక్రియ. గత ప్రభుత్వంలో ఇవి వచ్చాయని, వాటిని మరింత ముందుకు తీసుకువెళుతున్నామని సీనియర్ నేత అయిన చంద్రబాబు చెప్పి ఉంటే హుందాగా ఉండేది. అలా కాకుండా అసలు జగన్ హయాంలో పరిశ్రమలే రానట్లు, ఇప్పుడే వస్తున్నట్లు చెప్పుకుంటూ పోతే ఆయనకు విలువ ఏమి ఉంటుంది!. అలాగే, లోకేష్ ఈ మధ్య శంకుస్థాపనలు చేస్తున్న క్లీన్ ఎనర్జీ కంపెనీలు కూడా గత జగన్ ప్రభుత్వంలో మంజూరు అయినవే అన్నది వాస్తవం.ఉదాహరణకు ఇంటిగ్రేటెడ్ రెన్యుబుల్ ఎనర్జీ కాంప్లెక్స్కు బేతపల్లిలో భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ సంస్థ ఛైర్మన్ సుమంత్ సిన్హా జగన్ పారిశ్రామిక విధానాలను ప్రశంసిస్తూ ప్రసంగించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తారంగా తిరుగుతోంది. ఓర్వకల్లు వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్ కో ప్రాజెక్టు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే గ్రౌండ్ అయి చాలా ముందుకు వెళ్లింది. అదానీకి చెందిన సంస్థకు కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు కోసం భూములు కూడా కేటాయించారు.ఆ రోజులలో ఎల్లోమీడియా ఈ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా విపరీతంగా దుష్ప్రచారం చేసేది. రామాయంపట్నం వద్ద శిర్డిసాయి కంపెనీకి చెందిన ఇండో సోలార్ ప్రాజెక్టు వస్తుంటే ఈ కంపెనీ అధినేత విశ్వేశ్వరరెడ్డిపై ఎన్ని అసత్య కథనాలు వండివార్చారో లెక్కలేదు. జగన్ బినామీ అని కూడా ఎల్లో మీడియా ఆరోపించింది. కూటమి అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీకి ప్రభుత్వం ట్రాన్స్ఫార్మర్ల ఆర్డర్ ఇస్తోందంటూ విషపు రాతలు రాసింది. తదుపరి ఏమైందో కానీ, ఆ సంస్థ ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చిన ఫుల్ పేజీ ప్రకటనను ఆనందంగా ప్రచురించుకుంది. అంటే, ఆ కంపెనీ యజమానిని ఈ మీడియా బ్లాక్ మెయిల్ చేసిందని అనుకోవాలా? ఆయా కంపెనీలకు లోకేష్ శంకుస్థాపన చేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ, అదేదో తమ ప్రభుత్వం వచ్చాకే జరుగుతోందన్న భ్రమ కల్పించడానికి చేస్తున్న యత్నాలే బాగోలేవు.మరో ఉదాహరణ కూడా చెప్పాలి. విజయవాడ సమీపంలోని మల్లవల్లి వద్ద అశోక్ లేలాండ్ సంస్థ 2022లోనే బస్సుల తయారీని ఆరంభించింది. ఆ విషయం ఆ కంపెనీ సెబీకి కూడా తెలిపింది. కానీ, కొద్ది రోజుల క్రితమే ఉత్పత్తి ఆరంభమైనట్లు, లోకేశ్ ప్రారంభోత్సవం చేసినట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం జరిగింది. సోషల్ మీడియా యుగంలో ఏదో మాయ చేయాలనుకుంటే ఇట్టే దొరికిపోతామన్న సంగతిని నేతలు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు పాలన మొదలయ్యాక ఎన్ని పరిశ్రమలు మూతపడ్డాయి?. కూటమి ఎమ్మెల్యేలు ఎన్ని పరిశ్రమలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు?. కాంట్రాక్టుల కోసం ఏ రకంగా ఒత్తిడి తెస్తున్నది పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్న మాట అబద్దమా?. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచర వర్గం సిమెంట్ కంపెనీలపై చేసిన దాడులు, ఇలాగైతే తాము పని చేయలేమని ఒక సిమెంట్ కంపెనీ హెచ్చరించడమూ తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకరరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిల మధ్య బూడిద తగాదా అన్నీ టీడీపీ నేతల దౌర్జన్యాలు, అవినీతి కార్యకలాపాలను ఎత్తి చూపేవే కదా?.ఆది నారాయణ రెడ్డి అనుచరుల దౌర్జన్యాలపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఏకంగా జిల్లా కలెక్టర్కే ఫిర్యాదు చేశారే!. పల్నాడులో గురజాల ఎమ్మెల్యే యరపతినేని దందాలకు రెండు సిమెంట్ కంపెనీలు కొన్నాళ్లపాటు మూతపడ్డాయి కదా?. శ్రీకాకుళం జిల్లాలో స్థానిక కూటమి నేతలు కింగ్ ఫిషర్ కంపెనీ వారిని బెదిరించి డబ్బులు వసూలు చేయాలని ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి కదా?. రెడ్బుక్ కారణంగా జిందాల్ సంస్థ ఏపీలో పెట్టాల్సిన పెట్టుబడులను కాస్తా మహారాష్ట్రకు తరలించిందే!. గత ఫిబ్రవరి 12న ఒక అధికారిక సమావేశంలోనే చంద్రబాబు ఏపీలో పారిశ్రామికాభివృద్ది ‘-2.94 శాతం’గా ఉందని, పరిశ్రమలు మూతబడుతున్నాయని చెప్పారే. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఆ పరిస్థితి ఉందనే కదా! దానికి ఆయనే బాధ్యత వహించాలి కదా?. దావోస్కు వెళ్లి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తామని హోరెత్తించి, చివరికి ఒక్క రూపాయి కూడా తేలేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది? దానిని కవర్ చేయడానికి ఏపీ బ్రాండ్ బాగా ప్రచారమైందని ఎల్లో మీడియా ఎందుకు రాసింది? ఆ తర్వాత లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నట్లు ఒకసారి, వచ్చేసినట్లు మరోసారి చంద్రబాబు, లోకేశ్లు ఎందుకు చెప్పారు?. చంద్రబాబు చెబుతున్నట్లు జగన్ టైంలో పెట్టుబడులు రాలేదా?. వివరాలు పరిశీలిస్తే కూటమి నేతలు అసత్యాలు చెబుతున్నారని చెప్పడానికి ఎన్నో ఆధారాలు కనిపిస్తాయి. రెండేళ్ల కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ, జగన్ టైంలో లక్షల కోట్ల విలువైన ప్రతిపాదనలు వచ్చాయి. అంబానీ, అదానీ వంటి ప్రముఖులు సైతం గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చారు. కొన్ని శంకుస్థాపన చేసుకుని ప్రారంభమయ్యాయి కూడా. బద్వేల్ వద్ద సెంచరీ ప్లైవుడ్ ప్లాంట్ ను చూడవచ్చు.అంతేకాదు.. ఎన్టీపీసీ లక్ష పదివేల కోట్ల వ్యయంతో హైడ్రో పార్కు ఏర్పాటుకు ముందుకు వచ్చింది. కొంతకాలం క్రితం ప్రధాని మోదీ దీనికే శంకుస్థాపన చేశారు. కాకపోతే దీన్ని టీడీపీ నేతలు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. రిలయన్స్ బయోగ్యాస్, బిర్లా కార్బన్ ఇండియా, కోరమాండల్, అల్ట్రాటెక్, ఏసీసీ సిమెంట్స్, ఇండోసోలార్ మాడ్యూల్స్ ఇలా పలు రకాల పరిశ్రమలు సుమారు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరిచాయి. వాటిలో కొన్నిటిని ప్రస్తుత ప్రభుత్వ రెడ్ బుక్ విధానాల వల్ల కోల్పోయాయన్న విమర్శలు ఉన్నాయి.ఒకవైపు చంద్రబాబు పేరే బ్రాండ్ అని, ఏ కంపెనీ వచ్చినా ఆయనను చూసే వస్తున్నాయని లోకేష్ చెబుతుంటారు. కానీ, అత్యంత విలువైన విశాఖ భూములను కొన్ని కంపెనీలకు ఎకరా 99పైసలకే కట్టబెట్టవలసిన దుస్థితిలో రాష్ట్రం ఉంది. లీజుకు ఇవ్వాలని టీసీఎస్ సంస్థ కోరినా దాదాపు ఉచితంగా విక్రయించడం ఎందుకో?. ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి కారుచౌకగా అరవై ఎకరాల భూమిని కట్టబెడ్టడంలోని ఆంతర్యం ఏమిటి? ఏది ఏమైనా పరిశ్రమలు, ఒప్పందాలకు సంబంధించి కాకి లెక్కలు చెప్పడం చంద్రబాబు ప్రభుత్వానికి కొత్తకాదు.2014 హయాంలో ఏకంగా రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు, లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేసినట్లు ప్రచారం చేశారు. తీరా చూస్తే అందులో పదోవంతు కూడా వచ్చినట్లు స్పష్టంగా తెలియలేదు! నిరుద్యోగ భృతి ఎగవేయడానికి ఇలా చేస్తుండవచ్చు. ఇప్పటికైనా కాకి లెక్కలు మాని, గత ప్రభుత్వంపై బురద చల్లడం ద్వారా ఏపీ పరువును, బ్రాండ్ను పాడు చేయకుండా చిత్తశుద్దితో పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేయాలని కోరుకుందాం.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సూర్యుడిపైకి సాగర మేఘాలు
ఇది కూడా యుద్ధం వంటిదే! అయితే దేశాల మధ్య యుద్ధం కాదు. శాస్త్ర పరిశోధకులు సూర్యుడిని మసకబార్చి భూమిని చల్లబరిచేందుకు చేయబోతున్న మహా ప్రయోగ సంగ్రామం! ఈ జాజ్వల్యమాన జల వ్యూహంలో సముద్రతలం నుంచి నౌకలు, గగనతలం నుంచి విమానాలు ఉప్పు నీటి శతఘ్నులను సంధించి, తమ చెయ్యెత్తులో ఉన్న సాగర మేఘాలను చిక్కబరిచి వాటిని దట్టంగా మార్చేస్తాయి. ఆ బాహుబలి మేఘాలు, సూర్యుడి నుంచి వచ్చే తీక్షణమైన కిరణాలను అడ్డుకుని, వాటిని తిరిగి వెనక్కు అంతరిక్షంలోకి పంపిస్తాయి! వేడిమి నుంచి భూమిని కాపాడతాయి. మహోష్ణ గోళంతో మనిషి తలపడనున్న ఈ ఆపరేషనే ‘ఎంసీబీ’. మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్! -సాక్షి, స్పెషల్ డెస్క్మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్ అనేది ఒక జియో ఇంజనీరింగ్ టెక్నిక్. భూతాపాన్ని అరికట్టే ప్రయత్నంలో, భూ వాతావరణాన్ని ప్రభావితం చేసే పర్యావరణ ప్రక్రియలను పెద్ద ఎత్తున మార్చడమే జియో ఇంజనీరింగ్. ప్రపంచవ్యాప్తంగా, మహా సముద్రాలపై సూర్యరశ్మిని వెనక్కు పంపించేలా వాతావరణంలోకి కృత్రిమ రసాయన వాయు కణాలను చొప్పించటం, భూతాప నియంత్రణకు సముద్రపు నీటిలో కరిగి ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చి పారేయటం వంటి అత్యంత క్లిష్టమైన ప్రాజెక్టుల వంటి అన్నీ జియో ఇంజినీరింగ్ వ్యూహంలో భాగమే.ఎంసీబీ ప్రయోగాన్ని ఎలా చేస్తారు?వాతావరణంలోకి ఉప్పు నీటిని ‘ఎగచిమ్మటం’ ద్వారా సముద్ర మేఘాలను కృత్రిమంగా అత్యంత ప్రకాశవంతం చేయటమే మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్. దీనివల్ల ఏర్పడే ఉప్పు నీటి వాయు బిందువులు సముద్ర మేఘాల సాంద్రతను పెంచుతాయి. ఆ మేఘాలను ఢీకొని సూర్యరశ్మి వెనక్కు (పైకి) మళ్లుతుంది. దాంతో భూమి సంగ్రహించే ఉష్ణోగ్రత తగ్గి, భూతాప నివారణ జరుగుతుంది. సముద్రపు మేఘాలు సహజంగా మహాసముద్రాలపై ఏర్పడతాయి.అందుకు సముద్రపు ఉప్పు కీలకమైన పదార్థంగా పనిచేస్తుంది. సముద్రపు ఉప్పు కణాలు గాలి ద్వారా కదిలినప్పుడు అవి మేఘ బిందువులకు కేంద్రకాలుగా మారి, నీటి ఆవిరి వాటిపై ఘనీభవిస్తుంది. ఈ మేఘ బిందువుల సంఖ్య, పరిమాణం ఒక మేఘం ఎంత సూర్యరశ్మిని తిప్పి కొడుతుందో నిర్ణయిస్తాయి. ఇదంతా సహజ ప్రక్రియ. మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్ విధానంలో సముద్ర మేఘాలకు మరిన్ని సముద్రపు ఉప్పు కణాలను జోడించడం ద్వారా ఈ సహజ ప్రక్రియను అనుకరించడం, మెరుగుపరచడం జరుగుతుంది. మెరైన్ స్నో మెషీన్లను, ప్రత్యేకమైన నాళాల వంటి పరికరాలను ఉపయోగించి సముద్రపు ఉప్పు నీటిని గాలిలోకి చల్లడం ద్వారా ఈ ప్రయోగం చేస్తారు.35 ఏళ్ల ప్రయత్నాలు.. 5ఏళ్లలో ప్రయోగాలు!1990లలో తొలిసారి బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త జాన్ లాథమ్కు ఈ ‘మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్’ ఆలోచన వచ్చింది. ప్రయోగాలకు అనుకూలమైన సముద్ర ప్రాంతాలపై మేఘాలను ప్రకాశవంతం చేయడం వల్ల భూతాపాన్ని పెరగకుండా చేయవచ్చని ఆయన తలపోశారు. ఎలాగంటే... ప్రత్యేక స్ప్రేయర్లతో వాతావరణంలోకి చిన్నపాటి సముద్రపు నీటి బిందువులను ఎగజిమ్ముతారు. ఇవి ఆవిరైపోయి ఉప్పు కణాలను మిగులుస్తాయి. ఆ కణాలు దట్టమైన, ప్రకాశవంతమైన మేఘాలను సృష్టిస్తాయి. అవి సూర్యరశ్మిని అడ్డుకుని భూమి మీద వాటి తీవ్రతను తగ్గిస్తాయి. ఇదీ జాన్ లాథమ్ ఆలోచన. ఇన్నేళ్లకు ఈ ఆలోచన ప్రయోగ దశకు చేరుకుంది. వచ్చే ఐదేళ్లలో ఈ ప్రయోగం ఆచరణలోకి రావచ్చని ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూరుస్తున్న ‘ఆరియా‘ అనే బ్రిటన్ సంస్థ అంచనా వేస్తోంది.రహస్య పరిశోధనా సంస్థ ‘ఆరియా’భూతాప వేగాన్ని నెమ్మదిపరిచే లక్ష్యంతో అనేకమైన జియో ఇంజనీరింగ్ ప్రాజెక్టు పనులు చేపట్టటానికి ‘అరియా’ అడ్వాన్డ్ రీసెర్చ్ ఇన్వెషన్ ఏజెన్సీ’ ఏర్పాటైంది. ఇందుకోసం ఈ ప్రభుత్వ రహస్య పరిశోధనా సంస్థ ఇంతవరకు ప్రజా పన్నుల నుంచి 800 మిలియన్ పౌండ్లను సమకూర్చుకుంది. ఇందులో ఒక్క మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్ ప్రాజెక్టుకే 57 మిలియన్ పౌండ్లను బ్రిటన్ ప్రభుత్వం కేటాయించింది. అనధికారికంగా 2021 ఫిబ్రవరిలో, అధికారికంగా 2023 జనవరిలో ఈ సంస్థ ప్రారంభం అయింది. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూర్చే శాస్త్రీయ, సాంకేతిక పురోగతులను ఆవిష్కరించమే తన ధ్యేయం అని ఈ సంస్థ చెబుతోంది. ‘‘ఎంతో ఊహాజనితమైన, అతి కష్టతరమైన, వేరే చోట జరగటం అసంభవం అయిన పరిశోధనలను కొనసాగించడానికి మేము శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అధికారం ఇస్తాం’’ అని అరియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇలాన్ గుర్ అంటున్నారు.ఎంసీబీ ప్రయోజనాలు⇒ మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్ భూమి గ్రహించే సూర్యరశ్మి పరిమాణాన్ని తగ్గించి భూతాపాన్ని నివారిస్తుంది. ⇒ భూగోళాన్ని చల్లబరిచి వేడిగాలులు లేకుండా, కరువు కాటకాలు రాకుండా చేయగలదు.⇒సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను తగ్గించి, పగడపు దిబ్బలు క్షీణించకుండా కాపాడుతుంది.ఎంసీబీ దుష్ప్రభావాలు⇒ వాతావరణ సమతౌల్యం, భూమికి నీటిని అందించే ‘అవపాత చక్రం’ (వర్షపు జల్లులు, మంచు, వడగళ్లు కురిసే కుదురైన వ్యవస్థ) దెబ్బతినే ప్రమాదం ఉంది.⇒ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను నియంత్రించే ‘ఎల్ నినో’ గతి తప్పవచ్చు.⇒ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలు నిష్ఫలం కావచ్చు. -
బొప్పాయి.. లాభమేనోయి..
దేవరపల్లి: పొగాకు, జీడిమామిడి పంటలకు మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో ప్రత్యామ్నాయంగా పండ్ల తోటల సాగుపై రైతులు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా బొప్పాయి సాగుతో లాభాలు సాధిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని 326 హెక్టార్లలో రైతులు బొప్పాయి సాగు చేస్తున్నారు. ముఖ్యంగా కడియం, అనపర్తి, దేవరపల్లి, నల్లజర్ల, గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు మండలాల్లో దీని సాగు అధికంగా ఉంది. తెగుళ్లను తట్టుకునే రకాల మొక్కలను మహారాష్ట్ర నుంచి తీసుకుని వచ్చి, తోటలు వేసి అధిక దిగుబడులు సాధిస్తున్నారు.బొప్పాయిలో అనేక రకాల వంగడాలున్నప్పటికీ ఎక్కువ మంది పింక్, కో–786, తైవాన్ రెడ్ లీడ్, స్వీట్ బరీ రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. మొక్క వేసిన 9 నెలల్లో కాపు వస్తోంది. రెండు నుంచి నాలుగేళ్ల పాటు ఎకరాకు 30 నుంచి 40 టన్నుల చొప్పున దిగుబడి వస్తోంది. దిగుబడి బాగుంటే నాలుగేళ్ల వరకూ తోటలు ఉంటాయి. కొంత మంది రెండేళ్లకే తోటలను తొలగిస్తున్నారు. మొదటి రెండేళ్లు దిగుబడి, పండు నాణ్యత, సైజు బాగుంటాయి. ఒక్కో పండు 2 నుంచి 4 కిలోల బరువు ఉంటుంది. ఎకరాకు రూ.1.50 లక్షల ఆదాయం వస్తోందని, పెట్టుబడి రూ.60 వేల నుంచి రూ.70 వేలు అవుతోందని చెబుతున్నారు. ఆరోగ్య ప్రయోజనాలు » బొప్పాయి పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. » ఇది జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. » చర్మం, కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. » బరువు తగ్గడానికి, గుండె సంబంధిత సమస్యల నివారణకు తోడ్పడుతుంది. » బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్–సి దంతాల చిగుళ్ల ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగ నిరోధక శక్తి పెంపుదలకు తోడ్పడుతుంది. » విటమిన్–బి నోటిపూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది. » కెరోటిన్, ఎ, బి, సి, ఇ విటమిన్లు, ఖనిజాలు, ప్లేవొనాయిడ్లు, ఫోలేట్లు, పాంథోనిక్ ఆమ్లాల వంటి పోషకాలు బొప్పాయి పండులో పుష్కలంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. » ఇన్ని విధాల ఆరోగ్యం కలిగించేది కావడంతో బొప్పాయి పండును ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. దిగుబడి బాగుంది నేను నాలుగెకరాల్లో బొప్పాయి పంట వేశాను. రెండు కోతలు జరిగాయి. ఎకరాకు 20 టన్నుల దిగుబడి వచ్చింది. టన్ను కాయలకు రూ.10 వేలు లభించాయి. ప్రస్తుతం టన్ను కాయలు రూ.5 వేలు పలుకుతున్నాయి. రావులపాలెం, అమలాపురం ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి కాయలు కొనుగోలు చేసి, కోల్కతా, భువనేశ్వర్ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.ధర బాగుంటే మంచి ఆదాయం వస్తుంది. జూలైలో తోట వేయగా, ఫిబ్రవరిలో కాపునకు వచ్చింది. మహారాష్ట్ర నుంచి మొక్క రూ.23 చొప్పున కొనుగోలు చేసి తెచ్చాను. ఎకరాకు 700 మొక్కలు పడతాయి. కాయ సైజు, నాణ్యత బాగున్నాయి. – కూచిపూడి రాజు, రైతు, పట్లంట్ల, దేవరపల్లి మండలం కొవ్వూరు డివిజన్లో అధికం బొప్పాయి సాగు కొవ్వూరు డివిజన్లో ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. రాజమహేంద్రవరం డివిజన్లోని కడియం, అనపర్తి ప్రాంతాల్లో అక్కడక్కడ తోటలు వేశారు. వాతావరణం అనుకూలించి, తెగుళ్లు లేకుండా ఉంటే రైతులకు ఇది లాభదాయకమైన పంట. రైతులు ఇప్పుడిప్పుడే బొప్పాయి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. – బి.సుజాత కుమారి, జిల్లా ఉద్యాన అధికారి, రాజమహేంద్రవరం కోల్కతా, ఒడిశాకు ఎగుమతి వేసవి అనంతరం ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో రైతులు బొప్పాయి తోటలు వేస్తారు. నల్ల నేలలు, ఇసుక, రాతి నేలలు దీని సాగుకు అనుకూలంగా ఉంటాయి. రాతి నేలలు, కొండ ప్రాంతాల్లో ఈ పంట పండదు. ఏటా మార్చి నుంచి జూన్ వరకూ దిగుబడి వస్తుంది. ఈ ప్రాంతంలో పండించిన బొప్పాయి కాయలు, పండ్లను ఒడిశా, భువనేశ్వర్, కోల్కతా వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఒడిశాలోని పలు ప్రాంతాల్లో బొప్పాయి కాయలు కూరగా వండుకొని తింటూంటారు. దీంతో, ఆ ప్రాంతాలకు పచ్చి కాయలు కూడా ఎగుమతి చేస్తున్నారు. వేసవిలో పండ్లకు ఎక్కువ గిరాకీ ఉంటుంది. స్థానికంగా ఉన్న పండ్ల వ్యాపారులు తోటల్లోకి వచ్చి పండు కాయలు కొనుగోలు చేస్తారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో కిలో రూ.10 పలికింది. ప్రస్తుతం రూ.5 పలుకుతోంది. -
రాజ్యాంగ రక్షణలేని ‘స్థానికత’!
కూటమి ప్రభుత్వం రాజ్యాంగ మౌలిక సూత్రాలను బేఖాతరు చేస్తూ ఇష్టారీతిన నిబంధనలు సవరిస్తోంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం, రాజ్యాంగంలోని అంశాలను సైతం జీవోలతో మార్చేస్తోంది. విద్యార్థుల భవిష్యత్ను గందరగోళంలోకి నెట్టివేస్తోంది. ఇటీవల ఉన్నత విద్యలోని 8 సెట్ల ద్వారా భర్తీ చేసే వృత్తివిద్య, డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి కోర్సుల్లో ఇప్పటి వరకు అమలవుతున్న 15శాతం అన్ రిజర్వ్డ్ (నాన్ లోకల్), జనరల్ కోటా సీట్ల విషయంలో స్థానికతను సవరిస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి నాన్లోకల్ కోటా ఉండదని, 100శాతం సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకే కేటాయిస్తామని వెల్లడించింది. దీంతో రాష్ట్రపతి ఉత్తర్వుల(ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్)ను సాధారణ జీవోలతో ఎలా సవరిస్తారన్న ప్రశ్న వినిపిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో తెలంగాణ నుంచి ఎవరైనా న్యాయ స్థానాలను ఆశ్రయిస్తే ఇక్కడ 15 శాతం నాన్ లోకల్ కోటా సీట్లు ఇవ్వాల్సిందేనని విద్యావేత్తలు చెబుతున్నారు. -సాక్షి, అమరావతికూటమి ప్రభుత్వ కాలయాపన..భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డీ ప్రకారం ప్రత్యేక నిబంధనలను పొందుపరిచారు. కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల ప్రజల హక్కులను కాపాడటానికి, ముఖ్యంగా ఉపాధి, విద్యలో సమాన అవకాశాలు కల్పించడానికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా విద్యాసంస్థల్లో 85 శాతం సీట్లు లోకల్, 15శాతం సీట్లు అన్రిజర్వ్డ్(నాన్లోకల్) విద్యార్థులతో భర్తీ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఉస్మానియా, ఆంధ్ర(ఏయూ), శ్రీ వెంకటేశ్వర(ఎస్వీయూ) రీజియన్ల వారీగా స్థానికతను ప్రామాణికంగా తీసుకుని సీట్లు భర్తీ చేసేవారు. ఉస్మానియా పరిధిలో నాన్ లోకల్ కింద 15శాతం ఏయూ, ఎస్వీయూ విద్యార్థులకు, ఏయూ, ఎస్వీయూ పరిధిలో 15శాతం తెలంగాణ విద్యార్థులకు సీట్లు కేటాయించేవారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రపతి ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా దీనిని పదేళ్లు పొడిగించారు. గతేడాది జూన్ 2వ తేదీతో పదేళ్ల గడువు ముగిసింది. తెలంగాణ ప్రభుత్వం నాన్లోకల్ 15శాతం సీట్లను ఇకపై ఏపీ విద్యార్థులకు కేటాయించేది లేదని ఇప్పటికే స్పష్టం చేసింది.గత జూన్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాదిపాటు ఐఏఎస్ అధికారుల కమిటీ పేరుతో కాలయాపన చేసింది. తీరా ప్రవేశాలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఇప్పుడు చట్టం ముందు నిలవలేని జీవోలు ఇచ్చి చేతులు దులిపేసుకుంది. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పదేళ్లు గడువు ముగియడంతో అందులోని అంశాలన్నీ ఆటోమెటిక్గా సీజ్ అవుతాయని ప్రభుత్వ అధికారులు వాదిస్తున్నారు. కానీ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డీలో సవరణ చేయకుండా స్థానికత మార్పునకు చట్టంలో ఎటువంటి విలువ ఉండదని విద్యావేత్తలు చెబుతున్నారు. రాజ్యాంగ సవరణతోనే స్థానికతకు రక్షణ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.కొన్ని కోర్సులకేనా స్థానికత..కూటమి ప్రభుత్వం స్థానికత అంశం ఉన్నత విద్యకు, అందులోనూ కొన్ని కోర్సులకే పరిమితం చేస్తున్నట్టు కనిపిస్తోంది. 2025–26 విద్యా సంవత్సరంలో కేవలం సంప్రదాయ, సాంకేతిక వర్సిటీల్లో వృత్తి విద్య, డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మాత్రమే నాన్లోకల్ కోటాను మార్పు చేస్తూ జీవోలు ఇచ్చింది. మిగిలిన ఆరోగ్య, వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ, మత్స్య యూనివర్సిటీలతో పాటు ప్రత్యేక విశ్వవిద్యాలయాలుగా రూపాంతరం చెందిన పద్మావతి, ద్రవిడియన్, ఆర్కిటెక్చర్, కస్లర్, ఉర్దూ, ఆర్జీయూకేటీ, వేదిక్ వంటి వాటిల్లో ప్రవేశాలకు నాన్లోకల్ కోటాను ఎలా సర్దుబాటు చేస్తారనేది వెల్లడించలేదు. దీంతో ఆయా వర్సిటీల అధికారులు అడ్మిషన్ల నిర్వహణకు తలలు పట్టుకుంటున్నారు. వీటితోపాటు విశాఖలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో నాన్లోకల్ కోటా నిర్ణయించకుండా ప్రవేశాలు చేపట్టడం అసాధ్యమని నిపుణులు చెబతున్నారు. ఫలితంగా ఈ విద్యా సంవత్సరంలో అనేక కోర్సుల్లో ప్రవేశాలు జాప్యమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
ఫలించిన ఉపాధ్యాయుల చర్చలు
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయుల సర్దుబాటు, బదిలీల అంశంపై విద్యాశాఖ అధికారులతో ఉపాధ్యాయ సంఘాల చర్చలు సఫలమయ్యాయి. ఉపాధ్యాయులు లేవనెత్తిన కొన్ని డిమాండ్లకు అధికారులు అంగీకరించినట్టు ఉపాధ్యాయుల సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల బదిలీలపై బుధవారం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. దీంతో బుధవారం తలపెట్టిన జిల్లా విద్యాశాఖ అధికారుల కార్యాలయాల ముట్టడిని రద్దు చేసినట్టు ఉపాధ్యాయ సంఘాల నాయకులు వెల్లడించారు. వాస్తవానికి 9 ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సోమవారం జరిగిన చర్చల్లో కీలకమైన డిమాండ్లపై డైరెక్టరేట్ నుంచి సానుకూలత రాకపోవడంతో చర్చలను బహిష్కరించారు. అయితే, మంగళవారం ఉదయం మరోసారి విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్తో చర్చలు జరపగా, ఉపాధ్యాయులు సూచించిన కొన్ని డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకరించినట్టు ఐక్యవేదిక నేతలు వెల్లడించారు. ప్రభుత్వం అంగీకరించిన అంశాలు ఇవే..» ఎస్జీటీలకు మాన్యువల్ పద్ధతిలో బదిలీలు నిర్వహిస్తారు. » ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తిని 1:49గా మార్చారు. 49 మంది విద్యార్థులు దాటిన తర్వాత రెండో సెక్షన్ ఏర్పాటు చేస్తారు.» ఫౌండేషన్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 20 దాటిన తర్వాత రెండో పోస్టు కేటాయిస్తారు.» ఉన్నత పాఠశాలల్లో నిర్వహించే ప్రాథమిక పాఠశాలలను విడిగా (యూడైస్తో సహా) నిర్వహిస్తారు.» పనిభారం ఎక్కువయ్యే సందర్భంలో ఆయా సబ్జెక్టుల అవసరం మేరకు అకడమిక్ ఇన్స్ట్రక్టర్/ సర్ప్లస్ ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తారు. » ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తయిన ఉపాధ్యాయులు వారి సొంత మేనేజ్మెంట్కు అప్పగింత » స్టడీ లీవ్లో ఉన్న ఉపాధ్యాయుల్లో ఈ ఏడాది ఆగస్టు 31లోపు విధుల్లో చేరేవారి స్థానాలను బదిలీల్లో చూపరు.» ప్రస్తుత బదిలీల్లో బ్లాకింగ్ విధానం ఉండదు. అన్ని స్థానాలను చూపిస్తారు. » మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో 1,382 మంది ఎస్జీటీలకు పీఎస్ హెచ్ఎంగా పదోన్నతి కల్పిస్తారు.» రెండుసార్లు పునర్విభజన(రీ అపోర్షన్మెంట్)కు గురయ్యే ఉపాధ్యాయులకు 7 పాయింట్లు ఇస్తారు. » ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్య పరిష్కారానికి జూన్ నెలలో కమిటీ ఏర్పాటు. » బదిలీల అనంతరం జూలై లేదా ఆగస్టులో ఎంఈవో, ప్రధానోపాధ్యాయుల పరస్పర బదిలీపై నిర్ణయం తీసుకుంటారు.» మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 120 దాటితే పీఎస్హెచ్ఎంను అదనంగా (1+5) కేటాయిస్తారు.» సమాంతర తెలుగు మాధ్యమం అంశంపై విద్యాశాఖ మంత్రితో చర్చించిన తర్వాత నిర్ణయం.నేడు బదిలీలకు షెడ్యూల్!ఉపాధ్యాయ సంఘాల సమస్యలు పరిష్కారం కావడంతో బదిలీలకు మార్గం సుగమమైంది. బుధవారం పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేయనుంది. తొలుత ప్రొవిజనల్ సీనియారిటీ జాబితా ప్రకటించి, దానిపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం ఫైనల్ సీనియారిటీ జాబితా విడుదల చేసి స్కూళ్లలో స్థానాల ఎంపికకు (ఆప్షన్స్) అవకాశం కల్పిస్తారు. తొలుత హెచ్ఎంల బదిలీలు చేపడతారు. ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు ఎస్జీటీలకు మాన్యువల్ బదిలీలు చేపడతారు. అనంతరం బదిలీ ఉత్తర్వులు విడుదల చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ జూన్ 2 నాటికి పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. -
మీ పాలనలో రైతులకు మేలు జరిగిందయ్యా!
సాక్షి, అమరావతి: ‘మీ పాలనలో రైతులందరికీ మేలు జరిగిందయ్యా. మీ హయాంలో రైతుల కష్టాలు తెలుసుకుని అన్నదాతకు అండగా నిలిచి.. మద్దతు ధర కల్పించి ధాన్యం కొనుగోలు చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు ఎలాంటి సాయం అందకపోగా ఆరుగాలం కష్టించి పండించిన పంటను కొనుగోలు చేయడం లేదు. రైతులు రోడ్డెక్కి నిరసనలు, ఆందోళనలు చేయాల్సి వస్తోంది. అయినా పట్టించుకోవడం లేదయ్యా’ అని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పొడగట్లపల్లికి చెందిన రైతు మెర్ల సత్యనారాయణ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఎదుట వాపోయారు.మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రైతు మెర్ల సత్యనారాయణ మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిసి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత లేకపోయినా తమ ప్రాంత రైతులు ఎకరాకు 55–60 బస్తాల ధాన్యం పండించారని ఆ రైతు వివరించారు. ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులంతా నిరసనలు, ఆందోళనలు చేసినా ప్రభుత్వంలో చలనం లేదని వాపోయారు.ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు కళ్లాల్లోనే ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. దీనికి వైఎస్ జగన్ బదులిస్తూ.. అన్నదాతకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతుల తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ హామీతో రైతు సత్యనారాయణ సంతోషంతో తాను పండించిన వరి కంకులను ఆయనకు బహూకరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ను మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, రామచంద్రాపురం వైఎస్సార్సీపీ ఇన్చార్జి పిల్లి సూర్యప్రకాష్ కలిశారు. -
ఎన్నికల కమిషన్ ఆదేశాలన్నా లెక్క లేదా?
ఎవరినీ వదలం.. పౌరుల రక్షణ పోలీసుల బాధ్యత. దీనినుంచి వారు తప్పించుకోలేరు. సంక్షేమ రాజ్యంలో పోలీసుల బాధ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ వ్యవహారంలో పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు ఎవరినీ విడిచిపెట్టం.- హైకోర్టు ఆగ్రహంసాక్షి, అమరావతి: రాష్ట్ర పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ‘ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశాలన్నా లెక్క లేదా..? వాటిని కూడా అమలు చేయరా? ఎన్నికలో పాల్గొనే వైఎస్సార్సీపీ వార్డు సభ్యులకు తగిన భద్రత కల్పించాలని ఆదేశించినా పట్టించుకోరా? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేయకపోవడంలో ఔచిత్యం ఏమిటని నిలదీసింది. పోలీసుల సమర్థత ముఖ్యంగా ఏపీ పోలీసుల సమర్థత గురించి తమకు బాగా తెలుసునని వ్యాఖ్యానించింది. వారు ఎంత సమర్థులో అందరికీ తెలుసని.. వారి గురించి ప్రత్యేకంగా తమకు చెప్పాల్సిన అవసరం లేదంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు వీలుగా హైకోర్టును ఆశ్రయించిన ఇద్దరితో పాటు 11 మంది కౌన్సిలర్లకు తగిన భద్రత కల్పించాలని విజయవాడ పోలీస్ కమిషనర్ను ఆదేశించింది. కౌన్సిలర్లు ఉన్న ప్రదేశం నుంచి పోలింగ్ కేంద్రం వరకు వారికి భద్రత కల్పించాలని సూచించింది. తమ ఆదేశాల అమలు విషయమై నివేదిక సమర్పించాలని కమిషనర్ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.భద్రత కోసం కోర్టుకు వెళ్లిన వైఎస్సార్సీపీ వార్డు సభ్యులుతిరువూరు నగర పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే వారందరికీ తగిన భద్రత కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్సీపీ వార్డు సభ్యులు మోదుగు ప్రసాద్, గుమ్మా వెంకటేశ్వరి హైకోర్టులో సోమవారం అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ లక్ష్మణరావు మంగళవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది పాపుడిప్పు శశిధర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. తిరువూరులో చైర్మన్ ఎన్నిక ఈ నెల 19న ఎన్నిక జరగాల్సి ఉందన్నారు. కౌన్సిలర్లు ఓటు వేసేందుకు వెళ్తుండగా, అధికార టీడీపీ నేతలు అడ్డుకున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. చైర్మన్గా పోటీ చేస్తున్న వ్యక్తిని సీఐ, డీఎస్పీ తీసుకెళ్లడంతో ఎన్నిక మంగళవారానికి వాయిదా పడిందన్నారు. వార్డు సభ్యులకు భద్రత కల్పించేలా చూడాలంటూ తాము ఎన్నికల కమిషన్కు వినతిపత్రం ఇచ్చామన్నారు. శాంతిభద్రతల సమస్యతో వార్డు సభ్యులు వారి నివాసాల్లో ఉండలేని పరిస్థితి వచ్చిందని.. చాలామంది హోటళ్లలో తలదాచుకుంటున్నారని చెప్పారు. తమ వార్డు సభ్యులు ఎక్కడ ఉన్నారో చెప్పి వారికి భద్రత కల్పించాలని కోరామన్నారు. ఈ వినతిపత్రాన్ని ఎన్నికల సంఘం విజయవాడ పోలీస్ కమిషనర్, ఎన్నికల అధికారి, కలెక్టర్, డీజీపీ తదితరులందరికీ పంపిందని శశిధర్రెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ వార్డు సభ్యులకు భద్రత కల్పించాలని ఆదేశించిందన్నారు. కానీ, వీటిని పోలీసులు అమలు చేయలేదని.. వార్డు సభ్యులు ఇళ్లకు తిరిగి వస్తేనే భద్రత కల్పిస్తామని సీఐ, డీఎస్పీ చెబుతున్నారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది (హోం) అడుసుమల్లి జయంతిని న్యాయమూర్తి వివరణ కోరారు. భద్రత కోసం ఎన్నికల సంఘానికి వినతిపత్రం ఇస్తే సరిపోదని, పోలీసులకు కూడా ఇవ్వాలని ఆమె తెలిపారు. పోలీసులకు ఎందుకు వినతిపత్రం ఇవ్వలేదని శశిధర్రెడ్డిని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ చేసే వార్డు సభ్యుడిని తిరువూరు సీఐ తీసుకెళ్లారని, అందుకే ఆయనకు వినతిపత్రం ఇవ్వలేదని శశిధర్ సమాధానం ఇచ్చారు. ‘‘సీఐ పేరు ఏమిటి?’’ అని న్యాయమూర్తి ప్రశ్నించగా, సీఐ గిరిబాబు, డీఎస్పీ ప్రసాదరావు అని శశిధర్ తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. ఇరుపక్షాలు కోర్టులతో ఆడుకోవద్దని స్పష్టం చేశారు. పోలీసులు తప్పు చేస్తే కోర్టు ధిక్కారం కింద తీవ్రంగా శిక్షిస్తామని, వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. న్యాయస్థానాల్లో షోలు చేయవద్దని హితవు పలికారు.వార్డు సభ్యులు ఎక్కడున్నారో స్పష్టంగా చెప్పాంఈ సమయంలో శశిధర్రెడ్డి స్పందిస్తూ, తాము అవాస్తవాలు చెప్పడం లేదన్నారు. వైఎస్సార్సీపీ వార్డు సభ్యులు ఎక్కడ ఉన్నారో ఎన్నికల సంఘానికి ఇచ్చిన వినతిపత్రంలో స్పష్టంగా చెప్పామని, వాటిని పరిగణనలోకి తీసుకుని హోటల్లో ఉన్న కౌన్సిలర్లు, ఇంటి వద్ద ఉన్న వార్డు సభ్యులకు పోలింగ్ కేంద్రం వరకు భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించిందని తెలిపారు. (ఈసీ ఆదేశాలను చదివి వినిపించారు).పోలీసులకు తెలియదంటేమేం నమ్మాలా?వైఎస్సార్సీపీ వార్డు సభ్యులు ఎక్కడ ఉన్నారో పోలీసులకు తెలియదని జయంతి చెప్పారు. దీనిపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మాట ఓ సామాన్యుడు చెబితే నమ్ముతామని, తమకు తెలియదని పోలీసులు చెబితే ఎలాగని ప్రశ్నించారు. పోలీసులు తెలియదంటే నమ్మేస్తామని అనుకుంటున్నారా? అంటూ నిలదీశారు. వైఎస్సార్సీపీ వార్డు సభ్యులు ఎక్కడ ఉంటే అక్కడినుంచి పోలింగ్ కేంద్రం వరకు భద్రత కల్పించాలని ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు సరిపోవా? అంటూ ప్రశ్నించారు.భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించాంఎన్నికల సంఘం తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ, వైఎస్సార్సీపీ వినతిపత్రాన్ని పోలీసు కమిషనర్, ఎన్నికల అధికారి, కలెక్టర్, డీజీపీ తదితరులందరికీ పంపి భద్రతపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా వైఎస్సార్సీపీ వార్డు సభ్యులు ఎక్కడ ఉంటే అక్కడినుంచి పోలింగ్ కేంద్రం వరకు వారికి భద్రత కల్పించాలని విజయవాడ పోలీస్ కమిషనర్ను ఆదేశించారు. ఈ సమయంలో పోలీసులు ఏవైనా అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఆళ్లగడ్డలో అడుగుపెట్టనివ్వను!
ఆళ్లగడ్డ: ‘పార్టీలో నా ప్రమేయం లేకుండా పదవులు ఇస్తున్నారు. నాకు తెలియకుండా ఎవరికైనా పదవి ఇస్తే ఊరుకోను. వారిని నియోజకవర్గంలో అడుగుపెట్టనిచ్చేది లేదు..’ అని ఆళ్లగడ్డలో సోమవారం రాత్రి జరిగిన మినీ మహానాడులో టీడీపీ అధిష్టానానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అల్టిమేటం జారీ చేశారు. ఆమె వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. శిరివెళ్ల మండలానికి చెందిన నరసింహారావుకు టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వొద్దని ఎమ్మెల్యే అఖిలప్రియ అధిష్టానానికి చెప్పడంతోపాటు అదే మండలానికి చెందిన శ్రీకాంత్రెడ్డికి ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. అయినా అధిష్టానం ఆమె మాట లెక్క చేయకుండా నరసింహారావుకే జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలియడంతోనే మినీ మహానాడులో అధిష్టానానికి అఖిలప్రియ వార్నింగ్ ఇచ్చినట్లు టీడీపీ వర్గీయులు చర్చించుకుంటున్నారు.అఖిలప్రియకు షాక్.. ఇన్చార్జిగా వాసు? ఇటీవల ఆళ్లగడ్డ నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న ఘటనలపై మీడియాలో వరుస కథనాలు రావడంతో పార్టీ పరువుపోతోందని అఖిలప్రియపై టీడీపీ అధిష్టానం సీరియస్గా ఉన్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ను కలిసేందుకు ఆమె వెళ్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదనే చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. దీనికితోడు ఇటీవల అమరావతిలో ప్రధానమంత్రి సభకు అఖిలప్రియకు పాస్లు పంపకపోవడం, సీఎం కర్నూలుకు వచ్చినప్పుడు కూడా ఆమెకు ఆహ్వానం లేకపోవడంతో అక్కడకు వెళ్లలేదన్న అంశాలు సైతం చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో అధిష్టానంపై తిరుగుబాటు చేసేందుకైనా సిద్ధమని మినీ మహానడు వేదికగా అఖిలప్రియ హెచ్చరిక జారీ చేయడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారని, ఆళ్లగడ్డకు టీడీపీ ఇన్చార్జిగా సీపీ వాసును నియమించేందుకు రంగం సిద్ధమైందనే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
కడపలో ‘మహా’ కలెక్షన్!
సాక్షి ప్రతినిధి, కడప: టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి దంపతులు కొత్త దందాకు తెరతీశారు. కడపలో టీడీపీ మహానాడు కోసం మహా కలెక్షన్ మొదలుపెట్టారు. నిన్నటి వరకు కడప నగర అభివృద్ధి పేరుతో ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తున్నామని చెప్పినవారు... నేడు ఆ సొమ్మును మహానాడు పేరుతో తమ జేబులో వేసుకునే పనిలో పడ్డారు. ఎన్నికల్లో గెలవడం కోసం మాధవిరెడ్డి కడప నగరాభివృద్ధి కోసం చేసే పనుల వివరాలు తెలియజేస్తూ సొంత మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో భాగంగా కడప నగరంలోని ప్రతి వీధిలో సీసీ కెమెరాలు పెడతానని హామీ ఇచ్చారు. ఆమె గెలిచి ఏడాదైనా ఒక్క హామీ నెరవేర్చలేదని ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీంతో ఎన్నికల ముందు సొంత నిధులతో నగరాన్ని అభివృద్ధి చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన భార్యాభర్తలు, ఇప్పుడు విరాళాల పేరుతో బలవంతంగా వసూళ్లపర్వం మొదలుపెట్టారు. నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు విరాళాలు ఇవ్వాలని ప్రముఖులకు వాట్సాప్ మెసేజ్లు పంపారు. ఎవరెవరు ఎంతెంత ఇవ్వాలో కూడా వారే నిర్ణయించారు. ఎమ్మెల్యే సూచన మేరకు నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు రూ.లక్ష చొప్పున విరాళం ఇవ్వాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) నగర శాఖ ఆదేశించింది. ఎస్పీ పేరిట చెక్ లేదా డీడీ ఇవ్వాలని సూచించింది. దీనిపై విమర్శలు రావడంతో ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని ఎస్పీ ప్రకటించినట్లు తెలిసింది. ఇదే సమయంలో కడపలోనే మహానాడు నిర్వహిస్తుండడంతో ఎస్పీకి చెక్ లేదా డీడీ ఇవ్వాలన్న నేతలు ఇప్పుడు నేరుగా నగరంలోని ప్రముఖులందరికీ ఫోన్లు చేసి తమకే ఆ లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నగర అభివృద్ధి అనేది పక్కకుపోయి, ఇప్పుడు మహానాడు ఖర్చుల కోసం కొత్త కలెక్షన్లకు తెరలేపారనే ప్రచారం జోరుగా సాగుతోంది. విరాళల కోసం శ్రీనివాసులురెడ్డి నేరుగా వైద్యులకు ఫోన్లు చేస్తున్నట్లు పలువురు డాక్టర్లు తెలిపారు. ఇప్పటికే కొంతమంది డాక్టర్లు డబ్బులు ముట్టజెప్పినట్లు సమాచారం.నగరాభివృద్ధి కోసమే అయితే ‘కడప నగరాభివృద్ధికి చేయూతనివ్వండి. నేరాల కట్టడికి మీ వంతు బాధ్యతగా కృషి చేయండి. సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించండి’ అని కోరితే ఆసక్తిగలవారు ముందుకొస్తారు. దాతలు నేరుగా సీసీ కెమెరాలను అందజేస్తారు. కానీ, ఇక్కడ దాతలకు ఆ వెసులుబాటు లేదు. బలవంతంగా తాము ఎంత చెబితే అంత సమరి్పంచుకుని వెళ్లాల్సిందేనని హుకుం జారీ అయ్యింది. తొలుత సీసీ కెమెరాల పేరుతో వైద్యులు మాత్రమే రూ.లక్ష ఇవ్వాలని ఆదేశాలు వెళ్లాయి. ఇప్పుడు నగరంలోని ప్రముఖులకు ఫోన్లు చేసి మరీ ఎంత విరాళం ఇవ్వాలో చెబుతున్నారని పలువురు వాపోతున్నారు. ఇలాంటి సంస్కృతి కడపలో మునుపెన్నడూ లేదని, వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలతో నగరాన్ని అభివృద్ధి చేశారని, పైసా కూడా ప్రజల నుంచి విరాళం తీసుకోలేదని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే, ఆమె భర్త ఏడాదిలోనే ప్రైవేటు వ్యక్తుల వ్యాపారాలను స్వాహా చేస్తున్నారని, విరాళాల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. -
పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో మెజారిటీ లేకపోయినా పదవి కోసం దిగజారిపోతున్నారని మండిపడ్డారు. కోరం లేకుండా చేసి.. గెలిచినట్లు ప్రకటించుకున్నారని తప్పును ఎత్తి చూపారు. ఈ రోజు తిరువూరు.. నిన్న, మొన్న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో.. ఎక్కడైనా అదే రాజకీయం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన స్థానిక సంస్థల పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఈ రోజు చేస్తున్న రాజకీయంలో కనీసం ఒక శాతం కూడా మనం చేయలేదు. ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు. నాడు స్థానిక ఎన్నికల్లో అన్నీ మనం గెలిచాం. కేవలం రెండు మున్సిపాలిటీల్లో ఓడిపోయాం. తాడిపత్రి మున్సిపాలిటీలో మనకు 16 మంది కౌన్సిలర్లు ఉంటే, టీడీపీకి 18 మంది ఉన్నారు. ఇద్దరిని లాగుదామని, మన ఎమ్మెల్యే అంటే, నేను వద్దన్నాను. ఎమ్మెల్యేను హౌజ్ అరెస్టు చేయించి, చైర్మన్ ఎన్నిక నిర్వహించాను. అదీ మనం చేసిన విలువలతో కూడిన రాజకీయం. ‘నాడు జగనన్నకు చెబుదాం’, ‘స్పందన’ అనే కార్యక్రమాల ద్వారా ఎవరికి ఏ సమస్య వచ్చినా, నేరుగా సీఎంఓ ఫాలోఅప్ చేసేది. అప్పుడు ఎక్కువ సమస్యలు టీడీపీ వారివే పరిష్కారమయ్యాయి’ అని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..కోరం లేకపోయినా గెలిచినట్లు ప్రకటిస్తారా? ⇒ ఆ రోజు కులం, మతం, రాజకీయం చూడకుండా మనం పాలించాం. అదే ఈరోజు పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. అయినా ఎవరూ మాట్లాడలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో మనం రాజకీయం చేస్తున్నాం. ⇒ తిరువూరులో 20 మంది కౌన్సిలర్లలో 17 మంది వైఎస్సార్సీపీ, మిగతా ముగ్గురు టీడీపీ. అయితే బలవంతంగా ఐదుగురిని లాగారు. అయినా ఆ ఎన్నికలో మనమే గెలవాలి. ఎందుకంటే మన బలం 12. టీడీపీకి కేవలం ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. టీడీపీకి బలం లేకపోయినా, పదవి కోసం దారుణంగా వ్యవహరిస్తున్నారు. లేదంటే పోలీసుల సహాయంతో ఎన్నిక జరగకుండా చూస్తున్నారు. మన నాయకులను హౌజ్ అరెస్టు చేశారు. టీడీపీ వారందరినీ రోడ్ల మీదకు వదిలారు. ఈరోజు హైకోర్టులో హౌజ్ మోషన్ మూవ్ చేశాం. పోలీసు బందోబస్తు కోరాం. ⇒ నరసరావుపేటలో మొత్తం 17 గెలిచాం. కానీ వారిలో కొందరిని లాక్కున్నారు. దీంతో మనకు 13 మంది సభ్యులు ఉండగా, టీడీపీకి కేవలం ముగ్గురే ఉన్నారు. ఒకరు చనిపోయారు. కోరం లేకపోయినా గెలిచామని ప్రకటించుకున్నారు. ⇒ కారంపూడిలో మొత్తం 14 వైఎస్సార్సీపీ గెలిస్తే, ఆరుగురిని లాగారు. అయినా అక్కడ మన బలం ఎనిమిది కాగా, టీడీపీకి ఆరుగురు మాత్రమే ఉన్నారు. అయినా కోరం లేకపోయినా గెలిచినట్లు ప్రకటించారు. చివరకు కుప్పం మున్సిపాలిటీ, రామకుప్పంలోనూ అదే పరిస్థితి. ⇒ రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరిలో వైఎస్సార్సీపీ 9 గెలిస్తే, టీడీపీ 1 గెలిచింది. అయినా ఎంపీపీ ఎన్నికలో అక్రమాలు. ఒక పార్టీ మీద గెలిచినప్పుడు, వారిని లాక్కోవడం ఏమిటి? సీఎంగా ఉన్న వ్యక్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడకుండా పోలీసులను పెట్టి భయపెట్టడం ఏమిటి? మన పార్టీ నుంచి ముగ్గురిని లాక్కున్నారు. అయినా మనకు ఇంకా ఆరుగురు ఉన్నారు. మనదే మెజారిటీ. ఎన్నిక పెడితే మనమే గెలుస్తాం. అయినా దౌర్జన్యం చేసి, కోరం లేదని చెప్పి, ఎన్నిక గెల్చే ప్రయత్నం చేస్తున్నారు. ⇒ పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలిలో వైఎస్సార్సీపీ 14, టీడీపీ నాలుగు స్థానాల్లో నెగ్గింది. ఒకరిని లాక్కున్నారు. మిగతా వారు గట్టిగా నిలబడడంతో ఏం చేయలేక వదిలేశారు. ఇలా ప్రజాస్వామ్యం ఖూనీ అయిన పరిస్థితుల్లో మనం ఏకం అవుతున్నాం.వైఎస్సార్సీపీలో చేరిన విశాఖ టీడీపీ కార్పొరేటర్ పూర్ణిమ శ్రీధర్సాక్షి, అమరావతి: విశాఖపట్నం 41వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ మంగళవారం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి ఆమెను సాదరంగా వైఎస్సార్సీపీలోకి ఆహ్వనించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జ్ వాసుపల్లి గణేశ్ పాల్గొన్నారు. -
వేగంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు
సాక్షి, అమరావతి/మహారాణిపేట: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా తదితర జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. గడిచిన 24 గంటల్లో బాపట్ల జిల్లా కూచినపూడిలో 7.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. విశాఖ రూరల్లో 7.5, కృష్ణా జిల్లా ఘంటశాలలో 7.1, కాకినాడలో 6.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాకినాడ జిల్లా కరపలో 6.5 సెం.మీ వర్షం పడింది. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లా కటికపల్లిలో 5.3 సెంటీమీటర్లు, కోనసీమ జిల్లా మండపేటలో 4.8, కాకినాడ జిల్లా ఆర్యావటంలో 4.6, మధ్యకొంపలులో 4.4 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుందని తెలిపింది. 4, 5 రోజుల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు అనుకూల వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో నైరుతి రుతుపవనాలు 4, 5 రోజుల్లో కేరళను తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వేగంగా విస్తరిస్తున్న రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతంలోని మిగిలిన ప్రాంతాలు, లక్షద్వీప్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాల్లో ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఏర్పడిందని పేర్కొంది. -
‘పట్టు’ వదిలేశారా?
పట్టు (సిల్క్) ఉత్పత్తిలో పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు మండలం రాష్ట్రంలోనే కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడి మల్బరీ సాగు, పట్టుగూళ్ల ఉత్పత్తిని చూసిన స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం కె.పవన్కళ్యాణ్ గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలును సిల్క్ హబ్గా, సిల్క్ సిటీగా మారుస్తానని హామీలిచ్చారు. తీరాచూస్తే ఆ హామీ నెరవేరకపోగా.. రాష్ట్రానికే వన్నే తెచ్చిన పట్టు పరిశ్రమ ఇప్పుడు మూతపడే పరిస్థితులు ఎదురవుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. – పిఠాపురంమంగళం పాడేసినట్టేనా! ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రోత్సాహకాలు ఇవ్వాలంటూ పట్టు రైతులు ఇటీవల గుంటూరులోని రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ కమిషనర్కు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ క్రమంలో పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) పీడీ చైత్రవర్షిణికి సోమవారం వినతిపత్రం అందజేయగా.. ఆమె సూచన మేరకు కాకినాడలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ను కలిశారు. పంటలు పోయి నష్టాల పాలయ్యామని, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు విడుదల చేసి ఆదుకోవాలని గ్రీవెన్స్లో వినతిపత్రం ఇచ్చారు. ఆ సందర్భంగా ‘ఇబ్బందులు పడుతూ పట్టు సాగు చేయడం ఎందుకు. అది మానేసి పామాయిల్ సాగు చేసుకోండి’ అని కలెక్టర్ సలహా ఇచ్చారని రైతులు చెబుతున్నారు. కలెక్టర్ మాటలనుబట్టి పట్టు పరిశ్రమకు ప్రభుత్వం ఇక మంగళం పాడేసినట్టేనని రైతులు ఆందోళన చెందుతున్నారు.పంటను దున్నేస్తున్న రైతులుపట్టు పురుగులకు ఆహారం కోసం వినియోగించే మల్బరీ తోటల్ని సాగు చేసేందుకు కొత్త రైతులు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇదే సందర్భంలో పట్టు పురుగుల పెంపకం చేపట్టిన రైతులు కూడా గిట్టుబాటుకాక సాగును వదిలేస్తున్నారు. ఒక్క గొల్లప్రోలు మండలం చేబ్రోలులోనే సుమారు 400 ఎకరాల్లో మల్బరీ సాగు చేయగా, ఇప్పటికే వందల ఎకరాల్లో పంటను దున్నేశారు. రాష్ట్రంలో పలమనేరు, హిందూపురంతో పాటు కాకినాడ జిల్లాలోని చేబ్రోలులో పట్టు పరిశ్రమ కేంద్రాలు ఉన్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీలో 5, పెద్దాపురం డివిజన్లో 12, కాకినాడ డివిజన్లో 2 మండలాల్లో 4,500 ఎకరాల్లో 1,150 మంది రైతులు మల్బరీ సాగు చేస్తున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పట్టు పరిశ్రమ సుమారు 50 ఏళ్లుగా ఓ వెలుగు వెలుగుతోంది. ఇలాంటిచోట కూటమి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ప్రోత్సాహం కరువవడంతో సరైన ధర రాక, పంట కొనేవారు లేక, పెట్టుబడి దక్కక, కనీసం కౌలుకు తీసుకునే వారు కూడా ఉత్సాహం చూపకపోవడంతో పట్టు రైతులు పంటకు విరామం ప్రకటిస్తున్నారు. ఎకరం విస్తీర్ణంలో మల్బరీ సాగుకు రూ.లక్ష పెట్టుబడి అవుతోంది. పట్టు పురుగుల పెంపకానికి 50 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పున షెడ్ నిర్మాణానికి రూ.15 లక్షల వరకూ ఖర్చవుతోంది. దీని నిర్వహణకు రూ.50 వేల వరకూ ఖర్చవుతోంది. గతంలో ఇక్కడ పండించిన పట్టుగూళ్లకు కేజీకి రూ.550 వరకూ ధర వచ్చేది. ప్రస్తుతం రూ.250కి కూడా కొనేవారు లేకపోవడంతో తీవ్ర నష్టాల పాలవుతున్నామని రైతులు వాపోతున్నారు.మరోవైపు ప్రభుత్వం మల్బరీ రైతులకు ఇన్సెంటివ్లు ఇవ్వాల్సి ఉండగా.. ప్రతి రైతుకు రూ.లక్షల్లో బకాయి పెట్టింది. పైగా షెడ్ల నిర్మాణానికి ఇచ్చే ప్రోత్సాహకాలు సైతం ఇవ్వడం లేదు. దీనికి తోడు ఊజీ ఈగ దాడితో పాటు వివిధ రకాల తెగుళ్లతో పట్టు పురుగులు గూళ్లు కట్టలేదు. ఫలితంగా పట్టు సాగు తీవ్రంగా దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో సగానికి పైగా రైతులు తమ మల్బరీ తోటలను దున్నేశారు.కాకినాడ జిల్లాలో మల్బరీ సాగు వివరాలుసాగు చేస్తున్న మండలాలు 19గ్రామాలు 155పట్టు రైతుల సంఖ్య 1,150సాగు విస్తీర్ణం 4,500ఎకరాలురోజుకు పట్టుగూళ్ల దిగుబడి 5 టన్నులుఆదుకుంటారనుకుంటే ఆపేయమంటున్నారు ఎన్నికల్లో పవన్కళ్యాణ్ మా ఊరొచ్చి మాకు న్యాయం చేస్తానని మాటిచ్చారు. సిల్క్ సిటీ కడతానన్నారు. కానీ ఆయన పట్టించుకోవడం లేదు. కలెక్టర్కు వినతిపత్రం ఇస్తే.. ‘నష్టాలు వచ్చేటప్పుడు ఆ పంట ఎందుకు? వేరే పంటలు సాగు చేసుకోవచ్చు కదా’ అని అంటున్నారు. ‘ముందు మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రోత్సాహకాలు ఇప్పించండి. తరువాత పంట వేయాలో మానేయాలో నిర్ణయించుకుంటాం’ అని చెప్పాం. అధికారుల తీరు చూస్తుంటే పట్టు సాగు చేయనిచ్చేలా లేరు. – ఓరుగంటి ఏసుబాబు, పట్టు రైతు, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం పామాయిల్ వేసుకోమంటున్నారు పట్టు సాగుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని అడిగితే ఈ పంట మానేసి పామాయిల్ వేసుకోవాలని చెప్పడం విస్మయం కలిగించింది. నష్టం వస్తోందని ఆపుకుంటూ పోతే ఇక్కడ ఇక ఏ పంటలూ ఉండవు. నష్టాలు రాకుండా ఏం చేయాలన్నది ఎవరూ ఆలోచించడం లేదు. మాకు రావాల్సిన ప్రోత్సాహకాల గురించి మాట్లాడటం లేదు. ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నాం. రాజకీయ నాయకుల చుట్టూ తిరిగాం. అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. మమ్మల్ని పట్టించుకున్న వారు కనిపించడం లేదు. – ఓరుగంటి శ్రీను, పట్టు రైతు, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం -
హామీలు గాలికి.. కుట్రలు తెరపైకి..: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికలప్పుడు ఇచ్చిన సూపర్ సిక్స్, ఇతర హామీలు అమలు చేయకపోగా ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టడంపైనే దృష్టి పెట్టిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారని, ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించడం లేదని.. ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు పెచ్చుమీరిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రెడ్బుక్ కుట్రలతో విధ్వంసం సృష్టిస్తున్నారని, బరితెగించి యథేచ్ఛగా కేసుల మీద కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని.. మనం రాక్షస యుగంలో ఉన్నామని, చంద్రబాబు పాలనలో రాజకీయాలు నైతికంగా పతనం అయ్యాయన్నారు. అయితే ఈ అక్రమ కేసులు, అరెస్టుల పర్వానికి భయపడాల్సిన అవసరం లేదని వైఎస్సార్సీపీ శ్రేణులకు తేల్చి చెప్పారు. జైళ్లకు పంపినా సరే.. ‘చంద్రబాబూ.. నిన్ను ఎదుర్కొంటాం’ అని ధైర్యంగా, గట్టిగా నిలబడగలిగినప్పుడే రాష్ట్రంలో రాజకీయం చేయగలమని స్పష్టం చేశారు.ఆయన మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం, శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు.రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై చర్చించి.. పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్సీపీకి కార్యకర్తే నంబర్ వన్ అని, వచ్చేది మన ప్రభుత్వమేనని, జగన్ 2.0లో కార్యకర్తలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, ఆయా జిల్లాల పార్టీ ముఖ్య నాయకులను ఉద్దేశించి వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత ⇒ ఈ రోజు మనం ఎలాంటి పరిస్థితుల మధ్య ప్రయాణం చేస్తున్నామో నా కంటే మీకే బాగా తెలుసు. మనం రాక్షస యుగంలో ఉన్నాం. కలియుగంలో అంటే చంద్రబాబు యుగంలో రాజకీయాలు చేయాలంటే.. కేసులు వేసినా భయపడకూడదు. జైళ్లకు పంపినా, చంద్రబాబూ.. నిన్ను ఎదుర్కొంటాం అని గట్టిగా అంటేనే రాజకీయాల్లో ఉండగలం. రాజకీయాలు చేయగలం. అదే ఈ కలియుగంలో మనం నేర్చుకుంటున్న పాఠం. ఈరోజు రాజకీయాలు అలా తయారయ్యాయి. ⇒ మామూలుగా ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఏడాది తర్వాత కొంత వస్తుంది. కానీ, చంద్రబాబు ప్రభుత్వానికి ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ప్రజలు ఆయన్ను తీవ్రంగా ద్వేషిస్తున్నారు. ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చాడు. జగన్ ఇచ్చినవన్నీ ఇవ్వడమే కాకుండా, ఇంకా మూడు ఎక్కువ ఇస్తానన్నాడు. కానీ, ఏదీ నిలబెట్టుకోలేదు. ఇప్పటికే సంవత్సరం అయిపోయింది. అందుకే ఆయన ప్రభుత్వంపై అంత వ్యతిరేకత వచ్చింది.⇒ చంద్రబాబు, ఆయన పార్టీ కార్యకర్తలు ఏ ఒక్క ఇంటికీ ధైర్యంగా పోలేరు. వారు ఏ ఇంటి తలుపు తట్టినా.. పిల్లవాడి స్థాయి నుంచి ప్రశ్నించడం మొదలు పెడతారు. ఎన్నికలప్పుడు ఇంటింటికి పోయి ఏం చెప్పారు? బాండ్లు అన్నాడు. ఇంకా ఏమేం చెప్పారు? ఇంటింటికీ వెళ్లి, చిన్న పిల్లాడు కనబడితే నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని, అదే ఇంట్లో ఆ పిల్లల అమ్మ కనబడితే నీకు రూ.18 వేలు అని, ఆ ఇంట్లోనే అమ్మమ్మలు కనబడితే నీకు రూ.48 వేలు అని, 20 ఏళ్ల యువకుడు కనబడితే నీకు రూ.36 వేలు అని, రైతు కనబడితే నీకు రూ.26 వేలు ఇస్తామని చెప్పారు. ఆ మాటలు ఇంకా వారిని వెంటాడుతాయి. మాట మీద నిలబడని రాజకీయ నాయకుడు సీఎం హోదాలో ఉన్నాడు. మాట ఇస్తే, దాన్ని అమలు చేయని వ్యక్తి సీఎంగా ఉన్నాడు.వ్యవస్థలన్నీ నిర్వీర్యం ⇒ రాష్రంలో విద్యా రంగం నిర్వీర్యం అయింది. ఇంగ్లిష్ మీడియం లేదు. గోరుముద్ద నామమాత్రం అయింది. నాడు–నేడు లేదు. పిల్లలకు ట్యాబ్లు లేవు. మనం అమ్మ ఒడి కింద రూ.15 వేల చొప్పున ఇచ్చాం. ఇవాళ అది లేదు. నిరుపేదల ఆరోగ్యం గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని వదిలేసింది. ఆ బిల్లులు దాదాపు రూ.3,600 కోట్లు ఇవ్వడం లేదు. ఆరోగ్య ఆసరా అమలులోనే లేదు. ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వక పోవడంతో వైద్యానికి ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. ⇒ ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. దళారులు వచ్చారు. ఆర్బీకే వ్యవస్థను నాశనం చేశారు. ఉచిత ఇన్సూ్యరెన్స్ లేదు. పంటనష్ట పరిహారం ఇవ్వడం లేదు.మనం బాగు చేస్తే.. బాబు చెడగొడుతున్నాడు ⇒ మనం 17 మెడికల్ కాలేజీలు కడితే, ఈరోజు వాటిని అమ్మేస్తున్నారు. ఏదైనా జిల్లాలో మెడికల్ కాలేజీ ఉంటే, అక్కడ అన్ని వైద్య సదుపాయాలు, ఒక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఉన్నట్లు. దానివల్ల ఆ జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులు రోగులను మోసం చేయలేవు.⇒ మనం మూలపేట (శ్రీకాకుళం జిల్లా)తోపాటు మూడు పోర్టులు కట్టడం మొదలు పెట్టాం. వాటిలో 30 శాతం పనులు పూర్తి చేస్తే, కమీషన్ల కోసం చంద్రబాబు వాటిని అమ్మేస్తున్నాడు.⇒ ఉత్తరాంధ్రలో ట్రైబల్ ఇంజినీరింగ్, మెడికల్ కాలేజ్, ఐటీడీఏ పరిధిలో ఐదు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం మొదలు పెడితే, ఈ పెద్దమనిషి మొత్తం వదిలేశాడు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కోసం మనం భూసేకరణ చేశాం. 30 శాతం పనులు చేశాం. రాష్ట్రంలో ఎక్కడైనా, ఏ ప్రాంతంలో అయినా, ఏ అభివృద్ధి అయినా జరిగింది అంటే కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే.⇒ చంద్రబాబు అన్ని వ్యవస్థలను నాశనం చేశాడు. ఆయన ఎక్కడా మాట నిలబెట్టుకోలేదు. అలా ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. అందుకే తనను ఎవరూ ప్రశ్నించకూడదని భయానక పాలన సాగిస్తున్నాడు. అందులో భాగంగా రెడ్బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు. ఎవరు మాట్లాడినా, వారి గొంతు నొక్కుతున్నారు. నిలదీస్తున్న గొంతులను నలిపేస్తున్నారు.రాష్ట్రంలో తొలిసారిగా మాన్యుఫ్యాక్చర్ విట్నెస్ సృష్టిస్తుండటాన్ని చూస్తున్నాం. అంటే నేరంతో ఒక మనిషికి సంబంధం లేకపోయినా, వారికి సంబంధించిన ఒక వ్యక్తిని పట్టుకుని అప్రూవర్ అంటున్నారు. ఆయనతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తున్నారు. ఆ మనిషితో, ఈ మనిషి పేరు చెప్పిస్తున్నారు. ఈ మనిషిని అరెస్టు చేస్తున్నారు. అలా ఒక మాన్యుఫ్యాక్చర్ ఎవిడెన్స్ క్రియేట్ చేస్తున్నారు. చరిత్రలో గతంలో ఏనాడూ ఇలాంటివి జరగలేదు. ఒక తప్పుడు సంప్రదాయానికి ఈ పెద్దమనిషి చంద్రబాబు ఈరోజు బీజం వేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో పాత కేసులు తిరగ తోడుతున్నారు. మన ఎమ్మెల్యే అభ్యర్థులు, చురుగ్గా పని చేస్తున్న ప్రజా ప్రతినిధులు, నాయకులను ఇరికిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. - వైఎస్ జగన్మన ప్రభుత్వ హయాంలో ప్రతి కార్యకర్త కూడా ధైర్యంగా ఇంటింటికీ వెళ్లగలిగాడు. మేనిఫెస్టో చూపి, జగన్ ఏం చేశాడో చూపి టిక్ పెట్టమని అడిగాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు.. మూడు సార్లు ప్రతి ఇంటికీ వెళ్లి, ఎన్నికల ముందు ఏమేం చేశామో చెప్పాం. వాటిని చూపాం. ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావించాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం పూర్తి చేసిన పార్టీ దేశంలో ఎక్కడా లేదు. అయినా మనం ప్రతిపక్షంలో ఉన్నాం. కారణం కేవలం 10 శాతం మంది వారి మాటలు నమ్మి, మనకు వ్యతిరేకంగా ఓటేశారు. ఇంత మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చున్నామంటే.. చంద్రబాబు పరిస్థితి ఏమిటి? ఎన్నికలు ఎప్పుడొచ్చినా, ప్రజలు ఫుట్బాల్ను తన్నినట్లు తంతారు. - వైఎస్ జగన్ఉధృతంగా పోరాడుదాం.. రాబోయేది మన ప్రభుత్వమే⇒ ఈ రోజు చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది. మంగళగిరికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. అలాగే సుధారాణిని నెలల తరబడి శ్రీకాకుళం నుంచి అన్ని స్టేషన్లు తిప్పారు. బెయిల్ రాకుండా చూశారు. మాజీ ఎమ్మెల్యే వంశీపై 11 కేసులు పెట్టారు. ఒకదాంట్లో బెయిల్ వస్తే.. మరో కేసు.. రెండు నెలలుగా జైల్లోనే ఉంచారు. ఒక దాని తర్వాత మరో కేసు పెడుతున్నారు.⇒ ఇంకొకరు మాజీ ఎంపీ నందిగం సురేష్. దళితుడు. నెలల తరబడి జైల్లో పెట్టారు. బెయిల్ మీద బయటకు వస్తే, మరో కేసులో ఇరికించి, జైలుకు పంపారు. వాళ్ల ఇంటి దగ్గరకొచ్చి ఒక మనిషి తిట్టాడు. ఎందుకు తిడుతున్నావని ప్రశ్నిస్తే, మరో కేసు పెట్టి, జైలుకు పంపారు.⇒ ఈ రోజు ఒక తప్పుడు సంప్రదాయం మొదలు పెట్టారు. అది ఒక వృక్షమై, రెండింతలు పెరిగి, వాళ్లనే తన్నే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో గట్టిగా పోరాడుదాం. చూస్తుండగానే ఏడాది గడిచింది. ఇంకా చూస్తుండగానే మూడేళ్లు గడుస్తాయి. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. చీకటి తర్వాత వెలుగు తప్పదు. మనం తప్పకుండా గెలుస్తాం. అందుకే రాబోయే రోజుల్లో ఉధృతంగా పోరాడాలి. ఈలోగా గ్రామ స్థాయి నుంచి బూత్ కమిటీలు, మండల, జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఉద్యమబాట పట్టి, ప్రభుత్వ తప్పులను ప్రజల్లో ఎండగట్టాలి. అందుకే ఈ సమావేశాల నిర్వహణ. ఈ ప్రక్రియలో పార్టీ నాయకులు, కార్యకర్తలది చాలా గొప్ప పాత్ర.వైఎస్సార్సీపీకి కార్యకర్తే నంబర్ వన్ ⇒ ప్రతి కార్యకర్తకు చెబుతున్నా. మీకు ఎవరు అన్యాయం చేసినా, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా, వారి పేరు రాసుకోండి. అది ఏ బుక్ అయినా సరే. వారి పేరు మాత్రం కచ్చితంగా రాసి పెట్టుకోండి. ఆ తర్వాత మనం వచ్చాక, ఈరోజు మీకు అన్యాయం చేసిన వారికి సినిమా చూపిస్తాం. ఆ మనిషి రిటైర్ అయినా, దేశం వదిలి పోయినా లాక్కొస్తాం. ఎవ్వరినీ వదిలి పెట్టం. సినిమా ఎలా చూపాలో వారికి చూపిస్తాం. మిమ్మల్ని ఎవరైనా కొట్టినా కొట్టించుకోండి. ఫరవాలేదు. నీ టైమ్ బాగుంది.. కొట్టు అనండి. ఆ తర్వాత మన టైమ్ వస్తుంది. అప్పుడు మనం కొడతాం. ఇవాళ వారు నాటుతున్న విత్తనం రేపు రెండింతలు అవుతుంది.⇒ ఈరోజు నేను మీ అన్నగా, మీ బిడ్డగా ఒకటే చెబుతున్నా. జగన్ 2.0లో పరిస్థితి ఇలా ఉండదు. పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ రోజు కార్యకర్తల కష్టాలు చూశాను. స్వయంగా చెబుతున్నాను. గతంలో మన ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్. దాంతో మనం యుద్ధం చేశాం. అందువల్ల అనుకున్న మేరకు కార్యకర్తలకు చేయలేకపోయాను. ఇప్పుడు చెబుతున్నాను. రేపు ఈ పరిస్థితి ఉండదు. వైఎస్సార్సీపీకి కార్యకర్తనే నంబర్ వన్. -
బియ్యం బండి ఆగింది.. మీ రేషన్ మీరే తెచ్చుకోండి
సాక్షి, అమరావతి: పనులు మానుకుని రోజంతా రేషన్ డిపోల దగ్గర పడిగాపులు.. బియ్యం కోసం క్యూ లైన్లో కుస్తీలు.. ఎండైనా, వానైనా అరుగులపై కూలబడి అవస్థలు.. తీరా సర్వర్లు మొరాయించడంతో ఉసూరుమంటూ ఇంటి ముఖం పట్టిన దుర్భర దృశ్యాలు రాష్ట్రంలో పునరావృతం కానున్నాయి! వీధివీధినా బెల్టు షాపుల ఏర్పాటుతో ఊరూరా మద్యపుటేరులు పారిస్తున్న టీడీపీ కూటమి సర్కారు ఇప్పటికే రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థను నీరుగార్చగా, తాజాగా పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించింది. ప్రజల అవస్థలను తొలగిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక వ్యవస్థ ‘ఇంటి వద్దకే రేషన్’ను చంద్రబాబు సర్కార్ కక్షపూరితంగా రద్దు చేసింది. ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కుతూ రాజకీయ దురుద్దేశాలతో ఏకపక్షంగా ‘ఎండీయూ’ వ్యవస్థను తొలగించింది. కేవలం మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారనే దుగ్ధతో, వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలను జీర్ణించుకోలేక కోట్లాది మంది పేదలకు సేవలందిస్తున్న ఎండీయూలపై విషం చిమ్ముతూ ఆ వ్యవస్థకే మంగళం పాడేసింది. ఇకపై మీ రేషన్.. మీరే తెచ్చుకోండి..! అంటూ ప్రజలను నిలువునా మోసం చేసింది. బాబు ఆగమనం.. రాష్ట్రం తిరోగమనం! టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ సచివాలయాల వ్యవస్థను నిర్వీర్యం చేసి, వలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తూ తిరోగమన పాలనకు శ్రీకారం చుట్టింది. ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సమయంలో.. దేశం మెచ్చిన ఎండీయూ వ్యవస్థకు తిలోదకాలు ఇచ్చేసింది. సంపద సృష్టి, ఉద్యోగాల కల్పన అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలతో అరచేతిలో వైకుంఠం చూపించే సీఎం చంద్రబాబు అండ్ కో ఉన్న ఉద్యోగాలే ఊడగొడుతోంది. మొన్న... 2.66 లక్షల వలంటీర్ల కుటుంబాలు.. నేడు 9,260 మంది ఎండీయూ ఆపరేటర్ల కుటుంబాలు, వారిపై ఆధారపడి ఉపాధి పొందుతున్న మరో పది వేల మంది హెల్పర్ల కుటుంబాలను నడిరోడ్డు పైకి లాగేశారు. రాష్ట్రంలో 29,500 రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవడానికి నానా ప్రయాసలు పడిన ప్రజలకు సాంత్వన చేకూరుస్తూ గత ప్రభుత్వం తెచ్చిన ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ విధానాన్ని చంద్రబాబు భారీ ఆర్థిక భారంగా చిత్రీకరించారు. పేదల ఇంటికి ప్రభుత్వ సేవలు చేరుతుంటే దాన్ని అనవసర భారంగా ముద్రవేశారు. మళ్లీ కూలి మానుకునే దుస్థితి.. గత ప్రభుత్వంలో ఎండీయూ వాహనం ఇంటికి వచ్చే ముందు వలంటీర్ ద్వారా నిర్ణీత సమయం, తేదీతో సహా లబ్ధిదారులకు సందేశం వెళ్లేది. ఇంటి యజమానే కాకుండా కార్డుదారుల్లో ఏ వ్యక్తి ఉన్నా బియ్యం ఇచ్చేవారు. రేషన్ బియ్యం కోసం ఏ ఒక్కరూ పనులు మానుకుని ఎదురు చూడాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు రేషన్ కోసం కూలి పనులు మానుకుని ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించాల్సిన దుస్థితి దాపురించింది. రాష్ట్రంలో 1.45 కోట్ల మంది కార్డుదారులు ఉండగా వీరిలో అత్యధికం రోజువారీ పనులు చేసుకుని జీవించేవారే. వీరంతా రూ.300 – రూ.500 రోజు కూలీని నమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. వీరిలో సగటున కోటి మంది రేషన్ తీసుకోవడానికి డిపోకు వెళితే ఆ రోజు పనికి దూరం కాక తప్పదు. అంటే ఒక నెలలో ప్రభుత్వం ఇచ్చే రేషన్ తీసుకోవడానికి పేదలు రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్లు నష్టపోవాల్సిన పరిస్థితి. ఇక ఏడాదికి రూ.3,600 కోట్ల నుంచి రూ.6 వేల కోట్లు నష్టపోనున్నారు. పోనీ వెళ్లిన రోజే రేషన్ వస్తుందా అంటే అదీ లేదు. చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో అనుభవాలే దీనికి నిదర్శనం. నెలకు కేవలం రూ.25 కోట్లతో సమర్థంగా నిర్వహించే ఎండీయూ వ్యవస్థను ఆర్థిక భారంగా పరిగణిస్తూ కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోంది. ఒకవైపు 60 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ ఇస్తుంటే.. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే రేషన్ సరుకులు ఇంటికి పంపిస్తామంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు ఎవరి సహాయంతో రేషన్ డోర్ డెలివరీ చేస్తారో చెప్పకపోవడం కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. ఎండీయూలపై నేర ముద్ర.. గతంలో చౌక దుకాణాలపై కేసుల్లేవా! ఓ విప్లవాత్మక వ్యవస్థను నిర్వీర్యం చేయాలంటే నిందారోపణలు చేయాలి. ఇదే చంద్రబాబు సర్కార్ స్ట్రాటజీ! అందులో భాగంగానే ఎన్నికల ముందు నుంచే రేషన్ అక్రమ రవాణాకు కేరాఫ్ అంటూఎండీయూ వ్యవస్థపై గోబెల్స్ ప్రచారం సాగించారు. రేషన్ అక్రమ రవాణా మొత్తం ఎండీయూల చేతుల్లోనే జరుగుతోందంటూ హీనాతిహీనంగా మాట్లాడారు. వాస్తవానికి ఎండీయూ ఆపరేటర్లు అంతా బడుగు, బలహీన వర్గాలకు చెందిన యువతే. వీరంతా సొంతూరిలో సగౌరవంగా తలెత్తుకుని జీవించేలా, సొంత కాళ్లపై నిలబడేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 90 శాతం రాయితీతో వాహనాలను అందించి ఉపాధి కల్పించింది. తద్వారా సామాజిక న్యాయం, సాధికారతకు బాటలు వేసింది. ఎండీయూలకు ఆర్థిక ఊరట కల్పించేందుకు వాహన మిత్ర పథకంలో భాగంగా ఏడాదికి రూ.10 వేలు చొప్పున అందించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఎండీయూలపై అక్రమ రవాణాదారులుగా నిందలు మోపింది. 9,260 ఎండీయూ వాహనాల్లో ఇప్పటి వరకు 288 ఆపరేటర్లపై బియ్యం అక్రమ రవాణా కేసులు పెట్టామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం మీడియా ముఖంగా చెప్పారు. అంటే దాదాపు 9 వేల వాహనాలు సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నట్టే కదా? పోనీ గతంలో చౌక ధరల దుకాణదారులపై రేషన్ బియ్యం అక్రమ నిల్వ, అక్రమ రవాణా కేసులు లేవా అంటే కోకొల్లలుగా ఉన్నాయి. వ్యవస్థల్లో లోపాలు ఎక్కడైనా సహజంగా ఉంటాయి. వాటిని సరి చేసుకుంటూ పాలన సాగించాల్సిన ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ప్రజా ప్రయోజనకారిగా ఉన్న వ్యవస్థలను శాశ్వతంగా తొలగించడం అవివేకం కాక మరేమిటన్నది ప్రశ్న? ఇక రేషన్ డీలర్ అందుబాటులో లేకపోతే ఆ నెలలో సరుకులు కచ్చితంగా ఆలస్యం అవుతాయి. కానీ ఎక్కడైనా ఎండీయూ ఆపరేటర్ సెలవులో ఉన్నా, అనివార్య కారణాలతో రాకున్నా వీఆర్వో ద్వారా లబ్ధిదారులు ఇంటి వద్దే సరుకులు పొందేలా గత ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఎండీయూ వాహన ఆపరేటర్ల పోస్టు ఖాళీగా ఉంటే వెంటనే భర్తీ చేయడంతో పాటు లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక ప్రాతిపదికపైన నియమించి నిత్యావసరాలను సరఫరా చేసింది. గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఎండీయూ వాహనాలు వెళ్లడం కష్టంతో కూడుకున్నది. ఈ పరిస్థితుల్లో అదనపు ఖర్చు చేసి ఇతర వాహనాల్లో లబ్ధిదారుల ఇళ్లకు రేషన్ చేరవేసింది. ఆసక్తి చూపిన ఎనిమిది రాష్ట్రాలు.. రేషన్ పంపిణీలో వైఎస్ జగన్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. 2021లో రూ.530 కోట్లకు పైగా వ్యయంతో ‘ఇంటి వద్దకే రేషన్’ వ్యవస్థను తీసుకొచ్చింది. నాణ్యమైన సార్టెక్స్ బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటి ముంగిటికే వాహనాల ద్వారా (ఎండీయూ) డోర్ డెలివరీ చేయడంతో పాటు ఐసీడీఎస్(అంగన్వాడీలు), మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలలకు, సంక్షేమ హాస్టళ్లకు కూడా ఫోరి్టఫైడ్ బియ్యాన్ని నేరుగా సరఫరా చేసింది. దీంతో అంగన్వాడీలు, పాఠశాలలకు వ్యయ ప్రయాసలు తొలగిపోయాయి. గోదావరి వరదలు, విజయవాడ వరదలు లాంటి విపత్తుల సమయంలోనూ ఎండీయూలే సమర్థంగా సేవలందించాయి. ఇలా ఓ వ్యవస్థను వివిధ ప్రభుత్వ సేవలకు వినియోగించుకునే వెసులుబాటు ఉన్నప్పుడు దాన్ని విస్మరించి ఏకపక్షంగా రద్దు చేయడం సిగ్గుచేటు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎండీయూ వ్యవస్థ వచ్చిన తర్వాత రేషన్ వినియోగం పారదర్శకంగా 90 శాతానికిపైగా పెరిగింది. దేశంలో 8 రాష్ట్రాలకు పైగా రేషన్ డోర్ డెలివరీపై ఆసక్తి కనబరిచాయి.అధికారంలోకి రాగానే అడ్డుకున్న కూటమి ఎమ్మెల్యేలు.. రాష్ట్రంలో 1.45 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు ఎండీయూ వ్యవస్థ ద్వారా సమర్థంగా నాణ్యమైన బియ్యం పంపిణీ జరుగుతోంది. ఒక్కో ఎండీయూ వాహనం రోజుకు 90 కార్డులకు తగ్గకుండా నెలలో 17 రోజుల పాటు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ను చేరవేస్తోంది. కల్తీకి ఆస్కారం లేకుండా, కచ్చితమైన తూకంతో ప్రజల సమక్షంలో బియ్యాన్ని ఇంటి ముంగిట్లో అందజేస్తోంది. వివిధ కారణాలతో ఇంటి దగ్గర ఎవరైనా రేషన్ తీసుకోకుంటే సాయంత్రం పూట గ్రామ, వార్డు సచివాలయం వద్ద ఇచ్చేలా వెసులుబాటు ఉంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యల్లో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్కరికీ సార్టెక్స్ బియ్యాన్ని సరఫరా చేసింది. ఈ క్రమంలో ఎక్కడా రేషన్ డీలర్ల ఉపాధికి ఎటువంటి ఆటంకం ఏర్పడలేదు. కేవలం ప్రజల దగ్గరకే ప్రభుత్వ సేవలు చేరువయ్యాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆర్థిక భారం పేరుతో ఇంటి వద్దకే రేషన్ పంపిణీని నిలిపివేసింది. అధికారంలోకి రాగానే కూటమి పార్టీల ఎమ్మెల్యేలు 2 వేలకుపైగా ఎండీయూ వాహనాలను బలవంతంగా నిలిపివేశారు. ఆయా ప్రాంతాల్లో చౌక ధరల దుకాణాల్లోకి వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవాలని హుకుం జారీ చేశారు. పేదల ఇంటికి రేషన్ వద్దు... మద్యం ముద్దుపేదల ఇంటికి రేషన్ వద్దు గానీ మద్యం మాత్రం ముద్దు అనే రీతిలో టీడీపీ కూటమి సర్కారు చర్యలున్నాయి. బెల్ట్ షాపులతో ప్రతీ గ్రామంలో మద్యం డోర్ డెలివరీ చేస్తూ ఇంటివద్దకే రేషన్ను మాత్రం అదనపు వ్యయంగా చిత్రీకరిస్తోంది.2027 వరకు ఒప్పందం గడువు ఎండీయూ వ్యవస్థను రద్దు చేసి ఆ వాహనాలను ఆపరేటర్లకు ఉచితంగా ఇస్తామంటూ మంత్రి నాదెండ్ల ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం ఎండీయూ అసోసియేషన్లు, చౌక ధరల దుకాణదారుల అసోసియేషన్ల సమావేశంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అయితే దీనిపై విధివిధానాలు ఇప్పటి వరకు ఖరారు చేయలేదు. 2027 వరకు ఒప్పందం గడువు ఉన్నందున మధ్యలో ఎలా వెళ్లగొడతారని ఎండీయూ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. అర్ధంతరంగా ఎండీయూలను నిలిపివేస్తే తాము ఉపాధి కోల్పోవడంతోపాటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని విన్నవించినా ప్రభుత్వం ఆలకించలేదు. తమకు బ్యాంకుల నుంచి ఇబ్బందులు లేకుండా ఎన్వోసీ ఇచ్చిన తర్వాతే రద్దుపై నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు ఎండీయూలను కొనసాగించాల్సిందేనని తేల్చిచెప్పారు. రోడ్డుపై వదిలేస్తాం అంటే ఊరుకోముఎండీయూ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడే మాకు 72 నెలలకు అగ్రిమెంట్ చేశారు. 2027 జనవరి వరకు సమయం ఉంది. ఇంకా సుమారు 20 నెలలు కొనసాగే హక్కు మాకు ఉంది. ఇన్నేళ్లుగా మా సేవలను వినియోగించుకుని ఇప్పుడేదో ఉచితంగా వాహనం ఇచ్చేస్తున్నట్లు మాట్లాడటం సరికాదు. మాకేమైనా దానధర్మం చేస్తున్నారా? మేం పని చేయలేదా? ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని రోడ్డుపై వదిలేస్తామంటే చూస్తూ ఊరుకోం. బుధవారం నుంచి మా కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రభుత్వం మాకు ఏం ఉపాధి చూపిస్తారో చెప్పాలి. స్పందించకుంటే న్యాయ స్థానాన్ని ఆశ్రయించడానికి కూడా వెనుకాడబోం. మాకు న్యాయం చేయకుండా డీలర్ల ద్వారా రేషన్ పంపిణీ ఎలా చేస్తారో చూస్తాం. ముందుగా మాకు బ్యాంకుల నుంచి ఎన్వోసీ ఇప్పించి జీవనోపాధి చూపించాలి. – రౌతు సూర్యనారాయణ, ఎండీయూ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడుఇబ్బంది లేకుండా సరుకులు తీసుకున్నాంఇంటి ముందుకే రేషన్ వాహనం రావడం వల్ల ఇబ్బంది లేకుండా సరుకులు తీసుకున్నాం. ఐదేళ్లు ప్రశాంతంగా ఇంటి ముందుకే వచ్చాయి. ఇప్పుడు వాహనాలు రావంటే మాలాంటోళ్లం ఏం చేయాలో అర్థం కావడం లేదు. మా ఇంటి నుంచి రేషన్ షాపు అర కిలోమీటరు దూరంలో ఉంది. అంత దూరం నడిచి వెళ్లి క్యూలో నిలబడాలి. డీలర్ ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాలి. వేలిముద్రలు పడకపోతే గంటల తరబడి నిలబడాలి. మమ్మల్ని ఇన్ని కష్టాలు పెడితే ఈ ప్రభుత్వానికి ఏం వస్తుంది? – దారుకుమల్లి వెంకటసుబ్బమ్మ, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా గిరిజనులకు ఎంతోమేలు జరిగింది గతంలో గిరిజనులంతా నిత్యావసరాలు పొందేందుకు అవస్థలు పడ్డారు. గత ప్రభుత్వం ఎండీయూ వాహనాలతో ఇంటింటికి బియ్యం, ఇతర నిత్యావసరాల పంపిణీని ప్రారంభించి గిరిజనులకు ఎంతో మేలు చేసింది. కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేస్తే 3 కి.మీ. దూరంలో ఉన్న మినుములూరు డీఆర్ డిపో నుంచి సరుకులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. –పాలికి లక్కు, గిరిజనుడు, గుర్రగరువు గ్రామం, మినుములూరు, అల్లూరి సీతారామరాజు జిల్లా మాగ్రామంలో రేషన్ షాపు లేదు మా గ్రామంలో రేషన్ షాపు లేదు. మూడు కి.మీ. దూరంలో ఉన్న బురాందొడ్డికి వెళ్లి బియ్యం, ఇతర రేషన్ సరుకులు తెచ్చుకునేవాళ్లం. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మాకు రేషన్ కష్టాలు తొలిగాయి. ఇంటి దగ్గరకే రేషన్ బండి వచ్చింది. ఇప్పుడు వాటిని తీసి వేస్తే మళ్లీ బియ్యం సంచి నెత్తిన మోయాల్సిందే. చంద్రబాబు పుణ్యమా అని పాత కష్టాలు పునరావృతమవుతున్నాయి. – రహేలమ్మ, బ్యాతోలి గ్రామం, సీబెళగల్ మండలం, కర్నూలు జిల్లా -
రేషన్ షాపుల్లో సీసీ కెమెరాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటికే రేషన్ సరుకుల డోర్ డెలివరీ విధానాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. జూన్ 1వతేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారానే సరుకులు పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. అనంతరం ఈ వివరాలను మంత్రులు నాదెండ్ల మనోహర్, కె.పార్థ్దసార«థి మీడియాకు వెల్లడించారు. 9,260 మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీ నిలుపుదల చేస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.రేషన్ దుకాణాల్లో సీసీ కెమేరాలు అమర్చి పీడీఎస్ పంపిణీ పర్యవేక్షణకు ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో రేషన్ బియ్యం పక్కదారి పట్టడం ఆగిపోతుందన్నారు. జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల ద్వారానే సరుకులు పంపిణీ చేస్తామని చెప్పారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి రేషన్ దుకాణాల ద్వారా కిరాణాæ సరుకులు విక్రయించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ సరఫరాకు గత ప్రభుత్వం రూ.1,860 కోట్లు వ్యయం చేసిందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా పది శాతం డబ్బులు చెల్లించిన వాహనాల లబ్ధిదారులకు ఆయా కార్పొరేషన్ల ద్వారా వాటిని ఉచితంగా బదిలీ చేసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. వాహనాలకు సంబంధించి ఇంకా రూ.188 కోట్లు బ్యాంకులకు చెల్లించాల్సి ఉందని, దీనిపై బ్యాంకర్లతో చర్చించి వన్టైమ్ సెటిల్మెంట్ చేస్తామన్నారు. దీపం పథకం కింద మూడు సిలిండర్ల సబ్సిడీ డబ్బులను ముందుగానే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. మంత్రివర్గం తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు..» ఈ నెల 15న సీఎం అధ్యక్షతన ఎస్ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం. » భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి మరో 500 ఎకరాల భూమి కేటాయించేందుకు ఆమోదం. » వైఎస్సార్ కడప జిల్లా కె.బొమ్మపల్లిలో 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఎకరం రూ.5 లక్షల చొప్పున 41.99 ఎకరాల ప్రభుత్వ భూమి అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్కు బదిలీ చేసేందుకు ఆమోదం. శ్రీసత్యసాయి జిల్లా పెద్దకొల్ల గ్రామంలో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఎకరం రూ.5 లక్షలు చొప్పున 12.87 ఎకరాలు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్కు బదిలీకి ఆమోదం. » నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పైనాపురంలో పారిశ్రామిక పార్కు స్థాపనకు 615.98 ఎకరాల భూమి ఏపీఐఐసీకి ఉచితంగా కేటాయించేందుకు ఆమోదం.» పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఘర్షణల్లో మృతి చెందిన తోట చంద్రయ్య కుమారుడు తోట వీరాంజనేయులుకు శాశ్వత ఉద్యోగం కల్పించేందుకు చట్ట నిబంధనలు సవరించేందుకు ఆమోదం. » చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్ నుంచి పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం మండలాలు... చిత్తూరు రెవెన్యూ డివిజన్ నుంచి రొంపిచర్ల మండలాన్ని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి రెవెన్యూ డివిజన్కు బదిలీ చేసేందుకు ఆమోదం.» గనుల శాఖలో వివిధ బాండ్లకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం. » హైకోర్టులో 245 పోస్టుల కల్పనకు న్యాయ శాఖ ప్రతిపాదనకు ఆమోదం. » అమరావతిలో ‘ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్’ సంస్థ ఏర్పాటుకు ఆమోదం. » ఏలూరు సమీపంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోదం.» సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా 1,136 ఎస్జీటీ, 1,124 పాఠశాల సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్న అదనపు పోస్టులుగా మార్చుతూ జారీ చేసిన జీవోకు ఆమోదం. -
కొత్త సాంప్రదాయం.. టీడీపీ కార్యకర్తకు ఉద్యోగం
విజయవాడ: రాష్ట్రంలో సంక్షేమ పథకాలను తమ పార్టీకి చెందిన వారికే వర్తింపు చేయాలని, ఇది ఏ స్థాయి అధికారి అయినా గుర్తుపెట్టుకుని వ్యవహరించాలని గతంలో బహిరంగంగా ప్రకటించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ఉద్యోగాలు కూడా టీడీపీ కార్యకర్తలకే ఇస్తామనే విషయాన్ని తాజాగా బహిర్గతం చేశారు. ఓ టీడీపీ కార్యకర్తకు ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కేబినెట్ సాక్షిగా నిలవడం గమనార్హం. ఈరోజు(మంగళవారం) సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.అయితే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ తరహా నిర్ణయం తీసుకోవడం చెడు సాంప్రదాయానికే తెరలేపినట్లే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత కక్షలతో చంద్రయ్య అనే టీడీపీ కార్యకర్త హత్యగావించబడితే, ఆయన కుమారుడికి ఇప్పుడు శాశ్వత ఉద్యోగం కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం విడ్డూరంగా ఉందని అంటున్నారు పలువురు విశ్లేషకులు.2022లో వెల్దుర్ది మండలం గుండ్లపాడుకు చెందిన చంద్రయ్య హత్యగావించబడ్డాడు. అయితే రెండు కుటుంబాల నడుమ చోటు చేసుకున్న విభేదాల కారణంగా చంద్రయ్యను హత్య చేసింది మరో కుటుంబం. ఈ హత్యకు రెండు కుటుంబాల మధ్య కక్ష అని అప్పట్లోనే పోలీసులు సైతం ప్రకటించారు. ఇక్కడ చంద్రయ్య కుటుంబం కూడా ఒక కుటుంబంపైనే ఫిర్యాదు చేసింది కూడా. అంటే ఇదంతా వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగిందనే విషయం స్పష్టంగా తెలుస్తుంటే, మరి చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఇచ్చారనేది చర్చనీయాంశంగా మారింది. ఇదీ చదవండి: AP: మళ్లీ ప్రజలకు రేషన్ కష్టాలే.. డోర్ డెలివరీకి మంగళం -
AP: మళ్లీ ప్రజలకు రేషన్ కష్టాలే.. డోర్ డెలివరీకి మంగళం
విజయవాడ: చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రేషన్ డోర్ డెలివరీకి మంగళం పాడింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రేషన్ను డోర్ డెలివరీని నిలిపివేస్తూ చంద్రబాబు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈరోజు(మంగళవారం) సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకోగా, అందులో రేషన్ డోర్ డెలివరీని నిలిపివేయడం ఒకటి. ఫలితంగా ఎండీయూ ఆనరేటర్లను రోడ్డున పడేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. దాంతో 9260 రేషన్ డెలివరీ వాహనాలు నిలిచిపోనున్నాయి. మళ్లీ పాత పద్ధతిలోనే రేషన్ షాపుల నుండి సరఫరా చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. మళ్లీ ప్రజలకు రేషన్ కష్టాలే..రేషన్ డోర్ డెలివరీని నిలిపివేసే అంశాన్ని ఎండీయూ ఆపరేటర్లు గతంలో వ్యతిరేకించినా దాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో ఎండీయూ ఆపరేటర్లపై జాలి లేకుండా వ్యవహరించడమే కాకుండా మళ్లీ ప్రజలు పాత పద్ధతిలో షాపుల వద్ద క్యూ లో ఉండి తీసుకునే విధానానికే ప్రభుత్వం మళ్లీ మొగ్గుచూపింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయంతో రేషన్ను ఇప్పటివరకూ డోర్ డెలివరీ ద్వారా ప్రజలు ఇంటి వద్దనే పొందుతుండగా మళ్లీ వెనకటి రోజుల గుర్తు చేయడానికి సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు నాయుడు. దాంతో ప్రజలకు మళ్లీ రేషన్ కష్టాలు తప్పదనే సంకేతాన్ని, సందేశాన్ని కేబినెట్ సాక్షిగా ఇచ్చేశారు చంద్రబాబు. ఇప్పటికే 2.50 లక్షల వాలంటీర్లను తీసేసిన ప్రభుత్వం.. తాజాగా ఎండీయూ ఆపరేటర్లు, రేషన్ వాహనాలు అవసరం లేదనే నిర్ణయానికి వచ్చేసింది. -
ఏపీ ఐసెట్-2025 ఫలితాలు విడుదల.. ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి!
సాక్షి,విశాఖ: ఏపీలో ఎంబీఏ,ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్- 2025 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ విడుదల చేశారు. ఏపీ ఐసెట్ పరీక్షా ఫలితాల్లో 95.86శాతం విద్యార్థులు అర్హత సాధించారు. ఈ ఫలితాల్లో విశాఖకు చెందిన మేక మనోజ్ మొదటి ర్యాంక్ సాధించగా.. వైఎస్సార్ జిల్లాకు చెందిన సందీప్రెడ్డి రెండో ర్యాంక్ను సాధించారు. 👉 ఏపీ ఐసెట్-2025 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
‘కేశినేని చిన్నియే టీడీపీ గూండాలను మాపైకి పంపారు’
ఎన్టీఆర్ జిల్లా: ప్రశాంతమైన తిరువూరులో టీడీపీ గూండాలు విధ్వంసం సృష్టించారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ విమర్శించారు. ‘టీడీపీ గూండాలు మాపై దాడి చేశారు కేశినేని చిన్నియే టీడీపీ గూండాలను మాపైకి పంపారు. మా కారును ధ్వంసం చేశారు.. మమ్మల్ని హతమార్చాలని చూశారు, టీడీపీ గూండాల దాడికి పోలీసులు సహకరించారు. మాపై దాడి చేసిన వారిని ఎవరినీ వదిలి పెట్టం. పోలీసులే రాజకీయం చేస్తున్నారు.కౌన్సిలర్లకు వారి ఇంటి నుంచి భద్రత ఇస్తామని వితండవాదం చేశారు. మా కౌన్సిలర్లకు మేమే రక్షణగా నిలిచాం. టిడిపి ఎంపీ కేశినేని చిన్ని మందు పోయించి టిడిపి గూండాలను మా పైకి రెచ్చగొట్టారు. మా కారును పైకి లేపి పల్టీలు కొట్టించి...ధ్వంసం చేయాలని చూశారు. మా కారు ధ్వంసం చేసే వరకూ పోలీసులు చూస్తూ ఊరుకున్నారు’ అని ధ్వజమెత్తారు.కోర్టు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదునేను 35 ఏళ్లుగా తిరువూరు రాజకీయాలు చూస్తున్నా. తిరువూరు టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఒక గూండా మాదిరి వ్యవహరించారు. ఇలాంటి ఎమ్మెల్యేని తిరువూరు ప్రజలు ఎన్నడూ చూడలేదు. కూటమి నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. టిడిపి నేతలను చట్టపరంగా శిక్షిస్తాం. మాకు రక్షణ కల్పించమని కోర్టు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ మహిళా కౌన్సిలర్లను బలవంతంగా లాక్కెళ్లిపోయారు. అసలు ఈ రాష్ట్రం ఎటుపోతుంది. రాజ్యాంగబద్ధంగా కూటమి ప్రభుత్వం నడుచుకోవడం లేదు. రాబోయేది జగన్ మోహన్ రెడ్డి 2.0 పాలనే. తప్పుచేసిన ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటాం. మాపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన వారి పై కేసు పెట్టి చట్టం ముందు నిలబెడతాం’ అని తిరువూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి,నల్లగట్ల స్వామిదాస్ హెచ్చరించారు.టీడీపీ గూండాలు భయోత్పాతం స్పష్టించారురెండు గంటల పాటు టిడిపి గూండాలు భయోత్పాతం సృష్టించారు. తిరువూరు వెళ్లడానికి మాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు. పోలీసులే దగ్గరుండి టిడిపి గూండాలతో మాపై దాడి చేయించారు, మేం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాం. నా కారును ధ్వంసం చేస్తున్నా.. పోలీసులు చోద్యం చూశారు. కౌన్సిలర్లకు భద్రత కల్పించమని ఎన్నికల కమిషనర్ , హైకోర్టు ఆదేశాలున్నా పోలీసులు పెడచెవిన పెట్టారు. ఒక్కో కౌన్సిలర్ కు ఒక్కొక్క గన్ మెన్ ఇవ్వాలని ఆదేశాలున్నాయ్. పోలీసులు రక్షణ ఇవ్వకపోతే మేమే రక్షణ కవచంలా నిలిచాం. మా కారును ధ్వంసం చేసి మా పై హత్యాయత్నం చేశారుతిరువూరు టిడిపి ఎమ్మెల్యే వీధి రౌడీలా ప్రవర్తించాడు. మా కారును అడ్డగించి మా పై దాడి చేసారు. నన్ను , స్వామిదాస్ ను కులం పేరుతో దూషించి చంపేస్తామని బెదిరించారు’ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. -
మినీ మహానాడులో టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
అనంతపురం: టీడీపీ అర్బన నియోజకవర్గం మినీ మహానాడును విజయవంతం చేద్దామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పిలుపునివ్వగా, అది కాస్తా రసాభాసగా మారింది. ఈరోజు(మంగళవారం) కమ్మ భవన్ లో ఉదయం పది గంటల ప్రాంతంలో నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో ఓ కార్యకర్త పురుగుల మందు తాగాడు. టీడీపీకి వైఖరితో మనస్తాపం చెందిన వెంకటేష్ అనే కార్యకర్త వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. టీడీపీలో తనకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేసిన వెంకటేష్.. ఆపై పురుగుల మందు తాగేశాడు. దాంతో ఆ కార్యకర్తను ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
చురుగ్గా నైరుతి రుతుపవనాలు.. ముందుగానే తొలకరి!
విశాఖ: దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షాలు ముందుగానే పలకరించనున్నాయి. ఐదు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) స్పష్టం చేసింది. దక్షిణ, మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో విస్తరించిన రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు ఐఎండీ తెలిపింది. మే 25వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో వచ్చే వారం రోజులు వర్షాలు ఉధృతి కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, వైఎస్సార్, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వచ్చే 24 గంటట్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. నిన్న(సోమవారం) రేపల్లెలో 9 సెం.మీ వర్షపాతం నమోదైంది. -
మీడియాకు పీపుల్స్ స్టార్ పాఠాలు
పీపుల్ స్టార్ నారాయణమూర్తి ఏ అంశాన్ని అయినా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఆయనకు ముఖస్తుతి.. డబ్బా కొట్టడం.. చెంచాగిరి అసలు తెలియదు.. చిన్నపిల్లలు పెద్దవాళ్లు సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు.. డబ్బున్న వాళ్ళు పేదలు అనే తేడా లేకుండా అందరితోనూ కలిసిమెలిసి ఉంటూనే తన మనసులో ఉన్న భావాలను స్పష్టంగా వెల్లడించగలిగే ధైర్యం కలిగిన ఒకే ఒక్క సినీ నటుడు నారాయణమూర్తి.ఆయన ఎవరిని అయినా మంచి చేసుకోవడం కోసమో మచ్చిక చేసుకోవడం కోసమో మాట్లాడరు. కెరీర్ కోసము.. సినీ అవకాశాల కోసం భజన చేయడం అసలు ఉండదు.. అలాంటి నారాయణమూర్తి ఓ సభలో మీడియా తీరతెన్నులను తూర్పారబట్టారు. సమాజంలో మీడియా బాధ్యతను.. సమాజ మనుగడలో మీడియా పాత్రను దాన్ని ఔన్నత్యాన్ని ప్రశంసిస్తూనే ప్రస్తుతం కొన్ని మీడియా సంస్థలు పోతున్న పోకడలను ఈ పీపుల్స్ స్టార్ పెద్దల సమక్షంలోనే ఎండగట్టారు.కొన్ని పత్రికలు, కొంతమంది కోసం.. కొన్ని మీడియా సంస్థలు కొన్ని రాజకీయ పార్టీల కోసం పనిచేస్తూ తన బాధ్యతను విస్మరిస్తున్నాయని.. తమకు నచ్చిన నాయకుడు ఎలా వ్యవహరిస్తున్న ఎంత దుర్మార్గంగా పాలిస్తున్నా ఆయన కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని, ఈ వైఖరి అంతిమంగా సమాజానికి ఎనలేని కీడు చేస్తోందని నారాయణమూర్తి దుయ్యబట్టారు.మీడియా సంస్థలు తమ బాధ్యతను విస్మరించి కొన్ని పార్టీలకు ఊడిగం చేస్తూ మనుగడ సాగిస్తున్నాయని ఇలాంటి సంస్థల వలన సమాజానికి ఏం లాభం అని ఆయన మాజీ చీఫ్ జస్టిస్ రమణ వంటి పెద్దల సమక్షంలోనే దులిపి ఆరేశారు. ఆయన వ్యాఖ్యలు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్న కొన్ని మీడియా సంస్థలను నేరుగా తాకాయని పాత్రికేయులు విశ్లేషకులు అంటున్నారు. నారాయణమూర్తి మాట్లాడింది నూటికి నూరు శాతం నిజం అని.. చంద్రబాబుని కొన్ని మీడియా సంస్థలు వెనకేసుకు వస్తూ ఆయన తప్పులను కాపాడుతూ సమాజానికి నష్టం చేస్తున్నాయని.. విషయాన్ని నారాయణమూర్తి నిర్భయంగా బయటపెట్టారని ఎప్పటికీ సోషల్ మీడియాలో పోస్టింగులు మొదలయ్యాయి.ఇంగ్లీష్ మీడియం చదవాలండిదీంతోపాటు నారాయణమూర్తి ఇంకేమన్నారంటే పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదవాలని ఇంగ్లీషులో ప్రావీణ్యం సంపాదించాలని అప్పుడే ఉన్నత స్థానాలకు చేరగలుగుతారని అన్నారు. వేదికపై ఉన్న మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణను చూపిస్తూ ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా తెలుగులోనే సాగిన ఆ తర్వాత ఆంగ్లంలో ప్రారంభించిన సంపాదించి న్యాయ స్థానాల్లో ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. ఈ అంశం కూడా గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియాని ప్రవేశపెట్టిన అంశాన్ని పాత్రికేయులు ప్రజలు గుర్తు చేసుకున్నారు.ఆనాడు వైఎస్ జగన్ చేసిన ప్రయత్నాన్ని చంద్రబాబు మరికొందరు నాయకులు అడ్డుకున్నారని.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాని వ్యతిరేకించారని తద్వారా పేద పిల్లలకు ఆంగ్ల అందకుండా చేశారని గుర్తు చేసుకుంటున్నారు. నేడు పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి కూడా ఆంగ్ల విద్య ప్రాధాన్యాన్ని ప్రశంసిస్తూ మాట్లాడడం ఆనాటి వైఎస్ జగన్ పాలనను గుర్తుచేస్తుంది అని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి నిక్కచ్చిగా మాట్లాడే నారాయణమూర్తి పలు అంశాల్లో అటు పక్షపాత మీడియాకు.. ఆంగ్ల మీడియం వద్దన్న నాయకులకు చురకల్లా తగిలాయని అంటున్నారు.-సిమ్మాదిరప్పన్న -
ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ: సుదర్శన్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం వెళ్తున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని ఎన్నికల కమిషన్తో పాటు న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఏ మాత్రం ఖాతరు చేయలేదని ఆ పార్టీ లీగల్ సెల్ సీనియర్ నాయకుడు జల్లా సుదర్శన్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కౌన్సిలర్లను ఎన్నిక జరిగే ప్రాంతానికి వెళ్లనివ్వకుండా మార్గమధ్యలోనే కూటమి పార్టీలకు చెందిన గుండాలు అడ్డుకుని దౌర్జన్యం చేశారని అన్నారు. దీనిని అడ్డుకోవాల్సిన పోలీసులు కూటమి నేతలకు అండగా నిలబడి, వైఎస్సార్సీపీ నేతలనే అరెస్ట్ చేయడం చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా ఖూనీ అవుతోందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే...తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం విజయవాడ నుంచి తరలివెళుతున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై మరోసారి కూటమి పార్టీలకు చెందిన గుండాలు దౌర్జన్యం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే ఈ దాడి జరిగింది. నిన్న కౌన్సిలర్లు ఎన్నికకు హాజరుకాకుండా కూటమి పార్టీలకు చెందిన వారు ఎటువంటి దౌర్జన్యాలకు పాల్పడ్డారో అందరూ చూశారు. దీనితో ఈ రోజుకు ఎన్నికను వాయిదా వేశారు. ఏ విధంగా అయినా సరే తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఈ రోజు కూడా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు హాజరుకాకుండా అడ్డుకోవడాలని, తమకున్న కొద్దిపాటి సభ్యుల నుంచే చైర్మన్ను ఎన్నుకోవాలని కూటమి పార్టీలు కుట్ర పన్నాయి.దీనిని అర్థం చేసుకున్న వైఎస్సార్సీపీ నిన్ననే ఎన్నికల కమిషనర్ను కలిసి వినతిపత్రం సమర్పించింది. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు స్వేచ్ఛగా ఎన్నికకు హాజరయ్యేందుకు రక్షణ కల్పించాలని కోరిన మీదట, ఎన్నికల కమిషన్ డీజీపీతో పాటు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ అధికారులకు అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలంటూ మెమో కూడా జారీ చేసింది. దీనిలో భాగంగానే వైయస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఎక్కడి నుంచి ఏ మార్గంలో తిరువూరు మున్సిపల్ కార్యాలయం వరకు వెడతారో పూర్తి వివరాలను సంబంధిత పోలీస్ అధికారులకు అందచేశాం.రక్షణ కల్పించాల్సిన పోలీసులే దౌర్జన్యానికి కొమ్ముకాశారునిన్న కూటమి పార్టీలు చేసిన దౌర్జన్యానికి భయపడి పలువురు కౌన్సిలర్లు విజయవాడ రామవరప్పాడులోని ఒక హోటల్లో తలదాచుకున్నారు. నిన్న టీడీపీ నేతలు కిడ్నాప్కు ప్రయత్నించడంతో మరో మహిళా కౌన్సిలర్ తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు ఇంట్లో ఆశ్రయం పొందారు. ఇటువంటి పరిస్థితుల్లో వారికి భద్రత ఇవ్వాలని ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. ఈ మొత్తం అంశంపై కోర్ట్లో హౌస్ మోషన్ కింద పిటీషన్ దాఖలు చేయడం జరిగింది. రాత్రి ఫైల్ చేసిన పిటీషన్ను ఈ రోజు పదిగంటలకు కోర్ట్ విచారణకు స్వీకరించింది. ఈ సందర్బంగా కోర్ట్ ఎదుట ప్రభుత్వం తరుఫు న్యాయవాది మాట్లాడుతూ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు పూర్తి రక్షణ కల్పించడం జరిగిందని చెప్పారు. అయితే ఏ అధికారి పర్యవేక్షణలో రక్షణ కల్పించారు. ఎక్కడి నుంచి ఎక్కడకు రక్షణ కల్పించారని, ఒక ఏసీపీ స్థాయి అధికారిని నియమించి, ఆయన ద్వారా కోర్టుకు నివేదిక సమర్పించాలని కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కోర్టులో ఈ అంశం విచారణలో ఉందని తెలిసి కూడా ఏ కొండూరు మండలం పడమట మాధవరం గ్రామం వద్ద కూటమి పార్టీలకు చెందిన వారు వైయస్ఆర్సీపీ కౌన్సిలర్లను అడ్డుకున్నారు. కూటమి నేతల దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులు అందుకు భిన్నంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, నాయకుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్లను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనతో భయాందోళనలకు గురైన వైయస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఎన్నిక జరిగే ప్రదేశంకు వెళ్ళకుండానే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెనుదిరిగారు.వీరు సమావేశంకు వెడితే కూటమి పార్టీలకు చెందిన అభ్యర్ధులు ఓడిపోతారు. అందుకే రెండోసారి కూడా ఎన్నిక జరగకుండా అధికారబలాన్ని ఉపయోగించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. చట్టంలోని లొసుగును అడ్డం పెట్టుకుని మూడోసారి కోరం లేకపోయినా ఎన్నిక జరపవచ్చని చూపుతూ వారికి ఉన్న తక్కువ మంది కౌన్సిలర్ల నుంచే చైర్మన్ను ఎన్నుకోవాలన్నదే వారి లక్ష్యం. ఇలాంటి చర్యలను చూస్తే ప్రజాస్వామ్యం అనేది ఈ రాష్ట్రంలో ఉందా అనే సందేహం కలుగుతోంది. న్యాయస్థానంలో కేసు విచారణలో ఉండగానే పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరించడం చూస్తూంటే ప్రజాస్వామ్యం రాష్ట్రంలో ఖూనీ అయ్యిందని అర్థమవుతోంది. ఈ జరిగిన మొత్తం వ్యవహారాన్ని కోర్టు దృష్టికి తీసుకుపోతున్నాం. దీనికి బాధ్యులైన అధికారులపై న్యాయస్థానం తగిన చర్యలు తీసుకుంటుంది. -
నా కొడుకును అమృతే కడతేర్చి ఉంటుంది.. తండ్రి ఫిర్యాదు
నాయుడుపేట టౌన్(తిరుపతి): ‘నా కుమారుడిది సహజ మరణం కాదు. అతని మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. నా కుమారుడు నివాసముంటున్న నివాసంలోనే అతని భార్య స్నేహితుడు కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని నా కోడలు చెప్పలేదు. దీనిపై విచారణ చేపట్టండి’ అంటూ శ్రీకాకుళానికి చెందిన మృతుడి తండ్రి పీ.నరసింహమూర్తి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. శీకాకుళం ప్రాంతానికి చెందిన పూతల గణేష్ కుమార్(34), అతని భార్య అమృత, వారి బాబుతో కలిసి నాయుడుపేట పట్టణంలోని మంగపతినాయుడు నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. గణేష్కుమార్ మేనకూరు సెజ్లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో గణేష్కుమార్ ఇంట్లో నిద్రలేచి కింద పడిపోవడంతో తలకు బలమైన గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతన్ని స్థానిక ప్రభుత్వ వైద్య శాలకు తీసుకెళ్తుండగా గణేష్కుమార్ మృతి చెందినట్లుగా భార్య అమృత పేర్కొన్నారు. అయితే కోడలు అమృత చెప్పిన విషయాలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. తన కుమారుడు నివాసముంటున్న ఇంట్లో కోడలు అమృత స్నేహితుడు కూడా ఉంటున్నాడు. ఆ విషయం చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది.. అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు గణేష్కుమార్ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బంధువులు శ్రీకాకుళం నుంచి నాయుడుపేటకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. -
తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిరవధిక వాయిదా
సాక్షి, విజయవాడ: తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిరవధిక వాయిదా పడింది. కోరం లేక ముగించిసనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. నిన్న, ఈ రోజు టీడీపీ అరాచకం వల్ల ఎన్నిక జరగలేదు. ఎన్నికలు జరగకుండా టీడీపీ గూండాలు అల్లర్లు సృష్టించారు. టీడీపీ గూండాల బీభత్సంతో రెండు రోజులు ఎన్నిక జరగలేదు. వైసీపీ కౌన్సిలర్లు తిరువురు వెళ్లకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారు.హైకోర్టు చెప్పినా కానీ పోలీసులు భద్రత కల్పించలేదు. టీడీపీ నేతల దాడితో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఎన్నికకు హాజురుకాలేకపోయారు. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను కౌన్సిల్ సభ్యులు రాకపోవడంతో ఆర్డీవో కే.మాధురి ముగించారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం తదుపరి కార్యచరణ ఉంటుందని ఆర్డీవో ప్రకటించారు.దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ నేతలను పోలీసు వాహనం ఎక్కనివ్వకుండా టీడీపీ టీడీపీ నేత రమేష్ రెడ్డి, టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. పోలీసు వాహనంపై కూడా టీడీపీ గూండాల దాడి చేశారు. దేవినేని అవినాష్ , మొండితోక అరుణ్ కుమార్లను రెడ్డిగూడెం స్టేషన్కు పోలీసులు తరలిస్తున్నారు. -
నాన్నే అమ్మను రాయితో గుద్ది చంపేశాడు..!
నాయుడుపేట టౌన్(తిరుపతి): ‘నాన్నే అమ్మను రాయితో గుద్ది చంపేశాడు.. మా కళ్లెదుటే అమ్మ చనిపోయింది’ అంటూ ఆ చిన్నారి కళ్ల నిండా నీళ్లు పెట్టుకుని తన తల్లిని చంపిన వైనాన్ని పోలీసులకు వివరించిన తీరు స్థానికులను కలచివేసింది. కన్న బిడ్డల ఎదుటే అతి కిరాతకంగా భార్యను కడతేర్చిన ఘటనపై పోలీసులు సోమవారం విచారణ చేపట్టారు. వివరాలు.. మండల పరిధిలోని మడపలం గ్రామ సమీపంలో కాలువ గట్టు వద్ద శనివారం రాత్రి మద్యం మత్తులో భార్య వీణమ్మ(28)ను భర్త రాపూరు శ్రీనివాసులు హత్య చేసిన విషయం తెలిసిందే. మృతురాలి తల్లి తుపాకులు పెంచలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలికి అఖిల(7), బత్తెయ్య(4), ఆదెయ్య(3) చిన్నారులున్నారు. శనివారం రాత్రి భర్త శ్రీనివాసులు పూటుగా మద్యం సేవించి భార్య వీణమ్మతో గొడవపడ్డాడు. ఆపై బండరాయితో తలపై మోది చంపేశాడు. తర్వాత పాము కాటు వేయడంతో వీణమ్మ మృతి చెందిందని నమ్మబలికాడు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లి పెంచలమ్మ ఆదివారం ఉదయం బిక్కుబిక్కుమంటూ ఏడ్చుతున్న వీణమ్మ పిల్లల్ని అక్కున చేర్చుకుంది.పోలీసుల ఔదార్యం విచారణ అనంతరం వీణమ్మ మృతదేహానికి సోమవారం నాయుడుపేట ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతురాలి కుటంబ సభ్యులు నిరుపేద గిరిజనులు కావండతో వారికి పోలీసులు అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించారు. వీణమ్మ మృతదేహాన్ని సైతం తీసుకెళ్లందుకు వారి వద్ద నగదు లేక పోవడంతో పోలీసులే నాయుడుపేటలో వీణమ్మకు అంత్యక్రియలు జరిపించారు. పరారీలో ఉన్న ఆమె భర్త శ్రీనివాసులును త్వరలో పట్టుకుంటామని తెలిపారు. -
టీడీపీ గూండాల దౌర్జన్యం.. ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
విజయవాడ: తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలకు హాజరయ్యేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు రక్షణ కల్పించడంలో పోలీసులు మరోసారి నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆ పార్టీ ప్రతినిధి బృందం మండిపడింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, పండుల రవీంద్రబాబు, వరుదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర ముఖ్య నాయకులు విజయవాడలో మరోసారి ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీని కలిసి జరిగిన దౌర్జన్యానికి సంబంధించి ఫిర్యాదు చేశారు.కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను కూడా పోలీసులు బేఖాతరు చేయని వైనంపై ఆధారాలతో సహా కమిషనర్కు వివరించారు. కౌన్సిలర్లకు భద్రత కల్పించకపోగా, దాడికి పాల్పడిన కూటమి నేతలకు అండగా నిలుస్తూ, వైఎస్సార్సీపీ నేతలనే పోలీసులు అరెస్ట్ చేసిన వైనాన్ని కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళారు. అనంతరం విజయవాడలో మీడియాతో పార్టీ నేతలు మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారంటే..పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చినా అవి క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. పోలీసులే ఎస్ఈసీ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతుందా అనే అనుమానం కలుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల్లో వైఎస్సార్సీపీకి పూర్తి బలం ఉన్నా, అధికార బలంతో అడ్డదారిలో నెగ్గాలని చూస్తున్నారు. తిరువూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక విషయంలో టీడీపీ అనుసరిస్తున్న విధానాలు, పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించడంపై ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసి వైఎస్సార్సీపీ తరఫున ఫిర్యాదు చేయడం జరిగింది. చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుంచుకోవాలని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి హెచ్చరించారు. రాష్ట్రాన్ని బీహార్లా మార్చేశారు: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న తలంపుతో ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి అధికార టీడీపీ నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారు. పోలీసులు కూడా రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘించి టీడీపీ నాయకులకు వంత పాడుతున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన కౌన్సిలర్లకు స్వేచ్ఛగా ఓటేసుకునే అవకాశం కల్పించాలని కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతగా దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చు. అధికార పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రౌడీ మూకల్ని వెంటేసుకొచ్చి 144 సెక్షన్ ను ఉల్లంఘించి హంగామా చేస్తుంటే అడ్డుకోవాల్సిన పోలీసులే వారికి సహకరించారు.ఎన్నిక సక్రమంగా జరిగేలా చూసుకోవాల్సిన పోలీసులే మా కౌన్సిలర్ల మెడలో ఉన్న వైయస్సార్సీపీ కండువాలను లాగి పడేసి కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం చూసి ప్రజలంతా చీదరించుకుంటున్నారు. తిరువూరులో పోలీసులే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. కూటమి పాలనలో ఆంధ్ర రాష్ట్రం బీహార్ కన్నా దారుణంగా తయారవుతోంది. ఇలాంటి సంస్కృతి భావితరాలకు మంచిది కాదని గుర్తుంచుకోవాలి. అధికార పార్టీ అరాచకాలను ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలి.కోర్టులు, ఎన్నికల కమిషన్ ఆదేశాలను పట్టించుకోరా?: మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుచట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే పచ్చ చొక్కాలు తొడుక్కున్న టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. ఓటేసేందుకు వెడుతున్న కౌన్సిలర్లకు భద్రత కల్పించాల్సిన పోలీసులు, తిరువూరు వస్తేనే భద్రత కల్పిస్తామని మాటమార్చారు. చట్టపరంగా నడుచుకోవాల్సిందిపోయి అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి, పోలీసులకు ఎన్నికల కమిషన్ ఆదేశాలన్నా, కోర్టులన్నా గౌరవం కానీ భయం కానీ కనిపించడం లేదు. నిన్న ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఆర్డర్ను పోలీసులు పాటించడం లేదని ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు, కలెక్టర్తో మాట్లాడతానని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని హామీ ఇచ్చారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు తిరువూరులో ఎన్నికకు హాజరుకావాల్సి ఉంటే, విజయవాడ నుంచి వస్తున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను మార్గమధ్యలో ఎందుకు ఆపేయాల్సి వచ్చిందో పోలీసులే సమాధానం చెప్పాలి. మున్సిపాలిటీలో కేవలం ముగ్గురు సభ్యుల బలం మాత్రమే ఉన్న టీడీపీ, చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి అడ్డదారులు తొక్కింది. పోలీసుల అండతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గూండాలతో వచ్చి మా కౌన్సిలర్లపై దాడికి పాల్పడ్డాడు. పోలీసులే బలవంతంగా నలుగురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసి తీసుళ్లి తెలుగుదేశం పార్టీలో చేర్పించారు.ఈరోజు కూడా అదే విధంగా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఎన్నికల కమిషన్ ఆదేశాలను సైతం ఉల్లంఘిస్తున్నారు. పోలీసుల వ్యవహారశైలిపై ఈ రోజు ఉదయం వైయస్సార్సీపీ కోర్టును ఆశ్రయించింది. కౌన్సిలర్లకు భద్రత కల్పించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించినా పోలీసులు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారని సాక్షాత్తు కోర్టు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ 30 నిమిషాల్లో పూర్తి వివరాలతో రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. అధికారం చేతుల్లో ఉంది కదా అని దౌర్జన్యం చేసి మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. వీరి ఆటలు ఎంతోకాలం సాగవు. తిరువూరు మున్సిపాలిటీ హాల్ వరకు కౌన్సిలర్లకు భద్రత కల్పించి తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. -
టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి.. వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: ‘స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి’ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 69వ వర్ధంతి. ఈ సందర్భంగా వైఎస్సీస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శత్రుచర్ల పరీక్షిత్ రాజు, అలజంగి జోగారావు, తిప్పల నాగిరెడ్డి, మళ్ళ విజయ్ ప్రసాద్, వాసుపల్లి గణేష్, పలువురు సీనియర్ నాయకులు సైతం టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ఆయన. నేడు ప్రకాశం పంతులుగారి వర్ధంతి సందర్భంగా నివాళులు.#AndhraKesari pic.twitter.com/GjqEztDO5D— YS Jagan Mohan Reddy (@ysjagan) May 20, 2025 -
మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం: వైఎస్ జగన్
తాడేపల్లి: రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘‘కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదు. కేసులకు, జైళ్లకూ భయపడకూడదు. అలా అయితేనే రాజకీయాలు చేయగలం. తెగువ, ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలం. చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు అలా ఉన్నాయి:’’ అంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో మంగళవారం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాప్రతినిధులతో సమావేశమైన వైఎస్ జగన్.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.‘‘మన హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం స్వీప్ చేశాం. తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి 18, మనకు 16. టీడీపీ వాళ్లని లాక్కుందామని ఎమ్మెల్యే అడిగాడు. కాని, మన పార్టీ ఎమ్మెల్యేను మనం హౌస్ అరెస్ట్ చేయించాం. ప్రజాస్వామ్యంగా అక్కడ ఎన్నిక జరిగేలా చూశాం, కాబట్టే అక్కడ టీడీపీ గెలిచింది. రాష్ట్రంలో కులం, మతం, రాజకీయాలు చూడకుండా, చివరకు టీడీపీ వాళ్ల సమస్యలనూ తీర్చాం...జగనన్నకు చెబుదాం నంబర్కు ఫోన్ చేస్తే చాలు వెంటనే స్పందించి పరిష్కారం చూపాం. స్పందన కార్యక్రమం ద్వారా కూడా వివక్ష లేకుండా పరిష్కారాలు చూపాం. అత్యధికంగా టీడీపీ వాళ్లకు చెందిన సమస్యలకు పరిష్కారాలు చూపి మంచి పరిపాలన అందించాం. ఇవాళ చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీచేస్తున్నాడు’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే..👉స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు👉తిరువూరులో సంఖ్యాబలం లేని చోటకూడా టీడీపీ పోటీకి పెట్టి, లాగేసుకునే ప్రయత్నంచేస్తోంది👉అయినా సరే మెజార్టీ వైయస్సార్సీపీ ఉండడంతే ఎన్నికను ఆపుతున్నారు:👉పోలీసులు వైయస్సార్సీపీ వాళ్లని అరెస్టు చేస్తున్నారు, టీడీపీ వాళ్లని రోడ్డుపై విడిచిపెడుతున్నారు👉సంఖ్యాబలం లేకపోయినా నర్సారావుపేట, కారంపూడిల్లో గెలిచామని ప్రకటించుకున్నారు👉కుప్పం మొదలుకుని ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితే👉రాప్తాడులో రామగిరి ఉప ఎన్నికలో అరాచకాలకు అంతులేదు👉ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ గుర్తుమీద, ఒక పార్టీ బి-ఫాం మీద గెలిచినప్పుడు, సంఖ్యాబలంలేకపోయినా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాళ్లు అక్రమాలను ప్రోత్సహించడం ఎంతవరకూ సమంజసం👉పోలీసులను పెట్టి బెదిరిస్తున్నారు👉యలమంచిలిలో మన వాళ్లు గట్టిగా నిలబడి గెలుపును సాధించుకున్నారు👉ఏ ప్రభుత్వంపైన అయినా వ్యతిరేక రావాలంటే సమయం పడుతుంది👉కాని చంద్రబాబుగారి పరిపాలనలో నెలల్లోనే విపరీతమైన వ్యతిరేకత వచ్చింది👉మనకన్నా ఎక్కువ చేస్తానని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చాడు👉జగన్ ఇచ్చేవన్నీ ఇస్తాను, అంతకంటే ఎక్కువ ఇస్తానన్నాడు👉కాని వాటన్నింటినీ తుంగలో తొక్కాడు 👉కాని, మన ప్రభుత్వంలో ప్రతి కార్యకర్త మనం అమలు చేసిన మేనిఫెస్టోతో ప్రతి ఇంటికీ వెళ్లాడు👉గడపగడపకూ కార్యక్రమం కింద మూడుసార్లు ప్రతి ఇంటికీ వెళ్లారు:👉99శాతం హామీలను అమలు చేసిన పార్టీ భారతదేశ చరిత్రలో వైయస్సార్సీపీ మాత్రమే👉మనం చేసిన మంచి ఎక్కడకూ పోదు👉10 శాతం ప్రజలు చంద్రబాబు ఏదో చేస్తారని నమ్మారు👉ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు ఫుట్బాల్ తన్నినట్టు ఈ ప్రభుత్వాన్ని తంతారు👉వైఎస్సార్సీపీ మాదిరిగా ప్రతి ఇంటికీ వెళ్లే ధైర్యం టీడీపీకి ఉందా?👉హామీల అమలుపై గట్టిగా నిలదీస్తారనే భయం వారికి ఉంది👉మాట ఇవ్వడం అంటే వెన్నుపోటు మాత్రమే అని చంద్రబాబుగారు నిరూపించారు👉పేదవాడి వైద్యం గురించి ఆలోచించే పరిస్థితి లేదు👉ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేశారు👉రూ.3600 కోట్లు పెండింగ్లో పెట్టారు👉ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎత్తివేశారు👉వైద్యంకోసం అప్పులు పాలు అయ్యే పరిస్థితి👉ఏ పంటకూ కనీస మద్దతు ధర రావడంలేదు👉ప్రభుత్వం రంగంలో వైయస్సార్సీపీ తీసుకొచ్చిన కాలేజీలను చంద్రబాబు అమ్మేయడానికి ప్రయత్నిస్తున్నాడు:👉కొత్తగా మూడు పోర్టులు నిర్మాణం ప్రారంభించాం👉శ్రీకాకుళంలో మూలపేట పోర్టు నిర్మాణాన్ని జోరుగా ముందుకు తీసుకెళ్లాం👉ఇప్పుడు ఆమూడు పోర్టులను కమీషన్లకోసం అమ్మేసేందుకు చంద్రబాబు శ్రీకారం చుట్టాడు👉ట్రైబల్ ప్రాంతాన్ని అభివృద్ధి పథాన నడిపించాం👉ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీలు, ట్రైబల్ యూనివర్శిటీ, మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు పెట్టాం👉బోగాపురం ఎయిర్పోర్టుకు గత చంద్రబాబు హయాంలో అనుమతులు లేవు, భూసేకరణ లేదు👉మనం అన్నీచేసి 30శాతం పనులు చేశాం👉రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా అభివృద్ధి పనులు కేవలం వైయస్సార్సీపీ హయాంలోనే జరిగాయి👉ఈరోజు ఇవన్నీ నాశనం అయిపోతున్నాయి👉వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేస్తున్నాడు👉ప్రజలను వెన్నుపోటు పొడిచాడు👉ఎవరూ ప్రశ్నించకూడదని భయానక పరిస్థితులను తీసుకు వచ్చాడు👉రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు👉ఎవరైనా గొంతు విప్పితే వారిని అణచివేయాలని చూస్తున్నాడు👉చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు👉తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు సృష్టిస్తున్నారు 👉గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు👉పార్టీలో చురుగ్గా ఉన్న వ్యక్తులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు👉ప్రతి కార్యకర్త కష్టాన్నీ చూస్తున్నాను👉జగన్ 2.Oలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుంది👉కోవిడ్ కారణంగా ఐదేళ్లపాలనలో అనుకున్నంతమేర సరిగ్గా చేయలేకపోయాం👉ఇవాళ మీ కష్టాలను చూస్తున్నాను 👉రేపు కచ్చితంగా వైఎస్సార్సీపీకి కార్యకర్తే నంబర్ ఒన్👉అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి👉కొడతానంటే.. కొట్టమనండి👉కాని, మీరు ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసుకోండి👉కాని, ఆ అన్యాయాలు చేసిన వారికి సినిమాలు చూపిస్తాం👉రిటైర్డ్ అయిన వారినీ లాక్కుని వస్తాం👉దేశం విడిచిపెట్టి వెళ్లినా సరే రప్పిస్తాం👉అన్యాయాలు చేసిన ఒక్కొక్కరికి సినిమాలు చూపిస్తాం👉మనకూ టైం వస్తుంది👉చంద్రబాబు నాటిని విత్తనాలు.. కచ్చితంగా ఈ పరిస్థితులకు దారితీస్తాయి👉చంద్రబాబు దుర్మార్గపు పాలనవల్ల తీవ్రంగా ఇబ్బంది పడ్డవారి కథలు వింటే చాలా ఆవేదన కలుగుతోంది👉మహిళలను అని చూడకుండా నెలలతరబడి జైళ్లలో పెడుతున్నారు👉ఒక కేసులో బెయిల్ వస్తుంది, అది రాగానే మరో కేసు పెడుతున్నారు👉ఇలా కేసులు మీదు కేసులు పెడుతన్నారు👉వల్లభనేని వంశీ విషయంలో ఇలాగే చేశారు👉దళితుడైన ఎంపీ నందిగం సురేష్ విషయంలోనే ఇలాగే దారుణాలు చేస్తున్నారు👉సుమారు నెలన్నరకుపైగా జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్లీ కేసుపెట్టి జైల్లో వేశారు👉తనను, తన కుటుంబ సభ్యులను తిడితే, ఎందుకు తిట్టావన్నందుకు తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు👉చంద్రబాబు ఇవాళ నాటిన విత్తనం రేపు మహావృక్షం అవుతుందని మరిచిపోవద్దు👉రాబోయే రోజుల్లో ప్రజల తరఫున గట్టిగా పోరాటాలు చేద్దాం👉వచ్చేది మన ప్రభుత్వమే👉మంచి రోజులు కచ్చితంగా వస్తాయి -
ప్రజల ఆశలతో బాబు కపట రాజకీయం!
‘‘ప్రజలకు మరీ ఆశ ఉండకూడదు. దురాశ పనికిరాదు’’ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు తరచూ చేసే వ్యాఖ్య ఇది. ఈమధ్య సోషల్ మీడియాలోనూ ఆయన వాడిన ఈ డైలాగులు ఎక్కవగా కనిపిస్తున్నాయి. ఆయన చెప్పింది వాస్తవమే. ఎందుకంటారా? బాబు, పవన్కళ్యాణ్ లాంటి వాళ్లు ఇచ్చినమాటకు కట్టుబడి హామీలన్నీ నెరవేరుస్తారని నమ్మడం ప్రజల అత్యాశే కదా! ఈ దురాశతోనే ప్రజలు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని గెలిపించింది! పాపం.. పై పై వాగ్ధానాలు చేసిన వాళ్లు ఎవరు? వారి ట్రాక్ రికార్డు ఏమిటి అన్నది కూడా గుర్తుపెట్టుకోకుండా ప్రజలు అతిగా ఆశపడ్డారు. టీడీపీ ఎన్నికల మానిఫెస్టోలోని ‘ఆడ బిడ్డ నిధి’కి కూడా బాబు అండ్ కో మంగళం పాడేసినట్లేనన్న వార్తలు చూసిన తరువాత ప్రజలను ఇంత గొప్పగా మోసం చేయవచ్చా? అని అనిపించక మానదు. ప్రజలను దురాశా పరులుగా చిత్రీకరించి నిందించవచ్చు కానీ.. ఆ ఆశ పెట్టిన వారి తప్పు మాత్రం ఏమీ లేదన్నచందంగా ఉందీ వ్యవహారం. ప్రజలను ఇంత బాహాటంగా మోసం చేసినందుకు ఇతర దేశాల్లో ఎలాంటి శిక్షలు పడతాయో తెలియదు కానీ.. ఇలాంటి వారు.. ప్రజల ఆగ్రహాన్ని, ఛీత్కారాలనైతే తప్పకుండా చూస్తారు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఈ దేశంలో నేతల వైఖరి నమ్మి మోసపోయిన వారిదే తప్పన్నట్టుగా ఉండటం. అయ్యో ఈ నేతలు ప్రజలను పిచ్చోళ్లుగా చూస్తున్నారే అన్న ఆవేదన కలుగుతుంది. నిజాయితీ లేని నేతలు అధికారంలోకి వచ్చి, చెప్పినవి చేయకపోగా, వారినే బెదిరిస్తున్న తీరు, విషయాలను పక్కదారి పట్టిస్తున్న తీరులపై పెద్ద పరిశోధనే చేయవచ్చు. ఆశపెట్టి ఏమార్చడం.. ఆ తరువాత ప్రజలనే నిందించడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. సుమారు రూ.లక్ష కోట్ల రైతు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానన్న హామీతో 2014లో గద్దెనెక్కిన చంద్రబాబు ఆ తరువాత ఏం చేశారో అందరికీ తెలుసు. ఆ రోజుల్లోనే ఆయన ‘‘ఆశకు హద్దు ఉండాలి’’ అని రైతులను ఉద్దేశించి నేరుగానే అన్నారు. తాజాగా 2024 ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీ ప్రతి మహిళకూ రూ.1500 చొప్పున నెల నెల ఇస్తానని! ఈ పథకానికి ఆడబిడ్డ నిధి పేరూ పెట్టారు. ప్రతి ఒక్కరికీ ఇస్తాం. తల్లికి వందనం కింద ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకూ రూ.15 వేలు చొప్పున ఇస్తామని ఊదరగొట్టడంతో మహిళలు చాలామంది ఆశపడ్డారు. ఓట్లేశారు. ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడు అప్పట్లో ‘‘నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు’’ అంటూ ప్రచారం చేయడమూ మనం చూశాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు సైతం.. ‘‘ఒకరుంటే రూ.15 వేలు, నలుగురు పిల్లలుంటే రూ.60 వేలు..ఇంకా పిల్లలను కనండి..వారి బాధ్యత మాది’’ అని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. ఏడాది పూర్తి అయిపోయింది.. తల్లికి వందనం లేదు. విద్యార్ధులకు సుమారు రూ.13 వేలు ఎగవేశారు. వచ్చే విద్యా సంవత్సరం ఇస్తామని అంటున్నారు. ఏమవుతుందో తెలియదు! ఆర్టీసీ బస్సుల్లో మహిళకు ఉచిత రవాణా సౌకర్యం అన్న హామీని కూడా అటకెక్కించేశారు. అమలు చేసి ఉంటే ఏపీ మహిళలకు ఏడాదికి రూ మూడు వేల కోట్ల వరకూ మిగిలేది! ఈ లెక్క కూడా ఎల్లోమీడియాదే. ఆగస్టు పదిహేను నుంచి ఈ స్కీము అమలు చేస్తామని చంద్రబాబు ఈమధ్య కర్నూలులో ప్రకటించారు. అంటే మరో మూడు నెలలు ఈ స్కీమ్ ఉండదు. దీనిని కూడా లెక్కలోకి తీసుకుంటే మహిళలు మరో రూ.వెయ్యి కోట్లు నష్టపోయినట్లు! ఇదే సభలో చంద్రబాబు ఆడబిడ్డ నిధి స్కీము లేనట్లే తేల్చారని వార్త వచ్చింది. దానికి ఆయన ఇచ్చిన వివరణ చూస్తే మరీ ఇంత పచ్చి పాపమా అనిపిస్తుంది. తాను అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలు మోసపూరితమని ఆయనకు తెలుసు. తాను ఆ వాగ్దానాలు ఎందుకు చేసింది.. ఎందుకు అమలు చేయలేకపోతున్నది నిజాయితీగా వివరించడం మానేసి, మరో కొత్త అబద్దాన్ని సృష్టించారు. అదేమిటంటే తాను తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని ఏపీలో పేదలు బాగానే సంపాదిస్తున్నట్లు చంద్రబాబే తేల్చేశారు! అందువల్ల వారికి ఆ స్కీమ్ అవసరం లేదని, 2029నాటికి పేదరికం లేకుండా చేసేస్తామని, అప్పటికీ పేదలు ఉంటే పీ-4 కింద దాతలకు అప్పగిస్తామని అన్నారట. కూటమి ప్రభుత్వం వచ్చాక, ప్రజల చేతుల్లో డబ్బులు ఆడక పేదలు, గిట్టుబాటు ధరలు లేక రైతులు, వ్యాపారాలు లేక వ్యాపారస్తులు అల్లాడుతుంటే పేదలంతా బాగా సంపాదించుకుంటున్నారని చంద్రబాబు చెబుతున్నారు. ఇలాంటి వారి మాటలు నమ్మి ఓటు వేసినందుకు తమకు బాగానే శాస్తి అయిందని ప్రజలు అనుకునే పరిస్థితి ఏర్పడింది. ఆడబిడ్డ నిధి స్కీము రాష్ట్రంలోని కోటిన్నర మంది మహిళలకు ఉపయోగపడేది! ఏడాదికి సుమారు రూ.30 వేల కోట్లకుపైగా అవసరమని లెక్క. ఇంత మొత్తం ఎలా సాధ్యమని అప్పట్లో ప్రశ్నించిన వారికి బాబు ఇచ్చిన సమాధానం తాను సంపద సృష్టించగలనూ అని! ఇప్పుడేమో సంపద వచ్చేసిందని చెబుతుంటే బిత్తరపోవడం తప్ప ప్రజలు చేయగలిగేది ఏముంటుంది! ఒకరకంగా చెప్పాలంటే ఈవీఎంల మాయాజాలం సంగతి పక్కనబెడితే అనేక నియోజకవర్గాలలో తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి వాగ్దానాలు గేమ్ చేంజర్ గా మారి కూటమిని అధికారంలోకి తెచ్చాయి. ఇప్పుడేమో చేతులెత్తేసి పేదల జీవితాలతో కూటమి నేతలు చెలగాటమాడుతున్నారు. వాగ్దానాల గురించి చెప్పకుండా, చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నామని, ఓర్వకల్లో మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేశామని, బుద్దుడి సలహాలు పాటించండని కధలు చెబుతున్నారు. ఇక్కడ ఒక గమ్మత్తు జరిగింది. చెత్త ఎత్తడానికి పనివారు వస్తున్నారా అని చంద్రబాబు ప్రశ్నిస్తే లేదు..లేదు..అని ఎక్కువ మంది చేతులెత్తారు. దాంతో చెత్త గురించి ఆయన చెబుతున్న కబుర్లలో డొల్లతనం బయటపడింది. చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్లాంట్లు పెడతామని, లక్ష మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలు చేస్తామని, ఉద్యానవన పంటలను 18 లక్షల హెక్టార్ల నుంచి 36 లక్షల హెక్టార్లు చేస్తామని, ఇలా ఏవేవో సంబంధం లేని మాటలతో ప్రసంగం చేశారు. అక్కడితో ఆగితే ఫర్వాలేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కూడా దబాయించి మరీ చెప్పారు. నవ్వుకుని ఊండిపోవడం అక్కడి ప్రజల వంతైంది. చివరికి బుద్దుడు, ఆయన శిష్యుడి కథ అంటూ చంద్రబాబు ప్రజలకు ఒక స్టోరీ చెప్పారు. దాని ప్రకారం శిష్యుడి కోరిక మేరకు బుద్దుడు కొత్త వస్త్రాలు ఇప్పించారట. ఆ తర్వాత కొద్ది రోజులకు బుద్దుడు పిలిచి పాత వస్త్రాలు ఏమి చేశావని అడిగాడట. వాటితో చిరిగిపోయిన బొంతలో పెట్టి కుట్టుకున్నానని శిష్యుడు చెప్పాడట. మరీ చినిగిపోయిన బొంతలోని వస్త్రాలు ఏమి చేశావు అని బుద్దుడు అడిగాడట. వాటిని కిటికీ తెరలు చేశానని జవాబు ఇచ్చారు.మరి అప్పటికే ఉన్న కిటీకి తెరలు ఏమి చేశావని అడిగితే గది తుడవడానికి వాడుతున్నానని, ఆ వస్త్రాన్ని మసిబట్టగా వాడుతున్నానని, అప్పటిదాకా ఉన్న మసిబట్ట దారాలను కొవ్వొత్తిలో వాడే వత్తులకు వినియోగిస్తున్నానని శిష్యుడు చెప్పారట. ప్రతి వస్తువుకూ ఒక ఉపయోగం ఉంటుందని చెప్పడానికి చంద్రబాబు ఈ కథ చెప్పినా, విన్న వారికి మాత్రం చివరికి ఏపీ పరిస్థితి ఇలా మారిందన్నమాట అని అనుకున్నారనుకోవాలి. ఒక పక్క అమరావతిలో ఇప్పటికే ఉన్న సచివాలయం, అసెంబ్లీ తదితర భవనాలు ఉన్నా, అవి పనికి రావంటూ లక్ష కోట్లు వ్యయం చేస్తూ గొప్పలు చెప్పే చంద్రబాబు ప్రజలు మాత్రం ఈ ఆధునిక యుగంలో చినిగిన వస్త్రాలు సైతం వాడుకోవాలని చెబుతున్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి బుద్దుడు, శిష్యుడు కథ వర్తించదా అంటే ఏమి చెబుతాం. ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు అన్న సూత్రం చంద్రబాబు వంటివారిని చూసే వచ్చిందనుకోవాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కాళ్లు.. చేతులు కట్టేసి.. గొంతుకు తాడుతో బిగించి చంపేశారు
రాయచోటి టౌన్(అన్నమయ్య): కాళ్లు.. చేతులు కట్టేశారు.. గొంతుకు తాడుతో బిగించారు.. చనిపోయిన తరువాత ఆనవాళ్లు లభించకుండా చేసేందుకు పెట్రోలు పోసి నిప్పు పెట్టారు. అయితే మృతి చెందిన మహిళ చేతి పై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి హత్య జరిగిన వా రం రోజుల్లోనే నిందితులను అరెస్టు చేశారు. మృతురాలు మదనపల్లె నియోజకవర్గం పరిధిలోని రామసముద్రం ప్రాంతానికి చెందిన వెంకటరమణ భార్య బూసిపల్లె శివమ్మ(27) గా గుర్తించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సోమవారం విలేకరుల స మావేశంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి..అన్నమయ్య జిల్లా మదనపల్లె పరిధిలోని రామసముద్రం మండలం చెంబుకూరు ఎలకపల్లె రహదారిలో ఈనెల 11వ తేదీ గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించింది. రామసముద్రం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ సాగించారు. మృతదేహంపై పెట్రోలు పోసి తగలబెట్టడంతో ఎలాంటి ఆధారాలు లభించలేదు. అక్కడ పెట్రోల్ కోసం వాడిన బాటిల్ మాత్రమే ఉండింది. అయితే మృతురాలి చేతిపై యస్మిత అనే పచ్చబొట్టు ఉండటంతో దాని ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. పచ్చ బొట్టును సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమె ఏ ప్రాంతానికి చెందిన మహిళ అనే విషయం తెలిసింది. అలాగే డాగ్స్క్వాడ్ సంఘటన స్థలం నుంచి బెంగళూరు రోడ్డు వైపు వెళ్లడంతో ఆ మేరకు టెక్నాలజీని ఉపయోగించి నిందితులను గుర్తించారు. నిందితులంతా మృతురాలి బంధువులే అని తేలడంతో ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో బెంగళూరులో నివాసం ఉంటున్న ఎం.నీలావతి, రామసముద్రం మండలం గుండేవారిపల్లె నడింపల్లె ప్రాంతానికి చెందిన కన్నెమడుగు గణేష్, బెంగళూరులోని బి.హోసహళ్లి సజ్జాపురం ప్రాంతం అంబేద్కర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ హెచ్వీ గోపాల్ ఉన్నారు.ఎందుకు హత్య చేశారంటే..మృతురాలు బూసిపల్లె శివమ్మ అదే ప్రాంతానికి చెందిన సంతోష్ అనే వ్యక్తితో వెళ్లిపోయింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని ఆమె బంధువులు భర్తకు తెలియకుండా ఆమెను హత్య చేసేందుకు పథకం రచించారు. ఇందులో భాగంగా మృతురాలి బంధువైన నీలావతి బెంగళూరుకు చెందిన ఆటో డ్రైవర్ హెచ్వీ గోపాల్తో హత్య చేసేందుకు బేరం కుదుర్చుకుంది. వీరికి కన్నెమడుగు గణేష్ అనే వ్యక్తి సహకరించాడు. ఆ తర్వాత వారు రామసముద్రం వచ్చి శివమ్మకు మాయమాటలు చెప్పి ఆమెను తమ వెంట శివారు ప్రాంతంలోకి తీసుకెళ్లారు. తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి గొంతుకు తాడు బిగించి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ప్రాణం పోయిందని నిర్ధారించుకున్నాక ముందుగానే తమ వెంట తెచ్చుకున్న పెట్రోలును మృతదేహంపై పోసి నిప్పంటించారు. అయితే ఆమె చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు కేసు మిస్టరీని ఛేదించారు. మదనపల్లె డీఎస్పీ ఎస్.మహేంద్ర, రూరల్ సీఐ సత్యనారాయణ, రామసముద్రం ఎస్ఐ జి.రవికుమార్, మరికొంతమంది సిబ్బంది చాకచక్యంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారని ఎస్పీ ప్రశంసించారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారుసోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తే కఠిన చర్యలురాయచోటి టౌన్ : సమాజంలో ప్రజలను ఉద్రేకపరిచేలా, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్ట్లు పెడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని అన్నమయ్య జిల్లాఎస్పీ విద్యా సాగర్నాయుడు హెచ్చరించారు. మదనపల్లెలో హనుమాన్ శోభాయాత్రలో జరిగిన సంఘటనపై సోమవారం ఆయన స్పందించి విలేకరులతో మాట్లాడారు. శోభాయాత్ర నిర్వాహకులు ముందుగా తమతో అనుమతులు పొందే సమయంలో ఇచ్చిన రూట్మ్యాప్ ప్రకారం కాకుండా వేరే దారిలో వెళ్లేందుకు ప్రయత్నించారన్నారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకుండా సమస్యలు సృష్టించాలని చూశారన్నారు. ప్రకటించిన సమయానికి రాకుండా సుమారు ఒకటిన్నర గంట ఆలస్యంగా రావడమే కాకుండా దారి మళ్లించి సమస్య ను సృష్టించడంతో తమ పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేయాల్సి వచ్చిందన్నారు. కావాలనే శోభాయాత్రను దారి మళ్లించి సమస్యలు సృష్టించేందుకు కారణమైన వారిపై కేసు నమోదు చేశామని చెప్పారు. అయితే అక్కడ ఏదో జరిగిందని ఒక వర్గాన్ని అణచివేస్తున్నట్లుగా తప్పు డు సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్టు చేస్తున్నారన్నారు. అలాంటి వారిపైన కూడా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమేనని గుర్తించుకోవాలని సూచించారు. -
వైఎస్సార్సీపీ నేతల వాహనాలపై టీడీపీ గూండాల దాడి
రెండు గంటల పాటు టిడిపి గూండాలు భయోత్పాతం సృష్టించారుఎమ్మెల్సీ ,మొండితోక అరుణ్ కుమార్తిరువూరు వెళ్లడానికి మాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదుపోలీసులే దగ్గరుండి టిడిపి గూండాలతో మాపై దాడి చేయించారుమేం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాంనా కారును ధ్వంసం చేస్తున్నా.. పోలీసులు చోద్యం చూశారుకౌన్సిలర్లకు భద్రత కల్పించమని ఎన్నికల కమిషనర్ , హైకోర్టు ఆదేశాలున్నా పోలీసులు పెడచెవిన పెట్టారుఒక్కో కౌన్సిలర్ కు ఒక్కొక్క గన్ మెన్ ఇవ్వాలని ఆదేశాలున్నాయ్పోలీసులు రక్షణ ఇవ్వకపోతే మేమే రక్షణ కవచంలా నిలిచాంమా కారును ధ్వంసం చేసి మా పై హత్యాయత్నం చేశారుతిరువూరు టిడిపి ఎమ్మెల్యే వీధి రౌడీలా ప్రవర్తించాడుమా కారును అడ్డగించి మా పై దాడి చేసారునన్ను , స్వామిదాస్ ను కులం పేరుతో దూషించి చంపేస్తామని బెదిరించారు కులం పేరుతో దూషించి బెదిరించిన వారి పై నేను , స్వామిదాస్ కేసు పెట్టి... హై కోర్టుకు ఈడుస్తాంకోర్టు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు: తిరువూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి,నల్లగట్ల స్వామిదాస్నేను 35 ఏళ్లుగా తిరువూరు రాజకీయాలు చూస్తున్నాతిరువూరు టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఒక గూండా మాదిరి వ్యవహరించారుఇలాంటి ఎమ్మెల్యేని తిరువూరు ప్రజలు ఎన్నడూ చూడలేదుకూటమి నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారుటిడిపి నేతలను చట్టపరంగా శిక్షిస్తాంమాకు రక్షణ కల్పించమని కోర్టు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదువైఎస్సార్సీపీ మహిళా కౌన్సిలర్లను బలవంతంగా లాక్కెళ్లిపోయారుఅసలు ఈ రాష్ట్రం ఎటుపోతుందిరాజ్యాంగబద్ధంగా కూటమి ప్రభుత్వం నడుచుకోవడం లేదురాబోయేది జగన్ మోహన్ రెడ్డి 2.0 పాలనేతప్పుచేసిన ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటాంమాపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన వారి పై కేసు పెట్టి చట్టం ముందు నిలబెడతాంప్రశాంతమైన తిరువూరులో టీడీపీ గూండాలు విధ్వంసం స్పష్టించారు: దేవినేని అవినాష్టీడీపీ గూండాలు మాపై దాడి చేశారుకేశినేని చిన్నియే టీడీపీ గూండాలను మాపైకి పంపారుమా కారును ధ్వంసం చేశారు.. మమ్మల్ని హతమార్చాలని చూశారుటీడీపీ గూండాల దాడికి పోలీసులు సహకరించారుమాపై దాడి చేసిన వారిని ఎవరినీ వదిలి పెట్టంపోలీసులే రాజకీయం చేస్తున్నారుకౌన్సిలర్లకు వారి ఇంటి నుంచి భద్రత ఇస్తామని వితండవాదం చేశారుమా కౌన్సిలర్లకు మేమే రక్షణగా నిలిచాంటిడిపి ఎంపీ కేశినేని చిన్ని మందు పోయించి టిడిపి గూండాలను మా పైకి రెచ్చగొట్టారు మా కారును పైకి లేపి పల్టీలు కొట్టించి...ధ్వంసం చేయాలని చూశారుమా కారు ధ్వంసం చేసే వరకూ పోలీసులు చూస్తూ ఊరురున్నారు 👉వైఎస్సార్సీపీ నేతలు అరెస్ట్దేవినేని అవినాష్, అరుణ్కుమార్లు అరెస్ట్తిరువూరు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులురెడ్డిగూడెం స్టేషన్కు తరలిస్తున్న పోలీసులు👉తిరువూరులో టీడీపీ గూండాల అరాచకంవైఎస్సార్సీపీ నేతల వాహనాలపై టీడీపీ గూండాల దాడిదేవినేని అవినాష్, అరుణ్కుమార్ వాహనాలపై దాడివైఎస్సార్సీపీ నేతల కారు అద్దాలు పగలగొట్టిన టీడీపీ గూండాలుదారికాసి వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న టీడీపీ గూండాలుఎ.కొండూరు మండలం రేపూడి క్రాస్ వద్ద టీడీపీ గూండాల విధ్వంసంసాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు బరి తెగించేశారు.. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, వైఎస్సార్సీపీ నేతలను తిరువూరు వెళ్లకుండా చేసేందుకు కుట్రలకు తెరతీశారు. తిరువూరు వెళ్లే మార్గంలో రామచంద్రాపురం, చీమల పాడు వద్ద టీడీపీ.. భారీగా కార్యకర్తలను మోహరింపచేసింది. వైఎస్సార్సీపీ నేత స్వామిదాస్ ఇంటిని టీడీపీ గూండాలు ముట్టడించారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల కుటుంబసభ్యులపై టీడీపీ గూండాలు బెదిరింపులకు దిగారు.వైఎస్సార్సీపీ నేతల్ని దారికాసి టీడీపీ గూండాలు అడ్డగించారు. అవినాష్, స్వామిదాస్ అరుణ్ వాహనాలను అడ్డగించారు. వాహనాలు కదలకుండా టీడీపీ గూండాలు చుట్టుముట్టారు. అవినాష్, స్వామిదాస్పై టీడీపీ తప్పుడు ఫిర్యాదులు చేసింది. 13వ వార్డు కౌన్సిలర్ తండ్రితో టీడీపీ ఫిర్యాదు చేయించింది. ఓటమి భయంతో టీడీపీ గూండాలు దౌర్జన్యాలు చేస్తున్నారు. కాగా.. భద్రత కల్పించడంలో ఎన్నికల కమిషనర్ ఆదేశాలను కూడా పోలీసులు లెక్కచేయడం లేదు. తిరువూరు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల రక్షణ విషయంలో వితండవాదం చేస్తున్నారు.తిరువూరు వస్తేనే భద్రత కల్పిస్తామని పోలీసులు అంటున్నారు. నిన్న టీడీపీ గూండాల దాడితో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు విజయవాడకు చేరుకున్నారు. విజయవాడ నుంచి ఎన్నిక జరిగే వరుకు కౌన్సిల్ హాలు వరకు రక్షణ కల్పించాలని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు కోరుతున్నారు. టీడీపీ గూండాల దాడులపై ఈసీకి వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవిని సంఖ్యాబలం లేకపోయినా తన ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వీధి రౌడీలా వ్యవహరించారు. ఎన్నిక వాయిదా వేయించాలనే కుట్రతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. మహిళా కౌన్సిలర్లపై చెప్పులు, వాటర్ బాటిళ్లతో దాడికి తెగబడ్డారు. బారికేడ్లను ధ్వంసం చేశారు. దౌర్జన్యకాండను అడ్డుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. చివరకు కోరం సరిపోలేదంటూ ఎన్నికల అధికారి, ఆర్డీఓ మాధురి నేటికి (మంగళవారం) వాయిదా వేశారు. -
పచ్చ కండువా వేసుకుని రా.. లేదంటే నీ అంతు చూస్తా..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘ఏరా నా లిమిట్స్లో బోర్ వేస్తావా? నీకెంత ధైర్యం. మర్యాదగా బండి స్టేషన్లో పెట్టు. అయ్య చెబితే బండి వదుల్తా. మర్యాదగా ‘పచ్చ’ కండువా వేసుకో.. లేదంటే అంతు చూస్తా...’ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు సర్కిల్ పోలీసుస్టేషన్లో సీఐగా పనిచేస్తున్న రాజు అన్న మాటలివి. టీడీపీ కార్యకర్త కంటే అధ్వానంగా ప్రవర్తిస్తున్న ఈయన అరాచకాలు పెచ్చుమీరిపోయినట్లు విమర్శలొ స్తున్నాయి. ఫలానా వ్యక్తి టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నాడు అంటే చాలు టార్గెట్ చేసి మరీ టార్చర్ పెట్టడం సీఐకి అలవాటుగా మారిపోయింది.బోర్వెల్ వేయడానికి నీకెంత ధైర్యం..కూడేరు మండలం మరుట్ల–1 కాలనీకి చెందిన శ్రీనివాసులు అద్దెకు బోర్వెల్ బండి తెచ్చుకున్నాడు. ఇతను వైఎస్సార్ సీపీ అభిమాని. ఇటీవల ఉదిరిపికొండ గ్రామ సమీపంలోని ఓ పొలంలో బోర్ వేస్తున్న విషయం తెలుసుకున్న సీఐ రాజు.. అక్కడికి కానిస్టేబుళ్లను పంపించి లారీని స్టేషన్కు రప్పించారు. ఈ క్రమంలో శ్రీనివాసులపై రెచ్చిపోయారు. ‘మర్యాదగా పయ్యావుల శీనప్ప దగ్గరికి వెళ్లు.. అక్కడి నుంచి ఫోన్ చేయిస్తే నీ బండి వదులుతా. అక్కడే పచ్చ కండువా వేసుకుని రా.. లేదంటే నీ అంతు చూస్తా’ అంటూ అతన్ని బెదిరించారు. అంతటితో ఆగక ఆర్టీఓను పిలిపించి రూ.60 వేల ఫైన్ వేయించారు. మరో రూ.50 వేల లంచమూ తిన్నారు! చివరకు ఆ బోర్వెల్ బండిని టీడీపీ కార్యకర్తకు అద్దెకు ఇప్పించడం గమనార్హం.నా అనుమతి లేకుండా పాలు సేకరిస్తావా..?మరుట్ల–3 కాలనీకి చెందిన రామాంజనేయులు ‘దొడ్ల’ డెయిరీ కంపెనీకి గ్రామంలో పాల సేకరణ చేసేవాడు. సీఐ దాన్ని పీకేయించి పాలసేకరణకు ఆటోలు రాకుండా ఆపించారు. సేకరణ బాధ్యతలు టీడీపీ కార్యకర్తకు ఇప్పించారు. ఈ క్రమంలోనే రామాంజనేయులు ‘గాయత్రి’ డెయిరీ పాల సేకరణకు వెళ్లగా.. ‘ఏరా ఒకసారి ఆపితే వేరే కంపెనీకి పాలు సేకరిస్తావా’ అంటూ బెదిరించి బలవంతంగా దాన్ని కూడా ఆపేయించారు. సదరు డెయిరీకి సంబంధించిన ఆటో డ్రైవర్ను కూడా బెదిరించి ఊర్లోకి రాకుండా చేశారు. దీంతో రామాంజనేయులు ఉపాధి కోల్పోయాడు. అంతేకాదు సీఐ ఎప్పుడేం చేస్తారో అని ఇప్పటికీ అతను భయపడుతున్నాడు.దళిత రైతుకు చుక్కలు..కూడేరు మండలంలో ధనుంజయ అనే రైతు తన పొలానికి ట్రాన్స్ఫార్మర్ బిగించుకున్నాడు. అదే సర్వీసు కింద మరో మూడు ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ధనుంజయ వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడు కావడంతో విద్యుత్ శాఖ ఏఈతో ఓ తప్పుడు ఫిర్యాదు ఇప్పించిన సీఐ.. కానిస్టేబుళ్లను పంపించి డీపీని పీకేయించారు. జీపులో పోలీసుస్టేషన్కు తీసుకొచ్చారు. పోలీ సుల జీపునకు ధనుంజయ భార్య అడ్డుపడినా ఆమెను పక్కకు లాగేసి మరీ ట్రాన్స్ఫార్మర్ ఎత్తుకొచ్చారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు సీఐ రాజు అరాచకాలు రోజు రోజుకూ పెచ్చుమీరుతున్నాయి. కొన్ని రోజుల క్రితం చోళసముద్రం గ్రామంలో టీడీపీ కార్యకర్త నిర్వాకంతో కరెంటు పనిచేస్తున్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై బాధితులు ఫిర్యాదు ఇచ్చినా ‘తెలుగు తమ్ముడి’పై కేసు నమోదు చేయలేదంటే అధికార పార్టీకి సీఐ ఎంతలా కొమ్ము కాస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. -
దక్షిణ కోస్తా, సీమ మీదుగా ఉపరితల ద్రోణి
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా ఆవరించి ఉంది. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని వెల్లడించారు. కోస్తాంధ్ర జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. కాగా, పగటి ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటే సూచనలున్నాయని కూడా పేర్కొన్నారు. -
లోకేశ్కి ప్రమోషన్!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో అపరిమిత అధికారాలు చెలాయిస్తున్న తన కుమారుడు, మంత్రి లోకేశ్కి మరింత ప్రాధాన్యత కల్పించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అనధికారికంగా అన్ని వ్యవహారాల్లో ఆయన మాటే శాసనంగా నడుస్తున్నా, అధికారికంగా సీఎం, డిప్యూటీ సీఎం తర్వాతే ఉన్నారు. దీంతో తనకు మరింత ప్రాధాన్యత కల్పించాలని లోకేశ్ చాలారోజుల నుంచి పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన అభీష్టానికి అనుగుణంగానే కొందరు టీడీపీ నేతలు లోకేశ్ను సీఎం చేయాలని, పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని, మరికొందరు డిప్యూటీ సీఎం పదవి కేటాయించాలని తరచూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేశ్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా మహానాడులో ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రకరకాల డిమాండ్లు.. చివరికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి? కొద్ది నెలల క్రితం లోకేశ్ను డిప్యూటీ సీఎం చేయాలనే వాదన పార్టీలో గట్టిగా వినిపించింది. ఆ సమయంలోనే దావోస్ పర్యటనలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ లోకేశ్ తమ భావి ముఖ్యమంత్రి అని ప్రకటించి విమర్శలపాలయ్యారు. మూడు పార్టీల కూటమి ప్రభుత్వంలో లోకేశ్కి ఏడాదిలోనే కొత్త పదవి ఇచ్చే విషయంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆయన కోరిక నెరవేరలేదని తెలుస్తోంది. కానీ పార్టీ పదవి అనేది ఆ పార్టీ సొంత వ్యవహారం కాబట్టి అందులోనే కీలక పదవి ఇవ్వడం ద్వారా మరింత ప్రాధాన్యత కల్పించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తద్వారా తన తర్వాత తన కుమారుడే అని అధికారికంగా చెప్పినట్లవుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. కడపలో ఈ నెల 27 నుంచి జరిగే మహానాడులో లోకేశ్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం. తద్వారా ఆయన ప్రాధాన్యత మరింత పెరుగుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.పార్టీ కమిటీల్లోనూ భారీ మార్పులు.. సీనియర్లకు చెక్ఈ మహానాడులో పార్టీ పొలిట్బ్యూరో, అన్ని కమిటీల్లో భారీ మార్పులు చేయనున్నారు. చంద్రబాబు సమకాలీకులుగా ఉన్న నేతలను పక్కన పెట్టి తనకు అనుకూలంగా ఉండే వారిని ఈ కమిటీల్లోకి తీసుకునేందుకు లోకేశ్ అన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం పొలిట్బ్యూరోలో 25 మంది ఉండగా, వారిలో చాలామంది పాతవారే. యనమల రామకృష్ణుడు, అశోక్గజపతిరాజు, అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, వర్ల రామయ్య, కిమిడి కళా వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నక్కా ఆనంద్బాబు, గల్లా జయదేవ్, పితాని సత్యనారాయణ, అచ్చెన్నాయుడు, టీడీ జనార్ధన్ వంటి సీనియర్లు ఉన్నారు.వారిలో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్నా ఏమాత్రం ప్రాధాన్యత లభించడంలేదు. యనమల రామకృష్ణుడికి ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ చేయలేదు. కాకినాడ సెజ్ వ్యవహారంలో ఆయన చంద్రబాబుకు లేఖ రాయడంతో పార్టీ శ్రేణులతో ఆయన్ను తీవ్ర స్థాయిలో అవమానించేలా ప్రెస్మీట్లు పెట్టి తిట్టించారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయించారు. అచ్చెన్నాయుడు, టీడీ జనార్ధన్, గోరంట్ల, సోమిరెడ్డి, కళా, చినరాజప్ప వంటి వారికి చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా కష్టంగా మారింది.వీరందరినీ పొలిట్బ్యూరో నుంచి తప్పించి కొత్త వారిని నియమించనున్నట్లు సమాచారం. పార్టీ కమిటీల్లోనూ కొత్త వారికి అవకాశం కల్పిస్తామని లోకేశ్ పదేపదే చెబుతున్నారు. ఇందుకోసమే ఇటీవల వరుసగా మూడుసార్లు పార్టీ పదవిలో ఉన్నవారిని ఆ పదవుల్లో కొనసాగించకూడదని పొలిట్బ్యూరోలో తీర్మానం చేయించారు. దీంతో సీనియర్లకు చెక్ పెట్టడం ఖాయంగా కనిపిస్తుండడంతో వారు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పార్టీ కోసం అహరి్నశలూ కష్టపడితే లోకేశ్ కోసం చంద్రబాబు తమను అవమానిస్తున్నారని సీనియర్లు మండిపడుతున్నారు. -
సహ నిందితుల వాంగ్మూలం ఆధారమా?
సాక్షి, అమరావతి: మద్యం విధానంపై అక్రమ కేసులో కె.ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసే సమయంలో సహ నిందితుల నేరాంగీకార వాంగ్మూలాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. భారతీయ సాక్ష్యాల చట్టం 1872 సెక్షన్ 30 కింద తుది విచారణ (ట్రయల్) సందర్భంగా ఏ వాంగ్మూలాలను అయితే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందో, వాటిని ముందస్తు బెయిల్, బెయిల్ మంజూరు సమయంలో కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని హైకోర్టు చెప్పడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది.హైకోర్టు అభిప్రాయంతో తాము ఎంతమాత్రం ఏకీభవించలేమని స్పష్టం చేసింది. సహ నిందితుల వాంగ్మూలాలను ముందస్తు బెయిల్, బెయిల్ మంజూరు సమయంలో పరిగణనలోకి తీసుకోవడానికే వీల్లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సీఆర్పీసీ సెక్షన్ 161 కింద వాంగ్మూలం ఇచ్చింది సాక్షా? లేక నిందితుడా? లేక నిందితుడిగా మారే వ్యక్తా? అన్న విషయాన్ని బెయిల్, ముందస్తు బెయిల్ మంజూరు సమయంలో కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొన్ని సందర్భాల్లో 161 వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తి నిందితుడు కాకపోవచ్చు.. ఆ తరువాత నిందితుడు కావొచ్చని పేర్కొంది. నేర విచారణ ప్రక్రియలో ఓ నిందితుడి వాంగ్మూలాన్ని సహ నిందితుడికి వ్యతిరేకంగా ఉపయోగించరాదన్నది ప్రాథమిక సూత్రమని తెలిపింది. రాజకీయ దురుద్దేశాలున్నట్లు పిటిషనర్లు ప్రాథమిక ఆధారాలు చూపారు.. ప్రభుత్వం న్యాయపరమైన పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.. మద్యం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కృష్ణమోహన్రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, వికాట్ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ జంషేడ్ బొర్జూర్ పారీ్థవాలా, జస్టిస్ మహాదేవన్ల ధర్మాసనం వాటిని కొట్టేసింది.దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున దాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదంటూ పిటిషన్లు కొట్టేసింది. ఇదే సమయంలో మద్యం కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలున్నట్లు పిటిషనర్లు ప్రాథమిక ఆధారాలను చూపారని, ఇందుకు ప్రభుత్వం న్యాయపరమైన పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తీర్పునకు సంబంధించిన కాపీ తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఈ తీర్పులో ధర్మాసనం నిందితుల వాంగ్మూలాల గురించి పూర్తిస్థాయిలో చర్చించింది. కస్టడీలో పోలీసులకిచ్చిన వాంగ్మూలానికి ఆమోద యోగ్యత లేదు... ‘భారతీయ సాక్ష్యాల చట్టం సెక్షన్ 24 ప్రకారం సహ నిందితుడిపై మరో నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు.. ఆ వాంగ్మూలాన్ని ఆ వ్యక్తికి వ్యతిరేకంగా స్పష్టమైన సాక్ష్యంగా రుజువు చేయాల్సి ఉంటుంది. ఈ వాంగ్మూలం భయపెట్టి, బెదిరించి, ప్రలోభపెట్టి తీసుకున్నదై ఉండకూడదు. పోలీసు అధికారికి ఇచ్చిన వాంగ్మూలాన్ని నిందితుడికి వ్యతిరేకంగా ఉపయోగించడానికి వీల్లేదు. పోలీసు అధికారికి ఇచ్చిన వాంగ్మూలం భారతీయ సాక్ష్యాల చట్టం సెక్షన్ 25 ప్రకారం పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదు. ఈ అంశాలన్నింటినీ కూడా కేసు ట్రయల్ సందర్భంగా పరిశీలించాల్సి ఉంటుంది. నిందితులందరినీ ఉమ్మడిగా విచారించినప్పుడు (జాయింట్ ట్రయల్) మాత్రమే సహ నిందితుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వారిని ఒకే కేసులో, ఒకే కోర్టులో కలిపి విచారిస్తున్న సమయంలోనే వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకోవడం సాధ్యమవుతుంది.సెక్షన్ 30 కింద అభియోగాలు నమోదు కానప్పుడు, నిందితులను విచారణకు హాజరుపరచనప్పుడు భారతీయ సాక్ష్యాల చట్టం వర్తించదు. ఈ నేపథ్యంలో నిందితుల వాంగ్మూలాన్ని కోర్టులు పరిగణనలోకి తీసుకోజాలవు. ఒకవేళ సహ నిందితుల వాంగ్మూలాన్ని బెయిల్, ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా పరిగణనలోకి తీసుకోవచ్చని అనుకున్నా కేవలం నేరాంగీకార వాంగ్మూలమే కాకుండా సహ నిందితుడిపై ఉన్న ఇతర స్వతంత్ర సాక్ష్యాలను కూడా కోర్టు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. సెక్షన్ 25 ప్రకారం కస్టడీలో పోలీసులకిచ్చిన వాంగ్మూలాలకు ఆమోద యోగ్యత లేనందున ఆ వాంగ్మూలాలను సహ నిందితులకు వ్యతిరేకంగా ఉపయోగించరాదు. సెక్షన్ 26 ప్రకారం మేజి్రస్టేట్ సమక్షంలో ఇచ్చిన వాంగ్మూలాన్ని మాత్రమే సహ నిందితులకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు’ అని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. పోలీసు అధికారికి నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరంలేదు‘నిందితుడి వాంగ్మూలం సహ నిందితుడిని ఇరికించేలా ఉంటే ఆ వాంగ్మూలాన్ని సీఆర్పీసీ సెక్షన్ 161 ప్రకారం పరిగణనలోకి తీసుకోవచ్చా అనే విషయంలో ఎలాంటి అయోమయానికి, గందరగోళానికి తావులేకుండా స్పష్టతనివ్వదలిచాం. ఎఫ్ఐఆర్లో పేరున్న వ్యక్తిని, నేరం చేసిన వ్యక్తిని పోలీసులు విచారించి సీఆర్పీసీ సెక్షన్ 161 కింద అతడి వాంగ్మూలాన్ని నమోదు చేయవచ్చు. అయితే అలా నమోదు చేసిన వాంగ్మూలానికి ఎంతమాత్రం ఆమోదయోగ్యత లేదు. ఇదే విషయాన్ని సాహిబ్ సింగ్తో పాటు పలు కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది.2022లో ఇంద్రేష్ కుమార్ కేసులో సీఆర్పీసీ సెక్షన్ 161 కింద ఇచ్చిన వాంగ్మూలాన్ని సాక్ష్యంగా పరిగణనలోకి తీసుకోరాదని, అయితే బెయిల్ మంజూరు సందర్భంగా పరిగణనలోకి తీసుకోవచ్చునని సుప్రీంకోర్టు, చెప్పింది. ఈ కేసులో పూర్వాపరాల ఆధారంగా ఆ తీర్పునివ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ తీర్పు కేవలం సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలకే వర్తిస్తుంది గానీ నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలకు కాదు. ఆ తీర్పులో ఎక్కడా కూడా నిందితులు పోలీసులకిచ్చిన వాంగ్మూలాలను బెయిల్ మంజూరు సందర్భంగా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పలేదు. సెక్షన్ 161 కింద ఓ సాక్షి ఇచ్చిన వాంగ్మూలానికి, ఓ నిందితుడు ఇచ్చిన వాంగ్మూలానికి చాలా తేడా ఉంది.పోలీసు అధికారికి నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని విస్మరించవచ్చు. నిందితుడి వాంగ్మూలాన్ని సహ నిందితుడికి వ్యతిరేకంగా వాడకూడదన్న న్యాయ సూత్రానికి ఓ మినహాయింపు ఉంది. నిందితుడి వాంగ్మూలం నేరాన్ని రుజువు చేసేదే కాక, అది విశ్వసించేదిగా, ఆధార సహితంగా ఉన్నప్పుడు ఆ వాంగ్మూలాన్ని సహ నిందితుడికి వ్యతిరేకంగా వాడొచ్చు. అయితే నిందితుడి వాంగ్మూలమొక్కటే సరిపోదు. సహ నిందితుడి పాత్రను రుజువు చేసేందుకు ఇతర సాక్ష్యాలు కూడా కావాల్సి ఉంటుంది. ఆ సాక్ష్యాలు నిందితుడి వాంగ్మూలానికి మద్దతునిచ్చేవిగా ఉండాలి. అందువల్ల సహ నిందితుడికి వ్యతిరేకంగా ముఖ్యంగా పోలీసు అధికారి ముందు ఇచ్చిన వాంగ్మూలాలను న్యాయస్థానాలు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి’ అని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. నిందితుడి వాంగ్మూలం సహ నిందితుడిని ఇరికించేలా ఉంటే ఆ వాంగ్మూలాన్ని సీఆర్పీసీ సెక్షన్ 161 ప్రకారం పరిగణనలోకి తీసుకోవచ్చా? అనే విషయంలో ఎలాంటి అయోమయానికి, గందరగోళానికి తావులేకుండా స్పష్టతనివ్వదలిచాం. ఎఫ్ఐఆర్లో పేరున్న వ్యక్తిని, నేరం చేసిన వ్యక్తిని పోలీసులు విచారించి సీఆర్పీసీ సెక్షన్ 161 కింద అతడి వాంగ్మూలాన్ని నమోదు చేయవచ్చు. అయితే అలా నమోదు చేసిన వాంగ్మూలానికి ఎంతమాత్రం ఆమోదయోగ్యత లేదు. - సుప్రీంకోర్టుకేవలం సహ నిందితుని కన్ఫెషన్ స్టేట్మెంట్ను ఆధారంగా చేసుకుని ఒక వ్యక్తి బెయిల్పై నిర్ణయం తీసుకోరాదని తన జడ్జిమెంట్లో పలు పేరాల్లో అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అందులోని కొన్ని ...34. ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం, ఒక వ్యక్తి తనకు వ్యతిరేకంగా అలాగే మరొకరిని కూడా దోషిగా సూచిస్తూ చేసిన అంగీకారాన్ని (కన్ఫెషన్), వారు ఇద్దరూ ఒకే సమయంలో ఒకే కేసులో సంయుక్తంగా విచారణకు లోనవుతున్నప్పుడు, ఆ కోర్టు ఆ అంగీకారాన్ని పరిశీలనలోకి తీసుకోవచ్చు. అయితే, ఈ అంగీకారాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని మరొకరిని శిక్షించకూడదు. దానిని మిగతా ఆధారాలతో కలిపి పరిశీలించాలి.39. ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 30పై హైకోర్టు తనదైన అర్థాన్ని కలిగి ఉంది. సెక్షన్ 30 కింద అంగీకరించదగినదిగా (కన్ఫెషన్) ఉన్న విషయం, ముందస్తు బెయిల్ లేదా సాధారణ బెయిల్ పిటిషన్ పరిశీలన సమయంలో కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే, హైకోర్టు వ్యక్తపరిచిన అభిప్రాయంతో మేము ఏకీభవించడం లేదు. మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్న అభిప్రాయం ఏమిటంటే– అటువంటి ఒప్పుకోలు ఏదైనా ఉన్నా, అది ముందస్తు బెయిల్ లేదా సాధారణ బెయిల్ ఇచ్చే దశలో పరిగణనలోకి తీసుకోరాదు. దీనికి ప్రధాన కారణాలు ఇవే:(1) ఒక సహ–ఆరోపితుడిపై ఒప్పుకోలు (కన్ఫెషన్) ఆధారంగా నిర్ణయం తీసుకోవాలంటే, ఆ ఒప్పుకోలు చేసిన వ్యక్తిపై ముందు నేరం నిరూపితమవ్వాలి. అది సెక్షన్ 24 వీగిపోకూడదు. లేదా సెక్షన్ 25 ప్రకారం చట్టవిరుద్ధంగా ఉండకూడదు. ఇది పూర్తిగా కోర్టు విచారణ సమయంలోనే తేలుతుంది. కేసు నిరూపణ కోసం విశ్వసనీయ, బలమైన సాక్ష్యాలు కోర్టులో ఉంచాల్సి ఉంటుంది, తద్వారా నేరం స్పష్టంగా నిరూపితం కావాలి. ‘దీపక్ భాయ్ జగదీష్ చంద్ర పటేల్ (వర్సెస్) స్టేట్ ఆఫ్ గుజరాత్ అండ్ అదర్స్ (2019) 16 ఎస్సీసీ 547’లో అత్యున్నత న్యాయస్థానం ఇదే విషయాన్ని చెప్పింది. పోలీసు అధికారుల ముందు ఇచ్చిన ఒప్పుకోలు, కోర్టులో సాక్ష్యంగా పరిగణనలోకి తీసుకోరాదు. సెక్షన్ 30 ప్రకారం పరిగణనలోకి తీసుకునే స్టేట్మెంట్ సరైనదై ఉండాలి, చట్టబద్ధమైనదై ఉండాలి. ఇది ఈ సెక్షన్ మూల లక్ష్యం.49. (10) ముందస్తు (యాంటిసిపేటరీ) లేదా సాధారణ (రెగ్యులర్) బెయిల్ విచారణకు సంబంధించి కోర్టు సీఆర్పీసీ 161 ప్రకారం పోలీసుల ముందు ఒక వ్యక్తి ఇచ్చిన ప్రకటనను పరిశీలించే ముందు, ఆ వ్యక్తి వాస్తవంగా సాక్షినా, నిందితుడా, లేక భవిష్యత్తులో నిందితుడిగా మారే అవకాశం ఉన్నవాడా అనే విషయాన్ని మొదట తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి. ఎందుకంటే 161‑సెక్షన్ ప్రకటన‑ సమయంలో ఆ వ్యక్తి నిందితుడి జాబితాలో లేకపోయినా, దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో తర్వాత అతను నిందితుడిగా చేర్చబడే పరిస్థితులు ఏర్పడవచ్చు.ఈ నేపథ్యంలో, మొదట సాక్షిగా ఉన్న వ్యక్తి తర్వాత నిందితుడిగా మారవచ్చన్న భావాన్ని కోర్టులు ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి. ఎఫ్ఐఆర్లో పేరు లేదని మాత్రమే కారణం చెప్పుకుని ఆ వ్యక్తి ప్రకటనపై ఆధారపడితే, అతన్ని నిందితుడిగా చేర్చే దశ వచ్చే వరకు ఆ ప్రకటనను నమ్ముకునే అసంబద్ధ పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే, రికార్డుల ప్రకారం ఆ వ్యక్తిని నిందితుడిగా చేర్చే అవకాశముందని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తే, దర్యాప్తు ఏ విధంగానూ ప్రభావితం కాకుండా కోర్టులు ఏ విధమైన అభిప్రాయాన్ని ప్రకటించకుండా జాగ్రత్తగా ఉండాలని మేము హెచ్చరిస్తున్నాము. -
గజ రాజులకూ పేర్లుంటాయ్
సాక్షి, అమరావతి: మనం ఒకరినొకరు పేర్లతో పిలుచుకోవడం సహజం. ఇలా పేర్లు పెట్టుకుని సంబోధించుకోవడానికి మాట్లాడటం రావాలి. అందుకు ఓ భాష కూడా కావాలి. అది మనుషులకు మాత్రమే సాధ్యమనే భావన నిన్నమొన్నటి వరకు భావించేవారు. కానీ.. కొన్ని రకాల వన్యప్రాణులు కూడా మాట్లాడుకుంటాయని.. వాటికి కూడా భాష ఉంటుందని వివిధ పరిశోధనల్లో తేలింది. ఇప్పుడు అలా మాట్లాడుకునే వన్య ప్రాణుల్లో ఏనుగులు కూడా ఉన్నాయని తాజాగా గుర్తించారు. అడవుల్లో జీవించే ఏనుగులు పేర్లతో పిలుచుకుంటాయని తేలింది. అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్ మైకేల్ బార్టో నేతృత్వంలోని బృందం కెన్యాలోని ఆఫ్రికన్ ఏనుగులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలింది.నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. ఏనుగులు చేసే రకరకాల శబ్దాలను శాస్త్రవేత్తలు రికార్డు చేసి వాటి ప్రవర్తనను గమనించారు. అవి తమ గుంపులోని ఇతర ఏనుగులను గుర్తించడానికి ప్రత్యేకమైన, తక్కువ ఫ్రీక్వెన్సీ గల శబ్దాలను (ఇన్ఫ్రా సౌండ్) ఉపయోగిస్తాయని కనుగొన్నారు. ఈ శబ్దాలు మనం పేర్లుగా భావించే వాటితో సమానమని తేలింది. ఒక ఏనుగు తన సమూహంలోని మరో ఏనుగును పిలవాలనుకుంటే ఒక నిర్దిష్టమైన శబ్దాన్ని చేస్తుంది. అది ఆ ఏనుగు మాట్లాడాలనుకున్న మరో ఏనుగుకు మాత్రమే సంబంధించిన శబ్దం అని స్పష్టమైంది. ఒక్కో ఏనుగుకు ఒక్కో ప్రత్యేకమైన శబ్దం ఉంది. ఈ శబ్దాలు కామన్గా ఇతర అన్ని జంతువులు ఒకే రకంగా చేసేలా లేకపోవడం ఈ పరిశోధనలో గుర్తించిన కీలకమైన అంశం.ఏఐ టెక్నాలజీతో శబ్దాల విశ్లేషణ శాస్త్రవేత్తలు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఏనుగుల శబ్దాలను విశ్లేషించారు. పరిశోధకులు ఒక గుంపులోని ఏనుగులను గుర్తించేందుకు పేర్లు పెట్టారు. అందులో ఒక ఏనుగుకు ’మాంబా’ అని పేరు పెట్టి దాన్ని నిరంతరం గమనించారు. ’మాంబా’ ఒక నది దగ్గర నీళ్లు తాగుతుండగా, గుంపులోని మరో ఏనుగు దాన్ని పిలవడానికి ఒక ప్రత్యేకమైన గుండ్రని శబ్దాన్ని చేసింది. ఆశ్చర్యకరంగా ’మాంబా’ మాత్రమే ఆ శబ్దానికి స్పందించి తల ఎత్తి ఆ దిశగా చూసింది. మిగతా ఏనుగులు ఆ శబ్దాన్ని పట్టించుకోలేదు. దీనిద్వారా ఏనుగులు వ్యక్తిగత పేర్లను ఉపయో గిస్తాయని నిర్థారణ అయింది.అసాధారణ మేధస్సు గజరాజుల సొంతంసాధారణంగా అడవి జంతువులు ఒకే రకమైన అరుపులు, శబ్దాల ద్వారా సంభాషించుకుంటాయి. ఈ శబ్దాలన్నీ కామన్గా ఉంటాయి. ప్రత్యేకంగా ఒక్కో దానికి ఒక్కో రకమైన శబ్దాలు ఉండవు. కానీ.. ఏనుగులు ప్రత్యేకంగా మనుషుల మాదిరిగానే సంభాషించుకునేలా శబ్దాలు చేసుకోవడం కొత్త విషయం. అవి ఒక శబ్దాన్ని చేయడంతోపాటు అది ఎవరు చేశారో, ఎవరి కోసం చేశాయో కూడా గుర్తించగలుగుతున్నాయి. అంటే వాటికి బుద్ధితో ఆలోచించే సామర్థ్యం ఉన్నట్టు స్పష్టమైంది. ఏనుగులు బలమైనవే కాదు.. అసాధారణమైన మేధస్సు కలిగిన సామాజిక జీవులని తాజా అధ్యయనంలో వెల్లడైంది.డాల్ఫిన్లు, చిలుకలకు ప్రత్యేక భాషఇప్పటివరకు డాల్ఫిన్లు, చిలుకలు ఒకదాన్ని ఒకటి గుర్తించడానికి శబ్దాలను చేస్తాయని భావించేవారు. ఒక డాల్ఫిన్ తన సమూహంలోని మరో డాల్ఫిన్ చేసే స్వరాన్ని అనుకరించి దాన్ని పిలుస్తుంది. కానీ.. ఏనుగులు ప్రత్యేకమైన శబ్దాలను ఉపయోగిస్తుండటం.. అవి మనుషుల సంభాషణ పద్ధతికి చాలా దగ్గరగా ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఏనుగులు తమ సమూహంలో ఉన్న ఇతర ఏనుగులతో బలమైన బంధాలను ఏర్పర్చుకుంటాయి.కలిసి ప్రయాణించడం, కలిసి ఆహారం సేకరించడం, శత్రువుల నుండి ఒకదానిని మరొకటి రక్షించుకోవడం ద్వారా తమ బంధాన్ని మరింత దృఢంగా మార్చుకుంటాయి. అయితే వాటికి ఒక శబ్దాల భాష ఉన్నట్టు తాజాగా బయటపడటంతో అవి మనుషులతో చాలా దగ్గరగా ఉన్నట్టు తేలింది. ‘ఏనుగులు మనం ఊహించిన దానికంటే ఎక్కువ సంక్లిష్టతను కలిగి ఉన్నాయి. వాటి సామాజిక నిర్మాణం, సంభాషణ పద్ధతులు మనుషులతో సమానంగా ఉన్నాయి’ అని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఒక శాస్త్రవేత్త తెలిపారు. -
నేడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాప్రతినిధులతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమావేశం కానున్నారు.స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాల్లో భాగంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లను ఆహ్వానించారు. వారితోపాటు ఆయా జిల్లాలకు సంబంధించిన వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు కూడా హాజరుకానున్నారు. -
బాబు ప్రభుత్వ ‘చావు’ తెలివి
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం రెడ్బుక్ కుట్రలకు మరింతగా బరితెగిస్తోంది. ఎంతగా అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సహజ మరణాలు, వృద్ధాప్య, అనారోగ్యసమస్యలతో మరణాలనూ వక్రీకరిస్తూ అక్రమ కేసుల నమోదుకు తెగబడుతోంది. 2022, మార్చిలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 16 మంది మరణించారు. కోవిడ్ అనంతర అనారోగ్య సమస్యలు, వృద్ధాప్య సమస్యలతో వారు మరణించారు.వీటిపై అప్పట్లోనే ఎల్లో మీడియా సహకారంతో అప్పటి ప్రతిపక్ష టీడీపీ రాద్ధాంతం చేసింది. కల్తీసారా తాగి మరణించారని దుష్ప్రచారం చేసింది. అప్పట్లోనే విచారణ చేపట్టిన అధికారులు ఆ 16 మంది అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతోనే మరణించారని నిర్ధారించారు. కాగా ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ మరణాలపై విచారణ పేరుతో కొత్త కుట్రకు తెరతీయడం గమనార్హం. ప్రభుత్వ పెద్దల కుట్రకు డీజీపీ వత్తాసు⇒ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుమరో అక్రమ కేసుకు తెరతీయాలన్న టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల కుట్రకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వత్తాసు పలికారు. మూడేళ్ల క్రితం నాటి సహజ మరణాలపై తాజాగా ఆయన సందేహం వ్యక్తం చేయడమే అందుకు నిదర్శనం. ఆ మరణాలపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల నివేదిక పంపారు. కల్తీ సారా వల్లే ఆ మరణాలు సంభవించాయని ఎఫ్ఎస్ఎల్ వెల్లడించిందని కూడా ఆయన ఏకపక్షంగా ఆ నివేదికలో పేర్కొనడం గమనార్హం. విచారణతో నిమిత్తం లేకుండా ఏకంగా డీజీపీనే ఏకపక్షంగా కల్తీ సారా అని చెప్పేయడం విడ్డూరంగా ఉంది.అంటే రాబోయే నివేదిక ఎలా రూపొందించాలన్నది కూడా ఆయన పోలీసు అధికారులకు పరోక్షంగా స్పష్టం చేశారు. ఇక తాము అనుకున్నట్టుగా డీజీపీ ద్వారా నివేదిక రాగానే ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆ మరణాలపై దర్యాప్తునకు టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు ఎస్పీ కేపీఎస్ కిశోర్, ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కేవీఎన్ ప్రభుకుమార్, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ విభాగం అధిపతి కె.ఉమామహేశ్వరరావుతో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. 2022లో జంగారెడ్డిగూడెంలో 16మంది మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని, అప్పటి అధికారులు చేపట్టిన విచారణలో లోపాలు ఉంటే గుర్తించాలని, తదుపరి తీసుకోవాల్సిన న్యాయ, పరిపాలన, సాంకేతికపరమైన చర్యలను సూచించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతోనే 16 మంది మృతి⇒ ఆనాడే అధికారుల దర్యాప్తులో వెల్లడిజంగారెడ్డిగూడెంలో 2022 మార్చిలో 16మంది మృతిపై అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వమే దర్యాప్తునకు ఆదేశించింది. అప్పటి పోలీసు, రెవెన్యూ, వైద్య అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేశారు. ఆర్డీవో ప్రసన్నలక్ష్మి, డీఎంహెచ్వో బి. రవి నేతృత్వంలో రెవెన్యూ, వైద్య అధికారులు మరణించిన 16 మంది నివాసాలకు వెళ్లి విచారణ చేశారు. మృతుల బంధువుల వాంగ్మూలాలను నమోదు చేశారు.వారి కుటుంబ పరిస్థితులను అధ్యయనం చేశారు. వైద్య నివేదికలు పరిశీలించారు. అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతోనే ఆ 16 మంది మరణించారని నిర్ధారించారు. వారిలో ముగ్గురికి మాత్రమే మద్యం వ్యసనం ఉందని కూడా తేల్చారు. వారు కూడా జంగారెడ్డిగూడెంలో వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు. వారి మరణానికీ కేవలం మద్యంపానం ఒక్కటే కారణం కాదు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అనంతరం ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ప్రకారం ఆ 16 మంది మృతికి కారణాలు ఇవీ...నాటి ఎస్పీ రాహుల్దేవ్ శర్మ విచారణలోనూ అదే వెల్లడిఆయనే ప్రస్తుతం రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ మరణాలపై పోలీసు విచారణ కూడా నిర్వహించింది. అప్పటి ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మ ఆ విచారణ నిర్వహించారు. ఆయన జంగారెడ్డిగూడెంలో పర్యటించారు. అప్పటి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ హైమావతి, ఆర్డీవో ప్రసన్న లక్ష్మి, డీఎంహెచ్వో బి.రవి, డిప్యూటీ డీఎంహెచ్వో మురళీకృష్ణ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస చౌదరి, సూపరింటెండెంట్ బి.అరుణ కుమారి, డీఎస్పీ కేవీ సత్యనారాయణ తదితరులతో సమీక్షించారు.వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతోనే ఆ 16 మంది మరణించారని నివేదించారు. అప్పుడు దర్యాప్తు నిర్వహించిన జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మ ప్రస్తుతం రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఉన్నారు కూడా. కానీ ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరించి అక్రమ కేసు నమోదుకు సిద్ధపడుతుండటం కేవలం రాజకీయ కక్ష సాధింపు కుట్రేనన్నది స్పష్టమవుతోంది. -
గుంటూరులో దళిత మహిళ ఆత్మహత్యాయత్నం
గుంటూరు వెస్ట్: భూ తగాదాల విషయంలోనే గుంటూరు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. ఏళ్ల తరబడి తమ సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడంతోపాటు ఇటీవల టీడీపీ కార్పొరేటర్ బెదిరింపులకు భయపడి సోమవారం ఓ దళిత మహిళ ఎలుకల మందు తాగి అందరూ చూస్తుండగానే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను అక్కడి సిబ్బంది హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పెదపలకలూరు గ్రామంలోని జన్మభూమి నగర్, స్వర్ణాంధ్ర నగర్ ప్రాంతాల్లోని సర్వే నెంబర్ 376, 377తోపాటు 227లలో గుంటూరు వసంతరాయపురానికి చెందిన దోమతోటి బుజ్జి (50) తల్లి కల్లు లచ్చమ్మ, ఆడబిడ్డతోపాటు బంధువులకు తొమ్మిది ప్లాట్లు ఉన్నాయి.వీటిని మౌలాలితోపాటు మరికొందరు ఆక్రమించుకున్నారు. ఇటీవల స్థానిక టీడీపీ కార్పొరేటర్ సాంబిరెడ్డి పంచాయితీ నిమిత్తం బుజ్జిని తన ఆఫీసుకు పిలిచి నానా దుర్భాషలాడారు. కులం పేరుతో దూషించారు. ప్రాణాలు తీస్తామని బెదిరించారు. నిజానికి.. సదరు ప్లాట్ల కోసం బుజ్జి అనేక ఏళ్లుగా అధికారులతోపాటు నల్లపాడు పోలీసుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె సోమవారం తీవ్ర మనస్తాపంతో ఎలుకల మందు తీసుకుని గుంటూరులోని కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చింది. అందరూ చూస్తుండగానే ఎలుకల మందు తాగింది. వెంటనే అక్కడి సిబ్బంది ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
నేడు విద్యుత్ ఉద్యోగుల సమ్మె
సాక్షి, అమరావతి: విద్యుత్ శాఖ ఉద్యోగులు మంగళవారం దేశ వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 29 కార్మిక, ఉపాధి చట్టాలను ఏకీకృతం చేసి కేవలం నాలుగు కోడ్ (నియమావళి)లుగా రూపొందించి రాష్ట్రాల్లో అమలు చేయించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే పలు రాష్ట్రాల్లో అమల్లోకి కూడా తీసుకువచ్చింది.దీనిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా అన్ని విద్యుత్ ఉద్యోగుల, కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్, ఇంజనీర్స్ జాతీయ సమన్వయ ఐక్య కమిటీ (ఎస్సీసీఓఈఈఈ) ఏర్పాటైంది. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెకు ఈ కమిటీ పిలుపునిచి్చంది. రాష్ట్రంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ దీనికి మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంగళవారం అన్ని జిల్లాల్లో విద్యుత్ ఉద్యోగులు ఆందోళనలు, నిరసన ర్యాలీలు చేపట్టనున్నారు. -
ప్రజాస్వామ్యానికి.. టీడీపీ పాతర
సాక్షి, అమరావతి/నెట్వర్క్: గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్ సహా వివిధ మున్సిపల్ చైర్పర్సన్లు, మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, 20 పంచాయతీల్లో ఉప సర్పంచ్ పదవుల కోసం సోమవారం నిర్వహించిన ఎన్నికల్లో టీడీపీ నేతలు ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ.. అక్రమాల జాతర నడిపించారు. తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవిని సంఖ్యాబలం లేకపోయినా తన ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వీధి రౌడీలా వ్యవహరించారు. ఎన్నిక వాయిదా వేయించాలనే కుట్రతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. మహిళా కౌన్సిలర్లపై చెప్పులు, వాటర్ బాటిళ్లతో దాడికి తెగబడ్డారు. బారికేడ్లను ధ్వంసం చేశారు. దౌర్జన్యకాండను అడ్డుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. చివరకు కోరం సరిపోలేదంటూ ఎన్నికల అధికారి, ఆర్డీఓ మాధురి మంగళవారానికి వాయిదా వేశారు. నరసరావుపేట, కారంపూడిలో దొడ్డిదారిన.. నరసరావుపేట మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవి కోసం ఇప్పటికే రెండుసార్లు ఎన్నిక నిర్వహించగా కోరం లేక వాయిదా పడింది. మూడోసారి సోమవారం ఎన్నిక నిర్వహించారు. కనీసం నామినేషన్ వేయడానికి టీడీపీ తరఫున ఒక్క ఎంపీటీసీ కూడా లేకపోయినా ఆ పార్టీ ఎన్నికల బరిలో నిలిచింది. పోలీసుల వేధింపులు, అక్రమ కేసులకు నిరసనగా ప్రత్యేక సమావేశాన్ని వైఎస్సార్సీపీ బహిష్కరించింది.మూడోసారి నిర్వహిస్తున్న ఎన్నిక సమావేశం కావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల అధికారి ప్రత్యేక అధికారాన్ని వినియోగించి.. సమావేశానికి ఎన్నికైన ముగ్గురు ఎంపీటీసీల్లో కొత్తపాలెం ఎంపీటీసీ వంపుగుడి సువార్తమ్మ మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనట్టు ప్రకటించారు. కాగా.. కారంపూడి మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా టీడీపీ బలపరిచిన గాడిపర్తి రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. ఇక్కడ 14 మంది ఎంపీటీసీలకు గాను ఆరుగురు మాత్రమే హాజరయ్యారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ఎంపీడీఓ కార్యాలయంలోకి వెళ్లనివ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుని దాడులు చేశారు. భయానక వాతావరణం సృష్టించి టీడీపీ ఈ పదవిని తన ఖాతాలో వేసుకుంది. ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడి.. శ్రీసత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ చైర్పర్సన్, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాల రాజకీయం చేసింది. పదవులు, డబ్బు ఎరగా వేసి.. వినని వారిని కేసులతో భయపెట్టి తమ వైపు ఓటు వేయించుకుంది. గాండ్లపెంట మండలంలో టీడీపీకి కేవలం ఒక్క ఎంపీటీసీ మాత్రమే ఉండగా.. డబ్బులు ఎరవేసి ముగ్గురు ఎంపీటీసీలను తనవైపు తిప్పుకుంది. పార్టీ ఫిరాయించిన వ్యక్తికి ఎంపీపీ పదవి కట్టబెట్టింది. రామగిరి ఎంపీపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మహిళా అభ్యర్థి లేకపోవడంతో మరోసారి వాయిదా పడింది. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ కూటమి కుట్రలకు బలైంది. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు, ఎమ్మెల్యే బేబీ నాయన ప్రలోభాలకు గురిచేసి, భయపెట్టి టీడీపీ వైపు తిప్పుకున్నారు. సోమవారం జరిగిన మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలో రాంబార్కి శరత్ ఎన్నికయ్యారు. గ్రేటర్ విశాఖలో జనసేనకు ఝలక్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్ ఎన్నికలో జనసేన పారీ్టకి టీడీపీ కార్పొరేటర్లు ఝలక్ ఇచ్చారు. ఈ పదవి జనసేనకు ప్రకటించడంతో పలువురు టీడీపీ కార్పొరేటర్లు సమావేశానికి హాజరుకాకుండా షాకిచ్చారు. గత నెల 28న నిర్వహించిన మేయర్ ఎన్నికకు 74 మంది సభ్యులు హాజరుకాగా.. సోమవారం నిర్వహించిన డిప్యూటీ మేయర్ ఎన్నికకు కేవలం 54 మంది మాత్రమే హాజరయ్యారు. ఎన్నిక ప్రత్యేక సమావేశానికి 56 మంది సభ్యులు హాజరుకావాలి. కోరం లేకపోవడంతో ఎన్నికల అధికారి మయూర్ అశోక్ ఎన్నిక ప్రత్యేక సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేశారు. యలమంచిలి ఎంపీపీ వైఎస్సార్సీపీ కైవసం రెండు నెలలపాటు అధికార పార్టీ అక్రమ కేసులు, తీవ్రస్థాయి బెదిరింపులు, మానసిక వేధింపుల్ని తట్టుకుని వైఎస్సార్సీపీలోనే కొనసాగిన ఎంపీటీసీ ఇనుకొండ ధనలక్ష్మి పశి్చమ గోదావరి జిల్లా యలమంచిలి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీకి బలం లేకపోయినప్పటికీ అత్తిలి ఎంపీపీ స్థానాన్ని, కైకలూరు వైస్ ఎంపీపీ స్థానాన్ని బెదిరింపులతో దక్కించుకుంది. అత్తిలిలో టీడీపీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చిల్లర రాజకీయాలకు తెగబడ్డారు. ఆపార్టీ తీవ్రస్థాయి బెదిరింపులతో కొందరు వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను టీడీపీలో చేర్చుకుని అత్తిలి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ జయకేతనం ప్రకాశం జిల్లా మార్కాపురం, త్రిపురాంతకం మండల ఉపాధ్యక్షుల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మార్కాపురం వైస్ ఎంపీపీ–2గా కుందురు మల్లారెడ్డి, త్రిపురాంతకం వైస్ ఎంపీపీగా పాటిబండ్ల కృష్ణ ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా వైఎస్సార్సీపీకి చెందిన ఎనుముల సోమశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లా తవణంపల్లె రెండో వైస్ ఎంపీపీగా చెర్లోపల్లె వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అనసూయమ్మ ఎన్నికయ్యారు. -
ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు విఫలం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని తొమ్మిది ఉపాధ్యాయ గుర్తింపు సంఘాల నేతలతో సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. ఈ మేరకు ఆయా సంఘాల ఐక్యవేదిక కూడా ప్రకటించింది. చర్చలు విఫలమైన నేపథ్యంలో.. ఈనెల 21న ఉమ్మడి జిల్లాల డీఈఓ కార్యాలయాల ముట్టడి యథాతథంగా కొనసాగుతుందని ఐక్యవేదిక నేతలు మీడియాకు వెల్లడించారు. నిజానికి.. విద్యారంగ సంస్కరణల పేరుతో ప్రభుత్వ విద్యారంగాన్ని సర్కారు బలహీనపరచడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.దీంతో.. ఉపాధ్యాయుల సర్దుబాటు, పాఠశాలల రేషనలైజేషన్, ఉపాధ్యాయుల బదిలీ చట్టంలోని పలు అంశాలపై సోమవారం గుంటూరు జిల్లా ఆత్మకూరులోని విద్యాభవన్లో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ చర్చల్లో మొత్తం 19 డిమాండ్లను విద్యాశాఖ ముందుంచామని.. కొన్ని అంశాలపైనే సానుకూల స్పందన వచ్చిందని.. కీలక అంశమైన ఇంగ్లిష్కు సమాంతరంగా తెలుగు, ఇతర మైనర్ మీడియంలను కొనసాగించి స్టాఫ్ పాటర్న్ను కొనసాగించాలన్న డిమాండ్ను అంగీకరించలేదని నేతలు తెలిపారు. ఉన్నత పాఠశాలల్లో 1 : 35 నిష్పత్తిని అమలుచేయాలని.. 45 మంది విద్యార్థులు దాటాక రెండో సెక్షన్ ఏర్పాటుపైనా స్పష్టత రాలేదన్నారు.అలాగే.. మోడల్ ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలుగా స్కూల్ అసిస్టెంట్లను నియమించడం అశాస్త్రీయమైందని వారన్నారు. ఫౌండేషన్ స్కూళ్లల్లో 1 : 20 నిష్పత్తిలో ఉపాధ్యాయుల కేటాయింపునకు చర్చల్లో అంగీకరించారని, అయితే ఇది జీఓ–117లో ఉన్న అంశమేనన్నారు. ఇక స్టడీ లీవ్లో ఉండి రెండు నెలల్లో సర్వీసులో చేరే ఉపాధ్యాయుల పోస్టులను బదిలీల్లో ఖాళీగా చూపబోమని చెప్పడం.. కేవలం 1,400 మంది ఎస్జీటీలకు మాత్రమే పదోన్నతులిచ్చి హెచ్ఎంలుగా నియమిస్తామడంలో అర్థంలేదని నేతలు తెలిపారు. మరోవైపు.. ఉపాధ్యాయ బదిలీల చట్టం ఇప్పటికే రావడంతో అందులో మార్పులు సాధ్యంకాదని అధికారులు తేల్చిచెప్పడంతో ఉపాధ్యాయులు గతంలో ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ ప్రకారం ఈనెల 21న డీఈఓ కార్యాలయల ముట్టడికి సిన్నద్ధమవుతున్నారు.మంత్రి జోక్యం చేసుకోవాలి..ఇదిలా ఉంటే.. ఉపాధ్యాయ బదిలీలు, పాఠశాలలు పునర్వ్యవస్థీకరణపై ఉపాధ్యాయ సంఘాలతో సోమవారం జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి విద్యాశాఖ మంత్రి లోకేశ్ జోక్యం చేసుకోవాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీవీ ప్రసాద్, రాధాకృష్ణ కోరారు. -
‘రేపటి ఎన్నికైనా సజావుగా జరపండి’
విజయవాడ: టీడీపీ నేతలు అరాచకం సృష్టించిన కారణంగానే తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా. పడిందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ధ్వజమెత్తారు. ఎన్నిక జరగకుండా ఉండటానికి టీడీపీ నేతలు చేసిన అరాచకం అంతా ఇంతా కాదన్నారు. ‘ఎన్నిక జరగకుండా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి హల్చల్ చేశారు. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరించారు. 20 మంది సభ్యులున్న కౌన్సిల్ లో వైఎస్సార్సీపీ 17, టీడీపీ 3 గెలిచింది. ఉప ఎన్నిక నేపథ్యంలో వైఎస్సార్సీపీ అభ్యర్థినే గెలిపించాలనే వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు నిర్ణయించుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, టీడీపీ గూండాలు గుంపులుగా వచ్చారు. మా పై దాడిచేసేందుకు టిడిపి నేతలకు పోలీసులు మద్దతిచ్చారు. మా పార్టీకి చెందిన 1వ వార్డు కౌన్సిలర్ నిర్మలను పోలీసులే కిడ్నాప్ చేశారు. ఇంతకంటే నీచంగా దేశంలో ఏ రాజకీయ పార్టీ వ్యవహరించదు. స్వచ్ఛంధంగా వైఎస్సార్సీపీకే మద్దతిస్తున్నానని చెప్పినా నిర్మలను లాక్కెళ్లారుఛైర్మన్ పదవి కోసం చంద్రబాబు దగ్గర్నుంచి టిడిపి ఎమ్మెల్యే వరకూ అందరూ దిగజారిపోయారు. ఛైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా వేశారు. రేపటి ఎన్నిక సజావుగా జరపాలని ఎన్నికల కమిషనర్ ను కోరాం. రేపు మా కౌన్సిలర్లకు భద్రత కల్పించమని కోరాం. రేపు తిరువూరులో రెడ్ బుక్ రాజ్యాంగం కాకుండా అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందని ఆశిస్తున్నాం’ అని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. తిరువూరులో ప్రజాస్వామ్యం ఖూనీతిరువూరులో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందన్నారు మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ‘టీడీపీ బరిలోని నిలిపిన చైర్మన్ అభ్యర్థి కూడా ఆ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. పోలీసులు ఖాకీ దుస్తుల బదులు .. పచ్చ దుస్తులు వేసుకున్నారు. మా కౌన్సిలర్ ను లాక్కెళ్లి...ఆమె మెడలోని వైఎస్సార్సీపీ కండువాను తీసి చెట్లలో పడేశారు. ఎన్టీఆర్ జిల్లాలో అసలు పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా అని పోలీస్ కమిషనర్ ను ప్రశ్నిస్తున్నాంతిరువూరులో జరిగిన విషయాలు తెలుసుకుని కమిషనర్ ఆశ్చర్యపోయారు. పోలీసులు టిడిపి తొత్తుల్లా పనిచేయడం బాధాకరం. రక్షణ కల్పించాల్సిన పోలీసులు...ఎంపీ ,ఎమ్మెల్యేకు అమ్ముడుపోయారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా వైఎస్సార్సీపీ అండగా నిలిచిన మా కౌన్సిలర్లను అభినందిస్తున్నాం. రేపు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి’ అని పేర్కొన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. -
రేపు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి : రేపు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ కానున్నారు.మంగళవారం (మే 20)న జరగనున్న ఈ సమావేశంలో రామచంద్రాపురం, పార్వతీపురం మున్సిపాలిటీలతో పాటు, రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పోరేటర్లు పాల్గొననున్నారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు సహా అనేక అంశాలపై స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. -
పల్నాడులో అరాచకం .. సాక్షి జర్నలిస్ట్పై టీడీపీ గూండాల దాడి
పల్నాడు: కారంపూడిలో టీడీపీ నేతలు రౌడీయిజానికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా సాక్షి ప్రతినిధి అశోక్ వర్థన్పై దాడి చేశారు. అశోక్ వర్థన్పై పిడిగుద్దులతో విచక్షణారహితంగా దాడి దిగారు. కారంపూడి వైస్ ఎంపీపీ ఉప ఎన్నికకు వెళ్లకుండా వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను టీడీపీ గుండాలు అడ్డుకున్నాయి. అయితే టీడీపీ గూండాల దాడిని చిత్రీకరించేందుకు సాక్షి జర్నలిస్ట్ అశోక్వర్థన్ కవరేజ్కు వెళ్లారు. కవరేజ్కు వెళ్లిన సాక్షి ప్రతినిధి అశోక్ వర్థన్పై టీడీపీ గూండాలు దాడి చేశాయి. దాడి చేసిన గూండాల్లో పంగులూరి అంజయ్య, చెప్పిడి రాము,గొల్ల సురేష్ యాదవ్,గోరంట్ల నాగేశ్వరరావు, తదితరులు ఉన్నట్లు తేలింది. -
‘మహిళలకు ఫ్రీ బస్సు పథకానికి ముహూర్తం ఏంటి?’
విశాఖ : ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటివరకూ ఆ పథకం ప్రస్తావన తీసుకురాకపోవడంపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ అమలు చేయడానికి ముహూర్తం ఏమిటని ప్రశ్నించారు. మహిళలకు హామీ ఇచ్చిన మేరకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చెయ్యాలని వైఎస్సార్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నామని బొత్స తెలిపారు.ఈరోజు( సోమవారం) విశాఖ నుంచి ప్రెస్ మీట్ లో మాట్లాడిన బొత్స.. ‘ తల్లికి వందనం ఇస్తారో ఇవ్వరో తెలియదు. ఆడబిడ్డ నిధి పథకం అమలుకు p4కి సంబంధం ఏమిటి?, p4 కి పథకాలకు లింక్ పెట్టడం ఏమిటి..? , లబ్ధిదారులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది. ఈ పథకం అమలు చేయనట్టేనా.. ఆడ బిడ్డ నిధి పథకంపై కూటమి నేతలు స్పందించాలి. ఇస్తారో ఇవ్వరో కూటమి ప్రభుత్వం చెప్పాలి. రాష్ట్రంలో మహిళలు అందరూ ఆలోచించాలి. ప్రభుత్వ డొంక తిరుగుడు వ్యవహారాన్ని గమనించాలి. ఆడ బిడ్డ నిధి పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలి. లేదంటే మహిళలను మోసం చేసిన వారు అవుతారు. విశాఖ ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉన్నారు. 6 నెలలుగా జీవీఎంసీ కమిషనర్ లేరు.కీలకమైన జీవీఎంసీ కమిషనర్ స్థానాన్ని భర్తీ చేయకపోవడం దురదృష్టం. కూటమి ప్రభుత్వానికి అధికారం, దోచుకోవడం మాత్రమే అవసరం. కూటమి పార్టీల మధ్య సంఖ్యత లేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని దోపిడీ చేసే ఆలోచనే తప్ప ప్రజా సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టవు. పోలీసులను అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగం చేస్తుంది. కూటమి ప్రభుత్వం ప్రజా స్వామ్యాన్ని అబాసూపాలు చేస్తుంది. ఏడాది పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి. అన్ని వ్యవస్థలను ప్రభుత్వం చేతిలో పెట్టుకుని చట్టాన్ని చుట్టంగా చేసుకున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళలు నష్టపోతారు. ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం తరువాత మోసం చెయ్యడం బాబుకి అలవాటే’ అని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. -
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన
విశాఖ : రానున్న వారం రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణం కేంద్ర స్పష్టం చేసింది. ప్రధానంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. రాగల 24 గంట్లలో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఇక బాపల్ల, నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో గంటలకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. -
జనసేనకు కీలక పదవి.. టీడీపీ నేతలు ఆగ్రహం
సాక్షి, విశాఖ: విశాఖ డిప్యూటీ మేయర్ ఎంపిక విషయమై కూటమిలో ట్విస్ట్ చోటుచేసుకుంది. డిప్యూటీ మేయర్ ఎంపిక కూటమిలో చిచ్చు రాజేసింది. జనసేనకు డిప్యూటీ మేయర్ కేటాయింపుపై టీడీపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో, పలువురు టీడీపీ నేతలు ఎన్నికకు హాజరు కాకపోవడంతో డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది.వివరాల ప్రకారం.. విశాఖ డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించడంపై పచ్చ పార్టీ నేతలు మండిపడుతున్నారు. జనసేనకు చెందిన డల్లి గోవింద రెడ్డికి డిప్యూటీ మేయర్ అవకాశం ఇవ్వడంపై టీడీపీ నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఈరోజు జరిగిన సమన్వయ సమావేశం నుంచి కాపు, యాదవ సామాజిక వర్గాలకు చెందిన కార్పొరేటర్లు అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు.డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఈ వర్గానికి చెందిన కార్పొరేటర్లు హాజరుకాలేదు. కోరం సరిపడకపోవడంతో ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. డిప్యూటీ మేయర్ ఎన్నికకు కావలసిన సంఖ్యాబలం 56 కావాల్సి ఉండగా.. 54 మంది హాజరయ్యారు. దీంతో, ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో అలకబూనిన కౌన్సిలర్లతో టీడీపీ హైకమాండ్ చర్చించే అవకాశం ఉంది. మరోవైపు.. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ సతీష్ మాట్లాడుతూ..‘అధికార దాహంతో జీవీఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ను పదవి నుంచి దింపేశారు. నగర అభివృద్ధిపై కూటమికి చిత్తశుద్ధి లేదు. కూటమి నేతల మధ్య సమన్వయ లోపం ఉంది. డిప్యూటీ మేయర్ ఎన్నికకు కోరం సభ్యులు కూడా లేరు. మేము చేసిన అభివృద్ధిని కూటమి ఖాతాలో వేసుకుంటుంది. రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. సామాజిక వర్గాల వారీగా జీవీఎంసీ కార్పొరేటర్లు విడిపోయారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు అంతా ఒకే మాట మీద ఉన్నాం’ అని అన్నారు. -
వైఎస్సార్సీపీదే విజయం.. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఏకగ్రీవం
సాక్షి, కర్నూలు: కర్నూలులో కూటమి కుట్రలను పటాపంచలు చేశారు వైఎస్సార్సీపీ నేతలు. ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాన్ని వైఎస్సార్సీపీ నిలబెట్టుకుంది. ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్గా సీహెచ్ లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.వివరాల ప్రకారం.. ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలో కూటమి కుట్రలు ఫలించలేదు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్గా వైఎస్సార్సీపీ సీహెచ్ లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమి నేతల ప్రలోభాలకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు తలొగ్గలేదు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్పై నమ్మకంతో కౌన్సిలర్లు లోకేశ్వరికి అండగా నిలిచారు. దీంతో, ఎన్నికల అధికారి సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్.. లోకేశ్వరి ఏకగీవ్రంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా..మరోవైపు.. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. మండల పరిషత్ అధ్యక్షురాలుగా ఇనుకొండ ధనలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రి రామానాయుడు ఇలాకలో నాటకీయ పరిణామాల మధ్య ఎంపీపీ స్థానాన్ని వైఎస్సార్సీపీ దక్కించుకుంది. కూటమి నేతల కుట్రలకు, ప్రలోభాలకు వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు లొంగలేదు. వైఎస్సార్సీపీకి చెందిన 12 మంది ఎంపీటీసీ సభ్యులతో పూర్తి మెజార్టీతో ఏకగ్రీవంగా ధనలక్ష్మి ఎన్నికయ్యారు.శ్రీ సత్యసాయి జిల్లా..రామగిరి ఎంపీపీ ఎన్నికలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. రామగిరి ఎంపీపీ స్థానం మహిళకు రిజర్వ్ కావడంతో టీడీపీకి మహిళా ఎంపీటీసీల మద్దతు దొరకలేదు. రామగిరిలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వైఎస్సార్సీపీకి-8, టీడీపీకి-1 స్థానాలు ఉన్నాయి. ఒక్క స్థానం ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రలోభాలతో ఇద్దరు వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను టీడీపీ పార్టీలో చేర్చుకుంది. మరోవైపు.. టీడీపీలో చేరడం ఇష్టంలేక పేరూర్ ఎంపీటీసీ భారతి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈరోజు జరిగిన రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక జరగ్గా.. ముగ్గురు పురుష ఎంపీటీసీలు హాజరయ్యారు. మహిళా ఎంపీటీసీల నుంచి నామినేషన్ రాకపోవడంతో రామగిరి ఎంపీపీ ఎన్నిక నిరవధికంగా వాయిదా పడింది. రామగిరి ఎంపీపీ ఎన్నికలను వైఎస్సార్సీపీ బహిష్కరించింది. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రలోభాలకు మహిళా ఎంపీటీసీలు లొంగలేదు. -
కలెక్టర్ చెబితే వినాలా..?
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రి లోని న్యూట్రీషినల్ రీహాబిలిటేషన్ సెంటర్(ఎన్ఆర్ సీ)లో తీరు మారడం లేదు. ‘చిన్నారులకు అందించే డైట్పై నిర్లక్ష్యం చేయకూడదు’ అని ఇటీవల సాక్షాత్తు కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ స్పష్టమైన ఆదేశాలిచ్చినా పెడచెవిన పెట్టడం విమర్శలకు తావిస్తోంది. ఇక్కడ ఆకలితో అలమటిస్తున్న పిల్లలను చూస్తే అయ్యో అంటూ జాలిపడాల్సిందే. ఆరోగ్య శాఖ.. సర్వజనాస్పత్రి అధికారుల బాధ్యతారాహిత్యం చిన్నారులకు శాపంగా మారింది. గ్లాసు పాల కోసం మూడు నాలుగు గంటలపాటు వేచి ఉండాల్సి వస్తోంది. ఇక.. ఎన్ఆర్సీలో వంట మనిషి లేకపోవడంతో రోజూ ఉదయం, మధ్యాహ్నం పాయసంతోనే అల్పాహారాన్ని సరిపెడుతున్నట్లు తెలిసింది. ఇదిగో సాక్ష్యం.. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న తన ఇద్దరు బిడ్డలను (ఒకరు మూడేళ్లు, ఒకరికి 7 నెలలు) తాడిపత్రికి చెందిన శ్రావణి ఎన్ఆర్సీలో చేర్చింది. ఈ పిల్లలకు ఉదయం 6 గంటలకే ఎన్ఆర్సీలో సిబ్బంది పాలు పంపిణీ చేయాలి. కానీ ఆదివారం 9 గంటలైనా ఇవ్వలేదు. దీంతో పిల్లలు కడుపు కాలి ఏడుస్తుండటంతో చేసేదిలేక శ్రావణి ఆస్పత్రి బయట ఇడ్లీ తీసుకుని వచ్చి వారి పొట్ట నింపింది. మరో మహిళ కూడా తన బిడ్డ బాధను చూసి తట్టుకోలేక బయట తోపుడు బండ్లపై దోసె తీసుకువచ్చి ఆకలి తీర్చింది. ఇటీవల ‘సాక్షి’లో ‘చిన్నారుల ఆకలి కేకలు’ శీర్షికన కథనం ప్రచురితం కాగా.. ఆ మరుసటి రోజు వైద్య ఆరోగ్యశాఖాధికారులు, సర్వజనాస్పత్రి అధికారులు ఎన్ఆర్సీకి వచ్చి హడావుడి చేశారు. ఆ తర్వాత నుంచి షరామామూలుగానే పరిస్థితి తయారైంది. రెండు రోజులు సర్దుకో.. ‘ఎన్ఆర్సీలో ఉంటే మంచి తిండి పెడతారని చెప్పారు. కానీ ఇక్కడేమో ఆ పరిస్థితి కనిపించడం లేదు సార్’ అంటూ ఓ వృద్ధురాలు ఇటీవల డ్యూటీ వైద్యున్ని ప్రశ్నించగా.. సదరు వైద్యుడు ‘రెండు రోజులు సర్దుకొండహే’ అంటూ నిర్లక్ష్య సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. వాస్తవంగా అతను విధులకు ఎప్పుడూ గైర్హాజరవుతుంటాడని, కళ్యాణదుర్గం బైపాస్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తుంటాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. న్యూట్రీషియన్లు సౌజన్య, పల్లవి కూడా విధులకు తరచూ డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలున్నాయి. గతంలోనూ ఓ న్యూట్రీíÙయన్ సెలవులో వెళ్లి, జీతం మాత్రం తీసుకున్నట్లు తెల్సింది. రూ.లక్షలు జీతాలు తీసుకుంటూ చిన్నారుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్న వారిపై కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
బోల్తా కొట్టిన ఎల్లోపిట్ట!
ఎల్లో మీడియా శోకాలు పెడుతోంది. అరచి గీపెట్టి మరీ రోదిస్తోంది. దాని బాధల్లా ఒకటే.. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఆదాయం బాగానే ఉన్నా సాక్షి మీడియా దాన్ని తక్కువగా చేసి రాసిందీ అని! జగన్ ప్రభుత్వంలో కంటే ఆదాయం ఇప్పుడు ఎక్కువే ఉంటే ఆ మాట నేరుగా చంద్రబాబే ఢంకా బజాయించి మరీ చెప్పుకునేవాడు. ఆయన ఆ పని చేయలేదు కానీ.. ఆయన తరఫున ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ మాత్రం తెగ బాధపడిపోతున్నారు. ఆయనగారి పత్రికలో ఈ మధ్యే ‘సంపదపై శోకాలు’ అంటూ ‘జగన్ పత్రిక రోత రాతలు’ అన్న శీర్షికతో ఒక కథనం ప్రచురితమైంది.పచ్చి అబద్ధాలతో నిండిన ఇలాంటి కథనాలు నిత్యం వండి వారుస్తున్నందుకే.. వైసీపీ నేతలు.. సామాన్యులు చాలా మంది ఈ పత్రికను చంద్రజ్యోతిగాను, బూతు పత్రికగాను విమర్శిస్తుంటారు.రాధాకృష్ణ కాని, ఆయన సంపాదక బృందం కాని ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెబితే అందరం ఆయన కథనాలు సరైనవేనని ఒప్పేసుకుందాం. ఆ ప్రశ్న ఏమిటంటే... ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిందేమి? ఆ తరువాత ఏడాది కాలంలో ఆయన చేసిందేమిటి? ‘‘అప్పులు చేయబోను’’, ‘‘సంపద సృష్టి నాకు తెలుసు’’, ‘‘సూపర్ సిక్స్తోపాటు ఎన్నికల హామీలన్నీ అమలు చేసి చూపిస్తా’’ అని ఎన్నికల ముందుకు ఒకటికి పదిసార్లు హామీ ఇచ్చిన ఆ పెద్దమనిషి అధికారంలోకి వచ్చిన తరువాత.. ‘‘గల్లా పెట్టె ఖాళీగా కనబడుస్తా ఉంది’’, ‘‘అప్పులు పుట్టడం లేదు’’ ‘‘సంపద సృష్టించే మార్గముంటే చెవిలో చెప్పండి’’. ‘‘అప్పులు చేసి సంక్షేమానికి ఖర్చు చేయలేను’’ అని ప్లేటు ఫిరాయించిన విషయం తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయాలే. రాధాకృష్ణ భాషలో వీటిని శోకాలు అంటారా? లేదా? ఆయన రాసినట్లే చంద్రబాబు హయాంలో ఆదాయం ఎక్కువ ఉందని కాసేపు అనుకుందాం. అలాంటప్పుడు చంద్రబాబు ఖజానా ఖాళీగా కనబడుతోంది అని ఎందుకు అన్నట్టు? పైగా.. అప్పుల కోసం ఏకంగా ఖజానానే తనఖా పెట్టి చరిత్ర సృష్టించడం ఎందుకు? అప్పులు పుట్టడం లేదన్న బాబు మాట కూడా నిజమే అయితే ఏడాది కాలంలో రూ.1.5 లక్షల కోట్ల రుణం చేసిన రికార్డు మాటేమిటి? జగన్ హయాంలో ఆదాయం తక్కువగా ఉందనుకున్నా.. సంక్షేమ పథకాలన్నీ ఐదేళ్లూ చక్కగా అమలు చేశారు కదా? దానికి సమాధానం ఏమిటి? ఓడరేవులు, మెడికల్ కాలేజీలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, పాఠశాలల్లో ‘నాడు-నేడు’’ ఇలా బోలెడంత అభివృద్ధినికి ప్రజల కళ్లముందే నిలిపారు కదా? అయినా సరే.. జగన్ ఎప్పుడు బీద అరుపులు అరవలేదే? ఒకపక్క చంద్రబాబేమో ఖజానా ఖాళీ అంటారు.. ఇంకోపక్క రాధాకృష్ణ ఆదాయం భేష్ అంటారు. ఏది నిజం? ఈ ప్రశ్నకు సమాధానం కాగ్ లెక్కల్లో వెతుకుదాం.. జగన్ పాలన చివరి ఏడాది రాష్ట్ర రెవెన్యూ రాబడులు మొత్తం సుమారు రూ.1.74 లక్షల కోట్లు. ఆ తరువాత చంద్రబాబు (Chandrababu) పాలనలో తొలి ఏడాది (2024-2025) రూ.1.68 లక్షల కోట్లు! అయితే... ఆంధ్రజ్యోతి 2014-15కు సంబంధించిన రెవెన్యూ లోటు మొత్తాన్ని కేంద్రం 2023-24లో ఇవ్వడం వల్ల జగన్ హయాంలోని ఆదాయం ఎక్కువగా కనిపిస్తోందని అంటోంది. ఇదే నిజం అనుకుందాం. అప్పుడు కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను సమర్థంగా రాబట్టడంలో జగన్ ప్రభుత్వం విజయం సాధించినట్లే అవుతుంది కదా? ఐదేళ్లు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా పది వేల కోట్ల రూపాయల మొత్తం కూడా కేంద్రం నుంచి రాబట్టుకోలేని అసహాయ స్థితిలో చంద్రబాబు ఉన్నట్లు రాధాకృష్ణ ఒప్పుకున్నట్లేనా? జగన్ ప్రభుత్వం 12వ ఆర్థిక సంఘం నిధులను కూడా రాబట్టుకుందని ఆంధ్రజ్యోతి చెబుతోంది. ఇది కూడా జగన్ గొప్పదనమే అవుతుంది కదా! ఈ స్థాయిలో కేంద్రం నుంచి చంద్రబాబు నిధులు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? ఈ రెండింటినీ మినహాయిస్తే జగన్ హయాం చివరి ఏడాది వచ్చిన రాబడి రూ.1.61 లక్షల కోట్లేనని, చంద్రబాబు తన తొలి ఏడాదిలో ఆదాయం రూ.1.68 లక్షల కోట్లు అని ఈ పత్రిక తెలిపింది.అలాంటప్పుడు చంద్రబాబు పదే, పదే ఎందుకు డబ్బులు లేవని వాపోతున్నారు? రూ.1.5 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారు? ఈ మొత్తాన్ని ఎందుకోసం ఖర్చు చేశారు? జగన్ టైమ్ నాటికన్నా పదివేల కోట్లు ఎక్కువగా పన్ను ఆదాయం చంద్రబాబు ప్రభుత్వం పొందిందని ఎల్లో మీడియా చెబుతోంది. ఇదే నిజమైతే బాబు బీద అరుపుల మతలబు ఏమిటి? జీఎస్టీ వసూళ్లు రూ.2850 కోట్లు, ఎక్సైజ్ ఆదాయం రూ.3900 కోట్లు, కేంద్ర పన్నుల వాట రూ.ఐదు వేల కోట్ల మేర ఎక్కువ వచ్చిందని ఈ పత్రిక రాసింది. ఇంత భారీ ఎత్తున ఆదాయం వచ్చినా ఎందుకు ఒక్క స్కీమ్ అమలు చేయడం లేదు?జగన్ ప్రభుత్వం చివరి సంవత్సరంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రూ.9542 కోట్లు వచ్చినట్లు కాగ్ లెక్కలు చెబుతున్నాయి. చంద్రబాబు పాలనలో తొలి ఏడాది ఈ మొత్తం రూ.8837 కోట్లే! దీని అర్థం బాబు హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గినట్లే కదా? అమ్మకం పన్ను, పన్నేతర ఆదాయం మొదలైన వాటి పరిస్థితి కూడా ఇలాగే ఉందని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. జగన్ హయాంతో పోలిస్తే ఇప్పుడు రెవెన్యూ, ద్రవ్య లోటులు రెండూ సుమారు రూ.20 వేల కోట్లు ఎక్కువన్నది కూడా వాస్తవమే కదా? రాధాకృష్ణ ఏదో మసిపూసి మారేడుకాయ చేద్దామని ప్రయత్నించి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా ఉంది. ఆయన రాసింది వాస్తవమైతే చంద్రబాబు అబద్దాలు చెబుతున్నట్లు అవుతుంది. పైగా ఆదాయం బాగున్నా.. రూ.1.5 లక్షల కోట్లు అప్పు తెచ్చినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేవీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేసినట్టు అవుతుంది. ఖజానా ఖాళీ అన్న చంద్రబాబు మాటలు నిజమైతే ఈ జాకీ పత్రిక రాసింది అవాస్తవమని అంగీకరించవలసి ఉంటుంది. ఏతావాతా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ శోకాలకు చంద్రబాబు సర్కారే బద్నాం అయ్యింది. కూటమి ప్రభుత్వానికి భజన చేద్దామని అనుకుని ఇలాంటి పిచ్చి రాతలు రాసి చంద్రబాబునే డిఫెన్స్ లో నెట్టేసినట్లయింది. ఆ విషయం అర్థమైందా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చిట్టి తల్లి.. బుజ్జి కన్నా.!
విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూ పార్కులో వన్యప్రాణుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల జూలో ఇండియన్ తోడేలు, బెంగాల్ నక్క, మడగాస్కర్ ప్రాంతానికి చెందిన లెమూర్ ఒక్కో పిల్లకు జన్మనిచ్చాయి. ఈ మూడు పిల్లలు జూ వైద్యులు, సిబ్బంది సంరక్షణలో ఆరోగ్యంగా ఉన్నాయని జూ క్యూరేటర్ జి.మంగమ్మ వెల్లడించారు.అంతరించిపోతున్న జాబితాలో ఉన్న తోడేళ్లు జూలో సంతానోత్పత్తి చేయడం శుభసూచికమని క్యూరేటర్ పేర్కొన్నారు. కాగా, ఇక్కడ సంతానోత్పత్తి చేసిన తోడేళ్లను 2019లో మైసూరు జూ పార్కు నుంచి, బెంగాల్ నక్కలను 2021లో ఢిల్లీ జూ నుంచి తీసుకువచ్చినట్లు ఆమె తెలిపారు. ఇక లెమూర్లను సుమారు పదేళ్ల కిందట ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చామని వివరించారు. ప్రస్తుతం జూలో ఈ కొత్త పిల్లలతో కలిపి మొత్తం 8 ఇండియన్ తోడేళ్లు, 15 రింగ్టైల్డ్ లెమూర్స్, 4 బెంగాల్ నక్కలు ఉన్నాయని క్యూరేటర్ తెలిపారు. -
తిరువూరులో ఉద్రిక్తత.. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా
తిరువూరులో ఎన్నిక అప్డేట్.. విజయవాడ:ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్👉తిరువూరు మున్సిపాల్టీ ఛైర్ పర్సన్ ఎన్నికల్లో పోలీసులు టిడిపి కార్యకర్తల్లా వ్యవహరించారు👉20 మంది సభ్యులున్న కౌన్సిల్ లో వైఎస్సార్సీపీ 17 , టిడిపి 3 గెలిచింది👉ఉపఎన్నిక నేపధ్యంలోవైఎస్సార్సీపీ అభ్యర్ధినే గెలిపించాలనివైఎస్సార్సీపీ కౌన్సిలర్లు నిర్ణయించుకున్నారు👉టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్,టిడిపి గూండాలు గుంపులుగా వచ్చారు👉మా పై దాడిచేసేందుకు టిడిపి నేతలకు పోలీసులు మద్దతిచ్చారు👉మా పార్టీకి చెందిన 1వ వార్డు కౌన్సిలర్ నిర్మలను పోలీసులే కిడ్నాప్ చేశారు👉ఇంతకంటే నీచంగా దేశంలో ఏ రాజకీయ పార్టీ వ్యవహరించదు👉స్వచ్ఛంధంగా వైఎస్సార్సీపీకి మద్దతిస్తున్నానని చెప్పినా నిర్మలను లాక్కెళ్లారు👉ఛైర్మన్ పదవి కోసం చంద్రబాబు దగ్గర్నుంచి టిడిపి ఎమ్మెల్యే వరకూ అందరూ దిగజారిపోయారు👉ఛైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా వేశారు👉రేపటి ఎన్నిక సజావుగా జరపాలని ఎన్నికల కమిషనర్ ను కోరాం👉రేపు మా కౌన్సిలర్లకు భద్రత కల్పించమని కోరాం 👉కూటమి కుట్రలతో తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా. 👉వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసిన కూటమి నేతలు. పోలీసులు సమక్షంలోనే వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై టీడీపీ మూకల దాడులు. ఎన్నిక జరగకుండా కూటమి నేతల వ్యూహం. అల్లర్లు సృష్టించిన పచ్చ నేతలు👉తిరువూరులో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. ఎన్నిక జరగకుండా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి హల్చల్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఎన్నికలకు హాజరుకాకుండా దాడికి యత్నం చేశారు. టీడీపీ కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే రెచ్చిపోయి దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై చెప్పులు విసిరి, బాటిళ్లు విసురుతూ టీడీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. 👉తిరువూరులో పోలీసులు, టీడీపీ దౌర్జన్యానికి నిరసనగా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు రోడ్డుపై భైఠాయించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.👉టీడీపీ కార్యకర్తల దౌర్జన్యాన్ని చోద్యం చూస్తూ పోలీసులు అక్కడే నిలబడ్డారు. ఎన్నికలు జరగకుండా టీడీపీ నేతల వ్యూహానికి పోలీసులు సహకరిస్తున్నారు. రౌడీయిజం చేస్తున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టలేదు. బలం లేకపోయినా రౌడీయిజంతో గెలవడానికి టీడీపీ అల్లర్లు. తిరువూరులో టీడీపీ ఉద్రిక్తత సృష్టిస్తోంది.👉తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఓవరాక్షన్కు దిగారు. ఎమ్మెల్యే, టీడీపీ శ్రేణులు బారికేడ్లు తోసుకుని, పోలీసులను నెట్టుకుంటూ మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేతలు, పార్టీ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు.👉తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ హల్చల్ చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ వైఎస్సార్సీపీ నేతలను మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లకుండా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో బారికేడ్లు తోసుకుని, పోలీసులను నెట్టుకుంటూ కొలికపూడి, టీడీపీ నేతలు మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకున్నప్పటికీ వారినే బెదిరిస్తూ లోపలికి దూసుకెళ్లారు. దీంతో, వాగ్వాదం జరిగింది.👉మరోవైపు.. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు మద్దతుగా పార్టీ నేతలు దేవినేని అవినాష్, మొండితోక అరుణ్ కుమార్, నల్లగట్ల స్వామిదాస్, షేక్ ఆసిఫ్ తిరువూరు చేరుకున్నారు. ఇదిలా ఉండగా.. నేడు.. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఎన్నికల కోసం బలం లేకపోయినా గెలవాలని కూటమి కుట్రలు చేస్తోంది. మరోవైపు.. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. తిరువూరు వెళ్లొద్దంటూ వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. -
ఏపీలో నంది అవార్డులు ప్రకటిస్తాం: మంత్రి
ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డులను ప్రకటిస్తామని ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ఏలూరులో జరిగిన భైరవం సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ మాదిరిగానే విశాఖను అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. అక్కడ స్టూడియోల నిర్మాణంతో పాటు డబ్బింగ్, రీరికార్డింగ్ వంటి థియేటర్లు నిర్మించడానికి ప్రభుత్వం నుంచి ఒక కొత్త పాలసీ తెచ్చే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. కొద్దిరోజుల్లో సినిమా పరిశ్రమకు చెందిన పలు నిర్మాతలు, దర్శకులు, నటీనటులతో ఏపీ ప్రభుత్వం ఒక సమావేశం ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. ఆ సమయంలో చిత్రపరిశ్రమ అభివృద్ధి, నంది అవార్డుల గురించి చర్చిస్తామని తెలిపారు. రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం సినీ రంగ ప్రముఖులకు ఇచ్చేందుకు గద్దర్ అవార్డులను ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసింది. వారు నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను చేర్చారు. కొద్దిరోజుల క్రితం పలు సినిమాల నుంచి నామినేషన్స్ కూడా తీసుకున్నారు. -
తమ్ముడి మృతితో ఆగిన అక్క పెళ్లి
ఆలూరు రూరల్(కర్నూలు): అందరూ వివాహ వేడుకల్లో ఆనందంగా ఉన్నారు. మరి కొద్ది గంటల్లో కల్యాణ తంతు నిర్వహించాల్సి ఉంది. ఇంతలోనే విషాదం. వధువు తమ్ముడు రోడ్డు ప్రమా దంలో దుర్మరణం చెందడంతో అక్క వివాహం నిలిచిపోయింది. శనివారం రాత్రి హుళేబీడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆస్పరికి చెందిన ఆనంద్ (19) మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో అతని స్నేహితులు పూర్ణచంద్ర, తిమ్మప్ప తీవ్రంగా గాయపడ్డారు. ఆదోని ఆస్పత్రిలో పూర్ణచంద్ర, కర్నూలు ఆస్పత్రిలో తిమ్మప్ప చికిత్స పొందుతున్నారు. ఆస్పరికి చెందిన తిమ్మన్న, శుకుంతల కుమారుడు ఆనంద్.. కాగా అతని సోదరి వివాహం హొళగుంద మండలం వందవాగిలి గ్రామంలో ఆదివారం ఉదయం జరగాల్సి ఉంది. ఆనంద్, పూర్ణచంద్ర, తిమ్మప్ప గుంటూరులోని ఆర్వీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. పూర్ణచంద్ర స్వగ్రామం ప్రకాశం జిల్లా కంభం గ్రామం కాగా తిమ్మప్పది ఆస్పరి మండలం చిగిళి గ్రామం. శనివారం రాత్రి ఆనంద్ సోదరి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు బైక్పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఆనంద్ మృతితో అతని సోదరి పెళ్లి ఆగిపోయింది. అక్క పెళ్లికి వచ్చి తమ్ముడి అంత్యక్రియలు చేయాల్సి వచ్చిందని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.ఎమ్మెల్యే పరామర్శ.. ఆనంద్ మృతి బాధాకరమని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. ఆదివారం ఆయన ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆనంద్ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
తిరువూరు ఎన్నిక.. వైఎస్సార్సీపీ నేతలు హౌస్ట్ అరెస్ట్
సాక్షి, ఎన్టీఆర్: నేడు తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఎన్నికల కోసం బలం లేకపోయినా గెలవాలని కూటమి కుట్రలు చేస్తోంది. మరోవైపు.. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. తిరువూరు వెళ్లొద్దంటూ వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు.వివరాల ప్రకారం.. తిరువూరు మున్సిపల్ చైర్మన్ రాజీనామా చేయడంతో నేడు చైర్మన్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలు తిరువూరు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. శాంతిభద్రతల సాకుతో వైఎస్సార్సీపీ నేతల ఇళ్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసి హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఎన్నికల్లో బలం లేకపోయినా గెలవాలని కూటమి కుట్రలు చేస్తోంది. కూటమి ప్రభుత్వ వైఖరి, పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ..‘తిరువూరులో బలం లేకపోయినా గెలవాలని చూస్తున్నారు. వైఎస్సార్సీపీకి 17 మంది కౌన్సిలర్ల బలం ఉంది. టీడీపీకి ఉన్నది కేవలం ముగ్గురు కౌన్సిలర్లు మాత్రమే. ముగ్గురు కౌన్సిలర్లతో ఏవిధంగా గెలవాలనుకుంటున్నారు. అధికార బలంతో మున్సిపాల్టీ, నగర పాలక సంస్థలను కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. ఎన్నికల్లో మీరు ఏం చెప్పి గెలిచారు. రాష్ట్రమంతా అభివృద్ధి చేస్తామని ఇప్పుడు మీరు చేస్తున్నదేంటి?. తిరువూరు వెళ్లొద్దని మా పై ఆంక్షలు పెట్టడమేంటి?. వెళితే అరెస్ట్ చేస్తామని వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారు. ఏపీలో పోలీసు రాజ్యం నడిపిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తిరువూరు వెళ్లి తీరుతాం. తిరువూరు మున్సిపాల్టీపై వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం’ అని అన్నారు. మరోవైపు.. సోమవారం ఉదయమే మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ..‘శాంతి భద్రతల సమస్యను సాకుగా చూపించి వైఎస్సార్సీపీ నేతలను హౌస్ అరెస్టు చేయటం కరెక్ట్ కాదు. రాజ్యాంగ హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాయటమే అవుతుంది. వైఎస్సార్సీపీకి 17 మంది కౌన్సిలర్ల మద్దతు ఉండగా తెలుగుదేశం పార్టీకి కేవలం ముగ్గురు కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని కూటమి ప్రభుత్వం తిరువూరు మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఫలితం మాత్రం శూన్యం’ అని అన్నారు. ఇక, వైఎస్సార్సీపీ తరఫున 17 మంది కౌన్సిలర్లు ఉండగా, టీడీపీ నుంచి ముగ్గురు గెలుపొందారు. ఎన్నికల్లో గెలించేందుకు బలం లేకపోయినప్పటికీ టీడీపీ కుట్రలకు పాల్పడుతోంది. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేస్తూ తమ వైపు తిప్పుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. -
మాటలకందని విషాదం
అమ్మా... అందరం కలిసి ఆడుకుంటామంటే సరే అన్నారు.. అదే పిల్లల చివరి మాట అని ఆ తల్లులకు తెలియదు.. అక్కడే మృత్యువు కాపుకాసి ఉందని గుర్తించలేకపోయారు.. మూడు గంటల పాటు పిల్లలు కనిపించకపోయే సరికి తల్లిడిల్లిపోయారు.. ఏమయ్యారో అంటూ ఊరంతా గాలించారు.. చివరకు కారులో ప్రాణవాయువు అందక విలవిల్లాడుతూ విగత జీవులుగా కనిపించిన పిల్లలను చూసి కుప్పకూలిపోయారు.విజయనగరం క్రైమ్: సమయం మధ్యాహ్నం 2 గంటలు.. గ్రామంలోని పెళ్లివేడుకలో పెద్దలు, ఆటపాటల్లో చిన్నారులు నిమగ్నమయ్యారు. ఆటలాడుతూ గ్రామ బీసీ కాలనీ నీళ్ల ట్యాంకు వద్ద ఉన్న కారులోకి నలుగురు చిన్నారులు వెళ్లారు. పొరపాటున డోర్లు వేయడంతో లాక్ అయ్యాయి. అంతే.. వారికి ప్రాణ వాయువు అందలేదు. కాపాడాలంటూ వారి ఆర్తనాదాలు బయటకు వినిపించలేదు. మూడుగంటల తర్వాత వెతుకుతూ వెళ్లిన పెద్దలకు కొనఊపిరితో కారులో కొట్టుమిట్టాడుతున్న చిన్నారులు కనిపించారు. డోర్లు బద్దలగొట్టి చిన్నారులను బయటకు తీసినా ఫలితం లేకపోయింది. చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కారు రూపంలో మృత్యువు కాటేసింది. ఈ ఘటనతో విజయనగరం సమీపంలోని ద్వారపూడిలో మృత్యుఘోష వినిపించింది. సర్వజన ఆస్పత్రి ప్రాంగణం శోకసంద్రంగా మారింది. మాటలకందని విషాదం అందరూ పదేళ్లలోపు పిల్లలే. కూలి పనులు చేసుకుంటూ తల్లిదండ్రులు వారిని అల్లారు ముద్దుగా సాకుతున్నారు. పిల్లలు ఆడుకుంటేంటే సంబర పడ్డారు. పెళ్లివేడుకలో బిజీ అయ్యారు. ఒకేసారి కారు రూపంలో కంది మణీశ్వరి (6), బూర్లె చారులత (7), పండి ఉదయ్ (7), బూర్లె జాస్రిత(8)ను మృత్యువు కాటేయడంతో కన్నీరుకార్చారు. విగతజీవులుగా మారిన చిన్నారులను పట్టుకుని బోరున విలపించారు. కడుపుకోత.. మృతిచెందిన చిన్నారుల్లో బూర్లె చారులత, జాస్రిత అక్కాచెల్లెళ్లు. వీరిద్దరూ ఒకే సారి మృతిచెందడంతో తల్లిదండ్రులు ఉమ, ఆనంద్లు విషాదంలో ముని గిపోయారు. దేవుడా.. కడుపుకోత మిగిల్చావా అంటూ విలపించారు. సర్వజన ఆస్పత్రి మార్చురీ వద్ద ఉన్న కుమార్తెల మృతదేహాలను చూసిన ఉమ ఓ దశలో సొమ్మసిల్లి పోయింది. ఉదయ్ తల్లిదండ్రులు బుచ్చిబాబు, భవానీ, మణీశ్వరి తల్లిదండ్రులు సురేష్ అరుణలు సైతం బిడ్డల మృతదేహాలను పట్టుకుని రోదించారు.ఇళ్ల మధ్యనే ఘటన... మృత్యువుకు కారణమైన కారు వీధిలో ఇళ్ల మధ్యనే ఉంది. దాని పక్కగుండానే అందరూ రాకపోకలు సాగించినా.. అందులో ఉన్న చిన్నారులను గుర్తించలేకపోయారు. వారి ఆర్తనాదాలను ఆలకించలేకపోయారు. కారు అద్దాలు నలుపువి కావడం కూడా దీనికి ఓ కారణంగా గ్రామస్తులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్, వన్టౌన్ ఎస్ఐ రామ్గణేష్లు హుటాహుటిన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సర్వజన ఆస్పత్రికి వచ్చి మృతుల వివరాలు సేకరించారు.కారు ఎవరిది? బీసీ కాలనీ నీళ్ల ట్యాంకు వద్ద ఆగి ఉన్న కారు ఎవరిది..? అక్కడే ఎందుకు పార్క్ చేశారు? డోర్కు లాక్ ఎందుకు వేయలేదు అన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ద్వారపూడిలో జరుగుతున్న పెళ్లి వేడుకకు సంబంధించి వైజాగ్ నుంచి ఆ కారు వచ్చినట్టు సమాచారం. కారు ఓనర్, డ్రైవర్ ఒక్కరేనని తెలిసింది. సంబంధిత వ్యక్తిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. -
గుడి సేవకులు.. దేవుడిచ్చిన బంధాలు
పల్లకీలోని అమ్మాయి పేరు హిమబిందు. తండ్రి ఆవులశెట్టి చంద్రశేఖరప్ప వస్త్ర దుకాణం నిర్వహిస్తుండగా, తల్లి లక్ష్మీదేవి గృహిణి. బీసీఏ పూర్తి చేసిన ఈమె ‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’ బృందంలో సభ్యురాలు. మూడేళ్లుగా తన వంతు సేవగా ఆలయాలను శుభ్రం చేస్తున్నారు. ఈ అమ్మాయి ఎదురొచ్చి టెంకాయ కొడితే కానీ ఆ బృందం బయలుదేరుతున్న బస్సు కదలదు. అంతటి సెంటిమెంట్. పల్లకీ మోస్తున్నారంటే వాళ్లు సొంత మేనమామలు అనుకుంటే పొరపాటు. గుడి సేవ బృందంలోని సభ్యులు ఎంచుకున్న తోవ ఇది. తమతో పాటు సేవలో పాల్గొనే అమ్మాయిల పెళ్లి సందర్భంగా ఈ ‘పల్లకీ సేవ’ ఇంటి మనుషులుగా సొంత ఖర్చుతో నిర్వహిస్తుండటం విశేషం. కర్నూలు కల్చరల్: అమ్మాయిని ఓ అయ్య చేతిలో పెట్టాలంటే తల్లిదండ్రులకు కంటి మీద కునుకు ఉండదు. పెళ్లి చూపులు మొదలు.. అప్పగింతల వరకు ఒకటే హడావుడి. కాంక్రీట్ వనాల్లో ఎవరికి వారుగా బతుకున్న రోజుల్లో బంధాలు, బంధుత్వాలు గుర్తుకు తెచ్చుకున్నా కళ్ల ముందు మెదలని పరిస్థితి. సొంతూళ్లకు దూరంగా, సప్త సముద్రాలకు అవతల ఉద్యోగాలు చేస్తున్న వారికి వరుసలు తెలియవు, ఉన్న ఊళ్లో ఎవరిని ఏమని పిలవాలో దిక్కుతోచదు. అలాంటిది పెళ్లి అనగానే.. తల్లిదండ్రుల గుండెలు బరువెక్కుతాయి. అమ్మో.. ఇంత తక్కువ సమయమా? అనే మాట వినపడటం సర్వ సాధారణం. అయితే ముక్కూమొహం తెలియని వాళ్లు, మేమున్నామని భరోసా కల్పిస్తే.. సొంత మేనమామళ్లా హడావుడి చేస్తే.. కుటుంబ సభ్యుల్లో ఒకరిలా మెలుగుతుంటే.. జీవితంలో అంతకంటే సంతోషం ఏముంటుంది. ఈ కోవకు చెందినదే ‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’. కార్యక్రమం చేశామా, వెళ్లిపోయామా అన్నట్లు కాకుండా.. ఈ బృందం ఓ కుటుంబంలా మెలుగుతోంది. కష్టాలో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ.. సంతోషాలను కలిసి పంచుకుంటున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకం. వాట్సాప్ గ్రూపులో 1,500 పైనే సభ్యులు మొదట అరకొరగా మొదలైన మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత వాట్సాప్ గ్రూపు దినదిన ప్రవర్దమానంగా వెలుగొందుతోంది. ప్రస్తుతం ఈ గ్రూపులో 1,500 మందికి పైగానే సభ్యులు. ఎంపిక చేసుకున్న గుడి వివరాలను గ్రూపులో తెలియజేసి కార్యక్రమం నిర్వహణలో పాల్పంచుకునేందుకు ఆసక్తి కలిగిన సభ్యుల వివరాలతో జాబితా తయారు చేస్తున్నారు. ఆ తర్వాత అవసరమైన మేరకు సభ్యులకు అవకాశం కలి్పస్తున్నారు. మరో కార్యక్రమంలో మిగిలిన వారికి ఆ భాగ్యం లభిస్తోంది. ఇప్పటి 123 దేవాలయాల్లో కార్యక్రమం నంద్యాలలోని ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో మొదలైన కార్యక్రమం ఇప్పటి వరకు 123 దేవాలయాల్లో తమ సేవను విస్తరించడం విశేషం. కాశీలోని విశాలక్ష్మి గుడిలో ఏకంగా 9 రోజుల పాటు ఈ బృందం తమ కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్లకీలో పెళ్లి కూతురు‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’ బృందంలో సభ్యురాలైన హిమబిందు స్వస్థలం నంద్యాల కాగా.. వివాహం ఆదివారం కర్నూలు నగరంలో నిర్వహించారు. వరుడు వీర నవీన్. బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. వివాహం సందర్భంగా బృందం సభ్యులు సు మారు 150 మంది హాజరయ్యారు. వీరు పల్లకీని తీసుకొచ్చి పెళ్లి మంటపానికి తీసుకొస్తున్న తీరుకు వివాహానికి హాజరైన అతిథులు ఆశ్చర్యచకితులయ్యారు. ఎవరికి ఎవరో అన్నట్లుగా బతుకుతున్న రోజుల్లో ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారా అని చర్చించుకోవడం విశేషం. -
ఉగ్రకుట్ర భగ్నం
సాక్షి,హైదరాబాద్/విజయనగరం/విజయనగరం క్రైమ్: తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, ఏపీ పోలీసులు జాయింట్ ఆపరేషన్తో ఉగ్రకుట్రను భగ్నం చేశారు. సౌదీ అరేబియా కేంద్రంగా పనిచేస్తున్న పాకిస్తాన్ ప్రేరేపిత హ్యాండ్లర్ నెట్వర్క్ గుట్టురట్టు చేశారు. బాంబు పేలుళ్ల ప్రయోగాల కోసం పేలుడు పదార్థాలు సేకరిస్తున్న ఇద్దరిని వేర్వేరు చోట్ల అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పోలీసుల సమాచారంతో తొలుత ఏపీలో విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్(29)ను పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత సిరాజ్ విచారణలో చెప్పిన సమాచారాన్ని ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులతో పంచుకున్నారు. దీంతో తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు (సీఐ సెల్) హైదరాబాద్ బోయగూడలో ఉంటున్న సయ్యద్ సమీర్(28)ను అరెస్ట్ చేశారు. అనంతరం సమీర్ను విజయనగరం తరలించారు. డమ్మీ బ్లాస్ట్లకు కుట్ర విజయనగరానికి చెందిన సిరాజ్.. సయ్యద్ సమీర్ కలిసి ‘అల్ హింద్ ఇత్తెహబుల్ మిసిలెన’ (ఏహెచ్ఐఎమ్) పేరుతో పలు కార్యకలాపాలు చేస్తున్నట్లు పోలీసులకు కీలక అధారాలు లభించాయి. సౌదీ అరేబియాలోని ఓహ్యాండ్లర్ నుంచి హైదరాబాద్, ఏపీలోని సానుభూతిపరులకు ఆదేశాలు వస్తున్నట్లు గుర్తించారు. పేలుళ్ల కోసం ప్రయోగాలు చేసేందుకు సంబంధిత కెమికల్స్ కొనుగోలు చేసి హైదరాబాద్లో డమ్మీ బ్లాస్ట్లు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. ఇందుకోసం సిరాజ్ విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు సీఐ సెల్కు సమాచారం అందింది.దీంతో తెలంగాణ సీఐ సెల్ అధికారులు విజయనగరం పోలీసులను అప్రమత్తం చేశారు. సిరాజ్ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతని ఇంట్లో పేలుళ్లకు వినియోగించే అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ను స్వాదీనం చేసుకున్నారు. ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతోనే విజయనగరంలో పేలుడు పదార్థాల కొనుగోలుకు పూనుకున్నట్టు సమాచారం. వీరి వెనుక ఉన్న ఉగ్రవాద సంస్థల గురించి ఆరా తీస్తున్నారు. హైదరాబాద్లో చదువుకున్నప్పుడే... సిరాజ్ 2018 సంవత్సరంలో హైదరాబాద్లో ఇంజనీరింగ్ విద్యనభ్యసిస్తున్న సమయంలో సమీర్తో పరిచయం ఏర్పడినట్టు నిఘా వర్గాల సమాచారం. వీరిద్దరూ ఐసిస్తో సంబంధాలు పెంచుకున్నట్టు తెలంగాణ ఇంటెలిజెన్స్ గుర్తించింది. తండ్రి, సోదరుడు పోలీస్ విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తుండగా, సిరాజ్ మాత్రం ఉగ్రవాద భావజాలానికి ప్రేరేపితం కావడం పోలీసులను విస్మయపరుస్తోంది. వీరు రసాయనాలను ఎక్కడెక్కడ కొనుగోలుచేశారు, ఇంకా ఎక్కడ నిల్వ చేశారు, దీనితో ఎవరెవరికి సంబంధం ఉందన్న కోణంలో ఇంటెలిజెన్స్ అధికారులు విచారిస్తున్నట్లు విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాస్ తెలిపారు. నిందితులిద్దరినీ విజయనగరం కోర్టులో హాజరుపరిచి, రిమాండ్కు తరలించారు. -
ఆడబిడ్డలకు ద్రోహం
కర్నూలు (టౌన్)/ కాకినాడ రూరల్: ఎన్నికల సమయంలో ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేస్తామని టీడీపీ అధినేతగా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని సమాధి చేశారని మహిళలు మండిపడ్డారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్ నుంచి వైఎస్సార్ సర్కిల్ వరకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం మహిళలు ర్యాలీ నిర్వహించారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు డౌన్.. డౌన్.. ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలను నమ్మించి మోసం చేశారని నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లా నాగవేణి రెడ్డి మాట్లాడుతూ.. ఓట్ల కోసం సూపర్ సిక్స్ హమీలు ఇచ్చి.. తీరా గద్దెనెక్కాక కూటమి పార్టీల పెద్దలు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆడబిడ్డ నిధి పేరుతో ప్రతి మహిళకు ఏటా రూ.18 వేలు ఇస్తామని చంద్రబాబు నాయుడు బహిరంగంగా ప్రకటించారన్నారు. ఆ మేరకు కూటమి మేనిఫెస్టోలోనూ పెట్టారన్నారు. తీరా ఇప్పుడు సీఎం చంద్రబాబు తన కర్నూలు పర్యటనలో.. ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎత్తేస్తున్నట్లు ప్రకటించడం దుర్మార్గం అన్నారు.2029 నాటికి కూడా పేదరికం తగ్గకపోతే అప్పుడు పీ–4 పథకానికి ఆడబిడ్డ నిధి పథకాన్ని అనుసంధానం చేస్తానని చెప్పడం మరోసారి మహిళలను దగా చేయడమే అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి భారతి, కర్నూలు నగర మహిళ నాయకులు మంగమ్మ, 43వ వార్డు కార్పొరేటర్ మునెమ్మ, కర్నూలు నియోజకవర్గ ఆంగన్వాడీ మహిళ నాయకురాలు రాధికమ్మ తదితరులు పాల్గొన్నారు.సూపర్ మోసం కూటమి ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలు మహిళలకు శాపంగా మారాయని, ఆడబిడ్డ నిధి పేరిట ప్రతి మహిళకూ నెలకు రూ.1,500 ఇస్తామని నమ్మించి.. ఇప్పుడు మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సూపర్ మోసాలు చేస్తోందని ధ్వజమెత్తారు. కాకినాడ 49వ డివిజన్లోని తన నివాసంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని సూపర్ సిక్స్ హామీల కింద పెట్టి.. ఇప్పుడు మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించారని.. ఆ పథకం అక్కర్లేదని సీఎం చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల ముందు మహిళల్లో కనిపించిన పేదరికం.. అధికారం చేపట్టగానే మాయమైందా.. అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తెచ్చిన వేల కోట్ల రూపాయలతో ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. -
రెడ్బుక్ రాజ్యాంగంతో అరాచకం
నెల్లూరు(బారకాసు): ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం అరాచకాలకు తెగబడిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) మెంబర్ పి.అనిల్కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి ఊసే లేకుండా పోయిందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం లేని స్కామ్లు సృష్టించి కక్ష సాధింపులకు దిగుతోందని ధ్వజమెత్తారు. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి అక్రమ అరెస్ట్ను ఖండించారు. ఏపీలో పనిచేయాలంటేనే బ్యూరోక్రాట్స్ భయపడుతున్నారని విమర్శించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. మైనింగ్ మాఫియాను పోషిస్తున్న చంద్రబాబు నెల్లూరు జిల్లాలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు మైనింగ్ మాఫియాను బాబు పెంచి పోషిస్తున్నారు. జిల్లాలో దాదాపు 180 మైన్లు ఉంటే అందులో కేవలం 25 నుంచి 30 మాత్రమే నడుస్తున్నాయి. వేమిరెడ్డి వల్ల అనేక క్వారీలు ఇంకా మూతపడే ఉన్నాయి. వేమిరెడ్డి కంపెనీ పెట్టుకోవడం తప్పా అంటూ టీడీపీ నాయకుడు బీద రవిచంద్రయాదవ్ వత్తాసుగా మాట్లాడారు. తాను తప్ప ఇంకెవరూ మైనింగ్ వ్యాపారాలు చేసుకోకూడదన్న ఎంపీ దురాశ వల్ల నెల్లూరు జిల్లాలో దాదాపు 10 వేల మంది ఉపాధి కోల్పోతున్నారు.260 మందికిపైగా క్వార్ట్జ్æ ఎగుమతిదారులుంటే ఎంపీ వేమిరెడ్డికి చెందిన కంపెనీ ఒక్కటే వ్యాపారం చేయడం వెనుక మతలబు ఏంటి? ఎవరైనా ఎక్స్పోర్ట్ చేసుకుందామనిపోతే వారిని బెదిరిస్తున్నారు. ఎంపీ మైనింగ్ అక్రమాలపై నేను ప్రెస్మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత కొంతమందిని పిలిపించుకుని మాట్లాడుకున్నారని తెలిసింది. లోకల్ మైన్లన్నీ ఎంపీ కంపెనీకి చేయాలట. ఎక్స్పోర్టర్ చైనా కంపెనీకి అమ్ముకుంటామని వాళ్లతో చెప్పారు. ఇదే జరిగితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంటర్ కావడం తథ్యం. లీజు గడువు ముగిసిన వాటిలో అక్రమ మైనింగ్ ఎంపీ ప్రభాకర్రెడ్డి ఫ్యాక్టరీ పెడతానని ఇంకా శంకుస్థాపన చేయకుండానే వేల టన్నులు చైనాకి ఎక్స్పోర్టు చేస్తున్నాడు. 50 ఏళ్ల పరి్మషన్ గడువు ముగిసిపోయిన ఏడెనిమిది మైన్స్, పట్టా భూములను తన గుప్పెట్లో పెట్టుకుని అక్రమంగా మైనింగ్ చేస్తూ ఏడాదికి రూ.250 కోట్లు చొప్పున నాలుగేళ్లలో రూ.వెయ్యి కోట్లకు పైనే దోపిడీకి స్కెచ్ వేశాడు. ఇవి నిజంకాదని నిరూపిస్తే ఎంపీకి క్షమాపణలు చెప్పడానికీ సిద్ధం. మా హయాంలో పారదర్శకంగా మైనింగ్ గత ప్రభుత్వంలో ఎవరి మీద ఎలాంటి ఆంక్షలు విధించకుండా స్వేచ్ఛగా మైనింగ్ చేసుకోనిచ్చాం. టాప్ టెన్ ఎక్స్పోర్టర్ల లిస్ట్ చూస్తే అందులో టీడీపీ వాళ్లే ఎక్కువ మంది ఉంటారు. మా ప్రభుత్వ పారదర్శక విధానాలకు ఇంతకన్నా వేరే రుజువులు అవసరం లేదు. -
నేడు స్థానిక సంస్థల ఎన్నికలు
సాక్షి, అమరావతి: గ్రేటర్ విశాఖపట్నంతోపాటు మరో నాలుగు మున్సిపాలిటీలు, రాష్ట్రవ్యాప్తంగా 40 మండలాల్లోని స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేసేందుకు సోమవారం మరో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ పదవితోపాటు బొబ్బిలి(విజయనగ రం), ఆదోని (కర్నూలు), తిరువూరు (ఎన్టీఆర్), కదిరి (శ్రీ సత్యసాయి) మున్సిపాలిటీల చైర్మన్ పదవులకు, కదిరి మున్సిపాలిటీలో రెండు వైస్ చైర్మన్ పదవులకు పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఇందుకోసం జీవీఎంసీ కార్పొరేషన్, ఆయా మున్సిపాలిటీల్లో సోమవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు. కదిరి మున్సిపాలిటీలో ముందుగా చైర్మన్ పదవికి ఎన్నిక నిర్వహించి, ఆ తర్వాత వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆ జిల్లా కలెక్టరుకు సూచించారు.గ్రామీణ ప్రాంతాల్లో ఇలా... శ్రీ సత్యసాయి జిల్లా గండ్లపెంట, రామగిరి మండలాలతోపాటు పశి్చమ గోదావరి జిల్లా యలమంచిలి, అత్తిలి మండలాల్లో ఎంపీపీ పదవులకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. అత్తిలి(పశి్చమ గోదావరి), కారంపూడి, నరసరావుపేట(పల్నాడు), దగదర్తి(ఎస్పీఎస్ఆర్ నెల్లూరు), సర్వకోట(శ్రీకాకుళం), వి.మాడుగల(అనకాపల్లి), దేవరాపల్లి(అనకాపల్లి), కైకలూరు (ఏలూరు), పిట్టలవానిపాలెం(బాపట్ల), దుగ్గిరాల(గుంటూరు), మార్కాపురం, త్రిపురాంతకం (ప్రకాశం), తవనంపల్లి(చిత్తూరు), కంబదూర్ (అనంతపురం) మండలాల్లో వైస్ ఎంపీపీ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు.కొత్తవలస (విజయనగరం), చోడవరం (అనకాపల్లి), కడియం (తూర్పు గోదావరి) మండలాల్లో మండల కో–ఆపె్టడ్ పదవులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 19 మండలాల్లోని 20 గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. పల్నాడు జిల్లాలోనే అత్యధికంగా ఆరు మండలాల్లోని ఏడు పంచాయతీల్లో ఉప సర్పంచ్ పదవులకు ఎన్నికలు ఉన్నాయి. ఎక్కడైనా ఎన్నిక వాయిదా పడితే తిరిగి ఈ నెల 20వ తేదీ ఉదయం 11 గంటలకు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నిక కమిషనర్ ఆదేశించారు. -
ఐదుగురు చిన్నారులు జలసమాధి
కుప్పం రూరల్/బుట్టాయగూడెం: వేసవి సెలవుల్లో చిన్నారుల సందడితో కళకళలాడాల్సిన ఇళ్లల్లో విషాదం అలముకుంది. అప్పటివరకు కుటుంబసభ్యులతో సంతోషంగా గడిపిన ఐదుగురు చిన్నారులు జల సమాధి అయ్యారు. తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చారు. చిత్తూరు జిల్లా దేవరాజపురంలో ఆడుకోవడానికి వెళ్లి నీటి కుంటలో పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలోని జల్లేరు జలాశయంలో నీటమునిగి ఓ అన్న, తమ్ముడు మృతి చెందారు. ప్రమాదవశాత్తూ జారి పడి..చిత్తూరు జిల్లా కుప్పం మండలం దేవరాజపురానికి చెందిన యశోద, వరలక్ష్మి, రాజా ఒకే తల్లి బిడ్డలు. యశోద తమిళనాడులో నివసిస్తుండగా.. వరలక్ష్మి, రాజా దేవరాజపురంలోనే ఉంటున్నారు. వేసవి సెలవులు కావడంతో యశోద తన కుమారుడు అశ్విన్తో కలిసి ఇటీవల దేవరాజపురం వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం యశోద కుమారుడు అశ్విన్(7), వరలక్ష్మి కుమార్తె గౌతమి(6), రాజా కుమార్తె శాలిని(7) ఆడుకుంటూ.. సమీపంలోని నీటి కుంట వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ ముగ్గురూ అందులోకి జారిపడ్డారు. ఆడుకోవడానికి వెళ్లిన పిల్లలు ఎంతసేపటికీ రాకపోవడంతో.. తల్లిదండ్రులు వారిని వెదుకుతూ నీటి కుంట వద్దకు వెళ్లగా.. ముగ్గురూ విగతజీవులుగా కనిపించారు. వారిని అలా చూసిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేయనున్నట్లు డీఎస్పీ పార్థసారథి తెలిపారు.బిడ్డల కోసం తల్లి పోరాడినా..తాడేపల్లిగూడేనికి చెందిన షేక్ అన్వర్, పర్విన్ దంపతులకు ఇద్దరు కుమారులు సిద్దిక్(10), అబ్దుల్(7). వేసవి సెలవులు కావడంతో పర్విన్ తన ఇద్దరు కుమారులను తీసుకుని జంగారెడ్డిగూడెంలోని బంధువుల ఇంటికి వచ్చింది. ఆదివారం బంధువులతో కలిసి బుట్టాయగూడెం మండలం అలివేరు సమీపంలోని జల్లేరు జలాశయాన్ని చూసేందుకు వెళ్లారు. నీళ్లు తక్కువగా ఉండడంతో స్నానం చేసేందుకని జలాశయంలోకి దిగారు. సిద్దిక్, అబ్దుల్ లోతు ఎక్కువగా ఉన్న ప్రదేశానికి వెళ్లడంతో.. నీట మునిగారు. వారిని కాపాడేందుకు తల్లి పర్విన్తో పాటు మరో మహిళ ప్రయత్నించారు.ఈ క్రమంలో వారిద్దరూ కూడా నీటిలో మునిగిపోతుండగా.. స్థానికులు చున్నీల సాయంతో వారిద్దరినీ బయటకు లాగారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ దుర్గామహేశ్వరరావు ఘటనాస్థలికి చేరుకొని పిల్లల కోసం జలాశయంలో గాలించారు. గంట సేపటి తర్వాత స్థానికుల సాయంతో వలలు వేసి.. పిల్లల మృతదేహాలను బయటకు తీశారు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు పిల్లలూ.. ఒకేసారి మరణించడంతో తల్లిదండ్రులు ‘ఇక మాకు దిక్కెవరు?’ అంటూ రోదించారు. చిన్నారుల మృతిపై సీఎం విచారం సాక్షి, అమరావతి: విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడటంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. పిల్లల మృతితో తీవ్ర శోకంలో ఉన్న తల్లిదండ్రులకు సానుభూతి తెలిపారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. -
చిన్నారుల ఉసురు తీసిన కారు
విజయనగరం క్రైమ్: విజయనగరం జిల్లా కేంద్రానికి సమీపంలోని ద్వారపూడి గ్రామంలో విషాదం అలముకుంది. ఆటలాడుతూ కారులోకి ఎక్కిన నలుగురు చిన్నారులు ఊపిరాడక ప్రాణాలు విడిచారు. విజయనగరం రూరల్ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్వారపూడి గ్రామం, బీసీ కాలనీలో ఆదివారం ఒక పెళ్లివేడుక జరిగింది పెళ్లి హడావిడిలో ఉన్న తల్లిదండ్రులను విడిచి, మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒకటో తరగతి చదువుతున్న కంది మణీశ్వరి (6), బూర్లె చారులత (7), 2వ తరగతి చదువుతున్న బూర్లె జాస్రిత (8), 3వ తరగతి చదువుతున్న పండి ఉదయ్ (7) సమీపంలోని నీళ్ల ట్యాంక్ వద్ద ఆడుకోవడానికి వచ్చారు. ఆటల్లో ఆటగా అక్కడే ఆగి ఉన్న ఒక కారులోకి ఎక్కారు. అకస్మాత్తుగా డోర్ లాక్ కావడంతో లోపల చిక్కుకుపోయారు. కేకలు వేసినా బయటకు వినపడక పోవడంతో నలుగురు చిన్నారులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. పెళ్లి సందడిలో ఉన్న తల్లిదండ్రులు, ఎంతకూ తమ పిల్లలు కనిపించకపోవడంతో వెతకడం ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల సమయంలో కారులో పిల్లలు ఉన్నట్టు గుర్తించారు.వెంటనే కారు అద్దాలు పగలగొట్టి పిల్లలను బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్నారన్న భావనతో 108 వాహనంలో విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నలుగురు చిన్నారులు మృతిచెందినట్టు వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతుల్లో చారులత, జాస్రిత అక్కచెల్లెళ్లు. ఇద్దరు కుమార్తెలు మృతిచెందడంతో తండ్రి ఆనంద్ గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ సంఘటనలో గ్రామంలో తీవ్ర విషాదం అలముకుంది. రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్, వన్టౌన్ ఎస్ఐ రామ్గణేష్ లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. -
కూటమి పాలన.. ఆలయంలోని ఏడు విగ్రహాలు ధ్వంసం
గార: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆలయాల్లో జరుగుతున్న వరుస ఘటనలు హిందూవుల మనసులను కలచివేస్తున్నాయి. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ నెలలో శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మంలో రెండురోజుల వ్యవధిలో 15 నక్షత్ర తాబేళ్లు మృత్యువాతపడడం, ఆ తర్వాత విశాఖపట్నం జిల్లా సింహాచలంలో చందనోత్సవ సమయంలో గోడ కూలిన దుర్ఘటనలో ఏడుగురు భక్తులు మరణించడం వంటి హృదయ విదారక ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి.ఈ విషాద ఘటనలు మరువక ముందే శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నం పెద్ద పల్లిపేటలోని కోదండ రామాలయంలో మరో ఘోర అపచారం జరిగింది. ఈ గుడిలోని బాలశశిశేఖర ఆలయం (వైష్ణవాలయం)లో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఏడు విగ్రహాలను ధ్వంసం చేశారు. దాదాపు 300 ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయం గర్భగుడిని స్థానికులు విరాళాలు పోగు చేసి బాగు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా గుడి చుట్టూ దశావతారాలను సిమెంట్ విగ్రహాలతో ఏర్పాటు చేశారు. వీటిలో వామనావతరం విగ్రహాన్ని దుండగులు పూర్తిగా పెకిలించి వేశారు. కలి్క, బలరామ, శ్రీరాముడు, పరశురామ, నరసింహ, శ్రీకృష్ణుడు విగ్రహాల చేతులు విరిగిపోయి ఉన్నాయి. కొన్ని విగ్రహాలకు కత్తి, నాగలి, పిల్లనగ్రోవి వంటివి పాడైపోయాయి. ఎవరో కావాలనే ఈ పని చేశారని అనుమానిస్తున్నారు. ఈ ఆలయానికి ఒకవైపు పిచ్చి మొక్కలు పెరిగి ఉన్నాయి. ఇక్కడ మందుబాబులు ఎక్కువగా ఉంటారని స్థానికులు చెబుతున్నారు. ఆదివారం ఉదయం స్వీపర్ గొండు చిన్నమ్మడు వెనుక వైపు వెళ్లి చూడగా విగ్రహాలన్నీ కొన్ని చోట్ల విరిగిపోయి ఉండటం గమనించి అర్చకులకు తెలియజేసింది. అర్చకులు మహేంద్రాడ లక్ష్మణమూర్తి, కోదండరామాచార్యులు, చామర్తి రామగోపాలచార్యులు ఆలయ ఈఓకు, స్థానిక పెద్దలకు తెలియజేశారు. వాళ్లు పోలీసులకు సమాచారం అందజేశారు. రెండు ఆలయాల్లోని రెండు సీసీ కెమెరాలు గత పదిహేనురోజులుగా పనిచేయడం లేదు. ఘటన జరిగిన తర్వాత విరిగిపోయిన విగ్రహాలకు వెంటనే మరమ్మతులు చేపట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. నరసన్నపేట గ్రూప్ టెంపుల్స్ ఇన్చార్జి ఈఓ మాధవి విగ్రహాల ధ్వంసంపై గార పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. హిందూ సంఘాల నిరసనఆలయాన్ని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద పరిశీలించారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని గుర్తించి త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. ఆలయం చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఒకటో పట్టణ సీఐ పైడపునాయుడు, ఇన్చార్జి ఎస్ఐ ఎం.హరికృష్ణ ఉన్నారు. జిల్లా దేవదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ పటా్నయిక్ ఆలయాన్ని పరిశీలించారు. విగ్రహాల ధ్వంసంపై విశ్వహిందూ పరిషత్, భజరంగదళ్ సభ్యులు ఆలయం వద్ద నిరసన చేపట్టారు. బీజేపీ మండల అధ్యక్షురాలు మైలపల్లి లక్ష్మీజనార్దన్, రాష్ట్ర నాయకులు పండి యోగీశ్వరరావు ఆలయాన్ని పరిశీలించారు. -
విత్తు.. సర్కారు ప్రణాళిక చిత్తు
గతంలో ఈపాటికే విత్తనాలిచ్చారునాకు నాలుగెకరాలు సొంత భూమి ఉంది. మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకొని వేరుశనగ సాగు చేస్తున్నా. గతంలో ఈ పాటికే విత్తనాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాదు. విత్తనాలు పంపిణీ కూడా పూర్తయ్యేది. ఈ ఏడాది రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం లేదు. విత్తనాలు ఎప్పుడు వస్తాయో కూడా చెప్పే నాథుడు లేడు. బయట మార్కెట్లో కొందామంటే ధరలు మండిపోతున్నాయి. పైగా నాణ్యమైనవి దొరుకుతాయో లేదో తెలియడం లేదు. – బోయ ఓబులేసు, ఉదిరిపికొండ, కూడేరు మండలం, అనంతపురం జిల్లా⇒ ఇతని పేరు బొంతల హరీష్. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం లింగారెడ్డిపల్లె గ్రామం. సొంతంగా మూడెకరాలు, కౌలుకు రెండెకరాలు.. పూర్తిగా వర్షాధారంపై ఆధారపడి సాగు చేస్తున్నాడు. 15 ఏళ్లుగా వేరుశనగ పంట వేస్తున్నాడు. ఎకరాకు 80 నుంచి 100 కిలోల విత్తనం కావాలి. బహిరంగ మార్కెట్లో క్వింటా రూ.12 వేలకు పైగానే ఉంది. ఐదెకరాలకు రూ.60 వేలు ఖర్చు చేయాల్సి ఉంది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసే పరిస్థితి ఇతనికి లేదు. గత ఖరీఫ్లో మే మొదటి వారంలోనే విత్తనాలు ఆర్బీకేల ద్వారా ఇచ్చారు. గతేడాది ఈపాటికే విత్తుకోవడం పూర్తయింది.పంట ఏపుగా ఎదిగినా కోతకొచ్చే సమయానికి వర్షాల కారణంగా పంట పూర్తిగా దెబ్బతిన్నది. ఐదెకరాలకు 3 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. రూ.60 వేలకుపైగా నష్టపోయాడు. రబీలో పంట వేయలేదు. ఈ ఏడాది ప్రారంభంలోనే వర్షాలు పడుతుండడంతో అదును దాటిపోకుండా విత్తుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే పలుమార్లు రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్లినా రిజి్రస్టేషన్ చేసుకోవడం లేదని, ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదని వాపోతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పంటలు సాగు చేస్తున్న రైతులందరి పరిస్థితి ఈ విధంగానే ఉంది.సాక్షి, అమరావతి: అన్నదాతలకు అడుగడుగునా అండగా నిలవాల్సిన కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వారిపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోంది. అదును సమయంలో వారికి పెట్టుబడి సాయం అందించకపోగా, సబ్సిడీ విత్తనాలు సైతం ఇవ్వకుండా కష్టాలపాలు చేస్తోంది. మరో పది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతున్నా, విత్తన సరఫరా మొదలు కాకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నాన్ సబ్సిడీ విత్తన పంపిణీకి గతేడాది మంగళం పాడిన కూటమి ప్రభుత్వం.. ఈ ఏడాది సబ్సిడీ విత్తన పంపిణీలోనూ రైతులను ముప్పుతిప్పలు పెడుతోంది. దాదాపు ఆరు రకాల సబ్సిడీ విత్తనాల పంపిణీని నిలిపి వేయడమే కాకుండా, మిగిలిన సబ్సిడీ విత్తనాల పంపిణీలోనూ అడ్డగోలుగా కోత పెట్టింది. గతేడాది బకాయిలు చెల్లిస్తే కానీ విత్తన సరఫరా చేయలేమని ఓ వైపు కంపెనీలు తెగేసి చెబుతున్నాయి. దీంతో ఈ ఏడాది సబ్సిడీ విత్తనాలు రైతులకు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం తప్పు పడుతున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వం ఏటా వ్యవసాయ సీజన్కు ముందే తొలి విడత పెట్టుబడి సాయం అందించడంతో పాటు ఎవరికి ఏ మేరకు విత్తనం కావాలో ముందుగానే ఆర్డర్ తీసుకుని ఆర్బీకేల ద్వారా సరఫరా చేసేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. పెట్టుబడి సాయం రూ.13,500 కాకుండా ఏకంగా రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం తమను మభ్యపెడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపడా సబ్సిడీ విత్తనం లేదు.. పెట్టుబడి సాయమూ లేదని ఊరూరా అన్నదాతలు బావురుమంటున్నారు. ఇంకా ఖరారు కాని సబ్సిడీలు ⇒ ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 77.87 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 86.47 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ధేశించారు. ప్రధానంగా 38.87 లక్షల ఎకరాల్లో వరి, 14.30 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 14.10 లక్షల ఎకరాల్లో పత్తి, 9.35 లక్షల ఎకరాల్లో అపరాలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏటా 40% సబ్సిడీపై వేరుశనగ, 30% సబ్సిడీపై పెసర, మినుము, కంది, 50% సబ్సిడీపై కొర్ర, రాగి, అండుకొర్రలు వంటి చిరుధాన్యపు విత్తనాలను సరఫరా చేస్తుంటారు. ⇒ వరి విత్తనాలను మాత్రం జాతీయ ఆహార ధాన్యాల భద్రతా పథకం అమలయ్యే జిల్లాల్లో కిలోకి రూ.10, ఇతర జిల్లాల్లో రూ.5 చొప్పున రాయితీతో సరఫరా చేస్తారు. ఏజెన్సీ జిల్లాలో మాత్రం 90% సబ్సిడీపై వరితో సహా అన్ని రకాల విత్తనాలను పంపిణీ చేస్తారు. ఏటా మార్చిలో పంటల వారీగా నిర్ధేశించిన సాగు లక్ష్యాలకనుగుణంగా జిల్లాల వారీగా ఇండెంట్ సేకరిస్తారు. ⇒ గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద ఉత్పత్తి అయ్యే విత్తనాన్ని దృష్టిలో పెట్టుకొని మిగిలిన విత్తనాల కోసం టెండర్ల ద్వారా కంపెనీలను ఎంపిక చేస్తారు. ఇలా సేకరించిన విత్తనాలను ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్లలో సర్టీఫై చేసి, సీజన్కు ముందుగానే రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) రైతులకు అందుబాటులో ఉంచేవారు. సాధారణంగా ఏటా ఏప్రిల్లో పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ పూర్తి చేసేవారు. ⇒ షెడ్యూల్ ప్రకారం పంపిణీ చేసేవారు. గత ఐదేళ్లలో ఏ ఒక్క ఏడాది ఒక్కరంటే ఒక్క రైతు కూడా తమకు విత్తనం సకాలంలో అందలేదన్న మాట విని్పంచకుండా సరఫరా చేశారు. ఈ ఏడాది అదును ముంచుకొస్తున్నప్పటికీ విత్తన పంపిణీ షెడ్యూల్ కాదు కదా.. కనీసం సబ్సిడీలను కూడా ఖరారు చేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని రైతులు మండిపడుతున్నారు. సబ్సిడీ విత్తనంలో అడ్డగోలుగా కోత ⇒ వైఎస్ జగన్ ప్రభుత్వం ముందస్తుగా చేసిన ఏర్పాట్ల ఫలితంగా 2024–25 ఖరీఫ్లో 6.63 లక్షల క్వింటాళ్ల విత్తనం రైతులకు అందుబాటులో ఉండింది. వరి 2.29 లక్షల క్వింటాళ్లు, వేరుశనగ 3.16 లక్షల క్వింటాళ్లు, 94 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట, 15 వేల క్వింటాళ్ల అపరాల విత్తనాలను సీజన్కు ముందుగానే సర్టీఫై చేసి ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచగలిగారు. ⇒ ప్రస్తుత ఖరీఫ్–2025 సీజన్ కోసం జిల్లాల నుంచి వచ్చిన ఇండెంట్ ప్రకారం తొలుత 6,31,952 క్వింటాళ్ల విత్తనం అవసరమని ఏపీ సీడ్స్ అంచనా వేసింది. ప్రధానంగా 2.37 లక్షల క్వింటాళ్ల వరి, 2.95 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 69 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట, 12 వేల క్వింటాళ్ల కందులు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత సబ్సిడీ విత్తనాన్ని కుదించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కేవలం 5.18 లక్షల క్వింటాళ్లకు పరిమితం చేశారు. ⇒ ఇందులో 2.15 క్వింటాళ్ల విత్తనం గ్రామీణ విత్తనోత్పత్తి పథకం ద్వారా, మిగిలిన విత్తనాన్ని టెండర్ ప్రక్రియ ద్వారా సేకరించాలని నిర్ణయించారు. చివరికి 4.65 లక్షల క్వింటాళ్లకు మించి అమ్మకాలు ఉండవన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. పైగా గతంలో దాదాపు 16 రకాల విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేసేవారు. అలాంటిది ఈ ఏడాది 10 రకాలకే పరిమితం చేశారు. ఈ లెక్కన 3 లక్షల క్వింటాళ్లకు మించి విత్తనాలు అందుబాటులో ఉండే అవకాశం లేదని అధికారులే చెబుతున్నారు.⇒ పిల్లిపెసర సహా సామెలు, ఊదలు, అలసందలు, రాజ్మా, ఉలవల సరఫరా నిలిపివేశారు. మిగిలిన వాటికి కూడా అడ్డగోలుగా కోత వేశారు. రాయలసీమ జిల్లాల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే వేరుశనగ పంట కోసం గతంలో ఏటా దాదాపు 3.80 లక్షల క్వింటాళ్లకు పైగా విత్తనం అందుబాటులో ఉంచేవారు. అలాంటిది ఈ ఏడాది తొలుత 2.95 లక్షల క్వింటాళ్లు అవసరమని అంచనా వేయగా, ఆ తర్వాత ప్రభుత్వాదేశాలతో 1.95 లక్షల క్వింటాళ్లకు పరిమితం చేయడం పట్ల సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.బకాయిలు చెల్లించని కూటమి ప్రభుత్వం ⇒ గతంలో ఏటా క్రమం తప్పకుండా సీజన్కు ముందుగానే టెండర్ల ద్వారా విత్తనాలకు అవసరమైన మొత్తాన్ని బడ్జెట్లో కేటాయించడమే కాకుండా ఆ మొత్తాన్ని ఆయా కంపెనీలకు విడుదల చేసేవారు. దీంతో గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఏనాడు విత్తన సరఫరాలో ఎలాంటి ఆటంకం ఏర్పడ లేదు. 2024–25 ఖరీఫ్ సీజన్లో 6.63 లక్షల క్వింటాళ్లు, రబీలో 3.85 లక్షల క్వింటాళ్ల విత్తనం సరఫరా చేయగా, అందుకు సంబంధించిన సబ్సిడీ రూ.328.75 కోట్లు ప్రభుత్వం కంపెనీలకు చెల్లించలేదు.⇒ ఖరీఫ్ సీజన్కు సంబంధించి రూ.213.78 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎనిమిది నెలలుగా ఈ మేరకు పలుమార్లు పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. దీంతో పచ్చిరొట్ట విత్తనాల సరఫరాకు ముందుకొచ్చిన ఐదు కంపెనీలు.. వేరుశనగ, వరి, శనగ, ఉలవలు, రాజ్మా తదితర విత్తనాల సరఫరాకు ముందుకొచ్చిన 12 కంపెనీలు గతేడాది బకాయిలు చెల్లిస్తే కానీ ఈ ఏడాది విత్తన సరఫరా చేసేది లేదని తెగేసి చెప్పాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో యంత్రాంగం ఉంది.⇒ అతికష్టమ్మీద ఒత్తిడి తీసుకురాగా జీలుగు.. జనుము (పచ్చిరొట్ట) విత్తనాలు కేవలం 23 వేల క్వింటాళ్లు (25%) జిల్లాలకు సరఫరా చేయగలిగారు. దీంతో పచ్చిరొట్ట విత్తనాలు దొరక్క రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ఈ పాటికే ప్రారంభం కావాల్సిన వేరుశనగ విత్తనం పంపిణీ ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా చెప్పలేకపోతున్నారు. మిగిలిన విత్తనాల పంపిణీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ⇒ ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు. గతేడాది ప్రభుత్వ చేతకాని తనం వల్ల నకిలీ విత్తనాలు రాజ్యమేలాయి. ఖరీఫ్లో ఎక్కువగా సాగయ్యే మిరప, పత్తి విత్తనాల్లో నకిలీలకు చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 40 కంపెనీలతో ఒప్పందం చేసుకుని, కల్తీలకు ఆస్కారం లేని రీతిలో రైతులు కోరుకున్న కంపెనీలకు చెందిన నాన్ సబ్సిడీ విత్తనాలను ఆర్బీకేల ద్వారా సరఫరా చేసింది. గత సీజన్ నుంచి నాన్ సబ్సిడీ విత్తనాల పంపిణీకి ప్రస్తుత ప్రభుత్వం మంగళం పాడింది.విత్తనోత్పత్తికీ రాంరాం ⇒ సాధారణంగా సాగు విస్తీర్ణంలో 30 శాతం విస్తీర్ణానికి అవసరమైన విత్తనాన్ని ఏపీ సీడ్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఆ మేరకు అవసరమైన విత్తనం కోసం రబీ సీజన్లో జిల్లాల వారీగా గుర్తించిన రైతులకు విత్తనోత్పత్తి పథకం కింద 75 శాతం రాయితీపై మూల విత్తనాన్ని ఇచ్చి విత్తన సాగును ప్రోత్సహిస్తారు. మరొకవైపు ఏపీ సీడ్స్లో వాటాదారులుగా ఉన్న రైతులకు బ్రీడర్స్, ఫౌండేషన్ సీడ్స్ ఇచ్చి వారి ద్వారా విత్తనోత్పత్తి చేసి, ఆ విత్తనాన్ని ఖరీఫ్ సీజన్లో రైతుల డిమాండ్ మేరకు సేకరిస్తారు. ⇒ సాధారణంగా ఏపీ సీడ్స్ సరఫరా చేసే విత్తనంలో 50 శాతం ఈ విధంగా సేకరిస్తారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఎవరైతే విత్తనం ఉత్పత్తి చేస్తారో ఆ రైతుల నుంచే ఈ–క్రాప్ ప్రామాణికంగా సేకరించేవారు. నిర్ధేశిత గడువులోగా వారికి బహిరంగ మార్కెట్ ధర కంటే 20–30 శాతం అదనంగా చెల్లించేవారు. ఈ వివరాలను సామాజిక తనిఖీలో భాగంగా ఆర్బీకేల్లో సైతం ప్రదర్శించేవారు. ⇒ దీంతో విత్తనోత్పత్తి చేసే రైతులు కూడా ఏపీ సీడ్స్కు ఇచ్చేందుకు ముందుకొచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. గడిచిన ఖరీఫ్లో విత్తనోత్పత్తి చేసే రైతుల నుంచి సేకరించిన విత్తనాలకు సంబంధించిన బకాయిలు దాదాపు 9 నెలలు గడిచినా చెల్లించని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ రైతులెవ్వరూ తమ విత్తనాన్ని ఏపీ సీడ్స్కు ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. బహిరంగ మార్కెట్ ధరలకే అమ్ముకుంటున్నారు. దీంతో ఏపీ సీడ్స్ పూర్తిగా టెండర్ల ద్వారానే విత్తనం సేకరించాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలే పెదవి విరుపు⇒ విత్తన పంపిణీ విషయంలో ప్రభుత్వ తీరును అధికార పార్టీ ఎమ్మెల్యేలే తప్పు పడుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు అధికార పార్టీకి చెందిన అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రాసిన లేఖే నిదర్శనం. ⇒ వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏటా 3 లక్షల క్వింటాళ్ల విత్తనం అందించారని ఆమె గుర్తు చేశారు. అలాంటిది ఖరీఫ్–2025 సీజన్కు కనీసం 2 లక్షల క్వింటాళ్ల విత్తనం తక్కువ కాకుండా కేటాయించాల్సి ఉండగా, కేవలం 1.10 లక్షల క్వింటాళ్ల విత్తనం కోసం జిల్లా అధికారులు ఇండెంట్ పెట్టడం దారుణం అన్నారు. వ్యవసాయ శాఖ కేవలం 50 వేల క్వింటాళ్ల విత్తనాన్ని మాత్రమే కేటాయించడం విస్మయానికి గురి చేస్తోందని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. ఇదేనా మంచి ప్రభుత్వం అంటే? సబ్సిడీపై వేరుశనక్కాయల విత్తనాల గురించి సచివాలయానికి వెళ్లి అడిగితే తమకు ఆదేశాలు రాలేదంటున్నారు. పదెకరాల్లో సేద్యం చేసుకున్నా.. వర్షాలు పడుతున్నాయి.. త్వరలో విత్తుకోవాల్సి ఉందని చెప్పినా వినిపించుకునే వారే లేరు. మాది రైతు ప్రభుత్వం.. మంచి ప్రభుత్వం అంటున్నారు.. ఇదేనా మంచి ప్రభుత్వం అంటే? రైతు సేవా కేంద్రాల్లో మా పేర్లు కూడా నమోదు చేసుకోకపోవడం దారుణం. దీంతో విత్తనాలు అధిక ధరకు బయట కొనుక్కోవాల్సి వస్తోంది. – మునిరెడ్డి, బొందిమడుగుల, తుగ్గలి మండలం, కర్నూలు జిల్లా అన్ని విధాలుగా మోసం చేల్లో దుక్కి దున్నాం. ఇంత వరకు శనగ విత్తనాలు రాలేదు. సచివాలయంలో అడిగితే మాకు పై నుంచి ఆర్డర్స్ రాలేదంటున్నారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఈపాటికే శనక్కాయల విత్తనాలు ఇచ్చేది. కానీ ఈ ఏడాది ఈ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. అదును దాటిపోతుంది. ఇంకెప్పుడు విత్తుకోవాలి? పెట్టుబడి సాయం కూడా ఇవ్వలేదు. రైతులను అన్ని విధాలుగా ముంచేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే 90 శాతం సబ్సిడీపై శనక్కాయల విత్తనం ఇవ్వాలి. – రమణారెడ్డి, పొడరాగపల్లి, ముదిగుబ్బ మండలం, శ్రీ సత్యసాయి జిల్లా కౌలురైతులకు నూరు శాతం సబ్సిడీతో సర్టీఫైడ్ విత్తనాలివ్వాలిఏపీ కౌలురైతుల సంఘం డిమాండ్ సాక్షి, అమరావతి: కౌలురైతులకు నాణ్యమైన, సర్టీఫై చేసిన విత్తనాలను నూరు శాతం సబ్సిడీపై అందించాలని ఏపీ కౌలు రైతుల సంఘం ఆదివారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రైవేట్ మార్కెట్లో విత్తనాల ధరలు విపరీతంగా పెంచేశారని, పైగా ప్రైవేటు కంపెనీలు విక్రయించే విత్తనాల్లో నాణ్యత ఉండటం లేదని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.కాటమయ్య, పి.జమలయ్య పేర్కొన్నారు. ఈ ఏడాది సీజన్కు ముందు విత్తనాలను సిద్ధం చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
హరిత హైడ్రోజన్.. కాలుష్యానికి సొల్యూషన్
వేగంగా జరుగుతున్న పట్టణీకరణ కారణంగా 2050 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి 10 మందిలో ఏడుగురు నగరాల్లో నివసిస్తారని అంచనా. పట్టణాలు వృద్ధి చెందడం ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యం వంటి సవాళ్లూ వస్తాయి. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రస్తుతం విద్యుత్ వాహనాల వినియోగం కనిపిస్తోంది. భవిష్యత్తులో హైడ్రోజన్ ఇంధనం తోడవ్వనుంది. ఇది కాలుష్యాన్ని మరింత తగ్గించి, స్వచ్ఛ భారత్ సాధనకు కారకమవుతుందని ఇంధన, వాహన రంగ తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. 2050 నాటికి ప్రపంచంలో నడిచే వాహనాల్లో 16 శాతం హైడ్రోజన్తోనే ఉంటాయని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) అంచనా వేస్తోంది.ప్రపంచంలో అత్యధిక కాలుష్యం గల టాప్–5 దేశాల్లో ఇండియా ఉంది. మన దేశంలో 2008 నుంచి 2019 వరకూ, గాలిలో ఉండే పీఎం 2.5 కణాలు 10 ప్రధాన నగరాల్లో ఏటా దాదాపు 30 వేల మరణాలకు కారణమయ్యాయి. ఇది మొత్తం మరణాలలో 7.2 శాతమని లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది. ఇందులో ఏటా ముంబైలో మరణించినవారు 5,100, కోల్కతాలో 4,678, చెన్నైలో 2,870 మంది. తర్వాతి స్థానాల్లో అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, పుణే, వారణాసి, సిమ్లా, ఢిల్లీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యుత్ వాహనాల (ఈవీ)కు డిమాండ్ పెరిగింది.దూసుకొస్తున్న హైడ్రోజన్2023 నాటికి, ప్రపంచ రోడ్లపై 4 కోట్ల ఈవీలు ఉన్నాయి. ఇది 2022లో సంఖ్య కంటే 35 శాతం ఎక్కువ. మనదేశంలో 2024లో ఏకంగా 20.22 లక్షల ఈవీల అమ్మకాలు జరిగాయి. ఇప్పుడు వీటికి ప్రత్యామ్నాయంగా వస్తున్నవే ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనాలు (ఎఫ్సీఈవీ). ఇవి హైడ్రోజన్ సాయంతో నడుస్తాయి. ఐఈఏ గణాంకాల ప్రకారం 2023 నాటికి ప్రపంచంలో హైడ్రోజన్ డిమాండ్ 9.7 కోట్ల టన్నులకు చేరింది. 2022తో పోలిస్తే ఇది 2.5 శాతం ఎక్కువ. నీటిని విద్యుత్ విశ్లేషణ (ఎలక్ట్రాలసిస్) ద్వారా హైడ్రోజన్, ఆక్సిజన్గా విడగొట్టవచ్చు.సౌరశక్తి వంటి పునరుత్పాదక వనరులతో ఉత్పన్నమయ్యే విద్యుచ్ఛక్తితో నీటిని విభజిస్తే గ్రీన్ హైడ్రోజన్ వస్తుంది. అలా కాకుండా బొగ్గు, చమురు, సహజ వాయువు వంటి వాటితో ఉత్పన్నమయ్యే విద్యుత్తుతో నీటిని విభజిస్తే బ్లూ, గ్రే హైడ్రోజన్లు ఉత్పన్నమవుతాయి. ఈ ప్రక్రియలోనూ కర్బన ఉద్గారాలు వెలువడతాయి. గ్రీన్ హైడ్రోజన్ అలా కాదు, స్వచ్ఛమైన ఇంధనం. ముఖ్యంగా ఎరువులు, చమురు శుద్ధి, ఉక్కు, రవాణా వంటి రంగాల్లో అత్యధిక కర్బన ఉద్గారాలు వెలువడతాయి. ఈ రంగాల్లో గ్రీన్ హైడ్రోజన్ వాడితే ఆ మేరకు అవి తగ్గుతాయి.అధిక ధర, నిర్వహణ ఖర్చులుహైడ్రోజన్ వాహనాలు తేలిగ్గా ఉంటాయి. తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించగలవు. కేవలం 5 నుంచి 15 నిమిషాల్లో ఇంధనం నింపుకోగలవు. ముఖ్యంగా దూర ప్రయాణం, వర్షం, తీవ్రమైన చలిలోనూ దూసుకుపోగలవు. అయితే, ప్రస్తుతం ఈ వాహనాలు చాలా తక్కువగా.. ప్రపంచవ్యాప్తంగా 93 వేలే ఉన్నాయి. దీనికి కారణం వాటి అధిక ధర, నిర్వహణ ఖర్చులు. డీజిల్ బస్సులకు కిలోమీటర్కు నిర్వహణ ఖర్చు దాదాపు రూ.23.06 అవుతుంది. ఎలక్ట్రిక్ బస్సులకు రూ.14.52 ఖర్చవుతుంది. విద్యుత్ వాహనాల కొనుగోలు ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ మేరకు నిర్వహణ భారం తగ్గుతుంది. కానీ హైడ్రోజన్ బస్సులు నడపడానికి చాలా ఖర్చవుతుంది. సహజ వాయువు నుంచి ఉత్పత్తి చేసిన బ్లూ హైడ్రోజన్ వాహనానికి కిలోమీటర్కి రూ.71.73 ఖర్చవుతుంది. గ్రీన్ హైడ్రోజన్ అయితే కిలోమీటర్కు రూ.77.69 ఖర్చవుతుంది. సాంకేతికత మెరుగుపడటంతో రెండింటి ధరలు 2030 నాటికి సమానమవుతాయని నిపుణులు భావిస్తున్నారు.స్టీల్, వాహన రంగాల్లో..స్టీల్ ఉత్పత్తిని గ్రీన్ హైడ్రోజన్తో చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం 7 పైలట్ ప్రాజెక్టులు మంజూరు చేశారు. 2029–30 వరకు గ్రీన్ హైడ్రోజన్ ద్వారా స్టీల్ ఉత్పత్తి చేసేందుకు రూ.455 కోట్లతో పైలట్ ప్రాజెక్టులను కేంద్ర స్టీల్ శాఖ అమలుచేస్తోంది. రవాణా రంగంలో 5 పైలట్ ప్రాజెక్టులు మంజూరు చేశారు.గ్రీన్ హైడ్రోజన్ మిషన్గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, వాడకం, ఎగుమతుల్లో మనదేశాన్ని గ్లోబల్ హబ్గా రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్ మిషన్ (జీహెచ్ఎమ్) అమలు చేస్తోంది. దీని ప్రకారం ఏటా 50 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయగలిగితే శిలాజ ఇంధనాల దిగుమతులను భారీగా తగ్గించుకోవచ్చు. ఫలితంగా 2030 నాటికి రూ.లక్ష కోట్లు ఆదా చేయొచ్చు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగం వల్ల ఏటా 5 కోట్ల టన్నుల కార్బన్డయాక్సైడ్ ఉద్గారాలనూ తగ్గించుకోవచ్చు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే కంపెనీలకు కేంద్రం ప్రోత్సాహకాలూ ఇస్తోంది.వైఎస్ జగన్ హయాంలో...ఆంధ్రప్రదేశ్లో తిరుపతి రాక్మ్యాన్ ఇండస్ట్రీస్లో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఏర్పాటుచేసిన మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఈ ఏడాది మార్చిలోనే ఉత్పత్తి ప్రారంభించింది. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో భాగంగా అప్పటి సీఎం వైఎస్ జగన్ సమక్షంలో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఏపీలో హరిత ఇంధన రంగంలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దీనిద్వారా తొలి విడతలో 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తారు. రానున్న కాలంలో 54 టన్నులకు పెంచనున్నారు. దీని ద్వారా ఏడాదికి 206 టన్నుల కార్బన్డయాక్సైడ్ ఉద్గారాల తగ్గింపుతోపాటు వాతావరణంలోకి ఏడాదికి సుమారు 195 టన్నుల ఆక్సిజన్ విడుదల అవుతుంది. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లోనే.. ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఎన్టీపీసీతో ఏపీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. సుమారు రూ.లక్ష కోట్లతో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు తొలి విడత పనులు 2026 నాటికి, మొత్తం 2030 నాటికి పూర్తవుతాయి. అలాగే గత ప్రభుత్వ హయాంలోనే హెచ్పీసీఎల్, ఓఎన్జీసీ వంటి సంస్థలు కూడా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయి.గ్రీన్ హైడ్రోజన్ రైలుపూర్తి దేశీయ పరిజ్ఞానంతో హైడ్రోజన్తో నడిచే రైలును రైల్వే శాఖ తయారుచేసింది. మిగతా దేశాలు 500 నుంచి 600 హార్స్ పవర్ ఇంజిన్ మాత్రమే రూపొందిస్తే.. మనదేశం ఏకంగా 1,200 హెచ్పీ ఇంజిన్ తయారుచేయగలిగింది. ప్రపంచంలో జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, చైనా మాత్రమే ఇలాంటి ఇంజిన్లు తయారుచేశాయి. ప్రపంచంలో అత్యంత పొడవైన (10 కోచ్లు) రైలు ఇదే. అంతేకాదు, ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యం (2,400 కిలోవాట్లు) ఉన్న రైలు కూడా ఇదే. హరియాణాలోని జింద్ – సోనిపట్ మధ్య ఈ రైలు నడవనుంది.ఉత్పత్తి వ్యయం ఎక్కువే..: ఒక కేజీ బ్లూ లేదా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి గరిష్ఠంగా 2.4 డాలర్ల వరకు ఖర్చవుతుంది. అదే కేజీ గ్రీన్ హైడ్రోజన్ తయారీకి దాదాపు 5.5 డాలర్లు వెచ్చించాలి. గ్రే హైడ్రోజన్ ఉత్పత్తితో పోలిస్తే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వల్ల.. ప్రతి కేజీకి 10 కిలోల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయి.గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా చేపట్టే ప్రాజెక్టుల ద్వారా రూ.8 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు, 6 లక్షలకుపైగా ఉద్యోగాలు వస్తాయని అంచనా.తెలంగాణలోనూ..తెలంగాణ కూడా 2029–30 నాటికి 418 కిలోటన్నులు, 2034–35 నాటికి 554 కిలోటన్నుల వార్షిక గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ – 2025లో వెల్లడించింది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే కంపెనీలకు ప్రోత్సాహకాలూ ప్రకటించింది. -
తీవ్ర విషాదం.. నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి
చిత్తూరు జిల్లా: కుప్పం మండలం దేవరాజపురంలో విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలోపడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మృతులను శాలిని (5), అశ్విన్ (6), గౌతమి (8)గా గుర్తించారు. ఇంటి పునాది కోసం తవ్విన కుంటలో వర్షపు నీరు చేరగా.. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆడుకుంటూ అటువైపుగా వెళ్లిన చిన్నారులు.. కుంటలో పడి ప్రాణాలు కోల్పోయారు. చిన్నారుల మృతితో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.మరో ఘటనలో నలుగురు చిన్నారులు మృతి..మరో ఘటనలో కారు లాక్ పడి నలుగురు చిన్నారులు మృతి చెందారు. విజయనగరం జిల్లాలోని ద్వారపూడి గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు కారు లాక్ పడి మరణించారు. ఆదివారం ఉదయం ఈ నలుగురు చిన్నారులు ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. తల్లిదండ్రులంతా ఉదయం నుంచి వెతికినప్పటికీ కనిపించలేదు. అయితే గ్రామంలో మహిళా మండల కార్యాలయం వద్ద ఆగి ఉన్న ఒక కారులోకి నలుగురు చిన్నారులు సరదాగా కూర్చునేందుకు వెళ్లి కారు డోర్ వేశారు. దీంతో కారు డోర్ లాక్ పడడంతో ఊపిరి ఆడక ఉదయ్, చారుమతి, చరిష్మా, మనస్విని మృతి చెందారు. -
దళిత విద్యార్థి జేమ్స్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా
సాక్షి, అమరావతి: తిరుపతిలో ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్పై జరిగిన దాడిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఇదొక ఉదాహరణ అని మండిపడ్డారు. ఈ ఘటనకు కారకులైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘తిరుపతిలో ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతిభద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ.దళితులు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండాపోయింది. చంద్రబాబు, అధికారపార్టీ నాయకుల డైరెక్షన్లో కక్ష సాధింపు చర్యల్లో మునిగితేలుతున్న పోలీసు యంత్రాంగం పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.పోలీస్స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోవడమే కాదు... ఫిర్యాదుదారుల మీదే ఎదురు కేసులు పెట్టడం పరిపాటిగా మారింది. జేమ్స్పై దాడి ఘటనలో పోలీసు యంత్రాంగం వైఫల్యమే కాదు, రాజకీయ జోక్యంతో కనీసం ఫిర్యాదును కూడా స్వీకరించలేని పరిస్థితి. ఈ ఘటనకు కారకులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’ అని వైఎస్ జగన్ పోస్టు చేశారు. తిరుపతిలో ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ. దళితులు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. @ncbn, అధికారపార్టీ…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 18, 2025 -
మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
తాడేపల్లి : భారత్ మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఈరోజు (మే18 వ తేదీ) హెచ్డీ దేవెగౌడ 92వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. దేవెగౌడ నాయకత్వం భవిష్యత్తు తరాలకు, దేశ సేవకు స్పూర్తిదాయకంగా నిలవాలన్నారు వైఎస్ జగన్. On the occasion of the 92nd birthday of Shri @H_D_Devegowda Ji, former Prime Minister of India ,I extend my heartfelt wishes to him for a healthy and joyful year ahead. May his wisdom and leadership continue to guide us in the service of our Nation.— YS Jagan Mohan Reddy (@ysjagan) May 18, 2025 -
బాబు సర్కార్ కక్ష సాధింపు.. మరోసారి నందిగం సురేష్ అరెస్ట్
గుంటూరు: మాజీ ఎంపీ నందిగం సురేష్పై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. మరోసారి ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజు నిన్న(శనివారం) నందిగం సురేష్ ఇంటి దగ్గర తాగి వీరంగం సృష్టించాడు. నందిగం సురేష్ కుటుంబ సభ్యులను దూషించిన రాజు.. సురేష్ను చంపేస్తే తనకున్న ఆస్తుల్లో కొంత భాగం రాసిస్తానంటూ హడావుడి చేశాడు.నందిగం సురేష్ కార్లపైన రాజు దాడి చేశాడు. ఎందుకు వీరంగం సృష్టిస్తున్నావంటూ రాజును నందిగం సురేష్ అనుచరులు ప్రశ్నించారు. దీంతో రాజు, నందిగామ సురేష్ అనుచరులకు మధ్య గొడవ జరిగింది. తనపై దాడి చేశారంటూ రాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రాజు తమ కారులపై దాడి చేసి తమ కుటుంబ సభ్యులను దూషించాడని.. నందిగం సురేష్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.నందిగం సురేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదును పట్టించుకోని పోలీసులు.. రాజు ఇచ్చిన ఫిర్యాదుతో సురేష్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అధికార పార్టీ నేతల ప్రోద్భలంతో నందిగం సురేష్తో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నందిగం సురేష్ని అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. -
అప్పుడేం జరిగిందో గుర్తులేదా?: కాసు మహేష్రెడ్డి
సాక్షి, పల్నాడు జిల్లా: ఏపీలో కొత్త రాజకీయం మొదలైందంటూ.. చంద్రబాబు సర్కార్పై వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. గతంలో అక్కడక్కడ గ్రామాల్లో ఫ్యాక్షన్ ఉండేదని.. కానీ కూటమి ప్రభుత్వం ఫ్యాక్షన్ రాజకీయాన్ని రాష్ట్రమంతా అమలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకుడిని అణగదొక్కాలన్న ఆలోచనతోనే అక్రమ కేసులతో ప్రభుత్వం ముందుకెళ్తుందని దుయ్యబట్టారు.‘‘ఎన్నడూ లేని విధంగా ఐపీఎస్ అధికారులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతుంది. కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే భ్రష్టు పట్టిపోయింది. వైఎస్సార్సీపీ గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతోంది. ఇది జీర్ణించుకోలేని చంద్రబాబు.. వైఎస్ జగన్ చుట్టూ ఉన్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్రెడ్డిలపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు. కనీసం ఈ కేసులో ఎటువంటి ఆధారాలు కూడా లేవు’’ అని మహేష్రెడ్డి పేర్కొన్నారు.‘‘కొంతమంది పోలీసులు పచ్చ చొక్కా వేసుకోకుండానే టీడీపీ కార్యకర్తల పని చేస్తున్నారు. చంద్రబాబు అనుకూల మీడియా వైఎస్ జగన్ని కూడా అరెస్టు చేస్తారంటూ ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ.. వైఎస్ జగన్పై అక్రమ కేసులు పెట్టి 16 నెలలు జైల్లో ఉంచింది. 40 శాతం ఓట్ షేర్ ఉన్న కాంగ్రెస్ పార్టీ.. వైఎస్ జగన్ను అక్రమ కేసుల్లో జైలుకు పంపడంతో రెండు శాతానికి పడిపోయింది. ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా తుడుచు పెట్టుకుపోయింది. రేపు కూటమి పరిస్థితి కూడా అంతే. ఇవాళ మాకు పాఠాలు నేర్పుతున్నారు.. రేపు అవి వారికి గుణపాఠాలవుతాయి’’ అని మహేష్రెడ్డి చెప్పారు.మీరు ఎన్ని అక్రమ కేసులు బనాయించినా ధైర్యంగా ఎదుర్కొంటాం.. న్యాయ పోరాటం చేస్తాం. మీరు ఎన్ని కేసులు పెడితే అంత బలపడతాం. ఈ రోజు కొన్ని నియోజకవర్గాల్లో సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టారు. రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో అసభ్యంగా పోస్టులు పెట్టిన వారిపై కచ్చితంగా కేసులు పెడతాం’’ అని కాసు మహేష్రెడ్డి హెచ్చరించారు. -
దటీజ్ ది ‘పవర్’ ఆఫ్ జగన్
సాక్షి, అమరావతి: సమర్థుడైన నాయకుడి పాలనలో వ్యవస్థలు ఎంతగా అభివృద్ధి చెందుతాయన్నది చెప్పడానికి ఇదొక నిదర్శనం. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంస్కరణలు, తీసుకువచ్చిన వినూత్న విధానాల వల్ల విద్యుత్ పంపిణీ సంస్థల(డిస్కం) నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గాయి.ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజలపై రూ.15,485 కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపింది. కానీ, గత ప్రభుత్వ హయాంలోని ఐదేళ్లలో మొత్తం రూ.4,434.51 కోట్ల నిర్వహణ ఖర్చులు ఆదా అయ్యేలా చేసింది. ఈ మేరకు డిస్కంలు దాఖలు చేసిన ట్రూ డౌన్ పిటిషన్ల వివరాలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి తన వెబ్సైట్ ద్వారా వెల్లడించింది.డిస్కంల మిగులు ఇలా.. 2019–20 నుంచి 2023–24 వరకూ ఏపీఈపీడీసీఎల్ నిర్వహణా వ్యయాల ఆదా రూ.1,974.75 కోట్లు ఏపీసీపీడీసీఎల్ 2020–21 నుంచి 2023–24 వరకూ వ్యయ ఆదా రూ.1,400 కోట్లు. ఈ మొత్తం రూ.3,374.75 కోట్లు. ఇందులో కొంత మొత్తాలను 2024–25 వార్షిక ఆదాయ వ్యయ నివేదిక (ఏఆర్ఆర్)లో డిస్కంలు సర్దుబాటు చేసుకున్నాయి. అంటే వాటి రెవెన్యూ గ్యాప్ను భర్తీ చేసుకోవడానికి వినియోగించుకున్నాయి. ఈ విధంగా ఏపీఈపీడీసీఎల్ రూ.1,800 కోట్లు కలపగా, మిగిలిన రూ.174.75 కోట్లను సర్దుబాటు చేయాల్సి ఉంది. అదేవిధంగా ఏపీసీపీడీసీఎల్లో రూ.478.91 కోట్లు ఇప్పటికే 2024–25 ఏఆర్ఆర్లో కలిపారు. ఇంకా రూ.921.09 కోట్లు ఉన్నాయి. ఈ మొత్తం రూ.1,095.84 కోట్లు ప్రజలకు తిరిగి ఇచ్చేయాలా... లేక మరో ఏఆర్ఆర్లో సర్దుబాటు చేయాలా.. అనేది ఏపీఈఆర్సీ నిర్ణయిస్తుంది.ట్రాన్స్కో ఆదా ఇది.. 2019–20 నుంచి 2023–24 మధ్య ఏపీ ట్రాన్స్కో విద్యుత్ లైన్లను వినియోగించుకోవడంలోనూ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కం) రూ.1,059.76 కోట్లు మిగిల్చాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విద్యుత్ ప్రసార వ్యవస్థ వినియోగానికి ఏపీఈఆర్సీ అనుమతించిన టారిఫ్ కంటే తక్కువగా డిస్కంలు వినియోగించాయి. ఇది ఏపీఈపీడీసీఎల్లో రూ.383.84 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్లో రూ.428.57 కోట్లు, ఏపీసీపీడీసీఎల్లో రూ. 247.35 కోట్లుగా ఉంది. వీటిని కూడా ఏఆర్ఆర్లో సర్దుబాటు చేశారు. ఈ లెక్కన గత ప్రభుత్వ చర్యల కారణంగా కూటమి ప్రభుత్వంపై రూ.4,434.51 కోట్ల భారం తగ్గింది.దక్షిణ డిస్కంలో భిన్నం.. కానీ.. మరోవైపు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) మాత్రం రూ.3,346 కోట్ల ట్రూ అప్ చార్జీల వసూలుకు ఏపీఈఆర్సీని అనుమతి కోరింది. ఇందులోనూ 2024–25 ఏఆర్ఆర్లో రూ.2వేల కోట్లు సర్దుబాటు చేసేశారు. అంటే అప్పటికి డిస్కంకు ఆ మేరకు లాభం చేకూరినట్టే. ఇక మిగిలింది రూ.1,346 కోట్లు. డిస్కం దాఖలు చేసిన వడ్డీలను ఏపీఈఆర్సీ యథాతథంగా ఆమోదించదు. అందువల్ల ఈ ట్రూ అప్ కూడా తగ్గే అవకాశం ఉందని ఏపీఈఆర్సీ వెల్లడించింది. -
కేతిరెడ్డి పెద్దారెడ్డికి లేఖ.. వివాదాస్పదంగా తాడిపత్రి ఎస్పీ తీరు!
సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో పోలీసులు మరోసారి చేతులెత్తేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డికి రక్షణ కల్పించలేమని స్వయంగా ఎస్పీ జగదీష్ లేఖ రాశారు. ఈ క్రమంలో తాడిపత్రి పర్యటనను వారం లేదా పది రోజులు వాయిదా వేసుకోవాలని ఎస్పీ జగదీష్ సూచించడం గమనార్హం.ఏపీలో కూటమి సర్కార్ పాలనలో పోలీసులు తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటకే ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలను అక్రమ కేసులతో టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తుండగా.. మరోవైపు, భద్రత కల్పించడంలో కూడా పోలీసులు విఫలమవుతున్నారు. తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఎస్పీ జగదీష్ రెండోసారి లేఖ రాశారు. లేఖలో పెద్దారెడ్డికి రక్షణ కల్పించలేమని తెలిపారు. తాడిపత్రి పర్యటనను వారం లేదా పది రోజులు వాయిదా వేసుకోవాలని మాజీ ఎమ్మెల్యేకు సూచించారు. టీడీపీ మహానాడు, రాప్తాడు జంట హత్యలు, ఎంపీపీ ఉప ఎన్నికల దృష్ట్యా భద్రత కల్పించలేమని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రి వెళ్లేందుకు భద్రత కల్పించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేలిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి తాను తాడిపత్రి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే ఎస్పీకి తెలిపారు. అయిన్పటికీ ఎస్పీ ఇదే తీరుగా వ్యవహరిస్తూ వివాదంలో చిక్కుకుంటున్నారు. వివిధ కారణాలు చూపి భద్రత కల్పించలేమని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక, అంతకుముందు కూడా పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనకు భద్రత కల్పించలేమంటూ చేతులెత్తేశారు ఎస్పీ జగదీష్. ఈ నెల తొమ్మిదో తేదీన సీఎం చంద్రబాబు పర్యటన ఉన్నందున భద్రత ఇవ్వలేమని ఎస్పీ తెలిపారు. ఎస్పీ లేఖతో పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటన వాయిదా పడింది.మరోవైపు.. తాడిపత్రి వస్తే అంతుచూస్తామంటూ తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పదేపదే బెదిరిస్తున్నారు. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతి ఇచ్చినా.. తాను మాత్రం దాడులు చేస్తానని జేసీ బహిరంగంగా సవాల్ చేశారు. పెద్దారెడ్డికి ఎవరూ మద్దత ఇవ్వొద్దని, తనకు పెద్దారెడ్డితో గొడవలు ఉన్నాయని, ఒకవేళ వస్తే తిరిగి వెళ్లడు అంటూ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతిచ్చిన క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా వ్యాఖ్యానించడం ఏంటో అర్థం కావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 18-25)
-
మద్యం కుంభకోణం పూర్తిగా కట్టుకథే... ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపిత కేసే... ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి తరపున ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించిన మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్.. దర్యాప్తు నివేదిక పేరిట మరోసారి కనికట్టు చేసిన సిట్
-
పెను విషాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి
అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పీలేరు బాలుమువారి పల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో కారు బావిలోకి తీసుకుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. బాధితులు కర్ణాటకకు చెందిన వారని సమాచారం. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
టీచర్ల తిరుగుబావుటా!
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను రద్దుచేసి చంద్రబాబు కొత్తగా అమలుచేస్తున్న విధానాలు బూమరాంగ్ అవుతున్నాయి. సర్కారు ఏకపక్ష విధానాలతో ప్రభుత్వ ఉపాధ్యాయ వర్గాల్లో తిరుగుబాటు మొదలైంది. ప్రభుత్వ పాఠశాలల పునర్విభజన, టీచర్ల సర్దుబాటు తీరుపై వారు రగిలిపోతున్నారు. ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తిలోను.. స్కూల్ అసిస్టెంట్లను ప్రాథమిక పాఠశాలల్లో నియమించడంపైనా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయంలో.. దాదాపు ఎనిమిది నెలలుగా ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు వారం వారం సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు.ఇలా ఇప్పటివరకు 34 సమావేశాలు నిర్వహించి వారి నుంచి అభిప్రాయాలు తీసుకున్న విద్యాశాఖ.. వారి సూచనలను ఏ మాత్రం పట్టించుకోలేదు. ఉపాధ్యాయుల సర్దుబాటు అంశానికీ ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో వారు రగిలిపోతున్నారు. అంతేగాక.. జీఓ–117 రద్దు మార్గదర్శకాల్లో పేర్కొన్న అంశాలకు, కొత్తగా తీసుకొచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులకు అసలు పొంతనలేదని దుమ్మెత్తిపోస్తున్నారు. మిగులుగా 10వేల మంది ఉపాధ్యాయులు..ప్రభుత్వోద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేయడంతో ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టేందుకు విద్యాశాఖ ప్రణాళిక సిద్ధంచేసింది. ఇందుకనుగుణంగా మార్చిలో ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం–2025’ తీసుకొచ్చింది. దీంతోపాటు ఇటీవల మూడు జీఓలు విడుదలచేసి పాఠశాలల పునర్విభజన, ఉపాధ్యాయుల పంపిణీ ఎలా ఉంటుందో పేర్కొంది. ప్రభుత్వ నూతన విధానాలతో రాష్ట్రంలో తొమ్మిది రకాల పాఠశాలల ఏర్పాటుతో పాటు, ఉపాధ్యాయ–విద్యార్థి నిష్పత్తి అస్తవ్యస్తంగా మారింది. 10 వేల మందికి పైగా ఉపాధ్యాయులు మిగులుగా ఏర్పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ముందుగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని విద్యాశాఖ నిర్ణయించి శుక్రవారం గుర్తింపు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటుచేసింది. కానీ, గతంలో జరిగిన సమావేశాల్లో తాము సూచించిన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయ సంఘాల నేతలు ఈ సమావేశాన్ని బహిష్కరించారు.ఆది నుంచీ విభజించు– పాలించు విధానం..ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో 43 సంఘాలు పనిచేస్తున్నాయి. వీటిలో తొమ్మిది గుర్తింపు సంఘాలు కాగా, మరో 34 రిజిస్టర్డ్ సంఘాలున్నాయి. వీటిలో 1,78,984 మంది ఉపాధ్యాయులు సభ్యులుగా ఉన్నారు. అయితే, గత సార్వత్రిక ఎన్నికల అనంతరం టీడీపీ కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులతో సఖ్యతగా ఉన్నట్లు చెప్పుకునేందుకు గతేడాది సెప్టెంబరులో విద్యా సంబంధ సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశాలకు కేవలం గుర్తింపు సంఘాల నాయకులను మాత్రమే ప్రభుత్వం ఆహ్వానించి, రిజిస్టర్డ్ సంఘాలను దూరం పెట్టింది. ఈ ఎనిమిది నెలల్లో రిజిస్టర్డ్ సంఘాలతో కేవలం రెండు సమావేశాలను మాత్రమే నిర్వహించింది. కానీ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో.. గుర్తింపు సంఘాల నుంచి శుక్రవారం మళ్లీ నిరసన సెగ తగలడంతో రిజిస్ట్ర్డ్ సంఘాలను మచ్చిక చేసుకునేందుకు వచ్చే బుధవారం ఆ సంఘాలతో చర్చలు జరపాలని విద్యాశాఖ నిర్ణయించి వాటిని ఆహ్వానించింది. కానీ, ఈ సంఘాల నేతలు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నారు.ఉపాధ్యాయుల సర్దుబాటుపై తీవ్ర విమర్శలు..ఇక గత ప్రభుత్వం ఇచ్చిన జీఓ–117 ప్రకారం.. ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1 : 20గా ఉంటే.. టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఉపాధ్యాయుల సర్దుబాటు, కేటాయింపులో ఏకీకృత విధానం లేకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో తొమ్మిది రకాల స్కూళ్లను ఏర్పాటుచేయడం ఒక ఎత్తయితే, చాలా పాఠశాలలను విలీనం చేయడంతో విద్యార్థులు బడులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. హైసూ్కళ్లల్లో 3–4 తరగతులున్నా సబ్జెక్టు టీచర్ విధానం రద్దుచేయడం, యూపీ స్కూళ్లల్లోను ఉన్నత తరగతులకు ఎస్జీటీలనే కేటాయించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.కొన్ని ప్రైమరీ స్కూళ్లల్లో టీచర్–విద్యార్థుల నిష్పత్తి 1 : 30గా ఉంటే మరికొని్నంటిలో 1 : 5గా ఉంది. ఈ సర్దుబాటు క్రమంలో ఉపాధ్యాయులు భారీగా మిగులుగా ఏర్పడుతున్నారు. దీంతో.. స్కూల్ అసిస్టెంట్లను ప్రాథమిక పాఠశాలల్లో హెచ్ఎంలుగా నియమించడం, మరికొందరిని క్లస్టర్ పూల్లోను, ఇంకొందరిని హెచ్ఓడీ పూల్లోను పెట్టడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఒకరకంగా ఇది ఉపాధ్యాయులను గాలిలో పెట్టడమేనని వారంటున్నారు. ఇప్పటికే జిల్లాల్లో డీఈఓ పూల్ ఉండగా, దీనికి ఇవి అదనంగా జతచేయడం గమనార్హం. మెరుగైన ఫలితాల కోసం గత ప్రభుత్వం 3–5 తరగతులకు సబ్జెక్టు టీచర్ బోధన అమలుచేస్తే ఇప్పుడు తొలగించడమేంటని, యూపీ స్కూళ్లల్లో సైతం స్కూల్ అసిస్టెంట్లను తొలగించి మిగులు చూపడం ఎందుకని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈనెల 21న డీఈఓ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చాయి. -
రెడ్బుక్ రాజ్యాంగానికి ఇది పరాకాష్ట
సాక్షి, అమరావతి/సాక్షి,నెట్వర్క్: ఎన్నికల హామీలు అమలుచేయకపోవడం.. రాజకీయ కక్ష సాధింపులతో టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని.. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్కు మరోసారి తెరతీశారని వైఎస్సార్సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెడ్బుక్ రాజ్యాంగానికి ఇది పరాకాష్టని.. దాని అమలులో భాగంగానే గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపైనా కక్ష సాధిస్తున్నారని భూమన కరుణాకరరెడ్డి, సాకే శైలజానాథ్, అంబటి రాంబాబు, గడికోట శ్రీకాంత్రెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, వరుదు కళ్యాణి, మార్గాని భరత్రాం శనివారం వేర్వేరుచోట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. రానున్న రోజుల్లో కూటమి నేతలకు ప్రజలు తగిన బుద్ధిచెబుతారని వారు హెచ్చరించారు. ఎవరెవరు ఏమన్నారంటే..ప్రజల దృష్టి మరల్చేందుకే అక్రమ అరెస్టులు..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీని నాశనం చేయాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రిటైర్డ్ అధికారులను అక్రమంగా అరెస్టుచేసింది. వైఎస్ జగన్ను బలహీనపరచాలనే దురుద్దేశంతోనే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. దీనికి పరాకాష్టగా అసలు జరగని మద్యం స్కాంలో రిటైర్డ్ అధికారులు ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డిలను అరెస్టుచేయడం విడ్డూరం. నిజాయితీపరులైన అధికారులను జైళ్లకు పంపిన చంద్రబాబు సర్కారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – భూమన కరుణాకర్రెడ్డి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి లిక్కర్ స్కాంలో అసలు దోషి బాబే..లిక్కర్ స్కాంలో అసలు దోషి చంద్రబాబే. ఆధారాలతో సహా సీఐడీకి దొరికిన ఆయన, సీఎం కాగానే కేసు దర్యాప్తును అడ్డుకున్నారు. ప్రివిలేజ్ ఫీజు రద్దుతో అప్పట్లో బార్లకు చంద్రబాబు మేలు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ కుంభకోణం జరగకపోయినా జరిగినట్లు తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి రిటైర్డ్ అధికారులు కె. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిని అక్రమంగా అరెస్టుచేశారు. 2014–19 మధ్య చంద్రబాబు పాలనలోనే భారీ లిక్కర్ స్కాం జరిగింది. అందులో చంద్రబాబు నిందితుడు. బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దుచేసి, వాటి యజమానులకు దాదాపు రూ.1,300 కోట్ల లాభం చేకూర్చారు.2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు కూడా అదే స్థాయిలో మద్యం స్కాం జరుగుతోంది. ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న లిక్కర్ స్కాంలో ఇలాంటిది ఉందా? ఇక మద్యం షాపులను ప్రభుత్వం నడిపిస్తే ఆదాయం వస్తుందా? ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఆదాయం వస్తుందో టీడీపీ నేతలు చెప్పాలి. ఏపీలో ఉన్న అన్ని డిస్టిలరీలకు అనుమతులిచ్చింది చంద్రబాబే. అంతేకాక.. 69 శాతానికి పైగా ఆర్డర్లు నాలుగైదు డిస్టిలరీలకే ఇచ్చారు. ఇదంతా స్కాం కాదా? పైగా.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం నడిపే మద్యం షాపులను తిరిగి ప్రైవేటు వ్యక్తులకే అప్పగించారు. – సాకే శైలజానాథ్, మాజీమంత్రి జైలు అధికారుల మార్పులో బాబు కుట్ర..విజయవాడ జైలు అధికారులను హఠాత్తుగా మార్చడం వెనుక చంద్రబాబు భారీ కుట్ర ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసుల్లో అరెస్టయిన వారంతా విజయవాడ జైలులో ఉన్నందున వారిని వేధించేందుకే తాము చెప్పినట్లు నడుచుకునే అధికారులను అక్కడ నియమించారు. ఒకవైపు సంబంధంలేని అంశాల్లో కొందరు ప్రభుత్వాధికారులపై తప్పుడు కేసులు బనాయించడం, అక్రమ అరెస్టులతో వారిని జైలులో హింసించాలన్నదే చంద్రబాబు కుతంత్రంగా కనిపిస్తోంది. 2018–19లో లిక్కర్ ఆదాయం దాదాపు రూ.16,900 కోట్లు అయితే.. 2023–24లో అది రూ.24,700 కోట్లు. నిజంగా, చంద్రబాబు చెబుతున్నట్లుగా వైఎస్సార్సీపీ హయాంలో లిక్కర్ స్కాం జరిగితే ప్రభుత్వానికి లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయం ఎలా పెరిగింది? వైఎస్సార్సీపీ హయాంలో లిక్కర్ అమ్మకాలు తగ్గి ఆదాయం పెరిగింది. అదే ఇప్పుడు బాబు హయాంలో లిక్కర్ సేల్స్ పెరిగి ఆదాయం తగ్గింది. దీని మతలబు ఏమిటో చంద్రబాబే చెప్పాలి. ఈ తగ్గిన ఆదాయం ఎవరి జేబుల్లోకి పోతోంది? ఇది స్కాం కాదా? – మార్గాని భరత్, వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ అణిచివేయాలనుకుంటే మరింత బలోపేతమవుతాం..వైఎస్సార్సీపీని అణిచివేయాలని చూస్తే మరింత బలోపేతమవుతాం. గతంలో ఒకసారి వైఎస్సార్సీపీని అణగదొక్కాలని కాంగ్రెస్తో చంద్రబాబు జట్టు కట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ నామరూపాలు లేకుండాపోయింది. అధికారంలోకి వచ్చిఏడాదైనా ఎన్నికల హామీలను అమలుచేయడంపై చంద్రబాబు దృష్టిపెట్టలేదు. మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై కక్ష సాధింపు చర్యలకే పరిమితమయ్యారు. వైఎస్ జగన్ బలహీనపరిచేందుకు లిక్కర్ స్కామ్ సృష్టించారు. – అంబటి రాంబాబు, మాజీ మంత్రిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అక్రమ అరెస్టులు..చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయలేకపోవడంతోపాటు పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకే రాజకీయ కక్ష సాధింపు చర్యలకు, అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో బెల్ట్ షాపులు పూర్తిగా రద్దుచేసి, మద్యం షాపులు, అమ్మకాలు తగ్గిస్తే స్కాం జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబుకి దమ్ముంటే ఆయనపై నమోదైన ఇన్నర్ రింగ్రోడ్డు స్కాం, లిక్కర్ కుంభకోణం, ఏపీ ఫైబర్నెట్ స్కాం, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాలపై విచారణకు సిద్ధం కావాలి.– ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుబాబు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు..రాష్ట్రంలో రెడ్బుక్ రాజకీయ అరాచకం ఎక్కువైంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాజకీయ నాయకులపైనే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్లపై కూడా అక్రమ కేసులు పెడుతున్నారు. కొందరు అధికారులకు పోస్టింగ్స్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. సర్వీస్లో ఉన్న వారినే కాకుండా రిటైర్డ్ అధికారులనూ అరెస్టు చేస్తున్నారు. ఒక్క ఆధారం లేకపోయినా లిక్కర్ స్కాం జరిగిందంటూ తప్పుడు సాక్ష్యాలు సృష్టించి అక్రమ అరెస్టులు చేస్తున్నారు. చివరకు హైకోర్టు న్యాయమూర్తులు అక్షింతలు వేసినా సిగ్గులేకుండా ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోంది. వైఎస్ జగన్ను నైతికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. – గడికోట శ్రీకాంత్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబు లిక్కర్ స్కాం రూ.10వేల కోట్లు..మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో రూ.3,200 కోట్ల మేర లిక్కర్ స్కాం జరిగిందంటూ అనవసర యాగీ చేస్తున్న టీడీపీ కూటమి పెద్దలు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి చెప్పడంలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఘాటుగా విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ప్రతి బ్రాందీ షాపు నుంచి పోలీస్స్టేషన్కు, ఎక్సైజ్ స్టేషన్కు మామూళ్లు అందుతున్నాయని, తమ ప్రభుత్వంలో మామూళ్ల ప్రస్తావనే లేదన్నారు. ప్రస్తుతం ప్రతి మద్యం షాపు యజమాని ఎక్సైజ్ శాఖకు రూ.70 వేలు, పోలీస్స్టేషన్కు రూ.30 వేలు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా చెల్లిస్తున్నారని, కిందిస్థాయి నుంచి అమరావతి వరకు ఎవరి వాటా వారికి చేరుతోందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. తద్వారా నెలకు సుమారు రూ.100 కోట్ల వరకు మద్యం మామూళ్లు యువరాజు లోకేశ్కు అందుతున్నాయని ఆరోపించారు. నెలకు రూ.100 కోట్ల చొప్పున ఏడాదికి రూ.1,200 కోట్ల అవినీతి జరుగుతోందన్నారు. ఇక డిస్టలరీల నుంచి నేరుగా చంద్రబాబుకు ఏడాదికి రూ.1,000 కోట్లు అందుతోందన్నారు. నక్కలు, తోడేళ్లు కలిసి రూ.1,000 కోట్లు తింటే.. సింహం ఏకంగా రూ.1,000 కోట్లు ఆర్జిస్తోందన్నారు. ఇలా కూటమి ప్రభుత్వంలో మద్యం పాలసీకి సంబంధించి రూ.10వేల కోట్లకు పైగా అవినీతి జరుగుతుంటే.. జగన్ ప్రభుత్వంలో రూ.3,200 కోట్లు అవినీతి జరిగిందని చెబుతున్నారన్నారు.ఇదే అత్త కోడలికి సుద్దులు చెప్పడం అని రాచమల్లు ఎద్దేవా చేశారు. ఆరు పథకాలను అమలుచేయలేని చంద్రబాబు 60 కేసులు పెట్టి 60 మందిని జైలుకు పంపాడని, ఇచ్చిన హామీలను అమలుచేయలేకపోతున్నాడన్నారు. మద్యం పాలసీకి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వానిది అంతా దోపిడీ అని, ఐదేళ్లలో రూ.10వేల కోట్ల అవినీతి జరుగుతుందని, టీడీపీ నేతలకు దమ్ముంటే ఎవరైనా దీనికి సమాధానం చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. – మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి..అరాచక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం దిగిపోయే రోజులు దగ్గరపడ్డాయి. రాజ«దాని పేరుతో కూటమి ప్రభుత్వం రూ.వేల కోట్లు దోచుకుంటోంది. హామీల అమలును విస్మరించి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు. – ఆకేపాటి అమరనాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేరాష్ట్రంలో శాంతిలేదు..రాష్ట్రంలో ఎక్కడా శాంతి లేదు.. ప్రజలకు భద్రత అసలు లేదు. ఏపీలో పోలీస్ వ్యవస్థ చంద్రబాబు కబంధ హస్తాల్లో చిక్కుకుపోయింది. శనివారం అనంతపురం జిల్లా రాప్తాడులో దంపతులను టీడీపీ రౌడీమూకలు చంపినట్లు ప్రాథమిక సమాచారం ఉంది. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలోనే ఈ హత్యలు జరిగి ఉంటాయి. – గోరంట్ల మాధవ్, వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ -
ఉత్తరాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ప్రస్తుతం దక్షిణ అరేబియా సముద్రం, కొమొరిన్, మాల్దీవులు, తూర్పు బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి విస్తరించింది. దక్షిణ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నాలుగైదు రోజుల్లో విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఉంది. మరోవైపు పశి్చమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిమీ ఎత్తులో కొనసాగుతోంది.ఈ ఉపరితల ఆవర్తనంలో దక్షిణ కోస్తా నుంచి యానాం వరకూ విస్తరించిన ద్రోణి విలీనమైంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు మూడు రోజుల పాటు భిన్న వాతావరణం కొనసాగనుంది. వడగాలులు, రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదుతో పాటు ఈదురుగాలులు, వర్షాలు కూడా కురిసే సూచనలున్నాయి. ఆది, సోమవారాల్లో కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో మాత్రం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వెల్లడించారు. ఈనెలాఖరుకు వేసవి ముగింపు ఈనెల నాలుగో వారం నాటికి రాష్ట్రంలో ఎండాకాలం దాదాపు ముగిసి పోయినట్లేనని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రుతుపవనాలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఈ నెల 26 నుంచి రాయలసీమ అంతటా, 29 తర్వాత రాష్ట్రమంతటా చల్లని వాతావరణం ఏర్పడుతుందని భావిస్తున్నారు. రాష్ట్రమంతటా జల్లులతో కూడిన వర్షాలు మొదలవుతాయని అధికారులు చెబుతున్నారు. నేడు పలు ప్రాంతాలకు వర్ష సూచన రాష్ట్రంలో ఆదివారం అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం చిత్తూరు జిల్లా దామోదర మహారాజపురంలో 4.9 సెంటీమీటర్లు, ప్రకాశం జిల్లా డిజిపేటలో 4.7, కర్నూలులో 4.6, చిత్తూరు జిల్లా ముత్తుకూరు 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 41.3 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కొనకనమిట్ల, పల్నాడు జిల్లా రావిపాడులో 40.3, ఏలూరు జిల్లా ఎస్.రాఘవపురంలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
చచ్చేలా కొట్టి.. మూత్రం తాగించి..
సాక్షి, టాస్క్ ఫోర్స్: దళితుడిగా పుట్టడమే ఓ బీటెక్ విద్యార్థికి శాపంగా పరిణమించింది. సీనియర్ అన్న గౌరవం కూడా లేకుండా తరచూ కులం పేరుతో దూషిస్తున్న జూనియర్కు అది తగదని చెప్పడమే పాపమై పోయింది. ఆ జూనియర్ రౌడీషీటర్లతో కలిసి దళిత విద్యార్థిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. కారులో కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టారు. కత్తులతో తలపై కోశారు. అరవకుండా నోట్లో డ్రాయర్ (అండర్ వేర్) కుక్కారు. హాకీ స్టిక్లు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా మూత్రం తాగించారు. ఇంత తీవ్ర అవమానంతో న్యాయం కోసం వెళ్తే పోలీసులు తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి మిన్నకుండిపోయారు.ఈ అమానవీయ ఘటనకు సంబంధించి బాధిత విద్యార్థి విడుదల చేసిన వీడియో వైరల్గా మారింది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలోని ఓ కళాశాలలో జేమ్స్ అనే విద్యార్థి బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలలోని తన జూనియర్ యశ్వంత్ నాయుడు తరచూ కులం పేరుతో దూషిస్తూ, జేమ్స్ను తీవ్రంగా అవమానిస్తున్నాడు. ఇటీవల యశ్వంత్ మరోసారి తీవ్రంగా అవమానించడంతో అలా మాట్లాడటం తగదని జేమ్స్ బదులిచ్చాడు. దీంతో అతనిపై యశ్వంత్ నాయుడు కక్ష పెంచుకున్నాడు.‘మంగళవారం’ మంగళం సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న తన బావను కలిసేందుకు జేమ్స్ వెళ్లాడు. ఆ విషయం తెలుసుకున్న యశ్వంత్ నాయుడు.. రౌడీషిటర్ రూపేష్, మరో రౌడీషిటర్ చోటా బ్లేడ్, కిరణ్, జగ్గ, నానిలతో కారులో అక్కడికి వెళ్లాడు. జేమ్స్ను బలవంతంగా కారులో ఎక్కించుకొని బూతులు తిడుతూ.. కులం పేరుతో దూషించాడు. ఆపై కారులో అందరూ పిడిగుద్దులు గుద్దుతూ హాకీ స్టిక్స్, రాడ్లతో ఇష్టం వచ్చినట్టు కొట్టారు. కత్తితో తలపై గాయ పరిచారు. మూత్రం పోసి తాగించారు. బాధితుడు అరవకుండా నోట్లో డ్రాయర్ కుక్కారు. లాడ్జిలో బంధించి మరోమారు దాడి జేమ్స్ను తిరుచానూరు సమీపంలోని ఓ లాడ్జిలోకి తీసుకెళ్లి చేతులు, కాళ్లు కట్టేసి ఓ గదిలో బంధించారు. ఒకటిన్నర రోజులపాటు చిత్రహింసలకు గురిచేశారు. హోటల్ యజమానితో పాటు అందరూ మరోమారు దాడి చేశారు. ముఖంపై మూత్రం పోశారు. కత్తితో పొడవడానికి ప్రయత్నిస్తుండగా కొంత మంది అక్కడికి రావడంతో వారంతా అక్కడ నుంచి వెళ్లిపోయారు. జేమ్స్ అపస్మారక స్థితిలో ఉండగా.. అక్కడికి వచి్చన వారు (ఎవరో తెలియదు) కట్లు విప్పి ఆస్పత్రికి తరలించారు. కొంచెం కోలుకున్న తర్వాత తిరుచానూరు పోలీస్ స్టేషన్కి వెళ్లి జరిగిన విషయం పోలీసులకు వివరించాడు.ఆ మేరకు ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు స్వీకరించ లేదు. వారిపై కేసు కట్టేంత ధైర్యం తమకు లేదని నిస్సిగ్గుగా స్పష్టం చేశారు. సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లోనే ఉండి బతిమాలినా పట్టించుకోలేదు. మరుసటి రోజు పోలీసుస్టేషన్కు వెళితే ఫిర్యాదులో కొంత మంది పేర్లు తొలగించి మరో ఫిర్యాదు ఇస్తే తీసుకుంటామని తెలిపారు. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని జేమ్స్ చెప్పడంతో పోలీసు సిబ్బందే తూతూ మంత్రంగా ఫిర్యాదు రాసి బాధితుడి వద్ద సంతకం తీసుకున్నారు.ఇదేమిటని ప్రశ్నిస్తే తీవ్రంగా బెదిరించారని బాధితుడు వాపోయాడు. కాగా, జేమ్స్ కుడి కన్నుకు తీవ్ర గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నిందితులకు అధికార టీడీపీ అండ ఉండటంతో కేసు తీసుకోవడానికి పోలీసులు వెనకాడుతున్నట్లు సమాచారం. -
బాబుకు ఈనాడు నిత్య సన్మానం పాత్రికేయానికి తీరని అవమానం
సాక్షి, అమరావతి: ఎద్దు ఈనిందంటే గాటికి కట్టేయండన్న చందంగా తయారైంది ఎల్లో మీడియా. ప్రజలు ఏమనుకుంటారన్న సిగ్గూ, ఎగ్గూ లేకుండా చంద్రబాబు కోసం ఎంతగా బరితెగించడానికైనా సై అంటోంది. వలువలూడదీసుకుని పచ్చి అబద్ధాలను అచ్చేస్తోంది. వ్యవసాయానికి పగటి పూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్ను 30 ఏళ్ల పాటు హక్కుగా అందించాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ–సెకీ)తో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై విషం చిమ్ముతూనే ఉంది. ఈ ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) వరకు అన్ని విధాలుగా ఆమోదం లభించింది. అయినా గత ప్రభుత్వంపై బుదర జల్లాలి.. జగన్పై నిందలు వేయాలి.. ఒప్పందంపై విషం గక్కాలి.. అనే అజెండాతో అర్థం లేని ఆరోపణలు చేస్తూ టీడీపీ కరపత్రం ఈనాడు, ఎల్లో మీడియా అసత్య కథనాలను వండివారుస్తూనే ఉంది. తాజాగా సెకీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) రామేశ్వర్ ప్రసాద్ గుప్తాను కేంద్ర ప్రభుత్వం ఆ పదవి నుంచి తప్పించడాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంతో ముడిపెట్టి ఈనాడు పచ్చి అబద్ధాలతో శనివారం ఓ తప్పుడు కథనాన్ని అచ్చేసింది.ఎప్పుడో 2021లో జరిగిన ఒప్పందానికి 2023లో సీఎండీగా చేరిన అధికారికి సంబంధం ఏమిటనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా దిగజారుడు రాతలతో తన నైజాన్ని చాటుకుంది. ‘సెకీ’తో ఒప్పందం కారణంగా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లపై ఆరి్ధక భారం పడుతుందని, అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీ (ఐఎఎస్టీఎస్)ల నుంచి మినహాయింపు లభించదని ఇప్పటికే అనేక సార్లు అసత్య కథనాలను రాసి భంగపడ్డ టీడీపీ కరపత్రం ఇప్పుడు అభూత కల్పనలతో ప్రజలను ఏమార్చాలని చూస్తోంది. యూనిట్ రూ.2.49 చవక ధరకే సౌర విద్యుత్ను అందించే సెకీ ఒప్పందంపై ఇంతగా విషం చిమ్ముతున్న ఈనాడు.. అంతకు దాదాపు రెట్టింపు ధర యూనిట్ రూ.4.60తో చంద్రబాబు ప్రభుత్వం యాక్సిస్ అనే ప్రైవేటు సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే మాత్రం కళ్లున్న గుడ్డి వాడిలా నటిస్తోంది. ముడుపులకు ఆస్కారం ఎక్కడ? ⇒ వైఎస్ జగన్ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న నిబద్ధత చూసి, యూనిట్ రూ.2.49 చవక ధరకే సౌర విద్యుత్ను అందిస్తామంటూ 2021 సెపె్టంబర్ 15న సెకీ లేఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. ప్రాజెక్టు వాణిజ్య కార్యకలాపాల (కమర్షియల్ ఆపరేషన్ డేట్)తో సంబంధం లేకుండా ప్రత్యేక ప్రోత్సాహకంగా ఐఎస్టీఎస్ చార్జీల నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచి్చందని ఆ లేఖలో సెకీ స్పష్టంగా పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాంటి చార్జీలు వర్తించవని లేఖలో వివరంగా చెప్పింది. రెండు నెలల సుదీర్ఘ చర్చలు, సమగ్ర అధ్యయనం తర్వాత సెకీతో గత ప్రభుత్వం, డిస్కంలు మధ్య త్రైపాక్షిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగింది. ఇందులో ఎలాంటి రహస్యం లేదు. రాష్ట్ర మంత్రి మండలితో పాటు ఏపీఈఆర్సీ ఆమోదంతో అత్యంత పారదర్శకంగా బహిరంగంగానే ఈ ఒప్పందం జరిగింది. ⇒ సెకీతో ఒప్పందం వల్ల రాష్ట్రానికి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ యూనిట్ రూ.2.49కే పాతికేళ్ల పాటు సరఫరా అవుతుంది. ఈ ధర అప్పటికి ఎనీ్టపీసీ సరఫరా చేస్తున్న సౌర ధర రూ.2.79 కన్నా 30 పైసలు తక్కువ. ప్రస్తుతం చంద్రబాబు కుదుర్చుకున్న రూ.4.60 కన్నా రూ.2.11 తక్కువ. ⇒ ప్రస్తుతం రాష్ట్రం కొనుగోలు చేస్తున్న విద్యుత్ యూనిట్కు సగటున రూ.5.10 ఖర్చు అవుతోంది. ఈ లెక్కన ఏటా దాదాపు రూ.3,750 కోట్లు సెకీ విద్యుత్ వల్ల ఆదా అవుతుంది. కానీ ఈ ఒప్పందంలో ముడుపుల వ్యవహారం వల్లే సెకీ సీఎండీని కేంద్రం తప్పించిందంటూ ఈనాడు వక్ర భాష్యం చెప్పింది. ముడుపులే కావాలనుకుంటే చంద్రబాబులా ప్రైవేటు సంస్థలతోనే ఒప్పందం కుదుర్చుకునేవారు కదా..? ఇంత చిన్న లాజిక్ కూడా ఈనాడుకు తెలియదా? ⇒ అదీకాక 2021లో ఒప్పందం జరిగినప్పుడు గుప్తా సెకీ సీఎండీనే కాదు. ఆయన ఆ పదవి చేపట్టిందే 2023 జూన్లో. ఈనెల 10న ఆయ న్ను పదవి నుంచి తొలగించారు. అంటే సెకీ ఒప్పందం జరిగినప్పుడు ఆయన పదవిలోనే లేరు. అలాంటిది ఆ ఒప్పందంతో ఆయనకు ఎలా ముడిపెడతారనే కనీస జ్ఞానం కూడా టీడీపీ కరపత్రానికి లేకుండా పోయిందని విద్యుత్ రంగ నిపుణులు విస్తుపోతున్నారు. బురదజల్లడమే పని⇒ ఈ ఒప్పందంలో రైతుల పట్ల జగన్కు నిబద్ధత తప్ప స్వప్రయోజనం అనేది మచ్చుకైనా కనిపించదు. అయితే ఈ ఒప్పందంలో ఏ మాత్రం ప్రమేయం లేని అదానీ నుంచి లంచాలందాయంటూ గత ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని హననం చేస్తోంది కూటమి ప్రభుత్వం. అమెరికాలో అదానీ సంస్థపై అభియోగాలు నమోదైతే దానికి జగన్కు ముడిపెట్టి అత్యుత్సాహంతో విష ప్రచారం చేస్తూ.. పుంఖానుపుంఖాలుగా అసత్యాలు వండి వార్చింది టీడీపీ అనుబంధ పత్రిక ఈనాడు. ⇒ వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్న జనాదరణను తగ్గించకపోతే చంద్రబాబుకు మళ్లీ వానప్రస్థం తప్పదని భయపడుతున్న ఈనాడు.. అమెరికాలో నమోదైన కేసులో జగన్ పేరు లేకపోయినా ఉందంటూ పచ్చి అబద్దాన్ని ప్రచారం చేస్తోంది. దానికి అనుబంధంగానే సెకీ చైర్మన్ తొలగింపునూ ఈ ఒప్పందానికి ముడి పెడుతూ కుట్రలు పన్నుతోంది. దాదాపు 18 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్తు అందటమే మహాపరాధంగా చిత్రీకరిస్తోంది. ⇒ గతేడాది నవంబర్లో గౌతమ్ అదానీ, ఇతర కార్యనిర్వాహకులపై లంచం తీసుకున్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు అభియోగం మోపినప్పుడు, వాటికి ఎలాంటి ఆధారాలు లేనందున సెకీ ఆ ఆరోపణలపై ఎలాంటి విచారణ చేపట్టదని గుప్తా ప్రకటించారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఖండించారు. గతేడాది నవంబర్ 6న, నకిలీ పత్రాలను సమరి్పంచారనే ఆరోపణలతో రిలయన్స్ పవర్, దాని అనుబంధ సంస్థ రిలయన్స్ ఎన్యు బిఇఎస్ఎస్ను మూడు సంవత్సరాల పాటు టెండర్లలో పాల్గొనకుండా సెకీ నిషేధించింది. ⇒ కానీ ఢిల్లీ హైకోర్టు ఆదేశం తర్వాత ఆ నిషేధాన్ని ఉపసంహరించుకుంది. ఈ ఏడాది మేలో, రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ ఎన్యు సన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్తో 25 ఏళ్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం (సీపీఏ)పై సెకీ సంతకం చేసింది. దీనికి తప్పుడు ధృవపత్రాలను సృష్టించారనే ఆరోపణలు వెల్లువెత్తడంతోనే కేంద్రం నెల రోజుల్లో పదవీ విరమణ చేయనున్న గుప్తాను ఉన్నపళంగా తొలగించిందంటూ జాతీయ మీడియా ఇప్పటికే అనేక కథనాల్లో వెల్లడించింది. ఈ వాస్తవాన్ని ఈనాడు నిస్సిగ్గుగా దాస్తోంది. అది జర్నలిజమా? లేక బ్రోకరిజమా? ఈనాడుపై వైఎస్సార్సీపీ మండిపాటు‘వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం కోసం పత్రిక పేరుతో ఇంతగా దిగజారిపోతారా? నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తారా? ఈనాడుది జర్నలిజమా? లేక బ్రోకరిజమా?’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నించింది. సెకీ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఈనాడు పత్రిక చేస్తున్న అసత్యాలను ఖండిస్తూ ‘ఎక్స్’లో ఆ పార్టీ ఈ మేరకు పోస్టు చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందం 2021 డిసెంబర్లో జరిగిందని, 2023లో సెకీ సీఎండీగా రామేశ్వర్ గుప్తాను నియమించారని తెలిపింది. అలాంటప్పుడు ఏపీ–సెకీ ఒప్పందానికి ఏం సంబంధం ఉంటుందని ఆ పార్టీ ప్రశ్నించింది.‘సెకీకి రామేశ్వర్ గుప్తా సీఎండీ కాక ముందు కేంద్ర పర్యావరణ శాఖ సెక్రటరీగా పనిచేశారు. అనిల్ అంబానీ కంపెనీ ఫేక్ డాక్యుమెంట్లతో బిడ్డింగ్ వేశారన్న ఆరోపణల నేపథ్యంలో రామేశ్వర్ గుప్తాను తొలగించినట్టుగా ఐదారు రోజుల క్రితమే జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలను వక్రీకరించి ఏపీ సెకీ ఒప్పందానికి లింకు పెడుతూ నిస్సిగ్గుగా ఎల్లో పత్రిక ఈనాడు పచ్చి అబద్ధాలు రాసింది. ఈనాడుకు ధైర్యం ఉంటే సెకీతో ఒప్పందాన్ని రద్దు చేయమని మీ గ్యాంగ్ లీడర్ చంద్రబాబుకు చెప్పు. ఈనాడులో రూ.1.90కే యూనిట్ సౌర విద్యుత్ వస్తుందని రాశారు. మరలాంటప్పుడు మొన్న యాక్సిస్తో రూ.4.60కి కొనుగోలు చేస్తూ ఎందుకు ఒప్పందం చేసుకున్నావని దమ్ముంటే చంద్రబాబును ప్రశ్నించు. లేదా తప్పుడు రాతలు రాసినందుకు ప్రజల్ని క్షమాపణలు కోరాలి’ అంటూ ఈనాడు రాసిన ఫేక్ న్యూస్ కథనాన్ని జత చేసి, శనివారం ఎక్స్ పోస్ట్లో వైఎస్సార్సీపీ నిలదీసింది. -
శ్రీశైలం డ్యామ్ విపత్తుతో అమరావతికీ ముప్పు.!
సాక్షి, విశాఖపట్నం: శ్రీశైలం డ్యామ్ ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) హెచ్చరించినా ఇంతవరకు ఎందుకు మరమ్మతులు చేపట్టలేదని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఘాటుగా ప్రశ్నించారు. ఈ అంశంపై తక్షణమే స్పందించాలని కోరుతూ ఈ ఏడాది మార్చి 7న ఓ లేఖ రాసినా.. ఎందుకు స్పందించలేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి శనివారం మరోసారి శర్మ బహిరంగ లేఖాస్త్రం సంధించారు. 2012లో కనీవినీ ఎరుగని రీతిలో వచ్చిన వరద వల్ల డ్యామ్ క్రమక్రమంగా ప్రమాద స్థితికి చేరుకుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.చంద్రబాబుకు రాసిన లేఖలో శర్మ ఏం చెప్పారంటే... ‘2014లోనూ అప్పటి టీడీపీ ప్రభుత్వం డ్యామ్ ప్రమాదకర స్థితిలో ఉన్న విషయాన్ని పట్టించుకోలేదు. ఏడాది క్రితం ఎన్డీఎస్ఏ మరోసారి హెచ్చరించినా.. ఎందుకు స్పందించలేదు.? తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిని పట్టించుకోవడం లేదు. శ్రీశైలం డ్యామ్ కింద వైపున.. పునాదికి దగ్గరలో పెద్ద ఎత్తున కోతకు గురైంది. దీని వల్ల డ్యామ్ కట్టడానికి ముప్పు ఉందని, 2025 వర్షా కాలంలోగా తాము సూచించిన తాత్కాలిక మరమ్మతులు తక్షణమే చేపట్టాలంటూ ఎన్డీఎస్ఏ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. ఇంత వరకూ మీ ప్రభుత్వం అలాంటి మరమ్మతులేవీ చేపట్టలేదు. దీనిపై ఎన్డీఎస్ఏ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది.తాత్కాలిక మరమ్మతులతోపాటు దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలని, పునాది కింద ఏర్పడిన భౌగోళిక మార్పులపై నిపుణుల సహాయంతో అధ్యయనం చేసి త్వరగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కూడా ఎన్డీఎస్ఏ చెప్పింది. అయినా ఏమాత్రం స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో గనుక విపత్తు సంభవిస్తే.. కృష్ణానది కింద ఉన్న ప్రాంతాలు అంటే నాగార్జున సాగర్ డ్యామ్కు, గుంటూరు, నల్గొండ, కృష్ణా జిల్లాలకు ముంపు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. వందలాది గ్రామాలు నీటమునిగిపోతాయి. విజయవాడ, గుంటూరు నగరాలే కాకుండా.. కొత్తగా నిర్మిస్తున్న అమరావతి కట్టడాలకూ ముంపు ముప్పు వాటిల్లక తప్పదు.వాతావరణ మార్పుల వల్ల రాష్ట్రంలోని అన్ని నదుల్లోనూ వర్షాకాలంలో ప్రమాద స్థాయిలో వరద వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా శ్రీశైలం డ్యామ్కి మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టండి. ఎన్డీఎస్ఏ హెచ్చరికలకు అనుగుణంగా.. డ్యామ్ పనుల్ని సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ) నిపుణుల పర్యవేక్షణలో చేపట్టాలి. అని ఈఏఎస్ శర్మ బాబుకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. -
జనరేషన్ కష్టాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కొత్త రేషన్కార్డుల కోసం ప్రభుత్వం విధించిన నిబంధనలు ప్రజలకు గుదిబండగా మారాయి. వివాహ రిజిస్ట్రేషన్ సర్టీఫికెట్ తప్పనిసరి చేయడంతో తరాలతో సంబంధం లేకుండా ఎప్పుడో పెళ్లయిన వారూ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. కొత్త కార్డుల దరఖాస్తుకు గడువు 15 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొత్తగా పెళ్లయిన జంటలతోపాటు ఇంత వరకు రేషన్కార్డు లేని వారు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవడంతో మొదలయ్యే ప్రక్రియ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్టీఫికెట్ వచ్చే వరకు ప్రహసనంగా మారుతోంది. స్లాట్ విధానంలో లోపాలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్లో లోపాల వల్ల మ్యారేజ్ సర్టీఫికెట్ కోసం వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారు. ఒకే సమయానికి ఎక్కువ మందికి స్లాట్ ఇవ్వడం వల్ల పిల్లాపాపలతో గంటల తరబడి కార్యాలయాల వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది. మండే ఎండలతో నరకం చవి చూడాల్సిన దుస్థితి నెలకొంది. వాస్తవానికి ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం ఒక సమయానికి.. ఒక స్లాట్ విధానమే అమలులో ఉంది. కానీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్కు మాత్రం ఒకే సమయానికి ఎంతమందికి కావాలంటే అంతమందికి అధికారులు స్లాట్ ఇస్తున్నారు.ఈ–సైన్ సైట్లో నమోదు, భార్యాభర్తలు, ముగ్గురు సాక్షుల ఫింగర్ప్రింట్ల సేకరణ తదితర పనుల వల్ల ప్రక్రియ బాగా ఆలస్యమవుతోంది. దీనిని అవకాశంగా తీసుకుని కొందరు దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో రిజిస్ట్రేషన్కు రూ.2,500 నుంచి రూ.4,000 వంతున దరఖాస్తుదారుల నుంచి వసూలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత మంగళవారం ఒక్క రోజే కాకినాడ జిల్లా రిజి్రస్టార్ కార్యాలయానికి సుమారు 70 మంది మ్యారేజ్ రిజిస్ట్రేషన్లు కోసం దరఖాస్తులతో తరలివచ్చారు. ఇక్కడ ఈ పని అంతా చేసేది ఒకే ఒక సీనియర్ అసిస్టెంట్ కావడంతో దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పలేదు. కాకినాడ జిల్లాలోని సర్పవరం, ప్రత్తిపాడు, తాళ్లరేవు, సామర్లకోట, తుని తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలూ రోజూ మ్యారేజ్ సర్టీఫికేట్ల కోసం వచ్చేవారితో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయాల్లోనే.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయాల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్లు జారీ చేసేవారు. ఈ–సైన్ లేకపోవడంతో పది నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తయిపోయేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భార్యాభర్తలు, ముగ్గురు సాక్షులు, ఈ–సైన్ చేయాల్సి రావడంతో కష్టాలు తప్పడం లేదు.రిజిస్ట్రేషన్ కార్యాలయ ఉద్యోగులపై ఒత్తిడి మ్యారేజ్ సర్టీఫికెట్ కోసం రోజూ జనం పోటెత్తడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉద్యోగులపైనా ఒత్తిడి పెరుగుతోంది. సిబ్బంది అంతంతమాత్రంగా ఉండడంతో మానసిక వేదనకు గురవుతున్నారు. ఇలాంటి ఒత్తిళ్లతోనే ఇటీవల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ శివరాం మృతి చెందడాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. గ్రామ సచివాలయాలు లేదా, రిజి్రస్టార్ కార్యాలయాల్లోనూ మ్యారేజ్ సర్టీఫికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.సాయంత్రం వరకు పడిగాపులే రేషన్ కార్డు కోసం పెళ్లి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం. ముందు రోజు స్లాట్ బుక్ చేసుకున్నాను. పనులు అన్ని మానుకుని ఉదయమే 11 గంటలకు కాకినాడ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చాను. అప్పటికే పదుల సంఖ్యలో అర్జీదారులు ఉండటంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు పడాల్సి వచ్చింది. – కుంది కరుణ, జగన్నాథపురం, కాకినాడ -
రాజకీయ ప్రేరేపిత కేసే..
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ధరలను పెంచలేదు.. మద్యం ఉత్పత్తులపై పన్నులనే పెంచారు. గత టీడీపీ ప్రభుత్వంలో కంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యం విక్రయాలను గణనీయంగా తగ్గించింది. కానీ, పన్నులను పెంచడంతో ఎక్సైజ్ శాఖకు ఆదాయం పెరిగింది. దాంతోనే ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరిగింది. మరి ఎక్సైజ్ శాఖ ఆదాయం పెరిగితే ఇక ప్రభుత్వ ఖజానాకు నష్టం ఎక్కడ వాటిల్లింది..? కుంభకోణం ఎక్కడ జరిగింది..? అంటే ప్రభుత్వ ఖజానాకు రూ.3,200 కోట్ల నష్టం వాటిల్లిందని సిట్ చెబుతున్నది అంతా అవాస్తవమే కదా? సాక్షి, అమరావతి: ‘సిట్ నమోదు చేసింది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ కారణాలతోనే అక్రమ కేసు పెట్టింది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు అవినీతిపై నమోదైన కేసులను కప్పిపుచ్చేందుకే ఈ కేసును నమోదు చేసింది’ అని మాజీ అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ ఏసీబీ న్యాయస్థానానికి వివరించారు. 2019–24 మధ్య మద్యం విధానంతో ప్రభుత్వ ఖజానాకు రూ.3,200 కోట్లు నష్టం వాటిల్లిందన్న సిట్ అభియోగానికి ఎలాంటి ప్రాతిపదిక లేదని స్పష్టం చేశారు.అందుకు సంబంధించి న్యాయస్థానానికి కనీసం ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయారని గుర్తు చేశారు. దీన్నిబట్టి స్కామ్ అనేది ఒక కట్టుకథ అని స్పష్టం చేశారు. సీఐడీ కేసును ఆ దర్యాప్తు సంస్థ పరిధిలోని ఇతర పోలీసు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ఈ కేసులో సిట్ అక్రమంగా అరెస్టు చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ్రెడ్డి, పి.కృష్ణమోహన్రెడ్డిల తరపున సీనియర్ న్యాయవాది శ్రీరామ్ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో శనివారం వాదనలు వినిపించారు. వారిద్దరిని సిట్ అధికారులు అక్రమంగా అరెస్టు చేశారని నిబంధనలను ఉటంకిస్తూ వివరించారు. అంశాల వారీగా శ్రీరామ్ వినిపించిన వాదనలు ఇలా ఉన్నాయి... చంద్రబాబు ప్రభుత్వం 5 డిస్టిలరీల నుంచే 69% మద్యం కొనుగోళ్లు చేసింది చంద్రబాబు అవినీతి కేసులను కప్పిపుచ్చేందుకే సిట్ ఈ అక్రమ కేసు నమోదు చేసింది. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు. దీనివెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని.. వాటిని ఎంతమాత్రం కొట్టిపారేయలేమని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్ను విచారిస్తూ ఆ విషయాన్ని స్పష్టం చేసింది. రాజకీయ పక్షపాతం, దురుద్దేశాలకు న్యాయపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది కూడా. 2014–19 మధ్యన చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై పలు కేసులు న్యాయస్థానాల్లో విచారణలో ఉన్నాయి.ఆ ఐదేళ్లలో ప్రభుత్వ మద్యం విధానం ద్వారా పాల్పడిన అవినీతిని ఇప్పటికే సీఐడీ నిర్ధారించి చంద్రబాబుతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్పై ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కేవలం 5 డిస్టిలరీల నుంచే ఏకంగా 69 శాతం మద్యం కొనుగోళ్లు చేసినట్లు అప్పటి సిట్ తన రిమాండ్ రిపోర్టులోనే పేర్కొంది. మంత్రి మండలికి తెలియకుండా మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేశారు. ఆ కేసులో ఆయన ముందస్తు బెయిల్పై ఉన్నారు. దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే సిట్ ద్వారా ఈ అక్రమ కేసు నమోదు చేయించారు. అంతెందుకు ఇప్పుడు అడ్డగోలుగా వేధిస్తున్న సిట్ రాజ్ కేసిరెడ్డి రిమాండ్ రిపోర్టులో కూడా 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం కేవలం నాలుగు డిస్టిలరీల నుంచే 54 శాతం మద్యం కొనుగోళ్లు చేసిందని పేర్కొనడం నిజం కాదా? వైఎస్సార్సీపీ హయాంలో ఖజానా ఆదాయం పెరిగింది 2019–24లో రూ.3,200 కోట్ల కుంభకోణం జరిగిందని ఏ ప్రాతిపదికన నిర్ధారించామన్నది సిట్ చెప్పడమే లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. 2014–19 మధ్య కంటే 2019–24 మధ్య రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదాయం పెరిగింది. 2018–19లో ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ.16 వేల కోట్లు ఉంటే 2023–24లో రూ.24 వేల కోట్లకు చేరుకుంది. ఇక కుంభకోణంపై సిట్ వద్ద ఒక్క ఆధారం కూడా లేదు. కనీసం న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలోనూ ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని బెవరేజెస్ కార్పొరేషన్ రికార్డుల్లో కూడా అటువంటి సమాచారం ఏమీ లేదు. ఉంటే సిట్ చూపించి ఉండేది కదా. కేవలం సిట్ అధికారులు తాము బెదిరించి తీసుకున్న కొందరు డిస్టిలరీల ప్రతినిధుల వాంగ్మూలాలను మాత్రమే చూపిస్తున్నారు. ఆ డిస్టిలరీలన్నీ 2014–19లో అప్పటి ప్రభుత్వ హయాంలో లబ్ధి పొందినవే. అవే డిస్టిలరీలను తర్వాతి ప్రభుత్వం 2019–24లోనూ కొనసాగించింది. సీఐడీ కేసును పోలీసులు ఎలా దర్యాప్తు చేస్తారు? అసలు ఈ కేసు రాజకీయ ప్రేరేపితం. కేసు నమోదు నుంచి సీఐడీకి అప్పగించడం, సిట్ ఏర్పాటు అంతా చట్టానికి విరుద్ధంగా సాగుతోంది. ఈ కేసును సీఐడీ డీజీ పర్యవేక్షిస్తారు అని సిట్ను ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవోలో ప్రభుత్వం పేర్కొంది. సిట్ను ప్రత్యేక పోలీస్ స్టేషన్గా గుర్తించింది. కానీ, సిట్లో ఉన్న సభ్యుల్లో అత్యున్నత అధికారి విజయవాడ పోలీస్ కమిషనర్. మిగిలిన సభ్యులు ఆయన కంటే జూనియర్లు. మరి వీరందరూ సీఐడీ పరిధిలోకి వస్తారా? తాము సీఐడీ పరిధిలోకి వస్తామని వారిని న్యాయస్థానంలో అఫిడవిట్ సమర్పించమనండి. వారు అలా అఫిడవిట్ సమరి్పస్తే తదనుగుణంగా మేం తదుపరి చర్యలు చేపడతాం. సీఐడీ పరిధిలోకి రాని పోలీస్ అధికారులు ఈ కేసును ఎలా దర్యాప్తు చేస్తారు? అంటే ఈ కేసు దర్యాప్తే పూర్తి నిబంధనలను విరుద్ధంగా సాగుతోంది. సిట్ కేసు ఈ న్యాయస్థానం పరిధిలోకి రాదు సిట్ నమోదు చేసిన ఈ కేసు విజయవాడ ఏసీబీ న్యాయస్థానం పరిధిలోకి రాదు. ఏసీబీ నమోదు చేసే అవినీతి నిరోధక కేసులను విచారించేందుకు ప్రత్యేక చట్టం ద్వారా ఈ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. సీఐడీ నమోదు చేసే అవినీతి నిరోధక కేసులు కూడా ఈ న్యాయస్థానం పరిధిలోకి వస్తాయని చట్టం చేశారు. కానీ, సిట్ను ప్రత్యేక పోలీస్ స్టేషన్గా గుర్తిస్తూ ఈ ప్రభుత్వం జీవో ఇచి్చంది. సిట్ నమోదు చేసే కేసులు అసలు ఈ న్యాయస్థానం పరిధిలోకి రానే రావు. ప్రతి ఒక్కరికి 17ఏ కింద ముందస్తు అనుమతి తీసుకోలేదు ఈ కేసులో నిందితులు ప్రతి ఒక్కరిపై దర్యాప్తునకు 17ఏ కింద ముందే అనుమతి తీసుకోవాలి. మొత్తంగా అందరిపై ఒకేసారి 17ఏ కింద అనుమతి తీసుకున్నామని.. కేరళ హైకోర్టు తీర్పును ఉటంకిస్తూ సిట్ చెబుతున్నది సరికాదు. ప్రతి ఒక్కరిపై విడివిడిగా 17ఏ కింద అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు విస్పష్టంగా ప్రకటించింది. (ఈ అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించిందని సిట్ న్యాయవాదులు చేసిన వాదనను న్యాయవాది శ్రీరామ్ తోసిపుచ్చారు). 2023లో అప్పటి మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుకు సంబంధించి 17ఏ వర్తిస్తుందా వర్తించదా అనే అంశంపై సుప్రీంకోర్టు చెప్పినదాన్ని ప్రస్తుతం సిట్ న్యాయవాదులు వక్రీకరిస్తున్నారు.స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం 2018 కంటే ముందే జరిగింది కాబట్టి 17ఏ వర్తించదు. 2018కు ముందు జరిగిన కేసులకు 17ఏ వర్తిస్తుందా వర్తించదా అనే విషయాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక ధర్మాసనానికి నివేదించారు. అంతేగానీ, 2018 ఆ తర్వాత నమోదయ్యే కేసుల్లో నిందితులు ప్రతి ఒక్కరిపై విడివిడిగా 17ఏ కింద దర్యాప్తునకు అనుమతి తీసుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఆ ప్రకారం సీఎంవోలో కార్యదర్శిగా చేసిన కె.ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ పి.కృష్ణమోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులు. వారిపై కేసులకు విడివిడిగా 17ఏ కింద అనుమతి తీసుకోవాల్సిందే. ఈ నిబంధనను సిట్ ఉల్లంఘించింది కాబట్టి ఇది అక్రమ అరెస్టే అవుతుంది. హడావుడిగా అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పింది ముందస్తు బెయిల్ ఇవ్వనంత మాత్రాన నిందితులను హడావుడిగా అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. అరెస్టుకు ఉన్న అధికారాన్ని పోలీసులు దుర్వినియోగం చేయొద్దని ఇటీవలే స్పష్టం చేసింది. కచి్చతమైన ఆధారాలు ఉంటేనే అరెస్టు చేయాలని చెప్పింది. కానీ, ఈ అక్రమ కేసులో ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డికి వ్యతిరేకంగా సిట్ స్పష్టమైన ఆధారాలేమీ చూపలేకపోయింది. కనీసం న్యాయస్థానానికి కూడా సమర్పించనే లేదు. ఇక ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి దేశం విడిచివెళ్లే అవకాశం ఉంది కాబట్టి అరెస్టు చేస్తున్నామని సిట్ చెప్పడం పూర్తిగా అవాస్తవం. నిందితులుగా చేర్చకముందే వారికి వ్యతిరేకంగా సిట్ లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. సిట్ అక్రమంగా అరెస్టు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డిలను శుక్రవారం రాత్రి అరెస్టు చేసే క్రమంలో సిట్ అధికారులు నిబంధనలను ఉల్లంఘించారు. అరెస్టుకు ప్రాతిపదిక, కారణాలను నిందితులకు తెలపాలి. కానీ, వారికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. వారి కారు డ్రైవర్కు చెప్పామని రిమాండ్ నివేదికలోనే సిట్ అధికారులు పేర్కొన్నారు. నిందితులకు తెలపాలన్న నిబంధనను సిట్ అధికారులు కావాలనే ఉల్లంఘించారు. కాపీ పేస్ట్ కుట్ర.. అదే సిట్ రిమాండ్ నివేదిక రెడ్బుక్ కుట్రనే సిట్ తన దర్యాప్తు నివేదిక పేరిట మరోసారి కనికట్టు చేసింది. ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డికి జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని కోరుతూ న్యాయస్థానంలో దాఖలు చేసిన రిమాండ్ నివేదికే ఆ విషయాన్ని వెల్లడించింది. పూర్తిగా అవాస్తవాలు, అభూత కల్పనలతోనే రిమాండ్ నివేదిక రూపొందించిందని స్పష్టమైంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన రాజ్ కేసిరెడ్డి, శ్రీధర్రెడ్డి, ఇతర నిందితుల రిమాండ్ నివేదికల్లో పేర్కొన్న కట్టుకథనే కాపీ పేస్ట్ చేసింది. ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డికి వ్యతిరేకంగా కనీసం ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది. ఈ కేసు దర్యాప్తు పేరిట డిస్టిలరీల ప్రతినిధులు, ఇతర సాక్షులను తాము బెదిరించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలనే అరెస్టుకు ప్రాతిపదికగా చూపించడం సిట్ కుట్రను బట్టబయలు చేసింది. 20 వరకు రిమాండ్ విధించిన న్యాయస్థానం సిట్ అరెస్టు చేసిన రిటైర్డ్ ఐఏఎస్ కె.ధనుంజయ్రెడ్డి, పి.కృష్ణమోహన్రెడ్డికి న్యాయస్థానం ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. వారిద్దరిని సిట్ అధికారులు శనివారం ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఇరు పక్షాల వాదనల అనంతరం న్యాయస్థానం రిమాండ్ విధించింది. వారికి ప్రత్యేక వసతులు కలి్పంచాలని తన ఆదేశాల్లో పేర్కొంది. అనంతరం ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డిని సిట్ అధికారులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. శ్రీధర్రెడ్డికి ముగిసిన కస్టడీ విజయవాడ లీగల్: మద్యం కుంభకోణం ఆరోపణలపై అరెస్టయి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా వున్న శ్రీధర్రెడ్డి మూడు రోజుల కస్టడీ శనివారంతో ముగిసింది. పోలీసులు ఆయనకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించి, ఏసీబీ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అనంతరం జిల్లా జైలుకు తరలించారు. -
‘ఆడబిడ్డ నిధి’కి సమాధి
సాక్షి ప్రతినిధి కర్నూలు/ సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైన ‘ఆడబిడ్డ నిధి’ని ఇవ్వలేమని, ఇవ్వాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు చేతులెత్తేశారు. అప్పుడు, ఇప్పుడు అంటూ ఏడాది పాటు ఊరిస్తూ వచ్చి తీరా మోసం చేశారు. రాష్ట్రంలో 1.80 కోట్ల మంది మహిళల ఆశలపై నీళ్లు చల్లారు. తన ఆర్థిక సంస్కరణలతో సంపద సృష్టి జరిగిపోతోందని, పేదలందరూ బాగా డబ్బులు సంపాదిస్తున్నారని.. అందువల్ల ఈ నిధి అవసరం లేదని స్పష్టం చేశారు. 2029 నాటికి పేదరికాన్ని నిర్మూలిస్తానని మరోమారు ప్రతినబూనారు. ఒకవేళ అప్పటికి కూడా పేదరికం నుంచి మహిళలు గట్టెక్కకపోతే పీ–4తో ఆడబిడ్డ నిధిని అనుసంధానం చేస్తానని కర్నూలు సభలో చెప్పుకొచ్చారు. చంద్రబాబు మాటలు విన్న మహిళలు ఒకరి మోహం మరొకరు చూసుకుంటూ నిశ్చేష్టులయ్యారు. బాబు వ్యాఖ్యలు వైరల్ కావడంతో శనివారం సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశమైంది.ఎక్కడ నలుగురు మహిళలు కలిసినా కూటమి ప్రభుత్వ మోసం గురించి చర్చించుకుంటున్నారు. స్వచ్ఛ భారత్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం కర్నూలులో పర్యటించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సభకు వేలాదిగా డ్వాక్రా మహిళలను తరలించారు. వీరందరి సమక్షంలోనే ‘ఆడబిడ్డి నిధి’ అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ చర్యలతో పేదల ఆదాయం బాగా పెరిగిందని, పేదలు కూడా బాగా డబ్బు సంపాదిస్తున్నారని చెప్పారు. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలిస్తానని చెప్పారు.ఒకవేళ అప్పటికీ పేదరికం ఉంటే అప్పుడు ఆడబిడ్డ నిధిని పీ4 (పబ్లిక్ ప్రైవేటు పీపుల్స్ పార్టనర్షిప్)కు అనుసంధానం చేసే ఆలోచన చేస్తానని చెప్పారు. ఈ లెక్కన ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన గడువు ఐదేళ్లు మాత్రమే. 2029లో తిరిగి ప్రజాక్షేత్రంలో ఎన్నికలకు వెళ్లాలి. అప్పటి వరకు ఈ పథకం అమలు చేయరంటే పూర్తిగా ఎగనామం పెట్టినట్లే. చంద్రబాబు ప్రభుత్వం కొలువు దీరి ఏడాది అవుతోంది. ఏడాదిలో ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు.నాడు ఇంటింటా ఈ నిధి గురించి ప్రచారం 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మహాశక్తి ఆడబిడ్డ నిధి పేరుతో ప్రతి ఇంట్లో 18 ఏళ్లు నిండి 59 ఏళ్లలోపు ఉన్న మహిళలు ఎంత మంది ఉంటే అంత మందికీ నెలకు రూ.1,500 చొప్పున ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. కూటమి మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని పేర్కొన్నారు. కూటమి నేతలు ఇల్లిల్లూ తిరిగి ఈ మేరకు ప్రచారం చేశారు. దీంతో ఆశపడి మహిళలు ఆ పార్టీకి ఓట్లేశారు. ఇప్పుడు ఆ హామీని అమలు చేసే అవసరమే లేదని చంద్రబాబు నిర్భీతిగా ప్రకటించేయడం పరిశీలకులను సైతం విస్తుగొలుపుతోంది.1.80 కోట్ల మందికి ఎగనామం 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఓటు హక్కు ఉంటుంది. రాష్ట్రంలో 2.07 కోట్ల మంది మహిళలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేశారు. 60 ఏళ్లు పైబడిన వారిని మినహాయిస్తే 1.80 కోట్ల మంది మిగులుతారు. వీరికి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇవ్వాలి. అంటే ఏడాదికి రూ.32,400 కోట్లు బడ్జెట్లో కేటాయించాలి. గత బడ్జెట్లో ఈ పథకం ఊసే లేదు. ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించలేదు. మొన్నటి బడ్జెట్లోనూ ఆ విషయమే లేదు. అంటే ఇప్పటి వరకు రెండేళ్లకు కలిపి ఒక్కొక్కరికి రూ.32 వేల చొప్పున 1.80 కోట్ల మందికి రూ.64,800 కోట్లు కేటాయించాలి. అది జరగలేదు. దీన్నిబట్టి ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసేది లేదని స్పష్టమైంది. ఈ విషయాన్నే ఇప్పుడు సీఎం చంద్రబాబు బహిరంగంగా స్పష్టం చేశారు.జగన్ చేశారు.. చంద్రబాబు చేతులెత్తేశారు 2024 ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే కాంక్షతో చంద్రబాబు అలవికాని హామీలు ఇచ్చారు. అప్పటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న ప్రతీ పథకానికి పేరు మార్చి, నిధులు పెంచి అమలు చేస్తానని నమ్మబలికారు. అమ్మఒడిని తల్లికి వందనం పేరుతో, రైతు భరోసాను అన్నదాత సుఖీభవ పేరుతో.. వైఎస్సార్ చేయూతను ఆడబిడ్డ నిధి పేరుతో హామీ ఇచ్చారు. ‘చేయూత’ ద్వారా జగన్ ప్రభుత్వం 45–59 ఏళ్ల వయస్సున్న వారికి ఏడాదికి రూ.18,750 చొప్పున ఏటా వారి ఖాతాల్లో జమ చేసి.. మాట నిలుపుకుంది. ఇదే పథకానికి ఆడబిడ్డ నిధి పేరుతో నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.1,800 ఇస్తామని చంద్రబాబు చెప్పారు. అంటే జగన్మోహన్రెడ్డి కంటే రూ.750 తక్కువే ఇస్తామన్నారు. సూపర్ సిక్స్లో అన్ని పథకాల కంటే అత్యధిక బడ్జెట్ కేటాయించాల్సిన పథకం ఇదే. అత్యంత ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నదీ ఈ పథకానికే. ఇలాంటి పథకాన్ని అమలు చేయకుండా చంద్రబాబు చేతులెత్తేసి రాష్ట్రంలో 1.80 కోట్ల మంది మహిళలను నిలువునా మోసం చేశారు.బలవంతంగా దుకాణాల మూసివేత కర్నూలు నగరంలో స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు వస్తుండడంతో శనివారం దుకాణాలను మూసి వేయాలని పోలీసులు హుకుం జారీ చేశారు. ఉదయం 12 గంటలకు సీఎం రానున్న నేపథ్యంలో 9 గంటలకే షాపులన్నీ మూయించారు. దీంతో సీ క్యాంపు నుంచి నంద్యాల చెక్పోస్టు వరకు యజమానులు దుకాణాలు మూసివేసి వెళ్లిపోయారు. గత ప్రభుత్వంలో పరదాల మాటున సీఎం పర్యటనలు అని గగ్గోలు పెట్టిన పచ్చనేతలు.. ఇప్పుడు ఏకంగా తమ పర్యటనలకు దుకాణాలనే మూసి వేస్తుండటం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. సీఎం సభకు పలు ప్రాంతాల నుంచి పొదుపు సంఘాల మహిళలను బలవంతంగా తరలించారు. పర్యటన ఆలస్యం కావడంతో ఎండ వేడిమికి తట్టుకోలేక చాలా మంది రేకుల షేడ్లలో, బంద్ చేసిన షాపుల నీడలో తల దాచుకోవాల్సి వచ్చింది. కనీస ఏర్పాట్లు చేపట్టక పోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.నాడు ఆడ బిడ్డ నిధి హామీ ఇలాతెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మహాశక్తి కింద ఐదు కార్యక్రమాలు అమలు చేస్తాం. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య మహిళలందరికీ... ఒక్కొక్కరికీ నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18000.. ఇంట్లో ఎంత మంది మహిళలు ఉంటే అందరికీ అందజేస్తాం.– 2024 మార్చి 13వ తేదీన టీడీపీ నిర్వహించిన ‘కలలకు రెక్కలు’ నినాదంతో వెబ్ పోర్టల్లో పేర్ల నమోదు కార్యక్రమంలో చంద్రబాబు (చంద్రబాబు మాట్లాడినట్టు ‘ఈనాడు’ దినపత్రిక క్లిపింగ్)⇒ రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తూ.. రేపటి ఆకాంక్షలను సాకారం చేసేలా రూపొందించిన ఈ మేనిఫెస్టోను పక్కాగా అమలు చేస్తాం.– 2024 ఏప్రిల్ 30న ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సందర్భంగా పవన్ కళ్యాణ్ (మే 1వ తేదీ ఈనాడు క్లిప్లింగ్)⇒ భవిష్యత్కు గ్యారెంటీ–బాబు ష్యూరిటీ నినాదంతో ‘ఆడబిడ్డ నిధి’ నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తాం. – రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ–జనసేన నాయకులు ఇంటింటా కరపత్రాల ప్రచారంబకాయిలతో కలిపి ఇవ్వాలిచంద్రబాబునాయుడు ఎన్నికల్లో గెలిచేందుకు లేనిపోని హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. ఇన్నాళ్లూ నిధులు లేవు.. సంపద సృష్టించే మంత్రం ఉంటే చెవిలో చెప్పండి అన్నారు. ఇప్పుడు సంపద సృష్టించేశాం అంటున్నారు. పేదలు బాగా సంపాదిస్తున్నారట! ఇంకా నాలుగేళ్లకు పేదరికం పోకపోతే ఆడబిడ్డ నిధిని పీ4కు లింక్ చేస్తానని చెబుతున్నారు. పీ4 అంటే ప్రైవేటు వ్యక్తులు. వారికి ప్రభుత్వ పథకంతో ఏం సంబంధం? దీన్నిబట్టి పథకానికి పూర్తిగా మంగళం పాడినట్లే. మహిళలకు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.1500 చొప్పున ఇవ్వాలి. ఇప్పటికే ఏడాది పూర్తయినందున బకాయిలతో కలిపి ఇవ్వాలి. – వి.భారతి, ఏపీ మహిళా సమాఖ్య నగర కార్యదర్శి, కర్నూలుప్రజలు మోసపోయారని తెలుస్తోంది2029లోపు పేదరికాన్ని నిర్మూలిస్తా.. అప్పటికీ పేదరికం ఉంటే అప్పుడు పీ4కు ఆడబిడ్డి నిధిని అనుసంధానం చేస్తానని చంద్రబాబు చెప్పడం సరికాదు. అంటే 2029 లోపు ఆడబిడ్డ నిధి అమలు చేయరా? మీకు ఇచ్చిన గడువే 2028 వరకు. 2029లో ఎన్నికలకు వెళ్లాలి. ఆడబిడ్డ నిధి అనేది ప్రభుత్వ పథకం. పీ4 అనేది పారిశ్రామిక వేత్తలు, ప్రైవేటు వ్యక్తులు చేసే సాయం. ఈ రెండిటిని కలపడం అంటే ఎలా? 18 ఏళ్లు నిండిన ప్రతీ ఆడబిడ్డకు డబ్బులు ఇవ్వాలి. చంద్రబాబు మాటలు వింటుంటే మరోమారు ప్రజలు మోసపోయారని తెలుస్తోంది. – ఎం.శిరీష, ఇందిరాగాంధీ నగర్, కర్నూలుబాబువన్నీ బూటకపు హామీలేగత ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద ఏడాదికి రూ.18,000 ఇస్తానని నమ్మించి మహిళల ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారు. ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదు. ఇప్పుడు పీ–4 స్కీమ్తో అనుసంధానం చేస్తానని చెప్పడం చూస్తే ఇదొక మోసపూరిత హామీగా మిగలనుందని అర్థమవుతోంది. అధికారంలోకి రాక ముందు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారు. మహిళలందరం వచ్చే ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పి తీరుతాం. – ఎస్కే మస్తాన్బీ, నెల్లూరుఆడబిడ్డ నిధి ఇవ్వరా?కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ హామీగానే ఉండిపోయింది. ఆడబిడ్డ నిధి ఇస్తానని చెప్పడంతో లక్షలాది మంది ఆడబిడ్డలు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సంపద సృష్టించామని చెబుతున్నారుగా.. ఇవ్వండి మరి. మొత్తం బకాయిలతో కలిపి వెంటనే ఇవ్వాలి. – కె.కృష్ణవేణి, దెందులూరు, ఏలూరు జిల్లామాట నిలుపుకోవాలిఅధికారంలోకి రాగానే ఏడాదికి రూ.18,000 చొప్పున ఆడబిడ్డ నిధి పథకం కింద ఇస్తామన్నారు. ఏడాదవుతున్నా దాని ఊసే లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదు. సూపర్ సిక్స్ పథకాల కోసం అందరం ఎదురు చూస్తున్నాం. కూటమి నేతలు మాటలు చెబుతూ కాలయాపన చేస్తున్నారే గానీ పథకాల గురించి పట్టించుకోవడం లేదు. మాట నిలుపుకోకుండా మోసం చేయడం సరికాదు. – డాలు మనీషా, చిన్న కనుమళ్ల, ప్రకాశం జిల్లా ఈ పథకం అమలు కాదికఆడబిడ్డ నిధి పథకాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఇంకా పేదరికం ఉంటే పీ4 ద్వారా అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉంది. దీని ప్రకారం దాతలు ముందుకు వస్తే వారికి నచ్చిన వ్యక్తులకే అమలు చేస్తారు. దీని వల్ల నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అసలు ఇక ఈ పథకం అమలు కాదనిపిస్తోంది. – కర్రి వెంకటలక్ష్మి, సామర్లకోట, కాకినాడ జిల్లామరోసారి మోసం చేస్తున్నారుఅధికారంలోకి వస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద ఏడాదికి రూ.18,000 చొçప్పున ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా పథకం అమలు చేయలేదు. ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదు. ఇది చాలా అన్యాయం. పీ4తో ఆడ బిడ్డ నిధిని అనుసంధానిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం చూస్తే మహిళలను మరోసారి మోసం చేస్తున్నారని తెలుస్తోంది. – సూరెడ్డి హైమావతి, మెంటాడ, విజయనగరం జిల్లాప్రభుత్వంపై నమ్మకం పోయింది కూటమి ప్రభుత్వం 18 నుంచి 59 ఏళ్ల మహిళలందరికీ ఏడాదికి రూ.18,000 ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నప్పటికీ దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి మాటలతో ఈ పథకం అమలయ్యే సూచనలే కనిపించడం లేదు. ఇలా చేయడం సరికాదు. ఈ ప్రభుత్వంపై నమ్మకం పోయింది. – పి యేసమ్మ, ప్రకాష్ నగర్, కడప -
Nara Lokesh: మనల్ని ఎవడ్రా ఆపేది.. చినబాబు పెద్ద ప్లాన్!
ఆల్రెడీ ఐదేళ్ల క్రితమే మంత్రి పదవి చేసేసారు.. పైగా ఈ ఐదేళ్ళలో బోలెడు ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చింది.. క్యాడర్ తో కలిశారు..కలుస్తున్నారు.. పార్టీలో పెద్దరికం కూడా చేస్తున్నారు.. పైగా పాదయాత్ర పేరిట మరిన్ని మార్కులు.. ఇవన్నీ సరిపోవా ఏమి.. గమ్మున మా చిన్నోడికి పెద్ద పదవి ఇవ్వాల్సిందే అంటూ చంద్రబాబు మీద కుటుంబం ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.. ఈ నేపథ్యంలోనే కడప జిల్లాలో మే 27.. 28.. 29 తేదీల్లో కడపలో నిర్వహించే మహానాడులో చినబాబు స్టేచర్ పెరిగిపోవాలి.. లేదంటే ఇంట్లో గొడవలు అవుతాయి.. గిన్నెలు గాల్లోకి లేస్తాయి అనే అల్టిమేటం రావడంతో చిన్నోడికి పెద్ద పదవి ఇవ్వక తప్పడంలేదు. పోనీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం వంటి పదవులు ఇవ్వాలంటే అటు బీజేపీ ఒప్పుకోవాలి.. పవన్ ఊ కొట్టాలి.. ఇవన్నీ అయ్యేది కాదు.. కూటమి ప్రభుత్వంలో ఇంకో డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడానికి కేంద్రంలోని బిజెపి పెద్దలు సుతరామూ ఒప్పుకోవడం లేదు.వాస్తవానికి ప్రభుత్వంలో పార్టీలో లోకేష్ ఇప్పుడు నంబర్ టూ గా ఉంటున్నారు.. పేరుకే చంద్రబాబు కానీ పదవులు.. ప్రాజెక్టులు.. పంచాయతీలు అన్నీ లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలో కూడా ఎలివేషన్ ఉండాల్సిందే అనే డిమాండ్ కూడా క్యాడర్ నుంచి వచ్చేలా లోకేష్ ప్లాన్లు వేస్తున్నారు. వీలైనప్పుడల్లా కొందరితో చంద్రబాబుకు రికమెండ్ చేయిస్తున్నారు. దీంతో ఇప్పుడు కడప మహానాడులో చినబాబుకు పెద్దపదవిని కట్టబెట్టేపనిలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపుగా తెలుగుదేశం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్..లేదా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అనే పదవుల్లో ఆయన్ను కూర్చోబెట్టి ఇక పవన్ కళ్యాణ్ కు సరిసమాన హోదా ఇవ్వడానికి రంగం సిద్ధమైందని అంటున్నారు. మనల్ని ఎవడ్రా ఆపేది.. అనే ట్యాగ్ లైన్ మీద హడావుడి చేసే జనసేన నాయకులకు.. క్యాడర్ కు లోకేష్ ఇప్పుడు పోటీగా నిలబడతారని అంటున్నారు.. అప్పుడు లోకేష్ కూడా పవన్ కు సమానమైన హోదా.. గుర్తింపు వస్తుందని. అప్పుడు ఆయన్ను ఎవరూ ఆపలేరని క్యాడర్ సంబరపడుతోంది. -సిమ్మాదిరప్పన్న -
కిడ్నాప్కు గురైన నాలుగేళ్ల చిన్నారి క్షేమం
విశాఖ: అనకాపల్లిలో కిడ్నాప్ కు గురైన నాలుగేళ్ల చిన్నారి క్షేమంగా బయటపడింది. ఆ చిన్నారిని గాజువాకలో గుర్తించారు పోలీసులు. ఆ చిన్నారిని కిడ్నాప్ చేసి, విక్రయించేందుకు జరిగిన యత్నంలో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కిడ్నాప్ కు పాల్పడిన వారికి లక్ష్మీ, అప్పలస్వామిలుగా గుర్తించారు.ఉమ్మడి విశాఖ జిల్లాలో చిన్నపిల్లల కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. అనకాపల్లి టౌన్కి చెందిన నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్కు గురైంది. అనకాపల్లి లోకావారి వీధి ఇంటి నుంచి నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న అనకాపల్లి పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారిని ఎత్తుకెళ్లింది మహిళగా గుర్తించారు. అనంతరం గాలింపు ముమ్మరం చేయడంతో ఆ చిన్నారి కథ సుఖాంతమైంది. ఆ చిన్నారిని గాజువాకలో విక్రయానికి పెట్టే క్రమంలో పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో ఈ కేసును తక్కువ సమయంలోనే ఛేదించారు పోలీసులు. 48 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు పోలీసులు. -
ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి రిమాండ్
విజయవాడ: కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మద్యం కేసులో తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలం సృష్టించి అరెస్ట్ చేసిన రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డికి ఏసీబీ కోర్టు మూడు రోజుల రిమాండ్ విధించింది. వీరిని మే 20వ తేదీ వరకూ రిమాండ్ ఇస్తూ తీర్పునిచ్చింది. అదే సమయంలోవీరి వయసును దృష్టిలో పెట్టుకుని జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని కోర్టు ఆదేశించింది. వీరికి వెస్ట్రన్ కమోర్డ్, మంచం, దిండు, దుప్పటి, డ్రై ఫ్రూట్స్ వంటి వాటికి అనుమతి ఇచ్చింది కోర్టు. అంతే కాకుండా ధనుంజయరెడ్డికి కావాల్సిన ఇన్సులిన్ ఇంజక్షన్లు స్టోర్ చేసుకునేందుకు ఫ్రిజ్ సదుపాయం కల్పించాలని కోర్టు ఆదేశించింది.ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు..రిటైర్డ్ అధికారులు కె. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అరెస్టుకు ఆధారాల్లేవని, ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు అని న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ స్పష్టం చేశారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ పై ఈరోజు(శనివారం) విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి.. ఈ కేసుకు సంబంధించి కె. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల తరఫున న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు‘రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అరెస్ట్ సక్రమం కాదు. ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు. ఇద్దరి అరెస్ట్కు అధారాల్లేవ్. కోర్టుకు కూడా అరెస్ట్ కు సంబంధించిన ఆధారాలు ఏవీ ఇవ్వలేదు. ఈ కేసులో సిట్ ఏర్పాటు చట్ట విరుద్ధం. సిట్ కు ఈ కేసు విచారించే అర్హత లేదు.అసలు రూ. 3200 కోట్లు స్కామ్ కి అసలు ఆధారాలు ఏవి?, రూ. 3200 కోట్లు స్కామ్ ఆధారాలు కోర్టుకి కూడా ఇవ్వలేదు.ప్రభుత్వ సొంత కార్పొరేషన్ రికార్డుల్లో ఉన్న సమాచారం కూడా ఇవ్వలేదు. గత 5 ఏళ్ల పాలనలో లిక్కర్ ఆదాయం పెరిగింది. లిక్కర్ వినియోగం తగ్గి ఆదాయం పెరిగింది. మరి రూ. 3200 కోట్లు స్కామ్ ఎక్కడ జరిగింది?, రూ. 16 వేల కోట్ల నుండి రూ. 24 వేల కోట్లకు ఆదాయ పెరిగింది. మరి ప్రభుత్వంకి నష్టం ఎక్కడొచ్చింది. అరెస్ట్ కారణాలను కూడా కాపీ పేస్ట్ చేశారు. ఇది రాజకీయ ప్రేరేపితం కూడా అయ్యి ఉండొచ్చు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది’ అని శ్రీరామ్ స్పష్టం చేశారు. -
‘సంపద సృష్టిస్తామన్న ప్రభుత్వం.. చెత్తను తొలగించలేకపోతోంది’
విశాఖ: సంపద సృష్టిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం పెద్దలు.. వీధుల్లో చెత్తను కూడా తొలగించాలేకపోతున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రస్తుతం కూటమి నేతలు హామీలు అమలు చేయలేక ఫస్ట్రేషన్ ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. ఇక చిన్నపాటి వర్షానికి ప్రపంచస్థాయి రాజధాని అని బాబు చెప్పుకుంటున్న అమరావతి మునిగిపోయిదంటూ చురకలంటించారు బొత్స.‘వైఎస్సార్ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, అప్పటి వరకు నాయకులు, కార్యకర్తలు వేచి ఉండాలి.. కూటమి హనీమూన్ టైమ్ అయిపోయింది. ఇప్పటికే పోరాటాలు మొదలు పెట్టాము. నిర్దిష్టమైన ఉద్దేశాన్ని పెట్టుకుని ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ విషయాన్ని న్యాయస్థానం కూడా చెప్పింది. అధికారులు మీద తప్పుడు కేసులు పెడతారా?, తప్పుడు కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి మంచిదా? అని ప్రశ్నించారు.మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెడితే పరిస్థితి ఏమిటి.. సీజ్ ద షిప్ ఏమైంది?, మాట చెప్పే ముందు మనం ఏమి చేస్తున్నామో ఆలోచించాలి. నిజం నిలకడ మీద తేలాలి తప్ప.. ఉద్దేశాలను ఆపాదించడం సరైన విధానం కాదు’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.అధికారుల అరెస్టులు ఏ మాత్రం సహించదగినవి కాదు, వాటిని ఖండిస్తున్నాం. నన్ను 60 రోజులు జైల్లో పెట్టారు, మేము అధికారంలోకి వచ్చిన తరువాత.. నన్ను జైల్లో పెట్టిన వారిని, ఒక్కరోజైనా జైలులో ఉంచాలనే ఆలోచన మంచిది కాదు. సరైన విధానంలో విచారణ జరగకుండా అరెస్టులు చేయడం తప్పు. కాలం ఎప్పుడూ ఒకరి పక్షమే ఉండదని బొత్స గుర్తు చేశారు.వ్యక్తిగత సిబ్బందిని అరెస్ట్ చేయాలని అనుకుంటే అప్పుడు మీకు పీఏలు లేరా?, వ్యవస్థలను తమ పని తాము చేసుకొనివ్వకపోవడం వల్లే సమస్యలు ఏర్పడుతున్నాయి. సంపద సృష్టిస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు వీధుల్లో చెత్తను కూడా తొలగించలేక పోతున్నారు. హామీలు అమలు చేయలేక, ఫ్రస్టేషన్లో వున్నారు. చిన్నపాటి వర్షానికే అమరావతి మునిగిపోయిందిని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
‘ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు.. అరెస్టుకు ఆధారాల్లేవ్’
విజయవాడ: రిటైర్డ్ అధికారులు కె. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అరెస్టుకు ఆధారాల్లేవని, ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు అని న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ స్పష్టం చేశారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ పై ఈరోజు(శనివారం) విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి.. ఈ కేసుకు సంబంధించి కె. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల తరఫున న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు ‘రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అరెస్ట్ సక్రమం కాదు. ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు. ఇద్దరి అరెస్ట్కు అధారాల్లేవ్. కోర్టుకు కూడా అరెస్ట్ కు సంబంధించిన ఆధారాలు ఏవీ ఇవ్వలేదు. ఈ కేసులో సిట్ ఏర్పాటు చట్ట విరుద్ధం. సిట్ కు ఈ కేసు విచారించే అర్హత లేదు.అసలు రూ. 3200 కోట్లు స్కామ్ కి అసలు ఆధారాలు ఏవి?, రూ. 3200 కోట్లు స్కామ్ ఆధారాలు కోర్టుకి కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ సొంత కార్పొరేషన్ రికార్డుల్లో ఉన్న సమాచారం కూడా ఇవ్వలేదు. గత 5 ఏళ్ల పాలనలో లిక్కర్ ఆదాయం పెరిగింది. లిక్కర్ వినియోగం తగ్గి ఆదాయం పెరిగింది. మరి రూ. 3200 కోట్లు స్కామ్ ఎక్కడ జరిగింది?, రూ. 16 వేల కోట్ల నుండి రూ. 24 వేల కోట్లకు ఆదాయ పెరిగింది. మరి ప్రభుత్వంకి నష్టం ఎక్కడొచ్చింది. అరెస్ట్ కారణాలను కూడా కాపీ పేస్ట్ చేశారు. ఇది రాజకీయ ప్రేరేపితం కూడా అయ్యి ఉండొచ్చు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది’ అని శ్రీరామ్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పర్యవసానాలు తప్పవు: సుప్రీంకోర్టు -
ప్రతి అక్రమ అరెస్టుకు ప్రతిఫలం అనుభవిస్తారు: మార్గాని భరత్
తాడేపల్లి: ఎన్నికల సమయంలో హామీలను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం.. వేధింపులే లక్ష్యంగా అరెస్టుల పర్వం కొనసాగిస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. రెడ్బుక్ పేరుతో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లని సైతం వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం దెబ్బకి పారిశ్రామిక వేత్తలు కూడా ఏపీ నుండి పరారవుతున్నారని భరత్ స్పష్టం చేశారు. ''చంద్రబాబు గత పాలనలో భారీగా లిక్కర్ స్కాం జరిగింది. రూ.5 వేల కోట్లకు పైగా నిధులను కొల్లగొట్టారు. ఆ కేసులో చంద్రబాబు నిందితుడు. కానీ జగన్ ప్రభుత్వంలో రూ.24 వేల కోట్ల ఆదాయం వచ్చింది. జగన్ హయాంలో లిక్కర్ స్కాం జరిగి ఉంటే ప్రభుత్వానికి ఆదాయం ఎలా వచ్చింది?'' అని మార్గాని భరత్ ప్రశ్నించారు.‘ఇప్పుడు చంద్రబాబు పాలనలో మళ్ళీ తమ మనుషులకు దోచి పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ను మద్యాంధ్రప్రదేశ్గా మార్చారు. వాట్సప్లో కూడా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. పర్మిట్ రూములు పెట్టి అమ్ముతున్నారు. మరి ఇంత చేసినా ప్రభుత్వానికి ఆదాయం ఎందుకు రావటం లేదు?, ఆ సొమ్మంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది?, దీనిని డైవర్షన్ చేసేందుకే అక్రమ అరెస్టులు చేస్తున్నారు’ అని భరత్ వివరించారు.చంద్రబాబు.. జగన్ చుట్టూ ఉన్న వారిని టార్గెట్ చేశారు. నిజాయితీ కలిగిన అధికారులను పక్కన పెట్టి తమకు కావాల్సిన వారిని సిట్లో వేశారు. వారి ద్వారానే అక్రమ అరెస్టులు చేయిస్తున్నారు. అధికారం శాశ్వతం కాదని చంద్రబాబు గుర్తించాలి. ఇప్పుడు చేస్తున్న ప్రతి అక్రమ అరెస్టుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ప్రతిఫలం అనుభవిస్తారు’ అని భరత్ హెచ్చరించారు.రాష్ట్రంలో ఏ పంటకూ సరైన ధరలు లేకపోవడంతో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అక్రమ కేసులు ఆపి, ముందు రైతాంగానికి మేలు చేయండి. దావోస్ వెళ్ళి ఒక్క రూపాయి పెట్టుబడి కూడా తీసుకు రాలేక పోయారు. జిందాల్ ఏపీ నుంచి మహారాష్ట్రకు వెళ్లిపోయింది. ఇవి మాత్రమే కాకుండా.. జైళ్లలో అధికారులను కూడా ఉన్నపళంగా బదిలీలు చేయటం వెనుక కారణం ఏంటి?, జైళ్లలో థర్డ్ డిగ్రీ ప్రయోగించేందుకు ప్లాన్ చేస్తున్నారనే అనుమానం కలుగుతోందని భరత్ వెల్లడించారు. -
‘చంద్రబాబు.. లిక్కర్ స్కామ్కు అర్థం మీ వద్దే ఉంది వెతుక్కోండి’
తాడేపల్లి: నాణ్యమైన మద్యం, తక్కువ ధరలు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు జనాన్ని మోసం చేశారని మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. విమర్శించారు. దేశంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కు కూటమి ప్రభుత్వం పెట్టింది పేరని ఎద్దేవా చేశారు శైలజానాథ్,ఈ రోజు(శనివారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన శైలజానాథ్.. మద్యం వ్యాపారంలో చంద్రబాబు ఎక్స్ పర్ట్. అని స్పష్టం చేశారు. ‘చంద్రబాబు చేసిన అన్ని వ్యవహారాలు ప్రజలు మర్చిపోతారనే భావనలో ఉంటారు. చంద్రబాబు ప్రభుత్వం లోనే డిస్టలరీలకు అనుమతి ఇచ్చారు. చంద్రబాబు వ్యవహారం గురువింది గింజ సమేతలా ఉంటుంది. నూతన పాలసీ విధానంలో మద్యం అమ్మకాలు ప్రైవేటుకి ఇవ్వడంలో కూడా అవకతవకలు జరిగాయి. టీడీపీ స్థానిక నాయకులకు భాగస్వామ్యం ఉంది. రండి చూపిస్తాం... బెల్ట్ షాప్ లు లేని గ్రామం లేదు.. మేము చూపిస్తాం. అసలు మద్యం స్కాం అనేది ఇప్పుడు మీ ప్రభుత్వం లోనే నడుస్తోంది. మీ ప్రభుత్వ హయాంలో రోజు రెవెన్యూ లోటు కనిపిస్తుంది.మీరు సంవత్సర కాలంలో ఏం చేశారు?, లిక్కర్ కేసులో ఉన్న ఆధారాలు ఏంటి?, భయాన్ని క్రియట్ చేసి రాజ్యం నడుపుదాం అనుకుంటున్నారా?, చంద్రబాబు ఎన్నికల్లో గెలుపుకోసం ఏమైనా ప్రకటనలు చేస్తారని మరోసారి రుజువైంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరు రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన సాగించాలి. చంద్రబాబుపై సీఐడీ పెట్టిన కేసు ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు?, ఇప్పటికైనా కక్ష పూరిత వేధింపులు ఆపండి. మనం ఏది ఇస్తే అది మనకు వస్తుంది. మీ సీనియర్లతో చర్చించి చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకోండి. మీ సచ్చీలతను నిరూపించుకోండి. చంద్రబాబు.. లిక్కర్ స్కామ్ కు అర్థం మీ వద్దే ఉంది వెతుక్కోండి’ అంటూ ధ్వజమెత్తారు శైలజానాథ్. -
‘పాలనా వైఫల్యాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు’
నెల్లూరు: పాలనా వైఫల్యాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. హామీల అమలును గాలికొదిలేసిన సీఎం చంద్రబాబు నాయుడు.. మద్యాన్ని మాత్రాన్ని ఏరులై పారిస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన చంద్రశేఖర్ రెడ్డి.. ‘పాలనా వైఫల్యాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిల అరెస్ట్ దుర్మార్గం. గత ప్రభుత్వంలో పారదర్శకంగా జరిగిన మద్యం విషయాన్ని లిక్కర్ స్కాంగా మార్చారు. జరగని లిక్కర్ స్కామ్ని జరిగినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ నేతలని ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో ఈ కేసులో నేతలతో పాటు సీనియర్ అధికారులకు ఇరికించారు.చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని ధ్వజమెత్తారు చంద్రశేఖర్ రెడ్డి. -
ఆ అరెస్ట్ల వెనుక కుట్ర కోణం: అంబటి
సాక్షి, గుంటూరు: కేసులు పెట్టి అరెస్ట్లు చేస్తే బెదిరిపోయేది లేదని.. వేధిస్తే మరింత స్ట్రాంగ్ అవుతామని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల క్రితం నాటి అంశాల్లో ఇప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. మరికొద్ది రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తుంది. కూటమి ఏడాది పాలనలో అక్రమ అరెస్టులు తప్ప ఏమీ లేదన్నారు.‘‘రాజకీయ నాయకుల అరెస్టులే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కూడా అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టులు చేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో పని చేశారని ధనుంజయ రెడ్డి , కృష్ణమోహన్రెడ్డిలను అరెస్ట్ చేశారు. చంద్రబాబుకు నీచపు రాజకీయాలు కొత్త ఏమీ కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీతో జతకట్టి వైఎస్ జగన్ను అక్రమ కేసులతో జైలులో పెట్టి, ఇబ్బంది పెట్టారు. ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదు. న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తాం’’ అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.స్కిల్ స్కాంలో చంద్రబాబు జైలుకు వెళ్లాడనే కోపంతో వైఎస్సార్సీపీ నేతలను, గత ప్రభుత్వ హయాంలో పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపిస్తున్నారు. పులి మీద చంద్రబాబు, నారా లోకేష్ స్వారీ చేస్తున్నారు. ఆ స్వారీ చేయటం ఆపగానే ఆ పులి ఇద్దరిని మింగేస్తుంది. అమ్మ ఒడి వంటి పథకాలను ప్రజలు అడగకుండా చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడు. ధనుంజయ రెడ్డి,కృష్ణమోహన్రెడ్డి అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర కోణం ఉంది’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
‘పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అక్రమ అరెస్ట్లు’
సాక్షి, విశాఖపట్నం: సీఎం చంద్రబాబుకి పాలన చేతకాక, హామీలు అమల్లో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. విశాఖలో మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా గత ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిల అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.హామీల అమలు విషయంలో అన్నివర్గాల ప్రజల నుంచి ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నాయకులు వైఎస్ జగన్ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా అవినీతికి ఆస్కారం లేకపోయినా మద్యం స్కామ్ జరిగినట్టు తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి ఆయనకు సన్నిహితంగా ఉన్న వారిని అరెస్టు చేస్తున్నారని అన్నారు.వైఎస్సార్సీపీ హయాంలో బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు చేసి, మద్యం షాపులు తగ్గించి, అమ్మకాలు తగ్గిస్తే స్కాం జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు అన్ని డిస్టిలరీలకు చంద్రబాబే అనుమతులిచ్చాడని, గత వైఎస్సార్సీపీ పాలనలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతివ్వలేదని స్పష్టం చేశారు. గత మా వైఎస్సార్సీపీ పాలనలో మద్యం అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహిస్తే, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టిందని గుర్తు చేశారు.రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. వీధివీధినా బెల్ట్ షాపులు తెరిచి 24 గంటలూ ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకి దమ్ముంటే తన మీద నమోదైన ఇన్నర్ రింగ్రోడ్డు స్కాం, లిక్కర్ కుంభకోణం, ఏపీ ఫైబర్నెట్ స్కాం, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాలపై విచారణకు సిద్దం కావాలని డిమాండ్ చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందని, ఐఏఎస్, ఐపీఎస్లనే కాకుండా పారిశ్రామికవేత్తలను కూడా బెదిరిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వ వేధింపులతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, అరాచక పాలనతో ఎంతోకాలం ప్రజాచైతన్యాన్ని అడ్డుకోలేరని అన్నారు. రాబోయే రోజుల్లో వైయస్సార్సీపీ నేతృత్వంలో ప్రజా ఉద్యమాలతో కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. -
మరోసారి బయటపడ్డ ఈనాడు పచ్చి అబద్ధాలు
సాక్షి, అమరావతి: మరోసారి ‘ఈనాడు’ పచ్చి అబద్ధాలు బయటపడ్డాయి. సెకీ సీఎండీ రామేశ్వరగుప్తాను కేంద్రం తొలగించిన వార్తపై ఈనాడు వక్రభాష్యం చెప్పింది. వైఎస్ జగన్ హయాంలో ఏపీలో జరిగిన విద్యుత్ ఒప్పందాలే తొలగింపునకు కారణం అంటూ ఈనాడు అబద్ధాలు రాసింది.2023లో జూన్లో సెకీ సీఎండీగా రామేశ్వర్ పదవి చేపట్టగా.. రామేశ్వర్ గుప్తా ఛైర్మన్ కాకముందే ఏపీ ప్రభుత్వం సెకీతో ఒప్పందం కుదుర్చుకుంది. రామేశ్వర్ గుప్తా సెకీలో లేనప్పుడు ఒప్పందాలు జరిగితే.. ఆయన తొలగింపునకు ఏపీతో జరిగిన ఒప్పందాలే కారణమంటూ ఈనాడు అబద్ధాలు అచ్చేసింది.2021 డిసెంబర్లోనే ఏపీ ప్రభుత్వం సెకీతో ఒప్పందం కుదుర్చుకుందని ఈనాడు ఒప్పుకుంది. అబద్ధం వండివార్చాలనే తాపత్రయంలో కనీసం వాస్తవాలు ఏంటో తెలుసుకోని ఈనాడు.. అడ్డగోలు రాతలతో రెచ్చిపోయింది.ఈనాడు పిచ్చిరాతలపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననం కోసం పత్రిక పేరుతో ఇంతగా దిగజారిపోతారా? నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తారా?. ఈనాడుది జర్నలిజమా? లేక బ్రోకరిజమా?. విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై సెకీతో 2021 డిసెంబర్లో ఒప్పందం జరిగింది. 2023లో సెకీ సీఎండీగా రామేశ్వర్ గుప్తా నియమితులయ్యారు. 2023లో ఛైర్మన్ అయిన రామేశ్వర్ గుప్తాకు 2021 నాటి ఏపీ-సెకీ ఒప్పందానికి ఏం సంబంధం’’ అంటూ వైఎస్సార్సీపీ ప్రశ్నించింది.🚨 #BanYellowMediaSaveAPఏమిటీ రాక్షసత్వం. వైయస్.జగన్మోహన్రెడ్డిగారి వ్యక్తిత్వ హననంకోసం పత్రిక పేరుతో ఇంతగా దిగజారిపోతారా? నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తారా? “ఈనాడూ’’ మీది జర్నలిజమా? లేక బ్రోకరిజమా?విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై సెకీతో 2021 డిసెంబరులో ఒప్పందం. 2023లో సెకీ… pic.twitter.com/CJzt414GJH— YSR Congress Party (@YSRCParty) May 17, 2025 ‘‘సెకీకి రామేశ్వర్ గుప్తా సీఎండీ కాకముందు కేంద్ర పర్యావరణ శాఖ సెక్రటరీగా పనిచేశారు. అనిల్ అంబానీ కంపెనీ ఫేక్ డాక్యుమెంట్లతో బిడ్డింగ్ వేశారన్న ఆరోపణలు నేపథ్యంలో రామేశ్వర్ గుప్తాను తొలగించినట్టుగా 5-6 రోజులుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను వక్రీకరించి ఏపీ-సెకీ ఒప్పందానికి లింకు పెడుతూ.. నిస్సిగ్గుగా ఈనాడు పచ్చి అబద్ధాలు రాసింది’’ అని వైఎస్సార్సీపీ మండిపడింది. -
పిఠాపురం రూరల్లో మరోసారి ఉద్రిక్తత
కాకినాడ జిల్లా: పిఠాపురం రూరల్లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫక్రుద్దీన్ పాలెం( ఎఫ్.కే.పాలెం) పాపిడి దొడ్డి చెరువులో మట్టి తవ్వేందుకు యత్నించగా.. జేసీబీని రైతులు అడ్డుకున్నారు. చెరువును పరిశీలించిన సీపీఎం నేతలు.. చెరువులో మట్టి తవ్వుకునేందుకు ఎమ్మార్వో అనుమతి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.3.5 ఎకరాల కోసం 360 ఎకరాలను బీడుగా మారుస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పొలం మెరక పేరుతో చెరువులో మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తారని ఆరోపించారు. పంచాయితీ తీర్మానం, రైతులు అభిప్రాయం తీసుకోకుండా ఎమ్మార్వో మట్టి తవ్వకాలకు ఏలా అనుమతి ఇస్తారంటూ సీపీఎం నేతలు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రైతుల పక్షాన ఉంటారో లేక వ్యాపారుల పక్షాన ఉంటారో తేల్చుకోవాలంటూ సీపీఎం నేతలు హెచ్చరించారు. -
చంద్రబాబు కుట్ర ఇదే: భూమన
సాక్షి, తిరుపతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్సీపీని నాశనం చేయాలనే లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని మాజీ టీటీడీ చైర్మన్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్రెడ్డి మండపడ్డారు. మాజీ ప్రభుత్వ ఉద్యోగులు కృష్ణమోహన్రెడ్డి, ధనుంజయరెడ్డిల అరెస్ట్లను ఖండిస్తూ తిరుపతి క్యాంప్ కార్యాలయం నుంచి వీడియోను విడుదల చేశారు. ‘‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు అప్రజాస్వామికంగా పాలన సాగిస్తున్నారు. వైఎస్సార్సీపీని నాశనం చేయాలని, వైఎస్ జగన్ నాయకత్వాన్ని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. వైఎస్సార్సీపీపై కక్షతో నిరంతరం దుర్మార్గంగా పనిచేస్తోంది. వైఎస్ జగన్ను బలహీనపరచాలని, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను వేధింపులకు గురి చేయడమే కాకుండా చివరికి ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వదలడం లేదు...గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారనే కక్షతో తప్పుడు కేసులు బనాయించి, జైలుకు పంపుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడం, సూపర్ సిక్స్ విషయంలో ఏడాది కాలంలో ఎటువంటి హామీని అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారు. దీనికి పరాకాష్టగా లేని మద్యం స్కామ్లో సీనియర్ ప్రభుత్వ అధికారులుగా పనిచేసిన కృష్ణమోహన్రెడ్డి, ధనుంజయరెడ్డిలను అరెస్ట్ చేశారు. వీరి సర్వీస్ కాలంలో చిత్తశుద్దితో, నిజాయితీతో పనిచేసిన సమర్థులైన అధికారులుగా వీరు పేరు సంపాదించుకున్నారు...తప్పుడు ఆరోపణలతో వైఎస్ జగన్ను రాజకీయంగా దెబ్బతీయడానికే వీరిద్దరినీ అరెస్ట్ చేశారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన చేయకుండా, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అంటకాగారనే నెపంతో సివిల్ సర్వెంట్లు, ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేయడం అత్యంత దారుణం. ఇలా చేస్తుంటే ఏ ప్రభుత్వ అధికారి చిత్తశుద్దితో పనిచేస్తారు? ఎక్కడా జరగని మద్యం కుంభకోణంను సృష్టించి, దీనిలో వైఎస్ జగన్ను ఇరికించి, అరెస్ట్ చేయాలనే కుట్రతోనే చంద్రబాబు పనిచేస్తున్నారు...ఇలాంటి తప్పుడు కేసులు బనాయించి, ఇదే తరహాలో పాలన సాగించాలని అనుకుంటే ప్రజలు సరైన సమయంలో బుద్ది చెబుతారు. శిశుపాలుడి మాదిరిగా చంద్రబాబు చేస్తున్న తప్పులను కృష్ణుడి మాదిరిగా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల గురించి ఆలోచించకుండా, ప్రతి పదిహేను రోజులకు ఒక డైవర్షన్ పాలిటిక్స్ను ప్రయోగిస్తూ, గత వైయస్ఆర్సీపీపై ఏదో ఒక ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు. నిజాయితీపరులైన అధికారులను జైళ్లకు పంపడం ద్వారా చంద్రబాబు సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రతీకార చర్యలను చూసి రేపు మన భవిష్యత్తు ఏమిటీ అనే ఆత్మ మథనం అధికారుల్లో ప్రారంభమైంది’’ అని భూమన కరుణాకర్రెడ్డి పేర్కొన్నారు. -
ఉమ్మడి విశాఖ జిల్లాలో కిడ్నాప్ కలకలం
సాక్షి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాలో చిన్నపిల్లల కిడ్నాప్ కలకలం రేపుతోంది. అనకాపల్లి టౌన్కి చెందిన నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్కు గురైంది. అనకాపల్లి లోకావారి వీధి ఇంటి నుంచి అదృశ్యం అయినట్టు బాధితులు ఫిర్యాదు చేశారు.సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన అనకాపల్లి పోలీసులు షాక్కు గురయ్యారు. ఓ మహిళ చాకచక్యంగా చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. గుర్తు తెలియని మహిళ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పాత కిడ్నాప్ గ్యాంగ్గా పోలీసులు అనుమానిస్తున్నారు. -
బాబూ.. కూటమి సంక్షేమం ఉత్తుత్తి మాటేనా?
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ప్రభావం ప్రస్తుత అధికార కూటమిపై బాగానే ఉన్నట్టుంది. ఇచ్చిన హామీలను దాదాపుగా నెరవేర్చిన జగన్ ఒక పక్కనుంటే.. ఇంకోపక్క ఒకటి అర కూడా అమలు చేయని కూటమి ఇంకోవైపున ఉంది. రెండింటినీ పోల్చుకుంటున్న ప్రజలు అసంతృప్తిని వెళ్లగక్కుతుంటే.. దాన్ని చల్చార్చలేక కూటమి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోంది. రెడ్బుక్ పేరుతో సృష్టిస్తున్న ఆరాచకాలు.. జగన్పై లేనిపోని అభాండాలు వేయడం వంటివి ఎన్ని చేస్తున్నా ప్రజల్లో అసంతృప్తిని మాత్రం ఇసుమంత కూడా తగ్గడం లేదు.ఈ విషయం కూటమి నేతలకూ బాగానే అర్థమైంది. ఎక్కడికెళ్లినా జగన్కు ప్రజాదరణ ఏమాత్రం తగ్గకపోవడం కూడా కూటమి నేతలకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు, ఎల్లోమీడియా తన స్వరాన్ని కొంత మార్చుకుంటున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. సూపర్సిక్స్ హామీల్లో అన్నీ కాకపోయినా కొన్నింటినైనా అమలు చేసినట్లు కనిపించాలని సంక్షేమ రాగం ఎత్తుకున్నాయి!. అయితే ఇందులోనూ చిత్తశుద్ధి కనిపించడం లేదు. సంక్షేమ కార్యక్రమాల పేరిట టీడీపీ కార్యకర్తలకు నిధుల పందేరానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. టీడీపీ పోలిట్ బ్యూరో నిర్ణయాలు కొన్నింటిని గమనిస్తే.. పార్టీ కేడర్ను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యమని స్పష్టమవుతుంది.టీడీపీ కార్యకర్తలకు గతంలో పెండింగ్లో ఉన్న నీరు-చెట్టు, ఉపాధి హామీ పనులకు సంబంధించి సుమారు రూ.650 కోట్ల చెల్లించేందుకు నిర్ణయించారు. ఈ స్కీమ్ల కింద పనులు చేయకుండా చేసినట్లు చూపించడం, పలు అవకతవకలు పాల్పడినందున అప్పట్లో విజిలెన్స్ అధికారులు విచారణ చేసి నిధుల మంజూరును నిలిపి వేశారు. కూటమి అధికారంలోకి రాగానే ఇలాంటి పనుల బిల్లులు సుమారు రూ.1000కోట్ల మేర చెల్లించారని వార్తలు వచ్చాయి. తాజాగా మరో రూ.650 కోట్ల నిధులు పంచబోతున్నారు. విశేషం ఏమిటంటే టీడీపీ కార్యకర్తలే ఈ పనులు చేపట్టారని పార్టీ అంగీకరించడం!. పాలిట్ బ్యూరో నిర్ణయాన్ని ప్రజలు వేరే రకంగా భావించకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం సంక్షేమ స్కీములు అమలు చేయబోతోందని, సంక్షేమ క్యాలెండర్ తీసుకురాబోతోందని, దీని ద్వారా ప్రతి నెల ఒక స్కీము అమలు చేయాలని నిర్ణయించారని ఉచిత సిలిండర్లకు సంబంధించి నగదు ముందుగానే లబ్దిదారుల ఖాతాలలోకి వేయాలని నిర్ణయించారంటూ, సంక్షేమ సందడి అంటూ ఎల్లో మీడియా ప్రచారంలో పెట్టింది. టీడీపీ ఈ మాత్రం నిర్ణయాలైనా తీసుకుందంటే అది జగన్ ఎఫెక్ట్ అని తెలుస్తూనే ఉంది.ఉదాహరణకు ఈ మధ్య కాలంలో జగన్ రెండు, మూడు సార్లు అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఎప్పుడు వెళ్లినా అశేష జనసందోహం తరలివచ్చి ఆయనను ‘సీఎం సీఎం’ అంటూ నినాదాలు చేస్తూ జై కొడుతోంది. తిరుపతిలో తొక్కిసలాట ఘటన పరామర్శకు వెళ్లినప్పుడు, సింహాచలంలో గోడ కూలి మరణాలు సంభవించినప్పుడు వారి కుటుంబాలకు ధైర్యం చెప్పడానికి వెళ్లినప్పుడు కూడా జనం అభిమానం ఎంతటిదో అంతా గమనించారు. జగన్ ప్రభుత్వంలో మద్యం స్కాం అంటూ తప్పుడు కేసు పెట్టినా జనం పట్టించుకోవడం లేదని అర్థమైంది. దాంతో సంక్షేమం అమలు చేయబోతున్నామని ప్రజలను ఆకట్టుకోవడానికి యత్నిస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ, ఇందులో ఒక నిజాయితీ ఉందా అన్న చర్చ వస్తోంది. ఉదాహరణకు ప్రభుత్వం మూడు వంట గ్యాస్ సిలిండర్ల హామీ నెరవేర్చడంలో భాగంగా ముందుగానే వాటికి అయ్యే ఖర్చు మొత్తాన్ని వినియోగదారుల ఖాతాలో వేయాలని పాలిట్బ్యూరో నిశ్చయించిందట.జనసేన, బీజేపీలతో కూడా మాట్లాడి దీనిపై తుది నిర్ణయం చేస్తారట. నిజంగానే వంటగ్యాస్ వినియోగుదారులందరికీ ఈ రకంగా డబ్బు వేస్తారా?. మళ్లీ ఇందులో ఏ లిటిగేషన్ పెడతారో తెలియదు. ఎందుకంటే ఇప్పటికి ఏడాది పూర్తి అవుతున్నా, ఒక సిలిండర్ మాత్రమే.. అది కూడా అరకొరగా ఇచ్చి కథ నడిపించారు. అంటే ఒక ఏడాదికి రెండు సిలిండర్ల డబ్బు ఎగవేసినట్లు అవుతుంది. నిజంగానే రెండు లేదా, మూడు సిలిండర్ల నగదు ఇచ్చి ఉంటే దానిని విస్తారంగా ప్రచారంలో పెట్టడానికి చంద్రబాబు అన్ని చర్యలు తీసుకునేవారు కదా?. వెయ్యి రూపాయల పెన్షన్ అదనంగా ఇవ్వడానికే చంద్రబాబు లక్షల రూపాయల ఖర్చు పెట్టి హెలికాప్టర్లలో ప్రయాణిస్తూ సభలు పెట్టి హడావుడి చేస్తున్నారు. అలాంటిది అందరికి సిలిండర్ల డబ్బు ఇస్తే ఇంకెంత హడావుడి చేసేవారు? ఇప్పుడైనా నిజంగానే మూడు సిలిండర్ల డబ్బు వినియోగదారులకు ఇస్తారా? అందుకు అవసరమైన బడ్జెట్ ఉందా అంటే అనుమానమే. ఎందుకంటే బడ్జెట్ లో ఈ స్కీమ్కు వంద కోట్లే కేటాయించారని, అది ఎలా సరిపోతుందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు. ఆలోచిస్తే ఇది నిజమే కదా అనిపిస్తుంది.ఆంధ్రప్రదేశ్లో సుమారు కోటి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయనుకుంటే ఎన్ని కోట్లు అవసరం అవుతాయి. మరి ఇప్పుడు కొత్తగా ఏమైనా నిధులు కేటాయిస్తారా అన్నది చెప్పాల్సి ఉంటుంది. లేకుంటే ఇది ప్రచారం కోసమే అన్న సంగతి అర్థం చేసుకోవడం కష్టం కాదు. తల్లికి వందనం గురించి ఇప్పటికి పలు వాయిదాలు వేశారు. మళ్లీ జూన్ అంటున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మరో రెండు నెలలు పడుతుందని చెబుతున్నారు. మహిళలకు రూ.1500 చొప్పున ఇస్తామన్న హామీ గురించి చెప్పడం లేదు. అలాగే నిరుద్యోగ భృతిని ఏం చేశారు?. బీసీలకు 50ఏళ్లకే పెన్షన్ అని ఆర్భాటంగా చెప్పారు. ఆ మాట గురించి ఏంటి?. జగన్ ఆయా స్కీమ్లను పద్ధతి ప్రకారం అమలు చేస్తే శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేశారు. ఎన్నికలు వచ్చేసరికి తాము రెండు, మూడు రెట్లు ఎక్కువ ఇస్తామని ఊదరగొట్టారు. అధికారం వచ్చాక అప్పులు పుట్టడం లేదని ఒకసారి, సంక్షేమ పథకాలు వంద శాతం అమలు చేసేశామని ఇంకోసారి, అప్పులు చేసి సంక్షేమం అమలు చేయలేమని మరోసారి చెప్పారు.ఇలా ఎప్పుడు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలకు ఏం ఉపయోగం?. పాలిట్బ్యూరోలో ప్రస్తావనకు వచ్చిన ఇంకో విషయం రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి.. దావోస్ నుంచి ఒక్క రూపాయి పెట్టుబడులు రాలేదు కానీ.. ఏడాది కాలంలో రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్లు వచ్చేశాయని డమ్మీ ప్రచారం మొదలుపెట్టింది కూటమి!. ఇలాంటి అబద్ధాలే.. చంద్రబాబు ప్రభుత్వంపై అపనమ్మకాన్ని రోజు రోజుకూ పెంచుతున్నాయి!.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏ ఆధారాలతో వారిని అరెస్ట్ చేశారు?: రాచమల్లు
సాక్షి, కడప: కూటమి ప్రభుత్వం చేసే అరెస్ట్లు కుట్రలో భాగమేనని వైఎస్సార్సీపీ నేత రాచమల్లు శివప్రసాద్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిలను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. మద్యం పాలసీతో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిలకు సంబంధమే లేదన్నారు. కక్ష సాధింపుల్లో భాగంగానే వారిని అరెస్ట్ చేశారన్నారు.ఏ సాక్ష్యాలు, ఆధారాలతో అరెస్ట్ చేశారో ప్రభుత్వం చెప్పగలదా? అంటూ రాచమల్లు శివప్రసాద్రెడ్డి నిలదీశారు. ‘‘సత్యప్రసాద్ అనే చిన్న ఉద్యోగిని బెదిరించారు. అతని బెదిరించి వారికి కావాల్సిన స్టేట్మెంట్ ఇప్పించుకున్నారు. ఐఏఎస్, ఐపీఎస్లను బెదిరిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్లు ధైర్యంగా పనిచేయగలుగుతున్నారా?. ఐఏఎస్, ఐపీఎస్లు జైళ్లకు పోవాల్సిందేనా?’’ అంటూ రాచమల్లు దుయ్యబట్టారు.‘‘కొన్ని బ్రాండ్లే అమ్మారు.. అన్ని బ్రాండ్లు అమ్మలేదని ఆరోపణ.. కూటమి ప్రభుత్వం ఆరోపణలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. కూటమి ప్రభుత్వం చర్యలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. ఎవరిని జైలుకు పంపాలని ఉద్దేశంతో అక్రమ అరెస్ట్లు చేస్తున్నారు?. రూ.3,200 కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందో ఆధారాలతో చెప్పగలరా?. చంద్రబాబు మద్యం పాలసీ అత్త నీతులు చెప్పినట్లుంది. ఎన్నికలకు ముందు మద్యం ధరలు తగ్గిస్తామన్నారు.. తగ్గించారా?’’ అంటూ రాచమల్లు శివప్రసాద్రెడ్డి ప్రశ్నించారు. -
వీడియో వైరల్.. ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో దారుణం
శ్రీ సత్యసాయి జిల్లా: టీడీపీ కూటమి పాలనలో ఏ సంక్షేమ పథకం కావాలన్నా లంచం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పింఛన్ కావాలంటే అన్ని అర్హతలున్నా చేయి తడపందే పనికాని దుస్థితి. సీఎం చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. వివరాలివీ..హిందూపురం మోడల్ కాలనీకి చెందిన ఓ మహిళ తన చెవి దుద్దులు తాకట్టు పెట్టేందుకు ఓ బంగారం దుకాణానికి వెళ్లింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ‘ఏమంత కష్టం వచ్చిందమ్మా’ అని అడిగితే పింఛన్ కోసం రూ.10 వేలు డబ్బులడిగారని, తాను అంత ఇవ్వలేనని చెప్పి రూ.6 వేలకు ఒప్పించుకున్నానని మహిళ బదులిచ్చింది.ఈ డబ్బు కూడా తనవద్ద లేక చెవికమ్మలు తాకట్టు పెడుతున్నానని చెప్పింది. లంచం ఎవరడిగారని దుకాణం యజమాని ప్రశ్నించగా.. ‘మోడల్ కాలనీ సచివాలయంలో డబ్బు అడిగారు. ఇవ్వకపోతే పింఛన్ రాదని చెప్పారు.. అందుకే సామీ కమ్మలు తాకట్టుపెడుతన్నా’.. అంటూ ఆ మహిళ నిట్టూర్చింది.ఈ సంభాషణంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్చేయడంతో ఈ అంశం వైరల్గా మారింది. ఎమ్మెల్యే బాలకృష్ణ స్థానికంగా ఉండకపోవడం, నియోజకవర్గంపై పర్యవేక్షణ లేకపోవడంతో టీడీపీ నేతలు, కొందరు అధికారులు పేదలను పీల్చి పిప్పిచేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇలా ఎప్పుడూ జరగలేదని, ఎటువంటి లంచాలు లేకుండానే అప్పట్లో నేరుగా ఇంటివద్దే సేవలు అందేవని.. ఇప్పుడు వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయాయని వారు దుమ్మెత్తిపోస్తున్నారు. -
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
కాకినాడ జిల్లా: తుని రూరల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులు రాజమండ్రి అపోలో ఫార్మసీ ఉద్యోగులుగా గుర్తించారు. మరో ఘటనలో కడియం-రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ల మధ్య రైలునుంచి జారి పడి సుమారు 50 ఏళ్ల వయసుగల వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడని జీఆర్ఫీ ఎస్సై మావుళ్లు తెలిపారు. గాయపడి ఉండగా శుక్రవారం తెల్లవారు జామున గుర్తించి 108 అంబులెన్సు ద్వారా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు.మృతుడు నలుపు రంగుపై పసుపు రంగు గడులు గల హాఫ్ హాండ్స్ షర్ట్, నీలం రంగు లుంగీ ధరించాడు. మృతుడి కుడి చేయి మీద సన్ ఫ్లవర్ గుర్తుతో పచ్చబొట్టు ఉందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుని వివరాలు తెలిసిన వారు 94406 27551, 94910 03239 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
అనంతపురం: వివాదంలో ఎక్సైజ్ సీఐ హసీనా భాను
సాక్షి, అనంతపురం: అనంతపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో సీఐ, అటెండర్ మధ్య పంచాయితీ చర్చనీయాంశంగా మారింది. కళ్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ హసీనా భాను తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. సీఐ హసీనా భాను.. అటెండర్ను చెప్పుతో కొట్టిన ఘటన వివాదంగా మారింది. రెండు క్రితమే జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందివివరాల ప్రకారం.. కల్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ హసీనా భాను, అటెండర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ అటెండర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఐ హసీనా భాను. ఈ విషయమై తనకేమీ తెలియదని సదరు అటెండర్.. ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాట పెరిగి.. ఆగ్రహానికి లోనైన సీఐ హసీనా భాను.. అటెండర్ను చెప్పుతో కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. -
టీడీపీ ఎమ్మెల్యే.. మహిళా ఎంఆర్వోకి అర్ధరాత్రి వాట్సాప్ కాల్ చేసి దూషణ..
సాక్షి, పార్వతీపురం మన్యం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే అర్ధరాత్రి మహిళా ఎంఆర్వోకు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అనంతరం, సదరు మహిళా ఎంఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టీడీపీ ఎమ్మెల్యే ప్లేటు ఫిరాయించారు. రివర్స్లో ఆమెపైనే ఆరోపణలు చేశారు.వివరాల ప్రకారం.. పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర.. మహిళా ఎంఆర్వోకు అర్ధరాత్రి వాట్సాప్లో కాల్ చేశారు. ఈ క్రమంలో అసభ్య పదజాలంతో ఆమెను దూషించారు. దీంతో, సదరు మహిళా ఎంఆర్వో.. పోలీసులకు ఆశ్రయించారు. అనంతరం, టీడీపీ ఎమ్మెల్యే బోనెల.. బహిరంగంగా బ్లాక్మెయిల్కు దిగారు. సదరు అధికారి.. ఎస్టీ మహిళ కావడంతో తనపై కేసు నమోదు అవుతుందున్న భయంతో ఎంఆర్వోపై తీవ్ర ఆరోపణలు చేశారు.ఆయన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర స్పందిస్తూ..‘భూమి విషయమై మాట్లాడేందుకు అర్ధరాత్రి ఎంఆర్వోకు నేను ఫోన్ చేశాను. ఆమె ఎత్తకపోవడంతో వాట్సాప్ కాల్ చేశాను. ఎంఆర్వో ఆఫీసు అవినీతిమయంగా తయారైంది. ఎంఆర్వో మానసిన పరిస్థితి సరిగా లేదు. ఎంఆర్వోపై శాసనసభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తా. ఆమె క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.మరోవైపు... ఎంఆర్వోతో అనుచితంగా మాట్లాడిని ఎమ్మెల్యే తీరుపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఈ సందర్బంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు స్పందిస్తూ.. మహిళా ఎంఆర్వోకు అర్ధరాత్రి ఎమ్మెల్యే ఫోన్ చేయడం సరికాదు. ఆమెను వేధింపులకు గురిచేయడమేంటని ప్రశ్నించారు. -
సాగు భూమి మొత్తాన్నీ తీసుకుంటారా?
ఇబ్రహీంపట్నం: ‘‘ఇదివరకు గ్రామంలో దాదాపు 1,200 ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది. రియల్ ఎస్టేట్, కళాశాలలు, పరిశ్రమలకు 600 ఎకరాలు పోయింది. మిగిలిన 581 ఎకరాలను స్పోర్ట్స్ సిటీ పేరుతో ప్రభుత్వం తీసుకుంటే.. మా ఇళ్లు మాత్రమే మిగులుతాయి. ఇక వ్యవసాయం ఎక్కడ చేయాలి?’’ అంటూ టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి పార్టీల నేతలు ప్రశ్నించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామ సచివాలయం వద్ద శుక్రవారం వీరంతా నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సచివాలయ కార్యదర్శి ఎం.మౌనికకు వినతిపత్రం అందజేశారు.ఆందోళనలో టీడీపీ నాయకులు కేతనకొండ మాజీ సర్పంచి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పత్రి లేపాక్షిరావు, పత్రి చలపతి, కొమ్మూరి గోపీ, జనసేనకు చెందిన కొమ్మూరి వెంకటస్వామి, మొక్కపాటి చింతయ్య తదితరులు పాల్గొన్నారు. ఎకరం లోపు ఉన్న రైతులు సుమారు 90 శాతం మంది ఉన్నారని, ఏటా మూడు పంటలు పండే భూములను స్పోర్ట్స్ సిటీకి తీసుకుంటే ఎలాగని నిలదీశారు. సన్న, చిన్నకారు రైతుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోందని, స్పోర్ట్స్ సిటీతో తమ పొట్టకొట్టొదని వేడుకున్నారు.కాగా, కేతనకొండ, పరిసర గ్రామాల్లో సుమారు 2,874 ఎకరాల వ్యవసాయ భూమిని తీసుకుంటున్నట్లు రెవెన్యూ అధికారులు గ్రామ సభల్లో ప్రకటించారు. దీంతో తమ ప్రాంతంలో వ్యవసాయం కనుమరుగేనని.. జీవితాలు దుర్భరంగా మారతాయని రైతులు వాపోతున్నారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్లో తీసుకున్న రైతులకు ఇప్పటికీ ప్లాట్లు కేటాయించలేదని, ఇక తమకెప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. పూలింగ్పై పునరాలోచన చేయాలని కోరారు. కాగా, జీవనాధారంగా ఉన్న వ్యవసాయ భూములను పూలింగ్కు ఇవ్వబోమని ఇప్పటివరకు రైతులు మాత్రమే అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా వారి బాటలోనే కూటమి నాయకులు ప్రతిఘటించడం గమనార్హం. కేతనకొండ గ్రామం 1930లో ఉబ్బడివాగు వాగు పక్కన ఏర్పడింది. ప్రస్తుత 65వ నంబర్ జాతీయ రహదారి పక్కన నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. రియల్ ఎస్టేట్కు 400 ఎకరాలు, పరిశ్రమలు, స్టోన్ క్రషర్లు, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల ఏర్పాటుకు 200 ఎకరాలు పోయింది. మిగతాది కూడా తీసుకుంటే వ్యవసాయానికి భూమి మిగలదని రైతులు, కూటమి నాయకులు ఆందోళన చెబుతున్నారు. ఉన్నదే 44 సెంట్లు.. అదీ తీసుకుంటారా? నాకు 44 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. మూడు పంటలు పండిస్తా. అదే కుటుంబానికి ఆసరా. దీనినీ తీసుకుంటారా? గ్రామంలో 90 శాతం మంది ఎకరం లోపు ఉన్న రైతులే. భూములు తీసుకుంటే వారంతా ఏమవాలి. ఎట్టి పరిస్థితిలో పూలింగ్లో భూములు ఇవ్వం. –పయ్యావుల రాము, ఇబ్రహీంపట్నం బీజేపీ ప్రధాన కార్యదర్శి, కేతనకొండవ్యవసాయం లేకుంటే నేనేం చేయాలి? వ్యవసాయం ఇతర పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. జీవనాధారంగా ఉన్న భూమిని ప్రభుత్వం తీసుకుంటే నేనేం చేయాలి. వ్యవసాయం అలవాటుగా మారింది. భూమి లేకపోతే పంటలు ఉండవు. పశువులకు మేత, రైతు కూలీలకు పని దొరకదు. –షేక్ ఉద్దండు, రైతు, మాజీ ఎంపీటీసీ, కేతనకొండ -
ఏపీ ఈఏపీసెట్కు 3.62 లక్షల దరఖాస్తులు
సాక్షి, అమరావతి/బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్–2025కు 3,62,429 మంది దరఖాస్తు చేసుకున్నారని సెట్ చైర్మన్ ప్రొఫెసర్ సీఎస్ఆర్కే ప్రసాద్ చెప్పారు. కాకినాడలోని జేఎన్టీయూలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,80,597, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 81,832 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ఈ నెల 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీకి, 21 నుంచి 27వ తేదీ వరకు ఇంజినీరింగ్ విభాగాలకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు.ఆంధ్రప్రదేశ్లో 145, హైదరాబాద్, సికింద్రాబాద్లలో ఒక్కోటి చొప్పున ఆన్లైన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులకు ఏపీ ఈఏపీసెట్ పరీక్ష కేటాయించిన తేదీన వేరే జాతీయ స్థాయి పరీక్ష ఉంటే ఆధారాలతో హెల్ప్లైన్ సెంటర్ను సంప్రదించాలని, ఆ వివరాలను పరిశీలించి, పరీక్ష తేదీ మారుస్తామని చెప్పారు. ఉర్దూ మీడియం ఎంచుకున్న అభ్యర్థులు కర్నూలు రీజినల్ సెంటర్లో మాత్రమే పరీక్ష రాయాల్సి ఉంటుందన్నారు. దివ్యాంగులకు సహాయకులను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందన్నారు. దరఖాస్తులో ఏమైనా తప్పులు నమోదు చేస్తే పరీక్ష రాసిన తర్వాత హెల్ప్లైన్ సెంటర్ ద్వారా మార్చుకోవచ్చని తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి గంటన్నర ముందుగా అనుమతిస్తామన్నారు.అభ్యర్థులు హాల్ టికెట్తోపాటు నిర్దేశించిన గుర్తింపు కార్డు, నలుపు లేదా నీలం రంగు బాల్పాయింట్ పెన్ను మాత్రమే పరీక్ష కేంద్రంలోకి తీసుకువెళ్లాలని సూచించారు. బయోమెట్రిక్కు ఆటంకం లేకుండా చేతులపై మెహందీ వంటివి పెట్టుకోవద్దని, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతిలేదని పేర్కొన్నారు. హాల్టికెట్పై పరీక్ష కేంద్రం రూట్ మ్యాప్ ఉంటుందని, ముందు రోజే వెళ్లి చూసుకోవాలన్నారు. హాల్టికెట్లను ఏపీ ఈఏపీసెట్ వెబ్సైట్ నుంచి, మన మిత్ర వాట్సాప్ యాప్(నంబర్ 9552300009) ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 0884–2359599, 0884–2342499 హెల్ప్లైన్ నంబర్లలో సంప్రదించాలని ప్రొఫెసర్ ప్రసాద్ సూచించారు. ఈ సమావేశంలో సెట్ కన్వీనర్ వీవీ సుబ్బారావు, రెక్టార్ కేవీ రమణ, ఓఎస్డీ కోటేశ్వరరావు పాల్గొన్నారు.వైఎస్ జగన్ చొరవతో ప్రైవేట్ వర్సిటీల్లో సీట్లు..పేదింటి బిడ్డలు ప్రైవేట్ యూనివర్సిటీల్లోనూ ఉచితంగా చదువుకునే వెసులుబాటును కల్పిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఈఏపీసెట్లో ప్రతిభ చూపించిన విద్యార్థులకు ఏడాదికి రూ.4లక్షల నుంచి రూ.5లక్షల ఫీజులు ఉండే ప్రైవేట్ వర్సిటీల్లో ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించారు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రైవేటు కళాశాలల్లోనే కాకుండా ప్రైవేటు వర్సిటీల్లోనూ అమలు చేశారు.విట్, ఏపీ ఎస్ఆర్ఎం, ఎంబీయూ, సెంచూరియన్ వంటి ప్రైవేట్ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందేలా చేశారు. మరోవైపు పేద పిల్లలకు మేలు చేసే గత ప్రభుత్వ విధానాలను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కింది. విచ్చలవిడిగా ఇంజినీరింగ్ కళాశాలలను డీమ్డ్ వర్సిటీలుగా మార్చుకునేందుకు అనుమతులు ఇవ్వడంతోపాటు ప్రైవేటు వర్సిటీలుగా మార్చుకునేందుకు తోడ్పాటును అందించింది. తద్వారా విలువైన కన్వీనర్ కోటా సీట్లను కోల్పోవాల్సి వస్తోంది.సీట్లన్నీ ఏపీ విద్యార్థులకే..విభజన చట్టం ప్రకారం పదేళ్లు గడువు ముగియడంతో 2025–26 విద్యా సంవత్సరం నుంచి అన్ రిజర్వుడు కోటాలో తెలంగాణ విద్యార్థులకు కేటాయించే 15 శాతం సీట్లను కూడా ఏపీ విద్యార్థులకు ఇస్తారు. రాష్ట్రంలో గత విద్యా సంవత్సరం 1.81లక్షల ఇంజినీరింగ్ సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) అనుమతిచ్చింది. ఇందులో రాష్ట్ర యూనివర్సిటీ క్యాంపస్లు 245 , ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో 1,71,079 సీట్లు, ఆర్జీయూకేటీ, డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీల్లో 10,653 సీట్లు ఉన్నాయి.మౌలిక వసతుల ఆధారంగా కళాశాలలు సొంతంగా సీట్ల సంఖ్యను పెంచుకునే వెసులుబాటు ఏఐసీటీఈ కల్పించింది. దీంతో ఈ ఏడాది ఇంజనీరింగ్ సీట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. చాలా కళాశాలలు సంప్రదాయ ఇంజినీరింగ్ కోర్సులను పక్కనపెట్టి విద్యార్థులను ఆకర్షించేందుకు కంప్యూటర్ ఆధారిత కోర్సులకే అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. 2024–25లో కంప్యూటర్ సైన్స్ కోర్సులోనే ఏకంగా 99,494 సీట్లు ఉండటం గమనార్హం. కాగా కన్వీనర్ కోటాలో 1.36లక్షల సీట్లు ఉన్నాయి. -
టీడీపీ ఎమ్మెల్యే వేధిస్తున్నారు
సాక్షి, పార్వతీపురం మన్యం: కూటమి ప్రభుత్వంలో అధికారులకు వేధింపులు అధికమయ్యాయి. చిరుద్యోగులే లక్ష్యంగా ప్రారంభమైన వేధింపుల పర్వం.. మండల స్థాయి అధికారులకూ తప్పడం లేదు. పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర తనను వేధిస్తున్నారని, అసభ్య పదజాలంతో ఫోన్లో దూషించారని సాక్షాత్తు ఓ మండల మేజి్రస్టేట్ ఆవేదన వ్యక్తం చేయడం ఉద్యోగ వర్గాలను విస్మయపరుస్తోంది. ‘‘ఈ నెల 15న రాత్రి 21.59 నిమిషాలకు పార్వతీపురం ఎమ్మెల్యే తనకు వాట్సాప్ కాల్ చేసి, మహిళ అని చూడకుండా మాటలకు అందని పదజాలంతో నన్ను దూషించారు’’ అంటూ పార్వతీపురం ఎస్ఐకు స్థానిక తహసీల్దార్ వై.జయలక్ష్మి ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొంటున్న లేఖ ఒకటి బయటకు రావడం కలకలం రేపుతోంది.శుక్రవారం మధ్యాహ్నం జిల్లా రెవెన్యూ అధికారి హేమలత, సంయుక్త కలెక్టర్ శోభికలను కలిసి కూడా తన ఆవేదన వినిపించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో కలెక్టర్ అందుబాటులో లేకపోవడం.. ఆయన దృష్టిలో పెట్టకుండా ఎటువంటి నిర్ణయమూ తీసుకోకూడదని అధికారులు ఆమెకు నచ్చజెప్పినట్లు తెలిసింది. ఇదే విషయమై తహసీల్దార్ వద్ద మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టకుండా తాను ఏ విషయమూ బయటకు చెప్పలేనని, తర్వాత తానే పిలిచి చెబుతానని అక్కడ నుంచి వెళ్లిపోయారు. మరోవైపు విషయం పెద్దది కాకుండా రాజీ ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఏమంటున్నారంటే.. ఈ ఘటనపై పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర స్పందించారు. తహసీల్దారు మీద అవినీతి ఆరోపణలు రావడం వల్లే అడిగినట్లు చెప్పారు. పార్వతీపురం మండలంలోని ములగ గ్రామానికి చెందిన రైతుల వద్ద నుంచి డిజిటల్ సిగ్నేచర్ కోసం రూ.10 లక్షలు ఆమె డిమాండ్ చేసినట్లు తెలిసిందని, అందులో ఇప్పటికే రూ.2 లక్షలు కూడా తీసుకున్నట్లు పలువురు చెప్పారని తెలిపారు. -
లోపాలు సరిచేసుకోకపోతే రూ.కోటి జరిమానా
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో లోపాలపై జాతీయ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) కన్నెర్రచేసింది. లోపాలు దిద్దుకోకపోతే ఒక్కో మెడికల్ కాలేజీ రూ.కోటి జరిమానా కట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తూ.. వారం కిందట జాతీయ మెడికల్ కమిషన్ అధికారి సుఖ్లాల్ మీనా రాష్ర్టంలోని అన్ని కాలేజీలకు విడివిడిగా నోటీసులు జారీ చేశారు. ఒక్కసారిగా రాష్ర్టంలోని 16 మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ నోటీసులు ఇవ్వడంతో వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం ఉలిక్కి పడింది. గత ఏడాదిగా ఫ్యాకల్టీ లోపాలపై సర్కారు దృష్టి సారించలేదు. చాలా చోట్ల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల కొరత ఉంది. కొన్ని చోట్ల రెసిడెంట్లు, ట్యూటర్ల కొరతా వేధిస్తోంది. లోపాలు సరిదిద్దుకోమనడం వేరని, లేదంటే కోటి రూపాయల జరిమానా చెల్లించాలనడం ఏంటని డీఎంఈ కార్యాలయం మధనపడుతోంది. మీరే బాధ్యులు.. మీరే చెల్లించాలి ఈనెల 6వ తేదీన నోటిసులు వచి్చన అనంతరం డీఎంఈ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ల సమావేశం జరిగింది. వైద్య కాలేజీల్లో లోపాలకు కళాశాలల ప్రిన్సిపాళ్లే బాధ్యులని, ఒక వేళ ఎన్ఎంసీ నిబంధనలను బేఖాతరు చేస్తే రూ.కోటి జరిమానా ఆయా మెడికల్ కాలేజీలే చెల్లించాలని, ప్రభుత్వం ఈ డబ్బు ఇవ్వదని డీఎంఈ తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడు వైద్య కాలేజీల ప్రిన్సిపాళ్లు, వైస్ ప్రిన్సిపాళ్లు ఆందోళన చెందుతున్నారు. సర్కారు నిర్లక్ష్యానికి తామెందుకు బాధ్యత వహించాలని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో ఏ రాష్ట్రంలో పెరగని విధంగా ఏపీలో యూజీ, పీజీ సీట్లు పెరిగాయి. భారీగా అసిస్టెంట్ ఫ్రొఫెసర్ల నియామకం జరిగింది. మౌలిక వసతుల కల్పన ఊహించని స్థాయిలో జరిగింది. అయినా సరే సీట్లు నిలబడాలంటే ఎప్పటికప్పుడు వనరులు సమకూర్చుకోవాల్సిందే. కానీ కూటమి సర్కారు దీనిపై దృష్టి సారించలేదు.ఇవీ ప్రధాన సమస్యలు ⇒ ఏడాదిగా పదోన్నతులు లేవు.. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల కొరత ⇒ హిస్టోపెథాలజీ, సైటో పెథాలజీ ఇన్వెస్టిగేషన్స్ వివరాలు లేకపోవడం ⇒ కొన్ని విభాగాల్లో మౌలిక వసతులు సరిగా కల్పించక పోవడం ⇒ ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ వివరాలు ఎప్పటికప్పుడు ఇవ్వక పోవడం ⇒ పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లకు సరిపడా వసతులు లేవు ⇒ గైనిక్ వార్డుల్లో వేధిస్తోన్న బెడ్ల కొరత ⇒ అనంతపురం, శ్రీకాకుళం, ఒంగోలు తదితర చోట్ల పరిస్థితులు దారుణం -
స్పెషల్ గ్రేడ్ పంచాయతీలకు డిప్యూటీ ఎంపీడీఓలు
సాక్షి, అమరావతి: పది వేల పైబడి జనాభా లేదా ఏడాదికి రూ.కోటికి పైబడి వార్షికాదాయం ఉండే గ్రామ పంచాయతీలను స్పెషల్ గ్రేడ్ పంచాయతీలుగా గుర్తించి, వాటికి డిప్యూటీ ఎంపీడీవోలను పర్యవేక్షణ అధికారులుగా నియమించాలని సర్కారు నిర్ణయించింది. ఒక్కో మండలం పరిధిలో ఉండే అన్ని గ్రామ పంచాయతీల కార్యకలాపాలను పర్యవేక్షించే మండల స్థాయి అధికారి ఈవోపీఆర్ అండ్ ఆర్డీలను ప్రభుత్వం ఇటీవలే డిప్యూటీ ఎంపీడీవోలుగా గుర్తించి ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో గ్రామ పంచాయతీలను వాటి వార్షికాదాయం, జనాభా ఆధారంగా పునర్వర్గీకరించేందుకు ఈ ఏడాది జనవరిలో అధికారుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ పది వేలపైబడి జనాభా ఉండే గ్రామ పంచాయతీలు, లేదంటే ఏడాదికి రూ.కోటికి పైబడి వార్షికాదాయం ఉండే పంచాయతీలను స్పెషల్ గ్రేడ్ పంచాయతీలుగా గుర్తించాలని, గిరిజన ప్రాంతాల్లో ఐదు వేల పైబడి జనాభా ఉండే పంచాయతీని స్పెషల్ గ్రేడ్గా గుర్తించాలని ప్రతిపాదించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13,326 గ్రామ పంచాయతీలు ఉండగా, అందులో దాదాపు 300 గ్రామ పంచాయతీలను స్పెషల్ గ్రేడ్ పంచాయతీలకు అర్హమైనవిగా గుర్తించింది. వీటిల్లో ప్రస్తుత పంచాయతీ కార్యదర్శుల స్థానంలో డిప్యూటీ ఎంపీడీవోలను నియమించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మూడు గ్రేడుల్లో విలీనం.. గ్రామ పంచాయతీల పునర్వర్గీకరణకు ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ స్పెషల్ గ్రేడ్ పంచాయతీలను మినహాయించి మిగిలిన గ్రామ పంచాయతీల మొత్తాన్ని గ్రేడ్ –1, 2, 3 పంచాయతీలుగా వర్గీకరిస్తూ ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శులను గతంలో ఐదు గ్రేడ్లుగా వర్గీకరించారు. ఇప్పుడు తాజా మార్పులకు వీలుగా వీరిని గ్రేడ్ –1, గ్రేడ్ –2, గ్రేడ్ –3 పంచాయతీ కార్యదర్శులుగా వర్గీకరించి విలీనం చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ «కమిషనర్ కార్యాలయ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆన్ని జిల్లాల నుంచి తగిన ప్రతిపాదనలు పంపాలంటూ కలెక్టర్లకు ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ సూచించింది. -
లెక్చరర్ పోస్టుల రాత పరీక్షలు వాయిదా
సాక్షి, అమరావతి: పాలనాపరమైన కారణాలతో జూన్లో జరగాల్సిన పలు లెక్చరర్ పోస్టుల రాత పరీక్షలు వాయిదా పడ్డాయి. ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజాబాబు ఈ విషయాన్ని ప్రకటించారు. పరీక్షల నిర్వహణ తేదీలను త్వరలో వెల్లడిస్తామన్నారు. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులతో పాటు టీటీడీ డిగ్రీ, ఓరియంటల్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ పోస్టులకు జూన్ 16 నుంచి 26వ తేదీ వరకు పరీక్షలు జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే. వారికి మరో అవకాశం గ్రూప్–2 మెయిన్స్కు అర్హత సాధించినవారిలో యూపీఎస్సీ ప్రిలిమ్స్, ఎఫ్ఆర్వో పరీక్షలు రాసేవారికి ధ్రువపత్రాల పరిశీలన కోసం ఏపీపీఎస్సీ జూలై 10 వరకు అదనపు అవకాశం కల్పించింది. తదుపరి తేదీ కోసం అభ్యర్థులు కమిషన్ను సంప్రదించాలని కార్యదర్శి సూచించారు. ప్రశ్నాపత్రాల తయారీ వేతనం పెంపు ఏపీపీఎస్సీ ప్రశ్నాపత్రాలు తయారు చేసే నిపుణులకు చెల్లించే వేతనాన్ని ప్రభుత్వం పెంచింది. ఆబ్జెక్టివ్ ప్రశ్నాపత్రం, కీ తయారీలో ప్రతి ప్రశ్నకి రూ.150 ఇస్తుండగా, ఆ మొత్తాన్ని రూ.200కి, జవాబు పత్రాల వేల్యూయేషన్ కోసం ఒక్కో స్క్రిప్్టకి రూ.100 ఇస్తుండగా, దాన్ని రూ.300కి పెంచారు. -
బెయిల్..రిమాండ్..ఆపై మరో కేసు
విజయవాడలీగల్ /నూజివీడు/గన్నవరం : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్పై అక్రమ కేసుల పరంపర కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం ఆయనపై ఇప్పటికే పదికిపైగా తప్పుడు కేసులు నమోదు చేసింది. వీటిల్లో కొన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో ఆయన జైలు నుంచి ఎక్కడ బయటికి వచ్చేస్తారోననే అక్కసుతో మరిన్ని కేసులను తెరమీదకు తీసుకువస్తూ వేధిస్తోంది. అయినా న్యాయస్థానాలపై నమ్మకంతో పోరాటం సాగిస్తోన్న వంశీమోహన్ ఒక్కో సమస్య సాలెగూడును ఛేదించుకుంటూ ముందడుగు వేస్తున్నారు. తాజాగా శుక్రవారం అటు విజయవాడ, ఇటు నూజివీడు కోర్టుల్లో చోటుచేసుకున్న పరిణామాలతో పాటు గుట్టుచప్పుడు కాకుండా నమోదైన కేసే ఇందుకు అద్దం పడుతున్నాయి. టీడీపీ ఆఫీసుపై దాడికేసులో బెయిల్ గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఎ71గా ఉన్న మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్కు 12వ అదనపు జిల్లా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా వున్న వంశీ తరపున దేవి సత్యశ్రీ,, ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కళ్యాణి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఇదే కేసులో ఎ81గా ఉన్న లక్ష్మీపతికీ బెయిల్ మంజూరైంది. రెండువారాల రిమాండ్ వల్లభనేని వంశీకి నూజివీడులోని రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు శుక్రవారం 14 రోజుల రిమాండ్ విధించింది. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం పెరికీడు, కొయ్యూరు గ్రామాల్లో నకిలీ ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చారని నమోదైన కేసుపై హనుమాన్జంక్షన్ పోలీసులు వంశీతో పాటు ఇదే కేసులో ఉన్న ఓలుపల్లి మోహన రంగారావులను నూజివీడు కోర్టులో హాజరుపరిచారు. వీరిద్దరికీ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.శ్రావణి రిమాండ్ విధించారు. ఈ కేసులో వల్లభనేని వంశీ ఏ10 కాగా, ఓలుపల్లి మోహన రంగారావు ఏ7గా ఉన్నారు. అనంతరం వంశీని పోలీసులు విజయవాడలోని జిల్లా సబ్జైలుకు తరలించారు. వంశీ న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేయగా, దానిపై విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు. తాజాగా మరో కేసు..ఆపై గోప్యత తాజాగా గ్రావెల్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ మైనింగ్ ఏడీ ఇచ్చిన ఫిర్యాదుపై వల్లభనేని వంశీమోహన్తో పాటు ఇంకొంత మందిపై గన్నవరం పోలీసులు గురువారం మరొక అక్రమ కేసు నమోదు చేశారు. ఈ కేసు వివరాలు బయటకు రాకుండా పోలీసులు అత్యంత గోప్యతను పాటిస్తుండడం గమనార్హం. వివరాలిలా వున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రావెల్ తవ్వకాలపై మూడు నెలలు క్రితం సమర్పించిన నివేదిక ఆధారంగా ఆ శాఖ ఏడీ ఇచ్చిన ఫిర్యాదుపై గురువారం గుట్టుచప్పుడు కాకుండా పోలీసులు కేసు నమోదు చేశారు.ఇందులో ప్రధాన నిందితులుగా వల్లభనేని వంశీమోహన్ను చేర్చారు.ఆయనతోపాటు ఓలుపల్లి మోహన్రంగా, పడమట సురేశ్, కైలే శివకుమార్తో పాటు మరో 10 మందిపై పోలీసులు నాన్బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ ఆరోపణలు, గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో బెయిల్ రావడంతో వంశీ మోహన్ బయటకు వస్తారనే సమయంలో తాజాగా మైనింగ్ కేసును బనాయించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రపన్నుతోంది. -
అసమర్థ విధానాలతో టీచర్లలో అలజడి
సాక్షి, అమరావతి: అసమర్థ విధానాలతో కూటమి ప్రభుత్వం టీచర్లలో అలజడి సృష్టిస్తోందని వైఎస్సార్సీపీ ఆర్టీఐ విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె మాట్లాడారు. ‘విద్యార్థి, ఉపాధ్యాయుల రేషియోలో అశాస్త్రీయ విధానం కారణంగా దాదాపు 10 వేల మంది స్కూల్ అసిస్టెంట్లను సర్ప్లస్గా చూపే పరిస్థితి తీసుకువచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యా రంగంలో తీసుకువచి్చన సంస్కరణలను కక్షతోనే నిర్విర్యం చేస్తున్నారు.కూటమి ప్రభుత్వ తప్పుడు విధానాలతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యా రంగాన్ని బతికించాలంటూ వీధుల్లోకి వచ్చి పోరాడే దుస్థితి తెచ్చారు. 117 జీఓను రద్దు చేస్తూ, దానికి బదులుగా తెచ్చిన 19, 20, 21 జీవోల వల్ల ప్రైమరీ స్కూళ్లకు ఎటువంటి మేలు జరగడం లేదు. ఇదివరకు ఉన్న ఆరు రకాల స్కూళ్లను నాలుగింటికి తగ్గిస్తామని చెప్పి.. తొమ్మిదికి పెంచారు.ఉపాధ్యాయుల్లో అయోమయ పరిస్థితి. వైఎస్ జగన్ టీచర్లకు పదోన్నతులు ఇస్తే, కూటమి ప్రభుత్వం వారికి డిమోషన్స్ ఇస్తోంది. ఒకవైపు మిగులు టీచర్లను చూపుతూ, మరోవైపు డీఎస్సీలో కొత్త టీచర్ పోస్ట్లను ఎలా భర్తీ చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. డీఎస్సీలో పోస్ట్లను తగ్గించేందుకే ఇటువంటి తప్పుడు విధానాలకు పాల్పడుతున్నారు. విద్యార్థుల రేషియోను 1-53 కాకుండా 1-40 ప్రకారం తీసుకోవాలి. సెకండ్ సెక్షన్ కూడా హైసూ్కల్కు ఇచ్చి స్కూల్ అసిస్టెంట్లకు న్యాయం చేయాలి. సబ్జెక్ట్ టీచర్లను పక్కకు పెట్టాలనే ఆలోచనను విరమించుకోవాలి’. -
రేపే పీఎస్ఎల్వీ సీ61 ప్రయోగం
సూళ్లూరుపేట/తిరుమల: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఆదివారం ఉదయం 5.59 గంటలకు పీఎస్ఎల్వీ సీ61 ప్రయోగాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి శనివారం ఉదయం 7:59 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభమవనుంది. పీఎస్ఎల్వీ సీ61 రాకెట్ ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (రీశాట్–1బీ) అనే ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ ఉపగ్రహం జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి, కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడనుంది. భవిష్యత్తులో భారత్ ప్రపంచంలోనే బలీయమైన శక్తిగా అవతరించేందుకు, నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు.ఈ ఉపగ్రహంలో అమర్చిన సీ–బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ పగలు, రాత్రి వేళల్లోనే కాకుండా అన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడా భూమి ఉపరితలం నుంచి అధిక రిజల్యూషన్ కలిగిన చిత్రాలను సంగ్రహిస్తుంది. ఇప్పటి దాకా వున్న ఈఓఎస్ ఉపగ్రహాల సిరీస్ కంటే ఈ ఉపగ్రహంలో అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్స్ను అమర్చి పంపిస్తున్నారు.భారత సైన్యానికి కావాల్సిన పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ ఉపగ్రహం అందిస్తుంది. ఉగ్రవాదుల శిబిరాలు, ఉగ్ర కార్యకలాపాలను కూడా అత్యధిక రిజల్యూషన్తో ఛాయాచిత్రాలు తీయడమే కాకుండా సరిహద్దుల్లో శత్రు సైన్యాల కదలికల గురించి సమాచారాన్నీ అందిస్తుంది. ఈఓఎస్ ఉపగ్రహాల సిరీస్లో ఇది తొమ్మిదో ఉపగ్రహం. కాగా ఇస్రో చైర్మన్ వి.నారాయణన్, శాస్త్రవేత్తలు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పీఎస్ఎల్వీ సీ61 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ నారాయణన్, శాస్త్రవేత్తలు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. -
‘స్థానిక’ సంస్థలకు శఠగోపం
సాక్షి, అమరావతి: తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థలను ఉద్ధరిస్తామని మాయ మాటలు చెప్పిన టీడీపీ కూటమి పెద్దలు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదు. పైగా.. వాటిని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు. ఆ సంస్థలకు హక్కుగా రావాల్సిన నిధుల్ని సైతం ఇవ్వకుండా వాటిని మళ్లిస్తున్నారు. గతేడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన వాటాలో పైసా కూడా ఇవ్వకుండా నిలిపివేశారు.ఫలితంగా.. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, పంచాయతీలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. పైగా.. సబ్ రిజి్రస్టార్లు ఎవరూ స్థానిక సంస్థల వాటా నిధులు విడుదల చెయ్యొద్దని మౌఖిక ఆదేశాలు జారీచేశారు. ఎవరైనా తమకు తెలీకుండా నిధులు విడుదల చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలా 11 నెలలుగా టీడీపీ కూటమి ప్రభుత్వం స్టాంప్ డ్యూటీ ద్వారా వచ్చే ఆదాయంలో చిల్లిగవ్వ కూడా స్థానిక సంస్థలకు విడుదల చేయలేదు.రూ.2 వేల కోట్లు విడుదల చేయలేదునిజానికి.. ఆస్తుల క్రయ విక్రయాల సమయంలో వినియోగదారులు రిజిస్ట్రేషన్ల శాఖకు స్టాంప్ డ్యూటీ కింద 6.5 శాతం చెల్లిస్తారు. అందులో 5 శాతం ప్రభుత్వానికి, 1.5 శాతం స్థానిక సంస్థలకు వెళ్తుంది. ప్రతినెలా ఆ మొత్తాన్ని ఆయా స్థానిక సంస్థలకు రిజిస్ట్రేషన్ల శాఖ చెల్లించాలి. కానీ, టీడీపీ కూటమి ప్రభుత్వం మొత్తం 6.5 శాతం స్టాంప్ డ్యూటీని తీసేసుకుని ఇతర అవసరాలకు వినియోగించుకుంటోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా స్థూల ఆదాయం రూ.9 వేల కోట్లు వచ్చింది. ఇందులో స్థానిక సంస్థల వాటా 1.5 శాతం అంటే సుమారు రూ.2 వేల కోట్లు ఇవ్వాల్సి వుంది.కానీ, ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, పంచాయతీలు నిధుల్లేక అల్లాడుతున్నాయి. ఎందుకంటే.. వాటికి ఇదే ప్రధాన ఆదాయ వనరు. దీంతో అనేక స్థానిక సంస్థల్లో ఇప్పుడు పారిశుధ్య కారి్మకులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు. రోడ్లు, డ్రెయిన్ల వంటి కనీస మౌలిక సదుపాయాల మరమ్మతులూ చేయించలేకపోతున్నారు. స్థానిక సంస్థల నిర్వహణకు సైతం తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.ఆదాయం తగ్గిపోయినట్లు కనపడుతుందని..నిజానికి.. రియల్ ఎస్టేట్ పడిపోవడంతో ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం భారీగా పడిపోయింది. దీంతో ఆదాయం తగ్గినట్లు చూపిస్తే ఇబ్బంది వస్తుందనే భయంతో స్టాంప్ డ్యూటీ వాటా గురించి అసలు ఎక్కడా మాట్లాడడంలేదు. సాధారణంగా.. స్టాంప్ డ్యూటీ కింద వచ్చిన మొత్తంలో స్థానిక సంస్థలు, ఇతర ఖర్చులు పోగా మిగిలిన మొత్తాన్ని మాత్రమే రిజిస్ట్రేషన్ల ఆదాయంగా చూపిస్తారు.అంటే.. స్థూల ఆదాయంలో ఖర్చులు, ఇతర శాఖలకు ఇవ్వాల్సిన వాటిని తీసివేసి నికర ఆదాయాన్ని చూపిస్తారు. అందులో స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన వాటా కూడా ఉంటుంది.అయితే, గత ఆర్థిక సంవత్సరం స్థూల ఆదాయం భారీగా తగ్గిపోవడంతో స్థానిక సంస్థలకు వాటి వాటా నిధులు ఇవ్వడంలేదు. ఇస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఇంకా తగ్గిపోయినట్లు కనబడుతుందనే కారణంతో విడుదల చేయడంలేదని అధికారులు చెబుతున్నారు.నోరు మెదపని పవన్.. అయితే, తమకు రావాల్సిన నిధులు ఇవ్వాలని పలుచోట్ల సర్పంచ్లు, మున్సిపల్ కమిషనర్లు సబ్ రిజి్రస్టార్ల వద్దకు వచ్చి అడుగుతున్నారు. కొందరైతే ఎందుకు ఇవ్వడంలేదని నిలదీస్తున్నారు. తమ వాటా విడుదల చెయ్యొద్దని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలుంటే చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, ప్రభుత్వం నుంచి వచ్చింది మౌఖిక ఆదేశాలు కావడంతో సబ్ రిజిస్ట్రార్లు మిన్నకుండి పోతున్నారు.ఈ వ్యవహారం తన శాఖకు సంబంధించినదైనా ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ నోరు మెదపడంలేదు. పంచాయతీరాజ్ శాఖకు రావాల్సిన నిధులను ప్రభుత్వం ఇవ్వకుండా దారి మళ్లిస్తున్నా ఆయన చోద్యం చూస్తుండడంపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు స్థానిక సంస్థలకు అన్యాయం జరగనివ్వనని కాకినాడలో సర్పంచ్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఆయన అనేక హామీలు గుప్పించారు. కానీ, ఇప్పుడు తన శాఖకు రావల్సిన నిధులను రాబట్టుకోవాల్సిన ఆయన ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై వారు రగిలిపోతున్నారు. -
ఆయనపై కేసులున్నాయని మీరెలా చెబుతున్నారు?
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసులు ఉన్నాయని మీరెలా చెబుతారు.. అంటూ సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. క్వార్ట్జ్ ఖనిజం తవ్వకాల కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కాకాణి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారించింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి క్వార్ట్జ్ ఖనిజాన్ని తవ్వి తరలించారని, గిరిజనులను బెదిరించారని మైనింగ్ అధికారి బాలాజీనాయక్ ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకాణి గోవర్దన్ రెడ్డిని ఏ–4గా చేర్చారు. దీంతో ముందస్తు రక్షణ కల్పించాలని కోరుతూ.. ఆయన మే 13న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఆ పిటిషన్ శుక్రవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. కాకాణి గోవర్ధన్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ దవే వాదనలు వినిపించారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పెట్టిన కేసేనని, అందులో ఏ మాత్రం వాస్తవం లేదని కోర్టుకు తెలిపారు. అందుకు ధర్మాసనం.. ‘హైకోర్టు డివిజన్ బెంచ్ వద్దే తేల్చుకోవచ్చు కదా.. దీనికోసం ఇక్కడి వరకు ఎందుకు వచ్చారు.. అని అడిగింది.హైకోర్టు డివిజన్ బెంచ్ కేసును జూన్ 16కు వాయిదా వేసిందని, అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించామని దవే బదులిచ్చారు. కాగా.. తనపై గతంలో ఇలాంటి కేసులేవీ నమోదు కాలేదని గోవర్దన్ రెడ్డి కోర్టును తప్పుదారి పట్టించేలా పిటిషన్లో పేర్కొన్నారని ఏపీ ప్రభుత్వం తరఫున ప్రేరణ సింగ్ ధర్మాసనానికి తెలిపారు. ‘ఆయన మీద కేసులు ఉన్నాయని మీరు ఎలా చెబుతున్నారు?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. అయినా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, వాస్తవాలపై స్పష్టత రావాల్సి ఉన్నందున అరెస్టు నుంచి కాకాణికి మినహాయింపు ఇవ్వలేమని ధర్మాసనం తెలిపింది. -
రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పర్యవసానాలు తప్పవు
ఈ కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు..పక్షపాతం ఉందని పిటిషనర్లు కొంతమేర ప్రాథమికంగా రుజువు చేయగలిగారు. రాజకీయ దురుద్దేశాలు.. పక్షపాతానికి న్యాయపరమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని తగిన సమయంలో తేలుస్తాం.థర్డ్ డిగ్రీ ఉపయోగించినా.. బెదిరించినా.. ఒత్తిడి చేసినా.. ప్రలోభపెట్టినా వీటిని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తాం. నిందితులు, సహ నిందితుల నుంచి వాంగ్మూలాలను సేకరించే సమయంలో దర్యాప్తు సంస్థ కొన్ని సందేహాస్పద పద్ధతులను అనుసరిస్తోంది. పిటిషనర్లు, ఇతర సహ నిందితుల విషయంలో థర్డ్ డిగ్రీ ఉపయోగించడం, బెదిరించడం, ఒత్తిడి తేవడం, ప్రలోభపెట్టడం చెయ్యడానికి వీల్లేదు. సాక్షి, అమరావతి: ఏపీ మద్యం వ్యవహారంలో కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని, వాటిని ఎంతమాత్రం కొట్టిపారేయలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజకీయ పక్షపాతం, దురుద్దేశాలకు న్యాయపరంగా తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయితే, రాజకీయ దురుద్దేశాల కారణంతో.. నిందితులను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయకుండా దర్యాప్తు అధికారిని నిరోధించలేమని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ జంషేడ్ బుర్జోర్ పార్థివాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.\మద్యం వ్యవహారంలో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిలకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని చెబుతూ, వారి పిటిషన్లను కొట్టివేసింది. పిటిషనర్లపై థర్డ్ డిగ్రీ ఉపయోగించడానికి వీల్లేదని ఏపీ సీఐడీ అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, ఫలానా విధంగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేయడం గానీ, బెదిరించడం గానీ, ప్రలోభపెట్టడం గానీ చేయరాదంది. దర్యాప్తును నిష్పాక్షికంగా, పారదర్శకంగా కొనసాగించాలని ఆదేశించింది. పిటిషనర్లు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటే, కేసు పూర్వాపరాల ఆధారంగా విచారించి తగిన నిర్ణయం వెలువరించాలని కింది కోర్టు, హైకోర్టుకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విచారణ సమయంలో న్యాయవాదులు ఉండాలనుకుంటే, ఆ అభ్యర్థనతో హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్లకు సూచించింది. సీఐడీ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నారు మద్యం కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం జస్టిస్ పార్థివాలా ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. మద్యం కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని, ప్రభుత్వం మారగానే కేసు నమోదైందని వారు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సీఐడీ దర్యాప్తునకు పిటిషనర్లు పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే 13 గంటల చొప్పున వీరిని దర్యాప్తు అధికారి ప్రశి్నంచారన్నారు. ఎలాంటి అక్రమాల్లేవనీ సీసీఐ తేల్చింది... కొత్త మద్యం కంపెనీలకు అవకాశం కల్పించడం వెనుక అక్రమాలు జరిగాయని సీఐడీ ఆరోపిస్తోందని.. కానీ, ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తేల్చిందని అభిషేక్ మను సింఘ్వీ, వికాస్ సింగ్ పేర్కొన్నారు. సీఐడీ రిమాండ్ రిపోర్టులో ఇప్పుడు చేస్తున్న ప్రతి ఆరోపణ.. గతంలో సీసీఐకి చేసిన ఫిర్యాదులో ఉన్నవేనని గుర్తు చేశారు. నాటి ఫిర్యాదును సీసీఐ క్షుణ్నంగా పరిశీలించి క్లీన్చిట్ ఇచ్చిందని వివరించారు.ఈ మేరకు సీసీఐ ఉత్తర్వులను వారు ధర్మాసనం ముందు ఉంచారు. అక్రమాలే లేవని తేలిన వ్యవహారంలో సీఐడీ కేసు నమోదు చేసిందని, రాజకీయ కక్ష సాధింపులకు ఈ కేసు ఓ ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు. ఈ కేసులో సాక్షులను సీఐడీ పలు రకాలుగా భయపెడుతోందన్నారు. కావాల్సిన విధంగా వాంగ్మూలం ఇవ్వకుంటే నిందితులుగా చేర్చేందుకు కూడా వెనుకాడడం లేదని తెలిపారు. వాంగ్మూలాలు తప్ప సాక్ష్యాలు ఏమీ చూపడం లేదని నివేదించారు. పిటిషనర్లకు మద్యం వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని, వారు కేవలం ప్రభుత్వ అధికారులుగా సమావేశాల్లో మాత్రమే పాల్గొన్నారని చెప్పారు. ఇదే నేరం అంటూ కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. పారదర్శక విధానాన్ని పూర్తిగా మార్చేశారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ, ఇదో భారీ కుంభకోణమన్నారు. గతంలో మద్యం కొనుగోళ్లు చాలా పారదర్శకంగా జరిగేవని, గత ప్రభుత్వ హయాంలో దానిని పూర్తిగా మార్చేశారన్నారు. కీలక స్థానాల్లో కావాల్సిన వ్యక్తులను నియమించుకున్నారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ... రాజకీయ దురుద్దేశాలను, ప్రాథమిక ఆధారాలను ఎలా సమతుల్యం చేస్తారని ప్రశ్నించింది. దీంతో ఇది విచారణకు స్వీకరించదగ్గ నేరమే కాదని వికాస్ సింగ్ సమాధానం ఇచ్చారు.ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. అలాగైతే ఎఫ్ఐఆర్ కొట్టివేతకు పిటిషన్ దాఖలు చేసుకోవాలని ధర్మాసనం సూచించింది. ఆ పని కచి్చతంగా చేస్తామని వికాస్ తెలిపారు. సింఘ్వీ వాదనలు వినిపిస్తూ... పిటిషనర్లు ప్రభుత్వాధికారులుగా పదవీ విరమణ చేశారని, వారు ఎక్కడికీ పారిపోయే అవకాశం లేదని అన్నారు. ఆ అవసరం కూడా వారికి లేదన్నారు. కావాలంటే పాస్పోర్ట్ జప్తునకు ఆదేశాలు ఇవ్వొచ్చునన్నారు. అలాంటప్పుడు దేశం విడిచివెళ్లిపోతారన్న ఆందోళన అనవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా స్పందిస్తూ, ఈ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఈసీఆర్ నమోదు చేసిందన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం, పిటిషనర్లకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమంటూ పిటిషన్లు కొట్టేసింది. బెయిల్ పిటిషన్ దాఖలుకు గోవిందప్పకు అనుమతి వికాట్ సంస్థ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అరెస్ట్ నేపథ్యంలో తాము దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే సుప్రీంకోర్టుకు వివరించారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్కు అనుమతి కోరగా.. ధర్మాసనం అనుమతిచ్చింది. బాలాజీ గోవిందప్ప రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటే కేసు పూర్వాపరాల ఆధారంగా నిర్ణయం వెలువరించాలని కింది కోర్టు, హైకోర్టుకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ సమయంలో దవే స్పందిస్తూ, ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉండగానే గోవిందప్పను అరెస్ట్ చేశారన్నారు. ఇది ఏమాత్రం సహేతుకం కాదని, ఇలా అరెస్ట్ చేయడం తగదంటూ ఇదే కోర్టు గతంలో స్పష్టమైన తీర్పు ఇచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పరిశీలించాలంటూ సంబంధిత తీర్పు కాపీని ధర్మాసనం ముందు ఉంచారు. ఇప్పుడు ఈ అంశాలన్నీ అవసరం లేదని, తాము బాలాజీ గోవిందప్పకు ముందస్తు బెయిల్ ఇవ్వలేదని ధర్మాసనం తెలిపింది. సుప్రీంకోర్టు హెచ్చరికలు ఇవీ... రాష్ట్ర ప్రభుత్వానికి... ఏపీ మద్యం వ్యవహారంలో కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి. వాటిని ఎంతమాత్రం కొట్టిపారేయలేం. రాజకీయ పక్షపాతం, దురుద్దేశాలు ఉంటే, వాటికి న్యాయపరంగా తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.సీఐడీ అధికారులకు..పిటిషనర్లపై థర్డ్ డిగ్రీ ఉపయోగించడానికి వీల్లేదు. ఫలానా విధంగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేయడం గానీ, బెదిరించడం గానీ, ప్రలోభపెట్టడం గానీ చేయరాదు. దర్యాప్తును నిష్పాక్షికంగా, పారదర్శకంగా కొనసాగించాలి.రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై... పిటిషనర్లు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటే, కింది కోర్టులు కేసు పూర్వాపరాల ఆధారంగా విచారించి తగిన నిర్ణయం వెలువరించాలి. విచారణ సమయంలో న్యాయవాదులు ఉండాలనుకుంటే, ఆ అభ్యర్థనతో పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించాలి. -
ఈ అరెస్టులు అప్రజాస్వామికం: వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని.. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ ప్రభుత్వాధికారి కృష్ణమోహన్రెడ్డి అరెస్టులను ఖండిస్తున్నామని శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు కక్ష రాజకీయాల వల్ల వ్యవస్థలు దెబ్బతింటున్నాయన్నారు. తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలు, వాంగ్మూలాలు సృష్టిస్తున్నారని.. ప్రభుత్వాధికారులను, మాజీ ప్రభుత్వాధికారులపై కూడా రాజకీయ విరోధం చూపిస్తున్నారంటూ బొత్స మండిపడ్డారు.చంద్రబాబు తీసుకొచ్చిన తప్పుడు సంప్రదాయాలు రాష్ట్రానికి చేటు చేస్తాయి. లిక్కర్ వ్యవహారంలో ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు చూపడం లేదు. కాని.. బెదిరించి, భయపెట్టి తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని, అరెస్టులు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం కల్తీ జరుగుతోందని ఆరోపించారు. మరి ఇప్పుడు అవే డిస్టలరీల నుంచి మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఖజానా వల్ల నష్టం వచ్చిందన్నారు. మరి ఈ ప్రభుత్వంలో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నా ఆదాయాలు ఎందుకు పెరగడంలేదు?’’ అంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.కక్ష రాజకీయాలు తార స్థాయికి.. గడికోట శ్రీకాంత్రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కక్ష రాజకీయాలు తార స్థాయికి చేరాయని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. ‘‘ఐఏఎస్లను, ఐపీఎస్లను ఇప్పటికే టార్గెట్చేసి వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇప్పుడు మాజీ ఐఏఎస్, మాజీ ప్రభుత్వాధికారులపైనా చంద్రబాబు కక్ష రాజకీయం చేస్తున్నారు. ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్కు మంచివి కావు. చంద్రబాబు కక్ష రాజకీయాలు రాష్ట్రాన్ని, ప్రజలను దెబ్బతీస్తాయి...పరిపాలనలో చంద్రబాబు ఘోరంగా విఫలం కావడంవల్లే ప్రజల దృష్టిని మళ్లించేందుకు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. వాగ్దానాల అమలు లేదు, ఏ వర్గంకూడా సంతోషంగా లేరు. రాష్ట్రంలో ఎవ్వరికీ భద్రతలేదన్న సంకేతాన్ని చంద్రబాబు ఇస్తున్నారు. మాజీ ఐఏఎస్ ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డిల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. తప్పుడు రాజకీయాలు మాని, రాష్ట్రంపై చంద్రబాబు దృష్టిపెట్టాలి. అణచివేసినంత మాత్రాన ప్రభుత్వంపై వ్యతిరేకత సద్దుమణగదు’’ అని శ్రీకాంత్రెడ్డి చెప్పారు.అరెస్ట్ క్రూరమైన రాజకీయ కక్ష సాధింపు.. మేరుగ నాగార్జునధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ క్రూరమైన రాజకీయ కక్ష సాధింపు అని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. కూటమి ప్రభుత్వం తప్పుడు చర్య అని.. ప్రతిపక్ష పార్టీపై ప్రతీకారం తీర్చుకోవడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తోంది. ఈ అరెస్ట్లకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని మేరుగ నాగార్జున హెచ్చరించారు.చంద్రబాబువి కక్ష రాజకీయాలు: మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుమాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్టమోహన్ రెడ్డిల అరెస్టును ఖండిస్తున్నాను. ఈ అరెస్టులు అప్రజాస్వామికం. ప్రజలకిచ్చిన హామీల అమల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారు. విపక్ష పార్టీ నేతలతో పాటు ప్రభుత్వాధికారులతో పాటు మాజీ అధికారులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. లిక్కర్ వ్యవహారంలో ఆధారాలు లేకపోయినా అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహనరెడ్డిల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాను.వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం.. మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ధనుంజయ రెడ్డి, క్రిష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు. వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం. రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు. ఆ ప్రక్రియలో అంతులేని దారుణ వేధింపులు. ఇది ఇంకా కొనసాగితే ఏ మాత్రం సహించబోము. ప్రభుత్వ తీరును కచ్చితంగా ప్రజల్లో ఎండగడతాం. అక్రమ కేసుల్లో అరెస్టయిన వారికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. తగిన న్యాయ సహాయం అందిస్తాం.పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే.. తిరుపతి ఎంపీ గురుమూర్తిచంద్రబాబువి కక్ష రాజకీయాలు. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్టమోహన్ రెడ్డిల అరెస్టును ఖండిస్తున్నాను. చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్కు చేస్తున్నారు. లిక్కర్ వ్యవహారంలో ఆధారాలు లేకపోయినా అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రజలు చూస్తున్నారు. -
రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి అరెస్ట్
విజయవాడ: మద్యం కేసులో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిలను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల విచారణ అనంతరం సిట్ అరెస్ట్ చేసింది. ఈ అరెస్టులు కక్ష పూరితమని.. ఐఏఎస్లు, ఐపీఎస్లను అరెస్టు చేసే సంస్కృతి సరికాదని ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి తరపు అడ్వకేట్ సుదర్శన్ రెడ్డి అన్నారు. లిక్కర్ కేసులో రిటైర్డు ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను ఇవాళ రాత్రి 7.15కి అరెస్టు చేశారని.. రేపు(శనివారం) ఉదయం వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.కాగా, మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసుకు అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డిని సిట్ తీవ్ర వేధింపులకు గురి చేసిన సంగతి తెలిసిందే. నిన్న (గురువారం) 13 గంటలకుపైగా విచారణ పేరుతో ప్రహసనం సాగించడం సిట్ కుట్రలకు అద్దం పడుతోంది.సిట్ చీఫ్గా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్బాబు, ఇతర అధికారులు వారిని విడివిడిగా రోజంతా విచారించారు. మొదటి రోజు అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడగడం గమనార్హం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. సీఎంవో కార్యదర్శి, ఓఎస్డీలకు మద్యం విధానం రూపకల్పన, అమలుతో ఎలాంటి సంబంధం ఉండదని నిబంధనలను ఉటంకిస్తూ తేల్చి చెప్పారు.ఆ అంశం పూర్తిగా ఎక్సైజ్ శాఖ, బెవరేజస్ కార్పొరేషన్కు సంబంధించినదని పేర్కొన్నారు. అయినా సరే సిట్ అధికారులు పదే పదే అవే ప్రశ్నలు వేస్తూ వారిని వేధించారు. ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తూ వారిపై మానసిక ఒత్తిడికి గురి చేసేందుకు యత్నించారు. ఇక మెయిల్ ఐడీలు, పాస్ వర్డ్ చెప్పమని సిట్ అధికారులు అడిగారు. అందుకు వారిద్దరూ సున్నితంగా తిరస్కరించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు. -
‘కుట్రతోనే లిక్కర్ స్కామ్ అంటూ అక్రమ కేసు’
కాకినాడ: తమ ప్రభుత్వ హయాంలో పూర్తి పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై, ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలు చేస్తూ,వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టే లక్ష్యంతో పని చేస్తోందని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.తమ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో నిజంగా తప్పు జరిగి ఉంటే, నిష్పాక్షికంగా జరిపే ఎలాంటి విచారణనైనా స్వాగతిస్తామని ఆయన వెల్లడించారు. కానీ రాజకీయ దురుద్దేశాలతో తప్పుడు విచారణల పేరుతో వేధింపులకు పాల్పడితే సహించేది లేదని, ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండ గడతామని కాకినాడలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు.బొత్స ఇంకా ఏం మాట్లాడారంటే..కూటమి ప్రభుత్వం దారుణ వ్యవహారంకూటమి ఏడాది పాలనలో పార్టీల హనీమూన్ ముగిసింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కింది. కూటమి పాలనలో అవినీతి, దోపిడీ తప్ప ప్రజా సంక్షేమం, అభివృద్ది ఎక్కడా కనిపించడం లేదు. రాజకీయ కక్ష సాధింపులకే మొత్తం సమయాన్ని వెచ్చిస్తున్నారు.ఎన్నికల మందు ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకుండా తప్పించుకుంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు, రైతులకు పెట్టుబడి సాయం, ప్రతి కుటుంబానికి ఏటా మూడు ఉచిత సిలిండర్లు, ఏటా 4 లక్షల ఉద్యోగాలు లేదా ప్రతి నెలా ఒక్కో నిరుద్యోగికి రూ.3 వేల భృతి, ఆడబిడ్డ నిధి కింది ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు. కానీ, ఏడాది గడుస్తున్నా వాటిలో ఏదీ అమలు చేయడం లేదు.మరోవైపు ఎక్కడికక్కడ విచ్చలవిడిగా అంతులేని అవినీతి. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా కేవలం 99 పైసలకే దాదాపు 3 వేల కోట్ల విలువైన భూముల అప్పగింత. ఇంకా కాకినాడలో బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారంటూ.. ‘సీజ్ ది షిప్’ అని డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ నానా హంగామా చేశారు. ఒక్క బియ్యం గింజ కూడా అక్రమంగా రవాణా చేయడానికి వీలులేదని అన్నారు. కానీ ఒక్క దానిపైనా చర్యలు లేవు. పోలీసుల జులుంతో ప్రభుత్వాన్ని నడిపించాలని చూస్తున్నారు. అందుకే ప్రశ్నించే గొంతులను నొక్కేయాలని ప్రయత్నిస్తున్నారు.తెచ్చిన అప్పులు దేనికి ఖర్చు చేశారు?ఏడాది పాలనలోనే ఏకంగా రూ.1.59 లక్షల కోట్లు అప్పులు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంతలా ఏడాదిలో అప్పులు చేయలేదు. ఇంత అప్పులు తెచ్చి ఏ ప్రజా సంక్షేమ కార్యక్రమానికి ఖర్చు చేశారు? మా హయాంలో అప్పులు చేసినా, వివిధ పథకాల కింద రూ.2.73 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) రూపంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. మరి కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు దేనికి వినియోగించారో చెప్పాలి. సంపద సృష్టిస్తాను. అది తనకు బాగా తెలుసు అని ప్రచారం చేసిన చంద్రబాబు, మరి ఇన్ని అప్పులు, ఇంత తక్కువ సమయంలో ఎందుకు చేశారు? అప్పు చేయడం. ప్రచార ఆర్భాటాలకు ఖర్చు చేయడం చంద్రబాబుకు బాగా అలవాటు.అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కొంత అప్పు చేసినా, ఆ ఖర్చులకు ఒక అర్థం ఉంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, తీర ప్రాంతాల్లో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, బోగాపురం ఎయిర్పోర్ట్.. ఇలా ఉత్పాదకతకు దోహదం చేసే వాటికి ఖర్చు చేశాం. మాట ఇస్తే, దాన్ని తప్పకుండా నెరవేర్చాలనేది జగన్గారి విధానం. అందుకే ఎన్నికల ముందు, టీడీపీ కూటమి మాదిరిగా, అడ్డగోలు హామీలు ఇవ్వలేదు.పార్టీ కార్యాచరణ. నిర్ణయాలువైఎస్సార్సీపీ అయిదు జిల్లాల ముఖ్య నేతలతో ఈరోజు (శుక్రవారం) సమావేశం నిర్వహించాం. భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో సంస్థాగతంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీ కమిటీల ఏర్పాటు, ప్రతి జిల్లాలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహణపై నిర్ణయం తీసుకున్నాం. అలాగే గోదావరి జిల్లాల్లో ధాన్యం సేకరణపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడంతో పాటు, తీర ప్రాంతాల్లోని ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని నిర్ణయించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో పొగాకు రైతులు మద్దతు ధర లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ పొగాకు రైతులు ఇదే సమస్యలపై ఇబ్బంది పడుతున్నారు.దీనిపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, పొగాకు రైతులను కలిసి నేరుగా వారితో మాట్లాడనున్నారు. తదుపరి పొగాకు కొనుగోళ్ళపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పార్టీ పరంగా కార్యాచరణను ఖరారు చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పొగాకు మద్దతు ధర లభించని సందర్భంగా మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నాం. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం దీనికి భిన్నంగా రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఆ మొద్దునిద్ర నుంచి ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు రైతుల పక్షాన పోరాడతామని బొత్య సత్యనారాయణ హెచ్చరించారు. -
ఈ నెల 19 నుంచి ఏపీ ఈఏపీ సెట్
విజయవాడ: ఈ నెల 19 నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు మొత్తం 3,62, 392 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 145 పరీక్షా కేంద్రాలతో పాటు హైదరాబాద్ లో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.కాగా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఈసెట్ ఫలితాలు నిన్న(గురువారం, మే 15వ తేదీ) విడుదలయ్యాయి. మొత్తం 35,187 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 31,922 మంది పరీక్ష రాశారు. తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాకు చెందిన రేవతి 169 మార్కులతో ప్రథమ ర్యాంక్ సాధించింది. రెండు, మూడు, నాలుగో స్థానాలను కూడా తెలంగాణ విద్యార్థులు దక్కించుకున్నారు.మొత్తం 35,187 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 31,922 మంది పరీక్ష రాశారు. తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాకు చెందిన రేవతి 169 మార్కులతో ప్రథమ ర్యాంక్ సాధించింది. రెండు, మూడు, నాలుగో స్థానాలను కూడా తెలంగాణ విద్యార్థులు దక్కించుకున్నారు.ఈ పరీక్ష ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా మరియు బీఎస్సీ (గణిత శాస్త్రం) విద్యార్థులకు 2025–26 విద్యా సంవత్సరానికి BE / BTech / B.Pharmacy కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా రెండవ సంవత్సరంలో ప్రవేశాలు లభిస్తాయి. ఈ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు, త్వరలో ప్రారంభమయ్యే AP ECET 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా తగిన సీట్లను పొందవచ్చు. -
మద్యం కేసు రాజకీయ ప్రేరేపితం: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: మద్యం కేసు రాజకీయ ప్రేరేపితమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఏపీలో రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు పెడుతున్నట్టు సుప్రీంకోర్టుకు సైతం అర్థమైందన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ని టార్గెట్ చేసుకుని అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.‘‘చంద్రబాబు రూ.370 కోట్లు లూఠీ చేసినట్టు ఆధారాలతో సహా దొరికారు. ఏలేరు స్కాం నుంచి అనేక కేసులు విచారణ కూడా జరగకుండా స్టేలు తెచ్చుకున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబు 53 రోజులు జైలులో ఉన్నారు. దానిమీద ఒక్కరోజైనా వైఎస్ జగన్ని జైల్లో ఉంచాలని చంద్రబాబు తొందర పడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి కక్షసాధింపు పనిలో పడ్డారు. స్కిల్ కేసులో చంద్రబాబే స్వయంగా అక్రమాలకు పాల్పడ్డారు. నిధుల విడుదల అక్రమమని తెలిసినా నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు డ్రా చేశారు. ఆధారాలతో సహా స్కిల్ కేసులో దొరికారు’’ అని పేర్ని నాని గుర్తు చేశారు.‘‘బ్రీఫ్డ్ మీ కేసులో టేపులతో సహా దొరికారు.. కానీ లిక్కర్ కేసులో జగన్కు ఏం సంబంధం?. ఆయన ఎక్కడైనా సంతకాలు పెట్టారా?. ఈ కేసులో నిజాయితీగా వ్యవహరించిన వినీత్ బ్రిజిలాల్ను తప్పించారు. తమకు వత్తాసు పలికే ఆఫీసర్ ఆధ్వర్యంలో సిట్ను వేసి లిక్కర్ కేసు నడుపుతున్నారు. కేసు నిలుస్తుందా? లేదా? అనేది పక్కన పెట్టి జగన్ అరెస్టే లక్ష్యంగా కేసు నడుపుతున్నారు. ఇందుకోసం ఎన్ని పాపాలు, తప్పులు చేయాలో అవన్నీ సిట్తో చేయిస్తున్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా జగన్ వెనకడుగు వేయరు..చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి, లావు శ్రీకృష్ణ దేవరాయలు, అచ్చెన్నాయుడు.. వీరంతా లిక్కర్ కేసు మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు, ఆరోపణలు చేశారు. అనేక కేసుల్లో దొరికిన దొంగ చంద్రబాబు. లక్షా 50 వేల కోట్లు అప్పు చేసి, ఆ డబ్బును ఏం చేశారో చెప్పటం లేదు. రాష్ట్ర ఆదాయాలు భారీగా పడిపోయాయి. సంపద సృష్టి ఇంకెప్పుడు చేస్తారు?. ప్రత్యేక విమానాల్లో విహారాలు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ల కోసం మూడు హెలికాఫ్టర్లు కొనబోతున్నారు. ప్రజల సొమ్మును ఇష్టానుసారం ఖర్చు చేస్తున్నారు’’ అని పేర్ని నాని నిలదీశారు.మీరు చేస్తున్న తప్పుడు పనులను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. లిక్కర్ కేసులో ఆధారాలు లేకుండా అరెస్టులు చేస్తున్నారు. టీడీపీ ఆఫీస్ నుంచి వాట్సప్లో వచ్చిన ప్రశ్నలను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వంశీ కేసులో కోట్ల రూపాయలను లాయర్లకు ఇస్తున్నారు. ప్రజల డబ్బును టీడీపీ నేతల అవసరాలు, కక్షసాధింపు కోసం ఖర్చు చేస్తున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర డమ్మీ మంత్రి. ఆయన ఇంటి పక్కనే బెల్టుషాపు పెట్టినా చూస్తూ కూర్చున్న చేతగాని మంత్రి’’ అంటూ పేర్ని నాని మండిపడ్డారు. -
వీరజవాన్ కుటుంబానికి వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం.. రూ.25 లక్షల చెక్కు అందజేత
శ్రీసత్యసాయి జిల్లా: ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా దేశ సరిహద్దుల్లోని కశ్మీర్లో ఈనెల 8న పాకిస్తాన్తో జరిగిన కాల్పుల్లో వీర మరణం పొందిన అగ్నివీర్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్ కుటుంబాన్ని ఈ నెల 13న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే.. పార్టీ తరపున ఆయన రూ.25 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.రూ.25 లక్షల రూపాయల చెక్కును వీర జవాను మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ అందజేశారు. గోరంట్ల మండలం కల్లి తండాకు వెళ్లి వీర జవాన్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చెక్కును ఆమె అందించారు. కాగా, మూడు రోజల క్రితం (13వ తేదీన) మురళీ నాయక్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. మురళీనాయక్ స్వగ్రామమైన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చేరుకుని.. మురళీనాయక్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.మురళి తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్ నాయక్లకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారు భావోద్వేగానికి గురయ్యారు. ‘మురళీ.. లే మురళీ.. జగన్ సార్ వచ్చారు.. లేచి సెల్యూట్ చేయి మురళీ’ అంటూ తండ్రి శ్రీరామ్ నాయక్ భావోద్వేగంతో పలికిన మాటలు అక్కడ ఉన్న వారందరికీ కన్నీళ్లు తెప్పించాయి. యావత్ దేశం గర్వపడేలా దేశ రక్షణలో విధులు నిర్వర్తించిన మురళీ కుటుంబానికి యావత్ దేశం రుణపడి ఉంటుందని వైఎస్ జగన్ అన్నారు. -
వంశీ ఆరోగ్యం అసలు బాగోలేదు: భార్య పంకజశ్రీ
సాక్షి, ఏలూరు జిల్లా: తన భర్త ఆరోగ్యం అసలు బాగోలేదని వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ అన్నారు. కిటోన్ శాంపిల్స్ పాజిటివ్గా వచ్చాయని తెలిపారు. బరువు కూడా తగ్గిపోయారని.. వంశీ ఆరోగ్యంపై తమకు తీవ్ర ఆందోళనగా ఉందని తెలిపారు. లాయర్ చిరంజీవి మాట్లాడుతూ.. వంశీపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. పాత కేసులను తిరగదోడి కావాలనే ఇబ్బందిపెడుతున్నారన్నారు. పిటీ వారెంట్ దాఖలులో నిబంధనలు ఫాలో కాలేదని చిరంజీవి అన్నారువల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు.. 14 రోజుల రిమాండ్ను విధించింది. హనుమాన్ జంక్షన్ పోలీసుల పీటీ వారెంట్తో వంశీకి రిమాండ్ విధించింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అక్రమ కేసులతో అధికార కూటమి ప్రభుత్వం వేధింపుల పరంపరను కొనసాగిస్తోంది. ఇప్పటికే ఆయనపై పలు అక్రమ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయటంతో గత 90 రోజులకుపైగా వంశీ విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.ఇప్పటి వరకు ఆయనను అరెస్ట్ చేసిన కేసుల్లో న్యాయస్థానం వరుసగా బెయిల్ మంజూరు చేయటంతో తాజాగా హనుమాన్జంక్షన్ పోలీసులు నూజివీడు కోర్టులో గురువారం పీటీ వారంట్ దాఖలు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో వంశీపై నమోదైన పాత కేసును ఇప్పుడు తెర మీదకు తీసుకువచ్చారు. ఇదిలా ఉంటే వల్లభనేని వంశీ శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. -
విజయవాడలో బోర్డు తిప్పేసిన నాగరాజు కన్సల్టెన్సీ సంస్థ
సాక్షి, విజయవాడ: నగరంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల రూపాయలను కేటుగాళ్లు దోచేశారు. ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇపిస్తామంటూ నిరుద్యోగులను నిండా ముంచేశారు. మొగల్ రాజుపురంలోని నాగరాజు ట్రైనింగ్ అండ్ కన్సల్టెన్సీ సంస్థ.. ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి మోసానికి పాల్పడింది. ఒక్కొక్కరి వద్ద రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు వసూలు చేసి సంస్థ నిర్వాహకులు బోర్డు తిప్పేశారు.మాచవరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన కానీ న్యాయం జరగలేదంటూ విజయవాడ కమిషనర్ను కలిసేందుకు బాధితులు వచ్చారు. విజయవాడ కమిషనరేట్లో స్పందనలో కంప్లైంట్ ఇచ్చిన కానీ నేటికీ కూడా న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది బాధితులు ఉన్నారని బాధిత నిరుద్యోగులు అంటున్నారు. ఫిర్యాదు చేసి నెల రోజులు గడిచిన ఇప్పటి వరకు నిర్వాహకులను అరెస్టు చేయలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. సంస్థ ప్రతినిధులు నాగరాజు, హెచ్ఆర్ శిరీషలను అరెస్ట్ చేయకుండ మాచవరం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపించారు.మోసపోయిన వాళ్లందరూ ఒకేసారి వచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు. వారిపై చర్యలు తీసుకునే సరికి పది సంవత్సరాలైనా సమయం పట్టవచ్చంటూ హేళనగా సమాధానం చెబుతున్నారని బాధితులు అంటున్నారు. చేసేదిలేక విజయవాడ సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చామని సీపీ రాజశేఖర్బాబు తమకు న్యాయం చేయాలంటూ బాధితులు వేడుకుంటున్నారు. -
‘చంద్రబాబు నిర్వాకం.. పదివేల మంది టీచర్లకు డిమోషన్’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో విద్యారంగంలో వైఎస్ జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులను ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. సీఎం చంద్రబాబు విధానం వలన 10వేల మంది ఉపాధ్యాయులకు డిమోషన్లు రాబోతున్నాయని అన్నారు.ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘విద్యారంగంలో వైఎస్ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వాటిని ధ్వంసం చేస్తోంది. టీచర్లు సైతం విద్యారంగాన్ని బతికించమంటూ ధర్నాలు చేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న కన్ఫ్యూజన్ పాలనతో విద్యారంగం నాశనం అవుతోంది. సరైన విధానం లేకుండా 9 రకాల స్కూళ్లను చంద్రబాబు తెస్తున్నారు. వైఎస్ జగన్ వలన టీచర్లకు ప్రమోషన్లు వచ్చాయి. చంద్రబాబు విధానం వలన 10వేల మంది ఉపాధ్యాయులకు డిమోషన్లు రాబోతున్నాయి.ఒకవైపు సర్ప్లస్ చూపిస్తూ మరోవైపు డీఎస్సీ అంటూ మోసం చేస్తున్నారు. ఇప్పుడు చూపిస్తున్న సర్ప్లస్ టీచర్లను ఏం చేయబోతున్నారు?. గందరగోళంగా మారిన వ్యవస్థపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలి. సబ్జెక్టు టీచర్లను పక్కన పెడితే పిల్లలకు క్వాలిటీ విద్య ఎలా అందుతుంది?. విద్యా వ్యవస్థను నాశనం చేయవద్దు’ అంటే వ్యాఖ్యలు చేశారు. -
తిరుమల శ్రీవారికి సంజీవ్ గోయెంక భారీ విరాళం..
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారికి ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గోయెంక భారీ విరాళం అందించారు. ఏడు కోట్ల రూపాయల విలువైన కటి హస్తం, వరద హస్తాలను శ్రీవారికి విరాళం ఇచ్చారు. ఆలయ అధికారులకు సంజీవ్ గోయెంక వీటిని అందజేశారు. ఇక, సంజీవ్ గోయెంక.. ఐపీఎల్లో లక్నో జట్టు ఓనర్గా ఉన్నారు. -
వంశీపై కూటమి కుట్రలు.. మరో కేసు నమోదు
సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వంశీపై తాజాగా మరో కేసు నమోదు చేశారు పోలీసులు. గన్నవరంలో మైనింగ్ అక్రమాలపై ఏడీ ఫిర్యాదుతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు.ఇప్పటికే వంశీకి ఐదు కేసుల్లో బెయిల్ మంజూరు అయినప్పటికీ కూటమి సర్కార్ మాత్రం తప్పుడు కేసులతో వంశీకి బెయిల్ రాకుండా అడ్డుకుంటోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్పై నేడు కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇంతలో నిన్న నూజివీడు పోలీసులు.. వంశీపై పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈరోజు మరో కేసు నమోదు చేశారు. గన్నవరంలో జరిగిన మైనింగ్పై 58 పేజీలతో గనుల శాఖ ఏడీ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, క్రైమ్ నెం.142/2025తో గన్నవరం పీఎస్లో వంశీపై కేసు నమోదైంది. ఇలా.. వంశీపై ఏదో ఒక కేసు పెడుతూ వంశీకి బెయిల్ రాకుండా కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. సర్కార్ తీరు కారణంగా వంశీ.. 90 రోజులుగా విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. -
బాబూ.. మీడియాతో పెట్టుకోకు!
ఎవరైనా బలవంతంగా ఇంట్లోకి చొరబడితే ఏం చేస్తాం?. ముందుగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. మరి పోలీసులే వ్యక్తుల ఇళ్లల్లోకి బలవంతంగా చొరబడితే? చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే? ప్రజల స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రభుత్వమే వాటిని హరిస్తూ అరాచకాలకు పాల్పడితే? ఏపీలో ప్రస్తుత పరిస్థితి ఇదే.ఏపీ ప్రభుత్వం మిగిలిన పనులన్నీ పక్కనబెట్టి మరీ పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను వేధిస్తూ చివరికి ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న మీడియా గొంతు నొక్కేందుకూ ప్రయత్నిస్తోంది. సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి నివాసంపై పోలీసుల దాడిని కూడా ఈ కోణంలోనే చూడాలి. టీడీపీ, అధికారంలోకి వచ్చినప్పటి జనసేన, బీజేపీ కూటమి దుశ్చర్యలకు అంతు లేకుండా పోతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎప్పుడూ మీడియాపై ఒక కన్నేసే ఉంచుతారు. బాకా మీడియాను ఒకరకంగా, వైఫల్యాలను, ప్రభుత్వ స్కామ్లను బయటపెట్టే మీడియాను మరో రకంగా చూస్తారు. మాట వినని జర్నలిస్టులను ఉద్యోగాల నుంచి తొలగించేలా యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకు వస్తారు కూడా. అనుకూలంగా ఉండే మీడియాకు రకరకాల రూపాలలో మేళ్లు చేస్తారు. తద్వారా ఆ యాజమాన్యాలను తన గుప్పెట్లో ఉంచుకుంటారు.1995లో తన మామ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక వర్గం మీడియా ద్వారా ఆయనపైనే వ్యతిరేక ప్రచారం అనండి.. దుష్ప్రచారం చేయించిన చరిత్ర చంద్రబాబుది అని అప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నవారు చెబుతుంటారు. ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా ఉంటూనే ఆయన తెలివిగా ఎన్టీఆర్ ప్రతిష్టను తగ్గించే వ్యూహాలు అమలు చేశారని ఆరోపణలున్నాయి. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిని బూచిగా చూపెట్టేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలను బాగా వాడుకోగలిగేవారు. ఈనాడు చూడడానికే అసహ్యంగా ఉండే ఘోరమైన కార్టూన్లు ఎన్టీఆర్పై వేసేది. అయినా ఆ రోజుల్లో ఈ పత్రికలపై ఎన్టీఆర్ కేసులు పెట్టలేదు.మామను కూలదోసి ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబు పాలన మాటెలా ఉన్నా అనుకూల మీడియా వ్యవస్థనైతే బాగానే ఏర్పాటు చేసుకున్నారు. మీటింగ్లు జరిగినా, జరగకపోయినా, కల్పిత కథనాలకు కొదవ ఉండేది కాదు. అదే టైమ్లో రాజకీయ ప్రత్యర్థులపై బురద చల్లే వ్యూహాలు పక్కాగా అమలయ్యేవి. ఆ రోజుల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసే కొన్ని పత్రికలకు ప్రభుత్వ ప్రచార ప్రకటనలు నిలిపివేసే వారు. కానీ ఇప్పటిలా బరితెగించి మరీ కేసులు పెట్టేవారు కాదనే చెప్పాలి. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం చంద్రబాబుకు కొత్తకాదు. అయితే, ఆ హామీలను అమలు చేయకపోయినా ఎవరూ వాటిని గుర్తు చేయకూడదు! అందుకోసం ఆయన నానా ప్రయత్నాలూ చేస్తుంటారు.2014లో రైతుల సంపూర్ణ రుణమాఫీ కావచ్చు.. కాపుల రిజర్వేషన్ ఉద్యమం కావచ్చు.. మరేదైనా కావచ్చు. చంద్రబాబు పంథా ఒక్కటే. తనకు వ్యతిరేకంగా ఏదైనా జరుగుతుంటే అనుకూల మీడియా చేత వాటిని అణచివేసే ప్రయత్నం చేయడం. అంశం ఏదైనా.. టీవీ ఛానళ్లలో అనుకూల ప్రచారమే సాగాలన్నది ఆయన ఆకాంక్ష. కాపుల రిజర్వేషన్ విషయమే తీసుకుందాం.. ఇచ్చిన హామీ అమలుకు ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేపడితే ఆ విషయం ప్రజలలోకి వెళ్లనీయకుండా కొన్ని టీవీ చానళ్లను బ్లాక్ చేయడానికి యత్నించారు. ఇదే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే మాత్రం అధికార పార్టీపై వ్యతిరేక వార్తలు రాయాలని జర్నలిస్టులకు నూరి పోస్తుంటారు. దానికి తగినట్లే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి తమ రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం ఉన్నవి, లేనివి కల్పించి వార్తలు ఇచ్చేవి. ఈ మీడియా 2019-2024 మధ్యలో ముఖ్యమంత్రి జగన్పై కక్కినంత విషం బహుశా ప్రపంచంలోనే మరే మీడియా కక్కి ఉండదు. ఇందుకోసం పచ్చి అబద్ధాలు రాసేందుకూ వెనుకాడలేదు ఈ సంస్థలు.టీడీపీ మీడియా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ను కించపరిచేలా కథనాలు ఇచ్చినా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ తదితరులు దారుణమైన వ్యాఖ్యలు చేసినా అప్పట్లో ఎవరిపై కేసులు పెట్టలేదు. కానీ 2024లో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు.. సాక్షి మీడియా అణచివేతకు యత్నిస్తూనే ఉన్నారు. పలువురు విలేకరులపై పోలీసు కేసులు నమోదవడం ఇందుకు నిదర్శనం. నెల్లూరు జిల్లా కావలి వద్ద ఎప్పుడో మూడేళ్ల క్రితం శిలాఫలకం పడవేశారంటూ అప్పటి ఎమ్మెల్యేతోపాటు విలేకరిపై కూడా కేసు పెట్టారట. అప్పుడు ఏం చేశారో కాని, కూటమి అధికారంలోకి వచ్చాక, టీడీపీ, జనసేన వారు లెక్కలేనని శిలా ఫలకాలను ధ్వంసం చేసినా ఒక్క కేసు నమోదు కాలేదు. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఎవరెవరో ఫిర్యాదు చేయడం పోలీసులు హుటాహుటిన వైఎస్సార్సీపీ వారిని అరెస్టు చేయడం సాధారణమై పోతోంది.ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేశ్ ‘రెడ్ బుక్’పేరుతో కక్ష రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకు ఇవన్నీ?. చాలా సింపుల్ ప్రభుత్వ తప్పులు ఎవరూ ఎత్తి చూపకూడదు. సూపర్ సిక్స్ తో సహా ఎన్నికల సమయంలో ఇచ్చిన 150 హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ఎవరూ ప్రశ్నించకూడదు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరుల అసత్యపు ప్రచారాన్ని ఎవరూ గుర్తు చేయకూడదు. ఏడాది తిరగకుండానే కూటమి ప్రభుత్వం చేసిన రూ.1.5 లక్షల కోట్ల అప్పులు ఎందుకు? దేనికి ఖర్చుపెట్టారు? అని ఎవరూ అడగకూడదు. ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలను ఎవరూ వెలికి తీయకూడదు. సాక్షి మీడియా ఇవన్నీ చేస్తున్నందునే చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టి దాడి చేస్తోంది.నిజానికి సాక్షి మీడియా ప్రతీ వార్తనూ ఆధార సహితంగానే రాస్తుంది. సౌర శక్తి ఒప్పందాలనే తీసుకుందాం. జగన్ హయాంలో యూనిట్కు రూ.2.49లకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంస్థ సెకీతో ఒప్పందం చేసుకుంది. ఇందుకు గగ్గోలు పెట్టిన చంద్రబాబు, ఎల్లోమీడియా..లక్ష కోట్ల రూపాయల నష్టం జరిగిపోయిందని ప్రచారం చేశాయి. తీరా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిందేమిటి? అదే విద్యుత్తును రూ.4.60లకు కొనుగోలు చేస్తున్నారు. అంటే.. యూనిట్కు దాదాపు రెండు రూపాయలు ఎక్కువ పోసి కొంటున్నారన్నమాట. అయినా సరే.. దీనిపై ఈనాడు, ఆంధ్రజ్యోతుల్లో ఒక్క వార్త కూడా రాలేదు. సాక్షి మాత్రం పక్కా ఆధారాలతో జరిగిన అవినీతిని వివరించారు. సౌర శక్తి కొనుగోళ్ల విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో చంద్రబాబు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది.అలాగే.. విశాఖలో టీసీఎస్కు 99 పైసలకు ఎకరా భూమి ఇవ్వడం, ఊరు, పేరు లేని ఒక కంపెనీకి అరవై ఎకరాలు కట్టబెట్టడం, అమరావతి రాజధాని నిర్మాణాల పేరుతో అధిక రేట్లకు ఇష్టారాజ్యంగా టెండర్లు కేటాయించడం, అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను కూడా తాకట్టు పెట్టడం పెన్షన్లు మినహా మరే హామీ అమలు చేయకపోవడంతో ప్రజలలో అసంతృప్తి నెలకొనడం మొదలైన వార్తలను సాక్షి మీడియా ఇస్తోంది. ఏలికలకు ఇది పంటికింద రాయిలా మారింది. దీంతో సాక్షిని ఇబ్బంది పెట్టడానికి యత్నిస్తోంది. ఈ క్రమంలో ఆధారాలు లేని మద్యం స్కామ్ను సృష్టించి వైఎస్సార్సీపీ నేతల అరెస్టుకు చంద్రబాబు.. పోలీసులను ప్రయోగించారు. నిందితులు సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి ఇంటిలో ఉన్నారన్న అనుమానం వచ్చిందని పోలీసులు.. చెప్పా పెట్టకుండా విజయవాడలో ఆయన ఇంటిపై పడ్డారు. నిజంగా అలాంటి అనుమానం ఉంటే ఏమి చేయాలి? సెర్చ్ వారంటే ఇచ్చి సోదాలు చేయాలి. అసలు ఒక పత్రికా సంపాదకుడి ఇంటికి అంత ధైర్యంగా వెళ్లారంటే ఈ ప్రభుత్వం ఎంత నియంతృత్వంగా వ్యవహరిస్తున్నది అర్థం చేసుకోవచ్చు.సాక్షి సిబ్బందిని మానసికంగా వేధించడానికి ఇలా చేసినట్లు తెలుసుకోవడం కష్టం కాదు. ఇంత మాత్రానికే సాక్షి మీడియా వణికిపోతుందా?. 2008 నుంచి సాక్షి మీడియా ఇలాంటి ఆటుపోట్లను ఎన్నింటినో ఎదుర్కొంది. ఈ మీడియాను దెబ్బతీయడానికి చంద్రబాబు కాంగ్రెస్తో కలిసి ఎన్ని కుట్రలు పన్నింది.. ఎన్ని కేసులు పెట్టించింది తెలియనిది కాదు. 2014 టర్మ్లో కూడా సాక్షిని లేకుండా చేయాలని ప్రయత్నించి విఫలం అయ్యారు. తిరిగి ఈ టర్మ్లో అంతకన్నా ఎక్కువగా కక్ష సాధింపు చర్యలకు తెగిస్తున్నారు. ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి వాటిని సమర్థంగానే ఎదుర్కొన్నారు. పోలీసులు మూడు గంటలపాటు అక్కడ ఉన్నా వారికి ఏమీ దొరకలేదు. దాంతో వారు సైలెంట్గా వెళ్లిపోక తప్పలేదు. సెర్చ్ వారంట్ లేకుండా వెళ్లడం ద్వారా పోలీసులు దుశ్చర్యకు పాల్పడినట్లు అయింది.ఇక, ఎమర్జన్సీలో సైతం ఇందిరాగాంధీ ఇలాంటి పద్దతులు అనుసరించి మీడియా గొంతు నులమాలని విశ్వయత్నం చేశారు. కానీ, అంతిమంగా ఆమె ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్నారు. తొలుత ఇందిరాగాంధీ శిష్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత తెలుగుదేశంను తన అధీనంలోకి తెచ్చుకుని రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అవే పద్దతులు అవలంభిస్తున్నారు. చరిత్ర చెప్పిన పాఠాలను మర్చిపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎవరికైనా ఓటమి తప్పదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తిరుమల భక్తులకు ట్రావెల్స్ సంస్థ కుచ్చుటోపీ.. భక్తుల ఆవేదన
సాక్షి, తిరుమల: శ్రీవారి భక్తులకు బెంగళూరుకు చెందిన ట్రావెల్స్ సంస్థ కుచ్చుటోపీ పెట్టింది. బెంగళూరు నుండి తిరుపతికి రవాణా ఖర్చుతోపాటు దర్శనం కల్పిస్తామని నమ్మించిన భక్తులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దిక్కుతోచని స్థితిలో 35 మంది కన్నడ భక్తులు తిరుమలలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. తిరుమల కొండను టార్గెట్ చేసుకొని కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు మోసాలకు పాల్పడుతున్నాయి. తాజాగా బెంగళూరు నుండి తిరుపతికి రవాణా ఖర్చుతోపాటు దర్శనం కల్పిస్తామని బెంగళూరుకు చెందిన వర్షా ట్రావెల్స్ భక్తులను మోసం చేసింది. సర్వదర్శనం పేరుతో నకిలీ దర్శన టిక్కెట్లను వారికి ఇచ్చింది. ఒక్కొక్క భక్తుడి నుండి రూ.3,350 నగదు వసూలు చేసింది. టికెట్ ఉందని ధీమాతో భక్తులు తిరుమలకు వచ్చారు.తిరుమలకు వచ్చాక.. తీరా నకిలీ టికెట్లని తెలడంతో శ్రీవారి భక్తులు బోరుమంటున్నారు. 35 మంది కన్నడ భక్తులు దిక్కుతోచని స్థితిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం, భక్తులు.. పోలీసులను ఆశ్రయించారు. వర్షా ట్రావెల్స్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, భక్తులకు విక్రయించిన టికెట్లపై తిరుమల శ్రీవారి ఫొటో ఉండటం గమనార్హం.ఇదిలా ఉండగా.. తిరుమలలోని విష్ణు నివాసం అతిథి గృహంలో భారీ దొంగతనం జరిగింది. 32 గ్రాముల బంగారం, 40వేల నగదు, ఓ సెల్ ఫోన్ అపహరణకు గురైంది. ఈనెల 7న శ్రీవారి దర్శనం కోసం నెల్లూరు జిల్లా, మర్రిపాడుకు చెందిన విజయభాస్కర్ కుటుంబం తిరుమలకు వచ్చింది. వీరంతా.. రైల్వే స్టేషన్ సమీపంలోని విష్ణు నివాసం రూమ్ నెంబర్ 461లో బస చేశారు. రూమ్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వీరి వస్తువులను దొంగతనం చేశాడు. దీంతో, బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఈస్ట్ ఎస్సై మహేష్ తెలిపారు. -
నెల్లూరులో ప్రసిద్ధ ఆలయం..శనివారం ఒక్కరోజే భక్తులకు దర్శనం (ఫొటోలు)
-
పరిటాల శ్రీరామ్కు అరెస్టు వారెంట్
సాక్షి, అనంతపురం: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కుమారుడు, టీడీపీ ధర్మవరం నియోజక వర్గ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్కు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై 2023 అనంతపురం రెండో పట్టణ స్టేషన్లో పరిటాల శ్రీరామ్పై కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు హాజరు కాకపోవడంపై ఏజేఎఫ్సీఎం కోర్టు సీరియస్ అయ్యింది. పరిటాల శ్రీరామ్పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. -
కడప మేయర్ పదవి.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి : కడప మేయర్ పదవి నుంచి తనను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సురేష్ బాబు హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. తొలగింపు ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు.ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. తన కుటుంబ సభ్యులకు చెందిన వర్ధిని కన్స్ట్రక్షన్స్కు పనులు కేటాయించాలని మునిసిపల్ కమిషనర్ను సురేబాబు ఒత్తిడి చేశారా? అని ప్రశ్నించిన హైకోర్టు, ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ఉత్తర్వులు జారీ చేశారు.అంతకు ముందు సురేష్బాబు తరఫు న్యాయవాది వీఆర్ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపించారు. ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు సురేష్ బాబు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ముందు వ్యక్తిగతంగా హాజరయ్యారని, పూర్తిస్థాయి వివరణ నిమిత్తం గడువు కోరారని కోర్టుకు నివేదించారు. అయితే ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోకుండానే అధికారులు మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులిచ్చారని పేర్కొన్నారు. వర్ధిని కన్స్ట్రక్షన్స్ కంపెనీ పిటిషనర్ కుటుంబ సభ్యులకు చెందినది కాదని వివరించారు. మునిసిపల్ కమిషనర్ నిబంధనల మేరకే నేరుగా ఆ కంపెనీకి పనులు కేటాయించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ, సురేష్బాబు అధికార దుర్వినయోగానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. పిటిషనర్కు నోటీసులిచ్చి వివరణ తీసుకున్న తరువాతనే మేయర్ పదవి నుంచి తొలగించారని కోర్టుకు తెలిపారు.న్యాయమూర్తి స్పందిస్తూ మేయర్ తమ కుటుంబ కంపెనీకి పనులు కేటాయించాలని మునిపిసల్ కమిషనర్పై ఒత్తిడి తెచ్చారా? అని ప్రశ్నించారు. దీనిపై పూర్తి వివరాల సమర్పణకు గడువునివ్వాలని న్యాయవాది ప్రణతి కోరారు. సురేష్బాబు తొలగింపు ఉత్తర్వులు అమల్లోకి వచ్చేందుకు రెండు వారాలు పడుతుందని పేర్కొన్నారు. దీంతో న్యాయమూర్తి పూర్తి వివరాల సమర్పణకు గడువిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. -
రెడ్బుక్ మరువను: మంత్రి నారా లోకేశ్
గుంతకల్లు/గుత్తి : ‘రెడ్బుక్ను ఎట్టి పరిస్థితిల్లోనూ మర్చిపోను.. టీడీపీ కేడర్ను ఇబ్బంది పెట్టిన అందరూ మూల్యం చెల్లించుకోకతప్పదు. టీడీపీ కార్యకర్తలపై ఉన్న కేసులన్నీ ఎత్తేపిస్తా’ అని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారాలోకేశ్ పేర్కొన్నారు.గురువారం ఆయన అనంతపురం జిల్లా గుత్తి మండలం రామరాజుపల్లిలో ఉత్తమ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి నారా లోకేష్.. మాట్లాడుతూ ఏ సమావేశానికి వెళ్లినా పార్టీ కేడర్ రెడ్బుక్ గురించి అడుగుతున్నారని, ప్రతి ఒక్కరి చిట్టా విప్పి, చేయాల్సిన పని చేస్తానన్నారు. కాకపోతే కాస్త సమయం పడుతుందని పేర్కొన్నారు. కార్యకర్తలపై గత ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయిస్తానని చెప్పారు. వైఎస్ జగన్ నిర్వహకం వల్లే కరెంటు బిల్లుల్లో ట్రూఅప్ చార్జీలు వేయాల్సి వస్తోందని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం స్కూల్ మూసివేస్తుందని వైఎస్సార్సీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టాలని లోకేష్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో స్కూళ్లలో 45 లక్షల మంది విద్యార్థులు ఉండగా, ఇప్పడు ఆ సంఖ్య 33 లక్షలకు పడిపోయిందన్నారు. అనంతపురానికి రూ.22 వేల కోట్ల విలువైన భారీ సోలార్ విండ్ ప్రాజెక్టు వస్తుందని వెల్లడించారు. అనంతరం ఉత్తమ కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యకర్తలతో సెల్ఫీలు దిగారు.