
కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి తరలివచ్చిన అర్జీదారులు
కార్డుకు ని‘బంధనాలు’
మ్యారేజ్ సర్టీఫికెట్ తప్పనిసరి
పిల్లాపాపలతో గంటల తరబడి నిరీక్షణ
కార్యాలయాల్లో వసూళ్ల జాతర
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కొత్త రేషన్కార్డుల కోసం ప్రభుత్వం విధించిన నిబంధనలు ప్రజలకు గుదిబండగా మారాయి. వివాహ రిజిస్ట్రేషన్ సర్టీఫికెట్ తప్పనిసరి చేయడంతో తరాలతో సంబంధం లేకుండా ఎప్పుడో పెళ్లయిన వారూ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. కొత్త కార్డుల దరఖాస్తుకు గడువు 15 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొత్తగా పెళ్లయిన జంటలతోపాటు ఇంత వరకు రేషన్కార్డు లేని వారు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవడంతో మొదలయ్యే ప్రక్రియ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్టీఫికెట్ వచ్చే వరకు ప్రహసనంగా మారుతోంది.
స్లాట్ విధానంలో లోపాలు
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్లో లోపాల వల్ల మ్యారేజ్ సర్టీఫికెట్ కోసం వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారు. ఒకే సమయానికి ఎక్కువ మందికి స్లాట్ ఇవ్వడం వల్ల పిల్లాపాపలతో గంటల తరబడి కార్యాలయాల వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది. మండే ఎండలతో నరకం చవి చూడాల్సిన దుస్థితి నెలకొంది. వాస్తవానికి ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం ఒక సమయానికి.. ఒక స్లాట్ విధానమే అమలులో ఉంది. కానీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్కు మాత్రం ఒకే సమయానికి ఎంతమందికి కావాలంటే అంతమందికి అధికారులు స్లాట్ ఇస్తున్నారు.
ఈ–సైన్ సైట్లో నమోదు, భార్యాభర్తలు, ముగ్గురు సాక్షుల ఫింగర్ప్రింట్ల సేకరణ తదితర పనుల వల్ల ప్రక్రియ బాగా ఆలస్యమవుతోంది. దీనిని అవకాశంగా తీసుకుని కొందరు దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో రిజిస్ట్రేషన్కు రూ.2,500 నుంచి రూ.4,000 వంతున దరఖాస్తుదారుల నుంచి వసూలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత మంగళవారం ఒక్క రోజే కాకినాడ జిల్లా రిజి్రస్టార్ కార్యాలయానికి సుమారు 70 మంది మ్యారేజ్ రిజిస్ట్రేషన్లు కోసం దరఖాస్తులతో తరలివచ్చారు. ఇక్కడ ఈ పని అంతా చేసేది ఒకే ఒక సీనియర్ అసిస్టెంట్ కావడంతో దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పలేదు. కాకినాడ జిల్లాలోని సర్పవరం, ప్రత్తిపాడు, తాళ్లరేవు, సామర్లకోట, తుని తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలూ రోజూ మ్యారేజ్ సర్టీఫికేట్ల కోసం వచ్చేవారితో కిక్కిరిసి కనిపిస్తున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయాల్లోనే..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయాల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్లు జారీ చేసేవారు. ఈ–సైన్ లేకపోవడంతో పది నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తయిపోయేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భార్యాభర్తలు, ముగ్గురు సాక్షులు, ఈ–సైన్ చేయాల్సి రావడంతో కష్టాలు తప్పడం లేదు.
రిజిస్ట్రేషన్ కార్యాలయ ఉద్యోగులపై ఒత్తిడి
మ్యారేజ్ సర్టీఫికెట్ కోసం రోజూ జనం పోటెత్తడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉద్యోగులపైనా ఒత్తిడి పెరుగుతోంది. సిబ్బంది అంతంతమాత్రంగా ఉండడంతో మానసిక వేదనకు గురవుతున్నారు. ఇలాంటి ఒత్తిళ్లతోనే ఇటీవల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ శివరాం మృతి చెందడాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. గ్రామ సచివాలయాలు లేదా, రిజి్రస్టార్ కార్యాలయాల్లోనూ మ్యారేజ్ సర్టీఫికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
సాయంత్రం వరకు పడిగాపులే
రేషన్ కార్డు కోసం పెళ్లి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం. ముందు రోజు స్లాట్ బుక్ చేసుకున్నాను. పనులు అన్ని మానుకుని ఉదయమే 11 గంటలకు కాకినాడ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చాను. అప్పటికే పదుల సంఖ్యలో అర్జీదారులు ఉండటంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు పడాల్సి వచ్చింది. – కుంది కరుణ, జగన్నాథపురం, కాకినాడ