తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం తిరుమలలో స్వర్ణరథోత్సవం కన్నుల పండువగా సాగింది. ఉదయం 9 నుంచి 10.30 గంటల నడుమ శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని పురమాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారు. నేడు బధవారం వైకుంఠ ద్వాదశి కావడంతో ఉదయం శ్రీవారి పుష్కరిణిలో అర్చకులు సంప్రదాయబద్ధంగా చక్రస్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్కరిణి పరిసరాలు భక్తులతో నిండిపోయాయి.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా పరిమిత సంఖ్యలోనే వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పించామని టీటీడీ అధికారులు తెలిపారు. మొత్తం పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయని, ఇప్పటికే వైకుంఠ ద్వార దర్శన టికెట్లు కలిగిన భక్తులకు మాత్రమే రేపటి వరకు దర్శనం ఉంటుందని వెల్లడించారు. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనంలో భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.అలిపిరి మెట్ల మార్గం ద్వారా లక్కీడిప్లో టికెట్ పొందిన భక్తులు మెట్టు మెట్టుకు పూజలు చేస్తూ భక్తిశ్రద్ధలతో తిరుమలకు చేరుకుంటున్నారు. తిరుపతితో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనానికి భక్తులు కిటకిటలాడుతున్నారు.
వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులు: 67,053
నిన్న తలనీలాలు సమర్పించిన భక్తులు: 16,301
వైకుంఠ ఏకాదశి హుండీ ఆదాయం: ₹2.25 కోట్లు


