
సాక్షి, విజయవాడ: నగరంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల రూపాయలను కేటుగాళ్లు దోచేశారు. ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇపిస్తామంటూ నిరుద్యోగులను నిండా ముంచేశారు. మొగల్ రాజుపురంలోని నాగరాజు ట్రైనింగ్ అండ్ కన్సల్టెన్సీ సంస్థ.. ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి మోసానికి పాల్పడింది. ఒక్కొక్కరి వద్ద రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు వసూలు చేసి సంస్థ నిర్వాహకులు బోర్డు తిప్పేశారు.

మాచవరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన కానీ న్యాయం జరగలేదంటూ విజయవాడ కమిషనర్ను కలిసేందుకు బాధితులు వచ్చారు. విజయవాడ కమిషనరేట్లో స్పందనలో కంప్లైంట్ ఇచ్చిన కానీ నేటికీ కూడా న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది బాధితులు ఉన్నారని బాధిత నిరుద్యోగులు అంటున్నారు. ఫిర్యాదు చేసి నెల రోజులు గడిచిన ఇప్పటి వరకు నిర్వాహకులను అరెస్టు చేయలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. సంస్థ ప్రతినిధులు నాగరాజు, హెచ్ఆర్ శిరీషలను అరెస్ట్ చేయకుండ మాచవరం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపించారు.
మోసపోయిన వాళ్లందరూ ఒకేసారి వచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు. వారిపై చర్యలు తీసుకునే సరికి పది సంవత్సరాలైనా సమయం పట్టవచ్చంటూ హేళనగా సమాధానం చెబుతున్నారని బాధితులు అంటున్నారు. చేసేదిలేక విజయవాడ సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చామని సీపీ రాజశేఖర్బాబు తమకు న్యాయం చేయాలంటూ బాధితులు వేడుకుంటున్నారు.