విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతి కేసును రీ ఓపెన్ చేయించి తీరుతానని జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్కుమార్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాధినేతల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల్ల అమ్మేస్తున్నారని, ఇది అన్యాయమని ప్రశ్నించిన తనపై కేసులు పెడుతున్నారని వాపోయారు.
తమ బినామీలకు ప్రభుత్వ భూములను అప్పనంగా కట్టబెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతిలో అతిపెద్ద భాగస్వామి పవన్ కల్యాణ్ అంటూ ధ్వజమెత్తారు. మహిళలపై వేధింపులకు పాల్పడిన కూటమి నేతలకు చర్యలు ఎందుకు తీసుకోలేదని శ్రావణ్కుమార్ నిలదీశారు.
అలా చేయకపోతే న్యాయవాద వృత్తిని వదిలేస్తా
చంద్రబాబు తన పై ఉన్న చాలా కేసులను కొట్టేయించుకుంటున్నారు. నేను చంద్రబాబు కేసులపై పోరాటం చేస్తున్నా. రాష్ట్ర ప్రజలకు నేను మాటిస్తున్నా. చంద్రబాబు పై ఉన్న ప్రతీ కేసునూ రీ ఓపెన్ చేయించి తీరుతా. ఒకవేళ నేను చంద్రబాబు కేసులను రీ ఓపెన్ చేయించలేకపోతే న్యాయవాద వృత్తిని వదిలేస్తా. చంద్రబాబు తనపై ఉన్న నాలుగు కేసుల్లోనూ విచారణ ఎదుర్కోవాల్సిందే. న్యాయస్థానాల్లో మ్యానేజ్ చేసి తప్పించుకోవాలని చూస్తే కుదరదు. 2029లో నైనా ప్రతీ కేసును రీ ఓపెన్ చేయిస్తానని శ్రావణ్ కుమార్ అన్నారు.


