22 రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న తల్లిదండ్రులు
ఫిబ్రవరి 19న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
అనుమానితుల పేర్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన
విజయనగరం జిల్లా: అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఏమైందో తెలియదు.. ఎక్కడకు వెళ్లిందో అర్థంకావడం లేదు.. ఏ పరిస్థితుల్లో ఉందో ఆందోళనగా ఉంది.. అమ్మేశారేమోనని అనుమానంగా ఉంది.. మా కూతురును వెతికిపెట్టండి సారూ.. అంటూ 22 రోజులుగా చీపురుపల్లి పోలీస్ స్టేషన్ చుట్టు తిరుతున్నా పట్టించుకునే పాపాన పోవడం లేదు.
మా కూతురు కనిపించడం లేదని పుట్టెడు దుఃఖంలోఉంటే సీఐ, ఎస్ఐలు నిర్లక్ష్యంగా.. చులకనగా తమతో మాట్లాడుతున్నారంటూ అమాయకులైన ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గొల్లలములగాం గ్రామానికి చెందిన పిసిని బాలాజీ తన భార్యతో కలిసి బుధవారం సాయంత్రం మీడియా ముందు తమ గోడు వినిపిస్తూ కన్నీరుపెట్టారు. విజయనగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న బాలిక ఫిబ్రవరి 19న ఇంటి నుంచి వెళ్లి తిరిగి చేరుకోలేదన్నారు.
అదే రోజు చీపురుపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశామని చెప్పారు. తమ గ్రామానికి చెందిన మైలపల్లి అమ్మాజీ తమ బిడ్డను ఏదో చేసి ఉంటాడని పోలీసులకు చెప్పినప్పటికీ ఆ వ్యక్తిని పోలీస్స్టేషన్కు పిలిచి ఎందుకు విచారించడం లేదని తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలిక... తల్లిదండ్రులకు ఓ లేఖ రాసి విడిచి వెళ్లింది. అందులో ‘సారీ నాన్న’ అంటూ రాసి ఉన్న లేఖ కలకలం సృష్టిస్తోంది.


