breaking news
Wanaparthy District Latest News
-
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేయిస్తాం
వనపర్తి రూరల్: కాంగ్రెస్ పార్టీ మెడలువంచి ఆరు గ్యారెంటీలు అమలు చేయిస్తామని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ బుధవారం పట్టణ పార్టీ అధ్యక్షుడు రాజశేఖర్గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులతో కలసి, జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యలాయంలో డిప్యూటీ తహసీల్దార్కు చక్రపాణికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి 27 నెలలైనా ఒక్క హామీకూడా అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను తీవ్రంగా మోసం చేసిందన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆర్.వెంకటేశ్వర్రెడ్డి, కౌన్సిలర్లు విజయ్సాగర్, దాసరాజు ప్రవీణ్ కొమ్ము,శ్రీను, గోపినాథ్, కంచరవి, చాణక్య, ఉపేందర్ యాదవ్, చిన్నరాముడు తదితరులు పాల్గొన్నారు. తాగునీటి సమస్య పరిష్కరించాలి వనపర్తిటౌన్: గత వారం రోజులు 19వ, వార్డులో నీటి ఎద్దడి నెలకొందని, అధికారులు వెంటనే స్పందించి నీటి సరఫరా సమస్యను తీర్చాలని 19వవార్డు కౌన్సిలర్ మురళీసాగర్ కోరారు. ఈ మేరకు బుధవారం పుర కార్యాలయంలో కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. 19వవార్డులో ఎండలు తీవ్రతరమై నీటి సమస్యలు రాకముందే ముందస్తు చర్యలుగా సమస్యలను పరిష్కరించాలని పుర కమిషనర్ ఎన్.వెంకటేశ్వర్లు కోరారు. వేసవికాలంలో మంచి నీటిఎద్దడితో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. -
పాఠశాలలో ఉగాది సంబురాలు
పాన్గల్: మండల కేంద్రం ప్రాథమిక పాఠశాలల్లో బుధవారం ఉగాది పండుగ సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం ఉగాది పచ్చడిని తయారు చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. జీవితంలో కష్టసుఖాలు సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని, ఆరోగ్య ప్రయోజనాలను సూచిస్తాయన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ఆనంద్, హెచ్ఎం పద్మ, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. మత్తు పదార్థాల వినియోగం హానికరం కొత్తకోట రూరల్: మత్తు పదార్థాల వినియోగం హానికరమని.. జీవితాలు నాశనం అవుతాయని కొత్తకోట ఎకై ్సజ్ సీఐ కరుణ అన్నారు. బుధవారం మండలంలోని రాయినిపేటలో మత్తు పదార్థాల నివారణపై ఎకై ్సజ్ ఎస్సైలతో కలిసి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల విక్రయం, వినియోగం చట్టపరంగా నేరమని, అలాంటి కార్యకలాపాలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే ఎకై ్సజ్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజల సహకారం ఉంటేనే మత్తు నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో మత్తు పదార్థాలపై నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు భాస్కర్రెడ్డితో పాటు గ్రామస్తులు, యువకులు, ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు. -
చిన్నారికి అరుదైన వ్యాధి
పాన్గల్: ఆడుతూ పాడుతూ సంతోషంగా గడపాల్సిన వయస్సులో అరుదైన స్వైన్ప్లూ వ్యాధితో పోరాడుతున్న ఓ చిన్నారి దీనగాథ ఇది. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం నిజామాబాద్ (మంగళ్లపల్లి)కి చెందిన వరలక్ష్మి, మద్దిలేటి కుటుంబం వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. వారి రెండో కుమారుడు రిషికేష్ (5) పదిరోజుల కిందట అనారోగ్యానికి గురికాగా జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందించినా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో అటు నుంచి హైదరాబాద్లోని రెయిన్బో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించి అరుదైన స్వైన్ఫ్లూ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. ప్రత్యేక వైద్యం అవసరమని.. చికిత్సకు రూ.30 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలుపడంతో తమ కుమారుడిని ఎలా కాపాడుకోవాలో తెలియని అయోమయంలో పడిపోయారు. చికిత్సకు సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీలు, ఆరోగ్యశ్రీ పథకాలు వర్తించవని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు వివరించారు. రూ.5 లక్షలు అప్పుచేసి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. రోజుకు రూ.50 వేలకు పైగా ఖర్చవుతుందని.. దాతలు, సేవాసంస్థలు ముందుకొచ్చి ఆర్థిక సాయం అందించి తమ కుమారుడి ప్రాణాలు కాపాడాలని పేద కుటుంబం వేడుకుంటోంది. సాయం చేయాల్సిన దాతలు బాలుడి తల్లిదండ్రుల సెల్నంబర్లు 93986 68985, 93926 54657 సంప్రదించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆంగ్ల నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి వనపర్తిటౌన్: నేటి టెక్నాలజీతో విద్యార్థులు ఎన్నో ఆవిష్కరణలు చేయొచ్చని, విద్యార్థులు ఆంగ్లం నేర్చుకొని సాంకేతికతపై శ్రద్ధ పెడితే దేశం ప్రపంచంలో అభివృద్ధి దేశాలకు ధీటుగా పోటీ పడి నెగ్గుతుందని ఆంగ్ల ఉపన్యాసకుడు డాక్టర్. ఎండీ మహబూబ్ పాషా అన్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ (కో–ఎడ్) కళాశాలలో ఇంగ్లిస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఎక్ట్సెన్షన్ లెక్చరర్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ఆంగ్లభాష ప్రాముఖ్యతతో పాటు నేటి టెక్నాలజీ ప్రభావాన్ని విద్యార్థులు పరిశీలించి ప్రపంచం ఎలా ముందుకెళ్తుందో గ్రహించాలన్నారు. ఏఐ ఆధారిత సాధనాలు విద్యార్థులకు వ్యక్తిగతంగా సహాయం చేస్తూ, వారి వ్యాకరణ దోషాలను సరిచేసి, సరైన వ్యాఖ్య నిర్మాణాన్ని నేర్పిస్తున్నాయన్నారు. అంతకుముందు ఉపన్యాసకుడు ఎండీ మహబూబ్ పాషాను కళాశాల ప్రిన్సిపాల్ రఘునందన్ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఇంగ్లిష్ డిపార్ట్మెంట్ హెచ్వోడీ దామ్సింగ్, లెక్చరర్ మద్దిలేటి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ● చికిత్సకు రూ.30 లక్షలు అవుతుందన్న వైద్యులు ● దాతల సాయానికి ఎదురుచూపులు -
విగ్రహాల ఏర్పాటుకు భూమిపూజ
వనపర్తి రూరల్: మండలంలోని చిమనగుంటపల్లి గ్రామంలో ఆంబేద్కర్ నవచైతన్య సొసైటీ అధ్యక్షుడు భాస్కర్, బంజారా గిరిజన విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు శివనాయక్, స్వామి వివేకానందా యూత్ అధ్యక్షుడు వాకిటి మహేష్ ఆధ్వర్యంలో బుదవారం జ్యోతిరావుపూలే.. సావిత్రిబాయి పూలే విగ్రహాలకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో అంబేద్కర్ నగర్ సొసైటీ అధ్యక్షుడు భాస్కర్, నవ చైతన్య సొసైటీ వైస్ ప్రసిడెంట్ గొర్ల చంద్రకాంత్, జనరల్ సెక్రెటరీ జి.కృష్ణ, ట్రెజరర్ పుల్లయ్య, కె.బాలయ్య, స్వామి వివేకానందా గౌరవ అధ్యక్షుడు వాకిటి నిలేందర్, భగవంతు యాదవ్, వాకిటి సుదర్శన్, చెంచేటి మహేష్, రాజశేఖర్, వాకిటి నరేష్ పాల్గొన్నారు. -
తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం సరికాదు
● అధికారులు పని చేయకపోతే సెలవుపై వెళ్లండి ● పుర అత్యవసర సమావేశంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తిటౌన్: తాగునీటి సరఫరాలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. అధికారులు ఏ విషయం అడిగినా పొంతన లేని సమాధానాలు, నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే ఉద్యోగం నుంచి తొలగించేంత వరకు వెనుకాడబోనని ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం పుర కార్యాలయంలో చైర్పర్సన్ ఎం.మాధవి అధ్యక్షతన తాగునీటి సరఫరాపై అత్యవసర సమావేశం నిర్వహించగా.. ఎమ్మెల్యే మేఘారెడ్డి హాజరై మాట్లాడారు. అధికారులు తాగునీటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తమ వద్దకు వచ్చే ప్రజలకు కౌన్సిలర్లు, తాను ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అలాగే ఇక్కడ పనిచేసిన అధికారి కార్యాలయంలో ఉండాల్సిన దస్త్రాలు తీసుకెళ్తే ఏం చేస్తున్నారని.. తక్షణమే కేసు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. చార్జ్లిస్ట్ ఇవ్వకుండా వెళ్తే ప్రస్తుతం ఉన్న అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు పద్ధతి మార్చుకోకపోతే సెలవుపై వెళ్లాలని హితవు పలికారు. పుర చైర్పర్సన్ ఎప్పుడు కార్యాలయానికి వచ్చినా అధికారులు అందుబాటులో ఉండటం లేదని, కనీస సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని, ఆస్తిపన్ను వసూలు వివరాలు ఆమెకు తెలియజేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా పుర కార్మికులను డ్రైవర్లుగా, ఇంట్లో పని మనుషులుగా, ఫాంహౌస్లో పనిలో పెట్టుకుంటే చర్యలు తప్పవని, ఎక్కడ పని చేయాల్సిన వాళ్లు అక్కడే పని చేయాలన్నారు. కాంట్రాక్టర్లు ఎవరెవరు ఎంత పని చేశారు? ఏ మేరకు పనులు పెండింగ్లో ఉన్నాయి అనే విషయాలను సోమవారంలోగా తనకు అందించాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాలో ఎక్కడ ఏ సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని, క్షేత్రస్థాయిలో అవసరమైన ప్రతిపాదనలు కౌన్సిలర్లు ఇవ్వాలన్నారు. మోటార్ల మరమ్మతుకు ముగ్గురు కాంట్రాక్టర్లను ఏర్పాటు చేయాలని, ప్రతి 11 వార్డులకు ఒకరికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని కోరారు. -
జిల్లాలో ప్రతిభకు కొదవలేదు
వనపర్తిటౌన్: జిల్లాలో ప్రతిభకు కొదవ లేదని.. ప్రతి ఒక్కరిలో ఓ మేధావి దాగి ఉన్నాడని హెచ్ఎండీఏ జనరల్ మేనేజర్ పెరవలి బద్రీనాథ్ అన్నారు. ప్రతిభను గుర్తించి వెలికితీసేందుకు సహకరిస్తే ప్రయోజకులవుతారని చెప్పారు. బుధవారం జిల్లాకేంద్రంలోని పానుగంటి శారదమ్మ బ్రాహ్మణ సంస్కారభవన్లో జిల్లా బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో పంచాంగం ఆవిష్కరించారు. అలాగే జిల్లాలో వివిధ రంగాల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన 28 మందికి ఉగాది పురస్కారాలు అందజేసి సన్మానించారు. పురస్కారాలు అందుకున్న వారిలో.. కొత్తకోటకు చెందిన గ్రూప్–1 అధికారి పెరవలి బద్రీనాథ్, సినీ రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవి, ఆత్మకూర్కు చెందిన కవి, రచయిత బాబు దేవిదాస్రావు, కొత్తకోట మండలం కనిమెట్టకు చెందిన సినిమా డైరెక్టర్, సీనియర్ జర్నలిస్ట్ మద్దాలి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీలు గోపాల్పేటకు చెందిన రామేశ్వరశర్మ, ఖిల్లాఘనపురానికి చెందిన శేషాచార్యులు, వనపర్తికి చెందిన ఓరుగంటి మనోహర్శర్మ, వంగీపురం నీరజాదేవి, తాళాల రమాకాంత్, తాళాల గాయత్రి, ప్రధానోపాధ్యాయురాలు పెరవలి గాయత్రి, గోశాల వ్యవస్థాపకుడు సౌమిత్రి రామాచారి, వనపర్తి వెంకటేశ్వరస్వామి ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథచార్యులు, వనపర్తి బ్రాహ్మణ భవన్ స్థలదాత రాంకిషన్రావు, పత్రి సుధాకర్శర్మ, ఆత్మకూర్కు చెందిన రాఘవన్, శంకరమ్మపేట సర్పంచ్ శ్రీనివాస్శర్మ, సీనియర్ రాజకీయ విశ్లేషకుడు దేవరాజు అచ్యుత రామారావు, టెలికంశాఖ మాజీ అధికారి తాటిపర్తి మోహన్రావు, నాయకంటి నరసింహశర్మ, గీసుకొండ శ్రీనివాసశర్మ, పెబ్బేరుకు చెందిన రంగాచార్యులు, అయ్యవారిపల్లికి చెందిన కృష్ణమాచార్యులు, మదనాపురం జ్యోషి శ్రీనివాసాచారి, సోళీపురానికి చెందిన వెంకటేశ్వరశర్మ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మదనాపురం గోపీస్వామి, రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ మాజీ డైరెక్టర్ జ్యోషి గోపాలశర్మ, పంచాంగకర్త మనోహర సిద్ధాంతి, ధీరజ్శర్మ, పల్లా సాయికుమార్శర్మ, వరప్రసాదరావు, పత్రి సుధాకర్శర్మ, భక్షి శ్రీధర్రావు తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ పైప్లైన్ దెబ్బతినకుండా చూడాలి
వనపర్తి రూరల్: రైతులు తమ పొలాల వెంట ఉన్న గ్యాస్ పైప్లైన్ దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి రైతులకు సూచించారు. బుధవారం మండలంలోని పెద్దగూడెం శివారులో హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) ఇంటర్మీడియట్ పిగ్గింగ్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆఫ్సైట్ మాక్డ్రిల్కు ఆయనతో పాటు కంపెనీ డీజీఎం అనూజ్ బురోనియా, ఆపరేషన్ మేనేజర్ శశిధర్రెడ్డి పాల్గొన్నారు. పైప్లైన్ మార్గంలోని గ్రామాల పరిధిలో ఎక్కడైనా పొరపాటున గ్యాస్ లీకేజీ ఏర్పడితే భారీ నష్టం జరగకుండా ఏ విధంగా నివారించాలనే విషయాలను కంపెనీ బృందాలు మాక్డ్రిల్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పైప్లైన్ కేవలం 1.5 మీటర్ల లోతులో ఉంటుందని.. ఎల్పీజీ గ్యాస్ పైపులైన్ చుట్టూ 18 మీటర్ల పరిధిలో ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదని సూచించారు. పొలాల్లో పైప్లైన్ ఏ మార్గంలో ఉందో తెలిసి ఉండాలన్నారు. లీకేజీని గుర్తిస్తే సమీపంలోని సైన్బోర్డుపై రాసిన నంబర్కు ఫోన్చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వం తరఫున కూడా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. రైతులు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించి ప్రమాదాలను నివారించేందుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్రెడ్డి, డీసీఎస్ఓ కాశీవిశ్వనాథ్, సర్పంచ్ పుష్పలత, అసిస్టెంట్ మేనేజర్ విద్యాసాగర్ గుప్తా, కృష్ణ, విజయ్, పవన్కుమార్, భారతి, ఫైర్ అధికారులు పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయం లాభదాయకం
గోపాల్పేట: రసాయన ఎరువులతో పండిన పంటలకు మార్కెట్లో విలువ తగ్గుతోందని.. ప్రకృతి వ్యవసాయం చేస్తే ఎంతో లాభదాయకమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని జయన్నతిర్మలాపూర్లో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. ఏళ్ల కిందట చూసుకుంటే దేశంలో పండించే పంటలకు ఎంతో విలువ ఉండేదని.. 200 రోజుల్లో పంట దిగుబడి వచ్చేదని సాంబార్, వరి వంగడాలు చాలా ఏపుగా పెరిగి దిగుబడి అధికంగా ఉండేదని వివరించారు. ప్రస్తుత సమయంలో దిగుబడి అధికంగా రావాలన్న ఉద్దేశంతో రసాయన ఎరువుల వినియోగం పెరగడంతో బయటి దేశాల్లో డిమాండ్ తగ్గిందని వివరించారు. రైతులు ఇప్పటికై నా రసాయన ఎరువులు తగ్గించి ప్రకృతి సేద్యంపై దృష్టి సారించాలని సూచించారు. ప్రస్తుతం గ్రామంలో 125 మంది ప్రకృతి వ్యవసాయం చేసేందుకు సానుకూలంగా ఉన్నారని.. రాబోయే కాలంలో ఈ సంఖ్య మరింత పెరగనుందని వివరించారు. అనంతరం రైతులకు ప్రకృతి వ్యవసాయ మిషన్ బ్యాగులు, క్యాలెండర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి గోపాల్, టీపీసీసీ ప్రధానకార్యదర్శి నందిమళ్ల యాదయ్య, మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, భాస్కర్రెడ్డి, కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
పుట్టెడు దుఃఖంలో ‘పది’ పరీక్షకు హాజరు
కేటీదొడ్డి: కన్నతండ్రి ఇక లేరనే నిజాన్ని జీర్ణించుకోలేక ఆ పిల్లాడి గుండె తల్లడిల్లింది. కంటిపాపలా చూసుకున్న తండ్రి భౌతికంగా దూరమైనా ఆశయమే లక్ష్యంగా ఆ విద్యార్థి పుట్టెడు దుఃఖంలోనూ పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కేటీదొడ్డి మండలం గంగన్పల్లికి చెందిన విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సదానందం ఆచారి మృతిచెందారు. ఇంట్లో పార్థివదేహం ఉండగానే బుధవారం పాతపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో జరిగే హిందీ పరీక్షకు అతడి కుమారుడు సాయివిష్ణు హాజరు కావాల్సి ఉంది. సమాచారం అందుకున్న ఎంఈఓ విజయభాస్కర్, ఉపాధ్యాయులు విద్యార్థికి ధైర్యం చెప్పడంతో పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష రాస్తున్నంత సేపు ఆ విద్యార్థి కళ్లు కన్నీళ్లతో నిండిపోవడం చూసిన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు చలించిపోయారు. పరీక్ష అనంతరం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. -
బ్యాంకర్లు లక్ష్యాన్ని చేరుకోవాలి : కలెక్టర్
వనపర్తి: బ్యాంకర్లు 2025–2026 వార్షిక ఆర్థిక ప్రణాళిక లక్ష్యాన్ని ఛేదించాలని, ప్రతి ఖాతాదారుడికి ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కల్పించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి బ్యాంకర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రూ.5,339.27 కోట్ల వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా డిసెంబర్ నాటికి రూ.3,326.61 కోట్లు సాధించారని, మార్చి 31లోపు వందశాతం పూర్తి చేయాలన్నారు. ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజనకు జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 72,162 మంది ఖాతాదారులు మాత్రమే బీమా తీసుకున్నారని ఆశ్ఛర్యం వ్యక్తం చేశారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్, రిజర్వ్ బ్యాంక్ ఎల్డీఓ చేతన్ గోరేకర్, నాబార్డ్ డీడీఎం మనోహర్రెడ్డి, యూబీఐ చీఫ్ మేనేజర్ ఆశిష్ రంజన్ బ్యాంకు మేనేజర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్.. హైదరాబాద్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్యూమ్ టెక్నాలజీలో 2026–27 విద్యా సంవత్సరానికిగాను డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ‘పది’ పరీక్ష కేంద్రాల తనిఖీ.. జిల్లాకేంద్రంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదోతరగతి పరీక్ష కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి తనిఖీ చేశారు. 242 మంది విద్యార్థులకుగాను 242 మంది హాజరయ్యారని అధికారులు కలెక్టర్కు వివరించారు. ఆయన వెంట జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, తహసీల్దార్ రమేష్రెడ్డి తదితరులు ఉన్నారు. ఆస్తిపన్ను వసూళ్లలో వేగం పెంచండి.. ఆస్తి, నీటి పన్ను వసూళ్లలో పుర కమిషనర్లు వేగం పెంచాలని, సిబ్బందికి ఎప్పటికప్పుడు మార్గనిర్ధేశకాలు ఇవ్వాలని కలెక్టర్ ఆదర్శ్సురభి అన్నారు. బుధవారం జిల్లాలోని పుర కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. పన్ను బకాయిలు ఉన్న వారి జాబితాను వార్డుల వారీగా సిద్ధం చేయాలని, జాబితాను కౌన్సిలర్లకు కూడా అందజేయాలన్నారు. డిజిటల్ పేమెంట్ చేయడానికి బార్కోడ్ ఉన్న నోటీసులను తయారుచేసి పోస్ట్లో పంపించాలని సూచించారు. ప్రతి మూడు వార్డులకు ఒక ప్రత్యేక అధికారిని నియమించి పర్యవేక్షణ చేపట్టాలన్నారు. రివిజన్ మేళాల నిర్వహణ తప్పనిసరి.. అన్ని పురపాలికల్లో రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పన్ను వసూళ్లకు ప్రత్యేకంగా రివిజన్ మేళా నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. మ్యుటేషన్లు, కొత్త ఇంటి నంబర్ల జారీ పనులు వేగంగా కొనసాగించాలన్నారు. పన్ను వసూళ్లపై రోజు పర్యవేక్షణ కొనసాగించి నివేదిక ఇవ్వాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్కు సూచించారు. -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
● బాలికా విద్యకు ప్రోత్సాహం అందించాలి ● కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి: మహిళలు అన్ని రంగాల్లో రాణించి అందరికీ ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సోమవారం ఐడీఓసి సమావేశ మందిరంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఎస్పీ సునీతారెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే సమాజం నిజమైన అభివృద్ధి చెందినట్లు అని అన్నారు. మహిళలకు ఆరోగ్యం ఎంతో కీలకమని.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అదే విధంగా సమాజంలో బాల్యవివాహాల నిర్మూలనకు నడుం బిగించాలన్నారు. బాల్యంలోనే వివాహం చేయకుండా వారిని ఉన్నత చదువులు చదివించాలని, విద్యతోనే అందరికీ సమాజంలో గౌరవం పెరుగుతుందని తెలియజేశారు. చదువులో బాలికల డ్రాప్ అవుట్ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాలికా విద్యను ప్రోత్సహించి బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన వనజ, రాములమ్మలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎస్పీ సునీతారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళల భద్రతకు ఎంతో కృషి చేస్తుందన్నారు. పోలీస్శాఖలో మహిళా ఉద్యోగుల పాత్ర పెరిగిందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన మహిళా ఉద్యోగులు, మంచి ప్రతిభ కనబరిచిన మహిళలను కలెక్టర్, ఎస్పీ శాలువాతో సత్కరించి మెమోంటోలు అందజేశారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు.. ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యనాయక్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. కాగా, ప్రజావాణి కార్యక్రమంలో 34 దరఖాస్తులు వచ్చాయని కార్యాలయ సిబ్బంది తెలిపారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన టౌన్ హాల్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయాన్ని కలెక్టర్ పరిశీలించారు. వాటిని వినియోగంలోకి తెచ్చే దిశగాా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. టౌన్ హాల్ నిర్మాణానికి నిధులు ఉన్నప్పటికీ పనులు ముందుకు సాగకపోవడంపై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పెండింగ్ పనులను వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్ విభాగాలు సమన్వయంతో పనిచేసి.. నెల రోజుల్లోగా వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు. అదే విధంగా నూతన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ సముదాయాన్ని కూడా ఏప్రిల్ 1వ తేదీలోగా వినియోగంలోకి తెచ్చే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ తరలింపునకు నూతన ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కావాల్సిన సౌకర్యాలను సమకూర్చుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో జిల్లా సంక్షేమశాఖ అధికారిణి సుధారాణి, డీఆర్డీఓ ఉమాదేవి, జీసీడీఓ శుభలక్ష్మి, ఆర్డీఎస్ అధ్యక్షురాలు చిన్నమ్మ తామస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ వైస్చైర్మన్ మధుసూదన్ గౌడ్, ఆర్ఎంఓ రెడ్డి కుమారి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ముగిసిన ఇంటర్ పరీక్షలు
వనపర్తి విద్యావిభాగం: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు పరీక్షలు సోమవారం ముగిశాయి. జిల్లావ్యాప్తంగా 5 పరీక్ష కేంద్రాల్లో 844 మంది విద్యార్థులకు గాను 790 మంది పరీక్షలకు హాజరు కాగా.. 54 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని సీవీ రామన్, రావూస్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయని తెలిపారు. ప్రతి ఒక్కరికీ సేవాగుణం ఉండాలి మక్తల్: సమాజంలో ప్రతి ఒక్కరికీ సేవాగుణం ఉండాలని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణానికి చెందిన బురాన్ సమకూర్చిన దుస్తులను మంత్రి చేతుల మీదుగా పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంలో సేవా కార్యక్రమాలతోనే గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ సేవాదృక్పథం అలవర్చుకోవాలని సూచించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా పేద ముస్లింలకు కొత్త దుస్తులు అందించిన బురాన్ను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వాకిటి మానస, వాకిటి హన్మంతు, సరిత, రహీం పటేల్, శ్రీవిద్య, చెన్నమ్మ, జుట్ల అనిత, మహేశ్, లక్ష్మణ్ పాల్గొన్నారు. ఆశావర్కర్లకు రూ.18వేల వేతనం ఇవ్వాలి వనపర్తి రూరల్: ఆశావర్కర్లకు రూ. 18వేల పిక్స్డ్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మర్రికుంటలో 48 గంటల ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్ఎన్ రమేశ్, కార్యదర్శి మండ్ల రాజు, ఆశావర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సునీత, కార్యదర్శి బుచ్చమ్మ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తయినా నేటికీ ఆశావర్కర్లకు పిక్స్డ్ వేతనం నిర్ణయించకపోవడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 1,500లను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పారితోషికంతో కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 16 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఆశావర్కర్లకు ఫిక్స్డ్ వేతనం చెల్లించేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. అదే విధంగా 6 నెలల పీఆర్సీ ఏరియల్స్ చెల్లించాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఆశావర్కర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు బొబ్బిలి నిక్సన్, రాములు, గిరిజమ్మ, దేవమ్మ, చెన్నమ్మ, అనిత, ఇందిరా, తార, గోవిందమ్మ, లత, శాంతమ్మ, బాలకృష్ణమ్మ పాల్గొన్నారు. పంట మార్పిడితో అధిక దిగుబడులు గోపాల్పేట: పంటల సాగులో సేంద్రియ ఎరువుల వినియోగం, పంట మార్పిడి విధానంతో అధిక దిగుబడులు సాధించవచ్చని కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్త రాజేందర్రెడ్డి రైతులకు సూచించారు. సోమవారం గోపాల్పేట రైతువేదికలో డీఏఓ ఆంజనేయులుగౌడ్తో కలిసి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త మాట్లాడుతూ.. రైతులు సహజసిద్ధంగా లభించే మక్కిన పశువుల ఎరువులు, జీవామృతం, నీమాస్త్రం, దశపత్రి తదితర కషాయాలతో పంటల్లో చీడపీడలను నివారించవచ్చన్నారు. ఏటా ఒకే రకం పంటను వానాకాలం, యాసంగి సీజన్లో పండించకూడదని.. భూసార పరీక్షలకు అనుగుణంగా పంటమార్పిడి విధానం పాటించాలని సూచించారు. -
నారాయణపేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల్లో కదలిక
● తొలి విడతలో రూ.1,400 కోట్లు మంజూరు.. స్టేజీ–1 పనులు షురూ ● కాట్రేవులపల్లి వద్ద అప్రోచ్ చానల్, పంప్హౌస్ వర్క్స్ ముమ్మరం ● మొత్తంగా లక్ష ఎకరాలకు సాగునీరు.. ప్రాజెక్ట్ వెంట గ్రీన్బెల్ట్ ● 56 హెక్టార్లలో మొక్కల పెంపకం.. రైతాంగంలో హర్షాతిరేకాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరులోని నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా చేపట్టిన కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. పది మండలాల పరిధిలో లక్ష ఎకరాలకు సాగు, 123 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకానికి ఇటీవలే తొలి విడత నిధులు మంజూరు కాగా.. పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక భారం పడకుండా ఇదివరకే అనుకూలంగా ఉన్న చెరువులను రిజర్వాయర్లుగా మార్చడంతోపాటు ప్రాజెక్ట్ వెంట గ్రీన్బెల్ట్ ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా 56 హెక్టార్లలో మొక్కలను పెంచనున్నారు. రిజర్వాయర్ల సామర్థ్యం: 4 టీఎంసీలు మొత్తం విడతలు : 3మంజూరైనవి : రూ.1,400 కోట్లు వ్యయం : రూ.2,945 కోట్లు కొడంగల్ పనులు ప్రారంభమయ్యాయి. స్టేజీ–1 కింద మక్తల్ మండలంలోని కాట్రేవులపల్లి నుంచి ఊట్కూర్ వరకు, స్టేజీ–2 కింద ఊట్కూర్ మండలంలోని బాపూర్ నుంచి కానుకుర్తి వరకు పనులను డిసెంబర్ 2027 డిసెంబర్ వరకు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. 2 ప్యాకేజీలకు సంబంధించి రూ.2,945 కోట్లతో భూసేకరణ, కాల్వ, పంప్ హౌస్లు, రిజర్వాయర్ల పనులు రాఘవ, మెగా కన్స్ట్రక్షన్ల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. – శ్రీధర్, ఎస్ఈ, ఇరిగేషన్, మహబూబ్నగర్ -
బైపాస్పై ఆశలు
జడ్చర్ల: జడ్చర్లకు బైపాస్ మంజూరుపై ఆశలు చిగురిస్తున్నాయి. జడ్చర్ల పట్టణ ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదించిన బైపాస్ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నిత్యం ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా కేంద్రం పంపే కబురు కోసం ఎదురుచూస్తున్నారు. జడ్చర్ల పట్టణం చుట్టూ బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు రంగం సిద్ధం అయ్యింది. రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్న జడ్చర్ల పట్టణం గుండా ప్రయాణం నరకప్రాయంగా మారింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారు జడ్చర్ల దాటితే సరి అన్న ఆందోళనలో ప్రయాణాలు సాగిస్తున్నారు. పట్టణ విస్తీర్ణం కూడా అడ్డదిడ్డంగా ఉండడంతోపాటు పట్టణంలోని ప్రధాన రహదారులు ఇరుగ్గా ఉన్నాయి. ఇక్కడ వాహనాల రాకపోకలకు.. రహదారుల వెడల్పునకు ఎక్కడా పొంతన లేక అడుగడుగునా ట్రాఫిక్తో నిత్యం సతమతమవుతున్నారు. మరోవైపు జాతీయ రహదారి–44, ఇంకోవైపు ఎన్హెచ్–167తోపాటు రాష్ట్రీయ రహదారులు సైతం పట్టణం నడిబొడ్డుగుండా వెళ్తున్నాయి. వీటికి తోడు రైల్వే మార్గం కూడా ఉండడంతో రాకపోకలు అంత సునాయసంగా ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. రైల్వే మార్గం కారణంగా రెండు ప్రాంతాల రాకపోకలు సిగ్నల్గడ్డ వద్ద ఉన్న సింగిల్ బ్రిడ్జి మీదుగా మాత్రమే దాటే పరిస్థితి ఉండడంతో ఇక్కడ ట్రాఫిక్ స్తంభించి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అలాగే జడ్చర్ల కొత్త బస్టాండ్ సమీపంలో ఎన్హెచ్–44పై ఫ్లై ఓవర్ బ్రిడ్జి దగ్గర సైతం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయి. ఇలా అనేక దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలతోపాటు ఇతర ప్రాంతాల ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో జడ్చర్లకు బైపాస్ రోడ్డు నిర్మిస్తే బాగుంటుందని ఎంతో కాలంగా ప్రజలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బైపాస్ రోడ్డు నిర్మాణానికి పాలకవర్గాల నుంచి అనుకూల ప్రకటనలు రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్తో సతమతం.. జడ్చర్ల మీదుగా ఒక్క హైదరాబాద్కు మాత్రమే కాకుండా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర తదితర ఉత్తర, దక్షిణ భారతం వైపు భారీ సంఖ్యలో రాకపోకలు సాగుతుంటాయి. అయితే ఆయా ప్రాంతాలకు వెళ్లాలంటే జడ్చర్ల పట్టణం గుండానే అది కూడా సింగిల్ రోడ్డుగా ఉన్న ఒక చిన్నపాటి రైల్వే వంతెనపైనే రాకపోకలు సాగించే పరిస్థితి ఉండేది. కాగా ఇటీవల జాతీయ రహదారి–167 విస్తరణ పనులలో భాగంగా ఒకవైపు సింగిల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేయగా.. మరోవైపు బ్రిడ్జి విస్తరణ పనులు నిలిచిపోవడంతో గుంతలమయంగా మారిన రహదారిపైనే రాకపోకలు సాగుతున్నాయి. వనపర్తి, కొల్లాపూర్, నాగర్కర్నూల్, కల్వకుర్తి ప్రాంతాలకు సైతం ఇదే రహదారి కీలకంగా ఉంది. జాతీయ, అంతర్రాష్ట్ర రహదారులు సిగ్నల్గడ్డ మీదుగానే సాగుతుండడంతో నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. దీంతో గంటల తరబడి రాకపోకలకు అంతరాయం కలుగుతుండడంతో ప్రజలు బైపాస్ రోడ్డు కోసం ఎదురుచూస్తున్నారు. జడ్చర్ల పట్టణం వ్యూఈ నెలాఖరులోగా.. జడ్చర్ల పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బైపాస్ రోడ్డు నిర్మాణం చేయాలన్న డిమాండ్ గత కొన్నేళ్లుగా ఉంది. అయితే గత బీఆర్ఎస్ పాలనలో బైపాస్ రోడ్డుకు అప్పటి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రతిపాదించినా కార్యాచరణ రూపొందలేదు. తాజాగా ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి జడ్చర్ల బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి నితిన్గడ్కరీకి ప్రతిపాదించడంతో అడుగులు ముందుకు పడుతున్నాయి. ఈ నెలాఖరులోగా బిడ్డింగ్ ఓపెన్ చేసి డీపీఆర్ బాధ్యతలను అప్పగించే సూచనలు కనిపిస్తుండటంతో ఈ నెలాఖరులోగా డీపీఆర్ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. జడ్చర్ల బైపాస్తోపాటు జాతీయ రహదారి–167కి సంబంధించి రెండు వరుసలుగా ఉన్న రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించాలన్న ప్రతిపాదనలకు కూడా డీపీఆర్ చేయనున్నారు. దీనికి సంబంధించి జడ్చర్ల మండలంలోని జాతీయ రహదారి–167ని అనుసరించి నక్కలబండతండా మీదుగా మల్లెబోయిన్పల్లి, చిట్టింబోయిన్పల్లి మధ్యగా జాతీయ రహదారి–44 మీదుగా మరికల్, నాగసాల గ్రామాల సమీపం నుంచి చర్లపల్లి మీదుగా ఆల్వాన్పల్లి, గంగాపూర్ గ్రామాల పరిధిలోని జాతీయ రహదారి–167ని తాకేలా ప్రతిపాదనలు నివేదించారు. అయితే డీపీఆర్ ఆయా ప్రతిపాదనల మేరకే చేపడుతారా.. మరేమైనా కొత్తవి తెరపైకి వస్తాయా అన్నది వేచిచూడాల్సి ఉంది. డీపీఆర్కు రంగం సిద్ధంతో ముందడుగు ఈ నెలాఖరులోగా కొలిక్కి వచ్చే అవకాశం పట్టణంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం అన్నీ సవ్యంగా జరిగితే జడ్చర్ల మరింత అభివృద్ధి సమాచారం అందింది.. జడ్చర్లకు బైపాస్ నిర్మాణంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుంది. ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నుంచి డీపీఆర్ తయారీ టెండర్లకు సంబంధించి సమాచారం అందింది. బైపాస్తో జడ్చర్లలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఎంపీ డీకే అరుణ సహకారంతో బైపాస్ సాధనకు చిత్తశుద్ధితో కృషిచేస్తాం. – అనిరుధ్రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల -
గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం
అమరచింత: కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలపేతం చేయడానికే నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని డీసీసీ అధ్యక్షుడు, శాట్ చైర్మన్ శివాసేనారెడ్డి అన్నారు. సోమవారం అమరచింతలోని పార్టీ కార్యాలయ ఆవరణలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిది కేశం నాగరాజ్గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండలస్థాయి సమావేశానికి డీసీసీ అధ్యక్షుడు హాజరై మాట్లాడారు. మునుపెన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ, మండల అధ్యక్షులకు మరిన్ని అధికారాలు కల్పించేందుకు సీఎం రేవంత్రెడ్డి కార్యాచరణ రూపొందించారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని.. గ్రామాల్లో సర్పంచులతో పాటు పార్టీ అధ్యక్షుడికి సైతం అదే స్థాయిలో అధికారాలు కట్టబెట్టేందుకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామంలో ఎవరికి అందించాలనే పూర్తి స్వేచ్ఛ గ్రామ పార్టీ అధ్యక్షుడికి అప్పగిస్తున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ.. పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమించే నాయకుడిని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని సూచించారు. అనంతరం నాగరాజ్గౌడ్ మాట్లాడుతూ.. పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే ఉపేక్షించేది లేదన్నారు. వారిని పార్టీ నుంచి బయటికి పంపిస్తామన్నారు. గత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ లైన్కు వ్యతిరేకంగా పనిచేసిన వారిపై చర్యలు తప్పవన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ జింక సువర్ణ రవి, వైస్చైర్పర్సన్ రాధ అరుణ్, పార్టీ నాయకులు మహేందర్రెడ్డి, అరుణ్కుమార్, కమలాకర్గౌడ్, రవికాంత్, శ్యామ్, లక్ష్మీకాంత్రెడ్డి, తౌఫిక్, హనుమంతు నాయక్ పాల్గొన్నారు. -
గ్యాస్ కొరత నివారణలో మోదీ ప్రభుత్వం విఫలం
పాన్గల్: దేశంలో నెలకొన్న వంటగ్యాస్ కొరతను నివారించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్ అన్నారు. దేశంలో వంటగ్యాస్ కొరత, ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులపై సోమవారం పాన్గల్లోని అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంటగ్యాస్ సంక్షోభం నుంచి దేశ ప్రజలను రక్షించడంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వంటగ్యాస్ కొరతను నివారించాలని.. లేనిచో ప్రజలతో కలిసి గ్యాస్ గోదాంలను ముట్టడిస్తామని హెచ్చరించారు. కాగా, మండలంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మంగళవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బాల్యానాయక్, వెంకటయ్య, భగత్, సర్పంచులు నిరంజన్, జంబులయ్య, ఉపసర్పంచ్ బాలునాయక్, రాము, దేవేందర్, కమలాకర్ పాల్గొన్నారు. -
‘పేదలను పట్టించుకోని బీఆర్ఎస్’
గోపాల్పేట: బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలను పట్టించుకోలేదని.. పేదలకు డబుల్బెడ్రూం ఇళ్లు, భూములు పంపిణీ చేస్తామని మోసం చేసిందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన మండలంలోని ఏదుట్ల, తాడిపర్తి, పొలికెపాడులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ఇచ్చిన మాట ప్రకారం కొత్త దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో తమ సొంతింటి కల సాకారమైందని, నిర్మాణాలు పూర్తి చేసుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పేదల పార్టీ అని, వారి ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని, మహిళలకు వడ్డీలేని రుణాలు, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచితం విద్యుత్ తదితర ఎన్నో పథకాలు అమలు చేస్తోందని వివరించారు. భవిష్యత్లో మరిన్ని పథకాలు అమలు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం పొలికెపాడులో ప్రాథమిక ఉపకేంద్రాన్ని ప్రారంభించడంతోపాటు అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఆయన వెంట మండల నాయకులు సత్యశిలారెడ్డి, తాడిపర్తి సర్పంచ్ లోకారెడ్డి, పొలికెపాడు సర్పంచ్ బంగారయ్య, ఆయా గ్రామాల ముఖ్య నాయకులు ఉన్నారు. కాంగ్రెస్లో చేరిక.. మండలంలోని పొలికెపాడు సర్పంచ్ బంగారయ్య, ఉపసర్పంచ్ జంపన్నతో పాటు మరో 60 మంది కాంగ్రెస్పార్టీలో చేరగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథ కాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని చెప్పారు. -
పరిసరాల శుభ్రత అందరి బాధ్యత
వనపర్తి రూరల్: పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతని శాట్ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పెద్దగూడెం గ్రామంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు నిర్వహించిన శ్రమదానం కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు, గ్రామస్తులు, యువతతో కలిసి రహదారులు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లెలు అభివృద్ధి బాటలో నడిచినప్పుడే రాష్ట్రం ప్రగతి పథంలో ముందుంటుందని తెలిపారు. వేసవిలో నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. గ్రామంలోని రోడ్లు, పాఠశాల, దేవాలయ ఆవరణలు, వార్డులను శుభ్రం చేసిన విద్యార్థులను అభినందించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశంలో పాల్గొని లబ్ధిదారులు శిరీష బాలకృష్ణకు కొత్త దుస్తులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని రేవంత్రెడ్డి సర్కార్ సొంత ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి వారి కల నెరవేస్తుందన్నారు. సర్పంచ్ పుష్పలత శివకుమార్, సీనియర్ నాయకులు పుల్లారెడ్డి, ఉపసర్పంచ్ పోలికమ్మ, మాజీ సర్పంచ్ కొండన్న, నాయకులు శేఖర్రెడ్డి, రొయ్యల రమేష్, విష్ణువర్ధన్రెడ్డి, భాస్కర్రెడ్డి, ఉండాల రాముడు, శివయ్య పాల్గొన్నారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
చిన్నంబావి: రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండలంలోని కొప్పునూరులో సింగిల్విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పప్పుశనగ కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన పప్పుశనగ పంటను ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.5,875కు కొనుగోలు చేస్తామని తెలిపారు. కొనుగోళ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం ముఖ్యమని.. తేమశాతం 14 శాతంలోపే ఉండేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ సజావుగా, వేగవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, బీచుపల్లి యాదవ్, విద్యాసాగర్రావు, చిదంబర్రెడ్డి, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, తేజారెడ్డి, సర్పంచ్ బిచ్చన్న, భాస్కర్, గూడెం సుధాకర్, జ్యోతిగౌడ్, రాజుకుమార్, ఉమేష్ నాయుడు, యువజన కాంగ్రెస్ నాయకులు విభీషణ్, కత్తి జాని తదితరులు పాల్గొన్నారు. -
జనగణనకు సన్నద్ధం
వనపర్తి: జనగణనకు అధికారులు సిద్ధమవుతున్నారు. 2021లోనే జనగణన జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా ఈ ప్రక్రియ ఐదేళ్లు ఆలస్యంగా ప్రారంభమైంది. జనాభా లెక్కల ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసే అవకాశాలు ఉంటాయి. భారత ప్రభుత్వం ఈ ప్రక్రియను తొలిసారిగా పూర్తి డిజిటల్ విధానంలో రెండువిడతల్లో నిర్వహించనుంది. తొలివిడతలో జిల్లావ్యాప్తంగా ఉన్న ఇళ్లు, కుటుంబాలను గుర్తిస్తారు. అనంతరం గుర్తించిన ఇళ్లలో కుటుంబాల సంఖ్య ఆధారంగా బ్లాక్లుగా విభజించి జనాభా లెక్కలను సేకరించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మే 11 నుంచి క్షేత్రస్థాయిలోకి.. తొలివిడత మే నెల 11 నుంచి జూన్ 9 వరకు 30 రోజుల పాటు ఇళ్లు, కుటుంబాలు, జీవన స్థితిగతుల వివరాల సేకరణకు ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. ఇళ్లు, కుటుంబాలతో పాటు మరో 34 అంశాలను సేకరించి సీఎంఎంఎస్ పోర్టల్లో నమోదు చేయనున్నారు. మూడురోజుల పాటు శిక్షణ.. మండలాల వారీగా సెన్సెస్ అధికారులు, క్లర్క్లుగా నియమించిన 60 మంది అధికారులు, సిబ్బందికి మూడురోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఆదివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శిక్షణ తరగతులు ప్రారంభం కాగా.. కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరై జనాభా లెక్కల ప్రక్రియపై కీలక సూచనలు చేశారు. 15 ఏళ్ల తర్వాత నిర్వహణ.. పూర్తిగా డిజిటల్ విధానంలో... జిల్లాలో రెండు విడతల్లో వివరాల సేకరణ తొలి విడత ఇళ్లు, కుటుంబాలు మలి విడతలో జనగణనకు కసరత్తు ప్రారంభమైన ఎన్యూమరేటర్ల శిక్షణ బాధ్యతగా పనిచేయాలి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే జనగణన ప్రక్రియలో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. అన్ని ప్రక్రియల్లో నిబంధనలపై అవగాహన కోసం అధికారులు, సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. – ఆదర్శ్ సురభి, కలెక్టర్ -
హైరానా..!
జూరాల వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మాణంపై గందరగోళం గద్వాల: కృష్ణానదిపై నిర్మించిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు సేఫ్టీని కాపాడాలి.. ఈ మేరకు డ్యాంకు సమీపంలో మరో బ్రిడ్జి నిర్మించాలన్న వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో జూరాల వద్ద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణంపై గందరగోళం నెలకొంది. ఇదే అంశంపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నిర్వహించిన సమీక్షలో సైతం చర్చ జరగడం.. దీనిపై సమగ్ర వివరాలను ఆ శాఖ అధికారులు మంత్రికి నేరుగా వివరించడం.. ఎంపీ డీకే అరుణ డ్యాం సేఫ్టీని కాపాడాలని సమీక్షలో గట్టిగా కోరడం వంటి పరిణామాలతో సమగ్ర పరిశీలనకు ఆ శాఖ కార్యదర్శి త్వరలోనే జూరాలకు రానున్నారు. దీంతో ప్రస్తుతం గద్వాల మండలం కొత్తపల్లి– ఆత్మకూరు మధ్యలో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి భవితవ్యం గందరగోళంగా మారింది. ఇదే క్రమంలో ఈ బ్రిడ్జి నిర్మాణంపై ఇరిగేషన్ అధికారులు నిరభ్యంతర ధ్రువపత్రం ఇవ్వడానికి మల్లగుల్లాలు పడుతుండటం పెద్దఎత్తున చర్చకు దారితీసింది. భద్రతే.. ప్రధానం 2021–డ్యాం సేఫ్టీ చట్టం ప్రకారం ఎక్కడైనా పాజెక్టుకు సంబంధించి డ్యాం భద్రతే ప్రధానం. అయితే జూరాల డ్యాం సేఫ్టీకి సంబంధించిన బ్రిడ్జి సమీపంలో కాకుండా డ్యాంకు దూరంగా నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించి సర్వే, టెండర్లు పూర్తయ్యి సివిల్ పనులు సైతం మొదలయ్యాయి. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం డ్యాం సేఫ్టీ చట్టానికి విరుద్ధంగా ఉంది. ఈ చట్టం ప్రకారం డ్యాం సేఫ్టీ పర్యవేక్షణ బాధ్యత ఇరిగేషన్ శాఖదే. వరద వచ్చే ముందు, వరద వచ్చిన తర్వాత డ్యాం భద్రతపై సమగ్ర నివేదిక ఇరిగేషన్ అధికారులు ఇవ్వాల్సి ఉంటుంది. దీని కారణంగానే హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణంపై ఇరిగేషన్ శాఖ అధికారులు ఎన్ఓసీ (నిరభ్యంతర ధ్రువపత్రం) ఇవ్వడానికి తర్జనభర్జన పడుతున్నారు. స్థల మార్పిడి కారణంగా.. వాస్తవానికి చాలాకాలంగా జూరాల డ్యాం భద్రతను దృష్టిలో ఉంచుకుని డ్యాంకు సమీపంలో అదనంగా బ్రిడ్జి నిర్మించాలని అధికారులు రూ.వంద కోట్లతో అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే గతేడాది వానాకాలంలో జూరాల గేట్ల రోపులు తెగిపోయి ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉందని మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జూరాలను సందర్శించారు. ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం రూ.వంద కోట్లతో నూతనంగా మరో బ్రిడ్జి నిర్మి స్తామని ప్రకటించారు. ఇందుకు గతంలో ఇరిగేషన్శాఖ అధికారులు నివేదించిన స్థలంలో కాకుండా గద్వాల మండలం కొత్తపల్లి– ఆత్మకూరు మండలం జూరాల మధ్యలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పనులు సైతం మొద లు కాగా.. తాజాగా వివాదం చెలరేగింది. డ్యాం స్టేఫీ ప్రధానం అంటున్న ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసీ ఇచ్చేందుకు మల్లగుల్లాలు మూడు, నాలుగు రోజుల్లో రానున్న ఆ శాఖ కార్యదర్శి పైపెచ్చు ఆర్అండ్బీ నిర్మించే బ్రిడ్జిపై అభ్యంతరం లేదని స్పష్టీకరణ -
రైతులను మోసం చేసిన కాంగ్రెస్
● సమస్యలు విన్నవిస్తూ సీఎంకు లేఖలు ● మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి: రాష్ట్రంలో కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వచ్చాక ఒకసారి మాత్రమే రైతులకు పెట్టుబడి సాయం అందించి వరుసగా మూడు సీజన్లు మొండిచెయ్యి చూపిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో స్థానిక నాయకులతో కలిసి మాట్లాడారు. రూ.9 వేల కోట్లు సిద్ధంగా ఉన్నాయని.. రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్ నేతల్లో విశ్వసనీయత కొరవడిందన్నారు. నియోజకవర్గంలో పాలకులు, అధికారులు ప్రశ్నించే వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని.. పోలీసులు కూడా నాయకుల కొమ్ముకాస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఎస్పీ సునీతరెడ్డికి స్వయంగా కలిసి వివరించామని చెప్పారు. భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని జిల్లాకేంద్రంలో వైద్య, నర్సింగ్ కళాశాల, ఆస్పత్రి కోసం 50 ఎకరాలు కేటాయిస్తే.. అందులో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం చేసేందుకు సన్నాహాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. దూరదృష్టితో రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తే ఉద్దేశపూర్వకంగా పనులు నిలిపివేశారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్రెడ్డి హత్యకేసును పోలీసులు ఎందుకు ఛేదించడం లేదని.. ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వకుంటే ఆందోళన కార్యక్రమాలకు సిద్దమవుతామని హెచ్చరించారు. పెబ్బేరు సంత స్థల వివాదాన్ని నెలరోజుల్లో పరిష్కరిస్తామని చెప్పి రెండేళ్లు గడుస్తున్నా ఎందుకు పట్టించుకోవటం లేదన్నారు. యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం, పెబ్బేరు సంత స్థల వివాదాల విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు లేఖ రాయనున్నట్లు తెలిపారు. జిల్లాకేంద్రంలో రోడ్ల విస్తరణ చేపడితే.. కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలకు పాల్పడుతున్నారని, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం ప్రజలు గమనిస్తున్నారని, ప్రభుత్వ వైఫల్యాలకు కాలమే సమాధానం చెబుతుందన్నారు. రామన్నగట్టు రిజర్వాయర్కు శంకుస్థాపన చేసి నేటికీ పనులు ప్రారంభించలేదని, కేఎల్ఐ ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే డీ–5, డీ–8 కాల్వలను ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సాగునీటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం కావాలనే ఉద్దేశంతో గద్వాల, వనపర్తికి కలిపి ఇక్కడే సీఈ కార్యాలయం ఏర్పాటు చేశామని.. కనీసం అధికారులు వస్తున్నారా లేదా అనే విషయాన్ని సైతం పాలకవర్గం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మాజీ ఎంపీపీ కృష్ణానాయక్, నాయకులు నందిమళ్ల అశోక్, లక్ష్మారెడ్డి, ,రఘుపతిరెడ్డి, భీమన్న, తదితరులు పాల్గొన్నారు. -
హామీలన్నీ నెరవేరుస్తాం
వీపనగండ్ల: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్ఛయంతో ఉందని జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ అన్నారు. ఆదివారం మండలంలోని కల్వరాలలో సీసీ రహదారి నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించి మాట్లాడారు. ఉపాధిహామీ నిధులు రూ.16.50 లక్షలతో గ్రామంలో సీసీ రహదారి పనులు చేపడుతున్నామని.. మండలంలోని వివిధ గ్రామాల్లో కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో సీసీ రోడ్ల నిర్మాణాలకు ఎస్సీ సబ్ప్లాన్ నిధులు మంజూరయ్యాయని చెప్పారు. రహదారి నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ బండారి రాములు, ఉపసర్పంచ్ తడకల రంగమ్మ, వార్డు సభ్యులు చింతల రవికుమార్, శ్రీకాంత్, ఆంజనేయులు, సాయిప్రసాద్, మల్లేష్, వెంకటయ్య, పార్టీ సీనియర్ నాయకులు వెంకటరాజయ్య, అఖిల్పాషా, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. చిరు వ్యాపారులు, ఆర్టీసీ అధికారుల వాగ్వాదం వనపర్తి టౌన్: జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆదివారం చిరు వ్యాపారులు, ఆర్టీసీ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బస్టాండ్లోకి బస్సులు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆర్టీసీ సిబ్బంది కేసీ శెట్టి, కృష్ణయ్య, మహ్మద్ జాన్రాజ్ తదితరులు రహదారి పక్కన ఉన్న కూరగాయలు, పండ్ల విక్రయ దుకాణాలను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చిరు వ్యాపారులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బస్సుల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, ఖాళీ చేయాలని వారం రోజులుగా చెబుతున్నా వినిపించుకోవడం లేదని.. చివరకు చేసేది లేక తొలగించాల్సి వచ్చిందని ఆర్టీసీ సిబ్బంది తెలిపారు. చిరు వ్యాపారులకు కౌన్సిలర్లు ఏర్పుల రవి, మాజీ ఎంపీపీ పద్మమ్మ మద్దతుగా నిలిచి అధికారులతో వాదనకు దిగారు. ఒకదశలో ఆర్టీసీ సిబ్బంది రోడ్డుపై కూరగాయలు పారబోయడం, వ్యాపారులు ఆందోళన దిగడంతో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. ‘పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి’ వనపర్తి రూరల్: పట్టణాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దే పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని పెబ్బేరు పుర చైర్మన్ అక్కి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం పెబ్బేరు పుర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వైస్ చైర్మన్ సుమిత్రాఎల్లారెడ్డి, కౌన్సిలర్లతో కలిసి కార్మికులకు ప్రభుత్వం తరఫున నూనెలు, సబ్బులు పంపిణీ చేసి మాట్లాడారు. నిత్యం ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్న కార్మికులకు నూనెలు, సబ్బులే కాకుండా వారికి అవసరమయ్యే గ్లౌజులు, బూట్లు కూడా క్రమం తప్పకుండా అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు జమ్ములమ్మ, భాగ్యలక్ష్మి, పర్వీన్, హరిశంకర్నాయుడు, మన్యం, శివ తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదులు పెరుగుతున్నాయి..
వినియోగదారులు ఎవరైనా వస్తువులు కొనుగోలు చేసిన ప్రతి సందర్భంలో కూడా తప్పక బిల్లు తీసుకోవాలి. వస్తువు నాణ్యతలో లోపం ఉన్నా, ఇతర సమస్య ఏది ఉన్నా.. కోర్టుకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. కొనుగోలు చేసిన బిల్లు లేకపోతే చట్టపరంగా ఎదుర్కొవడానికి రాదు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఒకే ఒక్క కోర్టు ఉండటం వల్ల ఫిర్యాదులు పెరుగుతున్నాయి. జిల్లాలో ప్రతి రోజు హక్కుల ఫోరంకు రెండు నుంచి మూడు వరకు కేసులు వస్తుంటాయి. ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువులు, జీవిత భీమా, చిట్ఫండ్, ఫైనాన్స్లలో నష్టపోయిన వాళ్లు అధికంగా వస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణా ప్రాంతాల నుంచి ఎవరు రావడం లేదు.. పట్టణ ప్రాంతాల నుంచి అవగహన ఉన్న వ్యక్తులు మాత్రమే కేసులు వేయడానికి వస్తున్నారు. ఇంకా ప్రజల్లో దీనిపై చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. వచ్చిన కేసులు పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కారించడానికి కృషి చేస్తున్నాం. – అశోక్ వర్ధన్రాజు, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సూపరిటెండెంట్ తూకాల్లో మోసాలు తూనికల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతో వ్యాపారస్తులు తూకాల్లో తేడా చేస్తూ పేదలను మోసం చేస్తున్నారు. మరోపక్క వారాంతపు సంస్థలో బాట్లకు బదులు మోటు రాళ్లు పెట్టి తూకం చేసి వ్యాపారులు సామాన్యులతో భారీగా డబ్బులు గుంజుతున్నారు. అలాగే రైతులు పండించిన పంటలను దలారి వ్యాపారులు ఎలక్ట్రిక్ కాంటాల్లో మోసాలకు పాల్పడుతూన్నారు. తూనికల శాఖ అధికారులు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. – మోహన్ రెడ్డి, రైతు, మరికల్, నారాయణపేట జిల్లా తరచుగా తనిఖీలు చేపట్టాలి.. వ్యవసాయ మార్కెట్లతోపాటు ప్రైవేటు వ్యాపారుల వద్ద నిర్వహిస్తున్న కాంటాల్లో తేడాలు ఉంటున్నాయి. ప్రామాణికమైన తూకం రాళ్లకు బదులుగా సాధారణ బండరాళ్లను వినియోగిస్తున్నారు. తూకంలో తేడాలు వస్తున్నాయని ఫిర్యాదు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. లీగల్ మెట్రాలజీ అధికారులు తరచుగా తనిఖీలు చేపట్టాలి. – వర్దం సైదులు, అచ్చంపేట ● -
ప్రారంభమైన ‘పది’ పరీక్షలు
వనపర్తి టౌన్: జిల్లాలో శనివారం పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. మొదటిరోజు జరిగిన తెలుగు, ఉర్దూ పరీక్షకు జిల్లావ్యాప్తంగా 99.8 శాతం మంది విద్యార్థు లు హాజరయ్యారు. మొత్తం 37 కేంద్రాల్లో 7,219 మంది విద్యార్థులకుగాను 7,206 మంది పరీక్షల కు హాజరుకాగా.. 13 మంది గైర్హాజరయ్యారు. జి ల్లాకేంద్రంలోని అనూస్ పాఠశాల, చాణక్య పాఠశాల పరీక్ష కేంద్రాన్ని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, గోపాల్పేట మండలంలోని పరీక్ష కేంద్రాలను సహాయ పరీక్షల అధికారి గణేష్కుమార్ తని ఖీ చేశారు. ఐదు నిమిషాలు ఆలస్యమైనా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించారు. అరగంట ముందు నుంచే విద్యార్థులను తనిఖీ చేసి అనుమతించడంతో ఎక్కడా ఎవరు అసౌకర్యానికి గురికాలేదు. ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్యసిబ్బందితో పా టు తాగునీరు, విద్యుత్ అంతరాయం కలగకుండా అధికారులు కట్టదిట్టమైన ఏర్పాట్లు చేశారు. -
చేపలు విలవిల!
వేసవిలో ఆక్సిజన్ అందక మృతిచెందే ప్రమాదం ● జాగ్రత్తలు పాటిస్తే నియంత్రణ సాధ్యం ● అవగాహన కల్పిస్తామంటున్న మత్స్యశాఖ అధికారులు మృతిచెందిన చేపలు తొలగించాలి.. చెరువులో చనిపోయిన చేపలను తొలగించి చెరువుకు దూరంగా కాల్చివేయాలి లేదా గోతి తీసి పూడ్చిపెట్టాలి. వెంటనే సున్నమును హెక్టారుకు 100 నుంచి 250 కిలోల మోతాదులో చల్లాలి. అప్పటికీ అదుపులోకి రాకుంటే నీటినాణ్యత పెంచే రసాయనాలు అనగా బీకేఎస్ను హెక్టార్కు లీటరు చొప్పున నీటిలో కలిపి చెరువులో చల్లాలి. ఈ చర్యలతో నీటి నాణ్యత పెరగడమే కాకుండా చేపలపై ఉన్న పరాన్న జీవులు చనిపోతాయి. ప్రాణ వాయువు పెంచడానికి చెరువులోని నీటిని మోటార్ల ద్వారా రీసైక్లింగ్ చేయాలి. అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తే వేసవిలో చేపలు చనిపోకుండా ఉంటాయి. – డా. లక్ష్మప్ప, ఏడీ, మత్స్యశాఖ అమరచింత: జిల్లాలోని చెరువులు, కుంటలతో పాటు రిజర్వాయర్లలో మత్స్యకారులు చేపల పెంపకం చేపడుతున్నారు. వేసవిలో నీరు వేడెక్కి ఆక్సిజన్ అందక మృతిచెందే ప్రమాదం ఉంటుంది. తగిన ముందస్తు చర్యలు చేపడితే చేపలు మృతి చెందకుండా నివారించే అవకాశం ఉందని మత్స్యశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈసారి రాయితీ చేప పిల్లల పంపిణీ ఆలస్యం కావడంతో ఎదుగుదల లేక మత్స్యకారులు ఆందోళన చెందుతున్న తరుణంలోనే ఎండల తీవ్రత పెరుగుతోంది. దీంతో ఉన్న చేప పిల్లలను ఎలా బతికించుకోవాలని సతమతమవుతున్నారు. వేసవిలో అధిక ఉష్ణ్రోగ్రత, చేపల సాంద్రత అధికంగా ఉండటం, నీరు క్రమేపి తగ్గడంతో నీటిలో ప్రాణవాయువు కొరత, నాణ్యత తగ్గిపోవడం తదితర కారణాలతో చేపలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటాయి. రోగకారక సూక్ష్మజీవులతో వ్యాధులు వ్యాపించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కావున మత్స్యకారులు ముందస్తు చర్యలు చేపట్టాల్సి ఉందని అధికారులు వివరించారు. నిషితంగా పరిశీలిస్తే.. చెరువులోని నీటి నాణ్యత, లోతు, విస్తీర్ణం, చేపల కదలికలను రోజు గమనిస్తూ ఉండాలి. మచ్చుకు కొన్ని చేపలు పట్టి వాటి పెరుగుదల, రంగు, తోక, రెక్కల స్వభావంతో పాటు మొప్పల రంగు, పై జిగురు లక్షణాలను నిశితంగా పరిశీలించాలి. తేడాలు గమనించిన తర్వాత సంబంధిత మత్స్యశాఖ అధికారి సలహాలు, సూచనలు తీసుకొని నివారణ చర్యలు సత్వరమే చేపడితే ఆర్థిక నష్టాన్ని కొంతమేర తగ్గించుకోవచ్చు. -
సోదరభావానికి ప్రతీక రంజాన్
వనపర్తి: పవిత్ర రంజాన్ మాసం పరస్పర ప్రేమ, సోదరభావానికి ప్రతీక అని.. ముస్లింలు పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల్ల చిన్నారెడ్డి కోరారు. రంజాన్ మాసం పురస్కరించుకొని శనివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్కు ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఇఫ్తార్లో పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపి పలువురికి రంజాన్ తోఫా అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో ఐక్యత పెంపొందించే పండుగగా రంజాన్ ప్రత్యేక స్థానం కలిగి ఉందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. ఉపవాసం ద్వారా ఆత్మ నియంత్రణతో పాటు పేదలపై సానుభూతి పెంపొందుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవం, సహకారంతో సమాజ అభివృద్ధికి కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రంజాన్ శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ మాధవి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ముజహిద్, ముస్లిం మతపెద్దలు అఫ్జలుద్దీన్, రహీం, ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం సరికాదు
● ప్యాకేజీ–16 కాల్వ పనుల్లో జాప్యంపై ఆగ్రహం ● రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి: కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పారదర్శకత పాటించాలని రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో ఏదుల, పాన్గల్, చిన్నంబావి, వీపనగండ్ల మండలాల సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీడీఓలు, డీపీఓ, డీఎల్పీఓలతో మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని హౌసింగ్ పీడీ, ఏఈలను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను స్వయంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నారు. గ్రామపంచాయతీలకు వచ్చే నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రాధాన్యత క్రమంలో ఏయే పనులకు ఎంత వెచ్చించాలో వివరిస్తూనే గ్రామాభివృద్ధిలో అధికారుల పాత్ర అత్యంత కీలకమన్నారు. అనంతరం నీటిపారుదలశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాలు, కాల్వల లైనింగ్, డిస్ట్రిబ్యూషన్ పనుల పురోగతిపై చర్చించారు. ప్యాకే జీ–16 కాల్వ పనుల్లో జరిగిన అవకతవకలపై సీఈ, ఎస్ఈ స్థాయి అధికారులను నిలదీశారు. పను ల్లో నాణ్యత లోపించడం, నిధుల దుర్వినియోగంపై అస హనం వ్యక్తం చేస్తూ ఈ అంశాన్ని రాష్ట్ర సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ప్యాకేజీ–16కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వెంటనే అందజేయాలని ఆదేశిస్తూ త్వరలోనే తాను క్షేత్రస్థాయిలో పర్యటించి పనులు పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
ఎస్ఐఆర్ మ్యాపింగ్ వేగవంతం
వనపర్తి: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా 2025 ఓటరు జాబితాను 2002 ఎస్ఐఆర్తో మ్యాపింగ్ చేసే ప్రక్రియ వేగంగా చేపడుతున్నామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్రెడ్డి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్, ఆర్డీఓ సుబ్రమణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటి వరకు 67 శాతం పూర్తయిందని, పెండింగ్ పని త్వరగా పూర్తి చేస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. వనపర్తి మండలంలో మ్యాపింగ్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని.. బూత్ లెవల్ అధికారులు తమ బాధ్యతలను కచ్చితంగా నిర్వర్తించాలన్నారు. పనులను నిర్లక్ష్యం చేసే అధికారులకు నోటీసులు జారీ చేయడంతో పాటు అవసరమైతే వేతనాలు నిలిపివేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో డి సెక్షన్ సూపరింటెండెంట్ మదన్, తహసీల్దార్ రమేష్రెడ్డి, రెవెన్యూ సిబ్బంది రాజేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. వంట గ్యాస్ కొరత లేదు.. జిల్లాలో సాగు, తాగునీరు, విద్యుత్, గృహ అవసరాలు, విద్యాలయాలు, ఆస్పత్రులకు అవసరమైన ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదని, అవసరమైన మేరకు సరఫరా చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన రాష్ట్ర ఇరిగేషన్, పౌర సరఫరాలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల సమస్య లేదని, విద్యాలయాలు, ఆస్పత్రులకు సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వంట గ్యాస్ను 15 రోజులకు బదులు 25 రోజులకు బుక్ చేసుకునేలా అవకాశం కల్పించామన్నారు. యాసంగి పంటల కోతలు వారం రోజుల్లో ప్రారంభం అవుతాయని.. సాగునీటి సమస్యలు ఎక్కడా ఉత్పన్నం కాలేదని చెప్పారు. తాగునీటికి సైతం ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ముందస్తుగానే గోదాంలు, అవసరం మేరకు గన్నీ బ్యాగులు సమకూర్చడంపై దృష్టి సారిస్తామన్నారు. వీడియో కాన్ఫరెనన్స్లో ఎస్పీ డి.సునీతరెడ్డి, ఇరిగేషన్శాఖ సీఈ నాగేందర్, ఎస్ఈ చంద్రశేఖర్, ఈఈ కేశవరావు, పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, ఆర్డీఓ సుబ్రమణ్యం, వ్యవసాయ అధికారి ఆంజనేయులు, ఉద్యాన అధికారి విజయభాస్కర్, ఈఈ మిషన్ భగీరథ ఎండీ అంజాద్పాషా తదితరులు పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలో వృద్ధుల కోసం ఏర్పాటుచేసిన డేకేర్ సెంటర్లో కావాల్సిన వసతులు కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని రాంనగర్లో ఏర్పాటు చేసిన సీనియర్ సిటిజన్ డేకేర్ సెంటర్ ‘ప్రణామ్’ను ఆయన సందర్శించారు. కేంద్రంలోని వసతులను పరిశీలించి అక్కడే ఉన్న పలువురు సీనియర్ సిటిజన్లతో మాట్లాడారు. వారికి అందిస్తున్న సేవల గురించి తెలుసుకుని అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు. డేకేర్ సెంటర్ను ఉగాది నాటికి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. ఆయన వెంట జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, తహసీల్దార్ రమేష్రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
యూరియా అధిక ధరకు విక్రయిస్తే చర్యలు
పాన్గల్: యూరియాను ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు హెచ్చరించారు. మండలంలోని దావాజిపల్లిలో ఉన్న ఎన్వీ ట్రేడర్స్ దుకాణంలో యూరియా బస్తాలను అధిక ధరకు విక్రయిస్తున్నారనే ఫిర్యాదు మేరకు శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, స్టాక్ నిల్వను పరిశీలించారు. రూ.270 బస్తాను రూ.320కి విక్రయిస్తున్నట్లు రుజువు కావడంతో దుకాణ యజమానికి నోటీసులు ఇవ్వడంతో పాటు ఏడీఏకు మెమో జారీ చేశారు. యజమాని ఇచ్చే సమాధానం, మండల వ్యవసాయ అధికారులు ఇచ్చే నివేదికను కలెక్టర్కు అందజేసి ఆయన ఆదేశం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం మాట్లాడుతూ.. అన్ని దుకాణాల్లో యూరియాను ఎమ్మార్పీ ధరకే విక్రయించాలని, అధిక ధరకు విక్రయిస్తే దుకాణ యజమానిపై చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. ఆయన వెంట ఏఓ మణిచందర్ తదితరులు ఉన్నారు. -
డిమాండ్ నోటీసులు అందించాం..
బీడీ కార్మికుల వేతనాలు పెంచాలంటూ చిన్నచింతకుంటలో భారీ ప్రదర్శన నిర్వహించి బీడీ ఫ్యాక్టరీ యాజమాన్యాలకు వేతన పెంపు డిమాండ్ నోటీసులు అందించాం. వెయ్యి బీడీల తయారీకి రూ.400 చెల్లించాలని కోరాం. దీంతోపాటు పీఎఫ్, ఈపీఎఫ్ ప్రతి కార్మికుడికి వర్తింపచేజేయాని విన్నవించాం. – రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు, ప్రగతిశీల బీడీ కార్మిక సంఘం, అమరచింత నెలలో 20 పనిదినాలు ఉండగా.. 15 వేల బీడీలు తయారు చేస్తున్నాం. కుటుంబ పోషణ బీడీల తయారీపైనే ఆధారపడింది. వెయ్యి బీడీల తయారీకి రూ.290 చెల్లిస్తున్నారు. కూలి సరిపోక పోషణ భారంగా మారింది. ప్రస్తుతం కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. అందుకు అనుగుణంగా రూ.400 చెల్లిస్తే బాగుంటుంది. – సులోచనమ్మ, బీడీ కార్మికురాలు, అమరచింత చాలీచాలని కూలితో ఇబ్బందులు పడుతున్నా ం. యాజమాన్యం వెంటనే ధరలు పెంచాలి. అలాగే జరిమానాను పూర్తిగా రద్దు చేయాలి. పొద్దంతా కూర్చొని తయారుచేసిన వెయ్యి బీ డీలకు రూ.400 చెల్లించాలి. లేనిపక్షంలో కార్మిక సంఘంతో కలిసి ఆందోళన చేపడతాం. – సరోజ, బీడీ కార్మికురాలు, మస్తీపురం ● -
రాయితీ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తి: జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులు స్వయం ఉపాధి పొందేందుకు ఎస్సీ కార్యాచరణ ప్రణాళిక 2025–26 కింద రాయితీ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల షెడ్యూల్డ్ కులాల యువత ఈ నెల 17 నుంచి 24వ తేదీ వరకు ఆధార్, రేషన్కార్డు, కులం, ఆదాయం, విద్యార్హత ధ్రువపత్రాలతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోతో మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వ్యవసాయేతర పథకాలకు 21 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వారు, వ్యవసాయ పథకాలకు 21 ఏళ్ల నుండి 60 ఏళ్లలోపు, శిక్షణ పథకాలకు 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. సంవత్సర ఆదాయం గ్రామీణులకు రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు మించరాదని, ఐదేళ్లలో ఎస్సీ కార్పొరేషన్ నుంచి లబ్ధిపొందిన కుటుంబాలు అనర్హులని, ఒక కుటుంబంలో ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు పత్రాలను ఎస్పీ కార్పొరేషన్ వనపర్తి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు http://obmms.cgg.gov.in వెబ్సైట్లో గా ని, కార్యాలయంలోగాని సంప్రదించాలన్నారు. ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలి పాన్గల్: గ్రామాల్లోని ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్ కోరారు. పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యల గుర్తింపులో భాగంగా శుక్రవారం మండలంలోని బుసిరెడ్డిపల్లి, జమ్మాపూర్లో పర్యటించి ఉపాధి కూలీలు, స్థానిక సమస్యలపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూలీలకు ఇబ్బందికరంగా ఉన్న వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దుచేసి పాత చట్టానే పునరుద్ధరించాలన్నారు. కూలీలకు 8 వారాలకుపైగా కూలి డబ్బులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఉపాధి కూలీల సమస్యలు, స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న మండలస్థాయిలో నిర్వహించే ధర్నాకు కూలీలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెల్లరాళ్లపల్లి సర్పంచ్ జంబులయ్య, నాయకులు భీమయ్య, రాము, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు. ‘ఇందిరమ్మ ఇంటి’ బిల్లుల కోసం లంచం డిమాండ్ అయిజ: ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించి బిల్లు చేసేందుకు లంచం తీసుకుంటూ ఓ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కాడు. జోగుళాంబ గద్వాల జిల్లాలో అయిజ మండలంలోని ఎక్లాస్పురం గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న బోయ రంగన్న ఇంటి నిర్మాణానికి సంబంధించిన బిల్లు చేసేందుకు లబ్ధిదారుల నుంచి రూ.20 వేలు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంల సమీపంలో లబ్ధిదారుల నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రైడ్ చేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి మొదటి విడత బిల్లు చెల్లించేందుకు, తదుపరి మూడు వాయిదాలకు అంతరాయం లేకుండా బిల్లులు చెల్లించేందుకు రూ.20 వేలు డిమాండ్ చేశారని, లబ్ధిదారుల అభ్యర్థన మేరకు రూ.15 వేలకు ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఓ ఫిర్యాదుదారుడు ఇచ్చిన సమాచారం మేరకు ఏసీబీ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకొని, అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్లో జడ్జి ముందు హాజరు పరుస్తామని తెలిపారు. ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. వేరుశనగ క్వింటా రూ.8.519 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో శుక్రవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.8,519, కనిష్టంగా రూ.4,001 ధరలు లభించాయి. అదేవిధంగా కందులకు రూ.5,889, జొన్నలు రూ.5,273, పెబ్బర్లు రూ.4,850, ఆముదాలు రూ.6,144, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,840, కనిష్టంగా రూ.1,631, ధాన్యం హంస రూ.1,891, ఆర్ఎన్ఆర్ రూ.2,051 ధరలు పలికాయి. -
ముగిసిన ఇంటర్ పరీక్షలు
వనపర్తి విద్యావిభాగం: జిల్లాలో ఇంటర్మీడియట్ జనరల్ పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. చివరిరోజు రెండో సంవత్సరం విద్యార్థులకు రసాయన శాస్త్రం, కామర్స్ పరీక్షలు జరిగాయి. జిల్లావ్యాప్తంగా 5,555 మంది విద్యార్థులకుగాను 5,389 మంది విద్యార్థులు హాజరుకాగా.. 166 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విద్యార్థులు 4,705 మందికిగాను 4,590 మంది హాజరుకాగా.. 115 మంది పరీక్ష రాయలేదు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు 850 మందికిగాను 799 పరీక్ష రాయగా.. 51 మంది గైర్హాజరయ్యారు. డీఐఈఓ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులను తనిఖీ చేస్తున్న తీరును పరిశీలించారు. స్కాలర్స్, విజ్ఞాన్, జాగృతి, వాగ్దేవి, సీవీ రామన్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. అన్ని కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు. -
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
కొత్తకోట: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం పుర కేంద్రంలో నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమాలు, 2కే రన్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చేందుకు రూపొందించబడిందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని.. డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. చదువుకునే వయస్సులో చెడు వ్యసనాల బారిన పడకుండా క్రమశిక్షణ, మంచి ఆశయాలతో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ అరుణ శ్రీనివాస్, వైస్ చైర్మన్ పల్లవి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. -
‘పది’ పరీక్షలు.. పకడ్బందీ ఏర్పాట్లు
● నేటి నుంచి ప్రారంభం ● ఏర్పాట్లను పర్యవేక్షించిన అధికారులు ● ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి వనపర్తిటౌన్: జిల్లాలో శనివారం నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు.. ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 నుంచి 11 వరకు జరగనున్నాయి. జిల్లావ్యాప్తంగా 7,212 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. ఇందులో బాలురు 3,577 మంది, బాలికలు 3,635 మంది ఉన్నారు. వీరితో పాటు ప్రైవేట్ విద్యార్థులు 16 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 37 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 25 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల్లో, 12 కేంద్రాలు ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నాయి. అత్యధికంగా జిల్లాకేంద్రంలో 9, కొత్తకోటలో 5, పెబ్బేరు 4, ఆత్మకూర్లో 3, వీపనగండ్ల, చిన్నంబావి, రేవల్లిలో ఒక్కోటి, మిగతా మండలాల్లో రెండేసి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా.. ప్రశ్నపత్రాలను వాటి ముందే నిర్దేశిత సమయంలో తెరవనున్నారు. కేంద్రాల్లోకి సీఎస్, డీఓల మొదలుకొని ఎవరికి సెల్ఫోన్ అనుమతించ లేదు. జిల్లాలోని అన్ని కేంద్రాల్లో శుక్రవారం హాల్టికెట్ నంబర్ల నమోదు ప్రక్రియ పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని పలు కేంద్రాలను జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, సహాయ పరీక్షల అధికారి గణేష్కుమార్ పరిశీలించి సీఎస్, డీఈలకు పలు సూచనలు చేశారు. ప్రతి కేంద్రంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బెంచీలు, తాగునీరు, పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టారు. గ్రామపంచాయతీ, పుర పారిశుద్ధ్య కార్మికులతో ఆవరణలను శుభ్రం చేయించారు. విద్యార్థులను అరగంట ముందే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి ఉంటుందని.. దాటిన తర్వాత అనుమతించమని అధికారులు తెలిపారు. కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, స్మార్ట్ వాచ్లను అనుమతించమని చెప్పారు. పరీక్షల నిర్వహణకుగాను 375 మంది ఇన్విజిలేటర్లు, 37 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, మరో 37 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారు. సిట్టింగ్ స్క్వాడ్లు, పోలీస్, రెవెన్యూ, విద్యాశాఖ అధికారులతో కలిపి ముగ్గురి చొప్పున రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించనున్నాయి. పరీక్ష సమయంలో కేంద్రాల ఆవరణలో 144 సెక్షన్ అమలులో ఉండటంతో పాటు సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రతి కేంద్రంలో వైద్య సేవల కోసం ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉండనున్నారు. గురుకుల విద్యార్థులు 996 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 115 -
సమస్యల పరిష్కారమే లక్ష్యం..
● సర్పంచ్లు, కౌన్సిలర్లు బాధ్యతగా పనిచేయాలి ● రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి: సర్పంచులు, కౌన్సిలర్లు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసి వారి మెప్పు పొందాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని కళ్యాణసాయి గార్డెనన్స్లో ’ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఎన్నికై న సర్పంచులు, కౌన్సిలర్లకు నిర్వహించిన ఒకరోజు శిక్షణకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరుకాగా.. కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతరెడ్డి, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, మధుసూదన్రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీసుకొచ్చారని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా రోజు ఉదయం 2 గంటల పాటు 20 నుంచి 30 ఇళ్లను సందర్శించి సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాలన్నారు. రాబోయే రోజుల్లో నిర్వహించే గ్రామసభల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు రుణమాఫీ, రైతుభరోసా, సన్న వడ్లకు బోనస్, గృహజ్యోతి, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్ల పథకాల గురించి ప్రజలకు వివరించాలని కోరారు. అధికారులు కూడా ప్రజల నుంచి వచ్చే ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా నమోదు చేయాలని.. ఏ ఒక్క దరఖాస్తు కూడా 15 రోజులకు మించి పెండింగ్లో ఉండకూడదని ఆదేశించారు. అధికారులు జవాబుదారీగా పని చేయాలని కోరారు. స్వచ్ఛతకు ప్రాధాన్యమివ్వాలి.. ప్రజాప్రతినిధులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తమ కార్యాలయాలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. గ్రామాలు, వార్డుల్లో నీరు, విద్యుత్ వృథాను అరికట్టాలని కోరారు. తమ పరిధిలోని పాఠశాలలు, ఆస్పత్రుల్లో సమస్యలు ఉంటే పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి జిల్లాను అన్నిరంగాల్లో ముందువరుసలో నిలపాలని కోరారు. అనంతరం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ.. రెండున్నర ఏళ్లలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఏప్రిల్లో నిర్వహించే గ్రామసభల ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల బంధం దృఢంగా ఉండేందుకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని చెప్పారు. సమావేశంలో వనపర్తి మార్కెట్యార్డ్ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూర్, అమరచింత పుర చైర్పర్సన్లు మాధవి, అరుణ, శ్రీనివాస్గౌడ్, నాగమణి, జింక సువర్ణ, సర్పంచులు, కౌన్సిలర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పంటలు ఎండితే అధికారులదే బాధ్యత
● రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వనపర్తి టౌన్: ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ఆయకట్టులో సాగు చేసిన వరి పంటలకు సరిపడా నీరందక రైతులు ఆందోళన చెందుతున్నారని.. ఇందుకు కారణం సాగునీటిశాఖ అధికారులేనని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి ఆరోపించారు. గురువారం జిల్లాకేంద్రంలో జరిగిన కాంగ్రెస్పార్టీ పట్టణ, మండల కార్యవర్గాల ఎన్నిక కార్యక్రమానికి ఆయనతో పాటు ఎమ్మెల్యే తూడి మేగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. వర్షాకాలంలో వరద నీటిని ఎత్తిపోతల పథకాల ద్వారా రిజర్వాయర్లకు తరలించడంలో అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు. ఇటీవల అధికారుల సమీక్షలో కూడా ఇదే విషయాన్ని చెప్పానన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసినట్లు అవినీతికి పాల్పడితే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని అధికారులను హెచ్చరించారు. కాంగ్రెస్పార్టీలో నిబద్ధతగల నాయకులకు గుర్తింపు ఉంటుందని.. అందుకు ఉదాహరణ డీసీసీ అధ్యక్షుడిగా శివసేనారెడ్డి ఎన్నిక అని గుర్తు చేశారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పనితీరు బాగుందని.. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారని, ప్రజలకు చేరువవుతున్నారని కొనియాడారు. తనకు ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజావాణి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించి గుర్తింపు, గౌరవం ఇచ్చారని పేర్కొన్నారు. పార్టీ గ్రామ, మండల, పట్టణ కమిటీల్లో నిబద్దతగల కార్యకర్తలకే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. పనిచేసే వారికి ఎప్పుడు గుర్తింపు, గౌరవం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. పేదలందరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఉచిత విద్యుత్తో సీఎం రేవంత్రెడ్డికి ప్రజల్లో మంచిపేరు వచ్చిందన్నారు. డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తలు క్రమశిక్షణ, నిబద్ధతతో పని చేయాలని సూచించారు. కార్యకర్తల కోసం తాము పని చేస్తామని.. ఎప్పుడు ఫోన్చేసినా అందుబాటులో ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, పార్టీ పట్టణ, మండల నాయకులు పాల్గొన్నారు. -
ఆధునిక సాగుతోనే అధిక లాభాలు
మదనాపురం: రైతులు మూస పద్ధతికి స్వస్తి పలికి శాస్త్రవేత్తల సూచనల మేరకు ఆధునిక సాంకేతికతను జోడించి పంటలు సాగు చేపట్టినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన రైతులు, శాస్త్రవేత్తల ముఖాముఖి కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఆయనతో పాటు కేవీకే శాస్త్రవేత్త రాజేందర్రెడ్డి, సహాయ వ్యవసాయ సంచాలకుడు దామోదర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. వ్యవసాయంలో ‘ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్’ ప్రాధాన్యం వివరిస్తూ నీటి పారుదలలో మెళకువలు పాటించాలని సూచించారు. వరికి బదులుగా మార్కెట్లో డిమాండ్ ఉన్న, దీర్ఘకాలిక ఆదాయాన్నిచ్చే ఆయిల్పాం వంటి పంటలు సాగు చేయాలని సూచించారు. వరి గడ్డిని తగులబెట్టడంతో కలిగే నష్టాలను వివరిస్తూ పచ్చిరొట్ట ఎరువుల వినియోగం, సేంద్రియ సాగు చేపట్టాలని ప్రోత్సహించారు. రాబోయే వానాకాలం సీజన్కు అనుకూలమైన విత్తన రకాల గురించి శాస్త్రవేత్తలు వివరించారు. ప్రతి మంగళవారం నిర్వహించే ‘రైతునేస్తం‘ కార్యక్రమానికి రైతులు విధిగా హాజరుకావాలని.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, నూతన సాగు పద్ధతుల గురించి తెలుసుకునేందుకు ఇది మంచి వేదికని అన్నారు. కార్యక్రమంలో ఏఓలు గాయత్రి, అరవింద్, ఏఈఓలు, ఆత్మకూర్, అమరచింత, మదనాపురం, కొత్తకోట మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. -
మాజీ ఎంపీ చొరవతోనే కేంద్రీయ విద్యాలయం
వనపర్తి టౌన్: బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు కృషి ఫలితంగానే జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరైందని.. ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్ని తానే చేశానని ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేయడం సిగ్గుచేటని బీజేపీ జిల్లా అధ్యక్షులు డి.నారాయణ ఆరోపించారు. గురువారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2025, అక్టోబర్ 10న దేశవ్యాప్తంగా 57 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని.. అందులో భాగంగానే జిల్లాకేంద్రం సమీపంలోని నాగవరం శివారులో ఏర్పాటు జరగనుందని వివరించారు. నూతన భవన నిర్మాణం జరిగే వరకు రాజపేట శివారులోని యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ)లో ప్రారంభించనున్నట్లు చెప్పారు. ధైర్యం ఉంటే కేంద్రీయ విద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది, భవిష్యత్లో భవన నిర్మాణం, ఇతర అవసరాలకు ఎన్ని కేటాయిస్తుందో పూర్తి వివరాలతో బహిరంగ చర్చకు సిద్ధంగా కావాలని సవాల్ విసిరారు. రెండేళ్లయిన సొంత మండలానికి బీటీ రోడ్డు వేసుకోలేని ఎమ్మెల్యే నియోజకవర్గానికి రూ.వెయ్యి కోట్లు తెచ్చారంటే నమ్మడానికి ప్రజలు అమాయకులు కారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు బాశెట్టి శ్రీనివాసులు ఎస్సీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షుడు ఆగపోగు కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అదనపు భారం..
ఉద్యోగరీత్యా రోజు దుప్పల్లి పాఠశాలకు వెళ్లాలి. బస్సులు మదనాపురం రైల్వేస్టేషన్ దగ్గరే నిలిపివేస్తున్నారు. దీంతో అక్కడే దిగి కిలోమీటర్ నడిచి ఆత్మకూర్ రోడ్ వద్ద ఆటోలో వెళ్లాల్సి వస్తోంది. రాకపోకలకు అదనపు భారం పడుతోంది. అధికారులు స్పందించి త్వరగా పనులు త్వరగా పూర్తిచేసి గేట్ తెరవాలి. – ఆంజనేయులు, ఉపాధ్యాయుడు పనుల్లో జాప్యం సరికాదు. గేటు మూసివేయడంతో వాగులో దుమ్ము, బురదలో వాహనం నడపాల్సి వస్తోంది. చాలామంది ద్విచక్ర వాహనదారులు గేట్ మూసి ఉన్నా అలాగే రైల్వే ట్రాక్ దాటిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. మూడు రోజులు అని చెప్పి ఐదు రోజులైనా పూర్తి చేయడం లేదు. – వంగూరు రామకృష్ణారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు సాంకేతిక కారణాలతో పనుల్లో కాస్త జాప్యం జరిగింది. ట్రాక్ వద్ద పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. మరో రెండ్రోజుల్లో రాకపోకలు పునరుద్ధరిస్తాం. ప్రయాణికులకు కలిగిన ఇబ్బందికి చింతిస్తున్నాం. సోమవారం గేటు తెరిచే ప్రయత్నం చేస్తాం. – రవికుమార్, రైల్వే సెక్షన్ ఇంజినీర్ -
వ్యాధి నిరోధక శక్తి పెంపునకే టీకాలు
పాన్గల్: పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించేందుకు టీకాలు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి డా. వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని పశువులకు టీకాలు వేశారు. అనంతరం మాట్లాడుతూ.. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో పశువులకు ఉచితంగా అందిస్తున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు అందుబాటులో ఉండి తమ పశువులకు టీకాలు వేయించాలన్నారు. అదేవిధంగా మండలంలోని చింతకుంట, రాయినిపల్లిలో పశువైద్య సిబ్బంది టీకాలు వేశారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డా. సురేష్, చింతకుంట సర్పంచ్ కోట్ల రాములు, పశువైద్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. కార్మికుల వేతనాలు పెంచాలి ఆత్మకూర్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న కార్మికుల వేతనాలు రూ.26 వేలకు పెంచాలని, వారి సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సురేశ్ కోరారు. గురువారం స్థానిక కమ్యూనిటీ హెల్త్సెంటర్ వద్ద కార్మికులతో కలిసి ఆయన మాట్లాడారు. స్థానిక ఆస్పత్రిని 23 నుంచి 30 పడకలకు పెంచాలని గతంలో డిమాండ్ చేయగా.. మంత్రి వాకిటి శ్రీహరి కృషితో తెలంగాణ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ ఉత్తర్వులు వెలువరించారని వివరించారు. ఈ సందర్భంగా మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు, మెడికల్ కార్మికులు ఏళ్ల తరబడి కనీస వేతనాలకు నోచుకోక వెట్టిచాకిరి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ వేతనాల్లో కోత విధిస్తూ కార్మికుల కడుపు కొడుతున్నారని ఆరోపించారు. ఏజెన్సీని వెంటనే రద్దు చేసి జీఓ ప్రకారం వేతనాలు చెల్లించేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సత్తార్, బాలరాజు, శ్రీకాంత్, అరుణ్, శైలజ, బాలకిష్టమ్మ, నాగమ్మ, పార్వతమ్మ, మైనుద్దీన్, తిరుపతమ్మ, చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ఇంటర్ ఫస్టియర్ జనరల్ పరీక్షలు వనపర్తి విద్యావిభాగం: ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ పరీక్షలు గురువారం ముగిశాయి. చివరిరోజు రసాయనశాస్త్రం, కామర్స్ పరీక్షలు జరగగా 6,503 మంది విద్యార్థులకుగాను 6,222 మంది హాజరుకాగా.. 281 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విద్యార్థులు 5,491 మందికిగాను 5,283 మంది పరీక్ష రాయగా.. 208 మంది హాజరుకాలేదు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు 1,012 మందికిగాను 939 మంది హాజరుకాగా.. 73 మంది రాయలేదు. డీఐఈఓ ఎర్ర అంజయ్య జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలికల, ఉర్దూ మీడియం, రావూస్, అభ్యాస్, త్రివేణి జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. అలాగే డీఈసీ బృందం కొత్తకోటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, నివేదిత, శ్రీప్రతిభ, ఆత్మకూర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, వికాస్, వనపర్తిలోని విజ్ఞాన్, స్కాలర్స్, సూర్య, ప్రభుత్వ జూనియర్ కళాశాల, గోపాల్పేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసింది. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం పెద్దమందడి, వాగ్దేవి, సీవీ రామన్, జాగృతి కళాశాల పరీక్ష కేంద్రాలను.. సిట్టింగ్ స్క్వాడ్ బృందం కొత్తకోట, గోపాల్ పేట, వనపర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించింది. -
28న జాతీయ లోక్ అదాలత్
వనపర్తి విద్యావిభాగం: జిల్లాలోని కోర్టుల్లో ఈ నెల 28న నిర్వహించే జాతీయ లోక్అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి వి.రజని కోరారు. గురువారం జిల్లాకేంద్రంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్యానల్ లాయర్లు, ఇన్సూరెన్స్ స్టాండింగ్ కౌన్సిల్స్, పిటిషనర్ అడ్వొకేట్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. లోక్ అదాలత్లో పరిష్కారమయ్యే కేసుల్లోని కక్షిదారులతో మాట్లాడి రాజీ కుదిర్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ న్యాయమూర్తి కళార్చన, అడిషనల్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి కార్తీక్రెడ్డి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి శ్రీలత, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి నాగ అశ్విని పాల్గొన్నారు. -
రిజర్వాయర్ నిర్మాణాల్లో వేగం పెంచాలి
వనపర్తి: జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూ సేకరణ, ఇతర పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్నాయుడు ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి నీటిపారుదల, రెవెన్యూశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి భూ సేకరణకు సంబంధించిన పెండింగ్ అంశాలు, పునరావాస పనుల పురోగతి తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. గణప సముద్రం రిజర్వాయర్కు సంబంధించి 197 ఎకరాల ఎంజాయ్మెంట్ సర్వే పూర్తిచేసి ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా కర్నె తండా ఎత్తిపోతలకు సంబంధించి పెండింగ్లో ఉన్న 26 ఎకరాల భూ సేకరణకు పెగ్ మార్కింగ్ 14వ తేదీలోగా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద డీ–1, డీ–5, డీ–8, ప్యాకేజీ 29కు సంబంధించి 92 ఎకరాల భూ సేకరణకు పెగ్ మార్కింగ్ వారంలోగా పూర్తి చేయాలన్నారు. ఖిల్లాఘనపురం బ్రాంచ్ కాల్వ నిర్మాణానికి మార్కింగ్ పూర్తయిన 31 ఎకరాల ఎంజాయ్మెంట్ సర్వే పూర్తి చేయాలని సర్వేశాఖ అధికారులను ఆదేశించారు. అంతకుముందు కొత్తకోట మండలం కానాయిపల్లి ఆర్అండ్ఆర్ సెంటర్తో పాటు శంకరసముద్రాన్ని సందర్శించి పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో నీటిపారుదలశాఖ చీఫ్ ఇంజినీర్ నాగేందర్, ఎస్ఈ చంద్రశేఖర్, ఈఈ కేశవరావు, ఆర్డీఓ సుబ్రమణ్యం, సర్వే ఏడీ శ్రీనివాసులు, ఇతర రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు. కొత్తకోట రూరల్: శంకరసముద్రం ముంపు గ్రామమైన కానాయపల్లి పునరావ కేంద్రాన్ని ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్నాయుడు గురువారం సందర్శించారు. మొదట బండ్ లోపల ఉన్న ఇళ్లను పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో కలిసి పునరావాస కేంద్రంలోని రోడ్లు, ప్లాట్లను పరిశీలించారు. గ్రామస్తులు సమస్యలను కమిషనర్కు విన్నవించగా త్వరలోనే పరిష్కారం లభిస్తుందని సమాధానమిచ్చారు. ఆయన వెంట ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ చాంద్పాషా, నాయకులు పి.కృష్ణారెడ్డి, శేఖర్రెడ్డి, గ్రామస్తులు జితేందర్రెడ్డి, నరోత్తంరెడ్డి, భీమన్ననాయుడు, గోకరయ్య, నాగరాజు, బాలరాజు, శ్రీనివాసులు ఉన్నారు. -
‘ఉపాధిహామీ’పై నిర్లక్ష్యం తగదు
అమరచింత: కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంపై వివక్ష చూపుతూ లక్ష్యాన్ని నీరుగార్చే కుట్రలు చేస్తోందని.. ఉపాధి కూలీలకు అండగా నిలుస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ తెలిపారు. బుధవారం మండలంలోని పాంరెడ్డిపల్లి శివారులో ఉపాధి పని ప్రదేశంలో కూలీలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని వీబీజీ రాంజీగా పేరు మార్చి జీఓ తీసుకురావడం దారుణమన్నారు. కొత్త చట్టంతో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు భరించాలనే నిబంధన విధించడం సిగ్గుమాలిన చర్యగా అభి వర్ణించారు. అదేవిధంగా సంక్రాంతి నుంచి పనులు చేస్తున్నా కూలి డబ్బుల అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పని ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించలేని స్ధితిలో ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండలు ముదురుతున్నందున నీడ కోసం షేడ్నెట్లు ఏర్పాటు చేయాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలని కోరారు. రోజువారి కూలి రూ.307 చెల్లిస్తున్నారని.. మారుతున్న కాలానికి అనుగుణంగా రూ.800 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏడాదికి 200 పనిదినాలు, రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పనులు తొలగించడంతో వ్యవసాయ కూలీలు పనులు దొరకక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. మున్సిపల్, అర్బన్ ప్రాంతాల్లో సైతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పని అడిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని.. లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చామన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జీఎస్ గోపి, మహమూద్, వెంకటేష్, అజయ్, రాఘవేంద్ర, బుచ్చన్న, శంకర్రాజు, విజయ్, అనంతమ్మ, మణెమ్మ తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని అంతమొందిస్తున్నామనే సాకుతో అమెరికా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద దేశంగా మారిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విమర్శించారు. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయిల్ సైనిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఇరాన్పై జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటం ఏమిటని ప్రశ్నించారు. అమెరికా, ఇజ్రాయిల్కు అనుకూలంగా వ్యవహరించడం మానుకోవాలని హితవు పలికారు. ఇరాన్పై అమెరికా చేస్తున్న యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అన్ని దేశాలను తన గుప్పిట్లో పెట్టుకోవాలనే స్వార్థంతోనే అమెరికా ఇలాంటి చర్యలకు పూనుకొంటుందని దుయ్యబట్టారు. సీపీఎం రాష్ట్ర క్యార్యదర్శి జాన్వెస్లీ -
యువతకు కిడ్నీ గండం
పరీక్షలు చేసుకోవాలి.. కిడ్నీ సంబంధిత సమస్య ఉన్నవారిలో మొదట లక్షణాలు నీరసం, ఆకలి మందగించడం, మూత్రం తక్కువగా రావడం కనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేసుకోవాలి. ప్రస్తుతం చాలా మందిలో మారుతున్న జీవనశైలి వల్ల కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయి. వేసవిలో అధికంగా డీహైడ్రేషన్ సమస్య ఉండటం వల్ల మూత్రంలో మంట, కిడ్నీలలో రాళ్లు ఎక్కువగా ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. నాణ్యతతో కూడిన డయాలసిస్ చేసుకోకపోవడం వల్ల కూడా సమస్య పరిష్కారం కావడం లేదు. హెచ్డీఎఫ్ కానీ హెచ్ఓఎంఎల్, హెచ్డీ, నాచ్యురల్ హెచ్బీ చేస్తే ఫలితం మెరుగైన స్థితిలో ఉంటుంది. – డాక్టర్ రాజేష్, కిడ్నీ వైద్య నిపుణుడు, మహబూబ్నగర్ పాలమూరు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చాలామంది కిడ్నీ సమస్యతో బాధపడేవారు పెరిగిపోతున్నారు. మారుతున్న జీవన విధానంతో యువత ఒత్తిడికి లోనవుతోంది. దీనికితోడు ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోతున్నాయి. ఉప్పు, మసాలాలతో కూడిన ఆహారానికి అలవాటు పడటం, మానసిక ఒత్తిడి, ఎక్కువగా నొప్పులకు ఉపయోగించే ట్యాబ్లెట్స్ వాడటం, షుగర్, బీపీ, ఊబకాయం, మద్యం, పొగాకుకు బానిసవ్వడం తదితర అలవాట్లు కిడ్నీ రోగాలకు దారితీస్తోంది. రోజులో కనీసం అరగంట కూడా వ్యాయామం చేయకపోవడంతో ఈ సమస్య మరింత పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం లాంటి సమస్యలు మూత్రపిండాలపై అధిక ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఆహారం తినేటప్పుడు మాత్రమే యువత నీళ్లు తాగుతుండటం వల్ల శరీరానికి అవసరమైన నీరు సరిపోవడం లేదు. మరోవైపు ప్రాథమిక స్థాయిలో కిడ్నీ సమస్యలు గుర్తించకపోవడం, నిర్లక్ష్యం వల్ల రాళ్ల సమస్య ఏర్పడుతుంది. జిల్లాలో 28– 30 ఏళ్ల వయస్సులో అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేస్తున్న వారిలో కిడ్నీలు దెబ్బతింటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. 479 మందికి డయాలసిస్ ఉమ్మడి పాలమూరులో గద్వాల, వనపర్తి జిల్లాలో అధికంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు జిల్లాల్లో డయాలసిస్ రోగులు అధికంగా ఉన్నారు. స్థానికంగా ఉండే వాతావరణ పరిస్థితితోపాటు ఆహార అలవాట్ల వల్ల కూడా కిడ్నీ బాధితులు అధికం అవుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 77 మిషన్ల ద్వారా 479 మంది రోగులకు నిత్యం డయాలసిస్ చేస్తున్నారు. కొత్తగా ఆత్మకూర్లో ఐదు, మక్తల్లో ఐదు మిషన్లతో కూడిన డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. మార్చి రెండో గురువారం.. ప్రతి ఏడాది మార్చి రెండో గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవంగా నిర్వహిస్తారు. కిడ్నీలు శరీరంలో వెన్నెముకకు ఇరువైపులా 9– 10 సెంటిమీటర్ల వెడల్పుతో పాటు 150గ్రాముల బరువు కల్గి ఉంటాయి. కిడ్నీ ప్రధాన శరీరంలోని నీటి లవణాల సమత్యులత, రక్త తయారీలో కీలక పాత్ర, మూత్రం తయారీ చేస్తుంటాయి. ప్రధానంగా కిడ్రీలలో సమస్య తీవ్రతరం అయితే తప్ప లక్షణాలు బయటపడవు. కిడ్నీ సమస్య ఉన్నవారిలో ప్రధానంగా ఆకలి మందగించడం, నీరసం, వాంతులు, చిరాకు, బరువు తగ్గడం, కాళ్ల వాపులు, మూత్రం తగ్గడం, ముఖం వాపు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు కిడ్నీ వ్యాధిని కట్టడి చేయాలంటే ప్రధానంగా రోజూ తగినంత వ్యాయామం చేయడం, కావాల్సినంత నిద్ర, ఒత్తిడి లేకుండా జీవనం, సరైన మోతాదులో నీరు తాగడం, బీపీ, షుగర్ నియంత్రణలో పెట్టుకోవడం చేయాలి. దీర్ఘకాలికంగా కిడ్నీలు చెడిపోయిన రోగుల్లో క్రియాటీన్, పొటాషియం శాతాల పెరుగుదల శరీరంలో అదనంగా నీరు చేరిన ఆధారంగా ఎన్నిసార్లు డయాలసిస్ చేయాలన్నది ఆధారపడి ఉంటుంది. రోగులకు శ్వాస తీసుకోవడంలో అకస్మాత్తుగా ఇబ్బంది ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో వెంటనే డయాలసిస్ చేపట్టాలి. అందుబాటులో కేంద్రం ఉంటే రోగికి మేలు జరుగుతుంది. సుదూరంలో ఉండటం వల్ల ఒక్కోసారి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రక్తం తక్కువగా ఉంటే ఎరిత్రోఫాయింట్ ఇంజెక్షన్ ఇస్తారు. మరీ తక్కువగా ఉంటే నేరుగా రక్తం ఎక్కించాల్సి వస్తుంది. సమీపంలోనే కేంద్రం ఉంటే ఇలాంటి సందర్భాల్లో రోగి కుటుంబ సభ్యులకు ఆందోళన ఉండదు. కిడ్నీ రోగులకు ఒక్కసారిగా బీపీ పడిపోయే ప్రమాదం ఉంది. కేంద్రాలు దగ్గరలోనే ఉంటే వెంటనే రోగిని కాపాడేందుకు అవకాశాలు ఎక్కువ. మూత్రపిండం.. జరభద్రం మారుతున్న జీవనశైలి.. ఆహారపు అలవాట్లు మోతాదులో నీళ్లు తాగక అనర్థాలు ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న కిడ్నీ సంబంధిత బాధితులు నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం -
సంతోషంగా ఉంది..
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయడం సంతోషంగా ఉంది. ఈ పథకంతో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారిపోతున్నాయి. ప్రయాణికులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు అవుతాయి. ముఖ్యంగా దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. దేవరకద్ర, వనపర్తి రోడ్ రైల్వేస్టేషన్లు కూడా ఏబీఎస్ఎస్ కింద అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి. – దిడ్డి గోపాల్ నారాయణ, డీఆర్యూసీసీ మెంబర్ -
పీజీ హాస్టల్కు నిధులు మంజూరు
వనపర్తి టౌన్: జిల్లాకేంద్రంలోని పీజీ కళాశాలలో చదివే విద్యార్థుల హాస్టల్ వసతికి నిధులు మంజూరైనట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైస్ ఛాన్స్లర్ విజ్ఞప్తి మేరకు 200 మంది మహిళలకు రూ.911.16 లక్షలు, 150 మంది పురుషులకు రూ.672.48 లక్షలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ‘ప్రజాపాలన’ శిక్షణకు పక్కా ఏర్పాట్లు వనపర్తి: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాకేంద్రంలో గురువారం నిర్వహించే సర్పంచ్లు, కౌన్సిలర్ల ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. శిక్షణ కార్యక్రమం కొనసాగే కళ్యాణసాయి గార్డెన్స్ను బుధవారం ఆయన పుర చైర్పర్సన్ మాధవి, జెడ్పీ సీఈఓ యాదయ్య, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, డీపీఓ రఘునాథ్రెడ్డి, తహసీల్దార్ రమేష్రెడ్డితో కలిసి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పురపాలికల చైర్మన్లు, వైస్ చైర్మలు, కౌన్సిలర్లు, సర్పంచులు శిక్షణకు హాజరవుతారని, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. మంత్రులు, శాసనసభ్యులు, జిల్లా అధికారులు హాజరై వివరిస్తారని.. వచ్చే ప్రజాప్రతినిధులకు ఎలాంటి లోటు లేకుండా వేదిక, తాగునీరు, మధ్యాహ్న భోజనం, ఎల్ఈడీ స్క్రీన్లు, ఫొటో ఎగ్జిబిషన్ తదితర ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. తాగునీటి సరఫరాలో ప్లంబర్లదే కీలకపాత్ర ఆత్మకూర్: తాగునీటి సరఫరాలో ప్లంబర్లదే కీలకపాత్ర.. వారు లేకుంటే ప్రతి ఇంటికి తాగునీరు సకాలంలో చేరదని మిషన్ భగీరథ సీఈ లలిత అన్నారు. అంతర్జాతీయ ప్లంబర్ల దినోత్సవం సందర్భంగా బుధవారం మండలంలోని బాలకృష్ణాపూర్లో సర్పంచ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలన్నారు. అనంతరం ఉత్తమ విధులు నిర్వర్తించిన వారిని సన్మానించారు. కార్యక్రమంలో ఎస్ఈ వెంకటరమణ, ఈఈ అంజాద్పాషా, ఎంపీడీఓ శ్రీపాద, ఎంపీఓ శ్రీరాంరెడ్డి, మిషన్ భగీరథ డీఈలు జయపాల్రెడ్డి, విజయ్కుమార్, ఏఈలు రుక్మేందర్రెడ్డి, మహే ష్, శివానంద్, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా పది పరీక్షలు
హాల్టికెట్ లేకున్నా పరీక్షకు అనుమతి పది పరీక్షల నిర్వహణకుగాను ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ చొప్పున జిల్లావ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో 375 మంది విధులు నిర్వర్తించనున్నారు. అలాగే సీఎస్ 37 మంది, డిపార్ట్మెంటల్ అధికారులు 37 మందిని నియమించాం. కొన్ని గదుల్లో విద్యార్థుల సంఖ్య కాస్త అటు ఇటుగా ఉండవచ్చు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. ప్రశ్నపత్రాలను సీసీ కెమెరాల ఎదుటే తెరిచేలా ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. వనపర్తిటౌన్: పదోతరగతి విద్యార్థులు హాల్టికెట్ లేకపోయినా వార్షిక పరీక్షలు రాయవచ్చని.. అటెండెనన్స్ షీట్ ఆధారంగా కేంద్రాల్లోకి అనుమతిస్తామని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ తెలిపారు. ప్రతి కేంద్రంలో విద్యార్థుల అటెండెన్స్ షీట్స్ ఉంటాయని.. హాల్టికెట్స్ లేవని ఆందోళన చెందవద్దన్నారు. శనివారం నుంచి ప్రారంభమయ్యే పదోతరగతి వార్షిక పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లు, సిబ్బంది తదితర విషయాలను బుధవారం ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే.. ఆందోళనకు గురికావద్దు.. విద్యార్థులు మానసిక ఆందోళన, ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈసారి పదోతరగతి పరీక్షలను వచ్చే నెల 16 వరకు నిర్వహిస్తోంది. ప్రతి పరీక్షకు మధ్య ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని సబ్జెక్టుపై మరింత పట్టు సాధిస్తే ప్రతి విద్యార్థి ఉత్తీర్ణుడయ్యే అవకాశం ఉంది. వివిధ కారణాలతో హాల్టికెట్ పొందని విద్యార్థులు ఆందోళన చెందకుండా ధైర్యంగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. హాల్టికెట్పై ఉన్న క్యూఆర్ కోడ్ను స్మార్ట్ఫోన్లో స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం లోకేషన్ వస్తుంది.. దీంతో విద్యార్థులు సులువుగా కేంద్రాలకు చేరుకోవచ్చు. విద్యార్థులు కేంద్రాలకు సకాలంలో చేరుకునేందుకు రవాణా సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులకు లిఖితపూర్వకంగా విన్నవించాం. వారుకూడా సానుకూలంగా స్పందించారు. అనివార్య కారణాలతో విద్యార్థులు పరీక్ష సమయానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా కేంద్రంలోకి అనుమతిస్తాం. కేంద్రాల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలైన తాగునీరు, బెంచీలు, విద్యుత్ సౌకర్యం సరిగా ఉండేలా తగిన చర్యలు తీసుకున్నాం. రెవెన్యూ, పోలీస్శాఖ సమన్వయంతో ముందుకు సాగుతున్నాం. పరీక్షల్లో ఎలాంటి మాస్ కాపీయింగ్కు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. ప్రశ్నపత్రాలను సీసీ కెమెరాల సమక్షంలోనే తెరుస్తాం. విద్యార్థులు అనారోగ్యానికి గురైతే ప్రాథమిక వైద్యసేవలు అందించేందుకు కేంద్రాల వద్ద ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉంటారు. జిల్లావ్యాప్తంగా ప్రశ్నపత్రాల స్టోరేజ్ పాయింట్లు (పోలీస్స్టేషన్లు) 10 ఏర్పాటు చేశాం. 7,212 మంది విద్యార్థులు.. జిల్లావ్యాప్తంగా 7,212 మంది విద్యార్థులు పదోతరగతి వార్షిక పరీక్షలు రాయనున్నారు. ఇందులో 3,577 మంది బాలురు.. 3,635 మంది బాలికలు ఉన్నారు. మొత్తం రెగ్యులర్ విద్యార్థులే కాగా.. ప్రైవేట్ విద్యార్థులు కేవలం 16 మంది మాత్రమే ఉన్నారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కొనసాగనున్నాయి. కాగా ఫిజికల్ సైన్స్, బయోలజీ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 నుంచి 11.30 వరకు మాత్రమే జరగనున్నాయి. జిల్లావ్యాప్తంగా 37 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు 25, ప్రైవేట్ పాఠశాలలు 12 ఉన్నాయి. క్యూఆర్ కోడ్ స్కానింగ్తో కేంద్రం గుర్తింపు ప్రతి కేంద్రంలో విద్యార్థులకు కనీస వసతుల కల్పన ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి ‘సాక్షి’తో జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ -
ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం
గోపాల్పేట: ప్రతి కార్యకర్త శ్రమించి కాంగ్రెస్పార్టీ విజయానికి కృషి చేశారని.. వారికి పార్టీ అండగా ఉంటుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం ఉమ్మడి గోపాల్పేట మండలంలో మండల కాంగ్రెస్ కమిటీల ఎన్నికకు నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయనతో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి పాల్గొని ఆయా మండలాల కార్యకర్తలతో అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా పలువురు ముఖ్య నాయకులు మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని, పోలీసు కేసులతో వేధించినా పార్టీ కోసం పని చేశామని చెప్పుకొచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కష్టపడి పనిచేసినా ఫలితం లేదని.. కనీసం ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో పేర్లు లేకుండా చేశారని వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, మండల అధ్యక్షులతో పాటు ఎస్సీ, బీసీ, ఎస్టీ, ఓబీసీ, ఇందిరమ్మ కమిటీలు, పీసీసీ ఇలా ఎన్నో కమిటీలు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరికి ఏదోవిధంగా ప్రయోజనం కలిగేలా చూస్తామని చెప్పారు. అనంతరం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కోసం పనిచేసే వారికి అధ్యక్షుడి అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మూడు మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
చకచకా.. సుందరీకరణ
ఊపందుకున్న అమృత్ భారత్ స్టేషన్ పథకం పునరాభివృద్ధి పనులు ● విమానాశ్రయాల స్థాయిలో వసతుల కల్పనకు చర్యలు ● ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్, జడ్చర్ల, గద్వాల, జోగుళాంబ స్టేషన్లు ● ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తున్న జనరల్ మేనేజర్ స్టేషన్ మహబూబ్నగర్: రైల్వేస్టేషన్ల ఆధునికీకరణకు కేంద్ర రైల్వేశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. స్టేషన్లలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ మేరకు స్టేషన్లలో ప్రయాణికులకు మరిన్ని అధునాతనమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీం’ (ఏబీఎస్ఎస్) కింద రైల్వేస్టేషన్లలో ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నారు. ప్రయాణికుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తుండటంతో.. ఈ పథకం కింద ఎంపికై న రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి ముమ్మరంగా జరుగుతున్నాయి. రైల్వే ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించడానికి, భారీస్థాయిలో రైల్వేస్టేషన్లను ఆధునికీకరించడానికి గణనీయమైన మార్పులు తీసుకొస్తున్నారు. రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు ఎయిర్పోర్టు అనుభూతి కలిగేలా మినీ ఎయిర్పోర్టులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఎంపికై న ఉమ్మడి జిల్లాలోని నాలుగు రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. మహబూబ్నగర్ రైల్వేస్టేషన్కు రూ.39.82 కోట్లు, జడ్చర్ల స్టేషన్కు రూ.36.67 కోట్లు, గద్వాల స్టేషన్కు రూ.42.82 కోట్లు, శ్రీబాలబ్రహ్మేశ్వర, జోగుళాంబ స్టేషన్కు రూ.6.7 కోట్లతో పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ మేరకు ఆయా రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి పనులు గత నెలలో సౌత్సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవ పరిశీలించారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద స్టేషన్లను అన్ని విధాలుగా ఆధునీకరించనున్నారు. ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని వసతులు కల్పించనున్నారు. ముఖ్యంగా స్టేషన్ ముఖద్వారాలు, ప్రణాళికబద్ధమైన పార్కింగ్, పాదచారుల మార్గాలు, మెరుగైన లైటింగ్ సౌకర్యాలతోపాటు ఆహ్లాదకరమైన అనుభూతి కోసం సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా స్టేషన్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. పార్కింగ్, రైల్వే బుకింగ్ సౌకర్యం గదులు నిర్మాణం చేయనున్నారు. ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, ప్రయాణికులు వివిధ ప్లాట్ఫాంలో దిగేందుకు వీలుగా లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఉన్న ప్రధాన ద్వారం ముఖచిత్రం పూర్తిస్థాయిలో నవీకరణ, సుందరీకరణ చేయనున్నారు. రైల్వేస్టేషన్లో అనసవర నిర్మాణాలు తొలగించి సర్క్యులేటింగ్ ప్రాంతం, అప్గ్రేడ్ చేసిన పార్కింగ్ స్థలాలు, దివ్యాంగులకు అనుకూలంగా మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీని ఉపయోగించడం ద్వారా పర్యావరణ అనుకూల సదుపాయాలు కల్పించనున్నారు. ట్రాఫిక్ సర్క్యులేషన్, ఇంటర్ మోడల్ ఇంటిగ్రేషన్ వంటి పనులు చేపట్టనున్నారు. ఆధునిక ఆర్కిటెక్చర్, ప్రపంచస్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ట్రాక్ల శుభ్రత, దివ్యాంగుల కోసం చక్రాల కుర్చీలు ఏర్పాటు చేస్తారు. ప్రవేశం వద్ద ర్యాంపులు, కేఫ్ ఏరియా, విశ్రాంతి గదులు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా ఆధునిక లైటింగ్తో సహా స్పీడ్వైఫే 5జీ సేవలకు టవర్లు కూడా నిర్మించనున్నారు. -
గడువుల ఎత్తిపోతల..!
సాక్షి, నాగర్కర్నూల్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పనులతో పాటు ఉమ్మడి జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గతంలోనే పాలమూరు–రంగారెడ్డి పనులను పూర్తి చేసేందుకు ఈ ఏడాది మార్చి వరకు గడువు విధించింది. అయితే తాజాగా ప్రభుత్వం మరో 20 నెలల్లో పూర్తి చేసేందుకు లక్ష్యం పెట్టుకుంది. మొత్తానికి 2027 నవంబర్ వరకు పాలమూ రు–రంగారెడ్డి ప్రాజెక్ట్ని వినియోగంలోకి తెస్తామని ప్రభుత్వం చెబుతుండగా, ఈసారైనా అనుకున్న సమయానికి పూర్తి కావాలంటే అవసరమైన నిధులు కేటాయిస్తేనే పనుల్లో కదలిక వస్తుంది. కేఎల్ఐ, బీమా, కోయిల్సాగర్ ప్రాజెక్ట్లపై ఫోకస్.. 2025 మే 1న మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు, సాగునీటి పారుదల శాఖ అధికారుల బృందం పాలమూరు ప్రాజెక్ట్ను సందర్శించింది. నార్లాపూర్, వట్టెం, ఏదుల రిజర్వాయర్లతో పాటు పంప్హౌజ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 2026 మార్చి కల్లా ప్రాజెక్ట్ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. అయితే తాజాగా మరో 20 నెలలకు గడువును పొడిగించింది. ● ఉమ్మడి జిల్లాలో ఏళ్లుగా అసంపూర్తిగానే మిగిలిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(కేఎల్ఐ), నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్ట్లను పూర్తి చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. 2027 మార్చికల్లా పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించింది. అలాగే కొడంగల్–నారాయణపేట–మక్తల్ ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెంచి 2027 మార్చి నాటికే పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. నెట్టెంపాడు రూ. 252 కోట్లు ఇంకా కావాల్సిన నిధులు: రూ.50 వేల కోట్లు రానున్న రెండేళ్లలో ఖర్చు చేసే నిధులు: రూ.22 వేల కోట్లు ‘పాలమూరు–రంగారెడ్డి’ పనులు పూర్తి చేసేందుకు మరోసారి గడువు పెంపు 20 నెలల్లో పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించిన ప్రభుత్వం వచ్చేమార్చిలోగా కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ పెండింగ్ పనులు పూర్తి అనుకున్న సమయానికి పనులు కావాలంటే నిధులు తప్పనిసరి.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపైనే ఉమ్మడి జిల్లావాసుల ఆశలు నిధులు వస్తేనే పనులు.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పూర్తి చేయడంలో నిధుల కేటాయింపు విషయమే కీలకంగా మారింది. 2014లో మొత్తం రూ.35,200 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్ట్ను ప్రారంభించగా ఏటా ప్రాజెక్ట్ వ్యయం గణనీయంగా పెరుగుతోంది. డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లతో కలిపి ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే ఇంకా రూ.50 వేల కోట్లు అవసరం. అయితే ప్రభుత్వం రెండేళ్ల కాలంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్కు ఇంకా రూ. 22 వేల కోట్లు కేటాయించేందుకు ప్రణాళిక రూపొందించింది. అయితే మిగతా నిధులు విడుదల చేస్తేనే ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి రానుంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కోసం రూ.909 కోట్లు, కోయిల్సాగర్ రూ.185 కోట్లు, భీమా ఎత్తిపోతలకు రూ.220 కోట్లు, నెట్టెంపాడు కోసం రూ.252 కోట్లను వచ్చే ఏడాది కాలంలో ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ మేరకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తేనే ప్రాజెక్టుల పనుల్లో పురోగతి ఉండనుంది. -
అక్రమార్కులపై కొరడా!
జిల్లాలో ఇసుక, మట్టి అక్రమ రవాణాపై పటిష్ట నిఘా మూడు రోజుల్లో కేసుల నమోదు ఇలా.. ● గోపాల్పేట పీఎస్ పరిధిలో మూడు ట్రాక్టర్లు, పెద్దమందడి పీఎస్ పరిధిలో జేసీబీపై కేసుల నమోదు, ఇసుక డంపుల సీజ్. ● పెబ్బేరు పీఎస్ పరిధిలో నాలుగు ట్రాక్టర్లపై కేసులు ● వనపర్తి పట్టణ పీఎస్లో రెండు ట్రాక్టర్లపై కేసుల నమోదు ● వనపర్తి రూరల్ పీఎస్ పరిఽధిలో రెండు ట్రాక్టర్లపై.. ● ఖిల్లాఘనపురం పీఎస్ పరిధిలో మూడు మట్టి ట్రాక్టర్లపై కేసులు ● మదనాపురం పీఎస్ పరిఽధిలో ఒక ట్రాక్టర్పై కేసు నమోదు ● సీఎం సమీక్ష తర్వాత పోలీసుశాఖ ఉక్కుపాదం ● మూడు రోజుల వ్యవధిలోనే 38 ఇసుక ట్రాక్టర్లపై కేసులు వనపర్తి: జిల్లాలో ఇసుక, మట్టి అక్రమ రవాణాపై పోలీసుశాఖ పటిష్ట నిఘా ఏర్పాటుచేసి, ఉక్కుపాదం మోపుతోంది. ఎస్పీ సునీతారెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు అక్రమార్కులపై కొరడా ఝుళిపిస్తున్నారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే దాదాపు 38 ఇసుక ట్రాక్టర్లతో పాటు వాగుల్లో ఉన్న ప్రొకెయిన్లు సీజ్ చేసి.. కేసులు నమోదు చేశారు. కొన్ని ప్రాంతాల్లో అక్రమార్కులు భారీగా నిల్వచేసిన ఇసుకను సైతం సీజ్ చేసి.. మండల రెవెన్యూ అధికారులకు స్వాధీనం చేశారు. మట్టి వాహనాలను మైనింగ్శాఖ అధికారులకు అప్పగిస్తున్నారు. వారు క్యూబిక్ మీటర్ల కోలమానంగా జరిమానా విధిస్తుండటంతో జిల్లావ్యాప్తంగా అక్రమ దందాకు తెరలేపిన వారిలో భయం మొదలైంది. అనుమతి లేకుండా రోడ్డుపై ఇసుక ట్రాక్టర్లు రావడానికి ఆస్కారం లేనంతగా నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. సీఎం సమీక్ష తర్వాత.. రాష్ట్ర రాజధానిలో ఈ నెల 3న కలెక్టర్లతో సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఇసుక, మట్టి అక్రమ రవాణాపై సీరియస్గా స్పందించడం.. అక్రమ రవాణాను అదుపు చేయకుంటే పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్లు భావించాల్సి వస్తుందనే అర్థ వచ్చేలా మాట్లాడటంతో కలెక్టర్ పోలీస్ వ్యవస్థను అప్రమత్తం చేశారనే చర్చ సాగుతోంది. ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా ఈ నెల 3 నుంచే జిల్లాలోని ఇసుక అక్రమ రవాణాపై పోలీసు అధికారులు కొరడా ఝుళిపించడం గమనార్హం. ఆయా మండలాల్లో ఎస్హెచ్ఓలు జల్లెడ పట్టి మరీ ఇసుక, మట్టిని అక్రమంగా తరలిస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. -
పాడి పశువులకు టీకా రక్షణ
●మదనాపురం: జిల్లాలోని పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేసేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. పాడి రైతులకు తీవ్ర నష్టం కలిగించే గాలికుంటు మహమ్మారిని తరిమికొట్టేందుకు పశుసంవర్ధకశాఖ సర్వం సిద్ధంమైంది. మంగళవారం నుంచి జిల్లావ్యాప్తంగా ఉచిత టీకా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 9 వరకు నెలరోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రతి పశువుకు టీకా వేయాలని యంత్రాంగం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రత్యేక బృందాల ఏర్పాటు.. జిల్లాలోని 15 మండలాల్లో పశుసంపదను కాపాడేందుకు అధికారులు పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తం 1,10,935 పశువులకు టీకాలు వేయనున్నారు. ఇందుకోసం 28 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ఈ టీకా బృందాలు షెడ్యూల్ ప్రకారం ప్రతి గ్రామాన్ని సందర్శించి.. 6 నెలల వయసు పైబడిన ప్రతి పశువుకు టీకా వేయనున్నారు. తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ముందస్తు రక్షణ కల్పించవచ్చు. అశ్రద్ధ చేస్తే ఆర్థికంగా నష్టం.. గాలికుంటు వ్యాధి కేవలం ఒక అనారోగ్యం మాత్రమే కాదు. అది రైతు ఆర్థిక మూలాలను దెబ్బతీస్తుంది. గాలి, నీరు, కలుషిత మేత ద్వారా వ్యాపించే ఈ వైరస్ వల్ల కలిగే నష్టాలు ఎన్నో ఉన్నాయి. పాడి పశువుల్లో పాల ఉత్పత్తి ఒక్కసారిగా పడిపోతుంది. నోరు, కాళ్ల గిట్టల మధ్య పుండ్లు ఏర్పడి.. పశువు మేత మేయలేక నీరసించి ప్రాణాలు కోల్పోయ్యే ప్రమాదం ఉంది. నేటి నుంచి గాలికుంటు నివారణ టీకా కార్యక్రమం జిల్లాలో 1.10 లక్షల పశువులు 28 ప్రత్యేక బృందాలతో రంగంలోకి పశుసంవర్ధకశాఖ -
ఇప్పుడే నిప్పుల కొలిమి
పాలమూరు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా భానుడు సెగలు కక్కుతున్నాడు. 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉదయం 9 గంటల నుంచే బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడే ఎండలు ఇంతలా మండుతుంటే.. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ఇంకెంత పెరుగుతాయోనని ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో వడదెబ్బ ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సూర్యుడు నిప్పులు చెరుగుతుండగా వాతావరణ కాలుష్యంతో వేడి తీవ్రత మరింత అధికమవుతోంది. జిల్లాలో ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చిన్నపిల్లల వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం పెరిగిన ఎండల తీవ్రత వల్ల ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఏర్పాటు చేసుకునే పనిలో ప్రతిఒక్కరూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఫ్యాన్ల నుంచి వేడి గాలులు వస్తున్న క్రమంలో వచ్చే వారంరోజుల్లో కూలర్ల కొనుగోళ్లు అధికంగా పెరగనున్నాయి. ● ఉమ్మడి పాలమూరులో ఎండల తీవ్రత దృష్ట్యా అన్ని పీహెచ్సీల్లో అవసరమైన మందులతోపాటు ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో దినసరి కూలీలు, రైతులు, ఉపాధి హామీ కూలీలు ఇలా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో ఆశాలు, ఏఎన్ఎంలు ఇంటింటికి తిరుగుతూ ఓఆర్ఎస్ పాకెట్లు పంపిణీ చేయాలని పలువురు సూచిస్తున్నారు. మూడురోజుల నుంచి పెరిగిన ఎండలు -
పార్టీ కోసం పనిచేసే వారికి సముచిత స్థానం
వనపర్తి రూరల్: క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషిచేసే ప్రతి నాయకుడు, కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. సోమవారం పెబ్బేరు, శ్రీరంగాపురం మండల కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల ఎన్నిక కోసం ఏర్పాటుచేసిన సమావేశాలకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డితో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. గతంలో ఉన్న మండల కమిటీలకు, ప్రస్తుతం కొత్తగా ఎన్నుకునే కమిటీలకు ఎంతో వ్యత్యాసం ఉంటుందన్నారు. ఒక్కొక్క కమిటీలో 21 మంది ఉంటారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లడంతో పాటు సంస్థాగత, గ్రామ, బూత్ కమిటీల్లో మండల బాధ్యులు కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. పార్టీకి నిబద్దతగా పనిచేసే వారికే మొదటి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అనంతరం ఆశావహుల పేర్లను నమోదు చేసుకున్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గౌని ప్రమోదిని, బండారు శ్రీనివాస్గౌడ్, వైస్చైర్మన్ సుమిత్ర, విజయవర్ధన్రెడ్డి, పీసీసీ జరనల్ సెక్రెటరీ నందిమల్ల యాదయ్య, రాజేంద్రప్రసాద్ యాదవ్, కదిరె రాములు, శ్రీలతారెడ్డి ఉన్నారు. -
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై ఆశలు..
పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తిచేస్తేనే ఉమ్మడి జిల్లాకు పూర్తిస్థాయిలో ప్రయోజనం కలుగనుంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల కింద నార్లాపూర్, ఏదుల, కర్వెన, వట్టెం, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తికావచ్చాయి. పంప్హౌజ్ల్లో మోటార్ల బిగింపు, కాల్వల తవ్వకాలు కొనసాగుతున్నాయి. నార్లాపూర్ నుంచి ఏదుల ప్రధాన కెనాల్లో కుడికిళ్ల వద్ద 2.5 కి.మీ. మేర కెనాల్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అలాగే డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణం కోసం ఇంకా రూ.50 వేల కోట్లు అవసరం కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టుల పనులు పూర్తి చేసేందుకు భారీస్థాయిలో నిధులు కేటాయించాల్సి ఉండగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపైనే ఉమ్మడి జిల్లావాసులు ఆశలు పెట్టుకున్నారు. -
సమాజంలో మహిళల పాత్ర కీలకం
వనపర్తి: నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ.. మార్గదర్శకులుగా నిలుస్తున్నారని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా మహిళా అధికారులను ఆయన శాలువాలతో సన్మానించి మాట్లాడారు. సమాజ అభివృద్ధిలో మ హిళల పాత్ర ఎంతో కీలకమన్నారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమా లు అమలు చేస్తోందని.. వాటిని సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడంలో మహిళా అధికారులు ము ఖ్య పాత్ర పోషిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, ఏఓ భానుప్రకాశ్ పాల్గొన్నారు. అర్జీలు సత్వరం పరిష్కరించాలి వివిధ సమస్యలపై ప్రజావాణిలో సమర్పించే అర్జీలను అధికారులు వేగంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. పెండింగ్లో ఉన్న అర్జీలను పరిశీలించి.. వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలన్నారు. అదే విధంగా సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన, పెండింగ్లో ఉన్న అర్జీలను సైతం వారం రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా అందరూ పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. కాగా, ప్రజావాణిలో 35 అర్జీలు అందాయని కార్యాలయ సిబ్బంది తెలిపారు. -
మాదకద్రవ్యాలతో కుటుంబాలు నాశనం
వనపర్తిటౌన్: మాదకద్రవ్యాల వ్యసనంతో జీవితాలే కాకుండా కుటుంబాలు నాశనమై రోడ్డున పడతాయని.. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని డీఈఓ అబ్దుల్ ఘని సూచించారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియంలో మాదకద్రవ్యాలు నిరోధించడానికి ఏర్పాటుచేసిన ప్రహరీ క్లబ్ శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. మాదకద్రవ్యాల ద్వారా వచ్చే మత్తు కంటే, జీవితంలో సక్సెస్తో వచ్చే మత్తు ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకుసాగాలని సూచించారు. ముఖ్యంగా చెడు అలవాట్లు ఉన్న వారితో సహవాసం మంచిది కాదన్నారు. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే, జీవితం అంతా బాగుంటుందని చెప్పారు. ఇంట్లో తల్లిదండ్రుల మాట, బడిలో ఉపాధ్యాయుల మాట వింటూ జీవితాన్ని అందంగా మలుచుకోవాలని అన్నారు. సైకియాట్రిస్ట్ డా.పుష్పలత మాట్లాడుతూ.. విద్యార్థులు జీవితంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. విద్యార్థి తీసుకునే నిర్ణయంతోనే భవిష్యత్ ముడిపడి ఉంటుందన్నారు. పరీక్షలపై భయాన్ని వీడి.. పట్టుదలతో చదవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఈగల్ టీం ఇన్చార్జి అంజద్, షీ టీం అధికారి భవిత, మొబిలైజింగ్ అధికారి ప్రతాపరెడ్డి, ప్లానింగ్ అధికారి శేఖర్, జీసీడీఓ శుభలక్ష్మి, డీఎస్ఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలకు 262 మంది గైర్హాజరు
వనపర్తిటౌన్: జిల్లాలోని 25 పరీక్ష కేంద్రాల్లో సోమవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలకు 262 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 6,924 మందికి గాను, 6,662 మంది హాజరయ్యారు. ఇందులో జనరల్ విద్యార్థులు 5,613 మందికి గాను 5,400 మంది, ఒకేషనల్ విభాగంలో 1,311 మందికి గాను1,262 మంది విద్యార్థులు హాజరై పరీక్షలు రాసినట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. పరీక్ష కేంద్రాలను డీఐఈఓతో పాటు డీఈసీ మెంబర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్స్ తనిఖీ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలి వనపర్తి రూరల్: నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటనలో రెండు నెలల చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్ఎన్ రమేశ్, కార్యదర్శి ఎం.రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుమ్మెరగట్టు మల్లన్న దర్శనం కోసం వెళ్లిన కుటుంబంపై కొందరు అగ్రకుల దురహంకారంతో దాడి చేయడం అమానుషమన్నారు. నిందితులను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి బొబ్బిలి నిక్సన్, బి.కవిత, కుర్మయ్య, గంధం రత్నయ్య, ఆంజనేయులు, డి.కుర్మయ్య, గట్టయ్య, అరుణ, సంధ్య పాల్గొన్నారు. 17, 18నయూనివర్సిటీల కన్వెన్షన్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఈనెల 17, 18న పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించనున్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల కన్వెన్షన్ పోస్టర్ను పీయూ వీసీ శ్రీనివాస్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ కన్వెన్షన్కు పీయూ వేదిక కావడం గొప్ప విషయం అన్నారు. విద్యార్థులు, యూనివర్సిటీలకు మేలు జరిగే విధంగా చర్చలు జరుగుతాయని, విద్యార్థుల హక్కులు, అందరికీ నాణ్యమైన విద్య అందించేందుకు సంఘాలు కృషి చేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రర్ రమేష్బాబు, ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు జేపీఎన్సీ రవికుమార్, మధుసూదన్రెడ్డి, బెక్కం జనార్దన్, అధ్యక్ష, కార్యదర్శులు రాము, రాజేష్, భరత్, శేఖర్, సాయి తదితరులు పాల్గొన్నారు. -
నివారణే మేలు..
గాలికుంటు వ్యాధి అనేది పశుసంపదను దెబ్బతీసే అత్యంత ప్రమాదకరమైనది. ఇది గాలి, కలుషిత నీరు, మే త ద్వారా వేగంగా ఒక పశువు నుంచి మరో పశువుకు వ్యాపిస్తుంది. ఒక్కసారి వ్యాధి సోకిన తర్వాత చికిత్స చేయ డం చాలా ఖరీదైన వ్యవహారం. పైగా పశువు పూర్తిస్థాయిలో కోలుకోవడం కష్టం. అందుకే ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ టీకా కార్యక్రమాన్ని జిల్లాలోని పాడి రైతులు ఒక బాధ్యతగా తీసుకోవాలి. – వెంకటేశ్వర్రెడ్డి, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి -
పోలీస్ ప్రజావాణికి 20 ఫిర్యాదులు
వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 20 ఫిర్యాదులు అందాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో ఎస్పీ సునీతారెడ్డి నేరుగా సమస్యలను తెలుసుకొని ఫిర్యాదులు స్వీకరించారు. వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు సిఫారస్ చేశారు. భూ తగాదాలకు సంబంధించిన ఫిర్యాదులు అత్యధికంగా 10 దాఖలు కాగా.. పరస్పర గొడవలకు సంబంధించి 9, భార్యాభర్తల తగాదాపై ఒక ఫిర్యాదు అందినట్లు తెలిపారు. సదరం సర్టిఫికెట్స్కు దరఖాస్తు చేసుకోండి కందనూలు: జిల్లాలో దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని డీఆర్డీఓ చిన్న ఓబులేషు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026 సంవత్సరానికి రెన్యూవల్, రెగ్యులర్ సర్టిఫికెట్స్ కోసం యూడీఐడీ పోర్టల్, మీసేవలో గాని దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనంతరం ఫోన్కు మెసేజ్ వచ్చిన తర్వాత ఈ నెల 6, 10, 13, 17, 20, 24, 31 తేదీలలో శారీరక, మస్క్యులర్, సీఎన్ఎస్, సెరెబ్రల్, పార్కన్సన్ దివ్యాంగులు ఉదయం 10 గంటలకు నాగర్కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకోవాలని తెలిపారు. అలాగే వినికిడి, మూగలోపం గల దివ్యాంగులు ఈ నెల 5, 25 తేదీల్లో, కంటిచూపు లోపం గలవారు ఈ నెల 9, 24 తేదీల్లో, మానసిక దివ్యాంగులు ఈ నెల 11, 18 తేదీల్లో, తలసేమియా, హెమోపిలియా, స్కేరోసిస్ దివ్యాంగులు ఈ నెల 30న జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి ఉదయం 10 గంటలకు చేరుకోవాలని సూచించారు. -
రాహుల్గాంధీతో ప్రత్యేక అనుబంధం
వనపర్తి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో డీసీసీ అధ్యక్షుడు కొత్తకాపు శివసేనారెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉందని మరోసారి నిరూపితమైంది. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమానికి సోమవారం హాజరైన రాహుల్ గాంధీని డీసీసీ అధ్యక్షుడు కొత్తకాపు శివసేనారెడ్డి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కలిశారు. గత ప్రభుత్వ హయాంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఢిల్లీలో ధరల నియంత్రణపై చేపట్టిన ధర్నాలో ఆయన కాలుకు గాయమైతే.. రాహుల్ గాంధీ స్వయంగా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించడంతో పాటు శివసేనారెడ్డి కుటుంబ సభ్యుల ను కలిసి తానున్నానంటూ భరోసానిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పడిన అనుబంధంతో ప్రస్తుతం ఆయన శివసేనారెడ్డి కుటుంబ సభ్యులను కలిసినట్లు కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాగా, రాష్ట్రంలో శాట్ తరఫున చేపడుతున్న క్రీడలు.. జిల్లా, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై రాహుల్ గాంధీతో చర్చించినట్లు శివసేనారెడ్డి తెలిపారు. పా ర్టీని బూత్ లెవల్లో బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. -
ఈ కాల్వ యమడేంజర్!
ప్రాణాలను హరిస్తున్న జూరాల ఎడమ కాల్వ ● వారాబందితో కానరాని నీటి ప్రవాహం ● స్నానానికి, బట్టలు ఉతికేందుకు వెళ్లి గల్లంతు.. మృత్యువాత ● అవగాహన కల్పించడంలో విఫలమవుతున్న అధికారులు నీటి ప్రవాహాన్ని తెలియజేయాలి.. జూరాల ఎడమ కాల్వలో నీటి ప్రవాహ ఉధృతిని ప్రాజెక్టు అధికారులు సిబ్బంది ద్వారా సమీపంలోని గ్రామాల ప్రజలకు తెలియజేయాలి. వారాబంది ద్వారా ఎన్ని రోజులు నీటిని అధికంగా వదులుతారు.. ఎన్ని రోజులు నీటిని నిలిపివేస్తారనే విషయాలను అక్కడి రైతులతో పాటు ప్రజలకు వివరిస్తే ప్రాణ హానిని నివారించవచ్చు. – హన్మంతు, మాజీ ఎంపీటీసీ, నందిమళ్ల రక్షణ కంచె ఏర్పాటు చేయాలి.. గుంటిపల్లి క్రాస్రోడ్డు సమీపంలోని జూరాల కాల్వ వద్ద తరచుగా ప్రజ లు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. నీటి ప్రవాహంపై అవగాహన లేక ఎంతో మంది కాల్వలో కొట్టుకుపోయి మృతిచెందడం విచారకరం. మరోమారు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రాజెక్టు అధికారులు కాల్వ వెంట ఉన్న మెట్ల వద్ద రక్షణ కంచె ఏర్పాటుచేయాలి. – వెంకటేశ్, నందిమళ్ల అవగాహన కల్పిస్తున్నాం.. జూరాల ప్రాజెక్టు నుంచి రామన్పాడ్ రిజర్వాయర్ వరకు ఉన్న ప్రధాన ఎడమ కాల్వ వెంట నీటి ప్రవాహం అధికంగా ఉంటుంది. వారబందితో సంబంధం లేకుండా కాల్వకు నీటిని నిరంతరం అందిస్తుంటారు. వారబంది రోజుల్లో నీటి ప్రవాహం తక్కువగా ఉంటుందని సమీప ప్రాంతాల యువకులు, చిన్నారులు ఈత కోసం కాల్వను ఆశ్రయిస్తుంటారు. కాల్వలోని నాచు అధికంగా ఉండటంతో కాలుజారి కాల్వలో గల్లంతై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీనిపై ఆయా గ్రామాల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – శివకుమార్, సీఐ, ఆత్మకూరు అమరచింత: జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ ప్రమాదకరంగా మారింది. కాల్వలో నీటి ఉధృతిని పసిగట్టలేని రైతులు, ప్రజలు నీటిలో దిగి గల్లంతు కావడం.. విలువైన ప్రాణాలను పోగొట్టుకోవడం వంటి ఘటనలు సర్వసాధారణంగా మారాయి. జూరాల ఎడమ కాల్వ ఏర్పాటుచేసి నేటికీ 24 ఏళ్లు గడుస్తున్నా కాల్వ సమీపంలోని గ్రామాల ప్రజలకు చాలా వరకు నీటి ప్రవాహ ఉధృతి తెలియకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే చిన్నారులు, యువత ఈత సరదాతో కాల్వలోకి దిగి ప్రాణాలను కోల్పోతున్నారు. జూరాల ప్రాజెక్టు సమీపంలోని నందిమళ్ల గ్రామంలో ఈ ఘటనలు అధికంగా చోటు చేసుకోన్నాయి. అయితే ప్రాజెక్టు అధికారుల రక్షణ చర్యలు మాత్రం శూన్యంగా మారాయి. రామన్పాడు వరకు ప్రమాదమే.. జూరాల ఎడమ కాల్వ ద్వారా ఆయకట్టుకు సాగునీటితో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు తాగునీటిని అందించే రామన్పాడ్ ప్రాజెక్టుకు ఇక్కడి నుంచే విడుదల చేస్తుంటారు. ప్రాజెక్టు నుంచి రామన్పాడ్ వరకు సుమారు 17 కిలోమీటర్ల మేర కాల్వ ప్రవహిస్తోంది. రామన్పాడ్ రిజర్వాయర్ వరకు ఉన్న సమీప గ్రామాల వద్ద దాదాపు 10 చోట్ల కాల్వలో దిగుడు మెట్లు ఏర్పాటుచేశారు. దీంతో నందిమళ్ల, మూలమళ్ల, జూరాల తదితర గ్రామాల ప్రజలు నిత్యం కాల్వలో దిగుతూ.. తమతమ అవసరాలను తీర్చుకుంటుంటారు. ఈ క్రమంలోనే పలువురు కాల్వలో కొట్టుకుపోవడం.. రామన్పాడ్ రిజర్వాయర్లో మృతదేహాలు లభించడం సర్వసాధారణంగా మారింది. ఐదేళ్లుగా జూరాల కాల్వలకు ప్రతి సీజన్లో వారాబందితో నీటిని వదులుతున్న విషయం రైతులకు తప్ప ఇతరులకు తెలియకపోవడమే ప్రధాన కారణమని పలువురు అంటున్నారు. జూరాల గ్రామ సమీపంలో వెళ్తున్న ప్రధాన ఎడమ కాల్వ లోతుగా, భయంకరంగా ఉండటంతో ఎప్పుడే ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ సమీపంలో ఉన్న నందిమళ్ల గ్రామంలోనే 11 ఏళ్ల కాలంలో 17 మంది గల్లంతై మృత్యువాత పడ్డారు. గ్రామానికి చెందిన బండి పెద్ద హన్మంతు, కోళ్ల రంగన్న, మాల రాజు, చింతలమ్మ, బోయ చెన్నమ్మ, బోయ బొజ్జన్న, తెలుగు కాశీమన్న, చిన్నరాయుడు, రాజ్మీ బేగం, మహిమూద్, కుర్వ మణెమ్మ, అలుక్కోడి సరిత తదితరులు గల్లంతై మృతిచెందారు. గత నెలలో ఈత పడేందుకు వెళ్లి చిన్నారి ఆరిఫ్ గల్లంతయ్యాడు. అదే విధంగా మూడేళ్ల క్రితం పెబ్బేరు సమీపంలోని కాల్వలో ముగ్గురు, ఆత్మకూర్ సమీపంలోని గుంటిపల్లి వద్ద 8మంది గల్లంతు కాగా.. గతేడాది మరో ఇద్దరు కాల్వలో గల్లంతై మృతిచెందారు. ఒక్క గ్రామంలోనే 17 మంది మృత్యువాత.. -
సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టిసారించండి
వనపర్తి: ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు, పాఠశాలల్లో సమస్యల పరిష్కారంపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయా శాఖల అఽధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ వసతిగృహాలు, పాఠశాలల్లో వ్యాధుల వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులు సంక్షేమ హాస్టళ్లను సందర్శించి.. విద్యార్థులతో సమస్యలను తెలుసుకోవడంతో పాటు వారితో కలిసి భోజనం చేయాలని సూచించారు. హాస్టళ్లలో పరిశుభ్రత, విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతగా ఉందో లేదో తనిఖీ చేయాలన్నారు. విద్యార్థులకు వడ్డించే వంటలను సూపర్వైజర్ తప్పనిసరిగా రుచి చూసి నిర్ధారించాలనే నిబంధన కచ్చితంగా అమలు కావాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం ఉన్నారు. అర్జీలు సత్వరం పరిష్కరించాలి.. సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిలో దాఖలుచేసే అర్జీలను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, జెడ్పీ సీఈఓ యాదయ్యలతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వాటి పరిష్కారం నిమిత్తం సంబంధిత అఽధికారులకు సిఫారస్ చేశారు. మొత్తం 40 అర్జీలు దాఖలు కాగా.. ఎక్కువగా భూ సమస్యలపై అర్జీలు అందినట్లు గ్రీవెన్స్ సెల్ అధికారులు వెల్లడించారు. -
గరుడ వాహనంపై ఊరేగిన శ్రీరంగనాథుడు
వనపర్తి రూరల్: శ్రీరంగాపురం మండల కేంద్రంలో శ్రీరంగనాథుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం వేద మంత్రోచ్ఛారణలతో స్వామివారికి చతుస్థానార్చన అనంతరం మోహినిగా అలంకరించి.. గరుడ వాహన సేవ నిర్వహించారు. శ్రీరంగనాథుడు దివ్యతేజ స్వరూపుడై తిరు వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 10 గంటలకు స్వామి, అమ్మవార్ల కల్యాణ వేడుకను కనులపండువగా నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు విష్ణునారాయణ, కిట్టు స్వామి, గోవిందాచార్యులు, కన్నయ్యస్వామి పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలకు 255 మంది గైర్హాజరు వనపర్తిటౌన్: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సోమవారం జరిగిన మొదటి సంవత్సరం మ్యాథ్స్ 1ఏ, బాటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలకు 255 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 25 కేంద్రాల్లో 7,158 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 6,903 మంది హాజరయ్యారు. ఇందులో జనరల్ విద్యార్థులు 5,852 మందికి గాను 5,643 మంది, ఒకేషనల్లో 1,301 మందికి గాను 1,260 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు కొత్తకోట, ఆత్మకూర్, గోపాల్పేట కళాశాలల్లో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు. దరఖాస్తు గడువు పొడిగింపు ఖిల్లాఘనపురం: మండలంలోని దొంతికుంటతండా స్టేజీ వద్ద ఉన్న తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశానికి, 7 నుంచి 10 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి సంబంధించి ప్రభుత్వం దరఖాస్తు గడువును పొడిగించినట్లు పాఠశాల ప్రత్యేకాధికారిణి ఉమాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 10వ తేదీలోగా htt p://tgms.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఏప్రిల్ 19న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 6వ తరగతిలో ప్రవేశానికి సంబంధించి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7 నుంచి 10వ తరగతుల్లో సీట్ల భర్తీకి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అర్హత పరీక్ష ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వేరుశనగ క్వింటా రూ.10,080 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో సోమవారం వేరుశనగ క్వింటాకు గరిష్టంగా 10,080, కనిష్టంగా రూ.4,500 ధరలు లబించాయి. కందులు గరిష్టంగా రూ.7,389, కనిష్టంగా రూ.5,501, మినుములు గరిష్టంగా రూ.7,959, కనిష్టంగా రూ.7,600, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,826, కనిష్టంగా రూ.1,621,పెబ్బర్లు రూ.5,051 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్లో కందులు రూ.5,809, రాగులు క్వింటా రూ.3589గా ఒకే ధర నమోదైయింది. హోలీ సందర్భంగా దేవరకద్ర మార్కెట్కు మంగళవారం సెలవు ప్రకటించారు. -
భవిష్యత్ తరాలకు భరోసా
● బాలల సంరక్షణకు వందరోజుల కార్యాచరణ ● ప్రారంభమైన చైల్డ్ హెల్త్–100 ప్రోగ్రామ్ ● జిల్లాలోని విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు వనపర్తి: చిన్నారుల మరణాలు తగ్గించడం.. వ్యాధుల నియంత్రణ లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం ‘చైల్డ్ హెల్త్–100’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రీయ బాలస్వాస్త్య కార్యక్రమంలో భాగంగా ఈ నెల 2 నుంచి జూన్ మొదటి వారం వరకు వంద రోజులపాటు జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో బాలబాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించడం.. వారిలో ఆరోగ్య సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి.. ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. రానున్న రాష్ట్రావతరణ దినోత్సవం నాటికి చిన్నారుల్లో నెలకొన్న ఆరోగ్య సమస్యలను తెలుసుకొని.. వాటి పరిష్కారానికి దశల వారీగా చర్యలు చేపట్టనుంది. ఇందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాగా, 14–15 ఏళ్ల వయసు గల విద్యార్థినులకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయనున్నారు. తద్వారా భవిష్యత్లో కేన్సర్ను నివారించవచ్చు. ఈ వ్యాక్సిన్ను ప్రతి విద్యార్థినికి అందించే కార్యక్రమం సైతం ‘చైల్డ్ హెల్త్–100శ్రీలో చేపట్టనున్నట్లు తెలిసింది. ప్రాథమిక దశలోనే చికిత్స.. విద్యార్థుల్లో పోషకాహార లోపాలు, దృష్టి తీక్షణత తెలుసుకునేందుకు రక్తహీనత, హెచ్బీ తదితర పరీక్షలు చేస్తారు. జన్యుపరమైన లోపాలు, ఇతర వ్యాధులు, వైకల్యం తదితర సమస్యలను గుర్తించి.. వాటి నివారణ కోసం పోషకాలు, వైద్యాన్ని ప్రాథమిక దశలోనే అందించేందుకు చైల్డ్ హెల్త్ –100 కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. పకడ్బందీగా నిర్వహిస్తాం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చైల్డ్ హెల్త్–100 కార్యక్రమాన్ని జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, ఆశ్రమ, మోడల్ స్కూళ్లలో నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశాం. వంద రోజుల్లో నాలుగు దశల్లో కార్యక్రమాన్ని పుర్తిచేస్తాం. – డా.సాయినాథ్రెడ్డి, డీఎంహెచ్ఓ -
మహిళా భాగస్వామ్యంతోనే మెరుగైన సమాజం
వనపర్తి రూరల్: మహిళల భాగస్వామ్యంతోనే మెరుగైన సమాజం నిర్మితమవుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి వి.రజని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆద్వర్యంలో సోమవారం వనపర్తి మండల పరిషత్ కార్యాలయంలో మహిళా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, మహిళా సంఘాల సభ్యులతో ఏర్పాటుచేసిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దడంలో మహిళా ప్రజాప్రతినిధులు ముఖ్యభూమిక పోషించాలని సూచించారు. మహిళా చట్టాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అదే విధంగా గ్రామాల్లో బాల్యవివాహాల నిర్మూలనకు కృషి చేయాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమన్నారు. ఈ విషయంపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా అందించే న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రవీంద్రబాబు, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రఘు పాల్గొన్నారు. -
‘పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్’ విజయవంతం చేద్దాం
అమరచింత: ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి కోరారు. మంగళవారం పార్టీ పట్టణ అధ్యక్షురాలు లావణ్య ఇంట్లో నిర్వహించిన సమావేశంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి ఇందుకు సంబంధించిన వాల్పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. పాలమూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. క్రికెట్, కబడ్డీ, ఖో–ఖో, వాలీబాల్, పరుగుపందెం పోటీలు ఉంటాయని.. ప్రతిభ కనబర్చిన వారిని పార్లమెంట్స్థాయి పోటీలకు ఎంపికచేసి నగదు బహుమతితో పాటు జ్ఞాపికలు అందజేయనున్నట్లు వెల్లడించారు. పోటీలను రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని.. క్రీడాకారులు 24వ తేదీ వరకు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 9 నుంచి 24వ తేదీ వరకు క్రీడాపోటీల నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ గ్రామీణ అధ్యక్షుడు, కిష్టంపల్లి సర్పంచ్ మల్లారెడ్డి, నరాల నారాయణ, చంద్రనాయక్తండా సర్పంచ్ కృష్ణానాయక్, కౌన్సిలర్లు మేర్వ రాజు, విష్ణు, ఊషన్న, పసుల నీరజ్, దుబాయ్ వెంకటేశ్వర్రెడ్డి, అమరేందర్రెడ్డి, గణేష్ పాల్గొన్నారు. -
ర్యాలంపాడుకు మోక్షం
ఎట్టకేలకు నిధులు.. ర్యాలంపాడు రిజర్వాయర్కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేయడానికి ప్రభుత్వం రూ. 4.92 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.1.66 కోట్లు సీడబ్ల్యూపీఆర్సీ పుణెకు, మిగిలిన రూ. 3.66 కోట్లతో రిజర్వాయర్కు ఏర్పడిన లీకేజీలకు పూర్తిస్థాయిలో మరమ్మతు చేయాలని నిర్ణయించారు. అయితే రిజర్వాయర్ ఆనకట్టలోని రాక్టోల్ లేయర్ల మట్టి నమూనాలు, తూముల అడుగు భాగంలోని నమూనాలను పరీక్షల నిమిత్తం పుణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్సీకి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్ష ఫలితాల అనంతరం వచ్చే తుది నివేదిక ఆధారంగా రిజర్వాయర్కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేపట్టనున్నారు. గద్వాల: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం అంతర్భాగమైన ర్యాలంపాడు రిజర్వాయర్కు నాలుగేళ్ల క్రితం లీకేజీలు ఏర్పడ్డాయి. ఫలితంగా 4 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లో 2 టీఎంసీలు మాత్రమే నిల్వచేస్తూ.. 1.12 లక్షల ఎకరాల ఆయకట్టుకు వానాకాలంలో ఒక పంటకు మాత్రమే సాగునీరు అందిస్తున్నారు. యాసంగి సీజన్లో రెండో పంటకు సాగునీరు అందించకుండా క్రాప్హాలిడే ప్రకటిస్తూ వస్తున్నారు. దీంతో ర్యాలంపాడు రిజర్వాయర్కు మరమ్మతు చేయాలని రైతులు ప్రతి ఏడాది ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలుమార్లు హైదరాబాద్, పుణె నుంచి ఇంజినీరింగ్ నిపుణుల బృందం రిజర్వాయర్ను సందర్శించి.. సర్వే చేశారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. ఎట్టకేలకు ర్యాలంపాడు రిజర్వాయర్ మరమ్మతుకు మోక్షం లభించింది. రిజర్వాయర్ పూర్తిస్థాయి మరమ్మతు కోసం ప్రభుత్వం రూ. 4.92కోట్లు మంజూరు చేసింది. రెండేళ్లకే లీకేజీలు.. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల ప్రజలకు తాగునీటితో పాటు 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో దివంగత మాజీ ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 2005లో శంకుస్థాపన చేశారు. 2009 వరకు పరుగులు పెట్టిన ప్రాజెక్టు నిర్మాణ పనులు.. వైఎస్సార్ అకాలమరణంతో అసంపూర్తిగా నిలిచాయి. నెట్టెంపాడు ప్రాజెక్టులో మొత్తం 20 టీఎంసీల సామర్థ్యంతో ఏడు రిజర్వాయర్లు ఉండగా.. ర్యాలంపాడు రిజర్వాయర్ను 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన రిజర్వాయర్ నిర్మాణంపై అధికారుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం చోటు చేసుకోవడం.. గుత్తేదారు లోపభూయిష్ట నిర్మాణంతో రిజర్వాయర్ అందుబాటులోకి వచ్చిన రెండేళ్ల కాలంలోనే ఆనకట్ట, తూముల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. రిజర్వాయర్ మరమ్మతుకు రూ.4.92 కోట్లు మంజూరు సివిల్ గ్రౌంటింగ్ పరీక్షలకు రూ.1.66 కోట్లు కేటాయింపు రూ.3.66 కోట్లతో జలాశయం ఆనకట్ట, తూముల మరమ్మతు త్వరలోనే ప్రారంభంకానున్న పనులు పలుమార్లు సర్వే.. ర్యాలంపాడు రిజర్వాయర్ లీకేజీలకు మరమ్మతు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటగా రూ. 60లక్షలతో హైదరాబాద్కు చెందిన ఏజెన్సీకి సర్వే పనులను అప్పగించింది. ఆరునెలల పాటు సర్వే చేసిన సదరు ఏజెన్సీ.. మరమ్మతుకు సంబంధించిన తుది నివేదికను గత ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో మరోసారి పుణెకు చెందిన ఇంజినీరింగ్ బృందంతో సర్వే చేయించింది. ఇంజినీరింగ్ నిపుణుల బృందం రెండుసార్లు రిజర్వాయర్ను సందర్శించారు. సర్వేకు సంబంధించిన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. త్వరలోనే పనులు.. ర్యాలంపాడు రిజర్వాయర్ లీకేజీలకు మరమ్మతు కోసం ప్రభుత్వం రూ. 4.92కోట్లు మంజూరు చేసింది. పుణె నుంచి వచ్చే తుదినివేదిక ఆధారంగా త్వరలోనే రిజర్వాయర్కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేపట్టి.. పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందిస్తాం. – రహీముద్దీన్, ఎస్ఈ, ఇరిగేషన్ శాఖ -
యువత మత్తుకు దూరంగా ఉండాలి
వనపర్తిటౌన్: దేశాభివృద్ధికి యువతే మూల స్తంభమని.. మత్తుకు బానిస కాకుండా చదువుపై శ్రద్ధ సారించి దేశాన్ని ప్రపంచంలోనే ముందంజలో నిలిపేందుకు కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని డౠ్ల్యసీసీఎం కళాశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత స్వామి వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చే మత్తుకు బానిసైతే దేశం నాశనం అవుతుందన్నారు. మాదక ద్రవ్యాలు విక్రయించినా, వినియోగించినా, రవాణా చేసినా చట్ట ప్రకారం నేరమని, అందుకు కఠిన శిక్షకు అర్హులవుతారని చెప్పారు. మాదక ద్రవ్యాలతో వారి జీవితాలే కాకుండా కుటుంబాలు నాశనమవుతాయని చెప్పారు. బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, పోక్సో తదితర చట్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెనన్స్ కౌన్సిల్ శ్రీదేవి, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
పచ్చదనం.. ఎండుముఖం
గ్రామాల్లోని వన నర్సరీల్లో కానరాని గ్రీన్నెట్లు అధికారుల నిర్లక్ష్యం.. నర్సరీల నిర్వహణను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. మొక్కల సంరక్షణను అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. నాటిక మొక్కలకు సకాలంలో నీటిని సైతం అందించకపోవడంతో వాడుముఖం పడుతున్నాయి. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉన్న మొక్కలు ఎండిపోకుండా నీటిని అందిస్తూ రక్షణ చర్యలు చేపట్టాలి. – బాలకృష్ణ, అమరచింత గ్రీన్నెట్లు ఏర్పాటుచేయాలి.. వేసవిలో ఎండ తీవ్రత పెరుగుతున్నందున గ్రామాల్లో ఉన్న నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా గ్రీన్నెట్లను ఏర్పాటు చేయాలి. మొక్కలకు నీడ ను అందించడంతో వాడుముఖం పట్టకుండా ఉంటాయి. ఇందుకుగాను గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రత్యేక చొరవ తీసుకోవాలి. – వెంకటేష్, నందిమళ్ల నిర్వహణ బాధ్యతగ్రామపంచాయతీలదే.. గ్రామస్థాయిలోని నర్సరీల నిర్వహణ బా ధ్యత ఆ గ్రామపంచాయతీ పాలకవర్గాలదే. మొక్కల సంరక్షణ కోసం గ్రీన్నెట్ ఏర్పాటుకు పంచాయతీ నిధులు వినియోగించాల్సి ఉంది. త్వరలోనే అన్ని నర్సరీల్లో గ్రీన్నెట్ల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటాం. – ఉమాదేవి, డీఆర్డీఓ అమరచింత: గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంపొందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయిలోనే నర్సరీ ఏర్పాటు చేసి 10 వేల మొక్కలు పెంచి ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, రహదారులకు ఇరువైపులా, ఖాళీ ప్రదేశాల్లో నాటి సంరక్షిస్తోంది. ఒక్కో మొక్కకు సుమారు రూ.16 వరకు వెచ్చిస్తూ నీటిని సైతం అందించే కార్యక్రమాలు చేపడుతోంది. నర్సరీల్లోని మొక్కలు వానాకాలం, చలికాలంలో రక్షణ లేకున్నా ఏపుగా పెరిగే అవకాశం ఉంది. కాని వేసవిలో ఎండ తీవ్రతకు వాడుముఖం పడుతూ ఎండిపోతుంటాయి. మొక్కల సంరక్షణకుగాను ముందస్తుగా నర్సరీల్లో గ్రామపంచాయతీ నిధులు ఖర్చుచేసి గ్రీన్ నెట్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఎండలు తీవ్రరూపం దాల్చినా జిల్లాలోని నర్సరీల్లో గ్రీన్నెట్లు ఏర్పాటు చేయకపోవడంతో మొక్కలు వాడుముఖం పడుతున్నాయి. మరికొన్ని నర్సరీల్లో మొక్కల పెంపకానికి ప్లాస్టిక్ సంచుల్లో విత్తిన విత్తనాలు సైతం మొలకెత్తని పరిస్థితులు నెలకొన్నాయి. కనిపించని జోష్.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ‘హరితహారం’ పేరుతో ఏటా వర్షాకాలం ప్రారంభంలో ఊరూరా వేడుకగా మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించేవారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం వన మహోత్సవంగా పేరు మార్చడం తప్ప గ్రామస్థాయిలో ఉద్యమంలా మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో పాటు నర్సరీల నిర్వహణపై దృష్టి మందగించిందన్న అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం గతంలో నాటిన మొక్కలు వాడిపోయి ఉంటే వాటిని గుర్తించి తొలగించడంతో పాటు వాటి స్థానంలో కొత్త మొక్క నాటి సంరక్షించే కార్యక్రమం చేపడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. 10 వేల మొక్కల పెంపకమే లక్ష్యం ఒక్కో మొక్కకు రూ.16 వెచ్చింపు అధికారు పర్యవేక్షణ కరువు వాడుముఖం పడుతున్న వైనం జిల్లాలో 255 గ్రామపంచాయతీలు -
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షల నిర్వహణ
వనపర్తిటౌన్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. మంగళవారం జరిగిన పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 5,844 మంది విద్యార్థులకుగాను 5,591 మంది హాజరుకాగా.. 153 మంది గైర్హాజరైనట్లు వివరించారు. ఇందులో జనరల్ విద్యార్థులు 4,821 మందికిగాను 4,602 మంది హాజరుకాగా.. 119 మంది రాయలేదని చెప్పారు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు 1,023 మందికిగాను 989 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 34 మంది హాజరుకాలేదు. జిల్లాకేంద్రంలోని జాగృతి, విజ్ఞాన్, స్కాలర్స్, అభ్యాస్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను, సీవీ రామన్ కళాశాల కేంద్రాల్లో విద్యార్థుల తనిఖీని పరిశీలించినట్లు వివరించారు. డీఈసీ బృందం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, పానగల్, పెద్దమందడి, ఖిల్లాఘనపురం, స్కాలర్స్, త్రివేణి, సూర్య, సీవీ రామన్, వాగ్దేవి జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాలను.. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను.. సిట్టింగ్ స్క్వాడ్ బృందం శ్రీరంగాపురం, గోపాల్పేట, పెద్దమందడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కొత్తకోట శ్రీ ప్రతిభ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు చెప్పారు. ‘ఉపాధి పని ప్రదేశాల్లో వసతులు కల్పించాలి’ పాన్గల్: ఉపాధి పనుల్లో ఆన్లైన్ మస్టర్ విధానాన్ని తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జబ్బార్ కోరారు. స్థానిక సమస్యల గుర్తింపులో భాగంగా మంగళవారం సీపీఎం బృందం మండలంలోని దావాజిపల్లిని సందర్శించి ఉపాధి కూలీల సమస్యలపై ఆరా తీసింది. అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకం పేరు మార్చి పథకాన్ని నీరుగార్చిందన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం వాటా నిధులు ఖర్చుచేసే వారని.. కొత్త చట్టం ప్రకారం కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు వెచ్చించేలా నిబంధనలు విధించిందని తెలిపారు. పని ప్రదేశాల్లో సరైన వసతులు లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రోజువారీ కూలి రూ.600 చెల్లిస్తూ.. ఏడాదికి 200 రోజులు పని కల్పించాలని కోరారు. మరో బృందం పార్టీ మండల కార్యదర్శి బాల్యానాయక్ ఆధ్వర్యంలో తెల్లరాళ్లపల్లి, కేతేపల్లిలో పర్యటించి ఉపాధి కూలీలు, స్థానిక సమస్యలపై ఆరా తీసింది. ఉపాధిహామీ పథకాన్ని రక్షించుకునేందుకు కలిసి పోరాడాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సూర్యవంశం రాము, దేవేందర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ‘ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక’
వనపర్తి: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 12వ తేదీన నిర్వహించే సర్పంచులు, పుర కౌన్సిలర్ల శిక్షణను విజయవంతం చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కె.రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి అదనపు కలెక్టర్ పాల్గొని వివరాలు వెల్లడించారు. జిల్లాకేంద్రంలోని కళ్యాణ్సాయి ఫంక్షన్హాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రజాప్రతినిధులు అందరికీ ఆహ్వానం పంపించినట్లు తెలిపారు. కొత్తగా ఎన్నికై న పుర కౌన్సిలర్లకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. శిక్షణకు హాజరయ్యే ప్రజాప్రతినిధులకు మధ్యాహ్న భోజనం సైతం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మొదటి థీమ్ అయిన పరిశుభ్రత, రికార్డుల క్లియరెనన్స్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఎస్పీ బాలాజీనాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ -
రాష్ట్ర సదస్సును జయపద్రం చేయాలి
వనపర్తిటౌన్: హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 12న ‘విద్యుత్ బస్సులు ఆర్టీసీ.. ప్రజలపై ప్రభావం’ అనే అంశంపై రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని, కార్మికులు అధికసంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని టీఎస్ఆర్టీసీ ఎస్డౠ్ల్య (సీఐటీయూ) జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ ఖయ్యూం, డిపో కార్యదర్శి సి.నాగేశ్వర్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని డిపో ఎదుట సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం విద్యుత్ బస్సులు వినియోగించాలని నిర్ణయించిందని, దీంతో కార్మికులు ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గోపాలకృష్ణ, ప్రచార కార్యదర్శి గోవర్ధన్, సహాయ కార్యదర్శి నారాయణ, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. -
‘కాంగ్రెస్ కన్నతల్లి లాంటిది’
ఖిల్లాఘనపురం: కాంగ్రెస్పార్టీ కన్నతల్లి లాంటిదని, కష్టపడి నమ్మకంగా పనిచేసిన వారికి అండగా ఉంటుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు శివసేనారెడ్డి అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని ఓ కల్యాణ మండపంలో కాంగ్రెస్పార్టీ మండల నాయకుల విస్తృతస్థాయి సమావేశానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరవగా.. పలువురు నాయకులు వారిని శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. అదేవిధంగా పార్టీని నమ్ముకొని వచ్చిన కొత్తవారి సహకారంతోనే ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచామని.. కాబట్టి వారికి కూడా సముచిత స్థానం కల్పించనున్నట్లు వివరించారు. ఎవరుకూడా పదవులు రాలేదని నిరాశ చెందొద్దని.. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పుర ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్, బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు. మున్ముందు జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి అందరు ఐఖ్యంగా పనిచేయాలని సూచించారు. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్పార్టీ అంటేనే అభివృద్ధికి నిదర్శనమని.. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు అన్ని తామె చేశామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అనంతరం మండలపార్టీ అధ్యక్ష పదవి కోరుకుంటున్న వారి పేర్లు చెప్పాలని అడగగా.. మొత్తం 7 మంది పేర్లను రాయించారు. పరిశీలించి అధ్యక్షుడి పేరు ప్రకటిస్తామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు రవీందర్రెడ్డి, శ్రీనివాసులుగౌడ్, విజయ్కుమార్, సాయిచరణ్రెడ్డి, పీసీసీ ప్రధానకార్యదర్శి యాదయ్య, మాజీ ఎంపీపీ వెంకటయ్య, వెంకటేశ్వరరావు, గంజాయి రమేష్, ప్రభాకర్రెడ్డి, డా. నరేందర్గౌడ్, శేఖర్రెడ్డి, జయాకర్, కొత్త గొల్ల కృష్ణయ్య, పలు గ్రామాల సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కార్గో సేవలు వినియోగించుకోవాలి
అమరచింత: ప్రజలు కార్గో సేవలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం స్థానిక బస్టాండ్లో టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్గో కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కార్గో సేవలను విస్తృతం చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ కల్లుగీత సెల్ చైర్మన్ నాగరాజుగౌడ్, పుర చైర్మన్ జింక సువర్ణ, వైస్ చైర్మన్ రాధ, అరుణ్, కార్గో సమన్వయకర్తలు పృథ్వి, హలీం, హరీశ్ పాల్గొన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి -
తాగునీటి ప్రాముఖ్యత తెలుసుకోవాలి
ఖిల్లాఘనపురం: ప్రతి ఒక్కరికీ తాగునీటి ప్రాముఖ్యత తెలిసి ఉండాలని, తాగునీటి సమస్యలతో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయనే విషయాన్ని గ్రామసభల్లో ప్రజలకు వివరించాలని మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటరమణ తెలిపారు. ఆదివారం మండలంలోని సోళీపురం గ్రామంలో ‘జల్ మహోత్సవ్’ కార్యక్రమం నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నీటి ప్రాముఖ్యతపై గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామసభ ఏర్పాటు చేసి తాగునీటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. గ్రామపంచాయతీల్లో నిర్వహించే గ్రామసభల్లో పరిశుభ్రత, పచ్చదనం, శుద్దిచేసిన తాగునీరు తదితర విషయాలపై చర్చించాలన్నారు. మహిళలు పారిశుద్ధ్యంపై ప్రత్యేక చొరవ చూపాలని, సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజల ఆరోగ్యం విషయంలో తాగునీటి ప్రాముఖ్యత అవసరమనే విషయాన్ని మరవొద్దని సూచించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన మహిళలకు హర్ ఘర్ జల్ సర్టిఫికెట్లను అందించారు. నీటి బదిలీ అంశంలో భాగంగా సర్పంచ్ సింధుకు నీటి బదిలీ సర్టిఫికెట్ను అందజేశారు. కార్యక్రమంలో ఈఈ అంజద్బాషా, డీఈలు హరీశ్కుమార్, జయపాల్రెడ్డి, విజయ్కుమార్, ఏఈలు బండారు రవీందర్, నరేష్, గ్రామపెద్దలు, మహిళలు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు. వంట గ్యాస్ ధర తగ్గించాలంటూ నిరసన వనపర్తి రూరల్: పెంచిన వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని ఆదివారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌక్లో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వంట గ్యాస్ ధర భారీగా పెంచి పేదలపై భారం మోపిందని ఆరోపించారు. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్పై రూ.60, వాణిజ్య సిలిండర్పై రూ.115 పెంచిందని.. ధరల పెరుగుదల భారం సాధారణ ప్రజలతో పాటు చిరు వ్యాపారులు, హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకులపై పడుతుందన్నారు. దేశంలో ఇంధన కొరత లేదని, సరఫరాలో అంతరాయం గురించి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువులశాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి గతంలో వెల్లడించారని, చమురు, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్రం తెలిపిందని గుర్తుచేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం వెంటనే స్పందించి పెరిగిన ధరలు తగ్గించాలని.. లేనిచో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి ఎం.పరమేశ్వరాచారి, పార్టీ 18వ వార్డు కౌన్సిలర్ గంధం మదన్, నాయకులు డి.కురుమయ్య, జి.బాలరాజు, నందిమళ్ల రాములు, జి.భాస్కర్, శేషయ్య, డి.గట్టయ్య, విజయకుమార్, బి.కురుమయ్య, జి.మన్యం, డి.బాలరాజు, జి.రత్నయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్కు అప్పరాల క్రీడాకారులు కొత్తకోట రూరల్: వనపర్తిలోని డా. బాలకిష్టయ్య క్రీడా మైదానంలో ఆదివారం 3వ తెలంగాణ రాష్ట్ర రిలే కార్నివల్ మీట్–2026కు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించారు. అండర్–14, అండర్–20 విభాగాల్లో పురుషులు, మహిళల ఎంపికల్లో అప్పరాల గురుకుల డిగ్రీ కళాశాల క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. అండర్–14 విభాగం 60 మీటర్ల పరుగు పందెంలో చందన ద్వితీయ స్థానం, అండర్–20 విభాగం 100 మీటర్ల పరుగు పందెంలో జోత్స్న మొదటి స్థానం, సాయి చందన ద్వితీయ స్థానం సాధించారు. అదేవిధంగా పురుషుల సీనియర్ విభాగం 400 మీటర్ల పరుగు పందెంలో కె.గణేశ్ మొదటి స్థానం, ఎం.అజయ్కుమార్ ద్వితీయ స్థానం సాధించారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 15న హన్మకొండ జేఎన్ స్టేడియం, వరంగల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు వ్యాయామ శిక్షకుడు ఎం.అజయ్కుమార్ తెలిపారు. -
20 నెలల్లో పూర్తిచేస్తాం
పాలమూరును.. కృష్ణానదిలో మన వాటా నీటిలో బొట్టు కూడా వదిలిపెట్టం ● రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడి ● సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షా సమావేశం ● హాజరైన ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వచ్చే 20 నెలల్లో పూర్తిచేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు. ఉమ్మడి పాలమూరులోని ముఖ్యమైన ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి రైతులకు సాగునీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఆదివారం హైదరాబాద్లో ఉమ్మడి మహబూబ్నగర్లోని సాగునీటి ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించగా.. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్ధక, మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిలసాగర్ ప్రాజెక్టుల పనులను 2027 మార్చి నాటికి పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణకు కృష్ణానదిలో ఉన్న హక్కు మేరకు నీటిని పూర్తిగా వినియోగించుకుంటామని, ఒక్క బొట్టు కూడా వదిలిపెట్టమని తేల్చిచెప్పారు. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందన్నారు. వచ్చే ఏడాది కాలంలో కల్వకుర్తి ప్రాజెక్టుకు రూ.909 కోట్లు, నెట్టంపాడుకు రూ.252 కోట్లు, భీమాకు రూ.200 కోట్లు, కోయిల్సాగర్కు రూ.185 కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ పనులను మిషన్ మోడ్లో పూర్తి చేసేందుకు భూ సేకరణ, పునరావాస చర్యలను వేగవంతం చేస్తున్నామని వివరించారు. జూరాల ప్రాజెక్టులో డీసిల్టింగ్ పనులను వెంటనే చేపట్టాలని సాగునీటి శాఖ అధికారులకు మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ఆదేశించారు. 1995లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు మొదట 11.94 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకున్నా.. మట్టిపూడిక కారణంగా ప్రస్తుతం 9 టీఎంసీలకు చేరిందన్నారు. డీసిల్టింగ్ ద్వారా తీసే ఇసుకను గోదావరి పరివాహక ప్రాంతంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో వినియోగించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. ఇటీవల వానాకాలం సీజన్లో రాష్ట్రంలో 148.5 లక్షల మె.ట., ధాన్యం ఉత్పత్తి నమోదు కావడం దేశంలోనే రికార్డు అన్నారు. అలాగే సుమారు 72 లక్షల మె.ట., ధాన్యాన్ని కొనుగోలు చేసి.. రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్లు జమ చేశామని చెప్పారు. సమావేశంలో ఎంపీ డీకే అరుణ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రభుత్వ ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇరిగేషన్ శాఖ సెక్రటరీ ఈ.శ్రీధర్, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్రెడ్డి సూచనల మేరకు రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కోసం భూ సేకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ఈ పనుల కోసం జూన్ 2 నాటికి రూ.5 వేల కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. 2014 తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. పాలమూరు– రంగారెడ్డి పథకంలో నీటి ఎత్తిపోతల పాయింట్ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వల్ల ఖర్చు పెరిగి రాష్ట్రానికి నష్టం వాటిల్లిందన్నారు. అలాగే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లో తుమ్మిడిహట్టి స్థానంలో మేడిగడ్డను ఎంచుకోవడం కూడా తెలంగాణ రైతులకు శాపంగా మారిందని విమర్శించారు. అన్ని పనులు పారదర్శకంగా, చట్టబద్ధంగా చేపడతామని స్పష్టం చేశారు. కృష్ణానది పరివాహకంలోని రైతులకు సాగునీరు, పంటల ఉత్పత్తి పెరుగుదల, ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు కేంద్రిత విధానాలతో ముందుకెళ్తోందన్నారు. తమ ప్రభుత్వం 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు పాలమూరు ప్రాజెక్టు కోసం రూ.7,161 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఇందులో ప్రాజెక్టు పనులకు రూ.6,718 కోట్లు, భూ సేకరణకు రూ.284.71 కోట్లు, పునరావాసానికి రూ.63.65 కోట్లు, ఇతర పనులకు రూ.94 కోట్లు వెచ్చించామన్నారు. -
పీయూకు జవసత్వాలు
అంబులెన్స్ అందించిన ఎంపీ.. యూనివర్సిటీలో విద్యార్థులు అనారోగ్యానికి గురైతే ప్రాథమిక చికిత్స అందించేందుకు అధికారులు ప్రత్యేక పీహెచ్సీని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక్కడ చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు మాత్రమే చికిత్స ఇవ్వనున్నారు. అయితే విద్యార్థులకు అత్యవసర పరిస్థితి ఏర్పడితే ప్ర భుత్వ ఆస్పత్రి లేదా ఇతర ఆస్పత్రులకు తరలించేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండేంది. ఈ క్రమంలో పీయూ అధికారులు ఎంపీ డీకే అరుణను సంప్రదించగా ఆమె స్పందించి యూనివర్సిటీకి సుమారు రూ.10 లక్షల విలువైన అంబులెన్స్ను అందించారు. ప్రస్తుతం అది విద్యార్థులకు సేవలు అందిస్తుంది. మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: యూనివర్సిటీల అభివృద్ధికి నిధులు కేవలం ప్రభుత్వం నుంచే సంప్రదాయంగా వస్తున్న పద్ధతి ఉండేది. కానీ, పీయూలో ప్రభుత్వ నిధులతోపాటు ప్రైవేటు వ్యక్తుల నుంచి నిధులు సేకరించి యూనివర్సిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఈ క్రమంలో యూనివర్సిటీ చరిత్రలోనే గతేడాది అత్యధికంగా విరాళాలు సాధించి రికార్డు సాధించారు. సుమారు రూ.10.20 కోట్ల నిధులు దాతల నుంచి రాబట్టడం విశేషం. అంతేకాకుండా భవిష్యత్లో మరిన్ని నిధులను ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి (సీఆర్ఎఫ్) కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద నిధులు సేకరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని ప్రైవేటు సంస్థలకు యూనివర్సిటీ అవసరాలు, విద్యార్థులకు వసతుల కల్పన కోసం నిధులు సేకరించేందుకు ప్రతిపాదనలు సైతం పంపించారు. ఈ క్రమంలోనే నిధులు ఇచ్చేందుకు కొన్ని సంస్థలు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలో మరిన్ని నిధులు యూనివర్సిటీ వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఆడిటోరియం నిర్మాణంతో.. పీయూలో విద్యార్థులు పెద్దఎత్తున కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించేందుకు ఆడిటోరియం ఇప్పటి వరకు లేవు. కేవలం రెండు సెమినార్ హాల్స్ మాత్రమే ఉండగా.. ఇందులో ఒకటి ఫార్మీసీ కళాశాల సెమినార్ హాల్, లైబ్రరీ ఆడిటోరియం. ఇక్కడ కూడా సీటింగ్ కెపాసిటీ చాలా తక్కువగా ఉండడంతో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ నేపథ్యంలో పీయూలో ఆడిటోరియం నిర్మాణం కోసం రూ.10 కోట్లు ఇవ్వనున్నట్లు ఎంఎస్ఎన్ కంపెనీ అధినేత ఎంఎస్ఎన్ రెడ్డి ప్రకటించారు. వీటికి సంబంధించిన ప్రక్రియ సైతం ప్రారంభించినట్లు లేఖలను కూడా పీయూ వీసీకి అందించారు. దీంతో ఆడిటోరియం నిర్మాణం కోసం ఎంఈడీ కళాశాల ఆవరణలో భూమిని సైతం కేటాయించారు. త్వరలో భూమిపూజ చేసే అవకాశం ఉండగా.. సుమారు వెయ్యికిపైగా సీటింగ్ కెపాసిటీతో నిర్మించనున్నారు. అలాగే యూనివర్సిటీ అవసరాలతోపాటు బయటి వారికి సైతం అద్దె ప్రాతిపదికన ఇవ్వనున్నారు. మరిన్ని నిధులు రాబడతాం.. ఏడాది కాలంలో యూనివర్సిటీ చరిత్రలో ఎప్పుడూ లేనన్ని నిధులను ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాం. యూనివర్సిటీలో ఆడిటోరియం నిర్మాణానికి ఎంఎస్ఎన్ రెడ్డి రూ.10 కోట్లు ఇవ్వనున్నారు. వీటితోపాటు పీయూ హాస్టల్స్లో చపాతి చేసేందుకు ఎస్బీఐ నుంచి రెండు రోటీ మేకర్ మిషన్ తీసుకువచ్చాం. విద్యార్థుల అవసరాల కోసం మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అంబులెన్స్ కూడా అందజేశారు. అలాగే ఇతర అవసరాల కోసం పలు ప్రైవేటు సంస్థలకు ప్రతిపాదనలు పంపించాం. త్వరలో మరిన్ని నిధులు రానున్నాయి. వీటితో విద్యార్థులకు మరిన్ని మౌలిక వసతులు కల్పించి.. నాణ్యమైన విద్య అందించేలా కృషిచేస్తాం. – జీఎన్ శ్రీనివాస్, వైస్ చాన్స్లర్, పీయూ ప్రభుత్వంపై ఆధారపడకుండా వినూత్న పంథాలో నిధుల సమీకరణ దాతల నుంచి గతేడాది సుమారు రూ.10.20 కోట్ల విరాళాలు హాస్టల్స్లో రెండు రోటీ మేకర్స్ను ఇచ్చిన ఎస్బీఐ విద్యార్థులు ఆస్పత్రికి వెళ్లేందుకు అంబులెన్స్ సమకూర్చిన ఎంపీ డీకే అరుణ విద్యార్థుల శిక్షణ, ఇతర వసతుల కల్పన కోసం పలు సంస్థలకు విజ్ఞప్తులు రోటీ మేకర్స్తో తీరిన ఇబ్బంది.. పీయూ బాలికల హాస్టల్స్లో ఇటీవల కొత్త హాస్టల్స్ ప్రారంభంతోపాటు ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు చేరారు. దీంతో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఉదయం టిఫిన్ కోసం చపాతీలు చేయడం పెద్ద సమస్యగా మారింది. ఇందులో సుమారు 750 మందికిపైగా ఉండగా ఒక్కొక్కిరికి సుమారు నాలుగు చపాతీలు ఇచ్చినా ఒక్కరోజు సుమారు 4 వేల చపాతీలు చేయాల్సి వస్తుంది. దీంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండటంతో ఎస్బీఐ గణేష్నగర్ బ్రాంచ్ యూనివర్సిటీ అధికారులు రోటీ మేకర్స్ ఇవ్వాలని ప్రతిపాదనలు పెట్టారు. దీంతో స్పందించిన ఎస్బీఐ అధికారులు పీయూ హాస్టల్స్కు రూ.10 లక్షల విలువైన రెండు రోటీ మేకర్స్ను అందించారు. ఇవి ప్రస్తుతం బాలికల హాస్టల్స్లో అందుబాటులోకి వచ్చాయి. వీటి అవసరం రెండు బాలుర హాస్టల్స్లో కూడా ఉండడంతో అక్కడ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. -
ప్రణాళికతో పదిలం
● వార్షిక పరీక్షలకు మిగిలింది 6 రోజులే.. ● విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించిన ఉపాధ్యాయులు ● పక్కాగా ప్రాక్టీస్ పరీక్షల నిర్వహణ ● సబ్జెక్టుల వారీగా రివిజన్లు ●పదోతరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు తగిన ఏర్పాట్లు పూర్తి చేశాం. వెనుకబడిన విద్యార్థుల కోసం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మూడు నెలలుగా అనుభవం ఉన్న ఉపాధ్యాయులతో శిక్షణ ఇప్పిస్తున్నాం. ఈసారి అనుకున్న లక్ష్యం మేర ఉత్తీర్ణత సాధించేందుకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. – అబ్దుల్ ఘని, జిల్లా విద్యాధికారి అమరచింత కేజీబీవీలో ప్రత్యేక తరగతుల్లో పదోతరగతి విద్యార్థినులు (ఫైల్) అమరచింత: విద్యార్థుల జీవితంలో పదోతరగతి తొలిమెట్టు. అంత వరకు సాధారణంగా చదివిన పాఠశాల పరిధిలోనే పరీక్షలు రాసే విద్యార్థులు మొదటిసారి పబ్లిక్ పరీక్షలు రాసేది పదోతరగతిలోనే. ఉపాధ్యాయుల పనితీరుకు సైతం ఇది పరీక్షా కాలమని చెప్పవచ్చు. వార్షిక పరీక్షలకు ఇంకా 6 రోజుల సమయం మాత్రమే ఉండటంతో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ప్రత్యేక వ్యూహాలతో సిద్ధమవుతున్నారు. ప్రతిరోజు సబ్జెక్టుల వారీగా రివిజన్ చేస్తున్నారు. ఏఏఈఈఆర్టీ రూపొందించిన కరదీపికలతో పాటు ప్రత్యేక ప్రశ్నాపత్రాలు తయారు చేసి ఇది వరకే పరీక్షలు నిర్వహించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో గుర్తింపు సాధించే దిశగా జిల్లా విద్యాశాఖ అడుగులు వేస్తోంది. జిల్లాలోని 15 మండలాల్లో 221 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో బాలికలు 3,635 మంది, బాలురు 3,577 మంది మొత్తం 7,212 మంది విద్యార్థులు పదోతరగతి వార్షిక పరీక్షలకు హాజరుకానున్నారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 15 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పదోతరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. గతేడాది వార్షిక పరీక్షలకు వంద రోజుల ముందుగా.. ఈ ఏడాది దసరా సెలవుల తర్వాత ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. కొన్నిచోట్ల దాతల సహకారంతో, మరికొన్ని చోట్ల కలెక్టర్ ప్రత్యేక నిధులతో అల్పాహారం అందించారు. కాగా ఈసారి గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు రావడంతో విద్యార్థులకు బోధనతో పాటు తరగతుల నిర్వహణ సైతం అంతంత మాత్రంగానే కొనసాగినట్లు తల్లిదండ్రులు చెప్పుకొస్తున్నారు. కేవలం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోనే ప్రత్యేక తరగతులు నిర్వహించారు. వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం పదోతరగతి వార్షిక పరీక్షల నిర్వహణకుగాను విద్యాధికారులు ఇప్పటికే తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో ఎగ్జామినేషన్ జోన్లు 14, పరీక్ష కేంద్రాలు 37 గుర్తించారు. వీటిలో ఏ–కేటగిరిలో 12, బి–కేటగిరిలో 25 ఉన్నాయి. ప్రశ్నపత్రాల భద్రతకు 10 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. -
స్వచ్ఛతే ఉత్తమ సేవ
వనపర్తిటౌన్: స్వామి వివేకానంద చెప్పినట్లు ఉత్తమ సేవ అంటే స్వచ్ఛతేనని.. చెత్త రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదామని హైదరాబాద్ రీజినల్ డైరెక్టర్ కం అప్పిలేట్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి కోరారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఆదివారం జిల్లాకేంద్రంలోని కేడీఆర్ పార్క్లో మున్సిపల్ చైర్పర్సన్ ఎం.మాధవి అధ్యక్షతన ఇంటింటి చెత్త సేకరణపై ప్రజలు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. నేటి చిన్న మార్పులే భవిష్యత్కు బంగారు బాటలు అవుతాయని, తడి, పొడి చెత్తను పురపాలిక అందజేసిన వేర్వేరు పాస్టిక్ బుట్టల్లో వేసి చెత్త సేకరణ వాహనాలకు అందించాలన్నారు. చెత్త ఇంటి బయట వేయడమంటే మన ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని మనమే దెబ్బ తీసుకున్నట్లని, పట్టణాన్ని గ్రీన్ జోన్గా తీర్చిదిద్దేందుకు పట్టణవాసులంతా సహకరించాలని కోరారు. ఇంటితో పాటు కాలనీని సైతం శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తు చేశారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వార్డు మహిళలు, మహిళా సంఘ సభ్యులను ఆయన సన్మానించారు. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ నారాయణరావు, పుర కమిషనర్ ఎన్.వెంకటేశ్వర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్రెడ్డి, మెప్మా అధికారులు బాలరాజు, యువరాజు, సరస్వతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వనపర్తి
ఫ్యామిలీతోనే ‘ఇంతి’ంతై.. ఆమెకు ఆపదొస్తే.. ఆదివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2026సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఆధునిక కాలంలో మహిళలు.. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. కాలం మారుతున్న కొద్దీ వారి కట్టుబాట్లు మారాయి. ప్రధానంగా యువతుల ఆలోచన ధోరణిలో మార్పులు చోటుచేసుకున్నాయి. విద్య, ఉద్యోగాలు, జీవనంలో ఎక్కువ శాతం మంది స్వతంత్ర (ఇండిపెండెంట్) భావజాలాన్ని కనబరుస్తున్నారు. అయితే కుటుంబ సహకారమే తమకు ముఖ్యమని.. తమ నిర్ణయాలకు తల్లిదండ్రుల మద్దతు అవసరమని స్పష్టం చేస్తున్నారు. వారి కష్టాలు, శ్రమ ఫలితంగానే తాము ఈ స్థాయికి చేరామని.. అయితే తాము స్వతంత్రంగా జీవించేలా తమ నిర్ణయాలను గౌరవించే వైఖరికి సంబంధించి కుటుంబసభ్యుల్లో మరింత మార్పు అవసరమని పలువురు ఆకాంక్షిస్తున్నారు. ఆదివారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యనభ్యసిస్తున్న 18 నుంచి 25 ఏళ్ల యువతుల మనోగతంపై ‘సాక్షి’ సర్వే నిర్వహించింది. ఇందులో వెల్లడైన అంశాలు మీకోసం.. సర్వే సాగిందిలా.. ఉమ్మడి పాలమూరులో నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాల్లో ఒక్కో జిల్లా నుంచి 20 మంది చొప్పున యువతుల అభిప్రాయాలను ‘సాక్షి’ బృందం సేకరించింది. ఆయా జిల్లా కేంద్రాలు, పలు మున్సిపాలిటీల మున్సిపాలిటీల పరిధిలో మొత్తంగా 100 శాంపిళ్లు తీసుకుంది. ● రోజువారి నిర్ణయాల్లో ఎంత మేర స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు అనే ప్రశ్నకు ఒక్కో జిల్లాలో ఒక్కోరకమైన సమాధానం వచ్చింది. వంద మంది మహిళల్లో 25 మంది మాత్రమే పూర్తిస్థాయిలో స్వతంత్ర నిర్ణయాలతో ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు. ఇదే క్రమంలో మీరు నిర్ణయాలకు మీ ఇంట్లో ఎంత మేర మద్దతు లభిస్తోంది అనే దానికి కొద్ది మేర మాత్రమే అని 58 మంది సమాధానం ఇచ్చారు. ఒక సీ్త్ర ఇండిపెండెంట్గా ముందుకు వెళ్లాలంటే ఎవరి సహకారం ఎక్కువ అవసరం? 8668కుటుంబంమీరు చదువుతున్న కోర్సునుమీరు కావాలనే ఎంచుకున్నారా? మీరు తీసుకునే రోజు వారి నిర్ణయాల్లో ఎంత మేరకు స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నారు? అర్హులందరికీ సంక్షేమ ఫలాలు వనపర్తి రూరల్: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అన్నారు. శనివారం పెబ్బేరు పుర కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్గౌడ్, కమిషనర్ ఖాజా ఆరీఫుద్దీన్తో కలిసి ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల ముంగిటకే పాలనను తీసుకురావడమే ప్రజాపాలన ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో షెడ్యూల్ ప్రకారం దరఖాస్తులు స్వీకరిస్తామని.. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ప్రజలు సమర్పించిన దరఖాస్తులను అత్యంత పారదర్శకంగా పరిశీలిస్తామని చెప్పారు. పుర చైర్మన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్నుత్న ఈ కార్యక్రమాన్ని పుర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ సుమిత్ర ఎల్లారెడ్డి, మార్కెట్ చైర్మన్ ప్రమోదిని, వైస్ చైర్మన్ ఎద్దుల విజయవర్దన్రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. యూరియా కొరత సృష్టించొద్దు : డీఏఓ అమరచింత: రైతులకు సకాలంలో యూరియా అందించేందుకు దుకాణాల్లో నిల్వలు సిద్ధంగా ఉంచుకోవాలని.. కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆంజనేయులు హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలోని హాకా ఫర్టిలైజర్ సెంటర్తో పాటు ఇతర దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత సీజన్లో యూరియా అనుకున్నంత మేర సరఫరా కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. వచ్చిన యూరియాను సకాలంలో సరఫరా చేసినా.. రైతులు దొరకదనే ఉద్దేశంతో ఎక్కువ తీసుకెళ్లడంతో సమస్య తలెత్త్తిందని చెప్పారు. కొరతను నివారించడానికి ప్రభుత్వం ప్రత్యేక యాప్ను రూపొందించిందని.. ప్రతి రైతు తన స్మార్ట్ఫోన్లో యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఇంటి నుంచే బుక్ చేసుకోవచ్చని తెలిపారు. యాప్ వినియోగంపై రైతులకు వ్యవసాయశాఖ సిబ్బంది అవగాహన కల్పించారని చెప్పారు. రైతులకు సకాలంలో యూరియా అందించలేని డీలర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఏఓ అరవింద్, ఏఈఓలు ఉన్నారు. ముగిసిన బ్రహ్మోత్సవాలు బిజినేపల్లి: వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ముగిశాయి. ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల శ్రీమన్నారాయణచార్యుల ఆధ్వర్యంలో ఉత్స వమూర్తులకు పవిత్ర పుష్కరిణిలో అభిషేకం, చక్రతీర్థం నిర్వహించారు. భక్తులు పుష్కర స్నానం ఆచరించి ముక్కోటి దేవతలకు శాస్త్రోక్తంగా పరిసమాప్తి వీడ్కోలు పలికారు. ఆమెదే.. పైచేయి..వనపర్తిటౌన్: పుర పాలకవర్గం ప్రతి వార్డులో ప్రాధాన్యత క్రమంలో ఐదు దశల్లో అభివృద్ధి పనులు చేపట్టేలా మార్గదర్శకాలు రూపొందించామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం పుర కౌన్సిల్ హాల్లో 55 మంది పారిశుద్ధ్య కార్మికులు, 52 మంది ఆర్పీలు, 20 మంది మహిళా కౌన్సిలర్ల సన్మాన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై వారిని సన్మానించి మాట్లాడారు. ప్రతి వార్డును సమగ్రంగా అధ్యాయనం చేసేందుకు రోజంతా తిరగాలని.. ముఖ్యమైన సమస్యలను తొలి విడతలో పరిష్కరిస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందించాలని సూచించారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్లు చట్టసభల్లో అమలైతే అత్యధికంగా మహిళలే ప్రజాప్రతినిధులుగా రాణిస్తారని చెప్పారు. వనపర్తిలో నిజాం కాలంలోనే ఆసియాలోనే తొలి సైఫన్ సిస్టం, బస్డిపో, సెంట్రల్ లైటింగ్, తొలి ముద్రణాలయంతో పాటు అభివృద్ధికి దశల వారీగా అడుగులు పడుతూ వచ్చాయన్నారు. పారిశుద్ధ్య కార్మికులు వేతనం గురించి ఆలోచించకుండా ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్నారని, కార్మికుల హక్కుల సాధన, వారికి అన్నిరకాల బెనిఫిట్స్ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పురపాలికకు కౌన్సిల్ ఆమోదంతో 50 మంది కార్మికుల నియామకానికి చొరవ తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ ఎం. మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్, కౌన్సిలర్లు ధనలక్ష్మి, విజయలక్ష్మి, సౌమ్య, మహేశ్వరి, నాగమ్మ, శిరీష, శారద, అరుణజ్యోతి తదితరులు పాల్గొన్నారు. కౌన్సిలర్లను గౌరవించాలి.. పుర అధికారులు, సిబ్బంది ప్రజలతో ఎన్నుకున్న కౌన్సిలర్లకు తగిన గౌరవం ఇవ్వాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి సూచించారు. శనివారం పుర కార్యాలయంలో చైర్పర్సన్ ఎం.మాధవి అధ్యక్షతన పుర అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో పాలకవర్గానికి పరిచయ కార్యక్రమం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కౌన్సిలర్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించాలని, వారి స్థాయిలో కాకుండా చైర్పర్సన్, అక్కడ కూడా కాకుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో వైస్చైర్మన్ మధుసూదన్గౌడ్, కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఈ యూనుస్, మేనేజర్ శంకర్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్రెడ్డి, ఏఈలు ప్రశాంత్, మేఘనాథ్, మెప్మా అధికారులు బాలరాజు, యువరాజు, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. చైర్పర్సన్ మాధవి, మహిళా కౌన్సిలర్లను సన్మానిస్తున్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని నేటి మహిళలు నిరూపిస్తున్నారు. మహిళలు రాజకీయంగా మెరుగైన పాలన అందిస్తూ గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించాలి. మహిళా ప్రజాప్రతినిధులు పాలనలో భర్తల ప్రమేయం లేకుండా స్వయం నిర్ణయాలు తీసుకుంటే రాజకీయ సాధికారత సాధ్యం కావడంతో పాటు మహిళల ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచ మహిళా దినోత్సవం కంటే ముందు, తర్వాత చేసిన ప్రతి ఉద్యమంలో మహిళల పాత్ర ఎనలేనిది. – ఎం.మాధవి, మున్సిపల్ చైర్పర్సన్, వనపర్తి స్థానిక మున్సిపాలిటీలో గతంలో మహిళా కౌన్సిలర్ల బదులు వారి భర్తలే అన్ని అంశాల్లో పెత్తనం చేస్తే తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశామని.. అలాంటి పరిస్థితులు పునరావృత్తం కానివ్వొద్దని కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకురాలు, 21వ వార్డు కౌన్సిలర్ పి.ధనలక్ష్మి ఎమ్మెల్యేను కోరారు. ఎవరేమనుకున్నా తనకు అభ్యంతరం లేదని, మహిళా సంఘాల ఆర్పీలు సైతం మహిళలే ఉండేలా చూడాలన్నారు. ఆమె వ్యాఖ్యలతో అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు, మహిళా సంఘాల ఆర్పీలు, అధికారులు అవాక్కయ్యారు. వనపర్తి: మహిళలకు ఆపదొస్తే తక్షణం ఏం చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి..? ఇదికో ఈ నంబర్లను సంప్రదిస్తే చాలు కొండంత అండ దొరుకుతుంది. అధికారి యంత్రాంగం మీకు రక్షణ కవచంలా ఉంటుంది. మొదట డయల్ 100కు ఫోన్ చేయండి. తర్వాత షీటీమ్, భరోసా కేంద్రాలు, స్థానిక పోలీసులను సంప్రదించాలి. మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్తో కౌన్సిలర్గా పోటీ చేసే అవకాశం కలిగింది. వార్డు ప్రజలు నాపై విశ్వాసం ఉంచి గెలిపించారు. వార్డును అభివృద్ధి చేద్దామనుకుంటే అదృష్టవశాత్తు చైర్పర్సన్గా అవకాశం దక్కింది. అమరచింతను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా. ఐదేళ్ల పాలనలో రాజకీయాలకు అతీతంగా మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తా. – జింక సువర్ణ రవి, పుర చైర్పర్సన్, అమరచింత మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్నిరంగాల్లో రాణించాలి. బాగా చదివి ఉద్యోగాలు, వ్యాపారం, రాజకీయ రంగాల్లో తమ ప్రతిభ చాటాలి. ముందుంటేనే సమస్యలు సునాయసంగా పరిష్కారమవుతాయి. మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో, పాలకవర్గ సమన్వయంతో పురపాలికను అన్నింటా అభివృద్ధి చేస్తా. – నాగమణి, పుర చైర్పర్సన్, ఆత్మకూర్ పాలనాధికారి పారిశుద్ధ్య కార్మికుడై.. కుటుంబం మద్దతుతోనే ముందుకు.. 18 నుంచి 25 ఏళ్ల యువతుల మనోగతం తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల ఆలోచన ధోరణుల్లో మరింత మార్పు రావాలని ఆకాంక్ష -
‘పీఎం విశ్వకర్మ’ లబ్ధిదారులకు అవగాహన
వనపర్తి: జిల్లాకేంద్రంలోని ఓ బాంకెట్ హాల్లో శనివారం పీఎం విశ్వకర్మ పథకం లబ్ధిదారులకు ఎంఎస్ఎంఈ డీఎఫ్ఓ హైదరాబాద్, జిల్లా ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ సెంటర్ (ఈడీసీ), వనపర్తి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. విశ్వకర్మ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మేనేజర్ చంద్రశేఖర్ పథకం గురించి వివరంగా తెలియజేసి వారి సందేహాలను నివృత్తి చేశారు. అలాగే పథకం ద్వారా చేకూరే ప్రయోజనాలు, రుణ సదుపాయం, శిక్షణపై అవగాహన కల్పించారు. లబ్ధిదారులు తమ సందేహాల నివృత్తి, అప్లికేషన్లోని లోపాలను సరిచేసుకోవడానికి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను సంప్రదిస్తే సాయం అందిస్తామన్నారు. విశ్వకర్మ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు రాఘవేంద్రగౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం విశ్వకర్మ పథకం ద్వారా ఎక్కువ మంది లబ్ధి పొందాలని, సంప్రదాయ వృత్తుల్లో ఉన్న వారు ఈ పథకం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జ్యోతి, డీపీఎం నాగమల్లిక, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శివకుమార్, బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ పాండురంగం, డీఆర్డీఏ సూపరింటెండెంట్ ప్రభాకర్, పరిశ్రమలశాఖ ఐపీఓ నాగేష్, ఎంఎస్ఎంఈ డీఎఫ్ఓ అసిస్టెంట్ డైరెక్టర్ గురుస్వామి, ఈడీసీ మేనేజర్ శ్రీకాంత్, అసిస్టెంట్ మేనేజర్ హైమావతి తదితరులు పాల్గొన్నారు. -
42 శాతం రిజర్వేషన్ సాధనకు పోరాటం
● బీసీ సర్పంచ్లను ఇబ్బందులకు గురిచేస్తే సహించం ● రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య వనపర్తి టౌన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేంత వరకు పోరాటం ఆగదని.. బీసీ సర్పంచ్లను ఇబ్బందులు, ఒత్తిడికి గురి చేసినా సహించమని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. శనివారం జిల్లాకేంద్రంలో బీసీ సర్పంచులు, ఉప సర్పంచుల సన్మానసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఏ కుల రిజర్వేషన్లో లేని క్రిమిలేయర్ బీసీ రిజర్వేషన్లో ఉండటం వివక్షతో అణగదొక్కడమేనని, తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగ, ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయడానికి కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కోరారు. రాజకీయ ఎదుగుదలకు బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంట్లో పెండింగ్లో ఉన్న రిజర్వేషన్ బిల్లును సాధించుకునే వరకు పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయకపోయినా 60 శాతానికి పైగా గ్రామపంచాయతీలు, పురపాలికల్లో బీసీలే గెలుపొందారని చెప్పారు. 42 శాతం రిజర్వేషన్ సాధించడానికి పెద్దఎత్తున పోరాటాలు చేసేందుకు ప్రతి బీసీ బిడ్డ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. జనాభా పరంగా ఎక్కువ మందిమే ఉన్నా.. అగ్రవర్ణ నేతలు చిన్నచూపు చూస్తూనే ఉన్నారని, బీసీల ఐక్యత ఎలా ఉంటుందో అందరికీ చూపించాల్సిన సమయం ఉంచిందన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ అధ్యక్షుడు అరుణ్కుమార్, జిల్లా అధ్యక్షుడు అరవింద్స్వామి, బీసీ సంక్షేమ సంఘం నాయకులు ధారాసింగ్, రమేష్, జహంగీర్ పాషా, రఘునందన్చారి, సతీష్, గోపి, ముకుందనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
10న మెగా జాబ్ డ్రైవ్
వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 10న ఉదయం 11 గంటలకు మెగా జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. ఈశ్వరయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఉపాధి అధికారి డా. ప్రియాంక ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్మేళాలో 13 కంపెనీలు పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ పూర్తిచేసి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు అర్హులని, ఎంపికై న వారికి నెలకు రూ.14 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనాలు ఉంటాయన్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు
‘ఆమె’ లేకపోతే జననం లేదు.. గమనం లేదు.. ‘ఆమె’ లేకపోతే జీవనం లేదు.. అసలు సృష్టే లేదు.. గుడిలో.. బడిలో.. నారు మడిలో.. ‘ఆమె’ లేని చోటు లేదు.. ‘ఆమె’కు సాటి లేదు.. కలం పట్టినా.. హలం దున్నినా.. అధికారం చూపినా.. అక్కున చేర్చుకున్నా.. అంతా ‘ఆమె’ .. అన్నింటా ‘ఆమె’.. సృష్టి, స్థితి, లయకారులకూ ‘ఆమె’నే ధైర్యం ‘ఆమె’కెన్నో రూపాలు.. మనం కూడా ప్రతి రూపాలమే.. ‘ఆమె’ ఒక ధైర్యం.. ఆ ఆదరణ లేకపోతే అంతా శూన్యం ఆమెను తలిస్తే అన్నీ దర్శించినట్టే.. అందుకే ‘ఆమె’ కోసం ఓ రోజు... ఆదివారం అంతర్జాయతీ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు.. – వనపర్తి/వనపర్తిటౌన్/ కొత్తకోట రూరల్/ఆత్మకూర్/అమరచింత -
‘ప్రజాపాలన’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
● 99 రోజుల ప్రత్యేక కార్యాచరణతో ముందుకు.. ● రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామసభల్లో తాగునీటి సమస్యను ప్రజలు ప్రస్తావించే అవకాశం ఉందని, ఇందుకు గాను ముందుగానే అధికారులు తాగునీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గడిచిన రెండున్నరేళ్లలో గ్రామాల్లో ప్రభుత్వ పథకాల లబ్ధిపొందిన వారి వివరాలను గ్రామసభల్లో వెల్లడించాలని సూచించారు. లబ్ధిదారుల జాబితా, నోడల్ అధికారుల జాబితా, దరఖాస్తుల వివరాలను అధికారులు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇవ్వాలని స్పష్టం చేశారు. 46 లక్షల మంది మహిళలకు హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తున్నామన్నారు. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఒక్కోరోజు తాను పాల్గొంటానని పేర్కొన్నారు. ఇందులో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉన్నాయని, 99 రోజుల కార్యక్రమానికి అనుగుణంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. సీఎం రేవంత్రెడ్డి సైతం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. అటవీ పోడు భూముల సమస్య పరిష్కారానికి రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆస్పత్రుల అభివృద్ధి కమిటీల సమావేశాలు నిర్వహించేలా చూస్తామన్నారు. అందరూ చొరవ తీసుకోవాలి.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మొదటిరోజు నుంచి చివరి వరకు అదే ఉత్సాహంతో నిర్వహించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. 99 రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించడం ఇదే మొదటిసారి అని, కలెక్టర్లు, అధికారులు చొరవ తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల కలెక్టర్లు ఖుష్బూ గుప్తా, బదావత్ సంతోష్, ఆదర్శ్ సురభి, రిజ్వాన్బాషా షేక్, నారాయణపేట అదనపు కలెక్టర్ ఫణీంద్రరెడ్డి, మహబూబ్నగర్ మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్రెడ్డి, ఆయా జిల్లాల ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, డీఆర్డీఓలు, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ ప్రచార వాల్పోస్టర్లు, టీషర్ట్లను ఆవిష్కరించారు. -
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కసరత్తు
వనపర్తి: కాంగ్రెస్పార్టీని బలోపేతం చేసేందుకు పోలింగ్ బూత్స్థాయి నుంచి కసరత్తు ప్రారంభించామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి తెలిపారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లోని డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ హాజరై దిశా నిర్దేశం చేశారని చెప్పారు. ఈ నెల 9 నుంచి ఏప్రిల్ 30 వరకు విడతల వారీగా జిల్లా, మండల, పట్టణ, గ్రామకమిటీలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. పుర, మండల కేంద్రాలకు వెళ్లి అందరి ఆమోదంతో కార్యవర్గాలను ఏర్పాటు చేస్తామన్నారు. రానున్న కాలంలో బూత్స్థాయి కమిటీలు కీలకంగా పని చేస్తాయని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, తాను సైతం ఓటుహక్కు ఉన్న ప్రాంతాల్లోని బూత్ కమిటీలో సభ్యులుగా ఉండనున్నట్లు ప్రకటించారు. కమిటీల్లో ఉండదలుచుకున్న వారు అర్జీ చేసుకోవాలని సూచించారు. పార్టీ కోసం పూర్తిస్థాయిలో పని చేసేవారికి తొలి ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. రానున్న జనరల్ ఎన్నికల్లో రాహుల్గాంధీని ప్రధానిని చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్ రాజీనామాను అప్పడే ఆమోదించామని.. ప్రస్తుతం ఆయనకు కాంగ్రెస్పార్టీకి ఎలాంటి సంబంధం డీసీసీ అధ్యక్షుడు స్పష్టతనిచ్చారు. పార్టీలో క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారైనా ఉపేక్షించలేది లేదని హెచ్చరించారు. వనపర్తి, పెబ్బేరు మార్కెట్యార్డుల అధ్యక్షులు శ్రీనివాస్గౌడ్, ప్రమోదినిరెడ్డి, పుర చైర్పర్సన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్, పెబ్బేరు పుర చైర్మన్ శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. -
స్వచ్ఛతలో భాగస్వాములు కావాలి
వనపర్తి: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్చి 15 వరకు కొనసాగే పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. శుక్రవారం మొదటి థీమ్ అయిన ‘పరిశుభ్రత’ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అంతకుముందు అంబేడ్కర్ చౌరస్తా నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులతో కలిసి పరిశుభ్రత అవగాహన ర్యాలీ నిర్వహించగా.. పుర చైర్పర్సన్ మాధవి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతతో పాటు పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్పై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని.. అలాగే అధికారులు తమ కార్యాలయాల్లోని పెండింగ్ ఫైల్స్ను త్వరగా క్లియర్ చేయాలని సూచించారు. వానాకాలంలో వర్షపు నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి శుభ్రం చేయాలని, దోమలు వృద్ధి చెందకుండా నిరోధించి వ్యాధులను దూరం చేయాలన్నారు. పది రోజుల్లో మురుగు కాల్వలతో పాటు రహదారులను కూడా శుభ్రంగా ఉంచే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా పురపాలికల ఆదాయం పెంపునకు పన్ను వసూళ్లలో వేగం పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా పుర కమిషనర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పరిశుభ్రతపై అందరితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, డీపీఆర్వో సీతారాం, డీవైఎస్ఓ సుధీర్రెడ్డి, మార్కెట్యార్డ్ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ.. జిల్లాకేంద్రంలోని ఈవీఎం గోదాంకు కట్టుదిట్టమైన భద్రత కల్పించామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. త్రైమాసిన తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఆర్డీఓ కార్యాలయ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ తనిఖీ చేశారు. ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది హాజరు తీరుపై ఆరా తీశారు. గోదాం వద్ద విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, రెవెన్యూ అధికారులు చక్రపాణి, సి–సెక్షన్ సిబ్బంది రాజేష్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు లక్ష్మయ్య, శంకర్, వేణాచారి, పరమేశ్వరాచారి, కుమారస్వామి, ఆంజనేయులు, గట్టు యాదవ్ తదితరులు ఉన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
ముగిసిన రంగనాథుడి బ్రహ్మోత్సవాలు
వనపర్తి రూరల్: శ్రీరంగాపురం రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిశాయని ప్రధాన అర్చకుడు విష్ణునారాయణ తెలిపారు. చివరిరోజు ఉదయం అర్చకుల వేదమంత్రోచ్ఛారణ నడుమ గర్భాలయంలో శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథస్వామిని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు, హోమం, అవభృత స్నానం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. సాయంత్రం పుష్పయాగం, ద్వాదశారాధన జరిగాయి. 12 రకాల పూలను 12 ఆరాధనలతో స్వామివారికి విశేషంగా సమర్పించారు. ధ్వజ అవరోహణం, నాగావళి నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు కిట్టుస్వామి, గోవిందాచార్యులు, కన్నయ్యస్వామి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు వనపర్తిటౌన్: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. శుక్రవారం జరిగిన రెండో సంవత్సరం పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 4,803 మంది విద్యార్థులకుగాను 4,581 మంది విద్యార్థులు హాజరుకాగా.. 222 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. జనరల్ విద్యార్థులు 3,726 మందికిగాను 3,537 మంది పరీక్ష రాయగా.. 189 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు 1,077 మందికిగాను 1,044 మంది హాజరుకాగా.. 33 మంది రాయలేదు. జిల్లాకేంద్రంలోని స్కాలర్స్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థుల తనిఖీని డీఐఈఓ పరిశీలించి, త్రివేణి, జాగృతి, వాగ్దేవి, అభ్యాస్, రావూస్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. డీఈసీ బృందం పాన్గల్, వీపనగండ్ల, పెబ్బేరు, శ్రీరంగాపురం, ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాల, విజ్ఞాన్, స్కాలర్స్, గోపాల్పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను, సిట్టింగ్ స్క్వాడ్ బృందం పెద్దమందడి, ఖిల్లా ఘనపురం, పాన్గల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, స్కాలర్స్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. -
సివిల్స్లో మెరిసిన పాలమూరు బిడ్డ
● గతేడాది ఆలిండియా 700వ ర్యాంక్.. ఈసారి 358వ ర్యాంక్ ● గ్రూప్–1లోనూ 27 ర్యాంక్.. ప్రస్తుతం నల్లగొండ డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం ● ఐఏఎస్ కావడమే లక్ష్యమంటున్న వెంకటేష్ ● ఖిల్లాఘనపురం ఎంపీడీఓవిజయసింహారెడ్డికి 682వ ర్యాంక్ అడ్డాకుల/ఖిల్లాఘనపురం: అఖిల భారత సర్వీసుల్లో నియామకాలకు నిర్వహించిన సివిల్స్లో పాలమూరు బిడ్డ మరోసారి సత్తా చాటాడు. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం నిజాలాపూర్ గ్రామానికి చెందిన ఎం.వెంకటేష్ప్రసాద్ సాగర్ మొదటి ప్రయత్నంలో 700 ర్యాంక్ సాధించగా.. రెండో ప్రయత్నంలో మరింత మెరుగుపరుచుకొని 358 ర్యాంక్ను సొంతం చేసుకున్నారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండల ఎంపీడీఓగా విధులు నిర్వర్తిస్తున్న విజయసింహారెడ్డి (రంగారెడ్డి జిల్లా)ఆలిండియా 682వ ర్యాంక్ సాధించారు. పట్టుదలతో చదివి ర్యాంకులు.. నిజాలాపూర్ గ్రామానికి చెందిన మునుగల్ఛేడ్ సత్యయ్య, యశోద దంపతుల కుమారుడైన ఎం.వెంకటేష్ ప్రసాద్ హైదరాబాద్లోని పటాన్చెరువు శ్రీసాయి పబ్లిక్ స్కూల్లో 1, 2వ తరగతులు, 3వ తరగతి కొత్తకోటలోని జీటీ నారాయణ, 4 నుంచి 10వ తరగతి వరకు మహబూబ్నగర్లోని చైతన్య సెంట్రల్ స్కూల్లో చదివారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి విద్యా సంస్థల్లో ఇంటర్(ఎంపీసీ), డిగ్రీ(బీఎస్సీ ఫిజిక్స్), పీజీ పూర్తి చేశారు. వెంకటేష్ ప్రసాద్ తండ్రి సత్యయ్య ప్రస్తుతం కోయిలకొండ మండలంలో ట్రాన్స్కో ఏఈగా విధులు నిర్వహిస్తున్నాడు. తల్లి యశోద గృహిణి. వీరు మహబూబ్నగర్లోని శేషాద్రినగర్లో నివాసముంటున్నారు. గతేడాది సివిల్స్లో 700వ ర్యాంకు సాధించిన వెంకటేష్.. ఈ సారి సత్తా చాటి 358వ ర్యాంక్ పొందాడు. 2025లో విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో 27వ ర్యాంకు సాధించాడు. గతేడాది సెప్టెంబర్ 27న డిప్యూటీ కలెక్టర్గా ఉత్తర్వు అందుకున్న ఆయన అదేనెల 29న నల్లగొండ జిల్లా డిప్యూటీ కలెక్టర్గా విధుల్లో చేరాడు. ప్రస్తుతం హైదరాబాద్లో గ్రూప్–1 అధికారుల శిక్షణలో ఉన్నాడు. ‘ఐఏఎస్ సాధించడమే లక్ష్యం. మరోసారి ప్రయత్నించి.. ఐఏఎస్ సాధిస్తా.’ అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు వెంకటేష్ ప్రసాద్. -
డిప్యుటేషన్.. పరేషాన్!
పురపాలికలో కీలక అధికారులు ఇతర ప్రాంతాలకు.. ● అవగాహన లేని వారికి అదనపు బాధ్యతలు ● నెట్టుకు రాలేక ఇబ్బందులు పడుతున్న వైనం ● ముగ్గురు కీలక నేతలున్నా.. తప్పని కష్టాలు 33 వార్డులు.. 22 మంది అధికారులు.. పురపాలికలో 33 వార్డులుండగా.. 23 మంది వార్డు అధికారులను నియమించారు. కాగా ఒక వార్డు అధికారి భానుప్రసాద్ డిప్యుటేషన్పై హైదరాబాద్కు వెళ్లడంతో ప్రస్తుతం 22 మంది ఉన్నారు. వీరిలో కొందరికి అదనపు వార్డులు కేటాయించారు. వీరికి పని భారం అధికం కావడంతో పాలనాపరమైన అంశాలపై పుర అధికారులతో తరచూ వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. వనపర్తిటౌన్: స్థానిక పురపాలికలో కీలక విభాగాల్లో పనిచేసే అధికారులు ఏళ్ల తరబడి డిప్యుటేషన్పై ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో పాలన, పన్ను వసూళ్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆస్తిపన్ను వసూళ్లకు ఇంకా 23 రోజుల గడువు మాత్రమే ఉండటంతో ఏ మేరకు లక్ష్యం చేరుకుంటారా అనే సందేహం వ్యక్తమవుతోంది. మున్సిపాలిటీకి ఆదాయం సమకూరడంలో సింహభాగం ఆస్తి పన్నుదే. ఆ విభాగానికే పూర్తిస్థాయి అధికారి లేకపోవడంతో రూ.కోట్లలో వసూలు కావాల్సి ఉండగా.. అరకొరగానే అవుతుండటంతో లక్ష్యంగా నెరవేరడం లేదు. ఆర్వో అనిల్కుమార్ రెండేళ్ల కిందట డిప్యుటేషన్పై కోస్గికి వెళ్లడంతో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సాయిరాంకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన ఆరోగ్యం సహకరించట్లేదని, బాధ్యతల నుంచి తప్పించాలని 6 నెలల కిందటే విన్నవించినా పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేక నెట్టుకొచ్చారు. స్థానికుడు కావడంతో పన్ను వసూళ్లలో కొంత పురోగతి కనిపించినా.. ఆశించిన స్థాయిలో లక్ష్యం చేరలేదు. ఆయన గురువారం హఠాన్మరణం చెందడంతో ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ ఊపందుకుంది. మేనేజర్ శంకర్, ఆర్ఐ రాజ్కుమార్, డీఈ యూనుస్ తప్పితే ఆ స్థాయిలో మరే అధికారి కనిపించడం లేదు. -
‘ఖిల్లా’ ఎంపీడీఓకు సైతం..
వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండల ఎంపీడీఓ విజయసింహారెడ్డి సివిల్స్లో మెరిశారు. హైదరాబాద్లోని మనికొండలో నివాసం ఉంటున్న అంజిరెడ్డి, అలివేలు దంపతులకు ఇద్దరు కుమారులు విజయసింహారెడ్డి, విక్రంసింహారెడ్డి ఉన్నారు. అన్నదమ్ములిద్దరూ ఒకేసారి గ్రూప్–1లో కొలువులు సాధించాడు. ఇప్పుడు కూడా అన్న విజయసింహారెడ్డి సివిల్స్లో ఆలిండియా 682వ ర్యాంక్ సాధించగా.. ఆయన తమ్ముడు విక్రమ్సింహారెడ్డి కూడా 541 ర్యాంక్ సాధించారు. విషయం తెలిసిన వెంటనే ఖిల్లాఘనపురంలో ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది విజయసింహారెడ్డికి స్వీట్లు తినిపించి.. అభినందనలు తెలిపారు. అలాగే బీజేపీ నాయకులు ఆయనను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. -
‘పది’లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రుణాలు ● కలెక్టర్ ఆదర్శ్ సురభి కొత్తకోట రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం ఆయన పెద్దమందడి మండలం వెల్టూరు మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్వహణ, బోధన విధానం, విద్యార్థినుల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. చదువులో వెనుకబడిన విద్యార్థినుల వివరాలు తెలుసుకొని ప్రత్యేక శ్రద్ధతో బోధన అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థినుల మార్కుల జాబితాను పరిశీలించారు. అనంతరం వంటశాల, స్టాక్ రిజిస్టర్, విద్యార్థినులకు అందిస్తున్న భోజనం, ఆహార నాణ్యత పరిశీలించారు. శుభ్రత పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేసి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకోవాలని తహసీల్దార్కు సూచించారు. వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని.. కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని పదోతరగతి విద్యార్థులను ప్రోత్సహించారు. అనంతరం పెద్దమందడిలోని బీసీ బాలుర వసతిగృహాన్ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రహరీ, టాయిలెట్స్ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన.. పెద్దమందడి, వెల్టూరులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న లబ్ధిదారులను గుర్తించి వారికి మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించే ఏర్పాటు చేయాలని ఎంపీడీఓను ఆదేశించారు. అదేవిధంగా గ్రౌండింగ్కు నోచుకోని ఇళ్లను వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పెద్దమందడిలో రూ.5 లక్షలతో నిర్మించిన నమూనా ఇందిరమ్మ ఇంటిని సందర్శించారు. ఇంటి నిర్మాణంలో ఏమైనా సందేహాలుంటే నమూనా ఇందిరమ్మ ఇంటిని సందర్శించి ఇంజనీర్లతో మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట హౌసింగ్ డీఈ విఠోభా, తహసీల్దార్ పాండునాయక్, ఎంపీడీఓ పరిణత, పాఠశాల సిబ్బంది, ఇతర అధికారులు ఉన్నారు. -
మెనూ విధిగా పాటించాలి
పాన్గల్: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని డీఆర్డీఓ, మండల ప్రత్యేక అధికారి ఉమాదేవి అన్నారు. బుధవారం మండల కేంద్రలోని కస్తూర్బా విద్యాలయను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలు, స్టాక్ రూంలోని నిత్యావసర సరుకులు, గడువు తేదీ, భోజనాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోజు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వార్షిక పరీక్షలకు సిద్ధం చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దాలని కోరారు. వంటగది ప్రహరీ పక్కన మురుగు నిల్వతో దుర్వాసన వస్తుందనే విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించి మురుగు నిల్వకుండా సాఫీగా ముందుకు సాగేలా పైపులైన్ ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఓ హేమలత, ఏపీఓ కుర్మయ్య, పంచాయతీ కార్యదర్శి నరేష్గౌడ్ పాల్గొన్నారు. -
రూ.71.71 కోట్లతో ‘అమృత్’ పనులు
వనపర్తి: జిల్లాకేంద్రానికి రానున్న 50 ఏళ్ల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని అమృత్ పథకం నిధులు రూ.71.71 కోట్లతో నీటిట్యాంకులు, పైప్లైన్ నిర్మాణాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. బుధవారం రాజనగరం శివారులో నీటిట్యాంకు నిర్మాణానికిగాను అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. నాగవరం శివారులో 5 లక్షలు, రాజనగరం శివారులో 6 లక్షల లీటర్ల సామర్థ్యంతో ట్యాంకుల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, పబ్లిక్ హెల్త్ డీఈఈ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్, మాజీ కౌన్సిలర్లు బ్రహ్మచారి, నాయకులు రమేష్, నక్కరాజు ఉన్నారు. -
గుడ్డెందొడ్డి.. అప్గ్రేడ్
రిజర్వాయర్ సామర్థ్యం 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంపు ●అనుమతులు వచ్చాయి.. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ను 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సర్వే పన ులు మొదలుపెట్టాం. ఇందుకోసం రూ.16 లక్షలు విడుదలయ్యాయి. పనులు వేగవంతంగా పూర్తిచేసి ఈ నెల చివరి నాటికి ప్రభుత్వానికి డీపీఆర్ను సమర్పిస్తాం. – రహీముద్దీన్, ఇరిగేషన్ శాఖ ఎస్ఈ గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల కింద 9 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంది. ప్రతి ఏడాది వానాకాలం ఖరీఫ్ సీజన్లో ఈ ప్రాజెక్టుల కింద సాగయ్యే ఆయకట్టుకు సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. కానీ, ఇదే ప్రాజెక్టుల కింద రబీ సీజన్లో మాత్రం ఆయకట్టుకు నీటి కష్టాలు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో ఉన్న గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇందుకు సంబంధించి రిజర్వాయర్ సామర్థ్యం పెంపునకు సంబంధించిన సర్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెలాఖరుకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపనున్నారు. దీంతో ఉమ్మడి పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టుల కింద రబీ సీజన్లో సాగయ్యే ఆయకట్టుకు సాగునీటి కష్టాలు తొలగనున్నాయి. 120 రోజులపాటు వరద గుడ్డెందొడ్డి రిజర్వాయర్ ప్రస్తుతం సామర్థ్యం 1.19 టీఎంసీలు కాగా దీనిని 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 15 టీఎంసీలకు పెంచిన నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు వరద సమయంలో ప్రతిరోజు అర టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా అధికారులు డిజైన్ చేస్తున్నారు. జూరాలకు వానాకాలంలో సుమారు 120 రోజులపాటు వరద వస్తుంది. అయితే ఇక్కడ రోజుకు అర టీఎంసీ ఎత్తిపోయడం వల్ల కేవలం 30 రోజుల్లోనే రిజర్వాయర్కు పూర్తిస్థాయి సామర్థ్యంతో నీటిని నింపుకొనే వెసులుబాటు లభిస్తుంది. వరద సమయంలో ప్రతిరోజు అర టీఎంసీ ఎత్తిపోసేలా ప్రణాళిక ఈ నెల చివరి నాటికి డీపీఆర్ సిద్ధం చేసేలా కసరత్తు ముమ్మరంగా కొనసాగుతున్నసర్వే పనులు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు తీరనున్న సాగునీటి కష్టాలు -
పాలకులకు పట్టింపేది?
● పనుల్లో కానరాని పురోగతి ● ఒక్కో నిర్మాణానికి రూ.కోటి వ్యయం ● బిల్లులు చెల్లించక నిలిచిన నిర్మాణాలు ●పట్టణంలో వైకుంఠధామం నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. గత ప్రభుత్వ హయంలో మంజూరైనా.. బిల్లులు మంజూరుగాక కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లి పనులు పూర్తి చేయించేందుకు కృషి చేస్తా. – జింక సువర్ణ రవి, పుర చైర్పర్సన్, అమరచింత వైకుంఠధామం నిర్మాణ పనులు నిలిచిపోయిన విషయాన్ని ఉన్నతాధికారులకు విన్నవించాం. గత ప్రభుత్వంలో పనులు ప్రారంభించినా.. సమయానికి నిధులు రాక పనులు ఆగిపోయాయి. ఈ విషయాన్ని మరోమారు అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్తాం. – శశిధర్, పుర కమిషనర్, ఆత్మకూర్ అమరచింతలో నిర్మాణంలో ఉన్న వైకుంఠధామం అమరచింత: పురపాలికల్లో స్థలాల కొరతతో భవిష్యత్లో మృతదేహాల ఖననానికి ఇబ్బందులు ఉండొద్దని భావించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధునిక వసతులతో వైకుంఠధామాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఒక్కోదానికి రూ.కోటి మంజూరు చేయగా.. అధికారులు టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిర్మాణాలు ప్రారంభించినా సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణాలు అర్ధాంతంగా నిలిపివేశారు. జిల్లాలో కొత్తగా ఏర్పడిన అమరచింత, ఆత్మకూర్, కొత్తకోట, పెబ్బేరు పురపాలికల్లో నిర్మాణ పనులు 65 నుంచి 70 శాతం వరకు పూర్తవగా.. మిగిలిన పనులు అటకెక్కాయి. దీనికితోడు ప్రభుత్వం మారడంతో పనులు పూర్తిగా మరుగునపడినట్లయింది. రెండేళ్ల కిందట నిర్మాణాలకు శ్రీకారం చుట్టినా.. విడతల వారీగా బిల్లులు చెల్లిస్తారన్న ఆశతో కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించారు. బిల్లులు రాక పెట్టుబడి భారంగా మారడంతో పనులు నిలిపివేశారు. కొత్తకోట, అమరచింత, ఆత్మకూర్లో 75 శాతం పనులు జరిగాయని, పెబ్బేరులో 30 శాతం కూడా పూర్తి కాలేదని సంబంధిత అధికారులు తెలిపారు. కాని వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. మూడు పురపాలికల్లో 50 శాతం పనులు మాత్రమే జరిగాయని తెలుస్తోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, బిల్లులు చెల్లించకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు. జిల్లాలో అసంపూర్తిగా వైకుంఠధామాలు -
రమణీయం.. రంగనాథుడి రథోత్సవం
● మార్మోగిన గోవింద నామస్మరణ ● భారీగా తరలివచ్చిన భక్తజనం ● పాల్గొన్న ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, ఎమ్మెల్యే తదితరులు వనపర్తి రూరల్: శ్రీరంగాపురం రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 11.30 గంటలకు అశేష జనవాహిని నడుమ రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా వివిధ రకాల రంగురంగుల పూలు, మామిడి తోరణాలు, కొబ్బరి ఆకులతో రథాన్ని ముస్తాబు చేశారు. వనపర్తి సంస్థానాధీశుడు, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త రాజా కృష్ణదేవరావు, ఆయన కుమారుడు ఆరుద్రదేవ్, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి అర్చకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ అర్చకుడు విష్ణునారాయణశర్మ పర్యవేక్షణలో వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథస్వామి ఉత్సవమూర్తులను పట్టువస్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించి వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఆలయం నుంచి రథం వద్దకు తీసుకొచ్చి ఆసీనులు చేశారు. సంస్థానాధీశుడు రాజా కృష్ణదేవరావు టెంకాయ కొట్టగా ఆయనతో పాటు వారి కుమారుడు ఆరుద్రదేవ్, ఎమ్మెల్యే భక్తులతో కలిసి రథాన్ని ప్రధాన ఆలయం నుంచి గోదాదేవి ఆలయం వరకు లాగారు. రథోత్సవాన్ని తిలకించేందుకు ఉమ్మడి జిల్లాతో పాటు, వివిధ ప్రాంతాల భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు రథం ముందు టెంకాయలు కొట్టి పూజలు చేశారు. సాయంత్రం భక్తులు రథాన్ని తిరిగి ఆంజనేయస్వామి ఆలయం వరకు, అటు నుంచి రథశాలకు చేర్చారు. రథోత్సవానికి వచ్చిన భక్తులకు శ్రీరంగాపురం సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. గ్రామానికి చెందిన మంగలి నారాయణదాస్ జ్ఞాపకార్థం వారి కుమారులు ఎన్.జయప్రకాష్ కుటుంబసభ్యులతో కలిసి భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఆలయ ఆవరణలో వెలిసిన మిఠాయిలు, బొమ్మలు, గాజుల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ రాంబాంబు, ఎస్ఐ హిమబిందు సిబ్బందితో కలిసి కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ మద్దిలేటి, వనపర్తి మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, పెబ్బేరు పుర చైర్మన్ అక్కి శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, వెంకటయ్య యాదవ్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
రూ.5– 6 వేల కోట్ల వ్యయం..
గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యం పెంపునకు సంబంధించి 14,700 ఎకరాల్లో చేపడుతున్న రిజర్వాయర్ నిర్మాణానికి సుమారు రూ.5– 6 వేల కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ఇది వరకే ఈ రిజర్వాయర్ను 1,400 ఎకరాలలో నిర్మించారు. సామర్థ్యం పెంచేందుకు అదనంగా మరో 700 ఎకరాల భూమి అవసరమవుతుంది. దీంతో రిజర్వాయర్ దిగువన కొత్తపాలెం గుట్టల వరకు విస్తరించనున్నారు. సుమారు 11.15 కిలోమీటర్ల పొడవుతో రిజర్వాయర్ ఆనకట్ట నిర్మించనున్నారు. ● గుడ్డెందొడ్డి రిజర్వాయర్ నింపిన నీటిని తిరిగి జూరాల ప్రాజెక్టు రిజర్వాయ ర్కు ఎత్తిపోసే సమయంలోనే సమాంతరంగా హైడల్ విద్యుత్ ప్రాజెక్టులో టర్బైన్స్ ద్వారా విద్యుదుత్పత్తి చేసేలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తుండడం రాష్ట్రంలోనే తొలిసారి. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ -
‘కేంద్రీయ విద్యాలయ’కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
వనపర్తి రూరల్: జిల్లాకేంద్రంలోని రాజపేట శివారు వైటీసీ భవనంలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. నియోజకవర్గం విద్య, క్రీడలపరంగా రాష్ట్రస్థాయిలోనే గుర్తింపు సాధించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు చెప్పారు. కేంద్రీయ విద్యాలయ మంజూరు చేసిన ప్రధాని మోదీకి, కేంద్ర విద్యాశాఖ మంత్రికి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి, ఎంపీ మల్లు రవికి, కలెక్టర్ ఆదర్శ్ సురభికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. పన్ను చెల్లించి అభివృద్ధికి సహకరించండి ఆత్మకూర్: పుర ప్రజలు ఆస్తి పన్ను సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలని పుర కమిషనర్ చికినె శశిధర్ కోరారు. మంగళవారం వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు, సిబ్బందితో కలిసి పట్టణంలో పర్యటించి మొండి బకాయిలు ఉన్న దుకాణాలకు తాళం వేసి సీజ్ చేశారు. ఏప్రిల్ 30లోగా పన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీ ఇస్తున్నామని.. తర్వాత రెండు శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. గడువులోగా వందశాతం పన్ను వసూలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పౌర్ణమి ప్రత్యేక పూజలు కొత్తకోట రూరల్: మండలంలోని కానాయపల్లి శివారులో ఉన్న దత్తకోటిలింగేశ్వరస్వామి ఆలయంలో మంగళవాం ఉదయం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కోటిలింగేశ్వరస్వామి వారికి, పంచలోహ శివలింగానికి ఆవుపాలతో అభిషేకం, పుష్పార్చన చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మహా మంగళహారతి ఇచ్చినట్లు వివరించారు. అనంతరం చంద్ర గ్రహణం కారణంగా ఆలయం మూసివేశారు. బుధవారం ఉదయం 6 నుంచి భక్తులను అనుమతిస్తామని చెప్పారు. పర్యాటకాభివృద్ధికి కృషి కొల్లాపూర్ రూరల్: మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు జిల్లా టూరిజంశాఖ అధికారి నర్సింహ అన్నారు. మంగళవారం నాగర్కర్నూల్లో కలెక్టర్ బదావత్ సంతోష్ను ఆయన కలిసి పర్యాటకశాఖ డైరీ, క్యాలెండర్ అందజేశారు. అనంతరం సోమశిల, సింగోటం, జటప్రోలు, కొల్లాపూర్ కోట తదితర ప్రాంతాలను పర్యాటక పరంగా అభివృద్ధి చేసే ప్రణాళికలపై కలెక్టర్తో చర్చించారు. త్వరలో జిల్లా ఫారెస్టు, రెవెన్యూ, దేవాదాయ, ఇరిగేషన్ శాఖల అధికారులతో సమావేశమై.. సోమశిల–అలంపూర్ టూరిజం సర్క్యూట్పై సమీక్షించనున్నట్లు కలెక్టర్ తెలియజేశారని ఆయన తెలిపారు. -
వైద్యశాఖలో దుమారం..!
సంచలనంగా మారిన జడ్చర్ల ఘటన సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: జడ్చర్లలోని 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రికి సంబంధించి బాదేపల్లి మార్చురీలో పోస్టుమార్టం కోసం తీసుకొచ్చిన మృతదేహాన్ని వీధి కుక్కలు పీక్కు తిన్న అమానవీయ ఘటన సంచలనంగా మారింది. వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతుండగా.. రాజకీయ పక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. మరోవైపు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన రాష్ట్ర వైద్య ఆరోగ్య పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్.. ఇందుకు బాధ్యులుగా పేర్కొంటూ నలుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రకళతో పాటు ఆర్ఎంఓ హరినాథ్, డ్యూటీ డాక్టర్ మునీషా, ఎంఎన్ఓ రవిప్రకాశ్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్ఎంఓ పోస్ట్ ఖాళీగా ఉన్నా.. ప్రభుత్వం నుంచి గానీ, సూపరింటెండెంట్ నుంచి గానీ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకున్నా ఇన్చార్జిగా పేర్కొంటూ హరినాథ్పై వేటు వేయడం వైద్యారోగ్య శాఖలో దుమారం రేపుతోంది. బాదేపల్లి మార్చురీలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన వైరల్గా మారడంతో ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. స్వయానా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇన్చార్జిగా ఉన్న జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకోవడం దారుణమని.. దీన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి వైద్యరంగంపై ఉన్న చిత్తశుద్ధి ఏంటో స్పష్టవుతోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి రాజీనామా చేయాలని బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి.. ఈ ఘటన కలచివేసిందని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో విచారణకు వచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్య పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ ఈ ఘటనకు నలుగురిని బాధ్యులుగా పేర్కొంటూ సస్పెండ్ చేస్తునట్లు ప్రకటించారు. విచారణ క్రమంలో డాక్టర్ హరినాథ్ తనకు సంబంధం లేదని కమిషనర్ దృష్టికి తీసుకురాగా.. ఆయన వినిపించుకోలేదని సమాచారం. విచారణ అనంతరం కమిషనర్ ఫోన్లో మాట్లాడడం, వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడం సందేహాలకు తావిస్తోంది. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టకుండా ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి.. ఈ ఘటనను ఇంతటితో ముగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతోనేనా..? మృతదేహాన్ని కుక్కలు పీక్కు తినడంపై విపక్షాల ఆగ్రహం నలుగురిపై సస్పెన్షన్ వేటు వేసిన కమిషనర్ ఇన్చార్జి ఆర్ఎంఓ హరినాథ్పై వేటుతో కలకలం తనను ఎప్పుడు ఇన్చార్జిగా నియమించారోతెలియదంటూ ఆశ్చర్యం మౌఖికంగానే తప్ప ఎలాంటి అధికార ఉత్తర్వులు లేవని వెల్లడి డాక్టర్స్ యూనియన్కు ఫిర్యాదు.. సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ సంబంధం లేకున్నా బలిచేశారు.. వాస్తవానికి నేను ఆర్ఎంఓను కాదు. నన్ను ఆర్ఎంఓగా పేర్కొనడం చూసి ఆశ్చర్యపోయాను. ఘటన చోటుచేసుకున్న సోమవారం రోజు నా డ్యూటీ సమయం ప్రకారం ఉదయం 9 గంటలకు ఆస్పత్రికి వెళ్లా. డ్యూటీ అనంతరం సాయంత్రం 4 గంటలకు ఆస్పత్రి నుంచి వచ్చేశాను. మార్చురీలో జరిగిన సంఘటన నాకు తెలియదు. ఆ సమయంలో నేను ఆన్డ్యూటీలో కూడా లేను. జరిగిన ఘటన బాధాకరమే.. అయినా నా నిర్లక్ష్యం లేకున్నా నాపై సస్పెన్షన్ వేటు వేయడం అన్యాయం. దీన్ని మా డాక్టర్స్ యూనియన్ దృష్టికి తీసుకెళ్లాను. ఉన్నతాధికారులు మరోసారి సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలి. – డాక్టర్ ఎస్.హరినాథ్, సీఏఎస్ (పీడియాట్రిషన్) -
భక్తిశ్రద్ధలతో అశ్వవాహనసేవ
అడ్డాకుల: మండలంలోని కందూర్లో స్వయంభూగా వెలసిన శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత స్వామివారికి అశ్వవాహనసేవ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయం ముందున్న చిన్న తేరును పూజారులు శుద్ధి చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను పూజారులు తీసుకువచ్చి చిన్న తేరుపై ఉన్న అశ్వవాహనంపై అలంకరించారు. ఈ సందర్భంగా తేరు ముందు పండితులు హోమం నిర్వహించారు. భక్తులంతా కలిసి తేరును జయజయధ్వానాల మధ్య కొద్ది దూరం వరకు తీసుకెళ్లి అశ్వవాహనసేవ ముగించారు. మంగళవారం ఉదయం చంద్రగ్రహణం ఉండటంతో ఆలయాన్ని మూసి ఉంచారు. రాత్రి 7 గంటల తర్వాత ఆలయాన్ని సంప్రోక్షణ చేశారు. తర్వాత స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, బలిహరణ తదితర పూజలు జరిపించారు. గ్రామంలో ఉన్న స్వామివారి వెండి ముఖం, నాగపడగలను రాత్రి పల్లకీలో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ప్రధాన ఆలయంలో శివలింగానికి వెండి ముఖం, నాగపడగను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అర్ధరాత్రి తర్వాత రథోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు మణికంఠ శివాచార్య, రేవంత్శర్మ, సందీప్శర్మ, యాదిగిరిశర్మ, రామలింగేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు. -
నాలుగేళ్లుగా టెండర్లు లేవు..
కోర్టు తీర్పు వెలువడిన తర్వాత సంత వేలం నిర్వహించడం లేదు. చివరిసారి నిర్వహించిన వేలం పాటలో మున్సిపాలిటీకి రూ.3.36 కోట్ల ఆదాయం సమకూరింది. పురపాలిక నాలుగేళ్లుగా రూ.కోట్లలో ఆదాయం కోల్పోయింది. – గణేష్, మేనేజర్, పెబ్బేరు పురపాలిక శాశ్వత పరిష్కారం చూపిస్తాం.. పెబ్బేరు సంత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ విషయాన్ని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో చర్చించి అర్చకులతో శాంతియుత చర్చలు జరుపుతున్నారు. అందరికి ఆమోదయోగ్యంగా ఉండేలా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. – శ్రీనివాస్గౌడ్, పుర చైర్మన్, పెబ్బేరు ● -
పూర్తిస్థాయిలో కొరవడిన పర్యవేక్షణ..
జడ్చర్ల పట్టణంలోనే బాదేపల్లిలో 30 పడకల ఆస్పత్రి ఉండేది. దీన్ని బీఆర్ఎస్ హయాంలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా కల్వకుర్తి రోడ్డులో నిర్మించిన 100 పడకల ఆస్పత్రి భవనంలోకి మార్చారు. ప్రారంభ సమయంలో మార్చురీ నిర్మాణం పూర్తి కాకపోవడంతో బాదేపల్లి ఆస్పత్రి పరిధిలోని మార్చురీలోనే మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహిస్తున్నారు. మృతదేహాలను సైతం అక్కడే భద్రపరుస్తున్నారు. కిలోమీటరున్న దూరంలో ఉండగా.. పర్యవేక్షణ కొరవడడంతో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విచారణకు వచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్య పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ ముందుగా బాదేపల్లిలో మార్చురీ, ఆ తర్వాత కల్వకుర్తి రోడ్డులోని ప్రభుత్వ ఆస్పత్రి, మార్చురీని సందర్శించారు. కొత్తగా ఏర్పాటు చేసిన మార్చురీలో ఉన్న మూడు ఫ్రీజర్లను పరిశీలించారు. మార్చురీ నిర్మాణం పూర్తయి అధునాతన సౌకర్యాలు అందుబాటులో ఉన్నా.. పాత ఆస్పత్రినే పోస్టుమార్టం నిర్వహించడంపై అధికారులు, డాక్టర్లకు చీవాట్లు పెట్టినట్లు సమాచారం. ఆస్పత్రి నిర్వహణ, వైద్యుల పనితీరు సరిగ్గా లేదంటూ అసంతృప్తిని వ్యక్తం చేయడం పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కొరవడిందనే దానికి అద్దం పడుతోంది. -
నెట్టెంపాడుకు మహర్దశ
●ప్రభుత్వానికి నివేదిక.. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం మట్టి కాల్వలకు సీసీ లైనింగ్ నిర్మించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాం. 150 కి.మీ. మేర కాల్వలకు సీసీ లైనింగ్ నిర్మాణానికి రూ. 373 కోట్లు వ్యయం అవుతుందని అంచనాలు సిద్ధం చేశాం. ఈ నివేదికను ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే పనులు మొదలుపెడతాం. – రహీముద్దీన్, ఎస్ఈ, ఇరిగేషన్శాఖ గద్వాల: నడిగడ్డ వరప్రదాయిని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి మహర్దశ పట్టనుంది. తరచుగా లీకేజీలతో కోతలకు గురవుతున్న ప్రాజెక్టు మట్టి కాల్వలకు సీసీ లైనింగ్ నిర్మించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ పథకం ద్వారా గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 1.49 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. అయితే సాగునీటి కాల్వలకు ఇప్పటి వరకు సీసీ లైనింగ్ చేయలేదు. దీంతో కాల్వల్లో షిల్టు, పిచ్చిమొక్కలు, కంపచెట్లు పెరిగాయి. దీంతో కాల్వలకు లీకేజీలు ఏర్పడి సాగునీరు వృథా అవుతోంది. తద్వారా ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు అడ్డంకులు తలెత్తుతున్నాయి. వీటన్నింటిని అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 150 కి.మీ. మేర ఉన్న కాల్వలకు సీసీ లైనింగ్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం సుమారు రూ. 373కోట్లతో అంచనాలు రూపొందించారు. నీటి పారుదలకు అడ్డంకులు.. వానాకాలంలో కృష్ణానదికి వరదలు వచ్చే 120 రోజుల పాటు జూరాల ప్రాజెక్టు వెనకజలాల నుంచి నెట్టెంపాడుకు నీటిని ఎత్తిపోస్తారు. ఎత్తిపోసే నీటిని ఏడు రిజర్వాయర్లలో నింపి.. వాటి పరిధిలోని ఆయకట్టుకు కాల్వలు, డిస్టిబ్యూటర్లు, సబ్ డిస్టిబ్యూటర్ల ద్వారా నీటిని పారిస్తారు. ఇలా ఆయకట్టుకు సాగునీరు పారించే కాల్వలకు లైనింగ్ లేకపోవడంతో కంపచెట్టు, ముళ్లపొదలు పెరిగిపోయి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. ఈ క్రమంలో చాలా వరకు సాగునీరు వృథాగా పోతుంది. ప్రస్తుతం నెట్టెంపాడు కింద సుమారు 1.49 లక్షల ఎకరాలకు సాగునీటిని విడుదల చేస్తుండగా.. ఇందులో 2 టీఎంసీలకు పైగా నీరు వృథా అవుతోంది. తీరనున్న సమస్య.. నెట్టెంపాడు ప్రాజెక్టు కింద నిర్మించిన మట్టి కాల్వలు, డిస్టిబ్యూటర్లు, సబ్ డిస్టిబ్యూటర్లలో సీసీ లైనింగ్ నిర్మాణంతో నీటి పారుదల సాఫీగా సాగనుంది. తద్వారా చివరి ఆయకట్టు రైతులకు సాగునీటి సమస్య తీరనుంది. 150 కి.మీ. మేర కాల్వకు సీసీ లైనింగ్ నిర్మాణానికి రూ. 373 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించిన అధికారులు.. ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు. 2 లక్షల ఎకరాల ఆయకట్టు.. కృష్ణానదిపై నిర్మించిన జూరాల ప్రాజెక్టు బ్యాక్వాటర్ ఆధారంగా గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత డా.వైఎస్ రాజశేఖరరెడ్డి నెట్టెంపాడు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. రూ. 1,480 కోట్ల అంచనా వ్యయంతో మొదలుపెట్టిన నిర్మాణానికి రూ. 2వేల కోట్లపైగా ఖర్చుచేశారు. ఇందులో ఏడు రిజర్వాయర్లు, రెండు లిఫ్టులు, 164 కి.మీ. మెయిన్ కెనాల్స్, మరో 100 కి.మీ. మేర డిస్టిబ్యూటర్ల నిర్మాణాలు ఉన్నాయి. కాల్వల లైనింగ్కు రూ.373 కోట్లతో ప్రతిపాదనలు 150 కి.మీ. మేరసీసీ నిర్మాణానికి చర్యలు పనులు పూర్తయితే సాగునీటి లీకేజీలకు అడ్డుకట్ట ప్రభుత్వ అనుమతులే తరువాయి -
వట్టెం వెంకన్న పల్లకీసేవ
బిజినేపల్లి: వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అలివేలుమంగ, గోదాదేవి సమేత వేంకటేశ్వరస్వామికి పల్లకీసేవ నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకుడు సముద్రాల శ్రీమన్నారాయణచార్యుల ఆధ్వర్యంలో గరుడ పతాకావిష్కరణ చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకీలో పురవీధుల్లో ఊరేగించారు. కాగా, చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 7 నుంచి ఆలయాన్ని మూసివేశారు. సాయంత్రం 7 గంటల తర్వాత ఆలయాన్ని తెరిచి ప్రక్షాళన చేశారు. అనంతరం స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగించారు. -
మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్
కొత్తకోట రూరల్: బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి, శివాజీకి సమకాలీడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మండలంలోని సంకిరెడ్డిపల్లిలో రాష్ట్ర బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్గౌడ్ సొంత డబ్బుతో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా.. ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించి మాట్లాడారు. దోపిడీని అరికట్టడానికి 33 కోటలు, గోల్కొండను జయించిన మహా వీరుడని కొనియాడారు. ఆయన చరిత్రను తెలుగు రాష్ట్రాలకు విస్తరింపజేయాలని, కలిసికట్టుగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. గౌడ్లు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని, సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. అంతకుముందు యువత బైక్ ర్యాలీ, మహిళలు బతుకమ్మతో మాజీ మంత్రికి స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజుగౌడ్, ఆయిల్ వెంకటన్నగౌడ్, వనపర్తి మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ వామన్గౌడ్, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, మధుగౌడ్, మాలపల్లి రామన్గౌడ్, గడ్డం తిరుపతన్నగౌడ్, శేఖర్గౌడ్, ఆనంద్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
బాధ్యత పెరిగింది..
సంపూర్ణ అభియాన్ 2.0 కార్యక్రమంలో నర్వ యాస్పిరేషన్ బ్లాక్ దేశంలోనే 3వ ర్యాంకు సాధించి మరింత బాధ్యతను పెంచింది. కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలో ఆరు విభాగాల్లో వంద శాతం ఫలితాలు సాధించేందుకు కృషిచేస్తాం. – శ్రీనివాసులు, ఎంపీడీఓ నర్వ దేశవ్యాప్తంగా నర్వ బ్లాక్ ఉత్తమ ర్యాంకు సాధించడంతో మరిన్ని నిధులు రానున్నాయి. ఇటీవల నీతి ఆయోగ్ అడిషనల్ డైరెక్టర్ గౌరవ్ కటియార్ బ్లాక్ పనితీరు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కొత్తగా వచ్చే నిధులతో అంగన్వాడీ కేంద్రాల్లో టాయిలెట్స్ నిర్మాణం, కేజీబీవీలో సోలార్ స్టీమింగ్ కుకింగ్ సిస్టం ఏర్పాటు కానుంది. – బాలాజీ, నీతి ఆయోగ్ కోఆర్డినేటర్, నర్వ నీతి ఆయోగ్ ద్వారా యాస్పిరేషన్ బ్లాక్ నర్వ మండలానికి రూ.1.2 కోట్లు నిధులు మంజూరు కానున్నాయి. స్పార్క్ (ప్రాథమిక పాఠశాలల్లో ఎక్స్ఎల్ డిజిటల్ ల్యాబ్లు), శ్రీ (పునరుత్పాదక, పర్యావరణ అనుకూల ఆహారం కోసం సౌరశక్తితో పనిచేసే వంటగది) నిర్మాణాలకు ఈ నిధులు వినియోగించనున్నారు. – ప్రణయ్కుమార్, శిక్షణ కలెక్టర్, నారాయణపేట -
వైభవంగా హనుమద్ వాహన సేవ
వనపర్తి రూరల్: శ్రీరంగాపురం మండల కేంద్రంలోని రంగనాథస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం యాగశాలలో శ్రీవారి మూలమంత్ర హవనం.. రాత్రి హనుమద్ వాహనసేవ, గోదాదేవి అమ్మవారి మండపోత్సవం నిర్వహించారు. దివ్యతేజ స్వరూపుడైన స్వామివారు మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ హనుమద్ వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో అర్చకులు విష్ణునారాయణ, కిట్టుస్వామి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
ఒత్తిడి లేకుండా చదవాలి
వనపర్తిటౌన్: ఒత్తిడి లేకుండా చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ అన్నారు. ఒత్తిడితో చదివితే కేవలం పరీక్ష సమయం వరకే గుర్తుంటుందని.. ఒత్తిడి లేకుండా చదివితే నిద్రలో లేపి అడిగినా జవాబులు ఇవ్వగలరని వివరించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ప్రజా సేవకుడు డా. పోచ రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీలకు ప్రత్యామ్నాయ కోర్సులు చాలా ఉన్నాయని.. వాటిని అభ్యసిస్తే బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోవచ్చన్నారు. పదోతరగతి అనంతరం ఎలాంటి కోర్సులు చేయాలి, ఇంటర్ తర్వాత ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఎంపీసీ, బైపీసీలకు ప్రత్యామ్నాయ కోర్సులు.. ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలనే తదితర అంశాలను వివరించారు. అనంతరం పోచ రవీందర్రెడ్డిని శాలువా, జ్ఞాపికలతో సన్మానించారు. కార్యక్రమంలో ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ డా. భవానిశంకర్, యాజమాన్యం వేణు, విశ్వనాథం పాల్గొన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి పాన్గల్: అప్పుల బాధతో గడ్డి మందు తాగి శనివారం ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కావలి గట్టయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ఎండీ జబ్బార్, జిల్లా కార్యదర్శి పరమేశ్వరాచారి, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్యానాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని దావాజిపల్లిని సందర్శించి కౌలు రైతు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గట్టయ్య తనకున్న అర ఎకరం భూమితో పాటు ఇతర రైతుల నుంచి కొంత పొలం కౌలుకు తీసుకొని వరి సాగు చేశారని.. పెట్టిన పెట్టుబడి, పంటల దిగుబడి సక్రమంగా రాక అప్పులు ఎలా తీర్చాలనే దిగులుతో ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. బాధిత రైతు కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షలు, భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గొర్రెల కాపరుల సంఘం జిల్లా నాయకులు దేవేందర్, కేవీపీఎస్ జిల్లా నాయకుడు భగత్, మాజీ సర్పంచ్ వెంకటయ్యయాదవ్, రైతులు పాల్గొన్నారు. విశ్రాంత ఉద్యోగులు సమాజసేవ చేయాలి వనపర్తిటౌన్: విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయులు సమాజ సేవ చేసేందుకు కృషి చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కోరారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ గార్డెన్స్లో ఇటీవల పదవీ విరమణ పొందిన సుక్క శేఖర్ ఉద్యోగ విరమణ అభినందన సభకు ఆయన హాజరై దంపతులను పూలమాల, శాలువాతో సన్మానించి మాట్లాడారు. వృత్తికే విరమణ అని.. వ్యక్తి సామాజిక సేవలో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ పలుస శంకర్గౌడ్, మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, పార్టీ నాయకులు, ప్రజానాయకులు బైరోజు చంద్రశేఖర్, ఉందెకోటి నాగేందర్, రామన్పాడు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. రేపు కురుమూర్తిస్వామి ఆలయం మూసివేత చిన్నచింతకుంట: పౌర్ణమి, చంద్ర గ్రహణం నేపథ్యంలో మంగళవారం కురుమూర్తిస్వామి ఆలయం మూసివేస్తున్నట్లు ఈఓ మధనేశ్వర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి బుధవారం ఉదయం ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ చేసిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి సహకరించాలని ఆయన కోరారు. -
హిందూ ధర్మం ప్రపంచ దేశాలకు ఆదర్శం
ఖిల్లాఘనపురం: హిందూ ధర్మం ప్రపంచ దేశాలకు ఆదర్శమని పాలమూర్ విభాగ్ సహ కార్యవాహ సూర్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఖండ కార్యవాహ భాస్కర్ ఆధ్వర్యంలో శాఖల సంఘీక్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మానసికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా ఎదగాలని, అందుకు రోజు శాఖ చేయాలని సూచించారు. నేడు ప్రపంచ దేశాలు భారత్ వైపునకు చూస్తున్నాయని.. మనం నమ్మే హిందూ ధర్మాన్ని వారు ఎంతో గౌరవిస్తున్నారని చెప్పారు. సర్వేజనా సుఖినోభవంతు అంటూ ప్రపంచ శాంతిని కోరుకుంటున్నది భారత్, ఇక్కడి ధర్మం అన్నారు. కార్యక్రమంలో జిల్లా సామాజిక సామరస్యత ప్రముఖులు అశ్విని భగవంత్, జ్ఞానేశ్వర్, ఆంజనేయులు, విక్రం, వేణుగోపాల్, ఈశ్వర్, వివిధ గ్రామాల స్వయం సేవకులు పాల్గొన్నారు. -
‘సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలం’
ఆత్మకూర్: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి సలీం ఆరోపించారు. ఆదివారం పట్టణంలో కార్మిక సంఘం రెండో మహాసభలు జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ అధ్యక్షతన జరిగాయి. మహాసభలకు ఆయనతో పాటు సీపీఐ మాస్లైన్ జిల్లా కార్యదర్శి హన్మంతు, రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు రాజన్న, రాష్ట్ర నాయకుడు అరుణ్కుమార్, రాజు, చింతలన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ.. దేశంలో ధనవంతులే కుభేరులుగా మారుతున్నారని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరుస్తూ దాసోహం అంటోందన్నారు. కార్మికులు, పేదలను విస్మరిస్తున్న ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. అలాగే ఉపాధి కూలీలకు 200 రోజుల పనిదినాలు కల్పించాలని, ప్రతి వారం కూలి డబ్బులు చెల్లించాలని, రోజుకు రూ.700 ఇవ్వాలని, రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. -
కల్యాణం.. కమనీయం
కందూరు శ్రీరామలింగేశ్వరస్వామి క్షేత్రంలో ఆదివారం స్వామివారి కల్యాణాన్ని కనులపండువగా జరిపించారు. దక్షిణకాశీగా వెలుగొందుతున్న ఆలయంలో పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణం అశేష భక్తజన సందోహం మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామంలో మహిళలు సిద్దం చేసిన తలంబ్రాలను గ్రామస్తులు పల్లకీలో ఉంచి మేళతాళాల మధ్య ఊరేగింపుగా రామలింగేశ్వరస్వామి క్షేత్రానికి తీసుకువచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూల పందిరిలో ఉంచారు. అనంతరం పార్వతి సమేత రామలింగేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను సన్నాయి వాయిధ్యాల నడుమ ఆలయం లోపలి నుంచి కల్యాణ మండపంలోకి తెచ్చారు. దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ మదనేశ్వర్రెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. పురోహితులు ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలను కట్టించి, జీలకర్ర, బెల్లం పెట్టించారు. వేదమంత్రోచ్ఛరణాలు, మేళతాళాల మధ్య పార్వతి మెడలో మంగళసూత్రాన్ని కట్టించి కల్యాణాన్ని కమనీయంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయంలోని శివలింగానికి అభిషేకాలు నిర్వహించి పూలతో అలంకరించారు. అనంతరం కల్యాణానికి తరలివచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. – అడ్డాకుల -
అదుపు తప్పుతున్న చెరుకు ట్రాక్టర్లు
అమరచింత: కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు తరలిస్తున్న ట్రాక్టర్లు ప్రమాదాలకు గురవుతున్నాయి. అధికలోడ్తో అదుపు తప్పుతున్నా.. సంబంధిత రవాణాశాఖ అధికారులు నివారించడం లేదన్న విమర్శలు అధికమవుతున్నాయి. రైతులు తాము పండించిన పంటను ఫ్యాక్టరీకి తరలించే క్రమంలో ట్రాక్టర్లు డివైడర్లను ఢీకొట్టడం, రహదారి మలుపు వద్ద అదుపుతప్పి కిందపడటం వంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ట్రాక్టర్లో 14 టన్నుల చెరుకు మాత్రమే తరలించాల్సి ఉండగా.. 18 టన్నుల వరకు నింపడంతో లాగలేక ట్రాలీ పైకిలేచి చెరుకు గడలు కిందకు పడిపోతున్న సందర్భాలున్నాయి. అమరచింత, ఆత్మకూర్ మండలాల్లో అధికంగా చెరుకు సాగవుతుండటం.. డ్రైవింగ్ అనుభవం, లైసెన్స్ లేని వారు సైతం ట్రాక్టర్లను నడపడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చెరుకు ట్రాక్టర్ బీభత్సం.. ఆత్మకూర్: పట్టణంలో శనివారం అర్ధరాత్రి చెరుకు ట్రాక్టర్ డివైడర్పైకి దూసుకెళ్లడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయాయి. అమరచింత వైపు నుంచి వస్తుండగా డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో డివైడర్ను ఢీకొందని.. ఆ సమయంలో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని పట్టణవాసులు చెబుతున్నారు. ఈ ఘటనపై పుర సిబ్బంది ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
కేంద్ర మంత్రి పర్యటనతో..
నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎంపికై న 10 జిల్లాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ గతేడాది డిసెంబర్లో పర్యటించారు. ఈ సందర్భంగా నర్వ మండలంలోని రాయికోడ్లో డిసెంబర్ 27న పర్యటించి సంపూర్ణ అభియాన్ ద్వారా అమలవుతున్న పథకాలను లబ్ధిదారులు, చిన్నారులను అడిగి తెలుసుకొని కేంద్రానికి నివేదిక అందించారు. దీంతో జాతీయ స్థాయిలో నర్వ మండలానికి అభివృద్ధి పరంగా ప్రత్యేక నిధులు రాబట్టేందుకు ఈ కార్యక్రమం దోహదపడింది. నర్వ మండలంలో సంపూర్ణ అభియాన్ పనులను పరిశీలిస్తున్న కేంద్రమంత్రి బండి సంజయ్ (ఫైల్) -
నర్వ.. ప్రగతి బావుటా
జిల్లాలో నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్కు ఎంపికతో మహర్దశ ● 2024–25లో ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమానికి ఎన్నిక ● ఆరు విభాగాల్లో ఉత్తమ పనితీరుపై ప్రశంసలు ● దక్షిణ భారతంలో ప్రథమ, జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు ● కేంద్ర ప్రభుత్వం నుంచి సమకూరనున్న మరిన్ని నిధులు ●నర్వ: దేశంలో అత్యంత వెనకబడిన ప్రాంతాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేసేందుకు నీతి ఆయోగ్ జూలై 4, 2022న సంపూర్ణ అభియాన్ అనే ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి గాను దేశంలో 500 వెనకబడిన ప్రాంతాలను గుర్తించగా.. ఉమ్మడి పాలమూరులోని జోగుళాంబ గద్వాల జిల్లాలో గట్టు మండలం, నారాయణపేట జిల్లాలో నర్వ మండలాన్ని ఎంపిక చేసింది. ఇందులో సమగ్ర అభివృద్ధి సాధించేలా.. ఆరోగ్యం, పోషణ, విద్య, పారిశుద్ధ్యం, నీటి వసతి, వ్యవసాయం వంటి ఆరు ముఖ్యమైన సూచికలపై దృష్టిసారించింది. ఈ మేరకు మొదటి మూడు నెలలపాటు చేపట్టిన న్యూట్రీషణ్ (పోషణ), అగ్రికల్చర్ (వ్యవసాయం), విద్య (ఎడ్యుకేషన్, నీటి వసతి, సోషల్ సెక్టార్) విభాగాల్లో మెరుగైన పనితీరుపై ఇటీవల జాతీయ స్థాయిలో ర్యాంకింగ్ విడుదల చేశారు. ఇందులో జాతీయ స్థాయిలో దక్షిణ భారతదేశంలో ప్రథమ స్థానం, మొత్తం జాతీయ స్థాయిలో నర్వ మండలం యాస్పిరేషన్ బ్లాక్ 3వ ర్యాంకు సాధించినట్లు అధికారులు గణంకాలు విడుదల చేశారు. అలాగే దేశవ్యాప్తంగా నీటి కొరతతో అల్లాడుతున్న అనేక ప్రాంతాలకు నర్వ బ్లాక్ దిక్సూచిగా నిలిచింది. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన వాటర్ బడ్జెటింగ్ ఇన్ యాస్పిరేషనల్ బ్లాక్స్ నివేదికలో నర్వ బ్లాక్ పనితీరుపై ప్రశంసలు కురిపించింది. -
కో‘ఆప్షన్’ దక్కేనా..?
● నామినేటెడ్, పార్టీ పదవుల కోసం ఓడిన నేతల ప్రయత్నాలు ● మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ చీఫ్ ఆశీస్సుల కోసం ప్రయత్నాలు వనపర్తి: పుర, గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓడిన అధికార పార్టీ నేతలు కో–ఆప్షన్, నామినేటెడ్, పార్టీ పదవుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో పాటు ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, జి.మధుసూదన్రెడ్డి, డీసీసీ చీఫ్ కొత్తకాపు శివసేనారెడ్డి ఆశీస్సులతో జిల్లా, రాష్ట్రస్థాయి నామినేటెడ్, పార్టీలో కీలక పదవులు దక్కించుకునేందుకు నేతలు వారి వారి స్థాయిలో పావులు కదుపుతున్నారు. కో–ఆప్షన్, త్వరలో ఖాళీ అవుతున్న నామినేటెడ్ పదవుల కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నా.. ఎవరిని ఆదరిస్తారోనన్న చర్చలు అఽధికార పార్టీలో జోరందుకున్నాయి. సస్పెండ్ అయిన వారి దారెటు..? రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాకేంద్రంలో 8 మంది రెబల్స్పై డీసీసీ అధ్యక్షుడు సస్పెండ్ వేటు వేశారు. వారు ఇప్పటి వరకు ఎలాంటి లిఖితపూర్వక సంజాయిషీ ఇవ్వలేదు. వారిని పార్టీ మళ్లీ చేరదీస్తుందా? లేదా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలాగే మరికొందరు రెబల్స్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాంటి వార్డుల్లో అధికార కాంగ్రెస్పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన వారు తమ పరిస్థితి ఏమిటనే ధోరణిలో ఉన్నారు. నామినేటెడ్ పదవుల భర్తీకిగాను పార్టీ రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్లు ఢిల్లీ పెద్దలతో అనుమతి కోసం ప్రయత్నాలు ప్రారంభమైన విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు వారి ప్రయత్నాలను మరింత ఉధృతం చేస్తున్నారు. పురపాలికల్లో.. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలైన వారు పార్టీ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. పుర ఎన్నికల్లో ఓడిన కొందరు సీనియర్లు కౌన్సిలర్తో సమాన హోదా ఉన్న కో–ఆప్షన్ పదవుల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గత కౌన్సిల్లో ఉండి.. ఇటీవల ఓడిన వారే ఈ పదవుల కోసం ఎక్కువగా ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్ పోస్టులు దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నారు. పుర ఎన్నికల్లో ఓటమిపాలైన వారు వార్డులో ఎలాంటి అభివృద్ధి పనులైనా తమ కనుసన్నల్లోనే జరిగేలా ఎమ్మెల్యే, పుర పాలకవర్గంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష కౌన్సిలర్ల వార్డులకు వచ్చే సాధారణ నిధులు, పనులు మినహా ప్రత్యేకించి చేసే ఎలాంటి పనులు వారికి దక్కనివ్వకుండా క్యాడర్ను కాపాడుకొనే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందుకు వారు సైతం సుముఖంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. పార్టీకి ద్రోహం చేస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదు. రెబల్స్గా బరిలో నిలిచి పార్టీ అభ్యర్థుల ఓటమికి కారకులైన వారిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీలో స్థానిక ప్రజాప్రతినిధులు, రాష్ట్రస్థాయి పార్టీ పెద్దలతో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. సర్పంచ్, పుర ఎన్నికల్లో ఓడిన వారిని పార్టీ కాపాడుకుంటుంది. వారికి తగిన న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాం. – శివసేనారెడ్డి, డీసీసీ చీఫ్, వనపర్తి -
విద్యార్థుల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యం
● ‘హెల్త్ మిషన్–100‘ పేరిట ప్రత్యేక కార్యక్రమం ● జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్రెడ్డి వనపర్తి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా మార్చి 2 నుంచి జూన్ 9 వరకు ‘హెల్త్ మిషన్–100’ పేరిట 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్ రెడ్డి ప్రకటించారు. శనివారం జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో రాష్ట్రీయ బాలస్వాస్త్య్ బృందాలతో సమీక్ష నిర్వహించి ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 6 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు విద్యార్థులకు పోషకాహార, ఎదుగుదల లోపం, కంటి సమస్య గుర్తింపునకు ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహిస్తారన్నారు. రక్తహీనత నివారణకు ప్రతి విద్యార్థికి హిమోగ్లోబిన్ పరీక్ష చేసి అవసరమైన వారికి ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు పంపిణీ చేస్తారని చెప్పారు. దీంతోపాటు విద్యార్థులకు రుతుక్రమ పరిశుభ్రత, యోగా, అత్యవసర సమయాల్లో ప్రాణరక్షణకు ఇచ్చే విధానంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. జిల్లాలోని ప్రతి విద్యార్థికి మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యమని.. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికా రి డా. పరిమళ, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. శ్రీనివాసులు, వైద్య, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. -
సమష్టి కృషితోనే మెరుగైన సేవలు
వనపర్తిటౌన్: ఉద్యోగులు సమష్టిగా కృషి చేసి ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తూ ఆర్టీసీ ఆదాయాన్ని మరింత పెంచాలని డిప్యూటీ రీజినల్ మేనేజర్ కవిత కోరారు. శనివారం జిల్లాకేంద్రంలోని డిపో ఆవరణలో నిర్వహించిన ఆదర్శ ఉద్యోగుల అభినందన సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై జనవరిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన కండక్టర్లు, డ్రైవర్లు, మెయింటెనెన్స్ సిబ్బందికి ప్రశంసా పత్రాలు, నగదు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉత్తమ ఉద్యోగులను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ దేవేందర్గౌడ్, ట్రాఫిక్, మెయింటెనెన్స్ సూపర్వైజర్లు, కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు పాల్గొన్నారు. అనుభవజ్ఞులు ఉద్యోగ విరమణ పొందడం బాధాకరం.. అనుభవజ్ఞులైన ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందడం కొంత బాధాకరమని రీజనల్ డిప్యూటీ మేనేజర్ కవిత అన్నారు. శనివారం డిపో ఆవరణలో ఉద్యోగ విరమణ పొందిన రహీం, వీవీ మూర్తి, నీలయ్య, రాములును ఆమె సన్మానించి మాట్లాడారు. సంస్థను కన్న తల్లిలా భావించి అభివృద్ధికి కృషి చేసిన సేవలను ఆర్టీసీ ఎప్పటికీ మరువదన్నారు. డిపోలో పనిచేసిన ఉద్యోగులు సంస్థ కోసం అహర్నిశలు శ్రమించి మంచి పేరు తీసుకొచ్చారని డీఎం దేవేందర్గౌడ్ ప్రశంసించారు. కొల్లాపూర్ డిపో మేనేజర్ ఉమాశంకర్, గుండ్రాతి మధుగౌడ్, యూనియన్ నాయకులు, ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
తెలుగు భాషా పరిరక్షకులు
సురభి రాజులు శిల్ప, చిత్రకళలకు ప్రాధాన్యం ఇచ్చారు. 16వ శతాబ్దంలో జటప్రోల్, మంచాలకట్ట, సోమశిల గ్రామాల్లో నిర్మించిన పురాతన ఆలయాలే ఇందుకు నిదర్శనం. శ్రీశైలం డ్యాం నిర్మాణంలో ఈ గుడులన్నీ కృష్ణానదిలో మునిగిపోగా.. 1989లో జటప్రోల్, కొల్లాపూర్లో మదనగోపాలస్వామి, మూకగుడులు, సోమశిలలో లలితాంబికా సోమేశ్వరాలయాలను పురావస్తు శాఖ పునర్నిర్మించింది. జటప్రోల్లో ఆలయ ముఖద్వారం, ఆలయంలో మంటపాలు, మదనగోపాలస్వామి ఆలయంలోని స్తంభాలపై చెక్కిన శిల్పాలు సురభిరాజుల శిల్పకళా సౌరభాన్ని చాటుతాయి. అలాగే చిత్రకళలకు కూడా వీరు ప్రాధాన్యం ఇచ్చారు. సురభిరాజుల కోటలో ఉన్న చిత్రాలు ఈ విషయాన్ని తెలియపరుస్తాయి. నిజాం నవాబులకు సామంతులుగా ఉన్న సురభిరాజులు పరిపాలనలో ఎక్కడ కూడా నిజాం పోకడలను అనుసరించలేదు. ప్రధానంగా భాషా పరిరక్షణలో వారు తెలుగుకే ప్రాధాన్యం ఇచ్చారు. సంస్థానాల్లో చాలాచోట్ల ఉర్దూ ప్రభావం ఉన్నప్పటికీ.. జటప్రోల్, కొల్లాపూర్ సంస్థానంలో మాత్రం ఆ ఊసు ఎక్కడా కనిపించదు. తెలుగు భాష పరిరక్షణలో భాగంగా 1920లో కొల్లాపూర్ కవులచే స్నేహలతా కవితా సంఘాన్ని ఏర్పాటు చేయించి.. దాని నిర్వహణకు సహకరించారు. 1930లో రాణి రత్నమాంబ ఆర్థిక సహకారంతో వైజయంతి అనే తెలుగు పత్రికను ప్రచురించారు. సురభిరాజులు ప్రజారంజక పాలనతోపాటు అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలోనూ ముందున్నారు. మద్రాసు రాష్ట్రంలో ఉన్న రెండు విమానాలలో ఒకటి మద్రాసు పాలకులది కాగా.. రెండోది సురభి రాజులది. ఇద్దరు ప్రయాణించగల ఈ విమానాన్ని సురభి వెంకటలక్ష్మారావు కూతురు అయిన సరస్వతిదేవి అమ్మయ్యగారి భర్త బొబ్బిలి రాజ్యానికి చెందిన ఐవీ కృష్ణారావు నడిపేవారు. 1935 ఆగస్టు 25న కృష్ణారావు చనిపోవడంతో ఆయన స్మృత్యార్థం ఆర్ఐడీ బాలుర కళాశాల సమీపంలో స్తూపం ఏర్పాటు చేశారు. రైల్వే వ్యవస్థ ప్రారంభమయ్యాక కొల్లాపూర్కు రైల్వే లైన్ వేయాలనే ప్రతిపాదనను బ్రిటీష్ పాలకులు తీసుకురాగా సురభిరాజులు తిరస్కరించారు. ఇక్కడి సంపదను తరలించుకుపోతారనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతారు. కొల్లాపూర్ పట్టణాన్ని సురభిరాజులు అభివృద్ధికి చిరునామాగా మార్చారు. దేశంలో విద్యుత్ వాడకం ప్రారంభమైన తొలినాళ్లలోనే మద్రాసు సంస్థానంతోపాటు విద్యుత్ వినియోగించిన పట్టణాల్లో కొల్లాపూర్ ఒకటి. 18వ శతాబ్దంలోనే ధర్మాస్పత్రి ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా ఆయుర్వేద వైద్య సేవలు అందించారు. 1920లోనే టౌన్ ప్లానింగ్ రూపొందించారు. వ్యవసాయ అభివృద్ధి కోసం వేలాది ఎకరాలకు సాగునీరందించేలా సింగోటం శ్రీవారి సముద్రం చెరువు నిర్మించారు. హిందూ, ముస్లింలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ.. జటప్రోల్లో హజ్రత్ ఇనాయత్షా ఖాద్రీ దర్గా ఉర్సుకు మదనగోపాలస్వామి ఆలయం నుంచి పూజా సామగ్రిని పంపించేవారు. బొబ్బిలి రాజవంశాలతో బంధుత్వం ఉన్న సురభి రాజులు అక్కడి నుంచి వివిధ రకాల మామిడి మొక్కలను తెచ్చి కొల్లాపూర్లో ఉద్యానవనాల సాగుకు శ్రీకారం చుట్టారు. వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన మామిడి మొక్కలను కొల్లాపూర్లోని పెద్దతోటలో సాగుచేశారు. పెద్దతోటలో కాచిన పండ్లను బ్రిటీష్ పాలకులతోపాటు నిజాం నవాబులకు పంపేవారు. సురభిరాజులు కవులను కూడా పోషించారు. 19వ తరం పాలకుడైన మాధవరావు స్వతహాగా చంద్రికాపరిణయం అనే కవితా సంపుటిని రచించారు. సురభి సంస్థానంలో ఎలకూచి బాలసరస్వతి, ఎల్లూరి నరసింగకవి, వాజపేయాజుల రామసుబ్బరాట్ కవి వంటి ఉద్దండులు ఉండేవారు. -
పుర ఫలితాలు పునరావృతం కావాలి
కొత్తకోట: పుర ఎన్నికల ఫలితాలే రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పునరావృతం అవుతాయని.. రాష్ట్రంలో మరోసారి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. శనివారం పుర చైర్పర్సన్గా పి.అరుణ శ్రీనివాస్, వైస్ చైర్పర్సన్గా పి.పల్లవి కృష్ణారెడ్డి పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లు స్థానిక అంబాభవాని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి ఊరేగింపుగా పుర కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ పదవి బాధ్యతల స్వీకరణ అనంతరం ఎమ్మెల్యే వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పట్టణంలోని ఓ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన అభినందన, సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీకి అద్భుత విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికి కట్టారని.. పుర పాలకులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ కష్టపడి పనిచేసి వారి మన్ననలు పొందాలని కోరారు. అనంతరం 9వ వార్డులో నీటి మోటారును ప్రారంభించారు. కార్యక్రమంలో పుర కమిషనర్ సైదయ్య, కాంగ్రెస్ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ.. మదనాపురం: మండల కేంద్రంలోని రైతువేదికలో శనివారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఆర్థిక సాయం అందిస్తోందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు తావులేకుండా పారదర్శక పాలన అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శారద రామకృష్ణ, మార్కెట్ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, తహసీల్దార్ జేకే మోహన్, ఎంపీడీఓ ప్రసన్నకుమారి, కో–ఆర్డినేటర్ మహేష్ పాల్గొన్నారు. -
సకలకళా సురభిలు
జటప్రోల్, కొల్లాపూర్ సంస్థానాలుగా సురభిరాజుల ప్రజారంజక పాలన రాచరిక పాలన అంటే సంప్రదాయాలు, కట్టుబాట్లు, బానిసత్వం ఉంటాయి.. కానీ, కొల్లాపూర్ను శతాబ్దాల పాటు పాలించిన సురభి రాజవంశస్థులు అందుకు భిన్నంగా స్వేచ్ఛాయుత పాలన అందించారు. ఆధ్యాత్మికతను పెంపొందిస్తూ.. కళలకు పట్టం కట్టి.. అధునాతన వసతులతో ఆదర్శవంతమైన పాలన సాగించారు.. ఆ కాలంలోనే కొల్లాపూర్లో వంద ఫీట్ల వెడల్పాటి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం, ఆస్పత్రి వసతులు కల్పించారంటే వీరి ముందుచూపు ఏపాటిదో ఊహించవచ్చు. అలాగే దక్షిణ భారతంలోనే మద్రాస్, నిజాం పాలకుల తర్వాత విమానం కొనుగోలు చేసిన ఘనత వీరికే దక్కింది. ఆధునికతతోపాటు ఆధ్యాత్మికత, తెలుగు భాష పరిరక్షణకు పెద్దపీట వేసిన సురభిరాజ వంశస్తుల ప్రజారంజక పాలనపై ‘సాక్షి’ సండే స్పెషల్ కథనం.. – కొల్లాపూర్ ● స్వాతంత్య్రానికి ముందే కొల్లాపూర్లో డబుల్ లైన్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ఆస్పత్రి ఏర్పాటు ● దక్షిణ భారతంలో మద్రాస్, నిజాం పాలకుల తర్వాత విమానం కొనుగోలు చేసింది వీరే.. ● ఆధ్యాత్మికతతోపాటు తెలుగు భాష పరిరక్షణకు పెద్దపీట ● కళలకు పట్టం.. ఉద్యానవనాల సాగుకు బీజం -
ఉచిత వైద్య శిబిరాలతో మేలు
వనపర్తి టౌన్: ఉచిత వైద్య శిబిరాలతో ఎంతోమందికి మేలు చేకూరనుందని.. ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత కోరారు. శనివారం కోర్టు ఆవరణలో జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో మెడికవర్ ఆస్పత్రి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించగా.. ఆమె ముఖ్యఅతిథిగా ఆమె హాజరై ప్రారంభించి మాట్లాడారు. కోర్టులో న్యాయ సేవలతో పాటు వైద్య సేవలను అందించినట్లు అవుతుందని, ఎంతో సంతోషకర విషయమని తెలిపారు. ముఖ్యంగా ఉద్యోగులు ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. శిబిరంలో సుమారు 200 మందికిపైగా వైద్య సేవలు అందించినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.కిరణ్కుమార్ వివరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్రెడ్డి, న్యాయమూర్తులు కళార్చన, రజని, శ్రీలత, అశ్విని, న్యాయవాదులు మోహన్గౌ డ్, మోహన్కుమార్, తిరుపతిగౌడ్, దినేష్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, రాజు, భరణి, వంశీగౌడ్ పాల్గొన్నారు. 129 మంది విద్యార్థులు గైర్హాజరు వనపర్తిటౌన్: జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షకు 129 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 25 పరీక్ష కేంద్రాల్లో 5,655 మంది విద్యార్థులకుగాను 5,526 మంది హాజరయ్యారన్నారు. జనరల్ విద్యార్థులు 4,637 మందికిగాను 4,538 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 99 మంది హాజరు కాలేకపోయారు. ఒకేషనల్ విద్యార్థులు 1,018 మందికిగాను 988 మంది విద్యార్థులు హాజరుకాగా.. 30 మంది గైర్హాజరయ్యారు. డీఐఈఓ రూరల్ పోలీస్స్టేషన్ను సందర్శించి ప్రశ్నపత్రాల తరలింపును పరిశీలించారు. పాన్గల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, వనపర్తిలోని రావూస్, అభ్యాస్, జాగృతి జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. డీఈసీ బృందం జిల్లాకేంద్రంలోని పట్టణ పోలీస్స్టేషన్ను, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, శ్రీ సూర్య, స్కాలర్స్, త్రివేణి జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం కొత్తకోటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, నివేదిత, ప్రతిభ, పెబ్బేర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను, సిట్టింగ్ స్క్వాడ్ బృందం పాన్గల్, ఖిల్లాఘనపురం, వీపనగండ్ల, ఆత్మకూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లాలోని అన్ని కేంద్రాల్లో పరీక్షలు సజావుగా కొనసాగుతున్నాయని డీఐఈఓ పేర్కొన్నారు. -
లక్ష్యం.. నిర్లక్ష్యం..!
ఆస్తి పన్ను వసూళ్లకు మిగిలింది నెలరోజులే.. ● జిల్లాలోని 5 పురపాలికల లక్ష్యం రూ.19.20 కోట్లు ● ఇప్పటి వరకు వసూలైంది కేవలం రూ.6.88 కోట్లు మాత్రమే ● వసూళ్లకు ప్రత్యేక బృందాల ఏర్పాటు పట్టణంలో ఆస్తి పన్ను వసూళ్లకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. పుర ఎన్నికల సందర్భంగా ఆశించిన మేర పన్ను వసూలు చేయడంలో సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. అయిన రూ.2.24 కోట్లకుగాను ఇప్పటి వరకు రూ.89 లక్షలు వసూలు చేశాం. మిగిలిన మొత్తాన్ని నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించాం. ఇంటి పన్నుతో పాటు కొళాయి పన్ను సైతం వసూలు చేస్తున్నాం. – చికెన్ శశిధర్, పుర కమిషనర్, ఆత్మకూర్ మున్సిపాలిటీకి ప్రధాన ఆదాయ వనరైన ఇంటి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ఈ ఏడాది లక్ష్యం రూ.62 లక్షలు కాగా.. వార్డు అధికారులతో కలిసి ఇల్లిల్లూ తిరిగి పన్ను వసూలు చేస్తున్నాం. ఇప్పటి వరకు రూ.27 లక్షలు వసూలు చేశాం. – నూరుల్ నదీం, పుర కమిషనర్, అమరచింత అమరచింత: జిల్లాలోని ఐదు పురపాలికల్లో ఆస్తి, ఇంటి పన్ను వసూళ్లు మందకొడిగా కొనసాగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు మార్చి చివరి నాటికి వంద శాతం పన్ను వసూలు చేయాలని కలెక్టర్ నుంచి ఆదేశాలున్నా.. నెలరోజుల్లో లక్ష్యం ఎలా చేరుకుంటారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పన్ను వసూళ్లకు పురపాలికల్లోని బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులకు బాధ్యతలు అప్పగించినా.. వసూళ్లు మాత్రం సగానికే పరిమితమయ్యాయి. ఇంటి పన్ను వసూలైతేనే అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయని పుర అధికారులు వెల్లడిస్తున్నారు. సకాలంలో వసూళ్లు పూర్తి చేయాలనే ఆలోచనతో ప్రణాళికతో ముందుకు సాగుతున్నా.. సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో జాప్యం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో పన్ను వసూళ్లు చేపట్టాలని అధికారులు వత్తిడి పెంచడంతో సెలవు దినాల్లో సైతం విధులు నిర్వర్తిస్తున్నారు. పుర కమిషనర్లు వార్డుల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆస్తిపన్నును పూర్తిస్థాయిలో వసూలు చేయడానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. వార్డుల వారీగా వార్డు అధికారులతో పాటు మిగిలిన సిబ్బందితో బృందాలు ఏర్పాటు చేసి వసూళ్లపై దృష్టి సారిస్తున్నారు. ఉదయం ఎనిమిది నుంచే ఇల్లిల్లూ తిరిగి పన్ను వసూలు చేస్తున్నారు. సెలవు రోజుల్లో సైతం తిరిగి ఇంటి పన్నులు వసూలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. పురపాలికల వారీగా పన్ను వసూళ్లు ఇలా.. (రూ.కోట్లలో..) మున్సిపాలిటీ లక్ష్యం వసూలు చేసింది వనపర్తి 12.86 3.85 ఆత్మకూర్ 2.24 0.89 కొత్తకోట 2.20 1.08 పెబ్బేరు 1.20 0.79 అమరచింత 0.62 0.27 -
‘సప్తశేష వాహనం’పై రంగనాథస్వామి
వనపర్తి రూరల్: శ్రీరంగాపురం రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం అర్చకులు స్వామి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఉదయం మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ శ్రీవారి మూలమంత్ర హవనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం సర్వాలంకరణ శోభితుడు, సమస్త లోకాధిపతి అయిన రంగనాథస్వామి ఉభయ నాంచారీ సమేతుడై సప్త శేషవాహనంపై తిరువీధుల్లో విహరించారు. దివ్యతేజ స్వరూపుడైన స్వామివారిని భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకున్నారు. అర్చకులు విష్ణునారాయణ, కిట్టుస్వామి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శనేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు బిజినేపల్లి: నందివడ్డెమాన్ జైష్ట్యాదేవి సమేత శనేశ్వరాలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. తమ ఏలినాటి శనిదోష నివారణ కోసం శనేశ్వరుడికి తిల తైలాభిషేకాలు నిర్వహించి.. గోత్ర నామార్చనలు చేశారు. అనంతరం బ్రహ్మసూత్ర శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి పాల్గొన్నారు. వేగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఆత్మకూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ప్రాజెక్టు డైరెక్టర్ విఠోభా అన్నారు. శనివారం పట్టణంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండలంలోని 13 గ్రామపంచాయతీలకు 302 ఇళ్లు మంజూరుకాగా, 228 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. త్వరితగతిన పూర్తిచేసేలా సంబంధిత అధికారులు లబ్ధిదారులను ప్రోత్సహి ంచాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ శ్రీపాద్, ఎంపీఓ శ్రీరాంరెడ్డి, హౌసింగ్ ఏఈ రాజేశ్వరి పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధే లక్ష్యం
ఊట్కూర్/మాగనూర్: గ్రామాల్లో ప్రజలు, నాయకులు పార్టీలను కేవలం ఎన్నికల వరకు మాత్రమే పరిమితం చేయాలని, తర్వాత ఎవరు గెలిచినా అభివృద్ధిపై దృష్టి సారించాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం ఊట్కూరు మండలం పులిమామిడిలో రూ.2.20 కోట్లతో నిర్మించే విద్యుత్ సబ్స్టేషన్, మాగనూరు మండలం వడ్వాట్లో సబ్స్టేషన్, గురువా లింగంపల్లిలో రూ.12 లక్షలతో నిర్మించే అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మంత్రి మాట్లాడుతూ.. రైతులు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ ధ్యేయమని, నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేసేందుకు ప్రతి నాలుగు గ్రామాలకు ఒక సబ్స్టేషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రెండేళ్లలో నియోజకవర్గంలో 1,035 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని.. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంతో రైతులకు సాగునీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు.రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
మత్తులో చిక్కుకుంటే జీవితాలు నాశనం
వనపర్తిటౌన్: మాదక ద్రవ్యాల వలయంలో చిక్కుకుంటే జీవితాలు నాశనం అవుతాయని జిల్లా అకాడమిక్ అధికారి మహానంది అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రహరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థినులు తయారుచేసిన పోస్టర్లను ప్రదర్శించి మాట్లాడారు. యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసవుతున్నారని, మత్తు ఆనందంగా మొదలై అలవాటుగా మారి వ్యసనంగా మారుతుందని తెలిపారు. వారి జీవితాలతో పాటు కుంటుంబాలను నాశనం చేసే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని.. జీవితాన్ని ఎలా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి అనేదానిపై శ్రద్ధ చూపాలని సూచించారు. కార్యక్రమంలో కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి ప్రతాపరెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి, బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివాజీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టిన అదనపు కలెక్టర్ వనపర్తి: జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా ఎన్.ఖీమ్యానాయక్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా అధికారులు ఆయన్ను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు మెరుగైన సేవ లు అందించే దిశగా స్థానిక సంస్థల పనితీరును మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, వేగం, సమన్వయం ఉండేలా కృషి చేస్తానన్నారు. -
సూర్యప్రభ వాహనంపై ఊరేగిన రంగనాథుడు
వనపర్తి రూరల్: శ్రీరంగాపురం రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథస్వామిని అందంగా ముస్తాబుచేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ శ్రీహరి మూలమంత్ర హవసం జరిగింది. రాత్రికి స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను సూర్యప్రభ వాహనంపై ఆసీనులను చేసి భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఆలయ ఆవరణలో ఊరేగించారు. కార్యక్రమంలో అర్చకులు విష్ణునారాయణ, కిట్టుస్వామి, కన్నయ్య స్వామి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
న్యాయవాదులకు రక్షణ కరువు
● మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తిటౌన్: సమాజంలోని పెడ ధోరణులతో న్యాయవాదులకు రక్షణ కరువైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. జిల్లాకేంద్రంలో న్యాయవాదుల రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించి వారికి మద్దతు తెలిపి మాట్లాడారు. తమ రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్షిదారుడికి న్యాయం చేసేందుకు ముందుకెళ్తే కక్ష్య సాధింపుగా దాడులు చేయడం అవివేకానికి నిదర్శనమన్నారు. యువ న్యాయవాదులు సీనియర్ల సలహాలతో ముందుకెళ్లాలని.. న్యాయవాదులు న్యాయాన్ని గెలిపించేందుకే ప్రయత్నిస్తారని, అలాంటి వారిపై దాడులు చేస్తుంటే ప్రత్యేక రక్షణ చట్టాన్ని అమలు చేయకపోవడం ఏంమిటని ప్రశ్నించారు. వృత్తిలో ఈర్శ్య, ధ్వేషాలు వదలి ప్రవీణ్యతతో మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వైద్య కళాశాల సందర్శన.. వనపర్తి: స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి శుక్రవారం సందర్శించి విద్యార్థులతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కళాశాల ఆవరణలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి 8 ఎకరాల స్థలం కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అత్యున్నత ప్రమాణాలతో మెడికల్ కళాశాల అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవిష్యత్లో మెడికల్, పారా మెడికల్ కోర్సులు, హాస్టళ్లు, పరిశోధన కేంద్రాలు, ఇతర మౌలిక వసతుల విస్తరణకు స్థలం అవసరం ఉంటుందన్నారు. అనాలోచితంగా స్కూల్ నిర్మాణానికి స్థలం కేటాయించడం సరైంది కాదని విమర్శించారు. వైద్య వ్యర్థాల నిర్వహణ జరుగుతున్న ప్రాంతంలో పాఠశాల ఏర్పాటు చేయడం ప్రమాదకరమన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు లేఖ రాసి, ఫోన్ ద్వారా పరిస్థితులను వివరించి నిర్ణయాన్ని పునః పరిశీలించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ప్రభుత్వానికి ఇతర స్థలాలు అందుబాటులో లేకుంటే స్కూల్ నిర్మాణానికి సొంత స్థలం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమళ్ల అశోక్, గంధం బాలపీర్, గంధం పరంజ్యోతి, ధర్మా నాయక్, కౌన్సిలర్లు మురళీసాగర్, శ్రీకర్గౌడ్, ప్రేమ్నాథ్రెడ్డి, హరిబాబు, బండారు కృష్ణ ఉన్నారు. -
కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు
● శుక్రవారం 210 మంది విద్యార్థులు గైర్హాజరు వనపర్తిటౌన్: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు రెండోరోజు శుక్రవారం ఆంగ్ల పరీక్ష నిర్వహించారు. జిల్లాలోని 25 పరీక్ష కేంద్రాల్లో 6,402 మంది విద్యార్థులకుగాను 6,192 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 210 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విద్యార్థులు 5,069 మందికిగాను 4,908 మంది హాజరుకాగా.. 161 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 1,333 మందికిగాను 1,284 మంది పరీక్షకు హాజరవగా 49 మంది విద్యార్థులు పరీక్ష రాయలేదు. డీఐఈఓ ఎర్ర అంజయ్య జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉర్దూ మీడియం జూనియర్ కళాశాల, బాలికల జూనియర్ కళాశాల, శ్రీ సూర్య ఒకేషనల్, స్కాలర్స్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. విద్యార్థుల స్క్రీనింగ్పై ఆరాతీసి ఎలాంటి మాస్ కాపీయింగ్కు పాల్పడకుండా సరిగా చెస్చేసి గదుల్లోకి అనుమతించాలని సూచించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లు, పరీక్షల నిర్వహణ, ఇన్విజిలేటర్ రిజిస్టర్ తదితర రికార్డులను పరిశీలించినట్లు చెప్పారు. అదేవిధంగా డీఈసీ బృందం వనపర్తిలోని వాగ్దేవి, జాగృతి, సీవీ రామన్ జూనియర్ కళాశాల, పానగల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం పెద్దమందడి ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఖిల్లా ఘనపురం పరీక్ష కేంద్రం, సిట్టింగ్ స్క్వాడ్ బృందం రావూస్ జూనియర్ కళాశాల, పెబ్బేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీరంగాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పరీక్షలు సజావుగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. -
అనూహ్య మలుపులు
● అనేక మలుపులతో అంతుచిక్కని రహస్యంగా దాడి కేసు ● బాధితులపైనా లోతుగా సాగుతున్న విచారణ ● చివరికి ఎటువైపు దారితీస్తుందోనన్న అనుమానం ● పోలీసుల నిర్లక్ష్యం, నిఘా వైఫల్యంపై విమర్శలు సాక్షి, నాగర్కర్నూల్: కుమ్మెర మల్లన్న జాతరలో దాడి ఘటన అనూహ్య మలుపులు తిరుగుతూ మరింత క్లిష్టతరంగా మారుతోంది. ఇప్పటికే ఈ ఘటనపై ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల పోరాటం కొనసాగడంతోపాటు ఉన్నత స్థాయిలో ఎస్సీ, బీసీ కమిషన్లు సైతం విచారణలో భాగమయ్యాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్ సైతం స్పందించి నాలుగు వారాల్లో ఘటనపై పూర్తి వివరాలను అందించాలని కలెక్టర్ను ఆదేశించింది. ఈ నెల 18న జాతరలో దాడి ఘటన చోటుచేసుకోగా 21న పసిపాప మరణం నుంచి వరుసగా ఏడు రోజులపాటు నిరసనలు కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ కేసులో పోలీసుల నిఘా వైఫల్యంతోపాటు బాధితుల పట్ల పోలీసుల వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటన తర్వాత స్పందనపై విమర్శలు.. కుమ్మెర మల్లన్న జాతరలో ఏటా పదివేల మందికిపైగా భక్తులు పాల్గొంటున్నారు. జిల్లాకేంద్రానికి 11 కి.మీ దూరంలో కుమ్మెర ఉండగా.. భారీ సంఖ్యలో పాల్గొనే జాతరలో పోలీసుల బందోబస్తు, భద్రత ఏర్పాట్లలో లోపాలు ఉన్నట్టు ఎస్సీ, బీసీ కమిషన్ చైర్మన్లు స్పష్టం చేశారు. దాడి ఘటన చోటుచేసుకున్న నాటి నుంచి ఏం జరుగుతుందన్న దానిపై, అసలు నిజాలు తెలుసుకోవడంలో పోలీస్ నిఘా వ్యవస్థ సైతం వైఫల్యం చెందినట్లు విమర్శలు వస్తున్నాయి. దాడి ఘటన చోటుచేసుకున్న తర్వాత బాధితుల పట్ల పోలీసులు చూపిన వైఖరి వివాదాస్పదమైంది. బాధితులపైనే కేసుతో.. జాతరలో గణేశ్ను కొబ్బరికాయల గదిలో తలుపులు వేసి బంధించి 8 మంది వరకు దాడి చేసినట్లు బయటకు వచ్చిన వీడియోల్లోనే స్పష్టమైంది. దాడి ఘటన వెంటనే ముందుగా బాధితుడు గణేశ్ డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీస్స్టేషన్ దాకా వచ్చాక ముందుగా బాధితుడిపైనే కేసు నమోదు చేయడం వివాదానికి దారితీసింది. నిందితుల పట్ల పోలీసులు గౌరవ మర్యాదలతో ప్రవర్తించారని, తమను మాత్రం నిర్లక్ష్యం చేశారని బాధితులు పదేపదే ఆరోపించారు. గణేశ్పై దాడి జరిగింది స్పష్టమైనప్పటికీ, నిందితుడు శ్రీనివాస్రెడ్డికి గాయాలు అయ్యాయన్న కారణంతో బాధితులపైనే కేసు నమోదు చేయడం ఆగ్రహావేశాలకు దారితీసింది. దాడి ఘటన తర్వాత మూడు రోజులకు ఫిబ్రవరి 21న రెండు నెలల పాప మరణంతో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బాధితులు రోడ్డెక్కారు. ప్రజాసంఘాల ఒత్తిడితోనే పోలీసులు కేసు నమోదుచేశారని, లేకపోతే మరింత నీరుగార్చేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లోతుగా విచారణ.. కుమ్మెర ఘటనలో బాధిత కుటుంబంపై దాడి జరగగా ఇది ఆధిపత్య వర్గం నుంచి పోరుగా ఆగ్రహం పెల్లుబికింది. ఈ క్రమంలో నిందితులపై హత్యకేసు నమోదుచేయాలన్న డిమాండ్ వ్యక్తమైంది. అయితే పోలీసులు దాడి ఘటనలో పాల్గొన్నవారు ఎవరు.. ఏం జరిగిందన్న దాంతోపాటు బాధితులపైనా లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో చివరగా ఏం తేలుతుందోనని, బాధితులకు ఎలాంటి న్యాయం జరుగుతుందోనన్న దానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. దాడికి పాల్పడిన వారందరినీ అరెస్ట్ చేయాలని బాధితులు కోరుతుండగా.. ఇప్పటి వరకు ముగ్గురిని మాత్రమే అరెస్ట్ చేశారు. ఇంకా నలుగురు పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. శుక్రవారం నిజనిర్ధారణ కోసమని కాంగ్రెస్ నేతల బృందం కుమ్మెర గ్రామంలో పర్యటించింది. ఎంపీ మల్లురవి, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేశ్రెడ్డి, వీర్లపల్లి శంకర్ తదితరులు గ్రామస్తులతో మాట్లాడారు. అనంతరం జిల్లాకేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కుమ్మెర ఘటన విషయంలో అవాస్తవాలే ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయని, వాస్తవాలను గమనించాలని ఎంపీ మల్లు రవి అన్నారు. పసిపాప మృతిపై రాజకీయం చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో రాజకీయ పక్షాల ముఖ్యనేతలతోపాటు ఆందోళన నిర్వహించిన వారితో తాను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు. బాధిత కుటుంబానికి అన్యాయం జరిగినట్టు అనిపిస్తే తాను పార్టీని వదిలైనా వారితో కలిసి పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. -
మద్దతు ధర ప్రకటించాలి..
మామిడి తోటల్లో 95 శాతం పూత రాలుతుండటంతో కొద్దిపాటి పంట మాత్రమే చేతికందే పరిస్థితి ఉంది. మామిడి విక్రయాలకు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో అదనపు ఆర్థిక భారం అవుతుంది. ప్రభుత్వం స్పందించి మామిడికి మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలి. – ఎత్తం బాలస్వామి, మామిడి రైతు, వీపనగండ్ల అధిక దిగుబడి కోసం రూ.లక్షలు వెచ్చించి అప్పుల ఊబిలో కూరుకుపోయిన తమకు ప్రభుత్వం నష్ట పరిహారం అందజేసి ఆదుకోవాలి. పట్టాదారులకు చెల్లించిన డబ్బుతో పాటు పెట్టుబడులు, పురుగు మందులకు రూ.లక్షల్లో ఖర్చు చేశాం. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలు పరిశీలించి పరిహారం అందించాలి. – చెనమోని గంగయ్య, కౌలురైతు, వీపనగండ్ల వాతావరణంలో మార్పులతోనే మామిడి పూత రాలి దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉంది. పురుగు మందుల కోసం రైతులు, కౌలు రైతులు అధిక మొత్తంలో వెచ్చించారు. పరిహారం చెల్లింపునకు ఉన్నతాధికారులు నివేదిక కోరితే అందజేస్తాం. అలాగే మామిడి కాయలతో తయారయ్యే ప్రత్యామ్నాయ ఉత్పత్తులపై రైతులు దృష్టి సారిస్తే అధిక లాభాలు పొందవచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం పలు రకాల రాయితీలు అందజేస్తోంది. రైతులు కోరితే శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయిస్తాం. – విజయభాస్కర్రెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి ● -
ఇంటి వద్దకే సీతారాముల కల్యాణ తలంబ్రాలు
వనపర్తిటౌన్: శ్రీరామనవమి రోజున భద్రాచలంలో జరిగే సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే అందించేందుకు టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ప్రత్యేక సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్టీసీ డీఎం దేవేందర్గౌడ్ తెలిపారు. శుక్రవారం డిపోలో ఇందుకు సంబంధించిన బుకింగ్ పోస్టర్లను విడుదల చేసి మాట్లాడారు. భద్రాచలం వెళ్లలేని భక్తుల ఇంటికి తలంబ్రాలు చేరేందుకు ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. సౌకర్యవంతంగా, నమ్మకంగా సేవలు అందించడమే లక్ష్యమని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తలంబ్రాలు బుకింగ్ చేసుకోవాలనుకునే వారు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పృథ్వీరాజ్ (సెల్నంబర్ 91542 98609), వెంకటేష్ వనపర్తి కంట్రోలర్ (73828 29379) సంప్రదించాలని, రూ.151 చెల్లిస్తే బుకింగ్ చేసి రసీదు ఇస్తారని.. స్వామివారి కల్యాణం అనంతరం తలంబ్రాలు అందజేస్తారని చెప్పారు. కార్యక్రమంలో లాజిస్టిక్స్ ఏటీఎం నారాయణ, డిపో అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
టెన్త్ బెటాలియన్ అభివృద్ధికి కృషి
ఎర్రవల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ సిబ్బందికి అవసరమైన పూర్తి వసతులు అందించి బెటాలియన్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ స్పెషల్ పోలీస్ అడిషనల్ డీజీపీ సంజయ్కుమార్ జైన్ అన్నారు. శుక్రవారం ఎర్రవల్లిలోని పదో బెటాలియన్లో నూతనంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు, పటాలం కమాండెంట్ జయరాజుతో కలిసి నూతన కన్వెన్షన్ హాల్, పాఠశాల వేదిక, టెన్నిస్ కోర్టును ప్రారంభించారు. త్వరలో నిర్మంచబోయే 30 షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో బెటాలియన్ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేస్తున్న సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఇటీవల ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పలు ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకు గాను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం అసిస్టెంట్ కమాండెంట్లు నరేందర్రెడ్డి, పాణికి ఉత్కృష్ట సేవా పతకాలను ప్రదానం చేశారు. అలాగే ప్రతిభకనబర్చిన పోలీస్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులను అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు నరేందర్రెడ్డి, పాణి, ఆర్ఐలు నర్సింహరాజు, ఆర్పీ సింగ్, ధర్మారావు, రాజేశం, రాజు పాల్గొన్నారు. -
143 మంది విద్యార్థులు గైర్హాజరు
వనపర్తిటౌన్: జిల్లాలో గురువారం ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెలుగు, హిందీ, ఉర్దూ, అరబిక్, సంస్కృతం, ఒకేషనల్ విద్యార్థులకు జనరల్ ఫౌండేషన్ (జీఎఫ్సీ) పరీక్షలు జరిగాయి. జిల్లావ్యాప్తంగా 25 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 5,749 మంది విద్యార్థులకుగాను 5,606 మంది హాజరుకాగా, 143 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విద్యార్థులు 4,734 మందికిగాను, 4,619 మంది పరీక్ష రాయగా.. 115 మంది హాజరుకాలేదు. అదేవిధంగా ఒకేషనల్ విద్యార్థులు 1,015 మందికిగాను 987 మంది హాజరుకాగా.. 28 మంది గైర్హాజరయ్యారు. రాష్ట్ర పరిశీలకుడు నరేంద్రకుమార్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, స్కాలర్స్, శ్రీసూర్య ఒకేషనల్, సీవీ రామన్, పానగల్లోని పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో ఏర్పాట్లు, పరీక్షల నిర్వహణను పరిశీలించారు. విద్యార్థుల హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాకేంద్రంలోని జాగృతి కళాశాల పరీక్ష కేంద్రాన్ని డీఐఈఓ ఎర్ర అంజయ్య తనిఖీ చేశారు. విద్యార్థులను పూర్తిస్థాయిలో తనిఖీ చేసి కేందరంలోకి అనుమతించాలని సిబ్బందికి సూచించారు. స్క్వాడ్ బృందం పెబ్బేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీరంగాపూర్, కొత్తకోట పరీక్ష కేంద్రాలను, డీఈసీ బృందం పెద్దమందడి, కొత్తకోట, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం పెబ్బేరు, సీవీ రామన్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. -
రైతుకు భరోసా ఏది?
● ఎన్నికలు ముగిసినా జమకాని నిధులు ● వడ్డీ వ్యాపారులే దిక్కంటున్న అన్నదాతలు ● జిల్లాలో 1.75 లక్షల మంది రైతులు మదనాపురం: వ్యవసాయాన్ని బలోపేతం చేయడం, రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా పథకం అమలు చేస్తోంది. సాధారణంగా వానాకాలం, యాసంగి సీజన్లో నిధులు విడుదల చేయాల్సి ఉండగా.. అమలులో ఉన్న సమస్యలు, జాప్యం, స్పష్టతలేమి కారణంగా ఈ పథకం రైతులకు నిజంగా భరోసా ఇస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత యాసంగి సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం పూర్తిగా విడుదల కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే ఏడాది వానాకాలం సీజన్లోనూ రైతు భరోసాను నాలుగు ఎకరాల వరకు మాత్రమే పరిమితం చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. పెద్ద భూస్వాములు మాత్రమే కాదు.. 5, 6 ఎకరాలున్న చిన్న, మధ్య తరహా రైతులు కూడా నష్టపోయారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించినా.. ఎన్నికలు పూర్తయ్యాక కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడకపోవడంతో రైతుల్లో అసంతృప్తి నెలకొంది. యాసంగి సీజన్ ముగుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నేటికీ రైతుభరోసా నిధులు విడుదల చేయకుండా సాగదీస్తుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. పంటలు చేతికందే సమయం వచ్చినా పెట్టుబడి సాయం మాత్రం రైతుల ఖాతాల్లో జమ కాలేదు. జిల్లాలోని సుమారు 1,75,800 రైతులకు ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.205.94 కోట్లు అవసరమవుతాయని అంచనా. సకాలంలో అందకపోవడంతో చిన్న, సన్నకారు రైతులు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. సాగునీటి ఎద్దడి, ఎండల తీవ్రతకు ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో పంట దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. రైతు భరోసా కింద ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. రెండు సీజన్లకు విడివిడిగా సాయం అందిస్తామని ప్రకటించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎకరాకు మొత్తం రూ.12 వేలు మాత్రమే ఇస్తున్నారు. రెండు సీజన్లకు కాకుండా ఒక్క సీజన్కు రూ.6 వేల చొప్పున మాత్రమే జమ అవుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో మేనిఫెస్టోలో చెప్పిన హామీ అమలు కాలేదనే అభిప్రాయం గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తమవుతోంది. యాసంగి సీజన్ ముగుస్తున్నా.. అందని పెట్టుబడి సాయం -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అమరచింత: ఇందిరమ్మ ఇంటి పథకంతో పేదల సొంతింటి కల నెరవేరుతుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మండలంలోని నాగల్కడ్మూర్లో శ్రీనివాస్రెడ్డి, సంధ్య దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి మంత్రి తన సతీమణి వాకిటి లలితతో కలిసి హాజరై శ్రీనివాస్రెడ్డి దంపతులకు కానుక అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలోని పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు ఇందిరమ్మ ఇంటి పథకాన్ని తీసుకొచ్చారన్నారు. మొదటి విడతలో అర్హులై ఇంటి స్థలం కలిగిన వారికి మంజూరు చేశామని చెప్పారు. మొదటి విడతలో నియోజకవర్గానికి మూడు వేల ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయడమే కాకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. గత పాలకులు అభివృద్ధిని విస్మరించారని.. తాము అధికారంలోకి వచ్చాక రూ.వందల కోట్ల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, సర్పంచ్ శివకుమార్, అరుణ్కుమార్, జగన్రెడ్డి, ఆశిరెడ్డి, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతాం.. ఆత్మకూర్: పురపాలికను అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని.. ఇప్పటికే వివిధ అభివృద్ధి పనులకు రూ.400 కోట్లు తీసుకొచ్చామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం పట్టణంలోని వాసవీమాత ఆలయ ప్రాంగణంలో నిర్మించిన కల్యాణ మండపాన్ని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత, ఏపీ మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్ సాధించడమే తన లక్ష్యమని, పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్యులకు అండగా నిలుస్తోందని.. నియోజకవర్గంలోని వైశ్యులకు ఏ ఆపద వచ్చినా ముందుంటానని హామీ ఇచ్చారు. అనంతరం రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత మాట్లాడుతూ.. మార్చి 22న హైదరాబాద్లోని లాల్బహదూర్ స్టేడియంలో వాసవీమాత పారాయణ కార్యక్రమాన్ని 40 వేల మందితో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఏపీ మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించి మాట్లాడారు. ఆర్యవైశ్యులు ఐక్యతగా ఉంటే ఏదైనా సాధించవచ్చని.. ఐక్యత దేశానికి ఎంతో అవసరమని అన్నారు. ఆర్యవైశ్యులు అన్నిరంగాల్లో రాణించాలని, కల్వ సుజాత తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజా శ్రీరాంభూపాల్, కేశం నాగరాజుగౌడ్, మార్కెట్ చైర్మన్ రహ్మతుల్లా, చైర్పర్సన్ నాగమణి, వైస్ చైర్మన్ నల్గొండ శ్రీనివాసులు, నాయకులు పరమేష్, తులసీరాజ్, చెన్నయ్యసాగర్, నిర్వాహకులు రమేష్శెట్టి, సత్యనారాయణ, యాదగిరిశెట్టి, బాలీశ్వర్, కల్వ రాజయ్య, తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్తోనే సొంతింటి కల సాకారం
కొత్తకోట రూరల్: పేదల సొంతింటి కల సాకారం చేసిన ఘనత కాంగ్రెస్పార్టీకే దక్కిందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చర్లపల్లిలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి ఆయన హాజరై లబ్ధిదారుకు నూతన దుస్తులు అందజేసి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని.. గ్రామంలో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం తొలివిడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసిందని.. సుమారు 70 శాతం ఇళ్ల్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. ఏప్రిల్లో రెండోవిడత ఇళ్లు మంజూరవుతాయని చెప్పారు. ఇల్లు రాలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అర్హులందరికీ విడతల వారీగా మంజూరు చేస్తామని వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, సర్పంచ్ శోభారాణి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శేఖర్రెడ్డి, పి.కృష్ణారెడ్డి, కౌన్సిలర్ ఎన్జే బోయేజ్, మేసీ్త్ర శ్రీనివాసులు, బీచుపల్లి యాదవ్, మాసన్న పాల్గొన్నారు. వ్యవసాయ పరికరాలు పంపిణీ.. దరఖాస్తు చేసుకున్న ఐదుగురు రైతులకు రాయితీ వ్యవసాయ పరికరాలను ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అందజేశారు. మూడు రోటోవేటర్లు, రెండు కల్టివేటర్లు అందజేసినట్టు జిల్లా ఇన్చార్జ్ వ్యవసాయ అధికారి దామోదర్ తెలిపారు. రోటవేటర్కు రూ.5 వేలు, కల్టివేటర్రు రూ.30 వేల రాయితీ ఉందని.. అవసరం ఉన్న రైతులు సంబంధిత వ్యవసాయ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొత్తకోట ఏఓ జాస్మిన్, మదనాపురం ఏఓ గాయత్రి, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు. ● మండలంలోని పామాపురం గ్రామంలో 20 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే అందజేశారు. అలాగే 33/11 కేవీ సబ్స్టేషన్ను ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రం, మహిళా సమాఖ్య భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ వినీత్, సర్పంచ్ అనురాధ, నాయకులు ఉమామహేశ్వర్రెడ్డి, రామచంద్రయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఘటనపై ఆధారాలివ్వండి
● దాడి ఘటనకు ముందే పాప ఆరోగ్యం క్షీణించడంతో నీలోఫర్లో చికిత్స ● మొదటి ఫిర్యాదులో గణేశ్, చంద్రకళపై దాడి మాత్రమే ప్రస్తావన ● చిన్న సాక్ష్యం దొరికినా హత్యకేసు నమోదు చేస్తాం ● విలేకరుల సమావేశంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ సాక్షి, నాగర్కర్నూల్: కుమ్మెర మల్లన్న జాతరలో చోటుచేసుకున్న దాడి ఘటనపై సమగ్ర విచారణ చేపడుతున్నామని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ వెల్లడించారు. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యులందరినీ విచారిస్తున్నామని చెప్పారు. బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరిస్తున్నామని, అయితే కేసు పురోగతి కోసం బాధిత కుటుంబ సభ్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జాతరలో గణేశ్, చంద్రకళపై దాడి చేసినట్లు మాత్రమే బాధితులు మొదట ఫిర్యాదు చేశారని ఈ మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. మొదట ఫిర్యాదులో మౌనిక, ఆమె బిడ్డపై దాడి ప్రస్తావన లేదని స్పష్టం చేశారు. మౌనికతోపాటు బిడ్డపై దాడికి సంబంధించిన ఏ చిన్న సాక్ష్యం దొరికినా హత్యకేసుగా మార్చి నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు సంబంధించిన ఏవైనా సాక్ష్యాధారాలు ఉంటే తమకు సమర్పించి కేసు పురోగతికి సహకరించాలని కోరారు. కోర్టు అనుమతితో కేసు ‘ఈ నెల 18న కుమ్మెర జాతరలో తమపై దాడి జరిగిందని రాత్రి 8.30 గంటల సమయంలో శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన తలపై రక్తస్రావం, గాయాలు ఉండటం, కాగ్నిజబుల్ ఆరోపణలు ఉండటంతో కేసు నమోదు చేశామని ఎస్పీ వెల్లడించారు. అదేరోజు రాత్రి 9.30 గంటలకు గణేశ్ తమపై దాడి జరిగిందని 8 మందిపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో గణేశ్తోపాటు చంద్రకళపై మాత్రమే దాడి చేశారని పేర్కొన్నారు. మౌనిక, ఆమె పాప ప్రస్తావన ఫిర్యాదులో లేదు. ఆరోపణలు నాన్ కాగ్నిజబుల్ కావడంతో కోర్టు అనుమతితో కేసు నమోదు చేశాం. మెడికల్ రిపోర్టులో సాధారణ దెబ్బలు ఉన్నాయి. ఘటనరోజు ఇచ్చిన ఫిర్యాదులో కులం పేరుతో తిట్టారన్న ప్రస్తావన కూడా లేదు. ట్రీట్మెంట్ తీసుకోలేదు.. కుమ్మెర జాతరలో మౌనిక, ఆమె పాపపై దాడి జరిగిందన్న దానికి విచారణలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఏ చిన్న సాక్ష్యం దొరికినా హత్యకేసుగా మార్చి చర్యలు తీసుకుంటాం. ఈ నెల 18న ఘటన జరిగితే 21న పాప మరణించే వరకు ఎక్కడా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా లేదు. బాధితురాలికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పరిహారాన్ని త్వరగా అందించేందుకు అవసరమైన కుల ధృవీకరణ పత్రాలు, ఆధారాలు ఇవ్వమని అడిగినా కుటుంబం సహకరించలేదు. ఆధార్, రేషన్ లాంటి కనీస ఆధారం కూడా ఇవ్వలేదు. డిసెంబర్ 21న పాప తక్కువ బరువు 1.44 కేజీలుగా జన్మించింది. ఘటనకు ముందే పాప శ్వాస సంబంధ, న్యూమోనియా, జాండీస్ వంటి సమస్యలతో నీలోఫర్లో 30 రోజులపాటు చికిత్స పొందింది. పోస్టుమార్టం రిపోర్టులో అంతర్గత, బహిర్గత గాయాలు ఏమీ లేవు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. హిస్టోపాథాలజీ, విస్త్రా రిపోర్టులు పెండింగ్లో ఉన్నాయి. -
కాలయాపన సరికాదు..
ఎన్నికలు ముగిసినా రైతుభరోసా సాయం అందకపోవడం బాధాకరం. ఎకరాకు రూ.6 వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు మౌనంగా ఉన్నారు. మళ్లీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తే కోడ్ పేరుతో ఆపేస్తారేమోనని భయంగా ఉంది. సంబంధిత అధికారులను అడిగితే వస్తాయి అంటున్నారే తప్పా ఎప్పుడు వస్తాయో చెప్పడం లేదు. త్వరలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి. – కృష్ణయాదవ్, గోవిందహళ్లి, మదనాపురం రైతుభరోసాకు జిల్లాలో 1,75,800 మంది అర్హులైన రైతుల జాబితా సిద్ధంగా ఉంది. ఇందుకోసం సుమారు రూ.205.94 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. సాంకేతిక కారణాలు, ఎన్నికల కోడ్తో కొంత జాప్యం జరిగినప్పటికీ అర్హులైన ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందుతుంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – దామోదర్గౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి -
బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి
వనపర్తి: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సిబ్బంది ప్రతి ఒక్కరికి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. రోజు హాజరు నివేదికలను సమర్పించాలన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్), ఎంసీహెచ్ను ఆయన సందర్శించి వాటి పరిధిలో నిర్మాణంలో ఉన్న పలు విభాగాలను పరిశీలించారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు మెరుగుపర్చాలని సిబ్బందికి సూచించారు. సదరం క్యాంపు భవనాన్ని ఆదర్శ భవనంగా తీర్చిదిద్దాలని, దివ్యాంగులకు తగిన ఏర్పాట్లు చేయాలని, నాణ్యమైన వైద్యంతో పాటు మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. అలాగే సీటీ స్కాన్ భవనం పనులను పరిశీలించి పనులు వేగవంతం చేసి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఇంజినీరింగ్ అధికారులను కోరారు. జీజీహెచ్ ఆవరణలో కొనసాగుతున్న సీసీ పనులను పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని పుర కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి బంధువులు ఇబ్బందులు పడకుండా మౌలిక వసతులు మెరుగుపర్చాలన్నారు. క్రమశిక్షణతో సేవలు అందించడమే సిబ్బంది లక్ష్యమని చెప్పారు. చిన్నపిల్లల వార్డు తనిఖీ.. ఎంసీహెచ్లోని చిన్నపిల్లల వార్డును తనిఖీ చేసిన కలెక్టర్ చిన్నారులకు అందిస్తున్న వైద్యసేవలను పరిశీలించారు. వెంటిలేటర్ పని చేస్తుందా లేదా అని ఆరా తీశారు. అదేవిధంగా పోషకాహారం లోపంతో బాధపడే చిన్నారులను సిఫారస్ చేసే ఎన్ఆర్సీ విభాగాన్ని పరిశీలించి రోగులతో మాట్లాడి అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ హాస్టల్ భవన నిర్మాణం పరిశీలన.. జిల్లాకేంద్రంలోని పీర్లగుట్టలో నూతనంగా నిర్మిస్తున్న ఎస్సీ హాస్టల్ భవన నిర్మాణ పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. మార్చి 10 నాటికి పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చివరి దశలో ఉన్న పనులు వేగంగా, నాణ్యతగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. కలెక్టర్ వెంట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లికార్జున్, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి ఉమాదేవి, ఇతర అధికారులు ఉన్నారు. -
వైభవంగా రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు
వనపర్తి రూరల్: శ్రీరంగాపురం రంగనాథస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రెండోరోజు గురువారం ఉదయం మంగళ వాయిద్యాలు, వేదపండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. ధ్వజస్తంభంపై గరుడ పతాకం ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు తరలిరావాలని ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. యజ్ఞశాలలో హోమం, భేరీపూజ కొనసాగాయి. బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల భక్తులు తరలిరాగా.. వేడుక అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు విష్ణునారాయణ, కిట్టుస్వామి, కన్నయ్యశర్మ, గోవిందాచార్యులు, సురేశాచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఘనంగా విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఉత్సవాలు పాన్గల్: మండలంలోని తెల్లరాళ్లపల్లితండాలో గురువారం వేంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్ట అహోబిల రామానుజ జీయర్స్వామి పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో తండావాసులు అధికసంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఇంటి వద్దకే సీతారాముల కల్యాణ తలంబ్రాలు స్టేషన్ మహబూబ్నగర్: భద్రాచలంలో వచ్చే నెల 27న జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం సందర్భంగా దేవాదాయశాఖ సహకారంతో టీజీఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా భక్తుల ఇంటి వద్దకే తలంబ్రాలు అందించనున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్, లాజిస్టిక్ ఏటీఎం బద్రి నారాయణ తెలిపారు. తలంబ్రాలు చేరవేసే కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్లను గురువారం రీజినల్ కార్యాలయంలో వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రూ.151 చెల్లించి సీతారాముల కల్యాణ తలంబ్రాల కోసం వచ్చే నెల 31 వరకు బుకింగ్ చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాల కోసం మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్లు గద్వాల, నాగర్కర్నూల్, వనపర్తి డిపో 91542 98609, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట డిపో 91542 98611, మహబూబ్నగర్, షాద్నగర్, నారాయణపేట, కోస్గి డిపో 91542 98612, ఉమ్మడి జిల్లా 91542 98637 నంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ లక్ష్మీధర్మ, డిపో మేనేజర్ అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మెళకువలు పాటిస్తే అధిక లాభాలు
మదనాపురం: మత్స్యకారులు చేపల పెంపకంలో శాసీ్త్రయ మెళకువలు పాటిస్తే ఆర్థికంగా నిలదొక్కుకోగలరని ఖమ్మం జిల్లా పాలేరు ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్తలు సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఎన్ఎస్ ప్యాడ్ దిశ ప్రాజెక్టులో భాగంగా ‘మంచినీటి చేపలు.. వ్యాధులు నివారణ’ అనే అంశంపై ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించగా.. పాలేరు ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్ శాసీ్త్రయ సిబ్బంది రవీందర్, డా. అరుణ్, నాగరాజు, దివ్య హాజరై మత్స్యకారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా చెరువుల్లో నీటి నాణ్యత, బయో సెక్యూరిటీ (జీవ భద్రత) చర్యలు, చేపలకు సోకే వివిధ రకాల వ్యాధుల గురించి వివరించారు. కేవీకే సీనియర్ శాస్త్రవేత్త రాజేంద్రకుమార్రెడ్డి మాట్లాడుతూ.. శిక్షణ కార్యక్రమాలు రైతుల ఉత్పాదకతను పెంపొందించడానికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఆధునిక పద్ధతుల్లో చేపల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ లాభదాయకమైన ఆక్వాకల్చర్ వైపు అడుగులు వేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 37 మంది క్రియాశీల చేపల రైతులు, మత్స్యకారులు పాల్గొన్నారు. -
జాతీయ చెస్ పోటీలకు జిల్లా క్రీడాకారుడు
వనపర్తిటౌన్: సౌత్జోన్ ఆలిండియా చెస్ పోటీలకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడాకారుడు బి.జితేందర్ ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ రఘునందన్ బుధవారం తెలిపారు. బీఎస్సీ బీజెడ్సీ తృతీయ సంవత్సరం చదువుతున్న జితేందర్ పాలమూరు విశ్వవిద్యాలయ పరిధిలో 23వ తేదీన జరిగిన అఖిల భారత విశ్వవిద్యాలయ చెస్ పోటీలో రెండోస్థానంలో నిలిచి భారతి దాసన్ విశ్వవిద్యాలయం, తమిళనాడులో జరిగే సౌత్జోన్ ఆలిండియా పోటీలకు అర్హత సాధించారని వివరించారు. ఈ పోటీలు మార్చి 2 నుంచి 6వ తేదీ వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారుడిని ప్రిన్సిపాల్, ఫిజికల్ డైరెక్టర్ డా. వి.రాఘవేంద్ర అభినందించారు. -
ఆర్భాటాలతో అప్పుల పాలు కావద్దు : మంత్రి
వీపనగండ్ల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నిబంధనలను విస్మరించి ఆర్భాటాలకు వెళ్లి అప్పులపాలు కావద్దని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు లబ్ధిదారులకు సూచించారు. బుధవారం మండలంలోని సంగినేనిపల్లి, కల్వరాలలో ఇందిరమ్మ ఇళ్లతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన భూమిపూజ చేసి మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో వ్యవహరించినప్పుడే గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయని చెప్పారు. కల్వరాలలో నెలకొన్న నీటిఎద్దడిని సత్వరమే పరిష్కరించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ, సర్పంచ్లు పల్ల జయంతి, బండారి రాముడు, బలుస రామన్గౌడ్ పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మొదటిరోజు ప్రశాంతం వనపర్తి టౌన్: జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా తొలిరోజు పరీక్షలకు 6,503 మంది విద్యార్థులకుగాను 6,280 మంది హాజరుకాగా.. 223 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విద్యార్థులు 5,224 మంది విద్యార్థులకుగాను 5,039 మంది హాజరుకాగా.. 185 మంది పరీక్షలు రాయలేదు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు 1,279 మంది విద్యార్థులకు 1,241 మంది హాజరుకాగా.. 38 మంది గైర్హాజరయ్యారు. కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు నిర్వహించారు. గురువారం రెండో సంవత్సరం విద్యార్థులకు మొదటి రోజు పరీక్ష జరగనుంది. మాస్కాపీయింగ్కు తావివ్వొద్దు.. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి చీఫ్ సూపరింటెండెంట్కు పలు సూచనలు చేశారు. విద్యార్థుల హాజరు వివరాలను డీఐఈఓ ఎర్ర అంజయ్యను అడిగి తెలుసుకున్నారు. మాస్ కాపీయింగ్కు పాల్పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించే ముందు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, మొబైల్ ఫోన్లు, స్మార్ట్వాచ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లకుండా చూడాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, డీఐఈఓ ఎర్ర అంజయ్యతో కలిసి స్థానిక జాగృతి కళాశాలను పరిశీలించి పరీక్షల నిర్వహణ తీరును, ఏర్పాట్లపై ఆరా తీశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సుబ్రమణ్యం, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లకు రుణ సదుపాయం
వనపర్తి రూరల్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణ సదుపాయం కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం మండలంలోని పెద్దగూడెంతండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. గ్రామంలో 13 ఇళ్ల నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయని, రెండు ఇళ్ల నిర్మాణం పూర్తయిందని అధికారులు వివరించారు. అనంతరం కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణానికి అవసరమైన డబ్బులు ఎక్కడి నుంచి సమకూర్చుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులున్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం శ్రీరంగాపురం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణాన్ని పరిశీలించారు. పనులు నాణ్యతగా వేగంగా పూర్తి చేయాలని.. గరిష్టంగా 10 రోజుల్లో భవనాన్ని అప్పగించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాంను సందర్శించి యూరియా, ఎరువుల నిల్వలను పరిశీలించారు. స్టాక్ బోర్డుపై నిల్వలు, సరఫరా వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆన్లైన్లో యూరియా బుకింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుందని ఆరా తీశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మేరకు ఎరువులు అందుబాటులో ఉంచాలని, పారదర్శకంగా పంపిణీ జరగాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ రాజు, రమేష్రెడ్డి, హౌసింగ్ డీఈ విఠోబా, ఎంపీడీఓ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
పోరాటం ఆపొద్దు..!
● మానవత్వానికి మాయని మచ్చగా దాడి ఘటన ● రెండు నెలల పసిపాపపై ఇంత క్రూరత్వమా? ● ఒక్క వ్యక్తిపై 20 మంది దాడి చేయడం సిగ్గుచేటు ● ‘కుమ్మెర’ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలోని కుమ్మెర మల్లన్న జాతరలో ఓ కుటుంబం పట్ల పైశాచికంగా ప్రవర్తించిన మానవ మృగాలను శిక్షించే వరకు పోరాటం ఆపొద్దని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. బాధిత కుటుంబానికి తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బుధవారం ఆయన నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన శిబిరంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులు చంద్రకళ, గణేశ్, మౌనికతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, తమ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సంఘటన చోటుచేసుకున్న వెంటనే స్పందించి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తున్న విశారదన్ మహరాజ్ పోరాటాన్ని అభినందించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు, హంతకులందరికీ శిక్ష పడే దాకా పోరాటాన్ని ఆపేది లేదని తేల్చిచెప్పారు. పోలీసులను డిస్మిస్ చేయాలి కుమ్మెర దాడి ఘటనలో బాధితుల ఫిర్యాదు తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం చేశారని మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బాధ్యులైన వారిని సస్పెండ్ కాకుండా డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో పోలీసింగ్కు అంతర్జాతీయంగా పేరు తీసుకొస్తే.. కాంగ్రెస్ హయాంలో వ్యవస్థను నీరుగార్చారని మండిపడ్డారు. నిందితులందరిపై హత్య కేసు నమోదు చేయాలని కోరారు. ఆధిపత్యం, అహంకారంతోనే.. అగ్రకులాల ఆధిపత్యం, అహకారంతోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. కుమ్మెరలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని చెప్పారు. ఇక్కడి పరిస్థితులు, ఇలాంటి ఘటనల నుంచే తాను పాటలు పాడానని గుర్తుచేశారు. ప్రభుత్వం నిందితులపై చర్యలు తీసుకోకుండా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించడం సరికాదని విమర్శించారు. ఐదోరోజు కొనసాగిన నిరసనలు కుమ్మెరలో దాడి ఘటనపై జిల్లాకేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన శిబిరంలో బుధవారం ఐదోరోజు ఆందోళనలు కొనసాగాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలతోపాటు రాష్ట్ర రజక సంఘం నేతలు నిరసనల్లో పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో శ్రేణు లు నిరసన శిబిరం వద్దకు చేరుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాక సందర్భంగా అంబేడ్కర్ చౌరస్తా ప్రాంతం కిక్కిరిసి ఉండటంతో ట్రాఫిక్ స్తంభించింది. సామరస్యానికి ప్రతీక ఈ ప్రాంతం.. ఇక్కడి ప్రాంతం కుల, మతాల సామరస్యానికి ప్రతీకగా నిలిచిందని కేటీఆర్ పేర్కొన్నారు. మహేంద్రనాథ్తోపాటు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న లాంటి ప్రజా కవులు ఇక్కడి ప్రాంత సామరస్యం కోసం కృషిచేశారని చెప్పారు. కులాలు, మతాల పిచ్చి వదిలి.. సామాజిక చైతన్యం కావాలన్నారు. మానవ మృగాలకు శిక్ష పడేందుకు అందరం ఏకమవ్వాలని చెప్పారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ.లక్ష అందజేశారు. ఇంటి నిర్మాణం కోసం రూ.10 లక్షల ఆర్థికసాయం చేస్తున్నట్టు ప్రకటించారు. బాధితులకు న్యాయం జరిగే దాకా అండగా నిలబడదాం కుమ్మెర ఘటనలో నిరుపేద కుటుంబంపై దాడికి పాల్పడటం అధికార దురహంకారానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. ఒక్క వ్యక్తిపై 20 మంది కలిసి దాడి చేయడం, పసిపాప అని కూడా చూడకుండా కాలితో తన్నడం మానవత్వానికే మచ్చగా మిగిలిందని విమర్శించారు. ఇలాంటి ఘటనపై ప్రజలంతా స్పందించాలని, మనసున్న మనుషులంతా ఏకం కావాలని కోరారు. హంతకులను శిక్షించే దాకా సమాజం ఊరుకోదని హెచ్చరించారు. అప్పుడే పుట్టిన పసిపాపకు కుల, మతాలతో ఏం సంబంధమని ప్రశ్నించారు. పుట్టిన 5 నిమిషాలకు పుట్టేదే కులం, మతమని.. మనుషులు పుట్టించిన కులం పేరుతో దేవుని దర్శనాలకు రాకుండా ఎలా చేస్తారని మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యే, ఎంపీ కుటుంబంలో జరిగితే పోలీసులు ఇలాగే స్పందిస్తారా..? అని ప్రశ్నించారు. -
బడిబయటే బాల్యం!
జిల్లాలో ముగిసిన ఓఎస్సీ సర్వే అమరచింత: జిల్లాలో బడిబయటి పిల్లల సంఖ్య తగ్గడం లేదు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా వారి సంఖ్య అధికంగానే ఉంది. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో వివిధ మండలాల్లోని సీఆర్పీలు 40 రోజుల పాటు సర్వేచేసి విద్యాహక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 ఏళ్లలోపు పాఠశాలకు వెళ్లని 15 నుంచి 19 ఏళ్లలోపు వారిని గుర్తించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఆర్థిక పరిస్థితులు, అవగాహన లేమి కారణంగా జిల్లాలో 431 మంది చిన్నారులు బడిబయట ఉన్నట్లు గుర్తించారు. వారిని స్థానిక పాఠశాలలు లేదా కస్తూర్బా, గురుకులాల్లో చేర్పించే చర్యలు చేపట్టినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. సర్వే కొనసాగింది ఇలా.. చదువుకోవాల్సిన వయసులో వీధుల్లో ఉంటున్న వారి వివరాలను రెండు గ్రూప్లుగా వర్గీకరించారు. 6 నుంచి 14 ఏళ్లలోపు చిన్నారులు ఒక గ్రూప్గా.. 15 నుంచి 19 ఏళ్లలోపు బాలబాలికల మరో గ్రూప్గా విభజించి సేకరించిన వివరాలను ప్రబంద్ యాప్లో నిక్షిప్తం చేశారు. విద్యాసంస్థలు తెరిచాక వయస్సు ఆధారంగా ఆయా తరగతుల్లో చేర్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. బడిబయటి పిల్లలను గుర్తించిన అనంతరం వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అందుబాటులో ఉండే పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. అంతేగాకుండా బాలురు, బాలికలకు వేర్వేరుగా అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్(యూఆర్ఎస్), స్పెషల్ ట్రైనింగ్ సెంటర్(ఎస్టీసీ), సర్వేలో మైగ్రేటెడ్ (వలస పిల్లల కోసం) రెసిడెన్షియల్ స్కూల్స్ ట్రైనింగ్ సెంటర్లు (ఆర్ఎస్టీసీ) ఏర్పాటు చేసి బడిబయటి పిల్లలకు విద్యను అందించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది. ఇవేగాకుండా ఇటుక బట్టీలు, కర్మాగారాల వద్ద పనిచేస్తున్న కార్మికుల పిల్లల కోసం వర్క్సైట్ స్కూల్స్ ఏర్పాటు చేసి అక్కడే విద్యనందించేందుకు యాజమాన్యాల సహకారంతో 14 ఏళ్లలోపు విద్యార్థులకు ఏర్పాటు చేస్తారు. తూతూమంత్రంగానేనా..? బడిబయటి పిల్లల గుర్తింపు సర్వే నవంబర్ 15న ప్రారంభించి డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాల్సి ఉంది. కాగా డిసెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో సర్వే నామమాత్రంగా సాగింది. జనవరి రెండోవారం నాటికి ఆన్లైన్ ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా పర్యవేక్షించే అధికారి లేకపోవడంతో ఫిబ్రవరి మొదటి వారం వరకు కూడా వివరాల నమోదు పూర్తి కాలేదు. చాలామంది సీఆర్పీలు తమకు కేటాయించిన క్లస్టర్ గ్రామాల్లో పర్యటించకుండానే బడిమానిన విద్యార్థుల వివరాలు నామామాత్రంగా తెలుసుకొని నమోదు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనవరి 20 నుంచి 40 రోజుల పాటు కొనసాగింపు బడిబయటి విద్యార్థులు 431 గతంలో కంటే పెరిగిన సంఖ్య నిర్బంధ విద్య అందిస్తామంటున్న అధికారులు -
28న జాతీయ లోక్ అదాలత్
వనపర్తిటౌన్: జిల్లా కోర్టు ఆవరణలో ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నామని.. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత కోరారు. మంగళవారం జిల్లా కోర్టులో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. లోక్ అదాలత్లో సివిల్, వివాహ సంబంధిత, మోటారు ప్రమాద క్లయిమ్స్, చెక్బౌన్స్ తదితర రాజీ పడదగిన క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. లోక్ అదాలత్లో రాజీతో డబ్బు, సమయం ఆదా చేసుకోవచ్చని సూచించారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసులకు తక్షణ పరిష్కారం లభిస్తుందన్నారు. ఎలాంటి కోర్టు ఫీజు చెల్లించనవసరం లేదని, దావా వేయడానికి చెల్లించిన ఫీజు కూడా తిరిగి ఇస్తామని వెల్లడించారు. అనంతరం హిట్ అండ్ రన్, పోక్సో, అండర్ ట్రయల్, కో–ఆర్డినేషన్, డిస్ట్రిక్ట్ కేసు మేనేజ్మెంట్ కమిటీలతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని, న్యాయమూర్తులు జి.కళార్చన, కె.కార్తీక్రెడ్డి, శ్రీలత, నోముల అశ్విని, శిరీష, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు గోపాల్రెడ్డి, శ్రీనివాసాచారి, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రాజేష్, సునీత, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ బాలయ్య, కృష్ణయ్య, రఘు, శ్రీదేవి, సీడౠ్ల్యసీ వనజ, సఖి ఇన్చార్జ్ కవిత, జిల్లాలోని సబ్ ఇన్స్పెక్టర్లు, భరోసా కేంద్రం కౌన్సిలర్లు పాల్గొన్నారు.


