breaking news
Wanaparthy District Latest News
-
నీరున్నా.. నిట్టూర్పే!
‘అమరచింత’ ఆయకట్టుకు అందని సాగునీరు అమరచింత: వేసవిలో చేపట్టాల్సిన ఎత్తిపోతల సెక్షన్ పైపుల మరమ్మతు ప్రస్తుత వానాకాలంలో కొనసాగుతున్నాయి. కృష్ణానదికి వరద వచ్చి జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి పారుతుంటే సమీపంలోనే ఉన్న అమరచింత ఎత్తిపోతల ఆయకట్టు రైతులు మాత్రం సాగునీరు వినియోగించుకోలేకపోతున్నారు. సెక్షక్షన్ పైపుల మరమ్మతు పూర్తయితే తప్పా లిఫ్ట్కు సాగునీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొనడంతో వరి నారుమడులు సిద్ధం చేసుకొని సాగునీటి కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. మరో వారం పాటు మరమ్మతులు కొనసాగుతాయని.. పూర్తయిన వెంటనే ఆయకట్టుకు నీటిని అందిస్తామని లిఫ్ట్ నిర్వహణ కమిటీ చెబుతోంది. ఇప్పటికే సాగునీరు వదలాలని రైతుల నుంచి ఒత్తిడి వస్తున్నా.. 26 ఏళ్ల కిందట ఏర్పాటు చేసుకున్న సెక్షన్ పైపులను మార్చి కొత్త పైపులను అమర్చుకునే పనులు కొనసాగుతుండటంతో రైతుల విజ్ఞప్తిని వింటూనే త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికతో ముందుకుసాగుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే దయాకర్రెడ్డి హయంలో నాబార్డు నుంచి రూ.11 కోట్లతో 2,400 ఎకరాలకు సాగునీరు అందించేందుకు అమరచింత ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. లిఫ్ట్ డ్రమ్ము మరమ్మతుకు గురికావడంతో తెలంగాణా ఉద్యమ సమయంలో లిఫ్ట్ సందర్శనకు వచ్చిన నాటి ఎమ్మెల్యే హరీశ్రావు ఎంపీ నిధుల నుంచి రూ.60 లక్షలు మంజూరు చేయించారు. చిన్న చిన్న మరమ్మతులతో సాగునీటిని అందించిన ఎత్తిపోతలకు ప్రస్తుతం అతిపెద్ద మరమ్మతు సెక్షన్ పైపులను మార్చడమేనని ఆయకట్టు రైతులు అంటున్నారు. యాసంగిలో క్రాప్హాలిడే.. అమరచింత ఎత్తిపోతల పథకం ఆయకట్టుకు రెండేళ్లుగా యాసంగి సీజన్లో సాగునీరు సరఫరా చేయక క్రాప్ హాలీడే ప్రకటించారు. ఈసారైనా వానాకాలంలో సకాలంలో వరిసాగు చేద్దామనుకున్న రైతుల ఆశలకు ఎదురుచూపులే మిగిలాయి. వరద వేళ కొనసాగుతున్న సెక్షన్ పైపుల మరమ్మతు గతేడాదే రూ.56 లక్షలు మంజూరు టెండర్ పూర్తయినా.. అగ్రిమెంట్ ఆలస్యం సాగునీటికి ఆయకట్టు రైతుల ఎదురుచూపులు -
నకిలీ ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు
పాన్గల్: ఫర్టిలైజర్ డీలర్లు నకిలీ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు విక్రయించి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు హెచ్చరించారు. మంగళవారం మండలంలోని మల్లాయిపల్లి, రాయినిపల్లి, బుసిరెడ్డిపల్లి, పాన్గల్లోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి నిల్వలు, రికార్డులను పరిశీలించారు. దుకాణం ఎదుట నిల్వ వివరాలు, ధరలు ప్రదర్శించాలన్నారు. ఎరువులు, విత్తనాలు, మందులు కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఎఫ్ఎఫ్ఎస్ ఫ్రేమ్వర్క్ ఆన్ ఫర్టిలైజర్ సేల్ యాప్ జిల్లాలో ఈ నెల 13 నుంచి ప్రారంభం కానుండటంతో దుకాణాల్లో స్టాక్ వివరాలు, ఈపీఓఎస్ మిషన్ స్టాక్ను తనిఖీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో తెలియని వ్యక్తులు విక్రయించే నకిలీ డీఏపీ, ఫెస్టిసైడ్స్, ఫర్టిలైజర్ను కొనుగోలు చేయవద్దని కోరారు. అలాంటి వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆయన వెంట ఇన్చార్జ్ ఏఓ రమేష్నాయక్ ఉన్నారు. -
మరో వారం రోజులు..
త్వరగా సాగునీరు అందించాలి.. అమరచింత ఎత్తిపోతల పథకం ఆయకట్టు పరిధిలో 4 ఎకరాల పొలం ఉంది. యాసంగిలో క్రాప్ హాలీడే ప్రకటించడంతో ఈసారి వానాకాలంలోనైనా వరి సాగుచేద్దామని బోరుమోటారు నీటితో వరి నారుమడిని సిద్ధం చేసుకున్నా. త్వరగా సాగునీరు విడుదల చేసి పంటలు పండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి. – వెంకటేశ్వర్రెడ్డి, రైతు, అమరచింత 26 ఏళ్ల తర్వాత మరమ్మతు.. అమరచింత ఎత్తిపోతల పథకం నిర్మించి 26 ఏళ్లు అవుతోంది. లిఫ్ట్ ఏర్పాటు సమయంలో వేసిన 5 పైపులకు చిన్నపాటి రంధ్రాలు ఏర్పడటంతో మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా.. మరమ్మతుకు చిన్ననీటి పారుదలశాఖ నుంచి రూ.56 లక్షలు మంజూరు చేశారు. ఆయా పైపులతో పాటు బ్రేకర్ను ఈసారి మార్చుతున్నాం. – ఆంజనేయులు, ప్రధానకార్యదర్శి, అమరచింత ఎత్తిపోతల పథకం నిర్వహణ కమిటీ ●అమరచింత ఎత్తిపోతల పథకం పంప్హౌజ్ వద్ద సెక్షన్ పైపుల బిగింపు పనులు మరో వారం పాటు కొనసాగనున్నాయి. యాసంగిలోనే పూర్తి కావాల్సి ఉండగా.. సాంకేతిక కారణాలతో జాప్యం జరిగింది. త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించాం. పనులు పూర్తికాగానే ఆయకట్టుకు సాగునీరు వదిలేందుకు ప్రతిపాదనలు పంపాం. – వంశీకృష్ణ, ఏఈ చిన్ననీటిపారుదలశాఖ -
సకాలంలో యూనిఫాంల తయారీ
వనపర్తి/వనపర్తి రూరల్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేయనున్న యూనిఫాంల కుట్టు పనులు నాణ్యతగా, వేగంగా పూర్తిచేసి నిర్దేశిత గడువులోగా అందజేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ ఆదేశించారు. వనపర్తి పురపాలికలో మెప్మా ఆధ్వర్యంలో కొనసాగుతున్న కుట్టు కేంద్రంతో పాటు మండలంలోని రాజపేటలో సెర్ఫ్ కుట్టుకేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ యూనిఫాంల కుట్టు పనుల పురోగతిని పరిశీలించి నాణ్యతా ప్రమాణాలను విధిగా పాటించాలన్నారు. ప్రతి యూనిఫాంను నిర్ణీత ప్రమాణాల మేరకు కుట్టి ఎలాంటి లోపాలకు తావులేకుండా పూర్తి చేయాలని సూచించారు. కుట్టు పనులు ఆగస్టు 10వ తేదీలోగా పూర్తిచేసి సకాలంలో సంబంధిత పాఠశాలలకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలన్నారు. ఆయన వెంట పుర కమిషనర్ నిరంజన్, డీపీఎం, మెప్మా, సెర్ప్ అధికారులు, కేంద్రాల నిర్వాహకులు, సిబ్బంది ఉన్నారు. -
నీటి‘కబురు’
కలెక్టర్ సమీక్ష.. జూరాల ప్రాజెక్టుకు స్థిరంగా వరద నీరు కొనసాగుతుండడంతో కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ మంగళవారం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సీజన్లో ప్రాజెక్టుకు ఎంతమేర వరద వచ్చింది.. కర్ణాటక ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల వరద నీటి స్థితిగతులు వంటి వివరాలను ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం, గేట్ల పనితీరు, హైడల్ పవర్ హౌజ్లో విద్యుదుత్పత్తి వంటి వివరాలపై ఆరాతీశారు. అదేవిధంగా కుడి కాల్వ పరిధిలో లైనింగ్ మరమ్మతులను పర్యవేక్షించారు. ఈ క్రమంలోనే జూరాల– ఆర్డీఎస్ లింక్ కెనాల్కు నీటి విడుదల వంటి అంశాలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వరి పండించే రైతులు పంటకాల పరిమితిని దృష్టిలో ఉంచుకుని నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 1.40 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ఎక్కడికక్కడ రిజర్వాయర్లు, చెరువులను కృష్ణాజలాలతో నింపుకోవాలని సూచించారు. అదేవిధంగా జూరాలకు వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల కింద సేకరించాల్సిన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సమీక్షలో ఎస్ఈ కేశవరావు, డీఈ నాగేశ్వరరావు, తహసీల్దార్ నందిని తదితరులున్నారు. గద్వాల: వానాకాలం మొదలై రెండు నెలలు గడిచినా వరద నీరు లేక ఒట్టిపోయిన జూరాల జలాశయం.. వారం రోజులుగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండడంతో జలకళ సంతరించుకుంది. ఈ వానాకాలం సీజన్లో గరిష్టంగా మంగళవారం 2 లక్షల పైచిలుకు క్యూసెక్కుల ఇన్ఫ్లో జూరాలకు చేరింది. దీంతో అధికారులు ప్రాజెక్టులోని 30 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూరాలకు భారీగా వరద కొనసాగుతుండడంతో మొన్నటి వరకు ప్రాజెక్టు కింద ఆయకట్టుకు ఆరుతడి పంటలకు మాత్రమే నీటిని ఇస్తామని చెప్పిన అధికారులు తాజాగా పూర్తిస్థాయి పంటల సాగుకు నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే మంగళవారం కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ జూరాలను సందర్శించి వరద నీటి వివరాలు తెలుసుకుని అధికారులతో సమీక్షించారు. ఉమ్మడి జిల్లా వరప్రదాయిని.. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయినిగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వెలుగొందుతోంది. ఈ క్రమంలో ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. జూరాల ప్రాజెక్టు కింద ఎడమ, కుడి ప్రధాన కాల్వల పరిధిలో 1.09 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు కింద 1.40 లక్షల ఎకరాలు, ఆర్డీఎస్ కింద 50 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే ఈసారి ఎల్నినో ప్రభావంతో దాదాపు నెలన్నర రోజులపాటు వర్షాలు కురవక.. కృష్ణానదిలో నీరు పారక జూరాల ప్రాజెక్టు అడుగంటింది. దీంతో అధికారులు జలాశయంలో అందుబాటులో ఉన్ననీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రాజెక్టు కింద ఉన్న ఆరుతడి పంటలకు మాత్రమే సాగునీటిని అందిస్తామని ప్రకటించారు. కానీ, జూరాల కింద అప్పటికే సుమా రు 60 వేలకుపైగా ఎకరాల్లో నారుమళ్లు పోసుకున్న రై తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. కృష్ణాబేసిన్ పరిధిలో మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షా లు కురుస్తుండటంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వర ద వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయకట్టుకు నీటి విడుదల చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. రైతన్నకు తీపికబురు.. స్థానికంగా పెద్దగా వానలు కురవకపోయినా.. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. గడిచిన వారం రోజులుగా వరద జలాల రాక స్థిరంగా కొనసాగుతుండటంతో జూరాల ప్రాజెక్టు పరిధిలోని సాగునీటి రిజర్వాయర్లకు ఎత్తిపోతలు చేపట్టారు. ఆయకట్టులోని సుమారు 3 లక్షల ఎకరాలకు సాగునీరు వదిలేందుకు అధికారులు నిర్ణయించారు. దీంతో ఇన్నాళ్లు ఎల్నినో ప్రభావంతో వరి వేయాలా.. వద్దా.. అన్న మీమాంసలో కొట్టుమిట్టాడిన అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. కృష్ణానదికి పోటెత్తుతున్న భారీ వరద గడిచిన వారం రోజులుగా జూరాల స్థిరంగా ప్రవాహం జూరాల ఆయకట్టుకు సాగునీటి విడుదలకు నిర్ణయం నెట్టెంపాడు, ఆర్డీఎస్, జూరాల పరిధిలో సుమారు 3 లక్షల ఎకరాలు అన్నదాతల హర్షం.. సాగు పనుల్లో నిమగ్నం -
పారదర్శకంగా భూ రిజిస్ట్రేషన్ల నిర్వహణ
వనపర్తి: భూ భారతి విధానంలో భూముల రిజిస్ట్రేషన్లు వేగంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జూనియర్ అసిస్టెంట్లు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై జిల్లాలోని వివిధ మండలాల జూనియర్ అసిస్టెంట్లకు నిర్వహించిన శిక్షణకు ఆయన హాజరై మాట్లాడారు. రెవెన్యూశాఖలో భూ భారతి అత్యంత కీలకమైందని, రైతులు, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. లక్ష్య సాధనలో జూనియర్ అసిస్టెంట్ల పాత్ర ఎంతో ముఖ్యమైందని.. భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, డిజిటల్ సంతకాలు, సంబంధిత పత్రాల పరిశీలన తదితర ప్రక్రియలను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. సాంకేతిక లోపాలకు తావులేకుండా ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలిస్తూ లాగిన్ ప్రక్రియ నుంచి దరఖాస్తుల ఆమోదం వరకు ప్రతి దశలో అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, శిక్షణలోనే సందేహాలను మాస్టర్ ట్రైనర్ల ద్వారా వెంటనే నివృత్తి చేసుకోవాలన్నారు. శిక్షణలో కలెక్టరేట్ పరిపాలనాధికారి భానుప్రకాష్ , మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు. -
‘జైల్భరో’ జయప్రదం చేయండి
పాన్గల్: క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో జిల్లాకేంద్రంలో ఈ నెల 10న నిర్వహించే జైల్భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రమేష్, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్రెడ్డి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు రేగిచెట్టు నిరంజన్ పిలుపునిచ్చారు. మంగళవారం సీఐటీయూ మండల కన్వీనర్ సూర్యవంశం రాము అధ్యక్షతన నిర్వహించిన మండల సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపడుతున్న జైల్భరోలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు, ప్రజాతంత్రవాదులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆయా సంఘాల నాయకులు దేవేందర్, జంబులయ్య, భాస్కర్, శ్యామల, మహేశ్వరి, రేణుక, సుజాత, లక్ష్మి, సుగ్రీవుడు, డీవైఎఫ్ఐ మండల కన్వీనర్ కమలాకర్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్కు కేజీబీవీ విద్యార్థి ఎంపిక ఖిల్లాఘనపురం: మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్న కోట్ల నందిని రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు ప్రత్యేక అధికారి లలిత, పీఈటీ చిట్టి తెలిపారు. ఈ నెల 1న జిల్లాకేంద్రంలో జరిగిన ఎంపికల్లో అండర్ 18 విభాగం వెయ్యి మీటర్ల పరుగుపందెంలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచిందని.. ఈ నెల 7న హన్మకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరుఫున పాల్గొంటుందని వివరించారు. ఈ సందర్భంగా క్రీడాకారిణిని ప్రత్యేక అధికారి, పీఈటీతో పాటు గ్రామపెద్దలు ఆగారం ప్రకాష్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు. పశువుల సంత @ రూ.1.94 లక్షలు వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని పశువుల సంత రూ.1.94 లక్షలు పలికింది. మంగళవారం పుర కార్యాలయంలో చైర్పర్సన్ అధ్యక్షతన బహిరంగ వేలం నిర్వహించగా ముగ్గు రు పాటదారులు పాల్గొన్నారు. సర్కార్ పాటను రూ.1.40 లక్షల పైచిలుకుతో పుర అధికారులు ప్రారంభించగా.. గుజ్జుల భరత్ రూ.1.94 లక్షలు పాడి దక్కించుకున్నారు. కార్యక్రమంలో చైర్పర్సన్ ఎం.మాధవి, కమిషనర్ నిరంజన్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడదాం : సీపీఐ
అమరచింత: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడదామని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు పిలుపునిచ్చారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ధరల పెరుగుదలను తక్షణమే అరికట్టాలని, ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించాలని, పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్మిక హక్కులను పరిరక్షించాలని, బ్యాలెట్ విధానంలో ఎన్నికలు పునరుద్ధరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు, నీటిపారుదల వసతులు కల్పించినప్పుడే వ్యవసాయరంగం అభివృద్ధి చెందుతుందన్నారు. దశాబ్ద కాలానికిపైగా ప్రధాని మోదీ అపూర్వ ప్రగతి సాధించినట్లు ఒక చిత్రాన్ని ప్రాజెక్టు చేస్తోందని ఆరోపించారు. దళిత ఆదివాసీలపై దాడులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పాదయాత్రకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. సెప్టెంబర్ 1న న్యూడిల్లీలోని రాంలీలా మైదానంలో జరగబోయే యే బద్లావ్ జరూరీ హై ర్యాలీతో ముగుస్తాయని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి అబ్రహం, మక్తల్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీహరి, కో–కన్వీనర్ నర్సింహ, లక్ష్మి శెట్టి, శ్యాంసుందర్, భాస్కర్, మోషా, నాగరాజు, లక్ష్మీనారాయణ, అంజి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలి
వనపర్తిటౌన్: విశ్రాంత ఉద్యోగులకు న్యాయంగా అందాల్సిన రూ.900 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వాకిటి శ్రీధర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్యం డిమాండ్ చేశారు. బస్భవన్ ముట్టడిని అడ్డుకోవడంతో మంగళవారం జిల్లాకేంద్రంలోని రాజీవ్చౌక్లో విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు బకాయిలు చెల్లించండంటూ బస్భవన్ను ముట్టడించేందుకు ప్రయత్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వయో వృద్ధులని చూడకుండా అరెస్టులు చేయడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని మండిపడ్డారు. 2017 నుంచి రావాల్సిన ఆర్బీఎస్, గ్రాట్యుటీ, పెన్షన్ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొని ఇప్పుడు మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా స్పందించి బకాయిలు వెంటనే చెల్లించాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు ప్రేమ్నాథ్రెడ్డి ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు రామచంద్రారెడ్డి, అంజయ్య, ఉపేందర్, ప్రకాష్, సత్యనారాయణగౌడ్, హుస్సేన్ అలీ, స్వామి, రాఘవరెడ్డి, బీవీ రావు, గాంధీ, కురుమయ్య, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
తల్లిపాలతో రోగ నిరోధకశక్తి మెరుగు
మదనాపురం: శిశువుకు తల్లిపాలు అమృతంతో సమానమని, పుట్టిన ప్రతి బిడ్డకు 30 నిముషాల నుంచి గంటలోపు ముర్రుపాలు పట్టించడంతో రోగనిరోధకశక్తి పెరుగుతుందని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధారాణి తెలిపారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మంగళవారం మండలంలోని తిరుమలాయపల్లి అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. శిశువుకు మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టించాలన్నారు. బాలింతలు తమ రోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఆకుకూరలు, పండ్లు, పప్పుధాన్యాలతో కూడిన పౌష్టికాహారాన్ని తీసుకోవడంతో బిడ్డకు సరిపడా పాల ఉత్పత్తి జరుగుతుందని సూచించారు. అంగన్న్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పీడీపీఓ రాజలక్ష్మి, సూపర్వైజర్ జ్యోతి, ఉపాధ్యాయులు రాధ, శారద, అరుణ, తారమ్మ, హంసమ్మ, సుజాత, ఎంఎల్టీలు రతన్, ముజాఫర్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
పోలీసు ప్రజావాణికి 22 ఫిర్యాదులు
వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 22 మంది ఫిర్యాదుదారులు తమ సమస్యలను నేరుగా ఎస్పీ సునీతారెడ్డికి వివరించి.. వినతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను నేరుగా విని, తక్షణ పరిష్కారం చూపడం పోలీసుశాఖ ప్రధాన బాధ్యత అన్నారు. ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి.. సంబంధిత అధికారుల సమన్వయంతో చట్టబద్ధంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుశాఖ ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న కేంద్రం అమరచింత: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అజయ్ అన్నారు. అమరచింతలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సామ్రాజ్యవాదులకు లొంగిపోయి.. వ్యవసాయ ఉత్పత్తులను జీరో ట్యాక్స్తో దేశంలోకి దిగుమతి చేసుకోవడానికి అంగీకరించడం దారుణమన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను కుదించి.. పారిశ్రామిక యజమానులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం దుర్మార్గమన్నారు. కార్మికుల ప్రయోజనాలను దెబ్బకొట్టి.. పెట్టుబడిదారుల ఖజానా నింపడమే ప్రధాని మోదీ తన కార్తవ్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. కేంద్రం అవలంబిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 10న దేశవ్యాప్తంగా చేపట్టనున్న జైల్భరో కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్ఎన్ రమేశ్, రైతు సంఘం జిల్లా కోశాధికారి వెంకటేశ్, ప్రభాకర్, బుచ్చన్న, నాగేంద్రమ్మ, శంకర్, రాజు, మోహన్, భగవంతు, హరికృష్ణ, రేణుక ఉన్నారు. -
తుర్క కాషా ముస్లింల సంక్షేమానికి ప్రాధాన్యం
కొత్తకోట రూరల్: రాష్ట్రంలోని తుర్క కాషా ముస్లిం కమ్యూనిటీ అభ్యున్నతి, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. సోమవారం తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొత్తకోటలోని ఓ కన్వెన్షన్ హాల్లో తుర్క కాషా ముస్లిం వర్గాలకు యాంత్రిక పనిముట్ల పంపిణీ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన 90 మంది లబ్ధిదారులకు రూ. 54లక్షల వ్యయంతో (ఒక్కో లబ్ధిదారుడికి రూ. 60వేల విలువైన యూనిట్) వందశాతం రాయితీపై జనరేటర్లు, టూల్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 2వేల మంది లబ్ధిదారులకు రూ. 12కోట్ల వ్యయంతో పనిముట్ల పంపిణీని స్థానిక ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తుర్క కాషా కమ్యూనిటీ సభ్యులు అత్యంత కష్టమైన వృత్తితో జీవనోపాధి పొందుతున్నారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న జనరేటర్లు, టూల్ కిట్లు వారి ఉపాధికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. అంతకు ముందు ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ.. తుర్క కాషా కమ్యూనిటీ కోసం ప్రభుత్వం తొలిసారిగా ప్రత్యేకంగా పథకాన్ని అమలు చేయడం సంతోషకరమన్నారు. ప్రజా పాలనలో అన్ని వర్గాలు, అన్ని రంగాలు సమానంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. తుర్క కాషా కమ్యూనిటీ అవసరాల దృష్ట్యా షాదీఖానాల నిర్మాణానికి సహకరించాలని ఆయన మంత్రిని కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పల్లవి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్, తుర్క కాషా కమ్యూనిటీ అధ్యక్షుడు బడే సాబ్, టీజీఎంఎఫ్సీ ఏజీఎం ప్రవీణ్ కులకర్ణి, పవర్బిల్ట్ ఎగ్జిక్యూటివ్ కార్తీక్, సీడీసీ చైర్మన్ చంద్రమోహన్రెడ్డి, నాయకులు పి.కృష్ణారెడ్డి, శేఖర్రెడ్డి, ఎన్జే బోయేజ్, బీచుపల్లి యాదవ్, పెంటన్నయాదవ్, సుభాష్ పాల్గొన్నారు. -
ఇక్కడే సీటు ఇప్పించండి..
నేను 6 నుంచి 10వ తరగతి వరకు పెద్దమందడి టీజీడబ్ల్యూఆర్ఎస్/జేసీలో చదివాను. ఎస్సెస్సీలో 501 మార్కులతో పాసయ్యాను. అనంతరం ఇంటర్ ప్రవేశ పరీక్ష రాయగా.. నాకు మక్తల్లో సీటు కేటాయించారు. ఇక్కడ చదివిన వారికి ఇక్కడే మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా.. అలా జరగలేదు. ఇక్కడ టీసీ ఇవ్వడంతో మక్తల్ టీజీడబ్ల్యూఆర్ఎస్/జేసీలో ఇంటర్ బైపీసీలో చేరాను. అక్కడ తాగునీరు పడక తరచుగా అనారోగ్యానికి గురవుతున్నా. చదువుకు ఇబ్బందిగా మారింది. మక్తల్ నుంచి పెద్దమందడి గురుకులానికి ట్రాన్స్పర్ చేసి.. నా చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలి. – డి.పల్లవి, వెలగొండ, చిన్నంబావి మండలం -
సమస్యల పరిష్కారంలో అలసత్వాన్ని సహించం
వనపర్తి రూరల్: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే సహించమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. సోమవారం పెబ్బేరు, శ్రీరంగాపురం ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ శాఖల వారీగా ప్రగతి నివేదికలపై నిశితంగా సమీక్షించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సర్పంచులు సభ దృష్టికి తీసుకొచ్చారు. వాటిపై ఆయా శాఖల అధికారులు సరైన సమాచారం లేకుండా పొంతన లేని సమాధానాలు చెప్పడంపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. సంబంధిత అంశాలపై స్పష్టత ఇవ్వని విద్యుత్ లైన్మ్యాన్కు నోటీస్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. శ్రీరంగాపురంలో విద్యాశాఖకు సంబంధించిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు చెప్పలేకపోయిన ఎంఈఓ హనుమంతుకు మెమో జారీ చేయాలన్నారు. సమావేశానికి ఇరిగేషన్శాఖ అధికారులు గైర్హాజరు కావడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ.. వారికి వెంటనే నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం శ్రీరంగాపురంలో రూ. 10లక్షలతో నిర్మించనున్న గ్రామ మహిళా సమాఖ్య భవనం, రూ.10 లక్షలతో మండల మహిళా సమాఖ్య భవనం, రూ.30 లక్షలతో గోదాం నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. పీఎంశ్రీ పాఠశాలలో రూ. 14.50 లక్షలతో ఏర్పాటుచేసిన కంపూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధి కారులు సుధారాణి, యాదయ్య, సింగిల్విండో చైర్మన్ గౌని కోదండరామిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదిని, మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్గౌడ్, వైస్చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్రెడ్డి, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు సత్యనారాయణరెడ్డి, వరలక్ష్మి ఉన్నారు. -
టెక్నికల్గా తగ్గించారా..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కస్టం మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) పెట్టని, బకాయిలు చెల్లించని మిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అస్త్రం ప్రయోగించగా.. జిల్లాస్థాయిలో కొందరు అధికారులు, సిబ్బంది దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ సమీపంలోని శ్రీ లక్ష్మీ బాలాజీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలకు సంబంధించి వెలుగులోకి వచ్చిన కొత్తకోణం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. పలువురు జిల్లా స్థాయి సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి.. వడ్ల బస్తాల లెక్కింపులో మాయాజాలం ప్రదర్శించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సివిల్ సప్లయ్ శాఖ వర్గాలతో పాటు రైస్ మిల్లర్లలో ఈ చర్చ జోరుగా సాగుతుండగా.. కలకలం సృష్టిస్తోంది. అసలేం జరిగింది.. రాష్ట్రవ్యాప్తంగా 2022–23 రబీ ధాన్యం పంచాయితీ మూడేళ్లుగా కొనసాగుతుండగా.. మిల్లర్లు బకాయి పడిన మొత్తం చెల్లించాలని ప్రభుత్వ ఇటీవల అల్టిమేటం జారీ చేసింది. నిర్దేశిత గడువు సమీపిస్తున్నప్పటికీ.. స్పందన లేకపోవడంతో విజిలెన్స్ తనిఖీలకు ఆదేశించింది. ఇందులో భాగంగా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ సిటీ యూనిట్–2, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా గత నెల 29న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గుబ్బా అశోక్కు చెందిన ఇబ్రహీంబాద్లోని రైస్ మిల్లులో సోదాలు నిర్వహించారు. 2022–23 రబీకి సంబంధించి రూ.11.34 కోట్ల విలువైన 5,070 మెట్రిక్ టన్నుల (1,26,772 బస్తాలు) ధాన్యం బస్తాలు పక్కదారి పట్టినట్లు గుర్తించారు. రూ.14.84 లక్షల విలువైన సీఎమ్మార్ ధాన్యాన్ని అనుమతులు లేకుండా ఏపీకి తరలిస్తున్న రెండు లారీలను సైతం సీజ్ చేశారు. లోపాయికారిగా సర్దుబాటు? మిల్లుల్లో భారీగా ఉండాల్సిన ధాన్యం కొరతను సిబ్బంది నామమాత్రంగా తక్కువ చేసి చూపే ప్రయత్నం జరిగినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ వర్గాల్లోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 3 లక్షల బస్తాలు లేకున్నా.. కేవలం 1,26,772 బస్తాలు మాయమైనట్లు తేల్చడం వెనుక ఏదో మతలబు ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లెక్కించిన సిబ్బందికి ఆ మిల్లర్తో గత పరిచయాలు ఉన్నాయని.. ఈ మేరకు సహకరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. లోపాయికారి ఒప్పందంలో భాగంగా ఓ అధికారి చక్రం తిప్పి తక్కువ బస్తాలు చూపించేలా సర్దుబాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. విచారణ జరిపిస్తేనే వెలుగులోకి.. శ్రీబాలాజీ మిల్లుకు సంబంధించి 2022–23 రబీ సీజన్ బకాయిలు సుమారు రూ.19.50 కోట్లు ఉండగా.. ఇప్పటివరకు మూడు దఫాలుగా రూ.2.60 కోట్లు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. అయితే విజిలెన్స్ అధికారులు మా సమ్మతి లేకుండానే సుమారు లక్ష ఇరవై వేల బస్తాలు లేవని ప్రెస్కు రిలీజ్ చేశారని సదరు మిల్లు నిర్వాహకుడు మీడియాతో మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం స్పందించి ఉన్నతస్థాయి విచారణ జరిపిస్తే.. ఈ మాయాజాలం వెనుక ఉన్న అసలు సూత్రధారులు, పలువురు అధికారుల అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా.. విచారణ జరిపినా ఇంకా కేసు నమోదు చేయకపోవడంపై ఉన్నతాధికారులు జిల్లా సివిల్ సప్లయ్ శాఖ సిబ్బందికి చీవాట్లు పెట్టినట్లు సమాచారం. రైస్ మిల్లర్లలో ముదిరిన పోరు.. తనిఖీలు నిర్వహించిన మిల్లుకు సంబంధించిన నిర్వాహకుడు ప్రస్తుతం మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2022–23 రబీకి సంబంధించిన సీఎమ్మార్ ధాన్యం అంశంపై ఆయన కొంత మంది మిల్లర్లతో కోర్టులో పిటీషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని.. విజిలెన్స్ తనిఖీలు చేపట్టిందని.. సయోధ్యతో పోతే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేవని జిల్లాలోని పలువురు మిల్లర్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా ఆయన నోటి దురుసుతో మాట్లాడడమే చేటు తెచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో రైస్ మిల్లర్లలో పోరు ముదురుతున్నట్లు తెలుస్తోంది. లెక్కింపు సమయంలోనే..రైస్ మిల్లుల్లో విజిలెన్స్ బృందం తనిఖీల సందర్భంగా జిల్లాస్థాయి సిబ్బంది సహకారం తీసుకోవడం సహజం. ఈ మేరకు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ గణేష్ తదితర అధికారులు చేరుకుని ఇబ్రహీంబాద్లోని శ్రీ బాలాజీ మిల్లులో ఉన్న వడ్ల బస్తాల లెక్కింపు కోసం ఇద్దరు జిల్లాస్థాయి సిబ్బంది సహకారం తీసుకున్నారు. ఈ మేరకు సదరు సిబ్బంది వడ్ల బస్తాల నిల్వలను గడ (స్టాక్) ఆధారిత భౌతిక లెక్కింపు (ఫిజికల్ వెరిఫికేషన్) విధానంలో లెక్కగట్టారు. గోదాంలో వడ్ల బస్తాలను చట్రంలా ఒక పద్ధతి ప్రకారం అమర్చిన మేర పొడవు, వెడల్పు, ఎత్తులను కొలిచి మిల్లులో ఉన్న బస్తాల సంఖ్యను తేల్చారు. గోనె సంచుల్లో బరువు ఆధారంగా ఎన్ని మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందనేది నిర్ధారించారు. అయితే ఇక్కడే మాయాజాలం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘శ్రీ లక్ష్మీ బాలాజీ’లో విజిలెన్స్ తనిఖీల్లో కొత్తకోణం వడ్ల బస్తాల లెక్కింపులో మాయాజాలం పౌరసరఫరాల శాఖ సిబ్బందిపై అనుమానాలు లోపాయికారి ఒప్పందంలో ఓ అధికారి హస్తం? సివిల్ సప్లయ్ డీఎస్ఓ, డీఎం మధ్య పంచనామా లొల్లి రైస్మిల్లర్స్ అసోసియేషన్లో ముదురుతున్న పోరు ఇరువురి మధ్య ‘పంచనామా’ లొల్లి.. నిబంధనల ప్రకారం వడ్ల బస్తాల లెక్కింపు పూర్తయిన వెంటనే అక్కడికక్కడే స్థల పంచనామా రికార్డులు రాస్తారు. బస్తాలు లెక్కించిన వివరాలు, కేటాయింపులతో పోలుస్తూ వ్యత్యాసాలు స్పష్టంగా నమోదు చేస్తారు. ఆ తర్వాత తనిఖీ చేసిన అధికారులు, మిల్లు యజమాని లేదంటే సదరు మిల్లు ప్రతినిధి, సాక్షులు (రెవెన్యూ, సివిల్ సప్లయ్ సిబ్బంది) సంతకాలు తీసుకుంటారు. ఇక్కడ సివిల్ సప్లయి డీఎస్ఓ గంప శ్రీనివాస్ మిల్లు యజమాని లేదా సదరు మిల్లు ప్రతినిధి సంతకం లేకుండానే రిపోర్ట్ను జిల్లా మేనేజర్ రవినాయక్కు పంపించినట్లు సమాచారం. దీన్ని డీఎం ధ్రువీకరించారు. దీనిపై వివరణ కోసం డీఎస్ఓతో ఫోన్లో మాట్లాడేందుకు ‘సాక్షి’ సంప్రదించగా.. అందుబాటులోకి రాలేదు. ఆ శాఖలోని మరో అధికారిని సంప్రదిస్తే.. మిల్లు యజమాని లేదా ప్రతినిధి సంతకాలు అవసరం లేదని, విజిలెన్స్ అధికారులకు ఒక కాపీ ముందుగానే అందజేస్తారని తెలిపారు. -
రైతులకు కుచ్చుటోపీ..!
పెబ్బేరు కేంద్రంగా ఓ వ్యాపారి మామిడి కొనుగోలు ● నెలల తరబడి డబ్బులు చెల్లించకుండా కాలయాపన ● మోసపోయామని గుర్తించి ఎస్పీని ఆశ్రయించిన బాధిత రైతులు ● తమ డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని వేడుకోలు ●బుక్కచిట్టీ రాసిచ్చాడు.. రూ. 55వేల విలువైన మామిడి కాయలు విక్రయించగా.. బుక్క చిట్టీపై రాసిచ్చాడు. ఆ తర్వాత డబ్బుల కోసం మూడు నెలలుగా తిప్పించుకుంటున్నాడు. వీపనగండ్ల మండలంతో పాటు పాన్గల్, పెబ్బేరు మండల్లాలోని రైతులకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది. రోజుకో తేదీ చెబుతూ.. ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. రైతులకు రూ.కోటికి పైగా చెల్లించాల్సి ఉంది. – వెంకట్రెడ్డి, మామిడి రైతు, వీపనగండ్ల నిర్లక్ష్యంగా సమాధానం.. మూడు నెలల క్రితం మామిడి కాయలు విక్రయించాను. నాకు రూ. 66వేలు రావాలి. హైదరాబాద్లోని మార్కెట్కు వెళ్లి విక్రయించేందుకు ఖర్చు, శ్రమ పడాల్సి వస్తుందని పెబ్బేరులోనే విక్రయించాను. సదరు వ్యాపారి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. డబ్బుల కోసం గట్టిగా ప్రశ్నిస్తే.. నేను నష్టపోయా.. ఇవ్వలేను.. ఏం చేసుకుంటావో చేసుకో అని బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నాడు. – నారాయణ, మామిడి రైతు, వీపనగండ్ల త్వరలోనే చెల్లిస్తా.. రైతుల నుంచి మామిడి కాయలు కొనుగోలు చేసి ఢిల్లీ, పంజాబ్ ప్రాంతాలకు ఎగుమతి చేశా. అక్కడి వ్యాపారులు మోసం చేశారు. చివరగా తీసుకెళ్లిన లోడ్లకు సంబంధించిన డబ్బులు ఇవ్వలేదు. వచ్చే రెండు నెలల్లో హైదరాబాద్లో యాపిల్స్ సీజన్ ప్రారంభమవుతుంది. అందులో నుంచి రైతులకు డబ్బులు చెల్లిస్తాను. అందరు వ్యాపారుల మాదిరిగానే బుక్క చిట్టీలపై లావాదేవీలు చేశాను. కొందరు రైతులు ఒత్తిడి తీసుకొస్తే.. చెక్కులు ఇచ్చాను. – సోమశేఖర్, వ్యాపారి వనపర్తి: మూడు నెలల క్రితం రైతుల నుంచి మామిడిని కొనుగోలు చేసిన ఓ వ్యాపారి.. చెల్లింపుల సమయం వచ్చేసరికి మొఖం చాటేశాడు. చివరకు తాము మోసపోయిన గుర్తించిన బాధిత రైతులు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ సునీతారెడ్డిని ఆశ్రయించి.. తమకు న్యాయం చేయాలని కోరారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారి పెబ్బేరు కేంద్రంగా ఓ రైస్మిల్లు గోదాంలో పండ్లు నిల్వచేస్తున్నాడు. అయితే ఈ ప్రాంతంలో పండిన మామిడి కాయలను సరైన ధరకు కొనుగోలు చేస్తానంటూ.. రైతులను నమ్మబలికాడు. ఒకటి, రెండుసార్లు కాపు వచ్చిన తొలినాళ్లలో కొంత మొత్తంలో కొని చెప్పినట్టుగానే సకాలంలో డబ్బులు చెల్లించాడు. దీంతో వీపనగండ్ల, పెబ్బేరు, పాన్గల్ మండలాలకు చెందిన సుమారు 150 మంది రైతులు మామిడి ఉత్పత్తులను సదరు వ్యాపారికి విక్రయించారు. అయితే మామిడి కొనుగోలుకు సంబంధించి డబ్బుల లెక్కను బుక్కచిట్టీలపై రాసిచ్చిన సదరు వ్యాపారి.. నెలలు గడుస్తున్నా డబ్బులు మాత్రం చెల్లించడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే అప్పుడూ.. ఇప్పుడూ అంటూ కాలయాపన చేస్తున్నాడంటూ సోమవారం పోలీసు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తమకు రావాల్సిన డబ్బులను ఇప్పించి న్యాయం చేయాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు. 45రోజుల పాటు కొనుగోలు.. పెబ్బేరు శివారు ప్రాంతంలోని పాడుపడిన రైస్మిల్లులో రైతుల నుంచి మామిడి కాయల కొనుగోలు ప్రక్రియ నిర్వహించారు. 45రోజుల పాటు మామిడి కొనుగోళ్లు సాగినప్పటికీ స్థానిక అధికారులకు ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. కనీసం అనుమతులు తీసుకోవడం.. మార్కెట్ ఫీజు ఊసెత్తిన దాఖలాలు లేవు. -
సమస్యలు ఆలకించి.. వినతులు స్వీకరించి
● ప్రజావాణికి 50 ఫిర్యాదులు ● త్వరగా పరిష్కరించాలనిఅదనపు కలెక్టర్ల ఆదేశం వనపర్తి/వనపర్తి రూరల్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదులు పోటెత్తాయి. ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో కలిసి అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, వినోద్కుమార్ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకొని వినతులు స్వీకరించారు. మొత్తం 50 ఫిర్యాదులు అందగా.. పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చిన వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించి.. ఆ సమాచారాన్ని సంబంధిత ఫిర్యాదుదారుడికి తెలియజేయడంతో పాటు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిర్యాదులను పెండింగ్లో ఉంచొద్దన్నారు. సీఎం, జిల్లా మంత్రి నుంచి వచ్చిన దరఖాస్తులను సైతం సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో రెండు అర్జీలు అందినట్లు సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎన్.తిరుపతయ్య పాల్గొన్నారు. -
పోలీసుల పహారా అవసరం..
జూరాలకు వరద వస్తుండటంతో క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదలుతున్నారు. ఈ సమయంలో పోలీసుల పహార లేక పర్యాటకులు దిగువ నది వద్ద పరవళ్లను చూసేందుకు దిగువ నదిలోకి వెళ్తున్నారు. ఉధృతంగా పారుతున్న నీటితో ఆడుకుంటున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున పోలీసులు రక్షణ చర్యలు చేపట్టాలి. – వెంకటేష్, నందిమళ్ల జూరాల ప్రాజెక్టు వద్ద వరద ఎక్కువగా ఉండటంతో భద్రత చర్యలు తీసుకుంటున్నాం. ఆదివారం అధికసంఖ్యలో పర్యాటకులు రావడంతో దిగువ పుష్కరఘాట్ రోడ్ను మూసివేసి నదిలోకి వెళ్లకుండా పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేశాం. సూచిక బోర్డుల ఏ ర్పాటుతో పాటు ప్రాజెక్టుపై వాహనాలు ని లుపకుండా తగిన చర్యలు చేపడుతున్నాం. – శివకుమార్, సీఐ, ఆత్మకూర్ ● -
ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
వనపర్తిటౌన్: తమ సమస్యలు పరిష్కరించాలని టీఎస్ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి సత్యన్న ఆధ్వర్యంలో జిల్లా నాయకులు ఆదివారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వనపర్తి బస్టాండ్ ఆవరణలో తొలగించిన కుర్చీలను తిరిగి ఏర్పాటు చేయించాలన్నారు. సంబంధిత అధికారులు, ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని.. బస్టాండ్ ఆవరణలో సిమెంట్ కుర్చీలను తిరిగి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మచ్చ శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి కె.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా స్నేహితుల దినోత్సవం వనపర్తిటౌన్: కుల, మత, ప్రాంతాల సరిహద్దులు లేని ఏకై క పవిత్ర బంధం స్నేహమని వాసవి వనితక్లబ్ అధ్యక్షురాలు కొంపల రజిత అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో వాసవి వనిత క్లబ్ గోల్డ్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్చేసి ఒకరికొకరు పంచుకొని శుభాకాంక్షలు చెప్పారు. వివిధ క్రీడాపోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్నేహబంధం జీవితంలో అత్యంత విలువైందని.. కష్టసుఖాల్లో తోడుగా ఉండేవారే నిజమైన స్నేహితులని చెప్పారు. కార్యక్రమంలో సంఘం ప్రధానకార్యదర్శి పాపిశెట్టి రాధిక, కోశాధికారి కటకం ప్రశాంతి, వనితక్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య మహిళలు తదితరులు పాల్గొన్నారు. -
తల్లిపాలే అమృతం
జిల్లా పరిధిలో ఇలా.. వనపర్తి: తల్లీబిడ్డల మధ్య ఆత్మీయతను పెంచేవి తల్లిపాలు. బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని.. పోషక పదార్థాలను అందిస్తాయి. బిడ్డ పుట్టిన తల్లి ప్రతిరోజు లీటరు పాలు అదనంగా తాగితే నవజాత శిశువుకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించవచ్చు. కానీ, ఇటీవల పాల డబ్బాలు పిల్లల ఆరోగ్యాన్ని, తల్లి ఆప్యాయతను దూరం చేస్తున్నాయి. బిడ్డకు సుమారు రెండేళ్లపాటు పాలు ఇవ్వాల్సి ఉండగా.. ఎక్కువ మంది తల్లులు కేవలం ఏడాది మాత్రమే ఇస్తున్నారని వైద్య, ఆరోగ్యశాఖ అధ్యయనంలోనూ తేలింది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు నెల మొదటి వారంలో తల్లిపాల విశిష్టతను తెలియజేసేలా.. 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. తల్లిపాల సంస్కృతిని రక్షించడానికి తగిన ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఏటా వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అందు లో భాగంగా తల్లిపాల విశిష్టతను గర్భిణులు, బా లింతలకు వివరించేందుకు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారులు శనివారం నుంచి వారం రోజులపాటు తల్లిపాల వారోత్సవాలకు శ్రీకారం చుట్టింది. పోతపాలు, పాల పౌడర్ కల్తీ అయ్యే అవకాశం ఉన్నందున పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కొందరు మహిళలు అందం, శరీర ఆకృతి చెదిరిపోతుందనే ఉద్దేశంతో బిడ్డకు పాలివ్వడం లేదు. వీరిలో ప్రధానంగా సంపన్న వర్గానికి చెందినవారే ఎక్కువ ఉన్న ట్లు అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మరికొందరు ఒక్కసారి బిడ్డకు ఇవ్వడానికి ప్రయత్నించి తర్వాత పాలు రావడం లేదని వదిలేస్తారు. వైద్యుల సలహా తీసుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మెడిసిన్ ద్వారా 30 శాతం మాత్రమే ఫలితం వచ్చే అవకాశం ఉంది. డబ్బాపాలు తాగిస్తే బిడ్డ కడుపు నిండుతుందే కానీ పోషకాలు అందవు. ముర్రుపాలు ఎంతో శ్రేష్టం.. ప్రసవించిన తర్వాత తల్లి బిడ్డకు ఇచ్చే ముర్రుపాలు అమృతం లాంటివి. బిడ్డకు ఆ పాలు యాంటీ బయోటిక్స్లా ఉపయోగపడతాయి. మూడు రోజులపాటు పసుపురంగులో వచ్చే ఈ పాలలో బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు ఉంటాయి. పుట్టిన ప్రతి బిడ్డకు వచ్చే కామెర్లు.. ఈ పాలు తాగిస్తే 90 శాతం తగ్గుతాయి. తల్లిపాలతో పిల్లల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో మేధోసంపత్తి పెరిగే అవకాశం ఉంది. రెండేళ్ల వరకు అదనపు ఆహారంతోపాటు తల్లిపాలు పట్టాలి. తల్లిపాలతో బిడ్డ పేగులో నుంచి విసర్జకాలు తొలగిపోతాయి. ఎలర్జీలు రావు. దీర్ఘకాల వ్యాధులు ఉన్న తల్లులు వైద్యుల సలహా మేరకు శిశువులకు పాలివ్వాలి. ఐసీడీఎస్ ప్రాజెక్టులు 3 అంగన్వాడీ కేంద్రాలు 589 గర్భిణులు, బాలింతలు సుమారు 14,800 డబ్బా పాలతో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం జిల్లాలో తల్లిపాల వారోత్సవాలకు శ్రీకారం గర్భిణులు, బాలింతలకు అవగాహన కార్యక్రమాలు -
జిల్లాస్థాయి అథ్లెటిక్స్లో కొత్తకోట క్రీడాకారుల ప్రతిభ
కొత్తకోట రూరల్: హన్మకొండ జేఎన్ స్టేడియంలో ఆగస్టు 7, 8 తేదీల్లో జరిగే 5వ తెలంగాణ రాష్ట్రస్థాయి జావెలిన్ డే అథ్లెటిక్స్ మీట్–2026కు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు శనివారం జిల్లాకేంద్రంలోని డా. బాలకిష్ణయ్య క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు. ఈ పోటీల్లో అండర్–6 విభాగంలో కొత్తకోటకు చెందిన టి.యశ్విక 60 మీటర్లు, 150 మీటర్ల పరుగుపందెంలో ప్రథమ స్థానం సాధించింది. అదే విభాగంలో అప్పరాలకు చెందిన యు.కారుణ్య 60 మీటర్లు, 150 మీటర్ల పరుగుపందెంలో ద్వితీయ స్థానం దక్కించుకుంది. అండర్–8 విభాగంలో కొత్తకోటకు చెందిన టి.గగన్కుమార్రెడ్డి 200 మీటర్ల పరుగుపందెంలో తృతీయ స్థానంలో నిలిచాడు. అండర్–10 విభాగంలో అప్పరాలకు చెందిన వి.జోష్నవి 300 మీటర్ల పరుగుపందెంలో ప్రథమ స్థానం, యు.భావన బ్రాడ్ జంప్లో ద్వితీయ స్థానం పొందారు. అండర్–12 విభాగంలో అప్పరాలకు చెందిన వి.లేఖన 400 మీటర్ల పరుగుపందెంలో, జి.నందిని షాట్పుట్ పోటీలో తృతీయ స్థానాలు సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత పొందారని వ్యాయామ విద్యా శిక్షకుడు ఎం.అజయ్కుమార్ తెలిపారు. విజేతలను స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు అభినందిస్తూ రాష్ట్రస్థాయి పోటీల్లోనూ రాణించి జిల్లా, మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. -
కమిటీ సభ్యులు పరిశీలించాల్సిన అంశాలు..
● సమస్యల వలయంలో జీజీహెచ్ ● 205కుపైగా వైద్యులు, సిబ్బంది ఖాళీలు ● కదలిక లేని ఆర్కేఎస్, హెచ్ఎంసీ కమిటీలు ● రోజురోజుకు పెరుగుతున్న రోగుల సంఖ్య వనపర్తి: ఆస్పత్రి నిర్వహణ, రోగుల సంక్షేమం, నిధుల వినియోగం, సమస్యల పరిష్కారం, వైద్యసేవలను పర్యవేక్షించాల్సిన ఆర్కేఎస్ (రోగి సంక్షేమ సమితి), హెచ్ఎంసీ (హాస్పిటల్ మేనేజ్మెట్ కమిటీ)లు మొక్కుబడిగా సమావేశాలు నిర్వహిస్తూ.. మమా అనిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం సుమారు వెయ్యి నుంచి పదకొండు వందల మంది రోగులు వైద్యం కోసం వచ్చే జిల్లా జనరల్ ఆస్పత్రిపై అధికార, పాలకవర్గం సరైన దృష్టి సారించడం లేదన్న వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కొన్ని వార్డుల్లో ఇనుప మంచాలు తుప్పుపట్టగా, కిటికీలు పగిలిన అద్దాలతో దర్శనమిస్తున్నాయి. ఇక శుద్ధజల కేంద్రం వద్ద నిత్యం చిత్తడే. రక్త పరీక్షల విభాగంలో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేసే విద్యార్థులతో రక్త సేకరణ చేయడం, కొన్ని సందర్భాల్లో వైద్య పరీక్షల కోసం బయటకు సిఫారస్ చేస్తుండటం లాంటివి వెలుగు చూస్తున్నాయి. రోగాల సీజన్ వచ్చినట్లే.. వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. ఈ సమయంలో ఆస్పత్రిలో వైద్యసేవలు, వైద్యుల కొరత లేకుండా చూడటంతో పాటు కావాల్సిన అన్ని సౌకర్యాలను సమకూర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వేర్వేరు కమిటీలు ముందస్తుగా సమావేశమై.. కీలక అంశాలపై చర్చించి ముఖ్యమైన సమస్యల పరిష్కారం కోసం తీర్మానాలు చేయాల్సి ఉంది. కానీ వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి ఆయా కమిటీలు ఆస్పత్రిని సందర్శించిన దాఖలాలు ఒకటి రెండు కంటే ఎక్కువగా లేవు. అందులోనూ.. ఒక్కరిద్దరు సభ్యులే వచ్చినట్లుగా తెలుస్తోంది. నిత్యం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం భోజన విరామం వరకు వెయ్యి నుంచి 1,100 మందికిపైగా ఓపీ వస్తుండటంతో జిల్లా జనరల్ ఆస్పత్రి కిక్కిరిసిపోతోంది. సేవల మెరుగే ప్రధాన లక్ష్యం.. ఆర్కేఎస్, హెచ్ఎంసీ సభ్యులు జీజీహెచ్లో వైద్య, ఇతర సేవలను మెరుగుపర్చాలి. కానీ ఆ దిశగా కమిటీలు పని చేసింది తక్కువేనని చెప్పవచ్చు. మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సమావేశానికి సభ్యులు హాజరై ఉచిత సలహాలు ఇవ్వటమనే ధోరణి ఇప్పటి వరకు కొనసాగడం శోచనీయం. పర్యవేక్షణకు నోచుకోని అంశాలు.. రోగులకు స్వచ్ఛమైన తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య చర్యలు నిర్దేశించిన సమయానికి చేపట్టడం, టోకెన్ల జారీ ప్రదేశాల్లో వసతులు, బెడ్లు, ఫర్నీచర్, విద్యుత్, జనరేటర్, పవర్ బ్యాకప్ అంశాలను పరిశశీలించాలి. విద్యుద్ధీపాలు, ఫ్యాన్లు, ఆస్పత్రి పైకప్పు నుంచి వర్షపునీరు లోనికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ వనపర్తి జీజీహెచ్లో అత్యవసర విభాగం ముఖద్వారం వద్ద వర్షపు నీరు లోనికి వస్తోంది. జిల్లా ఆస్పత్రిలో ఖాళీలు.. విభాగం మంజూరైన పనిచేస్తున్న ఖాళీలు పోస్టులు వారు ప్రొఫెసర్లు 22 13 9 అసోసియేట్ ప్రొఫెసర్లు 24 6 18 అసిస్టెంట్ 90 24(రెగ్యులర్) 53 13 (కాంట్రాక్ట్) సిబ్బంది (అన్ని విభాగాలు) 489 361 128 ● వైద్యులు సకాలంలో విధులకు హాజరవుతున్నారా? సిబ్భంది అందుబాటులో ఉన్నారా..? ● మందుల కొరత, ఎక్స్రే, స్కానింగ్ యంత్రాల నిర్వహణ, శస్త్రచికిత్సలు, ఇతర వైద్యసేవలు నిర్వహణ, బ్లడ్ బ్యాంక్ నిర్వహణ, అంబులెన్స్ సేవలు, ఆస్పత్రిలో స్వచ్ఛత, రోగులకు అందిస్తున్న భోజనం నాణ్యత, బయో వేస్టేజ్ నిర్వహణ, రోగుల ఫిర్యాదులు, మరణాలు, ముఖ్యంగా శిశు మరణా లపై సమీక్షలు, ఆస్పత్రి భద్రత, ప్రభుత్వ ఆరోగ్య పథకాలను నిత్యం పరిశీలించాల్సి ఉంటుంది. -
11 యూనిట్లలో విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ కర్ణాటక నుంచి వరదనీరు భారీగా చేరుతుండడంతో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. ఈ మేరకు ఆదివారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, దిగువలో 5 యూనిట్ల ద్వారా 200 మెగావాట్లు చేపట్టారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 37.781 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి విజయవంతంగా చేపట్టామన్నారు. ప్రస్తుతం 33 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువ శ్రీశైలానికి వదులుతున్నామని చెప్పారు. ప్రాణాలను పణంగా పెట్టొదు అమరచింత: ఉధృతంగా ప్రవహించే నీటితో ఆటలొద్దని.. సెల్ఫీల కోసం పోటీపడి ప్రాణాలను పణంగా పెట్టొదని అమరచింత ఎస్ఐ స్వాతి సూచించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం జూరాల ప్రాజెక్టును సందర్శించి మాట్లాడారు. ప్రాజెక్టు వద్ద బందోబస్తు చర్యలు చేపట్టామని.. దిగువ పుష్కరఘాట్ వద్దకు వెళ్లే రహదారిని మూసి వేయించినట్లు చెప్పారు. ప్రాజెక్టు రహదారిపై వాహనాలు నిలువకుండా పార్కింగ్కు స్థలం కేటాయించామని తెలిపారు. వరదను చూడాలనే ఉద్దేశంతో ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లవద్దని.. పోలీసుల సూచనలు పాటించాలని పర్యాటకులకు సూచించారు. సందర్శకులు సురక్షిత ప్రదేశాల నుంచే కృష్ణమ్మ అందాలను తిలకించాలని.. అ త్యవసర పరిస్థితుల్లో వెంటనే సమీప పోలీసు సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు. అన్నవరం క్షేత్రానికిప్రత్యేక బస్సు కొల్లాపూర్: స్థానిక ఆర్టీసీ డిపో నుంచి అన్నవరం క్షేత్రానికి ఈ నెల 8న ప్రత్యేక బస్సు ఏర్పాటుచేసినట్లు డిపో మేనేజర్ మల్లేశయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొల్లాపూర్ నుంచి సాయంత్రం 6 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరి.. భద్రాచలం, విజయవాడ, అన్నవరం, వైజాగ్, సింహాచలం చేరుకుంటుందని పేర్కొన్నారు. 11న సాయంత్రం తిరిగి కొల్లాపూర్ చేరుకుంటుందని ఆయన వివరించారు. బస్సులో రానుపోను ప్రయాణ చార్జీలు నాలుగు రోజులకు పెద్దలకు రూ. 3వేలు, పిల్లలకు రూ. 2వేలుగా నిర్ణయించడం జరిగిందన్నారు. భక్తులు టికెట్ల బుకింగ్ కోసం స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో సంప్రదించాలని సూచించారు. -
‘జైల్భరోను విజయవంతం చేయాలి’
ఖిల్లాఘనపురం: కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 10న జైల్భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేరుతో కార్మిక చట్టాలను నీరుగారుస్తోందని.. కార్పొరేట్లకు అనుకూలంగా మారుస్తూ కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తోందని ఆరోపించారు. 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్కోడ్లు అమలు చేయడంతో కార్మికులు చట్టబద్దమైన హక్కులు కోల్పోతున్నారని, యాజమాన్యాలకు బానిసలుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా, కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తున్నట్లు ప్రగల్భాలు పలుకుతున్నా.. పరోక్షంగా సమర్థిస్తున్నారని తెలిపారు. కార్మికులకు ఒకటో తేదీన వేతనాలు ఇస్తామని చెబుతున్నా.. అమలుకు నోచుకోవడం లేదన్నారు. మూడు నెలల జీతాలు పెండింగ్లో ఉన్నా పట్టించుకునేవారు కరువయ్యారని.. కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని నిరసనలు చేపడుతున్నా ప్రభుత్వాలు స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆస్పత్రి బ్రాంచ్ యూనియన్ నాయకులు, కార్మికులు సాయికృష్ణ, భీమయ్య, వెంకటేష్, నాగయ్య, మునేందర్, శివ, నజ్మ, పద్మ, సంగీత, ప్రియాంక, స్వాతి తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం..
జిల్లా ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను కలెక్టర్ దృష్టి తీసుకెళ్లాం. ఆయన తన నిధులిచ్చి పరిష్కరించేందుకు ఆదేశించారు. ఖాళీలున్నా.. నిత్యం వచ్చే ఓపీ సేవలు, ఇన్పేషంట్ల సేవల విషయంలో ఎక్కడా రాజీపడకుండా సేవలందిస్తున్నాం. కమిటీ సమావేశం చివరగా ఏప్రిల్ 6న నిర్వహించాం. మళ్లీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వైద్య పరీక్షలు పూర్తిగా ఆస్పత్రిలోనే చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకున్నాం. – డా. చంద్రమోహన్, సూపరింటెండెంట్, జీజీహెచ్ -
విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి : ఎమ్మెల్యే
గోపాల్పేట: రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించినందని.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, ప్రజా ఆరోగ్యం, రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తోందని, అందరూ సహకరించాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. శనివారం రేవల్లి, ఏదుల మండలాల్లో జరిగిన మండల సర్వసభ్య సమావేశాలకు ఆయన హాజరయ్యారు. మూడు నెలల పురోగతిని శాఖల వారీగా అధికారులు వివరించగా.. సర్పంచుల ద్వారా సరైన సమాచారమా లేదా అని ఆరా తీశారు. రేవల్లిలో యూరియా బస్తాపై రూ.30 అదనంగా ఎందుకు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేవల్లి, నాగపూర్లో రెండు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మించనున్నామని తెలిపారు. సభకు హాజరుకాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని.. మరోసారి రాకుంటే సస్పెండ్ చేయిస్తామన్నారు. ఏదులలో మిషన్ భగీరథ ట్యాంకులు మూడు మ్యాప్లో ఉన్నాయని.. ఊర్లో చూస్తే కేవలం రెండే ఉన్నాయని సర్పంచ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. మిషన్ భగీరథ మంచినీరు గ్రామాల్లో సరఫరా కాకుంటే సర్పంచులు సంతకాలు చేయొద్దని సూచించారు. ఎస్ఐఆర్, ఈ–కేవైసీపై దృష్టి సారించి త్వరగా పూర్తి చేయాలని ఆర్డీఓ సుబ్రమణ్యం కోరారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కె వెంకటేష్, ఉపాధ్యక్షుడు సత్యశిలారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ లోడె రఘు, ప్రత్యేక అధికారి జ్యోతి పాల్గొన్నారు. 30 పోలీస్ యాక్ట్ అమలు వనపర్తి: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ఆగస్టు 31 వరకు 30 పోలీస్ యాక్ట్–1861 అమలులో ఉంటుందని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆమె మాట్లాడారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, నిరసన కార్యక్రమాలు, భారీ సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించడం పూర్తిగా నిషేధమన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఏ మాత్రం ఉపేక్షించబోమని.. 30 పోలీస్ యాక్ట్ ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏ సంస్థ, సంఘం, వ్యక్తి బహిరంగ కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే సంబంధిత పోలీసు అధికారులను ముందుగానే సంప్రదించి అను మతి పొందాలన్నారు. చట్టాలను గౌరవించడ ం ప్రతి పౌరుడి బాధ్యతని.. ప్రజలందరూ పో లీసుశాఖకు సహకరించి శాంతిభద్రతల పరిరక్ష ణలో భాగస్వాములు కావాలని సూచించారు. ‘కార్మికులపై తప్పుడు ఆరోపణలు సరికాదు’ వనపర్తి రూరల్: ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య, సెక్యూరిటి, పేషెంట్కేర్ కా ర్మికులపై తప్పుడు ఆరోపణలు, నిందలు వేసి వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ హెచ్చరించారు. వనపర్తి మాత, శిశు సంరక్షణ కేంద్రంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలిని దొంగతనం నెపంతో తొలగించగా ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. శనివారం ఆయన జిల్లా ఆస్పత్రిలో బాధితురాలిని పరామర్శించిన అనంతరం కార్మికలు, ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశమై చర్చలు జరిపారు. తిరిగి ఆమెను విధుల్లోకి తీసుకోవడానికి ఏజేన్సీ నిర్వాహకులు అంగీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కనీస వేతనాలకు నోచుకోక ఏళ్ల తరబడి ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తూ రోగులకు సేవలు చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను చిన్న చిన్న పొరపాట్లు బూచిగా చూపి తొలగించడం సరికాదన్నారు. 14న వేలం పాటలు చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 14న ఆలయం వద్ద బహిరంగవేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ మధనేశ్వరెడ్డి తెలిపారు. లడ్డూ, ప్రసాదం, కొబ్బరికాయలు, పూల దండలు, పూజ సామగ్రి, వాహన పూజ సామగ్రి, తలనీలాల సేకరణ, కొబ్బరి చిప్పల సేకరణ, దుకాణదారులకు విద్యుత్ లైటింగ్ వసతి కల్పించుట, రంగుల రాట్నం, ,ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకునేందుకు వేలం నిర్వహించేలా దేవాదాయశాఖ నిర్ణయించినట్లు చెప్పారు. వేలంలో పాల్గొన దలచినవారు కొబ్బరికాయలు, లడ్డు ప్రసాదం, తలనీలాలు, రంగు రాట్నం, ఎగ్జిబిషన్ ఏర్పాటు కోసం రూ.5లక్షల డీడీ, పూలు, పూలదండలు, టెంకాయల చిప్పల సేకరణ, విద్యుత్ లైటింగ్ వసతి కల్పించేందుకు రూ.2 లక్షల డీడీ తీసుకొని రావాలని ఈఓ తెలిపారు. -
సిబ్బందిని నియమించాలి..
పశు వైద్యశాలల్లో సిబ్బంది కొరత ఉండటంతో అత్యవసర సమయంలో వైద్య సేవలు అందడం లేదు. అనారోగ్యానికి గురైన గొర్రెలను కాపాడుకోలేకపోతున్నాం. దీంతో గొర్రెలు, మేకల పెంపకందారులు ఆర్థికంగా నష్టపోతున్నారు పాలకులు వెంటనే ఖాళీలను భర్తీచేసి జీవాల ఇబ్బందులు తొలగించాలి. – మల్లేష్, గొర్రెల పెంపకందారు, కొత్తకోట గ్రామంలో పశుసంపద అధికంగా ఉంది. పశువుల దవాఖాన ఉన్నప్పటికీ శాశ్వత వైద్యుడు లేకపోవడంతో ఇన్చార్జితోనే సేవలు అందిస్తున్నారు. ఆయన ఎప్పడు వస్తారో తెలియదు. కంపౌండర్ పశువులకు వైద్యం చేస్తారు. అధికారులు స్పందించి శాశ్వత వైద్యుడిని నియమించాలి. – ఎం.రాజు, సంకిరెడ్డిపల్లి, కొత్తకోట పశువులకు వైద్యం చేయడానికి సరిపడా సిబ్బంది లేరు. దీంతో తామే తోచిన విధంగా చికిత్సలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్కోసారి పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించాలి.– వెంకటయ్య, పాడి రైతు, సూగూరు, పెబ్బేరు● -
యూడీఐడీ కార్డుల జారీ వేగవంతం
వనపర్తి: దివ్యాంగులకు సంబంధించిన యూడీఐడీ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేసి దరఖాస్తులు పెండింగ్లో లేకుండా చూడాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అఽధికారులను ఆదేశించారు. శనివారం సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి అదనపు కలెక్టర్ పాల్గొని జిల్లా వివరాలు వెల్లడించారు. అనంతరం కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న యూడీఐడీ దరఖాస్తులను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి దరఖాస్తును సకాలంలో పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 2025, మార్చి 1 నుంచి ఇప్పటివరకు మొత్తం 2,647 యూడీఐడీ కార్డులు జారీ చేయగా, ప్రస్తుతం 782 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఆయా దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. -
ఉన్నతాధికారులకు విన్నవించాం..
పశుసంవర్ధకశాఖలో సిబ్బంది కొరత ఉంది. వివిధ స్థాయిల్లో 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పశువైద్య సేవలు, రైతులకు అందించే పలు సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలోని పశువైద్యశాలలు, పశు ఆరోగ్య ఉపకేంద్రాలు, ఇతర కార్యాలయాల్లో సరిపడా సిబ్బంది లేక ప్రస్తుతం ఉన్న వారిపైనే అదనపు భారం పడుతోంది. ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. – వెంకటయ్యగౌడ్, ఇన్చార్జి జిల్లా పశువైద్యాధికారి -
82 మంది బాల కార్మికులకు విముక్తి
వనపర్తి: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తోందని.. జిల్లాలో 12వ విడత ఆపరేషన్ ముస్కాన్ విజయవంతంగా పూర్తయిందని ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జూలై 1 నుంచి 31వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 82 మంది బాలకార్మికులను రక్షించామని, వీరిలో 78 మంది బాలురు, నలుగురు బాలికలు ఉన్నారని చెప్పారు. బాలలను చట్టవిరుద్ధంగా పనిలో పెట్టుకున్న 26 మంది యజమానులపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకున్నామని. రక్షించిన బాలలను సంబంధిత శాఖల సమన్వయంతో పునరావాసం కల్పించి, వారి తల్లిదండ్రులకు బాలల హక్కులు, నిర్బంధ విద్య, కలిగే నష్టాలపై అవగాహన కల్పించి తిరిగి పాఠశాలల్లో చేర్పించేలా కౌన్సిలింగ్ ఇచ్చినట్లు వివరించారు. బాలల హక్కులను పరిరక్షించడం, వారికి సురక్షితమైన బాల్యాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. 12వ విడత ఆపరేషన్ ముస్కాన్ను విజయవంతం చేయడంలో పోలీసుశాఖ, కార్మికశాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, విద్యా, వైద్యశాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేశారని వివరించారు. 18 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం, వెట్టిచాకిరి చేయించడం, బలవంతంగా భిక్షాటన చేయించడం, పశువుల కాపరులుగా, కిరాణా దుకాణాలు, మెకానిక్ షాపులు, హోటళ్లు, ఇటుక బట్టీలు, పౌల్ట్రీ ఫారాలు, పరిశ్రమలు లేదా ఇతర పనులు చేయించడం చట్టరీత్యా నేరమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు కనిపించినా లేదా బాలలపై వేధింపులు, దోపిడీ జరుగుతున్నట్లు తెలిసినా వెంటనే చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ 1098 లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. -
పశువుల ‘మూగ’ రోదన
జిల్లా పశుసంవర్ధకశాఖలో సిబ్బంది కొరత ● మొత్తం పోస్టులు 124.. ఖాళీలు 40 ● నియామకాలు చేపట్టని ప్రభుత్వం ● ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాడి రైతులు కొత్తకోట రూరల్: జిల్లా పశు సంవర్ధకశాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నా.. నియామకాలు చేపట్టడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో పశువైద్య సేవలు అందడంలో జాప్యం నెలకొంటోంది. జిల్లాలో 2 ప్రాంతీయ పశువైద్యశాలలు, 19 ప్రాథమిక పశువైద్యశాలలు, 29 పశు ఆరోగ్య ఉపకేంద్రాలు మొత్తం 50 ఉన్నాయి. ప్రతి ప్రాథమిక పశువైద్య కేంద్రంలో ఒక పశువైద్యుడు, సహాయకుడు, సబార్డినేట్.. అలాగే పశు ఆరోగ్య ఉప కేంద్రాల్లో లైవ్ స్టాక్ ఆఫీసర్, ఆఫీస్ సబార్డినేట్ ఉండాలి. జిల్లాలో మొత్తం 124 అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించాల్సి ఉండగా.. 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులు ఆర్థికంగా ఎదగడానికి పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ పశువులు, గొర్రెలు, మేకలు రోగాల బారిన పడినప్పుడు చికిత్స అందించేందుకు సిబ్బందిని మాత్రం నియమించడం లేదు. గొర్రెలకు నట్టల నివారణ, వ్యాధి నిరోధక, పారుడు రోగ నివారణ టీకాలు ఏటా రెండు నుంచి మూడుసార్లు వేస్తారు. అలాగే పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు, వర్షాకాలం ప్రారంభంలో వచ్చే గొంతువాపు, జబ్బవాపు టీకాలు వేస్తుంటారు. అలాగే పశువులు, గొర్రెలు, మేకలు రోగాల బారిన పడినప్పుడు సత్వర చికిత్సలు అందించడానికి సరిపడా సిబ్బంది లేకపోవడంతో పెంపకందారులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పశువులు అనారోగ్యానికి గురైతే ఎద్దులబండి కట్టుకొని పశు వైద్యశాలకు తీసుకొచ్చేవారు. ప్రస్తుతం అవి కనుమరుగుకావడంతో పశువులను వైద్యశాల వరకు తీసుకొచ్చే పరిస్థితి లేదు. దీంతో పశు వైద్యాధికారులే ఇళ్లు, పొలాలకు వెళ్లి చికిత్సలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించినప్పుడే సత్వర వైద్యసేవలు అందుతాయి. ఎనిమల్ మొబైల్ మెడికల్ అంబులెన్స్ సేవలు సాయంత్రం ఐదుగంటల వరకే అందుతుండటంతో ఎమర్జెన్సీ సేవలు కరువయ్యాయి. ప్రభుత్వం ఇప్పటికై నా పశుసంవర్ధకశాఖలో సిబ్బంది కొరత తీర్చాలని పాడి రైతులు, పెంపకందారులు కోరుతున్నారు. జిల్లా పశువైద్యాధికారి 1, సహాయ సంచాలకులు 2, పశువైద్య సహాయ శస్త్రచికిత్సకులు 8, వెటర్నరీ లైవ్ స్టాక్ అధికారి 4, జూనియర్ వెటర్నరీ అధికారి 2, లైవ్ స్టాక్ అసిస్టెంట్ 2, వెటర్నరీ అసిస్టెంట్ 12, ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) 9. -
గోల్మాల్..!
రూ.1,000 కోట్ల 2022–23 రబీ సీఎమ్మార్లో మాయాజాలం సీఎమ్మార్ చెల్లించని డీఫాల్టర్ల నుంచి క్రమక్రమంగా డబ్బుల వసూలుకు ఈ ఏడాది మే నెలలో శ్రీకారం చుట్టింది. నిర్దేశిత గడువు విధిస్తూ.. ఆ లోపు చెల్లించాలని సూచించింది. తొలి గడువు ఆగస్టు 5 సమీపిస్తున్నా.. మిల్లర్ల నుంచి స్పందన లేకపోవడంతో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జూలై చివరి వారంలో రాష్ట్రవ్యాప్తంగా మిల్లుల్లో సోదాలు నిర్వహించింది. ఒక్కో మిల్లులో కోట్లాది రూపాయల విలువైన ధాన్యం లేకపోవడంతో పాటు పలువురు మిల్లర్ల దందా వెలుగులోకి రాగా చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఒకటి కాదు.. రెండు కాదు.. సుమారు రూ.వెయ్యి కోట్లకు పైగా గోల్మాల్ చోటుచేసుకుంది. 2022–23 యాసంగికి సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కస్టం మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్)లో అక్రమాలకు అంతే లేకుండా పోయింది. మిల్లర్ల మాయాజాలం, పౌర సరఫరాల శాఖ ఉదాసీనత, పలువురు సిబ్బంది ధనదాహం వెరసి ప్రభుత్వానికి పెట్టిన పెట్టుబడి సైతం అందకుండాపోయింది. ఎట్టకేలకు దృష్టి సారించిన సర్కార్.. విజిలెన్స్ తనిఖీలకు శ్రీకారం చుట్టడంతో మిల్లర్లలో వణుకు మొదలైంది. సోదాల్లో ఒక్కో మిల్లు బాగోతం వెలుగులోకి వస్తుండగా.. ఉమ్మడి జిల్లాలో ఈ అంశం హాట్టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో అసలు అప్పట్లో ఏం జరిగింది, ప్రస్తుత పరిణామాలపై ‘సాక్షి’ ఫోకస్.. యాసంగికి సంబంధించి మిల్లులకు కేటాయించిన సీఎమ్మార్ ధాన్యాన్ని ప్రజా అవసరాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైతే మర ఆడించి బియ్యం ఇచ్చేలా.. లేదంటే టెండర్ ద్వారా ధాన్యం విక్రయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే 2022–23 యాసంగిలో ఎక్సెస్ ధాన్యం రావడం, అంతగా నాణ్యత లేకపోవడం (తడిసిన ధాన్యం)తో మిల్లర్లు వద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు టెండర్ ద్వారా వేలం వేసినా.. పలు కారణాలతో రద్దయింది. కొన్ని మిల్లులు కొంత మేర సీఎమ్మార్ బియ్యం పెట్టడం, వేలంలో కొంత మేర విక్రయించింది పోనూ.. 90 శాతానికి పైగా ధాన్యం ఆయా మిల్లుల వద్దే ఉన్నాయి. 86జిల్లాలోని హన్వాడ మండలపరిధిలో ఉన్న ఎంఎస్ శ్రీలక్ష్మి బాలాజీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో జూలై 29న విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, హైదరాబాద్ సిటీ–2 యూనిట్ అధికారులు.. జిల్లా సివిల్ సప్లయ్ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. 2022–23 యాసంగి సీజన్కు సంబంధించి రూ.11.34 కోట్ల విలువైన 1,26,772 ధాన్యం బస్తాలు లేవని నిర్ధారించారు. అంతేకాదు.. రూ.14.84 లక్షల విలువైన సీఎమ్మార్ ధాన్యాన్ని అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్కు తరలిస్తున్న రెండు లారీలను మిల్లు సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల నేపథ్యంలో మిల్లర్లలో వణుకు మొదలైనట్లు తెలుస్తోంది. 2022–23 యాసంగి సీఎమ్మార్ బకాయిలను వసూలు చేస్తున్నాం. ఆ సీజన్కు సంబంధించి మహబూబ్నగర్ జిల్లాలో 71,060 మెట్రిక్ టన్నుల ధాన్యం బస్తాలు మిల్లుల్లో ఉన్నాయి. వీటి విలువ రూ.152 కోట్ల వరకు ఉంటుంది. ఇప్పటికే ఆయా మిల్లర్లకు నోటీసులు అందజేశాం. అందరూ నిర్దేశిత గడువులోపు కట్టాల్సిందే. లేకుంటే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తప్పవు. ఈ రెండు రోజుల్లో రూ.21 కోట్లు వసూలయ్యాయి. – రవినాయక్, సివిల్ సప్లయ్ డీఎం, మహబూబ్నగర్ ఎక్సెస్ పేరిట మిల్లర్ల అక్రమాల పర్వం టెండర్ రద్దుతో మిల్లుల వద్దే లక్షలాది మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వానికి బియ్యం అప్పగించకపోవడంతో పంచాయితీ సీరియస్గా తీసుకున్న సర్కార్.. డీఫాల్టర్లపై చర్యలకు ఆదేశాలు విజిలెన్స్ తనిఖీలతో మిల్లర్లలో వణుకు.. పౌరసరఫరాలశాఖలో సైతం.. 2022–23 రబీ సీఎమ్మార్ డబ్బులను త్వరగా చెల్లించేలా.. ధాన్యాన్ని నిబంధనల ప్రకారం అమ్ముకునేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. చాలామంది మిల్లర్లు ఇప్పటికే ధాన్యాన్ని విక్రయించినప్పటికీ డబ్బులు చెల్లించకపోవడం.. మిల్లుల్లో ధాన్యం, బియ్యం లేకపోవడాన్ని ప్రభుత్వం మరింత సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. సదరు మిల్లర్లపై రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్ట్ ప్రయోగించాలని సూచించినట్లు సమాచారం. అంతేకాదు.. డీఫాల్టు మిల్లులకు సీఎమ్మార్ కేటాయింపులు చేసిన వారిపై క్రిమినల్ కేసుల నమోదుకు విజిలెన్స్ ఉన్నతాధికారులు సమాయత్తమవుతుండడం జిల్లా పౌర సరఫరాల శాఖలో కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 2022–23 రబీ ధాన్యం పంచాయితీ మూడేళ్లుగా కొనసాగుతుండగా.. ఇటీవల సర్కారు సీరియస్గా దృష్టి సారించింది. మిల్లర్లు బకాయి పడిన సీఎమ్మార్ మొత్తం అందజేయాలని, లేకుంటే తీసుకున్న ధాన్యం తిరిగి ఇవ్వాలని.. లేదంటే క్వింటాల్కు రూ.2,260 చొప్పున డబ్బులు చెల్లించాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు జిల్లాల వారీగా అధికారులు మిల్లర్లతో సమావేశం నిర్వహించగా.. మెజార్టీ సభ్యులు డబ్బులు కట్టేందుకే మొగ్గు చూపారు. దీంతో నిర్దేశిత గడువు (ఈనెల ఐదో తేదీ లోగా 50 శాతం, సెప్టెంబర్లో 25 శాతం, అక్టోబర్లో మిగిలిన 25 శాతం)లోపు చెల్లించేలా మిల్లర్లతో సంతకాలు తీసుకున్నారు. -
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి..
సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసులో భాగంగా వీబీజీ రాంజీ పథకంలో 20 ఏళ్లుగా తాత్కాలిక ఉద్యోగులుగా కొనసాగుతున్నాం. సరైన సమయానికి వేతనం రాదు.. పనికి తగిన వేతనం చెల్లించడం లేదు. అయినా ఎప్పటికై నా క్రమబద్ధీకరిస్తారనే ఆలోచనతో విధులు నిర్వర్తిస్తున్నా నేటికీ సమస్యలు పరిష్కరించడం లేదు. ఇక చేసేది లేక హక్కుల సాధన కోసం ఆందోళన బాట పట్టడం తప్పడం లేదు. – బాలయ్య, జిల్లా అధ్యక్షుడు, వీబీజీ రాంజీ తాత్కాలిక ఉద్యోగుల సంఘం రాష్ట్ర స్థాయిలో ఉద్యోగుల ఆందోళన ఉండటంతో సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకేళుతున్నాం. ప్రస్తుతం కొత్తగా ఇంచార్జి తీసుకోవడం ద్వార పూర్తి స్థాయిలో ఉద్యమం గురించి తెలుసుకోని, గ్రామీణ ప్రాంతాలలో వీబీజీ రాంజీ పనులు కొనసాగేలా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలతో ముందుకు వెలుతాం. – రాంమహేశ్వరరావు, ఇన్చార్జి డీఆర్డీఓ -
నేడు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు
వనపర్తిటౌన్: హన్మకొండలోని జేఎన్ స్టేడియంలో ఈ నెల 7, 8 తేదీల్లో జరిగే 5వ తెలంగాణ రాష్ట్రస్థాయి జావెలిన్ డే అథ్లెటిక్స్ మీట్– 2026కుగాను జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు శనివారం నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాకిటి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి నందిమళ్ల శ్రీకాంత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–6లో 60 మీటర్లు, స్టాండింగ్ లాంగ్జంప్, 150 మీటర్లు, అండర్–8లో 60 మీటర్లు, స్టాండింగ్ లాంగ్జంప్, 200 మీటర్లు, అండర్ –12లో 60 మీటర్లు, స్టాండింగ్ లాంగ్జంప్, 300 మీటర్లు, అండర్ –14లో కిడ్స్ జావెలిన్, అండర్–16, 18, 20, మెన్ అండ్ ఉమెన్ కేటగిరీలో జావెలిన్ త్రో ఎంపికలు నిర్వహిస్తామన్నారు. జిల్లాకేంద్రంలోని డా. బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో ఎంపికలు కొనసాగుతాయని.. ఉదయం 8 గంటలలోపు రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సెల్నంబర్ 94413 53375 సంప్రదించాలని సూచించారు. నేటి నుంచి 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ అమరచింత: ఎల్నినో ప్రభావం కారణంగా ప్రభుత్వం చౌకధర దుకాణాల్లో 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీకి శ్రీకారం చుట్టింది. శనివారం నుంచి లబ్ధిదారు ఒక్కరికి 6 కిలోల చొప్పున 3 నెలలకుగాను 18 కిలోల బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇందుకుగాను జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాలకు 8,600 మెట్రిక్ టన్నుల బియ్యం విడతల వారీగా సరఫరా చేయనున్నారు. 3 నెలల బియ్యం బస్తాలను నిల్వ చేసేందుకు స్థలం కొరత ఉందని రేషన్ డీలర్ల అభ్యర్థన మేరకు విడతల వారీగా సరఫరా చేయడానికి పౌరసరఫరాలశాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. జిల్లాలో 1,83,568 రేషన్ కార్డులు ఉండగా ఇందులో తెల్ల రేషన్ కార్డులు 1,67,367, అంత్యోదయ కార్డులు 9,912, అన్నపూర్ణ కార్డులు 114 ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొనసాగుతున్న విద్యుదుత్పత్తి ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద భారీగా కొనసాగుతుండటంతో దిగువ, ఎగువ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోందని ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. శుక్రవారం ఎగువన 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 11.141 మి.యూ., దిగువన 5 యూనిట్ల నుంచి 200 మెగావాట్లు, 11.86 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. ఎగువ, దిగువ కేంద్రాల్లో ఇప్పటి వరకు 12.327 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టామని.. ప్రస్తుతం 35 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువ శ్రీశైలం జలాశయానికి వదులుతున్నామని వివరించారు. -
డ్రై డేను సమర్థవంతంగా నిర్వహించాలి
వనపర్తి రూరల్: ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజల సహకారంతో డెంగీ, మలేరియా, చికున్గున్యా వంటి సీజనల్ వ్యాధులను నివారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. శుక్రవారం పెబ్బేర్లోని 7వ వార్డుతో పాటు మండలంలోని బునియాదిపూర్లో పర్యటించి ఫ్రైడే.. డ్రైడే కార్యక్రమ నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నివాస ప్రాంతాలను పరిశీలిస్తూ వర్షాకాలంలో ప్రజలు తీసుకోవాల్సిన ఆరోగ్య, పారిశుద్ధ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఇళ్ల పరిసరాల్లో పాత్రలు, కూలర్లు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ఇతర వ్యర్థ వస్తువుల్లో నీటి నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు బ్లీచింగ్ పౌడర్ చల్లడం, నివారణ మందులను పిచికారీ చేయడం, డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రపర్చడం, పిచ్చి మొక్కలను తొలగించడం, మురుగు నిల్వకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలు, పట్టణాలను వ్యాధి రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. బునియాదిపూర్లో అంగన్వాడీ కేంద్రం నిర్వహణ, పారిశుద్ధ్య పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ వెంట పుర చైర్మన్ శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుల హక్కుల సాధనకు పోరాటం
వనపర్తి రూరల్: జిల్లాలోని అసంఘటితరంగ కార్మికులందరినీ ఏకం చేసి వారి హక్కుల సాధనకు నిరంతరం పోరాడాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బాలరాజు పిలుపునిచ్చారు. శుక్రవారం పెబ్బేరులోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన సంఘం జిల్లా 4వ మహాసభల ముగింపు కార్యక్రమానికి జిల్లా కార్యవర్గ ఎన్నికకు ఉప ప్రధానకార్యదర్శి నర్సింహతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజా వ్యతిరేఖ విధానాలను ప్రతిఘటించేందుకు, హక్కులు కాపాడుకునేందుకు కార్మిక లోకాన్ని సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అనంతరం జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్రీహరి, ప్రధానకార్యదర్శిగా మోషా, ఉపాధ్యక్షులుగా రఘు, శ్యాంసుందర్, సహాయ కార్యదర్శులుగా శ్రీరామ్, గోపాలకృష్ణ, కోశాధికారిగా భాస్కర్తో పాటు 15 మంది కార్యవర్గసభ్యులు ఎన్నికయ్యారు. జిల్లాలో సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు నూతన కార్యవర్గం కృషి చేయాలని కోరారు. -
వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రణాళిక
వనపర్తి: పదోతరగతి వార్షిక పరీక్షల్లో జిల్లా విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికతో పని చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఉర్దూ మాధ్యమ పాఠశాలలో జరిగిన జిల్లా జీహెచ్ఎంల సమావేశంలో ఆయన పాల్గొని పరీక్షల సన్నద్ధత, ప్రత్యేక బోధన కార్యక్రమాలు, ఉపాధ్యాయులకు పాఠ్యపుస్తకాల పంపిణీ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. గణితం, ఆంగ్లం, సైనన్స్ పాఠ్యాంశాల స్టడీ మెటీరియల్ త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఆగస్టు 12 నాటికి సంబంధిత ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక స్టడీ మెటీరియల్ పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. అలాగే ఆయా సబ్జెక్టుల్లో ఆబ్జెక్టివ్ తరహా పరీక్షలు నిర్వహించాలని.. పరీక్షల ఫలితాల ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి జాబితా సిద్ధం చేయాలని కోరారు. ఆయా విద్యార్థులకు మూడు నెలల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటూ బలహీనతలను అధిగమించేలా ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. గణితం, ఇంగ్లీష్, సైన్స్ సబ్జెక్టుల్లో ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాకుండా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో వంట గ్యాస్ కనెక్షన్లను తప్పనిసరిగా వినియోగించి శుభ్రంగా, నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యా ప్రమాణాల పెంపుతో పాటు పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థుల సంక్షేమంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. -
ఉద్యమకారులను విస్మరిస్తే ఉద్యమిస్తాం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తే మరో ఉద్యమం తప్పదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా.పిడమర్తి రవి హెచ్చరించారు. శుక్రవారం ఆర్అండ్బీ అతిథి గృహంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలని.. కేకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ ప్రక్రియను వేగవంతం చేసి, ఉద్యమకారులను గుర్తించాలన్నారు. మొదట్లో మూడు నెలల సమయం పెట్టి.. ఇప్పుడు కాలయాపన చేసేందుకు డిసెంబర్ వరకు కమిటీ టైం బాండ్ పెట్టడం ఉద్యమకారులను విస్మరించేందుకేనని అరోపించారు. ఉద్యమకారులుగా ఉన్న తమకు రావాల్సిన హక్కుల కోసం పోరాడుతామన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేదుకు సెప్టెంబర్ 16న హైదరాబాద్లోని ఓయూలో ఉద్యమకారుల అపూర్వ సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా నుంచి ఉద్యమకారులు పెద్దఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. -
నల్లమలకు బుల్లెట్ రైల్
● శంషాబాద్, ఫ్యూచర్ సిటీ, సోమశిల, కర్నూలు నుంచి బెంగళూరుకు.. ● గతంలో ప్రతిపాదించిన మార్గంలో కీలక మార్పులు ● సవరించిన వాటిని ఖరారు చేయాలని కేంద్రానికి రాష్ట్రం వినతి ● సాకారమైతే పర్యాటకంగా.. అభివృద్ధి పరంగా కీలక ముందడుగు ●శంషాబాద్, ఫ్యూచర్ సిటీ, ఆమనగల్, మన్ననూర్, సోమశిల మీదుగా కర్నూలు, బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్కు సంబంధించి సాధ్యాసాధ్యాల అధ్యయనం జరిగింది. పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్న నల్లమల గుండా రూట్ మ్యాప్ను ఖరారు చేసిన సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. సీఎం ఆదేశాల మేరకు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభమయ్యే బ్రాహ్మణపల్లి వద్ద హైస్పీడ్ రైల్వే స్టేషన్కు స్థల పరిశీలన చేశాం. తుది అలైన్మెంట్ ఖరారు చేశారు. రావిర్యాల– ఆమనగల్ రతన్టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే నుంచి ప్రతిపాదించడం వల్ల భూసేకరణ సమస్య కూడా లేదు. – వంశీకృష్ణ ఎమ్మెల్యే, అచ్చంపేట అచ్చంపేట: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన హైదరాబాద్– బెంగళూరు బుల్లెట్ రైల్ మార్గం నల్లమల మీదుగా ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు మార్గంలో హైస్పీడ్ రైలులైన్ల అలైన్మెంట్లో కీలక మార్పులు చేస్తూ వాటినే ఖరారు చేయాలని కేంద్రానికి విన్నవించింది. మొదట కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన రూట్ మ్యాప్ ప్రకారం శంషాబాద్, మహబూబ్నగర్, కర్నూలు మీదుగా 218 కి.మీ., మార్గంలో 3 స్టేషన్లు ఏర్పాటు చేస్తూ ప్రతిపాదించారు. తాజాగా ఈ మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, ఆమనగల్, మన్ననూర్, సోమశిల, కర్నూలు మీదుగా రైల్వే లైన్ అలైన్మెంట్ను నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్)కు కీలక సవరణలు చేస్తూ నివేదించినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపుతూ మార్పులు చేసిన అలైన్మెంట్ ఖరారు చేయాలని కోరింది. దీంతో హైదరాబాద్– బెంగుళూరు హైస్పీడ్ రైల్వే లైన్ అలైన్మెంట్ ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే నల్లమల ప్రాంతానికి మంచి రోజులు రాబోతున్నారు. మూడు హైస్పీడ్ రైలు కారిడార్లకు శంషాబాద్ ప్రాంతం హబ్గా మారనుండటంతో భారత్ ఫ్యూచర్ సిటీ, మన్ననూర్, సోమశిలలో నల్లమల హైస్పీడ్ రైలు స్టేషన్లుగా మార్చనున్నారు. పర్యాటకానికి ఊతమిచ్చేలా.. నల్లమలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు వీలుగా హైస్పీడ్ రైలు కారిడార్ ప్రణాళికలు ఉండాలన్న సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు ఈ అలైన్మెంట్ మార్పులు చేసినట్లు తెలిసింది. భూ సేకరణలో తలెత్తే సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వంద మీటర్ల వెడల్పుతో రూ.4,030 కోట్లతో ప్రారంభమైన ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ రావిర్యాల– ఆమనగల్ (ఆకుతోటపల్లి) 41.5 కి.మీ., గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డుకు సమాంతరంగా హైస్పీడ్ రైల్వేలైన్ నిర్మిస్తే కొత్త ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ ఏర్పడుతుందని భావిస్తోంది. ఈ మార్గాన్ని ఆకుతోటపల్లి నుంచి మన్ననూర్– శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ అనుసంధానం కానుంది. ప్రాథమిక ప్రతిపాదనల ప్రకారం ఈ కారిడార్ శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, ఆమనగల్, మన్ననూర్, సోమశిల జాతీయ రహదారి–167కేలోని మల్లేశ్వరం– సిద్ధేశ్వరం ఐకానిక్ వంతెన మీదుగా కర్నూలు వెళ్లనుంది. ఏపీ ప్రభుత్వం కూడా ఈ రైల్వేలైన్ అలైన్మెంట్ను కర్నూలు నుంచి ధర్మవరం, పుట్టపర్తి మీదుగా ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిసింది. హైదరాబాద్– బెంగళూరు హైస్పీడ్ రైలు మార్గానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే డీపీఆర్ రూపకల్పనకు ప్రైవేట్ సంస్థకు అప్పగించినట్లు తెలుస్తోంది. హైస్పీడ్ రైలు మార్గాన్ని గ్రీన్ఫీల్డ్ హైవే మార్గంలోనే అధిక భాగం వచ్చేలా చేయడం వల్ల భూ సేకరణ, పర్యావరణ సమస్యలను అధిగమించేలా ఈ మార్గం ఉత్తమమైనదిగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ రైలు మార్గం నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్కు పంపించి.. అలైన్మెంట్, స్టేషన్ల స్థానాలను ఖరారు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. -
వైభవం.. శతమాస కల్యాణోత్సవం
కొత్తకోట రూరల్: కొత్తకోట సమీపంలోని వెంకటగిరి క్షేత్రంలో వెలిసిన భూలక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి శ్రావణ నక్షత్ర శతమాస కల్యాణోత్సవం గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు విష్ణునారాయణస్వామి, కన్నయ్యస్వామి, సింగారాచార్యుల వేద మంత్రోచ్ఛారణలు, మేళతాళాల నడుమ కల్యాణ క్రతువు కనులపండువగా సాగింది. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలతో శోభాయమానంగా అలంకరించి గర్భగుడి నుంచి పల్లకీలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం అర్చకులు జీలకర్ర–బెల్లం, మంగళసూత్ర ధారణ తదితర సంప్రదాయ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కల్యాణోత్సవానికి కొత్తకోటతో పాటు పరిసర గ్రామాల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కార్యక్రమ అనంతరం నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయడంతో పాటు అన్నదానం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాసులు, నరోత్తంరెడ్డి, వెంకటేష్, ఎన్.శ్రీనివారెడ్డి, మోహన్యాదవ్, మేడిశెట్టి జ్యోతి, ప్రసన్నలక్ష్మి, బీమా రజిని, రాణి, అనిత, విజయలక్ష్మి, రాజేశ్వరి, వసంత తదితరులు పాల్గొన్నారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి..
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు కలెక్టర్ ఆదర్శ సురభి తెలిపారు. గురువారం హైదరాబాద్ నుంచి సీఎస్ సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్న్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్తో పాటు ఎస్పీ సునీతారెడ్డి, అదనపు కలెక్టర్లు ఎన్.ఖీమ్యానాయక్, వినోద్కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తహసీల్దార్లు తమ తమ మండలాల్లో అందుబాటులో ఉండాలని సూచించామన్నారు. ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తినా వెంటనే సహాయక చర్యలు అందించాలని చెప్పామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
గోపాల్పేట: రాష్ట్రంలోని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని.. రాబోయే మూడేళ్లలో ఇళ్లు నిర్మించి తీరుతామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీఓ అయేషా అంజుం అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. మొదట అధికారులతో శాఖల వారీగా పురోగతి అడిగి తెలుసుకొన్నారు. ఎన్నినో ప్రభావం ఉన్నందున రైతులు మెట్టపంటల సాగుపై దృష్టి సారించాలని, వరి తక్కువగా సాగు చేయాలని.. ఒకవేళ వరి సాగు చేసినా సన్నరకం మేలని వ్యవసాయ అధికారి రమేష్ వివరించారు. ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తర్వాత ఏమైనా సమస్యలు ఉన్నాయా అని సర్పంచ్లను అడిగారు. అభివృద్ధి పనులు చేసిన తర్వాత గ్రామపంచాయతీలకు బిల్లులు కావడం లేదని చెప్పడంతో ఎందుకు పని సరిగా చేయడం లేదని ఎంపీఓ భవాని, కంప్యూటర్ ఆపరేటర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ తాగునీరు వారానికి ఒకసారి వస్తున్నాయని లక్ష్మీతండా సర్పంచ్ చెప్పడంతో ఇదేమిటని అధికారులను నిలదీశారు. ఎస్ఐఆర్ 99 శాతం పూర్తి చేసినందుకుగాను అధికారులను ఎమ్మెల్యే అభినందించారు. విద్య విషయంలో ప్రభుత్వం త్వరలోనే శుభవార్త వినిపించనుందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కె వెంకటేష్, ఉపాధ్యక్షుడు సత్యశిలారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ లోడె రఘు, అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు. -
లక్ష్యం.. జలసిరి
● ఇంటికో గుంత, పంటకో కుంట, గ్రామానికి ఊటకుంట నిర్మాణానికి చర్యలు ● భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా ప్రణాళిక ఖరారు ● ప్రజలు, రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు ● వచ్చేనెల 14 నాటికి పూర్తిచేసేలా గడువు విధింపు నర్వ: ఎల్నినో ప్రభావంతో వానలు పడక.. పల్లెలు, పట్టణాలు ఆకాశం వైపు చూస్తున్నాయి. సమీప భవిష్యత్లో ఇలాంటి ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు మేల్కొన్నాయి. నీటి సంరక్షణతోపాటు భూగర్భజలాల పెంపునకు ప్రతి చుక్క– ప్రజల కోసం నినాదంతో ‘జల సిరి’కి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం వీబీ జీ రాంజీ పథకంలో ఇళ్ల వద్ద వ్యక్తిగత, గ్రామాల్లో సామూహిక ఇంకుడు గుంతలు, బోర్వెల్ రీచార్జి కుంట, ఓపెన్ వెల్, పొలాల్లో నీటికుంటల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3.9 లక్షల ఇంకుడు గుంతలు, 6,776 పాంపాండ్ల నిర్మాణం.. ఆగస్టు 14 వరకు పూర్తిచేసేలా అధికారులు లక్ష్యం నిర్దేశించారు. సామూహిక ఇంకుడు గుంతలు గ్రామాల్లో ప్రతి ఇంటి ఆవరణలో వ్యక్తిగత ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టాలి. ఈ నిర్మాణం వీలుకాని చోట సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణం చేసుకోవచ్చు. వాటి నిర్మాణం కోసం ప్రభుత్వం నిర్దిష్ట కొలతలు రూపొందించింది. పరిమాణం 1.2 మీటర్ల పొడవు, 1.2 మీటర్ల వెడల్పుతో 1.8 మీటర్ల లోతు ఉండాలి. నిర్మాణ వ్యయంగా రూ.7,500 ప్రభుత్వం అందిస్తుంది. సామూహిక ఇంకుడు గుంత నిర్మాణం కోసం పొడవు, వెడల్పు 2.4 మీటర్లు, లోతు 2 మీటర్లు ఉండాలి. నిర్మాణం వ్యయం రూ.13 వేలుగా నిర్ణయించింది. పాంపాండ్స్ నిర్మాణం వ్యవసాయ భూముల వద్ద నీటి సామర్థ్యం పెంపొందించడానికి పాంపాండ్స్ నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది. వాటిని రెండు రకాల కొలతలతో ఏర్పాటు చేసుకోవచ్చు. గుంట భూమి కేటాయించి.. 12 మీటర్ల పొడవు, వెడల్పుతో నిర్మిస్తే రూ.80 వేలు, 5 గుంటల భూమి కేటాయిస్తే 20 మీటర్ల పొడవు, వెడల్పు ఉండాలి. దీని ఏర్పాటుకు రూ.4 లక్షలు ఖర్చు చేయనుంది. గ్రామానికో ఊటకుంట ప్రతి గ్రామంలో ఒక ఊటకుంట తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. గ్రామ నీటి అవసరాల కోసం భూగర్భ జలాలను పెంపొందించడమే ప్రధాన ఉద్దేశం. ఊటకుంట నిర్మాణం కోసం రూ.5 లక్షల నిధులు ప్రభుత్వం కేటాయించనుంది. అలాగే వ్యవసాయ అవసరాలు బోరు బావుల రీచార్జి కోసం రూ.25 వేలు మంజూరు చేయనుంది. వ్యవసాయ అవసరాల కోసం బావులు తవ్వుకోవడానికి సైతం రూ.3.50 లక్షలు ప్రభుత్వం అందిస్తుంది. సామూహిక ఇంకుడు గుంత కొలతలు తీసుకుంటున్న అధికారులు శాసీ్త్రయంగా ఇంటి పైకప్పు నుంచి 50 చదరపు అడుగుల వైశాల్యంలో వర్షపు నీరు పడి ఒక్క ఇంకుడు గుంత ద్వారా 25 వేల లీటర్ల నీటిని భూమిలో నిల్వ చేసుకోవచ్చు. ఇంకుడు గుంత ఏర్పాటును తమకు నచ్చినట్లుగా కాకుండా.. శాసీ్త్రయంగా నిర్మిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటి పైకప్పును బట్టి ఇంకుడు గుంత పొడవు, వెడల్పు నిర్ణయించుకోవాలని, ఇంటి వృథా నీరు ఇందులో చేరేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇంకుడు గుంత 4 అడుగుల పొడవు, 6 అడుగుల లోతున ఉండాలి. మూడు అడుగుల కింద భాగాన్ని పెద్ద, పెద్ద రాళ్లతో నింపాలి. ఒక సిమెంట్ గొళ్లెం తీసుకొని పైభాగంలో సరిపడా రంద్రాలు ఏర్పాటు చేసి గుంత మధ్య భాగంలో అమర్చాలి. ఇక గుంతలో మిగిలిన ఖాళీ భాగాన్ని మూడు ఫీట్లు (45ఎంఎం) కంకర నింపాలి. వృథాగా పారే వర్షపు నీటిని పైపు ద్వారా గొళ్లెంలోకి వెళ్లేలా చూసుకోవాలి. -
అవగాహన కల్పిస్తున్నాం..
వీబీజీ రాంజీ అమలులో భాగంగా జలసిరికి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామాల్లో నిర్మించనున్న ఇంకుడు గుంతలు, బోరుబావుల రీచార్జి, నీటి, ఊటకుంటల గురించి ప్రజలతోపాటు రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. జిల్లావ్యాప్తంగా ప్రతి పంచాయతీకి రెండు చొప్పున 272 గ్రామాల్లో 544 పాంపాండ్లు.. ఆగస్టు 14 వరకు నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటాం. ఇందులో ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రజలు, అన్నదాతలు భాగస్వామ్యులు కావాలి. – వెంకట్రాములు, డీఆర్డీఓ, నారాయణపేట ● -
కాగిత రహిత పాలన సాగిద్దాం
వనపర్తి: ఇక నుంచి కాగిత రహిత పాలన సాగిద్దామని.. జిల్లాలోని అన్ని కార్యాలయాలు ఈ–ఆఫీస్ ద్వారా మాత్రమే దస్త్రాలు పంపించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఎంలతో సంక్షేమ పథకాల పురోగతిపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా భూ భారతి రికార్డులు ఈ–ఆఫీస్ ద్వారానే రావాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సమీక్షిస్తూ ప్రభుత్వం గుడిసెల్లో ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని.. సర్వే చేయించి త్వరగా నివేదిక ఇస్తే అనుమతుల ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో పనులు ప్రారంభించని లబ్ధిదారులతో మాట్లాడి ఇంటి నిర్మాణం చేపట్టే విధంగా చూడాలని, అవసరమైన వారికి మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించాలని సూచించారు. ఎస్ఐఆర్ గడువు మరో మూడురోజులు మాత్రమే ఉందని.. పెండింగ్లో ఉన్న ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ త్వరతగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఒక్క ఓటరు నుంచి కూడా ఫిర్యాదు రావద్దని హెచ్చరించారు. అదేవిధంగా భూ భారతి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. తహసీల్దార్ వారీగా పెండింగ్లో ఉన్న భూ భారతి ఫైళ్లపై సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 7లోగా అన్ని పూర్తి కావాలని సూచించారు. భూగర్భ జలాలు పెంచేందుకు వీబీజీ రాంజీ పథకం కింద అన్ని మండలాల్లో నీటికుంటల ఏర్పాటుకు స్థలం చూసి పనులు మంజూరుకు ప్రతిపాదనలు పంపించాలన్నారు. జిల్లాలో 222 నీటి కుంటలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున వన మహోత్సవం లక్ష్యం పూర్తి చేయాలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు ఎన్.ఖీమ్యానాయక్, వినోద్కుమార్, డీఆర్డీఓ ఉమాదేవి, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీపీఓ రఘునాథ్రెడ్డి, డిప్యూటీ సీఈఓ రాంమహేశ్వర్రెడ్డి, హౌసింగ్ పీడీ విఠోబా పాల్గొన్నారు. -
రీ–సర్వేతో భూ సమస్యలు పరిష్కారం
వీపనగండ్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ రీ–సర్వే పూర్తయితే భూ సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం అవుతాయని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. గురువారం మండలంలోని కొర్లకుంటలో నిర్వహిస్తున్న భూ రీ–సర్వేను ఆయన పరిశీలించి సర్వేయర్లకు పలు సూచనలు, సలహాలిచ్చారు. గ్రామంలోని రైతుల భూములను సమగ్రంగా సర్వే చేస్తామని.. మోఖాపైన ఉండి పట్టాదారు పాసు పుస్తకాల్లో రాని రైతుల వివరాలు సేకరిస్తామని, ప్రభుత్వ భూములు కూడా గుర్తిస్తామని వివరించారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా సర్వే అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ ఖాజా మైనుద్దీన్, మాజీ ఎంపీపీ కమలేశ్వర్రావు, ఆర్ఐ రాములు, పలువురు రైతులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులతో జాగ్రత్త వీపనగండ్ల: ముసురు వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా నోడల్ అధికారి డా. వంశీకృష్ణ తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి వ్యాధులను ముందస్తుగా గుర్తిస్తే ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూసుకోవచ్చన్నారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ఫై డే.. డ్రై డే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మురుగుకుంటల్లో దోమలు వృద్ధి చెందకుండా చూసుకోవాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయుష్ వైద్యులు డా. శ్వేత, డా. కరుణశ్రీ, డా. భాగ్యశ్రీ, డా. కవిత, డా. మౌనిక, సూపర్వైజర్లు, పలువురు ఏఎన్ఎంలు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మిక సమస్యలు పరిష్కరించాలి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని టీఎంయూ (థామస్రెడ్డి) రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జి.లక్ష్మణ్గౌడ్ కోరారు. ఈ మేరకు గురువారం మహబూబ్నగర్ డిపో అసిస్టెంట్ మేనేజర్లు కవిత, జయరాంలను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ సంస్థ అభివృద్ధికి అన్నివిధాల క ట్టుబడి ఉన్నామన్నారు. కొ త్తగా ఎన్నికై న తమ యూనియన్ డిపో కమిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బి.కె.రెడ్డి, ముజీబ్, టి.ఆర్.సి. శేఖర్రె డ్డి, తెల్కపల్లి రాములు, హబీబ్ హసన్, చంద్రమోహన్, నిజామాబాద్ శ్రీనివాస్, ప్రేమలత, అమరేశ్వరి, రాగిణి, శిరీష, శ్రీదేవి, పద్మ పాల్గొన్నారు. నేడు రాష్ట్రస్థాయి గోగేమ్ క్రీడాకారుల ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ గోగేమ్ క్రీడాకారుల ఎంపికలను శుక్రవారం ఉదయం 10.30 గంటలకు జిల్లాకేంద్రంలోని మాస్టర్ మైండ్స్ స్కూల్లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గులాం అఫ్రోజ్, సీనియర్ ఉపాధ్యక్షులు మహ్మద్ షకీల్ అహ్మద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు తమ ఆధార్కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, జిరాక్స్ కాపీలతోపాటు తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని కోరారు. మిగతా వివరాల కోసం 98857 04173, 98852 42848 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
స్పాట్ అడ్మిషన్లు
వనపర్తి రూరల్: జిల్లాకేంద్రంలోని కడుకుంట్ల, చిట్యాల ఎంజేపీ బీసీ గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం బైపీసీలో మిగిలిన సీట్లకు ఆగస్టు 1న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని డీసీఓ శ్రీవేణి, కళాశాల ప్రిన్సిపాల్ గురువయ్యగౌడ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రెండు కళాశాలల్లో కలిపి 12 సీట్లు ఖాళీగా ఉన్నాయని.. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4 వరకు ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. పదోతరగతిలో 450 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా సంబంధిత కళాశాలలో హాజరై అడ్మిషన్ పొందవచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు సెల్నంబర్ 91549 02278 సంప్రదించాలన్నారు. -
వెల్లువాయె...!
వాన.. వాన.. జిల్లాలోని 12 మండలాల్లో కురిసిన వర్షం మండలాల వారీగా ఇలా.. (మి.మీ.లలో..) ● అధికంగా పెద్దమందడిలో 24.8 మి.మీ. ● మెట్ట పంటలకు జీవం.. అన్నదాతల్లో చిగురించిన ఆశలు ● వాతావరణంలో ఒక్కసారిగా మార్పు –8లో uజిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 98 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కాగా.. అందులో వరి ఒక్కటే 78 వేల ఎకరాల వరకు ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. వరి నాట్లు కొనసాగుతున్న సమయంలో వర్షం కురవడం రైతులకు కొంత ఊరటనిచ్చినట్లయింది. మరో ఇరవై వేల ఎకరాల వరకు మెట్ట పంటలైన జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, పత్తి సాగు చేశారు. వనపర్తి: వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఎదురుచూస్తున్న వర్షం బుధవారం జిల్లాలోని నేలను తడిపేసింది. వర్షాధారంగా సాగు చేసిన పంటలకు ఈ వర్షంతో జీవం పోసినట్లయింది. జిల్లాలో అత్యధికంగా పెద్దమందడిలో 24.8 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు నివేదిక విడుదల చేశారు. వర్షాభావంతో ఆందోళనలో ఉన్న అన్నదాతల్లో సాగు ఆశలు చిగురించాయి. కొద్దిరోజులుగా ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితులతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతుండగా, బుధవారం ఉదయం నుంచి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటుచేసుకుంది. మేఘాలు కమ్ముకొని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఆయా ప్రాంతాల్లో సాగు చేసిన జొన్న, మొక్కజొన్న, కంది, పత్తి తదితర పంటలకు కొంత మేలు చేసింది. ఇటీవల వర్షాలు కురువక మొక్కల ఎదుగుదల మందగించడంతో పాటు పలుచోట్ల వాడిపోతున్న పరిస్థితి నెలకొంది. తాజాగా కురిసిన వర్షంతో భూమిలో తేమశాతం పెరిగి పంటలు కోలుకునే అవకాశాలు మెరుగుపడ్డాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు, మూడురోజులు ఇదే తరహాలో వర్షాలు కురిస్తే సాగు పూర్తిగా గాడిన పడుతుందని వ్యవసాయశాఖ అధికారులు, రైతులు భావిస్తున్నారు. ఎన్నినో ప్రభావంతో ఈ వర్షాకాలం ఇక పంటలు సాగినట్లే అని నిరాశలో ఉన్న రైతులకు ఈ వర్షంతో ఊరట లభించిందని చెప్పవచ్చు. వర్షంతో చెరువులు, కుంటలకు నీరు చేరకపోయినా.. నేల బాగా తడిసింది. ఇకపై కురిసే వర్షాలకు నీరు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. నాలుగు మండలాల్లో నిల్.. జిల్లాలో మొత్తం 15 మండలాలు ఉండగా.. చిన్నంబావి, పాన్గల్, శ్రీరంగాపురం, వీపనగండ్ల మండలాల్లో బుధవారం ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదు. మిగతా 11 మండలాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. పెద్దమందడి, అమరచింత, కొత్తకోట, మదనాపురం మండలాల్లో 15 మిల్లిమీటర్లకుపైబడి, మరో ఏడు మండలాల్లో 10.3 మి.మీ. అంతకంటే తక్కువ వర్షపాతం నమోదైంది. మదనాపురంలో కురుస్తున్న వర్షం అమరచింత: మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు బుధవారం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వకు అధికారులు సాగునీటిని విడుదల చేశారు. వరి నారుమడులు వేసుకున్నామని.. ఎగువ నుంచి వరద వస్తున్నందున కాల్వకు సరఫరా చేయాలని ఆయకట్టు రైతులు కోరడంతో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో చర్చించి సాగునీటిని విడుదల చేయించినట్లు కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు రాజేందర్రెడ్డి తెలిపారు. రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్ వైస్ చైర్మన్ కేశం నాగరాజుగౌడ్ సమస్యను పలుమార్లు మంత్రి వాకిటి దృష్టికి తీసుకెళ్లడంతో ఎట్టకేలకు నీటి విడుదల సాధ్యమైందన్నారు. -
పేదలకే ఇందిరమ్మ ఇళ్లు
వనపర్తి: నియోజకవర్గంలోని పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పక్కా ఇళ్లు నిర్మించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వనపర్తిని గుడిసెలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా కూడా నిర్మాణాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపని లబ్ధిదారులను వెంటనే గుర్తించాలన్నారు. వాటిని అర్హులైన పేదలకు మంజూరు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే గుర్తించిన 287 గుడిసెలతో పాటు నియోజకవర్గంలో మిగిలిన గుడిసెలను పూర్తిస్థాయిలో గుర్తించి జాబితాను సిద్ధం చేయాలని, ఈ ప్రక్రియతో పాటు పెండింగ్ అంశాలన్నింటినీ వారంలోగా పూర్తి చేయాలని స్పష్టమైన గడువు విధించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వం విధించిన పరిమితులకు లోబడే నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్దేశిత లక్ష్యాలను గడువులోగా పూర్తి చేసేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని, లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ విఠోబా, అసిస్టెంట్ ఇంజినీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
చేపల సంరక్షణపై అవగాహన
అమరచింత (ఆత్మకూర్): చేపపిల్లల పెంపకందారులు సంరక్షణలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్ పాలేరు ఖమ్మం జిల్లా శాస్త్రవేత్తలు షిగా నాగరాజు, బానోత్ దివ్య సూచించారు. బుధవారం ఆత్మకూర్ మండలం ఆరేపల్లిలో ఏటి ఆనంద్ చేపల ఫారంను వారు సందర్శించి మత్స్యకారులకు అవగాహన కల్పించారు. చేపల్లో సాధారణంగా కనిపించే వ్యాధుల లక్షణాలు, నివారణ పద్ధతులు, నీటి నాణ్యత నిర్వహణ, బయో సెక్యూరిటీ చర్యల గురించి వివరించారు. -
‘సర్’ శతశాతం పూర్తికి సహకరించాలి
వనపర్తి: ఎస్ఐఆర్ ప్రక్రియ వందశాతం పూర్తి చేసేందుకు బీఎల్ఏలు సహకరించేలా రాజకీయ పార్టీలు చొరవ చూపాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ టి.వినోద్కుమార్ కోరారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వనపర్తిలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ కేవలం 68 శాతమే పూర్తయిందని తెలిపారు. మిగిలిన వారు ఎవరు.. ఎక్కడున్నారో గుర్తించి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసే విధంగా చొరవ చూపాలన్నారు. 2026, అక్టోబర్, 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువత ఫారం 6 ద్వారా ఇప్పుడే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్కుగాను ఇప్పటి వరకు 4 దరఖాస్తులు వచ్చాయని, ఏమైనా సమస్యలుంటే తెలియజేయాలని కోరారు. ఆర్డీఓ సు బ్రమణ్యం, తహసీల్దార్ రమేష్రెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు తిరుపతయ్య, వే ణాచారి, గట్టుయాదవ్, కుమారస్వామి, పుట్టా ఆంజనేయులు, గంధం నాగరాజు, పాల్గొన్నారు. -
రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
● భీమా ఫేజ్–1, ఫేజ్–2కు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యేలు కొత్తకోట/మదనాపురం: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని.. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదుగాకపోయినా, రైతులు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సాగునీటిని విడుదల చేస్తున్నామని వనపర్తి, దేవరకద్ర ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, మధుసూదన్రెడ్డి అన్నారు. బుధవారం కొత్తకోట, మదనాపురం మండలాల మధ్యలో ఉన్న భీమా ఫేజ్–1, మదనాపురం మండలం తిర్మలాయపల్లి సమీపంలో రామన్పాడు జలాశయ బ్యాక్వాటర్ ద్వారా శంకరసముద్రం భీమా ఫేజ్–2 ఎత్తిపోతల పథకం ద్వారా దిగువకు నీటిని విడుదల చేసి ఆయా ప్రాంతాల్లో రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఎగువన కర్ణాటక నుంచి జూరాలకు వరద వస్తోందని.. జలాశయంలో నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రైతుల వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటిని వదులుతున్నామన్నారు. రైతుల పొలాలు పచ్చగా ఉండాలన్నదే ప్రభుత్వ సంకల్పమని.. అవసరమైన మేర నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త సాగునీటి ప్రాజెక్టును కూడా నిర్మించలేదని, నేడు సాగునీటి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులతోనే నీరు విడుదల అవుతుంటే, వాటి ఘనతను వారి ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయడం ప్రజలను మోసం చేయడమేనని తెలిపారు. గత పాలకులు రాష్ట్రాన్ని దారుణంగా దోచుకున్నారని.. ప్రజల అవసరాలు, రైతుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా సొంత ప్రయోజనాలు, ఫామ్హౌస్ల నిర్మాణాలకే ప్రాధాన్యత ఇచ్చారని మండిపడ్డారు. శంకరసముద్రం రిజర్వాయర్కు నీటి విడుదలతో పరిసర ప్రాంతాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా తాగునీటి ఎద్దడి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. భీమా ఫేజ్–2 నీటి విడుదల కార్యక్రమంలో కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్ పోతుగంటి రాములు, మండలపార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నీటిపారుదలశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. -
అన్నదాతకు మద్దతుగా పోరాటం
అమరచింత: ఎగువ నుంచి వస్తున్న వరదను తోడుకునే వీలున్నా.. దిగువన ఉన్న ఆంధ్రాకు పంపుతామంటే ఇక్కడి రైతులు చోద్యం చూస్తూ ఉండరని, అన్నదాతలకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆత్మకూర్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరువు ఉందని, సాగునీరు ఇవ్వలేమని.. ఆరుతడి పంటలు సాగు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంత్రులతో కలిసి రైతులను భయపెట్టడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో మూడేళ్లకుపైగా వర్షం కురవకపోయినా ఇక్కడి ప్రాజెక్టులకు నీటి కొరత ఉండదని.. పచ్చిమ కనుమల్లో దట్టమైన అడవులు ఉండటంతో ప్రతి వర్షాకాలంలో తుంగభద్ర, కృష్ణా, భీమానదులు ఉధృతంగా పారుతుంటాయని వివరించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోని 19 నియోజకవర్గాలకు ఎల్లూరు నుంచి 9 టీఏంసీల నీరు అవసరమని.. వచ్చే జూన్ వరకు మిషన్ భగీరథ నీటికి ఇబ్బంది లేదని, వీటిని సాకుగా చూపుతూ జూరాల ఆయకట్టును ఎండబెట్టుదామనే ఆలోచనలో ఇక్కడిి మంత్రి ఆలోచించడం ఏమిటన్నారు. ప్రస్తుతం ఆల్మట్టిలో 123 టీఏంసీలు, నారాయణపూర్లో 30 టీఏంసీల నీరు ఉందని.. అక్కడ పంటలు సాగైతే వర్షం పడకపోయినా జూరాలకు ఐదువేల క్యూసెక్కుల వరద రోజు వచ్చి చేరుతుందని చెప్పారు. పాలమూర్లో కృష్ణానది మీద ఇప్పుడున్న అన్ని ప్రాజెక్టులు కలిపినా రోజుకు ఒక టీఎంసీ మించి వాడుకోలేమని.. అందుకే పాలమూర్–రంగారెడ్డి ప్రాజెక్టుతో రోజు రెండు టీఏంసీల నీరు ఎత్తిపోసేలా డిజైన్ చేసి తమ పాలనలో పనులు చేపట్టామని, మిగిలిన పనులు చేయలేక.. నీటిని ఎత్తిపోయకుండా సీఎం రేవంత్రెడ్డి కాలయాపన చేయడం ఏమిటన్నారు. జూరాల కుడి, ఎడమ కాల్వల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలనే డిమాండ్తో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జూరాల వద్ద బుధవారం ఆందోళన చేయడానికి వస్తున్నారనే సమాచారంతో ముందస్తుగానే అక్కడి లష్కర్లతో కాల్వ గేట్లు తెరిపించారని మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. కేఎల్ఐ ఒక పంప్ ఆన్ చేశారని.. నిరంతరంగా మూడు పంపులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సాగునీటి కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమళ్ల అశోక్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ వామన్గౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు రవికుమార్ యాదవ్, మాజీ పుర చైర్పర్సన్ గాయత్రి, పలుస రమేష్గౌడ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు విశ్వేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
అడ్డంకులు తొలగేనా..?
జిల్లాలోని నెట్టెంపాడు, ఆర్డీఎస్, గట్టు ఎత్తిపోతల పథకాలకు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేశాం. సేకరించాల్సిన భూమిలో ఇప్పటికే 65శాతం భూమిని సేకరించాం. మల్లమ్మకుంట రిజార్వాయర్కు సంబంధించి రైతులతో ఇప్పటికే రెండు పర్యాయాలు సమావేశం ఏర్పాటుచేశాం. కాని రైతుల నుంచి సానుకూలత రాలేదు. మరోసారి సమావేశం ఏర్పాటుచేసి మలమ్మకుంట రిజర్వాయర్కు ఇబ్బందులను తొలగిస్తాం. – రిజ్వాన్ బాషా షేక్, కలెక్టర్, జోగుళాంబ గద్వాల ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు అమరచింత: గురుపౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం అమరచింత, ఆత్మకూర్ మండలాల్లోని షిర్డీసాయి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయం నుంచే ఆలయానికి తరలివచ్చి సాయినాథుడికి పూజలు చేశారు. ఆలయంలో జరిగిన హోమం, యజ్ఞం, అభిషేకం, పల్లకీసేవలో మహిళా భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులందరికి అన్నప్రసాద వితరణ చేశారు. గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బీడు భూముల్లో సాగునీటిని పారించి సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనులు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నా యి. పాలమూరు–రంగారెడ్డి, ఎంజీకేఎల్ఐ, భీమా, నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతలతో పాటు ఆర్డీఎస్ ప్రాజెక్టుల ద్వారా 10 లక్షల ఎకరాలకు నీరందాల్సి ఉండగా.. అసంపూర్తి పనులతో కేవలం 6–7 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. పెండింగ్ పనులకు నిధుల లేమితో పాటు భూసేకరణ ప్రక్రియ ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్నాయుడు జిల్లాల వారీగా ఇరిగేషన్, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమీక్షిస్తూ.. భూ సేకరణ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నడిగడ్డలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 2లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సిన నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా కేవలం 1.45లక్షల ఎకరాలకే నీరందుతోంది. రెండు దశాబ్దాల క్రితం ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకు పదేళ్లుగా నిధులు లేకపోవడంతో పాటు 99, 100 ప్యాకేజీల పరిధిలో 541 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఎనిమిదేళ్ల క్రితం చేపట్టిన గట్టు ఎత్తిపోతల పథకం కుడి, ఎడమ కాల్వల పరిధిలో 249 ఎకరాలు, రిజర్వాయర్ నిర్మాణానికి మరో 283 ఎకరాలు అవసరం ఉండటంతో పనులు ముందుకు సాగడం లేదు. ఆర్డీఎస్ ద్వారా 87,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా.. అంతర్రాష్ట్ర జలవివాదం కారణంగా వానాకాలంలో గరిష్టంగా 50వేల ఎకరాలకు మించి సాగునీరు అందిన పరిస్థితి లేదు. దీంతో గత ప్రభుత్వం రాజోళి మండలంలో మలమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రిజర్వాయర్ నిర్మాణానికి 567 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా.. స్థానిక రైతులు అభ్యంతరం తెలుపుతుండటంతో పనులకు అడ్డంకిగా మారింది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు సైతం వివిధ దశల్లో పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు కింద సివిల్, మెకానికల్ పనులతో పాటు, భూ సేకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 4.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉండగా.. రెండు దశాబ్దాలుగా పనులు పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. ఇక్కడ సుమారు 130 ఎకరాల వరకు భూమిని సేకరించి పనులను పూర్తిచేయాల్సి ఉంది. అసంపూర్తి పనులతో కేవలం 2.50లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. భీమా ఎత్తిపోతల పథకం కింద 4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉండగా.. రెండు దశాబ్దాలుగా పనులు పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. నెట్టెంపాడు ప్రాజెక్టులోని గూడెందొడ్డి రిజర్వాయర్ భూ సేకరణ పూర్తయితేనే పెండింగ్ పనులు ముందుకు పాలమూరు ప్రాజెక్టుల పూర్తిపై సీఎం ప్రత్యేక దృష్టి అధికారులతో ఆర్అండ్ఆర్ కమిషనర్ వరుస సమీక్షలు -
భూ వివాదాలకు కోర్టుల్లోనే శాశ్వత పరిష్కారం
వనపర్తి: భూ వివాదాలు సివిల్ స్వభావం కలిగినవని.. వాటి శాశ్వత పరిష్కారం కోర్టుల్లోనే సాధ్యమని ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి ఆమె హాజరై అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భూ వివాదాల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, బెదిరింపులు, ధౌర్జన్యాలు, మోసాలకు పాల్పడితే పోలీసుశాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శకత, నిష్పక్షపాత ధోరణి, వేగవంతమైన స్పందనతో పోలీసుశాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. మొత్తం 25 వినతులు రాగా వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు ఫోన్చేసి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. -
సీజేపీ ఉద్యమస్ఫూర్తితో ముందుకు సాగుతాం
చిన్నంబావి: ఇటీవల ఢిల్లీలో జరిగిన కాక్రోచ్ జనత పార్టీ (సీజేపీ) ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మలిదశ ఉద్యమానికి శ్రీకారం చూడతామని.. ఈసారి కచ్చితంగా న్యాయం జరిగే వరకు పొరాడుతామని, అవసరమైతే ప్రాణాలను సైతం త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని శ్రీశైలం నిర్వాసితులు వివరించారు. సోమవారం మండలంలోని పెద్దమారూర్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో సర్వస్వం కోల్పోయి దశాబ్దాలు గడుస్తున్నా.. నేటికీ న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. తరాలు మారినా నిర్వాసితుల తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా.. సమస్యను ఎన్నికల హామీగానే తీసుకుంటున్నారే తప్ప అధికారంలోకి వచ్చిన మరుక్షణం పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి జూపల్లి తమకు న్యాయం చేస్తామని చెప్పడం తప్ప చేతల్లో కనిపించడం లేదని, మంత్రి 30 ఏళ్లు అధికారంలో ఉన్నా తమకు ఏ మాత్రం న్యాయం జరగడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో నిర్వాసితుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు దామోదర్రెడ్డి, దాగోజి గోవిందు, షబ్బీర్, సోమ భాస్కర్, బాలయ్య, మైనుద్దీన్, మహబూబ్పాషా, జహంగీర్పాషా, రంగస్వామి, కొండన్న, రాఘవేంద్ర శెట్టి, కాంతయ్య, గూడెం బాలస్వామి, పెద్దమారూర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ఉద్యాన సాగుపై దృష్టి సారించాలి
వనపర్తి: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి కృష్ణా, గోదావరి జలాశయాల్లో నీటిమట్టాలు తగ్గే అవకాశం ఉన్నందున రైతులు తక్కువ నీటితో సాగయ్యే ఉద్యాన పంటలు, ముఖ్యంగా కూరగాయల సాగుపై దృష్టి సారించాలని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. డి.రాజిరెడ్డి సూచించారు. జిల్లాలోని నందిమళ్లగడ్డలో కూరగాయలు సాగు చేస్తున్న రైతుల పొలాలను సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ.. సమగ్ర సాగు విధానాలు అనుసరించడంతో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు పొందడంతో పాటు రైతులకు నికర లాభాలు పెరుగుతాయని తెలిపారు. ఆధునిక సాంకేతికత సాగు, సూక్ష్మ నీటిపారుదల విధానాలను వినియోగించి తక్కువ నీటితోనే కూరగాయల సాగు చేపట్టి మంచి ఆదాయం పొందవచ్చన్నారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా. భగవాన్, డీన్ ఆఫ్ హార్టికల్చర్ డా. చీనా, విశ్వవిద్యాలయ కన్సల్టెంట్ డా. వీరాంజనేయులు, జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్, ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డా. వీణాజోషి, కేవీకే శాస్త్రవేత్త డా. రాజేందర్రెడ్డి, మండల ఉద్యాన అధికారులు శ్రీకాంత్, సాయితేజ, సురేష్, డా. శంకరస్వామి, గ్రామ రైతులు పాల్గొన్నారు. -
ఆగని సంతర్పణం..!
పెబ్బేరులో ఏళ్లుగా నిలిచిన సంత బహిరంగ వేలం ● కోర్టు వివాదంతో నిలిపివేత ● అక్రమార్కుల చేతికి ఆదాయం ● నకిలీ రసీదులతో వసూళ్లకు తెగబడిన వైనం ● నిద్రావస్థలో పాలకవర్గం విచారించి చర్యలు తీసుకుంటాం.. కొందరు అక్రమార్కులు పుర కార్యాలయం పేరిట రసీదులు ముద్రించి సంతలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు మా దృషికి వచ్చింది. విచారించి చర్యలు తీసుకుంటాం. గతంలో వీరిపై స్థానిక పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. సంతకు ప్రభుత్వ స్థలం లేదు. ప్రస్తుతం నిర్వహిస్తున్న స్థలం కోర్టు కేసులో ఉన్నందున ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నాం. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి సైతం తీసుకెళ్తాం. – గణేష్, పుర కమిషనర్, పెబ్బేరు త్వరలోనే పరిష్కారం.. సంత స్థల వివాద పరిష్కారానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కృషి చేస్తున్నారు. కోర్టు తీర్పు వరకు వేచి చూ డాలి. త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం. పురపాలికకు చెల్లించే సొమ్ము వేణుగోపాలస్వామి ట్రస్ట్ పేరిట బ్యాంకులో జమ చేస్తున్నాం. – అక్కి శ్రీనివాస్గౌడ్, పుర చైర్మన్, పెబ్బేరు ‘రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం సమకూరే సంతగా పెబ్బేరు సంతకు పేరుంది. పుర ఖజానాకు చేరాల్సిన రూ.కోట్ల ఆదాయం కొందరు అక్రమార్కులు దోచేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. ఇక్కడి అధికార పాలకవర్గం నిద్రావస్థలో ఉండటంతో అక్రమార్కులు యథేచ్ఛగా ఆదాయాన్ని కొల్లగొడుతున్నారన్న విమర్శలున్నాయి. ఈ విషయాన్ని మీడియా, పలు రాజకీయ పార్టీలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం కనిపించడం లేదు.’ వనపర్తి: పెబ్బేరులోని వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన 30.19 ఎకరాల భూమిలో 16 దశాబ్దాలుగా ప్రతి శనివారం వారాంతపు సంత కొనసాగేది. సంతపై వచ్చే ఆదాయాన్ని నాడు పంచాయతీ, నేడు పుర పాలకవర్గం తీర్మానం మేరకు పట్టణాభివృద్ధికి వెచ్చించడం ఆనవాయితీ. ఈ స్థలం తమదంటూ ఆలయ అర్చకులు, దేవాదాయశాఖ మధ్యలో కొన్నేళ్లపాటు కోర్టులో కేసు నడుస్తోంది. నాలుగేళ్ల క్రితం తీర్పు వెలువడగా.. నాటి నుంచి ఇప్పటి వరకు ఏటా నిర్వహించే సంత వేలం నిలిపివేశారు. చివరిసారి నిర్వహించిన వేలంలో పురపాలికకు రూ.కోట్లలోనే ఆదాయం సమకూరింది. సీపీఎం నాయకుల ఫిర్యాదుతో వెలుగులోకి.. ఇటీవల సీపీఎం జిల్లా కమిటీ నాయకులు పలువురు పెబ్బేరు సంతలో అక్రమార్కులు చేస్తున్న దోపిడీతో పాటు పురపాలిక పేరుతో ముద్రించిన నకిలీ రసీదుల విషయాన్ని కలెక్టర్ ఆదర్శ్ సురభి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మరోసారి పెబ్బేరు సంత ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్తుందనే అంశం తెరపైకి వచ్చింది. ఈ విషయంపై పుర అధికార, పాలకవర్గం స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
హే.. కృష్ణా!
గద్వాల: కృష్ణా బేసిన్లో రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాలకు ఎగువ నుంచి వరద తాకిడి ఎట్టకేలకు మొదలైంది. కృష్ణమ్మ పరవళ్లను చూసిన అన్నదాతల్లో రేకెత్తిన ఆశలు.. ఎక్కువసేపు నిలవలేదు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే నిరాశగా మారాయి. ఎగువ ప్రాంతంలోని నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి వరద ఉధృతి తగ్గింది. ఆదివారం రాత్రి 33వేల క్యూసెక్కుల వరద రాగా.. సోమవారానికి 27వేల క్యూసెక్కులకు పడిపోయింది. దీంతో వచ్చిన వరద నీటిని జూరాల జలాశయం ఎఫ్ఆర్ఎల్ 3,018 మీటర్ల వరకు నింపి.. తాగునీటి అవసరాలకు వినియోగించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వరద జలాలతో వానాకాలంలో పంటలు సాగుచేసుకోవచ్చని ఆశపడిన రైతన్నలకు నిరాశే ఎదురైంది. అగమ్యగోచరంగా ఆయకట్టు సాగు.. వానాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఎల్నిన్ ప్రభావంతో వరుణుడు మోహం చాటేశాడు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సరైనా వర్షాలు లేక పంట పొలాలు బీడుపడ్డాయి. జూరాల ప్రాజెక్టు ఆయకట్టులో కూడా అదే పరిస్థితి నెలకొంది. గతేడాది మే నెలలోనే వరద జలాలు జూరాలకు చేరగా.. ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. వర్షాకాలంలో జూరాల జలాశయం అడుగంటిందంటే.. పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తుంది. ఈ నేపథ్యంలో జూరాల ప్రధాన ఎడమ కాల్వ పరిధిలోని 69వేల ఎకరాలు, కుడి కాల్వ పరిధిలోని 37,400 ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. ఆరుతడి పంటల వైపు.. రాష్ట్రంలో తలెత్తిన ఎల్నినో పరిస్థితులను గుర్తించిన అధికారులు.. వానాకాలంలో తక్కువ నీటి వినియోగం ఉన్న పంటలు సాగుచేయాలని రైతులకు సూచిస్తున్నారు. ఆరుతడి పంటలైన మినుములు, పెసలు, చిరుధాన్యాలు, మొక్కజొన్న వంటి పంటల సాగుతో కలిగే లాభాలను వివరిస్తున్నారు. అయితే జూరాల ఆయకట్టులో చాలా వరకు వరిసాగు తప్ప.. ఇతర పంటలను సాగుచేయడానికి రైతులు మొగ్గు చూపడం లేదు. 80వేల ఎకరాల్లో నారుమళ్లు.. ఏటా వానాకాలంలో జూరాల ఆయకట్టు రైతులు వరిసాగు చేస్తూ వస్తున్నారు. అయితే ఈసారి పరిస్థితులు పూర్తి భిన్నంగా ఏర్పడ్డాయి. అయితే రైతులు మాత్రం వరుణ దేవుడు కరుణించకపోతాడా అన్న భరోసాతో యథావిధిగానే వరిపంట సాగుచేసేందుకు సిద్ధమయ్యారు. ఎడమ, కుడి కాల్వల పరిధిలో సుమారు 80వేల ఎకరాలకు పైగా నారుమళ్లు పోసుకున్నారు. అయితే మూడు రోజులుగా జూరాలకు వరద వచ్చి చేరుతుండటంతో రైతుల్లో ఆశలు రేకెత్తాయి. అయితే రెండు రోజులకే వరద తగ్గిపోవడంతో అన్నదాతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు రోజుల వ్యవధిలోనే జూరాలకు తగ్గిన వరద వరద జలాల్లో తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం ప్రశ్నార్థకంగా 1.9లక్షల ఆయకట్టు సాగు ఆందోళనలో అన్నదాతలు -
పొలంబాట ఆక్రమించారు..
గ్రామంలోని 10 మంది రైతులం 15 ఎకరాలు సాగు చేసుకోవడానికి 70 ఏళ్లుగా సర్వేనంబర్ 467 ప్రభుత్వ భూమిలో నుంచి పొలానికి వెళ్తున్నాం. గ్రామానికి చెందిన రైతు బండారు చంద్రయ్య దారిని ఆక్రమించి రాళ్లతో గోడ కట్టి రాకపోకలు నిలిపివేశారు. మోఖాపై విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశాం. – పెద్దదగడ రైతులు, చిన్నంబావి మండలం భూ పరిహారం చెల్లించాలి.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా రెండేళ్ల కిందట గ్రామశివారులోని 25 మంది రైతుల భూముల్లో నుంచి డీ–5 కాల్వను తవ్వారు. కాల్వ తవ్వకంతో 22 ఎకరాల భూమి కోల్పోయాం. ఇప్పటి వరకు నష్ట పరిహారం చెల్లించ లేదు. మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం చెల్లించాలని కలెక్టర్కు విన్నవించాం. – పర్వతాపూర్ రైతులు, ఖిల్లా ఘనపురం మండలం ● -
అర్జీల పరిష్కారంలో వేగం పెంచాలి
వనపర్తి/వనపర్తి రూరల్: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా ప్రజావాణికి వచ్చిన అర్జీలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించి ఫిర్యాదుదారుడికి సమాచారం ఇవ్వాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టర్లోని సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజావాణికి అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, వినోద్కుమార్తో కలిసి ఆయన హాజరై అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా అర్జీలను సంబంధిత అధికారులకు పంపించి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించడంతో పాటు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. సంబంధిత అంశం తమ శాఖ పరిధిలో కానిదైతే సంబంధిత శాఖకు లేఖ రాస్తూ పంపించాలని సూచించారు. ఉదయం 10.30 నుంచి మధాహ్నం భోజన విరామ సమయం వరకు జరిగిన ప్రజావాణికి 45 అర్జీలు, ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 2 వినతులు వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య, శిక్షణ ఉప కలెక్టర్ శ్రావ్య, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘సర్’ను నిర్లక్ష్యం చేయొద్దు : మాజీ ఎమ్మెల్యే
పాన్గల్: ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను నిర్లక్ష్యం చేయొద్దని.. గడువులోగా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించి అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటును కాపాడుకోవాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఎల్ఏల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ శ్రేణులు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేస్తూ అర్హుల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా జాగ్రత్త పడాలన్నారు. గ్రామాల్లో అందుబాటులో లేని ఓటర్లను ఫోన్ ద్వారా సంప్రదించి వివరాలు సేకరించి ఫారాలు అందించాలని సూచించారు. నియోజకవర్గంలో ఏకంగా 24 వేల డబుల్ ఓట్లు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. మంత్రి జూపల్లి నియోజకవర్గంలో పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మంత్రికి అఽధికార దాహం తప్ప నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, పనిచేసే కార్యకర్తలకు తప్పక గుర్తింపు ఉంటుందని భరోసానిచ్చారు. కిష్టాపూర్ సమీపంలో రామన్నగట్టు రిజర్వాయర్ నిర్మాణంతో మండలంలోని సాగు, తాగునీటి ఇబ్బందులు తొలగుతాయని.. చేపట్టే వరకు పార్టీ పోరాడుతుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వీరసాగర్, చంద్రశేఖర్నాయక్, సుధాకర్యాదవ్, తిలకేశ్వర్గౌడ్, రాజేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్లో చేరిక.. మండలంలోని శాగాపూర్ 5వ వార్డు సభ్యుడు లక్ష్మీనర్సింహ, మాజీ వార్డు సభ్యుడు కుర్మయ్య మాజీ ఎమ్మెల్యే బీరం సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ నాయకులు తిరుపతయ్యయాదవ్, కృష్ణయ్యయాదవ్, డా. తిరుపతయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
పుట్టిన ఊర్లో ఉండాలని..
నేను ఇతర ప్రాంతాల్లో ఉంటున్నా. ఊరిలో ఏ కార్యక్రమం జరిగినా వస్తుంటాం. అక్కడ ఓటు వద్దని.. ఇక్కడే ఉంచుకున్నా. ఏ ఎన్నిక వచ్చినా సొంత ఊరుకు వచ్చి ఓటు వేయడం ఇష్టం. అందుకోసం ఎన్యూమరేషన్ ఫారం నింపి వెళ్లాను. మా ఓటు మా ఊరిలో ఉంటేనే ఆనందం. – కట్టా జనార్దన్రెడ్డి, ఉప్పునుంతల అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా బీఎల్ఓలు చొరవ చూపాలి. ఆగస్టు 3 వరకు ఇంటింటి సర్వే చేపట్టి.. పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ చేపట్టాక 10న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేస్తాం. ఆపై అభ్యంతరాలు స్వీకరించి.. పరిశీలన అనంతరం 12న తుది ఓటరు జాబితా విడుదలవుతుంది. డిజిటలైజేషన్ వందశాతం పూర్తయ్యేలా రాజకీయ పార్టీల నాయకుల సహకరించాలి. – హేమంత కేశవ పాటిల్, కలెక్టర్ ● -
అర్హుల పేర్లు ఓటరు జాబితాలో ఉండాలి
వనపర్తిటౌన్: ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా నిర్వహిస్తున్న ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ఓటర్లు తుది జాబితాలో కచ్చితంగా ఉండేలా చూడాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కోరారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని 9వ వార్డులో సర్ ప్రక్రియను పరిశీలించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకమని, మృతిచెందిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించడంతో పాటు దొంగ ఓట్లకు తావివ్వొద్దన్నారు. అదేవిధంగా బీఎల్వోలు, బీఎల్ఏలకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు దేవర్ల నర్సింహ, డేగ మహేశ్వర్రెడ్డి, చిట్యాల రాము, శ్రీనివాసులు, బేదడి కుమార్, గోవర్ధన్ సాగర్, కిరణ్కుమార్, నాగేంద్రం, నాగనమోని రవి, బీఎల్వోలు అనురాధ, నాగలక్ష్మి ఉన్నారు. సాగునీరు వదలాలి.. వనపర్తి రూరల్: రాజకీయాలు పక్కనబెట్టి రైతులను ఆదుకునేందుకు వెంటనే కన్నెపల్లి, పాలమూరు–రంగారెడ్డితో పాటు అన్ని ఎత్తిపోతల పథకాల మోటార్లను ప్రారంభించి సాగునీరు విడుదల చేయాలని మాజి మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డి చంద్రబాబుకు తాబేదారుగా మారారని.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమైఖ్యవాది, ఆయనకు తెలంగాణ ప్రయోజనాలు పట్టవని ఎద్దేవా చేశారు. సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి తెలంగాణ ప్రజల ఆకలి, ఆకాంక్షల మీద సోయి లేదని పేర్కొన్నారు. ఎల్నినో నేపథ్యంలో ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని ఒడిసిపట్టడాన్ని సర్కారు మరిచిందని తెలిపారు. కుంటిసాకులతో పంటలను ఎండబెడితే అన్నదాతలు కన్నెర్ర చేయడం ఖాయమని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే మోటార్లు ప్రారంభించి ఎత్తిపోతల పథకాల కింద ఉన్న చెరువులు, కుంటలు నీటితో నింపాలని డిమాండ్ చేశారు. ‘పీఆర్సీ వెంటనే ప్రకటించాలి’ వనపర్తిటౌన్: అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పీఆర్సీ ప్రకటిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కాంగ్రెస్పార్టీ మరిచిందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రవిప్రసాద్గౌడ్, ప్రధాన కార్యదర్శి డి.కృష్ణయ్య ఆరోపించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఊర్దూ మీడియం హైస్కూల్లో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా.. నేటికీ పీఆర్సీ ప్రకటించడం లేదని, ఇకపై తాత్సారం చేస్తే పోరాటాలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే ఆరు విడతల డీఏలు పెండింగ్లో ఉన్నాయని.. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాగే ఓబీఎస్ అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయుల కొరత వేధిస్తోందని, ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ కార్డుల్లో ఎన్నో లోపాలున్నాయని తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి.వెంకటేష్, కె.జ్యోతి, జిల్లా కోశాధికారి తిమ్మప్ప, జిల్లా కార్యదర్శులు పి.శ్రీనివాస్ గౌడ్, ఎండీ హమీద్, జి.మురళి, లక్ష్మణ్ నాయక్, బి.అరుణ తదితరులు పాల్గొన్నారు. -
వర్షాభావాన్ని అధిగమించేందుకే ‘జలసిరి’
మదనాపురం: వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు నీటి సంరక్షణే శాశ్వత పరిష్కారమని డీఆర్డీఓ ఉమాదేవి అన్నారు. ఆదివారం స్థానిక మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన ఎంసీఎల్ఎఫ్ (మోడల్ క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్) శిక్షణకు ఆమె హాజరై సంఘ సభ్యులకు ‘విజన్ బిల్డింగ్’ అనే అంశంపై అవగాహన కల్పించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం ‘జలసిరి’ కార్యక్రమాన్ని సోమవారం నుంచి గ్రామాల్లో విస్తృతంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. రైతులు, మహిళా సంఘాల సభ్యులకు నీటి సంరక్షణ ప్రాధాన్యంపై అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భూగర్భ జలమట్టం పెంపునకు ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడుగుంట, ప్రతి రైతు పొలంలో ఊట కుంటలు ఏర్పాటు చేసుకునేలా చైతన్యపర్చాలన్నారు. ప్రతి నీటి చుక్కను సంరక్షించడంతో భవిష్యత్లో నీటి కొరతను అధిగమించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఐబీ ఏపీఎం వెంకన్న, ఏపీఎంలు, ఏపీఓలు, సీసీలు, వీఓఏలు, మండల సమాఖ్య సిబ్బంది, కార్యవర్గ సభ్యులు, గ్రామ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
జూరాలకు కృష్ణమ్మ పరవళ్లు
గద్వాల: ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం మొదలైంది. ఈ క్రమంలో గత రెండు రోజుల క్రితం కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి వరద నీటిని దిగువకు వదలడంతో కృష్ణమ్మ పరవళ్లు ఆదివారం జూరాలకు చేరాయి. ఈ క్రమంలో ఎగువ నుంచి 18,300 క్యూసెక్కుల కొత్త నీరు వచ్చింది. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.356 మీటర్లు కాగా.. ప్రస్తుతం 316.310 మీటర్ల 5.653 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎల్నినో ప్రభావంతో వరిపంట సాగుపై ఆశలు వదులుకున్న రైతులు కృష్ణానదిలో క్రమంగా నీటిమట్టం పెరుగుతుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జూరాల జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం -
సాగు, తాగునీటి ఇబ్బందులు
కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల వల్లే.. ● మాజీమంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్గౌడ్ మక్తల్/ కృష్ణా: కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న జలదోపిడిని అరికట్టకపోతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవని మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం బీఆర్ఎస్ బృందంతో కలిసి ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా వారు కృష్ణానదిపై ఉన్న గూగల్ ప్రాజెక్టు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడంతో దిగువకు వచ్చే నీరు తగ్గిపోతుందని, ప్రస్తుతం వర్షాలు తక్కువగా కురుస్తున్నందున తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచే చర్యలు తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే జూరాలలో పూడిక పేరుకుపోవడంతో 11 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేస్తున్నామని పేర్కొన్నారు. 33 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేందుకు ప్రాజెక్టు నిర్మిస్తే.. కేవలం 6 నుంచి 11 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుతున్నామన్నారు. ఈ విషయం గ్రహించే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించి, ఎక్కడికక్కడ నీటిని నిల్వలు పెంచేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మక్తల్ ఎమ్మెల్యేగా చిట్టెం నర్సిరెడ్డి ఉన్న సమయంలో నియోజకవర్గంలో కృష్ణా, భీమానదులపై ఎత్తిపోతల పథకాలు నిర్మించారని, ప్రస్తుతం నదిలో నీళ్లులేక అవి మూతపడ్డాయన్నారు. ఏడారిగా మారుతుంది.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆరోపించారు. కృష్ణా, భీమా నదులపై దివంగత ఎమ్మెల్యే నర్సిరెడ్డి నిర్మించిన ఎత్తిపోతల ప్రాజెక్టులు నిరుపయోగంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభుత్వం కొంతకాలంగా ఎగువన ఉన్న ప్రాజెక్టుల ఎత్తును పెంచడంతో పాటు కొత్తగా ఎక్కడపడితే అక్కడ బ్రిడ్జి కం బ్యారేజీలు నిర్మిస్తుందని, ఇదిలాగే కొనసాగితే త్వరలోనే ఉమ్మడి పాలమూరు ఎడారిగా మారుతుందని వాపోయారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో సాగునీటికి ఇబ్బందులు కలుగకుండగా తగు చర్యలు తీసుకోవాలని, కూసుమర్తి వద్ద బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి, మక్తల్, దేవరకద్ర, నారాయణపేట, షాద్నగర్ మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఎస్.రాజేందర్రెడ్డి, అంజయ్యయాదవ్, నాయకులు శ్రీనివాస్గుప్తా, నర్సింహగౌడ్, మహిపాల్రెడ్డి, శివరాజ్పాటిల్, సంతోష్, సురేష్రెడ్డి, నర్సింహారెడ్డి, ఈశ్వర్ పాల్గొన్నారు. -
పాలకవర్గానికి పట్టింపేది?
నేడు వనపర్తి పుర కౌన్సిల్ సమావేశం వనపర్తిటౌన్: పుర ఎన్నికలు జరిగి ఏడు నెలలు.. పాలకవర్గం కొలువుదీరి ఆరు నెలలు పూర్తయినా ఇప్పటి వరకు కేవలం రెండు సాధారణ కౌన్సిల్ సమావేశాలు మాత్రమే నిర్వహించడంపై పుర ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించాల్సిన కౌన్సిల్ సమావేశాలు నిర్వహించడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల లోలోపల ఒక సభ నిర్వహించినట్లు చెబుతున్నా.. అందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన కూడా పుర కార్యాలయం నుంచి విడుదల కాకపోవడం గమనార్హం. రహస్యంగా కౌన్సిలర్లతో సంతకాలు తీసుకొని సమావేశం నిర్వహించే ముందు, తర్వాత ఎలాంటి ప్రకటన లేకుండా ముగిసినట్లు చెప్పుకోవడం పాలక మండలి నిర్లక్ష్యానికి అద్ధం పడుతోంది. దీనిపై ప్రతిపక్ష, అధికార పార్టీ కౌన్సిలర్లు బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమావేశాల నిర్వహణ గాలికొదిలేయడంతో పుర పాలనలో పారదర్శకత లోపించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం నెలకొకసారి కౌన్సిల్ సమావేశం నిర్వహించాల్సి ఉండగా.. మార్చిలో బడ్జెట్ మీటింగ్, మే నెలలో సాధారణ సమావేశం నిర్వహించి చేతులు దులుపుకొన్నారు. నిబంధనల ప్రకారం మూడు నెలల పాటు సమావేశం జరపకపోతే పాలకమండలిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సమావేశాలు జరిగితేనే చైర్పర్సన్కు రూ.15,600, వైస్ చైర్మన్కు రూ.6,900, కౌన్సిలర్లకు రూ.3,250 చొప్పున గౌరవ వేతనం తీసుకోవాలి. సమావేశాలు నిర్వహించకుంటే గౌరవ వేతనం తీసుకునే అవకాశం ఉండదని సీనియర్ కౌన్సిలర్లు, అధికారులు పేర్కొంటున్నారు. అభివృద్ధిపై ప్రభావం.. పట్టణాభివృద్ధిలో భాగంగా వార్డుల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పైప్లైన్ల లీకేజీల మరమ్మతు తదితర అంశాలను ప్రతి నెల కౌన్సిల్లో ఆమోదించాల్సి ఉంటుంది. చైర్పర్సన్ అధ్యక్షతన సభ నిర్వహించాలి. చైర్పర్సన్ అందుబాటులో లేకపోతే వైస్ చైర్మన్ కూడా సభ నడపొచ్చు. ఒకవేళ ఆయన కూడా అందుబాటులో లేకపోతే ఎవరైన ఒక కౌన్సిలర్ కౌన్సిల్ను కొనసాగించొచ్చు. సభలో 1/3 మెజార్టీ సభ్యులు ఉంటే కౌన్సిల్ నిర్వహణకు అర్హత ఉంటుంది. కానీ పాలక పెద్దలు తాము అనుకుప్పుడే సభలు జరగాలనే ధోరణితోనే ప్రతి నెల నిర్వహించడం లేదని అధికారపార్టీ సభ్యులు వాపోతున్నారు. కో–ఆప్షన్ ఊసే లేదు.. పుర ఎన్నికలు జరిగి 7 నెలలు గడుస్తున్నా.. కో–ఆప్షన్ ఎన్నిక ఉంటుందా? ఉండదా అనేది అధికారపార్టీ ఆశావహుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో హామీ పొందిన ఆశావహులు ఎదురుచూస్తున్న ఎన్నిక జరగడం లేదు. పెబ్బేరు, వనపర్తి మున్సిపాలిటీలో 20మందికి పైగా దర ఖాస్తు చేసుకున్నా.. ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. గతంలో రెండునెలల్లోపే ఈ ప్రక్రియ ముగిసేది. చైర్పర్సన్ మౌనం వీడేనా..? ఇప్పటి వరకు జరిగిన రెండు సాధారణ సమావేశాల్లో చైర్పర్సన్ పట్టణ ఎజెండా అంశాల, కౌన్సిలర్లు లేవనెత్తుతున్న అభ్యంతరాలు, సమస్యలపై చైర్పర్సన్ మౌనంగానే ఉంటున్నారు. ఈ మౌనం అధికార పార్టీ సభ్యుల్లో చర్చకు దారితీస్తుంది. ఈ విషయమై చైర్పర్సన్తో ప్రస్తావించేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు. వనపర్తి పురపాలిక ఏడు నెలల్లో కేవలం రెండుసార్లే నిర్వహణ కో–ఆప్షన్ ఎన్నికపై వీడని సందిగ్ధం ఈ సమావేశంలోనైనా చైర్పర్సన్ గళం విప్పేనా? పుర కమిషనర్ లేకపోవడంతోనే సమావేశాలు నిర్వహించలేదు. ఒక్క జూన్లోనే ఇద్దరు కమిషనర్లు మారడంతో సమావేశం నిర్వహించేందుకు వీలు కాలేదు. కమిషనర్ లేకుండా సభ నిర్వహించడం సాధ్యం కాదు. మున్సిపాలిటీలోని పలు విభాగాల్లో అధ్యాయనం చేసేందుకు ఎమ్మెల్యే సూచించిన కమిటీలను త్వరలోనే వేస్తాం. – మధుసూదన్ గౌడ్, వైస్ చైర్మన్, వనపర్తి పురపాలిక -
సొంతూరులోనే ఓటు
● ఎన్యూమరేషన్ ఫారాలు అప్పగిస్తున్న జనం ● సర్ ప్రక్రియలో ఒకటి కంటే ఎక్కువ ఉన్న ఓట్లకు చెక్ ● ఓటరు జాబితా నుంచి తొలగింపు దిశగా చర్యలు అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో వేగంగా సాగుతోంది. గ్రామాల్లో బీఎల్ఓలు ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ, ఓటర్ల వివరాలను ధ్రువీకరిస్తుండగా.. సూపర్వైజర్లు, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో డిజిటలైజేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. అయితే ఉన్నత విద్య, ఉద్యోగాలు, జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిలో ఎక్కువ మంది పుట్టిన ఊరిలో ఓటు ఉంచుకునేందుకే మక్కువ చూపుతున్నారు. స్వయంగా స్వగ్రామానికి వచ్చి ఎన్యూమరేషన్ ఫారాలు నింపి బీఎల్ఓలకు అందిస్తున్నారు. అసలైన ఓటర్లు 75 – 85 శాతమే.. ఉమ్మడి జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో అసలైన ఓటర్లు 75 నుంచి 85శాతం మాత్రమే మిగలనున్నారు. మిగతా ఓటర్లు మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు, మరికొందరు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు కలిగి ఉన్నట్లు లెక్కలు తేలుతున్నాయి. అయితే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బీఎల్ఓలకు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలన్నింటిని వందశాతం డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. ఇందులో అసలైన ఓటర్లను గుర్తిస్తూనే.. మిగిలిన వారిని నాలుగు కేటగిరీల్లో నమోదు చేయాలి. బీఎల్ఓల విచారణలో ఓటరు మరణించినట్లు తేలితే మృతుల కేటగిరీలో, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతే పర్మినెంట్గా షిఫ్ట్ అయినట్లుగా, ఒకే వ్యక్తి రెండు చోట్ల ఓటరుగా నమోదైతే సదరు ఓటరు ఎంపిక చేసుకున్న చోట జాబితాలో ఉంచి.. రెండో దాని డూప్లికెట్గా, ఫారాలు తీసుకోని వారు, తిరిగి ఇవ్వని వారి పేర్లను ఇతర కేటగిరీలో చేరుస్తున్నారు. ఇలా నమోదైన వారి పేర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వందశాతం పూర్తికి.. క్షేత్రస్థాయిలో బీఎల్ఓలకు ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తిస్థాయిలో అందక డిజిటలైజేషన్ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఒకవైపు గడువులోగా డిజిటలైషన్ ప్రక్రియ వందశాతం పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుండటం.. మరోవైపు టెక్నికల్ అధికారుల నుంచి పూర్తి సహకారం అందకపోవడంతో బీఎల్ఓలు తలలు పట్టుకుంటున్నారు. ఆన్లైన్లో డిజిటలైజేషన్ చేసుకున్న వారు సైతం ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయాల్సి ఉండగా.. చాలామంది ఇవ్వడం లేదని బీఎల్ఓలు పేర్కొంటున్నారు. ఎన్యూమరేషన్ ఫారం డిజిటలైషన్ ప్రక్రియ పూర్తి చేస్తుండగా.. సాంకేతిక సమస్యతో ‘నో మ్యాపింగ్’ అని వస్తుండటంతో మరోసారి సరిచేయాల్సి రావడం తలనొప్పిగా మారింది. ఇంకా ఓటర్ల నుంచి 10 నుంచి 15 శాతం ఎన్యూమరేషన్ ఫారాలు అందాల్సి ఉందని చెబుతున్నారు. పట్టణాల్లో మందకొడిగా.. సర్ డిజిటలైజేషన్ ప్రక్రియ గ్రామాల్లో జోరుగా.. పట్టణాల్లో మందకొడిగా సాగుతోంది. కొందరు ఓటర్లు ఎన్యూమరేషన్ పత్రాలు తిరిగి ఇవ్వడంలో జాప్యం చేస్తుండటంతో అధికారులు పాట్లు పడుతున్నారు. ఓటర్లకు స్వయం ఫోన్చేసి అడుగుతున్నా అప్పుడు, ఇప్పుడు అని అంటున్నారని బీఎల్ఓలు వాపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ఇలా.. జిల్లా మొత్తం ఓటర్లు డిజిటలైజేషన్ ఫారాలు శాతం రానివి మహబూబ్నగర్ 7,32,488 5,93,167 55,743 86.12 నాగర్కర్నూల్ 7,31,632 5,80,793 56,482 79.38 వనపర్తి 2,75,570 2,18,488 16,515 79.29 జోగుళాంబ గద్వాల 5,03,859 4,19,973 43,961 83.32 నారాయణపేట 4,95,574 3,93,911 45,959 79.49 -
కేంద్ర ప్రభుత్వంపై యువత విజయం : సీపీఎం
అమరచింత: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టే యత్నంలో భాగంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై యువత విజయం హర్షనీయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. ఆదివారం పట్టణంలోని జీఎస్ భవనంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై దేశ రాజధానిలో యువత చేసిన ఆందోళన చివరకు విద్యాశాఖ మంత్రి రాజీనామాకు దారితీసిందన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది కేవలం మొదటి అడుగు మాత్రమేనని.. ఇప్పుడు ఎన్టీఏను రద్దు చేయాలని కోరారు. విద్యార్థి వ్యతిరేక, వాణిజ్యపరమైన, మతతత్వ ధోరణి కలిగిన ఎన్ఈపీ –2020 కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనకారులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని, విద్యార్థులపై అమానుషంగా దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోరాట మార్గంలో అన్నిరకాల బెదిరింపులను ధైర్యంగా ఎదుర్కొని దృఢంగా నిలిచిన విద్యార్థి సంఘాలకు అభినందనలు తెలిపారు. క్రీడలు, కళలు, సినిమా, సంస్కృతి తదితర రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ఉద్యమానికి మద్దతుగా నిలవడం సంతోషకరమన్నారు. ఐక్య పోరాటాలు విజయాన్ని సాధిస్తాయని చెప్పడానికి ఇదో ఉదహారణ అన్నారు. డిమాండ్లన్నీ నెరవేరే వరకు యువత ధృడంగా ఉంటూ పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఎం జిల్లాకార్యదర్శి పుట్టా ఆంజనేయులు, కార్యదర్శివర్గ సభ్యులు జబ్బార్, సీనియర్ నాయకులు మహమూద్, మండల కార్యదర్శి జీఎస్ గోపి, వెంకటేష్, అజయ్, రాఘవేంద్ర పాల్గొన్నారు. -
సాగునీరు పారేనా..?
జూరాల జలాశయానికి కొనసాగుతున్న వరద ● వరి సాగుకు సన్నద్ధమవుతున్న ఆయకట్టు రైతులు ● ప్రధాన ఎడమ కాల్వ పరిధిలో 85 వేల ఎకరాల ఆయకట్టు ● నీటి విడుదలపై స్పష్టత లేదంటున్న అధికారులు ●నేను ఇప్పటికే 16 ఎకరాల్లో వరి సాగు చేశాఆ. బోరు ద్వారా పారే నీరు సరిపోక ఎండుముఖం పడుతోంది. జూరాల జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని ప్రధాన ఎడమ కాల్వ ద్వారా విడుదల చేసి పంట ఎండిపోకుండా కాపాడాలి. – ఎర్రన్న, రైతు, మూలమళ్ల జూరాల ప్రధాన ఎడమ కాల్వకు అనుసంధానంగా ఉన్న అమరచింత ఎత్తిపోతల పథకానికి సైతం నీటిని అందించడంతో ఆయకట్టు రైతులు వరి సాగుచేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నారుమడులను సిద్ధం చేసుకొని సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం చొరవచూపి సాగునీరు అందించి ఆదుకోవాలి. – కృష్ణారెడ్డి, రైతు, అమరచింత ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఇప్పుడిప్పుడే ఎగువ నుంచి వరద వచ్చి చేరుతోంది. సాగునీటి విడుదలపై ప్రభుత్వం ప్రకటన చేయాల్సి ఉంది. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. అధికారికంగా ఆదేశాలు వస్తే తప్ప సాగునీటి విడుదలపై స్పష్టత ఇవ్వలేం. – షమీ ఉల్లా, డీఈ, పీజేపీ నందిమళ్ల డివిజన్ అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు రెండ్రోజులుగా ఎగువ నుంచి వరద చేరుతుండటంతో ఆయకట్టు రైతుల్లో సాగు ఆశలు చిగురించాయి. కాల్వలకు ఎలాగైనా నీటిని వదులుతారని వరి నారుమడులు సిద్ధం చేసుకోవడంతో పాటు పొలాలు దుక్కిదున్ని చదును చేసే పనులకు సిద్ధమయ్యారు. యాసంగిలో కేవలం 25 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందడంతో.. ఈ ఏడాది వానాకాలంలో పూర్తి ఆయకట్టు 85 వేల ఎకరాలకు సాగునీరు వదులుతారని ఆశించారు. ఎల్నినో ప్రభావంతో సరైన వర్షాలు కురవకపోవడం.. ప్రాజెక్టుకు సకాలంలో వరద చేరకపోవడంతో ఆశలు వదులుకున్నారు. కాగా ఆయకట్టు పరిధిలో అక్కడక్కడ బోరుబావులున్న రైతులు వరి నారుమడులు వేసుకున్నారు. మిగిలిన రైతులు కాల్వ ద్వారా ఎప్పుడు నీరు వస్తుందోనని ఎదురుచూస్తూ ఉండిపోయారు. ఎగువనున్న నారాయణపూర్ డ్యాం క్రస్ట్గేట్లు తెరిచి రెండోజ్రులుగా నీటిని వదలడంతో జూరాలకు 18,300 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండటంతో కాల్వల ద్వారా ఆయకట్టుకు సాగునీరు అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నందిమళ్ల శివారులో వరి నారుమడి -
ఎల్నినోను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
కొత్తకోట రూరల్: ఎల్నినో నేపథ్యంలో తాగునీటి నిర్వహణ, భూగర్భ జలాల సంరక్షణ, వర్షపు నీటి నిల్వ చర్యలపై ప్రత్యేక దృష్టిసారించి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ కోరారు. శనివారం పెద్దమందడి మండలం వీరాయపల్లి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఎల్నినో ప్రభావాన్ని తగ్గించేందుకు గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, తాగునీటి కొరత ఏర్పడకుండా భూగర్భ జలాలను సంరక్షించడంతో పాటు వర్షపు నీటిని ప్రతి గ్రామంలో సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. రైతులు వరి, చెరకు వంటి అధిక నీరు అవసరమున్న పంటల సాగును తగ్గించి ఆరుతడి పంటలు, ఆయిల్పాం సాగు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ సాగు వైపు మళ్లాలని, వ్యవసాయశాఖ అధికారుల సలహాలు తీసుకొని శాసీ్త్రయ పద్ధతుల్లో సాగు చేపట్టాలన్నారు. జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్ పాల్గొన్నారు. నిల్వ గోదాములు తనిఖీ వనపర్తి రూరల్: పెబ్బేరులోని సాయి గోపాల్ రైస్మిల్లుకు కేటాయించిన ధాన్యం ఎర్రవల్లి మండలం బీచుపల్లి సమీపంలో ఉన్న స్టాక్ గోదాంలలో భద్రపర్చారు. శనివారం రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. రాత్రి పొద్దుపోయే వరకు కూడా పూర్తిస్థాయిలో తనిఖీలు కాలేదని సమాచారం. -
కృష్ణమ్మ వచ్చింది
పాలమూరు మురిసేలా.. పుడమితల్లి మెరిసేలా.. సాగు ఆశలు తీర్చేలా.. రైతన్న పంట పండేలా.. కరువును పారద్రోలేలా.. కృష్ణమ్మ వచ్చింది అంటూ అన్నదాతలు సంబరపడ్డారు. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి రెండు రోజుల క్రితం దిగువకు నీటిని విడుదల చేయగా.. శనివారం తెల్లవారుజామున రాష్ట్రంలోని మొట్టమొదటి గ్రామమైన తంగిడి వద్ద తెలంగాణలోకి అడుగుపెట్టింది. కృష్ణానదిలో నీటిని చూసిన తీర ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక పంటలకు అవసరమయ్యే నీరు వచ్చిందని.. ఎల్నినోపై దిగులు పోయిందని అభిప్రాయపడుతున్నారు. – కృష్ణా కృష్ణా మండలంలోని గుడేబల్లూరు వద్ద కృష్ణానదిలో పారుతున్న వరద నీరు -
‘నకిలీ’పై నజర్..!
జిల్లాలో విస్తృతంగా వ్యవసాయ అధికారుల స్పెషల్ డ్రైవ్ ● చిన్నంబావి ఘటనతో రంగంలోకి.. ● ఇద్దరు డీలర్ల అరెస్ట్ ● నాణ్యతపై రైతుల్లో పెరుగుతున్న అనుమానాలు ●వనపర్తి: రాష్ట్రవ్యాప్తంగా కొద్దిరోజులుగా నకిలీ ఎరువులు వెలుగు చూస్తున్న నేపథ్యం.. జిల్లాలోని చిన్నంబావి మండలం వెల్టూరులో అక్రమ డీఏపీ విక్రయాల ఘటనలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని 15 మండలాల వ్యవసాయశాఖ అధికారులతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ జిల్లాలోని సుమారు 300కుపైగా ఉన్న ఫర్టిలైజర్ దుకాణాల్లోని ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల నిల్వలను పరిశీలిస్తున్నారు. జిల్లాలో ఎక్కడ అనధికారిక ఎరువుల విక్రయాలు జరిగినా, లైసెన్స్ పొందిన కంపెనీలు కాకుండా ఇతర కంపెనీల ఎరువులు, పురుగు మందులు విక్రయించినా కఠిన చర్యలు తీసుకునేలా నిఘా పెంచారు. అనధికారిక మిశ్రమ ఎరువుల పట్టివేత.. అధికారుల స్పెషల్ డ్రైవ్లో రాష్ట్ర ఎకై ్సజ్మంత్రి జూపల్లి కృష్ణారావు ఇలాకాలోని పాన్గల్ మండలంలో ఉన్న ఓ ఫర్టిలైజర్ దుకాణంలో ఆంధ్రప్రదేశ్లో తయారు చేసిన అనధికార ఎరువు (మిశ్రమ ఎరువు) 25 బస్తాలు పట్టుబడింది. రాష్ట్రవ్యాప్తంగా నకిలీ ఎరువుల విక్రయాల ఘటనలు వెలుగుచూస్తున్న వేళ సమీప మండలంలో అక్రమ డీఏపీ విక్రయంలో పోలీసు కేసులు, అరెస్టులు అవుతున్నా.. సదరు దుకాణ యజమాని అనధికారిక మిశ్రమ ఎరువును రైతులకు విక్రయించేందుకు గోదాంలో నిల్వ చేయడం శోచనీయం. ల్యాబ్కు నమూనాలు.. అనధికారికంగా రైతులకు విక్రయించిన డీఏపీ నమూనాలను జిల్లా వ్యవసాయశాఖ అధికారులు పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించారు. నివేదికలు వచ్చేందుకు కనీసం 15 రోజుల వ్యవధి పడుతుండగా.. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. రిపేర్టు నకిలీ అని వస్తే.. కోర్టులో దాఖలు చేసే చార్జిషీట్లో ఈ విషయాన్ని పోలీసులు ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. అప్రమత్తమైన రైతులు.. నకిలీ, అనధికారిక ఎరువుల విక్రయాల ఘటనలతో అప్రమత్తమైన రైతులు ఎరువులు కొనుగోలు చేసేందుకు వెళ్లినప్పుడు అక్కడి బస్తాల ఫొటోలను ఆయా మండలాల ఏఓలకు పంపిస్తున్నారు. వారు పరిశీలించి అనుమతించిన తర్వాతే కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవడం గమనార్హం. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఎరువులు, యూరియా నిల్వలు (మెట్రిక్ టన్నుల్లో..) చిన్నంబావి మండలం వెల్టూరులో అనధికారిక డీఏపీ విక్రయాలను గుర్తించి వ్యవసాయశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు పలువురిపై కేసునమోదు చేశారు. వారిలో ఇద్దరిని ఇటీవలే అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. వీరిలో ఒకరు గద్వాల జిల్లాకు చెందిన వారు కాగా.. మరొకరు జిల్లాలోని పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామానికి చెందిన ఫర్టిలైజర్ దుకాణ యజమాని. మరొకరు హైదరాబాద్లో అనధికార ఎరువులను స్టాక్ చేసిన వ్యక్తి ఈ కేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితుడైన అతను పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. -
సాగు విధానాల్లో మార్పు అవసరం
గోపాల్పేట: ఎల్నినో కారణంగా సాంప్రదాయ సాగు విధానాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని తిర్మలాపూర్లో ఎన్నినో ప్రభావం.. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. రైతులు దిగుబడి మాత్రమే కాకుండా పెట్టుబడి, నీటి లభ్యత, మార్కెటింగ్ అవకాశాలను కూడా దృష్టిలో ఉంచుకొని పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఎల్నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ప్రభుత్వం సూచిస్తున్న పద్ధతులను పాటించాలని చెప్పారు. వ్యవసాయ, ఉద్యాన అధికారులు ప్రతి గ్రామంలో రైతులకు అవసరమైన సూచనలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రైతులు నీటిగుంతలు, ఇంకుడు గుంతలు, సూక్మ నీటిపారుదల పద్ధతులను విస్తృతంగా వినియోగించాలని పిలుపునిచ్చారు. కంది, పప్పుధాన్యాలు, కూరగాయలు, ఇతర ఉద్యాన సాగుపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్నినో రాష్ట్ర కమిటీ చైర్మన్గా డా. చిన్నారెడ్డి ఎంపిక కావడం గొప్ప విషయమన్నారు. జిల్లాలో ఈ ఏడాది 34 శాతం మేర కరువు పరిస్థితులు ఉన్నాయని.. మండలంలో 40 శాతం వరకు నమోదు అయిందని తెలిపారు. జయన్న తిర్మలాపూర్లో సుమారు మూడు వేల ఎకరాల్లో సాగు జరుగుతుండగా.. అందులో 700 ఎకరాలు పూర్తిగా వర్షాధార పంటలే ఉన్నాయని తెలిపారు. ఇలాంటి సమయాల్లో అధిక నీరు అవసరం ఉన్న వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీగోపాల్, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, మండల ప్రత్యేక అధికారి సుధీర్రెడ్డి, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు గగనం నరహరి, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
ఆయుధ వినియోగంలో నైపుణ్యాలు ఉండాలి
వనపర్తి: పోలీసు అధికారులు, సిబ్బందికి ఆయుధాల వినియోగంపై సంపూర్ణ అవగాహన, నైపుణ్యం అవసరమని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఎరవ్రల్లి 10వ తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్లో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి నిర్వహించిన రెండ్రోజుల వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ శనివారం ముగిసింది. చివరిరోజు ఎస్పీ పాల్గొని అదనపు ఎస్పీ, పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఫైరింగ్ నిర్వహించి తమ నైపుణ్యాన్ని పరీక్షించుకున్నారు. శిక్షణలో భాగంగా విధుల్లో వినియోగించే ఆయుధాలతో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది పది రౌండ్ల ఫైరింగ్ చేసే అవకాశం కల్పించారు. ఫైరింగ్లో ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది తమ వద్ద ఉన్న ఆయుధాల పనితీరు, వినియోగ విధానంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ సక్రమంగా ఉంచాలన్నారు. విధి నిర్వహణలో శారీరక దృఢత్వం ఎంతో కీలకమని, రోజు వ్యాయామం జీవితంలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. ఆరోగ్యం, మానసిక స్థైర్యం, అప్రమత్తతతో పనిచేస్తేనే ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించగలమన్నారు. చెడు వ్యసనాలు, చెడు స్నేహాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, పోలీసుశాఖ గౌరవానికి భంగం కలిగించే చర్యలకు పాల్పడకూడదని కోరారు. వ్యక్తిగత, కుటుంబ, విధి నిర్వహణ, ఆరోగ్య సంబంధిత సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసానిచ్చారు. అలాగే ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, రిజర్వ్ సబ్ ఇనన్స్పెక్టర్ వినోద్, జిల్లా పోలీసు అధికారులు, ఎస్ఐలు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. ఫైరింగ్ ప్రాక్టీస్లో పోలీసు సిబ్బంది ఫైరింగ్ చేస్తున్న ఎస్పీ డి.సునీతారెడ్డి -
అర్హుల ఓట్లు కాపాడాలి : మాజీ మంత్రి
కొత్తకోట రూరల్: అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు జాబితాలో నమోదయ్యేలా చూడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకులు, బీఎల్ఏలపై ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం పెద్దమందడి మండలం బుగ్గపల్లితండా, అమ్మపల్లి, అమ్మపల్లితండాలో పర్యటించి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు. అనంతరం బీఎల్వోలు, పార్టీ నాయకులతో మాట్లాడుతూ.. సమయం తక్కువగా ఉన్నందున ప్రజలకు అవగాహన కల్పించి అర్హుల ఓట్లు తప్పకుండా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని బూత్లలో బీఎల్వోలపై పని భారం అధికంగా ఉందని, అదనపు సిబ్బందిని నియమించి సకాలంలో ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను కోరారు. వెంట జిల్లా రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, జెడ్పీ టీసీ మాజీ సభ్యుడు రఘుపతిరెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్గౌడ్, కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి పాన్గల్: వర్షపు నీటిని సంరక్షించేందుకు ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు తప్పనిసరిగా నిర్మించుకోవాలని డీఆర్డీఓ ఉమాదేవి సూచించారు. శనివారం మండలంలోని చింతకుంటలో సర్పంచ్ కోట్ల రాములు అధ్యక్షతన జరిగిన ప్రత్యేక గ్రామసభకు ఆమె హాజరై మాట్లాడారు. పొలాల్లోని బోరుబావుల దగ్గర ఇంకుడు గుంతలు నిర్మించుకోవడంతో వీబీజీ రాంజీ ద్వారా రూ.7 వేలు, వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకునే వారికి రూ.12 వేలు అందుతాయన్నారు. పశువుల షెడ్, ఫాంపాండ్ నిర్మాణాలు చేపడితే ఆర్థిక సాయం మంజూరు చేయనున్నట్లు చెప్పారు. కొలతల ప్రకారం పనిచేస్తేనే ఉపాధిహామీ డబ్బులు వస్తాయన్నా రు. సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉంటూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సమా వేశంలో ఎంపీడీఓ గోవిందరావు, పంచాయతీ కార్యదర్శి, ఏఈఓ, రైతులు పాల్గొన్నారు. నేడు బ్యారేజీల పరిశీలన మహబూబ్నగర్ మున్సిపాలిటీ: భీమా, కృష్ణానదులపై కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న చెక్డ్యాంలు, బ్యారేజీలను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి ఆదివారం పరిశీలిస్తామని మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హైడ్రాలిక్ గేట్లు ఏర్పాటు చేసి తెలంగాణకు నీళ్లు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ఆర్డీఎస్ వద్ద కర్ణాటక, ఏపీ రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారన్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని, కర్ణాటక నుంచి నీరు రాకుంటే తెలంగాణ రైతులు వచ్చే యాసంగిలో పంటలు వేసే పరిస్థితి లేకుండా పోతుందన్నారు. ఈ పరిస్థితి మారే వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేపడుతామని హెచ్చరించారు. -
ఆస్తుల కంటే విజ్ఞానం గొప్పది
వనపర్తిటౌన్: ఆస్తుల కంటే విజ్ఞానం గొప్పదని.. విద్యార్థులు కష్టపడి చదివి ఎంచుకున్న ఉన్నత లక్ష్యాన్ని సాధించి పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఇన్చార్జ్ జిల్లా విద్యాధికారి యాదయ్య కోరారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని హరిజనవాడ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన నగదు ప్రతిభ ప్రోత్సాహక పురస్కార మహోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆస్తులు తింటే తరుగుతాయి.. కానీ విజ్ఞానం ఉంటే ఎన్ని ఆస్తులైనా సంపాదించ వచ్చన్నారు. వైద్యులు, ఇంజినీర్లు, ఉపాధ్యాయులు, న్యాయవాదులుగా ఎదిగి సమాజానికి ఆదర్శంగా నిలవడంతో పాటు తోటి వారిని ప్రోత్సహించాలని సూచించారు. పాఠశాలలో ఉన్న సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 2026లో 10వ తరగతిలో 566 మార్కులు సాధించి మహబూబ్నగర్ ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన నజీరా, కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న కృతికకు నగదు ప్రోత్సాహకం అందజేయడంతో పాటు 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. కృతిక ఉన్నత విద్యకు ఆత్మకూర్ బాలవర్ధన్ రెడ్డి గతేడది రూ.20 వేలు, ఈ ఏడాది రూ.50 వేలు, 18వ వార్డు కౌన్సిలర్ గంధం మదన్ రూ.10 వేలు, సీనియర్ ఉపాధ్యాయుడు వాకిట రవికుమార్ రూ.10 వేలు, అరవింద్ రూ.10 వేలు అందజేశారు. 500కు పైగా మార్కులు సాధించిన అబ్దుల్ ఆదిల్, భార్గవి, భానుప్రకాశ్, జయచంద్ర, జ్ఞానేశ్వరికి ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్ రూ.వెయ్యి, ఆత్మకూర్ బాలవర్ధన్రెడ్డి రూ.వెయ్యి చొప్పున నగదు అందజేశారు. కార్యక్రమంలో ఏసీజీ అండ్ జీహెచ్ఎం గణేష్కుమార్, సామాజిక కార్యకర్తలు గంధం నాగరాజు, భోజరాజు వెంకటేష్, విశ్వంబాబు, శంకర్గౌడ్, చంద్రశేఖర్, శ్రీనివాసులు, మహిపాల్రెడ్డి, ప్రతాప్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బకాయి వేతనాలు చెల్లించాలి ఖిల్లాఘనపురం: సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల బకాయి వేతనాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కార్మికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, సూపర్వైజర్ తదితర కార్మికులకు మూడునెలలుగా వేతనాలు రావడం లేదన్నారు. ప్రభుత్వం ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని చెప్పినా ఎక్కడా అమలుకావడం లేదని వాపోయారు. ప్రభుత్వం తక్షణమే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మికులు సాయికృష్ణ, భీమయ్య, శివ, స్వాతి, ప్రియాంక, నజ్మ, నాగయ్య, వెంకటేష్, మునీందర్ పాల్గొన్నారు. ‘కేంద్ర విధానాలు దేశానికి ప్రమాదం’ వనపర్తి రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిరంకుశ విధానాలు దేశానికి తీవ్ర ప్రమాదకరమని.. యువత భవిష్యత్ను దోచుకుంటున్న పాలకులపై ఉద్యమించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కల్లూరి ధరేంద్ర పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహేష్ అధ్యక్షతన 3వ మహాసభలు నిర్వహించగా.. ఆయన పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగం, ఉద్యోగాల భర్తీలో జాప్యం, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ దోపిడీ, పరిశ్రమల కొరతతో జిల్లా యువత వలసబాట పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పోరేట్ల కోసం యువత జీవితాలతో పాలకులు చెలగాటమాడుతున్నారని.. నీట్ అక్రమాలే ఇందుకు నిదర్శనమన్నారు. శాశ్వత ఉద్యోగాలు, నాణ్యమైన విద్య, వైద్యం, క్రీడారంగాన్ని అభివృద్ధి చేయడమే నిజమైన ప్రగతని స్పష్టం చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు మాట్లాడుతూ.. యువత కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా, శాంతి, అభ్యుదయం, శాసీ్త్రయ సోషలిజం అనే సిద్ధాంతంతో ప్రజా సమస్యలపై పోరాడాలన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సమన్వయ కార్యదర్శి బిజ్జ శ్రీనివాసులు, కుతుబ్, సీపీఐ నేత రమేష్, సురేష్, విష్ణు, మహబూబ్, పరమేష్, వివిధ మండలాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సకాలంలో యూనిఫామ్స్ పంపిణీ
వనపర్తి: ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బాలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఆగస్టు 15లోగా యూనిఫామ్స్ అందజేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. జిల్లాలో వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతకు అనుగుణంగా రైతులు పంటమార్పిడి చేసుకునేలా రైతులను ప్రోత్సహిస్తున్నామని, అందుకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందజేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించామన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సంజయ్ జాజు విద్యార్థుల యూనిఫామ్స్ పంపిణీపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొని వివరాలు వెల్లడించారు. జిల్లాలోని 512 పాఠశాలల్లో 38,653 విద్యార్థులు, 15 కేజీబీవీల్లో 4,531 మంది విద్యార్థులు, 3 మోడల్ స్కూళ్లలో 1,919 విద్యార్థులు, గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్స్ ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో శిక్షణ పొందిన 358 స్వయం సహాయక సంఘాల టైలర్లను గుర్తించామని.. ఇప్పటి వరకు వచ్చిన వస్త్రాన్ని ఎప్పటికప్పుడు మండలాలకు విభజించి కుట్టేందుకు టైలర్లకు అందజేస్తామన్నారు. ప్రతి విద్యార్థికి ఆగస్ట్ 15లోగా ఒక జత, ఆగస్టు 25లోగా రెండోజత అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓను ఆదేశించారు. ● వ్యవసాయశాఖకు సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు కురిసిన వర్షాలు, సమస్యాత్మక గ్రామాలు, ఇప్పటి వరకు చేపట్టిన సాగు విస్తీర్ణాన్ని వివరించారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. కంది, నువ్వులు, వేరుశనగ సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో కూరగాయల సాగు సైతం పెంచేందుకు వ్యవసాయ, ఉద్యాన అధికారులను ఆదేశించామని చెప్పారు. వీడియో కాన్ఫరెనన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, ఇన్చార్జ్ జిల్లా విద్యాధికారి యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, వ్యవసాయశాఖ అధికారి ఆంజనేయులు, ఉద్యాన అధికారి విజయభాస్కర్, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ ఆదర్శ్సురభి.. జిల్లా అధికారులు -
రికార్డుస్థాయిలో సెల్ఫోన్ల రికవరీ : ఎస్పీ
వనపర్తి: జిల్లా పోలీసు అధికారులు నెలరోజుల వ్యవధిలో సుమారు రూ.65 లక్షల విలువైన 236 సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బాధితులకు ఫోన్లను అందజేసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. స్మార్ట్ఫోన్ పోగొట్టుకుంటే ఎలా ఫిర్యాదు చేయాలనే విషయాన్ని వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు మరో ఐదు రాష్ట్రాల్లో ఉన్న సెల్ఫోన్లను స్థానిక బృందాలు ప్రత్యేక దృష్టి సారించి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ సీఈఐఆర్ వ్యవస్థను ఉపయోగించి చోరీకి గురైన ఫోన్లను గుర్తించి బాధితులకు అందించినట్లు చెప్పారు. పోగొట్టుకున్న మొబైల్ విలువ కంటే అందులోని ఫొటోలు, సమాచారం, కాంటాక్ట్ నంబర్ల విలువ ఎంతో ఎక్కువని అభిప్రాయపడ్డారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకోవడం, చోరీకి గురైనప్పుడు బాధితులు వెంటనే https://www.ceir.gov.in అనే వెబ్సైట్లోగాని దగ్గర్లోని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 500 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేశామన్నారు. సెల్ఫోన్ల రికవరీకి కృషి చేసిన సీసీఎస్ సీఐ పవార్ అశోక్కుమార్, ఎస్ఐ రామరాజు, ఏఎస్ఐ తిరుపతిరెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు ఎన్.రాజగౌడ్, శ్రీనివాస్రెడ్డి, కృష్ణయ్య, బాలయ్య, రాఘవేందర్, కానిస్టేబుళ్లు బెద్దడి స్వామి, మురళీకృష్ణ, సమరసింహారెడ్డి, మురళి, సత్యనారాయణ, భూపాల్కు ఎస్పీ క్యాష్ రివార్డ్ అందజేసి అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్ పాల్గొన్నారు. -
పారదర్శకంగా భూముల రీ సర్వే
ఖిల్లాఘనపురం: పారదర్శకంగా భూముల రీ సర్వే చేపడుతున్నట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. మండలంలోని మల్కాపురం గ్రామం ల్యాండ్ రీ సర్వేకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై ంది. సర్వే గురించి గ్రామస్తులకు వివరించేందుకు శుక్రవారం గ్రామంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ప్రత్యేకంగా చేపడుతున్న భూముల రీ సర్వేకు గ్రామం ఎంపికై ందని.. గ్రామంలోని భూములు రీ సర్వే చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. భూములకు సంబంధించిన రికార్డులను సమగ్రంగా, పారదర్శకంగా నవీకరించడంతో పాటు సర్వేనంబర్ల వారీగా హద్దులను గుర్తించి వివాదాలను పరిష్కరిస్తామన్నారు. పూర్తిగా డిజిటల్ విధానంలో సర్వే కొనసాగుతుందని.. రైతులు సర్వే అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. ఎలాంటి సందేహాలున్నా సంబంధిత అఽధికారుల దృష్టికి తీసుకొచ్చి నివృత్తి చేసుకోవాలన్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం లేదని.. రైతులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుగుణ, సర్పంచ్ రవీందర్, ఆర్ఐ తిరుపతయ్య, పంచాయతీ కార్యదర్శి ఖాదర్బీ పాల్గొన్నారు. -
అడ్మిషన్లు ‘ఓపెన్’
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఆర్థిక ఇబ్బందులు.. కుటుంబ పరిస్థితులతో చదువు మధ్యలో ఆపేసిన వారికి దిక్సూచిగా నిలుస్తోంది ఓపెన్ స్కూల్ సొసైటీ. ఒకవైపు సొంత పనులు లేదా ఉద్యోగాలు చేసుకుంటూనే.. మరోవైపు పదో తరగతి, ఇంటర్మీడియట్ పూర్తిచేసేలా తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కోర్సుల ద్వారా వచ్చే సర్టిఫికెట్లు రెగ్యులర్ విద్యతో సమానమైన గుర్తింపు కలిగి ఉంటాయి. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా విద్యార్థుల సౌకర్యార్థం 104 స్టడీ సెంటర్లు ఉన్నాయి. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎంపిక చేసిన మండలాల్లో.. ప్రభుత్వం ఓపెన్ స్కూల్ విధానాన్ని 2008–09 సంవత్సరంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదట కేవలం ఎస్సెస్సీ చదివే విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉండగా.. 2011 నుంచి ఇంటర్ చదివే వారికి కూడా అవకాశం కల్పించారు. అయితే ఉమ్మడి జిల్లాలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న మండలాల్లో ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లు (అధ్యయన కేంద్రాలు) ఏర్పాటు చేశారు. ఇలా ఉమ్మడి పాలమూరులో మొత్తం 104 స్టడీ సెంటర్లలో విద్యార్థులు చేరేందుకు అవకాశం ఉంది. వారంలో మొత్తం వారికి అవసరం ఉన్న పనులు చేసుకుంటూ ఆదివారం స్టడీ సెంటర్లలో నిర్వహించే తరగతులకు హాజరుకావాల్సి ఉంది. నారాయణపేట, గద్వాల, నాగర్కర్నూల్ వంటి కొన్ని అక్షరాస్యత తక్కువగా ఉన్న మండలాల్లో వీటిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులతో మధ్యలో ఆపేసిన వారికి సదావకాశం ఇతరత్రా పనులు చేసుకుంటూనే చదివేందుకు అవకాశం సర్టిఫికెట్కు రెగ్యులర్ కోర్సులతో సమాన ప్రాధాన్యం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలంటున్న అధికారులు డిస్టెన్స్ విధానంలో ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ చదవాలనుకునే విద్యార్థుల కోసం ప్రభుత్వం అడ్మిషన్లకు అనుమతి ఇచ్చింది. ఆసక్తి గల విద్యార్థులు సూచించిన ఫీజులను చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు తమకు ఇష్టమైన సబ్జెక్టును.. తమకు అనుకూలమైన సమయంలో చదువుకునేందుకు అవకాశం ఉంది. ఆది, రెండో శనివారాల్లో తరగతులు నిర్వహిస్తాం. – శివయ్య, ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ఆన్లైన్ విధానంలో WWW.TELANGA NAOPENSCHOOL.ORG వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎస్సెస్సీలో జనరల్ వారికి రూ.1,400, మహిళలు ఇతర రిజర్వేషన్ వారు రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంది. వీటితోపాటు రిజిస్ట్రేషన్కు రూ.150 సాధారణంగా చెల్లించాలి. ఇంటర్లో పురుషులు జనరల్ వారు రూ.1,500, మిగతా వారికి రూ.1,200తోపాటు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఫీజులు చెల్లించిన రశీదు, అడ్మిషన్ ఫాం భర్తీ చేసి స్టడీ సెంటర్లో అందజేయాలి. చెల్లించిన ఫీజులోనే పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ అందిస్తారు. ఉమ్మడి జిల్లాలో స్టడీ సెంటర్లు.. గతేడాది ఎస్సెస్సీ, ఇంటర్లో ఉత్తీర్ణత పొందినవారు ఇలా.. ఓపెన్ స్కూల్ ద్వారా ఎస్సెస్సీ, ఇంటర్ చదివిన వారికి రెగ్యులర్ కోర్సులకు సమానంగా సర్టిఫికెట్ ఇస్తారు. ఈ సర్టిఫికెట్తో అన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సెస్సీ బోధన అంశాలను మూడు గ్రూపులుగా విభజించి బోధిస్తారు. గ్రూప్–ఏలో భాషలు, గ్రూప్–బీలో ప్రధాన అంశాలు, గ్రూప్–సీలో వృత్తి విద్యకు సంబంధించిన కోర్సులు ఉంటాయి. మొదటి రెండింటిని కలిపి కనీసం రెండు సబ్జెక్టుల చొప్పున ఐదింటిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ, ఒరియా భాషల్లో కొనసాగిస్తారు. ఇంటర్లో గ్రూప్–ఏలో భాషలు, బీలో ఆప్షనల్స్, సీలో వృత్తి విద్యా కోర్సులు ఉండగా.. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషలు అందుబాటులో ఉన్నాయి. గ్రూప్–ఏలో ఇంగ్లిష్తోపాటు నచ్చిన ఏదో ఒక భాషను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. బీ, సీలో నచ్చిన ఆప్షనల్స్, వృత్తి విద్య కోర్సులను ఎంపిక చేసుకోవాలి. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. -
30 ఏళ్లుగా పనిచేస్తున్నా..
ఆలయంలో 30 ఏళ్లుగా పనిచేస్తున్నా. అర్చకుడు మరణించి రెండేళ్లు గడుస్తుంది. నాటి నుంచి ఆలయం మూతబడింది. ఆలయ భూముల ద్వారా వచ్చే ఆదాయంతో మేలు జరుగుతుందని భావించా. అర్చకుడు బతికి ఉన్నప్పుడు కూడా నెలకు రూ. వెయ్యి మాత్రమే ఇచ్చేవారు. ఉన్నతాధికారులు స్పందించి ఆలయాన్ని తెరిపించాలి. – బాలీశ్వరమ్మ, స్వీపర్, వీపనగండ్ల ఆలయ భూములు పేదలు సాగు చేసుకునేలా చేస్తే ఆర్థికంగా బలపడుతారు. ఒకే వర్గానికి చెందినవారు ఏళ్లుగా సాగు చేసుకుంటూ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారేగాని కనీసం అర్చకుడిని కూడా నియమించడం లేదు. దేవాదాయశాఖ అధికారుల ఏక పక్ష నిర్ణయం సరికాదు. ఉన్నతాధికారులు స్పందించి భూముల వేలం నిర్వహిస్తే ఆదాయం సమకూరడంతో పాటు నిత్య పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి. – ఎత్తం కృష్ణయ్య, మాజీ అధ్యక్షుడు, మండల రైతుబంధు సమితి చెన్నకేశవస్వామి ఆలయ భూములను అదే గ్రామానికి చెందిన పలువురు రైతులు సిట్టింగ్ టెనెంట్ యాక్టు కింద మూడేళ్లు సాగు చేసుకునేందుకు దేవాదాయశాఖ కమిషరేట్ నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. గ్రామానికి చెందిన మరికొందరు సాగుహక్కు కోసం నిరాహార దీక్షలు చేస్తున్నట్లు తెలిసింది. గ్రామంలో పర్యటించి సమస్యను పూర్తిగా తెలుసుకొని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అందరికి ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ప్రయత్నిస్తాం. ఆలయంలో నిత్య పూజలు కొనసాగించేందుకు తగిన ఏర్పాట్లను వీలైనంత త్వరలో చేపడతాం. – శేఖర్గౌడ్, ఈఓ, దేవాదాయశాఖ, వనపర్తి ● -
ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి
పాన్గల్: వాతావరణ మార్పులకు అనుగుణంగా శాసీ్త్రయ పద్ధతులను అవలంబిస్తూ ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ రైతులకు సూచించారు. శుక్రవారం మండలంలోని రాయినిపల్లి, బుసిరెడ్డిపల్లిలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. వరికి బదులుగా తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలన్నారు. భూసార పరీక్షల నివేదికల ఆధారంగా ఎరువులు వినియోగించాలని, భూసారాన్ని కాపాడటంతో దిగుబడులు పెరగడంతో పాటు వ్యవసాయం స్థిరమైన అభివృద్ధి దిశగా సాగుతుందని తెలిపారు. భూమి, ఆరోగ్యంపై రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని.. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉంటూ పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలన్నారు. అనంతరం ఆయా గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణల్లో మొక్కలు నాటి నీరు పోశారు. ఆయన వెంట డీఆర్డీఓ ఉమాదేవి, తహసీల్దార్ కార్తీక్రావు, ఎంపీడీఓ గోవిందరావు, ఆయా గ్రామాల సర్పంచులు హేమాద్రినాయుడు, ప్రభాకర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. -
సైబర్ భద్రతపై అవగాహన అవసరం
వనపర్తి: రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలను సమర్థవంతంగా అరికట్టేందుకు ప్రతి పోలీసు అధికారి అప్రమత్తంగా పనిచేయాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నేరస్తులను వేగంగా గుర్తించి చట్టం ముందు నిలబెట్టడంతో పాటు ప్రజల్లో విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో సైబర్ మోసాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. గురువారం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయం నుంచి పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలు, క్షేత్రస్థాయి పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి ఎస్పీ డి.సునీతరెడ్డి పాల్గొని వివరాలు వెల్లడించారు. వీసీలో డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, సైబర్క్రైమ్ సీఐ శ్రీను నాయక్, సైబర్ క్రైమ్ ఎస్ఐ రవిప్రకాష్, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐలు మంజునాథరెడ్డి, నరేష్, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి, ఐటి కోర్ సిబ్బంది గోవింద్, రవీంద్రబాబు పాల్గొన్నారు. జీఓ 60 ప్రకారం వేతనాలు చెల్లించాల్సిందే మహబూబ్నగర్ న్యూటౌన్: జీఓ నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాల్సిందేనని రాష్ట్ర మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.సురేశ్ డిమాండ్ చేశారు. గురువారం జనరల్ ఆస్పత్రిలో కాంట్రాక్టు ఏజెన్సీ నిర్వాహకులతో యూనియన్ నేతలు, కార్మిక సంఘం నాయకుల ఆధ్వర్యంలో చర్చలు జరిపారు. కనీస వేతనాలు అమలు చేయాలని, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, సూపర్వైజర్స్ కార్మికులకు పూర్తిస్థాయి వేతనం అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. వేతనాల సమస్యపై మరోసారి సమావేశం నిర్వహించి, నిర్ణయం తీసుకుంటామని ఏజెన్సీ నిర్వాహకులు పేర్కొన్నారు. ఏజెన్సీ నిర్వాహకులు శ్రీవాణి, రాఘవేందర్, యూనియన్ నాయకులు రంగన్న, చెన్నయ్య, యాదయ్య పాల్గొన్నారు. -
జిల్లాను అగ్రస్థానంలో నిలుపుదాం
ఖిల్లాఘనపురం: విద్యాపరంగా జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని ఇన్చార్జి జిల్లా విద్యాధికారి యాదయ్య కోరారు. మండలంలోని సోళీపురం ఉన్నత పాఠశాలలో మూడురోజులుగా కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే దొంతికుంటతండా స్టేజీ సమీపంలో ఉన్న తెలంగాణ మోడల్ పాఠశాలను సందర్శించి కొనసాగుతున్న మరమ్మతులను పరిశీలించారు. ఇంటర్ బాలికల వసతి గృహాన్ని పరిశీలించి వసతులపై ఆరా తీశారు. పదోతరగతి, ఇంటర్ విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమై ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఐదేళ్లుగా నిర్వహిస్తున్న ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో రాష్ట్రంలో జిల్లా రెండోస్థానంలో నిలిచిందని, ఇందులో ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందన్నారు. ప్రతి తరగతిలో వెనుకబడిన విద్యార్థులను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై శిక్షణనిస్తున్నట్లు చెప్పారు. శిక్షణలో అందించే అంశాలను ఉపాధ్యాయులు అర్థం చేసుకొని విద్యార్థులను టాపర్లుగా నిలిపేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో పాల్గొని ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో జీసీడీఓ నారాయణమ్మ, ఎంపీడీఓ విజయసింహారెడ్డి, ఎస్ఓ శేఖర్, ఎంఈఓ జయశంకర్, ఏఓ మల్లయ్య, పాఠశాల ప్రిన్సిపాల్ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
వరదల సమయంలోనే..
జూరాల జలాశయానికి ఎగువ నుంచి వరద వచ్చి చేరుతున్న సమయంలోనే సమాంతర కాల్వ ద్వారా నీటిని తరలించాల్సి ఉంటుంది. వరద నిలిచిన వెంటనే ప్రధాన కాల్వ షట్టర్లను మూసి ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. గతంలో షట్టర్ల లీకేజీతో నీరంతా వృథాగా పారేది. ప్రస్తుతం షట్టర్ల మరమ్మతులు చేపడుతున్న అధికారులు నీటి వృథాను అరికట్టాలి. – వెంకటేష్, రైతు, నందిమళ్ల సమాంతర కాల్వ ప్రధాన షట్టర్ల మరమ్మతుకు రూ.60 లక్షలు మంజూరయ్యాయి. మరో పదిరోజుల్లో పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం. అనుకున్న సమయానికి పూర్తి చేసి షట్టర్లు మూసిన సమయంలో నీరు వృథాగా పారకుండా చూస్తాం. – కేశవరావు, ఈఈ, భీమా ఫేజ్–2 -
యూబీఐ సేవలు వినియోగించుకోవాలి
వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో యూనియన్ బ్యాంక్ వేతన ఖాతాల క్యాంపెయిన్ నిర్వహించగా.. అదనపు కలెక్టర్తో పాటు బ్యాంకు డీజీఎం వెంకటేశ్వర్లు, ఎస్డీసీ తిరుపతయ్య ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీఎం మాట్లాడుతూ.. జూన్ 25న రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక వేతన ప్యాకేజీలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా ఎగ్జిక్యూటివ్, ప్రీమియర్, ఎలైట్ ఖాతాలు ఉన్నాయని.. వ్యక్తిగత, ప్రమాద బీమా, టర్మ్ ఇన్సూరెన్్స్, ఇతర బీమా సదుపాయాలు, ఆకర్షణీయ రుణ సౌకర్యాలు, ప్రాధాన్య బ్యాంకింగ్ సేవలు కల్పిస్తున్నామన్నారు. అనంతరం బ్యాంకు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వేతన ఖాతాల ప్రత్యేకతలు, బీమా రక్షణ, రుణ సదుపాయాలు, ఇతర ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. సమావేశంలో ఎల్డీఎం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వైకుంఠధామాల్లో ‘స్వచ్ఛ’ పనులు
మదనాపురం: జిల్లాలోని వైకుంఠధామాల దుస్థితిని వివరిస్తూ గురువారం ‘సాక్షి’ దినపత్రికలో ‘ఆఖరి మజిలీకి ఆటంకాలు..’ శీర్షిక కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన మదనాపురం ఎంపీడీఓ ప్రసన్నకుమారి, ఎంపీఓ ఉషనప్ప మండలంలోని అజ్జకొల్లు, కొత్తపల్లి, నిల్విడి తదితర గ్రామాల్లోని వైకుంఠధామాల్లో పెరిగిన పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు, వ్యర్థాలను పొక్లెయిన్ సాయంతో తొలగించారు. వైకుంఠధామాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం శుభ్రంగా ఉంచాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం -
ఎస్జీఎఫ్ సందడి
● పాఠశాల, కళాశాల స్థాయిలో క్రీడలు ● తెలంగాణ స్కూల్గేమ్స్ షెడ్యూల్ విడుదల ● వచ్చేనెల మొదటి వారం నుంచి నాలుగు దశల్లో పోటీల నిర్వహణ మహబూబ్నగర్ క్రీడలు: పాఠశాల, కళాశాలల విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రతి ఏడాది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పాఠశాల స్థాయిలో అండర్ 14, అండర్–17 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా మండలస్థాయి నుంచి మొదలుకొని జిల్లా, ఉమ్మడి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో క్రీడాపోటీలను నిర్వహిస్తారు. ఎంతో మంది పాఠశాల, కళాశాలల విద్యార్థులు ఎస్జీఎఫ్ క్రీడల్లో రాష్ట్ర, జాతీయస్థాయికి ఎదిగి తమ ప్రతిభను చాటుతున్నారు. ఈ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలు విద్యార్థులకు ఒక వేదికలా ఉపయోగపడుతున్నాయి. ● ప్రతి ఏడాది పాఠశాల విద్యాసంవత్సరం ప్రారంభం అనంతరం జిల్లాలోని పీఈటీలతో సమావేశం నిర్వహించి, ఎస్జీఎఫ్ పోటీల ఎంపికలపై నిర్ణయం తీసుకుంటారు. ఆగస్టు నుంచి ఈ ఏడాది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడాపోటీలు ప్రారంభంకానున్నాయి. రాష్ట్రంలోని ఎస్జీఎఫ్ క్రీడా పోటీలకు 2026–27 సంవత్సరానికి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ క్రీడా షెడ్యూల్ను ఇటీవల విడుదల చేశారు. నాలుగు దశల్లో ఎస్జీఎఫ్ క్రీడాపోటీలు జరగనున్నాయి. ఆగస్టు మొదటి వారం నుంచి సెప్టెంబర్ నాలుగో వారం వరకు నాలుగు దశల్లో ఎస్జీఎఫ్ క్రీడలు జరగనున్నాయి. మండల, జిల్లా, ఉమ్మడి జిల్లా (జోనల్), రాష్ట్రస్థాయిల్లో ఎస్జీఎఫ్ క్రీడాపోటీలు జరగనున్నాయి. జిల్లాల ఎంపిక పోటీలను నిర్వహించుకొని పాత ఉమ్మడి జిల్లా జట్టుగా ఏర్పడి రాష్ట్ర పోటీలకు హాజరుకానున్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా షెడ్యూల్ విడుదలకావడంతో ఇక క్రీడల సందడి నెలకొనుంది. పకడ్బందీగా నిర్వహిస్తాం... ఈ ఏడాది అండర్–14, అండర్–17 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడాపోటీలను వ్యాయా మ ఉపాధ్యాయుల సహకారంతో పకడ్బందీగా నిర్వహిస్తాం. డీఈఓ ఆదేశాల మేరకు త్వరలో జిల్లాలోని పీడీ, పీఈటీలతో సమావేశం నిర్వహిస్తాం. గత ఏడాది వనపర్తి జిల్లాలో నాలుగు ఎస్జీఎఫ్ హాకీ టోర్నీలు నిర్వహించాం. ఈ ఏడాది కూడా జిల్లాకే ఏమైనా రాష్ట్రస్థాయి టోర్నీలు కేటాయిస్తే విజయంతంగా నిర్వహిస్తాం. – బి.కుమార్, జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి, వనపర్తి -
‘సర్’లో భాగస్వాములు కావాలి
ఖిల్లాఘనపురం: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి కోరారు. గురువారం మండలంలోని తిర్మలాయపల్లి, గారం, కమాలోద్ధీన్పూర్, వెంకటాంపల్లి, మానాజీపేటలో పర్యటించి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ బాలీశ్వర్రెడ్డి, మండలపార్టీ అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య, కార్యదర్శి పురేందర్రెడ్డితో సర్ ప్రక్రియను పరిశీలించారు. ఆయా గ్రామాల్లో బీఎల్వోలు, బీఎల్ఏలతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 100 శాతం పూర్తి చేసిన బీఎల్వోలు, బీఎల్ఏలను శాలువాలు, పూలమాలలతో సన్మానించి మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని.. అర్హలందరూ ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, బీఎల్వోల పాత్ర ఎంతో కీలకమని.. ఇంటింటికి ఫారాలు పంచడమేగాకుండా ఎలా నింపారు.. ఏమైనా తప్పులున్నాయా అనే వివరాలను పరిశీలించి తిరిగి తీసుకోవాలని చెప్పారు. గ్రామాల్లోని చదువుకున్న యువత ముందుకొచ్చి ఎన్యూమరేషన్ ఫారాలు నింపే విషయంలో సహకారం అందించాలన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
కల్వకుర్తి టౌన్: ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజన్ టెక్నీషియన్ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కోఆర్డినేటర్ రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ (ఎంపీసీ/ బైపీసీ) ఉత్తీర్ణులైన 18–23 ఏళ్ల మధ్య వయస్సు గల యువత అర్హులని, ఒకేషనల్ ఇంటర్ చదివిన వారికి అవకాశం లేదన్నారు. అచ్చంపేట, లింగాల, కల్వకుర్తి, కొల్లాపూర్, కొత్తకోట, వనపర్తి, తెలకపల్లి, పెద్దకొత్తపల్లి, కోడేరు ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష శుక్రవారం ఉదయం 10 గంటలకు తూడుకుర్తిలోని రామచంద్రారెడ్డి నేత్ర వైద్య కేంద్రంలో ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్ మార్కుల మెమోతోపాటు అవసరమైన ధ్రువపత్రాలతో హాజరుకావాలని, పూర్తి వివరాలకు సెల్ నంబర్లు 77309 93383, 99634 78751లను సంప్రదించాలని సూచించారు. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి శిక్షణతోపాటు ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఎల్నినోను సమర్థంగా ఎదుర్కొందాం వనపర్తి రూరల్: ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి స్థానికల సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ సూచించారు. గురువారం పెబ్బేరు మండలం వై–శాఖాపూర్, శ్రీరంగాపురంలోని రైతువేధికలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎల్నినోను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్నిశాఖలు సమన్వయంతో ముందస్తు సన్నద్ధత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తాగునీటి నిర్వహణ, భూగర్భ జలాల సంరక్షణ, వర్షపు నీటి వనరుల సమర్థ వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తూ ముందస్తు చర్యలను గ్రామస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సునీత, వ్యవసాయ అధికారి హైమావతి, సర్పంచ్లు మద్దిలేటి, నిఖిత, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఆరుతడి పంటలు సాగు చేయాలి పాన్గల్: ఎల్నినో నేపథ్యంలో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని డీఆర్డీఓ ఉమాదేవి, ఏడీఏ తిప్పేస్వామి రైతులకు సూచించారు. గురువారం మండలంలోని శాగాపూర్, శాగాపూర్తండాలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఏడీఏ, మల్లాయిపల్లిలో డీఆర్డీఓ పాల్గొని మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు, దీర్ఘకాలిక పొడి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. తక్కువ నీరు అవసరమయ్యే కంది, మినుము, జొన్న వంటి పంటలతో పాటు అంతర పంటలుగా కంది–మినుము, ఆముదం–మినుముతో పాటు టమాటా, బెండకాయ, చిక్కుడు వంటి కూరగాయాల పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. సేంద్రియ ఎరువుల వినియోగం, మల్చింగ్, వర్షపు నీటి సంరక్షణ, సూక్ష్మ సాగునీటి పద్ధతులపై అవగాహన కల్పించారు. అనంతరం ఎల్నినో ప్రభావంపై ముద్రించిన కరపత్రాలను రైతులతో కలిసి అధికారులు విడుదల చేశారు. ఆయా కార్యక్రమాల్లో అసిస్టెంట్ జల శాస్త్రజ్ఞుడు ఉమేష్, తహసీల్దార్ కార్తీక్రావు, ఎంపీడీఓ గోవిందరావు, ఏఈఓలు, ఆయా గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. 397 క్వింటాళ్ల వేరుశనగ రాక గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు గురువారం 397 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా క్వింటాల్ గరిష్టంగా రూ.7,269, కనిష్టంగా రూ.3,549, సరాసరిగా రూ.4,279 ధరలు లభించాయి. అలాగే 6 క్వింటాళ్ల వరి (సోన) రాగా క్వింటా రూ.2,585 ధర పలికింది. -
కేంద్రాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా? : కాంగ్రెస్
వనపర్తిటౌన్: కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్ట్లకు పాల్పడుతున్నారని కాంగ్రెస్పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, జిల్లా ప్రధానకార్యదర్శి బ్రహ్మచారి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బండారు శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. టీపీసీసీ, డీసీసీ అధ్యక్షుల పిలుపు మేరకు బుధవారం జిల్లాకేంద్రంలోని గాంధీచౌక్లో నీట్ ప్రశ్నాపత్రం లీక్, రాహుల్గాంధీ అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీ ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పకుండా మౌనం పాటించడమేమిటని మండిపడ్డారు. ప్రధాని మోదీ ఇంటి ఎదుట ప్రతిపక్ష నేతలు ధర్నా చేస్తే అక్రమంగా అరెస్టులకు పాల్పడ్డారని, రాహుల్గాంధీని అక్రమ అరెస్ట్ చేసి ప్రశ్నించే గొంతును నొక్కేయాలనుకుంటున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలని, రాహుల్గాంధీపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దేశ ప్రయోజనాల కోసం కాంగ్రెస్పార్టీ విద్యార్థులు, పేదల పక్షాన గళం విప్పుతోందని, పేపర్ లీక్లతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ను కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న రాహుల్గాంధీని అక్రమంగా అరెస్టు చేయడం సరికాదన్నారు. అనంతరం రాజీవ్చౌక్లో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. కార్యక్రమంలో పుర వైస్ చైర్మన్ మధుసూదన్, పట్టణ అధ్యక్షుడు కదిరి రాములు, మండల అధ్యక్షుడు రవికిరణ్, గోపాల్పేట మండల అధ్యక్షుడు నరహరి, కాంగ్రెస్ నాయకులు లక్కాకుల సతీష్, ఆదిత్య, జానకిరాములు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
అమరచింత (ఆత్మకూర్): ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు ముందుండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అన్నారు. ఆత్మకూర్లో కొత్తగా చేపడుతున్న లేఅవుట్లను బుధవారం ఆయన పరిశీలించి అనుమతులకు కావాల్సిన పత్రాలను తనిఖీ చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్లు, మిగిలిన అన్నిరకాల పత్రాలు సక్రమంగా ఉంటేనే అనుమతులిస్తామని చెప్పారు. అనంతరం స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పుతున్న సోలార్ ప్లాంట్ పనులను పరిశీలించారు. పనుల పురోగతి, విద్యుదుత్పత్తి సామర్థ్యం, నిర్వహణ విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ సోలార్ ప్లాంట్ను సకాలంలో పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. పుర, గ్రామపంచాయతీలోని పాత లేఅవుట్లతో పాటు కొత్త లేఅవుట్లలో పురపాలికకు చెందాల్సిన 10 శాతం స్థలాలను స్వాధీనం చేసుకొని అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా స్థలాలు కబ్జాకు గురైనట్లు తెలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పుర కమిషనర్ నరేష్కుమార్కు సూచించారు. అభివృద్ధితో పాటు స్వచ్ఛతకు ప్రాధాన్యమిస్తూ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. -
నిరుపయోగంగా మారాయి..
మా ఊళ్లో ఉన్న పాత శ్మశానంలోనే ఇప్పటికీ అంత్యక్రియలు చేస్తున్నాం. కొత్తగా కట్టిన వైకుంఠధామానికి ఎవరూ వెళ్లడం లేదు. ముళ్లపొదలు ఏపుగా పెరిగాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో అది వృథాగా మారింది. ఇప్పటికై నా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలి. – విష్ణు, గోపాల్పేట గత ప్రభుత్వ హయంలో రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన వైకుంఠధామాలు నేడు వృథా మారాయి. గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించకపోవడంతో మృతదేహాలను కాల్చేందుకు ముందుకు రావడం లేదు. మా పొలాల్లో, శ్మశానవాటికల్లో అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. అఽధికారులకు ఈ విషయం ప్రజలకు అవగాహన కల్పించాలి. – అశోక్కుమార్ యాదవ్, మదనాపురం జిల్లావ్యాప్తంగా ఉన్న వైకుంఠ ధామాల వినియోగం తక్కువగా ఉన్న మాట వాస్తవమే. నీటివసతి, విద్యుత్ కనెక్షన్లు లేని చోట త్వరితగతిన పనులు పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించాం. గ్రామాల్లో ప్రజలకు దీనిపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. సర్పంచులు, స్థానిక నాయకులతో మాట్లాడి, ప్రతి గ్రామంలోనూ వైకుంఠధామాల్లోనే అంత్యక్రియలకు ఉపయోగించేలా చూస్తాం. ప్రజాధనం వృథా కాకుండా త్వరలోనే అన్నింటినీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తాం. – రఘునాఽథ్రెడ్డి, డీపీఓ, వనపర్తి ● -
వీడని మరమ్మత్తు
ఎంజీకేఎల్ఐలో ఐదేళ్ల క్రితం పాడైన పంపు మోటార్లు కొల్లాపూర్: నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు, ఉమ్మడి పాలమూరు– రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు తాగునీరు అందించే ఉద్దేశంతో మహాత్మగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల (ఎంజీకేఎల్ఐ) పథకం చేపట్టారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 5 మోటార్ల ద్వారా ఏటా కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో నీటిని ఎత్తిపోసి.. కాల్వల ద్వారా రిజర్వాయర్లు, చెరువులు నింపుతూ సాగు, తాగునీటిని అందించాల్సి ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యం గల ఎత్తిపోతల పథకం అడుగడుగునా నిర్లక్ష్యానికి గురవుతోంది. గత ఐదేళ్ల క్రితం పాడైన రెండు మోటార్లు నేటికీ మరమ్మతుకు నోచుకోవడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వివిధ రకాల కారణాలు చెబుతూ అధికారు లు కాలయాపన చేస్తుండటంతో.. మిగతా మూడు మోటార్లతోనే నిరంతరం నీటిని ఎత్తిపోయాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ దీర్ఘకాలంగా కొనసాగుతుండటంతో వాటిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇదీ పరిస్థితి.. కేఎల్ఐ ప్రాజెక్టులోని ఎల్లూరు పంప్హౌజ్ నుంచి నీటిని ఎత్తిపోసి.. ఎల్లూరు, సింగోటం, జొన్నల బొగుడ, గుడిపల్లి గట్టు రిజర్వాయర్లతో పాటు వాటికి అనుసంధానంగా ఉన్న చెరువులను నింపుతున్నారు. ఎల్లూరు పంప్హౌజ్లో నీటి ఎత్తిపోతల కోసం 5 మోటార్లను ఏర్పాటుచేశారు. వీటిలో రెండు మోటార్లు పాడయ్యాయి. ఐదేళ్ల క్రితం పంప్హౌజ్లోకి నీరు చేరుకోవడంతో ఒక మోటార్, రెండున్నర ఏళ్ల క్రితం మరో మోటార్ దెబ్బతింది. వీటికి మరమ్మతు చేపట్టడంలో ఆలస్యం అవుతుండటంతో మూడు మోటార్లతోనే నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. వివిధ రకాల కారణాలతో సమస్య పరిష్కరించని అధికారులు ఎల్లూరు పంప్హౌజ్లో మూడు పంపులతోనే ఎత్తిపోతలు దీర్ఘకాలంగా కొనసాగుతుండటంతో ప్రాజెక్టుపై తీవ్రభారం తాజాగా వరదలు వచ్చే సీజన్ కావడంతో ఈసారి అదే పరిస్థితి పూర్తిగా నిలిపివేస్తేనే.. ప్రాజెక్టులో మోటార్ల మరమ్మతుకు పలు రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు తాగునీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ స్కీం కేఎల్ఐ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉండటంతో రెగ్యులర్గా నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. దీంతో మోటార్ల మరమ్మతుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మోటార్లకు మరమ్మతు చేయాలంటే నీటి ఎత్తిపోతలు కొంతకాలం పాటు పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. పాలమూరు ప్రాజెక్టు పూర్తిగా అందుబాటులోకి వస్తేనే.. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు నిలిపివేసేందుకు వీలు ఏర్పడుతుంది. పాలమూరు ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా ప్రారంభమయ్యే వరకు మోటార్లకు మరమ్మతు చేపట్టడం కష్టమేనని అధికారులు చెబుతున్నారు. -
ఓటరు సమగ్ర సవరణ సామాజిక బాధ్యత
వనపర్తి రూరల్: రాజకీయ పార్టీలు బాధ్యతగా తీసుకొని సర్ ప్రక్రియను వేగవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అచ్చుతాపురం, రాజనగరంలో కొనసాగుతున్న ఎన్యూమరేషన్ విధానాన్ని స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. పట్టణ కేంద్రంలో 57 శాతం పూర్తయిందని.. అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ శ్రేణులు అప్రమత్తమై ప్రతి ఇంటికి తిరుగుతూ అర్హులైన ఓటర్లను గుర్తించి తుది జాబితాలో పేరు ఉండేవిధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో జాబితా సవరణ ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలుసుకొని ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. అనంతరం గ్రామంలోని మండల మహిళా సమాఖ్య మాజీ అధ్యక్షురాలు సిలిమూర్తి చిట్టెమ్మ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. వారి ఇంటికి వెళ్లిన మాజీ మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సర్పంచ్ శాంతయ్య, జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, మాధవరెడ్డి, మండల అధ్యక్షులు మాణిక్యం, ధర్మానాయక్, డేగ మహేశ్వర్రెడ్డి, చిట్యాల రాము, శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఆగస్టు 15లోగా యూనిఫామ్స్ అందించాలి పాన్గల్: పాఠశాలల విద్యార్థులకు ఆగస్టు 15లోపు యూనిఫామ్స్ అందించేలా దర్జీలు ప్రయత్నించాలని డీపీఎం నాగమల్లిక అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో యూనిఫామ్స్ వస్త్రాన్ని ఆమె పరిశీలించి అనంతరం ఎమ్మార్సీ కార్యాలయంలో ఎంఈఓ ఆనంద్తో సమావేశమయ్యారు. మండలంలోని పాఠశాలల వారీగా విద్యార్థుల సంఖ్య, ఆయా గ్రామాల్లో యూనిఫామ్స్ కుట్టేందుకు అవసరమైన దర్జీలపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫామ్స్ క్లాథ్ను పాఠశాలల వారీగా దర్జీలకు వెంటనే పంపిణీ చేయాలన్నారు. దర్జీలకు అందజేసిన యూనిఫామ్స్పై సీసీలు పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని కోరారు. ఐకేపీలో ఏపీఎం పోస్టును భర్తీ చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని ఆమె దృష్టికి తీసుకరాగా డీఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సీసీలు సువర్ణ, వసంత పాల్గొన్నారు. న్యాయ సేవలపై అవగాహన ఉండాలి వనపర్తి రూరల్: ఉచిత న్యాయ సేవలపై విదార్థులు అవగాహన కలిగి ఉండాలని డీసీఓ శ్రీవేణి అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి కళార్చన ఆదేశాల మేరకు బుధవారం మండలంలోని పెద్దగూడెం శివారులో ఉన్న కడుకుంట్ల ఎంజేపీ గురుకుల పాఠశాలలో ఉచిత న్యాయ సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్యతో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు. వాహనంపై ఏర్పాటు చేసిన తెరపై లఘు చిత్రాలను ప్రదర్శించి విద్యార్థులకు చట్టాలపై సులభంగా అవగాహన కల్పించారు. విద్యా హక్కుచట్టం, బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, సైబర్క్రైమ్ చట్టాల గురించి వివరించారు. ఉచిత న్యాయ సేవలకు టోల్ఫీ నంబర్ 15100 సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, డిప్యూటీ లీగల్ ఎయిడ్ సభ్యులు పాల్గొన్నారు. బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని బీసీ స్టడీసర్కిల్లో గ్రూప్స్, ఆర్ఆర్బీ, ఎస్సెస్సీ, బ్యాకింగ్ వంటి పోస్టులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి విష్ణునందన్, స్టడీ సర్కిల్ డైరెక్టర్ స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల నారాయణపేట, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల అభ్యర్థులు ఆన్లైన్లో వచ్చే నెల14లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. గతంలో శిక్షణ పొందిన వారు అనర్హులని, మరింత సమాచారం కోసం 74167 31371 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
ఉపాధ్యాయుల కృషితోనే మూడో స్థానం
కొత్తకోట రూరల్: ఉపాధ్యాయులు బోధనా విధానాలను మరింత మెరుగుపర్చుకుని జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని ఇన్చార్జ్ జిల్లా విద్యాధికారి యాదయ్య అన్నారు. పెద్దమందడి మండలం బలిజపల్లి–జంగమాయపల్లి ఉన్నత పాఠశాలలో గణిత, ప్రాథమిక ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న మూడురోజుల వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో భాగంగా బుధవారం రెండోరోజు శిక్షణను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత విద్యాసంవత్సరంలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమంపై నిర్వహించిన సర్వేలో జిల్లా రాష్ట్రంలో మూడో స్థానం సాధించడం ఉపాధ్యాయుల అంకితభావం, కృషికి నిదర్శనమన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాల స్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తే జిల్లా మరింత మెరుగైన ఫలితాలు సాధించి రాష్ట్రంలోనే అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉందన్నారు. అనంతరం శిక్షణ తరగతులను పరిశీలించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. పాఠశాల ఆవరణ, అటల్ టింకరింగ్ ల్యాబ్, బడితోటలను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. రెండోతరగతి ఎఫ్ఎల్ఎన్ ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలవడంపై ఉపాధ్యాయులను అభినందిస్తూ, ఇదే ఉత్సాహంతో మరింత కృషి చేసి ప్రథమ స్థానం సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మానిటరింగ్ అధికారి మహానంది, శిక్షణ ఆర్డీఓ రంజిత్రెడ్డి, మండల విద్యాధికారి ఎస్.మంజులత, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యామ్నాయ సాగుపై అవగాహన కల్పించాలి
వనపర్తి: ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్తో కలిసి మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. జిల్లాలో గుడిసెలు, టార్పాలిన్ షెడ్లలో నివసిస్తున్న కుటుంబాలపై క్షేత్రస్థాయిలో మరోసారి సమగ్ర సర్వే నిర్వహించాలన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం గుడిసెల్లో నివసించే వారికే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. జిల్లాలో గుడిసెల్లో నివసిస్తున్న వారికి సంబంధించి ఇప్పటికే గుర్తించిన 1,367 కుటుంబాల జాబితాపై ప్రభుత్వం రీ–సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినందున ఎంపీడీవోలు, వెరిఫికేషన్ అధికారులు ఈ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. అలాగే ఈ ఏడాది జిల్లాపై ఎల్నినో ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని, ప్రస్తుతం వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులను అప్రమత్తం చేయాలన్నారు. ప్రతి గ్రామంలో రైతులతో సమావేశాలు నిర్వహించి, వరికి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలైన కంది, పెసర, మినుములు, వేరుశనగ, కూరగాయలు తదితర పంటల సాగుపై అవగాహన కల్పించాలని కోరారు. అదేవిధంగా ఉద్యాన పంటలైన ఆయిల్పాం ఇతరాత్ర వాటిని కూడా ప్రోత్సహించాలన్నారు. రోజు కనీసం రెండు గ్రామాల్లో రైతు అవగాహన సమావేశాలు నిర్వహించాలని, వర్షాధార వ్యవసాయంపై పూర్తిగా ఆధారపడకుండా రైతులను చైతన్యపర్చాలని సూచించారు. ఎల్నినో ప్రభావాన్ని ఓ సవాలుగా స్వీకరించి, నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. వర్షాధార పంటలు వేసి రైతులు నష్టపోకుండా వారిని అవగాహన కల్పించి రక్షించాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఆర్డీఓ ఉమాదేవి, హౌసింగ్ పీడీ విఠోబా, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, ఉద్యానశాఖ అధికారి విజయభాస్కర్, పంచాయతీ అధికారి రఘునాథ్ రెడ్డి, మండల స్థాయిలో తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఏఓ లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి
వనపర్తిటౌన్: జిల్లాలో ఓటు చోరీకి తావు లేకుండా సర్ ప్రక్రియ పారదర్శకంగా నమోదు చేయించాలని డీసీసీ చైర్మన్ శివసేనారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో సర్ ప్రక్రియ పురోగతిపై పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.. సర్ డిజిటలైజేషన్ ప్రక్రియ మొదలైన నాటి నుంచి మండలాలు, గ్రామాల వారీగా నివేదికను పరిశీలిస్తూ మందకొడిగా నడుస్తున్న కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆయా ప్రాంతంలో ఉన్న బీఎల్ఏ–2 క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్ జూమ్ కాల్ ద్వారా పర్యవేక్షిస్తున్నారని, గ్రామాల్లో, మండలాల్లో ఉంటూ సర్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, పట్టణాధ్యక్షుడు కదిరె రాములు, ఇన్చార్జీలు కోళ్ల వెంకటేష్, శరవంద, విజయలక్ష్మి, బి.కృష్ణ, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
ఓటరు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతం
వనపర్తి రూరల్: పారదర్శక ఓటరు జాబితాతోనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అంజనగిరి, వెంకటాపురం గ్రామాల్లో జరుగుతున్న ఓటరు ఎన్యూమరేషన్ విధానాన్ని స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం బీఎల్ఓలతో మాట్లాడుతూ.. పలు సూచనలు చేశారు. పార్టీ శ్రేణులు అప్రమత్తమై అర్హులైన ఓటర్లను తది జాబితాలో ఉండేవిధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అంజనగిరి ప్రాథమిక పాఠశాలను సందర్శించి తర గతి గదిలో ఉపాధ్యాయుడై విద్యార్థులకు పాఠాలు బోధించి, విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులంతా ప్రతిరో జు పాఠశాలకు హాజరు కావాలన్నారు. పోషకాహారం తీసుకోవడంతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించినప్పుడే ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్లు పృత్వీనాథ్ రెడ్డి, శాంతమ్మ మండల అధ్యక్షులు మానిక్యం, సింగిల్ విండో అధ్యక్షులు రాఘువర్దన్ రెడ్డి, ధర్మనాయక్, మాదవరెడ్డి, మహేశ్వర్ రెడ్డి,చిట్యాల రాము పాల్గొన్నారు. -
చిగురించి ‘ఆయిల్’ ఆశలు
నర్వ: దేశంలో నూనెగింజల ఉత్పత్తి తగ్గటం.. నూనెల వినియోగం గణనీయంగా పెరగడం కారణంగా ప్రతిఏటా రూ.70 వేల కోట్ల ఆయిల్ను దిగుమతి అవుతోంది. ఈ నేపథ్యంలో డిమాండ్ మేర నూనె గింజల ఉత్పత్తిని పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించి ఆయిల్పాం సాగును ప్రోత్సహిస్తున్నాయి. ప్రారంభంలో ఆసక్తి చూపని రైతులు తదనంతరం ప్రభుత్వం అందిస్తున్న రాయితీలతో ముందుకు వస్తున్నారు. దీనికి తోడు ప్రస్తుతం మార్కెట్లో టన్ను ఆయిల్పాం ధర రూ.24 వేల వరకు పలుకుతుండడంతో సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో.. మొదట్లో పైలెట్ ప్రాజెక్టుగా నారాయణపేట జిల్లాలో 2020–21 ఏడాది ప్రారంభంలో 430 ఎకరాలు మాత్రమే ఆయిల్పాం సాగు ప్రారంభించిన అధికారులు 2021లో జిల్లాకు 4.60 లక్షల మొక్కలు దిగుమతి చేసుకున్నారు. అప్పటి నుంచి 2025 వరకు ఉమ్మడి జిల్లాలో 33,999 ఎకరాల్లో విస్తరించగా.. నారాయణపేట జిల్లాలోనే 7 వేల ఎకరాల్లో ఆయిల్పాంను రైతులు సాగు చేస్తున్నారు. అయితే జిల్లాలో ఆయిల్పాం పరిశ్రమ అందుబాటులో లేకపోవడంతో ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటకు గెలలను తరలిస్తున్నారు. దీంతో రవాణా ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. గతేడాది జిల్లాలో ఆయిల్ఫెడ్ కార్పొరేషన్కు చైర్మన్ జంగా రాఘవరెడ్డి పర్యటించి రూ.300 కోట్లతో ఆయిల్పాం పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ప్రకటించగా.. మరికల్ మండలం చిత్తనూర్ వద్ద 80 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటు కోసం స్థలం సేకరణలో భాగంగా దాదాపు 40 ఎకరాలు కేటాయింపు కొలిక్కివచ్చింది. కోస్గి, మక్తల్లో ఏర్పాటు చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి సైతం సీఎం రేవంత్రెడ్డిని కోరడంతో ఆయిల్పాం రైతులకు ఆశలు రెట్టింపయ్యాయి. నారాయణపేట 6,907 వనపర్తి 6,400 30 కి.మీ., ఒకటి చొప్పున.. పంట కోత మొదలైనప్పటి నుంచి కొనుగోలు వరకు అయ్యే రవాణా ఖర్చులను ఆయిల్ఫెడ్ కార్పొరేషనే చెల్లిస్తోంది. ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున జిల్లాలో మక్తల్, మరికల్, మాగనూర్, కృష్ణా, నారాయణపేట, కోస్గి, మద్దూరు ప్రాంతాల్లో గెలల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సాగువిస్తీర్ణం ఇలా (ఎకరాలు).. ‘పేట’ జిల్లాలో మూడు చోట్ల పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదనలు చిత్తనూర్ వద్ద ఆయిల్పాం నర్సరీ, పరిశ్రమకు భూమి కేటాయింపు స్థానికంగా విక్రయించుకుంటేనే రైతులకు ప్రయోజనం ఇన్నాళ్లు ఫ్యాక్టరీ లేకపోవడంతో గెలల విక్రయానికి అవస్థలు జోగుళాంబ గద్వాల 7,700 నాగర్కర్నూల్ 7,692 మహబూబ్నగర్ 5,300 -
14 ఎకరాలకు సరిపోయేలా..
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు నర్సింహారెడ్డి. ఆత్మకూర్ మండలంలోని మూలమళ్ల గ్రామం. జూరాల ఆయకట్టు పరిధిలో ఈసారి 14 ఎకరాల్లో వరి పంటను సాగుచేసేందుకు అవసరమైన నారును సిద్ధం చేసుకుని, కరిగెట చేయించాడు. ఇప్పటికే రూ.లక్ష పైగా ఖర్చుతో సాగు పనులు పూర్తి చేసిన తర్వాత సాగునీరు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నాడు. ఎడమ కాల్వలో నీరు లేదని సమాంతర కాల్వ ద్వారా పైప్లైన్ వేసి నీరు తీసుకుందామనుకున్న కాల్వను మూసేశారని వాపోతున్నాడు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి వానాకాలంలో ఇలాంటి పరిస్థితి చూడలేదని చెప్పుకొస్తున్నాడు. -
బాలికల విద్యాభివృద్ధికి తోడ్పడాలి
వనపర్తి: బాలికల విద్యను ప్రోత్సహించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి, వారు ఉన్నత చదువులు చదివేందుకు తోడ్పాటు అందించడం అభినందనీయమని కలెక్టర్ ఆదర్శ్సురభి అన్నారు. గ్రామీణ భాగస్వామ్య స్వచ్ఛంద సంస్థ (వీఐపీ) వ్యవస్థాపకులు నాగేంద్రస్వామి ఆధ్వర్యంలో పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన బాలికలకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లాలోని ప్రతి మండలం నుంచి పదో తరగతి తెలుగు మాధ్యమంలో అత్యధిక మార్కులు సాధించిన 15 మంది విద్యార్థినులను సత్కరించి, ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులు, మొక్కలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి సుధారాణి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రంజిత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కరువు.. ఛాయలు
● సాగునీటి కోసంఅన్నదాత ఎదురుచూపు ● వర్షాలు కురవక నోరెళ్లబెట్టిన జలాశయం ● జిల్లాలో 85 వేల ఎకరాల ఆయకట్టుపై ప్రభావంప్రశ్నార్థకంగా మారుతున్న జూరాల ఆయకట్టు సాగు భూములు కోల్పోయిన వారికే సాగునీరు లేదు జూరాల ప్రాజెక్టు నిర్మాణంలో భూమలను కొల్పోయిన నందిమల్ళ, ములమళ్ళ గ్రామాల రైతులకు సాగునీరును ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సమాంతర కాల్వ పేరిట ప్రాజెక్టులో ఉన్న నీటిని ముందు మండలాలకు తరలించుకుని వెలుతున్న పట్టించుకునే పాలకులే కరువయ్యారు. నీటి తరలింపు వ్యవహరంలో తమ రైతుల పొట్టకొట్టి వ్యవసాయంకు దురం చేస్తున్నారు. – భాస్కర్రెడ్డి, రైతు, నందిమళ్ల అమరచింత: ప్రస్తుత ఖరీప్ సాగుపై అన్నదాతల్లో ఆందోళన మొదలయింది. వానాకాలం సీజన్ అర్ధభాగం ముగిసినా ఇప్పటికీ జలాశయాలు నోరెళ్లబెట్టి ఉన్నాయి. మునుపెన్నడు లేని విధంగా ఈ ఏడాది జూరాల ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు దాపరించాయి. ఆరుద్ర కార్తీ నాటికి వరి నాడుమడులు సిద్ధం చేసుకుని వరినాట్లను వేసుకునే పనుల్లో నిమగ్నమయ్యే ఆయకట్టు రైతులు నేడు సాగునీటి కోసం కళ్లలో ఒత్తులు పెట్టుకుని మేఘాల వైపు ఆశగా చూసే దుస్థితి నెలకొంది. ప్రాజెక్టు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు వానాకాలంలో పంటలకు సాగునీరు అందని దాఖలాలు లేవని అన్నదాతలు అంటున్నారు. జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల పరిధిలో 1.20 లక్షల ఎకరాలు సాగులోకి వస్తున్నాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో పూర్తి స్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందించి, యాసంగి సాగులో మాత్రం కొంత ఆయకట్టుకు కోతలు విధించేవారు. వారాబందీ పద్ధతిలో.. పదేళ్లుగా ప్రాజెక్టు అధికారులు సాగునీటి విడుదల విషయంలో పొదుపు చర్యలు పాటిస్తూ.. వారబందీ విధానం ప్రవేశపెట్టి వారంలో కేవలం 4 రోజులు మాత్రం నీరు ఆయకట్టుకు వదిలేవారు. మూడేళ్లుగా ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో నీటి నిల్వలు పూర్తిగా తగ్గుతుండటంతో ఎడమ కాల్వ పరిధిలో 20 వేల ఎకరాలు, కుడికాల్వ పరిధిలో 15 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించి మిగిలిన ఆయకట్టుకు క్రాప్ హలీడే ప్రకటించేవారు. గత యాసంగిలో సైతం కుడి, ఎడమ కాల్వల పరిధిలో 35 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని వదిలారు. -
ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తిటౌన్: తెలంగాణ ఓపెన్ స్కూల్స్లో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ రవీందర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓపెన్ స్కూల్, దూర విద్య విధానం ద్వారా అందించే ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్లో ప్రవేశానికి ఈనెల 28 వరకు నిర్ణీత రుసుము చెల్లించి దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఆలస్య రుసుముతో ఆగస్టు 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు ఫారాన్ని అప్లోడ్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం జిల్లా విద్యాధికారి కార్యాలయం, ww-w.telanganaope nschool.org వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. పెద్దమ్మ తల్లీ కరుణించమ్మా.. గోపాల్పేట: మండల కేంద్రంలో మంగళవారం పెద్దమ్మ బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు ఒకేరోజు పెద్దమ్మతల్లికి బోనమెత్తి కుటుంబసమేతంగా అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. మొదట మహిళలు అందంగా అలంకరించిన కుండల్లో నైవేధ్యం తయారు చేసి, ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని అమ్మవారికి నైవేధ్యం సమర్పించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి నిరంజన్రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. 25న లక్ష్మీచెన్నకేశవుడికి లక్ష పుష్పార్చన జడ్చర్ల టౌన్: మండలంలోని గంగాపురం శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామికి ఆషాఢ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని శనివారం లక్ష పుష్పార్చన నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ దీప్తిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వేడుక కొనసాగుతుందన్నారు. అనంతరం 4 గంటలకు అమ్మవారికి కుంకుమార్చన ఉంటుందన్నారు. తెల్లవారుజామన సుప్రభాత సేవతో ప్రారంభమయ్యే వేడుక 6.30 గంటలకు పంచామృతాభిషేకం, 9 గంటలకు పుణ్యాహవాచనం, రుత్విక్వరణం, సాయంత్రం 5 గంటలకు ప్రదోశ పూజ, రాత్రి 9 గంటలకు శయనోత్సవం జరిపించి మరుసటి రోజు ఆదివారం 7 గంటలకు స్వామికి సహస్రనామార్చన, 8 గంటలకు మహానివేదన చేస్తామన్నారు. -
ప్రభుత్వ ఖజానాకు గండి!
● పెబ్బేరు సంతలో నకిలీ రశీదుల కలకలం ● రూ 5.50 కోట్ల అక్రమ వసూళ్లు వనపర్తి రూరల్: పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని సంతలో టెండర్లు లేకుండానే కొందరు కాంట్రాక్టర్లు మున్సిపల్ కార్యాలయం పేర నకిలీ రశీదులతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని సీపీఎం నాయకులు ఆరోపించారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ 5.50 కోట్ల మేర నష్టం వాటిల్లితుందన్నారు. ఈ మేరకు మంగళవారం వారు మున్సిపల్ కమిషనర్ గణేష్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ మండల కన్వీనర్ మండ్ల రాజు, బాలయ్య మాట్లాడుతూ.. 2025, జనవరి నుంచి 2026, జూలై వరకు మున్సిపాలిటీ తరఫున సంతకు ఎలాంటి టెండర్లు వేయలేదన్నారు. అయినప్పటికీ కొందరు కాంట్రాక్టర్లు మున్సిపాలిటీ పేరుతో నకిలీ రశీదులను ముద్రించి, పురపాలక సంఘానికి ఎలాంటి సంబంధం లేకుండా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. వారానికి రూ.12 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు వసూలు చేస్తున్నా.. ఆ సొమ్మును మన్సిపాలిటీకి గానీ, ప్రభుత్వానికి గాని చెల్లించకుండా కాంట్రాక్టర్లే కాజేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ రకంగా ఇప్పటి వరకు సుమారు రూ.5.50 కోట్ల మేర అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులకు కనపడకపోవడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. వెంటనే స్పందించి అక్రమ వసూళ్లకు పాల్పడిన కాంట్రాక్టర్ల నుంచి సొమ్మును పూర్తిగా రికవరీ చేయాలని, నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకుంటాం.. మున్సిపల్ కార్యాలయం పేరు మీద నకిలీ రశీదులు ముద్రించి పెబ్బేరు సంతలో దళారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని మా దృషికి వచ్చింది. దీనిపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఈ వసూళ్లపై గతంలో స్థానిక పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. సంతకు సంబంధించిన భూ వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున్న మేము ఏ చర్యలు తీసుకోలేకపోతున్నాం. – గణేష్ మున్సిపల్ కమిషనర్, పెబ్బేరు -
అర్ధరాత్రి 12.30 దాటిన తర్వాతే..
ఆంధ్రప్రదేశ్లోని తాడిపత్రికి చెందిన ఓ అధికారిక రీచ్తో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కృష్ణా పరివాహకంలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అక్కడి కూటమి నేతల సహకారంతో ఆయా ప్రాంతాల నుంచి అక్రమార్కులు ఇసుక వాహనాలను కర్నూలు మీదుగా జాతీయ రహదారి మార్గంలో గద్వాల జిల్లా పుల్లూరు టోల్ప్లాజా గుండా సరిహద్దు దాటిస్తున్నారు. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చేరవేస్తున్నారు. రాత్రివేళల్లో నిత్యం 50 నుంచి 60 వరకు బెంజ్ వాహనాల్లో ఇసుక రవాణా కొనసాగుతుండగా.. ఇందులో అధికంగా 16 టైర్ల లారీల్లోనే తరలిస్తున్నారు. ఏపీలో ఉచిత ఇసుక నేపథ్యంలో అక్కడ ఒక లారీ లేదా బెంజ్ లోడ్కు రూ.10 వేల నుంచి రూ.12 వేలు మాత్రమే తీసుకుంటున్నారు. చౌకగా లభిస్తుండడంతో ఇసుక మాఫియా హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలించి దూరాన్ని బట్టి టన్నుకు రూ.1,800 నుంచి రూ.2,200 వరకు విక్రయిస్తున్నారు. మొత్తంగా 16 టైర్ల బెంజ్ ఇసుక (47 టన్నులు.. అయితే పరిమితి మించి అదనంగా 25 నుంచి 30 టన్నుల వరకు వేస్తారు)ను కనిష్టంగా రూ.84 వేలు, గరిష్టంగా రూ.లక్ష వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిసింది. రాష్ట్ర సరిహద్దు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణా మండలం టైరోడ్డు సమీపంలోని ఓ ఆశ్రమం వద్ద కృష్ణానది పరివాహకంలో గతేడాది ఇసుక మాఫియా ఆధ్వర్యంలో నదిలో సుమారు ఆరు కి.మీ.ల మేర మట్టి రోడ్డు వేశారు. ప్రస్తుతం దీన్ని వదిలేసిన ఇసుకాసురులు వాసునగర్ వద్ద రెండు, ముడుమాల్ వద్ద ఒకటి మొత్తంగా మూడు చోట్ల నదికి అడ్డంగా మట్టి రోడ్లు వేసి దందా కొనసాగిస్తున్నారు. వరద వచ్చినప్పడు నీరు సజావుగా వెళ్లేలా సిమెంట్ పైపులతో తూములు ఏర్పాటు చేశారు. నది ప్రవహిస్తున్న క్రమంలో తప్పితే మిగతా రోజుల్లో ఆయా ప్రాంతాల్లో జేసీబీ, హిటాచీలతో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. పగలు నది నుంచి ఇసుకను తోడి సమీప పొలాల్లో డంప్ చేయడం.. రాత్రి 8 గంటల తర్వాత ఆయా ప్రాంతాల నుంచి కర్ణాటకకు చెందిన 12 చక్రాల బెంజ్ వాహనాల్లో యాద్గిరి, సైదాపూర్, గుల్బర్గా వంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో బెంజ్ ఇసుకను దూరాన్ని బట్టి రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. అక్రమ ఇసుక దందాతో వేసిన పంటకు నీరందించే పైపులైన్లు దెబ్బతింటున్నాయని రైతులు ప్రశ్నించగా.. వారిపై మాఫియా దాడులకు పూనుకుంటోంది. మూడుమాల్కు చెందిన ఓ రైతుపై 8 నెలల క్రితం దాడులకు తెగబడింది. దీంతోపాటు ప్రశ్నించిన పలువురిని బెదిరింపులకు గురిచేసినట్లు సమాచారం. దీనిపై కృష్ణా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు చెబుతున్నారు. అడ్డొస్తే చంపేస్తామని దందా నిర్వాహకులు బెదిరించడంతో ఓ పార్టీకి చెందిన వ్యక్తి ఈ విషయాన్ని నారాయణపేట జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. స్పందన కరువైందని తెలుస్తోంది. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల్ యదవేంద్రస్వామి ఆలయం పక్కన నదిలో నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు నారాయణపేట జిల్లా కృష్ణ్ణా మండలంలోని ముడుమాల్ జెడ్పీహెచ్ఎస్ బ్యాక్ సైడ్లో కృష్ణానదిలోకి వేసిన రోడ్డు మక్తల్ నియోజకవర్గ ముఖ్యనేత కనుసన్నల్లో కర్ణాటక బార్డర్లో కృష్ణానదిలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్లు వేసి పలువురు ఇసుకదందా నిర్వహిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కృష్ణా మండలంలో గతంలో ఇసుక అక్రమాల్లో చక్రం తిప్పి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరిన ఓ వ్యక్తి, ఓ బంధువు, మరికొందరు అనుచరుల ద్వారా ఇసుక లావాదేవీలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ఏపీ నుంచి తెలంగాణకు ఇసుక రవాణా అటు కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కర్నూలుకు చెందిన ఓ నేత, తెలంగాణలోని అలంపూర్కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే అయిన ముఖ్యనేత కనుసన్నల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి తెలంగాణకు ఇసుక రవాణాలో ఆటంకాలు కలగకుండా మాఫియా జాగ్రత్తలు తీసుకుంటోంది. అర్ధరాత్రి పోలీసుల గస్తీ, వాహనాల రద్దీ నామమాత్రమే కావడంతో 12.30 నుంచి తెల్లవారుజాము 3 గంటల మధ్య ఇసుక లోడ్ వాహనాలను పుల్లూరు టోల్ప్లాజా దాటిస్తోంది. వాహనాలు బయలుదేరే పది నిమిషాల ముందు ఓ ఎస్కార్ట్ కారు వెళ్లి ఆయా ప్రాంతాల్లో పోలీసుల పహారాపై ముందస్తు సమాచారమిచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఎన్హెచ్ వెంట పోలీస్స్టేషన్లు ఉన్నా.. ఇసుకాసురులు తమ పని కానిచ్చేస్తున్నారు. -
‘మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీజేపీ వ్యతిరేకం’
అమరచింత: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సృజన ఆరోపించారు. భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా మూడో మహాసభలు సోమవారం పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై సంఘం జెండాను ఎగురవేసి మాట్లాడారు. డీలిమిటేషన్ లింకుతో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టకపోవడాన్ని పూర్తిగా వ్యతిరేస్తున్నామన్నారు. బిల్లు అమలు బీజేపీకి ఏ మాత్రం ఇష్టం లేదని స్పష్టం చేశారు. దేశంలో మహిళలపై అనేక అఘాయిత్యాలు, ధౌర్జన్యాలు, హత్యలు జరుగుతున్నా ప్రధాని నరేంద్రమోదీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తగదన్నారు. మహిళలు లేనిదే దేశంలో ఏ కార్యక్రమం లేదని.. మహిళలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమై ఆ పార్టీని గద్దెదించాలని పిలుపునిచ్చారు. మహబూబ్నగర్, వనపర్తి జిల్లా అధ్యక్షులు పద్మ, కృష్ణవేణి, జిల్లా కార్యదర్శి సీత మ్మ, నాయకులు జయమ్మ, కళావతమ్మ, పద్మ, సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, మండల కార్యదర్శి అబ్రహం, పట్టణ కార్యదర్శి రవీందర్ పాల్గొన్నారు. -
పోలీస్ గ్రీవెన్స్కు 17 వినతులు : ఎస్పీ
వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 17 మంది వినతులు అందజేశారు. ఎస్పీ సునీతారెడ్డి ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా పరిశీలించి సంబంధిత పోలీస్స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి వినతులపై చట్టబద్ధంగా, పారదర్శకంగా, వేగవంతంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణికి వచ్చిన ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతగా పరిగణించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. ప్రజల సమస్యలను వినడం మాత్రమే కాకుండా వాటికి త్వరితగతిన పరిష్కారం చూపడమే ప్రజావాణి ఉద్దేశమన్నారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. అర్హులందరి పేర్లు ఓటరు జాబితాలో ఉండాలి వనపర్తి రూరల్: అర్హులైన ఓటర్లందరి పేర్లు తుది జాబితాలో కచ్చితంగా ఉండేవిధంగా బీఎల్వోలు కృషి చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. సోమవారం పెద్దగూడెం, రాజాపేట, ఆర్.తండా, కడుకుంట్ల, పెద్దగూడెంతండా, కిష్టగిరి, నాచహళ్లి, సవాయిగూడెం గ్రామాల్లో కొనసాగుతున్న సర్ ప్రక్రియను స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించి బీఎల్వోలకు పలు సూచనలు చేశారు. సర్ ప్రక్రియను ఇంటింటికి చేరవేసి విజయవంతం చేయాలని సూచించారు. బీఎల్వోలు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలు తప్పులు లేకుండా నింపి తిరిగి అందజేసి ఓటును కాపాడుకోవాలన్నారు. ఓటరు జాబి తా అత్యంత పారదర్శకంగా, తప్పులు లేకుండా ఉండేలా ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయాలన్నారు. బీఆర్ఎస్పార్టీ మండల అధ్యక్షుడు మాణిక్యం, సింగిల్విండో అధ్యక్షుడు రఘువర్ధన్రెడ్డి, సర్పంచ్లు ఎల్లయ్య, తిరుపతయ్య, పద్మ, మాజీ సర్పంచ్లు మాధవ రెడ్డి, ధర్మానాయక్, నాయకులు పాల్గొన్నారు. అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు వనపర్తి రూరల్: పెబ్బేరు బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జయచంద్ర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 2, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 4, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ 3, ఇంగ్లీష్ 1, మాథ్స్ 1, ఫిజిక్స్ 1, కెమిస్ట్రీ 1 ఖాళీలు ఉన్నాయని.. ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంటెక్, బీటెక్, పీహెచ్డీ పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. అనుభవం, అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు బయోడేటా, సంబంధిత ధ్రువపత్రాలతో 23వ తేదీ సాయంత్రం 4లోపు కళాశాలలో దరఖాస్తులు అందజేయాలని వివరించారు. 24న నిర్వహించే మౌఖిక పరీక్షకు అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు ఒక సెట్ జిరాక్స్, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోల తో హాజరుకావాలని, మరిన్ని వివరాలకు సెల్నంబర్ 80969 07523 సంప్రదించాలన్నారు.జీఓనంబర్ 12 రద్దు చేయాలి : సీఐటీయూ వనపర్తి రూరల్: జీఓనంబర్ 12, కార్మికులకు నిర్వహిస్తున్న సీఎస్సీ ఆరోగ్య పరీక్షలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలంటూ సోమవారం తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో కార్మికులు జిల్లాకేంద్రంలోని మర్రికుంట నుంచి కలెక్టరేట్కు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గేటు ఎదుట ఆందోళన చేపట్టి రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంధం మదన్, కార్యదర్శులు బొబ్బిలి నిక్సన్ పాల్గొని మాట్లాడారు. కార్మికులకు సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా అందించాలని, ఇన్స్యూరెన్స్ కంపెనీలకు నిధులను మళ్లించరాదని డిమాండ్ చేశారు. చిన్న వెంకటయ్య, రామచంద్రయ్యగౌడ్, రాబర్ట్, బాలస్వామి, పుల్లయ్య, ఆశన్న శాంతన్న, కురుమూర్తి, యాదగిరి, రాజు, స్వామి పాల్గొన్నారు. -
‘ప్రజావాణి’ అర్జీలను నిర్లక్ష్యం చేయొద్దు
● రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ వనపర్తి/వనపర్తిరూరల్: ప్రజావాణి అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఆయన పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులకు సిఫారస్ చేశారు. మధ్యాహ్న భోజన విరామ సమయం వరకు మొత్తం 61 అర్జీలు దాఖలయ్యాయి. అదేవిధంగా ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి రెండు అర్జీలు రాగా.. పరిష్కారం కోసం ఆర్డీఓ అధికారులకు సిఫారస్ చేశారు. -
డిప్యుటేషన్ రద్దు చేయాలి..
ఆరేళ్ల కిందట కాంట్రాక్టు పద్ధతిన గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు క్రాఫ్ట్, ిపీఈటీ ఉపాధ్యాయులను నియమించారు. కాగా డిప్యూటేషన్పై ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు ప్రస్తుత విద్యాసంవత్సరంలో తిరిగి పాఠశాలలో చేరాల్సి ఉండగా రాలేదు. ఇక్కడ పనిచేయకుండా వేతనాలు పొందుతున్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు క్రాఫ్ట్, క్రీడల్లో వెనకబడుతున్నారు. ఆయా ఉపాధ్యాయులను స్కూల్కు పంపించాలని అర్జీ దాఖలు చేశాం. – విద్యార్థుల తల్లిదండ్రులు, వై శాగాపూర్, పెబ్బేరు -
సర్ సా..గుతోంది!
● జిల్లాకేంద్రంలో నెమ్మదించిన ప్రక్రియ ● వలస ఓటర్లపై అధికారుల ప్రత్యేక దృష్టి ● సమీపిస్తున్న గడువు.. బీఎల్వోలపై పెరుగుతున్న ఒత్తిడి ●అర్హులందరూ తమ ఓటుహక్కు కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎన్యూమరేషన్ ఫార్యాలను తప్పులు లేకుండా ప్రస్తుత వివరాలు, ఫొటోతో పూరించి నిర్దేశిత గడువులోగా బీఎల్వోలకు అందజేయాలి. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పదిరోజుల గడువు పొడిగించింది. మరోసారి పెంచే అవకాశం చాలా తక్కువ. ఓటర్లంతా త్వరపడి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. – సుబ్రమణ్యం, ఆర్డీఓ, వనపర్తి వనపర్తి: భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో బీఎల్వోలు, అధికారులకు క్షేత్రస్థాయిలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. దీంతో గడువు పదిరోజులు పొడిగించినా.. సరిపోతుందా అనే సందిగ్ధం అధికారులు, ఆయా రాజకీయ పార్టీల్లో ఉన్నాయి. ఆర్డీఓ నిత్యం పోలింగ్స్టేషన్ల వారీగా పర్యవేక్షణ చేస్తూ ఎక్కడెక్కడ నెమ్మదించిందో తెలుసుకుని వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వనపర్తి నియోజకవర్గ పరిధిలోని 12 మండలాలు.. 316 పోలింగ్ కేంద్రాల పరిధిలో 2,75,570 మంది ఓటర్లు ఉండగా, అందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు అధికారుల నివేదికలు వెల్లడిస్తున్నా.. చాలామందికి ఫారాలు చేరలేదు. కొందరు బీఎల్వోల ఇంటికెళ్లి ఫారాలు తెచ్చుకుని తమ ఓటుహక్కును కాపాడుకునే ప్రయత్నం చేసిన వారిలో అక్షరాస్యులు, నిరక్షర్యాసులు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఉన్నారు. మండలం ఓటర్లు పూర్తయిన శాతం వనపర్తి 32,496 72.44 ఏదుల 9,587 76.79 రేవల్లి 13,258 78.31 పెద్దమందడి 32,142 79.04 గోపాల్పేట 27,321 79.33 పెబ్బేరు 27,999 80.90 శ్రీరంగాపురం 16,451 81.70 అడ్డాకుల 3,959 83.78 ఖిల్లాఘనపురం 33,496 86.32 మూసాపేట 1355 91.00 పురపాలికలు.. వనపర్తి 63,246 53.12 పెబ్బేరు 14,260 65.29 జిల్లాలో ఇప్పటి వరకు 72.88 శాతమే పూర్తి సోమవారం ఉదయం పది వరకు 72.88 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయినట్లు అధికారిక లెక్క. మరో 14 రోజుల్లో 26.22 శాతం పూర్తి చేయాల్సి ఉంది. వివిధ రాజకీయ పార్టీలు సైతం పోలింగ్ కేంద్రాల వారీగా బీఎల్ఏలను నియమించుకొని ఓటర్లకు సాయం చేస్తూ వారి ఎన్యూమరేషన్ ఫారాలను పూరించి బీఎల్వోలకు అందజేస్తున్నారు. అయినా ప్రక్రియ నెమ్మదిగానే సాగుతుండటం గమనార్హం. తెలంగాణాలో ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించే గడువును ఆగస్టు 4 వరకు పొడిగించారు. అయినా ఇచ్చిన గడువు సరిపోతుందా లేదా అనే సందేహంలో బీఎల్వోలు ఉన్నారు. గడువు దగ్గర పడుతున్నా కొద్ది వారిపై వత్తిడి పెరుగుతోంది. -
22న కార్గో పార్సళ్ల బహిరంగ వేలం
వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని బస్టాండ్లో ఉన్న ఆర్టీసీ కార్గో అండ్ పార్సిల్ విభాగంలో చాలా రోజులుగా తీసుకెళ్లని పార్సళ్లకు ఈ నెల 22న ఉదయం 11 గంటలకు డిపో ఆవరణలో వేలం నిర్వహిస్తున్నామని డిపో మేనేజర్ దేవేందర్గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మెడికల్, ఆటోమొబైల్స్ స్పేర్స్, క్లాథ్ బ్యాగ్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువులు ఉన్నాయని.. ఆసక్తి గల వ్యాపారులు, పట్టణవాసులు వేలంలో పాల్గొనాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సెల్నంబర్ 91542 98609 సంప్రదించాలని సూచించారు. ‘సర్’ ప్రక్రియకు సహకరించాలి వీపనగండ్ల: గ్రామాల్లోని ఓటర్లు పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్వోలకు సకాలంలో అందజేయాలని జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ కోరారు. ఆదివారం మండలంలోని కల్వరాలలో ఇల్లిల్లూ తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించారు. అర్హులైన ఓటర్లు బాధ్యతగా వ్యవహరించి తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు బీఎల్వోలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిరక్షరాస్యులు ఎన్యూమరేషన్ ఫారాలు పూరించేందుకు గ్రామాల్లోని బీఎల్ఏల సహకారం తీసుకోవాలని, వలస ఓటర్లు తమ ఓటు హక్కును నిలుపుకోవాలని ఆయన కోరారు. స్వీపర్లపై వేధింపులు ఆపాలి : ఏఐటీయూసీ వనపర్తి రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పార్ట్టైం స్వీపర్లు, స్కావెంజర్లపై వేధింపులు ఆపాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల స్వీపర్ల యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షులు మోషా డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలో సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన స్వీపర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వీపర్లకు తక్కువ వేతనం చెల్లిస్తూ ఎక్కువ పని చేయిస్తున్నారని.. ఉపాధి కూలీలకు రోజుకు రూ.307 ఇస్తుంటే వీరికి మాత్రం రూ.170 మాత్రమే చెల్లిస్తున్నారని చెప్పారు. అరకొర వేతనానికి రోజంతా పాఠశాలల్లోనే ఉంచి వెట్టిచాకిరీ చేయించుకోవడం అన్యాయమన్నారు. ఉదయాన్నే పాఠశాల ఊడ్చడం, తాగునీరు అందించడం మాత్రమే స్వీపర్ల పనని.. గతంలో ప్రభుత్వం మరుగుదొడ్లను శుభ్రం చేయడానికి ప్రత్యేకంగా స్కావెంజర్లను నియమించి తర్వాత తొలగించిందని తెలిపారు. ముఖ్యంగా కొత్తకోట మండలంలో వేధింపులు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నెల 30న పెబ్బేరులో జరగబోయే ఏఐటీయూసీ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, నేతలు గోపాల్గౌడ్, మాలిక్, శోభారాణి, చంద్రమ్మ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. టూడేలీగ్లో విజేతగా నిలవాలి మహబూబ్నగర్ క్రీడలు: హైదరాబాద్లో సోమవారం నుంచి జరిగే హెచ్సీఏ బీ–డివిజన్ టూడేలీగ్ చాంపియన్షిప్లో ఉమ్మడి జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ అన్నారు. హెచ్సీఏ టూడేలీగ్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్టును ఆదివారం స్థానిక పిల్లలమర్రి రోడ్డులోని ఎండీసీఏ క్రికెట్ మైదానంలో రాజశేఖర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టూడేలీగ్లో క్రీడాకారులు తమ వ్యక్తిగత ప్రదర్శన చాటాలని పిలుపునిచ్చారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా సమష్టిగా, ఏకాగ్రతతో ఆడితే విజయం సాధించవచ్చన్నారు. ఉమ్మడి జిల్లా క్రీడాకారులు రానున్న రోజుల్లో రంజీ, భారతజట్టుకు ఆడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎండీసీఏ ఉపాధ్యక్షుడు సురేష్కుమార్, సంయుక్త కార్యదర్శి వెంకటరామారావు, కోచ్ అబ్దుల్లా పాల్గొన్నారు. టూడే లీగ్ గ్రూప్–సీలో సోమవారం మహబూబ్నగర్ జిల్లా జట్టు తన తొలి మ్యాచ్లో చేతన్ ఆనంద్ సీఏ జట్టుతో తలపడనుంది. ఉమ్మడి జిల్లా జట్టు ఇదే.. ఎ.శ్రీకాంత్– కెప్టెన్ (మహబూబ్నగర్), సంజయ్ (నాగర్కర్నూల్), అభిలాష్గౌడ్ (నారాయణపేట), వర్షిత్రెడ్డి, కేతన్ (జడ్చర్ల), ఎన్.జశ్వంత్ (నాగర్కర్నూల్), శశాంక్ (మహబూబ్నగర్), జి.జశ్వంత్ (నాగర్కర్నూల్), ముఖిత్ (మహబూబ్నగర్), గగన్ (నాగర్కర్నూల్), వెంకట్సాగర్ (గద్వాల), సాయి ప్రమోద్, అరవింద్, అద్నాన్ (మహబూబ్నగర్), విగ్నేష్ (జడ్చర్ల), కేతేశ్వర్ (నాగర్కర్నూల్), అఖిల్ (వనపర్తి), హర్షిత్ (జడ్చర్ల) ఉన్నారు. -
గుర్తింపు పొందిన దుకాణాల్లో కొనుగోలు చేయాలి..
పీఏసీఎస్లు, రైతు ఆగ్రో సేవాకేంద్రాలు, హాకా సెంటర్లు, ఫర్టిలైజర్ దుకాణాల్లో మాత్రమే ఎరువులు, విత్తనాలు అధికారికంగా సరఫరా చేస్తారు. ఈ–పాస్ యంత్రం సాయంతో పంపిణీ ఉంటుంది. అనధికారిక ఎరువులు, విత్తనాలను రైతులు విశ్వసించొద్దు. అపరిచితుల వద్ద ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయొద్దు. చిన్నంబావిలో పట్టుబడిన డీఏపీ నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించాం. నివేదికలు వచ్చాక వివరాలు వెల్లడిస్తాం. అక్రమ విక్రయాలపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – ఆంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి ● -
అభివృద్ధిపై అరోపణలు అర్థ రహితం
అమరచింత: నియోజకవర్గంలో రూ.1,400 కోట్ల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతుంటే.. అభివృద్ధి ఎక్కడంటూ బీఆర్ఎస్ నాయకులు అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని, ఇది సరికాదని రాష్ట్ర గీత పారిశ్రామిక కార్పొరేషన్ వైస్ చైర్మన్ కేశం నాగరాజ్గౌడ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మంత్రి వాకిటి శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 14 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకురాని చేతగాని పాలన చేశారని.. కాంగ్రెస్ హయంలో జరుగుతున్న అభివృద్ధికి చూడలేకపోతున్నారని విమర్శించారు. అమరచింత మండలానికి ఇప్పటి వరకు రూ.124.95 కోట్లు మంజూరు చేశామని.. ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులే నిదర్శనమన్నారు. ఆత్మకూర్కు రూ.248.02 కోట్లు మంజూరయ్యాయని వివరించారు. ఎత్తిపోతల పథకాలను విస్మరించడంతో అవి మరుగునపడి రైతులకు సాగునీరు కరువైన పరిస్థితులు బీఆర్ఎస్ పాలనలో కొనసాగాయని ఆరోపించారు. లిఫ్ట్ల మరమ్మతుతో పాటు ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో ముందుకు సాగుతుంటే కేవలం లబ్ధి కోసం నీచ రాజకీయాలకు పాల్పడటం తగదన్నారు. మరుగునపడ్డ చంద్రగఢ్ లిఫ్ట్ను వినియోగంలోకి తీసుకొస్తున్నామని, ఆత్మ కూర్ మండలం జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై వంతెన పనులు కొనసాగుతున్నాయని వివరించారు. హద్దు మీరితే చర్యలు తప్పవు.. పార్టీలో ఉంటూ ఎవరైనా అక్రమాలకు పాల్పడటం, రౌడీయిజం చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని నాగరాజుగౌడ్ హెచ్చరించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి నాయకుడి వరకు ఎవరైనా ఉపేక్షించేది లేదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ జింక సువర్ణ రవి, కాంగ్రెస్పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు రవికాంత్, రాజేందర్రెడ్డి, డీసీసీ కార్యదర్శి రమేష్ ముదిరాజ్, పార్టీ మాజీ అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్కుమార్, మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టుల సాధనకు సమష్టిగా కృషి
● అసంపూర్తి పనులు పూర్తిచేస్తే బీడు భూములు సస్యశ్యామలం ● విస్తృత స్థాయి రౌండ్టేబుల్ సమావేశంలో వక్తల పిలుపు జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల సాధన కోసం సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని వక్తలు పిలుపునిచ్చారు. ఆదివారం పెండింగ్ ప్రాజెక్ట్ల సాధన జేఏసీ ఆధ్వర్యంలో మహబూబ్నగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి జిల్లాలోని బీడు భూముల సాగునీటి సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై విస్తృత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో రైతులను మోసం చేసిందని, ప్రాజెక్టులు పూర్తి చేయకుండానే పూర్తి చేసినట్లుగా హంగామా చేసిందన్నారు. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేస్తే బీడు భూములను సస్యశ్యామలం చేయవచ్చన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ పాలమూరు వలసల జిల్లా, వెనకబడిన ప్రాంతంగా ఉండేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివిధాలా అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కనీసం రూ.30 వేల కోట్లు కావాలన్నారు. నిజాలను నిర్భయంగా చెప్పాలని, నిజాయితీగా మాట్లాడితేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని జేఏసీ నాయకులకు సూచించారు. కృష్ణానది నీటి వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు కలిసి చర్చలు జరిపితేనే శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ జిల్లా ప్రయోజనాల కోసం ఐక్యంగా పోరాటం చేద్దామని అన్నారు. జూరాల సామర్థ్యం 11 టీఎంసీలు ఉండగా ఇప్పుడు 6, 7 టీఎంసీల నీరు కూడా లేదని, పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి చేస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, ఆయా సంఘాలు, పార్టీల నాయకులు సాయిబాబా, షేక్ ఫరూఖ్ హుస్సేన్, బెక్కెం జనార్దన్, వీరబ్రహ్మచారి, జగపతిరావు, ప్రవీణ్కుమార్, రమేష్రెడ్డి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
రైతుల సంక్షేమమే బలమైన పునాది
వనపర్తిటౌన్: రైతుల సంక్షేమం, అభ్యున్నతే రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో జరిగిన జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు ధనలక్ష్మి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజా ప్రభుత్వంలో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని.. రైతులకు రూ.రెండు లక్షల రుణమాఫీ, రైతుబీమా, రైతు భరోసా అందిస్తూ అండగా నిలుస్తుందన్నారు. వ్యవసాయరంగ అభివృద్ధిలో రైస్మిల్లర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని.. రైతులు, వ్యాపారులు, వినియోగదారుల మధ్య వారధిగా నిలవాలని కోరారు. రైతులు పండించిన ధాన్యానికి విలువను జోడించి ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించడం రైస్మిల్లర్ల గొప్ప సేవ అని కొనియాడారు. జిల్లా రైస్మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్రంలో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు రైస్మిల్లర్ల సహకారం ఎంతో అవసరమని, ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం ధనలక్ష్మిని అధ్యక్షురాలి కుర్చిలో కూర్చొబెట్టి సన్మానించారు. కార్యక్రమంలో కార్యవర్గసభ్యులు, రైస్మిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
ఫర్టిలైజర్ దుకాణం
వనపర్తి: నకిలీ ఎరువులు, విత్తనాల కట్టడికి వ్యవసాయ, పోలీసు శాఖలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్రమార్కులు కొత్తదారులు వెదుక్కుంటున్నారు. మొన్న సూర్యాపేట.. నిన్న హైదరాబాద్.. నేడు వనపర్తి జిల్లాలో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కాగా.. ఫర్టిలైజర్ డీలర్లే అక్రమ దందాకు సూత్రదారులని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. హైదరాబాద్ కేంద్రంగా ఈ దందాకు బీజం పడినట్లు అఽధికారులు భావిస్తున్నారు. డీఏపీ కొరతను ఆసరాగా చేసుకొని అక్రమార్జనే లక్ష్యంగా ఈ దందాకు తెర తీశారు. జిల్లాలోని చిన్నంబావి మండలంలో ఏటా వర్షాకాలంలో మొక్కజొన్న ఎక్కువగా సాగు చేస్తారు. ఓ కంపెనీకి చెందిన డీఏపీ వాడితే అధిక దిగుబడులు వస్తాయని వ్యవసాయశాఖ అధికారుల సూచనల మేరకు ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు మొక్కజొన్న విత్తేందుకు సిద్ధం చేసుకున్నారు. డీఏపీ కొరత తలెత్తడంతో వెల్టూరుకు చెందిన ఓ వ్యక్తిని ఆశ్రయించారు. ఆయన రైతులకేదో మేలు చేసినట్లుగా తనకు పరిచయం ఉన్న పెబ్బేరు మండలం గుమ్మడంకు చెందిన ఒక డీలర్, గద్వాలకు చెందిన వంశీధర్రెడ్డి అనే మరో డీలర్లతో సంప్రదింపులు జరిపారు. గద్వాల డీలర్ హైదరాబాద్ ఆటోనగర్ నుంచి గద్వాలకు చెందిన డీసీఎంలో 200 బస్తాల అదె కంపెనీకి చెందిన డీఏపీని వెల్టూరుకు శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో తీసుకొచ్చారు. రైతులు వీరన్నగౌడ్ 60 బస్తాలు, ప్రవీణ్కు 20 బస్తాలు దించుకున్నారు. మార్కెట్లో కొరత కారణంగా ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.1,350 ఉండగా రూ.1,550కి విక్రయించేందుకు ప్రయత్నించారు. ధర ఎక్కువగా ఉంది.. నాణ్యత ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఆయా రైతులు వ్యవసాయశాఖ అఽధికారులను అడిగే ప్రయత్నం చేశారు. తమకు తెలియకుండా మండలానికి డీఏపీ రావడం ఏమిటని ఏఓ డాకేశ్వర్గౌడ్ వెల్టూరుకు వెళ్లి చూడగా అక్కడ గద్వాలకు చెందిన డీసీఎం డ్రైవర్ పరశురాముడు డీఏపీ విక్రయిస్తూ కనిపించాడు. వే బిల్స్, ప్రభుత్వ అనుమతి పత్రాలు చూపించాలని ప్రశ్నించగా.. గద్వాలకు చెందిన వంశీధర్రెడ్డి సూచన మేరకు హైదరాబాద్లో లోడ్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చినట్లు వివరించారు. ఏఓ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగి 120 బస్తాల డీఏపీతో పాటు డీసీఎంను పోలీస్స్టేషన్కు తరలించారు. ఏఓ ఫిర్యాదు మేరకు ఛీటింగ్ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పట్టుబడిన డీఏపీ నకిలీదా, అసలుదా పరీక్షించేందుకు ల్యాబ్కు పంపించనున్నట్లు అధికారులు చెప్పారు. రైతులు డీఏపీ నాణ్యత కోసం చేసిన ప్రయత్నం ఓ పెద్ద అక్రమార్కుల ముఠా గుట్టును రట్టుచేసినట్లు అయింది. నకిలీ డీఏపీరాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత నియోజకవర్గం, మండలంలో నకిలీ ఎరువుల విక్రయాల గుట్టురట్టు కావడంపై ఆయన సీరియస్గా స్పందించినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నమోదవుతున్న నకిలీ డీఏపీ ఘటనలపై ప్రభుత్వం, అధికారులు చిత్తశుద్ధితో విచారణ జరిపితే మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కొరతను ఆసరాగా చేసుకొని అక్రమార్జనే ధ్యేయంగా.. స్థానికులను మచ్చిక చేసుకొని ఇద్దరు డీలర్ల రహస్య దందా నాణ్యతన పరిశీలనకు అధికారులను పిలవడంతో విషయం వెలుగులోకి.. -
పౌల్ట్రీ ఫాంపై ఈగల్ బృందం దాడులు
● రూ.20 లక్షల విలువచేసే 1.150 కిలోల ఆల్ఫాజోలం సీజ్ ● ఆల్ఫాజోలం డాన్తోపాటు మరో ముగ్గురి అరెస్టు మహబూబ్నగర్ క్రైం: గతంలో ఆల్ఫాజోలం తయారు చేసి పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చాడు.. అయినా అతనిలో మార్పు రాకపోగా.. మళ్లీ అదే పద్ధతిని ఎంచుకొని ఆల్ఫాజోలం తయారు చేస్తూ.. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలంలోని తుంకినీపూర్ గ్రామానికి చెందిన ఎం.జయప్రకాష్గౌడ్, అదే గ్రామానికి చెందిన బాల ఆంజనేయులు ఇద్దరూ కలిసి అన్నాసాగర్ గ్రామ శివారులో బోయ నర్సింహులు అనే వ్యక్తి దగ్గర నెల రోజుల కిందట లక్ష్మీనర్సింహ పౌల్ట్రీ ఫాంను అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత పౌల్ట్రీ ఫాంలో రూ.40 లక్షల విలువ చేసే మిషన్ ఏర్పాటు చేసి.. ఆల్ఫాజోలం తయారు చేయడానికి రూ.20 లక్షల విలువ చేసే మెటీరియల్ సమకూర్చారు. అనంతరం వికారాబాద్కు చెందిన కృష్ణయ్యగౌడ్తో కలిసి జయప్రకాష్గౌడ్ ఆల్ఫాజోలం తయారు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్ ఈగల్ పోలీస్ బృందం ఆదివారం మధ్యాహ్నం ఆకస్మిక దాడులు చేసి.. రూ.20.30 లక్షల విలువ చేసే 1.150 కిలోల ఆల్ఫాజోలంతోపాటు మరో రూ.20 లక్షల విలువ చేసే మెటీరియల్ను సీజ్ చేశారు. అలాగే ఆల్ఫాజోలం సూత్రధారి జయప్రకాష్గౌడ్తోపాటు కృష్ణయ్యగౌడ్, బాలాంజనేయులు, నర్సింహులును సైతం ఈగల్ ఫోర్స్ బృందం అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించింది. బీటెక్ చదివి.. తుంకినీపూర్కు చెందిన జయప్రకాష్గౌడ్ బీటెక్ చదువు మధ్యలో వదిలేశాడు. మొదట్లో వీఆర్ఐగా కొన్ని రోజులు పనిచేశాడు. ఆ తర్వాత సికింద్రాబాద్లోని ఓల్డ్ బోయినపల్లిలో మేధా హైస్కూల్ ఏర్పాటు చేసి దాదాపు తొమ్మిదేళ్లు నడిపాడు. ఇదే సమయంలో ఓ వ్యక్తితో ఆల్ఫాజోలం తయారు చేసే ఫార్ములాను నేర్చుకున్నాడు. ఆ తర్వాత స్వయంగా అతను నిర్వహిస్తున్న పాఠశాలను అడ్డాగా చేసుకొని ఆల్ఫాజోలం తయారు చేయడం మొదలుపెట్టాడు. పాఠశాలలో అయితే ఎవరికి అనుమానం రాదని భావించి అక్కడే రెండు గదుల్లో ఈ దందా సాగించాడు. ఈ క్రమంలోనే గతేడాది సెప్టెంబర్ 13న ఈగల్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. అతని నుంచి 8 కిలోల ఆల్ఫాజోలం, రూ.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జైలుకు వెళ్లిన జయప్రకాష్గౌడ్ మళ్లీ ఈ ఏడాది మార్చి 16న జైలు నుంచి విడుదలయ్యాడు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి మకాం మార్చాడు. మూడు రోజుల నుంచి తనిఖీలు హైదరాబాద్కు చెందిన ఈగల్ ఫోర్స్ బృందాలు మూడు రోజుల నుంచి అన్నాసాగర్ శివారులో ఆల్ఫాజోలం తయారు చేస్తున్నట్లు సమాచారం తెలుసుకుని ఆయా ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. చివరికి ఆదివారం ఆరు కారులలో దాదాపు 20 మంది ఈగల్ ఫోర్స్ పోలీసులు స్థావరంపై ఆకస్మిక దాడులు చేసింది. ఆల్ఫాజోలం తయారీలో మంచి పట్టుసాధించిన జయప్రకాష్గౌడ్ రెండేళ్ల వ్యవధిలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని కల్లు దుకాణాలకు సుపరిచితుడిగా మారాడు. అతను తయారు చేసిన ఆల్ఫాజోలం ఉమ్మడి జిల్లాలో ఉన్న పలు కల్లు దుకాణాలకు సరఫరా అవుతున్నట్లు సమాచారం. వీటిని సరఫరా చేయడానికి స్థానికంగా మంచి నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సైతం ప్రత్యేకంగా కొందరిని ఏర్పాటు చేసుకొని కల్లు దుకాణాలకు వీటిని సరఫరా చేసినట్లు తెలుస్తోంది. -
పీయూలో విద్యార్థుల నిరసన
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: నేషనల్ సెమినార్ను యూనివర్సిటీలోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం పీయూ విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు పీయూ ఫార్మసీ కళాశాల హాస్టల్ వద్ద మధ్యాహ్న భోజనాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు. యూనివర్సిటీకే తలమానికంగా నిలిచే నేషనల్ సెమినార్ను హైదరాబాద్లో నిర్వహించడం సరైన పద్ధతి కాదన్నారు. అధికారులు మొండిపట్టు వీడి యూనివర్సిటీలోనే కార్యక్రమం నిర్వహించాలని డిమాండ్ చేశారు. పీఎం ఉషా ద్వారా రూ.100 కోట్లు విడుదలైతే వాటికి సంబంధించిన నిర్మాణాలు ఇప్పటికీ పూర్తికాలేదని, వాటిని కప్పిపుచ్చుకునేందుకే అధికారులు కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అధికారులు నిర్ణయం మార్చుకోకపోతే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. -
పంటమార్పిడిపై విస్తృత అవగాహన
వనపర్తి: ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వర్షాధార సాగుపై ఆధారపడే రైతులు నష్టాల పాలుకాకుండా పంట మార్పిడీపై విస్తృతస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఉద్యాన అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యాన అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అధికారులు గ్రామాల వారీగా రైతులతో సమావేశాలు నిర్వహించాలని.. కేవలం వరి సాగుకే పరిమితం కాకుండా భూభాగం, నేల స్వభావం, నీటి లభ్యత ఆధారంగా కూరగాయలు, ఉల్లి, మినుము, కంది, వేరుశనగ తదితర పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు. ఆయా ప్రాంతాలకు అనుకూలమైన, లాభదాయకమైన పంటల సాగు వైపు మళ్లించేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఉద్యాన అధికారులు ఆయిల్పాం సాగు విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి అధికారి సాగు లక్ష్యాలను నిర్దేశించుకొని తప్పనిసరిగా సాధించాలన్నారు. రాబోయే 15 రోజులు వ్యవసాయ, ఉద్యాన అధికారులు సెలవులు లేకుండా పూర్తిస్థాయిలో గ్రామాల్లో పర్యటిస్తూ రైతులను చైతన్యపర్చాలని కోరారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్, ప్రి–యూనిక్ సంస్థ సీపీఓ సింగారెడ్డి, ఏఓలు, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు. -
దోమల నివారణకు చర్యలు ముమ్మరం
వనపర్తి: వర్షాకాలంలో దోమల నివారణ, పారిశుద్ధ్య చర్యలను మరింత ముమ్మరం చేసి ప్రజారోగ్య పరిరక్షణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ ఆదేశించారు. ఫ్రై డే.. డ్రై డే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పుర పరిధిలోని 2వ వార్డు కమలానగర్లో పర్యటించి డ్రై డే కార్యక్రమ అమలు తీరును పరిశీలించారు. డ్రై డే సందర్భంగా నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. స్వచ్ఛత, వీధిదీపాల పనితీరు, వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. గుర్తించిన సమస్యలను తక్షణమే పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో శుభ్రత పాటించడం, దోమల నివారణ చర్యలను మరింత సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. అనంతరం గోపాల్పేట గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించి నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. రికార్డులను సక్రమంగా నిర్వర్తించడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించాలని, స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం గ్రామంలో అమలవుతున్న ఫ్రై డే.. డ్రై డే కార్యక్రమాలు, పారిశుద్ధ్య చర్యలు, దోమల నివారణ కార్యక్రమాలను పరిశీలించి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఆయన వెంట పుర కమిషనర్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, పుర సిబ్బంది, గ్రామపంచాయతీ అధికారులు ఉన్నారు. -
క్రమశిక్షణ, పారదర్శకతో మెరుగైన సేవలు
వనపర్తి: పోలీసు సిబ్బంది క్రమశిక్షణ, పారదర్శకతతో పనిచేస్తూ ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని.. ప్రతి పని సమయానికి పూర్తి చేయడంతో పోలీసుశాఖపై ప్రజల నమ్మకం మరింత పెరుగుతుందని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ అధికారులు, సిబ్బందితో ఎస్పీ ప్రత్యేక సమీక్ష నిర్వహించి పనితీరును ప్రశంసిస్తూ మరింత సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. స్పెషల్ బ్రాంచ్ విభాగం జిల్లా పోలీస్ వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తోందని.. క్షేత్రస్థాయిలో సిబ్బందికి అవసరమైన సమాచారాన్ని అందిస్తూ నేర నియంత్రణలో ముఖ్యమైన సహకారం అందిస్తోందని తెలిపారు. పాస్పోర్ట్, ఉద్యోగ వెరిఫికేషన్ ప్రక్రియ, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ల జారీ ఇతర విభాగాలకు సమన్వయంతో సహకారం అందించడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, ఎస్ఐలు మంజునాథ్రెడ్డి, నరేష్, పర్వతాలు, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. నిందితులకు శిక్ష పడేలా చూడాలి.. కోర్టు కేసుల్లో శిక్షల శాతాన్ని పెంచడం, తప్పుచేసిన వారికి శిక్ష పడేలా చేయడంతో ప్రజలకు పోలీసుశాఖపై మరింత గౌరవం, నమ్మకం పెరుగుతుందని ఎస్పీ సునీతరెడ్డి అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో కోర్టు లైజన్, కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నిందితులకు శిక్షలు పడినప్పుడే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని, ఇందుకుగాను కేసులు పెండింగ్లో లేకుండా చూసుకోవాలన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు నుంచి కేసు పూర్తయ్యే వరకు అవసరమైన రుజువులు, పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించడంలో కోర్టు పోలీసు అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని సూచించారు. బాధితులు, సాక్షులకు కేసుకు సంబంధించిన విషయాల్లో అవగాహన కల్పించాలని.. ప్రాసిక్యూషన్కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు ఎస్ఐలకు తెలియజేయాలన్నారు. పలువురు కోర్టు కానిస్టేబుళ్లతో మాట్లాడి కేసుల పురోగతిపై ఆరా తీశారు. సమావేశంలో డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి, జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు. -
‘సర్’ను సమర్థంగా పూర్తిచేస్తే నగదు పురస్కారం
● ఓటర్ల గుర్తింపులో బాధ్యతగా వ్యవహరించాలి ● బీఎల్వోలు, బీఎల్ఏల సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాన్గల్/వీపనగండ్ల: ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను నిర్దేశితా గడువులోగా అత్యంత సమర్థవంతంగా పూర్తిచేసిన బీఎల్వోలు, బీఏల్ఏలకు నగదు బహుమతులు అందజేస్తామని.. ప్రథమ బహుమతిగా రూ.10 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.5 వేలు చెల్లించనున్నట్లు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శనివారం పాన్గల్, వీపనగండ్ల రైతువేధికల్లో బీఎల్వోలు, బీఎల్ఏలతో నిర్వహించిన సమీక్షలో మంత్రితో పాటు నాగర్కర్నూల్ పార్లమెంట్ ఇన్చార్జ్ సిద్ధేశ్వర్, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి పాల్గొన్నారు. గ్రామాల వారీగా సర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించి మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు నమోదు సజావుగా జరగాలని.. ఓటు చోరీ జరగొద్దని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్లను తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తూ పశ్చిమబెంగాల్, బిహార్లో ఓట్ల చోరీ జరిగిందని.. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ యావత్ దేశానికి తన తెలియపర్చారని గుర్తు చేశారు. అర్హులైన ప్రతి ఓటరు పేరును ఆన్లైన్లో నమోదు చేసేందుకు బీఎల్వోలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. నిరక్షరాస్యులు, వలస వెళ్లిన వారి వివరాలు సేకరించి వారి పేర్లను కూడా ఓటరు జాబితాలో ఉండేవిధంగా చూడాలని, అందుకు గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, బీఎల్వోలకు అవసరమయ్యే సహకారం అందివ్వాలని సూచించారు. మనిషికి ఓటు లేకపోతే మనగడకు అంతరాయం కలుగొచ్చని.. 18 ఏళ్లు నిండిన వారంతా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సర్ ప్రక్రియ పార్లమెంట్ ఇన్చార్జ్ సిద్దేశ్వర్ సూచించారు. బీఎల్వోలు, బీఎల్ఏలు సమన్వయంగా పనిచేస్తూ ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేయాలని డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి కోరారు. తక్కువ సమయం ఉన్నందున ప్రతి ఒక్కరూ త్వరితగతిన పూర్తి చేసేలా దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో కాంగ్రెస్పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, సాయిచరణ్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్, వీపనగండ్ల తహసీల్దార్ ఎండీ ఖాజామైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ.. మకిలీ
● నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో వెలుగులోకి.. ● మహదేవునిపేటలో 117 ఎరువుల బస్తాలు స్వాధీనం ● రైతులు వినియోగించిన 39 ఖాళీ సంచులు సైతం.. ● కర్ణాటక నుంచి వచ్చి విక్రయించినట్లు అనుమానాలు ● గద్వాల, వనపర్తి జిల్లాల్లోనూ విక్రయాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కరువు మేఘాలు కమ్ముకుని.. వానాకాలం సాగుపై ఇప్పటికే సందిగ్ధత కొనసాగుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతాంగంలో నిరాశ వ్యక్తమవుతోంది. దీనికి తోడు నకిలీ ఎరువులు కలకలం సృష్టిస్తుండడంతో వారికి కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఇటీవల కరీంనగర్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో నకిలీ డీఏపీ విక్రయాలు వెలుగుచూడగా.. తాజాగా శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో పట్టుబడ్డాయి. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా రైతుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వెలుగులోకి ఇలా.. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహదేవునిపేట గ్రామానికి గురువారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తక్కువ ధరకు డీఏపీ ఎరువు ఇస్తామని తొలుత ఓ ఇద్దరు రైతులకు ఆశ చూపారు. వారి సహకారంలో శుక్రవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో మొత్తంగా ఎనిమిది మంది రైతులకు 156 బస్తాలు విక్రయించి వెళ్లిపోయారు. ఒక్కో బస్తాకు ఒక్కొక్కరి వద్ద ఒక్కో రకంగా రూ.1,300 నుంచి రూ.1,500 తీసుకున్నారు. వారు వెళ్లిన కొన్ని గంటలకు ఈ సమాచరం వెలుగులోకి రాగా పలువురు రైతులు నకిలీవనే అనుమానంతో ఏఈఓకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం కలెక్టర్, ఎస్పీ జిల్లా వ్యవసాయాధికారి దృష్టికి రాగా.. వారు వెంటనే గ్రామానికి చేరుకుని విచారించారు. 116 బస్తాల డీఏపీతో పాటు రైతులు వినియోగించిన 39 ఖాళీ సంచులను స్వాధీనం చేసుకున్నారు. వారి విచారణలో అవి నకిలీ ఎరువు బస్తాలని తేలినట్లు సమాచారం. దీంతో శాంపిళ్లను పరీక్షల నిమిత్తం హైదరాబాద్లోని ల్యాబ్కు పంపించనున్నట్లు వెల్లడించారు. గద్వాల, వనపర్తి జిల్లాల్లోనూ.. నకిలీ డీఏపీ ఎరువులకు సంబంధించి కర్ణాటకకు చెందిన పలువురు దళారులు ఉన్నట్లు సమాచారం. నాగర్కర్నూల్ జిల్లాలో బిజినేపల్లిలో వెలుగులోకి రాగా.. సమీప మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన రైతులు సైతం తీసుకెళ్లినట్లు తెలిసింది. అంతేకాదు.. వనపర్తి, గద్వాల జిల్లాల్లోని పలు మండలాల్లో తక్కువ ధర పేరిట వేలాది మంది రైతులకు అంటగట్టినట్లు తెలుస్తోంది. ఆయా జిల్లాల్లో పలు మండలాల్లోని మారుమూల గ్రామాల్లో అమాయక రైతులను టార్గెట్గా చేసుకుని కేటుగాళ్లు దందాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. నకిలీ డీఏపీ ఎరువుల దందా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మోసపోయిన రైతులు కలవరపడుతున్నారు. తమ బాధను వెల్లగక్కలేక, మింగలేక మథనపడుతున్నారు. రైతుల్లారా బీ అలర్ట్.. డీఏపీ.. డై అమ్మోనియం ఫాస్పేట్. వ్యవసాయంలో అత్యంత ప్రాముఖ్యత గల ఎరువు. విత్తనాలు విత్తే సమయంలో గానీ.. నాట్లు వేసేటప్పుడు గానీ దీన్ని బేసల్ ఎరువుగా వేస్తారు. వేరు వ్యవస్థ అభివృద్ధి, పంట ఎదుగుదల, అధిక దిగుబడికి ఇది దోహదం చేస్తుంది. అలాంటి ఈ ఎరువు అసలుదా.. నకిలీదా అని గుర్తు పట్టేందుకు మూడు రకాలుగా పరీక్షించాలని రైతులకు వ్యవసాయాధికారులు పలు సూచనలు చేశారు. డీఏపీ గింజను గోరుతో గట్టిగా నొక్కాలి. గింజ రాయిలా గట్టిగా ఉండి.. పగలకుంటే మంచిది. మట్టిగడ్డలా పొడిపొడిగా రాలిపోతే నకిలీది. కొన్ని డీఏపీ గింజలను చేతిలోకి తీసుకుని పాన్ (తాంబూలం)లో వేసే తడి సున్నం కలిపి బాగా రుద్దాలి. ఘాటైన వాసన (అమ్మోనియా) వస్తే అసలైన డీఏపీ. ఎలాంటి వాసన రాకపోతే రాతి పొడితో చేసిన నకిలీ ఎరువు అని గ్రహించవచ్చు. కొన్ని డీఏపీ గింజలను ఇనుప పెనం మీద వేసి వేడి చేయాలి. వేడికి ఉబ్బి కరిగిపోతే అసలైన డీఏపీ. కరగకుండా గట్టిగా ఉంటే నకిలీది. లైసెన్స్ ఉన్న ప్రభుత్వ లేదా ప్రైవేట్ డీలర్ల వద్ద మాత్రమే ఎరువులు కొనాలి. కొన్న తర్వాత దుకాణాదారుడి నుంచి కచ్చితంగా రశీదు తీసుకోవాలి. రాత్రి వేళ లేదా అనుమానాస్పద వ్యక్తుల వద్ద తక్కువ ధరకే వస్తుందని ఎట్టిపరిస్థితుల్లోనూ కొనుగోలు చేయొద్దు. ఎరువుల నాణ్యతపై అనుమానం వస్తే వెంటనే వ్యవసాయాధికారికి సమాచారం అందించాలి. నాగర్ కర్నూల్ జిల్లాలో అనుమతి ఉన్న విత్తన, ఎరువుల దుకాణాల్లో ఈ సారి పత్తి విత్తనాలు తక్కువగా అమ్ముడుపోయాయి. రైతులు ఎక్కడి నుంచో పత్తి విత్తనాలు కొనుగోలు చేసినట్లు అనుమానం ఉంది. నిఘా పెట్టడంతో పలు చోట్ల నకిలీ విత్తనాలు దొరికాయి. కానీ నకిలీ డీఏపీ ఎరువులు పట్టుబడడం ఉమ్మడి జిల్లాలో ఇదే మొదటిసారి అనుకుంటా. కర్ణాటక, గద్వాల సరిహద్దుల నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. రైతులు విత్తనాలు, ఎరువులు కొనేటప్పుడు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిందే. – చంద్రశేఖర్, జిల్లావ్యవసాయాధికారి, నాగర్కర్నూల్ నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలపై రైతులు అలర్ట్గా ఉండాలి. వీటిని విక్రయించిన వారు, ప్రోత్సహించిన వారికి చట్టప్రకారం శిక్ష తప్పదు. కొనుగోలు చేసిన రైతులు నకిలీ డీఏపీ ఎరువులను అంటగట్టిన వారి వివరాలు వెల్లడించకపోతే.. వారిపైనా చర్యలు తప్పవు. అవసరమైతే కేసులు పెట్టాల్సి వస్తుంది. – హేమంత్ కేశవ్ పాటిల్, కలెక్టర్, నాగర్కర్నూల్ నాగర్కర్నూల్ జిల్లాలో కలకలం సృష్టించిన నకిలీ డీఏపీ విక్రయాలకు సంబంధించి పోలీసులు కొందరు డీలర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. శుక్రవారం బిజినేపల్లి మండలంలోని మహదేవునిపేటలో 111 బస్తాలు నకిలీ డీఏపీ దొరికిన వ్యవహారంపై పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించడంతో తిమ్మాజిపేట మండలంలోని అమ్మపల్లిలో సైతం విక్రయించినట్లు తెలిసింది. దీంతో మాహదేవునిపేట, అమ్మపల్లి గ్రామాల్లో ఫర్టిలైజర్ దుకాణాలు నడిపే కొందరు డీలర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని వివరాలు సేకరించి దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. వ్యవసాయాధికారులు నకిలీ డీఏపీ నమూనాలను శనివారం టెస్టింగ్ కోసం హైదరాబాద్కు పంపించగా.. మంగళవారం నివేదిక రానుందని సంబంధిత అధికారి పేర్కొన్నారు. -
అర్ధరాత్రి త్రీఫేజ్ సరఫరా..
● జిల్లాలో 64,235 వ్యవసాయ కనెక్షన్లు ● బోరుబావుల కింద 1.20 లక్షల ఎకరాల వరి సాగు ● ఆందోళనలో రైతులు ‘ఈ ఫొటోలోని రైతు పేరు పోసిరిగారి రాజు. అమరచింత సమీపంలో ఉన్న తన వ్యవసాయ పొలంతో పాటు మరో 6 ఎకరాలు కౌలుకు తీసుకొని గత నెలలో కురిసిన వర్షాలకు పత్తి విత్తనాలు నాటారు. ప్రస్తుతం వాన జాడ కనిపించకపోవడంతో పక్క పొలం రైతు బోరుమోటారుకు స్ప్రింకర్లను బిగించి పొలం తడుపుతున్నారు. నిత్యం విద్యుత్ కోతలతో 6 ఎకరాలు కూడా తడవని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రూ.రెండు లక్షల పెట్టుబడి అయిందని.. పంట కాపాడుకునేందుకు పొలానికే పరిమితం కావాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.’ అమరచింత: బోరుబావుల కింద వానాకాలం పంటలు సాగు చేసిన అన్నదాతలు అప్రకటిత విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో బోరుబావుల కింద వరి వరి నాట్లు వేసుకున్నారు. ప్రస్తుతం కేవలం రోజుకు 15 గంటల మాత్రమే విద్యుత్ సరఫరా అవుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. నీరు సమృద్ధిగా ఉన్న బోరుబావుల కింద వరి సాగు చేయగా.. నీటి సౌకర్యం అంతంత మాత్రం ఉన్న బోరుబావుల కింద ఆరుతడి పంటలైన పత్తి, కంది సాగు చేపట్టారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవక భూగర్భ జలాలు సైతం తగ్గడంతో ఆరుతడి పంటలు కాపాడుకునేందుకు రైతులు పడుతున్న కష్టాలు వర్ణానాతీతం. జిల్లాలోని ప్రధాన జలాశయాలైన జూరాలతో పాటు రామన్పాడు, శంకరసముద్రం, సరళాసాగర్లోనూ నీటినిల్వలు అడుగంటడంతో ఆయకట్టు రైతులకు సాగు కష్టాలు నెలకొన్నాయి. వీటికితోడు గ్రామాల్లోని చెరువులు, కుంటలు సైతం ఎండుముఖం పట్టడంతో బోరుబావుల్లో నీటిమట్టం తగ్గి ఆపి ఆపి నీటిని బయటకు వదులుతున్నాయి. మండలం కనెక్షన్ల సంఖ్య పాన్గల్ 7,775 వీపనగండ్ల 5,781 గోపాల్పేట 5,638 పెద్దమందడి 5,136 చిన్నంబావి 4,926 ఖిల్లాఘనపురం 4,716 వనపర్తి టౌన్ 4,958 కొత్తకోట 4,848 పెబ్బేరు 4,070 రేవల్లి 3,612 అమరచింత 3,469 మదనాపురం 3,021 ఆత్మకూర్ 3,054 శ్రీరంగాపురం 2,353 వనపర్తి 878 రోజు సాయంత్రం 5.30 గంటలకు త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్న అధికారులు అర్ధరాత్రి 3, 4 గంటల సమయంలో వదులుతుండటంతో రైతులు పొలాల జాగారం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదేమిటని ట్రాన్స్కో అధికారులను ప్రశ్నించినా స్పందించడం లేదని.. తప్పరి పరిస్థితుల్లో ఉన్న సమయంలో నే పొలాలకు నీటిని వదులుతున్నామని చెబుతున్నారు. ఈసారి ఎల్నినో ప్రభావంతో సకాలంలో వర్షాలు కురవక జలాశయాలు నిండక విద్యుదుత్పత్తి ప్రశ్నార్థకంగా మారింది. విద్యుదుత్పత్తి లేకపోవడం, ఉన్న విద్యుత్ను సద్వినియోగం చేసుకొనేందుకు అప్రకటిత కోతలు విధించాల్సి వస్తోందని ట్రాన్స్కో అధికారులు తెలిపారు. -
బాల్యవివాహ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
ఖిల్లాఘనపురం: సమాజంలో బాల్యవివాహాలను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి జి.కళార్చన అన్నారు. శనివారం మండలంలోని మానాజీపేటలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాల్య వివాహాలు చేయడం, అందుకు సహకరించడం చట్టరీత్యా నేరమన్నారు. నియంత్రణకు అధికారులు, ఆశా, అంగన్వాడి కార్యకర్తలు, పోలీసులే కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. బాలలతో పనులు చేయించడం చట్టపరంగా నేరమన్నారు. బాల బాలికలు, వయోవృద్ధులు, బడుగు బలహీనవర్గాలు, మహిళలకు ఉచిత న్యాయసేవలు అందిస్తున్నట్లు చెప్పారు. మోటారు వాహనాలు, సైబర్క్రైమ్, పోక్స్, డ్రగ్స్ తదితర చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం చట్టాలపై రూపొందించిన లఘు చిత్రాలను ప్రజలతో కలిసి వీక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి కార్తీక్రెడ్డి, ప్రథమ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి అశ్విని, ఎస్ఐ వెంకటేష్, సర్పంచ్ శ్రీలత, సభ్యులు బాలయ్య, కృష్ణయ్య, శ్రీదేవి, రఘు, విశ్వనాథం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఏడుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు మన్ననూర్: స్థానిక పీవీటీజీ గురుకుల పాఠశాల/కళాశాల వసతిగృహంలో ఇటీవల ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారుల పరిశీలన, సమగ్ర విచారణ అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. ఇందుకు బాధ్యులైన ప్రిన్సిపల్ పద్మావతి, డిప్యూటీ వార్డెన్ గీత, ఏఎన్ఎం హుస్సేనమ్మతో పాటు మరో నలుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సస్పెన్షన్కు గురైన వారి స్థానంలో ఇన్చార్జిలతో పాటూ తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బంది నియామకాలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్పంచ్లకు ఓటుహక్కు కల్పించాలని పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సర్పంచ్ల సంఘం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వివిధ కమిటీల పేరుతో ఇతరులను అధ్యక్షులుగా నియమించడం తగదన్నారు. జాయింట్ చెక్పవర్ను రద్దు చేసి, కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన ఎన్ఆర్జీసీ నిధులను ఆయా గ్రామాలకే కేటాయించాలన్నారు. సర్పంచ్ల గౌరవ వేతనం రూ.25 వేలకు పెంచాలని, కలెక్టర్ వెంటనే గ్రీన్ చానల్ను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే విజన్–2047, వికసిత్ భారత్ వంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయన్నారు. కార్యక్రమంలో జోగుళాంబ గద్వాల జిల్లా సర్పంచ్ల ఫోరం కన్వీనర్ రాజశేఖర్, వనపర్తి జిల్లా కన్వీనర్ శేఖర్గౌడ్, నాగర్కర్నూల్ జిల్లా నాయకురాలు వీరోజు సుప్రియ తదితరులు పాల్గొన్నారు. హుండీ ఆదాయం రూ.10.67 లక్షలు చిన్నచింతకుంట: మండలంలోని అమ్మాపురం కురుమూర్తిస్వామి ఆలయానికి సంబంధించి అమావాస్య, శని, సోమవారాలను పురస్కరించుకొని భక్తులు కానుకలుగా సమర్పించిన హుండీ డబ్బులను ఆలయ అధికారులు శనివారం లెక్కించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.10,67,669 వచ్చినట్లు ఆలయ చైర్మన్ బాలరాజు, ఈఓ మధనేశ్వరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో బాలాజీ ట్రస్ట్ సభ్యులు, ఆలయ ఇన్స్పెక్టర్ వాసు, సభ్యులు తిరుపతిరెడ్డి, భాస్కరచార్యులు, నాగార్జున, భరత్కుమార్రెడ్డి, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. -
నారుమడి ఎండింది..
4 ఎకరాల్లో వరి సాగు చేయడానికి నారుమడి సిద్ధం చేసుకున్నా. పొలం దుక్కిదున్ని నాట్ల కోసం సిద్ధం చేసుకున్నా. తీరా బోరుబావి నుంచి నీరు ఆగి ఆగి వస్తుండటంతో చేసేది లేక వరినారు వదిలేశా. విద్యుత్ కష్టాలతో పాటు జూరాల జలాశయంలో నీరు లేకపోవడంతో బోరుబావిలో నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. – సుధాకర్రెడ్డి, రైతు, నందిమళ్ల ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవక ప్రధాన జలాశయాల్లో నిల్వ నీటిమట్టం తగ్గడంతో విద్యుదుత్పత్తి చేపట్టడం లేదు. ఉన్న విద్యుత్ను జాగ్రత్తగా వినియోగించుకునేందుకు బోరుమోటార్లకు నిత్యం 15 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నాం. రైతులు వరిసాగుకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఆరుతడి పంటలు వేసుకుంటే ఉన్న విద్యుత్తో పంటలకు నీరు వాడుకోవచ్చు. – తాతారావు, ఏఈ, ట్రాన్స్కో -
నిధులున్నా.. నిట్టూర్పే!
కొత్త పురపాలికల్లో కానరాని అభివృద్ధి పనులు● ప్రత్యేక నిధులు రూ.15 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం ● సీసీ రహదారులు, డ్రైనేజీలు తదితర పనులకు ప్రాధాన్యం ● అరకొర టెండర్లు.. ప్రారంభం కాని పనులు జిల్లాలో అమరచింత, ఆత్మకూర్, కొత్తకోట, పెబ్బేరు కొత్త పురపాలికలు. ఆయా పురపాలికల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇందుకు సంబంధించిన జీఓలు సైతం విడుదల కావడంతో ఆయా పుర ప్రజలు సంబురపడ్డారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన కౌన్సిలర్లు ఆ నిధులతో తమ వార్డుల్లో అభివృద్ధి చేపట్టాలని నిర్ణయించారు. కానీ నేటికీ ఆయా పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో అనే విషయాలు సైతం తెలియని పరిస్థితి నెలకొంది. అమరచింతలో రూ.3 కోట్లు, ఆత్మకూర్లో రూ.7 కోట్ల పనులకు సంబంధించి టెండర్లు, అగ్రిమెంట్ ప్రక్రియ పూర్తయిందని ఆయా పుర కమిషనర్లు చెబుతున్నారు. ఇక కొత్తకోట, పెబ్బేరు పురపాలికల్లో మాత్రం వాటి ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. నిధులు మంజూరయ్యాయి.. మరి పనులెప్పుడు ప్రారంభిస్తారని అడుగగా నిధుల మంజూరు కేవలం జీఓలకే పరిమితమైందని అధికారులు బదులివ్వగడం గమనార్హం. అమరచింత: కొత్త పురపాలికల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. జిల్లాలోని నాలుగు పురపాలికలకు కూడా ఒక్కో దానికి రూ.15 కోట్ల చొప్పున రూ.60 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులను గతేడాది జారీ చేసింది. పుర ఎన్నికల సమయంలో జనవరి 13న అమరచింత పురపాలికలో అభివృద్ధి పనులకుగాను రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపనలు కూడా చేశారు. ఎన్నికలు ముగిసి నెలలు గడుస్తున్నా పనుల గురించి చర్చించే అధికారులే కరువయ్యారు. పుర అధికారులను అడిగిన ప్రతిసారి టెండర్ల ప్రక్రియ పూర్తయింది.. త్వరలోనే ప్రారంభిస్తామని సమాధానం చెప్పడమే తప్పా ఆచరణలో అమలు కావడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. సీసీ రహదారులు, డ్రైనేజీలు, పురపాలిక భవనం, టౌన్హాల్తో పాటు వివిధ అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలని పుర ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం పురపాలికల్లో కొనసాగుతున్న అమృత్ 2.0 తాగునీటి పథకం పనులతో సీసీ రహదారులు దెబ్బతిన్నాయని.. వచ్చే నిధులతో వేగవంతంగా నిర్మించాలంటున్నారు. -
ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణలో వేగం పెంచాలి
వనపర్తి: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సాధ్యమైనంత త్వరగా విచారించి దోషులకు శిక్షపడే విధంగా చర్యలు తీసుకోవాలని నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన జరిగిన జిల్లా విజిలెనన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి ఆయనతో పాటు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హాజరయ్యారు. సమావేశంలో 2018 నుంచి నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, వాటి విచారణ, ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి, బాధితులకు అందిన పరిహారంపై సమీక్షించారు. 2025 నుంచి 2026 వరకు విచారణలో ఉన్న 12 కేసులపై చర్చించగా.. ఎస్పీ సునీతారెడ్డి వాటి పురోగతి, స్థితిగతులను కమిటీకి వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. 2020 నుంచి 2026 వరకు ఒక్క కేసు నేరారోపణ జరగలేదని ఇందుకు బాధ్యులెవరని ప్రశ్నించారు. తప్పు చేసిన వారికి చట్ట ప్రకారం కచ్చితంగా శిక్ష పడాలని, బాధితులకు న్యాయం జరగాలన్నారు. ఒకవేళ తప్పుడు కేసులు నమోదు చేస్తే విజిలెనన్స్ కమిటీ సభ్యులు నచ్చజెప్పి కేసు ఉపసంహరించుకునేలా చూడాలని సూచించారు. తప్పుడు కేసులు నమోదు చేయడం, తప్పు చేసినవారు శిక్ష పడకుండా బయట దర్జాగా తిరుగుతుండటం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. కేసులను సమగ్రంగా విచారించి తగిన ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేసి తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చూడాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. 2020లో నమోదైన ఒక కేసు 2026లో ట్రయల్కు రావడం ఇంకా తేదీ ఖరారు కాకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సమావేశానికి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. పౌరహక్కుల దినోత్సవం నిర్వహించాలి.. భూ సమస్యలు, భూ కబ్జాల వంటి కేసులకు అత్యంత ప్రాధాన్యమిచ్చి ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేకూర్చి అండగా నిలవాలని పోలీస్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రతినెల పౌరహక్కుల దినోత్సవం పకడ్బందీగా నిర్వహించి చట్టాలపై అవగాహన కల్పించి భరోసా ఇవ్వాలని సూచించారు. మంజూరైన సంక్షేమ పథకాలపై శాఖల వారీగా అధికారులతో ఆరా తీశారు. ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులకు సకాలంలో అందేవిధంగా చూడాలన్నారు. ప్రభుత్వం మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచి విద్యార్థులకు అండగా నిలిచేందుకు కృషి చేస్తుంటే.. వసతి గృహాల్లో వార్డెన్లు సరిగా ఉండటం లేదని, పర్యావసానంగా విద్యార్థులు నష్టపోతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి -
‘సర్’ ప్రక్రియ వేగవంతం
వనపర్తి రూరల్: సర్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, ఆన్లైన్ నమోదును వేగవంతం చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. గురువారం మండలంలోని చిమనగుంటపల్లిలో పర్యటించి ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, ఆన్లైన్ వివరాల నమోదును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి అర్హులైన ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి, పూర్తి చేసిన తర్వాత త్వరిగతిన సేకరించాలన్నారు. సేకరించిన ఫారాల వివరాలను రోజువారీగా ఆలస్యం లేకుండా ఆన్లైన్లో నమోదు చేయాలని, పెండింగ్ లేకుండా చూడాలని సూచించారు. ఫారాలు నింపడంలో ఓటర్లకు ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేయాలని.. నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు గ్రామపంచాయతీ కార్యదర్శులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని కోరారు. అనంతరం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను తనిఖీ చేసి తరగతి గదులను పరిశీలించారు. అదేవిధంగా విద్యార్థులతో మాట్లాడి మధాహ్న భోజనంపై ఆరా తీశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ రమేష్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మధు, బీఎల్వోలు, బీఎల్ఏలు ఉన్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలి పాన్గల్: తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించి అభివృద్ధికి సహకరించేలా మహిళా సంఘాల సభ్యులకు సమాఖ్య సిబ్బంది అవగాహన కల్పించాలని డీఆర్డీఏ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ (డీపీఎం) నాగమల్లిక అన్నారు. గురువారం మండల కేంద్రంలోని సమాఖ్య కార్యాలయంలో జరిగిన ఈసీ సమావేశం, సీఆర్పీల శిక్షణకు ఆమె హాజరై మాట్లాడారు. సభ్యులు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లించడంతో కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను సభ్యులకు వివరించాలన్నారు. ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా బలోపేతం కావాలని కోరారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థులకు యూనిఫామ్స్ను సర్పంచ్ నాగలక్ష్మితో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో కేజీబీవీ ఎస్ఓ హేమలత, సమాఖ్య సీసీలు సువర్ణ, వసంత, సమాఖ్య అధ్యక్షురాలు జయమ్మ, సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఎన్సీడీ వ్యాధిగ్రస్తుల వివరాలు నమోదు చేయాలి పాన్గల్: దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వివరాలను గ్రామాల వారీగా ఆన్లైన్లో నమోదు చేయాలని ఎన్సీడీ జిల్లా ప్రోగ్రామ్ అధికారి డా. మారుతినందన్గౌడ్ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు చేపట్టే పరీక్షలు, అందించే మందులు, ఆన్లైన్ నమోదు తదితర అంశాలపై వైద్యసిబ్బంది, ఆశా కార్యకర్తలకు అవగాహన కల్పించారు. 30 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి రక్తపోటు(బీపీ), మధుమేహం, క్యాన్సర్ (నోరు, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు) పరీక్షలు ఉచితంగా నిర్వహించడమేగాక చికిత్స, మందులు అందించే విషయాలను గ్రామాల్లో ప్రజలకు వివరించాలని సిబ్బందికి సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందించడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. విధుల్లో అలసత్వం సరికాదని హెచ్చరించారు. సమావేశంలో ఎన్సీడీ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్లు కొండ శ్రీనివాస్, అశోక్, మధుమోహన్, ఆయుష్మాన్ వైద్యులు డా. మైథిలి, లారెన్స్, నాగరాజు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. దరఖాస్తుల స్వీకరణ ఉండవెల్లి: ఉమ్మడి జిల్లాలోని మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి శ్రీనివాస్గౌడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత సబ్జెక్టులలో పీజీతోపాటు బీఎడ్ అర్హతతో పీజీలో కనీసం 55 శాతం మార్కులు ఉండాలన్నారు. ఆసక్తి గలవారు విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్, అనుభవ ధ్రువపత్రాలు, జడ్చర్లలోని ఆర్సీఓ ఆఫీస్లో ఈ నెల 20లోగా దరఖాస్తులతోపాటు అందజేయాలని సూచించారు. -
జననాల్లో మహబూబ్నగర్ టాప్..
ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాల్లో సీఆర్ఎస్–24 నివేదిక ప్రకారం మొత్తంగా 86,288 జననాలు, 19,605 మరణాలు, 198 శిశు మరణాలు, 369 మృత శిశు (నిర్జీవ పుట్టుక) జననాలు నమోదయ్యాయి. లింగ నిష్పత్తి ప్రకారం పరిశీలిస్తే ఐదు జిల్లాల్లోనూ మహిళా జననాల వాటా 45.7 శాతం నుంచి 48.0 శాతం మధ్య ఉండగా, పురుష జననాల వాటా 52 నుంచి 54 శాతం మధ్య నమోదైంది. నాగర్కర్నూల్ జిల్లాలో మగశిశు జననాల శాతం అత్యధికంగా 54.30 శాతంగా నమోదైంది. మొత్తంగా ఆడపిల్లల జననాల శాతం 2022తో పోలిస్తే 0.68 శాతం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. జోగుళాంబ గద్వాలమగ, ఆడ శిశువుల వారీగా జనన గణాంకాలు.. -
కేజీబీవీల్లో స్పాట్ అడ్మిషన్లు
వనపర్తిటౌన్: జిల్లాలోని కేజీబీవీల్లో ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు ఇన్చార్జ్ డీఈఓ యాదయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐఓఈ స్కూల్స్లోని అమరచింత కేజీబీవీలో ఎంపీసీ, బైపీసీలో 2 చొప్పున, వనపర్తి కేజీబీవీలో ఎంపీసీలో 7, గోపాల్పేట కేజీబీవీలో ఎంపీసీలో 3 సీట్లు, శ్రీరంగాపూర్ కేజీబీవీ ఎంపీసీలో 10, ఆత్మకూర్లోని కేజీబీవీ సీఈసీలో 7, రేవల్లిలో 10, పెద్దమందడిలో ఎంఎల్టీలో 5, ఖిల్లాఘనపురంలో కంప్యూటర్ సైన్స్లో 3, పాన్గల్లో కంప్యూటర్ సైన్స్లో 4, కొత్తకోటలో అకౌంట్ అండ్ ట్రాన్సాక్షన్లో 5, మదనాపురంలో ఫార్మా అండ్ టెక్నాలజీలో 15, ఖిల్లాఘనపురం (జనరల్) కేజీబీవీలో కమర్షియల్ గార్మెంట్ అండ్ టెక్నాలజీ కోర్సులో 25 సీట్లు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. ఆసక్తిగల విద్యార్థులు స్పాట్ అడ్మిషన్స్ ద్వారా ప్రవేశాలు పొందాలని సూచించారు. గురువారం నుంచి 18వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్స్కు అవకాశం ఉంటుందని, విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకుల అరెస్టులు అప్రజాస్వామికం వనపర్తి రూరల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉమ్మడి పాలమూరులో పర్యటించిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు, ప్రజా ప్రతినిధులను ముందస్తు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. ప్రతిపక్ష నేతలను, ప్రశ్నించే వారిని అరెస్టు చేస్తేగాని క్షేత్రస్థాయిలో తిరగలేని దుస్థితిలో సీఎం రేవంత్తెడ్డి ఉన్నారా.. ప్రజాపాలన అంటే ప్రజలను నిర్భందించడమేనా.. అని ప్రశ్నించారు. తన పాలన మీద తనకే నమ్మకం లేని వ్యక్తి సీఎంగా ఎలా కొనసాగుతారని ఎద్దేవా చేశారు. పోలీసుల పహారా మధ్య ప్రజాపాలన సాగుతుందని, రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్గాంధీకి రాష్ట్రంలో రేవంత్ అరాచకాలు కనిపించకపోవడం విస్మయానికి గురి చేస్తుందన్నారు. ఇలాగే కొనసాగితే కాంగ్రెస్కు ప్రజలే బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. వర్షాల కోసం తీరొక్క మొక్కులు కొల్లాపూర్/పెద్దకొత్తపల్లి: వానాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా వరుణుడి జాడే లేకుండాపోయింది. అప్పుడప్పుడు అరకొరగా కురిసిన వర్షాలకు రైతులు సాగుచేసిన పంటలు ఎండుమఖం పడుతున్నాయి. వ్యయ, ప్రయాసలకోర్చి సాగుచేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు వర్షాల కోసం ఆకాశంవైపు ఆశగా ఎదురుచూస్తూ.. తీరొక్క మొక్కులు మొక్కుకుంటున్నారు. బుధవారం పెంట్లవెల్లి మండలం గోపులాపురం శివాలయంలో గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి.. పరమశివుడిని జలదిగ్బంధనం చేశారు. పెద్దకొత్తపల్లి మండలం చంద్రబండ తండాలో మహిళలు కప్పల కావడి నిర్వహించారు. కప్పల కావడితో వాడవాడ తిరుగుతూ వానమ్మా.. వానమ్మ ఒక్కసారన్నా వచ్చి పోవమ్మా అంటూ పాటలు పాడారు. లొద్ది మల్లయ్య దర్శనానికి అనుమతివ్వాలి అచ్చంపేట: ఈ నెల 25న తొలి ఏకాదశి సందర్భంగా నల్లమల అటవీ ప్రాంతంలోని లొద్ది మల్లయ్య దర్శనానికి అనుమతించాలని భజరంగ్దళ్ నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా అటవీశాఖ అధికారి రేవంత్చంద్రకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నల్లమల ప్రాంత ప్రజలతో పాటు ఆదివాసీ చెంచుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు లొద్ది మల్లయ్య ఆలయం ప్రతీకగా నిలిచిందన్నారు. ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి సందర్భంగా చెంచు పూజారుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ ఏడాది కూడా అటవీశాఖ అనుమతులు ఇచ్చి.. భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో భజరంగ్దళ్ డివిజన్ కన్వీనర్ సీతారాల శివచంద్ర, చందులాల్ చౌహాన్, శివాజీ, నరేశ్, చందర్, అజయ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
దత్తాయిపల్లి అభివృద్ధికి రూ.7 కోట్లు మంజూరు
వనపర్తి రూరల్: దత్తాయిపల్లి గ్రామ అభివృద్ధికి రూ.7 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని దత్తాయిపల్లిలో రెండు అంగన్వాడీ భవనాలు, పంచాయతీ భవనం, గోదాంల నిర్మాణం, ఆంజనేయ ఆలయ నిర్మాణం పనులకు ఆయన శంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ఇంటి యజమానులకు నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిందన్నారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు రహదారులు, ప్రభుత్వ భవనాలు, తాగునీరు, విద్యుత్, ఇతర ప్రజావసరాల కల్పనకు ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటయ్య, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, శంకర్నాయక్, సింగిల్ విండో అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, ఉప సర్పంచ్ కిషన్నాయక్ నాయకులు అధికారులు పాల్గొన్నారు. -
ఆశా.. నిరాశాయే..
చాలీచాలని జీతం, ఉద్యోగ భద్రత కరువు ● జిల్లాలో 548 మంది వర్కర్ల ఆవేదన ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా ఆశావర్కర్లకు వెంటనే ఉద్యోగ భద్రత కల్పిస్తూ.. రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి. ప్రస్తుత ధరలతో కుటుంబాలు గడవడం చాలా కష్టంగా ఉంది. వచ్చిన వేతనంతో పిల్లల చదువులు, కుటుంబం గడవడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. – సునీత, ఆశావర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఆరోగ్యపరంగా గర్భిణులతో పాటు బాలింతలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షిస్తూ సేవలు అందిస్తున్నాం. వారి ఆరోగ్య పరిస్థితిపై ఉన్నతాధికారులకు క్రమం తప్పకుండా నివేదిక సమర్పిస్తాం. చాలీచాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకొని మాకు న్యాయం చేయాలి. – బుచ్చమ్మ, ఆశావర్కర్ ఆశా వర్కర్ల వేతనాలు పెంచకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మరో ఆందోళనకు శ్రీకారం చుడతాం. ఆశాల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే కాలయాపన చేస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కచ్చితంగా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – బొబ్బిలి నిక్సన్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆశావర్కర్ల సమస్యలు, వారి డిమాండ్లపై ఇప్పటికే ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాం. జిల్లావ్యాప్తంగా 15 మండలాల్లో 548 మంది ఆశాలు విధులు నిర్వహిస్తున్నారు. వేతనాల పెంపు అనేది ప్రభుత్వ పరిధిలోని నిర్ణయం. మా పరిధిలో ఉన్న పెండింగ్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం. ప్రతి ఆశా కార్యకర్తకు రూ.10 వేలకు తగ్గకుండా వేతనం అందేలా చూస్తున్నాం. – సాయినాథ్రెడ్డి, డీఎంహ్చ్ఓ, వనపర్తి మదనాపురం: పని ఒత్తిడి, చాలీచాలని వేతనం, భరోసా లేని ఉద్యోగం వెరసి ఆశా కార్యకర్తలు తీవ్ర నిరాశలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆశాలకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు కనీస వేతనం చెల్లిస్తామని చెప్పి అధికారం చేపట్టి సుమారు మూడేళ్లవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం తమను నిర్లక్ష్యంగా చూస్తుందని ఆశాలు ఆందోళన చెందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ నిత్యం రోగులకు అందుబాటులో ఉంటున్నారు. కరోనా లాంటి విపత్కర సమయంలో అన్ని శాఖలు లాక్డౌన్లోకి వెళ్లినా.. ప్రాణాలను పణంగా పెట్టి కరోనా సోకిన వారికి నిత్యం వైద్య సేవలు అందించినా తమకు కనీస గుర్తింపు దక్కలేదని వాపోతున్నారు. తమ శ్రమకు తగ్గట్టుగా రూ.18 వేల కనీస వేతనం అమలు చేయాలని ఏళ్లుగా వేడుకుంటున్నా వారి గోస వినే వారే కరువయ్యారు. ప్రభుత్వం స్పందిచకుంటే జిల్లావ్యాప్తంగా ఆశావర్కర్లు మరోసారి ఉద్యమబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. గ్రామాల్లో 24 గంటలు వైద్య సేవలు అందించాల్సి వస్తుందని ఆశాలు అంటున్నారు. గర్భిణులకు అర్ధరాత్రి ప్రసవ నొప్పులు వచ్చినా.. అత్యవసర వైద్య పరిస్థితులు తలెత్తినా కుటుంబాలను పక్కనబెట్టి బాధితులను ఆస్పత్రులకు తీసుకెళ్లే బాధ్యత ఆశా వర్కర్లదే. వారికి నిర్దిష్టమైన పని గంటలు లేవు. ప్రస్తుతం పెరిగిన నిత్యావసరాల ధరలతో వారికి ప్రభుత్వం చెల్లిస్తున్న రూ.9,600 వేతనం ఏమాత్రం చాలడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం క్షేత్రస్థాయి సేవలే కాకుండా, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి కొత్త యాప్లో సమాచారాన్ని నమోదు చేయడం, ఆన్లైన్ నివేదికలు తయారు చేయడం వంటి అదనపు భారం వీరిపై పడింది. ఆరోగ్య రంగంలో ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్నప్పటికీ వీరికి ఎలాంటి పీఎఫ్, ఈఎస్ఐ లేదా కనీస బీమా సదుపాయాలు లేవు. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. జిల్లాలోని 15 మండలాల్లో గల 14 పీహెచ్సీలు, 2 యూపీఎస్సీల పరిధిలో 548 మంది ఆశాలు పని చేస్తున్నారు. ప్రతి 1000 మంది జనాభా ఒక్కరు చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. -
ట్రాఫిక్ ఆంక్షలతో వాహనదారులకు ఇబ్బందులు
కొత్తకోట రూరల్: పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరైన సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ డి.సునీతారెడ్డి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ ఒకరు, డీఎస్పీలు నలుగురు, సీఐలు 16 మంది, ఎస్ఐలు 54 మంది, ఏఎస్లు, హెడ్ కానిస్టేబుల్స్ 181, మహిళా కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ 595 మంది కలిపి మొత్తం సుమారు 850 మంది పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి సాయంత్రం 4:49 గంటలకు కొత్తకోటకు చేరుకోగా.. ఆయన రాకకు గంట ముందే పట్టణంలోని ప్రధాన రహదారులను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని ట్రాఫిక్ను నిలిపివేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వనపర్తి, ఆత్మకూరు మార్గంలో ప్రయాణించే వాహనాలను సంకిరెడ్డిపల్లి స్టేజీ వద్ద నిలిపివేయడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. పాఠశాల భవన ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కానాయపల్లిలోని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్రెడ్డి నివాసానికి వెళ్లి తేనేటి విందులో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా హెలిప్యాడ్ దగ్గరకు చేరుకుని సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్కు బయలుదేరారు. ముఖ్యమంత్రి పర్యటన ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు, జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
బీఎల్ఏలు సమన్వయంలో పనిచేయాలి
వనపర్తి రూరల్: బీఎల్ఏలు, బీఎల్ఓలతో సమన్వయంగా పనిచేస్తూ ఎన్యూమరేషన్ కార్యక్రమంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఆదేశించారు. బుధవారం మండలంలోని పెద్దగూడెంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) పక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఎల్ఏ–2 ఇన్చార్జ్లతో మాట్లాడి ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ ఓటరు నమోదు వివరాల సవరణ, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్లో పూర్తి సహకారం అందించాలని సూచించారు. ప్రతి బీఎల్ఏ–2 కనీసం 100 ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేయాలని, సర్ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పుష్పలత, మాజీ సర్పంచ్ కొండయ్య, నాయకులు శివకుమార్, భాస్కర్రెడ్డి, రొయ్యల రమేష్, బుచ్చిబాబు, సురేష్, శారదమ్మ, విష్ణువర్ధన్రెడ్డి, మల్లేష్, గుండాల రాములు, బాలు తదితరులు పాల్గొన్నారు. -
త్వరలోనే నాలుగు పంపుల ద్వారా నీటి విడుదల
● ‘పాలమూరు’ ప్రాజెక్టు సలహాదారు పెంటారెడ్డి కొల్లాపూర్ రూరల్: పాలమూరు– రంగారెడ్డి మొదటి లిస్టు ద్వారా నెల వ్యవధిలో పూర్తయిన నాలుగు పంపుల ద్వారా నీటిని విడుదల చేస్తామని ప్రభుత్వ ప్రాజెక్టుల సలహాదారు పెంటారెడ్డి అన్నారు. మంగళవారం పంపుల విధివిధాలపై ఉన్నతాధికారులతో కంట్రోల్ బోర్డులో సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత మూడేళ్ల క్రితం ప్రారంభించిన మొదటి పంపులో చాలా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పరిష్కరించేందుకు దాదాపు 10 రోజుల సమయం పట్టిందన్నారు. అన్నిరకాల సాంకేతిక సమస్యలను అధిగమించి మంగళవారం దాదాపు గంటపాటు నీటిని రిజర్వాయర్లోకి విడుదల చేశామన్నారు. బుధవారం నుంచి రెండో పంపు డ్రైరన్ ప్రారంభిస్తామని, వారం రోజుల్లో రెండో పంపు నుంచి నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు. మోటార్లలో తలెత్తుతున్న చిన్నపాటి సమస్యలు పరిష్కరిస్తూ.. నాలుగు పంపుల నుంచి నెల వ్యవధిలో రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోస్తామన్నారు. కృష్ణానదికి నీళ్లు వచ్చే వరకు నాలుగు పంపులు సిద్ధం చేస్తామన్నారు. అలాగే ప్యాకేజీ–3లో ఉన్న పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయన్నారు. ఏదుల, వట్టెం, కర్వెనలో ఉన్న పంపులను సైతం సిద్ధం చేసి.. అన్ని రిజర్వాయర్లకు త్వరలో నీటిని తరలించాలని సీఎం రేవంత్రెడ్డి, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో ప్రాజెక్టు ఎస్ఈ రవీందర్, ఈఈ లోకిలాల్, డీఈ ప్రవీణ్ తదితరులున్నారు. -
విద్య.. నీరు.. పారిశ్రామికం
ఇవే మా మొదటి ప్రాధాన్యం: సీఎం రేవంత్రెడ్డి –8లో uసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/వనపర్తి: ‘నేను పాలమూరు బిడ్డను. అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా, ఆదర్శ జిల్లాగా చేయాలనేదే నా ప్రయత్నం. గతంలో ఈ జిల్లాను ఎవరెవరో దత్తత తీసుకున్నారనే చర్చలు జరిగేవి. ఈ రోజు మనమే ఇతర జిల్లాలను ద్తతత తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇది పాలమూరు జిల్లాకు గర్వకారణం. ఈ జిల్లాలో మొదటి ప్రాధాన్యత కింద ఎడ్యుకేషన్, ఇరిగేషన్, ఇండస్ట్రియల్ పాలసీలు అమలు చేస్తున్నాం. ఇందులో భాగంగా ట్రిపుల్ ఐటీ, ఇంజినీరింగ్ కాలేజీలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, ఏటీసీ సెంటర్లను తీసుకొచ్చాం’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలోని అమరరాజా గిగా కారిడార్లో బుధవారం ఆయన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ను ప్రారంభించారు. అనంతరం కొత్తకోటలో రూ.1.77 కోట్ల సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. త్వరలో శుభవార్త చెబుతాం.. ‘సాగురంగం అభివృద్ధి సాధించాలంటే జిల్లాలో కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కోయిల్సాగర్, నెట్టెంపాడు, భీమా, ఆర్డీఎస్ పూర్తి చేసుకోవాలి. ఆయా పథకాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు పక్క రాష్ట్రంతో చర్చలు జరుపుతున్నాం. పీఆర్ఎల్ఐకి సంబంధించిన 90 టీఎంసీలు సాధించడానికి కేంద్రం, ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పించి సంపూర్ణమైన అనుమతులు సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో రైతులకు శుభవార్త చెబుతాం. డిండి ప్రాజెక్ట్కు సంబంధించి 30 టీఎంసీల నీటి కేటాయింపులు కోసం కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ జిల్లాను సస్యశ్యాలం చేస్తాం. పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం తీసుకొస్తాం. నిరుద్యోగులకు ఉపాధి, అవకాశాలు కల్పిస్తాం. ప్రపంచంలో వేగంగా మారుతున్న పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగాలు పోయి లక్షల మంది నిరుద్యోగులుగా మారుతున్నారు. వైట్ కాలర్ జాబులు పోతున్నాయి. అయితే బ్లూ కలర్ జాబులు తెచ్చేందుకు మా ప్రభుత్వం పనిచేస్తోంది. బ్లూ కలర్ జాబులు కావాలంటే ఏటీసీ, పాలిటెక్నిక్ కాలేజీలు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలి. ఇందులో విద్యార్థులు చదువుకోవడానికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలి. ఈ దిశగా పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. ప్రస్తుత విద్యతో స్పోర్ట్స్ నూతన విధానం అమలు చేసి చదువులో వెనకబడిన వారు క్రీడల్లో రాణించి ఉన్నత జీవితాన్ని కొనసాగించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మట్టిలోని మాణిక్యాలను వెలికితీయాలి. విద్యార్థులు మైదానాల్లోనూ పోటీ పడాలి. మీ భవిష్యత్కు నాదీ హామీ. క్రీడల్లో రాణించే వారిని ఉన్నతస్థాయిలో నిలిపే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. కార్పొరేట్ విద్యాసంస్థలతో పోటీ పడేలా విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతాం. ఇందుకోసం ఏడాదికి రూ.30 వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం.’ అని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీలు డీకే అరుణ, మల్లురవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, మేఘారెడ్డి, కూచుకుళ్ల రాజేష్రెడ్డి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, వీర్లపల్లి శంకర్, వంశీకృష్ణ, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, గద్వాల సరిత, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలతో పోటీ పడేలా తీర్చిదిద్దుతాం విద్యార్థులు మైదానాల్లోనూ పోటీ పడాలి ఆదర్శ జిల్లాగా పాలమూరును మారుస్తామని హామీ కొత్తకోటలో బాలికల నూతన పాఠశాల భవనం ప్రారంభోత్సవం -
జోగుళాంబ క్షేత్రంపై విస్తృత ప్రచారం
అలంపూర్: జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రం, స్థల పురాణంపై విస్తృతంగా ప్రచారం చేస్తామని హైదవ సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్రెడ్డి అన్నారు. బుధవారం అలంపూర్ క్షేత్రంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అలంపురంగా పిలువబడుతున్న దేవాలయాల ఆసలు పేరు హేమలాపురం అని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ హేమలపురం పేరు తెలియపరచాలనే ఆకాంక్షతో పోస్టర్ల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నట్లు చెప్పారు. జేఏసీ సహాయ కార్యదర్శి రాఘవులు, నర్సింహ, వీరేందర్ గుప్తా, సాయిగౌడు, శ్రవణ్ కుమార్, రమేశ్, రామకృష్ణ పాల్గొన్నారు. -
‘సర్’పై నిర్లక్ష్యం వద్దు
అమరచింత (ఆత్మకూర్): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్)పై బీఎల్ఓలు నిర్లక్ష్యంగా ఉండొద్దని, ఓటర్లకు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి తీసుకొని ఆన్లైన్ చేయాల్సిన అవసరం ఉందని నారాయణ పేట జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు. ఆత్మకూర్ పట్టణంలో కొనసాగుతున్న సర్ కార్యక్రమాన్ని ఆయన తహసీల్దార్ జేకే మోహన్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు సేకరించి ఓటరు సవరణ కార్యక్రమం గురించి వివరించి, ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని బీఎల్ఓలకు సూచించారు. ప్రతినిత్యం తమకు కేటాయించిన క్యాచ్మెంట్ ఏరియాలో ఉంటూ.. ఫారాలు సేకరించి వందశాతం ఆన్లైన్ నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేష్, మేనేజర్ సీత్యానాయక్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. -
‘సమగ్ర వ్యవసాయ పథకం’ వినియోగించుకోవాలి
ఖిల్ల్ఘానపురం: కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు అమలు చేస్తున్న వాతావరణ ఆధారిత సమగ్ర వ్యవసాయ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు కోరారు. మంగళవారం మండలంలోని పర్వతాపురం రైతువేదికలో పథకంపై అవగాహన, అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2015 నుంచి 2022 వరకు ఖిల్లాఘనపురం మండలంలోని పర్వతాపురం, ఆగారం, అంతాయపల్లి, వెంకటాంపల్లి, అల్లమాయపల్లి వాతావరణ ఆధారిత సమగ్ర వ్యవసాయ పథకానికి ఎంపికయ్యాయన్నారు. ఈ పథకంలో అప్పట్లో రైతులకు ఒక్కో యూనిట్కు రూ.91 వేల విలువ చేసే గేదెలు, స్ప్రింక్లర్ పైపులు, కోడిపిల్లలు, మొక్కలు అందించామన్నారు. ఆ పథకంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1.27 కోట్లు మంజూరయ్యాయని.. గతంలో మాదిరిగా రైతులకు యూనిట్లు అందిస్తామని చెప్పారు. పథకాన్ని ఎలా కొనసాగించాలనే విషయంపై రైతుల అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మల్లయ్య, రైతులు పాల్గొన్నారు. ఘనంగా ఆరుద్ర పూజలు కొత్తకోట రూరల్: మండలంలోని కానాయపల్లి స్టేజీ సమీపంలో ఉన్న దత్తకోటిలింగేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం అమావాస్యను పురస్కరించుకొని స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని వరుణ సహిత రుద్రహోమం చేసి పూర్ణాహుతి సమర్పించారు. పూజా కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అన్న ప్రసాద విచారణ చేపట్టారు. స్థల పరిశీలన వనపర్తి రూరల్: పెబ్బేరు మండలం అయ్యవారిపల్లి సమీపంలో ఉన్న పల్లెగుట్టపై అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకుగాను మంగళవారం తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ కో–ఆర్డినేటర్ నవత స్థల పరిశీలన చేపట్టారు. అక్కడి సౌకర్యాలు, నేల రకం పరిశీలించి సానుకూలంగా స్పందించారని స్థానిక నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపడంతో గతంలోనూ ఈ ప్రాంతాన్ని అధికారులు రెండుసార్లు పరిశీలించారు. వారి వెంట స్థానిక నాయకులు లక్ష్మణ్ నాయుడు, బాలకృష్ణ నాయుడు, బాలరాజుశెట్టి ఉన్నారు. -
‘సర్’లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
ఖిల్లాఘనపురం: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కోరారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు సోళీపురం గ్రామంలో జిల్లా మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ బాలీశ్వర్రెడ్డి, జెడ్పీటీసీ మాసీ సభ్యుడు సామ్యానాయక్, పార్టీ మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్యతో కలిసి సర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. బీఎల్వోలు, బీఎల్ఏలతో మాట్లాడి ఎన్యూమరేషన్ ఫారాలు నింపే సమయంలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని.. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. బీఎల్వోలు ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు పంచడమే కాకుండా వారు ఫారాలు ఎలా నింపారు.. ఏమైనా తప్పులున్నాయా అనే వివరాలను పరిశీలించి తిరిగి తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న బీఆర్ఎస్ బీఎల్ఏలు మాత్రమే కాకుండా చదువుకున్న యువత ముందుకొచ్చి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు నింపే విషయంలో సహకారం అందించాలన్నారు. అనంతరం ఇటీవల ప్రమాదవశాత్తు కాలు విరిగిన పార్టీ కార్యకర్త కుమ్మరి కృష్ణయ్యను పరామర్శించారు. ఆయన వెంట పార్టీ ప్రధాన కార్యదర్శి పురేందర్రెడ్డి, సర్పంచ్లు బాలరాజు, గిరమ్మ వెంకటయ్య, ఉప సర్పంచులు పీన్యానాయక్, కృష్ణయ్యగౌడ్ ఉన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యలుపరిష్కరించాలి : టీపీయూఎస్
వనపర్తి విద్యావిభాగం: ఉపాధ్యాయులు, విద్యాశా ఖ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీపీయూఎస్ రాష్ట్రశాఖ పిలుపు మేరకు సోమవారం జిల్లాకేంద్రంలోని మర్నికుంట ధర్నా చౌక్లో సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేసి 51 శాతం పీఆర్సీ ప్రకటించాలని, సీపీఎస్ను రద్దు చేసి పాత పింఛన్ విధానం అమలు చేయాలని కోరారు. జీఓనంబర్ 317 బాధితులకు న్యాయం చేయాలని, జీఓనంబర్ 25 రద్దు, 2010కు ముందు నుంచి విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు, కేజీబీవీ, ఎస్ఎస్ఏ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన గ్రాంట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
పీజీఐ–డీలో సత్తా
ఉమ్మడి జిల్లాలో అగ్రస్థానంలో నిలిచిన నాగర్కర్నూల్ కల్వకుర్తి టౌన్: కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఫర్ డిస్ట్రిక్ (పీజీఐ–డీ ) 2025–26 నివేదికలో ఉమ్మడి పాలమూరులో నాగర్కర్నూల్ జిల్లా మరోసారి ప్రత్యేకత చాటుకుంది. పాఠశాల విద్యా ప్రమాణాలను 6 కీలక అంశాలపై విశ్లేషించి రూపొందించిన నివేదికలో మొత్తం 600 మార్కులకు గాను 333 మార్కులు సాధించి.. ప్రచేష్ట–1 గ్రేడ్ దక్కించుకుంది. అలాగే ఉమ్మడి జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలు బార్డర్ మార్కులతో ప్రచేష్ట–1లో నిలవగా.. మహబూబ్నగర్ మాత్రం ప్రచేష్ట–2కే పరిమితమైంది. ఒకే విధమైన ప్రమాణాలతో.. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను ఒకే విధమైన ప్రమాణాలతో అంచనా వేయడానికి కేంద్ర విద్యాశాఖ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఫర్ డిస్ట్రిక్ (పీజీఐ–డీ)ను ప్రవేశపెట్టింది. జిల్లాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచడంతోపాటు ఎక్కడ లోపాలున్నాయో గుర్తించి వాటిని సరిదిద్దేందుకు ఈ సూచికను రూపొందించారు. ప్రతి జిల్లాకు 600 మార్కుల స్కోరు కేటాయించి వివిధ ప్రమాణాల ఆధారంగా గ్రేడింగ్ ఇస్తారు. ఆరు అంశాలే కీలకం.. జిల్లాల పనితీరులో అభ్యసన ఫలితాలు, తరగతి గది బోధన, మౌలిక వసతులు– విద్యార్థుల హక్కులు, పాఠశాల భద్రత– విద్యార్థుల సంక్షేమం, డిజిటల్ లెర్నింగ్, పాలన– నిర్వహణ అనే ఆరు ప్రధాన విభాగాల్లో పరిశీలిస్తారు. ప్రతి విభాగానికి నిర్దిష్ట సూచికలు ఉండగా.. వాటి ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. అధికారిక గణాంకాలే.. పాఠశాల విద్యకు సంబంధించిన సమాచారం జిల్లా, రాష్ట్రస్థాయిల్లోని యూడైస్ ప్లస్, ఎన్ఏఎస్, పీఎం పోషణ్, సమగ్ర శిక్ష, పాఠశాల విద్యాశాఖ తదితర అధికారిక డేటాబేస్ల నుంచి సేకరిస్తారు. రాష్ట్రాలు నివేదించిన అధికారిక సమాచారాన్ని కేంద్ర విద్యాశాఖ పరిశీలించి తుది స్కోర్లు ప్రకటిస్తుంది. అందువల్ల ఈ గ్రేడింగ్ పూర్తిగా ప్రభుత్వ అధికారిక గణాంకాల ఆధారంగానే ఉంటుంది. ప్రమాణాల మెరుగుకు.. ఈ సూచిక ద్వారా ఏ జిల్లా ఏ రంగంలో వెనకబడి ఉందో స్పష్టంగా తెలుస్తుంది. ఉదాహరణకు ఒక జిల్లాకు అభ్యసన ఫలితాల్లో మంచి మార్కులు వచ్చినా, డిజిటల్ లెర్నింగ్ లేదా మౌలిక వసతుల్లో తక్కువ స్కోరు వస్తే.. ఆయా రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. అలాగే జిల్లాల మధ్య పోటీ పెరిగి విద్యా ప్రమాణాలు మెరుగుపడటానికి ఇది దోహదపడుతుంది. కేంద్ర ప్రభుత్వం వెలువరించిన నివేదికలో నాగర్కర్నూల్ ఉమ్మడి పాలమూరులో అగ్రస్థానంలో నిలిచినప్పటికీ.. డిజిటల్ లెర్నింగ్, పాఠశాల భద్రత, మౌలిక వసతుల విభాగాల్లో స్కోరు పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తే ‘ప్రచేష్ట–1’ నుంచి ‘ఉత్తమ్’ గ్రేడ్ సాధించే అవకాశం ఉంది. బార్డర్ మార్కులతో ‘ప్రచేష్ట–1’ గ్రేడ్ సాధించిన నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలు ‘ప్రచేష్ట–2’కే పరిమితమైన మహబూబ్నగర్ బోధన, అభ్యసన ఫలితాలు, పాలనలో మెరుగైన పనితీరు మౌలిక వసతులు, డిజిటల్ లెర్నింగ్లో మెరుగుదల అవసరం -
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే
వనపర్తి రూరల్: నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మంగళవారం పెబ్బేరు మండలం కంచిరావుపల్లితండా, రంగాపురం గ్రామాల్లో 23 మంది ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని లబ్ధిదారులకు కొత్త దుస్తులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రంగాపురం గ్రామంలో రైతులకు మంజూరైన ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేయడంతో పాటు గ్రామంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణను పరిశీలించారు. గ్రామంలో 80 శాతం ఎన్యూమరేషన్ పూర్తి చేసినందున బీఎల్వోలను శాలువాతో సన్మానించి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. అర్హులైన ఓటర్ల పేరు జాబితాలో నమోదు కావడం ప్రజాస్వామ్య బలోపేతానికి కీలకమని పేర్కొన్నారు. మిగిలిన నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటులో నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను కోరా రు. కార్యక్రమంలో పుర చైర్మన్ అక్కి శ్రీని వాస్గౌడ్, మార్కెట్ చైర్మన్ ప్రమోదిని, సర్పంచ్ హే మలత, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంపీఓ రోజారెడ్డి, ఉప సర్పంచ్ నందీశ్వర్, మండల, పట్టణ అధ్యక్షులు రాంరెడ్డి, దయాకర్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రత
కొత్తకోట రూరల్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి బుధవారం కొత్తకోటలో పర్యటించనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. మంగళవారం కొత్తకోటలోని బీపీఆర్ గార్డెన్ ఫంక్షన్హాల్లో విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భవన ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకమైందని, భద్రతలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమన్నారు. బందోబస్తును ఎనిమిది సెక్టార్లుగా విభజించామని.. ఎస్పీ, అదనపు ఎస్పీ, నలుగురు డీఎస్పీలు, 16 మంది సీఐలు, 54 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులు, ప్రత్యేక బృందాలు, డాగ్ స్క్వాడ్, సెక్యూరిటీ వింగ్, మఫ్టీ పార్టీలు తదితరులతో మొత్తం 850 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ప్రతి పోలీసు అధికారి విధుల్లో పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని, సెల్ఫోన్లు చూస్తూ లేదా వ్యక్తిగత పనుల్లో నిమగ్నమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, పరిస్థితులు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ట్రాఫిక్, పార్కింగ్, వీఐపీ రూట్లు, సభా ప్రాంగణం తదితర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూనే భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదన్నారు. సమన్వయంతో పనిచేస్తేనే ముఖ్యమంత్రి పర్యటన విజయవంతమవుతుందన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీలు గిరిబాబు, బాలాజీనాయక్, శ్రీనివాసులు, కొత్తకోట, వనపర్తి సీఐలు రాంబాబు, సుగంధరత్నం, కొత్తకోట ఎస్ఐ శివానందంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఉమ్మడి పాలమూరుకు సీఎం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించనున్నారు. మొదట పాలమూరు సమీపంలోని దివిటిపల్లిలో ఉన్న అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్లో కొత్తగా నిర్మించిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ను, అనంతరం వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్మించిన ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ప్రారంభిస్తారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ను మహబూబ్నగర్, వనపర్తి కలెక్టర్లు ఖుష్బూగుప్తా, ఆదర్శ్ సురభి వేర్వేరుగా వెల్లడించారు. సీఎం పర్యటించనున్న ప్రదేశాలను మంగళవారం ఆయా జిల్లాల కలెక్టర్లు పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. హెలిప్యాడ్, భద్రత ఏర్పాట్లు, సభా ప్రాంగణంలో వేదిక (డయాస్), సీటింగ్, రాకపోకలు, ఇతర మౌలిక సదుపాయాలపై అధికారులతో సమీక్షించారు. ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా అధికారులు, కంపెనీ ప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి వనపర్తి కలెక్టర్, ఎస్పీలతో కలిసి సీఎం ప్రారంభించనున్న ప్రభుత్వ పాఠశాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో మహబూబ్నగర్, వనపర్తి ఎస్పీ డి.జానకి, సునీతారెడ్డి, వనపర్తి అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, వినోద్కుమార్, సీఎం సెక్యూరిటీ ఇన్చార్జ్ శ్రీధర్, అసిస్టెంట్ కలెక్టర్ (అండర్ ట్రైనీ) సాయిశివాని, ఆర్డీఓ నవీన్, ఆయా శాఖల అధికారులు, అమరరాజా కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పర్యటన షెడ్యూల్ ఇలా.. మధ్యాహ్నం 12.50 గంటలకు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి హెలీకాప్టర్లో బయలుదేరి 1.15 గంటలకు దివిటిపల్లికి చేరుకుంటారు. 1.20 నుంచి 2.20 గంటల వరకు అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్లో కొత్తగా నిర్మించిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ప్రారంభోత్సవం, ప్లాంట్ పర్యటన, ప్రసంగం ఉంటుంది. మధ్యాహ్నం 2.20 గంటలకు తిరిగి హెలికాప్టర్లో బయలుదేరి 2.45 గంటలకు వనపర్తి జిల్లా కొత్తకోటకు చేరుకుంటారు. అక్కడ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భవన ప్రారంభోత్సవం, విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం తిరిగి హైదరాబాద్కు హెలికాప్టర్లో బయలుదేరుతారు. -
అదృశ్యం ఆంతర్యమేంటి?
జిల్లాలో ఏటా పెరుగుతున్న మిస్సింగ్ కేసులు ● మూడున్నర ఏళ్లలో 919 కేసులు నమోదు ● దర్యాప్తు చేసినవి 872 ● ఫిర్యాదుకు రాని కేసులు మరెన్నో.. ‘వనపర్తి మండలం అంకూరుకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల భార్యతో విభేదించి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. మూడురోజుల పాటు కాలినడకన ఎక్కడెక్కడో తిరిగి చివరకు పెద్దగూడెం క్రాస్ రోడ్ సమీపంలో ఓ చెట్టుకు ఉరేసుకొని మృతిచెందాడు. పోలీసులు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడి సెల్ఫోన్ సిగ్నల్స్ను పరిశీలించగా.. రాణిపేట, కొత్తకోట తదితర ప్రాంతాల్లో తిరిగినట్లుగా గుర్తించారు. జిల్లావ్యాప్తంగా నమోదవుతున్న మిస్సింగ్ కేసుల్లో వనపర్తిటౌన్, రూరల్ పోలీస్స్టేషన్లలో అధికంగా ఉన్నట్లు అఽధికారులు వెల్లడించిన లెక్కలతో తెలుస్తోంది.’ వనపర్తి: జిల్లాలో ఏటా అదృశ్యం (మిస్సింగ్) కేసుల సంఖ్య పెరుగుతుండగా.. అందులోనూ మహిళలు, యువతులు, మైనర్లే అత్యధికంగా నమోదు కావడం శోచనీయం. కేసుల విచారణలో అధికంగా క్షణికావేశానికి లోనై ఇళ్లు వదిలి వెళ్తున్న సంఘటనలు ఉండగా.. మరికొన్ని కేసులు మూడేళ్లవుతున్నా నేటికీ ఆచూకీ లభించనివి ఉన్నాయి. ఇంకొన్ని ప్రాణాలతో ఇంటి నుంచి వెళ్లి విగతజీవిగా ఇంటికి తిరిగి వస్తున్న ఘటనలు ఉన్నాయి. ఇటీవల పిల్లల అదృశ్యం కేసుల విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా నమోదవుతున్న మిస్సింగ్ కేసులు వాటిలో మహిళలు, మైనర్లు, ముఖ్యంగా చిన్నారుల మిస్సింగ్లపై రాష్ట్ర పోలీస్బాస్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నిత్యం భరోసా కేంద్రం ఆధ్వర్యంలో జీవన విధానంపై గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. ఘటనలు ఆగకపోవడం శోచనీయం. ఏడాది మిస్సింగ్ కేసులు మైనర్ల మొత్తం మహిళలు/ యువతులు 2023 183 18 233 2024 215 34 300 2025 219 58 322 2026 58 19 64 అభద్రతలో ‘ఆమె’.. జిల్లాలో మూడున్నరేళ్లలో నమోదైన మిస్సింగ్ కేసులు పరిశీలించగా.. మహిళలు, యువతులే అత్యధికంగా ఉండటం గమనార్హం. ఇంటిని చక్కబెట్టే మహిళలు, కుటుంబ పరువుగా భావించే యువతుల మిస్సింగ్ కేసులు పెరగడానికి ప్రధాన కారణం ఉమ్మడి కుటుంబాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడమేనని పలువురు సీనియర్ సిటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 47 కేసులు పెండింగ్.. జిల్లావ్యాప్తంగా గడిచిన మూడున్నర ఏళ్లలో 919 మిస్సింగ్ కేసులు నమోదుకాగా.. 872 కేసులను పోలీసు ఛేదించారు. మరో 47 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో 2023 నాటి కేసులు 6, 2024 కేసులు 8, 2025 కేసులు 22, తాజాగా 2026లో ఇప్పటి వరకు కేసులు 19 ఉన్నాయి. సాంకేతికతతో ఛేదిస్తున్నాం జిల్లాలో నమోదవుతున్న మిస్సింగ్ కేసులను మా అధికారుల బృందం ఆధునిక సాంకేతికతను వినియోగించి సెల్ టవర్ సిగ్నల్ ఆధారంగా ఛేదిస్తున్నారు. పెండింగ్లో ఉన్న కేసులను వీలైనంత త్వరగా ఛేదించాలని ఆదేశాలిచ్చాం. నిరంతరం స్టేషన్ల వారీగా రివ్యూ చేస్తున్నాం. క్షణికావేశంలో ఇంటి నుంచి వెళ్తున్న వారికి కౌన్సెలింగ్ ఇచ్చి తిరిగి పంపిస్తున్నాం. – సునీతారెడ్డి, ఎస్పీ ఏడాది వారీగా నమోదైన మిస్సింగ్ కేసులు


