ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు
వనపర్తిటౌన్: పుర ఎన్నికలను అందరి సహకారంతో ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని సహాయ ఎన్నికల అధికారి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని పుర కార్యాలయంలో నామపత్రాల పరిశీలనను పుర ఎన్నికల సహాయ అధికారి, కమిషనర్ వెంకటేశ్వర్లుతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డులకు అవసరమైన పోలింగ్ కేంద్రాలను సౌకర్యవంతంగా ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు కార్యాలయంలోని సిబ్బంది ఎవరూ సెలవులపై వెళ్లరాదని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. నామినేషన్ల తిరస్కరణపై ఆదివారం సాయంత్రం 5 వరకు అప్పీల్ చేయవచ్చని, 3వ తేదీన మధ్యాహ్నం 3 లోగా ఉపసంహరణకు అవకాశం ఉందన్నారు. అనంతరం అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నట్లు చెప్పారు.
450 పోలీస్ సిబ్బందితో
బందోబస్తు
మహబూబ్నగర్ క్రైం: మన్యంకొండ జాతర కోసం మొత్తం 450 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఏఎస్పీ ఎన్బీ రత్నం వెల్లడించారు. మన్యంకొండ దగ్గర శనివారం బందోబస్తు ఏర్పాట్లను ఏఎస్పీ ప్రత్యేకంగా పరిశీలించారు. మాట్లాడుతూ రథోత్సవంతో పాటు జాతరలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఒక అదనపు ఎస్పీతో పాటు ఇద్దరూ డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 16 మంది ఎస్ఐలు, 75 మంది ఏఎస్ఐ లు, హెడ్కానిస్టేబుల్స్, 250 కానిస్టేబుల్స్, 60 మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తారని తెలిపారు.


