పోలీసు ప్రజావాణికి 10 ఫిర్యాదులు
వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 10 మంది సమస్యలను ఎస్పీ సునీతారెడ్డి నేరుగా తెలుసుకుని ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల భద్రతే పోలీసుశాఖ ప్రధాన లక్ష్యమని, ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా ముందుకు తీసుకురావాలని సూచించారు. ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి.. సంబంధిత అధికారుల ద్వారా చట్టబద్ధంగా, వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా పోలీసుశాఖ ఎల్లప్పుడూ అంకితభావంతో పనిచేస్తుందని తెలిపారు.
ఇంటర్ ప్రాక్టికల్స్ప్రారంభం
వనపర్తి విద్యావిభాగం: జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 19 కేంద్రాల్లో ఉదయం నిర్వహించిన పరీక్షకు 1,811 మంది విద్యార్థులకు గాను 1730 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 1,586 మంది విద్యార్థులకు గాను 1,523 మంది హాజరైనట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాసినట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలను డీఐఈఓతో పాటు డీఈసీ సభ్యులు, ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ప్రత్యేక పరిశీలకులుగా ఆర్.వెంకటేశ్వరరావు జిల్లాను సందర్శించి.. వనపర్తి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, జాగృతి కళాశాల, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలతో పాటు పెబ్బేరు, కొత్తకోటలోని ప్రభుత్వ కళాశాల, నివేదిత జూనియర్ కళాశాలలను తనిఖీ చేశారు.
పారా లీగల్
వలంటీర్లకు శిక్షణ
వనపర్తిటౌన్: జిల్లా కేంద్రంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో సోమవారం పారా లీగల్ వలంటీర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పనితీరు, ప్రజలకు ఉచితంగా న్యాయ సహాయం అందించడం, న్యాయ అవగాహన సదస్సుల నిర్వహణ తదితర విషయాలను సంస్థ కార్యదర్శి వి.రజని వివరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిర్వహించే సామాజిక సేవలో భాగస్వాములు కావడానికి పారా లీగల్ వలంటీర్లుగా చేరవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రఘు తదితరులు పాల్గొన్నారు.
పోలీసు ప్రజావాణికి 10 ఫిర్యాదులు


