నేనంటే.. నేనే!
వనపర్తి బల్దియా చైర్పర్సన్ అభ్యర్థులుగా పలువురి ప్రచారం
ఫలితాల తర్వాతే స్పష్టత?
మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాతే చైర్పర్సన్ను ఎంపికచేసే యోచనలో కాంగ్రెస్ పార్టీ అధినేతలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా వినిపిస్తోంది. ఇందుకు ఆ పార్టీలోని పలువురు ముఖ్యనాయకులు సైతం ధ్రువీకరిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినాయకత్వం కూడా ఎవరి పేరును అధికారికంగా ప్రకటించడం లేదని తెలుస్తోంది. చైర్పర్సన్ ఎన్నిక సమయంలో ఎమ్మెల్యే ప్రతిపాదించే అవకాశం ఉందా? లేక డీసీసీ అధ్యక్షుడు తెరపైకి తెస్తారా? రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి బలపరుస్తారా? లేకా ముగ్గురు కలిసి ఒకరి పేరునే ఎంచుకుంటారా అనే అంశం ఉత్కంఠ రేపుతోంది. ఇదే విషయమై డీసీసీ అధ్యక్షుడు, శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డితో ప్రస్తావించగా.. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు, గెలిచిన తర్వాత అప్పటి పరిస్థితుల మేరకు నిర్ణయాలు ఉంటాయని చెప్పడం గమనార్హం.
వనపర్తిటౌన్: జిల్లా కేంద్రమైన వనపర్తి మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు నేనేంటే.. నేనేనంటూ చైర్పర్సన్ అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటుండటం గందరగోళం సృష్టిస్తోంది. పుర పీఠంపై ఆశలు పెట్టుకున్న నాయకులు.. చైర్పర్సన్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు కావడంతో తమ సతీమణులను ఎన్నికల బరిలో నిలిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వీరిలో ఐదారుగురు నాయకులు మరో అడుగు ముందుకేసి చైర్పర్సన్ అభ్యర్థిని తామే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. వారిలో ప్రధానంగా ఎస్ఎల్ఎన్ మాధవి రమేశ్ పేరు చైర్పర్సన్ అభ్యర్థిగా వినిపిస్తుండగా.. చీర్ల సౌమ్య చందర్, జయసుధ మధుగౌడ్, శారద బ్రహ్మం పేర్లు సైతం చర్చకు వస్తున్నాయి. అయితే పార్టీ అధిష్టానం అధికారికంగా చైర్పర్సన్ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఆయా వార్డుల్లో పోటీచేసే అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. ఎన్నికల్లో ఆర్థికంగా తోడ్పాటు పొందేందుకు ఎవరిని ఆశ్రయించాలో తెలియని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్లో భారతి ప్రేమ్నాథ్రెడ్డి, ఉంగ్లం అలేఖ్య పేర్లు ప్రధానంగా చైర్పర్సన్ రేస్లో వినిపిస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారంతో గడువు తీరనున్న తరుణంలో చైర్పర్సన్ అభ్యర్థుల ప్రకటన వెలువడుతుందా లేదా అనే సందిగ్ధత నెలకొంది.
అధికార కాంగ్రెస్ పార్టీలో గందరగోళం
టికెట్ల కేటాయింపుపై ఇంకా వెలువడని అధికారిక ప్రకటన
నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు


