ప్రజల దృష్టి మళ్లించేందుకే సిట్ డ్రామాలు
వనపర్తి టౌన్: పుర ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్పార్టీ సిట్ పేరుతో రెండేళ్లుగా డ్రామలు ఆడుతోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ విచారణ చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ సమీపంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాస్తారోకో చేపట్టాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రితో పాటు శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. ప్రజలు కాంగ్రెస్పార్టీని భరించే స్థితిలో లేరని, ఇచ్చిన హామీలు విస్మరించి అహంకారం, అజ్ఞానంతో వ్యవహరిస్తున్న సర్కార్ త్వరలోనే కుప్పకూలడం ఖాయమని మండిపడ్డారు.
● సిట్ కేసు లీగల్ సెన్స్ లేని కేసని.. పుర ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి కేసీఆర్పై ఉన్న అభిమానాన్ని చాటుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి కొత్త డ్రామాలకు తెర తీస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా తన వెక్కిలి చేష్టలు మానుకోకపోతే ఇంతకు పదింతల మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పరిపాలన సౌలభ్యం కోసం పదేళ్ల కిందట వనపర్తిని జిల్లాగా ఏర్పాటు చేస్తే నేడు రద్దు చేస్తామంటున్నారని, ప్రజలు విజ్ఞతతో కాంగ్రెస్ పాలనకు ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ.. సంక్షేమం చేతగాక సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్ సిట్ విచారణతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. అక్రమ కేసులు నమోదు చేయడం మాని అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఆందోళనకు పోలీసులు పటిష్ట బందోబస్తు కల్పించారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు పలుస రమేష్గౌడ్, పార్టీ మాజీ కౌన్సిలర్లు, అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


