ఆశలు.. అడియాశలు!
పోటీకి దూరంగా ప్రధాన పార్టీల పట్టణాధ్యక్షులు
వనపర్తి: పుర ఎన్నికల్లో వివిధ ప్రధాన పార్టీల పట్టణాఽధ్యక్షులపై రిజర్వేషన్ల నీళ్లు చల్లినట్లయింది. జిల్లాకేంద్రంతో పాటు పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత ఐదు పురపాలికల్లో ముగ్గురు మాత్రమే ఎన్నికల బరిలో ఉండటం గమనార్హం. ఒకటి రెండుచోట్ల రిజర్వేషన్ల ప్రతికూలతతో వారు తమ సతీమణులను పోటీలో నిలపాల్సిన పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లు ఖరారు కాకముందు చైర్మన్ రేసులో ఉన్నామంటూ ప్రచారం చేసుకున్న నేతలు సైతం రిజర్వేషన్లు అనుకూలించక చతికిల పడి ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. దీంతో చేసేది లేక సన్నిహితులకు ప్రచారం చేస్తూ ఎన్నికల వ్యూహాలు రచిస్తూ సీక్రేట్ ఆపరేషన్లు కొనసాగిస్తున్నారు.
● వనపర్తిలో బీజేపీ పట్టణాధ్యక్షుడు రాజశేఖర్గౌడ్, ఆత్మకూరు పురపాలికలో కాంగ్రెస్పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసులు, పెబ్బేరు పురపాలికలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు క్రాంతికుమార్ మాత్రమే పదవిలో ఉంటూ పుర బరిలో నిలిచారు. మిగిలిన పురపాలికల్లో రిజర్వేషన్లు అనుకూలించక పార్టీ పట్టణాధ్యక్షులు బరిలో నిలబడే అవకాశం లభించలేదు.
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అధికార కాంగ్రెస్పార్టీ తరుఫున బరిలో నిలిచిన చైర్మన్ అభ్యర్థి మాధవితో పాటు తనకు అత్యంత సన్నిహితులుగా మెలిగే, గత జనరల్ ఎన్నికల్లో తన కోసం పని చేసిన వారిని గెలిపించుకునేందుకు టికెట్లు ఖరారు చేయకముందు నుంచే ఆయా వార్డుల్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
● బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో లభించిన బూస్ట్తో పుర ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో చాలా జాగ్రత్తగా వ్యవహరించడంతో పాటు నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన మంగళవారం నుంచే ప్రచారం ప్రారంభించారు. అధికార కాంగ్రెస్పార్టీలో ముఖ్యులని చెప్పుకొనే వారు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ మారిన వారిపై సమర్థులైన అభ్యర్థులను, సీనియర్లను బరిలోకి దించారు. వనపర్తి పురపాలికలో బుధవారం నుంచే వార్డుల్లో పర్యటిస్తూ అధికార పార్టీకి గట్టిపోటీనిచ్చేందుకు కావాల్సిన అన్ని అస్త్రాలను సిద్ధ చేస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.
అఽధికార కాంగ్రెస్పార్టీ పట్టణాధ్యక్షుడు చీర్ల చందర్కు అవకాశం దక్కకపోవడంతో సతీమణి రజినిని బరిలో నిలిపారు. చైర్మన్ స్థానం మహిళకు రిజర్వ్ కావడంతో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రమేశ్గౌడ్ అతడి కుమారుడు శ్రీకర్గౌడ్ని బరిలో దింపారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్గౌడ్ పోటీలో ఉన్నారు. గతంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన వారిలో ఏ ఒక్కరూ ప్రస్తుతం పోటీలో లేకపోవడం గమనార్హం. ఐదేళ్లలో మున్సిపల్ చైర్మన్లుగా పనిచేసిన ఇద్దరు సైతం ఎన్నికలకు దూరంగా ఉండటం, తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ ఆదేశం మేరకు ఇతరులకు మద్దతుగా ఎన్నికల్లో పని చేస్తున్నారు.
రిజర్వేషన్ల కేటాయింపుతో
దక్కని స్థానాలు
సీనియర్ నేతలది ఇదే పరిస్థితి..
జిల్లాకేంద్రంతో పాటు
మిగిలిన పురపాలికల్లోనూ..
పలు వార్డులపై ప్రధాన నేతలు ఫోకస్


