సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిఘా
అమరచింత: పుర ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలిగించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్ హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బందితో పాటు ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా తగిన వసతులు కల్పించాలని సీఐ శివకుమార్ను ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలని, రాత్రి వేళలో పెట్రోలింగ్ పెంచాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే అదుపులోకి తీసుకోవాలని సూచించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఎస్ఎస్టీ చెక్పోస్టులను తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం రూ.50 వేల కన్నా ఎక్కువ నగదు తరలిస్తే జరిగే పరిణామాలను ప్రజలకు వివరించాలని ఎస్ఐ స్వాతికి సూచించారు. సీజ్ చేసిన నగదుకు సంబంధించిన ఆధారాలు చూపిస్తే నగదు పొందవచ్చన్నారు.


