నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
వనపర్తి: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో ఈ నెల 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 48 గంటల సైలెన్స్ పీరియడ్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ పార్టీలు, అభ్యర్థుల తరఫున ప్రచారానికి వచ్చిన ఇతర ప్రాంత వాసులు వెంటనే ఆయా పురపాలికలను వదిలి వెళ్లిపోవాలన్నారు. మోడల్ కోడ్ అనేది ఎన్నికలు పూర్తయ్యే వరకు ఉంటుందని.. ఏ ఒక్కరు ఇంటింటి ప్రచారం లేదా మీడియాలో ప్రచారం చేయడానికి వీలు లేదన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 సెక్షన్ 209(2) ప్రకారం కఠిన చర్యలు ఉంటాయన్నారు. అదే విధంగా మొబైల్ ఫోన్లలో ప్రచారం నిర్వహిస్తే సెక్షన్ 209(1) (బీ) ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించడం, ప్రసంగాలు చేయడం, సంగీత కచేరీలు ఏర్పాటు చేయడం వంటి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ఉద్దేశంతో కూడిన కార్యకలాపాలపై ఈ సైలెన్స్ పీరియడ్లో నిషేధం ఉంటుందన్నారు. పోలింగ్ రోజున ఓటు వేసేందుకు ఓటరు స్లిప్తో పాటుగా ఎన్నికల కమిషన్ గుర్తించిన 17 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక కార్డు వెంట తీసుకొని వెళ్లాలన్నారు. హోటళ్లు, దుకాణాలు, రెస్టారెంట్లు మొదలైన ప్రదేశాలతో పాటు పోలింగ్ ప్రాంతంలో మద్యం అమ్మకాలు లేదా పంపిణీ చేయడం నిషేధించబడిందని తెలిపారు. సోమవారం సాయంత్రం 5 నుంచి బుధవారం సాయంత్రం 5 గంటల వరకు అన్ని మద్యం షాపులు, కల్లు దుకాణాలు బంద్ చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ రోజు 13న సైతం మద్యం దుకాణాలు బంద్ చేయాలన్నారు. ఎగ్జిట్ పోల్ లేదా మరేదైనా పోల్ సర్వే ఫలితాలతో సహా ఎలాంటి ఎన్నికల విషయాలను నిశ్శబ్ద సమయంలో ఏ ఎలక్ట్రానిక్ మీడియా ఇతర మధ్యమాల్లో ప్రచురించడానికి లేదా ప్రసారం చేయడానికి వీలు లేదని తెలిపారు.


