కాంగ్రెస్లో టికెట్ల లొల్లి!
● కాంగ్రెస్పార్టీ పట్టణ కార్యనిర్వాహక అధ్యక్షుడు కదిరె రాములు 25వ వార్డు నుంచి, మాజీ కౌన్సిలర్ నక్క రాములు సతీమణి సుజాత 7వ వార్డు నుంచి బీ ఫారాలు ఇచ్చినప్పటికీ.. సకాలంలో రిటర్నింగ్ అధికారులకు సమర్పించక స్వతంత్రులుగానే బరిలో దిగనున్నారు.
● మాజీ కౌన్సిలర్ నందిమళ్ల శ్యామ్, భువనేశ్వరి దంపతులకు టికెట్లు నిరాకరించారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి వెంట మొదటి నుంచి ఉన్న రవియాదవ్, ఆయన సతీమణికి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పోటీ కారణంగా ఇరువురికి బీ ఫారాలు ఇవ్వలేదు.
వనపర్తిటౌన్: స్థానిక పురపాలిక ఎన్నికల సందర్భంగా మంగళవారం డీసీసీ కార్యాలయంలో టికెట్ల కేటాయింపు, బీఫారాల పంపిణీ వ్యవహారం ఆధ్యంతం ఉత్కంఠ రేపింది. చివరకు ఇద్దరు అభ్యర్థులకు సమయం దాటిన తర్వాత అందజేయడంతో స్వతంత్రులుగా బరిలో నిలవాల్సిన పరిస్థితి నెలకొంది. బయట కూర్చోబెట్టి మాట్లాడుతామని కొందరిని ఏమార్చగా.. మరికొందరిని రహస్యంగా కార్యాలయంలోకి పిలిపించి బీఫారాలు అందజేశారు. విషయం తెలియక కొందరు ఆశావహులు సమయం గడిచేంత వరకు కాలం వెళ్లదీశారు. పలు వార్డుల్లో ఇద్దరి నుంచి ఐదారుగురు వరకు పోటీ పడుతుండటంతో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి అభ్యర్థుల బలాబలాలపై ఆరా తీసి టికెట్లు కేటాయించారు. మధ్యాహ్నం 3 తర్వాత ఇద్దరు అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసినా అవి రిటర్నింగ్ అధికారులకు సమర్పించేందుకు గడువు ముగియడంతో వెనుదిరిగారు.
● మాజీ వైస్ చైర్మన్ బి.కృష్ణకు టికెట్ కేటాయింపులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బీసీ జనరల్ స్థానంలో ఆయన సతీమణికి కాకుండా అతడికే ఇస్తామని చెప్పడం.. ఓ దశలో బీ ఫారం ఇవ్వరనే ప్రచారం సాగింది. చివరకు ఆయన భార్యకే బీ ఫారం అందజేశారు.
32వ వార్డు టికెట్కు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, కాంగ్రెస్పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు ధనలక్ష్మి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. శ్రీనివాస్గౌడ్కు పదవి ఉండటంతో బీ ఫారం ఇవ్వరనే ప్రచారం సాగింది. చివరకు 40 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతుండటంతో సీనియార్టీని పరిగణలోకి తీసుకొని సతీమణి అరుణజ్యోతికి టికెట్ కేటాయించారు. ఈ క్రమంలో ధనలక్ష్మిని వ్యూహాత్మకంగా ఆ వార్డు నుంచి ఉపసంహరించుకునేలా చేసి 21వ వార్డుకు ఖరారు చేశారు.
● తన భర్త 20 ఏళ్లుగా టికెట్ ఆశిస్తున్నా.. అన్యాయమే జరుగుతోందని, వెయిటింగ్ లిస్ట్లో ఉంచి ఇతరులకు బీ ఫారం ఇచ్చారని రాగి వేణు సతీమణి లక్ష్మి, కుమారుడు అక్షయ్ డీసీసీ కార్యాలయంలో కన్నీటి పర్యంతమయ్యారు.
● 21వ వార్డులో 90 శాతానికిపైగా దళితులు ఉండగా.. ఇతర వర్గాలకు బీ ఫారం ఇవ్వడంలో చిన్నారెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారని, దళితులకు ద్రోహం జరిగిందని సోషల్ మీడియా వేదికగా కో–ఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్ ఆరోపించారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి సైతం పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆద్యంతం ఉత్కంఠంగా సాగిన బీఫారాల పంపిణీ
ఉదయం నుంచి వేచి ఉన్న ఆశావహులు
సకాలంలో అధికారులకు అందించక స్వతంత్రులుగా నిలిచిన ఇరువురు
పలువురి నాయకుల ఆందోళన
కాంగ్రెస్లో టికెట్ల లొల్లి!


