80 వార్డులు.. 816 నామినేషన్లు
చివరిరోజు భారీగా దాఖలు
● నేడు నామపత్రాల పరిశీలన
● ఉపసంహరణకు ఫిబ్రవరి 3 వరకు గడువు
వనపర్తిటౌన్: జిల్లాలో పుర ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పర్వం శుక్రవారం ముగిసింది. చివరిరోజు వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ద్విచక్ర వాహనాల ర్యాలీ, మేళతాళాల నడుమ పుర కార్యాలయాలకు చేరుకొని నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. జిల్లాకేంద్రంలో 33వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎస్ఎల్ఎన్ మాధవి రమేష్ నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా వచ్చారు. జిల్లాలోని ఐదు పురపాలికల్లో 80 వార్డులుండగా.. మొత్తం 816 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. చివరి రోజు అత్యధికంగా వనపర్తిలో 252.. అత్యల్పంగా అమరచింతలో 65 నామినేషన్లు దాఖలయ్యాయి. కొత్తకోటలో 88, ఆత్మకూర్లో 67. పెబ్బేర్లో 71 నామినేషన్లు వచ్చాయి. చివరిరోజు మొత్తంగా 543 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు వివరించారు. ఇందులో కాంగ్రెస్పార్టీ నుంచి 286, బీఆర్ఎస్ పార్టీ నుంచి 199, బీజేపీ నుంచి 151, సీపీఎం నుంచి 16, బీఎస్పీ నుంచి 9, ఎంఐఎం నుంచి 7, ఇతర పార్టీల నుండి 40, స్వతంత్రులు 104 మంది నామినేషన్లు దాఖలయ్యాయి.
నామినేషన్ల స్వీకరణకు సాయంత్రం 5 వరకు మాత్రమే సమయం ఉండటంతో సకాలంలో కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థుల నుంచి అధికారులు నామినేషన్ పత్రాలు స్వీకరించారు. వనపర్తి మున్సిపాలిటీలో రాత్రి 7 గంటలు దాటినా ప్రక్రియ కొనసాగింది. నామినేషన్లు వేసిన కొందరు అభ్యర్థులు సైతం చివరిరోజు అదనపు సెట్ల నామినేషన్లు వేశారు. శనివారం నామినేషన్ల పరిశీలన, తిరస్కరణకు గురైన వారు ఆర్డీఓ అప్పీల్కు వెళ్లేందుకు ఫిబ్రవరి 1న గడువిచ్చారు. ఫిబ్రవరి 2న అభ్యంతరాలపై విచారణ, 3న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. అదేరోజు మధ్యాహ్నం బరిలో ఉన్న అభ్యర్థుల తుదిజాబితాను ప్రకటించనున్నారు.
మున్సిపాలిటీల వారీగా నామినేషన్ల వివరాలు
పురపాలిక మొదటి రెండో చివరి మొత్తం
రోజు రోజు రోజు
వనపర్తి 25 108 252 385
కొత్తకోట 4 35 88 127
పెబ్బేరు 1 33 71 105
ఆత్మకూర్ 4 32 67 103
అమరచింత – 31 65 96


