పురపోరుకు సర్వం సిద్ధం
నేడు పోలింగ్.. ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
80 వార్డులు..
1,17,441 మంది ఓటర్లు
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో 80 వార్డులు, 1,17,441 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 191 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. 20 శాతం రిజర్వ్తో కలిపి 230 మంది ప్రిసైడింగ్ అధికారులు, 230 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 687 మంది ఓపీఓలను నియమించారు. వీరితో పాటు పోలీస్ సిబ్బంది, రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది సైతం విధులు నిర్వర్తించనున్నారు.
సీసీ కెమెరాలతో నిఘా..
ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సజావుగా సాగేందుకు జిల్లాలోని 80 పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకుల (మైక్రో అబ్జర్వర్లు)ను నియమించారు. మంగళవారం జిల్లాకేంద్రంతో పాటు పెబ్బేరు, కొత్తకోట ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎన్నికల పరిశీలకురాలు లక్ష్మీబాయి, ఆయా పుర కమిషనర్లు, తహసీల్దార్లు పరిశీలించారు.
వనపర్తి: జిల్లాలోని ఐదు పురపాలికల్లో బుధవారం ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 80 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం ఆయా పుర కేంద్రాల్లోని సామగ్రి పంపిణీ కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రి తీసుకొని కేటాయించిన బస్సుల్లో తరలివెళ్లారు. జిల్లాకేంద్రంలో పురుషుల డిగ్రీ కళాశాల ఆవరణలో, పెబ్బేరులో ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో, కొత్తకోటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం, అమరచింతలో జెడ్పీ ఉన్నత పాఠశాల, ఆత్మకూర్లో ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో సామగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ సామగ్రి పంపిణీతో పాటు ఎన్నికల రోజు సాయంత్రం రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు సైతం పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. అలాగే అక్కడే ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేయడంతో పాటు పోలింగ్ తర్వాత బ్యాలెట్ బాక్సులను భద్రపర్చేందుకు కావాల్సిన స్ట్రాంగ్రూంలను సైతం ఐదు మున్సిపాలిటీల పరిధిలోనే సిద్ధం చేయించినట్లు వెల్లడించారు.
పోలింగ్ సామగ్రితో కేంద్రాలకు వెళ్తున్న ఎన్నికల సిబ్బంది
సాయంత్రం 5లోగా ఉంటేనే..
ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు వరకు అవకాశం ఉంటుంది. సాయంత్రం ఐదులోపు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. ఓటర్లు ఓటరు స్లిప్తో పాటు ఎన్నికల సంఘం ప్రకటించిన 17 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తప్పనిసరిగా తీసుకెళ్లాలని కలెక్టర్ సూచించారు.
పురపాలికల వారీగా ఓటర్ల వివరాలు
కేంద్రాలకు చేరుకున్న బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి, సిబ్బంది
ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్
ఆయా పుర కేంద్రాల్లోనే స్ట్రాంగ్రూమ్స్ ఏర్పాటు.. అక్కడే ఓట్ల లెక్కింపు
పురపోరుకు సర్వం సిద్ధం


