కేసీఆర్ పాలనలోనే ముస్లింల అభ్యున్నతి
వనపర్తి: ముస్లింల అభ్యున్నతి మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పాలనలోనే కొనసాగిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పుర ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన అక్షా, ఈద్గా, మదీనా మసీదుల్లో ముస్లిం సోదరులను కలిసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పాలనలో మైనార్టీల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు. షాదీ ముబారక్, రంజాన్ తోఫా, బక్రీద్ ఇనాం వంటి పథకాలతో పాటు మైనార్టీ గురుకులాలు, విద్యార్థులకు విద్యాభరోసా, ముస్లిం మహిళలకు ప్రత్యేకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందించామని వివరించారు. అలాగే రాజకీయ రిజర్వేషన్లు కల్పించి ముస్లిం సమాజం అభివృద్ధికి కృషి చేశామన్నారు. పుర ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆయన వెంట గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, పలుస రమేష్గౌడ్, నందిమళ్ల అశోక్, వేణుగోపాల్, ప్రేమ్కుమార్, ఆరీఫ్, ప్రేమ్నాథ్రెడ్డి, ఆవుల రమేష్, నాగన్న యాదవ్, మెకానిక్ శ్రీను, జహంగీర్, శ్రీకర్గౌడ్, పోతులపల్లి రాజు, జోహెబ్ హుస్సేన్, ఎరువ అరుణ, రహీం తదితరులు ఉన్నారు.
ఉత్సాహంగా మహిళా క్రీడా పోటీలు
గోపాల్పేట: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో శుక్రవారం సీఎం కప్ నియోజకవర్గస్థాయి మహిళా క్రీడాపోటీలు నిర్వహించారు. కబడ్డీ, ఖో–ఖో, వాలీబాల్ పోటీలను తహసీల్దార్ తిలక్కుమార్రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. సాయంత్రం వరకు క్రీడలు కొనసాగాయి. క్రీడలను సంబంధిత చానల్, యూట్యూబ్లో లైవ్ టెలికాస్ట్ చేశారు. కబడ్డీ చివరి పోరులో పెబ్బేరు అర్బన్ జట్టు, ఖిల్లాఘనపురం జట్టు తలపడగా పెబ్బేరు అర్బన్ జట్టు విజయం సాధించింది. ఖో–ఖోలో పెద్దమందడి, వనపర్తి రూరల్ తలపడగా పెద్దమందడి.. వాలీబాల్లో పెద్దమందడి జట్టు, వనపర్తి అర్బన్ జట్టు తలపడగా పెద్దమందడి జట్లు గెలుపొందాయి. విజేత జట్లకు అతిథులు బహుమతులు ప్రదానం చేశారు.
టీ–20లో సత్తా చాటిన మహిళల జట్టు
మహబూబ్నగర్ క్రీడలు: వరంగల్లో జరుగుతున్న సీనియర్ మహిళా అంతర్ జిల్లాల టీ–20 క్రికెట్ టోర్నమెంట్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మహిళా జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతూ ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో 34 పరగుల తేడాతో ఖమ్మంపై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్నగర్ నిర్ణీత 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. ఓపెనర్లు మొదటి వికెట్కు 67 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆర్యాని 41 ( 45 బంతుల్లో 3 ఫోర్లు), ,అక్షరరాథోడ్ 30 (38 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఖమ్మం 17 ఓవర్లలో 69 పరుగులకే కుప్పకూలింది. మహబూబ్నగర్ బౌలర్లు ప్రవళిక రాథోడ్ 4 ఓవర్లలో కేవలం 8 పరుగులు ఇచ్చి 5 వికెట్లు, మేఘన 4 ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశారు. ఫైనల్లో జిల్లా జట్టు శనివారం వరంగల్తో తలపడనుంది. జట్టు ఫైనల్కు చేరడంపై ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, కోచ్ ఎండీ మన్నాన్ హర్షం వ్యక్తం చేశారు. ఫైనల్ మ్యాచ్లో మెరుగైన ప్రతిభ కనబరిచి చాంపియన్గా నిలవాలని ఆకాంక్షించారు.
కేసీఆర్ పాలనలోనే ముస్లింల అభ్యున్నతి


