చిన్నారులను మింగిన పాంపాండ్
● నీటిలో పడిన బంతి తీసేందుకు వెళ్లి ముగ్గురు మృతి
● త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డ మరో బాలిక
● నాగర్కర్నూల్ జిల్లా
ముచ్చర్లపల్లిలో విషాదం
తల్లిదండ్రులతో కలిసి సరదాగా సొంతూరికి వచ్చిన చిన్నారులు వ్యవసాయ పొలంలో ఆడుకునేందుకు వెళ్లి విగత జీవులుగా మారారు. ఉదయం నుంచి హుషారుగా కేరింతలు కొడుతూ.. సెల్ఫీలు దిగుతూ.. ఆడుకున్న ఆ చిన్నారుల ఆనందం ఊహించని ఘటనతో ఆవిరైపోయింది. పాంపాండులో పడిన బంతి తీసుకునేందుకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృత్యుఒడికి చేరిన విషాదకర ఘటన నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని ముచ్చర్లపల్లిలో చోటుచేసుకుంది.
కల్వకుర్తి టౌన్/ ఊర్కొండ: ముచ్చర్లపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్రెడ్డి, రజని దంపతుల సంతానం మాదు సిరి(14), మాదు శ్రీమన్యు(12), రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం రావిర్యాల గ్రామానికి చెందిన అతని సోదరి చంద్రకళ కూతురు స్నేహ(15), అదే గ్రామానికి చెందిన అతని అన్న వేణుగోపాల్రెడ్డి కూతురు విద్యాధరణి కలిసి వేణుగోపాల్రెడ్డి పొలంలో ఉదయం నుంచి సరదాగా ఆడుకున్నారు. మధ్యాహ్నం అందరూ కలిసి భోజనం చేశాక వేణుగోపాల్రెడ్డి పొలంలో ఉన్న పాంపాండ్ వద్ద బంతితో సరదాగా ఆడుకుంటుండగా అందులో పడిపోయింది. దీంతో పాంపాండులో బంతిని తీసుకునేందుకు ముందుగా శ్రీమన్యు వెళ్లగా.. అతనికి ఈత రాక మునిగిపోవడంతో అక్క మాదు సిరి చూసి తమ్ముడిని కాపాడేందుకు వెళ్లింది. ఇద్దరూ గుంతలో మునిగిపోతున్నారని గమనించిన స్నేహ సైతం వారి ని రక్షించాలని గుంతలో దిగగా ముగ్గురికి ఈత రాకపోవడం, పాంపాండు లోతుగా ఉండటంతో అక్కడే ఉన్న మరో చిన్నారి విద్యాధరణి గమనించి పాంపాండులోకి దిగుతూ గట్టిగా కేకలు వేసింది. వెంటనే శ్రీకాంత్రెడ్డి ఈత రాకపోయినా తన కాలుకు తాడు కట్టుకొని గుంతలోకి వెళ్లి విద్యాధరణిని బయటకు తీశాడు. మళ్లీ గుంతలోకి వెళ్లేసరికి ముగ్గురు చిన్నారు లు అప్పటికే పాంపాండులో బురదనీటిని మింగడంతో మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న ఊర్కొ ండ ఎస్ఐ కృష్ణదేవరాయ ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు చిన్నారులను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై చిన్నారుల తల్లి రజని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని కల్వకుర్తి సీఐ నాగార్జున తెలిపారు.
ఈ జీవితం మాకు వద్దు..
కళ్లెదుటే తమ ఇద్దరు సంతానం విగత జీవులుగా పడి ఉండడం చూసి తల్లిదండ్రులు మా పిల్లలు లేని ఈ జీవితం మాకు వద్దు అని బోరున విలపించారు. మా పిల్లలు చనిపోయిన ఈ గుంతలోనే మేం కూడా చనిపోతామని అనడంతో స్థానికులు వారిని ఓదార్చారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా.. నాయకులు, గ్రామస్తులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
ఎమ్మెల్యే పరామర్శ
ప్రమాదవశాత్తు గుంతలో పడి మృతిచెందిన చిన్నారుల కుటుంబ సభ్యులను జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి పరామర్శించారు. ఒకే కుటుంబంలోని చిన్నారులను కోల్పోవడం దురదృష్టకరణమన్నారు. కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన ఆయన చిన్నారుల మృతదేహాలను సందర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. సంఘటనకు దారితీసిన పరిస్థితులను కుటుంబ సభ్యులు, పోలీసులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
చెట్టును పట్టుకోవడంతో బతికాను
మేము నలుగురం కలిసి ఆడుకునేందుకు పొలం వద్దకు వెళ్లాం. బంతి ఆట ఆడుకుంటూ గుంతలోకి వెళ్లడంతో సిరి, శ్రీమన్యు, స్నేహ మునిగిపోయారు. వారిని కాపాడేందుకు చుట్టుపక్కల వాళ్లను మా బాబాయి శ్రీకాంత్రెడ్డి పిలిచారు. మా బాబాయి నన్ను అక్కడే ఉన్న చెట్టు పట్టుకోమని చెప్పడంతో నేను బతికిపోయాను. బాబాయి పిలిచిన వారంతా గుంత వద్దకు వచ్చే సరికి ఆ ముగ్గురూ నీటి లోపలికి మునిగిపోయారు.
– విద్యాధరణి,
ప్రాణాలతో బయటపడిన బాలిక
చిన్నారులను మింగిన పాంపాండ్
చిన్నారులను మింగిన పాంపాండ్


