అత్యుత్తమంగా 102, 108 వాహన సేవలు
వెయ్యి మంది సిబ్బందితో పటిష ్టబందోబస్తు
వనపర్తిటౌన్: పుర ఎన్నికల సందర్భంగా వెయ్యి మంది పోలీసులతో కట్టుదిట్టమైన పట్టిష్ట బందోబస్తు కల్పిస్తున్నట్లు ఎస్పీ సునీతరెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలో ఎన్నికల నిర్వహణపై పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అదనపు ఎస్పీ, డీస్పీలు, ప్రత్యేక పోలీసు బృందాలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయని, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలోని ఐదు పురపాలికల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి కఠినంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. మొత్తం 80 వార్డులు, 191 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. 67 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి ప్రత్యేక బందోబస్తు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణ సమష్టి బాధ్యతని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా విధుల్లో ఉన్న సిబ్బంది కఠిన పర్యవేక్షణ కొనసాగిస్తారన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్)ను అమలు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎన్నికల సెల్ ద్వారా పర్యవేక్షణ ఉంటుందని, సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా బృందాలు, మొబైల్ పెట్రోలింగ్ నిరంతరం పని చేస్తున్నారయన్నారు. అభ్యర్థులు ఓటర్ల మనసు గెలిచి ఎన్నికల బరిలో గెలవాలని, ఉచితాలు, బహుమతులు, డబ్బు, మద్యం లాంటి వాటితో ప్రలోభాలకు గురిచేయొద్దని, అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడిన, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి 123 కేసులు నమోదు చేసి, 432 మందిని సత్ప్రవర్తన కోరుతూ ముందస్తుగా బైండోవర్ చేసినట్లు వెల్లడించారు. ఎన్నికలను ప్రభావితం చేసే అక్రమ మద్యం రవాణాలో భాగంగా జిల్లాలో 425 లీటర్ల మద్యాన్ని పట్టుకొని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కొత్తకోట రూరల్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 102, 108 వాహనాలు అత్యుత్తమ సేవలు అందిస్తూ అపర సంజీవనిలా ఆదుకుంటున్నాయని 108 ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ కె.రవికుమార్ అన్నారు. మంగళవారం పెద్దమందడిలోని 108 వాహనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పరికరాల పనితీరు, మందులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాద బాధితులు, ఆపదలో ఉన్న వారిని 108 వాహనాల్లో వెంటనే దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నామన్నారు. అలాగే 102 అమ్మఒడి వాహనాలు గర్భిణులను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి తిరిగి ఇంటికి చేరుస్తున్నాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు అయిన తర్వాత తల్లీబిడ్డలను ఇంటివద్ద ఉచితంగా వదులుతున్నాయని.. ఐదేళ్లలోపు చిన్నారులను వ్యాక్సినేషన్ కోసం తీసుకెళ్లేందుకు ఉపయోగిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ మహబూబ్బాషా, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ బుద్వేష్, భార్గవి, శశి, భీమేష్ ఉన్నారు.


