పక్కా ప్రణాళికతో ఎన్నికల నిర్వహణ
అమరచింత: పుర ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని జిల్లా ఎన్నికల పరిశీలకురాలు జి.లక్ష్మీబాయి అన్నారు. పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పీఓ, ఏపీఓల ఎన్నికల సామగ్రి పంపిణీని మంగళవారం ఆమె పరిశీలించి సిబ్బందికి ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అమరచింతలో మొత్తం 9,147 మంది ఓటర్లుండగా.. 18 పోలింగ్ కేంద్రాలు, 90 మంది ఎన్నికల సిబ్బందిని కేటాయించినట్లు చెప్పారు. సీఐ ఆధ్వర్యంలో ఐదుగురు ఎస్ఐలతో పాటు 50 మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నట్లు వివరించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పుర కమిషనర్ నూరుల్ నదీంను ఆదేశించారు. వయోవృద్ధులు, నడవలేని వారు, దివ్యాంగుల కోసం వీల్చైర్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఆమె వెంట జెడ్పీ డిప్యూటీ సీఈఓ రామమహేశ్వరావు, ఎంపీడీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ రవికుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు.
అధికారుల పరిశీలన..
ఆత్మకూర్: ఎన్నికల విధులు నిబద్ధతతో నిర్వహించాలని ఎన్నికల పరిశీలకురాలు లక్ష్మీబాయి, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ, డీపీఓ రఘునాథ్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్రూం, ఓట్ల లెక్కింపు కేంద్రం, పోలింగ్ కేంద్రాలను వేర్వేరుగా పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా సజవుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఎన్నికలు జరుగనున్నాయని వివరించారు. కార్యక్రమంలో పుర కమిషనర్ చికినె శశిధర్, తహసీల్దార్ చాంద్పాషా, ఎంపీడీఓ శ్రీపాద్, ఎంఈఓ బాలరాజు, ఎంపీఓ శ్రీరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


