ప్రసవాల సంఖ్య పెంచాలి : డీఎంహెచ్ఓ
అమరచింత: ఆశా కార్యకర్తలు క్లస్టర్ పరిధిలోని గర్భిణులు, బాలింతలకు అందుబాటులో ఉంటూ వారికి సకాలంలో వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్రెడ్డి కోరారు. ఆశా డే సందర్భంగా గురువారం స్థానిక డీఎంఆర్ఎం పీహెచ్సీలో ఆత్మకూర్, అమరచింత మండలాల ఆశా కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. ఆయుష్ వైద్యులు, సూపర్వైజర్లు, ఆరోగ్య, ఆశా కార్యకర్తలకు విధులు, లక్ష్యాల గురించి ఆయన వివరించారు. ఎస్సీడీ స్క్రీనింగ్, ప్రసవాలు, ఏఎన్సీ రిజిస్ట్రేషన్లు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంటూ ప్రజలు రోగాల బారిన పడకుండా సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రులో ప్రసవాల సంఖ్య పెంచేలా చొరవ చూపాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆపరేషన్ మధుమేహ కార్యక్రమంలో భాగంగా వ్యాధిగ్రస్తులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా కుష్టు నిర్మూలనకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని.. లక్షణాలు కనిపిస్తే తగిన వైద్యసేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి డా. ఫయాజ్ ఆయుష్ వైద్యులు డా. దీపిక, డా. వసంత, డా. నిఖిత, సీహెచ్ఓ రవికుమార్, హెచ్ఈ విద్యాసాగర్, ఎంపీహెచ్ఈఓ సూపర్వైజర్లు సురేందర్గౌడ్, సంధ్యారాణి, డీఈఓ నారాయణ తదితరులు పాల్గొన్నారు.


