‘కార్మికులకు న్యాయం చేయండి’
పాన్గల్: కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూర్చడం కాదు.. కార్మికులకు న్యాయం చేసే చర్యలు చేపట్టాలని ఆవాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జబ్బార్ అన్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం మండల కేంద్రంలో సీఐటీయూ మండల కన్వీనర్ రాము అధ్యక్షతన నిర్వహించిన సమ్మెకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారులకు పెద్దపీట వేస్తూ కార్మికులు, రైతులపై భారం మోపుతూ ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లు, విత్తన చట్టం 2025 ముసాయిదా, విద్యుత్ సవరణ బిల్లు, వీబీజీ రాంజీ చట్టం తీసుకొచ్చిందని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దేవేందర్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్యానాయక్, సీఐటీయూ సీనియర్ నాయకుడు వెంకటయ్య విమర్శించారు. రైతులు, ఉపాధి కూలీలు, కార్మికులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తూ వారికి అండగా నిలుస్తామన్నారు. అంబేడ్కర్ చౌరస్తా నుంచి బస్టాండ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రేమద్దుల సర్పంచ్ నిరంజన్, రైతు సంఘం నాయకులు భాస్కర్, మల్లేష్, నాయకులు భీమయ్య, కిల్లె వెంకటయ్య, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, జీపీ కార్మికులు పాల్గొన్నారు.


