వెంకటేశ.. నమోస్తుతే...
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం దేవస్థానం సమీపంలోని కోటకదిరలో ఉన్న ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్ ఇంటి నుంచి స్వామి ఉత్సవమూర్తిని మన్యంకొండ గుట్టపైకి పల్లకీలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. కోలాటాలు, భజనలతో కోటకదిర గ్రామం భక్తిపారవశ్యంతో పులకించిపోయింది. ముందుగా స్వామివారిని వివిధ బంగారు ఆభరణాలతో అలంకరించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకం, నివేదన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన దాసంగాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు స్వామివారికి గరుడవాహన సేవ నిర్వహించారు.


