ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
వనపర్తి రూరల్: పేద ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం వనపర్తి పుర పరిధిలోని 18, 21 వార్డుల్లో అభ్యర్థులు పుట్టా ఆంజనేయులు, గంధం మదన్తో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి కర్రెమ్మ ఆలయం వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి కార్మికులు, కర్షకులు సంఘటితం కాకుండా చూస్తోందన్నారు. కష్టజీవులంతా ఐక్యంగా ఉద్యమిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని.. వార్డుల్లోని సమస్యలు పరిష్కరించాలంటే పేదల గురించి తెలిసిన కమ్యూనిస్టు అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ సీపీఎంకు మద్దతు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్, డి.బాల్రెడ్డి, రాజు, బాల్యానాయక్, బీఆర్ఎస్ నాయకులు గంధం బాలపీర్, గంధం విజయ్, పరంజ్యోతి, మంద రాము, తిరుపతయ్య, వెంకటయ్య, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
జాన్వెస్లీ


