కాంగ్రెస్ గెలుపుతోనే వార్డుల అభివృద్ధి
వనపర్తిటౌన్: పుర వార్డులు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్పార్టీ అభ్యర్థులను గెలిపించాలని.. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని 4వ వార్డులో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత బీఆర్ఎస్ పాలనకు, నేటి ప్రజాపాలనకు మధ్య బేధం ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుందని, అభివృద్ధి వైపు అడుగులు వేసేందుకు కాంగ్రెస్కు ఓటేయాలని కోరారు. 4వ వార్డులోని శివాలయం అభివృద్ధికి రూ.50 లక్షలు, బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.8 లక్షలు మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. రూ.85 లక్షలతో 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల తాగునీటి ట్యాంకు నిర్మించామని, రూ.40 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని.. త్వరలో మరో రూ.60 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు చేపడతామని వివరించారు. కాంగ్రెస్ హయంలోనే అంతర్గత రహదారులు, డ్రైనేజీల నిర్మాణాలు జరిగాయని పేర్కొన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు చీర్ల విజయచందర్, పరశురాములు, చంద్రశేఖర్రెడ్డి, లక్కాకుల సతీష్, ఎస్ఎల్ఎన్ రమేష్, బ్రహ్మంచారి, పాకనాటి కృష్ణయ్య, ఎల్ఐసీ కృష్ణ, బొంబాయి మన్యంకొండ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


