క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
● ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
● సీఎం కప్ జిల్లాస్థాయి
క్రీడాపోటీలు ప్రారంభం
గోపాల్పేట: క్రీడాకారులు ఉన్నత లక్ష్యం నిర్ధేశించుకొని చిన్నప్పటి నుంచే కష్టపడితే సులభంగా చేరుకోవచ్చని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. సీఎం కప్ జిల్లాస్థాయి క్రీడాపోటీల్లో భాగంగా గురువారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో వాలీబాల్, కబడ్డీ, ఖో–ఖో పోటీలను జ్యోతి వెలిగించి ప్రారంభించడంతో పాటు క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడారు. ప్రభుత్వం క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ఎంతో కష్టపడుతోందని.. గ్రామీణస్థాయి విద్యార్థులు వినియోగించుకుంటే భవిష్యత్లో జాతీయస్థాయిలో ఆడేందుకు సీఎం కప్ ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థి రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చేలా ఆడాలని కోరారు. సాయంత్రం విజేత జట్లకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి బహుమతులు అందజేశారు.
ఉన్నత పాఠశాల తనిఖీ..
క్రీడాపోటీలు ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మేఘారెడ్డి స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజనంలో మెనూ పాటిస్తున్నారా అని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. వంటగది, వంటలు, అన్నం కలిపి పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం నాణ్యతగా అందించాలని సూచించారు. ఆయన వెంట స్థానిక నాయకులు శివన్న, కొంకి వెంకటేష్, శేఖర్, కోదండం, కొంకి రమేష్, బంగారయ్య, యాదగిరి, మల్లేష్, అధికారులు ఉన్నారు.
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్


