ముగిసిన నామినేషన్ల పరిశీలన
వనపర్తిటౌన్: పుర ఎన్నికల్లో భాగంగా నామినేషన్ పత్రాల పరిశీలన శనివారం ఆయా పుర కార్యాలయాల్లో కొనసాగింది. మూడు వార్డులకు ఒక రిటర్నింగ్ అధికారి నామపత్రాల పరిశీలన చేపట్టారు. పరిశీలన కొనసాగిన సమయంలో ఆయా పార్టీల ప్రతినిధులు ఎన్నికల అధికారి ఛాంబర్లోనే కూర్చున్నారు. ఉదయం నుంచి వార్డుల వారీగా అభ్యర్థుల పత్రాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. ఎవరికై నా అభ్యంతరాలు ఉన్నాయా అంటూ అభ్యర్థులను అడుగుతూ నామినేషన్లు పరిశీలించి ఆమోదముద్ర వేశారు. సరైన ఆధారాలు లేక వనపర్తి, పెబ్బేరు మున్సిపాలిటీలో ఒక్కో నామినేషన్ తిరస్కరణకు గురైంది. కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూర్, అమరచింత మున్సిపాలిటీల్లో నామపత్రాల పరిశీలన సజావుగా సాగింది.
● జిల్లాలోని ఐదు పురపాలికల్లో మొత్తం 812 నామినేషన్లు దాఖలు కాగా.. బరిలో 496 మంది నిలిచారు. వనపర్తి నుంచి అత్యధికంగా 220 మంది ఉండగా, అతి తక్కువగా అమరచింతలో 60 మంది ఉన్నారు. ఇందులో కాంగ్రెస్పార్టీ నుంచి 176, బీఆర్ఎస్ పార్టీ నుంచి 120, బీజేపీ నుంచి 93, బీఎస్పీ నుంచి 8, సీపీఎం నుంచి 9, ఎంఐఎం నుంచి 7, ఇతర పార్టీల నుంచి 30, స్వతంత్రుల నుంచి 85 నామినేషన్లు దాఖలయ్యాయి.
వనపర్తి, పెబ్బేరులో ఒక్కొక్కటి తిరస్కరణ


