వ్యూహాలకు పదును
● ముఖ్యనేతల ఓటమే లక్ష్యంగా ప్రత్యర్థి
పార్టీల కసరత్తు
● తెలిసిన వారితో కథ నడిపిస్తున్న పార్టీలు
● పోటాపోటీగా
ప్రచారాలు, పలు వార్డుల్లో నజారానాలు, డబ్బుల పంపిణీ
వనపర్తిటౌన్: స్థానిక పురపాలికలో ముఖ్యనేతలను ఓడించడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. కాంగ్రెస్పార్టీలో కీలక నేతలుగా ప్రచారంలో ఉన్న ఎస్ఎల్ఎన్ రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ అరుణజ్యోతి, చీర్ల విజయచందర్, బి.వెంకటేష్, పుర మాజీ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ, బి.రమాదేవికృష్ణ, శారద బ్రహ్మం, ధనలక్ష్మి, మధుసూదన్గౌడ్ను ఎలాగైనా ఎన్నికల్లో ఓడించాలని బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. ఇందుకు ప్రతివ్యూహంగా కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్పార్టీకి చెందిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ఉంగ్లం అలేఖ్య తిరుమల్, కాగితాల లక్ష్మీనారాయణ, భారతి ప్రేమ్నాథ్రెడ్డిని ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇరుపక్షాలు ఏయే పార్టీ, ఏయే అభ్యర్థిని టార్గెట్ చేశాయో స్పష్టమవుతుండటంతో అభ్యర్థులు సైతం ఎత్తుకు పైఎత్తు వేస్తూ పట్టు సాధించేందుకు పావులు కదుపుతుండటం పురపోరు ఆసక్తి రేపుతోంది. దశాబ్దాలుగా మున్సిపాలిటీ అంటే పలువురు కౌన్సిలర్ల పేర్లే వినిపిస్తుండటంతో వారిని కట్టడి చేయాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి భావిస్తుండగా.. పురపాలికలో పట్టు సాధించిన కాంగ్రెస్ నాయకులను దెబ్బ తీసేందుకు మాజీ మంత్రి నిరంజన్రెడ్డి వ్యూహాలకు పదునుపెట్టారు.


