పకడ్బందీగా ఓట్ల లెక్కింపు
● కేంద్రాలను పరిశీలించిన
జిల్లా ఎన్నికల అధికారి సురభి
వనపర్తిటౌన్/వనపర్తి రూరల్/కొత్తకోట రూరల్/ఆత్మకూర్/అమరచింత: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. గురువారం జిల్లాలోని వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూర్, అమరచింత మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను డీఎస్పీ వెంకటేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు వివరించారు. జిల్లాకేంద్రంలో నర్సింగాయపల్లిలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెబ్బేరులో ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాల, కొత్తకోటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆత్మకూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాల, అమరచింతలో జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఉన్నాయని వెల్లడించారు. ఆయా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన మూడంచెల పోలీస్ బందోబస్తు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని.. మధ్యాహ్నం వరకు అన్ని ఫలితాలు వెలువడేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. లెక్కింపు కేంద్రాల్లోకి సెల్ఫోన్లను అనుమతించని, కచ్చితంగా ఏదైన ఒక గుర్తింపుకార్డు తీసుకురావాలని సూచించారు. అభ్యర్థితో పాటు ఒక్కరికి మాత్రమే కేంద్రంలోకి అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు, అధికారులు, సిబ్బంది అందరూ సహకరించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ విజయవంతం చేయాలని కోరారు. ఆయన వెంట రెవెన్యూ అదదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, అడిషనల్ జెడ్పీ సీఈఓ రామమహేశ్వర్రెడ్డి, పెబ్బేరు పుర కమిషనర్ ఖాజ ఆరీఫుద్దీన్, తహసీల్దార్ మురళిగౌడ్, ఎంపీడీఓ వెంకటేష్, సీఐ శివకుమార్, అమరచింత పుర కమిషనర్ నూరుల్ నదీం, తహసీల్దార్ రవికుమార్ యాదవ్, ఎంపీడీఓ శ్రీనివాసులు, అసిస్టెంట్ ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రమేశ్రెడ్డి, ఇతర సిబ్బంది తదితరులు ఉన్నారు.


