breaking news
iran
-
అమెరికా మెరుపు దాడులు.. ఇరాన్ ఎదురుదెబ్బ!
పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలోని ఇరాన్ లారక్ దీవిపై అమెరికా దాడి చేయగా.. ప్రతీకారంగా ఇరాన్ అమెరికా బలగాలపై క్షిపణి దాడులకు దిగింది. లారక్ దీవిలో ఇరాన్ రాకెట్ లాంచర్లను అమెరికా బలగాలు ధ్వంసం చేసిన కొన్ని గంటల్లోనే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్, జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. దీంతో ఇరుదేశాల మధ్య ఘర్షణ మరోసారి తీవ్రరూపం దాల్చింది.హర్ముజ్ జలసంధిలోని లారక్ దీవిపై అమెరికా బలగాలు రెండు ఇరానియన్ లాంచర్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ సిబ్బంది సముద్రంలో నౌకా విధ్వంసక మైన్లను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు గుర్తించిన నేపథ్యంలోనే ఈ దాడి చేసినట్లు అమెరికా వెల్లడించింది. లారక్పై జరిగిన దాడి.. జూలై చివరి తర్వాత ఇరాన్ భూభాగంపై అమెరికా చేసిన తొలి దాడిగా తెలుస్తోంది.అమెరికా అధికారుల ప్రకారం.. లారక్లోని లాంచర్లు హర్ముజ్ జలసంధిలో సముద్ర మైన్లను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ జలమార్గంలో మైన్లను అమర్చడం ద్వారా అంతర్జాతీయ నౌకాయానానికి తీవ్ర ముప్పు ఏర్పడే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యగా దాడి చేసినట్లు వాషింగ్టన్ చెబుతోంది.‘ప్రతీకారం తప్పదు’.. ఇరాన్ హెచ్చరికఅమెరికా దాడిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. లారక్ దాడిలో తమ సైనిక సిబ్బందితో పాటు పౌరులు కూడా మరణించినట్లు, గాయపడినట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ దాడికి తప్పకుండా ప్రతిస్పందిస్తామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్(IRGC) హెచ్చరించింది. అమెరికా దాడికి ‘ప్రతిస్పందన, శిక్ష’ ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది.ఆ హెచ్చరికకు అనుగుణంగానే ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. జోర్డాన్లో అమెరికా బలగాలు ఉన్న కింగ్ హుస్సేన్, అల్ అజ్రాక్ స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్లు IRGC ప్రకటించింది. ఇరాన్ దాడిలో రెండు స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.8 క్షిపణులను అడ్డుకున్న జోర్డాన్ఇరాన్ దాడులను జోర్డాన్ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్లు ఆ దేశం ప్రకటించింది. మొత్తం ఎనిమిది క్షిపణులను తమ గగనతలంలోనే కూల్చివేసినట్లు తెలిపింది. దీంతో ఇరాన్–అమెరికా ఘర్షణ ప్రభావం ప్రాంతంలోని ఇతర దేశాలపై కూడా పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.హర్ముజ్ జలసంధే అసలు కేంద్రంఈ మొత్తం పరిణామాలకు హర్ముజ్ జలసంధే కీలక కేంద్రంగా మారింది. ఇరాన్కు చెందిన లారక్ దీవి హార్ముజ్ దీవికి దక్షిణంగా, ఖేష్మ్ దీవికి తూర్పున ఉంది. సుమారు 49 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే ఉన్నప్పటికీ.. అత్యంత కీలకమైన సముద్ర మార్గానికి సమీపంలో ఉండటంతో దీనికి వ్యూహాత్మక ప్రాధాన్యం ఉంది. లారక్లో IRGC నేవీ స్థావరం కూడా ఉంది.ప్రపంచ ఇంధన సరఫరాకు హర్ముజ్ జలసంధి అత్యంత కీలకం. ప్రపంచ చమురు, ద్రవీకృత సహజవాయువు (LNG) రవాణాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గం గుండా సాగుతుంది. దీంతో ఈ జలమార్గంలో మైన్లు వేయాలన్న ఇరాన్ చర్యలను అమెరికా తీవ్రంగా పరిగణిస్తోంది.ఒమన్ వైపు మారిన నౌకలుహర్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడుల నేపథ్యంలో కొన్ని నౌకలు ఒమన్ తీరానికి సమీపంలోని దక్షిణ మార్గం గుండా ప్రయాణిస్తున్నాయి. అయితే ఆ మార్గంలోనూ ఇరాన్ మైన్లు అమర్చే సామర్థ్యం కలిగి ఉంటే.. అంతర్జాతీయ నౌకాయానానికి మరింత ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉందని అమెరికా రక్షణ రంగ మాజీ అధికారి డేవిడ్ డెస్ రోచెస్ విశ్లేషించారు.ట్రంప్ ‘జీరో టాలరెన్స్’ హెచ్చరికహర్ముజ్లో మైన్లను ఏర్పాటు చేసే ప్రయత్నాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలోనే తీవ్రంగా హెచ్చరించారు. మైన్లను అమర్చే ఏ నౌక లేదంటే పడవనైనా ఒక క్రమపద్ధతిలో ధ్వంసం చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. మైన్ల ఏర్పాటు విషయంలో ‘జీరో టాలరెన్స్’ విధానం అమల్లో ఉందని ట్రంప్ స్పష్టం చేశారు.పెరిగిన చమురు ధరలు.. ముదిరిన ఆందోళనఅమెరికా లారక్ దాడి వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన పెరిగింది. చమురు ధరలు రెండు శాతానికి పైగా పెరిగాయి. హార్ముజ్ జలసంధిలో నౌకాయానం మరింత దెబ్బతింటే ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో మార్కెట్లు అప్రమత్తమయ్యాయి.అమెరికా–ఇరాన్ మధ్య తాజా దాడులు ఇరు దేశాల మధ్య ఇప్పటికే కొనసాగుతున్న ఘర్షణను మరింత ప్రమాదకర దశలోకి తీసుకెళ్లే అవకాశముంది. ఒకవైపు హర్ముజ్ జలసంధిలో నౌకాయానాన్ని సురక్షితంగా కొనసాగించేందుకు అమెరికా ప్రయత్నిస్తుండగా.. మరోవైపు ఆ మార్గంపై తన ప్రభావాన్ని కొనసాగించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోంది. లారక్పై అమెరికా దాడి, దానికి ప్రతీకారంగా జోర్డాన్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేయడం.. ఈ పోరాటం మళ్లీ నేరుగా ఇరుదేశాల మధ్య సైనిక ఘర్షణగా మారుతున్న సంకేతాలను ఇస్తోంది. ఇదీ చదవండి: 270 మందితో వెళ్తున్న బోటు బోల్తా -
ట్రంప్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్ ఉక్కిరిబిక్కిరి..!
బాంబులు, క్షిపణులతోనే కాదు.. ఇప్పుడు డాలర్తో ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేయాలని అమెరికా వ్యూహం రచిస్తోంది. ఇరాన్కు ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయన్న ఆరోపణలతో ఈజిప్ట్కు చెందిన బాంక్ మిసర్ యూఏఈ శాఖలపై అమెరికా ట్రెజరీ కొరడా ఝళిపించింది. యూఎస్ ఆర్థిక వ్యవస్థతో ఆ బ్యాంక్ శాఖలకు ఉన్న డాలర్ లావాదేవీల మార్గాన్ని కట్ చేసే ప్రతిపాదన చేసింది. డొనాల్డ్ ట్రంప్ సర్కార్ చర్యతో ఇరాన్కు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఉన్న మార్గాలను ఒక్కొక్కటిగా మూసివేసే ప్రయత్నం మరింత ముదిరింది. 2024 జనవరి నుంచి 2026 జూన్ వరకు బాంక్ మిసర్ యూఏఈ సుమారు 1.8 బిలియన్ డాలర్ల లావాదేవీలను ఇరాన్ షాడో బ్యాంకింగ్ నెట్వర్క్తో సంబంధం ఉన్న 103 సంస్థల కోసం ప్రాసెస్ చేసిందని అమెరికా ఆరోపిస్తోంది.అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఇప్పటికే ప్రపంచ దేశాలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్కు సహకరించే సంస్థలు అమెరికా డాలర్, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను ఉపయోగించుకునే అవకాశం కోల్పోతాయని ఆయన తేల్చి చెప్పారు. ఈ చర్య ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్’లో భాగంగా చేపట్టినట్లు అమెరికా తెలిపింది. అయితే బాంక్ మిసర్పై చర్య ఇప్పటికిప్పుడు పూర్తిస్థాయిలో అమల్లోకి రాదు. ప్రతిపాదిత నిబంధనపై 30 రోజుల పాటు ప్రజల అభిప్రాయాలను స్వీకరించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు.ఈజిప్ట్కు షాక్..అమెరికా నిర్ణయంపై ఈజిప్ట్ స్పందించింది. ఈ చర్య యూఏఈలోని బాంక్ మిసర్ శాఖలు, వాటి డాలర్ లావాదేవీలకు మాత్రమే పరిమితం అవుతుందని స్పష్టం చేసింది. ఈజిప్ట్లోని బ్యాంక్ కార్యకలాపాలకు ఇది వర్తించదని తెలిపింది. మరోవైపు, యూఏఈ సెంట్రల్ బ్యాంక్ బాంక్ మిసర్ శాఖల లావాదేవీలపై ప్రత్యేక, అత్యవసర పరిశీలన ప్రారంభించింది.కాగా, ఇరాన్పై అమెరికా ఒత్తిడి ఇప్పుడు సరికొత్త దశకు చేరుకుంది. ఇరాన్కు డబ్బు చేరే మార్గాలను కట్ చేయడం.. డాలర్ వ్యవస్థ నుంచి దూరం చేయడం.. దాని ఆర్థిక భాగస్వాములపై కూడా ఒత్తిడి పెంచడం ద్వారా టెహ్రాన్ను ఆర్థికంగా ఏకాకిని చేయాలని వాషింగ్టన్ ప్రయత్నిస్తోంది. బాంక్ మిసర్ యూఏఈ శాఖలపై తాజా చర్య అందులో భాగమే. మొత్తంగా.. ఇరాన్పై అమెరికా యుద్ధం ఇప్పుడు మరో ఫ్రంట్కు చేరింది. ఆయుధాలతో యుద్ధం చేస్తూనే.. మరోవైపు డాలర్ను ఆయుధంగా మార్చుకుని ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై అమెరికా గట్టి దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతోంది.చదవండి: చమురు మంట.. సామాన్యుడికి మరింత భారం.. -
ట్రంప్ ఉక్కిరి బిక్కిరి.. చుట్టుముట్టిన అంతర్జాతీయ సంక్షోభాలు!
తనను తాను ‘శాంతి అధ్యక్షుడు’ (Peace President)గా అభివర్ణించుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రస్తుతం అంతర్జాతీయ వేదికపై ఏకకాలంలో పలు సంక్షోభాలను ఎదుర్కొంటున్నారు. ఇరాన్తో యుద్ధం తీవ్ర ప్రతిష్టంభనకు దారితీయగా, మరోవైపు అమెరికా దీర్ఘకాల మిత్రదేశమైన కెనడాతో భారీ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. ఇరాన్ తీరంలో నిలిచిపోయిన ముడి చమురు రవాణా, కెనడాపై భారీగా విధించిన దిగుమతి సుంకాలు, వివాదాస్పద ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు అగ్రరాజ్యాన్ని తీవ్ర ఆర్థిక, రాజకీయ ఒత్తిడిలోకి నెడుతున్నాయి.కెనడాతో రాజుకున్న వాణిజ్య సమరంఅమెరికా తన అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఒకటైన కెనడా ఉత్పత్తులపై 50 శాతం సుంకాలను విధించడంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఆగస్టు 21 గడువు నాటికి జరిగిన చర్చల్లో అమెరికా ఆమోదయోగ్యం కాని నిబంధనలను చేర్చడంతో చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. దీనికి ప్రతిగా సెప్టెంబర్ 8 నుంచి తాము కూడా సమాన స్థాయిలో ప్రతీకార సుంకాలు విధిస్తామని కెనడా స్పష్టం చేసింది. దాంతో ఇరు దేశాల మధ్య సంపూర్ణ వాణిజ్య యుద్ధం మొదలయ్యింది.‘లేక్ అమెరికా’ పేరు మార్పు వివాదంకెనడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన ట్రంప్ ఈ వివాదాన్ని మరింత పెంచుతూ సరిహద్దు సరస్సు ‘లేక్ అంటారియో’ పేరును ‘లేక్ అమెరికా’గా మారుస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఈ సరస్సులో దాదాపు 75 శాతం కెనడాలోని అంటారియో ప్రావిన్స్ పరిధిలో ఉండటంతో అక్కడి ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అటు అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ కాథీ హోచుల్ సైతం తాము ఈ పేరు మార్పును పరిగణనలోకి తీసుకోబోమని తేల్చిచెప్పారు.లొంగే ప్రసక్తే లేదన్న కెనడా ప్రధానివాషింగ్టన్ చర్చల వైఫల్యం అనంతరం కెనడా ప్రధాని మార్క్ కార్నీ దేశ ప్రజలనుద్దేశించి తీవ్రస్థాయిలో ప్రసంగించారు. అమెరికా తమను లొంగదీసుకోవాలని చూస్తోందని, కానీ తాము ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 34 కోట్ల జనాభా, భారీ ఆర్థిక వ్యవస్థ కలిగిన అగ్రరాజ్యం ముందు 4 కోట్ల జనాభా ఉన్న కెనడా వెనక్కి తగ్గకుండా ధీటుగా నిలబడటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.ఇరాన్ ప్రతిఘటన – హార్ముజ్ జలసంధి మూసివేతమరోవైపు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడులకు ప్రతిగా ఇరాన్ వ్యూహాత్మక అస్త్రాన్ని ప్రయోగించింది. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం, ఎల్ఎన్జీలో 19 శాతానికి మార్గమైన హార్ముజ్ జలసంధిని నిలిపివేసింది. ఫలితంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో తీవ్ర కొరత ఏర్పడి, ప్రపంచవ్యాప్తంగా ఎరువుల సరఫరా, ఆహార భద్రతపై ప్రతికూల ప్రభావం పడింది. అమెరికాలో కూడా పెట్రోల్ ధరలు, జీవన వ్యయం భారీగా పెరిగాయి.ట్రంప్ ప్రకటనలు.. యుద్ధంలో ప్రతిష్టంభనయుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ కాల్పుల విరమణ కోసం అర్థిస్తోందని, ఒప్పందం చివరి దశకు వచ్చిందని ట్రంప్ 38 సార్లు ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిష్కారం లభించలేదు. యుద్ధం 60 రోజులు దాటినా ఇరాన్ నుంచి ఉన్న తక్షణ ముప్పు ఏమిటనే అంశంపై స్పష్టత రాలేదు. గతంలో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా మధ్యప్రాచ్యంలో ముగింపు లేని యుద్ధంలో అమెరికా చిక్కుకుపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రాజకీయ సంక్షోభం.. పడిపోయిన ప్రజాదరణఈ వరుస వివాదాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ 33 శాతానికి పడిపోయింది. నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ముందు కెనడాతో వాణిజ్య యుద్ధం మరింత ముదరడం, ఇరాన్ సంక్షోభం సమసిపోకపోవడం రిపబ్లికన్ పార్టీకి గట్టి సవాలుగా మారింది. ఫలితంగా ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు మెజారిటీని కోల్పోయే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: ముగుస్తున్న ‘ఫరక్కా’ గడువు.. ముంచుకొస్తున్న జలయుద్ధం! -
యుద్ధం ఇంకా ఉంది!
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించి ఆరు నెలలవుతోంది. ఇప్పటికే వందలాది మంది మరణించారు. దాడులకు ముగింపు ఎప్పుడో ఎవరూ చెప్పలేకపోతున్నారు. యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగిస్తామని, పశ్చిమాసియాలో శాంతియుత వాతావరణం నెలకొల్పుతామని మొదట్లో పదేపదే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేడు మాట మార్చేశారు. ఇరాన్పై దాడులను ఆపే విషయంలో తొందరపడడం లేదని అంటున్నారు. వైమానిక దాడులు, దిగ్బంధనం ద్వారా ఇరాన్ నాయకత్వాన్ని, సైన్యాన్ని, ఆర్థిక వ్యవస్థను చాలావరకు నాశనం చేశానని ట్రంప్ తాజాగా వెల్లడించారు. ఇరాన్ను తమ దారికి తెచ్చేందుకు సైనిక చర్యకు బదులుగా, ఆర్థికంగా ఒత్తిడిని పెంచడంపైనే దృష్టి సారిస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. ఇరాన్తో వ్యాపారం కొనసాగించే ఏ దేశమైనా లేదా సంస్థ అయినా కఠిన ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆంక్షలను ప్రధాన ఆయుధంగా ఉపయోగించాలని అమెరికా నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇరాన్ నాయకత్వం ఇప్ప టికే చాలావరకు బల హీన పడిందని డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. వారు (ఇరాన్) సైని కులకు జీతాలు చెల్లించడం లేదని, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. ఇరాన్ సామర్థ్యం చాలా తక్కువగా ఉందన్నారు. ఇరాన్తో ఇప్పటికిప్పుడు చర్చలు ప్రారంభించాలన్న ఉద్దేశం కూడా లేదని స్పష్టంచేశారు. అందుకు సమయం ఉందని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇరాన్పై యుద్ధం వల్ల అమెరికాకు 37.5 బిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా. పశ్చిమాసియా సంక్షోభానికి దౌత్యపరమైన పరిష్కారం కనిపెట్టేందుకు ఖతార్, పాకిస్తాన్లు తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. త్వరగా చర్చలు ప్రారంభించాలని అమెరికా, ఇరాన్లను కోరుతున్నాయి. మొత్తం సమస్యకు హార్మూజ్ జలసంధి కేంద్ర బిందువుగా మారింది. జలసంధిపై పట్టుకోసం అమెరికా, ఇరాన్లు ఆరాటపడుతున్నాయి. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు ప్రారంభించడం లక్ష్యంగా జూన్లో కుదిరిన ప్రాథమిక ఒప్పందంపై ట్రంప్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. -
ట్రంప్కు ఎదురుగాలి!
రెండో దఫా అధికార పీఠం అధిరోహించి కూడా రెండేళ్లు కావస్తున్నా అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్కు దౌత్యనీతి ఒంటబట్టలేదు. తాను నిర్దేశించినదాన్ని అంగీకరించటమే తప్ప మరోవిధంగా మాట్లాడే హక్కు, అధికారం ఏ దేశానికీ లేదని ఆయన ఇప్పటికీ నమ్ముతున్నారు. ఆయన దృష్టిలో కేవలం అదే దౌత్యం. భారత్ నుంచి కెనడా వరకూ... ఇరాన్ నుంచి వెనిజులా వరకూ ఆయనది ఇదే బాణీ. ట్రంప్ను నేరుగా ప్రతిఘటించే వారుండొచ్చు, పరోక్షంగా చెప్పిచూద్దామనుకునే వారుండొచ్చు... మార్గాలు వేరైనా ట్రంప్ షరతులకు తలొగ్గబోమని చెప్పడమే వీరందరి సారాంశం. చాన్నాళ్లుగా విసుగెత్తి ఉన్నారేమో... కెనడా ప్రధాని మార్క్ కెర్నీ చాలా కరకుగానే వ్యవహరించారు. ఒకదాని వెంబడి మరో గొంతెమ్మ కోర్కెతో చీకాకుపరుస్తున్న అమెరికా తీరును నిరసిస్తూ వాణిజ్య ఒప్పందంపై చర్చలు సాగిస్తున్న తమ ప్రతినిధి బృందాన్ని వెనక్కురావాలని ఆదేశించారు. ఒప్పందం దాదాపు ఖరారై సంతకాలు జరపడమే తరువాయి అనుకునే దశలో ఎదురైన ఈ ఊహించని పరిణామం అమెరికాను అయోమయంలోకి నెట్టింది. ఇలాంటి భంగపాట్లే ఇరాన్ దగ్గర ఎదురయ్యాయి. మన దేశంతో చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని అమెరికా అనేకమార్లు ప్రకటించింది. కానీ అదేమీ జరగలేదు. వెనిజులా అధ్యక్షుడు మదురోను ట్రంప్ తన సైన్య బలంతో ఈ ఏడాది మొదట్లో అపహరించి, అమెరికాలో ఆయనపై విచారణ తంతు సాగిస్తున్నారు. ఇకపై అది తమ భూభాగమని అమెరికా చెప్పడం ఆ దేశ ప్రజల్ని మాత్రమే కాదు... అత్యధిక దేశాలను ఆగ్రహోదగ్రుల్ని చేస్తోంది. ఇక ఇరాన్ సంగతి చెప్పనవసరం లేదు. యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపేశామని చెప్పటం నుంచి హార్మూజ్ తమదేనని ప్రకటించటం వరకూ ట్రంప్ ఎన్ని చేసినా ఇరాన్ నిబ్బరంగా ‘నీ లెక్కేమిట’న్నట్టే వ్యవహరిస్తోంది. మిత్ర దేశమైన దక్షిణ కొరియాదీ అదే వైఖరి. ఏటా 11 రోజులపాటు అమెరికా, దక్షిణ కొరియాలు ఉమ్మడి సైనిక విన్యాసాలు జరుపుతాయి. ఈసారి అయిదో రోజుకల్లా అమెరికా సైనికులు తట్టా బుట్టా సర్దుకుని తిరుగుముఖం పట్టారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్జోంగ్ ఉన్తో చెలిమి కోసం ట్రంప్ తహతహలాడటంపై ఆగ్రహించి దక్షిణ కొరియా ఈ నిర్ణయం తీసుకుందంటున్నారు. ఈ విన్యాసాల ఉద్దేశం ఉత్తర కొరియాను భయపెట్టడం. తీరా ఆ దేశంతోనే అమెరికా చేతులు కలుపుతుంటే... ఈ విన్యాసాలకు అర్థమేమిటన్నది దక్షిణ కొరియా ప్రశ్న. వాస్తవానికి ఉత్తర కొరియా పూర్తి స్థాయి అణ్వస్త్ర దేశంగా మారింది. ఆ దేశం దగ్గర ‘చాలా శక్తిమంతమైన’ ఆయుధా లున్నాయని ట్రంపే కొద్దికాలం క్రితం ప్రకటించారు. దాన్ని మరిచి కొత్త చుట్టరికాలు కలుపుకుందామని ట్రంప్ ప్రయత్నించినంత మాత్రాన ఆ దేశం నమ్మే అవకాశమేమీ లేదు. ఇరాన్తోసహా అన్ని దేశాలతోనూ దౌత్యపరంగా వరస వైఫల్యాలు తప్పడం లేదు గనుక ఉత్తర కొరియాకు దగ్గరై అమెరికా జనాన్ని ఆశ్చర్యపరచాలని ట్రంప్ భావిస్తున్నట్టు కనబడుతోంది. కానీ వేరే దేశాలతో పెంచుకున్న వైరం వికటిస్తున్న విధంగానే ఉత్తర కొరియాతో చెలిమి సైతం బెడిసికొట్టే అవకాశం లేకపోలేదు. చివరకు ఉత్తర కొరియాఏం చేస్తుందన్నది అలావుంచితే... ఆసియా–పసిఫిక్ దేశాలన్నిటా ట్రంప్ అంతరంగంపై ఇప్పటికే ఉన్న సందేహాల్ని మరింతగా పెంచింది. ఈ దేశాలన్నీ చైనా దూకుడువల్ల చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి సమయంలో తమకు అండగా నిలిచి, చైనాకు కళ్లెం వేయాల్సిన అమెరికా ఆడుతున్న వింతనాటకాలు వాటికి మింగుడుపడటం లేదు.అందుకే దక్షిణ కొరియా, జపాన్ ఇటీవల సాన్నిహిత్యమవుతున్నాయి. ఆ రెండింటిమధ్యా ఇబ్బందికర చరిత్రవున్నా ట్రంప్ వింత చేష్టలు వారిని సన్నిహితం చేశాయి. కెనడా ఉత్పత్తులపై 50 శాతం అదనపు సుంకాలు వేయాల్సివస్తుందని ట్రంప్ ప్రకటించగా, దానికి ప్రతిగా వచ్చే నెల 8 నుంచి అమెరికా ఉత్పత్తులపై 15 నుంచి 50 శాతం వరకూ సుంకాలు విధిస్తామని కెర్నీ ప్రకటించారు. అమెరికా అదనపు సుంకాల విలువ 2,000 కోట్ల డాలర్లయితే, కెనడా సుంకాలు 2,760 కోట్ల డాలర్లు. ఈ ప్రపంచం తనకు భయపడటం మాట అటుంచి... జాలి కూడా చూపబోదని ట్రంప్కు ఎంత త్వరగా తెలిస్తే అమెరికా ప్రజలకు అంత మేలు. -
ఇరాన్ కళ్లుగప్పి.. హర్ముజ్లో అమెరికా సీక్రెట్ ఆపరేషన్!
ఇరాన్తో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా కీలక ప్రకటన చేసింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఏర్పాటు చేసిన మందుపాతరలను(సీ మైన్స్) పూర్తిగా తొలగించినట్లు తెలిపింది. అమెరికా దళాలు అత్యంత రహస్య ఆపరేషన్ నిర్వహించి.. శ్రమించి వాటిని తొలగించాయని అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వెల్లడించారు. ఈ చర్యను అమెరికా సైనిక కార్యకలాపాల్లో ‘మేజర్ మైలురాయి’గా అభివర్ణించారు.హర్ముజ్పై పట్టు సాధించే క్రమంలో ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కొన్ని నెలల క్రితం అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాల్లో సీ మైన్స్ను ఏర్పాటు చేసింది. వీటి కారణంగా అమెరికా బలగాల కదలికలు నిలిచిపోవడంతో పాటు వాణిజ్య నౌకల రాకపోకలకు తీవ్ర ముప్పు ఏర్పడింది. వాటిని తొలగించడమూ అంత సులువు కాదని.. చాలా సమయం పట్టొచ్చని అప్పట్లో చర్చలు నడిచాయి. ఈ క్రమంలో హర్ముజ్ బ్లాకేడ్(నిర్బంధం) కొనసాగిస్తున్న అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వీటి తొలగింపునకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. అయితే ఇరాన్ ఏర్పాటు చేసిన సముద్రపు మైన్స్ను తొలగించేందుకు అమెరికా బలగాలు అత్యంత రహస్యంగా ఆపరేషన్ చేపట్టాయి. ముందుగా మైన్స్ ఉన్న ప్రాంతాలను గుర్తించి.. అమెరికా నేవీకి చెందిన ప్రత్యేక డైవింగ్ బృందాలను రంగంలోకి దించారు. సముద్రంలోకి వెళ్లిన ఈ బృందాలు మైన్స్ను గుర్తించి, వాటిని సురక్షితంగా తొలగించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వెల్లడించారు. అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాల్లో ఏర్పాటు చేసిన మైన్స్ను పూర్తిగా తొలగించడం అమెరికా సైనిక కార్యకలాపాల్లో ‘మేజర్ మైలురాయి’ అని ఆయన పేర్కొన్నారు.హర్ముజ్లో మైన్స్ తొలగింపుతో పాటు గత కొన్ని నెలల్లో సుమారు 1,500 వాణిజ్య నౌకలు ఈ జలసంధిని దాటేందుకు అమెరికా దళాలు సహకరించినట్లు కూపర్ తెలిపారు. ఈ నౌకల ద్వారా ప్రపంచ మార్కెట్లకు దాదాపు 750 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు రవాణా అయినట్లు వెల్లడించారు. హర్ముజ్లో సురక్షిత రవాణా మార్గాలను పునరుద్ధరించడం అంతర్జాతీయ వాణిజ్యానికి కీలక పరిణామమని ఈ సందర్భంగా అమెరికా ప్రకటించుకుంది.ఇదిలా ఉంటే.. మైన్స్ తొలగించినంత మాత్రాన హర్ముజ్లో ముప్పు పూర్తిగా తొలగిపోయినట్లు కాదని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ నుంచి డ్రోన్లు, క్షిపణుల ముప్పు ఇంకా తొలగిపోలేదు. దీంతో నౌకల రాకపోకలు పూర్తిగా సాధారణ స్థితికి చేరడానికి సమయం పట్టే అవకాశం ఉంది.ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిమరోవైపు ఇరాన్పై అమెరికా ఆర్థిక, సైనిక ఒత్తిడిని మరింత పెంచుతోంది. ఇరాన్ నౌకాశ్రయాల్లోకి ప్రవేశించేందుకు.. అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన 75 నౌకలను వెనక్కి పంపినట్లు అమెరికా తెలిపింది. మరో మూడు నౌకలపై సైనిక చర్యలు(స్వల్ప దాడులు!) తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే మానవతా అవసరాల కోసం ప్రయాణించే నౌకలకు మాత్రం మినహాయింపులు ఇచ్చినట్లు పేర్కొంది.ఇదే సమయంలో హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచి, నౌకల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకురావడంపై దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఖతార్, ఒమన్ వంటి దేశాలు ఇరాన్తో చర్చలు జరుపుతున్నాయి. అమెరికా దిగ్బంధాన్ని ఎత్తివేయడం, ఆంక్షలను సడలించడం వంటి అంశాలపై ఇరాన్ పట్టుబడుతున్నట్లు సమాచారం.చమురు మార్కెట్లపై ప్రభావం?ప్రపంచ ఇంధన సరఫరాలో హర్ముజ్ జలసంధిది అత్యంత కీలకమైన స్థానం. ఈ మార్గంలో నౌకల రాకపోకలు పూర్తిస్థాయిలో పునరుద్ధరించగలిగితే చమురు, గ్యాస్ సరఫరాపై ఉన్న ఒత్తిడి తగ్గి అంతర్జాతీయ ధరలు కొంత స్థిరపడే అవకాశం ఉంది. అయితే అమెరికా–ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో హర్ముజ్ పూర్తిగా సురక్షితంగా మారిందని చెప్పడానికి ఇంకా పరిస్థితులను నిశితంగా గమనించాల్సి ఉంది.ఇదీ చదవండి: కెనడాకు బీపీ తెప్పించిన ట్రంప్.. ఏం చేశారంటే? -
పేట్రియాట్ల కొరత తీవ్రం
వాషింగ్టన్: అమెరికా సైన్యం పశ్చిమాసియాలో ఇరాన్తో యుద్ధంలో మునిగిపోయింది. తరచుగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగిస్తోంది. ఇరాన్ సైన్యం ప్రయోగించే ఆయుధాల నుంచి రక్షించుకోవడానికి అధునాతన క్షిపణి నిరోధకాలను (పేట్రియాట్లు) మోహరించింది. పశ్చిమాసియాలోని తమ మిత్రదేశాలకు వీటిని అందజేస్తోంది. మరోవైపు యూరప్లో అధునాతన క్షిపణి నిరోధకాల కొరత అత్యంత తీవ్రస్థాయిలో ఉందని అమెరికా రక్షణ అధికారి, నాటో అధికారి తెలియజేశారు. ఒకవేళ రష్యా సైన్యం యూరప్పై దాడి చేస్తే తాము రక్షించలేమని పరోక్షంగా తేల్చిచెప్పారు. రష్యా క్షిపణులను అడ్డుకొనే ఇంటర్సెప్టర్లు లేవని పేర్కొన్నారు. రష్యాకు చెందిన అత్యంత వేగవంతమైన బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేయగల పేట్రియాట్ క్షిపణి నిరోధకాల కొరత వేధిస్తుండడం అత్యంత ఆందోళనకరమని అమెరికా రక్షణ అధికారి తెలిపారు. ఐరోపా ఖండంలో అమెరికన్, నాటో దళాల వద్ద పేట్రియాట్ల నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయని ధ్రువీకరించారు. సైనిక ప్రధాన కార్యాలయం లేదా విద్యుత్ కేంద్రంపై రష్యా బాలిస్టిక్ క్షిపణులతో దాడికి దిగిన పక్షంలో, పేట్రియాట్ క్షిపణుల కొరతతో బాధపడుతున్న ఉక్రెయిన్ మాదిరిగానే నాటో కూడా అదే పరిస్థితిని ఎదుర్కొని, తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఇరాన్పై యుద్ధం ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ వల్ల అమెరికా సైన్యం ఇతర ప్రాంతాల్లో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు స్పష్టమవుతోంది. అమెరికా–ఇరాన్ యుద్ధానికి దాదాపు ఆరు నెలలు పూర్తయ్యాయి. యూరప్లోని అమెరికా క్షిపణి నిల్వలను ఇప్పటికే పశ్చిమాసియాకు తరలించారు. అక్కడ ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను అడ్డుకోవడానికి అమెరికా, గల్ఫ్ మిత్రదేశాలు పేట్రియాట్లతో సహా గణనీయమైన సంఖ్యలో ఇంటర్సెప్టర్లను ప్రయోగించాయి. మరోవైపు సాధ్యమైనంత త్వరగా మిస్సైల్ ఇంటర్సెప్టర్లు అందజేయాలని తమ ప్రభుత్వాన్ని యూరప్లోని అమెరికా సైన్యం కోరుతోంది. -
ట్రంప్ నెక్ట్స్ టార్గెట్ చైనా బ్యాంకులేనా?
ఇరాన్తో సంబంధాలున్నాయనే కారణంతో.. చైనా బ్యాంకులను లక్ష్యంగా చేసుకుని తమ ప్రభుత్వం ఆంక్షలకు సిద్ధమవుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. టెహ్రాన్ను ఏకాకిని చేసేందుకు, వాషింగ్టన్ చేస్తున్న ప్రయత్నాలలో ఇది ఒక పెద్ద ముందడుగు అనే చెప్పాలి.ఇరాన్ ప్రభుత్వాన్ని ఆర్థికంగా బలహీనపరిచేందుకు అమెరికా ఇప్పటికే ఆంక్షలను మరింత కఠినతరం చేస్తోంది. ఈ వారం అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ కూడా ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిని పెంచుతామని ప్రకటించారు. ముఖ్యంగా.. ఇరాన్తో వ్యాపారం కొనసాగించే ఇతర దేశాలు, సంస్థలపై కూడా సెకండరీ ఆంక్షలు విధించే అవకాశాన్ని అమెరికా పెంచుతోంది. దీంతో ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాలకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.చైనా ఎందుకు టార్గెట్?ఇరాన్కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ముఖ్యంగా ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల్లో చైనా కీలకంగా ఉంది. ఇరు దేశాల మధ్య చమురు, ఇతర వస్తువుల వ్యాపారానికి సంబంధించిన చెల్లింపుల్లో చైనా బ్యాంకులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే అమెరికా నిజంగానే చైనా బ్యాంకులపై ఆంక్షలు విధిస్తే.. అది కేవలం ఇరాన్పైనే కాకుండా అమెరికా-చైనా సంబంధాలు, ప్రపంచ చమురు మార్కెట్, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇప్పటివరకు అమెరికా.. పెద్ద చైనా బ్యాంకులపై ఇరాన్కు సంబంధించి ఆంక్షలు విధించలేదు. అయితే ఇరాన్ ప్రభుత్వానికి, దాని సైన్యానికి సహాయం చేస్తున్నాయని ఆరోపిస్తూ చైనా, హాంకాంగ్లోని కొన్ని కంపెనీలపై ఇప్పటికే చర్యలు తీసుకుంది. మరోవైపు అమెరికా విధించే సెకండరీ ఆంక్షలను చైనా చట్టవిరుద్ధమైనవిగా వ్యతిరేకిస్తోంది. దీంతో చైనా బ్యాంకులపై అమెరికా తదుపరి చర్యలు తీసుకుంటే.. ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. -
మోజ్తాబా ఖమేనీపై ఇరాన్ కపట నాటకం.. బయటపెట్టిన ట్రంప్!
వాషింగ్టన్: అమెరికా-ఇజ్రాయెల్లు సంయుక్తగా జరిపిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ మరణించారనే ప్రచారం అప్పట్లో జోరందుకుంది. తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు గైర్హాజరు కావడంతో ఆ ప్రచారానికి ఊతం ఇచ్చినట్లైంది.ఈ క్రమంలో మోజ్తాబా తన అనుచరులతో మాట మంతి నిర్వహించడం, ఆయనే స్వయంగా మాట్లాడిన వీడియోలను ఇరాన్ విడుదల చేసింది. దీంతో మోజ్తాబా మరణంపై కొనసాగుతున్న ప్రచారానికి పులిస్టాప్ పడినట్లైంది. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఖమేనీ ఆచూకీపై అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు గ్లెన్ బెక్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. గత కొన్ని నెలలుగా ఖమేనీ కనిపించకపోవడంపై వస్తున్న వార్తలను ఆయన ప్రస్తావించారు. ‘ఖమేనీ చనిపోయాడని నేను అనుకోవడం లేదు. కానీ వైమానిక దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా ఆయన ఎడమ వైపు శరీరం, చేయి, కాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆయన పరిస్థితి విషమంగానే ఉంది.. కానీ ప్రాణాలతోనే ఉన్నారు’ అని ట్రంప్ స్పష్టం చేశారు.ఒకవేళ మొజ్తాబా ఖమేనీ పూర్తిగా అచేతన స్థితిలోకి వెళ్ళినా, మరణించినా.. ఇరాన్ ప్రభుత్వం ఆ నిజాన్ని దాచిపెడుతోందని ట్రంప్ ఆరోపించారు. ప్రపంచాన్ని, ఇరాన్ ప్రజలను నమ్మించడానికి ఇరాన్ రహస్య నాటకం ఆడుతోందన్నారు. గత కొన్ని నెలలుగా మొజ్తాబా ఖమేనీ బహిరంగంగా కనిపించకపోవడం వెనుక ఇస్రాయెల్ క్షిపణి దాడుల ప్రభావం ఉందనే అనుమానాలకు ట్రంప్ వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చాయి. ఇరాన్ తన దేశాధినేత పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని చూపిస్తున్నప్పటికీ.. అంతర్గతంగా ఆ దేశ నాయకత్వం ఎంతటి బలహీన స్థితిలో ఉందో ట్రంప్ మాటలు స్పష్టం చేస్తున్నాయి.అవన్నీ పాత వీడియోలేనాఇరాన్ అత్యున్నత నాయకుడికి సంబంధించిన పాత వీడియో దృశ్యాలను ఇరాన్కు చెందిన ‘ఫార్స్ న్యూస్’ విడుదల చేసిందని ‘అల్ అరబియా’ నివేదించింది. అల్ అరబియా కథనం ప్రకారం, ఆయన అత్యున్నత నాయకుడిగా బాధ్యతలు చేపట్టకముందే ఈ దృశ్యాలు చిత్రీకరించినట్లు ఆరోపించిందిఎవరి మాటలు నమ్మాలిప్రపంచానికి తమ సుప్రీం లీడర్ ఆరోగ్యంగా ఉన్నారనే సంకేతాలు ఇచ్చేందుకు ఇరాన్ మీడియా ఈ వీడియోలను విడుదల చేసింది. ఆగస్టు నెలలో ఇరాన్ మీడియా ఈ వీడియోను విడుదల చేయడానికి ముందు, ఇరాన్ అత్యున్నత నాయకుడి ఆరోగ్యం విషమంగా ఉందని, ఆయనను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. ఆ వార్తలు వచ్చిన కొద్ది రోజులకే ఇరాన్ అధికారిక వార్తా సంస్థ 'మెహర్ న్యూస్' ఒక వీడియోను విడుదల చేసింది. తేదీ లేని ఆ వీడియోలో సుప్రీం లీడర్ ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించారు.అంతకుముందు, ఖమేనీ అత్యంత విషమ పరిస్థితిలో ఉన్నారని ఇజ్రాయెల్ మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఇరాన్ అంతర్గత వర్గాలు, అలాగే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ యంత్రాంగానికి సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ ‘ది జెరూసలేం పోస్ట్’ ప్రచురించిన కథనాల ప్రకారం, ఇరాన్ నాయకత్వంలో ఆయన ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి.అవన్నీ ఊహాగానాలే ఆ తర్వాత కొద్దిసేపటికే, అత్యున్నత నాయకుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ పేర్కొన్నారు. ఆయన శారీరక పరిస్థితికి సంబంధించిన ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. ఏడు నుండి ఎనిమిది గంటల పాటు కూర్చుని చర్చించగలిగే వ్యక్తికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు అని అధ్యక్షుడు అన్నారు. ఆగస్టు ప్రారంభంలో తాను ఆయనతో మంచి సమావేశాన్ని నిర్వహించినట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడులలో తన తండ్రి, మాజీ సర్వోన్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత, మొజ్తాబా ఖమేనీ ఆ పదవిని చేపట్టారు. ఆ పదవిని చేపట్టినప్పటి నుండి, మొజ్తాబా ఖమేనీ ఎక్కడా బహిరంగంగా కనిపించకుండా కేవలం లిఖితపూర్వక ప్రకటనల ద్వారా మాత్రమే వ్యవహరిస్తున్నారు.👉ఇదీ చదవండి: ‘యుద్ధంతో జీవించలేం’.. ఇరాన్లో వినిపిస్తున్న కొత్త స్వరం -
భారత కంపెనీలకు షాకిచ్చిన ట్రంప్..
ఇరాన్పై అమెరికా ఆర్థిక ఒత్తిడి రోజురోజుకు పెరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ నుంచి పెట్రోలియం, పెట్రోకెమికల్ ఉత్పత్తుల దిగుమతుల్లో భాగస్వామ్యం ఉన్నాయన్న ఆరోపణలతో భారత్కు చెందిన నాలుగు కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. మొత్తం సుమారు 119 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.10 వేల కోట్లకు పైగా) విలువైన ఇరాన్ చమురు వ్యాపారానికి సంబంధించి ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా పేర్కొంది. ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్’లో భాగంగా ఈ ఆంక్షలు అమెరికా ప్రకటించింది.ఆంక్షలు విధించిన కంపెనీలు ఇవే.. PP Softtech Private Limited, Sadashiva Overseas Limited, Prakrutees Infra Impex India Private Limited, Portease Partners LLP కంపెనీలపై చర్యలు తీసుకున్నారు.ఇక, వీటిలో మొదటి మూడు సంస్థలు ఇరాన్ మూలం కలిగిన పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నాయని అమెరికా ఆరోపించింది. నాలుగో సంస్థ అయిన Portease Partners ఇరాన్ పెట్రోకెమికల్ ఉత్పత్తుల పలు షిప్మెంట్లను భారత్కు తీసుకురావడంలో కస్టమ్స్ బ్రోకర్గా సహకరించిందని పేర్కొంది. 2023 మే నుంచి 2026 ఫిబ్రవరి మధ్య ఈ లావాదేవీలు జరిగినట్లు పేర్కొంది. ఈ మూడు సంస్థలకు సంబంధించి అమెరికా పేర్కొన్న దిగుమతుల విలువే దాదాపు 119 మిలియన్ డాలర్లు. Portease Partners ద్వారా నిర్వహించబడిన షిప్మెంట్ల విలువను ఇందులో చేర్చలేదు.ముగ్గురు భారతీయులపైనా ఆంక్షలుఇదిలా ఉండగా.. కంపెనీలతో పాటు ముగ్గురు భారతీయులపై కూడా అమెరికా చర్యలు తీసుకుంది. PP Softtech డైరెక్టర్ ప్రశాంత్ గార్గ్తో పాటు Portease Partners భాగస్వాములు ఇంద్రిస్మియా అషరఫ్మియా షేఖ్, హరీశ్ రామచంద్ర రంగిలను కూడా ఆంక్షల జాబితాలో చేర్చింది. అయితే, అమెరికా ఆంక్షలు కేవలం నాలుగు భారత కంపెనీలకు మాత్రమే పరిమితం కాలేదు. ఇరాన్ ఆదాయ మార్గాలను ప్రపంచవ్యాప్తంగా దెబ్బతీయడమే లక్ష్యంగా ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్’ పేరుతో విస్తృత ఆంక్షల కార్యక్రమాన్ని వాషింగ్టన్ ప్రారంభించింది. దాదాపు 60 మంది వ్యక్తులు, సంస్థలు, నౌకలపై తాజాగా చర్యలు తీసుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. చైనా, హాంకాంగ్కు చెందిన పలు సంస్థలు, వ్యక్తులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.ఇది కూడా చదవండి: అమెరికాకు కెనడా స్ట్రాంగ్ కౌంటర్ఈ నేపథ్యంలో ఆంక్షల విధింపుపై అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. ఇరాన్ ప్రభుత్వ ఆర్థిక సంబంధాలపై ఒత్తిడిని మరింత పెంచుతామని స్పష్టం చేశారు. ఇరాన్తో ఆర్థిక సంబంధాలు కొనసాగించే సంస్థలు కూడా భవిష్యత్తులో అమెరికా ఆంక్షల ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు.. అమెరికా ఆంక్షలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. తాజా చర్యలు అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్యసమితి చార్టర్ను ఉల్లంఘించే ప్రయత్నమని ఇరాన్ విదేశాంగ శాఖ ఆరోపించింది. ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదనిజాదెహ్ స్పందిస్తూ.. తమ దేశం ఈ ఆంక్షలను ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉందని చెప్పారు. ఇందుకోసం రెండేళ్ల ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు.భారత్పై ప్రభావం?ఇరాన్ చమురు వ్యాపారానికి సంబంధించి భారత కంపెనీలపై అమెరికా వరుసగా చర్యలు తీసుకోవడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలోనూ ఇరాన్తో చమురు సంబంధాల ఆరోపణలపై భారత సంస్థలు, వ్యక్తులను అమెరికా ఆంక్షల పరిధిలోకి తీసుకొచ్చింది. తాజా చర్యలతో ఇరాన్తో వాణిజ్యం చేసే భారతీయ సంస్థలపై అమెరికా నిఘా మరింత కఠినమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. -
యుద్ధం ముగింపు, హార్మూజ్ తెరవడంలో ‘అద్భుత పురోగతి’!
ఇస్లామాబాద్: అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు ప్రారంభమయ్యేలా చేసేందుకు పాకిస్థాన్ నేతలు టెహ్రాన్లో చర్చలు జరిపారు. యుద్ధాన్ని ఆపేందుకు శాంతి దిశగా మార్గంపై జరిగిన చర్చల్లో పాకిస్థాన్, ఇరాన్ అద్భుతమైన రీతిలో పురోగతి సాధించాయని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మంగళవారం తెలిపారు. ఆయన టెహ్రాన్ పర్యటన ముగిసింది.మరింత ఉద్రిక్తత పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఘర్షణను వేగంగా ముగించే అంశాలపై ఇరు దేశాలు చర్చించాయని పాకిస్థాన్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్, ఇరాన్ నేతల మధ్య జరిగిన సమావేశం గురించి ఈ ప్రకటన వెలువడింది. ప్రాంతీయ శాంతి, వివాదానికి చర్చల ద్వారా పరిష్కారం కనుగొనే మార్గంపై కూడా ఇరు పక్షాలు అభిప్రాయాలను పంచుకున్నాయని ప్రకటనలో పేర్కొన్నారు.“ఇరాన్ అధ్యక్షుడు తమ ప్రభుత్వ దృక్కోణాన్ని స్పష్టంగా వివరించారు. చర్చించిన అంశాలపై మేము ఎంతో నిర్మాణాత్మకంగా అభిప్రాయాలను పంచుకున్నాం” అని మునీర్తో కలిసి టెహ్రాన్ వెళ్లిన అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఎక్స్లో పోస్టు చేశారు.దీనిపై వైట్ హౌస్, విదేశాంగ శాఖ స్పందించలేదు. టెహ్రాన్ పర్యటనకు ముందు మునీర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడారని రాయిటర్స్ సోమవారం తెలిపింది. ఇరాన్ను ఒంటరి చేయాలని ప్రయత్నిస్తున్న ట్రంప్, ఇరాన్కు “ఏ విధమైన సహాయ మార్గాన్నైనా” అందించే ఏ దేశమైనా ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని గత వారం హెచ్చరించారు. దీనికి ప్రతిగా ఇరాన్ గల్ఫ్ నుంచి చమురు ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని హామీ ఇచ్చింది. -
ట్రంప్ వార్నింగ్.. ఇరాన్కు కటీఫ్ చెప్పాల్సిందేనా?
ఇరాన్పై అమెరికా ఆంక్షల ఉచ్చు మరింత బిగుస్తోంది. ఇరాన్తో ఆర్థిక సంబంధాలు కొనసాగించే దేశాలు వెంటనే వాటిని తగ్గించుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఇరాన్ను ఆర్థికంగా ఒంటరిని చేసి.. చివరకు అమెరికాతో చర్చలు, ఒప్పందానికి దిగేలా ఒత్తిడి చేయడమే వాషింగ్టన్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఈ హెచ్చరికలకు ఇరాన్ ప్రధాన భాగస్వాములైన చైనా, రష్యా ఎంతవరకు తలొగ్గుతాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది. అదే సమయంలో ఈ పరిణామం భారత్కు మాత్రం కొత్త చిక్కును తెచ్చిపెట్టింది.ఒకవైపు అమెరికాతో వేగంగా బలపడుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం.. మరోవైపు ఇరాన్తో భారత్కు ఉన్న చారిత్రక, వాణిజ్య, వ్యూహాత్మక బంధం. ఈ రెండింటినీ సమతుల్యం చేయడం ఢిల్లీకి సవాల్గా మారింది. ముఖ్యంగా ఇరాన్తో ఆర్థిక సంబంధాలు కొనసాగించే దేశాలపై సెకండరీ ఆంక్షలు విధించే అవకాశం ఉందన్న హెచ్చరిక నేపథ్యంలో.. భారత్ ఎంతవరకు అమెరికా ఒత్తిడిని పరిగణనలోకి తీసుకుంటుందన్నదే ఆసక్తికరంగా మారింది. అయితే ఇది భారత్కు పూర్తిగా కొత్త పరిస్థితి కాదు.రష్యా విషయంలో వెనక్కి తగ్గని ఢిల్లీఉక్రెయిన్ సంక్షోభం తర్వాత రష్యాపై అమెరికా, పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ.. భారత్ మాస్కోతో సంబంధాలను పూర్తిగా తెంచుకోలేదు. ముఖ్యంగా దేశీయ ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకుని రష్యా నుంచి భారీగా క్రూడ్ కొనుగోళ్లను కొనసాగించింది. 2026 జూన్లో రష్యా చమురు భారత్ మొత్తం క్రూడ్ దిగుమతుల్లో సగానికి పైగా వాటా సాధించినట్లు రాయిటర్స్ డేటా పేర్కొంది. అంటే అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని భారత్ కొనసాగించింది. అయితే ఇరాన్ విషయంలో సమీకరణాలు కొంత భిన్నంగా ఉన్నాయి.ఇప్పటికే భారీగా తగ్గిన వాణిజ్యంభారత్–ఇరాన్ ద్వైపాక్షిక వాణిజ్యం గతంతో పోలిస్తే భారీగా క్షీణించింది. 2018–19లో దాదాపు 17 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యం.. 2025–26లో సుమారు 1.6 బిలియన్ డాలర్లకు పడిపోయింది. భారత్ ప్రధానంగా ఇరాన్కు బియ్యం, టీ, ఔషధాలు తదితర వస్తువులను ఎగుమతి చేస్తోంది. అమెరికా ఆంక్షలు మరింత కఠినతరం కావడం, యూఏఈ వంటి మార్గాల ద్వారా చెల్లింపులు, రీ-ఎగుమతులపై ఆంక్షల ప్రభావం పెరగడం భారత ఎగుమతిదారులకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా బాస్మతి, టీ, ఫార్మా రంగాలపై ప్రభావం పడొచ్చు. అయితే ఇరాన్తో వాణిజ్యం ఇప్పటికే పరిమిత స్థాయికి చేరినందున.. భారత్ మొత్తంగా ఎదుర్కొనే ఆర్థిక దెబ్బ కంటే, కొన్ని రంగాల్లోని ఎగుమతిదారులపై ప్రభావమే ఎక్కువగా ఉండొచ్చు.చమురు కంటే పెద్ద ముప్పు.. హర్ముజ్భారత్కు ఇరాన్ విషయంలో అసలు ఆందోళన కేవలం ఆ దేశం నుంచి ఎంత చమురు కొనుగోలు చేస్తున్నామన్నది కాదు.. హర్ముజ్ జలసంధి. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన ఈ మార్గంలో ఉద్రిక్తత పెరిగితే అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా ఎగిసే అవకాశం ఉంది. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్లో దీనివల్ల దిగుమతి బిల్లు పెరగడంతో పాటు రూపాయి, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరగొచ్చు.అయితే తాజా అమెరికా ఆంక్షల ప్రకటన తర్వాత వెంటనే చమురు ధరలు పెరగలేదు. ఆంక్షలు ఇరాన్పై ఒత్తిడిని పెంచి, చివరకు దౌత్యపరమైన పరిష్కారానికి దారితీయవచ్చన్న అంచనాలు కూడా మార్కెట్లలో కనిపించాయి. సోమవారం బ్రెంట్ క్రూడ్ ధర 2.35 శాతం తగ్గి 92.17 డాలర్ల వద్ద ముగిసింది.ఇదీ చదవండి: జింగ్పిన్ రాక.. భారత్తో బంధం బలపడేనా?చాబహార్ను వదులుకోవడం అంత సులభమా?ఇరాన్తో భారత్ సంబంధాల్లో చాబహార్ పోర్టు మరో కీలక అంశం. పాకిస్థాన్ను దాటకుండా అఫ్గానిస్థాన్, మధ్య ఆసియాకు చేరుకునే మార్గంగా ఇది భారత్కు వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగి ఉంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో చాబహార్లో భారత కార్యకలాపాలు కొనసాగించడం సవాల్గా మారుతున్నప్పటికీ.. ఇరాన్తో పూర్తిగా సంబంధాలు తెంచుకుంటే ఈ కీలక కనెక్టివిటీ మార్గంపై భారత్ తన ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఇరాన్ భారత్కు కేవలం వాణిజ్య భాగస్వామి మాత్రమే కాదు.. పశ్చిమాసియాలో వ్యూహాత్మక భాగస్వామి కూడా.మరి మోదీ సర్కార్ ఏం చేస్తుంది?ప్రస్తుతానికి భారత్పై అమెరికా నేరుగా ఆంక్షలు విధించలేదు. తాజా చర్యల్లో భారత్ను లక్ష్యంగా చేసుకున్న నిర్ణయం కూడా కనిపించలేదు. దీంతో ఢిల్లీకి ఇంకా కొంత దౌత్యపరమైన వెసులుబాటు ఉంది. అమెరికాతో సంబంధాలను దెబ్బతీయకుండా.. అదే సమయంలో ఇరాన్తో అవసరమైన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకోవడం భారత్ ముందున్న వాస్తవిక మార్గంగా కనిపిస్తోంది. రష్యా విషయంలో అనుసరించినట్టుగా జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూనే, ఆంక్షల పరిధిలోకి వెళ్లకుండా సంబంధాలను పరిమిత స్థాయిలో కొనసాగించే ప్రయత్నం చేయొచ్చు.కటీఫ్ కాదు.. కత్తిమీద సాము!కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో “ఇరాన్కు భారత్ కటీఫ్ చెబుతుంది” అనుకోవడం తొందరపాటు అంచనా. అదే సమయంలో అమెరికా హెచ్చరికలను పూర్తిగా విస్మరించి ఇరాన్తో యథావిధిగా ఆర్థిక సంబంధాలు కొనసాగించడం కూడా ఢిల్లీకి అంత సులభం కాదు. వాణిజ్యం ఇప్పటికే గణనీయంగా తగ్గిపోయింది. చమురు విషయంలో భారత్కు ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలున్నాయి. కానీ చాబహార్, మధ్య ఆసియా కనెక్టివిటీ, పశ్చిమాసియాలో వ్యూహాత్మక ప్రయోజనాలు, హర్ముజ్ భద్రత వంటి అంశాలను ఒక్కసారిగా పక్కన పెట్టడం సాధ్యం కాదు. అందుకే భారత్ ముందున్న మార్గం ‘ఇరాన్కు కటీఫ్’ కంటే.. ‘అమెరికా ఆంక్షలకు చిక్కకుండా ఇరాన్తో అవసరమైన సంబంధాలను కొనసాగించడం’ అయ్యే అవకాశమే ఎక్కువ.రష్యా విషయంలో అమెరికా ఒత్తిడిని తట్టుకుని జాతీయ ప్రయోజనాలను కాపాడుకున్న భారత్.. ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అదే వ్యూహాన్ని అనుసరిస్తుందా? లేక అమెరికాతో పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత ప్రాధాన్యం ఇస్తుందా? ఈ సమతుల్యమే మోదీ సర్కార్కు అసలు పరీక్ష.:::వెబ్డెస్క్ ప్రత్యేకం -
ఇరాన్ తో వ్యాపారం చేస్తే.. చైనా, రష్యాకు ట్రంప్ వార్నింగ్?
-
అమెరికా ఆంక్షలు.. ఇరాన్ ప్రతిఘటన.. గల్ఫ్ లో యుద్ధ భయం..!
-
మొజ్తాబా ఖమేనీ మరో సంచలన వీడియో విడుదల
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఉనికిపై సస్పెన్స్ నెలకొన్న సమయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మొజ్తబా ఖమేనీకి సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఈసారి ఆయన స్వరం కూడా వినిపించింది. తొలిసారి మొజ్తబా ఖమేనీ గొంతు వినిపించగా.. యుద్ధం తర్వాత మరోసారి తేదీ లేని వీడియో విడుదలైంది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా అలీ ఖమేనీ మతపరమైన విద్యా అధ్యయన సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న అరుదైన వీడియోను ఇరాన్ తొలిసారిగా విడుదల చేసింది. ఈ వీడియోలో మొజ్తబా.. ఓ విద్యార్థి తన థీసిస్ను వివరిస్తుండగా వింటూ.. ఆ పరిశోధనపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మొజ్తబా ఆరోగ్యంపై అనే సందేహాలు వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది.ఇదీ చదవండి: ట్రంప్ ఉక్కుపాదం.. ఇరాన్పై ‘ఎకనామిక్ డీ-డే’!ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ సమన్వయ దాడుల్లో ఆయన తండ్రి ఖమేనీ మృతి చెందగా.. ఆ దాడుల్లో మొజ్తబా తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వచ్చాయి. ఇరాన్కు చెందిన ఫార్స్ వార్తా సంస్థ తాజా వీడియోను విడుదల చేసింది. ఇందులో మొజ్తబా గొంతు కూడా తొలిసారిగా వినిపించింది. ఇరాన్ పాలనా వ్యవస్థలోని ‘ఇస్లామిక్ సెక్యూరిటీ మోడల్’ గురించి ఆయన విద్యార్థులకు వివరిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించారన్న విషయం మాత్రం స్పష్టంగా తెలియలేదు. First Look Iran’s Supreme Leader Mojtaba Khamenei appears in newly released footage for the first time.A rare public glimpse into Iran’s new leadership. pic.twitter.com/qaMDZ25BLI— Dr Tariq Tramboo (@tariqtramboo) August 24, 2026 -
మేం సిద్ధం.. మా దాడి మొదలవుతుంది: ఇరాన్
ఇరాన్పై అమెరికా ఆంక్షలను మరింత విస్తరించడంతో మరోసారి ఉద్రిక్తతలు రాజుకుంటున్నాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఆదాయ మార్గాలను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా కొత్త ఆంక్షలను ప్రకటించింది. అయితే ఈ చర్యలకు తాము భయపడబోమని ఇరాన్ తేల్చిచెప్పింది. ఆంక్షలను ఎదుర్కొనేందుకు ‘పూర్తిగా సిద్ధంగా ఉన్నామని’ ప్రకటించడంతోపాటు.. అవసరమైతే అమెరికా ప్రయోజనాలు, కీలక ఇంధన మార్గాలపై ఎదురుదాడికి దిగుతామని హెచ్చరించింది.అమెరికా కొత్త ఆంక్షలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘర్ ఘలీబాఫ్ తీవ్రంగా స్పందించారు. అమెరికా చేస్తున్న ఆంక్షల బెదిరింపులనుOperation Economic Outcast ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. ఇరాన్ ప్రధాన వాణిజ్య భాగస్వాములు కూడా అమెరికా ఒత్తిడికి తలొగ్గబోరని ధీమా వ్యక్తం చేశారు. అలాగే.. అమెరికా మరిన్ని దేశాలతో ఆర్థిక సంబంధాలను తెంచుకునే స్థితిలో లేదని ఘలీబాఫ్ వ్యాఖ్యానించారు. ఇరాన్తో వాణిజ్యం చేస్తున్న దేశాలు అమెరికా హెచ్చరికలను పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదని తమకు సమాచారం అందుతోందన్నారు. దీంతో ఆంక్షల విషయంలో అమెరికా ఒత్తిడికి దీటుగా దౌత్య, ఆర్థిక మార్గాల్లో ప్రతిఘటనకు ఇరాన్ సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.‘పూర్తిగా సిద్ధంగా ఉన్నాం’ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానిజాదే అమెరికాకు మరింత ఘాటైన హెచ్చరిక జారీ చేశారు. కొత్త ఆంక్షలను ఎదుర్కొనేందుకు ఇరాన్ ‘పూర్తిగా సిద్ధంగా ఉంది’ అని ప్రకటించారు. అమెరికా తమపై ఆర్థిక దాడికి దిగితే.. తమ వద్ద కూడా ప్రతిస్పందించేందుకు అవసరమైన సాధనాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ‘‘ఇక మేం కేవలం రక్షణాత్మక చర్యల కోసమే పరిమితం కాబోం. శత్రువులు మా నుంచి దాడిని ఎదురుచూడాల్సి ఉంటుంది’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. చైనా, రష్యాలు అమెరికా తాజా చర్యలను అంగీకరించలేదని, ఇతర దేశాలు కూడా వాషింగ్టన్ ఒత్తిడికి తలొగ్గకపోవచ్చని మదానిజాదే పేర్కొన్నారు.అమెరికా ప్రయోజనాలే టార్గెట్?ఆర్థిక ఆంక్షల విషయంలో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ హొస్సేన్ మొహెబ్బీ కూడా అమెరికాను హెచ్చరించారు. ఇరాన్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటే.. అమెరికా కీలక ప్రయోజనాలు, ఇంధన రవాణా మార్గాలపై భారీ దెబ్బలు తప్పవని హెచ్చరించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. అంతేకాదు.. గల్ఫ్ ప్రాంతం నుంచి చమురు ఎగుమతులను మరింత తగ్గించే అవకాశం ఉందని కూడా ఇరాన్ సంకేతాలు ఇచ్చింది. అదే జరిగితే ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఉద్రిక్తతలకు కేంద్రంగా మారిన హర్ముజ్ జలసంధిలో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉంది.60 మందిపై అమెరికా ఆంక్షలుఇరాన్కు వచ్చే ప్రతి కీలక ఆదాయ మార్గాన్ని అడ్డుకునే లక్ష్యంతో అమెరికా తాజా చర్యలకు దిగింది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ 60 మంది వ్యక్తులు, సంస్థలు, నౌకలపై కొత్త ఆంక్షలు విధించినట్లు ప్రకటించారు. ఇరాన్తో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలు, సంస్థలపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని బెసెంట్ హెచ్చరించారు. ముఖ్యంగా ఇరాన్ చమురు ఆదాయాన్ని నగదుగా మార్చేందుకు సహకరించే సంస్థలు అమెరికా ఆంక్షల పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు.అయితే ఇరాన్ చమురు వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తున్న చైనా ఆర్థిక సంస్థలను తాజా ఆంక్షల జాబితాలో చేర్చకపోవడం గమనార్హం. ఇరాన్తో వాణిజ్య సంబంధాలను కొనసాగించే దేశాలు అమెరికా డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి వెలేస్తామని బెసెంట్ ఇప్పటికే హెచ్చరించారు.ఆరు నెలలుగా యుద్ధం.. తగ్గని వేడిఅమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు ప్రారంభించి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా.. సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. ఇటీవలి వారాల్లో పెద్దస్థాయి దాడులు కొంత తగ్గినా.. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన పరిష్కారం మాత్రం ఇంకా దూరంగానే ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ సాంప్రదాయిక సైనిక సామర్థ్యం దెబ్బతిన్నప్పటికీ.. క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసే సామర్థ్యం మాత్రం ఆ దేశానికి మిగిలి ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, చమురు నౌకలు, కీలక ఇంధన మార్గాలపై ముప్పు కొనసాగుతోంది.ఆర్థిక దెబ్బకు.. సైనిక కౌంటర్?ఇరాన్ను ఆర్థికంగా ఒంటరి చేసేందుకు అమెరికా ఆంక్షలను మరింత కఠినతరం చేస్తుండగా.. వాటికి తలొగ్గకుండా ఎదురుదాడికి సిద్ధమని ఇరాన్ స్పష్టం చేయడం ఇప్పుడు కీలక పరిణామంగా మారింది. ఒకవైపు **చమురు, డాలర్ లావాదేవీలు, నౌకాయానంపై అమెరికా ఒత్తిడి పెంచుతుండగా.. మరోవైపు హర్ముజ్ జలసంధి, ఇంధన సరఫరా మార్గాలను ఇరాన్ ప్రతీకార చర్యలకు ఉపయోగించే అవకాశం ఆందోళన కలిగిస్తోంది.డొనాల్డ్ ట్రంప్ గనుక ఆర్థిక యుద్ధాన్ని మరింత తీవ్రం చేస్తే.. ఇరాన్ ఎలాంటి కౌంటర్ ఇస్తుందన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఆర్థిక ఆంక్షలతో ఇరాన్ను లొంగదీసుకోవాలని అమెరికా చూస్తుంటే.. ‘‘ఆంక్షలు మమ్మల్ని ఆపలేవు.. అవసరమైతే ఎదురుదాడికి దిగుతాం’’ అనే సంకేతాలను టెహ్రాన్ స్పష్టంగా ఇస్తోంది. దీంతో ఇరాన్-అమెరికా ఘర్షణ మరోసారి ఆర్థిక రంగం నుంచి సైనిక చర్యల దిశగా మళ్లుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: డొనాల్డ్ ట్రంప్కు భారీ ఊరట -
ట్రంప్, నెతన్యాహు వారసులపై ఇరాన్ కన్ను!
ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మొన్నటిదాకా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హతమార్చేందుకు ఇరాన్ ప్రణాళికలు వేస్తోందన్న చర్చ జరిగింది తెలిసిందే. ఇప్పుడు శత్రుదేశాల వారసులపైనా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన కుమారుల్లో ఒకరిని ఇరాన్ హత్య చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించడం తీవ్ర చర్చనీయాంశమైంది.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకి ఇద్దరు కొడుకులు. అయితే వాళ్ల భద్రత కోసం ఆయన భారీగా ఖర్చు పెడుతున్నారంటూ ఈ మధ్యకాలంలో రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఆయన స్పందిస్తూ.. ఇరాన్ తన కుమారుల్లో ఒకరిని లక్ష్యంగా చేసుకుని హత్యకు ప్రయత్నించిందని చెప్పారు. కుటుంబానికి భద్రత కల్పించడం విలాసం కాదని.. ప్రస్తుత పరిస్థితుల్లో అది అవసరమని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ప్రయత్నం ఎప్పుడు, ఎలా జరిగిందన్న వివరాలను నెతన్యాహు వెల్లడించలేదు. అలాగే కొడుకులు యాయిర్, అవ్నెర్లలో ఎవరిని టార్గెట్ చేశారన్నది కూడా చెప్పలేదు. బారన్పై బౌంటీ?మరోవైపు ఇరాన్ ప్రభుత్వ టీవీలో ప్రసారమైన ఓ వీడియో అమెరికాలో కలకలం రేపింది. ‘‘Where to Kill Barron Trump’’ పేరుతో ప్రసారమైన ఈ వీడియోలో డొనాల్డ్ ట్రంప్ 20 ఏళ్ల కుమారుడు బారన్ కదలికలను చూపిస్తూ, అతడి గురించి వివరాలు ప్రస్తావించినట్లు కథనాలు పేర్కొన్నాయి. అతడిని లక్ష్యంగా చేసుకునేందుకు 10 మిలియన్ డాలర్ల (రూ.95 కోట్లకు పైగా) బహుమతిని ప్రకటించినట్లు సమాచారం.బారన్ భద్రతా బలగాల కళ్లుగప్పి ఎలా కదులుతున్నాడన్న అంశాలను కూడా వీడియోలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఎక్స్బాక్స్, ఫిఫా గేమ్స్, డిస్కార్డ్ వంటి ప్లాట్ఫామ్లలో అతడి ఖాతాల వివరాలు తమకు లభించాయని వీడియోలో పేర్కొన్నట్లు సమాచారం.మెలానియాపైనా గతంలో బెదిరింపులుట్రంప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఇరాన్ మీడియాకు ఇదే తొలిసారి కాదు. గతంలో అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని కూడా ఇరాన్ ప్రభుత్వ టీవీ ఓ బెదిరింపు వీడియో ప్రసారం చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. అందులో ఆమె ప్రయాణాలు, బహిరంగ ప్రదేశాల్లో కదలికలకు సంబంధించిన వివరాలను ప్రస్తావించినట్లు సమాచారం.మరింత ముదిరిన ఉద్రిక్తతలుఇరాన్పై అమెరికా ‘ఎకనామిక్ డీ-డే’ పేరుతో కొత్త ఆంక్షలు ప్రకటించిన సమయంలోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని ట్రంప్ వ్యాఖ్యానించగా.. అమెరికా చర్యలను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్, నెతన్యాహు కుటుంబ సభ్యులపై వెలువడిన బెదిరింపులు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉన్నాయి.ఇదీ చదవండి: H-1B ఉద్యోగులకు కొత్త రూల్ -
ట్రంప్ ఉక్కుపాదం.. ఇరాన్పై ‘ఎకనామిక్ డీ-డే’!
వాషింగ్టన్: ఆంక్షలు, సైనిక చర్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై మరో పిడుగు పడింది. మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఆ దేశానికి వచ్చే ప్రతి ఆదాయ మార్గాన్ని దెబ్బతీయడమే లక్ష్యమని ప్రకటించింది. అంతేకాదు ఆ దేశంతో ఆర్థిక లావాదేవీలు కొనసాగించే ఇతర దేశాలు, సంస్థలకూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తద్వారా ఆ దేశాన్ని ఒంటరిని చేయాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది.ఇరాన్కు ఆర్థికంగా సహకరిస్తే అమెరికా ఆంక్షల పరిధిలోకి వస్తారని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. సంస్థలు, దేశాలపై ఇక ఉపేక్ష ఉండదని బెసెంట్ తేల్చిచెప్పారు. ఇరాన్ తరఫున మనీలాండరింగ్కు పాల్పడే ఏ సంస్థ అయినా అమెరికా డాలర్ వ్యవస్థ నుంచి తొలగించబడుతుందని హెచ్చరించారు. ‘‘గడియారం తిరగడం ఇప్పుడే మొదలైంది’’ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ పాలక వ్యవస్థకు ఆర్థికంగా అండగా నిలిచే వారెవరైనా అమెరికా శక్తిని పరీక్షించేందుకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు అమెరికా-ఇరాన్లలో ఎవరితో సంబంధాలు కొనసాగించాలనే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.‘గ్రే ఏరియాల్లో’ ఇక వ్యాపారాలు కుదరవుఇరాన్తో ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తూ అమెరికా ఆంక్షలను తప్పించుకునే ప్రయత్నాలను ఇక సహించబోమని బెసెంట్ స్పష్టం చేశారు. ఇరాన్ చమురు విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని నగదుగా మార్చేందుకు సహకరించే సంస్థలు, లావాదేవీలకు మధ్యవర్తిత్వం వహించే సంస్థలపై కూడా చర్యలు తప్పవన్నారు. ‘‘ఇరాన్తో ఎలాంటి ఆర్థిక సంబంధమైనా కొనసాగించడం.. బాధ్యత వహించే వారిని అమెరికా ఆంక్షల పరిధిలోకి తీసుకువస్తుంది’’ అని హెచ్చరించారు.ఐదు కీలక రంగాలే లక్ష్యంఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారాలుగా ఉన్న ఐదు కీలక రంగాలపై అమెరికా ప్రత్యేకంగా దృష్టి సారించింది. డిజిటల్ ఆస్తులు, సాంకేతికత, బంగారం, విమానయానం, నౌకాయానం రంగాలను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు విధించనున్నట్లు అమెరికా ప్రకటించింది. వీటితోపాటు ఇరాన్ చమురు ఆదాయాన్ని అడ్డుకోవడం, ఆ దేశానికి సహకరిస్తున్న సంస్థలు, నౌకలు, వ్యక్తులపై చర్యలు తీసుకోవడం ద్వారా ఆర్థిక మూలాలను తెంచే ప్రయత్నం చేస్తోంది.తాజా చర్యల్లో ప్రపంచంలోని పలు ప్రాంతాలకు చెందిన సుమారు 60 సంస్థలు, నౌకలు, వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా వెల్లడించింది. ఇరాన్కు కీలక వాణిజ్య భాగస్వాములుగా ఉన్న చైనా, టర్కీ, యూఏఈ వంటి దేశాలపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.దేశాధినేతలకు ట్రంప్ ఫోన్లుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రపంచ దేశాల అధినేతలకు ఫోన్ చేసి ఇరాన్తో ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలని కోరుతున్నారని బెసెంట్ తెలిపారు. అమెరికాకు మద్దతు ఇచ్చే దేశాలు భాగస్వామ్య ప్రయోజనాలను పొందుతాయని, ఇరాన్తో సంబంధాలు కొనసాగించే దేశాలు ఒంటరితనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.అయితే ఈ చర్యల వెనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే ప్రమాదం కూడా ఉందని అమెరికా వర్గాలు అంగీకరిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని, తప్పిదాలను సరిదిద్దుకునేందుకు దేశాలకు అవకాశం ఇస్తున్నామని బెసెంట్ పేర్కొన్నారు.‘ఆపరేషన్ ఎకనామిక్ ఔట్కాస్ట్’ఇరాన్పై చేపట్టిన తాజా ఆర్థిక ఒత్తిడి కార్యక్రమాన్ని అమెరికా ‘‘ఆపరేషన్ ఎకనామిక్ ఔట్కాస్ట్’’Operation Economic Outcastగా పేర్కొంది. దీనిని బెసెంట్ ‘‘ఎకనామిక్ డీ-డే’’గా అభివర్ణించారు. ఇరాన్కు వచ్చే అన్ని ఆర్థిక మార్గాలను ఒక్కొక్కటిగా మూసివేసి ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటరిగా చేయడమే లక్ష్యంగా అమెరికా ముందుకు సాగుతున్నట్లు ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.వెనక్కి తగ్గేదేలేఅమెరికా కొత్త ఆంక్షలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా వద్ద ఇరాన్ను ఎదుర్కొనేందుకు కొత్త మార్గాలు లేకపోవడంతోనే పాత ఆంక్షలను పదేపదే అమలు చేస్తోందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ విమర్శించారు. అమెరికా ఒత్తిడికి తాము తలొగ్గబోమని స్పష్టం చేశారు.ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానీ-జాదే కూడా అమెరికా ప్రకటించిన కొత్త ఆర్థిక ఒత్తిడి కార్యక్రమంపై స్పందించారు. ఆంక్షలు, ఆర్థిక ఒత్తిళ్లు ఇరాన్కు కొత్తేమీ కాదని, వాటిని ఎదుర్కొనే సామర్థ్యం తమకు ఉందనే సంకేతాలు ఇచ్చారు.రియాల్ పతనం.. రికార్డు కనిష్ఠానికిమరోవైపు అమెరికా ఆంక్షలతోపాటు యుద్ధ ప్రభావం ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. ఇరాన్ కరెన్సీ రియాల్ డాలర్తో పోలిస్తే రికార్డు స్థాయిలో పతనమైంది. ఒక డాలర్కు సుమారు 20.2 లక్షల రియాల్స్ వరకు పడిపోయింది.యుద్ధానికి ముందే అధిక ద్రవ్యోల్బణం, ప్రతికూల వృద్ధితో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ సతమతమవుతోంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. బియ్యం ధరలు దాదాపు 60 శాతం పెరగగా.. గొడ్డు మాంసం ధరలు 150 శాతానికి పైగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి కూడా ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో 5 శాతానికి పైగా సంకోచం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.‘ఇరాన్ పూర్తిగా కుప్పకూలుతోంది’ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ ఆర్థిక, సైనిక పరిస్థితిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ‘‘పూర్తిగా కుప్పకూలుతోంది’’ అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆ దేశం ఆర్థిక, సైనిక పరంగా ‘డెత్ స్పైరల్’లోకి వెళ్తోందని వ్యాఖ్యానించారు.చమురు.. హర్ముజ్పైనే అసలు పోరుఇరాన్పై అమెరికా ఆర్థిక ఒత్తిడి వెనుక ప్రధాన లక్ష్యం చమురు ఆదాయాన్ని అడ్డుకోవడమే. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో పరిస్థితులు ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్నాయి. అక్కడ నౌకాయానం అంతరాయానికి గురికావడంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు, గ్యాస్ ధరలపై ఒత్తిడి పెరిగింది.ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకోవడం ద్వారా ఆ దేశానికి వచ్చే విదేశీ మారకద్రవ్యాన్ని నిలిపివేయాలని అమెరికా భావిస్తోంది. అయితే ఇప్పటివరకు విధించిన ఆంక్షలు, సముద్ర దిగ్బంధనం ఇరాన్పై ఒత్తిడి పెంచినా.. రాజకీయంగా ఆశించిన ఫలితాన్ని పూర్తిగా సాధించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చర్చల టేబుల్పైకి రావాల్సిందే: హెగ్సెత్అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా ఇరాన్ ఆర్థిక ఒత్తిడిని ఎక్కువ కాలం తట్టుకోలేదని వ్యాఖ్యానించారు. చివరకు అణు కార్యక్రమంపై చర్చలకు తిరిగి రావడం తప్ప ఇరాన్కు మరో మార్గం ఉండదని అన్నారు. అవసరమైతే అమెరికా సైనిక చర్యలకు కూడా వెనుకాడబోదని హెచ్చరించారు.దీంతో ఇరాన్పై అమెరికా వ్యూహం సైనిక చర్యల నుంచి ఆర్థిక యుద్ధం వైపు మరింతగా మళ్లుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చమురు, డాలర్ లావాదేవీలు, నౌకాయానం, బంగారం, సాంకేతిక రంగాలను లక్ష్యంగా చేసుకున్న తాజా ఆంక్షలు ఎంతవరకు ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఇరాన్తో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలు అమెరికా ఒత్తిడికి ఎలా స్పందిస్తాయన్నదే తదుపరి కీలక పరిణామంగా మారనుంది.ఇదీ చదవండి: మేం రెడీ.. రెండేళ్లకు సరిపడా!: ఇరాన్ -
అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. రెండేళ్ల ప్లాన్ రెడీ!
అమెరికా విధిస్తున్న కొత్త ఆంక్షలను ఎదుర్కొనేందుకు ఇరాన్ ప్రభుత్వం ముందుగానే సిద్ధమైందని.. ఆ దేశ ఆర్థిక మంత్రి అలీ మదానిజాదె వెల్లడించారు. అమెరికా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇరాన్ ప్రజల సంకల్పాన్ని, దేశ అధికారుల నిర్ణయాన్ని మార్చలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. అమెరికా చర్యలు మరోసారి విఫలమయ్యే అవకాశముందని, ఇరాన్ మరో ఓటమిని అమెరికాకు ఇవ్వబోతోందని ఆయన వ్యాఖ్యానించారు.రెండేళ్ల ప్రణాళిక సిద్ధం!కొత్త ఆంక్షల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఇరాన్ ప్రభుత్వం రెండేళ్ల ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసిందని మదానిజాదె తెలిపారు. అమెరికా నుంచి ఇలాంటి చర్యలు వస్తాయని తమకు చాలాకాలంగా తెలుసని, అందుకు అనుగుణంగానే ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైందని చెప్పారు. ఆంక్షల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగినా, పరిస్థితులను నిర్వహించేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపడుతోందని ఆయన వెల్లడించారు.అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలుఅమెరికా, ఇరాన్ మధ్య సంబంధాలు ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తంగా ఉన్న సమయంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికా ఆంక్షలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, ఆదాయ మార్గాలపై ప్రభావం చూపించే లక్ష్యంతో ఉంటాయి. అయితే.. ఇరాన్ మాత్రం వాటిని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యూహాలను అమలు చేస్తామని చెబుతోంది. దీంతో రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. -
‘పాక్’ అసిమ్ మునీర్కి ట్రంప్ ఫోన్.. ఇరాన్ వెళ్లిన మునీర్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్తో మాట్లాడినట్లు రాయిటర్స్ వెల్లడించింది. ఇరాన్తో చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో, పాకిస్థాన్ తనకున్న ప్రభావాన్ని ఉపయోగించి ఇరాన్ను మళ్లీ అమెరికాతో చర్చల టేబుల్ వద్దకు తీసుకురావాలని ట్రంప్ కోరినట్లు పాకిస్థాన్కు చెందిన 3 వర్గాలు తెలిపాయి.ట్రంప్ ప్రారంభించిన ఈ ఫోన్ సంభాషణ మునీర్ ఇరాన్ పర్యటనకు కొన్ని రోజుల ముందు జరిగింది. అయితే ఆ సంభాషణలోని పూర్తి వివరాలు బయటకు రాలేదు. వైట్హౌస్ కూడా దీనిపై స్పందించలేదు.ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో మునీర్ సోమవారం టెహ్రాన్ చేరుకున్నారు. ఆయనతో పాటు పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ కూడా వెళ్లారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని ప్రోత్సహించడమే ఈ పర్యటన లక్ష్యమని పాకిస్థాన్ సైన్యం తెలిపింది.ఇరాన్ గల్ఫ్ నుంచి చమురు ఎగుమతులను అడ్డుకునే చర్యలకు దిగుతామని హెచ్చరిస్తుండగా, ఇరాన్కు ఆర్థికంగా సహకరించే దేశాలపై చర్యలు తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిగా వ్యవహరించే ప్రయత్నాన్ని మళ్లీ ప్రారంభించింది. గతంలోనూ పాకిస్థాన్ ఇరు దేశాల మధ్య చర్చలకు సహకరించి జూన్లో తాత్కాలిక శాంతి ఒప్పందం కుదరడంలో పాత్ర పోషించింది. అయితే ఆ ఒప్పందం తర్వాత విఫలమైంది.ఇరాన్-అమెరికా మధ్య చర్చలు మళ్లీ ప్రారంభం కావాలని ట్రంప్ కోరుతున్నారు. అందుకోసం ఇరాన్పై ప్రభావం ఉన్న పాకిస్థాన్ను రంగంలోకి దించి, అసిమ్ మునీర్ ద్వారా టెహ్రాన్ను చర్చలకు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.ఇదీ చదవండి: ఒక్క పొరపాటు.. అపార్ట్మెంట్లు కూలిపోతాయని దడుసుకున్నారు.. -
హర్ముజ్ విషయంలో మరో బాంబు పేల్చిన ఇరాన్
టెహ్రాన్: ఇరాన్ పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ఓడలపై పన్ను విధించేందుకు అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇరాన్కు సంబంధించిన మీడియా కథనాలు ఈ కీలక విషయాలు వెల్లడించాయి.ఆ దేశ మీడియా కథనాల ప్రకారం.. "హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతి ఉన్న దేశాల ఓడల నుండి సముద్రయాన సేవలకు రుసుము వసూలు చేయబడుతుంది రుసుములకు బదులుగా సముద్ర సేవలు, భద్రత మరియు బీమా వంటి సౌకర్యాలు కల్పించబడతాయి.పర్యావరణ సేవలు మరియు, ప్రత్యేక పరిస్థితులలో, ఇంధనం కూడా అందించబడతాయి. చెల్లింపు ఇరానియన్ రియాల్స్లో లేదా ఇరాన్ ఎంచుకున్న ఏదైనా ఇతర కరెన్సీలో చేయబడుతుంది". అని తెలిపాయి.కాగా ఇటీవల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరాయి. అమెరికా ఇరాన్పై ఆర్థిక యుద్ధం ప్రకటిస్తున్నట్లు తెలిపింది.ఇరాన్పై ఆర్థిక యుద్ధంఇరాన్పై ట్రంప్ ప్రభుత్వం సాగిస్తున్న ఆర్థిక యుద్ధం ఇప్పుడు తుది దశలోకి ప్రవేశించిందని అమెరికా ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెస్సాంట్ అన్నారు. ఇరాన్ ప్రధాన ఆదాయ వనరులను నిలిపివేయడమే అమెరికా లక్ష్యమని బెస్సాంట్ తెలిపారు. ఇరాన్పై ఒత్తిడిని పెంచడానికి అమెరికా తన ప్రభుత్వ సంస్థలన్నింటినీ, అధికారాలన్నింటినీ వినియోగిస్తుందని బెస్సెంట్ చెప్పారు. దీనిని ఒక శత్రువుపై చేపట్టే అతిపెద్ద ఆర్థిక చర్యగా ట్రంప్ గతంలో అభివర్ణించారు మరియు ఇరాన్ను ఏకాకిని చేయడంలో పాలు పంచుకోవాలని ఇతర దేశాలకు విజ్ఞప్తి చేశారు.గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ సైతం గల్ఫ్ దేశాలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. అమెరికా ఆర్థిక కఠిన చర్యలకు మద్దతు ఇచ్చే గల్ఫ్ దేశాలను ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్పై ఆర్థిక ఆంక్షలు విధించడంలో అమెరికాకు మద్దతు ఇచ్చే ఏ దేశాన్నైనా శత్రువుగా పరిగణిస్తామని ఇరాన్ కొత్త జాతీయ భద్రతా అధిపతి మొహ్సెన్ రెజాయీ అన్నారు.కాగా ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య హర్ముజ్ అంశంలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఈ కీలకమైన జలసంధిపై పట్టు సాధించేందుకు అమెరికా యత్నిస్తుంది. ఇప్పుడు ఇరాన్ దానికి టోల్ టాక్స్ వసూలు చేస్తుండడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
హర్ముజ్పై పట్టు కోసం ఇరాన్ కొత్త ఎత్తుగడ
హర్ముజ్.. ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయలాంటి ఈ కీలక సముద్ర మార్గంపై ఆధిపత్య పోరు మరింత తీవ్రంగా మారుతోంది. జలసంధిపై ఇరాన్ ప్రభావం, అమెరికా ఒత్తిడి మధ్య నౌకల రాకపోకలపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, తీసుకుంటున్న చర్యలు కూడా ఈ పోరుకు మరింత ఆజ్యం పోశాయి. ఈ నేపథ్యంలో జలసంధిపై తన పట్టు సడలుతోందనే సంకేతాల మధ్య.. ఇరాన్ కొత్త వ్యూహాలను అమలు చేయాలని నిర్ణయించింది.గత కొంతకాలంగా హర్ముజ్ జలసంధిలో పరిస్థితులు మారిపోయాయి. ఇరాన్ సూచించే మార్గం కంటే.. ఒమన్ తీరానికి సమీపంలోని ప్రత్యామ్నాయ మార్గాన్నే అంతర్జాతీయ నౌకలు ఎక్కువగా ఎంచుకుంటున్నాయి. షిప్ ట్రాకింగ్ సంస్థల సమాచారం ప్రకారం.. ఇటీవల హర్ముజ్ దాటిన నౌకల్లో 80 శాతానికి పైగా ఒమన్ మార్గంలో ప్రయాణించినట్లు తెలుస్తోంది. అమెరికా నౌకాదళ భద్రతతో ఈ మార్గంలో రాకపోకలు పెరిగినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. దీంతో హర్ముజ్పై ఇరాన్ నియంత్రణ సడలుతోందనే చర్చ మొదలైంది. సరిగ్గా ఇదే సమయంలో.. నౌకల నుంచి సేవల పేరుతో రుసుములు వసూలు చేసే ప్రతిపాదనకు ఇరాన్ పార్లమెంట్ కమిషన్ ఆమోదం తెలిపింది.టెహ్రాన్ కొత్త ప్లాన్ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిషన్ ‘హర్ముజ్ జలసంధి భద్రత, అభివృద్ధి కోసం వ్యూహాత్మక చర్యలు’ ప్రణాళికలోని ఆర్టికల్-3కు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం హర్ముజ్ గుండా ప్రయాణించే నౌకలకు ఇరాన్ అందించే సముద్ర భద్రత, పర్యావరణ సేవలు, ప్రత్యేక పరిస్థితుల్లో ఇంధన సరఫరా, బీమా తదితర సేవలకు రుసుములు వసూలు చేయనుంది. ఈ ఫీజులను హర్ముజ్ గుండా ప్రయాణించేందుకు అనుమతి పొందిన దేశాల నౌకల నుంచే వసూలు చేస్తామని ఇరాన్ తెలిపింది. చెల్లింపులు ఇరాన్ కరెన్సీ రియాల్ లేదంటే టెహ్రాన్ నిర్ణయించే ఇతర కరెన్సీలో ఉండవచ్చని వెల్లడించింది.అమెరికా మద్దతుదారులకూ వార్నింగ్ఓవైపు ట్రంప్ ఇరాన్ మద్దతుదారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆంక్షల మోతకు సిద్ధపడాలంటూ చెబుతున్నారు. అయితే ఇటు అమెరికా ఆంక్షలపై ఇరాన్ మరింత ఘాటుగా స్పందిస్తోంది. ఆర్థిక ఒత్తిడి కొనసాగితే హర్ముజ్ నుంచే కాదు.. పర్షియన్ గల్ఫ్ నుంచి కూడా ఒక్క చుక్క చమురు బయటకు వెళ్లదని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయ్ హెచ్చరించారు. అమెరికా చర్యలకు మద్దతిచ్చే దేశాలను కూడా ఇరాన్ వ్యతిరేక శక్తులుగా పరిగణిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. చమురు రవాణా విషయంలో ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని టెహ్రాన్ సంకేతాలు ఇస్తోంది.నౌకలకు ఇరాన్ హెచ్చరికలుహర్ముజ్ నిబంధనలు ఉల్లంఘించే నౌకలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇరాన్ పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ హెచ్చరించింది. నిబంధనలు అతిక్రమించే నౌకలకు జరిమానాలు, భవిష్యత్ ప్రయాణాలపై ఆంక్షలు, అవసరమైతే స్వాధీనం వంటి చర్యలు ఉంటాయని తెలిపింది. ఉల్లంఘన చేసే నౌకలకు సహకరించే షిప్పింగ్ సంస్థలు, సరుకు యజమానులను కూడా సమస్యాత్మక జాబితాలో చేర్చుతామని పేర్కొంది.ఇంకా రూట్లోనే..ఇరాన్ బెదిరింపులు పెద్దగా పని చేయడం లేదా? అనే చర్చా నడుస్తోంది. మరోవైపు హర్ముజ్లో తన ప్రభావాన్ని పెంచుకునేందుకు అమెరికా కూడా ప్రయత్నిస్తోంది. ఒమన్ మార్గంలో ప్రయాణించే నౌకలకు రక్షణ కల్పిస్తున్నామని, ప్రపంచ చమురు సరఫరా నిరాటంకంగా కొనసాగడమే తమ లక్ష్యమని వాషింగ్టన్ చెబుతోంది. గల్ఫ్ దేశాల నుంచి బయలుదేరే భారీ క్రూడాయిల్ ట్యాంకర్లు హర్ముజ్పైనే ఎక్కువగా ఆధారపడతాయి. అయితే భద్రతా కారణాలతో కొన్ని నౌకలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం ఇరాన్కు సవాల్గా మారింది.ప్రపంచ చమురు మార్కెట్పై ప్రభావం?ప్రపంచ చమురు రవాణాలో హర్ముజ్ జలసంధికి అత్యంత కీలక స్థానం ఉంది. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. 80 శాతం నౌకలు ప్రత్యామ్నాయ మార్గం పట్టినా.. హర్ముజ్పై పట్టు కోల్పోకుండా ఉండేందుకు ఇరాన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. రుసుముల ప్రతిపాదన నుంచి కఠిన హెచ్చరికల వరకు.. చమురు మార్గంపై తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు టెహ్రాన్ ప్రయత్నిస్తోంది.ఇదీ చదవండి: శత్రువులు చేతులు కలుపుతారా?.. సర్కత్రా ఉత్కంఠ! -
మిడిల్ఈస్ట్లో బిగ్ ట్విస్ట్.. ఇరాన్ నిర్ణయంపై ఉత్కంఠ
దశాబ్దాలుగా సాగుతున్న వైరం.. ఎప్పుడూ ప్రత్యర్థులుగా కనిపించిన దేశాలు.. ఇప్పుడు ఒకే వేదికపైకి వస్తాయా? మిడిల్ఈస్ట్ రాజకీయాల్లో ఇదే ఇప్పుడు అతిపెద్ద చర్చ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిళ్లు, ఇరాన్పై పెరుగుతున్న ఆంక్షలు, ప్రాంతీయ భద్రతా ఆందోళనల మధ్య అనూహ్య పరిణామం తెరపైకి వచ్చింది. సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ ఏర్పాటు చేసిన మక్కా రక్షణ కూటమిలో చేరాలని ఇరాన్కు ఆహ్వానం అందినట్లు వచ్చిన వార్తలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇరాన్-సౌదీ అరేబియా.. ఈ రెండు పేర్లు వినగానే గుర్తొచ్చేది ఆధిపత్య పోరు. గల్ఫ్ ప్రాంతంలో ప్రభావం కోసం ఇరు దేశాల మధ్య ఏళ్లుగా సాగుతున్న పోటీ. యెమెన్లో హౌతీల అంశం నుంచి సిరియా, లెబనాన్ వరకు పలు పరిణామాల్లో ఈ విభేదాలు బయటపడ్డాయి. అలాంటి రెండు దేశాలు భద్రతా వేదికపై దగ్గరవుతాయా? అనే ప్రశ్న ఇప్పుడు మిడిల్ఈస్ట్లో కొత్త చర్చకు తెరతీసింది. ఒకప్పుడు ఒకరిపై ఒకరు అనుమానంతో చూసుకున్న దేశాలు.. ఇప్పుడు ఒకే భద్రతా గొడుగు కిందకు వస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది. అమెరికా ప్రభావం, ప్రాంతీయ భద్రతా పరిణామాలు, మారుతున్న ప్రపంచ రాజకీయాల నేపథ్యంలో ఈ పరిణామం మిడిల్ఈస్ట్ భవిష్యత్ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముంది.మక్కా కూటమిలోకి ఇరాన్?సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ ఆగస్టు 7న మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం.. ఈ మూడు దేశాల్లో ఏదో ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే, అది మిగిలిన దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. రక్షణ సహకారం, వ్యూహాత్మక సమన్వయం, సంయుక్త భద్రతా చర్యలు ఈ ఒప్పందంలో భాగంగా ఉంటాయని ప్రకటించారు. అయితే ఈ కూటమి ఏర్పడిన కొద్ది రోజులకే మరో ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. మక్కా ఒప్పందంలో చేరాలని ఇరాన్కు ఆహ్వానం అందినట్లు ‘అల్ మయదీన్’ నివేదించింది. ఇరాన్ పార్లమెంట్కు అనుబంధంగా ఉన్న ఖానే మెల్లత్ వార్తా సంస్థ అధిపతి మెహదీ రహీమి ఈ విషయాన్ని వెల్లడించినట్లు పేర్కొంది. ఆ ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పినట్లు సమాచారం. అయితే ఇరాన్ ప్రభుత్వం గానీ, సౌదీ, పాకిస్థాన్, టర్కీ ప్రభుత్వాలు గానీ దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు.ట్రంప్ ప్రభావమేనా?ఈ పరిణామాల వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల ప్రభావం ఉందా? అన్న చర్చ కూడా మొదలైంది. ఇరాన్పై అమెరికా ఒత్తిడి పెరగడం, ఆంక్షల భయం, గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో ప్రాంతీయ దేశాలు తమ భద్రతా వ్యూహాలను పునరాలోచిస్తున్నాయి. ఇప్పటివరకు మిడిల్ఈస్ట్లో భద్రతకు అమెరికా కీలక శక్తిగా ఉండేది. అయితే ఇటీవలి పరిణామాల్లో ప్రాంతీయ దేశాలే తమ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలనే ఆలోచనలోకి వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మక్కా కూటమి కూడా ఇదే దిశలో మరో అడుగుగా భావిస్తున్నారు. శత్రువుల మధ్య కొత్త స్నేహమా?ఇరాన్ నిజంగా మక్కా కూటమిలో చేరితే అది సాధారణ పరిణామం కాదు. ఎందుకంటే ఈ కూటమిలో ప్రధాన దేశమైన సౌదీ అరేబియాతో ఇరాన్కు గతంలో తీవ్ర విభేదాలున్నాయి. 2016లో తెగిపోయిన దౌత్య సంబంధాలు 2023లో చైనా మధ్యవర్తిత్వంతో తిరిగి ప్రారంభమైనప్పటికీ.. అనుమానాలు పూర్తిగా తొలగిపోలేదు.యెమెన్లో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు, సౌదీ ప్రయోజనాల మధ్య ఉన్న విభేదాలు కూడా ఈ సంబంధాలకు సవాలుగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒకే రక్షణ వేదికపైకి రావడం జరిగితే.. అది మిడిల్ఈస్ట్ రాజకీయాల్లో భారీ మార్పుగా మారే అవకాశం ఉంది.ఇరాన్ లెక్కలు ఏంటి?ఇరాన్ మాత్రం ఈ పరిణామాన్ని పూర్తిగా వ్యతిరేకించలేదు. ప్రాంతీయ దేశాలు తమ స్వంత భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. మరోవైపు ట్రంప్ ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో తనకు అనుకూలమైన కొత్త వ్యూహాలను రూపొందించుకోవాల్సిన పరిస్థితిలో టెహ్రాన్ ఉంది.అయితే.. మక్కా కూటమిలో చేరడం ద్వారా ఇరాన్కు లాభమా? లేదంటే తన పాత మిత్ర, ప్రత్యర్థి సమీకరణాలను మార్చుకోవాల్సి వస్తుందా? అన్నది కీలక ప్రశ్న.ఇరాన్ తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఒకప్పుడు ప్రత్యర్థులుగా ఉన్న దేశాలు నిజంగా చేతులు కలిపితే.. అది ట్రంప్ హయాంలో మిడిల్ఈస్ట్లో అతిపెద్ద దౌత్య మలుపుగా నిలిచే అవకాశం ఉంది.ఇదీ చదవండి: అమెరికాలో కాల్పులు.. భారతీయుడి దుర్మరణం -
‘న్యూ యూఎస్ టెరిటరీ’.. ట్రంప్ పోస్టుతో ముదిరిన మంటలు!
వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి హార్ముజ్ జలసంధి వద్దకు చేరాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ జలమార్గాన్ని ‘NEW US Territory’గా పేర్కొంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్లో మరోసారి పోస్టు చేయడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఆగస్టు 18న ఇదే చిత్రాన్ని తొలిసారి షేర్ చేసిన ట్రంప్.. తాజాగా మళ్లీ దాన్ని పంచుకోవడం ద్వారా హార్ముజ్పై తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్న సంకేతం ఇచ్చారు.అంతకుముందు ఆగస్టు 14న లాంగ్ ఐలాండ్లోని పోలీస్ అకాడమీలో మాట్లాడిన ట్రంప్.. ‘త్వరలోనే హార్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తాను’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే సోషల్ మీడియాలో పోస్టు చేయడం లేదా అధ్యక్షుడి ప్రకటనతోనే హార్ముజ్పై అమెరికాకు చట్టపరమైన సార్వభౌమాధికారం ఏర్పడదు. ట్రంప్ వ్యాఖ్యలను ప్రస్తుతానికి రాజకీయ, వ్యూహాత్మక ఒత్తిడిలో భాగంగానే చూడాల్సి ఉంటుంది.ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ.. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవలేని అమెరికా అసమర్థతకు, అదే జలసంధిని సొంతం చేసుకుంటామన్న వాదనకు మధ్య ఉన్న అంతరం.. వాషింగ్టన్ నుంచి హార్ముజ్ వరకు ఉన్న 7,000 మైళ్ల దూరం కంటే ఎక్కువగా ఉందంటూ ఎద్దేవా చేశారు. పర్షియన్ గల్ఫ్లో అమెరికా అనంతర వ్యవస్థకు స్వాగతం అంటూ అమెరికాకు ఘాటు కౌంటర్ ఇచ్చారు.🔴President Trump just posted a map labeling the Strait of Hormuz as “NEW U.S. Territory.” The critical waterway is clearly circled and claimed. This follows his repeated statements that America now controls the Strait. Iran’s ability to threaten global oil shipping is being… pic.twitter.com/4TbQoFMNWC— Commentary Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) August 22, 2026ఇదే సమయంలో ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఇరాన్పై ఇప్పటివరకు లేనంత కఠినమైన ఆంక్షలు విధించనున్నట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. ముఖ్యంగా ఇరాన్ చమురుకు ప్రధాన కొనుగోలుదారుగా ఉన్న చైనాపై కూడా వాషింగ్టన్ ఒత్తిడి పెంచుతోంది. ఇరాన్ చమురు ఎగుమతులకు సహకరించే దేశాలు, సంస్థలపై ద్వితీయ ఆంక్షలు విధించే అవకాశాన్ని అమెరికా పరిశీలిస్తోంది. ఈ క్రమంలో అమెరికా చర్యలను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వాషింగ్టన్ విధించబోయే ద్వితీయ ఆంక్షలకు అంతర్జాతీయ చట్టంలో ఎలాంటి ఆధారం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ స్పష్టం చేశారు. అంతేకాదు, అమెరికా ఆర్థిక యుద్ధంలో తమతో చుట్టుపక్కల దేశాలు చేరితే వాటిని శత్రువులుగా పరిగణిస్తామని రెజాయీ హెచ్చరించారు.ఇది కూడా చదవండి: ఎల్నినో సెగ.. ప్రపంచ వాణిజ్య మార్గాలకు గండం!ప్రస్తుతం అసలు సమస్య అంతా హార్ముజ్ జలసంధి చుట్టూనే తిరుగుతోంది. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన ఈ మార్గంలో చమురు, ఎల్ఎన్జీ రవాణా భారీగా దెబ్బతింది. కొద్దిమంది వాణిజ్య నౌకలు మాత్రమే జలసంధిని దాటుతుండగా.. పెద్ద సంఖ్యలో క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు, ఎల్ఎన్జీ నౌకలు రాకపోకలకు దూరంగా ఉంటున్నాయి. ఇరాక్ విజ్ఞప్తి మేరకు కొన్ని ఇరాకీ చమురు నౌకలకు మాత్రం హార్ముజ్ గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతించినట్లు సమాచారం. హార్ముజ్ సంక్షోభం ఎక్కువకాలం కొనసాగితే దాని ప్రభావం అమెరికా, ఇరాన్లకే పరిమితం కాకపోవచ్చు. చమురు సరఫరా తగ్గితే అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలపై కూడా దీని ప్రభావం పడే అవకాశముంది. ఇంధన ధరలు పెరిగితే రవాణా ఖర్చులు, పరిశ్రమల వ్యయాలు, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంటుంది. -
పర్షియన్ గల్ఫ్లో ‘మంటలు’.. యూఎస్ వైఖరిపై ధ్వజం
టెహ్రాన్: అమెరికా తన వైఖరిని మార్చుకుని, ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ‘హార్ముజ్ జలసంధి’ మూసివేసే ఉంటుందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహసేన్ రెజాయ్ స్పష్టం చేశారు. అమెరికా చేస్తున్న వాదనల్లో వాస్తవం లేదని, ఆ దేశం తన ప్రవర్తనను సరిదిద్దుకునేంత వరకు ఈ జలమార్గాన్ని తెరిచే ప్రసక్తే లేదని ఐఆర్ఐబీ ఇంటర్వ్యూలో ఆయన హెచ్చరించారు.వాషింగ్టన్ ప్రత్యక్ష సైనిక దాడులకు స్వస్తి చెప్పి, ఆర్థిక ఆంక్షల వైపు మళ్లిందని రెజాయ్ పేర్కొన్నారు. ఇరాన్పై ఆర్థిక దిగ్బంధం విధిస్తే లొంగిపోతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు భరోసా ఇచ్చారని ఆయన విమర్శించారు. అయితే ఆంక్షలను అధిగమించి చమురు ఎగుమతులు కొనసాగించే మార్గాలను తాము ఎప్పటినుంచో నేర్చుకున్నామని తెలిపారు. పర్షియన్ గల్ఫ్ తీరంలో 50 శాతానికి పైగా భూభాగం ఇరాన్దేనని, హార్ముజ్ నిర్వహణ బాధ్యత తమదేనని తేల్చిచెప్పారు.ఈ జలసంధి అమెరికా భూభాగమంటూ ట్రంప్ చేసిన ప్రకటనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఆర్థిక దిగ్బంధం ముగింపు, స్తంభింపజేసిన నిధుల విడుదల, చమురు ఆంక్షల ఎత్తివేతతో కూడిన 14 అంశాల ఒప్పందాన్ని అమెరికా నెరవేరిస్తేనే జలసంధిని తెరుస్తామని పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ గలీబాఫ్ స్పష్టం చేశారు. మరోవైపు, యూఎస్ నౌకాదళ భద్రతతో చమురు రవాణా నిరాటంకంగా సాగుతోందని అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ పేర్కొన్నారు. అంతర్జాతీయ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హార్ముజ్ సంక్షోభం ప్రస్తుతం ప్రపంచ ఇంధన మార్కెట్లలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.ఇది కూడా చదవండి: బుల్లెట్ప్రూఫ్ జాకెట్ సీక్రెట్ హిస్టరీ ఇదే! -
ట్రంప్ కొత్త అస్త్రం.. ప్రతీకారం భీకరంగా ఉంటుందన్న ఇరాన్
అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఇరాన్పై చరిత్రలోనే అత్యంత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించగా.. దానికి ఇరాన్ తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించింది. కొత్త ఆంక్షలు, బెదిరింపులకు సమాధానం విధ్వంసకరంగా ఉంటుందని టెహ్రాన్ వార్నింగ్ ఇచ్చింది.‘అమెరికా బెదిరింపులకు గట్టి సమాధానం’.. అమెరికా నుంచి ఎదురయ్యే ఎలాంటి కొత్త బెదిరింపులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ఇరాన్ సాయుధ దళాలు ప్రకటించాయి. ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ అలీ అబ్దొల్లాహీ మాట్లాడుతూ.. “భూమి, సముద్రం, గగనం, వాయు రక్షణ, సైబర్ రంగాల్లో మా బలగాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయి. శత్రువుల కొత్త బెదిరింపులకు శిక్షాత్మక, వినాశకర ప్రతిస్పందన ఇస్తాం” అని హెచ్చరించారు.ఆంక్షల యుద్ధం విఫలమవుతుంది: అరాఘ్చీఅమెరికా ప్రతిపాదిస్తున్న ఆర్థిక ఆంక్షలు విఫలమవుతాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. ఆర్థిక ఒత్తిళ్లతో ఇరాన్ను లొంగదీసుకోవాలన్న ప్రయత్నాలు ఫలించవని అన్నారు. దౌత్య మార్గమే సమస్యలకు పరిష్కారమని పేర్కొంటూనే.. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు అన్ని మార్గాల్లో సిద్ధంగా ఉన్నామని తెలిపారు.ట్రంప్ లక్ష్యం.. ఇరాన్పై గరిష్ఠ ఒత్తిడిఇరాన్కు సహకరించే ఏ దేశంపైనైనా ఆర్థిక చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ సోమవారం కొత్త ఆంక్షల వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. అయితే ట్రంప్ మాత్రం.. “ఇరాన్ ఒక ఒప్పందాన్ని కోరుకుంటోంది. కానీ సరైన ఒప్పందానికి ఇంకా సిద్ధంగా లేదు” అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, హర్ముజ్ జలసంధిని ప్రస్తుతం “అమెరికా భూభాగంగా చూస్తున్నాను” అంటూ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి కారణమయ్యాయి.హర్ముజ్.. ఇరాన్ చేతిలో కీలక ఆయుధంప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన మార్గం హార్ముజ్ జలసంధి. ఈ మార్గం ద్వారా రోజూ భారీ స్థాయిలో చమురు రవాణా జరుగుతుంది. ఇరాన్ వద్ద ఉన్న క్షిపణులు, డ్రోన్ల సామర్థ్యంతో ఈ ప్రాంతంలో నౌకా రవాణాకు అంతరాయం కలిగించే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే హర్ముజ్ ప్రాంతంలో జరిగిన ఘటనల్లో పలువురు నావికులు ప్రాణాలు కోల్పోయారు.చమురు మార్కెట్లపై ఆందోళనఅమెరికా కొత్త ఆంక్షల హెచ్చరికలతో అంతర్జాతీయ చమురు ధరలు పెరిగాయి. ఇరాన్ చమురు సరఫరాపై ఆంక్షలు మరింత కఠినమైతే ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇరాన్ నుంచి ఎగుమతి అయ్యే చమురులో ఎక్కువ భాగాన్ని చైనా కొనుగోలు చేస్తోంది. దీంతో అమెరికా ఒత్తిడి ప్రధానంగా బీజింగ్పైనా పడే అవకాశముంది. చైనా మాత్రం.. “ఆంక్షలు, ఒత్తిళ్లు సమస్యను పరిష్కరించవు. చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యం” అని స్పష్టం చేసింది.చర్చలకు ఒమన్ ప్రయత్నాలుహర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ఒమన్ మధ్యవర్తిత్వం చేస్తోంది. ఒమన్, ఇరాన్ విదేశాంగ మంత్రులు ఫోన్లో చర్చించి.. నౌకా రవాణాపై కొత్త ఒప్పందం కోసం చర్చలు పునఃప్రారంభించే అంశాన్ని పరిశీలించారు.యెమెన్ హౌతీలతో మరో సమస్యఇదే సమయంలో యెమెన్కు చెందిన హౌతీ గ్రూప్ బాబ్ అల్ మందెబ్ జలసంధిలో సౌదీ నౌకలపై దిగ్బంధం ప్రకటించడంతో ఎర్ర సముద్ర రవాణాపైనా ప్రభావం పడింది. సౌదీ అరేబియాలోని యన్బు పోర్టుకు వచ్చే ట్యాంకర్ రాకపోకలు గణనీయంగా తగ్గినట్లు సమాచారం.అమెరికా ఆర్థిక ఆంక్షల బెదిరింపులు.. ఇరాన్ ప్రతీకార హెచ్చరికలు.. హర్ముజ్పై ఆధిపత్య పోరు.. ఇవన్నీ పశ్చిమాసియా సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తున్నాయి. దౌత్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ఇరు దేశాల నుంచి వస్తున్న కఠిన ప్రకటనలు కొత్త ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.ఇదీ చదవండి: ప్లీజ్.. ప్లీజ్.. మా చక్కెర కొనరా? -
అమెరికా ఆంక్షలకు తగ్గేదేలే అంటున్న టెహ్రాన్
-
ఇరాన్పై ట్రంప్ కొత్త గేమ్.. మద్దతుదారులకు మూడినట్లే!
ఇరాన్ను ఒంటరి చేసేందుకు అమెరికా ఇక నేరుగా రంగంలోకి దిగింది! టెహ్రాన్ను మాత్రమే కాదు.. దానికి అండగా నిలిచే దేశాలు, సంస్థలను కూడా టార్గెట్ చేస్తానంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన హెచ్చరిక చేశారు. ఇరాన్కు డబ్బు అందించినా.. వ్యాపారం చేసినా.. చమురు తరలింపులో సహకరించినా భారీ ఆర్థిక మూల్యం చెల్లించాల్సిందే అని తేల్చిచెప్పారు. ఇరాన్ను అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి పూర్తిగా వేరుచేసేలా ఇప్పటివరకు ఎన్నడూ లేనంత కఠినమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. దీంతో టెహ్రాన్కు అండగా నిలిచే దేశాలపై కూడా అమెరికా ఆంక్షల పిడుగు పడబోతోందా? అన్న ఉత్కంఠ మొదలైంది.ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో చేసిన పోస్టులో.. ఇరాన్కు ఆర్థిక సంస్థలు, వ్యాపారాలు, విమానాశ్రయాలు లేదా ప్రభుత్వ సంస్థలు ఎలాంటి సహాయం చేసినా ఆయా దేశాలు “భారీ ఆర్థిక పరిణామాలు” ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అయితే ఏ దేశాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇరాన్కు సహాయం చేసే మార్గాలపై కూడా ట్రంప్ ప్రత్యేకంగా హెచ్చరించారు. చమురు అక్రమ రవాణా, ఆర్థిక స్వాప్ ఒప్పందాలు, నగదు బదిలీలు, ఎక్స్ఛేంజ్ హౌస్లు, నౌకల రిజిస్ట్రీలు, ఫ్రంట్ కంపెనీల ద్వారా టెహ్రాన్కు మద్దతు ఇచ్చినా అమెరికా చర్యలు తప్పవన్న సంకేతాలు ఇచ్చారు. అంటే ఇరాన్తో నేరుగా వ్యాపారం చేసే సంస్థలతో పాటు పరోక్షంగా ఆ దేశానికి ఆర్థిక చేయూత అందించే వ్యవస్థలపైనా అమెరికా కన్నేయనుంది.ఇరాన్తో ఒప్పందం చేసుకునేందుకు తన ప్రభుత్వం అనేక అవకాశాలు ఇచ్చిందని ట్రంప్ పేర్కొన్నారు. కానీ టెహ్రాన్ వాటిని ఉపయోగించుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు ఇరాన్పై అపూర్వ స్థాయిలో ఆర్థిక యుద్ధం, అంతర్జాతీయ ఒంటరితనం ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. అమెరికా మిత్రదేశాలు కూడా ఈ చర్యలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇరాన్ సైనిక సామర్థ్యం ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్నదని ట్రంప్ అన్నారు. ఆ దేశ నౌకాదళం ధ్వంసమైందని, వైమానిక దళం బలహీనపడిందని, సైనిక కర్మాగారాలు భారీగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర ఒత్తిడిలో ఉందని పేర్కొన్న ఆయన.. కొత్త చర్యలతో టెహ్రాన్ అంతర్జాతీయంగా కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం మరింత తగ్గిపోతుందని అన్నారు.ఇరాన్ అణు కార్యక్రమంపైనా ట్రంప్ మరోసారి కఠిన వైఖరి వ్యక్తం చేశారు. “ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండదు” అంటూ తన పరిపాలన వైఖరిని పునరుద్ఘాటించారు. ట్రంప్ తాజా హెచ్చరికతో ఇప్పుడు అసలు ప్రశ్న ఇరాన్ గురించే కాదు.. ఇరాన్కు అండగా నిలిచే దేశాల సంగతేంటి? అన్నదే. టెహ్రాన్తో వాణిజ్య, ఆర్థిక సంబంధాలు కొనసాగించే దేశాలపై అమెరికా చర్యలు మొదలుపెడితే అంతర్జాతీయ వాణిజ్య సమీకరణాలు కూడా మారే అవకాశం ఉంది. దీంతో ఇరాన్ను ఒంటరి చేయాలన్న ట్రంప్ వ్యూహం.. ఇప్పుడు ఆ దేశానికి మద్దతిచ్చే వారిని కూడా చుట్టుముట్టే స్థాయికి చేరిందా? అన్న చర్చ మొదలైంది. -
ఇరాన్ యుద్ధం తెచ్చిన విద్యా సంక్షోభం
యుద్ధం జరిగేది ఎక్కడో సరిహద్దుల్లో కావచ్చు.. కానీ దాని ప్రభావం మాత్రం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నిరుపేద కుటుంబాల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధం కారణంగా ఎగిసిపడుతున్న ఇంధన ధరలు, నిత్యావసరాల ఖర్చులు పేద దేశాల్లోని పాఠశాల విద్యపై భారీ పిడుగుపాటులా పరిణమించాయి. ఫలితంగా తల్లిదండ్రులు తమ చిన్నారుల చేతుల్లోని పుస్తకాలను లాగేసి, కుటుంబ ఆర్థిక అవసరాలు తీరేందుకు వారిని ప్రమాదకరమైన పనుల్లోకి నెడుతున్నారు.వేల మైళ్ల దూరంలో యుద్ధ సెగలుఇరాన్ కేంద్రంగా సాగుతున్న ఉద్రిక్తతలు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులకు దారితీస్తున్నాయి. ముడి చమురు, రవాణా ఛార్జీల పెరుగుదల వల్ల పేద దేశాల్లో సామాన్య కుటుంబాల బడ్జెట్ పూర్తిగా తలకిందులైంది. బతుకుదెరువు భారంగా మారడంతో, సరిహద్దు రేఖకు వేల కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న అట్టడుగు వర్గాల పిల్లల చదువులు అర్ధాంతరంగా ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది.బోటు ప్రయాణం భారం.. తప్పని బాల కార్మికులుకంబోడియాలోని టోన్లే సాప్ సరస్సు సరిహద్దుల్లో నివసించే 13 ఏళ్ల సౌ శ్రేయ్నిచ్ పరిస్థితి ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. భవిష్యత్తులో ఉపాధ్యాయురాలు కావాలని కలలు కంటున్న ఈ బాలిక చదువు ఇప్పటికే ఎంతో ఆలస్యమైంది. చేపల వేటపై ఆధారపడే ఆమె కుటుంబం, డీజిల్ ధరలు పెరగడంతో వేట సాగించలేకపోతోంది. దీంతో కుటుంబ పోషణ కోసం చదువును మధ్యలోనే ఆపేసి, తల్లిదండ్రులతో కలిసి శ్రమించాల్సిన దుస్థితి నెలకొంది.యూనిసెఫ్ హెచ్చరిక: పేదరికంలోకి మరో 2.34 కోట్ల మందిఐక్యరాజ్యసమితి బాలల నిధి (యూనిసెప్) నివేదిక ప్రకారం ఈ సంక్షోభ ప్రభావం ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా అదనంగా 2.34 కోట్ల మంది పిల్లలు తీవ్ర పేదరికంలోకి చేరుకుంటారు. ఇందులో సుమారు 80 శాతం మంది చిన్నారులు ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని పేద దేశాలకు చెందినవారే ఉండటం అంతర్జాతీయ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.హోటల్ పనుల్లోకి బాలికలువియత్నాంలో 16 ఏళ్ల లీ, 13 ఏళ్ల న్హీ అనే అక్కాచెల్లెళ్ల కుటుంబం డీజిల్ ధరల పెరుగుదల వల్ల తీవ్ర ఇబ్బందుల్లో పడింది. వారి తండ్రి చేపల వేట ఆగిపోవడంతో, తొమ్మిది మంది పిల్లల కుటుంబ పోషణ కష్టమై, ఆ ఇద్దరు బాలికలు హనోయ్లోని ఒక రెస్టారెంట్లో ప్రమాదకరమైన పనుల్లో చేరాల్సి వచ్చింది. బాల కార్మిక చట్టాల ఉల్లంఘనకు దారితీసిన ఈ పరిస్థితిని గుర్తించిన బ్లూ డ్రాగన్ చిల్డ్రన్స్ ఫౌండేషన్ జోక్యంతో వారు తిరిగి పాఠశాలకు చేరుకోగలిగారు.పాఠశాలల నిర్వహణపై తీవ్ర వ్యయ భారంఇంధన ధరల భారం విద్యార్థుల ప్రయాణానికే కాకుండా పాఠశాలల నిర్వహణపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. మారుమూల ప్రాంతాలకు ఉపాధ్యాయులు చేరుకోవడం, విద్యా సామగ్రి సరఫరా చేయడం, విద్యుత్ ఛార్జీలు చెల్లించడం వంటివి పాఠశాలలకు భారంగా మారాయి. ప్రభుత్వాలు ఇంధన, ఆహార సబ్సిడీలకే ఎక్కువ నిధులు కేటాయించాల్సి రావడంతో విద్య, వైద్య రంగాల బడ్జెట్లపై తీవ్ర కోతలు పడుతున్నాయి.మధ్యాహ్న భోజనంపై ప్రభావంప్రపంచవ్యాప్తంగా దాదాపు 46.6 కోట్ల మంది పిల్లలు బడిలో పెట్టే మధ్యాహ్న భోజనంపైనే ఆధారపడి చదువుకుంటున్నారు. రవాణా, ఎరువుల ధరలు పెరగడంతో ఈ పథకాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతోంది. మరోవైపు, దక్షిణాసియా వంటి ప్రాంతాల్లో ఆర్థిక ఒత్తిడి పెరిగినప్పుడు మగపిల్లల చదువులకే ప్రాధాన్యం ఇస్తూ, ఆడపిల్లలను బడి మానిపించడం, బాల్య వివాహాలు చేయడం పెనుముప్పులా పరిణమించిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇది కూడా చదవండి: జాబిల్లిపై రాకెట్ క్రాష్.. భారీ గుంతను గుర్తించిన నాసా! -
ట్రంప్ మ్యాప్ల సంబరం!
హార్మూజ్ జలసంధిని ‘చాలా త్వరలోనే’ అమెరికా భూభాగంగా మారుస్తానని గతవారం ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పుడు ఇరాన్పై మళ్లీ భీకర దాడులకు తెగబడొచ్చని కొందరు అనుమానించారు. తీరా మంగళవారం ఆయన చేసిందల్లా ‘అమెరికా కొత్త భూభాగం’ అని రాసివున్న హార్మూజ్ జలసంధి మ్యాప్ను విడుదల చేయటమే. దీంతో ఇరాన్ దౌత్యవేత్తలు ప్రతిదాడికి దిగారు. కాలిఫోర్నియాను ఇరాన్ భూభాగంగా చూపుతూ ఇరాన్ కాన్సులేట్ ఒక చిత్రపటాన్ని విడుదల చేసింది. వేరే దేశాల భూభాగాలు డిమాండ్ చేయటం, వాటిని అమెరికా భౌగోళిక చిత్రపటాల్లో భాగంగా చూపటం ట్రంప్కు కొత్తేం కాదు. రెండోసారి అధికారంలోకొచ్చిన వెంటనే గ్రీన్లాండ్పై ఆయన కన్నుపడింది. అలాగే కెనడాను అమెరికాలో విలీనం చేసుకుని 51వ రాష్ట్రంగా మారుస్తామనీ, పనామా కాల్వ ఇకపై తమదేననీ, గాజాను ‘సొంతం’ చేసుకుంటామనీ కూడా పలుమార్లు చెప్పారు. అందుకు సంబంధించి ఒక వీడియో రూపొందించి విడుదల చేశారు. వెనిజులా మ్యాప్లో అమెరికా జెండాను సూచించే రంగులు నింపారు. అలాగే ఇకపై గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా వ్యవహరించాలంటూ ఉత్తర్వులు జారీచేశారు. అట్లాంటిక్ మహాసముద్రంలోని ఈ ప్రాంతం మెక్సికోకు పశ్చిమ, దక్షిణ దిశల్లో, అమెరికాకు ఉత్తరంవైపు, క్యూబాకు ఆగ్నేయంవైపు ఉంది. పేరు మార్చినా ప్రాదేశిక జల పరిధులేమీ మారడంలేదు గనుక మెక్సికో, క్యూబాలు ఈ విషయంలో మౌనంగా ఉండిపోయాయి. ఇక పర్షియన్ గల్ఫ్ పేరును గల్ఫ్ ఆఫ్ అరేబియాగా మారుస్తామని తొలి ఏలుబడిలో 2017లో ప్రకటించారు. దాంతో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ జాగ్రఫీ చదువుకోమని ట్రంప్కు సలహా ఇచ్చారు. నిరుడు మే నెలలో సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ పర్యటనకెళ్లే ముందు పేరు మార్పు ఉంటుందని ప్రకటించారు. అటు తర్వాత ఎందుకో దాని జోలికి పోలేదు. ఈ ‘భౌగోళిక చిత్రపట దురాక్రమణల్ని’ చూసి జనం కాలక్షేపానికి నవ్వుకోవచ్చు. ట్రంప్ ప్రదర్శిస్తున్న అమాయకత్వమో, అజ్ఞానమో చూసి జాలిపడే వారూ ఉండొచ్చు. కానీ అగ్ర రాజ్యాల చరిత్ర తెలిసినవారు దాన్నంత తేలిగ్గా వదిలేయరు. ఒక విశాల పాలస్తీనా భూభాగంలోకి కొన్ని దశాబ్దాల్లో భారీయెత్తున యూదుల్ని తరలించి, అక్కడ నరమేధాలకు పాల్పడి ఇజ్రాయెల్ను సృష్టించి, అందుకు ఐక్యరాజ్యసమితి ఆమోదాన్ని ‘రాబట్టిన’ చరిత్ర ఆ దేశాలది. కనుక ఇప్పుడు ఉబుసుపోక మాట్లాడే మాటల్లో వేరే అర్థాలు ఉండొచ్చన్న అనుమానాలు రావటం సహజం. రాజకీయావతారం ఎత్తి దాదాపు పదిహేనేళ్లవుతున్నా పూర్వాశ్రమంలో నిర్వహించిన రియలెస్టేట్ వ్యాపార ప్రభావంనుంచి ట్రంప్ బయటపడలేకపోతున్నారన్నది వాస్తవం. రియలెస్టేట్ యజమాని మాదిరే ఆయన భూదాహంతో అల్లాడిపోతున్నారు. ‘మళ్లీ అమెరికాను ఉన్నతంగా చేద్దాం’ అనే నినాదం సారాంశం ఖనిజ సంపద పుష్కలంగా ఉండే ప్రాంతాలను అమెరికాలో విలీనం చేసుకోవటమేనన్న సందేశాన్ని ట్రంప్ పంపుతున్నారు. అందుకే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ గ్రీన్లాండ్ సందర్శనకెళ్లినప్పుడు డెన్మార్క్, గ్రీన్లాండ్ల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. దాంతో చేసేదిలేక ఆమె మధ్యలోనే ఆ పర్యటనను విరమించుకుని వెనక్కిపోవాల్సి వచ్చింది. జనం భావోద్వేగాలు రెచ్చగొట్టి అధికారంలోకొచ్చినవారు వాటిపైనే మనుగడ సాగించాలనుకోవటం సహజం. అలాగైతేనే వారి వైఫల్యాలు మరుగునపడతాయి మరి. ఈ బాపతు నేతలు అందరి దృష్టి తమపైనే ఉండాలన్న తపనతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ట్రంప్ దీనికి భూదాహాన్ని కూడా చేర్చారు. ఈ భౌగోళిక చిత్రపటాల్ని చూసిన ‘మాగా’ జనం నిజంగానే ట్రంప్ వాటిని జయించుకొస్తారన్న భ్రమల్లో ఉంటారు. ఒకపక్క అరేబియా సముద్రంలో లంగరేసిన విమానవాహక నౌక యూఎస్ఎస్ అబ్రహాం లింకన్లో దుర్భర పరిస్థితులున్నాయనీ, కొందరు ఆత్మహత్యా యత్నం కూడా చేశారనీ వార్తలొస్తున్నాయి. అందులో పనిచేసే రక్షణ సిబ్బందిని వెనక్కు పిలిపించాలని వారి కుటుంబాలనుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. అందుకే చవకబారు చిత్రపట వివాదాలు కట్టిపెట్టి ఇరాన్తో సంధికి ప్రయత్నించడం అమెరికా శ్రేయస్సుకు, రాజకీయంగా ట్రంప్కు మంచిది. -
ముందుచూపే ఇరాన్ను బతికించిందా?.. ఇక మీదట ఎలా?
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుతున్నాయి. ఇప్పటికే యుద్ధం, సముద్ర దిగ్బంధనం, చమురు ఎగుమతులపై ఆంక్షలతో సతమతమవుతున్న ఇరాన్పై మరిన్ని కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. గతంలో ఎన్నడూ లేనంత కఠినమైన చర్యలు తీసుకుంటామని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ హెచ్చరించారు. ఈ పరిస్థితిని ముందే అంచనా వేసిన ఇరాన్ ప్రభుత్వం.. ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టింది? ఇక మీదట ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతోంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇరాన్పై అమెరికా ఇప్పటికే విస్తృతమైన ఆంక్షలు అమలు చేస్తోంది. 2025 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు వెయ్యికి పైగా ఇరాన్కు చెందిన వ్యక్తులు, నౌకలు, విమానాలపై ఆంక్షలు విధించింది. ఇప్పుడు ఈ జాబితాను మరింత విస్తరించేందుకు వాషింగ్టన్ సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఇరాన్ చమురు వ్యాపారానికి సహకరిస్తున్న సంస్థలు, ఆర్థిక లావాదేవీలు, రవాణా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. ఇరాన్ చమురుకు చైనా ప్రధాన కొనుగోలుదారు. దీంతో అక్కడి చిన్న రిఫైనరీలపై అమెరికా ఇప్పటికే ద్వితీయ ఆంక్షలు విధించింది. ఇరాన్తో లావాదేవీలు నిర్వహించే పెద్ద చైనా బ్యాంకులపైనా చర్యలు తీసుకునే అవకాశముందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే ఇరాన్ చమురు ఆదాయానికి మరింత గండి పడటమే కాకుండా అమెరికా–చైనా సంబంధాలపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.హర్ముజ్ మూసుకుపోతే..ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు మరో కీలక సమస్య హర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు, సహజవాయువు రవాణాలో యుద్ధానికి ముందు దాదాపు ఐదో వంతు ఈ మార్గం గుండా సాగేది. ఇప్పుడు యుద్ధం, దిగ్బంధనం కారణంగా నౌకల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా ఇరాన్కు మాత్రమే కాకుండా అంతర్జాతీయ ఇంధన మార్కెట్కూ ఆందోళన మొదలైంది.అయితే హర్ముజ్ను తెరిచే విషయంలో ఇరాన్ కూడా తన షరతులను స్పష్టం చేస్తోంది. అమెరికా దిగ్బంధనం ఎత్తివేయడం, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, చమురు ఆంక్షలు తొలగించడం, సైనిక చర్యలను నిలిపివేయడం వంటి హామీలు లభించే వరకు జలసంధిని తెరవబోమని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ గాలిబాఫ్ స్పష్టం చేశారు.సముద్ర మార్గం దెబ్బతింటే..హర్ముజ్ సంక్షోభం సుదీర్ఘమైతే దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఇరాన్ ముందుగానే గుర్తించింది. సముద్ర మార్గాల్లో సరుకుల రవాణా దెబ్బతిన్నా దేశంలో ఆహారం, వినియోగ వస్తువులు, పారిశ్రామిక ముడిసరుకుల కొరత రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకుంది. పాకిస్థాన్, టర్కియే తదితర దేశాలతో ఉన్న భూ సరిహద్దుల ద్వారా సరుకులను దిగుమతి చేసుకుంటోంది. కాస్పియన్ సముద్రం మీదుగా రష్యా, మధ్య ఆసియా దేశాల నుంచి సరుకులను తీసుకొచ్చే మార్గాలపైనా దృష్టి పెట్టింది.యుద్ధానికి ముందే సరిహద్దు ప్రావిన్సులకు కొన్ని అధికారాలు అప్పగించి అత్యవసర వస్తువుల నిల్వలను పెంచుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడు ఆ ముందస్తు నిల్వలే సంక్షోభ సమయంలో ఇరాన్కు కొంత ఊరటనిస్తున్నాయి.చమురు ఆదాయం తగ్గితే..అయితే ప్రత్యామ్నాయ దిగుమతి మార్గాలు ఉన్నప్పటికీ ఇరాన్కు అసలు సమస్య ఆదాయమే. దేశ ఆర్థిక వ్యవస్థకు చమురు ప్రధాన ఆదాయ వనరు. యుద్ధం, ఆంక్షలు, రవాణా సమస్యల కారణంగా చమురు ఎగుమతులు దెబ్బతింటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోతుంది. అదే సమయంలో యుద్ధంతో దెబ్బతిన్న మౌలిక వసతుల పునర్నిర్మాణానికి అదనపు ఖర్చులు అవసరమవుతాయి.ఇప్పటికే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, తక్కువ వేతనాలు, ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. చమురు ఆదాయం మరింత పడిపోతే ఈ భారమంతా సామాన్య ప్రజలపై పడే ప్రమాదం ఉంది.ఇంధన కొరత ముంచుకొస్తుందా?చమురు ఎగుమతుల సమస్యకు తోడు ఇరాన్కు ఇంధన సరఫరా కూడా సవాలుగా మారుతోంది. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా వ్యవస్థలు యుద్ధానికి ముందే ఒత్తిడిలో ఉన్నాయి. దిగ్బంధనం మరింతకాలం కొనసాగితే ఈ రంగాల్లో సంక్షోభం తీవ్రమయ్యే అవకాశం ఉంది.శరదృతువు, చలికాలం వరకు పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంధనం, విద్యుత్, గ్యాస్ కొరత ఏర్పడవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిశ్రమలకు తాత్కాలికంగా విద్యుత్ సరఫరా తగ్గించి.. గృహ అవసరాలకు సరఫరాను కాపాడాల్సిన పరిస్థితి రావచ్చని వియన్నా ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ స్టడీస్కు చెందిన ఆర్థికవేత్త మహ్దీ ఘోద్సీ పేర్కొన్నారు.ఇంధన వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఇప్పటికే వ్యక్తిగత వాహనాలకు ఇచ్చే సబ్సిడీ పెట్రోల్ కోటాలను తగ్గించింది. ఇంధన ధరలు పెంచే అంశాన్నీ పరిశీలిస్తోంది.యుద్ధానికి ముందే బలహీనంగా..ఇరాన్ ఆర్థిక సంక్షోభానికి ప్రస్తుత యుద్ధమే కారణం కాదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న అమెరికా ఆంక్షలు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి ఒంటరితనం, దేశీయ అవినీతి, పాలనా వైఫల్యాలు ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచాయి. ఇప్పుడు వీటికి యుద్ధం, సముద్ర దిగ్బంధనం, చమురు ఎగుమతుల అంతరాయం తోడయ్యాయి.అంటే ఇరాన్ ప్రస్తుతం ఒకేసారి రెండు యుద్ధాలు చేస్తోంది. బయట సైనిక పోరాటం కొనసాగుతుండగా.. లోపల ఆర్థిక వ్యవస్థను కుప్పకూలకుండా కాపాడుకునే పోరాటం సాగుతోంది.పెజెష్కియాన్ ప్రభుత్వం ఏం చేస్తోంది?ఈ పరిస్థితుల్లో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రభుత్వం వచ్చే రెండేళ్లకు ఆర్థిక స్థిరీకరణ లక్ష్యాలను నిర్దేశించుకుంది. మార్కెట్లను స్థిరీకరించడం, ప్రజల జీవనోపాధిని రక్షించడం, దేశ ఆర్థిక స్థైర్యాన్ని పెంచడం ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకుంది. అయితే అత్యవసర చర్యలు కొంతకాలం మాత్రమే ఉపశమనం కల్పించగలవని నిపుణులు చెబుతున్నారు. అమెరికా, పశ్చిమ దేశాలు, ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలను తగ్గించడంతో పాటు దేశీయంగా ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.ఇక ముందు ఎలా?ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ ముందు రెండు ప్రధాన మార్గాలు కనిపిస్తున్నాయి. అమెరికాతో రాజీకి వచ్చి ఆంక్షలు, దిగ్బంధనం నుంచి ఉపశమనం పొందడం ఒకటి. ఒత్తిడికి తలొగ్గకుండా సైనిక, ఆర్థిక ప్రతిఘటనను కొనసాగించడం రెండోది. ఇరాన్ ఇప్పటివరకు రెండో మార్గానికే ఎక్కువగా మొగ్గు చూపుతోంది. అయితే యుద్ధం, హర్ముజ్ సంక్షోభం, చమురు ఎగుమతుల అంతరాయం మరింతకాలం కొనసాగితే ఇరాన్ ముందస్తు ఏర్పాట్లకు కూడా పరిమితులు ఏర్పడే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ దిగుమతి మార్గాలు, అత్యవసర నిల్వలు కొంతకాలం దేశాన్ని ఆదుకోగలిగినా.. చమురు ఆదాయం లేకుండా దీర్ఘకాలం ఆర్థిక వ్యవస్థను నడపడం మాత్రం కష్టమే.అదే సమయంలో హర్ముజ్ జలసంధి సంక్షోభం ఇరాన్ సరిహద్దులు దాటి ప్రపంచాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. చమురు సరఫరా తగ్గితే అంతర్జాతీయంగా ధరలు పెరగవచ్చు. ఇంధన ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కూడా పెరిగే ప్రమాదం ఉంది. -
ఇరాన్తో సంబంధాలు కట్.. యూఏఈ సంచలన ఆరోపణలు
పశ్చిమాసియా సంక్షోభం మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. ఇరాన్–యూఏఈ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. గల్ఫ్లో నౌకాయానాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని యూఏఈ ఆరోపించగా.. ఆ వాదనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇవి పూర్తిగా నిరాధార ఆరోపణలని, ఇలాంటి ప్రకటనలు ప్రాంతీయ శాంతి, భద్రతకు విఘాతం కలిగిస్తాయని ఇరాన్ విదేశాంగశాఖ స్పష్టం చేసింది. మరోవైపు.. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్తో అన్ని రకాల వాణిజ్య, ఆర్థిక లావాదేవీలను తదుపరి ఆదేశాలు వెలువడే వరకు నిలిపివేస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది.మంగళవారం గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ నుంచి రెండు బాలిస్టిక్ క్షిపణులు తమ వైపు దూసుకొచ్చినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. తమ వైమానిక రక్షణ వ్యవస్థలు ఈ రెండు క్షిపణులను గుర్తించాయని పేర్కొంది. వాటిలో ఒకటి యూఏఈ ప్రాదేశిక జలాల వెలుపల సముద్రంలో పడగా.. మరో క్షిపణి తమ ప్రాదేశిక జలాల్లోనే కూలిపోయిందని వెల్లడించింది.ఆ తర్వాత విడుదల చేసిన మరో ప్రకటనలో.. ఈ రెండు క్షిపణులు సముద్ర రవాణాను లక్ష్యంగా చేసుకున్నట్లు తమ అంచనాల్లో తేలిందని యూఏఈ పేర్కొంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా భారీ నష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు.‘నిరాధార ఆరోపణలు’.. ఇరాన్ కౌంటర్యూఏఈ ఆరోపణలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమ దేశం నుంచి యూఏఈపై క్షిపణి ప్రయోగించారన్న ఆరోపణలను ‘పూర్తిగా ఖండిస్తున్నట్లు’ ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు. ప్రాంతీయ దేశాల మధ్య విశ్వాసాన్ని పెంచే ప్రయత్నాలకు ఇలాంటి ఆరోపణలు విఘాతం కలిగిస్తాయని అన్నారు. పొరుగు దేశాలతో సత్సంబంధాల సూత్రాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి నిరాధార ఆరోపణలకు దూరంగా ఉండాలని యూఏఈ సహా ప్రాంతీయ దేశాలకు సూచించారు.అమెరికా, ఇజ్రాయెల్ చర్యల కారణంగా ఇప్పటికే మధ్యప్రాచ్యంలో పరిస్థితులు సంక్లిష్టంగా మారాయని బఘాయీ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో తప్పుడు ఆరోపణలు చేయడం ప్రాంతీయ భద్రతను మరింత దెబ్బతీస్తుందని అన్నారు.యూఏఈలో మిసైల్ అలర్ట్ఈ ఆరోపణలకు కొద్దిసేపటి ముందు యూఏఈ ప్రజలకు ఫోన్ ద్వారా అత్యవసర హెచ్చరిక సందేశం వచ్చింది. ‘సంభావ్య క్షిపణి ముప్పు’ ఉన్నందున సమీపంలోని సురక్షిత భవనంలోకి వెళ్లాలని అధికారులు సూచించారు. కొద్దిసేపటికే ఆ అలర్ట్ను ఉపసంహరించుకున్నారు.జూన్లో తప్పుడు అలారం వెలువడిన తర్వాత.. జూలైలో జరిగిన మరో ఘటనలో క్షిపణి యూఏఈ భూభాగంలోకి ప్రవేశించకపోయినప్పటికీ హెచ్చరిక జారీ చేశారు. తాజాగా వచ్చిన అలర్ట్ మాత్రం ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో మరింత ఆందోళనకు దారితీసింది.ఇరాన్తో సంబంధాలు కట్!తాజా పరిణామాల నేపథ్యంలో యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్తో అన్ని రకాల వాణిజ్యం, వాణిజ్య మార్పిడి, ఆర్థిక లావాదేవీలను తదుపరి ఆదేశాలు వెలువడే వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యూఏఈ విదేశాంగశాఖ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అఫ్రా అల్ హమెలీ.. ప్రాంతీయ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతల్లో ఉన్న ఇరాన్–యూఏఈ సంబంధాలు మరింత దిగజారే పరిస్థితి ఏర్పడింది.ఇప్పటికే ఆయిల్ ట్యాంకర్లపై దాడులుయూఏఈకి చెందిన ప్రభుత్వ చమురు సంస్థ ADNOC ట్యాంకర్లు గత కొన్ని వారాలుగా వరుస దాడులకు గురవుతున్నాయి. దీంతో గల్ఫ్ ప్రాంతంలో సముద్ర రవాణా భద్రతపై ఆందోళనలు పెరిగాయి.ఫిబ్రవరి 28న మధ్యప్రాచ్య యుద్ధం ప్రారంభమైన సమయంలో ఇరాన్ దాడుల్లో యూఏఈ తీవ్రంగా ప్రభావితమైన దేశంగా నిలిచింది. దాదాపు 3,000 క్షిపణులు, డ్రోన్లు యూఏఈ వైపు ప్రయోగించినట్లు సమాచారం. అయితే జూన్లో ఇరుపక్షాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత కొంతకాలం దాడులు తగ్గాయి. తాజాగా ఆ ఒప్పందం కుప్పకూలడంతో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి.‘హర్ముజ్ మూసివేత కొనసాగుతుంది’మరోవైపు ఇరాన్ కీలక హెచ్చరిక చేసింది. ప్రపంచంలోని అత్యంత వ్యూహాత్మక చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగుతుందని స్పష్టం చేసింది. అమెరికాతో శాంతి ఒప్పందం కుదిరే వరకు హర్ముజ్ను తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ తన వైఖరిని వెల్లడించింది. యూఏఈ నుంచి గల్ఫ్ వెలుపలికి వెళ్లే నౌకలకు హర్ముజ్ కీలక మార్గం కావడంతో.. ఇరాన్ తాజా ప్రకటన యూఏఈ ఆర్థిక వ్యవస్థతో పాటు అంతర్జాతీయ చమురు రవాణాపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.హర్ముజ్.. మరోసారి యుద్ధ కేంద్రంగా!ఒకవైపు క్షిపణి ఆరోపణలు, మరోవైపు వాణిజ్య ఆంక్షలు, ఇంకోవైపు హర్ముజ్ మూసివేతపై ఇరాన్ హెచ్చరికలు.. మొత్తంగా గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది. ఇరాన్ ఆరోపణలను ఖండిస్తున్నప్పటికీ.. యూఏఈ మాత్రం సముద్ర రవాణాపై ముప్పు పెరిగిందని చెబుతోంది. ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్ముజ్పై ఆధిపత్యం తమదేనంటూ ఓ మ్యాప్(ఏఐ జనరేటెడ్) రిలీజ్ చేశారు కూడా. ఈ నేపథ్యంలో హర్ముజ్ జలసంధి చుట్టూ పరిణామాలు తదుపరి రోజుల్లో మరింత కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. -
హర్ముజ్లో ఒక్కసారిగా మారిన సీన్
ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ ముదురుతున్న వేళ.. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరు మరింత ఉత్కంఠగా మారింది. ఈ వ్యూహాత్మక జలమార్గంపై తమదే పైచేయి అని ఇరాన్ చెప్పుకుంటోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ అడుగు ముందుకేసి తమ భూభాగంలోకే వస్తుందంటూ మ్యాప్ రిలీజ్ చేశారు. అయితే.. తాజా షిప్పింగ్ గణాంకాలు మాత్రం ఆసక్తికర విషయాన్ని వెల్లడిస్తోంది.గత రెండు వారాల్లో హర్ముజ్ గుండా ప్రయాణించిన నౌకల్లో అత్యధిక శాతం ఒమన్ వైపు ఉన్న మార్గాన్ని ఎంచుకున్నాయి. దీంతో హర్ముజ్పై ఇరాన్ గతంలో ఉన్నంత స్థాయిలో నియంత్రణ కొనసాగించడం కష్టమవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో అమెరికా నౌకాదళ బలగాల ఉనికి, ఇరాన్ నౌకలపై దాడుల భయం, చమురు రవాణా మార్గాల్లో మార్పులు.. ఈ జలసంధిలో శక్తి సమీకరణాలు వేగంగా మారుతున్నాయని స్పష్టం చేస్తున్నాయి.షిప్పింగ్ డేటా సంస్థ కేప్లర్ గణాంకాల ప్రకారం.. గత రెండు వారాల్లో హర్ముజ్ జలసంధి గుండా వెళ్లిన నౌకల్లో 80 శాతానికి పైగా ఒమన్ వైపు ఉన్న మార్గాన్ని ఉపయోగించాయి. ఈ మార్గాన్ని ఐక్యరాజ్యసమితి అనుమతించినప్పటికీ.. ఇరాన్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.నెల రోజుల క్రితం వరకు ఈ మార్గంలో దాదాపు ఎలాంటి నౌకా రాకపోకలు లేవని కేప్లర్ తెలిపింది. ఇప్పుడు మాత్రం పెద్ద సంఖ్యలో వాణిజ్య నౌకలు ఇరాన్ అభ్యంతరాలను పక్కనబెట్టి ఒమన్ వైపు నుంచి ప్రయాణిస్తున్నాయి. ఇరాన్ ఉత్తర ఒమన్ తీరానికి సమీపంలోని మార్గాలను ఉపయోగించే నౌకలను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ.. అమెరికా నౌకాదళ రక్షణపై ఆధారపడుతూ కొన్ని నౌకలు ఆ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి.కేప్లర్ క్రూడ్ ఆయిల్ విశ్లేషణ విభాగం అధిపతి హోమయూన్ ఫలక్షాహీ స్పందిస్తూ.. హర్ముజ్పై ఇరాన్ కొంతవరకు నియంత్రణ కోల్పోయినట్లు కనిపిస్తోంది అని అంటున్నారు.ఇరాన్ టోల్ వసూళ్లకూ బ్రేక్!హర్ముజ్ గుండా ప్రయాణించే నౌకల నుంచి రవాణా రుసుములు వసూలు చేయాలని ఇరాన్ గతంలో ప్రయత్నించింది. అయితే నౌకలు ఇరాన్ ప్రాధాన్యమిస్తున్న మార్గాన్ని కాకుండా ఒమన్ వైపు ఉన్న మార్గాన్ని ఎంచుకోవడంతో ఆ ప్రయత్నాలను అమలు చేయడం కష్టంగా మారింది. ఇరాన్ టోల్ వసూలు చేయాలన్న ప్రతిపాదనను మధ్యప్రాచ్యంలోని చాలా దేశాలు అంగీకరించడం లేదని పికరింగ్ ఎనర్జీ పార్ట్నర్స్ వ్యవస్థాపకుడు డాన్ పికరింగ్ పేర్కొన్నారు.అంటే.. నౌకల రాకపోకలను బెదిరించడం మాత్రమే కాకుండా వాటి నుంచి తన నిబంధనల ప్రకారం రుసుములు వసూలు చేయాలన్న ఇరాన్ ప్రయత్నానికీ ఇప్పుడు పరిమితులు ఏర్పడుతున్నాయి.చమురు ట్యాంకర్లలో ‘డార్క్ ట్రాఫిక్’హర్ముజ్ ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాలు చమురు రవాణాలో కొత్త మార్గాలను అనుసరిస్తున్నాయి. కువైట్, సౌదీ అరేబియా, యూఏఈలు వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్స్ (వీఎల్సీసీ)ను ఉపయోగించి పెర్షియన్ గల్ఫ్ నుంచి హర్ముజ్ మీదుగా చమురును తరలిస్తున్నాయి. ప్రమాదకర ప్రాంతాన్ని దాటిన తర్వాత గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఇతర ట్యాంకర్లకు చమురును బదిలీ చేస్తున్నట్లు సమాచారం.ఇరాన్ దాడుల ముప్పు నుంచి తప్పించుకునేందుకు కొన్ని ట్యాంకర్లు తమ ట్రాన్స్పాండర్లను ఆపివేస్తున్నాయి. కొన్ని నౌకలు వారాలపాటు తమ గుర్తింపు సంకేతాలను నిలిపివేస్తున్నాయి. దీంతో సాధారణ షిప్పింగ్ ట్రాకింగ్ వ్యవస్థలకు అవి కనిపించకుండా పోతున్నాయి. ఈ విధానాన్ని ‘డార్క్ ట్రాఫిక్’గా వ్యవహరిస్తున్నారు. ఉపగ్రహ చిత్రాలు, ఇతర సాంకేతిక వ్యవస్థలతో కొన్ని నౌకలను గుర్తించగలిగినా.. వాటి కదలికలను పూర్తిస్థాయిలో అంచనా వేయడం కష్టమవుతోంది.ట్రంప్.. అదే మాటమరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం హర్ముజ్పై అమెరికాదే పైచేయి అని స్పష్టం చేస్తున్నారు. అమెరికా నౌకాదళ బలగాలు ఈ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. హర్ముజ్పై తమకు పూర్తి నియంత్రణ ఉందని ట్రంప్ ప్రకటించారు.మంగళవారం మరింత దూకుడుగా స్పందించిన ఆయన.. హర్ముజ్ను అమెరికా నియంత్రణలోకి తీసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. అంతేకాదు.. జలసంధి మ్యాప్ను షేర్ చేస్తూ దానిని ‘కొత్త అమెరికా భూభాగం’గా అభివర్ణించారు. అమెరికా ఇంధనశాఖ మంత్రి క్రిస్ రైట్ స్పందిస్తూ.. హర్ముజ్ గుండా వెళ్తున్న చమురు, హర్ముజ్ను తప్పించి ఇతర మార్గాల ద్వారా తరలిస్తున్న చమురు కలిపి ఒక వారంలో రోజుకు సుమారు 1.5 కోట్ల బ్యారెళ్లకు చేరుకుంది.యుద్ధానికి ముందు హర్ముజ్ ప్రాంతం గుండా రోజుకు సుమారు 2 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా జరిగేది. ప్రస్తుత ప్రవాహం దానికి దగ్గరగా ఉండటాన్ని చూపిస్తూ.. ఇరాన్ హర్ముజ్ను పూర్తిగా మూసివేయడంలో విఫలమైందని అమెరికా వాదిస్తోంది.అరాఘ్చీ కౌంటర్ఇరాన్–అమెరికా మధ్య మాటల యుద్ధం కూడా తీవ్రంగా కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్తో ఎలాంటి చర్చలు జరగడం లేదని, ప్రస్తుతం ఎలాంటి చర్చలు షెడ్యూల్ కాలేదని చెప్పారు. అమెరికా నౌకాదళ దిగ్బంధం కొనసాగుతోందని, హర్ముజ్లోని సముద్రపు గనులను తొలగించినట్లు కూడా ఆయన ప్రకటించారు. దీనికి భిన్నంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఘాటుగా స్పందించారు. అమెరికా తన లక్ష్యాలను సాధించలేకపోవడంతో ఇప్పుడు ఇరాన్ షరతులపై చర్చలు జరపాలని ‘వేడుకుంటోంది’ అని వ్యాఖ్యానించారు.ఇరాన్–యూఏఈ మధ్యా ఉద్రిక్తత!హర్ముజ్ సంక్షోభం నేపథ్యంలో ఇరాన్–యూఏఈ మధ్య కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సముద్ర రవాణాను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. వాటిలో ఒక క్షిపణి యూఏఈ ప్రాదేశిక జలాల్లో పడిందని.. మరో క్షిపణి ఆ జలాలకు వెలుపల సముద్రంలో పడిందని తెలిపింది.అయితే ఈ ఆరోపణలను ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ ఖండించారు. అవి నిరాధార ఆరోపణలని.. ఇలాంటి వ్యాఖ్యలు ఇరుగు పొరుగు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసి ప్రాంతీయ నమ్మకాన్ని బలహీనపరుస్తాయని అన్నారు.మరోవైపు.. ఇరాన్తో వాణిజ్యం, వాణిజ్య మార్పిడి, ఆర్థిక లావాదేవీలన్నింటినీ తదుపరి ఆదేశాలు వెలువడే వరకు నిలిపివేస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది.చమురు ధరలపై ప్రభావంహర్ముజ్ ఉద్రిక్తతలు అంతర్జాతీయ చమురు మార్కెట్పైనా ప్రభావం చూపుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 59 సెంట్లు లేదా 0.7 శాతం పెరిగి బ్యారెల్కు 91.46 డాలర్లకు చేరాయి. మూడు వారాల తర్వాత తొలిసారిగా ఈ స్థాయికి చేరడం గమనార్హం. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) ధర 75 సెంట్లు లేదా 0.9 శాతం పెరిగి 85.25 డాలర్లకు చేరింది. హర్ముజ్ మీదుగా చమురు రవాణాకు అంతరాయం కొనసాగితే.. సరఫరా భయాలు మరింత పెరిగి ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.ఇరాన్–ఒమన్ చర్చలపై ఆశలుహర్ముజ్లో నౌకాయానాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇరాన్, ఒమన్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇరుదేశాలకు జలసంధి తీర ప్రాంతాలు ఉండటంతో స్వేచ్ఛాయుత నౌకాయానంపై ఒక ఒప్పందం కుదిరే అవకాశాలపై ఆసక్తి నెలకొంది. అమెరికా ప్రత్యక్ష భాగస్వామ్యం లేకుండా ఈ చర్చలు జరగడం ట్రంప్కు అసంతృప్తి కలిగించినట్లు తెలుస్తోంది.ఇరాన్–ఒమన్ మధ్య హర్ముజ్ రవాణా ఒప్పందం కుదిరిన తర్వాతే అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలను పునఃప్రారంభించేందుకు అంతర్జాతీయ మధ్యవర్తులు ప్రయత్నించే అవకాశం ఉందని ఖతార్ విదేశాంగశాఖ ప్రతినిధి మాజెద్ అల్ అన్సారీ తెలిపారు.‘షరతులు నెరవేర్చే వరకు క్లోజ్’ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘలీబాఫ్ మాత్రం తమ వైఖరిని స్పష్టం చేశారు. అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేయడం, ఆంక్షలను తొలగించడం, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం వంటి షరతులను అమెరికా నెరవేర్చే వరకు హర్ముజ్ జలసంధి మూసే ఉంటుందని ఆయన ప్రకటించారు. దీంతో హర్ముజ్ కేవలం నౌకాయాన సమస్యగా కాకుండా.. ఇరాన్–అమెరికా మధ్య రాజకీయ, సైనిక, ఆర్థిక పోరాటానికి ప్రధాన వేదికగా మారింది.ఎవరి పట్టు ఎంత?ఇరాన్ దాడుల ముప్పుతో కొన్ని వాణిజ్య నౌకలు తమ కదలికలను గుర్తించే ట్రాన్స్పాండర్లను ఆపేస్తున్నాయి. మరికొన్ని నౌకలు ప్రమాదకర మార్గాలను వదిలి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. అదీ అమెరికా రక్షణ నడుమ. అయితే 80 శాతానికి పైగా నౌకలు ఒమన్ మార్గాన్ని ఎంచుకోవడం మాత్రం హర్ముజ్పై ఇరాన్ సంప్రదాయ ఆధిపత్యానికి గట్టి సవాలుగా మారింది. అదే సమయంలో చమురు రవాణా యుద్ధానికి ముందు స్థాయికి ఇంకా చేరుకోకపోవడం అమెరికా పూర్తి నియంత్రణ వాదనకూ పరిమితులు ఉన్నాయని చెబుతోంది. అందుకే ప్రస్తుతం హర్ముజ్లో కనిపిస్తున్నది ఒకరి సంపూర్ణ విజయం కాదనేది విశ్లేషకుల మాట. -
‘హర్మూజ్ జలసంధి మాదే’.. మ్యాప్ విడుదల చేసిన డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్/టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రపంచంలోనే అత్యంత వ్యూహాత్మక చమురు రవాణా మార్గం హర్మూజ్ జలసంధి కొత్త అమెరికా భూభాగంగా పేర్కొంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ఏఐ జనరేటెడ్ మ్యాప్ ఫొటోను పోస్ట్ చేశారు. ఇరాన్తో నెలకొన్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.అయితే, ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. హర్మూజ్ జలసంధి తమదేనని, అది తమ నియంత్రణలోనే ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. గతంలో ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాదీ మాట్లాడుతూ.. హర్మూజ్ ‘ఇరాన్దే, ఇరాన్దిగానే ఉంటుంది’ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం హర్మూజ్ను తిరిగి తెరవడం అమెరికా,ఇరాన్ చర్చల్లో ప్రధాన అంశంగా మారింది. అమెరికా ఆంక్షలు, నౌకాదళ చర్యలను ఉపసంహరించుకోవాలని ఇరాన్ కోరుతుండగా.. అమెరికా మాత్రం జలసంధి స్వేచ్ఛగా తెరవాలని ఒత్తిడి చేస్తోంది. ఇరువైపులా రాజీ కుదరకపోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. చర్చలు ఎందుకు విఫలమవుతున్నాయి?అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన 60 రోజుల అవగాహన గడువు ఆగస్టు 17న ముగిసింది. అయితే, కీలక అంశాలపై పురోగతి లేకపోవడంతో ఆ ఒప్పందాన్ని పొడిగించబోమని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. హర్మూజ్ను తెరవడం,ఇరాన్పై అమెరికా ఆంక్షలు, అమెరికా నౌకాదళ చర్యలు, ఇరాన్ అణు కార్యక్రమం వంటి అంశాలపై ఇరువర్గాల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. ఇరాన్ మాత్రం అమెరికా ముందుగా తన సైనిక ఒత్తిడిని తగ్గించి ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తోంది. అమెరికా మాత్రం ఇరాన్పై ఒత్తిడిని కొనసాగిస్తూ హర్మూజ్ జలసంధి పూర్తిగా తెరవాలని కోరుతోంది.ప్రపంచ చమురు మార్కెట్పై ప్రభావంహర్మూజ్ జలసంధి మూసివేత లేదా రవాణాపై పరిమితులు కొనసాగితే ప్రపంచ ఇంధన సరఫరాకు భారీ దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతంలోని ఉద్రిక్తతల కారణంగా నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా చమురు ధరలు, రవాణా వ్యయాలు, బీమా ఖర్చులు పెరిగే ప్రమాదం ఉంది. -
‘యుద్ధంతో జీవించలేం’.. ఇరాన్లో వినిపిస్తున్న కొత్త స్వరం
అమెరికా–ఇజ్రాయెల్తో కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ ఇరాన్లో అంతర్గత చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. యుద్ధ మార్గమా? లేక దౌత్య మార్గమా? అనే ప్రశ్నపై దేశ రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఖటామీ చేసిన వ్యాఖ్యలు టెహ్రాన్లో కొత్త చర్చకు దారితీశాయి.‘‘యుద్ధంతో ఎప్పటికీ జీవించలేం.. సమస్యలను పరిష్కరించేందుకు దౌత్య మార్గాలను అన్వేషించాలి’’ అని ఖటామీ చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుత ఇరాన్ విధానంపై పరోక్ష విమర్శలుగా భావిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లను ఎదుర్కొంటూనే.. దేశ అంతర్గత సమస్యలు, ప్రజల జీవన పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.సంస్కరణవాద నేత ఖటామీ స్వరంమహ్మద్ ఖటామీ 1997 నుంచి 2005 వరకు ఇరాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన సంస్కరణవాద భావజాలానికి దగ్గరగా ఉన్న నేతగా గుర్తింపు పొందారు. పాశ్చాత్య దేశాలతో సంబంధాల మెరుగుదల, రాజకీయ సంస్కరణలు, పరిమిత దౌత్య విధానాలకు ఆయన మద్దతు ఇచ్చేవారు. ప్రస్తుతం అధికారంలో లేకపోయినా.. ఇరాన్లో ఆయనకు ఉన్న రాజకీయ ప్రభావం కారణంగా తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా యుద్ధ వాతావరణంలో ఉన్న దేశంలో శాంతి, చర్చల ప్రస్తావన చేయడం రాజకీయంగా కీలక సంకేతంగా మారింది.‘‘ప్రజలు యుద్ధంలో జీవించలేరు’’యుద్ధం ద్వారా శాశ్వత పరిష్కారం సాధ్యం కాదని ఖటామీ స్పష్టం చేశారు. విదేశీ శక్తుల నుంచి వచ్చే బెదిరింపులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. దేశ ప్రజల ఆర్థిక పరిస్థితులు, సాధారణ జీవనం కూడా ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఉండాలని సూచించారు. అమెరికా ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిళ్లు ఇప్పటికే ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాలిక ఘర్షణలు కొనసాగితే ప్రజలపై మరింత భారం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.మరోవైపు కఠిన వైఖరిలో అధికార వర్గంఅయితే ఇరాన్ అధికార వ్యవస్థలోని కీలక వర్గాలు మాత్రం అమెరికా, ఇజ్రాయెల్ విషయంలో కఠిన వైఖరినే కొనసాగిస్తున్నాయి. సుప్రీం లీడర్ వర్గం విదేశీ ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది. ఇరాన్లో అత్యంత ప్రభావశీలమైన శక్తిగా ఉన్న ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కూడా ప్రతిఘటన విధానానికే మద్దతు ఇస్తోంది. భద్రత, విదేశాంగ విధానం, ప్రాంతీయ వ్యూహాల్లో కీలక పాత్ర పోషించే ఐఆర్జీసీ.. అమెరికా, ఇజ్రాయెల్పై వ్యతిరేకతను దేశ రక్షణలో భాగంగా చూస్తోంది.అధ్యక్షుడి పాత్ర పరిమితంప్రస్తుత ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ గతంలో దౌత్య సంబంధాల పునరుద్ధరణకు అనుకూలంగా మాట్లాడిన నేతగా గుర్తింపు పొందారు. అయితే ఇరాన్ రాజకీయ వ్యవస్థలో తుది నిర్ణయాధికారం సుప్రీం లీడర్, భద్రతా వ్యవస్థ చేతుల్లో ఉంటుంది. అందువల్ల అధ్యక్షుడి వైఖరి కంటే.. సుప్రీం లీడర్ వర్గం, సైనిక వ్యవస్థ నిర్ణయాలే కీలకంగా మారుతాయి.ఆర్థిక సమస్యలు.. ప్రజల్లో అసంతృప్తిఇరాన్లో యుద్ధ వాతావరణం, ఆంక్షలు, ఆర్థిక ఇబ్బందులు ప్రజల్లో అసంతృప్తిని పెంచుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా యువతలో ఉద్యోగాలు, జీవన ప్రమాణాలు, అంతర్జాతీయ అవకాశాలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. యుద్ధం మరింత కొనసాగితే ఈ సమస్యలు తీవ్రం కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో దేశంలో కొంత వర్గం దౌత్యానికి అవకాశం ఇవ్వాలని కోరుతోంది.ముందున్న మార్గం ఏంటి?ఖటామీ వ్యాఖ్యలు వెంటనే ఇరాన్ విదేశాంగ విధానాన్ని మార్చే అవకాశం లేకపోయినా.. దేశంలో ఉన్న అంతర్గత భిన్నాభిప్రాయాలను మాత్రం బయటపెట్టాయి. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా కఠినంగా ముందుకు వెళ్లాలనే వర్గం.. మరోవైపు దేశ ప్రయోజనాల కోసం చర్చలకు అవకాశం ఇవ్వాలనే వర్గం మధ్య ఇరాన్లో చర్చ కొనసాగుతోంది. యుద్ధం మరింత తీవ్రం అవుతుందా? లేదంటే దౌత్యానికి కొత్త మార్గం తెరుచుకుంటుందా? అనేది రాబోయే పరిణామాలపై ఆధారపడి ఉంది. ఖటామీ వ్యాఖ్యలు మాత్రం ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో కొత్త ప్రశ్నలకు తెరలేపాయి. -
ఓ ఫేక్ న్యూస్.. అమెరికా–ఇరాన్ అణు చర్చల్లో కలకలం
క్షిపణులు, డ్రోన్లతో సాగుతున్న అమెరికా–ఇరాన్ ఘర్షణ ఇప్పుడు మరో కొత్త మలుపు తీసుకుంది. యుద్ధం కేవలం మైదానంలోనే కాదు.. సోషల్ మీడియా వేదికలపైనా సాగుతోంది. తాజాగా ఓ తప్పుడు సమాచారం అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించింది. ఎలాంటి నిర్ధారణ లేకుండానే ఇజ్రాయెల్, అమెరికా రాజకీయ వర్గాల్లోకి చేరి.. చివరకు అణు చర్చలపై ప్రభావం చూపే స్థాయికి చేరుకుంది.ఆగస్టు 5న ‘ఎక్స్’ (X) వేదికగా ఓ గుర్తుతెలియని భారతీయ ఖాతా నుంచి ఓ సంచలన పోస్టు వెలువడింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ వహీది.. ‘‘అమెరికా, ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు ఉన్నంత కాలం.. ఇరాన్ కూడా తన అణు ఆయుధాల లక్ష్యాన్ని వదులుకోదు’’ అని వ్యాఖ్యానించినట్లు అందులో పేర్కొన్నారు. దీనికి అణు పేలుడు మేఘాన్ని పోలిన ఏఐ రూపొందించిన చిత్రాన్ని కూడా జత చేశారు.అయితే ఈ వ్యాఖ్యలు నిజంగా వహీది చేశారనే ఆధారాలు ఏవీ లేవు. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసిందనే ఆధారాలు కూడా లేవు. అయినప్పటికీ ఆ పోస్టు వేగంగా వైరల్ అయింది.భారత్ టు అమెరికా వయా ఇజ్రాయెల్.. సుమారు 1.75 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఆ భారతీయ ఖాతా నుంచి మొదలైన ఈ ప్రచారం.. కొన్ని గంటల్లోనే మరో భారతీయ ఖాతా ద్వారా హిందీలోకి అనువదించబడింది. ఆ తర్వాత ఇజ్రాయెల్కు చెందిన కొన్ని సోషల్ మీడియా ఖాతాలు దీనిని విస్తృతంగా ప్రచారం చేశాయి. ఇజ్రాయెల్లోని ఓ టీవీ ఛానల్ ఈ తప్పుడు సమాచారాన్ని ఆధారంగా చేసుకుని.. ‘‘ఇరాన్ తొలిసారి అణుబాంబు తయారీ లక్ష్యాన్ని అంగీకరించింది’’ అన్నట్టుగా కథనం ప్రసారం చేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ జెరూసలేంలోని మౌంట్ హెర్జెల్ వద్ద చేసిన ప్రసంగంలో కూడా దీనిని ఇరాన్ ఉద్దేశాలకు నిదర్శనంగా ప్రస్తావించారు.అమెరికాలోనూ ఈ ప్రచారం ప్రభావం చూపింది. ఐక్యరాజ్యసమితిలో ట్రంప్ ప్రభుత్వ ప్రతినిధి మైక్ వాల్ట్జ్ ఈ పోస్టును షేర్ చేస్తూ.. ఇరాన్ అసలు ఉద్దేశాలను అంగీకరించిందన్న అర్థంలో వ్యాఖ్యానించారు. అమెరికా సెనేటర్ రిక్ స్కాట్ కూడా దీన్ని పంచుకున్నారు. అయితే తర్వాత మైక్ వాల్ట్జ్ తన పోస్టును ఎలాంటి వివరణ లేకుండా తొలగించారు.అణు చర్చలపై ప్రభావంఅమెరికా–ఇరాన్ మధ్య ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, ఇజ్రాయెల్ అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. తాము శాంతియుత అవసరాల కోసమే అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని టెహ్రాన్ చెబుతోంది. ఇలాంటి సమయంలో అణ్వాయుధాలపై ఇరాన్ నేత వ్యాఖ్యలంటూ వచ్చిన తప్పుడు ప్రచారం.. దౌత్య చర్చల వాతావరణాన్ని మరింత క్లిష్టంగా మార్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఫేక్ న్యూస్ పవర్ అది!ఈ ఘటన సోషల్ మీడియా యుగంలో తప్పుడు సమాచారానికి ఉన్న ప్రభావాన్ని మరోసారి బయటపెట్టింది. ఒక గుర్తుతెలియని ఖాతా నుంచి వచ్చిన నిర్ధారణ లేని పోస్టు.. భాషలు, దేశాల సరిహద్దులు దాటి.. ప్రపంచ నాయకుల ప్రసంగాల్లోకి చేరింది. నిజానిజాలు నిర్ధారించకుండానే ప్రచారం జరిగితే.. అంతర్జాతీయ రాజకీయాలు, యుద్ధ నిర్ణయాలపైనా ప్రభావం చూపగలదని ఈ ఉదంతం స్పష్టం చేసింది. -
ఇరాన్ కొత్త వార్ ప్లాన్.. అమెరికా సైనికుడి ప్రాణానికి భారీ బౌంటీ!
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికా సైనికుడిని హతమార్చినా, సజీవంగా పట్టుకుని అప్పగించినా 30 వేల డాలర్ల నజరానా అందిస్తామని ప్రకటించింది. ఈ చర్యకు పాల్పడేది మహిళ అయితే రివార్డును రెట్టింపు చేసి 60 వేల డాలర్లు ఇస్తామని ఇరాన్ సైన్యం ప్రకటించినట్లు ఆ దేశ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది.ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ ఈ నజరానా పథకాన్ని ప్రకటించినట్లు సమాచారం. అమెరికాపై పోరాటానికి ఆర్థికంగా మద్దతు ఇచ్చేందుకు ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థనలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నట్లు ఐఆర్ఎన్ఏ కథనాన్ని ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా తెలిపింది. అయితే అమెరికా సైనికులను ఎక్కడ, ఎప్పుడు పట్టుకోవాలనే విషయంపై ఎలాంటి వివరాలను ఇరాన్ వెల్లడించలేదు.హార్మూజ్ ప్రతిష్ఠంభన వేళ..హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలపై ప్రతిష్ఠంభన కొనసాగుతున్న సమయంలో ఇరాన్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికాతో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న నేపథ్యంలో ఇరాన్ తీసుకున్న తాజా నిర్ణయం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అయితే ప్రస్తుతం ఇరాన్ భూభాగంలో అమెరికా బలగాల పెద్దఎత్తున మోహరింపు లేదని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. ఏప్రిల్లో కూలిపోయిన అమెరికా యుద్ధ విమాన పైలట్ను రక్షించేందుకు చేపట్టిన చర్య మినహా ఇరాన్లో అమెరికా బలగాల ప్రత్యక్ష మోహరింపునకు సంబంధించిన ఘటనలు పరిమితంగానే ఉన్నట్లు సమాచారం.ట్రంప్పైనా గతంలో ముప్పు?ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కూడా ఇరాన్ వైపు నుంచి గతంలో హత్యా ముప్పులు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆ నేపథ్యంలో ట్రంప్ భద్రతా ఏర్పాట్లపై కూడా అప్పట్లో పలు కథనాలు వెలువడ్డాయి. తాజాగా అమెరికా సైనికులపై నేరుగా నజరానా ప్రకటించడం.. ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతలతో ఉన్న అమెరికా-ఇరాన్ సంబంధాలను మరింత ప్రమాదకర దిశలోకి తీసుకెళ్లే పరిణామంగా మారింది. -
ట్రంప్కు మళ్లీ కోపమొచ్చింది! ఈసారి..
ఇరాన్పై యుద్ధ వ్యూహంలో తమతో కలిసిరాని మిత్రదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ట్రంప్.. ఇప్పుడు మరో మిత్రదేశంపై గుర్రుగా ఉన్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా చేపడుతున్న చర్యలకు మద్దతు ఇవ్వకపోవడంపై దక్షిణ కొరియాపై అసహనం వ్యక్తం చేసిన ఆయన.. సంయుక్త సైనిక విన్యాసాలను గణనీయంగా తగ్గించాలని పెంటగాన్ను ఆదేశించారు.ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ను అణు ఆయుధాల నుంచి దూరం చేసే ప్రయత్నాల్లో అమెరికాతో కలిసి పనిచేయాలా అని దక్షిణ కొరియా అధ్యక్షుడిని ఇటీవల అడిగానని.. అందుకు సియోల్ "వద్దు, ధన్యవాదాలు" అంటూ సమాధానం ఇచ్చిందని ట్రంప్ పేర్కొన్నారు. సైనిక విన్యాసాలపై ట్రంప్ నిర్ణయందక్షిణ కొరియా నిర్ణయంతో అసంతృప్తి చెందిన ట్రంప్.. అమెరికా, దక్షిణ కొరియా మధ్య జరిగే వార్షిక సంయుక్త సైనిక విన్యాసాలను భారీగా తగ్గించాలని రక్షణ శాఖకు ఆదేశించినట్లు తెలిపారు. అయితే ఈ ఏడాది జరగనున్న ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ (Ulchi Freedom Shield) విన్యాసాలను పూర్తిగా రద్దు చేసే అవకాశం లేకపోయిందని చెప్పారు. ముందుగానే ప్రణాళిక ఖరారైందని, అందుకే పూర్తిగా నిలిపివేయలేకపోతున్నామని స్వయంగా ట్రంపే తెలిపారు. ఈ సైనిక విన్యాసాలు ఆగస్టు 17 నుంచి 27 వరకు జరగనున్నాయి.ఉత్తర కొరియాపై ట్రంప్ వ్యాఖ్యలుఅమెరికా-దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలపై తన అసంతృప్తికి మరో కారణంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్తో తనకు ఉన్న మంచి సంబంధాలను కూడా ట్రంప్ ప్రస్తావించారు. ఈ విన్యాసాలు భారీ ఖర్చుతో కూడుకున్నవని, ఉత్తర కొరియాకు అనవసరంగా శత్రుత్వ సంకేతాలు పంపుతున్నాయని ఆయన అన్నారు. తన అధ్యక్ష పదవీకాలంలో ఉత్తర కొరియా ఎలాంటి ముప్పు కలిగించకుండా గౌరవప్రదంగా వ్యవహరించిందని పేర్కొన్నారు.మాంచి స్నేహంఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య సంబంధాలు అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు దారితీశాయి. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. పరస్పరం ఇద్దరు నేతలు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. అయితే 2018లో సింగపూర్లో జరిగిన చారిత్రక భేటీతో ట్రంప్–కిమ్ సంబంధాల్లో కీలక మలుపు వచ్చింది. ఆ తర్వాత కూడా కిమ్తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు.ఇరాన్పై అమెరికా ఒత్తిడి వ్యూహంఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా ఒత్తిడి పెంచుతున్న సమయంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్ను అణు ఆయుధాల నుంచి దూరంగా ఉంచేందుకు మిత్రదేశాల మద్దతును కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగానే అమెరికా చర్యలు కొనసాగుతున్నాయి. దక్షిణ కొరియా వైఖరి, అమెరికా సైనిక నిర్ణయం రెండు దేశాల మధ్య భద్రతా సహకారంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు.ఉ.కొరియా సవాల్కు..ఇటు.. దక్షిణ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాలను తగ్గిస్తామని ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆసియా భద్రతా వర్గాల్లో చర్చకు దారితీసింది. సాధారణంగా అమెరికా-దక్షిణ కొరియా నిర్వహించే ఈ డ్రిల్స్ ఉత్తర కొరియా క్షిపణి, అణు బెదిరింపులకు ప్రతిస్పందనగా భావిస్తారు. ఇటీవలి కాలంలో ఉత్తర కొరియా వరుసగా బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ అమెరికా, దాని మిత్రదేశాలకు సవాలు విసురుతోంది. ఇలాంటి సమయంలో సంయుక్త సైనిక విన్యాసాల తీవ్రత తగ్గితే అది కిమ్ దేశానికి ఎలాంటి సంకేతాలు ఇస్తుందనే చర్చ మొదలైంది.అయితే ట్రంప్ మాత్రం ఈ నిర్ణయాన్ని ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలతో ముడిపెట్టలేదు. కిమ్ జోంగ్ ఉన్తో తనకు ఉన్న సంబంధాలు, భారీ ఖర్చుతో కూడిన సైనిక విన్యాసాల అవసరంపై ఆయన ఎక్కువగా ప్రస్తావించారు. మరోవైపు దక్షిణ కొరియాకు అమెరికా భద్రతా హామీలు కొనసాగుతాయని నిపుణులు చెబుతున్నప్పటికీ.. డ్రిల్స్ తగ్గింపు ఉత్తర కొరియా వైఖరిపై ప్రభావం చూపుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. -
ట్వీట్ తో హార్మోజ్ ను స్వాధీనం చేసుకోలేరు.. ట్రంప్ కు ఇరాన్ కౌంటర్
-
అలా చేస్తేనే.. దారి తెరుస్తాం.. ట్రంప్కు ఇరాన్ దిమ్మతిరిగే కౌంటర్
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరుకున్నాయి. హార్ముజ్ జలసంధిని ఎప్పుడు తెరవాలి, ఎప్పుడు మూసివేయాలన్నది ఇరాన్ నిర్ణయమేనని ఆ దేశ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాది స్పష్టం చేశారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటమి వాస్తవాన్ని అంగీకరించండి.. ఊహల్లో విహరించడం ఆపండి. అప్పటివరకు ఇరాన్ దిగ్బంధాన్ని కొనసాగిస్తుంది అంటూ హెచ్చరించారు. కేవలం ఆదేశాలు ఇవ్వడం, ట్వీట్ చేయడం లేదా యుద్ధనౌకలను మోహరించడం ద్వారా జలసంధిపై నియంత్రణ సాధించలేరని అమెరికాకు కౌంటరిచ్చారు.మరోవైపు, ప్రపంచంలోని కీలక చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధిలో రాకపోకలు భారీగా పడిపోయాయి. శుక్రవారం కేవలం రెండు నౌకలు మాత్రమే ఈ మార్గం గుండా వెళ్లినట్లు షిప్ ట్రాకింగ్ సంస్థ Kpler విశ్లేషణ తెలిపింది. వాటిలో ముడి చమురు రవాణా కనిపించకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. యుద్ధానికి ముందు రోజుకు 130కి పైగా నౌకలు ఈ మార్గంలో ప్రయాణించేవి. జలసంధి మూసివేత కొనసాగితే చమురు, ఇంధన సరఫరాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే అమెరికాలో పెరుగుతున్న పెట్రోల్ ధరలను ప్రజలు భరించాల్సి ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు వేగంగా పెరుగుతున్నాయి.ఇదే సమయంలో హార్ముజ్ జలసంధిని త్వరలో అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని ట్రంప్ చెప్పడం పరిస్థితిని మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. ఇరాన్తో ఒప్పందం కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, అవసరమైతే ఆ దేశంపై ఆర్థికంగా మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. ఒకవైపు హార్ముజ్పై ఇరాన్ పట్టు.. మరోవైపు దాన్ని అమెరికా భూభాగంగా ప్రకటిస్తామంటున్న ట్రంప్.. ఈ ప్రతిష్ఠంభన ఎటు దారితీస్తుందన్నదే ఇప్పుడు ప్రపంచ దేశాల ఆందోళన.చర్చలకు నో ఛాన్స్?ఇదిలా ఉండగా.. అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య చర్చలు కూడా ముందుకు కదలడం లేదు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి.. అమెరికాతో చర్చలు పునఃప్రారంభించడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఖతార్, పాకిస్తాన్ వంటి దేశాలు మధ్యవర్తిత్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. అవి అధికారిక శాంతి చర్చలు కాదని ఇరాన్ స్పష్టం చేసింది. -
ఇరాన్కు ఖతార్ స్ట్రాంగ్ కౌంటర్.. ముగ్గురు పైలట్లపై బిగ్ సస్పెన్స్!
గల్ఫ్ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగేలా ఇరాన్-ఖతార్ మధ్య పైలట్ల వివాదం తెరపైకి వచ్చింది. ముగ్గురు ఇరాన్ యుద్ధ విమాన పైలట్లను ఖతార్ బలగాలు సజీవంగా పట్టుకున్నాయని ఇరాన్ వర్గాలు ప్రకటించగా ఖతార్ మాత్రం ఆ ఆరోపణలను పూర్తిగా ఖండించింది.ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ IRNA కథనం ప్రకారం, మార్చిలో ఖతార్లోని ఒక సైనిక స్థావరంపై దాడి చేసే మిషన్లో పాల్గొన్న మూడు యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయి. వాటిలోని పైలట్లు విమానాల నుంచి బయటకు దూకిన అనంతరం ఖతార్ బలగాలకు చిక్కారని ఇరాన్ సైనిక అధికారి పేర్కొన్నారు. ఈ ముగ్గురి ఆచూకీ కోసం అంతర్జాతీయ రెడ్క్రాస్ సహాయం కోరినట్లు ఇరాన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ తెలిపింది. అయితే ఖతర్ కథనం పూర్తిగా భిన్నంగా ఉంది.ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ప్రకారం, ఆ ఇరాన్ పైలట్లు ఖతార్ గగనతలంలోకి ప్రవేశించారు. వారిని సంప్రదించేందుకు అధికారులు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ స్పందన రాలేదని తెలిపారు. అనంతరం చేపట్టిన గాలింపు, రక్షణ చర్యల్లో ఒక పైలట్ మృతదేహాన్ని మాత్రమే గుర్తించినట్లు ఖతార్ వెల్లడించింది. అంతేకాదు, ఆ మృతదేహాన్ని ఇరాన్కు అప్పగించే అంశంపై కూడా ఖతార్ సంప్రదింపులు జరిపిందని తెలిపింది. ఆపరేషన్కు సంబంధించిన వివరాలను పరిశీలించేందుకు ఇరాన్ను ఆహ్వానించినప్పటికీ, ఇప్పటివరకు స్పందన రాలేదని ఆరోపించింది.ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ముగ్గురు పైలట్లు సజీవంగా ఖతార్ అదుపులో ఉన్నారా? లేక ఒక పైలట్ మాత్రమే మరణించాడా?. ఈ వివాదం కేవలం ముగ్గురు సైనికుల ఆచూకీకి సంబంధించినది కాదు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతల్లో ఉన్న ప్రాంతంలో ఇరాన్, ఖతార్ మధ్య ఈ ఆరోపణలు కొత్త రాజకీయ, సైనిక పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. ఇరాన్పై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గల్ఫ్ దేశాల్లోని స్థావరాలను అమెరికా, ఇజ్రాయెల్ తమ సైనిక చర్యలకు ఉపయోగించుకుంటున్నాయని ఇరాన్ చాలాకాలంగా ఆరోపిస్తోంది. అందుకే ఈ పైలట్ల వ్యవహారం ఇప్పుడు ఒక కీలక ప్రశ్నగా మారింది. -
హర్ముజ్ను అమెరికా భూభాగంగా ప్రకటిస్తా!: ట్రంప్
ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హర్ముజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిదాకా కేవలం దాని నియంత్రణ మాత్రమే తమదేనంటూ ఆయన ప్రకటించుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సైన్యం మోహరించామని చెబుతున్నారు. అయితే తాజాగా ఈ వ్యూహాత్మక జలమార్గాన్ని అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని మరో సంచలనానికి తెర తీశారు. “ఇరాన్ను ఓడించడం ఖాయం. ఆ తర్వాత.. అతి త్వరలో హర్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తాను” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఈ నిర్ణయం ఎలా అమలు చేస్తారు? దీనికి అంతర్జాతీయంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనే అంశాలపై ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడమే తమ లక్ష్యమని ట్రంప్ చెబుతుండగా.. ఇరాన్పై మరింత కఠిన ఆర్థిక చర్యలు తీసుకుంటామని అమెరికా వర్గాలు చెబుతున్నాయి.‘కొంత ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు’.. అమెరికన్లకు ట్రంప్ఇరాన్పై చర్యల కారణంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని ట్రంప్ అంగీకరించారు. “అమెరికన్లు పెట్రోల్ కోసం కొంచెం ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు. కానీ ఇరాన్ అణ్వాయుధ శక్తిగా మారకుండా అడ్డుకోవడం ప్రపంచానికి చేసే సేవ” అని అన్నారు.హర్ముజ్పై అధికారం మాదే: ఇరాన్ స్పష్టంట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ ఘాటుగా స్పందించింది. హర్ముజ్ జలసంధిపై నియంత్రణ తమదేనని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాది స్పష్టం చేశారు. “ఒక ట్వీట్తోనో, విమాన వాహక నౌకతోనో హార్ముజ్ను స్వాధీనం చేసుకోలేరు. ఇరాన్ ఓటమిని అంగీకరించే వరకు ఈ మార్గంపై మా నియంత్రణ కొనసాగుతుంది” అని ఆయన పేర్కొన్నారు.ప్రపంచానికి చమురు షాకే!ప్రపంచ ఇంధన మార్కెట్లకు హర్ముజ్ జలసంధి అత్యంత కీలకం. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు, ఎల్ఎన్జీలో దాదాపు 20 శాతం ఈ మార్గం గుండా రవాణా అవుతుంది. అయితే ఫిబ్రవరి 28వ తేదీన మొదలైన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో నౌకల రాకపోకలు భారీగా తగ్గాయి. ఫలితంగా ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 90 డాలర్లకు చేరువైంది. అమెరికాలో పెట్రోల్ ధర గ్యాలన్కు 4 డాలర్ల స్థాయికి చేరింది.నిలిచిన చర్చలు.. పెరుగుతున్న ఉద్రిక్తతఅమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు నిలిచిపోయాయి. యుద్ధాన్ని ముగించే దిశగా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. మరోవైపు ఇరాన్పై మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధిస్తామని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ తెలిపారు.హర్ముజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం సాగుతున్న ఈ పోరు కొనసాగితే.. ప్రపంచ చమురు సరఫరా, ఇంధన ధరలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఎవరీ యాల్డా మోయిరీ..? ఏకంగా 15 ఏళ్లు..
పాత్రికేయ రంగం అంటేనే సంఘర్షణలతో ముడిపడి ఉంటుంది. ఏది పడితే అది రాసే అవకాశం ఉండదు. అధికారులకు అననుకూలంగా రాసామో అంతే సంగతులు. అలాంటి రక్షణలేని వృత్తి ఇది. ఎప్పుడు మీడియా గొంతును నొక్కేసేలా దాడులు, కక్ష సాధింపు చర్యలు ఉంటూనే ఉంటాయి. కానీ తొలిసారిగా మహిళల హక్కులు, ప్రకృతి విపత్తుల కోసం చాలా చురుకుగా ప్రపంచానికి తెలియజేసే ఓ ఫోటో జర్నలిస్ట్ జైలు పాలవ్వడమే కాదు ఎన్నే ఏళ్లు జైలు శిక్ష విధించారో తెలిస్తే కంగుతింటారు. పైగా పాత్రికేయరంగంలో ఇన్ని సవాళ్లు ఉంటాయా అనిపిస్తుంది. మంచి జరగాలని ప్రయత్నిస్తే మొత్తానికి వాళ్ల కథే ముగిసిపోతుంది అనేలా అయ్యింది ఈ జర్నలిస్ట్ పరిస్థితి.ఇరాన్ దేశల్లో నిరసనలు, మహిళలు జీవితాలను డాక్యుమెంట్ చేయడంలో పేరుగాంచిన ఫోటో జర్నలిస్ట్కి జైలుపాలవ్వడమే కాదు ఏకంగా 15 ఏళ్లు జైలు శిక్ష విధించారు. 2025లో ఇరాన్ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రవేశపెట్టిన చట్టం ప్రకారం ఈ శిక్షణు విధించింది. ఇది గూఢచర్యం, శత్రుదేశాల సహకారాన్ని ఎదుర్కోవడానికి ఉద్దేశించిన చట్టం. ఆమెపై జాతీయ భద్రతకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేశారనే ఆరోపణలతో టెహ్రాన్ కోర్టు ఈ శిక్ష విధించింది. ఆమె ఇరాన్ అధికారులకు ప్రతికూలంగా ఉండే మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారని, యూఎస్ ఇజ్రాయెల్తో సంబంధం ఉన్న సంస్థలకు ఫోటోలు అందించారని ఆరోపణలతో ఆమెకు ఈ శిక్ష విధించినట్లు ఇరాన్ అంతరంగిక వర్గాల సమాచారం. అంతేగాదు ఇంటెలిజెన్స్ వింగ్ సభ్యులు ఆమె ఇంటిపై దాడిచేసి, ల్యాప్టాప్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. కనీసం ఆమె కేసుకి సంబంధించిన కాఫీలు కూడా ఇవ్వకుండా కోర్టు ముందుంచి ఈ శిక్ష విధించడం గమనార్హం. ఇదిలా ఉండగా మోయిరీ ఇరాన్లో వైమానిక దాడుల వల్ల జరిగిన నష్టాన్ని చూపించే ఫోటోల తోపాటు తన పనికి సంబంధించిన ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆ నేపథ్యంలోనే ఇలా మోయిరీపై ఇరాన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా ఇదేమి ఆమెకు మొదటి జైలు శిక్ష కాదు, గతంలో ఘర్చక్ జైలులో రెండేళ్లు శిక్షఅనుభవించింది. అలాగే 2022లో, పోలీసు కస్టడీలో మహ్సా అమినీ మరణించిన తర్వాత దేశవ్యాప్తంగా "స్త్రీ, జీవితం, స్వేచ్ఛ" నిరసనలను కవర్ చేసినందుకు గానూ ఏకంగా ఎనిమిది నెలలు జైలు శిక్ష విధించగా మూడేళ్లు శిక్ష అనుభవించి క్షమాభిక్ష అనంతరం విడుదలైంది. తాజాగా మరోసారి సుదీర్ఘ జైలు శిక్షను ఎదుర్కొంటుండటం గమనార్హం. (చదవండి: అచ్చం నీలాంబరి మూవీ రమ్యకృష్ణలా రక్తంతో ఫేషియల్..! అందం కోసం ఇంత పెయిన్ తప్పదా?) -
ఇరాన్ నెత్తిన అమెరికా మరో పిడుగు! అవసరమైతే..
తమ డిమాండ్లు, షరతుల విషయంలో రాజీ పడబోమని.. అవసరమైతే ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం యుద్ధం కొనసాగిస్తామని ఇరాన్ కుండబద్ధలు కొట్టేసింది. ఈ తరుణంలో అమెరికా ఒత్తిడి మరింత పెంచింది. హర్ముజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ‘ నో ఎండ్ ప్లాన్’తో మరింత దూకుడుగా వ్యవహరించాలని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే జలసంధిలో నౌకా దిగ్బంధాన్ని (బ్లాకేడ్) కొనసాగిస్తున్న అమెరికా సైన్యం.. అవసరమైతే నిరవధికగా ఆ పని చేయాలని భావిస్తోంది. అంటే నిర్దిష్ట కాలపరిమితి అంటూ ఏదీ లేకుండా ఇరాన్ పోర్టులకు వచ్చి పోయే నౌకలపై నిఘా కొనసాగించడం(అవసరమైతే దాడులు జరపడం) అన్నమాట.కాల్పుల విరమణ చర్చలు నిలిచిపోవడం, ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో నౌకాదళాన్ని కొనసాగించే సామర్థ్యం అమెరికాకు ఉందని చెప్పారు. అవసరమైనప్పుడు యుద్ధ నౌకలను మార్చుతూ హర్ముజ్ ప్రాంతంలో పహారా కొనసాగిస్తామని తెలిపారు.ఇరాన్పై మరిన్ని ఆర్థిక ఆంక్షలునౌకా దిగ్బంధంతో పాటు ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఆంక్షల చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అమెరికా లక్ష్యం ఇరాన్ను చర్చల బల్లపైకి తీసుకురావడమేనని వాషింగ్టన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటివరకు విధించిన ఆంక్షలు, ఒత్తిళ్లు ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదని కూడా విశ్లేషణలు ఉన్నాయి.హర్ముజ్ జలసంధే కేంద్రంగా పోరుఅణు ఒప్పందంతో మొదలైన పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ఇప్పుడు హర్ముజ్ జలసంధి చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ రవాణాలో ఈ మార్గం అత్యంత కీలకం. యుద్ధం ప్రారంభానికి ముందు ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గం ద్వారానే జరిగేది. తమపై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ ఈ వ్యూహాత్మక మార్గంపై నియంత్రణ సాధించేందుకు ప్రయత్నిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. మరోవైపు హర్ముజ్ తమ ఆధీనంలోనే ఉందని ఇరాన్ చెబుతోంది.రెండు చమురు నౌకలపై దాడిహర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి చెందిన రెండు నౌకలపై దాడి జరిగినట్లు యూఏఈ అధికారిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనకు ఇరాన్ కారణమని యూఏఈ ఆరోపించింది. ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా ఆందోళనలు మరింత పెరిగాయి. నౌకల రాకపోకలు కూడా భారీగా తగ్గిపోయాయి.నౌకల రాకపోకలకు బ్రేక్యుద్ధానికి ముందు హర్ముజ్ జలసంధి ద్వారా రోజుకు 130 నుంచి 140 వరకు నౌకలు ప్రయాణించేవి. ప్రస్తుతం ఆ సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఒక దశలో రోజుకు కేవలం ఎనిమిది నౌకలు మాత్రమే ఈ మార్గంలో ప్రయాణించినట్లు సమాచారం. అమెరికా గతంలో ఇరాన్ నౌకలు, పోర్టులపై ఉన్న దిగ్బంధాన్ని కొంతకాలం సడలించినప్పటికీ.. తర్వాత మళ్లీ పునరుద్ధరించింది. దీనివల్ల ఇరాన్కు కీలకమైన విదేశీ మారక ఆదాయంపై ప్రభావం పడుతోంది.ప్రపంచ చమురు మార్కెట్లో కలవరంఇరాన్ సంక్షోభం కొనసాగితే ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ఈ ఏడాది ప్రపంచ చమురు సరఫరా రోజుకు 43 లక్షల బ్యారెళ్ల మేర తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇది దాదాపు 4 శాతానికి సమానం. అయితే మరోవైపు డిమాండ్ తగ్గడం, అమెరికా ముడిచమురు నిల్వలు పెరగడంతో చమురు ధరలు కొంత తగ్గాయి. గురువారం ధరలు 2 శాతానికి పైగా పడిపోయాయి.ట్రంప్పై దేశీయ ఒత్తిడిఇరాన్తో యుద్ధం ముగించాలని అమెరికాలోనూ ఒత్తిడి పెరుగుతోంది. పెరిగిన ఇంధన ధరలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణపై ప్రభావం చూపుతున్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి. నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఈ అంశం రాజకీయంగా కీలకంగా మారింది. ట్రంప్ ఈ మధ్య హర్ముజ్పై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని వ్యాఖ్యానించారు. అయితే ఇరాన్ దీనిని ఖండిస్తూ.. ఆంక్షలు ఎత్తివేయడం, తమ నిలిపివేసిన ఆస్తులను విడుదల చేయడం వంటి షరతులు నెరవేరే వరకు జలసంధిని పూర్తిగా తెరవబోమని స్పష్టం చేసింది.యుద్ధం కంటే ఆర్థిక దెబ్బే వ్యూహమా?ఇరాన్పై సైనిక చర్యలు చేపడతామని ట్రంప్ గతంలో హెచ్చరించినప్పటికీ.. ప్రస్తుతం ఆర్థిక ఒత్తిడిపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికా ఇప్పటికే ఇరాన్కు ఆయుధాల సరఫరాకు సహకరిస్తున్న వ్యక్తులు, సంస్థలపై ఆంక్షలు విధించింది. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని పొందకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని హెగ్సెత్ తెలిపారు.అబ్రహం లింకన్ నౌకపై వదంతులుహర్ముజ్ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా నౌకాదళానికి చెందిన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌకపై సిబ్బంది మరణించారన్న వార్తలను అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఖండించింది. ఈ యుద్ధం ఆగదని.. తమ జీవితాలు ఇంతేనన్న వైరాగ్యంతో ఏడుగురు నేవీ సిబ్బంది బలవన్మరణానికి పాల్పడ్డారన్నది ఇరాన్ మీడియా కథనాల సారాంశం. అయితే అది తప్పు సమాచారమని అమెరికా తెలిపింది. 260 రోజులకు పైగా సముద్రంలో ఉన్నప్పటికీ అబ్రహం లింకన్ క్యారియర్ గ్రూప్ సిబ్బంది ధైర్యంగా ఉన్నారని CENTCOM పేర్కొంది. ఆగస్టు 3న సముద్రంలో పడిపోయిన ఒక నావికుడిని కూడా సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించింది. ఈ తరుణంలో.. లింకన్ నౌకను ఒడ్డుకు రప్పించి జార్జ్ వాషింగ్టన్ నౌకతో రిప్లేస్ చేశామని, ఇది సాధారణ చర్యేనని ప్రకటించుకుంది.హర్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరు ఇప్పుడు అమెరికా–ఇరాన్ ఘర్షణలో కీలక అంశంగా మారింది. ఒకవైపు అమెరికా నిరవధిక బ్లాకేడ్, ఆర్థిక ఆంక్షలతో ఒత్తిడి పెంచుతుండగా.. మరోవైపు ఇరాన్ వ్యూహాత్మక మార్గాన్ని తన ఆధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ పోరు ఎంతకాలం కొనసాగుతుందన్నది చమురు మార్కెట్లతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపనుంది. -
‘ఆయనకేం.. చెత్తబుట్టలో కూడా దాక్కుంటారు!’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతకు సంబంధించిన రహస్య ఆపరేషన్ అంతర్జాతీయ చర్చకు దారితీసింది. టర్కీలోని అంకారాలో నాటో సదస్సు పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఆయన్ని మరో చిన్న విమానంలోకి మార్చిన ఘటనపై విశ్లేషణలు నడుస్తున్నాయి. అయితే ఈ ఘటనపై ఇరాన్ మీడియా తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ ఘటన అమెరికా అధ్యక్షుడి భద్రతా ఆందోళనలను బయటపెట్టిందంటూ వ్యాఖ్యానించింది.నాటో సదస్సు కోసం టర్కీ వెళ్లిన ట్రంప్ తిరుగు ప్రయాణం సందర్భంగా ఎయిర్ఫోర్స్ వన్పై క్షిపణి (shoulder-fired missile) దాడి ముప్పు ఉందన్న సమాచారంతో అమెరికా సీక్రెట్ సర్వీస్ అప్రమత్తమైంది. ముప్పు నమ్మదగినదిగా, తక్షణ చర్య అవసరమయ్యే స్థాయిలో ఉందని భావించి ఈ రహస్య మార్పిడి చేపట్టినట్లు సమాచారం.ఇరాన్ మీడియా వ్యంగ్యంఈ ఘటనను ఇరాన్ ప్రభుత్వ మీడియా తమ ప్రచారానికి ఉపయోగించుకుంది. అమెరికా అధ్యక్షుడు ఇరాన్ సైనిక శక్తికి భయపడుతున్నారనే సంకేతంగా ఈ విమాన మార్పిడిని చిత్రీకరించింది. ట్రంప్ తాజా “స్కాండల్”గా అభివర్ణిస్తూ.. ఇది ఆయనకు అవమానకర పరిస్థితి అని ఇరాన్ టీవీ వ్యాఖ్యాత పేర్కొన్నారు. ఇరాన్ దక్షిణాఫ్రికా రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ట్రంప్ను కేటరింగ్ బాక్స్లో దాచినట్లు చూపించే మీమ్ను కూడా షేర్ చేసింది. “త్వరలో చెత్త బుట్టలో దాచాల్సి వస్తుంది” అనే వ్యాఖ్యను జోడించింది.He will be hidden in a trash can before long. pic.twitter.com/ZTkAahNIKw— Iran Embassy SA (@IraninSA) August 11, 2026Brave American hero, or a coward hiding in a catering truck? pic.twitter.com/t1vcmrdcHw— Iran Embassy SA (@IraninSA) August 12, 2026కేటరింగ్ వాహనంలో రహస్య తరలింపుజూలై 8న అంకారా నుంచి బ్రిటన్కు బయలుదేరే సమయంలో ట్రంప్, ఆయనతో ఉన్న కొద్దిమంది సిబ్బందిని కేటరింగ్ ట్రక్కు ద్వారా పెద్ద విమానం నుంచి చిన్న ప్రభుత్వ విమానం C-32Aలోకి మార్చినట్లు నివేదికలు వెల్లడించాయి. అదే సమయంలో అసలు ఎయిర్ఫోర్స్ వన్ వేరుగా బయలుదేరింది. అందులో సీనియర్ అధికారులు, వైట్హౌస్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఉన్నారు.ఈ ఆపరేషన్ వివరాలను తొలుత వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. ట్రంప్ ప్రయాణ వివరాలు, ఆయన అంకారాలో ఉన్న హోటల్ అంతస్తు వరకు ఇరాన్కు తెలిసినట్లు అమెరికా అధికారులు ఆందోళన చెందారని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అలాగే ఇలాంటి డీకాయ్ ఆపరేషన్లు(మోసపూరిత భద్రతా వ్యూహం) సర్వసాధారణమేనని వ్యాఖ్యానించింది. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల మధ్య ఘటనఅమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ట్రంప్పై గతంలోనూ దాడి కుట్ర ఆరోపణలు వచ్చాయి. 2024లో ట్రంప్ అప్పటి అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో ఆయన హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణలపై అమెరికా న్యాయశాఖ ఓ ఇరానియన్పై కేసు నమోదు చేసింది. అయితే ఆ ఆరోపణలను ఇరాన్ ఖండించింది.ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ఇజ్రాయెల్-అమెరికా.. ఇరాన్ల యుద్ధం మొదలైంది. అయితే గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులకు శాశ్వత ముగింపు కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో ఇప్పటికీ ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే విమాన మార్పిడి ఘటన రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.భద్రతా చర్యా? రాజకీయ ప్రచారమా?అమెరికా వర్గాల ప్రకారం ఇది అధ్యక్షుడి భద్రత కోసం తీసుకున్న ముందస్తు జాగ్రత్త మాత్రమే. ఇజ్రాయెల్ నుంచి వచ్చిన సమాచారంతోనే డీకాయ్ ఆపరేషన్ చేపట్టింది. అయితే కేవలం ఒక ఏజెన్సీ సమాచారంతోనే.. అదీ ధృవీకరణ చేసుకోకుండానే అమెరికా భద్రతా బలగాలు ట్రంప్ను అలా తరలించారని తర్వాత తెలిసింది. ఏది ఏమైనా.. ఈ మొత్తం వ్యవహారాన్ని ఇరాన్ మాత్రం దీన్ని అమెరికా బలహీనతకు సంకేతంగా చూపిస్తూ ప్రచారం చేస్తోంది. ట్రంప్ను రక్షించేందుకు చేపట్టిన అత్యంత రహస్య ఆపరేషన్ ఇప్పుడు ఇరు దేశాల మధ్య మాటల యుద్ధానికి కొత్త కారణంగా మారింది. -
ట్రంప్ బిగ్ వార్నింగ్: హర్ముజ్ మాదే.. ఇక వదులుకోం!
పశ్చిమాసియా సంక్షోభంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ.. హర్ముజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గంపై పూర్తి నియంత్రణ అమెరికాదేనని.. ఇక మీదట దానిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. హర్ముజ్ జలసంధిపై అమెరికాకు సంపూర్ణ ఆధిపత్యం ఉందని, ఇరాన్ దీనిని ఎదుర్కొనే పరిస్థితిలో లేదని వ్యాఖ్యానించారు. అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని ‘‘ఉక్కు గోడ’’గా అభివర్ణించారు. అయితే తన పోస్ట్ చివర్లో ‘అల్లాహ్కు స్తుతి’ అంటూ ట్రంప్ ముగించారు. సాధారణంగా ఇస్లామిక్ సందర్భాల్లో వినిపించే ఈ పదబంధాన్ని ట్రంప్ ఇరాన్ అంశాన్ని ప్రస్తావిస్తూ వ్యంగ్య ధోరణిలో ఉపయోగించినట్లు భావిస్తున్నారు.వీక్ ఇరాన్!ఇరాన్కు నౌకాదళం, వైమానిక దళం బలహీనంగా ఉన్నాయని ట్రంప్ అంటున్నారు. ఇరాన్ సైనికులకు జీతాలు కూడా అందడం లేదని వ్యాఖ్యానించారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) తీవ్రంగా దెబ్బతిన్నదని, వెనక్కి తగ్గుతోందని పేర్కొన్నారు.తగ్గమంటున్న ఇరాన్ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ కొట్టిపారేసింది. హార్ముజ్ జలసంధిపై అమెరికా పూర్తి నియంత్రణ సాధించిందన్న వాదన వాస్తవాన్ని మార్చలేదని పేర్కొంది. హార్ముజ్ ఇంకా మూసివేసే ఉందని, ఇరాన్ పెట్టిన షరతులు అంగీకరించే వరకు దానిని తిరిగి తెరవబోమని పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ (PGSA) స్పష్టం చేసింది. అమెరికా అధికారులు పదేపదే చేస్తున్న ప్రకటనలు పరిస్థితిని మార్చలేవని వెల్లడించింది. అమెరికా నౌకాదళ దిగ్బంధం ఎత్తివేయడం, తమ ఆస్తులపై ఆంక్షలు తొలగించడం, యుద్ధ నష్టాలకు పరిహారం చెల్లించడం వంటి డిమాండ్లను ఇరాన్ ముందుకు తెస్తోంది. ఈ షరతులు నెరవేరే వరకు జలసంధి విషయంలో వెనక్కి తగ్గబోమని చెబుతోంది.ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావంప్రపంచ చమురు సరఫరాలో హార్ముజ్ జలసంధి అత్యంత కీలకమైన మార్గం. ఇక్కడ నెలకొన్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. నౌకల రాకపోకలు తగ్గడం, భద్రతా భయాలు పెరగడంతో చమురు ధరలు, రవాణా వ్యయాలపై ప్రభావం కనిపిస్తోంది.చర్చలపై ట్రంప్ వ్యూహంఇరాన్తో చర్చల విషయంలో ట్రంప్ భిన్నమైన వైఖరి ప్రదర్శిస్తున్నారు. తాము తక్కువ స్థాయిలో చర్చలు జరుపుతున్నామని, ఇది ఒక చెస్ ఆటలా ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందని, ద్రవ్యోల్బణం పెరిగిందని పేర్కొన్నారు. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మాత్రం అమెరికాతో నేరుగా చర్చలు జరగడం లేదని, మధ్యవర్తుల ద్వారా కేవలం సందేశాల మార్పిడి మాత్రమే జరుగుతోందని తెలిపారు. -
ట్రంప్ దిగిపోయేదాకా యుద్ధమే.. ఇరాన్ IRGC సంచలన వార్నింగ్!
టెహ్రాన్: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న సంక్షోభం డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉన్నంత కాలం కొనసాగే అవకాశం ఉందని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సీనియర్ సలహాదారు వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన, సైనికపరమైన ప్రతిష్టంభన ఇప్పట్లో ముగిసేలా లేదని ఆయన స్పష్టం చేశారు.ట్రంప్ పరిపాలన అనుసరిస్తున్న తీవ్రమైన ఒత్తిడి వ్యూహాలు, ఆంక్షలు, సైనిక బెదిరింపులకు ఇరాన్ లొంగే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలో కొనసాగినంత కాలం వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య సయోధ్య కుదిరే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, ఈ ఘర్షణ వాతావరణాన్ని దీర్ఘకాలం ఎదుర్కొనేందుకు ఇరాన్ సన్నద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.పశ్చిమాసియాలో ఉద్రిక్తతలుఇరాన్ అణు కార్యక్రమం, క్షిపణి పరీక్షలు, పశ్చిమాసియాలో ప్రాక్సీ గ్రూపుల కార్యకలాపాలపై అమెరికా గట్టి నిఘా ఉంచడంతో పాటు తీవ్ర ఆంక్షలు అమలు చేస్తోంది. దీనికి ప్రతిగా ఇరాన్ తన సైనిక బలాన్ని, డ్రోన్, క్షిపణి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ అమెరికా స్థావరాలకు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య చిన్నపాటి ఘర్షణ కూడా పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే ముప్పు ఉందని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు.చర్చలకు సిద్ధంగా లేని వాతావరణంఅమెరికా బెదిరింపుల కింద ఎలాంటి చర్చలు సాధ్యం కావని, తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి అన్ని చర్యలూ తీసుకుంటామని ఇరాన్ వర్గాలు పునరుద్ఘాటించాయి. ట్రంప్ పదవీకాలం ముగిసేంత వరకు ఈ ప్రతిష్టంభన ఇలాగే కొనసాగవచ్చని ఐఆర్జీసీ వర్గాలు స్పష్టం చేయడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. -
వాళ్లు ఏం చెబితే నేను అదే చేస్తా: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణంలో జరిగిన రహస్య మార్పు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నాటో సదస్సు తర్వాత అంకారా నుంచి బయలుదేరే సమయంలో ఆయన్ని ఎవరి కంటా పడకుండా మరో విమానంలో తరలించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఎయిర్ఫోర్స్ వన్లో ఎక్కినట్లు కనిపించేలా ఓ డమ్మీ ఆపరేషన్ నిర్వహించి.. అనంతరం ఓ క్యాటరింగ్ ట్రక్కు ద్వారా ట్రంప్ను మరో సైనిక విమానంలోకి తరలించినట్లు సమాచారం. అయితే ఈ ప్రచారంపై ట్రంప్కు తాజాగా ప్రశ్న ఎదురైంది. భద్రతా కారణాలతో ఎయిర్ఫోర్స్ వన్ నుంచి మరో విమానానికి తనను తరలించారన్న ప్రచారాన్ని ట్రంప్ ధృవీకరించారు. ‘‘విమానం మార్చాలన్న నిర్ణయం పూర్తిగా సీక్రెట్ సర్వీస్, సైనిక అధికారులదే. వాళ్లు ఏం చెబితే నేను అదే చేస్తా” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.“నేను సీక్రెట్ సర్వీస్, మిలిటరీ చెప్పినట్లే చేస్తాను. వారు వేరే విమానంలో వెళ్లాలని చెప్పారు. అది కూడా అంతే భద్రత కలిగిన విమానమే. వారు కోరడంతో నేను అలా చేశాను. వాళ్లు ఏం చెబితే నేను అదే చేస్తా” అని ట్రంప్ అన్నారు. అయితే ఆ ముప్పు ఇరాన్ నుంచే ఉందా? అనే విషయంపై ఆయన ధాటవేత ధోరణి ప్రదర్శించారు. తనపై ఉన్న ముప్పు వివరాలను తాను సీక్రెట్ సర్వీస్ వాళ్లను ఎక్కువగా అడగలేదని ఆయన చెప్పారు. “నాకు చాలా బెదిరింపులు వస్తుంటాయి” అని పేర్కొన్నారు.“మీకు తెలియని చాలా బెదిరింపులు నాకు ఉన్నాయి. ప్రభావవంతమైన అధ్యక్షులకు ఇలాంటి బెదిరింపులు సహజమే. దాదాపు ఆరు సంవత్సరాల కాలంలో నా కంటే ఎక్కువ చేసిన అధ్యక్షుడు ఎవరూ లేరని నేను భావిస్తున్నాను. నిజం చెప్పాలంటే నేను దేని గురించి ఆందోళన చెందను. ఏదైనా సరే.. నా వైఖరి అదే” అని అన్నారు.ఇరాన్ను నమ్మను: ట్రంప్ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై కూడా ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “నేను ఇరాన్ను నమ్మను. వారు నాతో నిరంతరం అబద్ధాలు చెప్పారు. ఇరాన్ను నమ్మే చివరి వ్యక్తి నేనే” అని అన్నారు. హర్ముజ్ జలసంధిపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని పేర్కొంటూ.. అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.“ప్రస్తుతం హార్ముజ్ జలసంధిపై మాకు పూర్తి నియంత్రణ ఉంది. ఎవరైనా ఏదైనా చేయాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని ట్రంప్ అన్నారు.ఆనాడు జరిగింది ఇదే..టర్కీలోని అంకారా నుంచి బయలుదేరే సమయంలో ట్రంప్ తొలుత ఎయిర్ఫోర్స్ వన్ విమానం ఎక్కారు. అయితే కొద్దిసేపటికే భద్రతా వ్యూహాన్ని మార్చిన అధికారులు ఆయనను రహస్యంగా మరో విమానంలోకి తరలించారు. సాధారణంగా విమానాలకు ఆహారం, సరఫరాలు తరలించే క్యాటరింగ్ ట్రక్ను ఉపయోగించి ట్రంప్ను విమానాశ్రయంలో మరో ప్రాంతానికి తీసుకెళ్లి, ఎయిర్ఫోర్స్ C-32A విమానంలో ఎక్కించారు.అదే సమయంలో అసలు ఎయిర్ఫోర్స్ వన్ విమానం మాత్రం ప్రయాణాన్ని కొనసాగించింది. ఈ ఆపరేషన్ను భద్రతా వర్గాలు ఒక “డీకాయ్ ఆపరేషన్”గా పరిగణిస్తున్నాయి. ఇరాన్కు చెందిన వర్గాల నుంచి ట్రంప్ను లక్ష్యంగా చేసుకునే ముప్పు ఉందన్న నిఘా సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అగ్ర దేశాధినేతల ప్రయాణాలు ఎప్పుడూ అత్యంత రహస్యంగా, కట్టుదిట్టమైన భద్రత మధ్య సాగుతుంటాయి. అయితే “దేనికీ భయపడను” అంటూ చెప్పుకునే ట్రంప్ విషయంలో ఇరాన్ ముప్పు నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ రహస్య విమాన మార్పు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నేతల్లో ఒకరిగా చెప్పుకునే ట్రంప్ ప్రయాణంలో జరిగిన ఈ “సీక్రెట్ స్విచ్” భవిష్యత్తులో అధ్యక్షుల రక్షణ వ్యూహాలకు మరో కొత్త అధ్యాయంగా మారుతుందా? అన్నదే ఆసక్తికరంగా మారింది. -
హర్ముజ్పై ఉడుంపట్టు.. ట్రంప్ సంచలన ప్రకటన
పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. ఇరాన్పై ఆంక్షలు, నౌకా దిగ్బంధం కొనసాగుతున్న వేళ.. అమెరికా దళాలు రంగంలోకి దిగాయి. హర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఓ కార్గో నౌకపై నిబంధనలు ఉల్లంఘించిందని చెబుతూ చర్యలు చేపట్టింది. దీంతో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో.. హర్ముజ్పై పూర్తి నియంత్రణ మాదే అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హర్ముజ్లో అమెరికా ఇప్పటిదాకా బ్లాకేడ్కే పరిమితం కాగా.. తాజా దాడులకూ దిగింది. ఇరాన్ పోర్టు వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన పనామా జెండా కలిగిన ఓ కార్గో నౌకను అమెరికా దళాలు అడ్డుకున్నాయి. హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో ఆ నౌక స్టీరింగ్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని రెండు హెల్ఫైర్ క్షిపణులు ప్రయోగించి దాన్ని నిర్వీర్యం చేశాయి. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) అధికారంగా ప్రకటించింది. హర్ముజ్ దిగ్బంధాన్ని దాటేందుకు ప్రయత్నించిన వాణిజ్య నౌకల్లో ఇప్పటివరకు 55 నౌకలను దారి మళ్లించామని, మూడు నౌకలను నిలిపివేశామని, రెండు నౌకలను తనిఖీ చేశామని అమెరికా వెల్లడించింది. తద్వారా హర్ముజ్పై తాము పూర్తిగా పట్టు సాధించే ప్రయత్నాల్లో ఉన్నట్లు సంకేతాలిచ్చింది. అయితే.. హర్ముజ్ మా నియంత్రణలోనే.. ట్రంప్ఇరాన్ పరిస్థితి “బాగానే సాగుతోంది” అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. హర్ముజ్ జలసంధిపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని, తమ నౌకాదళం అత్యంత శక్తివంతమైనదని పేర్కొన్నారు. ఇరాన్ను నమ్మలేమని, గతంలో ఆ దేశం పలుమార్లు అబద్ధాలు చెప్పిందని మండిపడ్డారు. అంతేకాదు ఇరాన్తో చర్చల్లో గత దశాబ్దాల ఘర్షణల్లో జరిగిన నష్టాలకు పరిహారం కోరుతామని ట్రంప్ ప్రకటించడం మరింత ఉద్రిక్తతకు కారణమైంది. అయితే ట్రంప్ తాజా ప్రకటనను ఇరాన్ ఎలా స్వీకరిస్తుందనేది చూడాలి.మా ఈ డిమాండ్లు.. నిబంధనలు నేరవేరాల్సిందే!: ఇరాన్హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలంటే అమెరికా తమ డిమాండ్లను అంగీకరించాలని ఇరాన్ స్పష్టం చేసింది. అవి..అమెరికా యుద్ధ చర్యలు, బెదిరింపులకు పూర్తిగా ముగింపుఇరాన్ పోర్టులపై నౌకా దిగ్బంధం ఎత్తివేతఅమెరికా సైనిక బలగాల ఉపసంహరణయుద్ధ నష్టాలకు పరిహారంఆంక్షల తొలగింపుస్తంభింపజేసిన ఇరాన్ నిధుల విడుదలప్రాంతీయ కాల్పుల విరమణ.. ఈ షరతులు నెరవేరే వరకు హర్ముజ్ మూసివేత కొనసాగుతుందని ఇరాన్ జాతీయ భద్రతా మండలి అధికారి మొహ్సెన్ రెజాయి తెలిపారు.ఒమన్ మధ్యవర్తిత్వం.. చర్చలు తుది దశలో?అమెరికా-ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలు లేవని ఇరాన్ చెబుతున్నప్పటికీ.. ఒమన్ మధ్యవర్తిత్వంతో హర్ముజ్ భవిష్యత్ నిర్వహణపై చర్చలు జరుగుతున్నాయి. నౌకల రాకపోకల కోసం కొత్త మార్గాలపై ఒప్పందం చివరి దశకు చేరుకుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తెలిపారు. ఖతార్ కూడా ఇరాన్, ఒమన్ మధ్య చర్చలు గణనీయమైన పురోగతిలో ఉన్నాయని పేర్కొంది.90 డాలర్లకు చేరువలో.. “ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన ఈ మార్గం ద్వారా గతంలో చమురు, ఎల్ఎన్జీ రవాణాలో దాదాపు ఐదో వంతు సాగేది. అయితే సంక్షోభంతో ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు దాదాపు 90 డాలర్లకు చేరువైంది. హర్ముజ్ మార్గం ద్వారా గతంలో ప్రపంచంలోని చమురు, ఎల్ఎన్జీ సరఫరాలో ఐదో వంతు రవాణా అయ్యేది.బాబ్ అల్ మందెబ్లో హౌతీ దాడి.. నలుగురు మృతిమరోవైపు ఎర్ర సముద్రంలోని బాబ్ అల్ మందెబ్ జలసంధిలో హౌతీలు వాణిజ్య నౌకపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు పాకిస్థానీలు, ఒక ఇండోనేషియా పౌరుడు మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. సౌదీ సైనిక సామగ్రిని తరలిస్తున్న నౌకను లక్ష్యంగా చేసుకున్నామని హౌతీలు ప్రకటించారు. అయితే ఆ నౌక సౌదీ యాజమాన్యంలో లేదని, ఈజిప్టు కంపెనీలకు చెందినదని సమాచారం.అటు.. వెస్ట్ బ్యాంక్లో ఉద్రిక్తతలుఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లోనూ పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 76 మంది పాలస్తీనియన్లు, వారిలో 18 మంది చిన్నారులు మరణించారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.ప్రపంచం చూపు హర్ముజ్పైనే!హర్ముజ్ జలసంధిపై అమెరికా, ఇరాన్ వైఖరులు పరస్పర విరుద్ధంగా కొనసాగుతున్న వేళ.. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఉత్కంఠగా మారింది. ఒకవైపు అమెరికా పూర్తి నియంత్రణ తమదేనని చెబుతుండగా.. మరోవైపు తమ షరతులు నెరవేరే వరకు హర్ముజ్ తెరవబోమని ఇరాన్ స్పష్టం చేస్తోంది.చర్చలు పురోగమిస్తాయా? లేదంటే ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా? అన్నదే ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న అతిపెద్ద ప్రశ్న. హర్ముజ్ సంక్షోభం పరిష్కారం కాకపోతే.. దాని ప్రభావం చమురు ధరల నుంచి అంతర్జాతీయ వాణిజ్యం వరకు పడే అవకాశం ఉంది. -
ఇరాన్ నుంచి ముప్పు.. ఏమార్చి కేటరింగ్ ట్రక్కులో ట్రంప్ ప్రయాణం!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రత చుట్టూ ఎప్పుడూ అత్యంత కట్టుదిట్టమైన వలయం ఉంటుంది. అయితే, కొన్ని సందర్భాల్లో భద్రతా ముప్పులు, నిరసనలు లేదా వ్యక్తిగత కారణాల వల్ల ఆయన అనుకోని రీతుల్లో, అత్యంత గోప్యంగా ప్రయాణించాల్సి వచ్చింది. వెనుక ద్వారాల నుంచి దొంగచాటుగా వెళ్లడం, భూగర్భ బంకర్లోకి మారడం, బుల్లెట్ ప్రూఫ్ గోల్ఫ్ కార్ట్లలో తరలింపుతో పాటు.. ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉండటంతో తాజాగా ఎయిర్పోర్టులో కేటరింగ్ ట్రక్కులో ప్రయాణించిన ఉదంతం తీవ్ర చర్చనీయాంశమైంది.గత నెలలో టర్కీలోని అంకారాలో జరిగిన నాటో సదస్సుకు హాజరైన ట్రంప్పై ఇరాన్ నుంచి హత్యాయత్నం ముప్పు పొంచి ఉందన్న నిఘా సమాచారంతో భద్రతా సిబ్బంది వినూత్న వ్యూహాన్ని అమలు చేశారు. విలేకరుల సమక్షంలో ట్రంప్ పాత బోయింగ్ 747 విమానం ఎక్కారు. అయితే, విమానం లోపల నుంచి ఆయన్ను అత్యంత రహస్యంగా ఒక 'కేటరింగ్ ట్రక్'లోకి ఎక్కించి విమానాశ్రయం గుండా మరో చిన్న ఎయిర్ఫోర్స్ సీ-32ఏ విమానానికి తరలించారు.ట్రంప్ అందులోనే ఉన్నాడనే భ్రమ కల్పించడానికి బ్రిటన్కు వెళ్లింది. అందులోని రిపోర్టర్లు, సిబ్బందిని కూడా కిటికీల కర్టెన్లు మూసేయాలని ఆదేశించారు. ట్రంప్ వేరే విమానంలో సురక్షితంగా బ్రిటన్ చేరుకున్నారు. కొన్ని వారాల తర్వాత గానీ ఈ విషయం బయటకు రాలేదు.2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా శాన్ఫ్రాన్సిస్కోలోని హయత్ రీజెన్సీ హోటల్లో కాలిఫోర్నియా రిపబ్లికన్ సమావేశానికి ట్రంప్ హాజరుకావాల్సి వచ్చింది. వందలాది మంది నిరసనకారులు ప్రధాన మార్గాన్ని దిగ్బంధించడంతో ఆయన కాన్వాయ్ దారి మళ్లించారు. హైవే 101 నుంచి దిగి, హోటల్ వెనుక ఉన్న తక్కువ ఎత్తున్న రక్షణ గోడను ట్రంప్ స్వయంగా దూకి లోపలికి వెళ్లారు. వేదికపైకి చేరుకున్నాక నేను నా జీవితంలో ఇంత కష్టపడి ఎప్పుడూ వేదికపైకి రాలేదు అంటూ స్వయంగా ఆయనే చమత్కరించారు.జార్జ్ ఫ్లాయిడ్ మృతి తర్వాత అమెరికా వ్యాప్తంగా చెలరేగిన నిరసనలు వైట్ హౌస్ సరిహద్దుల వరకు చేరాయి. ఆందోళనకారులు వైట్ హౌస్ బారికేడ్లపై వస్తువులు విసురుతుండటంతో సీక్రెట్ సర్వీస్ విభాగం ట్రంప్ను వైట్ హౌస్ కింద ఉన్న అత్యవసర భూగర్భ బంకర్లోకి తరలించింది. ఆయన దాదాపు గంటపాటు అక్కడే ఉన్నారు. విపక్షాలు ఆయన్ను బంకర్ బాయ్ అని ఎగతాళి చేయగా.. తాను దాక్కోవడానికి వెళ్లలేదని, కేవలం బంకర్ను పరిశీలించడానికే వెళ్లానని ట్రంప్ వివరణ ఇచ్చారు.సెప్టెంబర్ 15, 2024న వెస్ట్ పామ్ బీచ్లోని తన గోల్ఫ్ క్లబ్లో ట్రంప్ ఆడుతుండగా, ఫెన్సింగ్ పొదల్లోంచి తుపాకీ గురిపెట్టిన దుండగుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గుర్తించి కాల్పులు జరిపారు. వెంటనే ఏజెంట్లు ట్రంప్కు రక్షణ వలయంగా ఏర్పడి, స్టీల్ రీఇన్ఫోర్స్డ్తో తయారుచేసిన బుల్లెట్ ప్రూఫ్ 'ఫాస్ట్ గోల్ఫ్ కార్ట్'లోకి ఆయన్ను ఎక్కించి క్లబ్హౌస్కు సురక్షితంగా తరలించారు. ఈ సంఘటనపై స్పందించిన ట్రంప్, నాలుగైదు బుల్లెట్ శబ్దాలు వినిపించాయి.. చిట్టచివరి షాట్ కొట్టాలని ఉండేది కానీ, వెంటనే అక్కడి నుంచి సురక్షితంగా బయటపడటమే మంచిదనిపించిందిఅని సరదాగా పేర్కొన్నారు.అధ్యక్షుడిగా గెలిచిన వారం రోజులకే అంటే నవంబర్ 2016 భద్రతా ప్రెస్ బృందానికి సమాచారం ఇవ్వకుండా ట్రంప్ డిన్నర్కు వెళ్లారు. ఆ రాత్రి ఆయన బయటకు రారని అధికారికంగా ప్రకటించిన తర్వాత, ఆయన తన కుటుంబంతో కలిసి రహస్యంగా మాన్హట్టన్లోని '21 క్లబ్' రెస్టారెంట్కు వెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న రిపోర్టర్లు ఆయనను కవర్ చేయడానికి పరుగులు తీశారు. అధ్యక్షుడికి అత్యవసర రక్షణ కవరేజ్ వ్యవస్థ ఉన్నప్పటికీ, వారికి తెలియకుండా డిన్నర్కు వెళ్లడం ఆ సమయంలో తీవ్ర చర్చకు దారితీసింది. -
ట్రంప్ నకు ఇరాన్ ముప్పు టర్కీలో ట్రంప్ సీక్రెట్ ఆపరేషన్
-
యుద్దానికి ముగింపు పలకాలంటే నష్టపరిహారం ఇవ్వాల్సిందే
-
అయ్యో ట్రంప్.. మరీ ఇలానా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రత కోసం చేపట్టిన ఓ అసాధారణ ఆపరేషన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టర్కీ రాజధాని అంకారాలో జరిగిన నాటో సదస్సుకు హాజరైన ట్రంప్.. అక్కడి నుంచి బయలుదేరే సమయంలో కనిపించిన దృశ్యాల వెనుక ఓ రహస్య వ్యూహం ఉన్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.కెమెరాల ముందు ట్రంప్ పాత ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో ఎక్కినట్లు కనిపించారు. కానీ అది కేవలం డీకాయ్ (మభ్యపెట్టే ఏర్పాటు) మాత్రమేనని.. అసలు ఆయనను ఓ చిన్న సైనిక విమానంలోకి రహస్యంగా తరలించినట్లు సమాచారం. ఈ మొత్తం ఆపరేషన్లో ఓ సాధారణ క్యాటరింగ్ ట్రక్ కీలక పాత్ర పోషించడం ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది.టర్కీ నుంచి బయలుదేరే ముందు ట్రంప్ పాత ఎయిర్ఫోర్స్ వన్లో ప్రయాణిస్తారని అధికారికంగా ప్రకటించారు. అయితే ఆ సమయంలో ఇరాన్ నుంచి ముప్పు ఉందన్న నిఘా సమాచారంతో భద్రతా అధికారులు చివరి నిమిషంలో ప్రణాళిక మార్చినట్లు తెలుస్తోంది.ట్రంప్ ముందుగా ఎయిర్ఫోర్స్ వన్లోకి ఎక్కినట్లు కనిపించిన తర్వాత.. విమానం మరో వైపు నుంచి క్యాటరింగ్ ట్రక్ దగ్గరకు వెళ్లింది. సాధారణంగా విమానాలకు ఆహారం, ఇతర సరఫరాలు అందించే ఆ వాహనాన్ని ఈసారి భద్రతా వ్యూహంలో భాగంగా ఉపయోగించారు. ట్రక్ సహాయంతో ట్రంప్, ఆయన సిబ్బందిని ఎవరికీ కనిపించకుండా బయటకు తీసుకొచ్చి C-32A సైనిక విమానంలోకి తరలించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.డీకాయ్గా పాత విమానం.. అసలు ప్రయాణం మరో విమానంలోఈ వ్యూహం కారణంగా మీడియా ప్రతినిధులు, కొంతమంది సిబ్బంది కూడా ట్రంప్ పాత ఎయిర్ఫోర్స్ వన్లోనే ప్రయాణిస్తున్నారని భావించారు. కానీ ఆయన మాత్రం C-32A విమానంలో బ్రిటన్కు చేరుకున్నట్లు సమాచారం.ఎందుకీ రహస్య ఆపరేషన్?ట్రంప్ టర్కీలో ఉన్న సమయంలో ఇరాన్ అనుబంధ వర్గాల నుంచి ముప్పు ఉందన్న నిఘా సమాచారం అందినట్లు నివేదికలు తెలిపాయి. అధ్యక్షుడి ప్రయాణ మార్గం, విమానం వివరాలు బయటకు వెళ్లకుండా ఉండేందుకు ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.ఖతార్ విమానంపై మళ్లీ చర్చఈ ఘటనతో ఖతార్ అందించిన కొత్త బోయింగ్ 747-8 విమానం భద్రతా సామర్థ్యాలపై మరోసారి చర్చ మొదలైంది. అయితే వైట్హౌస్ మాత్రం అధ్యక్షుడి రక్షణ కోసం అత్యున్నత భద్రతా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.అగ్రరాజ్య అధ్యక్షుడి ప్రయాణం(అందునా ట్రంప్).. రెండు విమానాలు.. రహస్య మార్గం.. ఓ క్యాటరింగ్ ట్రక్.. ట్రంప్ భద్రతా ఆపరేషన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చగా మారింది. -
రివర్స్ రీయింబర్స్మెంట్.. ట్రంప్ నయా గేమ్!
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి చుట్టూ మొదలైన వివాదం ఇప్పుడు దౌత్యపరమైన ఆధిపత్య పోరుగా మారింది. ఐదు నెలలపాటు కొనసాగిన ఘర్షణల తర్వాత పరిస్థితులు కొంత చల్లబడతాయని భావిస్తున్న సమయంలో.. ఇరు దేశాలు పరస్పరం కొత్త డిమాండ్లు, ఆరోపణలతో ముందుకు రావడం అంతర్జాతీయ ఆందోళనలకు కారణమవుతోంది.యుద్ధంలో తమకు జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించాలని, అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ డిమాండ్లను తిరస్కరించడమే కాకుండా.. గత ఘర్షణల్లో అమెరికా పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోవడానికి ఇరాన్ బాధ్యత వహించాలని, తమ నష్టాలకు టెహ్రాన్ నుంచే పరిహారం కోరుతామని స్పష్టం చేశారు.హర్ముజ్ తెరవాలంటే ఇరాన్ షరతులుహర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ తన వైఖరిని కఠినంగా వెల్లడించింది. అమెరికా చర్యల కారణంగా తమ దేశానికి జరిగిన నష్టాలను భర్తీ చేయాలని, అంతర్జాతీయ ఆంక్షల నుంచి ఉపశమనం కల్పించాలని కోరుతోంది. యుద్ధ పరిస్థితుల్లో నిలిచిపోయిన తమ ఆస్తులను విడుదల చేయాలని, మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించాలని కూడా టెహ్రాన్ డిమాండ్ చేస్తోంది.ఈ డిమాండ్లపై స్పష్టమైన హామీ లభించే వరకు హర్ముజ్ విషయంలో తమ వైఖరిలో మార్పు ఉండకపోవచ్చనే సంకేతాలను ఇరాన్ ఇస్తోంది. హర్ముజ్ జలసంధి తమ భద్రత, ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశమని టెహ్రాన్ చెబుతోంది.ట్రంప్ ఎదురుదాడి.. ‘పరిహారం మాకే రావాలి’ఇరాన్ డిమాండ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. యుద్ధంలో అమెరికన్ల ప్రాణ నష్టానికి, గత ఘర్షణల్లో జరిగిన నష్టాలకు ఇరాన్ బాధ్యత వహించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ నుంచి పరిహారం కోరుతామని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్కు అమెరికా పరిహారం చెల్లించాలన్న డిమాండ్ను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. గతంలో ఇరాన్ చర్యల వల్ల అమెరికా ఎదుర్కొన్న నష్టాలను ప్రస్తావిస్తూ.. బాధ్యత టెహ్రాన్పైనే ఉందని వాదిస్తున్నారు.ఆంక్షలతో ఒత్తిడి పెంచాలన్న అమెరికా వ్యూహంప్రస్తుతం ఇరాన్పై సైనిక చర్యల కంటే ఆర్థిక ఒత్తిడి పెంచడంపైనే అమెరికా దృష్టి పెట్టిందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు తీవ్రతరం అయితే ఇరాన్ చర్చలకు రావాల్సి వస్తుందని ట్రంప్ వర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఇరాన్ మాత్రం అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని చెబుతోంది. ఆంక్షలు తమను బలహీనపర్చేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నమని ఆరోపిస్తూ.. తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని మార్గాల్లో పోరాడతామని స్పష్టం చేస్తోంది.ప్రపంచానికి ఎందుకు కీలకం హర్ముజ్?పర్షియన్ గల్ఫ్ను ఒమన్ గల్ఫ్తో కలిపే సన్నని సముద్ర మార్గమే హర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాలో ఇది అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటి. మధ్యప్రాచ్యం నుంచి అంతర్జాతీయ మార్కెట్లకు వెళ్లే భారీ స్థాయి ఇంధన సరఫరా ఈ మార్గంపైనే ఆధారపడి ఉంటుంది. హర్ముజ్లో ఏదైనా అంతరాయం ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇంధన సరఫరాలో అనిశ్చితి ఏర్పడటంతో పాటు అంతర్జాతీయ వాణిజ్యంపైనా ప్రభావం పడే ప్రమాదం ఉంది. అందుకే ఇరాన్–అమెరికా వివాదంలో హర్ముజ్ జలసంధి కేంద్ర బిందువుగా మారింది.ట్రంప్పై ఎన్నికల ఒత్తిడి.. ఇరాన్కు కలిసొస్తుందా?అమెరికాలో రాజకీయ పరిణామాలు కూడా ఈ సంక్షోభంపై ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్తో దీర్ఘకాలిక ఘర్షణ కొనసాగితే దేశీయంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మాజీ అమెరికా అధికారి చార్లెస్ కుప్చాన్ అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల ఒత్తిడి కారణంగా చర్చల్లో ఇరాన్కు కొంత వ్యూహాత్మక ఆధిక్యం లభించే అవకాశం ఉంది. అయితే అదే సమయంలో టెహ్రాన్ చేస్తున్న డిమాండ్లు అమెరికాకు అంగీకరించలేని స్థాయిలో ఉన్నాయని ఆయన విశ్లేషించారు.కొనసాగుతున్న ఉద్రిక్తతలుఇరాన్–అమెరికా వివాదం ప్రభావం పశ్చిమాసియాలో ఇతర ప్రాంతాలపైనా కనిపిస్తోంది. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండగా.. యెమెన్లో హౌతీ దళాల చర్యలు పరిస్థితులను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. గాజా శాంతి ప్రయత్నాలపైనా అనిశ్చితి కొనసాగుతోంది.హర్ముజ్ తాళం ఎవరి చేతిలో?ప్రస్తుతం అమెరికా–ఇరాన్ మధ్య అసలు పోరు కేవలం పరిహారం, ఆంక్షల అంశానికే పరిమితం కాలేదు. ఇది మిడిల్ఈస్ట్లో ఆధిపత్యం, భద్రత, ప్రపంచ ఇంధన సరఫరాలపై ప్రభావం చూపే పెద్ద సంక్షోభంగా మారింది.ఇరాన్ తన డిమాండ్లపై పట్టుబడుతుండగా.. ట్రంప్ కూడా వెనక్కి తగ్గే సూచనలు ఇవ్వడం లేదు. చర్చల ద్వారా పరిష్కారం లభిస్తుందా? లేదంటే హర్ముజ్ జలసంధి మరోసారి ప్రపంచ సంక్షోభానికి కేంద్రంగా మారుతుందా? అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న. -
ఇరాన్కు ట్రంప్ బిగ్ షాక్.. ఇక పరిహారం కూడా చెల్లించాల్సిందే!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్పై తీవ్ర ఆరోపణలు చేశారు. భవిష్యత్లో జరిగే శాంతి చర్చల్లో భాగంగా.. దశాబ్దాలుగా ఇరాన్ మద్దతుతో జరిగిన దాడులు, ఘర్షణల్లో అమెరికన్లకు జరిగిన నష్టానికి ఇరాన్ నుంచి నష్టపరిహారం కోరాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో ఆయన ఓ పోస్ట్ చేశారు.గత ఐదు నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో ఇరాన్కు జరిగిన నష్టానికి ఆ దేశం పరిహారం కోరుతున్న విషయాన్ని ప్రస్తావించిన ట్రంప్.. అదే తరహాలో అమెరికా కూడా ఇరాన్ నుంచి పరిహారం కోరడం ‘ఆసక్తికరమైన ఆలోచన’ అని పేర్కొన్నారు. ఇరాన్ కోరుతున్న నష్టపరిహారం అంశం అమెరికాతో జరిగిన చర్చల్లో ఇప్పటివరకు ప్రస్తావనకు రాలేదని ఆయన అన్నారు.దశాబ్దాల నాటి ఘటనల ప్రస్తావనతన నష్టపరిహారం డిమాండ్కు మద్దతుగా గతంలో జరిగిన పలు ఘటనలను ట్రంప్ ప్రస్తావించారు. ఇరాన్ మద్దతుతో జరిగిన రోడ్డు పక్క బాంబు దాడులు, ఇతర ఘర్షణల్లో అమెరికా సైనికులు మరణించడం, తీవ్రంగా గాయపడటాన్ని ఆయన ప్రస్తావించారు. ఇరాన్ మాజీ సైనిక కమాండర్ ఖాసిమ్ సొలైమానీ పేరు కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.2000 అక్టోబర్లో యెమెన్లోని ఓడరేవులో అమెరికా నావికాదళానికి చెందిన యూఎస్ఎస్ కోల్పై జరిగిన బాంబు దాడిని కూడా ట్రంప్ ఉదహరించారు. ఆ ఘటనలో 17 మంది అమెరికా నావికులు మరణించగా.. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ దాడికి అల్ఖైదానే కారణమని ఎఫ్బీఐ గతంలో పేర్కొంది.నిరసనకారుల కుటుంబాలకూ పరిహారం?గత ఐదు దశాబ్దాల్లో ఇరాన్లో జరిగిన ప్రజా ఉద్యమాలు, నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కూడా పరిహారం అందించాలని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత ఐదు నెలల యుద్ధంలో మరణించినట్లు తాను పేర్కొన్న సుమారు 52 వేల మందికి సంబంధించిన నష్టపరిహారం అంశాన్ని కూడా చర్చల్లో చేర్చాలని తన ప్రతినిధులకు సూచించినట్లు తెలిపారు.హర్మూజ్పై ఇరాన్ కీలక డిమాండ్మరోవైపు హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ తన వైఖరిని స్పష్టం చేసింది. అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో పాటు.. యుద్ధం కారణంగా జరిగిన నష్టానికి పరిహారం చెల్లించి, ఆర్థిక ఆంక్షలను తొలగించి, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేసే వరకు హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవబోమని ఇరాన్ చెబుతోంది.ప్రాంతీయ వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోవద్దని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కూడా డిమాండ్ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్-అమెరికా మధ్య భవిష్యత్ శాంతి చర్చలు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం కనిపిస్తోంది. -
మొజ్తాబా ఖమేనీ ఎక్కడ?.. ఇరాన్ సంచలన ప్రకటన
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడుతుందా? ఆయన బహిరంగంగా కనిపించకపోవడంతో చుట్టుముడుతున్న అనుమానాల మధ్య ఇరాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మోజ్తబా ఖమేనీకి సంబంధించిన మరిన్ని వీడియోలు, ఫొటోలను త్వరలో విడుదల చేస్తామని వెల్లడించింది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరోసారి అంతర్జాతీయంగా చర్చ మొదలైంది.అసలు ఏం జరుగుతోంది?తన తండ్రి, మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి అనంతరం మార్చిలో ఇరాన్ అత్యున్నత నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన మొజ్తాబా ఖమేనీ.. అప్పటి నుంచి బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయనకు సంబంధించిన తాజా, స్పష్టమైన దృశ్యాలు పెద్దగా బయటకు రాకపోవడంతో ఆరోగ్యంపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అలాగే, ఇటీవల ఇజ్రాయెల్ మీడియా సైతం మోజ్తబా ఖమేనీ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందంటూ కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి వచ్చిన తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.‘త్వరలో మరిన్ని వీడియోలు’బసీజ్ ఆర్గనైజేషన్ డిప్యూటీ అధికారి ఖాసెమ్ ఖొరైషీ మాట్లాడుతూ.. మొజ్తాబా ఖమేనీ ప్రజల్లో ఉన్న దృశ్యాలు, వీధుల్లో పర్యటిస్తున్న వీడియోలు, సాయుధ దళాల కమాండర్లతో సమావేశాల దృశ్యాలను త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న అనుమానాలు, విమర్శలకు సమాధానం చెప్పేందుకే ఈ దృశ్యాలను బయటకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.ఆగస్టు 9న ఓ వీడియో విడుదలఇప్పటికే ఆగస్టు 9న ఇరాన్కు చెందిన సెమీ-అధికారిక మెహర్ న్యూస్ ఏజెన్సీ ఖమేనీకి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది. అయితే ఆ వీడియో ఎప్పుడు చిత్రీకరించారనే విషయాన్ని వెల్లడించలేదు. వీడియోలో ఖమేనీ తన అనుచరులతో మాట్లాడుతున్నట్లు కనిపించారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారనే సందేశాన్ని ఇవ్వడమే ఈ వీడియో ఉద్దేశంగా కనిపించింది.మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. జూలై 21న మోజ్తబా ఖమేనీతో తన సంప్రదింపులు క్రమంగా పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. కానీ ఆగస్టు ప్రారంభంలో మాత్రం.. ఖమేనీతో కమ్యూనికేషన్ “చాలా కష్టంగా ఉంది” అని వ్యాఖ్యానించారు. ఈ రెండు భిన్న వ్యాఖ్యలు ఆయన వాస్తవంగా ఎంతవరకు ప్రభుత్వ వ్యవహారాల్లో చురుకుగా ఉన్నారనే ప్రశ్నలకు దారితీశాయి. కాగా, జూలై చివర్లో మసూద్ పెజెష్కియన్.. మొజ్తాబా ఖమేనీని కలిసినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఈ సమావేశంలో సైనిక వ్యవహారాలతో పాటు విదేశీ మారకద్రవ్య నిర్వహణ, ఇంధన వినియోగం, అంతర్జాతీయ భాగస్వాములతో ఆర్థిక సంబంధాల వంటి కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.అందరి చూపూ ఆ వీడియోలపైనే!ఖమేనీ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టేందుకు ఇరాన్ ప్రభుత్వం మరిన్ని దృశ్యాలను విడుదల చేయనున్న నేపథ్యంలో.. ఆ వీడియోలు ఎప్పుడు చిత్రీకరించబడ్డాయి? ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన ఎంత చురుకుగా ఉన్నారా? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా.. ఇప్పటివరకు విడుదలైన వీడియోలు ఎక్కువగా తేదీ వెల్లడించనివే కావడంతో, కొత్తగా విడుదలయ్యే దృశ్యాలను అంతర్జాతీయ పరిశీలకులు నిశితంగా గమనించే అవకాశం ఉంది. -
ఇరాన్ను లొంగదీసుకునేందుకు మరో మాస్టర్ప్లాన్!
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు ఇరాన్పై తీవ్ర హెచ్చరికలు చేస్తూ.. మరోవైపు చర్చలకు తలుపులు తెరిచి ఉంచుతున్న ఆయన తీరు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. “ఇది యుద్ధం కాదు.. చెస్ గేమ్ లాంటిది” అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆయన వ్యూహానికి అద్దం పడుతున్నాయి. సైనిక చర్యల కంటే ముందుగా ఆర్థిక ఒత్తిడి, ఆంక్షలు, దౌత్యపరమైన ఎత్తుగడలతో ఇరాన్ను చర్చల బాట పట్టించాలన్నది అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది. ఇరాన్తో అమెరికా ప్రస్తుతం “పాక్షిక చర్చలు మాత్రమే” జరుపుతోందని ట్రంప్ తాజాగా స్పష్టం చేశారు. “ఇరాన్లో భారీ ద్రవ్యోల్బణం ఉంది. వారి వద్ద డబ్బు లేదు. మేం పరిస్థితిని గమనిస్తున్నాం” అని ట్రంప్ పేర్కొన్నట్లు అమెరికా మీడియా సంస్థ ఆక్సియోస్ తెలిపింది.వెంటనే మరో సైనిక చర్యకు దిగకుండా.. ఇరాన్ ఆర్థిక పరిస్థితిని మరింత ఒత్తిడికి గురిచేసే విధానాన్ని అనుసరిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.ఇటీవల ఇరాన్పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ట్రంప్.. ఇప్పుడు మాట మార్చడం వెనుక వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం వల్ల అమెరికాపై పడే ఆర్థిక, రాజకీయ ప్రభావాలను అంచనా వేసుకుంటూనే.. ఒత్తిడి ద్వారా ఫలితం సాధించాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.ఓసారి దాడుల మాట.. మరోసారి చర్చల బాట!ట్రంప్ విదేశాంగ విధానంలో ఈ మార్పు కొత్తది కాదు. ప్రత్యర్థి దేశాలపై గరిష్ఠ ఒత్తిడి తీసుకురావడం.. ఆ తర్వాత చర్చలకు మార్గం సుగమం చేయడం ఆయన శైలిలో కనిపించే అంశం. ఇరాన్ విషయంలోనూ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు సైనిక శక్తిని ప్రదర్శిస్తూ హెచ్చరికలు చేయడం.. మరోవైపు చర్చలకు అవకాశం ఉందని చెప్పడం ద్వారా టెహ్రాన్పై మానసిక ఒత్తిడి పెంచే ప్రయత్నం జరుగుతోందని అంచనాలు ఉన్నాయి.“ఇది చెస్ ఆట లాంటిది. చివరకు అంతా సర్దుకుంటుంది” అని ట్రంప్ చెప్పడం కూడా ఈ వ్యూహాన్నే సూచిస్తోంది. చమురు ధరలు తగ్గుతున్నాయని, దీంతో యుద్ధ ప్రభావం అమెరికా ప్రజలపై పెద్దగా పడటం లేదని ఆయన పేర్కొన్నారు.మారిన సమీకరణాలుఅమెరికా–ఇరాన్ వివాదం కొత్తది కాదు. ఇరాన్ అణు కార్యక్రమం చుట్టూ మొదలైన వివాదం.. ఆంక్షలు, చమురు ఎగుమతులు, ప్రాంతీయ ఆధిపత్య పోరు వరకు విస్తరించింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ప్రధాన పట్టు హర్ముజ్ జలసంధిపై ఉంది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ మార్గం ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది.హర్ముజ్ను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలంటే అమెరికా ముందుగా నౌకాదళ ఆంక్షలు, చమురు ఆంక్షలను తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది.అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మాట్లాడుతూ.. అమెరికాతో నేరుగా చర్చలు జరగడం లేదని, కానీ మధ్యవర్తుల ద్వారా చర్చలకు అనుకూల వాతావరణం కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.అదసలు సాధ్యమేనా?ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి అమెరికాకు కొత్త వ్యూహం కాదు. దశాబ్దాలుగా అమలు చేస్తున్న ఆంక్షల కారణంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. చమురు ఎగుమతులు, విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థపై ఆంక్షలు ఆ దేశ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేశాయి. అయితే ఇరాన్ను పూర్తిగా లొంగదీయడం మాత్రం అంత సులభం కాలేదు. ఆంక్షల మధ్య కూడా చైనా వంటి దేశాలకు చమురు విక్రయించడం, ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలు అనుసరించడం ద్వారా టెహ్రాన్ కొంతవరకు నష్టాన్ని భర్తీ చేసుకుంటోంది.అంటే.. ఆంక్షలు ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్నప్పటికీ, అవి ఇప్పటివరకు ఆ దేశాన్ని పూర్తిగా అమెరికా షరతులకు తలొగ్గే స్థాయికి తీసుకురాలేదని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు ట్రంప్ ఆర్థిక ఒత్తిడితో పాటు దౌత్యపరమైన ఒత్తిడిని కూడా కలిపి ప్రయోగిస్తున్నట్లు కనిపిస్తోంది.ట్రంప్కు నెతన్యాహూ షాక్ఇదిలా ఉండగా.. గాజా అంశంలో అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ పూర్తిగా ఆయుధాలు పక్కన పెట్టేంత వరకు గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ ఉండదని నెతన్యాహూ స్పష్టం చేశారు. ఈ అక్టోబర్లో ఇజ్రాయెల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. తన దేశ ప్రజల ముందు తాను కఠిన వైఖరినే కొనసాగిస్తున్నానని చూపించుకోవాల్సిన రాజకీయ ఒత్తిడి కూడా ఆయనపై ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.హౌతీల దాడులతో మరింత ఉద్రిక్తతమరోవైపు యెమెన్లో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలోని అల్-మఖా పోర్టుపై దాడి చేశారు. ఈ ఘటనలో కనీసం ఏడుగురు మరణించినట్లు సమాచారం. హౌతీల చర్యలు, హార్ముజ్ వివాదం, గాజా యుద్ధ పరిణామాలు కలిసి మధ్యప్రాచ్య పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయి.ట్రంప్ వ్యూహం ఫలిస్తుందా?ఇరాన్తో ఘర్షణను పూర్తిస్థాయి యుద్ధంగా మార్చకుండా.. ఆర్థిక ఒత్తిడి, చర్చలు, వ్యూహాత్మక బెదిరింపులతో తన లక్ష్యాలను సాధించాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. అయితే ఇరాన్ కూడా వెనక్కి తగ్గే పరిస్థితిలో లేదు. అణు కార్యక్రమం, చమురు ఆంక్షలు, హార్ముజ్ జలసంధి వంటి అంశాలపై రెండు దేశాల మధ్య భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ట్రంప్ ఆడుతున్న ఈ ‘చెస్ గేమ్’లో ఇరాన్ చివరకు ఏ ఎత్తు వేస్తుంది? లేదంటే ఈ వ్యూహం మరోసారి పశ్చిమాసియా యుద్ధం అంచులకు తీసుకెళ్తుందా?.. రాబోయే రోజుల్లోనే తెలిసేది. -
అమెరికాకు ఇరాన్ పెట్టిన షరతులు ఇవే..!
-
రూమర్స్ కు చెక్.. మొజ్తాబా ఖమేనీ బతికే ఉన్నాడు..! వైరల్ అవుతున్న వీడియో
-
హార్మూజ్పై ఇరాన్ కీలక ప్రకటన
అమెరికా తన బుద్ధిని మార్చుకోనంత వరకు హార్మూజ్ జలసంధిని తెరిచేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మహ్మద్ బఘెర్ జొల్ఘాదర్ ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనను ప్రభుత్వ మీడియా ప్రసారం చేసింది.‘అమెరికా ఇకపై ఇరాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ బెదిరించే ప్రయత్నం చేయరాదు. ఇరాన్, ఈ ప్రాంతంలోని ఇరాన్ మిత్ర పక్షాలపై అమెరికా దాడులు మానుకోవాలి. ఇరాన్ నౌకాశ్రయాల నుంచి అమెరికా వైదొలగాలి. ఈ ప్రాంతం నుంచి అమెరికా సేనలు వెనక్కి వెళ్లిపోవాలి. ఇరాన్కు పూర్తి యుద్ధ పరిహారం చెల్లించాలి. ఆంక్షలను ఎత్తి వేయాలి. స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను బేషరతుగా విడుదల చేయాలి..’వంటి డిమాండ్లు కూడా ఆ ప్రకటనలో ఉన్నాయి.శక్తివంతమైన రివల్యూషనరీ గార్డ్ విభాగానికి జొల్ఘాదర్ కమాండర్గా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే, ఇరాన్ ప్రకటనపై అమెరికా స్పందించలేదు. తమ రెండు దేశాల మధ్య నుంచి వెళ్తున్న హార్మూజ్ జలసంధి ఉమ్మడి నిర్వహణపై ఒమన్తో ఒప్పందం తుది దశకు చేరుకుందని అంతకుముందు ఇరాన్ ప్రకటించింది. -
హర్ముజ్లో హైటెన్షన్కు తెర.. అమెరికా–ఇరాన్ కీలక ఒప్పందం
హర్ముజ్ జలసంధి విషయంలో అమెరికా- ఇరాన్ మధ్య కీలక ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఒమన్ దేశం దౌత్యంతో అంతర్జాతీయ నౌకయానాన్ని పునరుద్ధించేందుకు ఇరు దేశాల మధ్య రహస్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు శాంతి ఒప్పంద ప్రతిపాదనలపై ఇరు దేశాలు సంతకం చేశాయని సమాాచారం.ఒకదేశ అంతరంగిక వ్యవహారాల్లో మరో దేశం తలదూర్చకూడదని ఇరు దేశాల సౌర్వభౌమాధికారాన్ని పరస్పరం గౌరవించుకోవాలని ఒప్పందంలో పేర్కొన్నాయి. హర్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల ప్రయాణానికి సురక్షితంగా తరలివెళ్లేలా మార్గం ఇస్తే ఇరాన్కు సంబంధించిన ఆర్థిక ఆంక్షలను సడలించనున్నట్లు అమెరికా ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంతో ఇక చమురధరలు తగ్గే అవకాశం ఉంది.కాగా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల తర్వాత హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఈ జలసంధిని తెరవాలని అమెరికా ఇరాన్ను పలుమార్లు కోరినప్పటికీ ఒప్పందం కుదిరినప్పటికీ ఇరాన్ ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా రహస్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. -
మొజ్తబాకు ఏమైంది..? ఖమేనీ ఆరోగ్యంపై ఉత్కంఠ
-
అమెరికానే కాపాడలేకపోయింది.. ఇంక పాక్-టర్కీ ఏం చేస్తాయి?
పశ్చిమాసియాలో మారుతున్న భద్రతా సమీకరణాలకు సంకేతంగా పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ మూడు దేశాలు కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో కుదిరిన ఈ ఒప్పందం ప్రాంతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఒక దేశంపై దాడిని మిగిలిన రెండు దేశాలపై దాడిగా పరిగణించేలా రూపొందించిన ఈ రక్షణ కూటమి.. సౌదీ భద్రతా వ్యూహంలో కీలక మార్పుగా మారింది. అయితే ఈ ఒప్పందంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది.టర్కీ, పాకిస్థాన్తో చేసుకున్న రక్షణ ఒప్పందాలు సౌదీ అరేబియాకు శాశ్వత భద్రతను అందించలేవని ఇరాన్ విమర్శించింది. అమెరికానే కాపాడలేకపోతోంది.. ఇంక పాక్ టర్కీలు వచ్చి ఏం చేస్తాయి?.. ఏం సాధిస్తాయి? అంటూ డీల్పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశీ వ్యవహారాల కమిషన్ సభ్యుడు ఎబ్రహీం రెజాయీ ఈ మేరకు ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘కాగితపు ఒప్పందాలతో భద్రత రాదు’సోషల్ మీడియా వేదికగా స్పందించిన రెజాయీ.. “టర్కీ, పాకిస్థాన్తో కుదుర్చుకున్న కాగితపు ఒప్పందాలు సౌదీకి భద్రతను తీసుకురావు. అమెరికాతో ఎన్నో ఏళ్లుగా కొనసాగించిన సంబంధాలు కూడా సౌదీకి భద్రత ఇవ్వలేదు” అని వ్యాఖ్యానించారు. సౌదీ తన విధానాలను మార్చుకుంటే ఇతర దేశాల నుంచి భద్రత కోసం ఆధారపడాల్సిన అవసరం ఉండదని ఆయన పేర్కొన్నారు. గతంలో సౌదీ భద్రత కోసం అమెరికాపై ఆధారపడిన తీరును ప్రస్తావిస్తూ ఇరాన్ ఈ విమర్శలు చేసింది.మక్కా వేదికగా మూడు దేశాల డిఫెన్స్ డీల్అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ మధ్య ఈ రక్షణ ఒప్పందం కుదిరింది. ఇస్లాం పవిత్ర నగరమైన మక్కాలో జరిగిన సమావేశంలో మూడు దేశాల నేతలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ సందర్భంగా ఈ ఒప్పందం ఖరారైంది. మూడు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, ఉమ్మడి భద్రతా వ్యూహాలను రూపొందించడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యాలుగా పేర్కొన్నారు.ఒకరిపై దాడి.. ముగ్గురిపై దాడిగానే!ఈ రక్షణ ఒప్పందంలోని కీలక అంశం పరస్పర భద్రత. మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై అయినా సాయుధ దాడి జరిగితే.. దాన్ని మిగిలిన రెండు దేశాలపై జరిగిన దాడిగా పరిగణించేలా నిబంధనలు రూపొందించారు. దాడి జరిగిన సమయంలో పరస్పర సహకారం, రక్షణ రంగంలో సమన్వయం పెంచుకోవడం ఈ ఒప్పందం లక్ష్యమని పాకిస్థాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. మూడు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు, ఉమ్మడి వ్యూహాత్మక ప్రయోజనాల ఆధారంగా ఈ ఒప్పందం కుదిరినట్లు తెలిపింది.సౌదీ ఎందుకు కొత్త రక్షణ భాగస్వామ్యాల వైపు?ఇరాన్తో పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ అరేబియా తన రక్షణ భాగస్వామ్యాలను విస్తరిస్తోంది. గతంలో సౌదీ చమురు కేంద్రాలు, కీలక మౌలిక వసతులపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిగాయి. ఈ దాడుల వెనుక ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు, ఇరాక్లోని మిలీషియా గ్రూపులు ఉన్నాయని సౌదీ ఆరోపించింది. దీంతో భద్రత విషయంలో కేవలం ఒకే దేశంపై ఆధారపడకుండా కొత్త భాగస్వామ్యాలను పెంచుకోవాలని రియాద్ భావిస్తోంది.ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం, గల్ఫ్ ప్రాంతంలో నౌకాయానం ప్రభావితమవడం వంటి పరిణామాలు కూడా ఈ రక్షణ ఒప్పందానికి కారణాలుగా మారాయి.భారత్-పాక్ కోణంలోనూ చర్చఈ ఒప్పందం మరో కోణంలోనూ చర్చకు దారితీస్తోంది. ఒకవేళ భవిష్యత్లో పాకిస్థాన్పై భారత్ సైనిక చర్య చేపడితే ఈ రక్షణ ఒప్పందం ఎలా ప్రభావితం చేస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒప్పందంలోని పరస్పర రక్షణ నిబంధన ప్రకారం.. పాకిస్థాన్పై జరిగే దాడిని మిగిలిన దేశాలు ఎలా పరిగణిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇలాంటి రక్షణ ఒప్పందాల్లో ప్రతిస్పందన విధానం, సైనిక సహాయం, దౌత్య మద్దతు వంటి అంశాలు ఆయా దేశాల నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. ఆ లెక్కన.. ఈ ఒప్పందం ఉన్నంత మాత్రాన సౌదీ అరేబియా, టర్కీ వెంటనే ఏదైనా ఘర్షణలోకి దిగాల్సిందేనని స్పష్టమైన హామీ లేదు.మారుతున్న సమీకరణాలుపాక్, సౌదీ, టర్కీ రక్షణ ఒప్పందం మధ్యప్రాచ్య రాజకీయాల్లో కొత్త మార్పులకు సంకేతంగా మారింది. ఒకవైపు ఇరాన్ తన ప్రాంతీయ ప్రభావాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తుండగా.. మరోవైపు సౌదీ తన భద్రతా వ్యవస్థను విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో మూడు దేశాల కొత్త రక్షణ కూటమి భవిష్యత్లో పశ్చిమాసియా శక్తి సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. -
చీకట్లో రహస్య మీటింగ్.. కారులో మెుజ్తాబానేనా?
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం మెుజ్తాబా ఖమేనీ ఉనికిపై ఇప్పుడు ఎంతో సస్పెన్స్ నెలకొంది. ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో ఆయతుల్లా ఖమేనీ మరణించిన అనంతరం ఇరాన్ సుప్రీంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి వరకూ ఆయన ఎక్కడ బహిరంగంగా కనిపించింది లేదు చివరకు ఖమేనీ అంత్యక్రియలకు సైతం ఆయన హాజరుకాలేదు. దీంతో ఆయన బ్రతికి ఉన్నారా లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ మీడియా సంచలన కథనం ప్రచురించింది. ఇరాన్ అధ్యక్షుడు ఇటీవలే మోజ్తాబాతో రహస్యంగా భేటీ అయినట్లు వార్త ప్రచురించింది. రహస్య భేటీఇరాన్ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం, "పెజెష్కియన్ను ఆయన భద్రతా సిబ్బంది టెహ్రాన్లోని ఒక రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆయనను తన అధికారిక వాహనం నుంచి దించి, టింటెడ్ అద్దాలు ఉన్న ఒక సాధారణ కారులోకి ఎక్కించారు. ఆ కారులో మొజ్తబా ఖమేనీ వేచి ఉన్నారు. అయితే ఆ ప్రదేశంలో పూర్తిగా చీకటి ఉండటంతో ఇద్దరూ ఒకరినొకరు చూడలేకపోయారు. సమావేశం కేవలం కొన్ని నిమిషాలే కొనసాగింది, అనంతరం పెజెష్కియన్ను వెంటనే అక్కడి నుంచి పంపించారు". అంతేకాదు, ఖమేనీ భద్రతా సిబ్బంది ఆయనకు చేతులు కలిపే అవకాశం కూడా ఇవ్వలేదని పేర్కొంది.మెుజ్తాబా ఖమేనీ ఉనికిపై సందేహంఅధ్యక్షుడి కార్యాలయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సమావేశం తనను అవమానించినట్టుగా అనిపించిందని పెజెష్కియన్ భావించారని, తర్వాత తాను మాట్లాడింది నిజంగానే మొజ్తబా ఖమేనీయేనా అని ప్రశ్నించినట్లు నివేదిక వెల్లడించింది. ఈ భేటీ తర్వాత ఖమేనీ అధికారిక నివాసంలో మరోసారి సమావేశం కావాలని పెజెష్కియన్ కోరినా, ఆ అభ్యర్థనను తిరస్కరించినట్లు సమాచారం. అనంతరం ఈ అంశంపై పెజెష్కియన్ మాట్లాడుతూ ఖమేనీతో మాట్లాడటం ఇప్పుడు చాలా కష్టంగా మారిందని అన్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడటం చాలా కష్టం. అయినప్పటికీ ఆయన ఉనికి మాకు గొప్ప బలాన్ని ఇస్తోంది. దాని వల్లనే మేము ముందుకు సాగగలుగుతున్నాం అని ఆయన తెలిపినట్లు కథనాలు ప్రచురించాయి.రాజీనామా బెదిరింపులతో మీటింగ్ ఇరాన్ మీడియా కథనం ప్రకారం, ఖమేనీని కలవడానికి పెజెష్కియన్ పలుమార్లు ప్రయత్నించారు. తనకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని కూడా హెచ్చరించారు. దీంతో చివరకు ఖమేనీ కార్యాలయం సమావేశానికి అంగీకరించిందని తెలిపింది. సంప్రదాయం ప్రకారం ఆయన నివాసంలో కాకుండా వేరే రహస్య ప్రదేశంలో భేటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఖమేనీ ఉనిపై ట్రంప్ "వారి నౌకాదళం లేదు, వైమానిక దళం లేదు. వారి వైమానిక రక్షణ వ్యవస్థ నాశనమైంది. వారి ప్రధాన నాయకులు చనిపోయారు. ఖమేనీ వెళ్లిపోయాడు. ఆయన కుమారుడు కూడా 90 శాతం వరకు అంతమైపోయాడు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
ఇరాన్ యుద్ధం.. ట్రంప్ బిగ్ సిగ్నల్
పశ్చిమాసియాను కుదిపేస్తున్న యుద్ధ మేఘాలు క్రమంగా తొలగిపోతున్నాయా? నెలల తరబడి కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ ఘర్షణకు తెరపడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు ఆయుధ నిల్వలు, యుద్ధ సామర్థ్యంపై చర్చలు సాగుతుండగా.. మరోవైపు కీలక దేశాల మధ్య దౌత్య ప్రయత్నాలు వేగం పుంజుకోవడం ఆసక్తిని రేపుతోంది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం “చాలా త్వరలోనే ముగుస్తుందని భావిస్తున్నా” అని ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. ఇరాన్ ఈ యుద్ధాన్ని ఎక్కువ కాలం కొనసాగించే పరిస్థితిలో లేదని ఆయన పేర్కొన్నారు.క్షిపణుల నిల్వలపై వస్తున్న ప్రశ్నలపైనా ట్రంప్ స్పందించారు. కొన్ని అత్యంత శక్తివంతమైన ఆయుధాలు తమ వద్ద భారీగా ఉన్నాయని, మరికొన్ని ఆయుధాల నిల్వలు పరిమితంగా ఉన్నాయని అంగీకరించారు. అయితే అమెరికా సైన్యం మాత్రం “చాలా మంచి స్థితిలోనే ఉందని” స్పష్టం చేశారు.ఇటీవల ఇరాన్తో నెలల తరబడి సాగిన యుద్ధంలో అమెరికా సైన్యం అత్యంత ఖచ్చితమైన దీర్ఘశ్రేణి క్షిపణుల నిల్వలను భారీగా వినియోగించిందని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఆయుధాల లభ్యతపై చర్చ మొదలైంది. అయితే ఆయుధాల కొరతను అధిగమించేందుకు అమెరికా రక్షణ సంస్థలు కొత్త తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయని ట్రంప్ తెలిపారు. ముఖ్యంగా పేట్రియాట్, టామాహాక్ క్షిపణుల ఉత్పత్తిని పెంచుతున్నట్లు వెల్లడించారు.హర్ముజ్ జలసంధిపై కీలక నిర్ణయం?మరోవైపు ఇరాన్, అమెరికా, ఒమన్ మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి తాత్కాలిక ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నట్లు సమాచారం. ఈ మార్గంలో ఆంక్షలు, భద్రతా సమస్యలు ప్రపంచ చమురు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.మోదీ–నెతన్యాహు ఫోన్కాల్పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్లో చర్చించారు. భారత్–ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై కూడా ఇరువురు నేతలు సమీక్షించినట్లు మోదీ తెలిపారు.Received a phone call from Prime Minister Benjamin Netanyahu. We reviewed progress on various aspects of the India-Israel Special Strategic Partnership which continues to grow from strength-to-strength.We also exchanged views on the current situation in West Asia.@netanyahu— Narendra Modi (@narendramodi) August 6, 2026ప్రాంతీయ భద్రతపై సౌదీ–ఫ్రాన్స్ చర్చలుతాజా పరిస్థితులు, ఎర్ర సముద్రంలో నౌకా రవాణా స్వేచ్ఛపై సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ చర్చించారు. హౌతీ దాడుల నేపథ్యంలో ప్రాంతీయ భద్రతపై ఇరువురు నేతలు దృష్టి సారించారు.చమురు ధరలు మళ్లీ పైకిపశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 82 డాలర్లకు పైగా చేరింది. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ధర కూడా 77 డాలర్లకు ఎగబాకింది. హర్ముజ్ జలసంధిలో అమెరికా, ఇజ్రాయెల్కు చెందిన నౌకలపై ఆంక్షలు విధించేలా ఇరాన్ పార్లమెంట్లో ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. నిబంధనలు ఉల్లంఘించే నౌకలకు భారీ జరిమానాలు విధించే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది.ఇరాన్ తీవ్ర ఆరోపణలు.. గ్యాస్ నష్టంపై వ్యాఖ్యలుఅమెరికా గరిష్ఠ ఆర్థిక ఒత్తిడి విధానాన్ని కొనసాగిస్తోందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఆరోపించారు. అమెరికా–ఇజ్రాయెల్ దాడుల కారణంగా రోజుకు దాదాపు 230 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ నష్టపోతున్నామని పేర్కొన్నారు.కొనసాగుతున్న ఉద్రిక్తతలుఇరాన్–అమెరికా యుద్ధ వాతావరణం కొనసాగుతుండగా, ప్రాంతంలోని ఇతర దేశాల్లోనూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. యెమెన్లో హౌతీ దాడుల్లో కనీసం 18 మంది సైనికులు మరణించినట్లు సమాచారం. డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో దాడులు జరిగినట్లు హౌతీ వర్గాలు ప్రకటించాయి. లెబనాన్–ఇజ్రాయెల్ మధ్య రోమ్లో జరిగిన చర్చలు ముగిశాయి. చర్చలు ఫలప్రదంగా సాగాయని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడులు నిర్వహించింది. కాల్పుల విరమణ చర్చలు పక్కకు జరిగిన సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం.గాజాలో పిల్లల మరణాలపై యూనిసెఫ్ ఆందోళనగాజాలో పరిస్థితిపై యూనిసెఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 2025 అక్టోబర్ కాల్పుల విరమణ తర్వాతి 300 రోజుల్లో కనీసం 300 మంది పిల్లలు మరణించినట్లు తెలిపింది. రోజుకు సగటున ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.ఇరాన్పై యుద్ధం ముగింపుకు చేరుకుంటోందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, హర్ముజ్ ఒప్పంద ప్రయత్నాలు, చమురు ధరల పెరుగుదల.. పశ్చిమాసియా సంక్షోభం కీలక మలుపులోకి ప్రవేశించిన సంకేతాలుగా కనిపిస్తున్నాయి. -
హర్మూజ్ లో కొత్త షిప్పింగ్ కారిడార్.. ఇరాన్, ఒమన్ కీలక ఒప్పందం
-
ఇరాన్ నాయకత్వంలో చీలిక?.. అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
ఇరాన్ అగ్ర నాయకత్వంలో విభేదాలు నెలకొన్నాయన్న ఊహాగానాల మధ్య అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో ప్రస్తుతం సంప్రదింపులు జరపడం “చాలా కష్టంగా మారింది” అని ఆయన వ్యాఖ్యానించడం కొత్త అనుమానాలకు తావిచ్చింది. యుద్ధ పరిస్థితుల వేళ దేశ అత్యున్నత నాయకత్వం మధ్య సమన్వయం ఎలా ఉందన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. అయితే పదవి చేపట్టిన తర్వాత ఆయన బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండటం చర్చకు కారణమైంది. ఇప్పటివరకు ఎక్కువగా రాతపూర్వక ప్రకటనల ద్వారానే ఆయన స్పందిస్తున్నారు. ఇరాన్ కీలక సమయంలో ఉన్నప్పటికీ సుప్రీం లీడర్ ప్రజల ముందుకు రాకపోవడం(ఆఖరికి తండ్రి అంత్యక్రియలకు కూడా..), నిర్ణయ ప్రక్రియ ఎలా సాగుతోందన్న అంశాలపై అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా యుద్ధ సమయంలో నాయకత్వం నుంచి వచ్చే ప్రతి సంకేతాన్ని ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.అయితే ఈ విషయంలో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ‘డబుల్ వాయిస్’ వినిపించారు. ఓవైపు కాస్త ప్రతికూల కామెంట్లు చేస్తూనే.. మరోవైపు మొజ్తబా ఖమేనీపై కొందరు కావాలనే ప్రతికూల ప్రచారం చేస్తున్నారని మద్దతుగా మాట్లాడారు. ఆయనతో తనకు సమావేశాలు జరిగాయని, ఎంతో ప్రశాంతంగా, తార్కికంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. “ప్రస్తుత పరిస్థితులను ఉపయోగించుకుని కొందరు ఆయనపై వేరే విధమైన అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు” అని పెజెష్కియాన్ అన్నారు.ఆయనతో మాట్లాడటం కష్టం..మొజ్తబా ఖమేనీతో నేరుగా సంప్రదింపులు కొనసాగించడం కష్టంగా ఉందని ఆయన అన్నారు. దీనివల్ల కీలక నిర్ణయాల విషయంలో జాప్యం జరుగుతుందనే విమర్శలను ఆయన అంగీకరించారు. అదే సమయంలో.. ఆయన ఉనికి ఇరాన్కు గొప్ప బలమని పెజెష్కియాన్ పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో సుప్రీం లీడర్ పాత్ర ఎంతో కీలకమని స్పష్టం చేశారు. “ప్రస్తుతం ఆయనతో మాట్లాడటం కష్టంగా ఉన్నా.. ఆయన ఉనికి మనకు గొప్ప బలం. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆయన నాయకత్వం అవసరం” అని పెజెష్కియాన్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. ఇరాన్ అగ్ర నాయకత్వంలో అధికార సమతుల్యతపై పలు అంతర్జాతీయ నివేదికలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. కీలక భద్రతా, విదేశాంగ నిర్ణయాల్లో అధ్యక్షుడు పెజెష్కియాన్ పాత్ర పరిమితమవుతోందని, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) ప్రభావం పెరుగుతోందని కథనాలు వెలువడ్డాయి. కొన్ని నివేదికల ప్రకారం.. విధానపరమైన విభేదాల నేపథ్యంలో పెజెష్కియాన్ రాజీనామా ఆలోచన కూడా చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ అంశాలపై ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు.యుద్ధ వేళ పెరిగిన ఉత్కంఠఇరాన్ ప్రస్తుతం ఒకవైపు అంతర్జాతీయ ఒత్తిళ్లు, మరోవైపు సైనిక ఉద్రిక్తతలను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో దేశ రాజకీయ, సైనిక వ్యవస్థల మధ్య సమన్వయం అత్యంత కీలకంగా మారింది. సుప్రీం లీడర్ చుట్టూ నెలకొన్న అనిశ్చితి, అధ్యక్షుడి తాజా వ్యాఖ్యలు ఇరాన్ అంతర్గత రాజకీయాలపై కొత్త చర్చకు తెరతీశాయి.అయితే పెజెష్కియాన్ వ్యాఖ్యల్లో విభేదాల కంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో నాయకత్వాన్ని కాపాడే ప్రయత్నమే ఎక్కువగా కనిపిస్తోందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అయినప్పటికీ మొజ్తబా ఖమేనీ బహిరంగంగా కనిపించకపోవడం, ఆయన నిర్ణయాలపై వస్తున్న ఊహాగానాలు ఇరాన్ రాజకీయ భవిష్యత్పై ఆసక్తిని కొనసాగిస్తున్నాయి. -
రేపో ఎల్లుండో హార్మూజ్ను తెరవడమే
కైరో: ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించి, పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికేందుకు దోహదపడే కీలక జలమార్గమైన హార్మూజ్ను తిరిగి తెరిచే అంశంపై ఇరాన్, ఒమన్లు ఒక ఒప్పందానికి చాలా సమీపంలోకి వచ్చాయి. ఒకట్రెండు రోజుల్లో దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కాలిఫోర్నియాలో స్థానిక కాలమానం ప్రకారం ట్రంప్ మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ‘‘హార్మూజ్ జలసంధిని రేపో లేదా ఎల్లుండో తెరిచేందుకు ఆస్కారం ఉంది. ఈ విషయంలో ఇప్పటికే చాలా పురోగతి సాధించాం’’అని చెప్పారు. హార్మూజ్ను తెరిచే విషయంలో సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బుధవారం బ్యారెల్కు సుమారు 80 డాలర్ల వద్ద ఉంది. ఇది సంఘర్షణ ఉధృతంగా ఉన్నప్పటి స్థాయి కంటే చాలా తక్కువ. ఇరాన్, ఒమన్ మధ్య చర్చల ఫలితంగా కుదిరే అవకాశం ఉన్న ఒప్పందం ప్రకారం... నౌకలు ఇరాన్ నియంత్రణలో ఉన్న మార్గం ద్వారా పర్షియన్ గల్ఫ్లోకి ప్రవేశించి, ఒమన్ నియంత్రణలో ఉన్న మార్గం ద్వారా నిష్క్రమిస్తాయి. నౌకలకు భద్రత కల్పించినందుకు, సముద్ర పర్యావరణాన్ని పరిరక్షించినందుకు ఇరాన్, యెమెన్లు సేవా రుసుములు వసూలు చేస్తాయి. మరోవైపు హార్మూజ్ జలసంధికి సంబంధించి ఒక ఒప్పందం త్వరలోనే కుదిరే అవకాశం ఉందన్న ఆశలు పెరుగుతున్నప్పటికీ ఆ ప్రాంతంలో నౌకలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం ఎర్ర సముద్రంలో వాఫా అనే సౌదీ చమురు ట్యాంకర్పై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ అండదండలున్న హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. సౌదీ ఓడరేవు పట్టణమైన యాన్బు సమీపంలో ఆ నౌకను లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పారు. అయితే, అందుకు ఎలాంటి సాక్ష్యాధారాలు చూపలేదు. దీనిపై సౌదీ అరేబియా కూడా స్పందించలేదు. మంగళవారం యెమెన్ తీరంలోని ఎర్ర సముద్రంలో పేలుడు పదార్థాలతో నిండిన పడవ ఢీకొనడంతో భారత జెండా ఉన్న వాణిజ్య నౌక మునిగిపోయిందని యెమెన్, భారత అధికారులు తెలిపారు. ఆ నౌకలోని సిబ్బందిని యెమెన్ తీరరక్షక దళం రక్షించింది. వీరిలో 13 మంది భారతీయులు, ఒక యెమెన్ దేశస్థుడు ఉన్నారు. -
క్రూడ్ ఆయిల్ ధరలు ఢమాల్!
అంతర్జాతీయ చమురు మార్కెట్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. క్రూడ్ ఆయిల్ ధరలు దాదాపు 4 శాతం తగ్గి బ్యారెల్కు 77.11 డాలర్లకు చేరుకున్నాయి. ప్రపంచ చమురు మార్కెట్లలో సరఫరా, డిమాండ్ అంచనాలు, భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావంతో ధరల్లో ఈ భారీ మార్పు కనిపించింది.ఇటీవల వరకు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు కొంత స్థిరంగా ఉన్నప్పటికీ.. తాజాగా క్రూడ్ ఆయిల్ ధరలు క్షీణించాయి. ట్రేడింగ్ సమయంలో ధరలు వేగంగా పడిపోవడం మార్కెట్లో ఆందోళనకు దారితీసింది. దీనికి ప్రధాన కారణం అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య చర్చల్లో పురోగతి వస్తుందన్న అంచనాలు.ప్రపంచంలోని కీలక చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గితే, భవిష్యత్తులో చమురు సరఫరా సులభతరం అవుతుందని మార్కెట్లు భావిస్తున్నాయి. దీంతో పెట్టుబడిదారులు కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా.. ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఉన్న అనిశ్చితి కూడా చమురు ధరలపై ప్రభావం చూపుతోంది. ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తే ఇంధన డిమాండ్ తగ్గుతుందనే అంచనాలు ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి.చమురు ధరలు తగ్గుదల.. వినియోగదారులకు కొంత ఊరటనిస్తుంది. ఎందుకంటే.. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గితే పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అలాగే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో కూడా ఇది సహాయపడవచ్చు. -
యుద్ధం ఆపేందుకు తలపట్టుకుంటున్న ట్రంప్?
వాషింగ్టన్: ఇరాన్పై దాడులకు అమెరికా సెంట్రల్ కమాండ్ సరికొత్త వ్యూహం అనుసరించనుందా అంటే అవుననే సమాధానమస్తుంది.. ఈ విషయమై ఇరాన్పై ఒత్తిడి తెచ్చేలా సరికొత్త వ్యూహాలను తెలియజేయాలని ఆ దేశంలోని సైనికులను కోరిందట.. సంప్రదాయేతర, సృజనాత్మక మార్గాలను" సూచించాల్సిందిగా విస్తృత శ్రేణి సైనిక విశ్లేషకులను సంప్రదించిందని కథనాలు పేర్కొన్నాయి.ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా ఉంది.. ఇరాన్పై దాడి చేసి వారం రోజుల్లోగా యుద్ధాన్ని ముగించవచ్చు అనకున్న ట్రంప్కు యుద్దం ప్రారంభమై ఐదునెలలు గడుస్తోన్నా యుద్ధం ముగించే దారి దొరకడం లేదు. అలా అని ఇరాన్ భూభాగంలోకి సైనికులను పంపితే పెద్దఎత్తున ప్రాణనష్టం జరిగే అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అలాగని దాడులు ఆపేస్తే అమెరికా పట్టు సడలిపోతుంది. దీంతో ఏం చేయాలో తోచక తల పట్టుకోవాల్సిన పరిస్తితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో యూఎస్ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ కొత్తగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.ఇరాన్ను ఏవిధంగా మరింతగా దెబ్బతీయవచ్చు లేదా కట్టడి చేయవచ్చు అనే అంశంపై ఆర్మీ విశ్లేషకులు, అధికారుల నుంచి కొత్త ప్రతిపాదనలను సేకరించాలని ఒక సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంతర్గతంగా ఈ అభ్యర్థనను పంపినట్లు సమాచారం. ఇరాన్తో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడటం ,పరిమితమైన సైనిక ప్రత్యామ్నాయాలు ఉన్న నేపథ్యంలో అమెరికా ఈ సరికొత్త విశ్లేషణలు లేదా ఆలోచనల కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.సీఎన్ఎన్ (CNN) నివేదిక ప్రకారం.. గత వారం సెంట్రల్ కమాండ్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లోని ఒక అధికారి ఈమెయిల్ ద్వారా ఈ బ్రెయిన్స్టార్మింగ్ (ఆలోచనల సేకరణ) సెషన్ను ప్రారంభించారు. ఈమెయిల్ ద్వారా ఇలా ప్రజల లేదా సిబ్బంది అభిప్రాయాలను సేకరించడం (క్రాగ్సోర్సింగ్ పద్ధతి) సైన్యంలో చాలా అరుదైన విషయం, ఈ విషయాన్ని పట్టి చూస్తే తన నిబంధనల ప్రకారం ఇరాన్ను ఒప్పందానికి అంగీకరించేలా చేయడానికి అధ్యక్షుడు ట్రంప్కు చాలా కష్టమని తెలుస్తోందని కథనాలు ప్రచురించాయి.అమెరికా గత కొన్ని వారాలుగా ఇరాన్పై పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేస్తున్నప్పటికీ, ఇరాన్ వెనక్కి తగ్గకపోవడం, తమ వైఖరి మార్చుకోకపోవడంతో అమెరికా రక్షణ రంగానికి ఒక రకమైన ప్రతిష్టంభన ఏర్పడింది. కేవలం బాంబులు వేయడం వల్ల ఇరాన్ను లొంగదీసుకోవడం సాధ్యం కాదనే వాస్తవం అమెరికాకు అర్థమయ్యింది. ఒకవేళ ఇరాన్ భూభాగంలోకి గ్రౌండ్ ట్రూప్స్ (భూతల సైన్యం)ను పంపడం లేదా భూగర్భంలో ఉన్న అణు కేంద్రాలపై భారీ దాడులు చేయడం వల్ల అమెరికాకు ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉంది. అలాగే ఆయుధ నిల్వలు తరిగిపోవడం, చమురు ధరలు పెరగడం వంటి సమస్యల వల్ల అమెరికా ప్రత్యక్షంగా పెద్ద యుద్ధానికి వెనుకంజ వేస్తోంది.దీంతో కొత్త దారుల కోసం అన్వేషణ ఇప్పటివరకు అనుసరించిన పద్ధతులు కాకుండా, ఎలాంటి పెద్ద యుద్ధ నష్టం లేకుండా ఇరాన్ను దెబ్బతీయడానికి లేదా చర్చల ముందుకు రప్పించడానికి పూర్తిగా భిన్నమైన, ఎవరూ ఊహించని మార్గాలు అవసరమని అమెరికా సైనిక వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరగా ఒక విజయాన్ని లేదా స్పష్టమైన ఒప్పందాన్ని కోరుకుంటున్నప్పటికీ, దానికి తగిన సరైన సైనిక ప్రత్యామ్నాయాలు తక్షణమే అందుబాటులో లేకపోవడాన్ని ఈ అంతర్గత ఈమెయిల్ స్పష్టం చేస్తోంది. -
ఇరాన్పై ట్రంప్ ‘టూ ఆప్షన్స్’ బాంబ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చర్చల విషయంలో ఇరాన్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరాన్ ముందు ఇప్పుడు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయని.. వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవడం తప్ప మరో మార్గం లేదని అల్టిమేటం జారీ చేశారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్ బహిరంగంగా అమెరికాతో చర్చలు జరగడం లేదని చెబుతున్నప్పటికీ, సమస్య పరిష్కారం కోసం చర్చలకు ప్రయత్నించిందని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఇరాన్ సృష్టించిన సమస్యకు పరిష్కారం కోసం తాము చర్చలు జరుపుతున్నామని అన్నారు.“ఒకటి ఒప్పందం చేసుకోవడం.. లేదంటే పూర్తిగా లొంగిపోవడం” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.హర్ముజ్ జలసంధిపై ట్రంప్ హెచ్చరికప్రపంచంలోని అత్యంత కీలకమైన వాణిజ్య మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధి అంశంపైనా ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతంపై అమెరికా నౌకాదళానికి పూర్తి నియంత్రణ ఉందని, తమ అనుమతి లేకుండా ఇరాన్కు ఎలాంటి రాకపోకలు జరగవని స్పష్టం చేశారు. “ఒప్పందం కుదిరే వరకు లేదా పూర్తిగా లొంగిపోయే వరకు ఎలాంటి మార్పు ఉండదు” అనే రీతిలో ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి.దాడి నుంచి చర్చల వైపు ట్రంప్ అడుగుఇరాన్పై రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద దాడి చేస్తామని మొన్న హెచ్చరించిన ట్రంప్.. నిన్న ఆ సైనిక చర్యను తాత్కాలికంగా నిలిపివేశారు. గల్ఫ్ దేశాలు ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ నేతల సూచనలతో పాటు దౌత్య మార్గాలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు సోమవారం ప్రారంభమవుతాయని ట్రంప్ చెప్పినప్పటికీ.. వాటి వివరాలను వెల్లడించలేదు.ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ రియాక్షన్ ఇదేఅంతకు ముందు అమెరికా వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది. ప్రస్తుతం వాషింగ్టన్తో ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ.. అమెరికాతో చర్చలు జరుగుతున్నాయన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ప్రస్తుతం తాము ఒమన్తో మాత్రమే సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. హర్ముజ్ జలసంధిలో తాత్కాలిక సురక్షిత రాకపోకల ఏర్పాటుకు సంబంధించిన చర్చలు మాత్రమే జరుగుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇరాన్కు డీల్ లేదంటే పూర్తిగా లొంగిపోవడం అనే ఆప్షన్లు ఉంచారు. అయితే ట్రంప్ ఫ్రెష్వార్నింగ్పై ఇరాన్ స్పందన రావాల్సి ఉంది. మరోవైపు.. ఇరాన్ తన సార్వభౌమత్వంపై రాజీపడబోదనే సంకేతాలు ఇస్తోంది. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని చెబుతూనే, ఉద్రిక్తతలు మరింత పెరగకుండా దౌత్య మార్గాలను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే క్షిపణి బెదిరింపులు, సైనిక కదలికలతో వేడెక్కిన పరిస్థితుల్లో.. ట్రంప్ తాజా అల్టిమేటం, ఇరాన్ తిరస్కరణతో తదుపరి పరిణామాలపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. -
మళ్లీ చర్చల వంతు: ట్రంప్
కైరో/వాషింగ్టన్: ఇరాన్ విషయంలో గత కొన్ని వారాలుగా క్షిపణులు, డ్రోన్లకు పనిచెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మంతనాల కోసం మధ్యవర్తులకు పనిచెప్పారు. యుద్ధంలో మారణహోమం తప్పితే సత్ఫలితాలు ఏమీ ఉండవని, అందుకే చర్చల పర్వానికి తెరతీస్తున్నానని సోమవారం ప్రకటించారు. ఈ మేరకు అధ్యక్షుని అధికార విమానం ‘ఎయిర్ఫోర్స్ వన్’లో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ‘‘ఇరాన్పై కనివినీ ఎరుగని స్థాయిలో దాడులకు సిద్ధమయ్యాం. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఎన్నడూ ఎవరూ చూడని భీకరస్థాయిలో ఇరాన్పై దాడులు చేయాలని నిర్ణయించాం. తీరా రణరంగంలోకి దూకే వేళ పశ్చిమాసియాలో సౌదీ అరేబియాసహా మా మిత్రదేశాలు వద్దు అని వారించాయి. చర్చల మార్గం తెరచే ఉందని గుర్తుచేశాయి. అందుకే మళ్లీ చర్చల మార్గంలో అమెరికా పయనిస్తోంది. చర్చలకు రావాలని ఇరాన్ అధికారులు సైతం ఆహ్వానాలు అందాయి. అందుకే సోమవారం నుంచి మధ్యవర్తుల ద్వారా చర్చలు మొదలుపెడతాం’’అని ట్రంప్ ప్రకటించారు. చర్చలు లేవన్న ఇరాన్ ఇరాన్ సోమవారం ట్రంప్ ప్రకటనకు భిన్నంగా స్పందించింది. ‘‘ఒమన్తో మాత్రమే మేం చర్చలు జరుపుతున్నాం. అది కూడా నౌకల సురక్షిత ప్రయాణ అంశంపై చర్చిస్తున్నాం. అమెరికాతో ప్రస్తుతం సంప్రతింపుల ప్రక్రియ నిలిచిపోయింది’’అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ సోమవారం స్పష్టంచేశారు. -
ట్రంప్ వెనక్కి తగ్గేలా.. సౌదీ వ్యూహం
పశ్చిమాసియా యుద్ధంలో ఇప్పుడు సౌదీ రంగప్రవేశం ఆసక్తిగా మారింది. ఇరాక్లో అమెరికాతో కలిసి ఇరాన్ ప్రాక్సీలపై విరుచుకపడ్డ సౌదీ అంతలోనే.. ఇరాన్పై పెద్దఎత్తున దాడులు చేయవద్దని ట్రంప్కు విజ్ఞప్తి చేసింది. దీనికి తల ఊపిన ట్రంప్ సౌదీ ఎంట్రీతో తాత్కాలికంగా దాడుల ఆలోచన విరమిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే అమెరికాని ఒప్పించేలా సౌదీ మధ్యవర్తిత్వం చేయడంపై ఒక పెద్దకారణం దాగున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ట్రంప్ ఇరాన్కు భారీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ సారి కనీవినీ ఎరుగని రీతిలో అమెరికాపై దాడులు చేస్తామని హెచ్చరించారు. అయితే ఇంతలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై మరిన్ని దాడులు చేయకుండా నివారించాలని సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) కోరినట్లు అమెరికా అధికారులు తెలిపారు. దీంతో ట్రంప్ వెనక్కి తగ్గుతున్నట్లు ప్రకటించారు. అయితే దీని వెనుక "క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ చేపట్టిన ప్రతిష్టాత్మక ఆర్థిక ప్రణాళిక 'విజన్ 2030' కారణమని తెలుస్తోంది.రిటైర్డ్ బ్రిగేడియర్ జనరల్ అబ్దుల్లా బిన్ ఫరాహ్ అల్-షయా మాట్లాడుతూ.. "రాజ్యంలోని విజన్ 2030 అనేది కేవలం ఒక ఆర్థిక ప్రణాళిక మాత్రమే కాదు. విభిన్నమైన, స్థిరమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి, అలాగే పెట్టుబడులు, ఇంధనం, లాజిస్టిక్స్, పర్యాటకం ఆవిష్కరణలకు గ్లోబల్ హబ్గా సౌదీ స్థానాన్ని బలోపేతం చేయడానికి ఇదొక సమగ్ర జాతీయ ప్రాజెక్ట్" అని పేర్కొన్నారు. ఇరాన్పై ఏవైనా పెద్ద దాడులు జరిగితే గల్ఫ్ ప్రాంతం తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటుందని, ఇది తమ ఆర్థిక ప్రణాళికను దెబ్బతీస్తుందని సౌదీ ఆందోళన చెందుతోందని పేర్కొన్నారు.మాజీ యూఎస్ రక్షణ శాఖ అధికారి, మిడిల్ ఈస్ట్ నిపుణురాలు డానా స్ట్రౌల్ మాట్లాడుతూ.. యెమెన్ హూతీ తిరుగుబాటుదారుల ముప్పును తొలగించడానికి కేవలం సైనిక బలప్రయోగం మాత్రమే సరిపోదని సౌదీ అరేబియా చాలా కష్టపడి నేర్చుకుందని తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ ఎన్నిసార్లు సైనిక చర్యలు చేపట్టినా హూతీల ముప్పును పూర్తిగా తొలగించలేకపోయాయని, సౌదీ మళ్లీ అటువంటి పెద్ద సంఘర్షణలోకి దిగితే అది 'విజన్ 2030'పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆమె పేర్కొన్నారు.మరోవైపు, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి పాకిస్థాన్, టర్కీ, సౌదీ అరేబియా అధికారులతో చర్చలు జరిపారు. అమెరికా లేదా ఇజ్రాయెల్ దాడి చేస్తే లేదా అలాంటి దాడులకు ఇతర దేశాలు మద్దతు ఇస్తే ఇరాన్ నుంచి బలమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా యుఎస్ను బుజ్జగించాల్సి వస్తోంది. -
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. చేతులెత్తేసిన అమెరికా?
-
యుద్ధానికి బ్రేక్.. ఇరాన్ కీలక ప్రకటన
అమెరికా-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నడుమ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. క్షిపణులు, దాడుల హెచ్చరికలతో హోరెత్తిన వాతావరణం ఒక్కసారిగా చర్చల వైపు మళ్లింది. ఇరాన్పై భారీ సైనిక చర్యకు సిద్ధమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు దౌత్య మార్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇరాన్తో ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని ప్రకటించిన ట్రంప్.. సోమవారం నుంచి చర్చలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. దీంతో పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ భయాలు కొంత తగ్గే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఇరాన్ కీలక మౌలిక వసతులపై భారీ దాడులకు అమెరికా ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ.. చివరి దశలో వాటిని నిలిపివేసినట్లు ట్రంప్ తెలిపారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఖతార్ వంటి గల్ఫ్ దేశాలు యుద్ధాన్ని విస్తరించకుండా దౌత్య పరిష్కారానికి అవకాశం ఇవ్వాలని కోరినట్లు ట్రంప్ చెప్పారు.ఇరాన్పై తాను చేపట్టబోయిన సైనిక చర్య సాధారణ దాడి కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆ దాడి జరిగి ఉంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద దాడుల్లో ఒకటిగా నిలిచేదని వ్యాఖ్యానించారు. “నేను ప్రజలను చంపాలని కోరుకోవడం లేదు. యుద్ధంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. ఒకవేళ దాడి జరిగి ఉంటే భారీ విధ్వంసం జరిగేది.. తిరిగి నిర్మించడానికి ఎన్నో సంవత్సరాలు పట్టేది” అని ట్రంప్ పేర్కొన్నారు.అందుకే యుద్ధం కంటే చర్చల ద్వారా పరిష్కారం సాధించడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇరాన్తో ఒప్పందం కుదిరితే ప్రాణనష్టం, విధ్వంసం రెండింటినీ నివారించవచ్చని తెలిపారు.“ఇరాన్తో ఒక ఒప్పందం దగ్గరలోనే ఉంది” అని ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించాయి. అయితే ఈ ఒప్పందంలో ఏ అంశాలపై రాజీ కుదరబోతోందన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.ఇరాన్ కీలక వ్యాఖ్యలుమరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ కూడా అమెరికాతో చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి అమెరికా కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. “అమెరికా తన హామీలను గౌరవించాలి.. పరస్పర నమ్మకంతో ముందుకు సాగాలి” అనే సంకేతాలను పెజెష్కియన్ ఇచ్చారు.జూన్లో కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందమే భవిష్యత్లో ఇరాన్ విదేశాంగ విధానానికి కీలక ఆధారంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఇరాన్ తన ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో వెనక్కి తగ్గబోదని కూడా ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.టెహ్రాన్కు దౌత్య బృందాలు!అమెరికా-ఇరాన్ మధ్య చర్చలకు మార్గం సుగమం చేసేందుకు మధ్యవర్తి దేశాలు రంగంలోకి దిగుతున్నాయి. గత 24 గంటల్లో చోటుచేసుకున్న పరిణామాల తర్వాత.. టెహ్రాన్లో పరోక్ష చర్చలకు వేదిక సిద్ధమవుతోందని సమాచారం. అమెరికా, ఇరాన్ మధ్య నేరుగా చర్చలు కాకుండా.. ఒమన్, ఖతార్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉంది.ఇప్పటికే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ.. సౌదీ అరేబియా, పాకిస్థాన్ తదితర దేశాలతో సంప్రదింపులు జరిపారు. ప్రాంతీయ దేశాల సహకారంతో యుద్ధ ఉద్రిక్తతలను తగ్గించి, హార్ముజ్ జలసంధి విషయంలో ఒక అవగాహనకు రావడమే లక్ష్యంగా దౌత్య ప్రయత్నాలు సాగుతున్నాయి.హర్ముజ్ జలసంధిపై అసలు పోరుఅమెరికా-ఇరాన్ చర్చల్లో అత్యంత కీలక అంశంగా హర్ముజ్ జలసంధి మారింది. ప్రపంచ చమురు రవాణాలో ఈ మార్గానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. పర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచ మార్కెట్లకు వెళ్లే భారీ స్థాయి చమురు రవాణా ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. అందుకే ఏ చిన్న అంతరాయం ఏర్పడినా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ.. ఒమన్తో హార్ముజ్ నిర్వహణపై జరుగుతున్న చర్చలు చివరి దశకు చేరుకున్నాయని వెల్లడించారు. అయితే ఇవి అమెరికాతో నేరుగా జరుగుతున్న చర్చలు కావని ఇరాన్ స్పష్టం చేసింది. యుద్ధానికి ముందు ఉన్న పరిస్థితులకు హర్ముజ్ను పూర్తిగా తీసుకెళ్లడం సాధ్యం కాదని కూడా సంకేతాలు ఇచ్చింది.హర్ముజ్ కోసం తెర వెనుక డీల్!హర్ముజ్ జలసంధి విషయంలో కొత్త విధానం రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరు పర్యవేక్షిస్తారు? నౌకల రాకపోకలు ఎలా ఉంటాయి? భద్రతా ఏర్పాట్లు ఎలా ఉండాలి? వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల్లో ఒమన్ కీలక పాత్ర పోషిస్తోంది. గతంలోనూ అమెరికా-ఇరాన్ మధ్య రహస్య దౌత్య చర్చలకు ఒమన్ వేదికగా నిలిచింది.ఇరాన్ వ్యూహం.. చర్చలు కూడా, ఒత్తిడి కూడాఇరాన్ ఒకవైపు చర్చలకు సిద్ధమని చెబుతూనే.. మరోవైపు తన వ్యూహాత్మక బలాన్ని కొనసాగిస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ.. సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తదితరులతో సంప్రదింపులు జరిపారు. ప్రాంతీయ భద్రత, స్థిరత్వంపై చర్చించినట్లు ఇరాన్ వెల్లడించింది. అయితే హార్ముజ్పై తన ప్రభావాన్ని మాత్రం కొనసాగించాలని భావిస్తున్నట్లు స్పష్టం చేసింది.అణు అంశమే అసలు పరీక్ష!అమెరికా-ఇరాన్ మధ్య జరిగే ఏ ఒప్పందానికైనా అణు కార్యక్రమం ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఇరాన్ అణు సామర్థ్యాలను పరిమితం చేయాలని అమెరికా కోరుతోంది. మరోవైపు తమపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఈ రెండు అంశాలపై రాజీ కుదిరితేనే చర్చలు విజయవంతమయ్యే అవకాశం ఉంది.ట్రంప్ ప్రకటనతో చమురు ధరలు దిగొచ్చాయియుద్ధ భయాల మధ్య పెరిగిన చమురు ధరలు ట్రంప్ తాజా ప్రకటనతో తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 4 డాలర్లకు పైగా పడిపోయింది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరట లభిస్తుందని మార్కెట్లు భావిస్తున్నాయి.ఎర్రసముద్రంలో ఉత్కంఠ!మరోవైపు సౌదీ అరేబియా నుంచి బయలుదేరిన రెండు చమురు నౌకలు బాబ్ అల్ మందెబ్ జలసంధిని దాటాయి. హౌతీల హెచ్చరికల మధ్య కూడా చమురు రవాణా కొనసాగుతుండటం గమనార్హం. అయితే భద్రతా కారణాలతో కొన్ని నౌకలు తమ ఆటోమేటిక్ ట్రాకింగ్ వ్యవస్థలను నిలిపివేసినట్లు సమాచారం.ఇజ్రాయెల్ చూపు చర్చలపైనేఅమెరికా-ఇరాన్ చర్చలను ఇజ్రాయెల్ కూడా నిశితంగా పరిశీలిస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమంపై ఎలాంటి రాజీ వచ్చినా అది తమ భద్రతకు ముప్పుగా భావించే ఇజ్రాయెల్.. గతంలో ఇరాన్పై కఠిన వైఖరి ప్రదర్శించింది. అందుకే ఈ చర్చలు కేవలం వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య వ్యవహారం కాకుండా మొత్తం పశ్చిమాసియా భవిష్యత్తును ప్రభావితం చేసే పరిణామంగా మారాయి.యుద్ధానికి ముగింపా? లేదంటే.. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలకు మార్గం సుగమమైనప్పటికీ.. పూర్తి ఒప్పందం ఇంకా దూరంలోనే ఉంది. హర్ముజ్ నియంత్రణ, అణు కార్యక్రమం, ఆంక్షల తొలగింపు, భద్రతా హామీలపై ఇరు దేశాల మధ్య ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయి. యుద్ధం అంచుల నుంచి చర్చల బల్లపైకి వచ్చిన అమెరికా-ఇరాన్ సంబంధాలు.. నిజంగా శాంతి దిశగా అడుగులు వేస్తాయా? లేక ఇది కేవలం వ్యూహాత్మక విరామమేనా? అన్నది రాబోయే చర్చలే తేల్చనున్నాయి. -
ఇరాన్ యుద్ధం పై ట్రంప్ కీలక నిర్ణయం..
-
గల్ఫ్ దేశాలను వీడండి.. అమెరికా పౌరులకు ట్రంప్ అత్యవసర హెచ్చరిక
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్, అమెరికా వరుస దాడులు తీవ్రతరమయ్యాయి. దీంతో, మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న అమెరికా పౌరులకు అమెరికా విదేశాంగ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. భద్రతా ముప్పులు పెరుగుతున్నందున వీలైతే మధ్యప్రాచ్య దేశాలను విడిచి వెళ్లాలని, లేకపోతే ఎప్పుడైనా అత్యవసరంగా బయలుదేరాల్సిన పరిస్థితి రావచ్చని ముందస్తుగా సిద్ధంగా ఉండాలని సూచించింది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఇరాక్, ఇజ్రాయెల్, జోర్డాన్, కువైట్, లెబనాన్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియాలోని అమెరికా రాయబార కార్యాలయాల ద్వారా తాజా ప్రయాణ సూచనలను విడుదల చేసింది. గగనతల మూసివేతలు, విమాన సర్వీసుల రద్దు, ప్రయాణాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అమెరికా పౌరులకు సూచించింది. మధ్యప్రాచ్యానికి వెళ్లే ప్రయాణాలను కూడా పునరాలోచించాలని విదేశాంగ శాఖ పేర్కొంది. అంతకుముందు చేసిన సూచనల కంటే తాజా సూచన మరింత కఠినంగా ఉండటం గమనార్హం.ఇక, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. అవసరమైతే ఇరాన్పై తీవ్ర చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించగా, అమెరికా దాడులకు తగిన ప్రతీకారం తప్పదని ఇరాన్ ప్రకటించింది. ఇదే సమయంలో ఇరాన్కు చెందిన డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని కువైట్ సైన్యం వెల్లడించింది. రెండు రోజుల క్రితం ఇరాన్పై భారీ స్థాయిలో దాడులు నిర్వహించినట్లు అమెరికా సైన్యం ప్రకటించడంతో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ ఘర్షణలు మరిన్ని దేశాలకు విస్తరించే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతుండగా, ఇంధన ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.Middle East: Americans currently in the Middle East should exercise caution and heightened vigilance and should be prepared for flight cancellations, periodic airspace closures, and potential travel disruptions. Some airlines in the region have postponed resumption of earlier… pic.twitter.com/d1ZmzRBBHN— TravelGov (@TravelGov) August 1, 2026మరోవైపు.. అమెరికా హెచ్చరికలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మాట్లాడుతూ.. అమెరికా మరోసారి సైనిక చర్యలకు దిగితే దానికి ‘నిర్ణయాత్మక, తీవ్రమైన ప్రతిస్పందన’ ఇస్తామని హెచ్చరించారు. అలాగే సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, ఇజ్రాయెల్లోని ఇంధన మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇరాన్పై దాడులకు తమ భూభాగాన్ని లేదా సౌకర్యాలను ఉపయోగించేందుకు ఏ దేశం అనుమతించవద్దని ప్రాంతీయ దేశాలకు ఆయన హెచ్చరించారు. అదే సమయంలో, అమెరికా హెచ్చరికలు ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యలని ఇరాన్ విమర్శించింది. తమపై ఎలాంటి దాడి జరిగినా తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని, ప్రాంతీయ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, అయితే తమ భద్రత విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేసింది. -
అమెరికాకు ఇరాన్ వార్నింగ్: మరో దాడి చేస్తే..
టెహ్రాన్: అమెరికా మరోసారి సైనిక దాడికి పాల్పడితే తీవ్రంగా స్పందిస్తామని ఇరాన్ హెచ్చరించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఏ క్షణమైనా నిర్ణయాత్మక బదులిస్తామని స్పష్టం చేసింది. ఇరాన్ వైపు నుంచి వ్యూహాత్మక ప్రాంతాలపైకి ప్రయోగించిన శత్రు డ్రోన్లను కూల్చివేశామని కువైట్ సైన్యం ప్రకటించిన కొద్ది గంటలకే ఈ పరిణామం చోటుచేసుకుంది. టెహ్రాన్తో చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసిన ఒక రోజు తర్వాత ఈ హెచ్చరిక వెలువడింది. అవసరమైతే అమెరికా మరోసారి దాడులకు దిగుతుందని, తమపై ఒత్తిడి తెస్తున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు.ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ.. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్లతో వేర్వేరుగా టెలిఫోన్ ద్వారా సంభాషించారు. అమెరికా దురాక్రమణకు పాల్పడితే గట్టిగా స్పందిస్తామని పాక్, టర్కీ అధికారులకు ఆయన తెలిపారు. సౌదీ విదేశాంగ మంత్రితో మాట్లాడుతూ.. అమెరికా లేదా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.కువైట్లో కూల్చివేసిన డ్రోన్ల అవశేషాలు ఉత్తర కువైట్లోని ప్రభుత్వ భవనం, బుబియాన్ ద్వీపంలోని ఆస్తులను ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఇరాన్ భద్రతా సంస్థకు చెందిన మీడియా సంస్థ ఒక హెచ్చరిక జారీ చేస్తూ, అమెరికా కనుక ఇరాన్ ఇంధన సౌకర్యాలపై దాడి చేస్తే, సౌదీ అరేబియా, యూఏఈలోని చమురు కేంద్రాలు, ఖతార్, ఇజ్రాయెల్లోని గ్యాస్ క్షేత్రాలపై ప్రతీకార దాడులు జరుపుతామని, అన్నీ బూడిదవుతాయని పేర్కొంది.ఈ పరిణామాల మధ్య అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. జూలైలో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 24 శాతం పెరిగాయి. హార్ముజ్ జలసంధిలో భద్రతా ఆందోళనల కారణంగా వాణిజ్య నౌకల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. మరోవైపు ఒమన్ తీరంలో రెండు వేర్వేరు సముద్ర ఘటనలు చోటుచేసుకున్నట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ వెల్లడించింది.ఇది కూడా చదవండి: ఎవరెస్ట్ ‘డెత్ జోన్’లో అసలేం జరుగుతుంది? -
వినాశకర దాడులు చేస్తాం
వాషింగ్టన్/కైరో: హార్మూజ్ జలసంధిపై ఇరాన్ తనదైన పట్టును నిలుపుకోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మరింత చిర్రెత్తిపోతోంది. దీంతో ఇకమీదట అత్యంత విశానకర స్థాయిలో దాడులు చేస్తామని ఇరాన్ను ట్రంప్ తాజాగా హెచ్చరించారు. మేరీల్యాండ్లో క్యాంప్ డేవిడ్ ప్రెసిడెన్షియల్ రీట్రీట్ కార్యక్రమంలో తన కేబినెట్ సహచరులతో భేటీలో ట్రంప్ మాట్లాడారు. ‘‘హార్మూజ్ను బేషరతుగా ఇరాన్ తెరవాల్సిందే. మధ్యవర్తిత్వం ద్వారా చర్చల ప్రక్రియ పూర్తిగా విఫలమైతే ఇరాన్పై మళ్లీ విధ్వంసకదాడుల పర్వం మొదలవుతుంది. మా దాడులను ఇరాన్ విజయవంతంగా అడ్డుకుంటుందని అస్సలు అనుకోను. ఎందుకంటే వాళ్ల నేవీ నాశనమైంది. గగనతల రక్షణ వ్యవస్థ నిరీ్వర్యమైంది. ఈమధ్య అమెరికా దాడుల తీవ్రతను తగ్గించడంతో వాళ్లు సాయుధ శక్తిసామర్థ్యాలపరంగా కాస్తంత పుంజుకున్నారేమో. కానీ అమెరికా దాడులను తీవ్రతరంచేయనుంది. గెలవడమే మా ధ్యేయం. ఇక దాడులను తట్టుకోలేం అని ఇరాన్ కాళ్లబేరానికొచ్చేస్థాయిలో దాడులు చేస్తాం’’అని ట్రంప్ ప్రకటించారు. కువైట్పై ఇరాన్ దాడులు అమెరికాకు మిత్రదేశంగా ఉన్న కువైట్పై ఇరాన్ శనివారం దాడులుచేసింది. అయితే ఇరాన్ డ్రోన్లను నేలకూల్చామని కువైట్ రక్షణశాఖ తెలిపింది. అత్యంతకీలకమైన ప్రాంతాలపై ఇరాన్ దాడులకు ప్రయతి్నంచింది. బుబియాన్ ద్వీపంలోని వాహన తయారీ కర్మాగారంపై దాడికి యతి్నంచింది. ఆ ప్రయత్నాలను మేం వమ్ముచేశాం’అని కువైట్ రక్షణశాఖ అధికార ప్రతినిధి జనరల్ అబ్బుల్అజీజ్ తెలిపారు. మరోవైపు ఒమన్లోని లీమా సమీపంలోని హార్మూజ్ జలసంధిలో ట్యాంకర్నౌకపై ఇరాన్ దాడిచేసిందని బ్రిటన్ నావికాదళం తెలిపింది. ఖాసాబ్ సిటీకి వాయవ్యంగా 21 నాటికల్ మైళ్లదూరంలో సముద్రజలాల్లో మరో సరుకు రవాణా నౌక సమీపంలో పేలుడు సంభవించింది. ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. -
ఇరాన్కు ట్రంప్ వార్నింగ్.. ఈ సారి దాడి ఎప్పుడు చూడనిది
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్పై రెచ్చిపోయారు. ఈ వారాంతంలో ఇరాన్పై కనీవినీ ఎరుగని రీతిలో దాడులు చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో టెహ్రాన్ని లొంగిపోయేలా చేసేలా అత్యంత కఠినమైన దాడులు చేయాలని సైన్యాన్ని హెచ్చరించినట్లు సమాచారం.పశ్చిమాసియా యుద్ధంలో ట్విస్టుల మీద ట్విస్టులు నడుస్తున్నాయి. యుద్ధం ముగుస్తుందనుకునేలోపే మళ్లీ తీవ్రస్థాయికి చేరింది.ఇది చాలదన్నట్లు ఇటీవలే అమెరికాకు మద్ధతుగా సౌదీ అరేబియా సైతం రంగప్రవేశం చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఇరాన్కు ఝలకిచ్చారు.వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.." టెహ్రాన్ను లొంగిపోయేలా ఇరాన్పై కఠినమైన దాడులు చేయండి. వారు అబద్ధాలు చెబుతారు. తప్పుగా అన్వయిస్తారు. ఇరాన్పై విశ్వాసం కోల్పోతున్నాము మనము వారిని చాలా తీవ్రంగా దెబ్బతీద్దాం. దీంతో ఏదో ఒక సమయంలో, ఇకపై దీనిని భరించలేమని వారు చెబుతారు," అని ట్రంప్ అన్నట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ యుద్ధంలో అమెరికా ఎట్టిపరిస్థితుల్లో గెలవాలని కోరుకుంటున్నట్లు తెలిపాయి.అత్యంత కఠినమైన బాంబు దాడిగా?కాగా అక్కడి కథనాల ప్రకారం, ఇరాన్ యొక్క ఇంధన మౌలిక సదుపాయాల లక్ష్యాలు, రిఫైనరీలే టార్గెట్గా ఈ దాడులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన బాంబుదాడులలో అత్యంత తీవ్రమైనదిగా నిలిచేలా ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. ఈ భారీ దాడులను అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపేలా ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం. -
ఇరాన్ రహస్య కోట.. ట్రంప్ బాంబులు చేరగలవా?
ఒక పర్వతం.. దాని లోపల అంతుచిక్కని సొరంగాలు.. ప్రపంచ శక్తుల కళ్లన్నీ దానిపైనే. ఇరాన్ అణు కార్యక్రమంలో అత్యంత రహస్యంగా భావిస్తున్న ‘పికాక్స్ మౌంటెన్’ ఇప్పుడు మరోసారి అంతర్జాతీయ చర్చకు కేంద్రంగా మారింది. ఇందుకు కారణం.. ఇటీవలి కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్న వరుస హెచ్చరికలు. ‘ఆ ప్రాంతాన్ని త్వరలోనే.. చాలా తీవ్రంగా లక్ష్యంగా చేసుకుంటాం’ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మధ్యప్రాచ్యంలో కొత్త ఉద్రిక్తతలకు తెరతీశాయి. ఇప్పటికే ఇరాన్లోని కొన్ని అణు కేంద్రాలపై దాడులు జరిగిన నేపథ్యంలో.. ఇప్పుడు అమెరికా చూపు పికాక్స్ మౌంటెన్పై పడిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.పర్వతం లోపల ఏముంది?ఇరాన్లోని నటాంజ్ అణు సముదాయానికి దక్షిణంగా ఉన్న ఈ పర్వత ప్రాంతం బయటికి చూస్తే సాధారణ కొండలా కనిపిస్తుంది. కానీ దాని లోపల భారీ భూగర్భ నిర్మాణం ఉందని ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. ‘కుహ్-ఎ కొలాంగ్’గా పిలిచే ఈ ప్రాంతానికి ఆంగ్లంలో పికాక్స్ మౌంటెన్ అనే పేరు వచ్చింది. పికాక్స్ అంటే కొండను తవ్వే పనిముట్టు. పేరు మాదిరిగానే ఈ ప్రాంతం లోపల భారీ సొరంగ వ్యవస్థ ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఉపగ్రహ చిత్రాల్లో ఈ ప్రాంతంలో నాలుగు సొరంగ ప్రవేశ మార్గాలు కనిపిస్తున్నాయి. రెండు తూర్పు వైపు, మరో రెండు పడమర వైపు ఉన్నట్లు గుర్తించారు. ఇటీవలి చిత్రాల్లో అక్కడ నిర్మాణ వాహనాలు, కొత్త రహదారి పనులు, సొరంగాల వద్ద కదలికలు కనిపించడం అనుమానాలను పెంచింది.అణు కేంద్రానికి ప్రత్యామ్నాయమా?2020లో నటాంజ్ అణు కేంద్రంలో జరిగిన అనుమానాస్పద విధ్వంసం తర్వాత.. మరింత సురక్షితమైన, ఆధునిక భూగర్భ కేంద్రాన్ని నిర్మిస్తామని ఇరాన్ ప్రకటించింది. ఆ కేంద్రం పికాక్స్ మౌంటెన్ అయి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇక్కడ అధునాతన సెంట్రిఫ్యూజ్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. సెంట్రిఫ్యూజ్లు యురేనియం శుద్ధికి ఉపయోగపడతాయి. తక్కువ స్థాయి శుద్ధితో అణు విద్యుత్ అవసరాలకు ఉపయోగించే యురేనియం తయారు చేయవచ్చు. అయితే అత్యధిక స్థాయి శుద్ధి చేస్తే అణ్వాయుధాల తయారీలోనూ ఉపయోగించే అవకాశం ఉంటుంది.Iran : ( Video ) Israeli Channel 14 explains what Pickaxe Mountain is and what it has become . Iran's most strategic asset in its necular program. 👇 pic.twitter.com/TipMFrNOM9— Kbar57 (@kbar57) July 30, 2026ట్రంప్ ఎందుకు గురి పెట్టారు?పికాక్స్ మౌంటెన్లో అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉండవచ్చని కొన్ని వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇదే అమెరికా ఆందోళనకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. జూలై 21న ట్రంప్ మాట్లాడుతూ.. “ఆ ప్రాంతాన్ని త్వరలోనే భారీగా దెబ్బతీస్తాం” అని వ్యాఖ్యానించారు. తర్వాత కూడా ఒప్పందం కుదరకపోతే పికాక్స్ మౌంటెన్ను లక్ష్యంగా చేసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అయితే ఇరాన్ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. అక్కడ ఎలాంటి అణు కార్యకలాపాలు జరగడం లేదని చెబుతోంది. అమెరికా బెదిరింపులు దాడికి సాకులు మాత్రమేనని విమర్శిస్తోంది.అమెరికా బాంబులతోనైనా కూలుతుందా?పికాక్స్ మౌంటెన్కు ఉన్న అతిపెద్ద రక్షణ.. దాని లోతు. ఈ కేంద్రం భూమికి దాదాపు 100 మీటర్ల లోపల ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. భూగర్భ లక్ష్యాలను ఛేదించేందుకు అమెరికా వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధాల్లో GBU-57 బంకర్ బస్టర్ బాంబులు ఒకటి. ఇవి భారీగా రక్షణ కలిగిన నిర్మాణాలను ఛేదించేందుకు రూపొందించబడ్డాయి. అయితే ఇంత లోతులో ఉన్న పికాక్స్ మౌంటెన్ను పూర్తిగా ధ్వంసం చేయడం అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. లోపలి నిర్మాణం ఎలా ఉందో స్పష్టంగా తెలియకపోవడం కూడా మరో సమస్య. కేంద్రంలోని సొరంగ మార్గాలు, విద్యుత్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, సరఫరా మార్గాలను దెబ్బతీయడం ద్వారా కార్యకలాపాలను నిలిపివేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) అంచనాల ప్రకారం.. 2025లో ఇరాన్ వద్ద దాదాపు 440 కిలోల (970 పౌండ్ల) 60 శాతం శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వల్లో కొంత భాగం లేదా మొత్తం పికాక్స్ మౌంటెన్ భూగర్భ కేంద్రంలో ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనికి ఇప్పటివరకు ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు లేవు. అంతేకాదు.. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత నటాంజ్, ఫోర్డో అణు కేంద్రాల్లో దెబ్బతినకుండా మిగిలిన కొన్ని అధునాతన సెంట్రిఫ్యూజ్లను కూడా పికాక్స్ మౌంటెన్కు తరలించి ఉండవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.ఒక పర్వతం.. రెండు దేశాల పోరుపికాక్స్ మౌంటెన్ ఇప్పుడు కేవలం ఓ అణు కేంద్రం అనుమానంతో ఉన్న ప్రాంతం మాత్రమే కాదు.. అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలకు ప్రతీకగా మారింది. ఒకవైపు అమెరికా “అణు బెదిరింపును అడ్డుకోవాలి” అంటోంది. మరోవైపు ఇరాన్ “దాడికి ప్రతీకారం తప్పదు” అని హెచ్చరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో భూమి లోపల దాగిన ఈ రహస్య కేంద్రంపై నిజంగా బాంబులు పడతాయా? లేక ఇది కేవలం ఒత్తిడి వ్యూహమా? అన్నది ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. -
ఇరాన్ ఉలిక్కిపడేలా.. ట్రంప్, నెతన్యాహు మెగా ఆపరేషన్!
మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ భారీ స్థాయి వైమానిక దాడులకు సిద్ధమవుతున్నాయా? అంటే తాజా పరిణామాలు అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. ఇరాన్ ఇంధన మౌలిక వసతులపై ఇప్పటివరకు జరగని స్థాయిలో దాడుల ప్రణాళిక సిద్ధమవుతున్నట్లు అమెరికా అధికారులను ఉటంకిస్తూ సీబీఎస్ న్యూస్ వెల్లడించింది.ఈ దాడుల్లో ఇరాన్లోని కీలక విద్యుత్ కేంద్రాలు, చమురు శుద్ధి కర్మాగారాలు వంటి వ్యూహాత్మక లక్ష్యాలను ఎంచుకున్నట్లు సమాచారం. ఇరాన్ సైనిక కార్యకలాపాలు, ప్రభుత్వ వ్యవస్థను కొనసాగించే సామర్థ్యాన్ని బలహీనపర్చడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ ఉండొచ్చని అమెరికా అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ భారీ ఆపరేషన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా తుది అనుమతి ఇవ్వలేదని సమాచారం. పెంటగాన్ కూడా లక్ష్యాలపై స్పందించేందుకు నిరాకరించింది.ప్రపంచ మార్కెట్లు సోమవారం ప్రారంభమయ్యేలోపు ఈ ఆపరేషన్ను ముగించాలని అమెరికా వర్గాల్లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇరాన్ ఇంధన సరఫరాలపై దాడులు జరిగితే ప్రపంచ చమురు మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉండటంతో ఈ అంశంపై జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ను కూడా ఈ ప్రణాళికల్లో భాగస్వామిగా ఉంచినట్లు తెలుస్తోంది. వాషింగ్టన్తో టెల్ అవీవ్ సన్నిహిత సమన్వయం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్పై పూర్తి స్థాయి సైనిక చర్యకు తిరిగి వెళ్లే నిర్ణయం ఇంకా తీసుకోలేదని ఓ ఇజ్రాయెల్ అధికారి స్పష్టం చేశారు.ట్రంప్ అధ్యక్షతన క్యాంప్ డేవిడ్లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఇరాన్పై సైనిక ఎంపికలపై చర్చ జరిగినట్లు సమాచారం. కొందరు అధికారులు ఈ చర్యకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, ట్రంప్ మాత్రం ఇరాన్పై కఠిన వైఖరిని ప్రదర్శిస్తూ చాలా తీవ్రంగా దెబ్బతీస్తాం అనే సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా లక్ష్యం ఇరాన్ అణ్వస్త్ర సామర్థ్యాన్ని అడ్డుకోవడమేనని వైట్హౌస్ స్పష్టం చేసింది. అధ్యక్షుడి నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినా అమలు చేసేందుకు అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని పెంటగాన్ పేర్కొంది. టెహ్రాన్ నగర విద్యుత్ సరఫరాను దెబ్బతీయడం వంటి ప్రత్యామ్నాయాలపైనా అమెరికా అధికారులు చర్చించినట్లు సమాచారం.మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ చర్యలపై ఇరాన్ తీవ్ర హెచ్చరికలు చేసింది. ఎలాంటి అమెరికా దాడి జరిగినా ప్రతీకార చర్యలకు సమగ్ర ప్రణాళిక సిద్ధంగా ఉందని ఇరాన్ భద్రతా వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్లోని కీలక మౌలిక వసతులు, ప్రాంతీయంగా ఉన్న అమెరికా ఇంధన వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం తమకు ఉందని హెచ్చరించాయి. -
అమెరికా ‘హెవీ వేవ్’ దాడులు.. విస్తరిస్తున్న యుద్ధం!
మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకుంటున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రాంతీయ యుద్ధం దిశగా సాగుతున్నాయి. ఇరాన్ నుంచి అమెరికా స్థావరాలపై జరిగిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా అమెరికా భారీ వైమానిక దాడులు చేపట్టింది. దక్షిణ ఇరాన్లోని కీలక ప్రాంతాలపై ‘హెవీ వేవ్’ పేరుతో దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ దాడులతో పాటు ఇరాక్లో ఇరాన్ అనుకూల మిలీషియాలపై అమెరికా, సౌదీ అరేబియా సంయుక్త చర్యలు చేపట్టడం, యెమెన్లో హౌతీల కదలికలు, హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరగడం.. మొత్తం ప్రాంతాన్ని యుద్ధ వాతావరణంలోకి నెట్టాయి.ఇరాన్లోని రెవల్యూషనరీ గార్డ్ (IRGC)కు చెందిన స్థావరాలే లక్ష్యంగా తాజాగా అమెరికా దాడులు జరిపింది. సైనిక కమాండ్ కేంద్రాలు, మిసైల్, డ్రోన్ సదుపాయాలు, తీర రక్షణ వ్యవస్థలు, సముద్ర కార్యకలాపాలకు సంబంధించిన కేంద్రాలను టార్గెట్ చేసినట్లు అమెరికా వెల్లడించింది. అబాదాన్, బుషెహర్, కిష్, క్విష్మ్ దీవులు, ఖుజెస్తాన్ ప్రావిన్స్లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. కిష్ దీవిలోని కజెరూన్ ప్రాంతంలోనూ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు సమాచారం.క్విష్మ్లో నివాస భవనంపై మిసైల్.. రెస్క్యూ కొనసాగింపుఅమెరికా దాడుల్లో క్విష్మ్ దీవిలోని ఓ నివాస భవనం దెబ్బతింది. మిసైల్ దాడితో భవనం కూలిపోవడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి ఇద్దరు చిన్నారులను రక్షించి ఆస్పత్రికి తరలించాయి. మరో ముగ్గురి కోసం శిథిలాల తొలగింపు, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటన యుద్ధంలో పౌర ప్రాంతాలు కూడా ప్రభావితమవుతున్నాయన్న ఆందోళనలను పెంచింది.‘ఇప్పుడు మా వంతు’.. ట్రంప్ హెచ్చరికల తర్వాతే దాడులుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా బలగాలపై దాడులకు ప్రతిస్పందన తప్పదని స్పష్టం చేసిన ఆయన.. “ఇప్పుడు కొట్టే వంతు మాది” అనే సంకేతాలు ఇచ్చారు. ఇరాన్ నుంచి దాడులను ఆపాలని కోరినా అమెరికా చర్యలు తప్పవని ట్రంప్ వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే వైమానిక దాడులు ప్రారంభమయ్యాయి.జోర్డాన్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులుఇటీవల జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసినట్లు అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతీకారంగానే తాజా ఆపరేషన్ చేపట్టినట్లు వాషింగ్టన్ వెల్లడించింది. మరోవైపు ఇరాన్ మాత్రం తమ చర్యలను అమెరికా బెదిరింపులకు ప్రతిస్పందనగా సమర్థించుకుంది. అమెరికా ఒత్తిడి కొనసాగితే ప్రతిఘటన కూడా కొనసాగుతుందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ హెచ్చరించింది.ఇరాక్లో అమెరికా–సౌదీ దాడులు.. తీవ్ర ఉద్రిక్తతయుద్ధ ప్రభావం ఇరాక్కు కూడా చేరింది. ఇరాన్కు అనుబంధంగా ఉన్న మిలీషియా గ్రూపుల స్థావరాలపై అమెరికా, సౌదీ అరేబియా సంయుక్త దాడులు జరిపాయి. ఈ దాడుల్లో పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ (PMF)కు చెందిన పలువురు సభ్యులు మరణించినట్లు సమాచారం. కనీసం 20 మంది మృతి చెందినట్లు ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఇరాక్ ప్రభుత్వం ఈ చర్యలను తీవ్రంగా ఖండించింది. తమ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించారని, అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించింది.రంగంలోకి హౌతీలు.. యెమెన్ నుంచి మరో ముప్పుఇరాన్కు మద్దతుగా వ్యవహరిస్తున్న యెమెన్లోని హౌతీ గ్రూపు కూడా ఈ ఘర్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. సౌదీ అరేబియా చమురు రవాణా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని హౌతీలు దాడులు చేసినట్లు సమాచారం. దీనికి ప్రతిగా హోడెయిడా ప్రావిన్స్లోని హౌతీ స్థావరాలపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో యుద్ధ ప్రభావం గల్ఫ్ ప్రాంతం దాటి యెమెన్ వరకు విస్తరించింది.హర్ముజ్ జలసంధిలో పెరుగుతున్న టెన్షన్ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి మరోసారి యుద్ధ కేంద్రంగా మారింది. ఈ మార్గంలో ప్రయాణించే నౌకలపై ఇరాన్ ఆంక్షలు విధించడం, అనుమతి లేని మార్గాల్లో వెళ్లే ట్యాంకర్లను అడ్డుకుంటామని హెచ్చరించడం ఉద్రిక్తతలకు కారణమైంది. ఇరాన్ నౌకాదళం మూడు చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది. మరోవైపు అమెరికా మాత్రం అంతర్జాతీయ నౌకాయానానికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. హర్ముజ్లో అమెరికా ఆంక్షలను దిక్కరించిన లావిన్ ట్యాంకర్పై దాడి జరిగింది. ఇంజిన్ రూమ్పై కాల్పులు జరపడంతో నౌక దెబ్బతింది. ఈజిప్ట్ పోర్టులో డ్రోన్ దాడి కలకలం?యుద్ధం కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోందన్న సంకేతంగా ఈజిప్ట్లోని డమియెట్టా పోర్టులో అమెరికాకు చెందిన ఎల్ఎన్జీ ట్యాంకర్పై డ్రోన్ దాడి ఘటన కలకలం రేపింది. దాడి తర్వాత నౌకలో మంటలు చెలరేగాయి. మంటలు మరో నౌకకు కూడా వ్యాపించాయి. అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇది ఇరాన్ జరిపిన డ్రోన్ దాడియేనా?.. లేదంటే అగ్నిప్రమాదమా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. చమురు ధరలకు యుద్ధ సెగమిడిల్ ఈస్ట్లో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్లపై పడుతోంది. యుద్ధ భయాలతో క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఏకంగా సెంచరీ దాటేశాయి. ఇరాన్ చమురు స్థావరాలు, హర్ముజ్ జలసంధి భద్రతపై అనిశ్చితి కొనసాగితే ప్రపంచ ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ప్రాంతీయ యుద్ధంగా మారుతున్న ఘర్షణఅమెరికా–ఇరాన్ మధ్య మొదలైన పోరు ఇప్పుడు ఇరాక్, యెమెన్, సౌదీ అరేబియా, సముద్ర మార్గాల వరకు విస్తరించింది. ఒకవైపు ప్రతీకార దాడులు.. మరోవైపు చమురు మార్గాలపై ముప్పు.. ఇంకోవైపు మిత్ర దేశాల జోక్యం.. ఇవన్నీ కలిసి మిడిల్ ఈస్ట్లో పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చుతున్నాయి. -
ట్రంప్-నెతన్యాహు భేటీ.. ఇరాన్పై ఫైనల్ గేమ్కు రంగం సిద్ధం?
ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన కీలక భేటీ ప్రపంచ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వైట్హౌస్లో దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో ఇరాన్ను ఎదుర్కొనే భవిష్యత్ వ్యూహాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.అమెరికాను వెంటనే మరో యుద్ధంలోకి నెట్టాలనే ఉద్దేశంతో కాకుండా.. దౌత్య చర్చలు, ఆర్థిక ఆంక్షలు, అవసరమైతే సైనిక చర్య అనే మూడు మార్గాలను పరిశీలించడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశమని ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు.ఇరాన్పై మూడు మార్గాలు.. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అమెరికా, ఇజ్రాయెల్ ముందున్న అవకాశాలపై చర్చ జరిగింది.1. చర్చల మార్గం:ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లు చర్చల్లో పాల్గొంటున్నప్పటికీ.. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరుదేశాల మధ్య ఇంకా తీవ్ర విభేదాలు ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో నెతన్యాహుకు అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది.2. ఆర్థిక ఒత్తిడి:ఇరాన్పై మరిన్ని ఆంక్షలు విధించడం, నౌకా నిర్బంధాన్ని కొనసాగించడం ద్వారా ఒత్తిడి పెంచే అంశాన్ని కూడా పరిశీలించారు.3. సైనిక చర్య:చర్చలు, ఆంక్షలు ఫలించని పరిస్థితుల్లో తిరిగి సైనిక దాడులను విస్తరించే అవకాశాన్ని కూడా చర్చించినట్లు సమాచారం.చమురు ధరలపై ట్రంప్ ఆందోళనఇరాన్తో ఘర్షణ కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చమురు ధరలు పెరగడం, ఇంధన మార్కెట్లలో అస్థిరత వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇరాన్కు ప్రస్తుతం ఉన్న ప్రధాన వ్యూహాత్మక ఆధారం హార్మూజ్ జలసంధి అని, దానిని ఒత్తిడి సాధనంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోందని నెతన్యాహు పేర్కొన్నట్లు సమాచారం.సిరియా నుంచి సౌదీ వరకు.. ఇరాన్తో పాటు మధ్యప్రాచ్యంలోని ఇతర పరిణామాలపైనా ట్రంప్, నెతన్యాహు చర్చించారు. సిరియాలో ఇజ్రాయెల్, టర్కీ సైనిక ఉనికి, దక్షిణ సిరియాలో భద్రతా పరిస్థితులపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం. అలాగే, అమెరికా-సౌదీ అణు ఒప్పందం, భవిష్యత్లో సౌదీ అరేబియా-ఇజ్రాయెల్ సంబంధాల సాధారణీకరణ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక, రక్షణ రంగంలో అమెరికాపై ఆధారాన్ని క్రమంగా తగ్గించుకోవాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. వచ్చే పదేళ్లలో స్వదేశీ రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు, కొత్త తరం యుద్ధ విమానాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని నెతన్యాహు ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరాన్పై అమెరికా తదుపరి నిర్ణయం ఎలా ఉండబోతోందన్న అంశం ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. ట్రంప్-నెతన్యాహు భేటీ తర్వాత మధ్యప్రాచ్య పరిణామాలు మరింత కీలక దశలోకి ప్రవేశించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. -
మళ్లీ భీకర యుద్ధం.. ఇరాన్పై విరుచుకుపడ్డ అమెరికా
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరుకున్నాయి. జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులకు ప్రతీకారంగా అమెరికా బుధవారం రాత్రి ఇరాన్పై భారీ వైమానిక దాడులు ప్రారంభించింది. ఇరాన్ భూభాగంపై దాదాపు వారం రోజుల తర్వాత అమెరికా చేపట్టిన తొలి ప్రత్యక్ష దాడులు ఇవే.అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఈ దాడులను ధ్రువీకరించింది. ఇరాన్ నుంచి అమెరికా బలగాలపై జరిగిన దాడులకు ఇది “శక్తివంతమైన ప్రతిస్పందన” అని పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు దాడులు ప్రారంభమైనట్లు తెలిపింది.U.S. forces began launching strikes against Iran at 8 p.m. ET today. The strikes are a powerful response to yesterday's attempted Iranian attacks on U.S. forces based in the Middle East.— U.S. Central Command (@CENTCOM) July 30, 2026ట్రంప్ హెచ్చరికల తర్వాతే..ఇరాన్పై దాడులకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. జోర్డాన్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడి చేసిన నేపథ్యంలో.. ‘‘ఇరాన్కు గట్టి సమాధానం ఇస్తాం.. చాలా బలంగా ఎదురుదాడి చేస్తాం’’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘వాళ్లు దాడి చేశారు.. ఇప్పుడు మా వంతు వచ్చింది’’ అంటూ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ చర్యలకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.🚨 BREAKING: President Trump is warning adversaries that a forceful U.S. response is coming after a drone attack on an LNG tanker off the coast of Egypt."We're going to hit them very hard."Trump confirmed five rockets were fired and signaled that retaliation is imminent,…— Stephen Gardner (@StephenGardnerX) July 29, 2026దక్షిణ ఇరాన్లో పేలుళ్ల శబ్దాలుఅమెరికా దాడుల తర్వాత దక్షిణ ఇరాన్లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. అయితే అమెరికా దాడుల లక్ష్యాలు, నష్టం వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడికాలేదు.ప్రతిఘటన ఉంటుంది: ఇరాన్అమెరికా బెదిరింపులు కొనసాగినంత కాలం తమ ప్రతిఘటన కొనసాగుతుందని ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. అమెరికా బలగాలపై తాము చేపట్టిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించింది.ఇరాన్ నావికా దళాలు హార్ముజ్ జలసంధి వైపు వెళ్తున్న మూడు చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు కూడా సమాచారం వెలువడింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన ఈ మార్గంపై ఉద్రిక్తతలు పెరగడం అంతర్జాతీయంగా ఆందోళనకు కారణమవుతోంది.ఇరాక్లోనూ ఉద్రిక్తతలు..ఇరాక్లో అమెరికా, సౌదీ అరేబియా సంయుక్త దాడులపై అక్కడి ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ దాడుల్లో పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్కు చెందిన 20 మంది మరణించగా.. మరో 32 మంది గాయపడినట్లు సమాచారం. ఈ పరిణామాలు ఇరాక్ను కూడా ప్రాంతీయ ఘర్షణలోకి లాగుతున్నాయని అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.చర్చల నుంచి యుద్ధం వైపు?..కొద్ది రోజుల క్రితం ఇరాన్తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని ట్రంప్ చెప్పినప్పటికీ.. తాజా పరిణామాలతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇరాన్ తీవ్ర చర్యలకు దిగితే యుద్ధాన్ని మళ్లీ ప్రారంభించాల్సి వస్తుందని ట్రంప్ గతంలో హెచ్చరించారు.అమెరికా తాజా దాడులతో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ ప్రతిస్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి పరిణామాలు ప్రపంచ చమురు మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. -
ఇరాన్ మిలిటెంట్లపై అమెరికా–సౌదీ దాడి
కైరో: పశ్చిమాసియాలో దాడుల పరంపర ఆగడం లేదు. ఇరాక్ భూభాగంలో ఇరాన్ మద్దతుగల మిలిటెంట్లపై సౌదీ అరేబియాతో కలిసి మంగళవారం అర్ధరాత్రి తర్వాత అమెరికా దాడి చేయగా.. బుధవారం తెల్లవారుజామున ఇరాన్ సైన్యం గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా బలగాలపై క్షిపణుల వర్షం కురిపించింది. అమెరికా–సౌదీ అరేబియా దాడిలో కనీసం 20 మంది మరణించారు. 32 మంది గాయపడ్డారు. ఈ దాడిలో ఆరుగురు ఇరాన్ సలహాదారులు మరణించారని ఇరాకీ మిలీíÙయా సిబ్బంది తెలిపారు. మరణించిన 20 మందిలో ఈ సలహాదారులు కూడా ఉన్నారా లేదా అనేది తెలియరాలేదు. పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరగడం చూస్తూ మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం జరుగుతుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు అమెరికా వద్ద అత్యాధునిక ఆయుధ నిల్వలు ఇప్పటికే తగ్గిపోయినట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా తమ చమురు కేంద్రాలపై ఇరాకీ మిలిటెంట్లు డ్రోన్లతో దాడులు చేశాయని సౌదీ అరేబియా ఆరోపించింది. సౌదీ అరేబియాపై జరిగినట్లు చెబుతున్న డ్రోన్ దాడులకు ప్రతిస్పందనగా, తమ యుద్ధ విమానాలు తూర్పు ఇరాక్లోని పలు రవాణా, ఆయుధ స్థావరాలపై దాడి చేశాయని అమెరికా సైన్యం తేల్చిచెప్పింది. జోర్డాన్లోని అమెరికా సైనిక కేంద్రమైన మువఫాక్ సాల్టి వైమానిక స్థావరంపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ ఇస్లామిక్ పారామిలటరీ రివల్యూషనరీ గార్డ్ వెల్లడించింది. మరోవైపు ఐదు ఇరాన్ క్షిపణులను అడ్డుకుని ధ్వంసం చేసినట్లు జోర్డాన్ సైన్యం స్పష్టంచేసింది. ఇరాన్కు చావుదెబ్బలు తప్పవు: ట్రంప్ పశ్చిమాసియాలో తమ సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేయడం, బాలిస్టిక్ క్షిపణులు పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గట్టిగా స్పందిస్తామని, ఇరాన్ను తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఇరాన్కు చావుదెబ్బలు తప్పవని బుధవారం ప్రతిజ్ఞ చేశారు. జోర్డాన్లోని అమెరికా స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. అనంతరం దీనిపై ట్రంప్ మాట్లాడారు. ఇరాన్ గట్టిగా విరుచుకుపడతామని, మర్చిపోలేని రీతితో దెబ్బకొడతామని స్పష్టంచేశారు. -
మళ్లీ మొదలైన యుద్ధం..! అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి?
-
షా వారసుడికి అడ్డుపడుతోంది ఎవరో తెలుసా?
ఒక అవకాశం వస్తే చాలు.. చరిత్ర తిరగరాస్తానని భావించాడు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ క్షణం వచ్చేసిందనుకున్నాడు. అల్లకల్లోల పరిస్థితులు.. మార్పు కోసం ఎదురుచూస్తున్న ప్రజలు.. ఇదే సరైన సమయం అనుకున్నాడు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల నెరవేరుతుందని ఆయన ఆశలు పెట్టుకున్నాడు. కానీ పరిస్థితులు అనుకున్నట్లుగా సాగలేదు. మద్దతు పెరుగుతుందని భావించిన వేళ.. వరుస సవాళ్లు ఎదురయ్యాయి. ఈ ప్రయత్నాల్లో షా వారసుడికి ఇప్పుడు చిక్కులు తప్పడం లేదు.ఇరాన్లో పాలనా మార్పు వస్తే కొత్త నాయకత్వం ఎవరిది? అనే ప్రశ్నకు సమాధానంగా తనను తాను ముందుకు తెచ్చుకున్న మాజీ షా కుమారుడు రెజా పహ్లవీ ప్రయత్నాలకు అనూహ్య అడ్డంకులు ఎదురవుతున్నాయి. 1979 ఇస్లామిక్ విప్లవంలో తన తండ్రి మహ్మద్ రెజా పహ్లవీ పాలన కూలిపోయిన తర్వాత దేశం విడిచిన రెజా పహ్లవీ దాదాపు ఐదు దశాబ్దాలుగా ప్రవాస జీవితంలోనే ఉన్నారు. రాజరికం అంతమైనప్పటికీ.. షా కుటుంబ వారసుడిగా ఆయన పేరు ఇరాన్ రాజకీయాల్లో మాత్రం కొనసాగుతూనే వచ్చింది. అయితే ఇరాన్లో ఇటీవలి పరిణామాలు, అమెరికా–ఇజ్రాయెల్ ఘర్షణల నేపథ్యంలో రాజకీయ మార్పు వస్తుందనే అంచనాలతో ఆయన మళ్లీ తెరపైకి వచ్చారు. ఇరాన్లో కొత్త వ్యవస్థ ఏర్పడితే తాత్కాలిక మార్పు దశకు తానే నాయకత్వం వహిస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో.. ‘నేను గమ్యం కాదు.. వంతెన మాత్రమే’రెజా పహ్లవీ తనను భవిష్యత్ పాలకుడిగా కాకుండా ప్రజాస్వామ్య మార్పుకు మార్గదర్శిగా చూపించుకునే ప్రయత్నం చేశారు. ‘‘నేను గమ్యం కాదు.. గమ్యానికి తీసుకెళ్లే వంతెన మాత్రమే’’ అంటూ ఆయన తన పాత్రను వివరించారు. ఇరాన్ ప్రజలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలని ప్రకటించారు. అయితే..అదే సమయంలో అమెరికా, యూరప్లో పర్యటిస్తూ ఆయన మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేశారు. అమెరికాలోని కొంతమంది సంపన్న ప్రవాస ఇరానీయులు కూడా ఆయనకు ఆర్థిక సహకారం అందించారు. అయితే ఈ మద్దతు దేశంలో బలమైన ప్రజా ఉద్యమంగా మారిందా? అనే అనుమానాలు ఆ సమయంలో వ్యక్తం అయ్యాయి కూడా!.ప్రతిపక్షంలోనే అసలు పోరుఒకవైపు ఇరాన్ ప్రభుత్వంపై వ్యతిరేకత.. మరోవైపు ప్రతిపక్షంలోనే విభేదాలు.. ఇంకోవైపు అంతర్జాతీయ మద్దతుపై అనిశ్చితి.. ఇలా మూడు వైపుల సవాళ్ల మధ్య పహ్లవీ రాజకీయ ప్రయాణం సాగుతోంది. రెజా పహ్లవీకి ఎదురైన అతిపెద్ద సవాలు ఇరాన్ ప్రభుత్వమే కాదు.. ప్రతిపక్షంలోని విభేదాలే. ఇస్లామిక్ రిపబ్లిక్కు వ్యతిరేకంగా ఉన్న వర్గాలు అనేకం ఉన్నప్పటికీ.. వాటి మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం సమస్యగా మారింది.రాయిటర్స్ కథనం ప్రకారం.. పహ్లవీ చుట్టూ ఉన్న కొందరు మద్దతుదారులు ఇతర ప్రతిపక్ష నేతలపై తీవ్ర విమర్శలు చేయడం, కొందరిపై దాడులకు పాల్పడిన ఘటనలు ఉద్యమ ఐక్యతను దెబ్బతీశాయి. 2023లో ప్రతిపక్షాలను ఏకం చేసే ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి ఎక్కువ కాలం కొనసాగలేదనే విషయం ఇప్పుడు వెలుగులోకి రావడం గమనార్హం.దాతల్లోనూ పెరిగిన అసంతృప్తిపహ్లవీకి మద్దతుగా కొందరు ఇరానియన్-అమెరికన్ వ్యాపారవేత్తలు మిలియన్ల డాలర్ల నిధులు సమకూర్చినప్పటికీ.. ఆశించిన స్థాయిలో రాజకీయ ఫలితాలు కనిపించడం లేదనే అసంతృప్తి కొందరిలో పెరిగినట్లు సమాచారం. ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయడం, ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తీసుకురావడంలో మరింత చురుగ్గా వ్యవహరించాలని వారు సూచించినట్లు తెలుస్తోంది.అమెరికా మద్దతు కూడా ప్రశ్నార్థకమేఇరాన్లో మార్పు కోసం ప్రయత్నిస్తున్న పహ్లవీకి అమెరికా మద్దతు పూర్తిగా లభించలేదని విశ్లేషణలు చెబుతున్నాయి. ట్రంప్ సహా అమెరికా అధికారులు కూడా ఆయనను భవిష్యత్ ఇరాన్ నాయకుడిగా అధికారికంగా ప్రకటించలేదు. ఇరాన్లో ఆయనకు ఉన్న వాస్తవ ప్రజాదరణ, రాజకీయ స్థిరత్వంపై సందేహాలు ఉన్నట్లు తెలుస్తోంది.షా వారసత్వం.. బలంతోపాటు బలహీనత కూడా!రెజా పహ్లవీకి అతిపెద్ద బలం ఆయన కుటుంబ పేరు. చివరి షా కుమారుడిగా కొందరు ఆయనను స్థిరత్వానికి ప్రతీకగా చూస్తున్నారు. అయితే అదే గతం ఆయనకు సవాల్గా మారింది. షా పాలనలో జరిగిన అణచివేతను గుర్తు చేస్తూ కొందరు వర్గాలు ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం ఇరాన్లో మార్పు కోసం ప్రయత్నిస్తున్న అనేక శక్తుల్లో రెజా పహ్లవీ అత్యంత గుర్తింపు ఉన్న వ్యక్తిగా ఉన్నప్పటికీ.. ఆయన ముందున్న అసలు పరీక్ష మాత్రం ఒక్కటే. విభిన్న ప్రతిపక్షాలను ఏకం చేసి, దేశంలో విశ్వసనీయమైన ప్రత్యామ్నాయంగా నిలబడగలరా? అన్నదే. -
రెచ్చిపోయిన ఇరాన్.. ట్రంప్ రియాక్షన్పై టెన్షన్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతున్నాయన్న సమయంలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇస్తున్న వేళ.. ఇరాన్ మరోసారి తన సైనిక శక్తిని ప్రదర్శించింది. అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. మంగళవారం సాయంత్రం ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నుంచి పలు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు CENTCOM తెలిపింది. జోర్డాన్లో ఉన్న అమెరికా బలగాల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. అయితే వాటన్నింటినీ విజయవంతంగా అడ్డుకున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించింది.‘‘ఇది ఆకస్మిక దాడికి చేసిన ప్రయత్నం. ప్రయోగించిన అన్ని క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నాం’’ అని అమెరికా కమాండ్ వెల్లడించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా సమాచారం లేదని తెలిపింది.ట్రంప్ చర్చల మాటలు.. ఇరాన్ క్షిపణుల బదులుఇటీవల ఇరాన్పై అమెరికా సైనిక చర్యలకు తాత్కాలిక విరామం ప్రకటించిన ట్రంప్.. చర్చలకు అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్తో మంచి చర్చలు జరుగుతున్నాయని, ఒప్పందం కుదిరే అవకాశం ఉందని కూడా చెప్పారు. అయితే చర్చలు విఫలమైతే మళ్లీ సైనిక చర్యలు ప్రారంభిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిణామాల మధ్యే ఇరాన్ క్షిపణి దాడి జరగడం అంతర్జాతీయంగా ఆసక్తిని రేపుతోంది.ట్రంప్కు ఇరాన్ హెచ్చరిక సంకేతమా?ఇరాన్ తాజా చర్యను అమెరికాకు ఒక బలమైన సందేశంగా విశ్లేషకులు చూస్తున్నారు. తమను పక్కన పెట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అంగీకరించబోమని చెప్పే ప్రయత్నంగానే ఈ దాడిని భావిస్తున్నారు. ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన ఘర్షణల్లో భాగంగా అమెరికా బలగాలు ఇరాన్కు చెందిన పలు లక్ష్యాలపై దాడులు చేశాయి. ఆ తర్వాత ట్రంప్ దౌత్యానికి అవకాశం కల్పిస్తూ సైనిక చర్యలను నిలిపివేశారు.మళ్లీ మొదలైన యుద్ధం?తాజా క్షిపణి దాడి నేపథ్యంలో అమెరికా తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది. ట్రంప్ ఇప్పటికే ఇరాన్పై కఠిన వైఖరి ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఇప్పుడు జరిగిన దాడికి అమెరికా ఎలా స్పందిస్తుందన్నది కీలకంగా మారింది. మరోవైపు మధ్యప్రాచ్యంలో అమెరికా నౌకాదళం, సైనిక బలగాల మోహరింపు కొనసాగుతోంది. ఇరాన్-అమెరికా మధ్య మరోసారి ప్రత్యక్ష ఘర్షణకు దారితీస్తుందా? లేదంటే దౌత్య మార్గంలోనే పరిష్కారం దొరుకుతుందా అన్నది వేచి చూడాల్సి ఉంది.హౌతీల దాడులతో మరింత టెన్షన్ఇదే సమయంలో యెమెన్కు చెందిన ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో సౌదీ చమురు నౌకను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించినట్లు ప్రకటించారు. మరోవైపు సౌదీ అరేబియా, అమెరికా కలిసి ఇరాక్లోని ఇరాన్ అనుకూల మిలీషియా స్థావరాలపై దాడులు చేసినట్లు CENTCOM తెలిపింది. ఈ పరిణామాలన్నీ కలిసి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.ఇక ట్రంప్ నిర్ణయం ఏంటి?ఇరాన్ క్షిపణి దాడికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. చర్చలకు అవకాశం ఇస్తూనే.. సైనికంగా కఠిన చర్యలకు వెనుకాడబోమన్న ట్రంప్ వైఖరి నేపథ్యంలో తదుపరి పరిణామాలు కీలకం కానున్నాయి. -
ప్రభుత్వానికి ఎదురు తిరిగితే ఇదే గతి... నడివీధిలో ఇద్దరికి ఉరి
టెహ్రాన్: ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో సంబంధం ఉన్న కేసుల్లో ఇద్దరు వ్యక్తులకు విధించిన ఉరిశిక్షను అమలు చేసినట్లు ఇరాన్ న్యాయవ్యవస్థ మంగళవారం ప్రకటించింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఈ ఉరిశిక్షను బహిరంగ ప్రదేశంలో అమలు చేశారు."అబోల్ఫజల్ సెపాహి, అమీర్-హొస్సేన్ సఫారీకి విధించిన మరణదండనను ఈ ఉదయం అమలు చేశాం" అని న్యాయవ్యవస్థకు చెందిన మిజాన్ ఆన్లైన్ వెబ్సైట్ వెల్లడించింది. ఇక మెహర్ వార్తా సంస్థ కథనం ప్రకారం.. మధ్య ఇస్ఫహాన్ ప్రావిన్స్లోని మలెక్షహర్ నగరంలోని ఒక చౌరస్తాలో ప్రజల సమక్షంలో ఉరిశిక్ష అమలు చేశారు.జనవరి 8న ఈ ఇద్దరు మచెట్లు, కత్తులతో పోలీసు అధికారులపై దాడి చేశారని, వారిని రహదారి సూచిక బోర్డులకు కట్టేసి నేలపై ఈడ్చారని, పెట్రోలు పోసి నిప్పంటించారని మిజాన్ తెలిపింది. వారిపై "మొహారెబెహ్ (దేవుడిపై యుద్ధం చేయడం)" అనే అభియోగంతో పాటు, ఆయుధాలు ప్రదర్శించి ప్రజల్లో భయం, భీతావహ పరిస్థితులు సృష్టించడం, దేశంలో శాంతి భద్రతలకు తీవ్ర అంతరాయం కలిగించే చర్యలకు పాల్పడడం వంటి ఆరోపణలు నమోదయ్యాయని పేర్కొంది.డిసెంబర్ చివరలో జీవన వ్యయం పెరగడంపై ప్రారంభమైన నిరసన ఉద్యమం వేగంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలుగా మారింది. జనవరి 8, 9 తేదీల్లో అవి గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఈ హింసలో 3,000 మందికి పైగా మరణించారని ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలకు అమెరికా, ఇజ్రాయెల్ ప్రోత్సహించిన "ఉగ్రవాద చర్యలే" కారణమని వారు ఆరోపించారు. అయితే విదేశాల్లో ఉన్న హక్కుల సంస్థలు మాత్రం భద్రతా బలగాలు నిరసనకారులపై కాల్పులు జరిపాయని చెబుతున్నాయి.ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై సైనిక జోక్యం చేసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై దాడి చేశాయి. దీంతో పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైంది. ఆ తర్వాత దేశంలో ఘర్షణలు, నిరసనలకు సంబంధించి అరెస్టులు, ఉరిశిక్షల అమలు పెరిగాయి.జూలై 19న కూడా ఇస్ఫహాన్ ప్రావిన్స్లో ఇదే తరహా ఆరోపణలపై మరో ఇద్దరికి ఉరిశిక్ష అమలు చేశారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం, ప్రపంచంలో అత్యధిక ఉరిశిక్షలు అమలు చేసే దేశాల జాబితాలో చైనా తర్వాత ఇరాన్ రెండో స్థానంలో ఉంది. -
ట్రంప్ శాంతి మంత్రం.. ఇరాన్ షాక్!
అమెరికా–ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కాస్త చల్లబడుతున్న వేళ.. శాంతి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష దాడులు మూడు రోజులుగా నిలిచిపోవడంతో చర్చలకు అవకాశం ఏర్పడిందని చెప్పారు. అయితే దౌత్య ప్రయత్నాలు విఫలమైతే తిరిగి సైనిక చర్యలకు దిగుతామని హెచ్చరించారు.‘‘ఇరాన్తో మంచి చర్చలు జరుగుతున్నాయి. ఏదో ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది’’ అని ట్రంప్ ఎయిర్ఫోర్స్ వన్లో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. అయితే చర్చలు ఫలించకపోతే గతంలో చేపట్టిన చర్యలను తిరిగి కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దౌత్య మార్గాల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తే అది అందరికీ మంచిదేనని పేర్కొన్న ఆయన.. అమెరికా ప్రయోజనాలు, భద్రత విషయంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండదని సంకేతాలు ఇచ్చారు. ఇరాన్తో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, అవసరమైతే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని ట్రంప్ తెలిపారు.ప్రత్యక్ష చర్చలు లేవంటున్న ఇరాన్అమెరికాతో నేరుగా ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. మధ్యవర్తుల ద్వారా అమెరికా నుంచి కొన్ని సందేశాలు అందుతున్నాయని, కానీ ప్రస్తుతం అధికారిక చర్చలు మాత్రం లేవని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు. ఇటీవలి కాలంలో అమెరికా దాడులతో ఇరాన్లోని పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయని, ప్రతిగా ఇరాన్ కూడా అమెరికా అనుబంధ లక్ష్యాలపై దాడులు చేసిందని సమాచారం. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఎంతకాలం కొనసాగుతుందన్నది ఆసక్తిగా మారింది.‘అమెరికా ఆయుధ నిల్వలు తగ్గలేదు’.. ట్రంప్ఇరాన్పై దీర్ఘకాలిక సైనిక చర్యలకు అమెరికా వద్ద క్షిపణులు, ఆయుధ నిల్వలు సరిపోవడం లేదన్న వార్తలను ట్రంప్ ఖండించారు. అమెరికా వద్ద భారీగా ఆయుధ నిల్వలు ఉన్నాయని, అవసరానికి మించి ఉన్నాయని పేర్కొన్నారు. అయితే గత బైడెన్ ప్రభుత్వ హయాంలో ఉక్రెయిన్కు భారీగా ఆయుధాలు పంపడం వల్ల నిల్వలపై ఒత్తిడి ఏర్పడిందని ట్రంప్ ఆరోపించారు. ప్రస్తుతం అత్యాధునిక ఆయుధ వ్యవస్థల ఉత్పత్తిని వేగవంతం చేస్తున్నామని చెప్పారు.సౌదీ చమురు స్థావరాలపై డ్రోన్ దాడులుపశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గలేదు. సోమవారం సౌదీ అరేబియాలోని చమురు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు జరిగాయి. ఇరాన్ అనుకూల వర్గాలే ఈ దాడులకు కారణమని సౌదీ ఆరోపించింది. మరోవైపు యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు కూడా సౌదీ చమురు మౌలిక వసతులపై దాడులు చేసినట్లు ప్రకటించారు. అయితే దీనిపై సౌదీ నుంచి అధికారిక స్పందన రాలేదు.హర్ముజ్ జలసంధిపైనే అసలు పంచాయితీప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి ఇప్పుడు ప్రధాన వివాదంగా మారింది. ఈ మార్గంపై నియంత్రణ తమదేనని ఇరాన్ చెబుతుండగా.. నౌకల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని అమెరికా పట్టుబడుతోంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఇటీవల ఈ మార్గంలో ప్రయాణిస్తున్న కొన్ని నౌకలను అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో ప్రపంచ చమురు మార్కెట్లు ఆందోళనకు గురయ్యాయి. అయితే తాజా కాల్పుల విరమణ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో కొంత ఉపశమనం కనిపించింది.చర్చలా? దాడులా? ఉత్కంఠ కొనసాగింపుఅమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలపై ఆశలు కనిపిస్తున్నప్పటికీ.. ఇరు దేశాల ప్రకటనల్లో భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు చర్చలకు సిద్ధమంటూ సంకేతాలు ఇస్తూనే.. మరోవైపు సైనిక చర్యలకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరికలు రావడం మిడిల్ఈస్ట్ సంక్షోభాన్ని మరింత సంక్లిష్టంగా మారుస్తోంది.ట్రంప్ మాటల్లో శాంతి సంకేతాలు కనిపిస్తున్నా.. హర్ముజ్ జలసంధి, ఆయుధ నిల్వలు, ప్రాంతీయ దాడులు ఈ ఒప్పందానికి అసలు పరీక్షగా మారనున్నాయి. -
సీఎన్జీ కార్లకు ఫుల్ డిమాండ్: కారణం ఇదే!
పశ్చిమ ఆసియా సంఘర్షణ తర్వాత.. ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఇలాంటి సమయంలో చాలామంది వాహన వినియోగదారులు ఎక్కువ మైలేజ్ ఇచ్చే సీఎన్జీ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. దీంతో ఈ వాహనాలకు డిమాండ్ బలంగా కొనసాగుతుందని మారుతి సుజుకి ఇండియా అంచనా వేస్తోంది.మారుతి సుజుకి FY27లో సుమారు 9 లక్షల సీఎన్జీ వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో విక్రయించిన 7 లక్షలకు పైగా యూనిట్లతో పోలిస్తే దాదాపు 30 శాతం పెరుగుదలను సూచిస్తుంది.ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మారుతి సుజుకి సుమారు 2.2 లక్షల సీఎన్జీ వాహనాలను విక్రయించిందని, ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 58 శాతం పెరుగుదలను సూచిస్తుందని మారుతి సుజుకి ఇండియా మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బానర్జీ వెల్లడించారు. దీన్నిబట్టి చూస్తే ఈ ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ తన లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందనిపిస్తోంది.పశ్చిమ ఆసియా యుద్ధం తర్వాత ఇంధన ధరలు పెరగడం కూడా డిమాండ్ పెరుగుదలకు ఒక కారణమని, దీనివల్ల కొనుగోలుదారులు తక్కువ నిర్వహణ ఖర్చులున్న వాహనాలను పరిగణనలోకి తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. మారుతి సుజుకి ప్రస్తుతం దేశీయ మార్కెట్లో లైట్ వెయిట్ కమర్షియల్ వాహనాలతో సహా 15 సీఎన్జీ మోడళ్లను అందిస్తోంది. గత నెలలో కంపెనీ మొత్తం అమ్మకాలలో సీఎన్జీ వాహనాల వాటా 42 శాతంగా ఉంది. -
ట్రంప్ గుండెల్లో రైళ్లు.. ఇరాన్ చేతికి 'ఖైబర్ షెకాన్' క్షిపణి.. ఏమిటి దీని ప్రత్యేకత?
-
ఇజ్రాయెల్కు సవాల్.. హెజ్బొల్లాకు ఖమేనీ భరోసా
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సంచలన ప్రకటన విడుదల చేశారు. మరోసారి షియా సాయుధ సంస్థ హెజ్బొల్లాకు బహిరంగంగా అండగా నిలిచారు. ఇజ్రాయెల్, అమెరికా ఒత్తిళ్లు ఎంత పెరిగినా ప్రతిఘటన ఉద్యమం ఆగదని స్పష్టం చేస్తూ.. హెజ్బొల్లాను ఉద్దేశించి ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హెజ్బొల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నయీమ్ ఖాసెమ్కు పంపిన సందేశంలో "జిహాద్, ప్రతిఘటనే ముందుకు సాగే ఏకైక మార్గం" అని పేర్కొన్నారు. తన సందేశంలో ఖమేనీ, హెజ్బొల్లా ప్రస్తుతం "ప్రతిఘటన చరిత్రలో కీలక దశ"లో ఉందని పేర్కొన్నారు. యుద్ధాలు, ఆంక్షలు, నాయకత్వ మార్పులు వచ్చినా ప్రతిఘటన ఆగదని, పోరాట స్ఫూర్తే తమ బలమని చెప్పారు. హెజ్బొల్లా యోధులు లెబనాన్ ప్రజల హక్కులు, గౌరవాన్ని కాపాడేందుకు పోరాడుతున్నారని ప్రశంసించారు.ఇటీవలి నెలల్లో ఇజ్రాయెల్-హెజ్బొల్లా ఘర్షణలు, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, అనంతరం కాల్పుల విరమణతో మధ్యప్రాచ్య పరిస్థితులు కొంత మారాయి. ఇదే సమయంలో లెబనాన్లో హెజ్బొల్లా వద్ద ఉన్న ఆయుధాలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ పరిణామాల మధ్య ఖమేనీ చేసిన తాజా వ్యాఖ్యలు వ్యూహాత్మకంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇరాన్కు హెజ్బొల్లా కేవలం మిత్ర సంస్థ మాత్రమే కాదు. ఇజ్రాయెల్, అమెరికా ప్రభావాన్ని ఎదుర్కొనే ప్రాంతీయ "యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్"లో అది కీలక భాగంగా టెహ్రాన్ భావిస్తోంది. అందుకే హెజ్బొల్లాకు రాజకీయ, వ్యూహాత్మక మద్దతు కొనసాగుతుందని ఖమేనీ తాజా ప్రకటన ద్వారా మరోసారి స్పష్టం చేశారు. లెబనాన్లో ఇరాన్ ప్రభావం తగ్గలేదనే సంకేతాన్ని కూడా ఈ సందేశం ఇస్తోందని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం హెజ్బొల్లాను ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్నాయి. ఆ సంస్థ సైనిక సామర్థ్యాన్ని బలహీనపర్చేందుకు లెబనాన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. దేశంలోని అన్ని ఆయుధ బలగాలు ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలని లెబనాన్ ప్రభుత్వం కూడా చెబుతోంది. అయితే ఇజ్రాయెల్ నుంచి ముప్పు ఉన్నంత వరకు ఆయుధాలను వదిలే ప్రసక్తే లేదని హెజ్బొల్లా స్పష్టం చేస్తోంది.ఇటీవల ఇరాన్-అమెరికా మధ్య జరిగిన సైనిక ఉద్రిక్తతల తర్వాత టెహ్రాన్ వైఖరిలో మార్పు వస్తుందేమోనని అంతర్జాతీయ వర్గాలు భావించాయి. అయితే ఖమేనీ తాజా ప్రకటనతో అలాంటి సంకేతాలు కనిపించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్పై కఠిన వైఖరిని కొనసాగిస్తూనే, తమ మిత్ర బలగాలకు మద్దతు తగ్గబోదని ఇరాన్ మరోసారి స్పష్టం చేసినట్లయింది.ఖమేనీ వ్యాఖ్యలతో మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులపై మరోసారి చర్చ మొదలైంది. ఒకవైపు శాంతి చర్చలు, కాల్పుల విరమణ ప్రయత్నాలు కొనసాగుతుండగా, మరోవైపు "జిహాద్, ప్రతిఘటనే ముందుకు సాగే మార్గం" అనే సందేశం వెలువడటం ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇజ్రాయెల్-హెజ్బొల్లా ఉద్రిక్తతలు, ఇరాన్ పాత్రపై ప్రపంచ దృష్టి మరోసారి మధ్యప్రాచ్యంపైనే కేంద్రీకృతమైంది. -
జెలెన్స్కీకి ఇరాన్ వార్నింగ్.. మూల్యం చెల్లించుకుంటావ్
ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి వార్నింగ్ ఇచ్చారు. కాస్పియన్ సముద్రంలో ఇరాన్కు చెందిన వాణిజ్య నౌకపై జరిగిన దాడికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీయే వ్యక్తిగతంగా కారణమని తీవ్రంగా ఆరోపించారు. ఈ ఘటనకు జెలెన్స్కీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు.ఇటీవల కాస్పియన్ సముద్రంలో వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ఒక నావికుడు మరణించగా, మరోకరు గాయపడ్డారు. ఇరాన్ తాజాగా దీనిని జెలెన్స్కీ స్వయంగా ధృవీకరించారు. ఉక్రెయిన్ బలగాలు (ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ / సెక్యూరిటీ సర్వీసెస్) ఈ దాడులకు పాల్పడినట్లు తెలిపారు. ఈ ఘటనపై అబ్బాస్ అరాఘ్చీ ఎక్స్ వేదికగా స్పందించారు. " జెలెన్ స్కీ ఒక ఇరాన్ వాణిజ్య నౌకపై దాడి చేసి, ఒక నావికుడిని చంపారు. ఐరోపాను తమ యుద్ధంలోకి లాగడానికి ఇజ్రాయెల్ ఆదేశాల మేరకు చేసిన ఈ చర్య, ఐక్యరాజ్యసమితి చార్టర్ను బహిరంగంగా ఉల్లంఘించడమే. ఈయూ ఉన్నత ప్రతినిధి కల్లాస్, విదేశాంగ మంత్రి లావ్రోవ్లతో జరిపిన సంభాషణలలో, కీవ్లోని ఆ ఉచిత భోజనప్రియుడు చేసిన దానికి జవాబు చెప్పకుండా ఉండలేమని స్పష్టం చేశారు".కాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సౌదీ అరేబియాతో వ్యూహాత్మక, దౌత్యపరమైన సంబంధాలను బలోపేతం చేస్తున్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ, డ్రోన్ రక్షణ వ్యవస్థలు, సాంకేతికత బదిలీ, ఆహార భద్రత, ఇంధన రంగాల్లో కీలక ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ తన యుద్ధ అనుభవాన్ని, ముఖ్యంగా డ్రోన్లను తిప్పికొట్టే సాంకేతికతను సౌదీ అరేబియాతో పంచుకోవడం పట్ల ఇరాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్యం చేస్తోంది. -
భారీ దాడులకు సిద్ధమైన అమెరికా.. ఒక్కసారిగా ఎందుకు ఆగింది?
వాషింగ్టన్: ఇరాన్పై భారీ సైనిక దాడి చేపట్టాలన్న ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి పక్కన పెట్టారు. పెంటగాన్ వద్ద ఉన్న వాయు రక్షణ ఆయుధ నిల్వలు ప్రమాదకర స్థాయిలో తగ్గిపోతాయని సీనియర్ సలహాదారులు హెచ్చరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. శుక్రవారం ట్రంప్, ఆయన కేబినెట్ సభ్యులు, సీనియర్ సలహాదారులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అమెరికా సైన్యం వద్ద పేట్రియట్ ఇంటర్సెప్టర్ క్షిపణులు, ఇతర రక్షణ వ్యవస్థల నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయన్న అంశమే ప్రధానంగా చర్చకు వచ్చింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కేన్ కూడా ఇరాన్పై యుద్ధాన్ని మరింత పెంచాలన్న అంశాన్ని ట్రంప్ పరిశీలిస్తున్న సమయంలో అమెరికా వద్ద ఆయుధ నిల్వలు తగ్గిపోతున్నాయని హెచ్చరించారు.వాయు రక్షణ ఆయుధ నిల్వలు తగ్గిపోవడమే అమెరికా వరుస రాత్రి దాడులను నిలిపివేయడానికి ప్రధాన కారణమా, లేక ఈ విరామం కొనసాగుతుందా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు పశ్చిమాసియాలో పెద్ద యుద్ధం చెలరేగడం, గల్ఫ్ దేశాలతో సంబంధాలు దెబ్బతినడం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, ఇంధన సరఫరా అంతరాయం, శరణార్థుల సంక్షోభం మరింత పెరగడం వంటి అంశాలపై కూడా ట్రంప్, ఆయన సలహాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, ఇరాన్పై పెద్ద స్థాయి యుద్ధ చర్యలు చేపట్టడం సాధ్యమేనని, కానీ అలా చేస్తే పశ్చిమాసియాలో అమెరికా సైనిక చర్యలను పర్యవేక్షించే సెంట్రల్ కమాండ్ వద్ద ఉన్న ఇంటర్సెప్టర్ క్షిపణుల నిల్వలు ప్రమాదకరంగా తగ్గిపోతాయని జనరల్ డాన్ కేన్ వ్యక్తిగతంగా ట్రంప్కు వివరించారు.ముగ్గురు అమెరికా సైనికులు మృతితో.. గత వారం జోర్డాన్లో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి అమెరికా వాయు రక్షణ వ్యవస్థను దాటి దాడి చేయడంతో ముగ్గురు అమెరికా సైనికులు మరణించిన ఘటన తర్వాత ఈ చర్చలు జరిగాయని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.శుక్రవారం అమెరికా బలగాలు పూర్తి సిద్ధంగా ఉన్నాయని, దాడికి రెడీగా ఉన్నాయని ట్రంప్ ప్రకటించినా, చివరకు భారీ బాంబు దాడులకు ఆయన అనుమతి ఇవ్వలేదు. ఈ వారం ప్రారంభంలో ఆక్సియోస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో "ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత భారీ దాడి చేయించాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నాను. నిర్ణయానికి చాలా దగ్గరగా ఉన్నాను. అందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నాం" అని ట్రంప్ చెప్పారు.ఇరాన్ తీర ప్రాంత రాడార్లు, నౌకలపై దాడి చేసే క్షిపణి ప్రయోగ కేంద్రాలు, నౌకాదళ వాహనాలు, రవాణా వ్యవస్థలు, పిక్యాక్స్ పర్వతం అడుగున ఉన్న భూగర్భ అణు కేంద్రం వంటి వ్యూహాత్మక లక్ష్యాలపై పలుదశల్లో దాడి చేసే ప్రణాళికలను పెంటగాన్ సిద్ధం చేసింది. అయితే దీర్ఘకాలం దాడులు కొనసాగితే ఇప్పటికే తగ్గిపోయిన క్షిపణి నిల్వలపై తీవ్ర ఒత్తిడి పడుతుందని అధికారులు హెచ్చరించారు.ట్రంప్ సీనియర్ సలహాదారుల్లో పలువురు, జారెడ్ కుష్నర్ సహా, భారీ సైనిక దాడికి బదులుగా నిరంతర దౌత్య చర్చలు, ఆర్థిక ఒత్తిడి కొనసాగించే వ్యూహానికే మద్దతు ఇస్తున్నారు. ఇదే సమయంలో, అసోసియేటెడ్ ప్రెస్ కథనం ప్రకారం.. దాదాపు రెండు వారాలుగా నిరంతరంగా సాగిన వైమానిక దాడుల తర్వాత అమెరికా సైన్యం తొలిసారి రాత్రి దాడులను నిలిపివేసింది. తాత్కాలిక కాల్పుల విరమణను పునరుద్ధరించే ప్రయత్నాలు కూడా వేగం పుంజుకున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలపై రాజీ మార్గం కనుగొనేందుకు మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.అయితే ప్రాంతీయ ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇరాన్ మద్దతుతో ఉన్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని యాన్బు, జిజాన్ ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్టు ప్రకటించారు.హోదైదాపై సౌదీ వైమానిక దాడులకు ప్రతీకారంగానే అరామ్కోకు చెందిన కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నామని వారు తెలిపారు. -
విమానం మార్చేసిన ట్రంప్.. ఎందుకలా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల ప్రారంభంలో టర్కీలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశాన్ని ముగించుకుని తిరిగి వెళ్లే సమయంలో తన ప్రయాణ విమానాన్ని అత్యవసరంగా మార్చవలసి వచ్చింది. ఇరాన్ ప్రాక్సీ దళాల నుండి ఆయనకు ముప్పు ఉందని నిఘా వర్గాల సమాచారం అందడంతో సీక్రెట్ సర్వీస్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రముఖ పత్రిక 'ది న్యూయార్క్ టైమ్స్' వెల్లడించింది.ట్రంప్ టర్కీకి వెళ్లేటప్పుడు ఖతార్ ప్రభుత్వం బహుమతిగా ఇచ్చిన సరికొత్త 'బోయింగ్ 747-8' విమానంలో ప్రయాణించారు. అయితే భద్రతా కారణాల రీత్యా తిరిగి వస్తున్నప్పుడు పాత 'ఎయిర్ ఫోర్స్ వన్' విమానంలో ప్రయాణించాలని సీక్రెట్ సర్వీస్ అధికారులు ఆయనను కోరారు. ఈ ముప్పు ప్రత్యేకించి ఖతార్ విమానానికి మాత్రమే కాకుండా, అధ్యక్షుడితో పాటు ఆయన ప్రయాణించే ఏ విమానాన్నైనా టార్గెట్ చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. మొదట్లో ఈ విమానం మార్పును వైట్హౌస్ సాధారణ విషయంగానే పేర్కొంది. బ్రిటన్లోని అమెరికా సైనికులు.. కొత్త విమానాన్ని తిలకించేందుకే తాను విమానం మార్చినట్లు ట్రంప్ బహిరంగంగా తెలిపారు. కానీ.. అసలు కారణం భద్రతా ప్రమాదాలేనని అధికారులు తరువాత స్పష్టం చేశారు. ఖతార్ బహుమతిగా ఇచ్చిన బోయింగ్ 747-8 విమానంలో పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ఉండే అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్థలు లేవు.ఈ నేపథ్యంలో ఈ విమానం భద్రతపై గతంలోనూ విమర్శలు వచ్చాయి. ఈ ఘటన తర్వాత ఈ విమానాన్ని మరింత అప్గ్రేడ్ చేసేందుకు త్వరలో సుమారు ఒక నెలపాటు సర్వీస్ నుంచి తప్పించనున్నట్లు వైట్హౌస్ ప్రెస్ కార్యదర్శి కరెలిన్ లీవిట్ వెల్లడించారు. అమెరికా అగ్రనేతలకు ముప్పు తీవ్రత ఊహించని స్థాయిలో పెరిగిందని సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ సీన్ కుర్రాన్ పేర్కొన్నారు. -
ట్రంప్ ప్రాణాలకు ముప్పు? విమాన మార్పు వెనుక రహస్యం!
-
ఇరాన్ అణు బాంబు ప్లాన్ ట్రంప్ వార్నింగ్ తో ..!
-
డబుల్ గేమ్ మొదలుపెట్టిన ట్రంప్
ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నాయని చెబుతూనే.. అవసరమైతే భారీ సైనిక చర్యకు వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ ఇప్పుడు చర్చల్లో మరింత సీరియస్గా వ్యవహరిస్తోందని చెప్పిన ఆయన.. ఒప్పందం కుదరకపోతే గతం కంటే తీవ్ర స్థాయి దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.వైట్హౌస్లో మీడియాతో మాట్లాడిన అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్పై భారీ దాడులకు సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అయితే అమెరికా సైన్యం మాత్రం పూర్తిగా సిద్ధంగా ఉందని, ‘‘మేం సిద్ధంగా ఉన్నాం.. అవసరమైతే ముందుకు వెళ్తాం’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘డీల్ లేదంటే భారీ దాడులు’ఇరాన్కు ఇప్పుడు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాతో ఒక ఒప్పందానికి రావడం లేదా మరింత తీవ్ర స్థాయి సైనిక చర్యలను ఎదుర్కోవడం అని హెచ్చరించారు. ‘‘మేము వారితో మాట్లాడుతున్నాం. గతంతో పోలిస్తే ఇరాన్ ఇప్పుడు మరింత సీరియస్గా కనిపిస్తోంది. అయితే చర్చలు ఫలిస్తాయని ఇప్పుడే చెప్పలేం’’ అని ట్రంప్ అన్నారు.‘లాక్డ్ అండ్ లోడెడ్’అమెరికా సైనిక సామర్థ్యంపై ట్రంప్ మరోసారి స్పష్టత ఇచ్చారు. అవసరమైతే ఇరాన్పై మరింత భారీ దాడులకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దౌత్య మార్గానికి అవకాశం ఇస్తున్నప్పటికీ.. సైనిక ఎంపికను పూర్తిగా పక్కన పెట్టలేదని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమమే ఈ వివాదానికి ప్రధాన కారణమని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.ఇరాన్ మాత్రం..మరోవైపు అమెరికా ఒత్తిళ్లకు తాము తలొగ్గబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తెలిపారు. బెదిరింపులు, ఒత్తిళ్లతో ఇరాన్ను నియంత్రించలేరని స్పష్టం చేశారు. చర్చలకు తాము సిద్ధమే అయినప్పటికీ.. బలవంతపు షరతులను అంగీకరించబోమని పేర్కొన్నారు. మరోవైపు మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వారాలుగా అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఘర్షణలు, సైనిక చర్యల నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్ముజ్ జలసంధిపై ప్రభావం పడుతోంది. గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో వాణిజ్య నౌకల రాకపోకలు, సముద్ర రవాణాపై అనిశ్చితి నెలకొంది.ఈ పరిణామాల నేపథ్యంలో హర్ముజ్ ప్రాంతంలో వేలాది మంది నౌకా సిబ్బంది భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వందలాది నౌకలు ఆగిపోయాయని.. దాదాపు 6 వేల మంది నౌకా సిబ్బంది ఈ ప్రాంతంలోని ఉద్రిక్త పరిస్థితుల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ సముద్ర సంస్థ (IMO) పేర్కొంది. నౌకల రాకపోకలకు అంతరాయాలు, భద్రతా పరమైన సవాళ్ల కారణంగా సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది.రష్యా, చైనాపైనా ట్రంప్ దృష్టిఇరాన్కు రష్యా, చైనా ఆయుధ సహాయం అందిస్తున్నాయన్న వార్తలపైనా ట్రంప్ స్పందించారు. ఆ దేశాల అధినేతలు ఇరాన్కు ఆయుధాలు అందించబోమని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఇరాన్ విషయంలో అమెరికా తదుపరి నిర్ణయం ఏంటన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతోంది. ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధిలో ఏదైనా పెద్ద పరిణామం చోటుచేసుకుంటే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు సఫలం అవుతాయా? లేక పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారతాయా? అన్నది ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. -
పాకిస్తాన్కు కొత్త చిక్కులు.. 2015 నాటి పరిస్థితి మళ్లీ వస్తుందా?
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు పాకిస్తాన్ను మరోసారి క్లిష్ట పరిస్థితిలోకి నెడుతున్నాయి. ఇరాన్-అమెరికా ఘర్షణలు, హౌతీ తిరుగుబాటుదారుల కదలికలు, సౌదీ అరేబియా భద్రతపై ముప్పు నేపథ్యంలో పాకిస్తాన్పై సైనికంగా స్పందించాలనే ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2015లో యెమెన్ యుద్ధ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితినే పాకిస్తాన్ ఎదుర్కొంది. సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి హౌతీలపై యుద్ధం ప్రారంభించినప్పుడు, తమకు మద్దతుగా పాకిస్తాన్ సైన్యాన్ని పంపాలని రియాద్ కోరింది. అయితే పాకిస్థాన్ పార్లమెంట్ విస్తృత చర్చల అనంతరం యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనకూడదని నిర్ణయించింది.అప్పట్లో పాకిస్తాన్కు రెండు వైపులా సవాళ్లు ఎదురయ్యాయి. ఒకవైపు సౌదీ అరేబియాతో దశాబ్దాలుగా కొనసాగుతున్న రక్షణ, ఆర్థిక సంబంధాలు ఉండగా, మరోవైపు ఇరాన్ పొరుగుదేశంగా ఉండటంతో ఆ దేశంతో సంబంధాలను దెబ్బతీయాలని ఇస్లామాబాద్ కోరుకోలేదు. తాజాగా మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మళ్లీ వేడెక్కుతున్నాయి. హౌతీలు సౌదీ లక్ష్యాలను టార్గెట్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలు, ఎర్ర సముద్రంలో నౌకాయాన భద్రతపై ఆందోళనలు ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచుతున్నాయి.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దౌత్యపరంగా సమతుల్య వైఖరిని కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. ఒకవైపు సౌదీ అరేబియాకు మద్దతు ప్రకటిస్తూనే, మరోవైపు ఇరాన్తో సంబంధాలను కొనసాగించాలని చూస్తోంది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సౌదీ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతూ, సౌదీ భద్రతకు మద్దతు ఉంటుందని స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే, యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చితే పాకిస్తాన్పై ప్రత్యక్షంగా రంగంలోకి దిగాలనే ఒత్తిడి పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2015లో యెమెన్ యుద్ధానికి దూరంగా నిలిచిన పాకిస్థాన్.. ఇప్పుడు మరోసారి అదే నిర్ణయాన్ని కొనసాగించగలదా? లేక మారిన పరిస్థితులు దాని విధానాన్ని మార్చేలా చేస్తాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.పాకిస్తాన్కు మూడు ప్రధాన సవాళ్లు..సౌదీతో వ్యూహాత్మక సంబంధాలను కాపాడుకోవడంఇరాన్తో పొరుగుదేశ సంబంధాలను కొనసాగించడంప్రత్యక్ష యుద్ధంలో చిక్కుకోకుండా దేశ ఆర్థిక, భద్రతా ప్రయోజనాలను రక్షించడంఅయితే, పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతోంది. మరోవైపు, సైనికంగా ఏదైనా చర్య తీసుకుంటే అది దేశీయంగా, అంతర్జాతీయంగా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఇస్లామాబాద్ ప్రస్తుతం "దౌత్య సమతుల్యత" విధానాన్నే అనుసరిస్తోంది. యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనకుండా, అవసరమైతే మధ్యవర్తిత్వ పాత్ర పోషించాలని ప్రయత్నిస్తోంది. -
అలా చేస్తే మీ పని అంతే.. చైనా,రష్యాలకు ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ రష్యా,చైనాలపై ఫైరయ్యారు. ఈ రెండు దేశాలు ఇరాన్కు ఎట్టిపరిస్తితుల్లో ఆయుధాలు విక్రయించవద్దని తీవ్రంగా హెచ్చరించారు. ఒకవేళ ఆ పని చేస్తే అది ఆ దేశాలకే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని అది వారి దేశ ప్రయోజనాలకు ఏమాత్రం మంచిది కాదని స్పష్టం చేశారు.ట్రంప్ తన అధికారిక ట్రూత్ సోషల్లో పోస్ట్ చేస్తూ "చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ ఏడాది మే నెలలో బీజింగ్లో జరిగిన సమావేశంలో తమ దేశం నుంచి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇరాన్కు ఆయుధాలు విక్రయించబోమని హామీ ఇచ్చారు. మా మధ్య ఉన్న సంబంధాల దృష్ట్యా ఆయన మాటను నమ్ముతున్నాను" అని అన్నారు.అదే విధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం ఉక్రెయిన్తో యుద్ధం జరుగుతున్నప్పటికీ, ఇరాన్కు ఆయుధాలు అమ్మబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా తనకు హామీ ఇచ్చారని ట్రంప్ చెప్పారు.అదే సమయంలో ఉక్రెయిన్కు అమెరికా ఆయుధాలు అమ్మడంపై మాట్లాడుతూ "నేను ఉక్రెయిన్కు నేరుగా ఆయుధాలు అమ్మడం లేదని, కేవలం నాటో (NATO) దేశాలకే విక్రయిస్తున్నానని పుతిన్కు తెలుసు. నాటో దేశాలు పూర్తి ధర చెల్లించి కొనుగోలు చేస్తాయి, ఆ తర్వాత ఆ ఆయుధాలు ఎలా పంపిణీ అవుతాయో నాకు తెలియదు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.ఇటీవలి కాలంలో అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన వరుస దాడులకు సంబంధించి, ఇరాన్కు రష్యా మరియు చైనాలు లక్ష్యాల సమాచారాన్ని అందిస్తున్నాయా లేదా అనే అంశంపై వాషింగ్టన్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో దర్యాప్తు జరుపుతోంది. ఇంతలోనే ట్రంప్ ఇరుదేశాలకు వార్నింగ్ ఇచ్చారు. -
గల్ఫ్లో మళ్లీ యుద్ధమేఘాలు
జూన్ 17, 2026న ఇరాన్–యూఎస్ఏల మధ్య అవగాహన (మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్–ఎంవోయూ) కుదర టంతో పర్షియన్ గల్ఫ్లో శాంతి పునః స్థాపితమవుతుందనే అందరూ భావించారు. ప్రపంచ విపణిలో చమురు ధరలు దిగిరావటంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. మూడు వారాలు తిరగక ముందే హార్మూజ్ మళ్లీ మూతపడటంతో శాంతి మూణ్నాళ్ల ముచ్చటయింది. ఈ రెండవ దశ యుద్ధం మరింత విస్తృతంగా, తీవ్రంగా కనపడుతున్నది. ప్రాంతీయ, అంతర్జా తీయ రాజకీయాలలో కీలక మలుపునకు ఈ దశ నాంది కావచ్చు.దిక్కుతోచని అమెరికా ఇరాన్–యూఎస్ అంగీకరించిన అవగాహన పత్రం 60 రోజులలో సమగ్ర ఒప్పందాన్ని తయారు చేయటానికి ఒక చట్రంగా ఉపయోగపడాలనేది ప్రధాన ఉద్దేశ్యం. ఈ రెండు నెలల వ్యవధిలో హార్మూజ్ జలసంధి ద్వారా నిరాటంకంగా ఎలాంటి రుసుములు లేకుండా వాణిజ్య నౌకల రవాణా జరగాలనీ, తత్సంబందిత ఏర్పాట్లను ఇరాన్ చేయాలనీ ఎంవోయూలోని అయిదవ ఆర్టికల్ నిర్దేశిస్తుంది. ఇదే పీటముడిగా మారింది. హార్మూజ్ జలసంధి ద్వారా రవాణా పూర్తిగా తన అజమాయిషీ, ఆధ్వర్యంలో జరగాలని ఇరాన్ నిర్దేశాలు జారీ చేసింది. ఈ నిర్దేశాల ప్రకారం హార్మూజ్ నుండి ప్రయాణించే ప్రతి నౌక ముందుగా ఇరాన్ వద్ద తమ పూర్తి వివరాలను నమోదు చేసుకుని నిర్దేశించిన మార్గంలో, నిర్దేశించిన సమయంలో ప్రయాణించాలి. యూఎస్ఏ ఈ వాదనను తిరస్క రిస్తూ హార్మూజ్ జలసంధి అంతర్జాతీయ రవాణా మార్గం, దీనిపై ఇరాన్ అజమాయిషీ కుదరదని తేల్చి చెప్పింది. ఇరాన్ తీరానికి సమీపంగా కాకుండా ఒమన్ తీరానికి సమీపంలో ఒమన్ ప్రాదేశిక జలాల గుండా నౌకల రవాణాను ప్రోత్సహించింది. ఒమన్ తీరంగుండా ప్రయాణిస్తున్న నౌకలపై ఇరాన్ దాడి చేయటంతో యూఎస్ఏ తన నౌకాబలంతో హార్మూజ్ను దిగ్బంధించింది. ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు ప్రారంభించింది.మొదటి దశ 40 రోజుల దాడులతో పోల్చితే గత పన్నెండు రోజులుగా జరుగుతున్న రెండవ దశ యుద్ధం భిన్నంగా ఉన్నది. మొదటిసారిగా అమెరికా ఇరాన్లోని పౌర లక్ష్యాలపై దాడి చేసింది. రహదారులు, వంతెనలు, పవర్ ప్లాంట్లు, డీసాలినేషన్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకున్నది. బుషేర్లో నిర్మాణంలో ఉన్న పౌర అణువిద్యు చ్ఛక్తి కేంద్రంపై కూడా దాడి చేసింది. ఇది అంతర్జాతీయ యుద్ధనేరం (వార్ క్రైమ్) కిందకు వస్తుంది. ఇరాన్ కూడా అవగాహన పత్రంపై అమెరికా అధ్యక్షుడి సంతకానికి విలువ లేదని చెప్పి, అదే స్థాయిలో విరుచుకుపడింది. కువైట్లోని అల్సుబియా డీసాలినేషన్ ప్లాంట్, విద్యుచ్ఛక్తి కేంద్రంపై దాడి చేసింది. బహ్రెయిన్లో అమెరికా అయిదవ నౌకాదళ ప్రధాన కార్యాలయం ఉన్న సల్మాన్ పోర్టుపై దాడి చేసింది. మొదటిసారిగా సిరియా, జోర్డాన్లలోని యూఎస్ వైమానిక స్థావరాలు, విమానాశ్రయాలు, రేపు పట్టణాలపై కూడా దాడి చేసింది. అవగాహన పత్రంపై ట్రంప్ తప్పనిసరి పరిస్థితులలో సంతకం పెట్టినట్లుగా కన్పడుతున్నది. ఏదోరకంగా హార్మూజ్ జలసంధిని తెరిపించి, చమురు ధరలను కిందకు తేవాలనే ఆరాటం కనపడుతుంది. కానీ ఎంవోయూలో ఎక్కడా ఇరాన్ అణుకార్యక్రమాన్ని వీడుతున్నట్లు లేదు. ఒక రకంగా ఎంవోయూ అమెరికాకు ప్రతి కూలంగా, ఇరాన్కు ప్రయోజనకారిగా ఉన్నదని విశ్లేషకుల అభి ప్రాయం. ఈ నేపథ్యంలో ఇరాన్ హార్మూజ్ను తన ఆజమాయిషీ లోకి తీసుకునే ప్రయత్నాలు చేయటంతో అమెరికా దిక్కుతోచక మళ్లీ దాడులు మొదలుపెట్టింది.ఇరు పక్షాలకూ నష్టమే!ఇరాన్తో యుద్ధం అమెరికాకు కొరివితో తల గోక్కున్నట్లయింది. అమెరికా రక్షణ శాఖ మంత్రి పీటర్ హెగ్సెత్ అమెరికా ప్రభుత్వం ఇప్పటికే 37.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. మూడీస్ సంస్థ అంచనాల ప్రకారం ఇరాన్పై దాడి వలన అమెరికన్ పౌరులపై పన్నులు, అధిక ధరల రూపంలో 132 బిలియన్ డాలర్ల అదనపు భారం పడింది. పెంటగాన్, యుద్ధం కోసం అదనంగా 80 బిలియన్ డాలర్ల నిధులను కోరుతున్నది.తరిగిపోతున్న మందుగుండు సామగ్రి నిల్వలను పూర్తి చేయటానికి అమెరికా రక్షణ శాఖ 114 బిలియన్ డాలర్లను కోరుతున్నది. ఆర్థిక భారంతో పాటు, ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటికి 18 మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గత రెండు వారాల లోనే వందమందికి పైగా అమెరికన్ సైనికులు గాయపడ్డారు. ఇరాన్పై దాడితో అమెరికా సాధించిందేమిటనేది ప్రశ్నార్థకం. ఇరాన్ అణుకార్యక్రమాన్ని, అణుసామర్థ్యాన్ని నిర్మూలించే లక్ష్యం నెరవేరే సూచనలు లేవు. గల్ఫ్ దేశాలను రక్షించే సామర్థ్యం అమెరికాకు ఉన్నదా అనే సందేహాలను ఈ యుద్ధం లేవనెత్తుతున్నది. ఇక ఇరాన్ విషయానికొస్తే, ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం ఈ సంవత్సరం ఇరాన్ ఆర్థిక వ్యవస్థ 6.1 శాతం క్షీణిస్తున్నది. ద్రవ్యో ల్బణం 68.9 శాతం. ఆహార ద్రవ్యోల్బణం 105 శాతం. ఇరాన్ కరెన్సీ (రియల్) దారుణంగా పతనమయింది. ఒక డాలర్కు 1.32 మిలియన్ల రియల్స్ పలుకుతున్నది. యుద్ధం వలన 144 బిలియన్ డాలర్ల నష్టం జరిగింది. ఇది ఇరాన్ జీడీపీలో 40 శాతం. సుమారుగా 3,460 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉన్నతస్థాయి సైనిక, రాజ కీయ నాయకత్వం తుడిచిపెట్టుకుపోయింది. అయితే, అమెరికా, ఇజ్రాయెల్ దాడులు రాజకీయంగా ఇరాన్ నాయకత్వానికి కలిసి వచ్చాయి. ప్రజలలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత అమెరికా–ఇజ్రా యెల్ వైపు మళ్లింది. ఖమేని అంత్యక్రియలను ఇరాన్ తెలివిగా వాడుకున్నది. అన్నింటికంటే ముఖ్యంగా ఇరాన్ హార్మూజ్ జలసంధి రూపంలో ఒక కొత్త అస్త్రాన్ని కనుక్కొన్నది. ఈ యుద్ధం ద్వారా ఇరాన్–రష్యా–చైనా మైత్రీబంధం మరింత బలపడింది.కొత్త గుణపాఠాలుహార్మూజ్, బాబెల్ మాండెబ్, సూయజ్, పనామా, మలక్కా వంటి ఇరుకైన జలసంధుల (చోక్ పాయింట్ల) ద్వారా రవాణాపై పూర్తిగా ఆధారపడటం వలన వచ్చే ముప్పు అన్ని దేశాలకు అర్థమైంది. హార్మూజ్ నుండి తప్పించుకోవటానికి సౌదీ ఈస్ట్–వెస్ట్ పైప్ లైన్ ద్వారా రోజూ సుమారు 5 బిలియన్ బారల్స్ చమురును ఎర్ర సముద్రంలోని యాంబూ రేవు పట్టణం గుండా పంపిస్తున్నది.అందుకే ఇరాన్కు మద్దతునిచ్చే యెమెన్లోని హౌతీలు బాబెల్ మాండెబ్ను మూసివేశారు. యూఏఈ హార్మూజ్కు ప్రత్యామ్నాయంగా హబ్షాన్ నుండి పైప్లైన్ ద్వారా ఫుజేరాకు పంపించి ఒమన్ సింధుశాఖ గుండా రవాణా చేస్తున్నది. అందుకే ఇరాన్ ఫుజేరాపై దాడి చేసింది. భారత్ ప్రతిపాదించిన ‘ఐమెక్’(ఇండియా–మిడిల్ ఈస్ట్– యూరప్ ఎకనామిక్ కారిడార్) వీటన్నింటికి విరుగుడు. ఐమెక్ రూపుదిద్దుకోవాలంటే గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్తో ఆచరణాత్మక వైఖరిని రూపొందించుకోవాలి. అధునాతన ఎయిర్క్రాఫ్ట్ కారియర్లు, స్టెల్త్ యుద్ధ విమానాలు, అణ్వస్త్రాలు, క్షిపణి రక్షణ వ్యవస్థల ద్వారా దిగ్గజ శక్తులు చిన్న రాజ్యాలను లొంగదీసుకోవటం అసాధ్యమని ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలు రుజువు చేస్తున్నాయి. చౌకైన డ్రోన్లు, క్షిపణులతో కూడా ఎదురొడ్డి నిలువవచ్చని చాటి చెప్తున్నాయి. ఒకరకంగా ఈ రెండు యుద్ధాలు రెండు కూటముల మధ్య జరుగుతున్నట్టు లెక్క. అమెరికా, ఐరోపా దేశాలు ఒకవైపు; చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా ఇంకొకవైపు మోహరించి ఉన్నాయి. ఉక్రెయిన్ వెనుక అమెరికా, యూరప్ ఉన్నాయి. ఇరాన్ వెనుక చైనా, రష్యా ఉన్నాయి. గల్ఫ్ దేశాల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కగా మారింది. గల్ఫ్ దేశాల రక్షణను ఇజ్రాయెల్ పట్టకంలోంచి అమెరికా చూస్తుందనే విషయాన్ని అవి గుర్తించాలి. తమ భద్రతకై జీసీసీ దేశాలు, నాటో తరహా కూటమిని ఏర్పాటు చేసుకోవటం మేలు. ఇరాన్తో సత్సంబంధాలకు ప్రయత్నించాలి. భద్రత, రక్షణ, ఆర్థిక అంశాలలో వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని అనుసరించాలి. ఈ విషయంలో భారత్ విధానాల నుండి నేర్చుకోవచ్చును.-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్); సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు-గురజాల శ్రీనివాసరావు -
ఇరాన్ ఆస్తులపై ట్రంప్ గురి.. టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఇరాన్కు చెందిన స్తంభింపజేసిన నిధులను(ఫ్రీజ్డ్ ఫండ్స్) వినియోగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. అయితే ఈ ప్రకటనపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. అమెరికా ఆధీనంలో ఉన్న ఇరాన్కు చెందిన స్తంభింపజేసిన నిధులను.. అమెరికా నౌకలు, సరుకు రవాణా నౌకలు, ఇతర సంబంధిత ఆస్తులకు జరిగిన నష్టాల భర్తీకి ఉపయోగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఇరాన్ చర్యల వల్ల జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించేందుకు ఈ నిధులను వినియోగిస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే అమెరికా–ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ట్రంప్ ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాషింగ్టన్ మళ్లీ దాడులు ప్రారంభించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింత వేడి పెంచాయి.“ఇకపై నౌకలు, సరుకు లేదా వాటికి సంబంధించిన ఏదైనా ఆస్తికి జరిగే నష్టాలను అమెరికా ఆధీనంలో ఉన్న ఇరాన్ డబ్బుతో చెల్లిస్తాం” అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నష్టాలు భారీగా ఉండొచ్చని, అయినప్పటికీ ఇది న్యాయమైన చర్య అని ఆయన సమర్థించారు. ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో రెండు సౌదీ చమురు నౌకలపై దాడులకు పాల్పడినట్లు ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ ఘాటు కౌంటర్ట్రంప్ ప్రకటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తీవ్రంగా స్పందించారు. ఇతర దేశాల ఆస్తులను స్వాధీనం చేసుకుని భవిష్యత్తు నష్టపరిహారాలకు వినియోగించడం “పేలుడు స్వభావం కలిగిన ప్రమాదకరమైన సంప్రదాయానికి నాంది” అని వ్యాఖ్యానించారు. “ఒక దేశానికి చెందిన ఆస్తులను మరో దేశం సంబంధం లేని అంశాలకు ఉపయోగించడం సాధారణమైతే.. భవిష్యత్తులో ఏ దేశ ఆస్తులకూ భద్రత ఉండదు. దీని ఫలితంగా ఏర్పడే గందరగోళం శాంతియుతంగా ఉండదు” అని అరాఘ్చీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అంతర్జాతీయ నిబంధనలను బలహీనపరిచే చర్యగా ఆయన ట్రంప్ నిర్ణయాన్ని అభివర్ణించారు.నిధుల విలువ ఎంత?ఇరాన్పై అమెరికా ఆంక్షల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ఆర్థిక వ్యవస్థల్లో ఆ దేశానికి చెందిన భారీ మొత్తంలో నిధులు నిలిచిపోయాయి. ఈ నిధుల ఖచ్చితమైన విలువ స్పష్టంగా తెలియకపోయినా.. కొన్ని నివేదికల ప్రకారం వాటి విలువ సుమారు 124 బిలియన్ డాలర్ల నుంచి 167 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా. ఈ స్తంభింపజేసిన నిధుల విడుదల ఇరాన్–అమెరికా మధ్య గత చర్చల్లో కీలక డిమాండ్గా ఉంది. అయితే ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందం కూడా ముందుకు సాగలేదు.హౌతీల దాడులతో మళ్లీ ఉద్రిక్తతలుఇటీవల ఎర్ర సముద్రంలో సౌదీకి చెందిన రెండు చమురు నౌకలపై దాడులకు యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు బాధ్యత వహించారు. హౌతీ అధికార ప్రతినిధి యాహ్యా సరీ మాట్లాడుతూ.. “ఎన్సీలియా (ENCELIA), లైలా (LAYLA)” అనే రెండు సౌదీ నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. సౌదీ రవాణా అధికారులు కూడా ఎన్సీలియా నౌకపై దాడి జరిగిందని, బాబ్ అల్-మందెబ్ జలసంధి వద్ద నౌక ముందుభాగంలో మంటలు చెలరేగినట్లు ధ్రువీకరించారు. ఇరాన్ కూడా హార్ముజ్ జలసంధిలో నిబంధనలు పాటించని వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుంటోందని అమెరికా ఆరోపిస్తోంది.యుద్ధం నుంచి ఆర్థిక పోరాటం వరకుఅమెరికా–ఇరాన్ ఘర్షణ ఇప్పటివరకు ప్రధానంగా సైనిక, దౌత్య స్థాయిలో కొనసాగింది. అయితే తాజా పరిణామాలతో ఆర్థిక ఆస్తులు కూడా ఈ పోరాటంలో కీలక ఆయుధాలుగా మారుతున్నాయి. ఒక దేశానికి చెందిన విదేశీ నిధులను మరో దేశం నష్టపరిహారాల కోసం వినియోగించడం అంతర్జాతీయ చట్టపరంగా కొత్త చర్చలకు దారితీయొచ్చని నిపుణులు చెబుతున్నారు. అమెరికా మాత్రం తన చర్యలను సమర్థిస్తూ.. తమ వాణిజ్య ప్రయోజనాలు, నౌకల భద్రతకు జరిగిన నష్టాలకు బాధ్యులను జవాబుదారీ చేయడమే లక్ష్యమని చెబుతోంది.న్యూయార్క్లో కత్తిపోట్ల కలకలంఇదిలా ఉండగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన రెండు కత్తిపోటు ఘటనలు కూడా చర్చనీయాంశంగా మారాయి. మాన్హాటన్లోని అప్పర్ వెస్ట్ సైడ్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులపై దాడి చేసిన 51 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దాడి సమయంలో నిందితుడు “అల్లాహు అక్బర్” అని నినదించినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొనడంతో.. ఇది విద్వేష నేరమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రాథమిక విచారణలో నిందితుడి మానసిక ఆరోగ్య పరిస్థితి కూడా కారణం అయి ఉండొచ్చని అధికారులు వెల్లడించారు. దాడిలో గాయపడిన ఇద్దరు బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ప్రపంచానికే ప్రమాదకర సంకేతమా?ఒక దేశానికి చెందిన స్తంభింపజేసిన ఆస్తులను మరో దేశం తన ప్రయోజనాలకు వినియోగించడం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో కొత్త వివాదాలకు దారితీసే అవకాశం ఉంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇతర దేశాల విదేశీ నిధుల భద్రతపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆస్తుల స్వాధీనం వంటి చర్యలు సాధారణ పరిణామంగా మారితే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నమ్మకం, పెట్టుబడుల భద్రతపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ప్రపంచానికి పెరుగుతున్న సవాళ్లుఒకవైపు ఇరాన్ స్తంభింపజేసిన నిధుల వినియోగంపై అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా.. మరోవైపు అమెరికాలో భద్రత, విద్వేష నేరాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. తాజా పరిణామాలు యుద్ధాలు కేవలం యుద్ధ రంగానికే పరిమితం కావని.. అవి ఆర్థిక వ్యవస్థలు, అంతర్జాతీయ నిబంధనలు, ప్రపంచ భద్రతపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని మరోసారి స్పష్టం చేస్తున్నాయి. -
ఇది చాల్లేదు.. ఇరాన్కు ఇంకా నొప్పి తెలియట్లేదు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఇరాన్ మౌలిక వసతులపై అమెరికా బలగాలు దాడులు కొనసాగిస్తుండగా.. ప్రతిగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ కౌంటర్ అటాక్లు జరుపుతోంది. మరోవైపు ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు కూడా రంగంలోకి దిగడంతో ఈ ఘర్షణ మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్పై మరింత కఠిన చర్యలకు దిగాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఇరాన్పై భారీ స్థాయి సైనిక చర్యను పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇప్పటికే జరుగుతున్న దాడులు సరిపోలేదని భావిస్తున్న ఆయన.. “ఇరాన్కు ఇంకా తగినంత నొప్పి తెలియలేదు” అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆక్సియోస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్పై గతంలో కంటే పెద్ద స్థాయిలో దాడి చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. “నేను భారీ దాడి గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పటివరకు జరిగిన వాటికంటే పెద్దదిగా ఉంటుంది. నిర్ణయం తీసుకునే దశకు చేరుకున్నాను” అని పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది. అయితే కొత్త దాడికి సంబంధించి అధ్యక్షుడు తుది నిర్ణయం తీసుకోలేదని అమెరికా అధికారులు వెల్లడించారు. ఎలాంటి కొత్త సైనిక ఆదేశాలు కూడా జారీ కాలేదని తెలిపారు.చర్చలకు ఇరాన్ సిద్ధంగా లేదు: ట్రంప్ఇరాన్ చర్చలకు ఆసక్తి చూపుతున్నప్పటికీ.. ఒప్పందానికి రావడానికి సిద్ధంగా లేదని ట్రంప్ ఆరోపించారు. “వారికి ఇంకా తగినంత నొప్పి తెలియలేదు” అని వ్యాఖ్యానించారు. ఇరాన్పై ఒత్తిడి కొనసాగాల్సిన అవసరం ఉందని ఆయన సంకేతాలు ఇచ్చారు.13వ రోజూ అమెరికా దాడులుమరోవైపు ఇరాన్పై అమెరికా సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం.. వరుసగా 13వ రాత్రి కూడా ఇరాన్ సైనిక లక్ష్యాలపై దాడులు జరిగాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సామర్థ్యాన్ని తగ్గించడం, వాణిజ్య నౌకలపై ముప్పును అడ్డుకోవడమే తమ లక్ష్యమని అమెరికా చెబుతోంది.ఇజ్రాయెల్ మద్దతుపై ట్రంప్ వ్యాఖ్యలుఇటు.. ఇరాన్పై కొత్త ఆపరేషన్ జరిగితే ఇజ్రాయెల్ వెంటనే అమెరికాతో కలిసి వస్తుందని ట్రంప్ అన్నారు. “నేను అడిగితే ఇజ్రాయెల్ రెండు నిమిషాల్లో చేరుతుంది” అని వ్యాఖ్యానించారు. అయితే అమెరికా చర్యలకు ఇజ్రాయెల్ సహకారం తప్పనిసరి కాదని స్పష్టం చేశారు.హర్ముజ్ జలసంధిపై ఉత్కంఠఅమెరికా–ఇరాన్ ఘర్షణ ప్రభావం ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధిపై పడుతోంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళనలు నెలకొన్నాయి. ఇరాన్ కూడా తనపై దాడులు కొనసాగితే ప్రాంతీయ చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాలపై ప్రతీకారం ఉంటుందని హెచ్చరించింది.యుద్ధం విస్తరిస్తుందా?ఇరాన్కు మద్దతుగా ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో సౌదీ నౌకలపై దాడులు చేసినట్లు ప్రకటించారు. దీంతో మధ్యప్రాచ్య సంక్షోభం మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్.. ఇకపై హర్మూజ్ లో ఒక్క నౌకపై దాడి చేసినా
-
సూపర్ పవర్ ఇరాన్ డార్క్ సీక్రెట్.. ఇలాంటి పరిస్థితి ఎందుకు?
ఇటీవలి కాలంలో ఇరాన్ అనగానే మనందరికీ ఏం గుర్తుకొస్తుంది.. వీధుల్లో నిరసనలు, మహిళల హిజాబ్ ఆందోళనలు, ఇజ్రాయెల్-అమెరికా దేశాలతో యుద్ధాలు, ఆంక్షలు.. మతచాందసవాద ప్రభుత్వం..! కానీ మీకు తెలుసా..? ఒకప్పుడు ఇరాన్ అంటే ఇదంతా కాదు..! ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ పవర్లలో ఇరాన్ ఒకటి. 2,000 ఏళ్ల చరిత్ర ఉన్న 'పర్షియన్ సామ్రాజ్యం' పశ్చిమాసియాతోపాటు.. మధ్య ఆసియాను ఏలింది..! మరి అలాంటి గొప్ప నాగరికత ఉన్న దేశం.. ఈ రోజు ఒక క్రూరమైన, మతచాందసవాద రెజీమ్గా ఎలా మారింది..? అమెరికా, బ్రిటన్ వేసిన ఎత్తుగడలు ఇరాన్ను ఎలా మార్చేశాయి.. ఇరాన్ అసలు రక్తచరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే అసలు కథ తెలుస్తుంది..చరిత్రలోకి వెళ్తే క్రీస్తు శకం 1800 ప్రాంతంలో ఇరాన్ను 'కజార్' రాజవంశం పాలిస్తోంది. బయటి ప్రపంచం దీన్ని 'పర్షియా' అని పిలిచేది. ఆ సమయంలో రెండు పెద్ద సామ్రాజ్యాలు ఇరాన్పై కన్నేశాయి. వాటిల్లో ఒకటి రష్యన్ ఎంపైర్, రెండోది బ్రిటిష్ ఎంపైర్. రష్యాకు చలికాలంలో గడ్డకట్టని సముద్ర మార్గాలు కావాలి. అందుకే రష్యా ఇరాన్పై దాడి చేసి.. కొన్ని యుద్ధాల్లో ఓడించి, ఇరాన్ సముద్ర మార్గాలపై పూర్తి హక్కులు సాధించింది. ఇది చూసి బ్రిటన్ వణికిపోయింది..!రష్యా గనక ఇరాన్ను దాటుకుని ముందుకు వస్తే.. తమ అత్యంత విలువైన కాలనీ అయిన 'ఇండియా' రష్యా చేతికి చిక్కుతుందని భయపడింది. దాంతో బ్రిటన్, రష్యా మధ్య ఇరాన్ను ఎవరు కంట్రోల్ చేయాలనే ఒక పెద్ద పోటీ మొదలైంది. దాన్నే చరిత్రలో 'ది గ్రేట్ గేమ్' అంటారు. బ్రిటన్ ఓపెన్గానే చెప్పింది.. ‘మాకు ఇరాన్ను ఆక్రమించడం ఇష్టం లేదు. కానీ రష్యా ఆక్రమిస్తుంటే చూస్తూ ఊరుకోలేం..’ అని..! దాంతో ఇరాన్ రాజు షహా డబ్బుల కోసం తన దేశంలోని ఆస్తులను, రైల్వేలను, పరిశ్రమలను వ్యాపార హక్కులుగా రష్యా, బ్రిటన్లకు అమ్మేయడం మొదలుపెట్టాడు.1908లో ఇరాన్లో ఒక పెద్ద నిధి దొరికింది.. అదే చమురు..! బ్రిటిష్ నావికాదళం తమ నౌకలను బొగ్గు నుంచి చమురుకు మార్చే సమయానికి ఇరాన్లో క్రూడాయిల్ దొరకడం ఒక వరంగా మారింది. దీంతో.. బ్రిటన్ 'ఆంగ్లో-ఇరానియన్ ఆయిల్ కంపెనీ'ని స్థాపించింది. ఇప్పటికీ కొనసాగుతున్న British Petroleum కంపెనీయే అది..! ఇరాన్ చమురును తోడేస్తూ బ్రిటన్ ధనికదేశమైంది. కానీ ఇరాన్కు ఇచ్చిన వాటా కేవలం 16 శాతం మాత్రమే..! దీన్ని నిరసిస్తూ.. 1951లో ఇరాన్ ప్రజలు మొహమ్మద్ మొసద్దెగ్ (Mohammad Mosaddegh) అనే ప్రజాస్వామ్య నాయకుడిని తమ ప్రధానిగా ఎన్నుకున్నారు. మొసద్దెగ్ వచ్చీ రాగానే ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు.‘‘ఇరాన్ చమురు ఇరాన్ ప్రజలదే..! విదేశీయులు నడిపే ఆయిల్ కంపెనీని జాతీయకరణ (Nationalize) చేస్తున్నాం’’ అని ప్రకటించాడు..! ఈ నిర్ణయాన్ని బ్రిటన్, అమెరికా తట్టుకోలేకపోయాయి. 1953లో అమెరికా CIA, బ్రిటన్ MI6 కలిసి ఇరాన్లో రహస్యంగా ఒక కుట్ర పన్నాయి. ఫలితంగా.. ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య ప్రధాని మొసద్దెగ్ గద్దెదిగడమే కాకుండా.. జైలుపాలవ్వాల్సి వచ్చింది. బ్రిటన్, అమెరికాకు పెంపుడు కుక్కలా పనిచేసే 'మొహమ్మద్ రేజా షహా' (Mohammad Reza Shah) అనే రాజును సింహాసనంపై కూర్చోబెట్టారు..!ఖమేనీ ఎంట్రీ.. అమెరికా రక్షణతో అధికారంలోకి వచ్చిన షహా.. ఇరాన్లో వేగంగా పాశ్చాత్యీకరణ చేయడం మొదలుపెట్టాడు. మహిళలకు ఓటు హక్కు ఇచ్చాడు, పాఠశాలలు కట్టించాడు. సాంప్రదాయ ఇస్లామిక్ పద్ధతులను రద్దు చేశాడు. హిజాబ్ను నిషేధించాడు. తనను ఎదిరించిన వారిని సీఐఏ సాయంతో ఏర్పడిన 'సవాక్' అనే క్రూరమైన సీక్రెట్ పోలీసులతో హింసించి చంపేశాడు. ప్రజల్లో కోపం నరనరానా పాకింది..! ‘‘మన రాజు అమెరికా చేతిలో కీలు బొమ్మ.. మన సంస్కృతిని, చమురును విదేశీయులు దోచుకుంటున్నారు’’ అని ప్రజలు రగిలిపోయారు. ఆ సమయంలో వచ్చాడు అయతుల్లా రుహోల్లా ఖమేనీ..!ఆయన ఒక మత గురువు. ఆయన దేశం వెలుపల ఉంటూ క్యాసెట్ టేపుల ద్వారా ఇరాన్ ప్రజలకు సందేశాలు పంపేవాడు. ‘‘బ్రిటన్, అమెరికాలు మనల్ని బానిసలుగా చేశాయి. ఈ షహాను తరిమికొట్టండి..!’’ అని పిలుపునిచ్చాడు. 1979లో ఇరాన్ ప్రజలందరూ.. అంటే విద్యార్థులు, కార్మికులు, మత పెద్దలు కలిసి విప్లవం లేవనెత్తారు..! ఆ దెబ్బకు షహా దేశం వదిలి పారిపోయాడు. ఖమేనీ మళ్లీ ఇరాన్ వచ్చి 'ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్'ను స్థాపించాడు..!పక్కా నెట్వర్క్.. 1979 తర్వాత ఖమేనీ ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వం చాలా విచిత్రమైనదని చెప్పవచ్చు. అమెరికా, రష్యా వంటి ఏ విదేశీ శక్తి మళ్లీ వచ్చి, తమ దేశాన్ని ఆక్రమించకుండా ఉండటానికి.. ఖమేనీ ఒక పక్కా నెట్వర్క్ నిర్మించాడు.మొదటిది ఫిల్టర్డ్ ప్రజాస్వామ్యం: ఇరాన్లో ఎన్నికలు ఉంటాయి. ప్రెసిడెంట్ ఉంటాడు. కానీ వీళ్లందరి కంటే పైన సుప్రీమ్ లీడర్ (Supreme Leader) ఉంటాడు. మత కౌన్సిల్కు నచ్చిన వాళ్లు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయాలి.రెండోది.. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్: సాధారణ మిలిటరీగా కాకుండా, మత ప్రభుత్వాన్ని కాపాడటానికి సొంతంగా 'IRGC' అనే 5 లక్షల బలగాలున్న ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేశారు.మూడోది ప్రాక్సీ నెట్వర్క్: లెబనాన్లో హెజ్బొల్లా, యెమెన్లో హూతీలు, ఇరాక్లోని మిలీషియాలు.. పాలస్తీనాలో హమాస్.. ఇలా పశ్చిమాసియా అంతటా తమ ప్రాక్సీ గ్రూపులను తయారు చేసిన ఇరాన్, వాటి ద్వారా అమెరికా-ఇజ్రాయెల్లను భయపెట్టడం మొదలుపెట్టింది. ఈరోజు ఇరాన్ వద్ద ఉన్న అణు కార్యక్రమం (Nuclear Program) కూడా.. విదేశీయులు తమపై దాడి చేయకుండా ఉండటానికి వాడుతున్న ఆఖరి ఆయుధమే..!ఇరాన్ విషయంలో ఫైనల్గా మనం ఒక నిజాన్ని గుర్తుంచుకోవాలి..! ఇప్పుడున్న ఇరాన్ ప్రభుత్వం నిరంకుశమైనదే కావచ్చు. కానీ.. ఇరాన్ ప్రజలు వేరు. ఇరాన్ ప్రభుత్వం వేరు..! వివిధ సర్వేల ప్రకారం.. ఇరాన్లోని 80 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు ఈ మతఛాందస ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నారు. గత 200 ఏళ్లుగా ఇరాన్ ప్రజలు ఒకవైపు తమ సొంత నిరంకుశ పాలకులు, ఇంకోవైపు తమ స్వార్థం కోసం దేశాన్ని వాడుకున్న అమెరికా, బ్రిటన్, రష్యా వంటి విదేశీ శక్తుల మధ్య నలిగిపోతూనే ఉన్నారు. ఇదీ ఇరాన్ అసలు చరిత్ర.-హెచ్. కమలాపతి రావు, సీనియర్ జర్నలిస్టు. -
గల్ఫ్లో డ్రోన్ వార్.. ఆ ‘అదృశ్య శక్తి’ ఎవరు?.. అమెరికా ఆరా
గల్ఫ్ ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడులు ఇప్పుడు మరో అంతర్జాతీయ రహస్యానికి తెరతీశాయి. అమెరికా కీలక నిఘా సంస్థ సీఐఏకు చెందిన రహస్య స్థావరాలపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేయడం కలకలం రేపింది. అయితే ఈ దాడుల వెనుక ఇరాన్ సొంత సామర్థ్యమే ఉందా? లేక మరేదైనా శక్తి సాంకేతికంగా సహకరించిందా? అన్న కోణంలో అమెరికా నిఘా వర్గాలు దర్యాప్తు ప్రారంభించాయి.ముఖ్యంగా ఇరాన్ ఉపయోగించిన డ్రోన్ల కచ్చితత్వం, లక్ష్యాలను చేరుకున్న విధానం అమెరికా అధికారుల్లో అనుమానాలు పెంచుతోంది. ఇంత అధునాతన సామర్థ్యం కలిగిన డ్రోన్లు ఎలా సిద్ధమయ్యాయన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.CIA స్థావరాలే లక్ష్యంగా?రాయిటర్స్ కథనం ప్రకారం.. మార్చిలో గల్ఫ్ ప్రాంతంలోని కొన్ని సీఐఏ అనుబంధ కేంద్రాలపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది. సౌదీ అరేబియాలోని రియాద్ అమెరికా రాయబార కార్యాలయంలోని సీఐఏ కేంద్రం, ఇరాక్లోని మరో సీఐఏ అనుబంధ ప్రాంతం కూడా లక్ష్యంగా మారినట్లు సమాచారం. మరిన్ని రహస్య స్థావరాలు కూడా దాడుల పరిధిలోకి వచ్చి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ దాడులకు ఇరాన్కు చెందిన ‘షహీద్’ డ్రోన్లను ఉపయోగించినట్లు పాశ్చాత్య నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.టెక్నాలజీ ఆ దేశానిదేనా?అమెరికా దర్యాప్తులో ఇప్పుడు కీలకంగా మారిన అంశం.. ఇరాన్ డ్రోన్ల సామర్థ్యాన్ని పెంచడంలో రష్యా పాత్ర ఉందా అన్నది. ముఖ్యంగా రష్యాకు చెందిన ‘కొమెటా-ఎం’ శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థను ఇరాన్ డ్రోన్లలో ఉపయోగించారా అనే కోణంలో పరిశీలన సాగుతోంది. ఈ సాంకేతికత వల్ల డ్రోన్లు మరింత కచ్చితంగా లక్ష్యాలను చేరుకోవడంతో పాటు, వాటిని ఎలక్ట్రానిక్ జామింగ్తో అడ్డుకోవడం కూడా కష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు.దాడుల వెనుక నిఘా సమాచారమా?ఇరాన్కు రష్యా కేవలం సాంకేతిక సాయం మాత్రమే అందించిందా? లేక లక్ష్యాల వివరాలు, నిఘా సమాచారం కూడా ఇచ్చిందా? అనే అంశాన్ని అమెరికా పరిశీలిస్తోంది. అయితే ఇక్కడ మరో కోణం కూడా ఉంది. ఇరాన్ అసలు లక్ష్యం అమెరికా రాయబార కార్యాలయాలు కావొచ్చని, సీఐఏ కేంద్రాలు అనుకోకుండా దెబ్బతిని ఉండొచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై తుది నిర్ధారణకు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.రష్యా–ఇరాన్ బంధంపై కొత్త చర్చఇప్పటికే రష్యా, ఇరాన్ మధ్య సైనిక సహకారం కొనసాగుతోంది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ డ్రోన్ల వినియోగంపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్న వేళ.. గల్ఫ్లో అమెరికా లక్ష్యాలపై జరిగిన దాడుల్లో రష్యా పాత్ర ఉందా అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అమెరికా, రష్యా ప్రభుత్వాలు అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.డ్రోన్లతో సాగుతున్న ఆధునిక యుద్ధంలో.. ఒక దేశం దాడి చేస్తే, దాని వెనుక సాంకేతిక బలం ఎవరిది? అనే ప్రశ్న ఇప్పుడు గల్ఫ్ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. ఇరాన్ డ్రోన్ దాడుల వెనుక నిజంగా రష్యా హస్తం ఉందా? లేక ఇది కేవలం అనుమానమేనా? అమెరికా దర్యాప్తు తేల్చాల్సి ఉంది. -
అణు కేంద్రంపై బాంబులేస్తాం
వాషింగ్టన్/దుబాయ్: ఇరాన్ అణ్వాయుధ ఆశను శాశ్వతంగా చెదరగొట్టేందుకు ఎంతకైనా తెగిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దక్షిణ ఇరాన్లోని నటాంజ్ అణు శుద్ధి కర్మాగారం సమీపంలో పర్వతం అడుగున నిర్మాణ దశలో ఉన్న ‘పిక్యాక్స్ మౌంటేన్’అణుకేంద్రంపై దాడులు చేయాలని భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. మంగళవారం శ్వేతసౌధంలో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. 2025లో 12 రోజులపాటు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ బాంబులేశాయి. కానీ పిక్యాక్స్ పర్వత ప్రాంతం జోలికి పోలేదు. ఇప్పుడు ఆ ప్రాంతం పని పడతామని ట్రంప్ వెల్లడించారు. హార్మూజ్లో స్వేచ్ఛాయానం చేసే నౌకలపై ఇరాన్ దాడి చేసినప్పుడల్లా ఆ దేశంలోని ఒక విద్యుత్ఉత్పత్తి కేంద్రం లేదా ఒక వంతెనను నేలమట్టంచేస్తానని ట్రంప్ హెచ్చరించారు. ‘‘ఇరాన్ క్షిపణి, రాకెట్, డ్రోన్ మరేదైనా ఆయుధ వ్యవస్థను ప్రయోగిస్తే ఒక్కో దాడికి అమెరికా బదులుతీర్చుకుంటుంది. ఇరాన్ దాడిచేస్తే ప్రతిసారీ ఒక పవర్ ప్లాంట్ లేదా బ్రిడ్జిని బద్దలుకొడతాం’’అని ట్రంప్ ‘ట్రూత్సోషల్’లో ఒక పోస్ట్పెట్టారు. హెచ్చరికలతోడు అమెరికా వైమానిక దళా లు మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉద యం దాకా ఇరాన్లోని పలు ప్రాంతాలపై దాడు లు చేశాయి. ఈ దాడులను ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ)లోని గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకునే ప్రయత్నంచేశాయి. దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్లోని ఏలాట్ నగర శివారు ప్రాంతం అఖాబాపై దాడులు చేసింది. -
ఇరాన్పై వైమానిక దాడులతో విరుచుకపడ్డ అమెరికా
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. తాజాగా ఇరాన్పై అమెరికా దాడులు చేసింది. ఆ దేశ మిలటరీ స్థావరాలే లక్ష్యంగా (బుధవారం) అమెరికా వైమానిక దళాలు విరుచుకపడ్డాయి. ఆ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్పై అమెరికా దాడులు చేయడం ఇది వరుసగా 12వ రాత్రి కావడం ఆందోళన కలిగించే విషయంఅమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన ప్రకటనలో "ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు అమెరికా దళాలు ఇరాన్ సైనిక లక్ష్యాలపై మరిన్ని దాడులను ప్రారంభించాయి. ఆ ప్రాంతీయ జలాల్లో పయనించే పౌర నావికులకు ,వాణిజ్య నౌకలకు ఇరాన్ నుండి ఎదురవుతున్న ముప్పును పూర్తిగా మట్టుబెట్టే వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుంది." అని ప్రకటన విడుదల చేసింది.మధ్యప్రాచ్య సముద్ర మార్గాల్లో నౌకాయాన భద్రతను కాపాడటమే లక్ష్యంగా ఇరాన్ సైనిక శక్తులను దెబ్బతీసేందుకు ఈ దాడులు తీవ్రతరం చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. కాగా ఇరాన్ సైతం అమెరికాకు ఘాటుగా బదులిచ్చింది. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఈ మేరకు కొద్ది సేపటి క్రితమే అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. అమెరికా తమపై దాడులు చేస్తే కన్నుకు కన్ను అన్న రీతిలోనే సమాధానం ఉంటుందని తెలిపారు. -
"కన్నుకు.. కన్ను".. అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్
టెహ్రాన్: ఇరాన్కు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో టెహ్రాన్ ఘాటుగా బదులిచ్చింది. తమ దేశ మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడి జరిగినా దానికి తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ఇరాన్పై మండిపడ్డారు. "హర్ముజ్ జలసంధిలో పయనించే ఏ నౌకపైనా ఇరాన్ దాడులు చేయకూడదు. ఇరాన్ మిస్సైళ్లు, రాకెట్లు లేదా డ్రోన్లతో ఏ నౌకపైనైనా దాడి చేస్తే... దానికి ప్రతికారంగా ఇరాన్లోని ఒక వంతెనను లేదా విద్యుత్ ప్లాంట్ను అమెరికా దళాలు బాంబులతో పేల్చివేస్తాయి. అని హెచ్చరించారు.దీనిపై స్పందించిన అరాఘ్చీ "మా రక్షణ విధానం చాలా స్పష్టం 'కంటికి కన్ను' ఇరాన్ మౌలిక సదుపాయాలపై జరిగే ఏ రకమైన దాడికైనా మా స్పందన అత్యంత శక్తివంతంగా, నిర్ణయాత్మకంగా ఉంటుంది" అని పేర్కొన్నారు.అనంతరం ఆ దేశ ఆర్మీ అధికారులు మాట్లాడుతూ అమెరికా చేస్తున్న ఈ బెదిరింపుల వల్ల యుద్ధం మరింతగా పెరగడం తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. కాగా అమెరికా - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు విఫలమవ్వడంతో దాడులు తీవ్రతరమవుతున్నాయి. దీంతో వరుస దాడులతో పశ్చిమాసియా ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. -
‘హర్మూజ్కు ప్రత్యామ్నాయం దొరికింది’.. కానీ అసలు ట్విస్ట్ ఇదే!
టెహ్రాన్: హర్మూజ్ జలసంధిపై పెరుగుతున్న ఉద్రిక్తతలు గల్ఫ్ దేశాలను ప్రత్యామ్నాయ రవాణా మార్గాల అన్వేషణ వైపు మళ్లిస్తున్నాయి. ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన ఈ సముద్ర మార్గంపై ఇరాన్కు ఉన్న వ్యూహాత్మక ఆధిపత్యం నేపథ్యంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ , ఒమన్ తదితర దేశాలు పైప్లైన్లు, రైల్వేలు, కొత్త పోర్టుల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నాయి.సాధారణ పరిస్థితుల్లో హర్మూజ్ జలసంధి మీదుగా రోజుకు 100 నుంచి 150 నౌకలు ప్రయాణిస్తూ ప్రపంచానికి అవసరమైన క్రూడ్ ఆయిల్, సహజవాయువు, ఆహార పదార్థాలు, ఇతర సరుకులను రవాణా చేస్తుంటాయి. అయితే ఇరాన్తో ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితులు, సముద్ర భద్రతపై నెలకొన్న ఆందోళనల కారణంగా ఈ మార్గంపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో గల్ఫ్ దేశాలకు స్పష్టమైంది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎగుమతులు కొనసాగించే దిశగా భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నాయి.సౌదీ అరేబియా ప్రత్యేక వ్యూహంసౌదీకి తూర్పున పర్షియన్ గల్ఫ్, పశ్చిమాన ఎర్ర సముద్రం ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గాల అభివృద్ధికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. తూర్పు ప్రాంతాల నుంచి చమురును పెట్రోలైన్ ద్వారా యాంబూ పోర్టుకు తరలిస్తోంది. అలాగే జెద్దా–దమ్మామ్ మధ్య సుమారు 7 బిలియన్ డాలర్లతో రైల్వే, హైవే ప్రాజెక్టులను చేపడుతోంది.ఫుజైరాపై యూఏఈ దృష్టిదుబాయ్, అబుదాబి పోర్టులు హార్మూజ్ లోపల ఉండటంతో యూఏఈకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే హార్మూజ్ వెలుపల గల్ఫ్ ఆఫ్ ఒమన్ తీరంలో ఉన్న ఫుజైరా, కోర్ఫక్కన్ పోర్టులను ప్రత్యామ్నాయ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తోంది. 2027 నాటికి రెండో ఈస్ట్-టు-వెస్ట్ ఆయిల్ పైప్లైన్ను పూర్తి చేసి ఫుజైరా ద్వారా ఎగుమతులను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఒమన్కు భౌగోళిక ప్రయోజనంసోహార్, దుఖ్మ్, సలాలా పోర్టులు హార్మూజ్ వెలుపల ఉండటంతో ఒమన్కు సహజంగానే వ్యూహాత్మక ప్రయోజనం ఉంది. అయితే సౌదీ, యూఏఈతో పోలిస్తే పరిమిత ఆర్థిక వనరుల కారణంగా భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టే అవకాశం తక్కువగా ఉంది.ఖతార్, కువైట్కు సవాళ్లుఖతార్ ఎల్ఎన్జీ ఎగుమతులు పూర్తిగా హార్మూజ్పైనే ఆధారపడి ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా సౌదీ లేదా యూఏఈ భూభాగం గుండా పైప్లైన్ నిర్మించాల్సి ఉంటుంది. అయితే గతంలో ఖతార్పై విధించిన దిగ్బంధనం కారణంగా పొరుగు దేశాలపై పూర్తి స్థాయి విశ్వాసం నెలకొనలేదు.కువైట్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. సౌదీ మార్గాన్ని వినియోగిస్తే ఆర్థిక ఆధారపడటం పెరుగుతుందనే ఆందోళన ఉంది. మరోవైపు ఇరాక్ మార్గంలో భద్రతా సమస్యలు ప్రత్యామ్నాయ ప్రణాళికలకు అడ్డంకిగా మారుతున్నాయి.ప్రాజెక్టులు ఉన్నా.. అమలులో సవాళ్లుఇరాక్ కారిడార్, హిజాజ్ రైల్వే పునరుద్ధరణ, ఇండియా–యూఏఈ–ఒమన్ సముద్రగర్భ పైప్లైన్ వంటి ప్రతిపాదనలు ఉన్నప్పటికీ వాటి అమలుకు పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. హార్మూజ్ సాధారణ స్థితికి వస్తే భారీ పెట్టుబడులతో చేపట్టిన ప్రాజెక్టుల అవసరం తగ్గే అవకాశం ఉంది. పైప్లైన్లు కూడా దాడులకు గురయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా సముద్ర మార్గాల ద్వారా జరిగే భారీ స్థాయి చమురు రవాణాను రైళ్లు, ట్రక్కులు లేదా పైప్లైన్లు పూర్తిగా భర్తీ చేయలేవని నిపుణులు చెబుతున్నారు.అత్యవసర పరిస్థితుల కోసమే ప్రత్యామ్నాయాలుగల్ఫ్ దేశాలు చేపడుతున్న ఈ భారీ మౌలిక వసతుల ప్రాజెక్టుల లక్ష్యం హార్మూజ్ జలసంధిని పూర్తిగా పక్కన పెట్టడం కాదని, అత్యవసర పరిస్థితుల్లో కొంతకాలం ఎగుమతులు కొనసాగించే సామర్థ్యాన్ని పెంచుకోవడమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే ఈ ప్రణాళికలు విజయవంతం కావాలంటే నిధులతో పాటు ప్రాంతీయ రాజకీయ విశ్వాసం, స్థిరత్వం కూడా కీలకమని అభిప్రాయపడుతున్నారు.- హెచ్. కమలాపతి రావు, సీనియర్ జర్నలిస్టు. -
ఇరాన్ వార్.. భారీ మూల్యం చెల్లించుకుంటున్న అమెరికా
ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం అమెరికా ఖజానాపై భారీ భారంగా మారుతోంది. ఇప్పటివరకు ఈ యుద్ధానికి సంబంధించిన ఖర్చు 37.5 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.3.2 లక్షల కోట్లకు పైగా) చేరిందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. యుద్ధ వ్యయాలను భరించేందుకు అదనపు నిధులు కేటాయించాలని ఆయన అమెరికా కాంగ్రెస్ను కోరారు.కాంగ్రెస్ కమిటీలో జరిగిన విచారణ సందర్భంగా హెగ్సెత్ ఈ వివరాలు వెల్లడించారు. ఈ మొత్తం ఖర్చులో ఇప్పటికే జరిగిన యుద్ధ కార్యకలాపాలతో పాటు.. సెప్టెంబర్ 30 వరకు అంచనా వేసిన వ్యయాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఇదే సమయంలో.. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా రక్షణ శాఖ అదనపు నిధుల కోసం ప్రయత్నిస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో కాంగ్రెస్ను దాదాపు 90 బిలియన్ డాలర్ల (సుమారు రూ.7.7 లక్షల కోట్లకు పైగా) అదనపు నిధులు కోరారు. ఇందులో ఎక్కువ భాగం ఇరాన్ యుద్ధానికి సంబంధించిన ఖర్చులేనని సమాచారం. అంతేకాకుండా 2027 ఆర్థిక సంవత్సరానికి పెంటగాన్ ఏకంగా 1.5 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.128 లక్షల కోట్లకు పైగా) బడ్జెట్ను ప్రతిపాదించింది. ఈ నిధులు కేటాయించకపోతే దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని రక్షణ మంత్రి హెగ్సెత్ వ్యాఖ్యానించారు.యుద్ధంపై అమెరికాలో అసంతృప్తిఇరాన్తో యుద్ధంపై అమెరికాలో విమర్శలు పెరుగుతున్నాయి. మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. యుద్ధ వ్యయం, ద్రవ్యోల్బణం అంశాలను ప్రతిపక్ష డెమొక్రాట్లు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్లో పలువురు సభ్యులు.. ట్రంప్ ప్రభుత్వం యుద్ధ పరిణామాలపై తమకు తగిన సమాచారం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. డెమొక్రాట్ సెనేటర్ పాటీ ముర్రే మాట్లాడుతూ.. ఈ యుద్ధం దీర్ఘకాలికంగా కొనసాగుతుందా అన్న ఆందోళన వ్యక్తం చేశారు.18 మంది అమెరికా సైనికుల మృతిఇరాన్తో జరుగుతున్న పోరులో ఇప్పటివరకు 18 మంది అమెరికా సైనికులు మరణించినట్లు పెంటగాన్ తెలిపింది. మరో 430 మంది వరకు సైనికులు గాయపడినట్లు వెల్లడించింది. అయితే జూలై 7 తర్వాత గాయపడిన వారిలో 96 శాతం మంది తిరిగి విధుల్లో చేరారని అధికారులు తెలిపారు.కొనసాగుతున్న దాడులుఅమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల ప్రారంభంలోనే కుప్పకూలింది. ఆ తర్వాత ఇరు దేశాలు పరస్పరం దాడులు కొనసాగిస్తున్నాయి. ఇరాన్లోని లక్ష్యాలపై దాడులను విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. ఇంధన కేంద్రాలు, వంతెనలు, వ్యూహాత్మక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఖార్గ్ ద్వీపం, అణు కేంద్రాలపై ట్రంప్ హెచ్చరికలుఇరాన్లో కీలకమైన ఖార్గ్ ద్వీపం చమురు కేంద్రంపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే భూగర్భంలో ఉన్న అణు సంబంధిత కేంద్రాలపై కూడా దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. తాజాగా ఓ లోతైన భూగర్భ అణు కేంద్రాన్ని(పికాక్స్ మౌంటెన్ (Pickaxe Mountain) “త్వరలోనే ధ్వంసం చేస్తాం” అని ట్రంప్ పేర్కొన్నారు.సైనిక సామర్థ్యాలపై ప్రభావంయుద్ధ ఖర్చులు పెరగడంతో అమెరికా సైనిక శిక్షణ కార్యక్రమాలపై ప్రభావం పడే అవకాశం ఉందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. అత్యవసర నిధులు అందకపోతే సైనిక నిర్వహణ, ఆయుధాల ఆధునీకరణ, భవిష్యత్ రక్షణ ప్రాజెక్టులపై ఒత్తిడి పెరుగుతుందని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కేన్ తెలిపారు.మొత్తంగా.. ఇరాన్పై సైనిక చర్య అమెరికాకు వ్యూహాత్మకంగా ఎంత కీలకమైనదైనా.. దాని ఆర్థిక భారం మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది. బిలియన్ల డాలర్ల ఖర్చు, సైనిక నష్టాల మధ్య ట్రంప్ ప్రభుత్వానికి ఇరాన్ యుద్ధం సవాల్గా మారుతోంది. -
ఇరాన్ కు ట్రంప్ స్టాంగ్ వార్నింగ్
-
అమెజాన్ డేటా సెంటర్ పై ఇరాన్ మెరుపు దాడులు
-
ఒక పక్క దౌత్యం.. ఇంకోపక్క యుద్ధం!
ఇస్లామాబాద్: ఇరాన్ అమెరికాల మధ్య యుద్ధం మంగళవారానికి పదో రోజుకు చేరుకుంది. దాడి ప్రతిదాడుల మధ్య చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలూ ఊపందుకుంటున్నాయి. అమెరికా మంగళవారం ఇరాన్ మిలటరీ స్థావరాలు లక్ష్యంగా దాడులకు దిగింది. మిలటరీ కమాండ్ సెంటర్లు, క్షిపణి, డ్రోన్ల లాంచింగ్ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు జరిపిందని మిలటరీ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ హర్మూజ్ జలసంధిలో ఒక నౌకపై దాడి చేసింది.దీంతో సిబ్బంది నౌకను వదిలి పారిపోయారు. బెలూచిస్థాన్ ప్రావిన్స్లోని ఫార్స్, హొర్మోజ్గాన్, ల్లామ్, కెర్మాన్, సిస్టాన్ల వద్ద పేలుడు శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ అధికార మీడియా సంస్థ మంగళవారం ప్రకటించింది. అంతేకాకుండా ఇరాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో అమెరికా మిత్రదేశాలు జోర్డాన్, బహ్రయిన్, కువైట్లో విద్యుత్తు, నిర్లవణీకరణ కేంద్రాలపై దాడులు జరిపింది. ఇరాన్ ప్రయోగించిన ఐదు డ్రోన్లు, మూడు క్షిపణులను కూల్చేసినట్లు జోర్డాన్ ప్రకటించింది. మంగళవారం మధ్యాహ్నం బహ్రయిన్లో ఇరాన్ దాడులపై హెచ్చరికలు జారీ చేస్తూ సైరన్లు మోగాయి.ఇదిలా ఉంటే ఇరాన్ ఒక నిర్లవణీకరణ కేంద్రంపై దాడి చేసిందని, సోమవారం రాత్రి జరిగిన ఈ దాడిలో కేంద్రం దెబ్బతన్నట్లు కువైట్ ప్రకటించింది. ఇరుపక్షాల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు కూడా పెరిగిపోయాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 90 డాలర్లకు దగ్గరైంది. అలాగే మధ్యంతర ఎన్నికల నేపథ్యం, ద్రవ్యోల్బణం పెరగవచ్చునన్న అంచనాల కారణంగా అమెరికాలో గ్యాలన్ పెట్రోలు ధర రికార్డు స్థాయిలో నాలుగు డాలర్లకు చేరింది. పాకిస్థాన్లో ఇరాన్ హోం మంత్రిఇరాన్– అమెరికాల మధ్య దాడి, ప్రతిదాడులు కొనసాగుతూండగానే ఇరాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఎస్కందర్ మోమేనీ మంగళవారం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్, ప్రధాని షాబాజ్ షరీఫ్లతో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో యుద్ధ విరమణకు సంబంధించి ఎలాంటి ఏర్పాటు జరిగిందో స్పష్టం కాలేదు. ఇరాన్ – అమెరికాల మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ గత నెలలో ఇరుపక్షాలు ఒక మధ్యంతర అంగీకారానికి వచ్చేందుకు కృషి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఒప్పందం కాస్తా వీగిపోయి మళ్లీ యుద్ధం మొదలైన నేపథ్యంలో ఇరుపక్షాలు మరోసారి చర్చలు ప్రారంభించాలని పాకిస్థాన్ ఆహా్వనిస్తోంది.ఈ నేపథ్యంలో సోమవారం సాయంకాలమే పాకిస్థాన్ చేరుకున్న మొమేనీని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మోహసిన్ నక్వీని స్వాగతించారు. ఆ తరువాత అసీమ్ మునీర్తో సమావేశమయ్యారు. చివరగా పాక్ ప్రధానితో చర్చలు జరిపారు. మరోవైపు అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మార్కో రూబియో కూడా చర్చలకు సై అంటూనే అవి వాస్తవికంగా ఉండాలన్న షరతు విధించారు. ఈ నేపథ్యంలో ట్రంప్కు వాస్తవికం అనిపించే ఏర్పాటును ఇరాన్ చూపగలదా? అన్న ప్రశ్న వస్తోంది. ఇరుపక్షాల్లోనూ అపనమ్మకం వేళ్లూనుకున్న పరిస్థితుల్లో దౌత్యపరమైన చర్చలు ఎక్కడికి దారితీస్తాయో చూడాలి. -
పశ్చిమాసియా ఉద్రిక్తత.. భూగర్భంలోకి ఇరాన్ అణు రక్షణ వ్యవస్థ
టెహ్రాన్: అమెరికాతో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అణుబాంబుల తయారికీ ఎంతో కీలకమైన అణు సెంట్రిఫ్యూజ్లను ఆనటాంజ్ సమీపంలోని ‘పిక్యాక్స్ మౌంటెన్’ అని పిలిచే అత్యంత భద్రమైన భూగర్భ ప్రాంగణంలోకి తరలించినట్లు తెలుస్తోంది. గగనతలం నుంచి వీటిపై దాడులు చేసిన సైతం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది.వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం... అమెరికా, ఇజ్రాయెల్ అధికారులను ఉటంకిస్తూ—2025 జూన్లో 12 రోజుల పాటు జరిగిన సైనిక ఘర్షణ ముగిసిన కొద్ది నెలలకే ఇరాన్ ఈ పరికరాలను అక్కడకు మార్చిందని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఆ ఘర్షణలో అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్కు చెందిన అణు కర్మాగారాలపై దాడులు చేశాయిఅయితే, ఈ పిక్యాక్స్ స్థావరం ఆ దాడుల నుంచి తప్పించుకుంది. అంతేకాకుండా, ఫిబ్రవరి 28 నుండి ప్రారంభమైన మరింత తీవ్రమైన వైమానిక దాడుల్లో కూడా ఇది చెక్కుచెదరకుండా సురక్షితంగా ఉంది. ఈ భూగర్భ కేంద్రం కఠినమైన గ్రానైట్ రాతి కింద 300 అడుగులకు పైగా లోతులో నిర్మించబడిందని భావిస్తున్నారు. ఇది 2025లో బాంబు దాడులకు గురైన నటాంజ్, ఫోర్డో అణు శుద్ధి కర్మాగారాల కంటే చాలా లోతైనది. పర్వతం చుట్టూ సుమారు 15 నెలలుగా ట్రక్కుల రాకపోకలు, నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నాయని శాటిలైట్ చిత్రాలు, నిఘా సమాచారం వెల్లడించాయి. ఈ ప్రాంగణాన్ని ఇరాన్ నిలకడగా అభివృద్ధి చేస్తోందని ఇది సూచిస్తోంది అక్కడకు చేర్చిన సెంట్రిఫ్యూజ్లను ఎక్కడి నుండి తీసుకువచ్చారనేది స్పష్టంగా తెలియలేదు, కానీ ఇరాన్లోని ఇతర అణు కేంద్రాల నుండి వాటిని మార్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.ఐఏఈఏ పరిశీలనకు దూరంఅంతర్జాతీయ పరమాణు ఇంధన సంస్థ (IAEA) ఇన్ స్పెక్టర్లను ఈ పిక్యాక్స్ కాంప్లెక్స్ను సందర్శించడానికి ఇరాన్ అనుమతించలేదు. లోపల ఏమి జరుగుతుందనే దానిపై ఎటువంటి వివరణాత్మక సమాచారాన్ని కూడా అందించలేదు.2021లోనే ఇరాన్ పిక్యాక్స్ సైట్లో "అణు కార్యకలాపాలు" చేపడతామని తమకు తెలియజేసిందని IAEA డైరెక్టర్ జనరల్ రఫెల్ గ్రోసీ మార్చిలో తెలిపారు. అయితే అంతర్జాతీయ పర్యవేక్షణ, తనిఖీలు లేకపోవడంతో, ప్రపంచ కంటికి కనిపించకుండా ఈ భూగర్భ స్థావరాన్ని ఇరాన్ రహస్య కార్యకలాపాల కోసం ఉపయోగిస్తుందేమోనన్న ఆందోళనలు తీవ్రమవుతున్నాయి.‘పిక్యాక్స్’ తదుపరి లక్ష్యం కావచ్చు ట్రంప్ఈ భూగర్భ ప్రాంగణం త్వరలోనే అమెరికా దాడికి ప్రధాన లక్ష్యం కానుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదేపదే హెచ్చరిస్తున్నారు.గత వారం ఆయన మాట్లాడుతూ, "పిక్యాక్స్ ప్రధాన ద్వారం వద్దే మేము ఒక పెద్ద, బలమైన దాడి చేయడానికి అనువైన లక్ష్యంగా ఉంది" అని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఈ సైట్పై అమెరికా దాడి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
ఇరాన్ దెబ్బకు అమెరికా విలవిల
-
ఓడరేవులే టార్గెట్ గా అమెరికా భీకర దాడులు
-
యుద్ధంలో కీలక మలుపు.. ఇరాన్ సంచలన ప్రకటన
టెహ్రాన్: తమ దేశం.. అమెరికాతో పూర్తిస్థాయి యుద్ధంలో ఉందని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అన్నారు. యుద్ధ సమయంలో ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడం ఎంతో కీలకమని ఆయన ఉద్ఘాటించారు. నేటి యుద్ధం కేవలం క్షిపణుల యుద్ధం మాత్రమే కాదు. మిలిటరీ దాడులతో ఇరాన్ జాతీయులను లొంగదీసుకోలేమని శత్రువు గ్రహించాడంటూ టెహ్రాన్లోని హై కౌన్సిల్ ఆఫ్ ది జుడీషియరీ సమావేశంలో పెజెష్కియాన్ వ్యాఖ్యానించారు. యుద్ధం పరిణామాలను ప్రజలు అంగీకరించాలన్న పెజెష్కియన్.. ప్రతిఘటనే ప్రస్తుత మార్గమన్నారు.శత్రువు.. ఇరాన్పై హైబ్రిడ్ యుద్ధాన్ని మొదలుపెట్టాడన్న పెజెష్కియాన్.. యుద్ధ సమయంలో పరిపాలనా వ్యవస్థ ప్రాధాన్యతల్లో ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటం, సామాజిక ఆస్తులను పరిరక్షించడం ప్రధానమైనవని ఆయన స్పష్టం చేశారు. జూన్ 18న కుదిరిన అవగాహన ఒప్పందంతో సహా అమెరికాతో జరిగిన చర్చల్లో తమ ప్రభుత్వం ఇరాన్ జాతీయ హక్కులను, ప్రయోజనాలను పూర్తిస్థాయిలో కాపాడిందన్నారు.కాగా, వాణిజ్య నౌకలను బెదిరించే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా గత వారంలో అమెరికా ఇరాన్లోని దక్షిణ ప్రావిన్సులపై వరుస దాడులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్.. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్ వంటి ప్రాంతీయ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు మరియు సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం తుది ఒప్పందానికి రావడానికి 60 రోజుల వ్యవధిలో చర్చలు జరగాల్సి ఉన్న తరుణంలో ఈ ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి.మరో వైపు, అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్పై మరో విడత దాడులను ప్రారంభించినట్లు ప్రకటించడంతో.. సోమవారం రాత్రి, మంగళవారం వేకువజామున దక్షిణ, మధ్య ఇరాన్లో పలు పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. దక్షిణ ప్రావిన్స్ హోర్మోజ్గాన్లోని బందర్ అబ్బాస్, సిరిక్, బందర్ లెంగే, ఖేష్మ్ కౌంటీలతో పాటు ఆగ్నేయ ప్రావిన్స్ సిస్తాన్ అండ్ బలూచిస్థాన్లోని చాబహార్, కొనారక్ కౌంటీలలో సోమవారం రాత్రి పేలుళ్లు జరిగాయి. -
ఇరాన్పై మరోసారి అమెరికా బాంబింగ్
అమెరికా – ఇరాన్ల యుద్ధం మరింత వేడెక్కింది. ఇరాన్ మిలిటరి కమాండర్ సెంటర్పై అమెరికా దాడి చేసింది. ఇరాన్ డ్రోన్ లాంచ్ సైట్లు, ఎయిర్ డిఫైన్స్ సిస్టమ్పై ఎటాక్ చేసింది. మరోవైపు యూఎస్స్థానిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. కువైట్లోని యూఎస్ స్థావరంపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. యూఎస్ రాడర్ సిస్టమ్, అమెరికన్లు టార్గెట్గా ఇరాన్ విరుచుకుపడుతోంది.ఇరాన్, యూఎస్ మధ్య యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. క్షిపణి, డ్రోన్ దాడులతో గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వాషింగ్టన్ వరుసగా 10వ రాత్రి కూడా దాడులు కొనసాగించగా.. బహ్రెయిన్లోని అమెరికా వైమానిక రక్షణ వ్యవస్థపై దాడి చేసినట్లు ఇరాన్ వెల్లడించింది. మరో వైపు, హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై కూడా దాడులు జరిగాయి. తాము పూర్తి స్థాయి యుద్ధంలో ఉన్నామని టెహ్రాన్ హెచ్చరించగా.. ఇరాన్ దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికులు మరణించినట్లు పెంటగాన్ ధృవీకరించింది.నిన్న (సోమవారం) కూడా ఇరాన్ లక్ష్యంగా అమెరికా మరోసారి దాడులకు తెగబడగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్లపై ప్రతిదాడులకు దిగింది. ఇరాన్ వాయువ్య ప్రాంతంలో భూగర్భ క్షిపణి కేంద్రంగా భావిస్తున్న తబ్రిజ్ నగరం లక్ష్యంగా అమెరికా దాడులకు దిగగా ఒకరు మరణించినట్లు ఇరాన్ ప్రకటించింది. ప్రతీకారంగా ఇరాన్ బహ్రెయిన్తోపాటు అమెరికా నావికాదళపు ఫిఫ్త్ ఫ్లీట్ ఉన్న కువైట్పై క్షిపణులతో విరుచుకుపడింది. ఇరు దేశాల్లో సోమవారం ఉదయమే క్షిపణి దాడులకు సంబంధించిన హెచ్చరికలు జారీ అయ్యాయి.దూసుకొస్తున్న క్షిపణులను అడ్డుకున్నట్లు కువైట్ ప్రకటించింది. ఇరుదేశాల మధ్య యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటిస్తూ గత నెలలో ఒక ఒప్పందం కుదిరినా ఆ తరువాత దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూండటంతో ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో కార్యకలాపాలు మళ్లీ స్తంభించిపోయాయి. ఇరుపక్షాలూ మౌలిక సదుపాయాలు లక్ష్యంగా దాడులు చేసుకుంటూండంతో చమురు ధరలు మళ్లీ పైకి ఎగబాకాయి. సోమవారం బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్ ధర 90 డాలర్ల కంటే ఎక్కువ పలికి ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది. ఇరాన్పై సోమవారం జరిగిన దాడులు బాగా జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఒరాన్ డ్రోన్ దాడిలో శనివారం వీరసైనికుడి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నామని ఆయన ప్రకటించారు. -
హర్ముజ్ తర్వాత మరో షాక్.. హౌతీల సంచలన ప్రకటన
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకుంటున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ పదో రోజుకు చేరుకున్న వేళ.. యెమెన్కు చెందిన ఇరాన్ అనుకూల హౌతీ తిరుగుబాటుదారులు చేసిన సంచలన ప్రకటన ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. సౌదీ అరేబియాకు చెందిన వాణిజ్య, ఇంధన నౌకలపై నావికా దిగ్బంధం విధిస్తున్నట్లు హౌతీలు ప్రకటించారు. ఈ పరిణామంతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న గల్ఫ్ ప్రాంతంలో మరో కొత్త యుద్ధ ఫ్రంట్ తెరుచుకునే ప్రమాదం కనిపిస్తోంది.సౌదీ నేతృత్వంలోని కూటమి యెమెన్పై విధించిన ఆంక్షలు, చర్యలకు ప్రతిస్పందనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హౌతీ సాయుధ విభాగం వెల్లడించింది. సౌదీకి వ్యతిరేకంగా ‘మారిటైమ్ ఎంబార్గో’ అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఈ ప్రకటనతో ప్రపంచ ఇంధన సరఫరా మార్గాలపై మరోసారి తీవ్ర ఆందోళన మొదలైంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన బాబ్ ఎల్ మండెబ్ bab el mandeb జలసంధిపై ప్రభావం పడితే పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది.ఇప్పటికే హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ రెండు కీలక సముద్ర మార్గాల్లో అంతరాయం ఏర్పడితే ప్రపంచ చమురు సరఫరాలో భారీ కోత వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చమురు మార్కెట్లలో కలవరంహౌతీల ప్రకటన వెలువడిన వెంటనే అంతర్జాతీయ చమురు మార్కెట్లు అప్రమత్తమయ్యాయి. అయితే దౌత్య చర్చలపై ఆశలు ఉండటంతో ధరలు కొంత మేర తగ్గాయి. అయినప్పటికీ.. గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు అదుపు తప్పితే ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రపంచ చమురు ఎగుమతుల్లో కీలక పాత్ర పోషించే సౌదీ అరేబియా రవాణా మార్గాలకు ముప్పు ఏర్పడితే దాని ప్రభావం కేవలం మధ్యప్రాచ్యానికే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉంది.ఇరాన్పై అమెరికా దాడులు కొనసాగింపుమరోవైపు ఇరాన్పై అమెరికా సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. పదో రోజు కూడా అమెరికా వైమానిక దాడులు జరిపినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్ సైనిక కమాండ్ కేంద్రాలు, క్షిపణి ప్రయోగ స్థావరాలు, డ్రోన్ కేంద్రాలు, నౌకా సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. ఇరాన్లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. తబ్రీజ్, చాబహార్, బందర్ అబ్బాస్, ఖెష్మ్ దీవి పరిసర ప్రాంతాల్లో అమెరికా దాడుల ప్రభావం కనిపించినట్లు సమాచారం.ఇరాన్ మాత్రం అమెరికా దాడులకు ప్రతీకార చర్యలు కొనసాగిస్తామని ప్రకటిస్తోంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అమెరికా మిత్ర దేశాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది.హర్ముజ్లో ట్యాంకర్లపై దాడులుగల్ఫ్ ఉద్రిక్తతలకు కేంద్రంగా మారిన హర్ముజ్ జలసంధిలో మరో కలకలం చోటుచేసుకుంది. రెండు చమురు ట్యాంకర్లు పేలిపోయినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. సురక్షితం కాని మార్గంలో ప్రయాణించడంతో ఈ ఘటన జరిగిందని ఇరాన్ పేర్కొంది.అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలను స్వతంత్ర సంస్థలు ధ్రువీకరించలేదు. మరోవైపు ఒమన్ తీరంలో ఓ వాణిజ్య నౌకపై గుర్తుతెలియని ఆయుధంతో దాడి జరిగినట్లు బ్రిటన్కు చెందిన సముద్ర భద్రతా సంస్థ వెల్లడించింది.దౌత్య ప్రయత్నాలు.. కానీ తగ్గని ఉద్రిక్తతలుయుద్ధ వాతావరణం కొనసాగుతున్నప్పటికీ మరోవైపు దౌత్య ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఎస్కందర్ మొమెని పాకిస్థాన్కు చేరుకుని చర్చలు ప్రారంభించారు. గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించే ప్రయత్నాలు చేస్తోంది.అయితే అమెరికా మాత్రం ప్రస్తుతం దౌత్యం కంటే సైనిక చర్యలకే ప్రాధాన్యం ఇస్తోంది. ఇరాన్ దాడుల్లో మరణించిన అమెరికా సైనికులకు ప్రతీకారం తీర్చుకుంటామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.గల్ఫ్ దేశాల్లో భయంఇరాన్-అమెరికా ఘర్షణ ప్రభావం గల్ఫ్ దేశాలపై కూడా పడుతోంది. కువైట్, బహ్రెయిన్, ఖతార్ వంటి దేశాలు అప్రమత్తమయ్యాయి. తమపై జరిగిన దాడులపై ఖతార్ ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది. నష్టపరిహారం కోరుతూ చర్యలు తీసుకుంటోంది.ఇప్పటికే హర్ముజ్ జలసంధి.. ఇప్పుడు బాబ్ ఎల్ మండెబ్ మార్గంపై కూడా ముప్పు ఏర్పడటంతో ప్రపంచ దేశాల దృష్టి మొత్తం మధ్యప్రాచ్యంపై పడింది. అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ మరింత విస్తరిస్తే.. అది కేవలం ప్రాంతీయ యుద్ధంగానే కాకుండా ప్రపంచ ఇంధన సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ఇరాన్పై అమెరికా భారీ వైమానిక దాడులు
దుబాయి: అమెరికా – ఇరాన్ల యుద్ధం మరింత వేడెక్కింది. సోమవారం ఉదయం ఇరాన్ లక్ష్యంగా అమెరికా మరోసారి దాడులకు తెగబడగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్లపై ప్రతిదాడులకు దిగింది. ఇరాన్ వాయువ్య ప్రాంతంలో భూగర్భ క్షిపణి కేంద్రంగా భావిస్తున్న తబ్రిజ్ నగరం లక్ష్యంగా అమెరికా దాడులకు దిగగా ఒకరు మరణించినట్లు ఇరాన్ ప్రకటించింది. ప్రతీకారంగా ఇరాన్ బహ్రెయిన్తోపాటు అమెరికా నావికాదళపు ఫిఫ్త్ ఫ్లీట్ ఉన్న కువైట్పై క్షిపణులతో విరుచుకుపడింది. ఇరు దేశాల్లో సోమవారం ఉదయమే క్షిపణి దాడులకు సంబంధించిన హెచ్చరికలు జారీ అయ్యాయి. దూసుకొస్తున్న క్షిపణులను అడ్డుకున్నట్లు కువైట్ ప్రకటించింది. ఇరుదేశాల మధ్య యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటిస్తూ గత నెలలో ఒక ఒప్పందం కుదిరినా ఆ తరువాత దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూండటంతో ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో కార్యకలాపాలు మళ్లీ స్తంభించిపోయాయి. ఇరుపక్షాలూ మౌలిక సదుపాయాలు లక్ష్యంగా దాడులు చేసుకుంటూండంతో చమురు ధరలు మళ్లీ పైకి ఎగబాకాయి. సోమవారం బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్ ధర 90 డాలర్ల కంటే ఎక్కువ పలికి ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది. బాగా దెబ్బకొట్టాం: ట్రంప్ ఇరాన్పై సోమవారం జరిగిన దాడులు బాగా జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఒరాన్ డ్రోన్ దాడిలో శనివారం వీరసైనికుడి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నామని ఆయన ప్రకటించారు. -
ఖర్గ్ ద్వీపం కోసం ఆలోచిస్తే.. ఇరాన్ భారీ వార్నింగ్
టెహ్రాన్: అమెరికాకు ఇరాన్ మరోసారి భారీ వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ ఖర్గ్ ద్వీపం ఆక్రమించడానికి వాషింగ్టన్ యత్నిస్తే అక్కడికి వచ్చిన సైనికులు ప్రాణాలతో తిరిగి వెళ్లలేరని వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల ట్రంప్ ఖర్గ్ ద్వీపంపై వ్యాఖ్యల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.పర్షియన్ గల్ఫ్లోని, బుషెహర్ ప్రావిన్స్ తీరానికి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖర్గ్ ద్వీపం, ఇరాన్ యొక్క అతిపెద్ద చమురు ఎగుమతి కేంద్రం ఆ దేశంలోని అత్యంత వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఇంధన ఆస్తులలో ఇది ప్రధానమైనది. ఇరాన్ నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యే మొత్తం ముడి చమురులో దాదాపు 90 శాతం ఈ ఒక్క ద్వీపం నుంచే సరఫరా అవుతుంది.దీంతో దీనిని ఎలాగైనా ఆక్రమించాలని ట్రంప్ తొలినుంచి యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అవసరమైతే ఖర్గ్ ద్వీపాన్ని తమ నియంత్రణలోకి తీసుకునేలా పరిమిత భూతల దాడి చేసే ఆలోచన ఉందని మాట్లాడారు. తాజాగా ఆ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటరిచ్చింది.విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి మాట్లాడుతూ "ఖర్గ్ ద్వీపంపై భూతల దాడి చేయడానికి అమెరికా సైనికులు వస్తే... వారిని 'స్వాగతించడానికి' మా సైన్యం, మా ప్రజలు నిమిషాలు లెక్కిస్తూ, సిద్ధంగా ఎదురుచూస్తున్నారు." అని అన్నారు.మళ్లీ ఉద్రిక్తతప్రస్తుతం పశ్చిమాసియా పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా, యుద్ధ వాతావరణంతో అట్టుడుకుతున్నాయి. గత నెలలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా విఫలమై, మళ్లీ భారీ ఎత్తున దాడులు ప్రతిదాడులు జరుగుతున్నాయి. -
ఫ్యామిలీకి అదే చివరి కాల్ అనుకున్నా.. ఇరాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
టెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో శాంతి చర్చలు జరుపుతున్న సమయంలో ఇరాన్ ప్రతినిధులు తీవ్ర ప్రమాద పరిస్థితుల్లో పనిచేశారని ఆయన వెల్లడించారు. మేము ఎప్పుడు చనిపోతామో.. మాపై బాంబులు ఎప్పుడు వేస్తారోననే భయంతో వణికిపోయినట్టు చెప్పుకొచ్చారు.ఇరాన్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరాఘ్చి మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యప్రాచ్య ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్తో జరిగిన సంభాషణను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన.. ‘చర్చలు జరుగుతున్న సమయంలో ఏ క్షణంలోనైనా సమావేశంపై బాంబు దాడి జరగొచ్చనే భయం ఉండేది. కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇది చివరి సంభాషణ కావచ్చేమో అన్న ఆలోచన వచ్చేది’ అని తెలిపారు.అనంతరం.. అమెరికా, ఇజ్రాయెల్ నుంచి వస్తున్న ఒత్తిళ్లకు ఇరాన్ తలొగ్గలేదని ఆయన స్పష్టం చేశారు. అణు కార్యక్రమంలో యురేనియం ఎన్రిచ్మెంట్ను పూర్తిగా నిలిపివేయాలన్న డిమాండ్ను అంగీకరించలేదని, తమ హక్కుల విషయంలో వెనక్కి తగ్గబోమని పేర్కొన్నారు. ‘చర్చలు జరపాలి.. బెదిరింపులు లేదా ప్రలోభాలతో మమ్మల్ని మార్చలేరు’ అని అరాఘ్చి వ్యాఖ్యానించారు. చర్చల ద్వారా తమ లక్ష్యాలను సాధించలేమని భావించిన తర్వాతే అమెరికా యుద్ధ మార్గాన్ని ఎంచుకుందని ఆయన ఆరోపించారు. అమెరికా సైనిక ఒత్తిడితో ఇరాన్ను లొంగదీయవచ్చన్న వాదనలను కూడా అరాఘ్చి ఖండించారు. ‘ఇరాన్ వెనిజులా కాదు. ఒక నాయకుడిని తొలగిస్తే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోదు. ఇరాన్లో అధికార వ్యవస్థ అనేక స్థాయిల్లో పనిచేస్తుంది’ అని ఆయన అన్నారు.ఇదిలా ఉండగా, అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్పై వరుసగా తొమ్మిదో రోజు వైమానిక దాడులు కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులకు ఉపయోగిస్తున్న ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమే తమ లక్ష్యమని అమెరికా తెలిపింది. మరోవైపు ఇరాన్ మీడియా ప్రకారం.. తబ్రిజ్, చాబహార్, కొనారక్, బందర్ మహ్షహర్ తదితర ప్రాంతాల్లో పేలుళ్లు జరిగినట్లు సమాచారం వెలువడింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కూడా సిరియాలోని అల్-తన్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా ప్రత్యేక ఆపరేషన్స్ కేంద్రంపై దాడి చేసినట్లు ప్రకటించింది. -
ఇరాన్ భీకర దాడి.. అమెరికా సైనికులు మృతి
-
ఇరాన్ యుద్ధం తీవ్రరూపం.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక
మధ్యప్రాచ్యంలో అమెరికా–ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు కొనసాగుతున్న వేళ, ఇరాక్లో జరిగిన ఓ ఆపరేషన్లో అమెరికా సైనికుడు మరణించగా, మరో సైనికుడు గాయపడ్డాడు. దీంతో, ఇరాన్పై దాడుల మరింత పెంచాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలిచ్చారు. ఇదే సమయంలో ఇరాన్కు ప్రయాణాలను నివారించాలని, ఇప్పటికే అక్కడ ఉన్న భారతీయులు భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దేశం విడిచి రావడాన్ని పరిశీలించాలని భారత్ సూచించింది.అమెరికా సైనికుడు మృతిఅమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం, ఉత్తర ఇరాక్లో కూలిపోయిన ఇరాన్కు చెందిన ఒక డ్రోన్లోని పేలని ఆయుధ భాగాలను నిర్వీర్యం చేసే సమయంలో అమెరికా సైనికుడు ప్రాణాలు కోల్పోగా, మరో సైనికుడు స్వల్పంగా గాయపడ్డాడు. జూలై 18న ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో సైనికుల వివరాలను వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చిన తర్వాత వెల్లడిస్తామని CENTCOM తెలిపింది. ఈ తాజా మరణంతో గత దాదాపు ఐదు నెలలుగా కొనసాగుతున్న ఘర్షణల్లో మరణించిన అమెరికా సైనికుల సంఖ్య 17కు చేరింది.ఇరాన్పై వరుస దాడులుఉద్రికత్తల నేపథ్యంలో ఇరాన్పై అమెరికా మరోసారి వైమానిక దాడులు ప్రారంభించింది. ఇది వరుసగా తొమ్మిదో రాత్రి దాడులుగా CENTCOM పేర్కొంది. హర్మూజ్ జలసంధి ద్వారా ప్రయాణించే వాణిజ్య నౌకలు, పౌర నావికులపై దాడులకు ఉపయోగిస్తున్న ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమే తమ లక్ష్యమని అమెరికా తెలిపింది. అయితే తాజా దాడుల్లో ఏ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారో, ఎంత నష్టం జరిగిందో అమెరికా అధికారులు ఇంకా వెల్లడించలేదు. అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు అక్కడి మీడియా తెలిపింది.ఇరాన్ ప్రయాణంపై భారత్ కీలక సూచనపశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం భారత పౌరులకు ప్రయాణ సూచన జారీ చేసింది. ఇరాన్కు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని భారత్ కోరింది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయులు తమ భద్రతను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా దేశం విడిచి వెళ్లే అవకాశాలను పరిశీలించాలని సూచించింది. ఇరాన్లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారుల సూచనలు పాటించాలని, తాజా భద్రతా పరిస్థితులను గమనించాలని భారత రాయబార కార్యాలయం సూచించింది.బహ్రెయిన్లో అమెరికా పౌరులకు హెచ్చరికఇదే సమయంలో బహ్రెయిన్లోని అమెరికా రాయబార కార్యాలయం కూడా భద్రతా హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ నుంచి ముప్పు ఉందని సమాచారం అందినట్లు పేర్కొంది. అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
ఇరాన్పై అమెరికా ప్రతీకార దాడులు
దుబాయ్: ఇరాన్పై అమెరికా సైన్యం ప్రతీకారంతో రగిలిపోతోంది. జోర్డాన్లో జరిగిన దాడిలో ఇద్దరు అమెరికా జవాన్లు మరణించడంతో యుద్ధం మరింత ఉధృతమవుతోంది. అమెరికా ఆదివారం ఇరాన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. వైమానిక దాడులకు దిగింది. క్షిపణులు డ్రోన్లు, ప్రయోగించింది. ఇరాన్ సైతం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా జోర్డాన్లో అమెరికా స్థావరాలపై గురిపెట్టింది. రానున్న రోజుల్లో ఇది పూర్తిస్థాయి యుద్ధంగా మారే సూచనలు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కోట్ల మంది ఆధారమైన పౌర మౌలిక సదుపాయాలను ఇరుపక్షాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. జోర్డాన్లో శుక్రవారం జరిగిన దాడికి ప్రతిస్పందనగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ)పై ఆదివారం భీకర దాడుల చేసినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. మరోవైపు ఇరాన్ వైమానిక దాడుల నుంచి రక్షించుకోవడానికి బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ తమ గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలం చేశాయి. తమ పొరుగు దేశమైన జోర్డాన్ వైపు ప్రయోగించిన క్షిపణుల వల్ల మంటలు భూభాగంలోకి వ్యాపించే అవకాశం ఉందని, అదే జరిగితే ఇరాన్కు తగిన బుద్ధి చెప్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం నిర్మాణ స్థలంపై దాడి ఇరాన్ సైనిక తీరప్రాంత నిఘా, గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణి, డ్రోన్ నిల్వ స్థావరాలపై దాడి చేసినట్లు అమెరికా మిలటరీ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. హార్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణను దెబ్బతీయడానికి, ఐఆర్జీసీ దళాలను శిక్షించడానికి వ్యూహం రూపొందించినట్లు పేర్కొంది. నైరుతి ప్రాంతంలో నిర్మించతలపెట్టిన అణు విద్యుత్ కేంద్రం నిర్మాణ స్థలాన్ని అమెరికా లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపినట్లు ఇరాన్ అణు శక్తి సంస్థ పేర్కొంది. -
మార్కెట్ తడబడ్డా... ఐపీఓలు అదుర్స్
ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా–ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై భారీ స్థాయిలో దాడులు మొదలుపెట్టేంత వరకూ భారత మార్కెట్లు బాగానే ఉన్నాయి. పైపెచ్చు జీవితకాల గరిష్ట స్థాయిలకు అటూఇటుగా ఉన్నాయి. బుల్ మార్కెట్ మంచి జోరుమీద ఉండటంతో అప్పటిదాకా వచ్చిన ఐపీఓలకు ఏకంగా 100 రెట్లు, 200 రెట్లు స్థాయిలో స్పందన వచ్చింది. రిటైల్ విభాగంలో అయితే ఏ ఐపీఓకైనా 100 రెట్లకు తక్కువ స్పందన రాలేదంటే అతిశయోక్తి కాదు. వాస్తవానికి అలాంటి స్పందన వచ్చిన ఐపీఓలు కూడా కొన్ని పేలవంగా లిస్టయి ఇన్వెస్టర్లకు నష్టాలు మిగిల్చాయి. కాకపోతే ఇరాన్పై దాడులు మొదలయ్యాక పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మార్కెట్లు కిందపడ్డాయి. కంపెనీలు ఐపీఓలకు రావటానికే ఇష్టపడలేదు. కొన్ని కంపెనీలు అప్పటికే ప్రక్రియ మొత్తం పూర్తిచేసుకుని ఉండటంతో పబ్లిక్ ఇష్యూకు రాక తప్పలేదు. కాకపోతే వాటికి రిటైలర్ల నుంచి వచ్చిన స్పందన నామమాత్రమే. రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా పూర్తిగా సబ్ర్స్కయిబ్ కూడా కాలేదంటే పరిస్థితి ఎలా మారిపోయిందో తెలుసుకోవచ్చు. విచిత్రమేంటో తెలుసా? అప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చిన 6 ఐపీఓల్లో ఒక్కటి తప్ప మిగిలినవన్నీ లాభాలే ఇచ్చాయి. కొన్నయితే ఈ నాలుగు నెలల్లోనే 40–50 శాతానికి పైగా పెరిగాయి. వీటిలో కొన్ని షేర్లయితే లిస్టింగ్ నాడు పెద్దగా లాభాలివ్వకపోయినా... ఆ తరవాత క్రమంగా పెరుగుతూ చక్కటి లాభాలిచ్చాయి. దీనర్థం ఒక్కటే... సబ్ స్క్రిప్షన్ తక్కువయినంత మాత్రాన, లిస్టింగ్ లాభాలు రానంత మాత్రాన ఆ షేర్లు రాణించవని కాదు. మెల్లగా ముందుకెళుతూ అద్భుతమైన రాబడినిస్తాయనేది ఈ షేర్లు చెబుతున్న వాస్తవం. ఆ వివరాలే ఈ ‘సాక్షి వెల్త్’ స్టోరీ...ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతలు, వడ్డీ రేట్లపై సందేహాలు... ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా ఈ ఏడాది ‘మెయిన్ బోర్డు’ ఐపీఓ మార్కెట్ అద్భుతమైన నిలకడ చూపించింది. మార్చి–2026 తరువాత మార్కెట్లోకి వచ్చిన ఆరు ప్రధాన ఐపీఓల్లో ఐదు ఇప్పటికీ ఇష్యూ ధర కంటే ఎగువన ట్రేడవుతుండగా... ఒక్క అమీర్ చంద్ జగదీశ్ కుమార్ ఎక్స్పోర్ట్స్’ మాత్రమే ఇష్యూ ధర కంటే దిగువన కొనసాగుతోంది.ఈ మూడూ... 40 శాతానికిపైనే ఇప్పటివరకు అత్యధిక రాబడినిచ్చిన ఐపీఓగా హెక్సగాన్ న్యూట్రిషన్ నిలిచింది. ఇష్యూ ధరతో పోలిస్తే దాదాపు 55 శాతం లాభాన్ని అందించింది. ఆ తర్వాత పవరికా (44 శాతం), సాయి పేరెంటరల్స్ (42 శాతం) టాప్–2, 3, స్థానాల్లో నిలిచాయి. ఏప్రిల్ తరువాత లిస్టయి ఈ మూడు షేర్లూ మూడు 40 శాతానికి పైగా లాభాలివ్వటం గమనార్హం. వీటిలో సాయి పేరెంటరల్స్ హైదరాబాద్కు చెందిన ఫార్మా కంపెనీ కావటం విశేషం. లిస్టయిన తరువాత కంపెనీ వెలువరించిన 2025 క్యూ4 ఫలితాలు అంచనాలకు మించి ఉండటంతో ఒకస్థాయిలో షేరు ధర రూ.600 కూడా దాటింది. అత్యధిక లాభాలు అందించిన హెక్సగాన్ కూడా ఫార్మా కంపెనీయే కాగా... పవరికా మొదట్లో తడబడినా ఆ తరువాత డేటాసెంటర్ల బూమ్తో ఒక్క నెలలోనే 50 శాతానికిపైగా పెరగటం గమనార్హం. ఒబెరాయ్ల కుటుంబానికి చెందిన ఈ కంపెనీ పవన విద్యుదుత్పత్తితో పాటు డేటా సెంటర్లకు భారీ స్థాయి జనరేటర్లను సమకూర్చే వ్యాపారంలో ఉంది. సబ్ స్క్రిప్షన్ ఎక్కువైతే... లాభాలూ ఎక్కువేనా?ఈ ఐపీఓలు మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించాయి. పవరికాకు కేవలం 1.45 రెట్లు మాత్రమే సబ్ స్క్రిప్షన్ లభించింది. అయినప్పటికీ అది 44 శాతం రాబడితో అగ్రగాముల్లో ఒకటిగా నిలిచింది. మరోవైపు నాక్ ప్యాకేజింగ్కు 87 రెట్లు, హెక్సాగాన్కు 54 రెట్లు సబ్స్క్రిప్షన్ వచ్చింది. కాకపోతే వీటి రాబడులు మాత్రం ఒకేలా లేవు. అమీర్ చంద్ జగదీశ్కుమార్ ఎక్స్పోర్ట్స్’కు పవరికా కంటే ఎక్కువ సబ్స్క్రిప్షన్ వచ్చినా ఇప్పటికీ ఇష్యూ ధర కంటే దిగువనే ట్రేడవుతోంది. అంటే సబ్ స్క్రిప్షన్ సంఖ్య మాత్రమే షేర్ల రాబడులను నిర్ణయించదని ఈ ఐపీఓలు స్పష్టం చేశాయి.ఈ ఐపీఓలు చెప్పిన పాఠాలివీ..→ లిస్టింగ్ రోజున వచ్చే హైప్ శాశ్వతం కాదు. → భారీ సబ్ స్క్రిప్షన్ అంటే భారీ లాభాలు అన్న గ్యారంటీ లేదు. → చివరికి కంపెనీ వ్యాపార నాణ్యత, వృద్ధి, మార్కెట్ నమ్మకమే పెట్టుబడిదారుల సంపదను నిర్ణయిస్తాయి. - మంథా రమణమూర్తి -
ఉలిక్కిపడ్డ ఇరాన్.. 5.0 తీవ్రతతో భూకంపం
ఖుజెస్తాన్ : ఇరాన్లోని నైరుతి ఖుజెస్తాన్ ప్రావిన్స్లోని సలాండ్ ప్రాంతంలో ఆదివారం 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ భూకంపం సుమారు 12 కిలోమీటర్ల (7.5 మైళ్లు) లోతులో సంభవించింది. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు రెండు రెస్క్యూ బృందాలను పంపినట్లు ఇరాన్ ప్రభుత్వం పేర్కొంది.యుద్ధ విరమణ ఒప్పందం విఫలమైన తర్వాత గత వారం రోజులుగా అమెరికా, ఇరాన్ల మధ్య దాడులు కొనసాగుతూ ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఈ భూకంపం సంభవించింది. అరేబియన్- యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే సరిహద్దులో ఉండటం వల్ల ఇరాన్ ప్రపంచంలోనే అత్యధిక భూకంప ప్రభావిత దేశాలలో ఒకటిగా ఉంది. ఈ ప్లేట్ల నిరంతర కదలికల వల్ల దేశంలోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాలైన ఖుజెస్తాన్, కెర్మన్షా, హొర్మోజ్గాన్ ప్రావిన్స్లలో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఇరాన్లో సంభవించే అనేక భూకంపాలు తక్కువ తీవ్రతతో ఉండి పెద్దగా ప్రభావం చూపవు.అయితే, ఉపరితలానికి దగ్గరగా సంభవించే భూకంపాలు ప్రమాదకరంగా మారవచ్చు. ఇటువంటి భూకంపాలు బలమైన ప్రకంపనలను సృష్టించి, ముఖ్యంగా జనాభా అధికంగా ఉండే ప్రాంతాల్లో నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఇరాన్లో ఇటీవలి నెలల్లో నమోదైన వరుస భూకంపాల్లో ఇది తాజా ఘటన. జూన్ 2026లో దక్షిణ హొర్మోజ్గాన్ ప్రావిన్స్లో 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది, అయితే ఎటువంటి భారీ నష్టం లేదా ప్రాణనష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. దేశం తరచుగా భూకంపాల బారిన పడే అవకాశం ఉన్నందున, శాస్త్రవేత్తలు ఇరాన్ ఫాల్ట్ లైన్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. -
ఖమేనీ అంత్యక్రియల్లో హైడ్రామా.. ఇరాన్ విదేశాంగ మంత్రిపై రాళ్ల వర్షం!
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత దేశ రాజకీయాల్లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఆయనకు ఘన నివాళులు అర్పించాల్సిన అంత్యక్రియలే అధికార పోరుకు వేదికగా మారాయి. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీపై అమెరికాతో రాజీని వ్యతిరేకించే అతివాదులు బహిరంగంగా విమర్శలు గుప్పించడం, అమెరికాతో రాజీకి వెళ్లారని దేశద్రోహులుగా ముద్ర వేయడంతో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఖమేనీ అంతిమయాత్రలో పాల్గొన్న అధ్యక్షుడు పెజెష్కియన్ను లక్ష్యంగా చేసుకుని అతివాదులు కొందరు ట్రంప్తో రాజీపడ్డవారికి మరణం అంటూ నినాదాలు చేశారు. అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన విదేశాంగ మంత్రి అరాఘ్చీపై కొందరు రాళ్లు విసిరారు. దేశాన్ని అమ్ముకున్న వ్యక్తి అంటూ దూషించారు.కొత్త సుప్రీం లీడర్ ఎక్కడ? ఖమేనీ వారసుడిగా బాధ్యతలు స్వీకరించిన మొజ్తబా ఖమేనీ ఇప్పటికీ ప్రజల్లో కనిపించకపోవడం ఊహాగానాలకు తావిచ్చింది. ఆయన నిజంగా పాలనను నడిపిస్తున్నారా? లేక ఆయన పేరుతో ఇతర నేతలే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధ్యక్షుడు పెజెష్కియన్, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అరాఘ్చీలు మోజ్తాబా ఖమేనీ ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.మొజ్తబాపై తిరుగుబాటుఅమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఇరాన్ నిపుణుడు అరాష్ అజీజీ వ్యాఖ్యానిస్తూ.. మొజ్తబా ఖమేనీ ప్రజల్లో కనిపించకపోవడంతో ఘాలిబాఫ్, ఆయన మిత్రులే పాలనను నడిపిస్తున్నారనే అభిప్రాయం బలపడింది. దీంతో అతివాదులు మొజ్తబాపై తిరుగుబాటు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు అని అన్నారు. అతివాది ఎంపీ మహ్మూద్ నబవియన్ కూడా సోషల్ మీడియాలో ఇరాన్ ప్రభుత్వం తిరుగుబాటు ప్రయత్నాలు జరుగుతున్నాయా?" అంటూ ప్రశ్నిస్తూ, తర్వాత ఖమేనీ రక్తానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. తిరుగుబాటు దారుల్ని అడ్డుకుంటాం అని ప్రకటించారు.అధ్యక్షుడికి బహిరంగ బెదిరింపులు రాజకీయ విమర్శలు వ్యక్తిగత బెదిరింపుల దాకా వెళ్లాయి. ఐఆర్జీసీతో అనుబంధం ఉన్న మతగాయకుడు మొహమ్మద్ అలీ బఖ్షీ.. సుప్రీం లీడర్ ఆదేశాలు అమలు చేయకపోతే కత్తి మీ గొంతుకే చేరుతుంది. మీకు నరకం చూపిస్తాం’ అంటూ అధ్యక్షుడు పెజెష్కియన్ను హెచ్చరించారు. అయినప్పటికీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అమెరికాతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఎక్కువకాలం నిలవలేదు. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నౌకలపై దాడులు ప్రారంభించడంతో అమెరికా ప్రతిదాడులకు దిగింది. దీంతో అతివాదులు అమెరికాతో కుదిరిన ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయాలని, అమెరికా-ఇజ్రాయెల్లపై మరింత దూకుడుగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు.మాజీ విదేశాంగ మంత్రి మనూచెహర్ మొట్టాకీ కూడా ప్రాంతంలోని ఏదైనా అమెరికా సైనిక స్థావరంపై దాడి చేసి వందమంది అమెరికా సైనికులను బందీలుగా తీసుకురావాలి అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవలి పరిణామాల్లో అతివాదుల ప్రభావాన్ని తగ్గించే చర్యలు కనిపిస్తున్నాయి. ఐఆర్జీసీ మద్దతురాలు ఎంపీ మహ్మూద్ నబవియన్ను పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ నుంచి తొలగించారు. అమెరికా ఒప్పందాన్ని వ్యతిరేకించిన మరో సభ్యుడినీ తప్పించారు.జర్మనీకి చెందిన భద్రతా విశ్లేషకుడు హమీద్రెజా అజీజీ అభిప్రాయం ప్రకారం.. ఘాలిబాఫ్ హార్డ్లైన్ వర్గాలను పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారి అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగంగా బయటపడుతున్నాయి. దేశంలో అస్థిరత పెరుగుతున్న వేళ ఈ వర్గాలు ప్రభుత్వానికి భారంగా మారుతున్నాయి అని పేర్కొన్నారు.ఒకే లక్ష్యం.. కానీ విభేదాలు అంతర్గతంగా తీవ్ర విభేదాలు ఉన్నప్పటికీ ఇరాన్ నాయకత్వం మొత్తం ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అమెరికా ఆంక్షల నుంచి ఉపశమనం పొందడం, హర్మూజ్ జలసంధిపై తన ఆధిపత్యాన్ని కొనసాగించడం, దేశంలో అధికారాన్ని నిలబెట్టుకోవడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. అయితే వాటిని సాధించడానికి అమెరికాతో రాజీ పడాలా? లేక సైనికంగా ప్రతిస్పందించాలా? అన్న విషయంలోనే అధికార వర్గాల్లో తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. 🔻حمله مخالفان توافق به عراقچی با شعار:«مرگ بر وطنفروش خائن» «بیشرف، بیشرف»🔻شعار «مرگ بر سازشگر» در حضور پزشکیان در مراسم تشییع جنازه خامنهای.🔻 Opponents of the agreement attack Araqchi with the slogans: "Death to the traitorous sellout!" and "Dishonorable!… pic.twitter.com/ThBhZLP1tf— Siamak Tadayon Tahmasbi (@SiamakTadayonT) July 6, 2026 -
ఇరాన్ భీకర దాడి.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి
-
కొనసాగిన దాడుల పర్వం
దుబాయ్: ఇరాన్తో తాత్కాలిక శాంతి ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజు నుంచి వరుసగా ఏడోరోజూ ఇరాన్పై అమెరికా సేనలు రాత్రిపూట దాడులను శనివారమూ కొనసాగించాయి. దీంతో ఇరాన్వ్యాప్తంగా అమెరికా దాడుల్లో గత ఏడు రోజుల్లో చనిపోయిన ఇరానియన్ల సంఖ్య 50కి పెరిగిందని ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం ప్రకటించింది. జూన్ 27 తర్వాత అమెరికా మొదలెట్టిన భీకర దాడుల్లో ఇప్పటిదాకా 500 మందికిపైగా గాయపడ్డారు. శనివారం సైతం ఇరాన్లోని మౌలిక వసతులు, సైనిక లక్ష్యాలపై అమెరికా పదులకొద్దీ ఆత్మాహుతి డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడి భారీ స్థాయిలో విధ్వంసం సృష్టించింది. నిఘా ప్రాంతాలు, సాయుధ ఉపకరణాలు, రహదారులు, వంతెనలు, భూగర్భ ఆయుధాగారాలు, నావికాదళ సామర్థ్యాలను నాశనంచేశామని శనివారం ఉదయం అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అమెరికా దాడిలో దక్షిణ ఇరాన్లోని డీసాలినేషన్ ప్లాంట్ ధ్వంసమైంది.దీంతో ఈ ప్లాంట్ నుంచి 20 గ్రామాలకు తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో జనం అల్లాడిపోయారని హార్మూజన్ ప్రావిన్స్ డెప్యూటీ గవర్నర్ ఇస్లాయిల్ దెహస్తానీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిదాడులు ఆరంభించిన ఇరాన్.. దాడులకు ఇరాన్ దీటుగా బదులిచ్చింది. అమెరికా పేట్రేగిపోతున్నా మౌనం దాల్చిన దాని మిత్రదేశాలపై ఇరాన్ క్షిపణులకు పనిజెప్పింది. దీంతో కువైట్లోని నీటి శుద్ధీకరణ(డీసాలిలేషన్)ప్లాంట్, విద్యుత్ఉత్పత్తి కేంద్రాలు పేలుళ్లతో మార్మోగిపోయాయి. చమురుశుద్ధి కర్మాగారంపై దాడిలో పలువురు కువైట్ సిబ్బంది గాయాలపాలయ్యారు. దాడులతో పల విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాల్లో ఉత్పత్తిని వెంటనే నిలిపేశారు. కువైట్లోని డీసాలినేషన్ ప్లాంట్లపై ఇరాన్ దాడిచేయడం వరుసగా ఇది రెండోరోజు. కువైట్ తన తాగునీటి అవసరాల కోసం 90 శాతం డీసాలినేషన్ ప్లాంట్ల మీదనే ఆధారపడుతోంది. ఇరాన్ దాడుల కారణంగా మంటల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురు అగ్నిమాపక సిబ్బంది,కారి్మకులు గాయపడ్డారని కువైట్ ఫైర్ ఫోర్స్ తెలిపింది. క్షిపణులు పడుతుండటంతో ముందు జాగ్రత్తగా విమానాశ్రయాల నుంచి రాకపోకలను కువైట్ నిలిపేసింది. ఇరాక్లోని ఇర్బిల్ నగరంపైనా ఇరాన్ డ్రోన్లను ప్రయోగించింది. ఇరాన్ మిస్సైళ్లను విజయవంతంగా అడ్డుకున్నామని జోర్డాన్ ప్రకటించింది. బహ్రెయిన్లో ముందుజాగ్రత్తగా సైరన్లు మోగించి ప్రజలను ప్రభుత్వం అప్రమత్తంచేసింది. సౌదీ అరేబియా సైతం రెండు ప్రాంతాల్లో హెచ్చరికలగా సైరన్లు మోగించి తర్వాత నిలిపేసింది. అమెరికా సేనలకు ఆశ్రయం కల్పించే ప్రతి పశ్చిమాసియా దేశంపై దాడులు కొనసాగుతాయని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్(ఐఆర్జీసీ) శనివారం పునరుద్ఘాటించింది.మర్చిపోలేని గుణపాఠం చెప్తాం: మొజ్తబా అమెరికాకు ఖమేనీ హెచ్చరిక దుబాయ్: తమ దేశంపై ఇంకా దాడులు కొనసాగిస్తే మర్చిపోలేని గుణపాఠం చెప్తామని అమెరికాను ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ ఘాటుగా హెచ్చరించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. దీన్ని ప్రభుత్వ టీవీ ఛానల్లో చదివి వినిపించారు. తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత నూతన సుప్రీంలీడర్గా నియమితుడైన మొజ్తబా ఖమేనీ ఇప్పటిదాకా బహిరంగంగా ప్రజలకు కనిపించలేదు. మధ్యంతర ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంతకం విలువలేనిది, చెల్లనిది అని మొజ్తబా తేల్చిచెప్పారు. జోర్డాన్పై దాడిలో ఇద్దరు అమెరికా సైనికుల మృతి దుబాయ్: జోర్డాన్లోని తమ స్థావరాలపై ఇరాన్ శనివారం జరిపిన దాడిలో ఇద్దరు సైనికులు చనిపోయారని, ఒకరి జాడ గల్లంతైందని అమెరికా సైన్యం ప్రకటించింది. గత కొంతకాలంగా జరుగుతున్న ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికులు చనిపోవడం ఇదే తొలిసారి. ఇరాన్ నుంచి దూసుకొచ్చిన బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను నిలువరించేందుకు అమెరికా, జోర్డాన్ సైనిక సిబ్బంది ప్రయత్నిస్తుండగా తమ సైనికులు ప్రాణాలు కోల్పోయారని అమెరికా శనివారం పేర్కొంది. ఇరాన్ దాడుల్లో నలుగురు సైనికులు సైతం గాయపడ్డారు. వాళ్లకు సమీప ఆస్పత్రుల్లో ప్రథమ చికిత్స చేసి డిశ్చార్జ్చేశారు. చనిపోయిన ఇద్దరు అమెరికా సైనికుల పూర్తి వివరాలను సైన్యం ఇంకా బయటపెట్టలేదు. -
జోర్డాన్లో ఇరాన్ క్షిపణుల మోత.. ఇద్దరు అమెరికా సైనికులు బలి
అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం రద్దు కావడంతో పశ్చిమాసియాలో మళ్లీ పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. జోర్డాన్లో శుక్రవారం ఇరాన్ జరిపిన బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్ల దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మరణించారు. ఈ విషయాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్ అధికారికంగా ధ్రువీకరించింది. మరో సైనికుడు ప్రస్తుతం గల్లంతైనట్లు సెంట్రల్ కమాండ్ తెలిపింది. దీంతో ఈ యుద్దంలో ఇప్పటివరకు మరణించిన అమెరికా సైనికుల సంఖ్య 16కు చేరింది. అంతేకాకుండా 430 మందికి పైగా గాయపడ్డారు. కాగా ఇరాన్ తాజా దాడుల్లో గాయపడిన నలుగురు అమెరికా సైనికులను జోర్డాన్లోని ఆసుపత్రికి తరలిచారు. వారు చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు.ఇరాన్ సుప్రీం లీడర్ హెచ్చరిక..మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్పై దాడులను ఇలాగే కొనసాగిస్తే అమెరికాకు తగిన గుణపాఠం చెబుతామని ఎక్స్ వేదికగా ఖమేనీ పేర్కొన్నారు. కాగా ఇరాన్పై అమెరికా తమ దాడులను కొనసాగిస్తోంది. శనివారం తెల్లవారుజామున అమెరికా సైన్యం ఇరాన్లోని నిఘా కేంద్రాలు, సైనిక లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, ఆయుధ నిల్వలపై క్షిపణులతో విరుచుకుపడింది. ఇది వరుసగా ఏడో రోజు కావడం గమనార్హం. దీనికి ప్రతికారంగా ఇరాన్.. వైట్, ఇరాక్, బహ్రెయిన్, జోర్డాన్, సౌదీ అరేబియాలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఎటాక్ చేస్తోంది. -
"రక్తానికి రక్తం" రగిలిపోతున్న ఇరాన్
టెహ్రాన్: పశ్చిమాసియా యుద్ధం ముగింపు దశకు చేరుకుంటుందనే తరుణంలో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా ఇరాన్లో ట్రంప్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్గా చేసుకొని ఓ వివాదాస్పద హోర్డింగ్ను ప్రదర్శనకు ఉంచారు. మధ్య టెహ్రాన్లోని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన ఈ భారీ బ్యానర్పై "రక్తానికి రక్తం" అనే నినాదాన్ని పర్షియన్ భాషలో రాశారు.ఇరాన్ ప్రతీకార జ్వాలతో రగిలిపోతుంది. తమ దేశాధినేత మాజీ సుప్రీంలీడర్ ఆయతుల్లా ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో చంపడంతో ఆ దేశం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు ట్రంప్ను చంపేస్తామంటూ నినాదాలు హోరెత్తాయి. తాజాగా టెహ్రాన్లో ట్రంప్ను చంపేస్తామంటూ బ్యానర్ వెలిసింది. ఈ బ్యానర్లో వెనుక భాగంలో అమెరికా అధ్యక్ష భవనం 'వైట్ హౌస్' తగలబడుతున్నట్లు చూపించారు. దాని ముందర అమెరికా ఫ్లాగ్తో కప్పబడిన శవపేటికలపైన డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్తో పాటు ఆయన ఐదుగురు పిల్లలు—ఇవాంకా, డాన్ జూనియర్, ఎరిక్, టిఫానీ, మరియు బారన్ ట్రంప్ల చిత్రాలను ముద్రించారు.ట్రంప్ను హెచ్చరిస్తూ ఇరాన్ ఇలాంటి హోర్డింగ్ను ఏర్పాటు చేయడం ఇది రెండవసారి. అంతకుముందు టెహ్రాన్లోని ఎంగెలాబ్ స్క్వేర్లో ట్రంప్ శవపేటికలో పడుకుని ఉన్నట్లు ఒక బిల్ బోర్డ్ను ఏర్పాటు చేశారు. ఆ చిత్రంలో ట్రంప్ జుట్టు చెల్లాచెదురై, కళ్ళు, నోరు మూసి ఉండి, ఎర్రటి టైపై చేతులు పెట్టుకుని శవపేటికలో ఉన్నట్లు చూపించారు.వ్యూహాత్మక ప్రచారంటెహ్రాన్లోని వలియాస్ర్ స్క్వేర్లో ఉండే ఇలాంటి పెద్ద పెద్ద మురల్స్ (గోడచిత్రాలు) అన్నింటినీ 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్'తో సంబంధం ఉన్న 'ఓజ్ ఆర్ట్స్ అండ్ మీడియా ఆర్గనైజేషన్' రూపొందిస్తుంది. ఫిబ్రవరి చివరలో అమెరికా-ఇజ్రాయెల్ దళాలతో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, ఇరాన్ తన సంప్రదాయ విప్లవాత్మక ఇమేజరీ, యుద్ధ స్మారకాలు, లాజికల్ సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి టెహ్రాన్లోని బిజీ రోడ్లపై ఇలాంటి భారీ బిల్ బోర్డులను వాడుతోంది.మోజ్తబా ఖమేనీ హెచ్చరికగత వారం ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ తన టెలిగ్రామ్ ఛానల్లో మాట్లాడుతూ, తన తండ్రి హత్యకు ప్రతీకారం ఖచ్చితంగా తీర్చుకుంటామని ప్రకటించారు. "ఈ ప్రతీకారం మా దేశం యొక్క డిమాండ్. దీనికి కారణమైన నేరగాళ్లు (పై స్థాయి నుండి కింది స్థాయి వరకు అందరి పేర్లు మాకు తెలుసు) తమ బెడ్లపై ప్రశాంతంగా ప్రాణాలు వదలలేరు. ఆ కోరిక తీరకుండానే వారు సమాదుల్లోకి వెళ్తారు" అని హెచ్చరించారు.ఇరాన్ను బాంబులతో ముంచెత్తండి: ట్రంప్మరోవైపు, ఇరాన్ తనను ఒకవేళ విజయవంతంగా హత్య చేస్తే, ఆ దేశాన్ని ఊహించని స్థాయిలో బాంబులతో ముంచెత్తాలని డొనాల్డ్ ట్రంప్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. న్యూయార్క్ పోస్ట్ తో ట్రంప్ మాట్లాడుతూ.. "నేను చాలా కాలంగా ఇరాన్ హిట్ లిస్ట్లో ఉన్నాను. ఒకవేళ నాకు ఏదైనా జరిగితే, వారు ఎన్నడూ చూడని స్థాయిలో ఇరాన్పై బాంబుల వర్షం కురిపించాలని నేను ఇప్పటికే స్పష్టమైన సూచనలు ఇచ్చాను" అని పేర్కొన్నారు.రగులుతున్న యుద్ధ జ్యాలలుమరోవైపు ఇరాన్పై పెద్ద ఎత్తున సైనిక దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. ఇందుకోసం అమెరికా రాబోయే రోజుల్లో డజన్ల కొద్దీ రీఫ్యూయలింగ్ (ఇంధనాన్ని నింపే) విమానాలను ఇజ్రాయెల్కు పంపుతోందని ఆక్సియోస్ (Axios) నివేదిక పేర్కొంది. రాబోయే కొద్ది రోజుల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడులకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని అమెరికా, ఇజ్రాయెల్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
ఇరాన్ పై భారీ వైమానిక దాడులకు ట్రంప్ ప్లాన్
వాషింగ్టన్ డీసీ: ఇరాన్పై పెద్దఎత్తున దాడులకు ట్రంప్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం అందుతోంది.ఈ మేరకు వైట్హౌస్లో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి దేశానికి చెందిన మౌలిక సదుపాయాలు, సైనిక స్థావరాలే టార్గెట్గా దాడులు జరపాలని అందుకు గానూ పెద్దఎత్తున గగనతల ఇంధన సరఫరా విమానాలను ఇజ్రాయెల్ పంపినట్లు ఆక్సియోస్ కథనాలు ప్రచురించింది. కాగా ఇదివరకే ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ సమీపంలో ఉన్న బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయం ,దక్షిణ ఇజ్రాయెల్లోని రామోన్ ఎయిర్పోర్టులలో పదుల సంఖ్యలో ఇంధన సరఫరా విమానాలున్నాయి. అయితే వీటికి అదనంగా భారీగా రీప్యూయలింగ్ విమానాలను పంపేందుకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.దాడులు ప్రధానంగా అణుఇంధన కేంద్రాలు, విద్యుత్ ప్లాంట్లు, ఇతర వ్యూహాత్మక లక్ష్యాలపై ఉండనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ట్రంప్ తుది నిర్ణయం తీసుకోనప్పటికీ దాడికి ప్రణాళికలు ఖచ్చితంగా రచించినట్లు తెలుస్తోంది. సుదీర్ఘ దూరం ప్రయాణించి దాడులు చేసే యుద్ధ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపడానికి ఈ ట్యాంకర్ విమానాలు చాలా కీలకం.కాగా ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ఇటీవల పూర్తిగా విఫలమైంది. దీంతో దౌత్యపరమైన చర్చలు ఆగిపోయి, మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, అమెరికా దేశాలు ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇరాన్ సైతం ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. -
డొనాల్డ్ ట్రంప్ను హతమారిస్తే. రూ. 96కోట్లు
ఇరాన్పై వరుసగా ఏడవ రాత్రి కూడా అమెరికా దాడులు నిర్వహించింది. ఇరాన్ సైనిక సామర్థ్యాలను మరింత బలహీనపరిచేలా ఈ దాడులు జరిగాయని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) శుక్రవారం నాటి ప్రకటనలో పేర్కొంది. మరోవైపు అమెరికా యుద్ధ విమానాల్ని కూల్చి వేశామని, మరికొన్నింటికి తీవ్ర నష్టాన్ని కలిగించామని ఇరాన్ గురువారం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇరాన్ మద్దతు ఉన్న ఇరాకీ మిలీషియా (సాయుధ ముఠాల) సంకీర్ణ కూటమి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్ల (సుమారు 96.28 కోట్ల రూపాయలు) బహుమతిని ఇస్తామని ప్రకటించింది. ఈ ప్రకటన రగులుతున్న ఇప్పటికే యుద్ధ జ్వాలలకు మరింత ఆజ్యం పోసింది. డొనాల్డ్ ట్రంప్ను చంపిన వారికి లేదా ఆ ఆపరేషన్కు నిధులు సమకూర్చిన వారికి, సహాయం చేసిన వారికి ఈ బహుమతి అందుతుందని 'ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్' (IRI) తెలిపింది. ఈ 10 మిలియన్ డాలర్ల మొత్తాన్ని తమ సభ్యులు, మద్దతుదారుల నుండి సేకరించిన విరాళాల ద్వారా సమకూర్చినట్లు వారు పేర్కొన్నారు. అయితే దీనిని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు చూపలేదు.ఇటీవల వైట్ హౌస్లో ఇరాక్ ప్రధాన మంత్రి అలీ అల్-జైదీతో జరిగిన సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ... 2020లో ఇరాన్ అగ్ర సైనిక కమాండర్ మేజర్ జనరల్ ఖాసీం సులేమానీ, ఇరాకీ మిలీషియా నాయకుడు అబూ మహదీ అల్-ముహందిస్లను చంపడంలో తన పాత్రను బహిరంగంగా ప్రస్తావించారు. దీనికి ప్రతిచర్యగా ఐఆర్ఐ ఈ ప్రకటన చేసింది.ఇరాక్, సిరియా , గల్ఫ్ ప్రాంతంలోని ఇతర చోట్ల ఉన్న అమెరికా దళాలు, దౌత్య కార్యాలయాలు మరియు మిత్రదేశాలపై వందలాది డ్రోన్, రాకెట్, క్షిపణి దాడులకు ఈ గ్రూపులే కారణమని అమెరికా ఆరోపిస్తోంది. ప్రస్తుత అమెరికా-ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో, ఇరాన్ సరిహద్దుల వెలుపల తన సైనిక ఒత్తిడిని కొనసాగించడానికి టెహ్రాన్కు ఈ మిలీషియాలు ప్రధాన ఆయుధాలుగా మారాయి. -
ఇరాన్ దెబ్బకు ఆరు దేశాలు అలర్ట్!
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు వరుసగా ఏడో రాత్రికి చేరుకోగా హర్మూజ్ జలసంధి చుట్టూ సైనిక కదలికలు, నౌకా రవాణా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం.. దక్షిణ ఇరాన్లోని హర్మూజ్గాన్ ప్రావిన్స్పై అమెరికా దాడుల్లో ముగ్గురు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారు. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) మాత్రం ఈ దాడుల లక్ష్యం ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమేనని పేర్కొంది.ఆధిపత్య పోరు..ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి ఇప్పుడు ఘర్షణకు కేంద్రంగా మారింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) రెండు చమురు ట్యాంకర్లు మైన్ల కారణంగా పేలిపోయాయని, కొన్ని నౌకల రాకపోకలను అడ్డుకున్నామని ప్రకటించింది. అయితే అమెరికా ఈ వాదనలను ఖండించింది. అమెరికా, ఇరాన్ రెండూ ఈ వ్యూహాత్మక జలమార్గంపై తమ ప్రభావాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొన్ని నౌకలు మాత్రం పరిమిత స్థాయిలో రాకపోకలు సాగిస్తున్నట్లు సమాచారం.ఇరాన్ హెచ్చరిక..అమెరికా దాడులు ఇలాగే కొనసాగితే తమ ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని ఇరాన్ సైనిక అధికారులు హెచ్చరించారు. తమ వ్యూహాన్ని పూర్తిగా మార్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సీనియర్ సైనిక సలహాదారు మేజర్ జనరల్ మొహ్సెన్ రెజాయి హెచ్చరించారు. ఇరాన్ ఇక సమాన స్థాయి ప్రతీకార చర్యలకే పరిమితం కాదు.. ఎలాంటి రాజకీయ సరిహద్దు కూడా సురక్షితంగా ఉండదు అని ఆయన హెచ్చరించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. ఈ వ్యాఖ్యలు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. ఇప్పటివరకు ఇరాన్ ప్రధానంగా అమెరికా స్థావరాలు, మిత్రదేశాలపై ప్రతీకార చర్యలకు దిగుతామని ప్రకటించగా, తాజా హెచ్చరికతో దాడుల పరిధి విస్తరించే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ తన దాడులను కేవలం అమెరికా సైనిక లక్ష్యాలకే పరిమితం చేయకపోవచ్చని సంకేతాలు ఇస్తోంది.గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిత్రదేశాలు, సైనిక స్థావరాలు మరింత అప్రమత్తంగా మారే అవకాశం ఉంది.గల్ఫ్ దేశాలకు టెన్షన్.. ఇరు దేశాల మధ్య యుద్ధ ఘర్షణ ఇప్పుడు సరిహద్దులను దాటి గల్ఫ్ ప్రాంతానికి విస్తరిస్తోంది. తాజాగా కువైట్లో కీలక మౌలిక సదుపాయాలపై దాడులు జరిగాయని అధికారులు తెలిపారు. ఖతార్, బహ్రెయిన్, జోర్డాన్ ప్రాంతాల్లోనూ క్షిపణులు, డ్రోన్ దాడుల ఆరోపణలు వచ్చాయి. కొన్ని దాడులు అమెరికా మిత్రదేశాలపై జరిగాయని ఇరాన్ ప్రకటించగా, వాటిలో కొన్ని వాదనలను ఆయా దేశాలు ఖండించాయి. దీంతో, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమన్ దేశాలు భద్రతా చర్యలను మరింత కఠినతరం చేస్తున్నాయి.కువైట్పై ప్రభావంఇరాన్ దాడుల్లో కువైట్లోని కీలక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలపై ప్రభావం పడటంతో ప్రజలను ఇంధనం, విద్యుత్ వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు.ఖతార్లో అప్రమత్తతగల్ఫ్లో అతిపెద్ద అమెరికా సైనిక స్థావరాల్లో ఒకటైన అల్ ఉదీద్ ఎయిర్ బేస్ ఉన్న ఖతార్పై కూడా ఉద్రిక్తతల ప్రభావం కనిపిస్తోంది. ఇరాన్ క్షిపణి దాడుల ప్రయత్నాలను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని ఖతార్ తెలిపింది.బహ్రెయిన్కు ప్రత్యేక సవాల్బహ్రెయిన్లో అమెరికా నౌకాదళానికి చెందిన కీలక స్థావరం ఉంది. దీంతో ఈ చిన్న దేశం వ్యూహాత్మకంగా అత్యంత సున్నిత ప్రాంతంగా మారింది. గల్ఫ్ భద్రతపై ఆందోళనలు పెరిగాయి.సౌదీ అరేబియా, యూఏఈ పరిస్థితిగల్ఫ్లో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారులైన సౌదీ అరేబియా, యూఏఈలు తమ చమురు మౌలిక సదుపాయాల రక్షణపై దృష్టి పెట్టాయి. గతంలో చమురు కేంద్రాలపై జరిగిన దాడుల అనుభవంతో, ఇప్పుడు డ్రోన్లు, క్షిపణుల ముప్పును ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉన్నాయి.ఒమన్కు పెరుగుతున్న ప్రాధాన్యంహర్మూజ్ జలసంధికి సమీపంలో ఉన్న ఒమన్ ఈ సంక్షోభంలో కీలక పాత్రలో ఉంది. నౌకా రవాణా భద్రత, సముద్ర మార్గాల రక్షణపై దృష్టి పెట్టింది. -
ఇరాన్పై నిప్పుల వర్షం
దుబాయ్: పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య దాడులు నానాటికీ తీవ్రతరం అవుతున్నాయి. తాత్కాలిక శాంతి ఒప్పందం అకస్మాత్తుగా ముగిసిన తర్వాత రెండు దేశాలు పరస్పరం కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ప్రధానంగా హార్మూజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగుతున్నాయి. హార్మూజ్పై టెహ్రాన్ పట్టును సడలించేలా ఒత్తిడి పెంచడానికి బలప్రయోగం తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగా గురువారం అర్ధరాత్రి తర్వాత అమెరికా తన వైమానిక దాడుల పరంపరను మరింత ఉధృతంచేసింది. ఇరాన్లో కీలక వంతెనలు, విద్యుత్ వ్యవస్థలపై దాడి చేయడంతోపాటు గల్ఫ్ ఆఫ్ ఒమన్లో చాబహార్ ఓడరేవు వద్ద ముఖ్యమైన నిఘా టవర్ను కూల్చివేసింది. ఇరాన్ సైతం వెంటనే ప్రతిదాడికి దిగింది. ఖతార్, కువైట్, జోర్డాన్పై క్షిపణులు ప్రయోగించింది. బహ్రెయిన్, ఒమన్, సిరియాలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. కువైట్లో విద్యుత్, నీటి శుద్ధి ప్లాంట్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. పెద్ద సంఖ్యలో విద్యుత్ ఉత్పాదన యూనిట్లకు నష్టం వాటిల్లిందని కువైట్ ఆందోళన వ్యక్తంచేసింది. గల్ఫ్లో అమెరికా యుద్ధ విమానాలను ధ్వంసం చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) ప్రకటించింది. జోర్డాన్లో మోహరించిన అమెరికా యుద్ధ విమానాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి, డ్రోన్ దాడులు జరిపినట్లు స్పష్టంచేసింది. ఈ దాడుల్లో పలు అమెరికన్ యుద్ధ విమానాలు, గగనతల ఇంధన సరఫరా విమానాలు ధ్వంసం కాగా, మరికొన్ని తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొంది. అయితే, తమ భూభాగం మీదుగా వచ్చిన మూడు క్షిపణులను అడ్డుకొని, కూల్చివేసినట్లు జోర్డాన్ సైన్యం తేల్చిచెప్పింది. విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలి ఇరాన్లోని దక్షిణ హార్మూజ్గాన్ ప్రావిన్స్లో వంతెనలపై అమెరికా సైన్యం వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో కనీసం ఏడుగురు మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ టీవీ వెల్లడించింది. హార్మూజ్ జలసంధిలో ఇరాన్ తీర నగరమైన బందర్ ఖమీర్పైనా దాడులు జరిగాయి. ప్రధాన రహదారులు, రైల్వే వంతెనలను కూడా విడిచిపెట్టలేదు. ప్రధాన రేవు పట్టణమైన బందర్ అబ్బాస్, రాజధాని టెహ్రాన్ మధ్య అనుసంధానం లేకుండా చేయడమే అమెరికా లక్ష్యంగా కనిపిస్తోంది. తమ దేశంలో విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడులు జరిగినట్లు ఇరాన్ అంగీకరించింది. దక్షిణ ప్రావిన్స్లలో ప్రజలు విద్యుత్ను చాలా పొదుపుగా వాడుకోవాలని ఇరాన్ ఇంధన మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. టార్గెట్ చాబహార్ పోర్టు! ఇరాన్లో పదుల సంఖ్యలో లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు అమెరికా సైనిక దళాల సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. వరుసగా ఆరో రోజు ఇరాన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్లు వెల్లడించింది. అమెరికా వైమానిక దాడిలో చాబహార్ ఓడరేవు వద్ద ఒక టవర్ కూలిపోయినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ తెలియజేసింది. ఓడరేవులోకి వచ్చే నౌకలను ఈ టవర్ నుంచే పర్యవేక్షిస్తారు. నిఘా టవర్ కూలిపోతున్న ఫొటోను అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. భారత ప్రభుత్వ సహకారంతో ఇరాన్ నిర్వహిస్తున్న చాబహార్ ఓడరేవు అమెరికా దాడులకు పదేపదే లక్ష్యంగా మారుతోంది. ఇక్కడ దాడులు జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా సైతం ధ్రువీకరించింది. శుక్రవారం ఉదయం 6 గంటల కల్లా అమెరికా దాడుల కారణంగా ఇరాన్లో కనీసం 38 మంది మరణించారని, 400 మందికి పైగా గాయపడ్డారని ఆరోగ్య శాఖ ప్రతినిధి హొస్సేన్ కెర్మన్పూర్ వెల్లడించింది. కుర్దిష్ రెబెల్ గ్రూప్పై ఇరాన్ దాడులు ఇరాన్ దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలంటూ ఖతార్ ప్రభుత్వం తమ పౌరులను రెండుసార్లు హెచ్చరించింది. ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడానికి గగనతల రక్షణ వ్యవస్థలను సన్నద్ధం చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలకు ఖతార్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్ ప్రయోగించిన మూడు క్షిపణులను మధ్యలోనే అడ్డుకున్నట్లు జోర్డాన్ సైన్యం ప్రకటించింది. మరోవైపు ఉత్తర ఇరాన్లోని కుర్దిష్ రెబెల్ గ్రూప్ ‘కొమాలా’పై దాడులు జరిగాయి. ఈ ఘటనలో కనీసం తొమ్మిది మంది మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ఇరాన్ సైన్యమే ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న ఒక ట్యాంకర్ దాడికి గురైందని బ్రిటిష్ సైన్యం తెలిపింది. -
అమెరికా యుద్ధ విమానాల్ని కూల్చేశాం, భారీ నష్టం : ఇరాన్ ప్రకటన
మధ్యప్రాచ్యంలో యుద్ధం మళ్లీ ఉద్రిక్త స్థాయికి చేరింది. ఇరాన్పై అమెరికా రాత్రికి రాత్రే జరిపిన వైమానిక దాడులతో ఇరాన్ వార్ మరింత ముదిరింది. ఎనిమిది మంది ప్రాణాలు తీసిన అమెరికా దాడులకు ప్రతీకారంగా జోర్డాన్లో ఉన్న అమెరికా సైనిక విమానాలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. జోర్డాన్లో మోహరించిన అమెరికాకు చెందిన పలు యుద్ధ విమానాలను, ఇంధనం నింపే విమానాలను (Refuelling aircraft) పూర్తిగా ధ్వంసం చేశామని ఇరాన్ ప్రకటించడం కలకలం రేపింది.ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటనమధ్యప్రాచ్య ప్రాంతీయ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచీ ఇరాన్ మొదటిసారిగా తూర్పు సిరియాపై క్షిపణి దాడులు చేసింది. ఇరాన్లోని ఇరాన్షహర్లో తన సైనికుల మరణానికి ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ప్రకటించింది. తాము అనేక అమెరికా ఇంధన సరఫరా విమానాలు, యుద్ధ విమానాలను ధ్వంసం చేశామని, మరికొన్నింటికి తీవ్ర నష్టం కలిగించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు అమెరికా ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకోవాలని జోర్డాన్ ప్రజలకు పిలుపునిచ్చింది. అయితే, ఇరాన్కు చెందిన 3 క్షిపణులను తాము కూల్చివేసామని, తమకు ఎలాంటి నష్టం జరగలేదని జోర్డాన్ సైన్యం పేర్కొన్న తరువాత ఈ ప్రకటన రావడం గమనార్హం. ఇరాన్షహర్లో ఇరాన్ సైనికుల హత్యకు ప్రతీకారంగా, సిరియా, జోర్డాన్, ఇరాక్ సరిహద్దుల్లోని 'అల్-తాన్ఫ్' లో ఉన్న అమెరికా స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ సెంటర్పై కూడా దాడి చేసినట్లు ఐఆర్జిసి తెలిపింది. అయితే, తాము ఫిబ్రవరిలోనే ఆ బేస్ నుండి వైదొలిగామని అమెరికా గతంలో ప్రకటించిందిఇతర గల్ఫ్ దేశాలపై దాడులు అమెరికాకు మిత్రదేశాలుగా ఉన్న ఇతర గల్ఫ్ దేశాలపై కూడా ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఖతార్ఫై క్షిపణి దాడులు చేయడంతో పాటు, కువైట్లోని అత్యంత కీలకమైన విద్యుత్, నీటి శుద్ధి కర్మాగారాన్ని ఇరాన్ దెబ్బతీసింది. ఉత్తర ఇరాక్లోని ఇర్బిల్, సులేమానియా ప్రాంతాలపై కూడా దాడులు జరిగాయి. ఇరాన్ అసమ్మతి గ్రూప్ 'కొమాలా'ను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడుల్లో కనీసం 9 మంది మరణించారు.ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్ఇరాన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్శుక్రవారం ఇరాన్ జరిపిన పలు వైమానిక దాడులను బహ్రెయిన్ సాయుధ బలగాలు తమ వైమానిక రక్షణ వ్యవస్థల (Air defence systems) ద్వారా విజయవంతంగా అడ్డుకొని, ధ్వంసం చేశాయి. బహ్రెయిన్లోని పౌరులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేయడాన్ని అంతర్జాతీయ మానవతా చట్టాల ఉల్లంఘనగా బహ్రెయిన్ సైన్యం తీవ్రంగా ఖండించింది. అలాగే కూల్చివేసిన క్షిపణుల శిథిలాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.కాగా గత నెలలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా కుప్పకూలిపోవడంతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకోవాలని ఆదేశించారు. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టును సడలించేందుకు అమెరికా.. ఇరాన్లోని కీలక ఓడరేవులు, వంతెనలు, విద్యుత్ గ్రిడ్లను ధ్వంసం చేసింది. ఇరాన్ తీరప్రాంత నగరాలైన అహ్వాజ్, బుషెహర్, బందర్ అబ్బాస్, కిష్ ఐలాండ్ వంటి ప్రాంతాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. రైల్వే లైన్లు, విమానాశ్రయాలు దెబ్బ తినడంతో ఇరాన్ లో భారీగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో విద్యుత్తునుపొదుపగా వాడాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ దాడుల్లో ఇరాన్ వైపు డజన్ల కొద్దీ ప్రజలు మరణించగా, వందలాది మంది గాయపడినట్లు ఇరాన్ అధికారిక వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: ఆ రూ. 40 వేలతోనే : రామమందిర్ విరాళాల గోల్మాల్ గుట్టు -
ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ కీలక ప్రకటన
-
చిన్నారుల ఆసుపత్రులను సైతం వదలరా..?
టెహ్రాన్: అమెరికా,ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాలు పరస్పరం దాడులకు తెగబడుతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నపిల్లలకు వైద్యచికిత్స చేస్తున్న కేంద్రాలపై అమెరికా దాడులు జరిపిందని అది అత్యంత అనాగరికత చర్యని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేశారు.అమెరికా చేసిన దాడులతో ఆసుపత్రి ప్రాంగణంలో భయానక వాతావరణం నెలకొందన్నారు. ఆసుపత్రిలోని చిన్నపిల్లల క్యాన్సర్ చికిత్స విభాగంపై ఈదాడుల ప్రభావం పడిందని క్యాన్సర్ రోగులకు, ముఖ్యంగా చిన్నపిల్లలకు కీమోథెరపీ చికిత్స అందించే ఈ ఆసుపత్రిని ఖాళీ చేయించాల్సి వచ్చింది.ఈ అంశమై ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బకాయి మాట్లాడుతూ ఈ దాడి "ఆరోగ్య సంరక్షణ కేంద్రాలపై ఇజ్రాయెల్ జరిపిన క్రూరమైన దాడులను గుర్తుకు తెస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నపిల్లలకు ఈ దాడి తీవ్ర వేదనను, ఆందోళనను కలిగించింది.వెంటనే కీమోథెరపీ చేయించుకుంటున్న211 మంది రోగులను ఆసుపత్రి నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించాం. ఇది తమ ప్రాణాల కోసం వీరోచితంగా పోరాడుతున్న చిన్నారులపై జరిగిన ఈ దాడి అత్యంత అమాయకులైన మానవులపై జరిగిన ఒక పిరికిపంద యుద్ధ నేరం " అని ఎక్స్ వేదికగా ఆయన మండిపడ్డారు."మానవ హక్కుల గురించి నిరంతరం నీతులు చెప్పే దేశాలు, ఆసుపత్రులు. ఆరోగ్య కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడాన్ని చూసీచూడనట్లు నటిస్తున్నాయి. అలాంటి వారు తమ నైతిక విశ్వసనీయతను ఎప్పుడో పూర్తిగా కోల్పోయారు," అని మండిపడ్డారు.ఇరాన్ అంతటా పేలుళ్లు - ప్రాణనష్టంఅల్ జజీరా నివేదిక ప్రకారం.. ఇరాన్లోని కెస్మ్ ఐలాండ్, బందర్ అబ్బాస్ సిరిక్ , చబహార్ , కొనారక్, రాస్క్ సిటీ,సహా పలు ప్రాంతాలపై అమెరికా దాడులతో తెగబడింది. అదే విధంగా ఇరాన్ ఆర్మీ స్థావరాలపై ఏకకాలంలో అమెరికా విరుచుకపడుతుంది. ఈ దాడిలో కనీసం ఏడుగురు సైనికులు మరణించారని, దేశవ్యాప్తంగా వందలాది మంది గాయపడ్డారని ఇరాన్ అధికారులు తెలిపారు. అమెరికా దాడుల వల్ల ఇప్పటివరకు ఇరాన్లో కనీసం 35 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారని టెహ్రాన్ వెల్లడించింది. -
పాక్కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇరాన్ కొత్త ఎత్తుగడ!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర మలుపు తిరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా ఇరాన్ విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే.. ఎర్ర సముద్రానికి ప్రవేశ ద్వారమైన బాబ్ అల్-మందెబ్ జలసంధిని మూసివేసేందుకు సిద్ధంగా ఉండాలని యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ సూచించింది!. ఈ సమాచారం బయటకు రావడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లతో పాటు ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు పెరిగాయి.రాయిటర్స్ కథనం ప్రకారం.. ఇప్పటికే హౌతీలు క్షిపణులు, డ్రోన్లను బాబ్ అల్-మందెబ్ ప్రాంతానికి సమీపంలో మోహరించి, ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. ఎర్ర సముద్ర మార్గం కూడా దెబ్బతింటే ప్రపంచ చమురు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.బాబ్ అల్-మందెబ్ జలసంధి(Bab al-Mandab Strait) ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటి. ఎర్ర సముద్రాన్ని ఏడెన్ గల్ఫ్తో అనుసంధానించే ఈ జలసంధి మీదుగానే ఆసియా-యూరప్ మధ్య పెద్దఎత్తున చమురు, సహజవాయువు, ఇతర వాణిజ్య సరకు రవాణా జరుగుతుంది. ఈ మార్గం మూసివేయబడితే నౌకలు ఆఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా సుదీర్ఘ మార్గంలో ప్రయాణించాల్సి వస్తుంది. దీంతో రవాణా ఖర్చులు, బీమా ప్రీమియాలు పెరిగి అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో హౌతీలను వ్యూహాత్మక ఒత్తిడి సాధనంగా ఉపయోగించేందుకు టెహ్రాన్ ప్రయత్నిస్తోందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇరాన్పై నేరుగా దాడులు జరిగితే సమాధానం కేవలం తన భూభాగానికే పరిమితం కాకుండా, ప్రాంతంలోని కీలక సముద్ర మార్గాలపై కూడా ప్రభావం చూపించేలా వ్యూహం అమలు చేసే అవకాశాన్ని ఈ పరిణామాలు సూచిస్తున్నాయని భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు... ఇదే సమయంలో ఈ పరిణామాలు పాకిస్థాన్కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. హౌతీలు ఇటీవల సౌదీ అరేబియాపై మళ్లీ క్షిపణి దాడులు ప్రారంభించడంతో ఇస్లామాబాద్లో ఆందోళన పెరిగింది. ఒకవైపు ఇరాన్తో దౌత్య సంబంధాలు కొనసాగించాలని చూస్తున్న పాకిస్థాన్, మరోవైపు సౌదీ అరేబియాతో ఉన్న రక్షణ భాగస్వామ్యాన్ని కూడా కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.గత ఏడాది కుదిరిన రక్షణ ఒప్పందం ప్రకారం వేలాది మంది పాకిస్థాన్ సైనికులు ప్రస్తుతం సౌదీ అరేబియాలో విధులు నిర్వహిస్తున్నారు. యుద్ధం మరింత విస్తరించి సౌదీపై దాడులు తీవ్రతరమైతే.. పాకిస్థాన్ తటస్థంగా ఉండే అవకాశం చాలా తక్కువగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్థాన్ ప్రభుత్వానికి చెందిన ఓ ఉన్నతాధికారి "సౌదీపై దాడి అంటే పాకిస్థాన్పైనే దాడిగా పరిగణిస్తాం. అదే మా రెడ్లైన్" అని రాయిటర్స్కు చెప్పడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.మరోవైపు ఎర్ర సముద్రంలో హౌతీలు నౌకలపై దాడులు ప్రారంభిస్తే.. ప్రపంచ వాణిజ్యంతో పాటు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే హర్ముజ్ జలసంధిలో అంతరాయాల ప్రభావాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్కు.. ఎర్ర సముద్ర మార్గం కూడా దెబ్బతింటే ఇంధన దిగుమతులు, సరకు రవాణా మరింత సంక్షోభంలో పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ప్రస్తుతం పరిస్థితి పూర్తిస్థాయి ఘర్షణకు దారితీయకపోయినా, ఇరాన్, హౌతీలు, అమెరికా, సౌదీ అరేబియా, పాకిస్థాన్ల ప్రయోజనాలు ఒకే వేదికపై ఢీకొనే పరిస్థితి ఏర్పడుతోంది. బాబ్ అల్-మందెబ్, హర్ముజ్ జలసంధుల భద్రతపై నెలకొన్న అనిశ్చితి ప్రపంచ ఇంధన సరఫరా, సముద్ర వాణిజ్యం, ప్రాంతీయ భద్రతపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశముండటంతో అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను అత్యంత నిశితంగా గమనిస్తోంది. -
ఇరాన్కు అమెరికా గట్టి దెబ్బ.. ‘ప్లాన్ బీ’ అమలు!
టెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పరస్పర దాడుల్లో భాగంగా అమెరికా మరోసారి ఇరాన్పై వైమానిక దాడులు జరిపింది. హర్మూజ్ జలసంధికి సమీపంలోని ఇరాన్ దక్షిణ ప్రాంతంలో కీలక రవాణా మౌలిక సదుపాయాలే లక్ష్యంగా అమెరికా ఈ దాడులు జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అమెరికా జరిపిన తాజా దాడుల్లో రెండు వంతెనలు, ఒక రైల్వే స్టేషన్, ఒక విమానాశ్రయం దెబ్బతిన్నట్లు ఇరాన్ వర్గాలు తెలిపాయి. హర్మూజ్ ప్రావిన్స్లోని వంతెనలపై జరిగిన దాడుల్లో ముగ్గురు మరణించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. దాడుల్లో పలువురు గాయపడినట్లు సమాచారం.వరుసగా ఆరో రోజు దాడులుఅమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) గురువారం రాత్రి కొత్త దాడులను ప్రకటించింది. ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరిచే లక్ష్యంతో ఈ దాడులు కొనసాగిస్తున్నట్లు అమెరికా తెలిపింది. తాజా దాడులు వరుసగా ఆరో రోజు జరుగుతున్న అమెరికా సైనిక చర్యల్లో భాగంగా భావిస్తున్నారు. ఇరాన్లోని బుషెహర్ నగరంలో కూడా రెండు భారీ పేలుళ్లు సంభవించినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా తెలిపింది. బుషెహర్లో ఇరాన్ ఏకైక పౌర అణు విద్యుత్ కేంద్రం ఉంది.BREAKING: US STRIKES ON IRAN SO FAR TONIGHT TARGETED 3 BRIDGES, RAILWAY STATION, POWER STATION & AIRPORT - Bandar Khamir, an important overpass connecting Bandar Abbas to Lar. There were cars on the bridge during the attack, leaving at least 1 dead and several injured.-… pic.twitter.com/dXZy9Lk5vP— Sulaiman Ahmed (@ShaykhSulaiman) July 16, 2026జలసంధిపై ఆందోళనప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాలో అత్యంత కీలకమైన మార్గమైన హర్మూజ్ జలసంధి ప్రస్తుతం ఈ ఘర్షణకు కేంద్రంగా మారింది. ఈ ప్రాంతంలో ఏ చిన్న సైనిక చర్య జరిగినా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు జరిగితే ఈ ప్రాంతంలోని కీలక వసతులపై ప్రతీకార చర్యలు తీసుకుంటామని ఇరాన్ గతంలోనే హెచ్చరించింది.ఇరాన్ ప్రతిదాడులుఅమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కూడా క్షిపణి దాడులు జరిపినట్లు ప్రకటించాయి. జోర్డాన్లోని అమెరికా వైమానిక స్థావరంపై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్లు ఇరాన్ తెలిపింది. ఇరాన్లోని అహ్వాజ్ ప్రాంతంలో చిన్నారుల క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో అమెరికా దాడులు జరిగాయని, దీనికి ప్రతిస్పందనగా ఈ చర్యలు తీసుకున్నామని ఇరాన్ పేర్కొంది. అహ్వాజ్ ప్రాంతంలో అమెరికా దాడులను ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. వాటిని అమానవీయ చర్యగా అభివర్ణించింది. అయితే, అమెరికా వర్గాలు మాత్రం తమ దాడులు ఇరాన్ సైనిక సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకున్నవేనని చెబుతున్నాయి.🚨 BREAKING NEWS : 💥💥The US has completely destroyed the IRGC headquarters in Iran. This was the primary location from which Iran controlled its air force. The attack was so massive that surrounding buildings were completely destroyed. An uncontrollable fire is raging at the… pic.twitter.com/dGmVyTI4yB— Israel_Military (@IsraelMillitary) July 15, 2026గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలుఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో అమెరికా మిత్రదేశాలైన గల్ఫ్ దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి. కువైట్ తమ వైమానిక రక్షణ వ్యవస్థలు క్షిపణులు, డ్రోన్లను ఎదుర్కొంటున్నాయని తెలిపింది. బహ్రెయిన్లో కూడా వైమానిక దాడుల హెచ్చరిక సైరన్లు మోగాయి. ఇరాన్ సైనిక అధికారులు హర్మూజ్ జలసంధి విషయంలో వెనక్కి తగ్గబోమని ప్రకటించారు. అమెరికా ఈ ప్రాంతం నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. ఇటీవలి అమెరికా దాడుల్లో ఇరాన్లో కనీసం 30 మంది మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫాతిమా మొహజెరాని తెలిపారు. -
సహకార రంగం పనితీరుపై ఇరాన్ ప్రతినిధి బృందంతో తెలంగాణ మంత్రులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సహకార రంగం పనితీరు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇరాన్ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందానికి వివరించారు. రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన గురువారం సచివాలయంలో ఇరాన్ ప్రతినిధి బృందంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.ఈ ఉన్నతస్థాయి సమావేశంలో ఇరాన్ సహకార, కార్మిక, సామాజిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మైదారీ, ఉపమంత్రి డాక్టర్ సర్ఫీ, భారతదేశంలో ఇరాన్ రాయబారి డాక్టర్ మహమ్మద్ ఫత్ అలీ, హైదరాబాద్లోని ఇరాన్ కాన్సుల్ జనరల్ హమీద్ అహ్మదియా, వైస్ కాన్సుల్ మోహ్సిన్ మొగద్దమి, ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి హషేమి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, తెలంగాణలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పనితీరు, సభ్యత్వ విస్తరణ, రైతులకు అందిస్తున్న బహుముఖ సేవల గురించి ప్రతినిధి బృందానికి వివరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహకార రంగం కీలక పాత్ర పోషిస్తోందని, రైతు సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో ఇవి సమర్థవంతంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు.తెలంగాణలో అమలవుతున్న సహకార విధానాలు, సంస్థాగత సంస్కరణలపై ఇరాన్ ప్రతినిధి బృందం తీవ్ర ఆసక్తిని కనబరిచింది. భవిష్యత్తులో సహకార రంగంలో ఇరు దేశాల మధ్య పరస్పర అనుభవాల మార్పిడి, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే అంశాలపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు.సమావేశం ముగిసిన అనంతరం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి ఇరాన్ మంత్రులు, రాయబారులను శాలువాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను బహూకరించారు. ఇరు ప్రాంతాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఇరాన్ ప్రతినిధి బృందం ఈ సందర్భంగా ఆకాంక్షించింది. -
బ్రేకింగ్: ఇరాన్కు ట్రంప్ హెచ్చరిక.. పరిస్థితి ఉద్రిక్తం!
-
ఇరాన్ కీలక ప్రకటన.. ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన నిర్ణయం!
-
శత్రువే అయినా ప్రశంసించాల్సిందే.. ఇరాన్ను పొగిడిన ట్రంప్!
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ.. డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతున్నాయి. ఒకవైపు ఇరాన్పై సైనిక ఒత్తిడి కొనసాగిస్తూనే.. మరోవైపు అదే దేశానికి ట్రంప్ బహిరంగంగా కృతజ్ఞతలు తెలిపారు. శత్రుదేశాన్నే ప్రశంసించేలా ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక ఓ ఆసక్తికర పరిణామం ఉంది.2024 డిసెంబర్ నుంచి ఇరాన్లో నిర్బంధంలో ఉన్న అమెరికా-ఇరాన్ ద్వంద్వ పౌరసత్వం కలిగిన డెనా కరారీకి తాజాగా విముక్తి లభించింది. ఆమెను ఇరాన్ విడుదల చేయడాన్ని 'సద్భావ సంకేతం' (Goodwill Gesture)గా అభివర్ణించిన ట్రంప్.. ఆ దేశ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ట్రూత్ సోషల్లో స్పందిస్తూ.. "ఆమె ఇప్పుడు సురక్షితంగా ఇరాన్ వెలుపల ఉంది. ఆరోగ్యం కూడా బాగానే ఉంది. ఈ సద్భావ చర్యను అమెరికా అభినందిస్తోంది" అని పేర్కొన్నారు.ట్రంప్ పోస్టు అనంతరం మానవ హక్కుల న్యాయవాది జారెడ్ జెన్సర్.. విడుదలైన మహిళ డెనా కరారీనేనని ధృవీకరించారు. 2024లో కుటుంబ సభ్యులను కలిసేందుకు ఇరాన్కు వెళ్లిన ఆమెను అక్కడి అధికారులు దేశం విడిచి వెళ్లనీయలేదు. అనంతరం 2025లో అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల తర్వాత ఆమెపై గూఢచర్యం ఆరోపణలు నమోదు చేశారు. అంతకుముందు.. డెనా అమెరికాలోని ఓ టెక్నాలజీ కంపెనీలో ఉద్యోగం చేయడంతో పాటు ఇరాన్లో పేద పిల్లల కోసం సేవా కార్యక్రమాలు నిర్వహించే స్వచ్ఛంద సంస్థను నడిపేవారు. డెనా కరారీ విడుదలకు ట్రంప్ చేసిన నిరంతర ప్రయత్నాలే కారణమని జారెడ్ జెన్సర్ తెలిపారు. ప్రస్తుతం ఆమె అమెరికాకు తిరుగు ప్రయాణంలో ఉన్నట్లు వెల్లడించారు. గత రెండు దశాబ్దాల్లో 20 దేశాల్లో 340 మందికిపైగా ఖైదీల విడుదలకు జెన్సర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా.. ఇరాన్తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. ‘‘ఇరాన్ చర్చలు కోరుకుంటోంది. వారితో ఒప్పందం కుదురుతుందేమో చూడాలి. అయితే వారు సరిగ్గా, మర్యాదగా ప్రవర్తించాలి (They better behave)’’ అంటూ హెచ్చరించారు. అలా కాదని ఘర్షణలు కొనసాగితే ఇరాన్ త్వరలోనే ఓటమి పాలవుతుందని కూడా వ్యాఖ్యానించారు. అయితే చర్చలు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.మరోవైపు అమెరికా హర్ముజ్ జలసంధి పరిసరాల్లో ఇరాన్కు చెందిన తీర రక్షణ వ్యవస్థలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలపై రెండో విడత దాడులు కొనసాగిస్తోంది. దీనికి ప్రతిస్పందించిన ఇరాన్.. ఇది తమ ఉనికికే సంబంధించిన యుద్ధమని పేర్కొంటూ, అవసరమైతే ప్రాంతీయ ఇంధన ఎగుమతులకు అంతరాయం కలిగించే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. -
ఇరాన్ ఆస్పత్రిపై అమెరికా క్షిపణి దాడి
అహ్వాజ్: ఇరాన్లోని అహ్వాజ్లో ఉన్న షాహిద్ బాఘేయీ ఆస్పత్రి సమీపంలో అమెరికా క్షిపణులు దాడి చేశాయని, ఫలితంగా ఆస్పత్రిలోని రోగులను అత్యవసరంగా తరలించాల్సి వచ్చిందని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. చికిత్స పొందుతున్న క్యాన్సర్ రోగులు, ముఖ్యంగా కీమోథెరపీ తీసుకుంటున్న చిన్నారులను భద్రతా కారణాల దృష్ట్యా సిబ్బంది ఆస్పత్రి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 24 గంటల వ్యవధిలో ఇరాన్పై అమెరికా రెండు భారీ దాడులను చేసింది.హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న ఇరాన్ సైనిక ఆస్తులను లక్ష్యంగా చేసుకునే ఈ దాడులు నిర్వహిస్తున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఈ సైనిక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. అహ్వాజ్తో పాటు బందర్ అబ్బాస్, చబహార్, బుషెహర్ నగరాల్లోనూ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.అలాగే ఇరాన్ ఓడరేవుల వద్ద నిబంధనలను ఉల్లంఘించి వస్తున్న ‘ఎం/టి బెల్మా’ అనే చమురు ట్యాంకర్ను అమెరికా యుద్ధ విమానాలు క్షిపణులతో దెబ్బతీశాయి. ఈ దాడుల వల్ల ఆస్పత్రికి జరిగిన నష్టం లేదా ప్రాణనష్టంపై ఎటువంటి అధికారిక సమాచారం అందలేదు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. -
గల్ఫ్ దేశాల భారీ వ్యూహం!.. ఒక శకం ముగియబోతోందా?
ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన మార్గం హర్మూజ్ జలసంధి. ప్రతిరోజూ ప్రపంచానికి అవసరమైన ముడి చమురులో దాదాపు ఐదో వంతు ఈ ఇరుకైన సముద్ర మార్గం గుండా ప్రయాణిస్తుంది. ఎన్నో దశాబ్దాలుగా గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థకు ఇదే ప్రధాన ద్వారం. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్తో తరచూ తలెత్తుతున్న వివాదాలు, గల్ఫ్ దేశాలను కొత్త ఆలోచనల వైపు నడిపిస్తున్నాయి. ఒకవేళ హర్మూజ్ జలసంధి మూసుకుపోతే ప్రపంచ చమురు సరఫరాకు భారీ దెబ్బ తగులుతుందనే ఆందోళనతో గల్ఫ్ దేశాలు బిలియన్ల డాలర్ల పెట్టుబడులతో ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేస్తున్నాయి.ఈ మార్పులో ముందంజలో ఉన్న దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. హర్మూజ్ జలసంధిలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఫుజైరా తీరాన్ని ప్రపంచ చమురు ఎగుమతులకు ప్రధాన కేంద్రంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే ఉన్న పైప్లైన్ సామర్థ్యాన్ని భారీగా పెంచడంతో పాటు కొత్త పోర్టు నిర్మాణానికి కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దీంతో చమురు నేరుగా అరేబియా సముద్రంలోకి చేరి ప్రపంచ మార్కెట్లకు వెళ్లే అవకాశం ఉంటుంది.ఇరాక్ కూడా వెనుకబడటం లేదు. బస్రా నుంచి ఇతర దేశాల మీదుగా చమురును తరలించే కొత్త పైప్లైన్ నిర్మాణాన్ని ప్రారంభించింది. సౌదీ అరేబియా ఇప్పటికే ఉన్న ఈస్ట్–వెస్ట్ పైప్లైన్ను మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మార్గం ద్వారా చమురును ఎర్ర సముద్ర తీరానికి తీసుకెళ్లి అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయవచ్చు. అంటే హర్మూజ్లో ఎలాంటి అంతరాయం వచ్చినా ఎగుమతులు పూర్తిగా ఆగిపోకుండా చూసే వ్యూహం అమలులోకి వస్తోంది.నిపుణుల అంచనా ప్రకారం 2027 నాటికి గల్ఫ్ దేశాల చమురు ఎగుమతుల్లో దాదాపు 45 శాతం వరకు హర్మూజ్ జలసంధిని ఉపయోగించకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తరలించే సామర్థ్యం ఏర్పడుతుంది. అయినప్పటికీ కోట్లాది బ్యారెళ్ల చమురు ఇంకా అదే జలసంధి గుండా వెళ్లాల్సి ఉంటుంది. అందువల్ల హర్మూజ్ ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోదు, కానీ దానిపై ఆధారపడే స్థాయి మాత్రం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.ఈ పరిణామాలు భారత్కు కూడా అత్యంత కీలకం. ఎందుకంటే భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో పెద్ద భాగం గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. హోర్ముజ్లో అంతరాయం ఏర్పడితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, రవాణా ఖర్చులు అధికమవడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి ప్రభావాలు కనిపిస్తాయి. కొత్త పైప్లైన్లు, పోర్టులు అందుబాటులోకి వస్తే చమురు సరఫరా మరింత స్థిరంగా ఉండే అవకాశం ఉంది.మొత్తంగా చూస్తే, గల్ఫ్ దేశాలు ఇప్పుడు కేవలం కొత్త పోర్టులు, పైప్లైన్లు మాత్రమే నిర్మించడం లేదు. ప్రపంచ ఇంధన రవాణా మ్యాప్ను మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకే సముద్ర మార్గంపై ఆధారపడే కాలం క్రమంగా ముగుస్తుండగా, భవిష్యత్తులో చమురు ఎగుమతులకు మరింత సురక్షితమైన, ప్రత్యామ్నాయ మార్గాల యుగానికి శ్రీకారం చుడుతున్నాయి.


