ట్రంప్‌ కొత్త అస్త్రం.. ప్రతీకారం భీకరంగా ఉంటుందన్న ఇరాన్‌ | Trump Sanctions Strike on Iran: Tehran Warns of Devastating Retaliation | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ కొత్త అస్త్రం.. ప్రతీకారం భీకరంగా ఉంటుందన్న ఇరాన్‌

Aug 22 2026 6:43 AM | Updated on Aug 22 2026 6:53 AM

Trump Sanctions Strike on Iran: Tehran Warns of Devastating Retaliation

అమెరికా–ఇరాన్‌ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఇరాన్‌పై చరిత్రలోనే అత్యంత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించగా.. దానికి ఇరాన్‌ తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించింది. కొత్త ఆంక్షలు, బెదిరింపులకు సమాధానం విధ్వంసకరంగా ఉంటుందని టెహ్రాన్‌ వార్నింగ్‌ ఇచ్చింది.

‘అమెరికా బెదిరింపులకు గట్టి సమాధానం’.. అమెరికా నుంచి ఎదురయ్యే ఎలాంటి కొత్త బెదిరింపులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ఇరాన్‌ సాయుధ దళాలు ప్రకటించాయి. ఇరాన్‌ సాయుధ దళాల చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మేజర్‌ జనరల్‌ అలీ అబ్దొల్లాహీ మాట్లాడుతూ.. “భూమి, సముద్రం, గగనం, వాయు రక్షణ, సైబర్‌ రంగాల్లో మా బలగాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయి. శత్రువుల కొత్త బెదిరింపులకు శిక్షాత్మక, వినాశకర ప్రతిస్పందన ఇస్తాం” అని హెచ్చరించారు.

ఆంక్షల యుద్ధం విఫలమవుతుంది: అరాఘ్చీ
అమెరికా ప్రతిపాదిస్తున్న ఆర్థిక ఆంక్షలు విఫలమవుతాయని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ స్పష్టం చేశారు. ఆర్థిక ఒత్తిళ్లతో ఇరాన్‌ను లొంగదీసుకోవాలన్న ప్రయత్నాలు ఫలించవని అన్నారు. దౌత్య మార్గమే సమస్యలకు పరిష్కారమని పేర్కొంటూనే.. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు అన్ని మార్గాల్లో సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ట్రంప్‌ లక్ష్యం.. ఇరాన్‌పై గరిష్ఠ ఒత్తిడి
ఇరాన్‌కు సహకరించే ఏ దేశంపైనైనా ఆర్థిక చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ సోమవారం కొత్త ఆంక్షల వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. అయితే ట్రంప్‌ మాత్రం.. “ఇరాన్‌ ఒక ఒప్పందాన్ని కోరుకుంటోంది. కానీ సరైన ఒప్పందానికి ఇంకా సిద్ధంగా లేదు” అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, హర్ముజ్‌ జలసంధిని ప్రస్తుతం “అమెరికా భూభాగంగా చూస్తున్నాను” అంటూ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి కారణమయ్యాయి.

హర్ముజ్‌.. ఇరాన్‌ చేతిలో కీలక ఆయుధం
ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన మార్గం హార్ముజ్‌ జలసంధి. ఈ మార్గం ద్వారా రోజూ భారీ స్థాయిలో చమురు రవాణా జరుగుతుంది. ఇరాన్‌ వద్ద ఉన్న క్షిపణులు, డ్రోన్ల సామర్థ్యంతో ఈ ప్రాంతంలో నౌకా రవాణాకు అంతరాయం కలిగించే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే హర్ముజ్‌ ప్రాంతంలో జరిగిన ఘటనల్లో పలువురు నావికులు ప్రాణాలు కోల్పోయారు.

చమురు మార్కెట్లపై ఆందోళన
అమెరికా కొత్త ఆంక్షల హెచ్చరికలతో అంతర్జాతీయ చమురు ధరలు పెరిగాయి. ఇరాన్‌ చమురు సరఫరాపై ఆంక్షలు మరింత కఠినమైతే ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇరాన్‌ నుంచి ఎగుమతి అయ్యే చమురులో ఎక్కువ భాగాన్ని చైనా కొనుగోలు చేస్తోంది. దీంతో అమెరికా ఒత్తిడి ప్రధానంగా బీజింగ్‌పైనా పడే అవకాశముంది. చైనా మాత్రం.. “ఆంక్షలు, ఒత్తిళ్లు సమస్యను పరిష్కరించవు. చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యం” అని స్పష్టం చేసింది.

చర్చలకు ఒమన్‌ ప్రయత్నాలు
హర్ముజ్‌ జలసంధిలో నౌకల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ఒమన్‌ మధ్యవర్తిత్వం చేస్తోంది. ఒమన్‌, ఇరాన్‌ విదేశాంగ మంత్రులు ఫోన్‌లో చర్చించి.. నౌకా రవాణాపై కొత్త ఒప్పందం కోసం చర్చలు పునఃప్రారంభించే అంశాన్ని పరిశీలించారు.

యెమెన్‌ హౌతీలతో మరో సమస్య
ఇదే సమయంలో యెమెన్‌కు చెందిన హౌతీ గ్రూప్‌ బాబ్‌ అల్‌ మందెబ్‌ జలసంధిలో సౌదీ నౌకలపై దిగ్బంధం ప్రకటించడంతో ఎర్ర సముద్ర రవాణాపైనా ప్రభావం పడింది. సౌదీ అరేబియాలోని యన్బు పోర్టుకు వచ్చే ట్యాంకర్‌ రాకపోకలు గణనీయంగా తగ్గినట్లు సమాచారం.

అమెరికా ఆర్థిక ఆంక్షల బెదిరింపులు.. ఇరాన్‌ ప్రతీకార హెచ్చరికలు.. హర్ముజ్‌పై ఆధిపత్య పోరు.. ఇవన్నీ పశ్చిమాసియా సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తున్నాయి. దౌత్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ఇరు దేశాల నుంచి వస్తున్న కఠిన ప్రకటనలు కొత్త ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.

ఇదీ చదవండి: ప్లీజ్‌.. ప్లీజ్‌.. మా చక్కెర కొనరా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement