న్యూఢిల్లీ: యెమెన్, సోమాలియా తీర ప్రాంతాల్లో వేర్వేరు ఘటనల్లో రెండు వాణిజ్య నౌకలను సాయుధ సముద్రపు దొంగలు (పైరేట్స్) హైజాక్ చేసినట్లు కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ రెండు నౌకల్లో మొత్తం 22 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, వారంతా ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. మొదటి ఘటన ఆగస్టు 17న జరిగింది. కామెరూన్ జెండాతో ప్రయాణిస్తున్న 'ఎంవి లుటుఫ్' అనే నౌకను సోమాలియాలోని పుంట్లాండ్ తీరంలో సముద్రపు దొంగలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ నౌకలో ఆరుగురు భారతీయులతో సహా మొత్తం 10 మంది సిబ్బంది ఉన్నారు.
ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత, అంటే ఆగస్టు 20న యెమెన్ తీరంలోని గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ప్రాంతంలో రెండో నౌక హైజాక్కు గురైంది. ఎరిట్రియా జెండాతో వెళ్తున్న ‘ఎంటి. సిబు 1’ అనే ఈ నౌకలో 16 మంది భారతీయులతో సహా మొత్తం 20 మంది సిబ్బంది ప్రయాణిస్తున్నారు. భారతీయ సిబ్బంది భద్రతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారిని సురక్షితంగా రక్షించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని అధికారులు పేర్కొన్నారు.


