టెహ్రాన్: అమెరికాతో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అణుబాంబుల తయారికీ ఎంతో కీలకమైన అణు సెంట్రిఫ్యూజ్లను ఆనటాంజ్ సమీపంలోని ‘పిక్యాక్స్ మౌంటెన్’ అని పిలిచే అత్యంత భద్రమైన భూగర్భ ప్రాంగణంలోకి తరలించినట్లు తెలుస్తోంది. గగనతలం నుంచి వీటిపై దాడులు చేసిన సైతం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది.
వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం... అమెరికా, ఇజ్రాయెల్ అధికారులను ఉటంకిస్తూ—2025 జూన్లో 12 రోజుల పాటు జరిగిన సైనిక ఘర్షణ ముగిసిన కొద్ది నెలలకే ఇరాన్ ఈ పరికరాలను అక్కడకు మార్చిందని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఆ ఘర్షణలో అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్కు చెందిన అణు కర్మాగారాలపై దాడులు చేశాయి
అయితే, ఈ పిక్యాక్స్ స్థావరం ఆ దాడుల నుంచి తప్పించుకుంది. అంతేకాకుండా, ఫిబ్రవరి 28 నుండి ప్రారంభమైన మరింత తీవ్రమైన వైమానిక దాడుల్లో కూడా ఇది చెక్కుచెదరకుండా సురక్షితంగా ఉంది. ఈ భూగర్భ కేంద్రం కఠినమైన గ్రానైట్ రాతి కింద 300 అడుగులకు పైగా లోతులో నిర్మించబడిందని భావిస్తున్నారు. ఇది 2025లో బాంబు దాడులకు గురైన నటాంజ్, ఫోర్డో అణు శుద్ధి కర్మాగారాల కంటే చాలా లోతైనది.
పర్వతం చుట్టూ సుమారు 15 నెలలుగా ట్రక్కుల రాకపోకలు, నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నాయని శాటిలైట్ చిత్రాలు, నిఘా సమాచారం వెల్లడించాయి. ఈ ప్రాంగణాన్ని ఇరాన్ నిలకడగా అభివృద్ధి చేస్తోందని ఇది సూచిస్తోంది అక్కడకు చేర్చిన సెంట్రిఫ్యూజ్లను ఎక్కడి నుండి తీసుకువచ్చారనేది స్పష్టంగా తెలియలేదు, కానీ ఇరాన్లోని ఇతర అణు కేంద్రాల నుండి వాటిని మార్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఐఏఈఏ పరిశీలనకు దూరం
అంతర్జాతీయ పరమాణు ఇంధన సంస్థ (IAEA) ఇన్ స్పెక్టర్లను ఈ పిక్యాక్స్ కాంప్లెక్స్ను సందర్శించడానికి ఇరాన్ అనుమతించలేదు. లోపల ఏమి జరుగుతుందనే దానిపై ఎటువంటి వివరణాత్మక సమాచారాన్ని కూడా అందించలేదు.
2021లోనే ఇరాన్ పిక్యాక్స్ సైట్లో "అణు కార్యకలాపాలు" చేపడతామని తమకు తెలియజేసిందని IAEA డైరెక్టర్ జనరల్ రఫెల్ గ్రోసీ మార్చిలో తెలిపారు. అయితే అంతర్జాతీయ పర్యవేక్షణ, తనిఖీలు లేకపోవడంతో, ప్రపంచ కంటికి కనిపించకుండా ఈ భూగర్భ స్థావరాన్ని ఇరాన్ రహస్య కార్యకలాపాల కోసం ఉపయోగిస్తుందేమోనన్న ఆందోళనలు తీవ్రమవుతున్నాయి.
‘పిక్యాక్స్’ తదుపరి లక్ష్యం కావచ్చు ట్రంప్
ఈ భూగర్భ ప్రాంగణం త్వరలోనే అమెరికా దాడికి ప్రధాన లక్ష్యం కానుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదేపదే హెచ్చరిస్తున్నారు.గత వారం ఆయన మాట్లాడుతూ, "పిక్యాక్స్ ప్రధాన ద్వారం వద్దే మేము ఒక పెద్ద, బలమైన దాడి చేయడానికి అనువైన లక్ష్యంగా ఉంది" అని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఈ సైట్పై అమెరికా దాడి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.


