breaking news
Hanamkonda District Latest News
-
పేదబ్రాహ్మణుల సంక్షేమానికి కృషి
హన్మకొండ కల్చరల్: రాష్ట్రంలోని పేదబ్రాహ్మణుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని, త్వరలోనే బ్రాహ్మణ కార్పొరేషన్కు రూ.వందకోట్ల బడ్జెట్ రానుందని తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఉపాధ్యక్షుడు పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు బ్రాహ్మణ సేవాసమితి, శ్రీవైష్ణవ సేవా సమితి, విప్ర బ్రాహ్మణ సేవాసంఘాల ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండ బ్రాహ్మణభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 10 లక్షల మంది పేదబ్రాహ్మణుల సంక్షేమం కోసం బ్రాహ్మణ సంఘాలు నిబద్ధతతో పనిచేయాలని, అన్ని కులాలతో మమేకమై నడవాలని సూచించారు. పేద వేదపండితులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ట్రస్ట్లో తీర్మానం చేశామని, వివేకానంద స్కీం, విదేశీ విద్యా పథకం, వ్యాపారాలు చేసుకోవడానికి గ్రాంట్ ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించిందని అన్నారు. అనంతరం సుబ్రహ్మణ్యప్రసాద్ను సన్మానించారు. సమావేశంలో బ్రాహ్మణసేవా సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, బ్రాహ్మణసేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీఎస్ శ్రీనివాసాచారి, వేదపండితులు విజయకుమారాచార్యులు, విప్ర బ్రాహ్మణసేవా సంఘం రాష్ట్ర కన్వీనర్ వల్లూరి పవన్కుమార్, వైష్ణవ సేవా సంఘం రాష్ట్ర కన్వీనర్ తిరువరంగం ప్రభాకరాచారి, చకిలం సుధాకర్రావు, శ్రీధరాచార్యులు ఉన్నారు.తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఉపాధ్యక్షుడు పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్ -
గ్రూపు రాజకీయాలకు తావు లేదు
పరకాల: రానున్న ఎన్నికల్లో పరకాల గడ్డపై మరోసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి స్పష్టం చేశారు. పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆదివారం నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బుతో రాజకీయాలు చేసే వారు దూరంగా ఉండండి, నిబద్ధతతో పనిచేసే వారే తనతో ఉండాలని కోరారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో రాష్ట్రంలోని 119 నియోజక వర్గాల్లో పరకాల నియోజకవర్గానికి నాలుగో స్థానం రావడం గర్వంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా బీఎల్ఏలు, క్లస్టర్ ఇన్చార్జ్లు, మండల అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, పార్టీ నాయకులను ఆయన అభినందించారు. అన్ని మండలాల్లో 100 శాతం ఎస్ఐఆర్ పూర్తి అయ్యిందని పేర్కొన్నారు. పరకాల నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలను సహించనని, అధిష్టానం చెప్పిందే సుప్రీం అని స్పష్టం చేశారు. నామిటెడ్, పార్టీ పదవుల్లో టీం సభ్యులకు ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రతీ కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంమన్నారు. సమావేశంలో పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చందు, పట్టణ అధ్యక్షుడు ఒంటేరు శ్రావణ్, నడికూడ, పరకాల మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరకాలలో మరోసారి కాంగ్రెస్దే గెలుపు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
విద్యారణ్యపురి: ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని స్టేట్ టీచర్స్ అసోసియేషన్ (ఎస్టీయూ) రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యులు మాలోత్ గణపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండలోని ఎస్టీయూ భవన్లో ఆదివారం జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్సీ ప్రకటించాలని, ఐదు డీఏలు విడుదల చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఖాళీ పోస్టులు భర్తీచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు భీమనాథుని రవి మాట్లాడుతూ ఉపాధ్యాయుల కృషితోనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగిందన్నారు. రాష్ట్ర పూర్వ ఆర్థిక కార్యదర్శి ఆట సదయ్య, వరంగల్ జిల్లా ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు మూల మధుమాలిమాయే, జిల్లా ప్రధాన కార్యదర్శి దానం నాగరాజు, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కామగోని రాంబాబు, ప్రధాన కార్యదర్శి వేమునూరి రాంబాబు, ఆర్థిక కార్యదర్శి శవకోటి, జిల్లాల కార్యవర్గసభ్యులు ఆర్.సుధాకర్, కిషన్, ఖలీల్పాషా, శ్రీను, నిరంజన్, రజనీకాంత్, వెంకన్న, సోమయ్య, శేషాచారి, సాంబమూర్తి, చీకటి శ్రీనివాస్, విద్యాసాగర్ పాల్గొన్నారు. ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యుడు గణపతి -
నాలుగున్నర గంటలు ఉత్కంఠ
హన్మకొండ: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్రెడ్డి ఆదివారం గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి నాలుగున్నర గంటల పాటు ఉత్కంఠ నెలకొంది. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. నిలకడగా ఆరోగ్యం హనుమకొండ హంటర్రోడ్డులోని తన నివాసంలో అస్వస్థతకు గురైన వెంటనే పెద్ది సుదర్శన్రెడ్డిని భార్య స్వప్న, అందుబాటులో ఉన్న కార్యకర్తలు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఉదయం 8 గంటలకు చేరుకున్న వెంటనే డాక్టర్ మమత చికిత్స ప్రారంభించారు. ఆస్పత్రి సిబ్బంది బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బీరవెల్లి భరత్ కుమార్రెడ్డికి సమాచారం అందించారు. ఆయన వెంటనే ఆస్పత్రికి చేరుకుని పెద్ది సుదర్శన్రెడ్డి భార్యతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ శాసన సభాపక్ష ఉపనేత హరీశ్రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఇతర నాయకులకు సమాచారం అందించారు. హనుమకొండలోనే ఉన్న మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, మార్తినేని ధర్మారావు, డాక్టర్ టి.రాజేశ్వర్రావు, నన్నపునేని నరేందర్, శంకర్నాయక్, అరూరి రమేశ్, సీనియర్ నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, మార్నేని రవీందర్రావు, ఈవీ శ్రీనివాస్రావు, ముద్దసాని సహోదర్రెడ్డి ఆస్పత్రికి చేరుకున్నారు. ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అదే విధంగా కేటీఆర్, హరీశ్రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, శంబీపూర్ రాజు, హైదరాబాద్ నుంచి పలువురు సీనియర్ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారు. భార్య పెద్ది స్వప్నతో మాట్లాడి సుదర్శన్రెడ్డి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని, మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలిస్తున్నట్లు వారు చెప్పారు. కాగా, సుదర్శన్రెడ్డి ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరగడంతో వైద్యులు తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. పెద్ది సుదర్శన్రెడ్డిని ఆస్పత్రికి తీసుకొచ్చిన వెంటనే గంట పాటు సీపీఆర్ చేశా. ఎనిమిది సార్లు చేసినా గుండె లయ అందుకోలేదు. తొమ్మిదోసారికి లయ అందుకొని శ్వాస తీసుకుకున్నాడు. ఇది మిరాకిల్. తర్వాత అంజియోగ్రామ్తో పాటు ఇతర పరీక్షలు చేశాం. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తం కరగడానికి ఇంజక్షన్ ఇచ్చాం. గుండె నుంచి ఊపిరితిత్తులకు వచ్చే రక్తనాళంలో గడ్డకట్టింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించాం. – మమత, కార్డియాలజిస్ట్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డికి గుండెపోటు ఆస్పత్రికి తీసుకెళ్లిన కుటుంబసభ్యులు భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు పరామర్శకొద్దిరోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, ఇప్పడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రాణాలను కార్డియాలజిస్ట్ మమత కాపాడారు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను కాపాడిన ఆమెను పలువురు ప్రశంసలతో ముంచెత్తారు. గంటపాటు శ్రమించి పట్టువదలకుండా అంకితభావంతో సీపీఆర్ చేసి పెద్ది సుదర్శన్రెడ్డి ప్రాణాలు కాపాడిన మమతకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్రావు ఎక్స్లో అభినందనలు తెలిపారు. -
సోమవారం శ్రీ 27 శ్రీ జూలై శ్రీ 2026
కులదైవం బీరన్న బోనాల కోసం హైదరాబాద్ నుంచి స్వస్థలం వరంగల్ ఉర్సుగుట్ట సమీప కాలనీ బీఆర్నగర్కు వచ్చిన మాడ అనిల్(23)ను అతడి స్నేహితుడు మహేశ్ పాత కక్షల నేపథ్యంలో కత్తితో గొంతులో పొడిచాడు. అనిల్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణం వదిలాడు.వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రధాన అనుచరుడైన వరంగల్ ఎన్టీఆర్ నగర్కు చెందిన అడుప మహేశ్(45)పై ఇటీవల ఓ రౌడీ షీటర్ పెట్రోల్ పోసి నిప్పంటించగా.. మహేశ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఉమ్మడి జిల్లాలో సంచలనంగా మారింది. -
గస్తీ.. సుస్తీ
వరుస హత్యలతో కలకలంవరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస హత్యలు బెంబేలెత్తిస్తున్నాయి. రోజుకు ఎక్కడో ఒక చోట నేరం జరుగుతోంది. రౌడీలు యథేచ్ఛగా తిరుగుతున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇటీవలి ఘటనలు చెబుతున్నాయి. జీవిత ఖైదు పడిన రౌడీ షీటర్ బెయిల్పై వచ్చి మరో హత్యను చేసి తప్పించుకొని పోలీసులకు సవాల్గా మారాడు. ఎట్టకేలకు ఆదివారం పోలీసులు నిందితులను అరెస్టు చూపారు. – వరంగల్ క్రైం/ఖిలా వరంగల్● పట్టుతప్పుతున్న పోలీసింగ్.. భయాందోళనలో నగరం ● కమిషనరేట్ పరిధిలో బెంబేలెత్తిస్తున్న చైన్స్నాచింగ్లు ● పోలీసులకు సవాల్ విసురుతున్న నేరగాళ్లు ● సీపీ మరింత దృష్టి పెట్టాలని ప్రజల విన్నపందృష్టిసారించని టాస్క్ఫోర్స్! చైన్స్నాచింగ్లు జరిగే ముందు దొంగలు.. పార్కింగ్ చేసి ఉన్న బైక్లు ఎత్తుకెళ్లి చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. బ్లూకోల్ట్ సిబ్బంది షిఫ్టుల వారీగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నప్పటికీ చోరీలు ఆగట్లేదన్న చర్చ జరుగుతోంది. అప్పుడప్పుడు గుట్కాలు, అడపాదడపా పీడీఎస్ బియ్యం, పలుమార్లు ఫోన్లు చేసి సమాచారం ఇస్తే.. పేకాట స్థావరాలపై దాడులు తప్ప టాస్క్ఫోర్స్ అధికారులు వేటిపైనా దృష్టి సారించట్లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల హనుమకొండకు చెందిన ఓ రౌడీషీటర్ పుట్టిన రోజు వేడుకలు ఘన్పూర్లోని ఓ రిసార్ట్లో ఘనంగా జరుపుకుంటే ట్రైసిటీలో రౌడీలంతా హాజరై సంబురాల్లో మునిగి తేలడం వివాదాస్పదమైంది. గతంలో రౌడీషీటర్లకు తరచూ కౌన్సెలింగ్ ఇచ్చేవారు. ప్రస్తుతం రౌడీషీటర్లు ఎలాంటి ఘటనల్లో తలదూర్చినా అధికారులు మాకెందుకులే అని ఊరుకుంటున్నారనన్న ఆరోపణలున్నాయి. పోలీస్ సైరన్కు ఏమైంది? కమిషనరేట్ పరిధిలో పోలీసులకు వాహనాలిచ్చి ఇప్పటికే పదేళ్లు దాటింది. అన్ని స్టేషన్లలో వాటి పరిస్థితి అధ్వానం. వాహనాలకు అవసరమైన టైర్లు, బ్యాటరీలు, మెయింటెనెన్స్ లేక వాహనాలు పార్కింగ్ ప్లేస్ దాటి బయటకు రావట్లేదు. వీటి భారం, నెలవారీ మెయింటెనెన్స్ రెగ్యులర్గా రాక ఎస్హెచ్ఓలపై భారం పడుతుండడంతో వాళ్లు కూడా చేతులు ఎత్తుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పెట్రోలింగ్ జరగడం లేదని తెలుస్తోంది. నగరంలో చాలా పోలీస్ స్టేషన్ల పరిధిలో మచ్చుకు ఒకటి రెండు వాహనాలు తిప్పి చేతులు దులుపుకుంటున్నారని ఆయా కాలనీలవాసులు విమర్శిస్తున్నారు. దీంతో పోలీస్ సైరన్ మూగబోయిందా అంటూ నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ఏసీపీ లేక నేర నియంత్రణపై ప్రభావం! వరంగల్ నగరంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) పోస్ట్ చాలాకాలంగా ఖాళీగా ఉంది. దీంతో పోలీస్ పరిపాలనపై ప్రభావం పడుతోంది. ఇంతకాలం ఏఎస్పీ శుభం ప్రకాశ్ బాధ్యతల్లో ఉన్నంత కాలం నేరాలు తగ్గుముఖం పట్టాయి. ఆయన బదిలీ కావడంతో ఏసీపీ స్థాయి అధికారి లేక ఇన్చార్జ్ ఏసీపీ ఉన్నప్పటికీ కీలక నిర్ణయాలు ఆలస్యం కావడం, నేరాల పర్యవేక్షణలో లోపాలు ఏర్పడడం, ప్రజలకు అందాల్సిన సేవల్లో జాప్యం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. సీపీ దృష్టి సారించాలి.. కమిషనరేట్ పరిధిలో భూముల రేట్లు పెరగడం, డబుల్ డాక్యుమెంట్లు సృష్టించడం, మాట వినని వారిని బెదిరించడం, అడిగే వారు లేకుంటే కబ్జా చేయడం వంటి పనులతో కమిషనరేట్లో రౌడీలకు చేతినిండా పని దొరికినట్లయ్యింది. రౌడీలకు నేతలతో పాటు కొంత మంది పోలీస్ అధికారుల అండదండలు ఉండడంతో వారు రెచ్చిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీపీ శ్వేత సూచనల మేరకు కమిషనరేట్ పరిధిలో పోలీసులు మెరుగ్గా విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ మరింత ప్రజలకు చేరువవ్వాల్సిన అవసరం ఉంది. పెట్రోలింగ్, ప్రజల భద్రత, సీసీఎస్, టాస్క్ఫోర్స్ విభాగాల్లో ఏళ్లుగా పాతుకుపోయిన వారి విధులపై సీపీ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నగరంలో నేరాల నియంత్రణ కోసం పోలీసుల గస్తీని మరింత పెంచాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణను విస్తరించాలని, రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సీపీ శ్వేతను ప్రజలు కోరుతున్నారు. -
బలాకా, విజయా క్రమాల్లో భద్రకాళి అమ్మవారు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో శాకంబరీ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం అమ్మవారికి బలాకా, విజయా క్రమాల్లో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు నిత్యాహ్నికపూజలు చతుస్థానార్చనలు నిర్వహించారు. స్నపనమూర్తిని కాళీకల్పకం ప్రకారం బలాకా అమ్మవారుగా, బోగభేరాన్ని షోడశీక్రమంలో విజయా నిత్యగా అలంకరించారు. చతుఃస్థానార్చన పూజలు, నీరాజన మంత్రపుష్పాలు, తీర్థప్రసాద వితరణ నిర్వహించారు. ఆలయ ఈఓ రామల సునీత పర్యవేక్షించారు. వరంగల్ అర్బన్: జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్ ఇసంపల్లి జోనా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి కౌన్సిల్హాల్లో రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న గ్రీవెన్స్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేయూ క్యాంపస్: తెలంగాణ ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అభ్యర్థుల కోసం ఉచిత సివిల్ సర్వీసెస్లో శిక్షణ కోసం నిర్వహించిన ప్రవేశ అర్హత పరీక్ష ఆదివారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రశాంతంగా ము గిసింది. ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి నిర్మల, హైదరాబాద్లోని ఎస్సీ స్టడీ సర్కిల్ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ జగన్మోహన్, ఆస్టడీ సర్కిల్ ప్రతినిధి కిరణ్ పర్యవేక్షించారు. హన్మకొండ: రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడానికి ఈ నెల 27 నుంచి 29 వరకు రైతువేదికల్లో విత్తనమేళా నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా వ్యవసాయాధికారి విజయ్చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో సాగుకు అనువైన పంటల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. కందులు, పెసలు, మినుములు, కూరగాయల విత్తనాలు, పచ్చిరొట్ట, జొన్నవిత్తనాలు విక్రయించనున్నట్లు తెలిపారు. హనుమకొండ, కమలాపూర్, వేలేరు, కాజీపేట, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, హసన్పర్తి, ఐనవోలు, ధర్మసాగర్, పరకాల, దామెర, నడికూడ, ఆత్మకూరు, శాయంపేట రైతు వేదికల్లో రైతుమేళాలు నిర్వహించనున్నట్లు వివరించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు వరికి బదులు, కంది, పెసలు, మినుములు, నువ్వులు, మొక్కజొన్న, జొన్న, పెసర వంటి పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. కాజీపేట అర్బన్: గ్రేటర్ వరంగల్ 31వ డివిజన్ పరిధి న్యూశాయంపేట రైల్వే గేట్ను సోమవారం నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు ఆరు రోజులు మూసివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాక్ మరమ్మతుల్లో భాగంగా రైల్వే గేట్ను మూసివేస్తుండగా న్యూశాయంపేట నుంచి భట్టుపల్లి గ్రామానికి రాకపోకలు కొనసాగించాలని, ప్రజలు సహకరించాలని మాజీ కార్పొరేటర్ మామిండ్ల రాజు కోరారు. విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో రెండు నుంచి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈనెల 27న బేస్లైన్ పరీక్షలు నిర్వహించాలని డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్, జిల్లాక్వాలిటీ కోఆర్డినేటర్ డాక్టర్ బండారు మన్మోహన్ కోరారు. తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ యాప్ ద్వారా టెస్ట్ నిర్వహించాలని పేర్కొన్నారు. పరీక్షలు నిర్వహించిన వెంటనే టీఎస్ ఎడ్యుకేషన్ యాప్లో విద్యార్థుల వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు తమ పరిధిలోని అన్ని పాఠశాలల్లో పరీక్షలు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
● ప్రజల భద్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు ● మీడియా సమావేశంలో సీపీ ఎన్.శ్వేత సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలిగించే అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత స్పష్టం చేశారు. నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఆదివారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యాధునిక సీసీ కెమెరాల నెట్వర్క్తో పాటు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నట్లు చెప్పారు. నేరాల నియంత్రణ కోసం గతంలో పనిచేసిన పోలీస్ అధికారులు.. ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఇతర సంస్థల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని, వాటిని పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు గంజాయి రవాణా, మాదకద్రవ్యాల విక్రయం, రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని సీపీ వెల్లడించారు. గంజాయి రవాణా అరికట్టేందుకు చర్యలు చేపడతామన్నారు. మరింత పటిష్టంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం పకడ్బందీ చర్యలు కొనసాగిస్తున్నామన్నారు. నేరాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు.. ప్రజల భద్రతకు భంగం కలిగించే ఏ చర్యనైనా సహించబోమని సీపీ శ్వేత స్పష్టం చేశారు. నేరాలకు పాల్ప డిన వారిపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు అవసరమైతే నిరోధక చర్యలను కూడా అమలు చేస్తామని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో రౌడీషీటర్లను గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. సుమారు 700 మంది రౌడీషీటర్లు ఉన్నట్లు గుర్తించామని, చర్యలు తీసుకుంటామని, పోలీస్ యాక్షన్ త్వరలోనే చూస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు ప్రజల సహకారమే పోలీసులకు బలం.. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజాప్రతినిధులు, ప్రజలు, మీడియా కీలక భాగస్వాములని సీపీ శ్వేత అన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలు, నేరాలకు సంబంధించిన సమాచారం వెంటనే పోలీసులకు అందిస్తే త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసులకు సమాచారం అందించే వారి సమాచారం గోప్యంగా ఉంచుతామన్నారు. -
జిల్లాల్లో పోస్టుల కేటాయింపు..
ఉమ్మడి వరంగల్ జిల్లాల వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులకు వివిధ కేటగిరీల్లో సుమారు 564 పోస్టులను మంజూరు చేశారు. ముఖ్యంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు, ట్యూటర్లు, అనస్తీషియా టెక్నీషియన్లు, సాంకేతిక సిబ్బంది, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇచ్చారు.● హనుమకొండకు 3 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 10 అసోసియేట్ ప్రొఫెసర్లు, వరంగల్ జిల్లా కింద 40 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 20 అసోసియేట్ ప్రొఫెసర్లు, అనస్తీషియా టెక్నీషియన్లు, ఇతర సాంకేతిక సిబ్బందిని కేటాయించారు. ● ఎంజీఎం/కాకతీయ మెడికల్ కాలేజీ పరిధిలో 145 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 15 ప్రొఫెసర్లు, ఏసీ మెకానిక్, ఆడియాలజిస్ట్ తదితర పోస్టులు ఇచ్చారు. ● మహబూబాబాద్కు 50 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 35 అసోసియేట్ ప్రొఫెసర్లు, అనస్తీషియా టెక్నీషియన్లు, ఇతర సిబ్బందిని కేటాయించారు. ● ములుగు జిల్లాకు 56 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 28 అసోసియేట్ ప్రొఫెసర్లు, 7 ట్యూటర్లు, అనస్తీషియా టెక్నీషియన్లు, ఇతర పోస్టులు ఇచ్చారు. ● జనగామకు15 మంది అసిస్టెంట్, 26 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, అనస్తీషియా టెక్నీషియన్లు, ఇతర సిబ్బందిని కేటాయించారు. ● జయశంకర్ భూపాలపల్లికి 53 అసిస్టెంట్, 22 అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇతర సాంకేతిక పోస్టులు మంజూరు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
రాజీనామాతో బీజేపీ తప్పించుకోలేదు..
హన్మకొండ: కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో బీజేపీ ప్రభుత్వం తన బాధ్యతలనుంచి తప్పించుకోలేదని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డి అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి హనుమకొండ పబ్లిక్ గార్డెన్లోని మహాత్మాగాంధీ విగ్రహంనుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో ఘనంగా ‘విజయ్ మార్చ్’ నిర్వహించారు. ఇనుగాల వెంకట్రామ్రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ పేపర్ లీకేజీల వల్ల నష్టపోయిన ప్రతి విద్యార్థికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు. ఈ విజయం విద్యార్థుల హక్కుల కోసం పోరాడిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీకి అంకితం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈవీ శ్రీనివాస్ రావు, బత్తిని శ్రీనివాస్రావు, బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పింగిలి వెంకట్రామ్రెడ్డి, పులి ప్రియాంక, గోదాదేవి, సాగరిక రావు, కరాబు రాజేశ్వర్రావు, యువజన, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యూ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి -
పెరుగుతున్న గోదావరి
● సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద 1,62,994 క్యూసెక్కుల నీరు కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలోని సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద గోదావరి గంట గంటకూ పెరుగుతోంది. ఎగువన వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లి నదిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో తుపాకులగూడెంలోని సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. శుక్రవారం 65,300 క్యూసెక్కుల నీటితో సాధారణంగా ప్రవహించిన గోదావరి.. శనివారం ఉదయం 1,20,300 క్యూసెక్కులకు పెరిగింది. సాయంత్రం 1,65,994 క్యూసెక్కులకు పెరిగి ప్రవహిస్తోంది. శుక్రవారం నుంచి ఇప్పటి వరకు రెట్టింపు నీటి ప్రవాహం పెరిగి ప్రవహిస్తోంది. బ్యారేజీ వద్ద ఉన్న గేట్లను ఎత్తి 1,62,994 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. గుట్టగంగారంలోని దేవాదుల ఎత్తిపోతల వద్ద పది మోటార్లు ఉండగా అందులో తొమ్మిది మోటార్లను ఆన్ చేసి 2,306 క్యూసెక్కుల నీటిని దిగువలోని భీంఘన్పురం రిజర్వాయర్కు పంపింగ్ చేస్తున్నారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు కాళేశ్వరం: ఓ బాలికను కిడ్నాప్ చేసిన ఘటన పై జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని సురారం గ్రామానికి చెందిన ఎం. వేణుపై పోక్సో కేసు నమోదు చేసి రి మాండ్కు తరలించినట్లు ఎస్సై సాంబమూర్తి శనివారం ప్రకటనలో తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. కిడ్నాప్నకు గురైన బాలిక వాంగ్మూలం ఆధారంగా నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి శనివారం అరెస్ట్ చేసి రి మాండ్కు తరలించిట్లు పేర్కొన్నారు. బాలికల పై జరిగే నే రా ల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. -
న్యాయవాదులకు సామాజిక బాధ్యత ఉండాలి
వరంగల్ లీగల్: న్యాయవాదులు సామాజిక బాధ్యత కలిగి ఉండాలని హైకోర్టు జడ్జి, వరంగల్, హనుమకొండ జిల్లాల పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ సేనారెడ్డి అన్నారు. శనివారం కోర్టు ప్రాంగణంలో హనుమకొండ జిల్లా కోర్టుకు నూతనంగా కేటాయించబడిన మూడో అదనపు జిల్లా కోర్టు, ఐదు, ఆరు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులను, ఆలాగే పునర్నిర్మించిన వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ భవనాన్ని జస్టిస్ విజయ సేనారెడ్డి ప్రారంభించారు. అంతకు ముందు వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీ.బి. నిర్మాల గీతాంబ, హనుమకొండ జిల్లా ప్రధానన్యాయమూర్తి ఎంఆర్. సునీత నేతృత్వంలో వేద పండితులు జస్టిస్ విజయసేనారెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వృత్తిలో తీర్చిదిద్దాలి.. ఉభయ జిల్లా బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో జస్టిస్ విజయసేనారెడ్డి మాట్లాడుతూ.. న్యాయవాదుల పక్షాన చేసిన విజ్ఞప్తులను సానుకూల దృష్టితో పరిష్కరిస్తానని హమీ ఇచ్చారు. సీనియర్ న్యాయవాదులు.. యువ న్యాయవాదులను వృత్తిలో తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో ఉభయ బార్ అసోసియేషన్ల అధ్యక్షులు చొల్లేటి రామకృష్ణ, చకిలం ఉపేందర్, బార్ కౌన్సిల్ సభ్యులు ఎం.సహోదర్రెడ్డి, న్యాయమూర్తులు, న్యాయవ్యాదుల సంఘ ప్రతినిధులు నాగేంద్రచారి, నరేందర్, సాంబశివరాజు, రఘుపతి, లలితకుమారి, వనజ ఉన్నారు. హైకోర్టు జడ్జి జస్టిస్ బి.విజయసేనారెడ్డి కోర్టు భవనం ప్రారంభం -
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
వరంగల్ అర్బన్: అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వరంగల్లోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. తడి, పొడి చెత్త సేకరణ కోసం మోడల్ డివిజన్గా ఎంపిక చేసిన 26లోని చార్బౌళి, గిర్మాజీపేట తదితర ప్రాంతాల్లో ఇంటింటా తడి, పొడి చెత్త వేరు చేసే విధానం, స్వచ్ఛ ఆటోలు సమయపాలన తదితర విషయాలను స్థానిక గృహాల యాజమానుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అనంతరం నర్సంపేట గ్రాండ్ ఎంట్రెన్స్, ఖమ్మం గ్రాండ్ ఎంట్రెన్స్ ప్రాంతాలను పరిశీలించారు. ఎంజీఎం ఎదురుగా స్వీపింగ్ మిషన్తో చేపడుతున్న రహదారి శుభ్రత పనుల్ని పరిశీలించారు. అనంతరం ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై ఆరా తీశారు. ఆయన వెంట సీఎంహెచ్ఓ రాజారెడ్డి, సీహెచ్ఏహెచ్ రాజేశ్, శానిటరీ సూపర్వైజర్లు గోల్కొండ శ్రీను, భాస్కర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న -
ఘనంగా శత ఘటాభిషేకం
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో నిర్వహిస్తున్న వరుణ పూజల్లో భాగంగా రెండో రోజు రుద్రేశ్వరస్వామికి ఘనంగా శతఘటాభిషేకం నిర్వహించారు. శనివారం ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశిని పురస్కరించుకుని ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు రుద్రేశ్వరస్వామికి ఏకాదశ రుద్రాభిషేకం, భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ నాట్య మండపంలో వరిధాన్యంపై 108 ఘటాలకు మూలయుక్తంగా పూజలు నిర్వహించారు. పూజల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి దంపతులు, బల్దియా కమిషనర్ వెంకన్న నాయక్, ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు గట్టు మహేశ్బాబు, వరంగల్ దేవాదాయశాఖ పరిశీలకులు నందనం కవిత పాల్గొన్నారు. ఈఓ అనిల్కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
కర్రతో కొట్టి.. గోర్లతో మెడను పిసికి
దుగ్గొండి: మద్యం అనేక కుటుంబాల్లో చిచ్చు పెడుతోంది. మానవత్వాన్ని మంట కలుపుతోంది. రక్త సంబంధాలను సైతం మరిపిస్తోంది. దీనికి నిదర్శనమే ఈ ఘటన. మద్యం మత్తులో ఓ యువకుడు తన పెద్దనాన్నను కర్రతో కొట్టి గోర్లతో మెడను పిసికి హత్య చేశాడు. ఈ ఘటన శనివారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ముస్కుల సాంబరెడ్డి(56), తిరుపతిరెడ్డి అన్నదమ్ములు. వీరి తల్లిదండ్రులు పదేళ్ల క్రితమే చనిపోయారు. సాంబరెడ్డి మానసిక దివ్యాంగుడు కావడంతో పెళ్లి కాలేదు. తిరుపతిరెడ్డికి పెళ్లి అయి ఇద్దరు కుమారులు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం తిరుపతిరెడ్డి భార్య క్యానర్తో చనిపోయింది. దీంతో సాంబరెడ్డి ఆలనాపాలన తమ్ముడు తిరుపతిరెడ్డి చూస్తున్నాడు. తిరుపతిరెడ్డి మూడు నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. ఇక అప్పటి నుంచి తిరుపతిరెడ్డి పెద్ద కుమారుడు రాజు.. పెద్దనాన్న వద్ద ఉంటూ అతడికి వండి పెడుతున్నాడు. చిన్నకుమారుడు తిరుమల్ వరంగల్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. రాజుకు పెళ్లి కాలేదు. మద్యానికి బానిసగా మారాడు. శుక్రవారం మద్యం సేవించి ఇంటికి వచ్చిన రాజుకు పెద్ద నాన్న సాంబరెడ్డి దుస్తుల్లోనే మల విసర్జన చేసి కనిపించాడు. దీంతో కోపోద్రెకుడైన రాజు పెద్దనాన్నను అర్ధరాత్రి కర్రతో విపరీతంగా కొట్టాడు. మెడ బాగాన్ని చేతులతో పిసికి గోర్లతో రక్కాడు. దీంతో సాంబరెడ్డి తెల్లవారుజామున మృతి చెందాడు. రైతుబీమా ప్రీమియం తీసుకున్న రాత్రే హత్య.. తిరుపతిరెడ్డికి వ్యవసాయ భూమి ఉండగా తన నామినీగా ఇద్దరు కుమారులను కాకుండా అన్న సాంబరెడ్డిని పెట్టుకున్నాడు. దీంతో తిరుపతిరెడ్డి మృతి అనంతరం రైతు బీమా కింద రూ. 5లక్షలు వచ్చాయి. శుక్రవారం గిర్నిబావిలోని ఏపీజీవీబీ బ్యాంకుకు సాంబరెడ్డి ఇద్దరు తమ్ముడి కుమారులతో కలిసి వెళ్లాడు. డబ్బులు తీసుకున్నారు. ఇంటికి వచ్చిన రాత్రే హత్య జరగడం చర్చనీయాంశంగా మారింది. గొయ్యి తీసి పూడ్చడానికి ప్రయత్నం.. సాంబరెడ్డి మృతిచెందాడని తెలుసుకున్న రాజు.. మృతదేహాన్ని పూడ్చి పెట్టడానికి శనివారం తెల్లవారుజామున గుంత తీయడం ప్రారంభించాడు. దీంతో అనుమానం వచ్చిన ఇరుగు పొరుగు వారు వెళ్లి చూడగా సాంబరెడ్డి మృతి చెంది ఉన్నాడు. వెంటనే వా రు 100 నంబర్కు ఫోన్ చేశారు. దీంతో ఏసీపీ రవీందర్రెడ్డి, సీఐ సాయిరమణ, ఎస్సై రణధీర్రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించారు. మృతుడి చెల్లి చల్లా ఉమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సాయిరమణ తెలిపారు. కాగా, రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే తాను కర్రతో పెద్దనాన్నను కొట్టానని, చనిపోతాడని అనుకోలేదని తెలిపినట్లు సమాచారం. మద్యం మత్తులో పెద్దనాన్నను చంపిన యువకుడు దుగ్గొండి మండలం నాచినపల్లిలో దారుణం -
‘సర్’పై అప్రమత్తంగా ఉండాలి
● ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ● కేయూలో సింపోజియంకేయూ క్యాంపస్: తెలంగాణలో ఓటర్ల తొలగింపు కుటిల యత్నాలు చెల్లవని, మరో వారంరోజులు ప్రజసంఘాలు, సామాజిక ఉద్యమకారులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. శనివారం పూలే ఆశయ సాధనసమితి (పాస్) ఆధ్వర్యంలో కేయూలోని దూరవిద్యాకేంద్రం జర్నలిజం విభాగంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ–(సర్) పై నిర్వహించిన సింపోజియంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా సర్ ప్రక్రియను నిర్వహించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాల్లోనే సర్ ప్రక్రియ మందకోడిగా సాగుతున్నదన్నారు. సర్ ఫారంలో సంక్లిష్టతలను తొలగించాలని తెలంగాణ తెలుగు అకాడమీ చైర్మన్ ఆచార్య కె.వెంకటనారాయణ అన్నారు. యువత పౌరసమాజం బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కాపాడుకునేలా కృషి చేయాలలని ఇఫ్లూ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజారాం, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగం ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, రచన జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.ఉమామహేశ్వర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ జర్నలిజం విభాగం అధ్యాపకుడు డాక్టర్ యాదగిరి, కేయూ మాజీ రిజిస్ట్రార్ సదానందం అన్నారు. సభకు కేయూ జర్నలిజం విభాగం అధిపతి డాక్టర్ సంగాని మల్లేశ్వర్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పూలే ఆశయసాధన ిసమితి రాష్ట్ర కార్యదర్శి చందా మల్లయ్య, బాధ్యులు డాక్టర్ కూరపాటి రమేశ్, తాడూరు శాస్త్రి, గోడిశాల సత్యనారాయణ మెరుగుబాబు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
కాపుకాసి.. కత్తితో గొంతులో పొడిచి
ఖిలా వరంగల్: పాతకక్ష నేపథ్యంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నిందితుడు ఏడాదిగా అదును కోసం వేసి చూసి అత్యంత కిరాతకంగా గొంతులో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఉర్సుగుట్ట సమీప కాలనీ బీఆర్ నగర్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బీఆర్ నగర్కు చెందిన మాడ అనిల్ (23) అదే ప్రాంతానికి చెందిన లారీ క్లీనర్ గిరబోయిన మహేశ్ స్నేహితులు. వీరిద్దరు గతేడాది డిసెంబర్ 31న మద్యం సేవించిన తర్వాత ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో అనిల్.. మహేశ్ను కత్తితో పొడవగా తీవ్రగాయాలతో ఎంజీఎంలో చికిత్స పొంది ఇంటికి చేరుకున్నాడు. నాటి నుంచి అనిల్ హైదరాబాద్లో కూలీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నాడు మృతుడిపై మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు సైతం నమోదైనట్లు తెలుస్తోంది. ఎలాగైనా అనిల్ను చంపాలని ఏడాదిగా మహేశ్ ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో అనిల్ తమ కులదైవమైన బీరన్న బోనాలకు శుక్రవారం హైదరాబాద్ నుంచి బీఆర్నగర్కు చేరుకున్నాడు. ఈ విషయం మహేశ్ తెలుసుకున్నాడు. ఎలాగైనా చంపాలని మాటువేశాడు. మధ్యాహ్నం 3గంటల సమయంలో బీరన్న గుడికి బయలుదేరిన అనిల్ను మహేశ్ ఎదురెళ్లి ఆకస్మికంగా గొంతులో కత్తితో పొడిచాడు. వెంటనే అనిల్ కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. దారుణ హత్యను చూసిన స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. కళ్లముందే తమ కుమారుడు హత్యగురికావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. నిందితుడు మహేశ్ నేరుగా మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఈహత్యలో ప్రధాన నిందితుడు మహేశ్కు రాజు అనే వ్యక్తి సహకరించినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి పోలీసులు.. సమాచారం అందుకున్న మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ కర్రె స్వామి ఘటనా స్థలికి చేరుకున్నారు. హత్యప్రదేశాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.అనిల్ హత్యతో బీఆర్నగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితుడి ఇంటిపై మృతుడి బంధువులు దాడి చేయకుండా ముందస్తుగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనిల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాగా.. మహేశ్ బీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ‘మా అబ్బాయి ఎవరికి అపకారం చేయలేదు. పాత గొడవను మళ్లీ లేపి చంపారు.. నిందితులను కఠినంగా శిక్షించాలి’ అని మృతుడి తండ్రి కొమురయ్య కన్నీరుపెట్టుకున్నారు. యువకుడి దారుణ హత్య వరంగల్ నగరంలోని బీఆర్ నగర్లో ఘటన పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు? -
ఫిర్యాదులకు త్వరగా పరిష్కారం చూపాలి
● బల్దియా అడిషనల్ కమిషనర్ జోనా వరంగల్ అర్బన్: ప్రజాఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యానికి తావివ్వకూడదని బల్దియా అడిషనల్ కమిషనర్ ఇసంపెల్లి జోనా ఆదేశించారు. శనివారం కార్యాలయంలోని తన చాంబర్లో వివిధ విభాగాల పర్యవేక్షకులు, సెక్షన్ హెడ్లు, న్యాయాధికారితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వివిధ విభాగాల్లో పెండింగ్లో ఉన్న ప్రజావాణి ఫిర్యాదులు, ఆర్టీఐ దరఖాస్తులు, కోర్టు కేసులు, ఇతర పెండింగ్ ఫైళ్ల పురోగతిని సమీక్షించారు. సమావేశంలో బల్దియా న్యాయాధికారి శ్రీనివాస్, పర్యవేక్షకులు సంతోశ్, ఆనంద్కుమార్, దేవేందర్, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పెరిగిన కోమళ్ల టోల్ ప్లాజా రుసుములు రఘునాథపల్లి : వరంగల్ – హైదరాబాద్ జాతీయ రహదారిలోని రఘునాథపల్లి మండలం కోమళ్ల టోల్ ప్లాజా రుసుములు పెరిగాయి. పెరిగిన చార్జీలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. 2026–27 ఆర్థిక సంవత్సరానికి లింకింగ్ ఫ్యాక్టర్ పునరుద్ధరణతో 5 శాతం టోల్ ధరల పెంపునకు జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) హైదరాబాద్ ప్రాంతీయ ఆఫీస్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ధరలు ఈ నెల 27 నుంచి 31, మార్చి 2027 వరకు అమలులో ఉంటాయి. పెరగనున్న టోల్ చార్జీలు ఇలా... కారు, జీప్, వ్యాన్, లైట్ మోటారు వాహనం ఒక వైపు రూ 130, ఇరు వైపులా రూ. 190, నెల వారీ 4,295, లైట్ కమర్షియల్ వాహనం, లైట్ గూడ్స్ వాహనం, మినీ బస్సు ఒకవైపు రూ. 210, ఇరువైపులా రూ. 310, నెలవారీ రూ. 6,935, బస్సు, ట్రక్కుకు ఒక వైపు రూ. 435, ఇరువైపులా రూ. 655, నెల వారీ రూ. 1,4530, త్రీ యాక్షల్ కమర్షియల్ వాహనం ఒక వైపు రూ. 475, ఇరు వైపులా రూ. 715, నెలవారీ రూ.1,5850, హెచ్సీఎం, ఈఎంఈ వాహనం ఒకవైపు రూ. 685 ఇరువైపులా రూ.1,025, నెలవారీ రూ. 22,785, ఓవర్సైజ్ వాహనం ఒక వైపు రూ. 830, ఇరువైపులా రూ. 1,250, నెల వారీ రూ. 27,740కు పెంచారు. నెల వారి పాస్ రూ. 350 నుంచి రూ. 360కి పెరిగింది. చిన్నారి హత్యకు యత్నించిన వ్యక్తి అరెస్ట్ కొడకండ్ల : పాత గొడవలు, భూతగాదాలను దృష్టిలో ఉంచుకుని ఓ చిన్నారి హత్యకు యత్నించిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై చింత రాజు తెలిపారు. ఈ మేరకు శనివారం కేసు వివరాలను విలేకరులకు వివరించారు. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన అందె మధు, జ్యోతి దంపతుల కుమార్తె నౌమిక శుక్రవారం సాయంత్రం తమ ఇంటి సమీపంలోని అందె సత్తార్ ఇంటి ఆవరణలోని సంపులో అనుమానాస్పదంగా పడి మూత పెట్టి ఉంది. అదే సమయంలో తన కూతురి కోసం తల్లి జ్యోతి వెతుకుతూ సంపు వైపు వెళ్లగా అమ్మ అని అరుపులు వినిపించాయి. సమీపంలో ఉన్న అందె భవాని, ఉప్పలమ్మ సాయంతో సంపునుంచి కూతురిని జ్యోతి బయటకు తీసింది. ఇదే సమయంలో తనను చూసి అందె రంజిత్ అనే వ్యక్తి పారిపోయాడని, అతనిపై అ నుమానం ఉందని జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకుని విచారించగా చిన్నారి తాత అందె వెంకన్నతో పాత గొడవలు, భూతగాదాలపై కక్ష పెంచుకుని నౌమిక హత్యకు యత్నించినట్లు అంగీకరించినట్లు ఎస్సై తెలిపారు. ● రేపటి నుంచి అమల్లోకి ● ఐదు శాతం పెరగనున్న ధర -
అనుమానాస్పద స్థితిలో యువకుడి ఆత్మహత్య
వరంగల్ క్రైం : హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలసముద్రంలో శనివారం ఓ ఇంట్లో యువకుడు అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నక్కలగుట్టలోని లిటిల్ మంకీస్ బేకరీలో పనిచేసే బాసిక నాగరాజు(25) ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు, బంధువులు పలు అనుమానాలు లేవనెత్తారు. ఘటనాస్థలిలో ఉరేసుకోవడానికి ఎలాంటి ఆధారం లేకపోవడం అనుమానాలకు కారణమైంది. నడికూడ మండలం ధర్మరం గ్రామానికి చెందిన నాగరాజు ఆత్మహత్య విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో బాలసముద్రం చేరుకున్నారు. కుటుంబ సభ్యులు రాకముందే మృతదేహం తొలగించాలని పోలీసులు యత్నించారని, గతంలో సుబేదారి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సై సుమన్ తమ కుమారుడిని అకారణంగా కొట్టారన్నారు. అప్పటి నుంచి నాగరాజు మానసిక వేదనకు గురైనట్లు ఆరోపించి తమకు న్యాయం చేయాలని కుటుంబీకులు, బంధువులు ఘటనాస్థలిలో రాత్రి 8.30 గంటల వరకు ఆందోళన చేపట్టారు. కాగా, గతంలో బేకరీ నుంచి ఎస్సై సుమన్.. నాగరాజును బయటకు తీసుకెళ్తున్న వీడియో వైరల్గా మారింది. ఎస్సైతోపాటు ఇద్దరిపై కేసు నమోదు.. కుటుంబ సభ్యులు, బంధువులు వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతను కలిసి నాగరాజు మృతిపై అనుమానాలు ఉన్నట్లు తెలిపారు. కాగా, నాగరాజు తండ్రి చేరాలు ఫిర్యాదు మేరకు ఎస్సై సుమన్తో పాటు బేకరీ యజమాని శ్రీకాంత్, జిమ్ సెంటర్ యజమా ని సురేశ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్కుమార్ తెలిపారు. నాగరాజు ఆత్మహత్యతో వెలుగులోకి కుళ్లిన ఆహార పదార్థాలు.. నక్కలగుట్టకు చెందిన లిటిల్ మంకీస్ బేకరీ స్టోరేజీలో కుళ్లిన చికెన్తోపాటు ఇతర పాడైన ఆహార పదార్థాలు పెద్ద మొత్తంలో నిల్వ చేశారు. నాగరాజు మృతదేహం చూడడానికి వచ్చిన వారికి కుళ్లిన ఆ హార పదార్థాలు దర్శనమిచ్చాయి. ఈ ఘటనలో ని ర్వాహకులపై ఇప్పటి వరకు టాస్క్ఫోర్స్, పోలీసు అధికారులు దృష్టిసారించకపోవడంపై పలు ఆరోపణాలు వస్తున్నాయి. ఫుడ్సెఫ్టీ అధికారులు కూడా బేకరీ, హోటళ్లపై దాడులు చేసి ఆహార పదార్థాలను తనిఖీ చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. సుబేదారి ఎస్సైతో సహా ఇద్దరిపై కేసు నమోదు కుటుంబీకులు, బంధువుల ఆందోళన -
బకాయిల విడుదలకు బీజేపీ పోరాటం
● పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి హన్మకొండ: రాష్ట్రంలో పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల విడుదలకు బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నట్లు బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి తెలిపారురు. శనివారం హనుమకొండ దీన్దయాల్ నగర్లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ‘ఫీజు బకాయి – బీజేపీ లడాయి’ పోస్టర్, మిస్డ్ కాల్ నంబర్ను సంతోశ్రెడ్డి, నాయకులు ఆవిష్కరించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు తీగల భరత్ గౌడ్, నాయకులు రావు పద్మారెడ్డి, డా.కాళీప్రసాద్, పులి సరోత్తంరెడ్డి, డా.విజయ్ చందర్రెడ్డి, కాసర్ల రుత్విక్రెడ్డి, గుజ్జుల వసంత, కందగట్ల సత్యనారాయణ, నాను నాయక్ పాల్గొన్నారు. -
త్వరగా పరిహారం చెల్లించండి
హన్మకొండ అర్బన్: గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి, గౌరెల్లి, చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పరిహారం చెల్లింపుల ప్రక్రియను మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ చాహత్బాజ్పాయ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో రెవెన్యూ, జాతీయ రహదారుల సంస్థ అధికారులతో నిర్వహించిన సమీక్షలో వివిధ ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో హనుమకొండ, పరకాల ఆర్డీఓలు వెంకటేశ్, వెంకన్న, జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ భరద్వాజ్, భూసేకరణ విభాగ పర్యవేక్షకుడు జగత్సింగ్తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. హెచ్ఐవీ, ఎయిడ్స్ నియంత్రణకు సమష్టిగా కృషి చేయాలి.. 2027 డిసెంబర్ 1 నాటికి హెచ్ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ సాధనకు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం, వైద్య ఆరోగ్య శాఖ, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హెచ్ఐవీ నివారణ, ఎయిడ్స్ నియంత్రణ కమిటీ సమావేశంలో వైద్యాధికారులు, కౌన్సిలర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. హైరిస్క్ వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి వారికి కౌన్సిలింగ్, పరీక్షలు మరింత పెంచాలని సూచించారు. డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హెచ్ఐవీ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సమావేశంలో అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ మదన్ మోహన్ రావు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మేనేజర్ స్వప్న మాధురి, ఏఆర్టీ కేంద్ర వైద్యులు డాక్టర్ సూర్యప్రకాశ్, డాక్టర్ హంపీ, డాక్టర్ అనిరుద్, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్ రెడ్డి, డాప్కో రామకష్ణ, కమలాకర్, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఐసీటీసీ కౌన్సిలర్లు, టెక్నీషియన్లు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులతో సమీక్ష -
ముగిసిన శిక్షణ
మామునూరు: వరంగల్ మామునూరు నాలుగో బెటాలియన్లో కమాండెంట్ శివప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా సివిల్ పోలీసులకు 28 రోజులుగా కొనసాగుతున్న బేసిక్ ఫస్ట్ రెస్పాన్స్ విపత్తుల నిర్వహణ శిక్షణ కార్యక్రమం శనివారం సాయంత్రం ముగిసింది. ముఖ్య అతిథిగా శివప్రసాద్రెడ్డి హాజరై ప్రతిభ చూపిన శిక్షణార్థులకు సర్టిఫికెట్లు, ప్రశంసపత్రాలు అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30 మంది శిక్షణార్థులకు మొదట మెడికల్ ఫస్ట్ రెస్పాండర్ గురించి, ఈసెస్ఎస్ఆర్ (కాలేప్సెడ్ స్ట్రక్చర్ సెర్చ్ అండ్ రెస్క్యూ), రోప్ రెస్క్యూ, ఎడీఆర్సీ ఆక్వాటిక్ డిజాస్టర్ రెస్పాన్స్ కోర్సులను నిష్ణాతులైన సిబ్బందితో శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా డీఎస్పీ శ్రీనివాస్, ఏసీ రాజేందర్, ఆర్ఐలు విజయ్, రవి, సర్వర్, వెంకటేశ్వర్లు, రాజ్కుమార్, ఎన్డీఆర్ఎఫ్ ట్రైనింగ్ సిబ్బంది, శిక్షణార్థులు పాల్గొన్నారు. విద్యారణ్యపురి: హైదరాబాద్లోని తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఆదివారం ఉదయం 10–30గంటలకు హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాలలో అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు షెడ్యూల్ కులాల అభివృద్ధి సంస్థ అధికారి బి.నిర్మల, ఉమ్మడి వరంగల్ జిల్లా గౌరవ సంచాలకులు డాక్టర్ కె.జగన్మోహన్ తెలిపారు. అభ్యర్థులు సంబంధిత వెబ్సైట్నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. సకాలంలో పరీక్షకు హాజరుకావాలని కోరారు. హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో శనివారం ఉదయం అమ్మవారిని ఏకాదశి తిథికి ఆది దేవతయైన ఘనా, నీల పతాకా క్రమంలో అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో నిత్యాహ్నిక పూజలు, చతుస్థానార్చనలు జరిపారు. స్నపన మూర్తిని కాళీకల్పకం ప్రకారం ఘనాదేవిగా, బోగభేరాన్ని షోడశీక్రమంలో నీల పతాక మాతగా అలంకరించి చతుఃస్థానార్చన పూజలు, నీరాజన మంత్రపుష్పాలు, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. ఆలయ ఈఓ రామల సునీత పర్యవేక్షించారు. ఏకాదశి పర్వదినం కావడంతో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. హన్మకొండ అర్బన్: జిల్లా పరిషత్ సీఈఓ బి.శేషాద్రికి హనుమకొండ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఈ పోస్టులో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్.రవి అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు వె లువడే వరకు బి.శేషాద్రి అదనపు కలెక్టర్ (స్థానికసంస్థలు)గా విధులు నిర్వహించనున్నారు. -
‘ప్రధాని మోదీ మెడలు వంచిన రాహుల్ గాంధీ’
హన్మకొండ చౌరస్తా: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్రం మెడలు వంచి వి ద్యార్థుల అభీష్టాన్ని నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకే దక్కుతుందని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎరబ్రెల్లి స్వర్ణ శని వారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సుమారు నెల రోజులుగా విద్యార్థులు నిరసన తెలుపుతున్నా కేంద్రం పట్టించుకోలేదని తెలిపారు. ఈ క్రమంలో వి ద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచి దేశవ్యాప్తంగా ఉద్యమించడంతో కేంద్రం దిగిరాక తప్పలేదన్నారు. రాబోయే రోజుల్లో ప్రధాని మోదీని గద్దెదించడమే తమ కర్తవ్యమని, రా హుల్ గాంధీని ప్రధానిగా చేసేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని తెలిపా రు. నిరసనల్లో మృతి చెందిన విద్యార్థులకు స్వర్ణ ప్రగా ఢ సానుభూతి ప్రకటించారు. గాయపడ్డవారికి మె రుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబా లకు రూ.కోటి చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించి, కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. -
విద్యుత్ ఆర్టిజన్ల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం
టీఎస్ ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్ ఈఈయూ)–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం హనుమకొండ వడ్డేపల్లి రోడ్లోని టీఎస్ ఈఈయూ కార్యాలయంలో పల్లా రవీందర్ రెడ్డి భవన్లో విద్యుత్ ఆర్టిజన్ల రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇనుగాల శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఐదేళ్లకు ఇవ్వాల్సిన గ్రేడ్ ప్రమోషన్లు ఎనిమిదేళ్లు పూర్తయినా ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. దేశంలో ఒకే సంస్థలో రెండు రకాల సర్వీస్ రూల్స్ అమలులో ఉండడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే ఆర్టిజన్ ఉద్యోగులకు కూడా ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్ ఈఈయూ–327 టీజీ ఎన్పీడీసీఎల్ అధ్యక్షుడు పి.మహేందర్ రెడ్డి, టీఎస్ ఈఈయూ–327 రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం ఐలేశ్, కంపెనీ కార్యదర్శి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సి.హెచ్ నరేందర్ రెడ్డి, నాయకులు కట్ల సదయ్య, తులసి శ్రీమతి రెడ్డి, దొనికల సద య్య, మచ్చిక బుచ్చయ్య గౌడ్, చిట్ల ఓదెలు, పప్పు వెంకటేశ్వర్లు, సలీం పాషా, కోరుకొప్పుల రాంబాబు, చింతలపూడి సతీశ్ కుమార్ పాల్గొన్నారు. -
గుండెపోటుతో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ రవీందర్ మృతి
కేయూ క్యాంపస్ : హనుమకొండలోని యూనివర్సిటీ పీజీ కళాశాల కామర్స్అండ్బిజినెస్మేనేజ్మెంట్ విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఓ రవీందర్( 52) శనివారం సాయంత్రం గుండెపోటుతో మృతిచెందారు. విధులు నిర్వర్తించిన అనంతరం హనుమకొండ ఎన్జీఓఎస్ కాలనీలో తాను నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లాడు. సాయంత్రం అస్వస్థతకు గురికావడంతో కుటుంబీకులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందారని నిర్ధారించారు. రవీందర్కు భార్య,కుమారుడు, కూతురు ఉన్నారు. రవీందర్ మృతి సమాచారం అందుకున్న కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహాచారి, పలువురు అధ్యాపకులు రవీందర్ మృతదేహాన్ని సందర్శించారు. రవీందర్ మృతితో కుటుంబంతోపాటు సహచర అధ్యాపకుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది సంతాపం తెలిపారు. ఇదిలా ఉండగా రవీందర్ కుటుంబం ఎన్జీఓఎస్ కాలనీలో అద్దెభవనంలో నివసిస్తోంది. రవీందర్ మృతదేహాన్ని శనివారం రాత్రి ఆస్పత్రి నుంచి సొంత గ్రామం చిన్నకోడెపాకకు తరలించారు. ఆదివారం అక్కడే అంత్యక్రియలు జరగనున్నాయని సహచర అధ్యాపకులు తెలిపారు. -
క్రీడా పాఠశాలలో ప్రవేశాలు పూర్తి
● 4,5 తరగతుల్లో 28 మంది విద్యార్థులు ● డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహిస్తున్న క్రీడా పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి 4, 5వ తరగతుల్లో ప్రవేశాల ప్రక్రియ శనివారం పూర్తయిందని హనుమకొండ జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ప్రతిభా ఎంపిక పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించగా, రెండో దఫాలో 28 మంది విద్యార్థులు స్కూల్లో చేరినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తూ చిన్న వయసు నుంచే ప్రతిభను వెలికితీసేందుకు క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేసిందని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు శాసీ్త్రయ విధానంలో క్రీడా శిక్షణ అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. స్కూల్లో విద్యార్థులకు వసతి, పోషకాహారం, వైద్య సేవలు, విద్యా సౌకర్యాలు, క్రీడా సామగ్రి వంటి అన్ని వసతులను ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తోందని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించి వారి ప్రతిభను మరింత మెరుగుపరచాలని డీవైఎస్ఓ ప్రశాంత్ సూచించారు. -
జూనియర్ సివిల్ జడ్జిలకు పదోన్నతులు
వరంగల్ లీగల్: రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ సివిల్ జడ్జిలకు సీనియర్ సివిల్ జడ్జిలుగా పదోన్నతులు కల్పిస్తూ హై కోర్టు వర్గాలు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశాయి. ఈమేరకు వరంగల్ ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కె.పూజ, హనుమకొండ ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి ప్రతీక్ సెహాగ్, మొదటి జూనియర్ సివిల్ జడ్జి టీ.ఎం వైష్ణవికి సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి కల్పించారు. హసన్పర్తి: ఇటీవల మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో నిర్వహించిన జాతీయ స్థాయి మాస్టర్స్ క్లాసిక్ అండ్ ఈక్విస్ట్ పవర్ లిఫ్టింగ్లో హసన్పర్తి మండలం భీమారానికి చెందిన సంగాల కమల్ కాంస్య పతకం సాధించారు. ఈసందర్భంగా కమల్ను హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి అభినందించారు. భవిష్యత్లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. హన్మకొండ చౌరస్తా : జిల్లాలో పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు డీసీసీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్లు హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చైర్మన్గా పింగిలి వెంకట్రాంనరసింహారెడ్డి, కన్వీనర్లుగా కౌటిల్రెడ్డి, నాయిని గోదాదేవి, సభ్యులుగా లక్ష్మణ్, రాహుల్రెడ్డి, దిలీప్రాజ్, గోవిందు శ్వేత, డాక్టర్ రమేశ్, అల్లం రఘునారాయణ, పోతుల శ్రీమాన్రావు, మరో 13మందితో కమిటీని ఏర్పాటు చేసిననట్లు వివరించారు. కాజీపేట అర్బన్: బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్ 1, 2, 3, 4 బ్యాంకింగ్ సర్వీసెస్, స్టాఫ్ సెలక్షన్, ఆర్ఆర్బీ, పోలీస్ నియామక పరీక్షలకు ఫౌండేషన్ కోర్సు ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ ఇన్చార్జ్ డైరెక్టర్ లక్ష్మణ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 25 నుంచి ఆగష్టు 14వ తేదీ వరకు www.tgbcstudycircle.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 0870–2571192 నంబర్లో సంప్రదించాలని సూచించారు. హన్మకొండ కల్చరల్: దేవాదాయశాఖ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు ఆదేశాల మేరకు వేయిస్తంభాల ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న వరుణ పూజలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు జరిగాయి. వరుణ పూజల్లో భాగంగా మొదటి ఆలయ నాట్య మండపంలో వేద పండితులు మణికంఠశర్మ, పానుగంటి సాయితేజ, శ్రీవాస్తవ, అర్చకులు ప్రణవ్, కాశి లింగాచారి సకాలంలో వర్షాలు పడాలని వరుణ జపం, ఋశ్యశృంగ పారాయణం నిర్వహించారు. నేడు శనివారం తొలి ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, ఉదయం 7 గంటలకు శత ఘటాభిషేకం ప్రారంభమవుతుందని, అలాగే, రేపు 26న ఆదివారం వరుణ హో మం వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈఓ అనిల్కుమార్ తెలిపారు. -
బీరన్న బోనాలకు సర్వం సిద్ధం
ఖిలా వరంగల్: తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా శుక్రవారం వరంగల్ ఉర్సు కరీమాబాద్లోని బీరన్న దేవాలయం బోనాలకు సర్వం సిద్ధమైంది. బీరన్న స్వామి దేవాలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రంగురంగుల విద్యుద్దీపాలతో బీరన్న ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఆలయ పరిసరాల్లో బల్దియా అధికారులు తాగునీటి ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నారు. ఆలయంలో కురుమ కులస్తులే కాకుండా స్థానికంగా ఉండే ఇతర కులస్తులు కూడా స్వామి వారిని దర్శించుకునేందుకు క్యూ కడతారు. ఆలయ పూజారులు స్వామి వారి బండారి, కంకణాలు సిద్ధం చేశారు. మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ కర్రె స్వామి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. కురుమల ఉపవాస దీక్షతోనే బీరన్నకు నైవేద్యంగా బోనాన్ని సమర్పించనున్నట్లు బీరన్న ఆలయ కమిటీ చైర్మన్ మరుపల్లి రవి తెలిపారు. విద్యుద్దీపాలతో వెలిగిపోతున్న ఆలయాలు నేడు ఊరేగింపునకు భారీ బందోబస్తు -
తుదిదశకు యూజీడీ కసరత్తు
వరంగల్ అర్బన్: మహానగరంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ టెండర్ ప్రక్రియ తదిదశకు చేరిందని గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న అన్నారు. శుక్రవారం వరంగల్ జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో యూజీడీ టెండర్ ప్రక్రియ పురోగతిపై ఇంజనీర్లు, ప్లానింగ్ అధికారులు, బిల్డ్ కాన్ సంస్థ ప్రతినిధులతో సమావేశమై చర్చించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగర పరిధిలో ఏర్పాటు చేయనున్న ఏడు ఎస్టీపీల (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు) కోసం అవసరమైన భూసేకరణ పూర్తయిందన్నారు. టెండర్ ప్రక్రియ చివరి దశకు చేరినందున మిగిలిన ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో బల్దియా సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్కుమార్, ‘కుడా’ సీపీఓ అజిత్రెడ్డి, ఈఈ రవికుమార్, బిల్డ్కాన్ సంస్థ ప్రతినిధి అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. జూ పార్కులో నీటి నిల్వకు శాశ్వత పరిష్కారం హనుమకొండలోని కాకతీయ జులాజికల్ పార్కు నుంచి వర్షాకాలంలో వరద నీటితో పలు ప్రాంతాలు ముంపు గురవుతున్న నేపథ్యంలో కమిషనర్ టి.వెంకన్న, జిల్లా అటవీ శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఇంజనీర్లను ఆదేశించారు. ఆయన వెంట ఎస్ఈ రాజుకుమార్, ఈఈ రవికుమార్, అసిస్టెంట్ క్యూరేటర్ మయూరి, బల్దియా డీఈలు, ఏఈలు, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎస్టీపీల ప్రతిపాదనలపై సీరియస్గా దృష్టిసారించాలి గ్రేటర్ వరంగల్ కమిషనర్ వెంకన్న -
ఐదేళ్ల వారసత్వం.. పనుల్లో అలసత్వం..!
రామప్పకు యునెస్కో గుర్తింపు (వారసత్వ హోదా) వచ్చినా మారని రూపురేఖలుములుగు: రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు వచ్చి నేటి (శనివారం)కి ఐదేళ్లు పూర్తయినా ఏ మార్పూ కనిపించ డం లేదు. ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని పాలంపేట పరిధిలో 1213లో కాకతీయులు నిర్మించిన రామప్ప దేవాలయానికి వారసత్వ సంపదగా యునెస్కో హోదా కల్పిస్తున్నట్లు 2021, జూలై 25న వరల్డ్ హెరిటేజ్ కమిటీ ప్రకటించడంతో ఉమ్మడి వరంగల్ ప్రజలు, పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని స్థానికులు సంబురపడ్డారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు సైతం ఆలయాన్ని సందర్శించి ఆలయ రూపురేఖలు మార్చేస్తామని, ప్రభుత్వాలనుంచి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. వినియోగంలోకి రాని ఉప ఆలయాలు రామప్ప ఆలయం ముందు ఉన్న గొల్లాల గుడికి మరమ్మతులు చేపట్టినప్పటికీ పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురాలేదు. మరో శివాలయాన్ని అభివృద్ధి చేయాల్సి ఉండగా కూలిపోతోందని దానికి సపోర్టుగా ఇనుపపైపులను అమర్చి చుట్టూ ప్రహరీ నిర్మించారు. ఇటీవల ఆ ఆలయాన్ని జాతీయ ప్రాముఖ్యత స్మారక చిహ్నంగా కేంద్రం గుర్తించింది. మరికొన్ని ఉప ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించినప్పటికీ ఇప్పటివరకు వాటి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ప్రారంభమెప్పుడో.. దేవాలయానికి వచ్చే దేశ, విదేశీ పర్యాటకులకు వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ ప్రాజెక్టు కింద రూ.61.99 కోట్ల నిధులను కేటాయించింది. మొదటి విడతగా రూ.42.14 కోట్ల నిధులు మంజూరు చేసి సుమారు 10 ఎకరాల్లో ఇంటర్ ప్రిటేషన్ సెంటర్ను నిర్మించారు. కానీ, కాంట్రాక్టర్కు బిల్లు రాలేదనే నెపంతో సెంటర్ను ప్రారంభించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రామప్ప ఆలయ ఆవరణలోని కామేశ్వరాలయాన్ని పునర్నిర్మాణం పేరుతో 2011లో పురావస్తుశాఖ అధికారులు తొలగించారు. 2022 డిసెంబర్లోగా ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలని హెరిటేజ్ కమిటీ షరతు విధించినప్పటికీ ఇప్పటివరకు పునాదులకే పరిమితమైంది. రామప్ప సరస్సులోని ఐలాండ్లో 5 ఎకరాల విస్తీర్ణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. సాస్కి పథకం కింద మంజూరైన రూ.13 కోట్లతో ఐలాండ్లో భారీ శివుడి విగ్రహం, రెస్టారెంట్, కెఫిటేరియా, చిల్డ్రన్స్పార్కు, బటర్ ఫ్లై గార్డెన్ నిర్మిస్తుండగా పనులు వేగవంతంగా కొనసాగడం లేదనే విమర్శలున్నాయి. గత ఏడాది నవంబర్లో పనులు ప్రారంభించారు. ఇప్పటివరకు పనుల పురోగతిలో ఎలాంటి అభివృద్ధి కనిపించట్లేదు. పునాదుల్లోనే కామేశ్వరాలయం.. ముందుకు సాగని ఐలాండ్ పనులు నిర్మాణం పూర్తయినా ప్రారంభం కాని ఇంటర్ప్రిటేషన్ సెంటర్ పనులు పూర్తయితే మరింత సుందరంగా ఆలయ పరిసరాలు -
స్వగ్రామాల్లో ఓటు హక్కు వినియోగానికి గ్రేటర్ వాసుల మొగ్గు
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్–26) గ్రేటర్ వరంగల్ రాజకీయ సమీకరణాలను మార్చే దిశగా సాగుతోంది. నగరంలో ఉంటున్న వేలాది మంది ఓటర్లు తమ స్వగ్రామాల్లోనే ఓటు కొనసాగించేందుకు మొగ్గు చూపుతుండడంతో ట్రైసిటీలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ మందగించింది. ఇదే పరిస్థితి కొనసాగితే నగర ఓటర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉండడంతో, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 66 నుంచి 88 డివిజన్లకు పెంచాలన్న ప్రతిపాదనపై ప్రభావం పడుతుందా? అనే చర్చ మొదలైంది. నగరంపై నిరాసక్తత ఉద్యోగాలు, వ్యాపారాల కోసం గ్రేటర్ వరంగల్లో నివాసం ఉంటున్న వేలాది మంది ఓటర్లు తమ శాశ్వత నివాసం గ్రామాలేనని, అక్కడే ఓటు హక్కు కొనసాగించాలని భావిస్తున్నారు. దీంతో గ్రామీణ నియోజకవర్గాలు, మండలాల్లోనే తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారు. అందువల్ల గ్రేటర్ వరంగల్ నగరంలో తమ పేర్లు నమోదు చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లినా చాలామంది ఫారాలు తీసుకున్నా తిరిగి ఇవ్వట్లేదని తెలుస్తోంది. ఫలితంగా హనుమకొండ జిల్లాలో ఇప్పటి వరకు 5,09,014 ఫారాలు పంపిణీ చేయగా.. 3,86,676 (75.97 శాతం) డిజిటైజేషన్ అయ్యాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం వరంగల్ నగరంలో 1,82,991 (63.91 శాతం)లు ఎన్యుమరేషన్ పత్రాలు (ఈఎఫ్) నింపి ఇచ్చారు. వరంగల్ జిల్లాలో మూడు నియోజకవర్గాలు చూస్తే 7,76,953 లకు 6,52,211 (83.94 శాతం) డిజిటైజ్ కాగా, వరంగల్ తూర్పులో డిజిటైజేషన్1,67,115 (64.17 శాతం)లే కావడం గమనార్హం. వరంగల్ తూర్పు. పశ్చిమలో 35 శాతం వరకు తక్కువ నమోదు కాగా.. రెండు జిల్లాల్లోని మిగతా నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాలకు చెందిన మండలాల్లో 78 శాతం నుంచి 99.81 శాతం వరకు డిజిటైజ్ అయ్యాయి. డివిజన్ల పెంపుపై ప్రభావం గ్రేటర్ వరంగల్లో ఉన్న 66 డివిజన్లను 88కు పెంచాలన్న ప్రతిపాదన 2025 ఆగస్టులో మొదలైంది. పాలకవర్గం పదవీకాలం 2026 మే 7తో ముగియకముందే డివిజన్ల పునర్విభజన పూర్తి చేయాలనే పట్టుదలలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా డివిజన్ల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వంతో 2025 డిసెంబర్లో చర్చించినట్లు కూడా ప్రకటించారు. 66 డివిజన్లను 88కి మార్చాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. 2011 జనాభా లెక్కలు, కొత్త ఓటర్ల జాబితా ఆధారంగా 12–13 వేల జనాభా నుంచి 7–9 వేల ఓటర్ల లెక్కల ఆధారంగా కొత్త అంచనాలు వేసినట్లు కూడా ప్రచారం జరిగింది. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యాక డూప్లికేట్ నమోదుల తొలగింపు, వరంగల్ నగరంలో ఫారాలు సమర్పించని ఓటర్ల వివరాల పరిశీలన పూర్తయితే తుది సంఖ్యలో మార్పులు కనిపించే అవకాశముందని ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తున్న వర్గాలు భావిస్తున్నాయి. ఎస్ఐఆర్ తుది జాబితా తర్వాత గ్రేటర్ వరంగల్లో ఓటర్ల సంఖ్యలో వచ్చే మార్పులే డివిజన్ల పునర్విభజన దిశను నిర్ణయించే అవకాశముందన్న చర్చ రాజకీయ, అధికార వర్గాల్లో సాగుతోంది.వరంగల్ పశ్చిమజిల్లాలో మొత్తం ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ డిజిటైజ్ చేసిన ఫారాలు డిజిటైజేషన్వరంగల్ తూర్పుసర్ పురోగతి ఇదీ..ఆగస్టు 3 ప్రత్యేక ఓటర్ల సవరణకు గడువు. మరో తొమ్మిది రోజుల గడువే ఉండగా, శుక్రవారం నాటికి గ్రేటర్ వరంగల్లో (రెండు నియోజకవర్గాల) సగటు 64.04 శాతం ఎన్యుమరేషన్ ఫారాలే బీఎల్ఓలకు అందాయి. ఇల్లిల్లూ తిరిగినా రెండు చోట్ల నమోదుకు అవకాశం లేకపోవడంతో తిరిగి ఇవ్వడానికి విముఖత వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. పెద్ద ఎత్తున డూప్లికేట్ నమోదుల తొలగింపు, స్వగ్రామాల్లోనే ఓటు కొనసాగించాలనే ధోరణి కొనసాగితే తగ్గే అవకాశం ఉందని ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తున్న వర్గాలు భావిస్తున్నాయి. స్వగ్రామాల్లోనే ఓటు కొనసాగించాలనే ధోరణితో పాటు డూప్లికేట్ నమోదుల తొలగింపు వంటి అంశాలు దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే ఎస్ఐఆర్ తుది జాబితా తర్వాత స్పష్టత రానుంది. వృత్తి, ఉద్యోగరీత్యా నగరంలో జీవనం ఎన్యూమరేషన్ పత్రాలు తిరిగి ఇచ్చేందుకు విముఖత ‘ఎస్ఐఆర్’ ప్రక్రియలో తగ్గుతున్న నమోదు -
పోలీస్ ప్రెస్మీట్లపై పునరాలోచన?
సాక్షి, వరంగల్: ఏదైన కేసులో అరెస్ట్ చేసిన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి ప్రెస్మీట్లు నిర్వహించడం పోలీస్శాఖలో చాలాకాలంగా కొనసాగుతున్న పద్ధతి. ఇటీవలి కాలంలో ఈ విధానంపై న్యాయపరంగా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా గుర్తింపు సాక్ష్యం (ఐడెంటిఫికేషన్ ఎవిడెన్స్), నిందితుల హక్కులు, నిష్పాక్షిక విచారణ వంటి అంశాలు కోర్టుల్లో తరచూ చర్చకు వస్తుండటంతో దర్యాప్తు సంస్థలు కూడా మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఇందులో భాగంగానే వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ప్రెస్నోట్లకే పరిమితం కావాలనే చర్చ అంతర్గతంగా సాగుతోంది. కాగా, ప్రెస్మీట్ల నిర్వహణలో మార్పులపై ఎటువంటి అధికారిక ఉత్తర్వులు మాత్రం రాలేదు. గుర్తింపు సాక్ష్యమే ప్రధాన అంశం.. హత్యలు, దోపిడీలు, చోరీలు వంటి కేసుల్లో బాధితులు లేదా ప్రత్యక్ష సాక్షులు నిందితులను గుర్తించడం కీలకమైన అంశం. ఇందుకోసం టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ నిర్వహిస్తారు. దీని ఉద్దేశం బాధితుడు లేదా సాక్షి, సంఘటన సమయంలో చూసిన వ్యక్తినే గుర్తిస్తున్నాడా లేదా అన్నది నిర్ధారించడం. నిందితుల ఫొటోలు, వీడియోలు ముందుగానే పత్రికలు, టెలివిజన్, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వస్తే, అనంతరం జరిగే గుర్తింపు ప్రక్రియ విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. పైకోర్టుల్లో వస్తున్న వాదనలు.. న్యాయవర్గాల సమాచారం ప్రకారం... కొన్ని క్రిమినల్ అప్పీళ్లు, లీవ్ పిటిషన్లలో శిక్షపడిన ఖైదీలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ‘సాక్షులు ఘటనా స్థలిలో చూసి కాదు.. మీడియా ద్వారా ప్రచారంలోకి వచ్చిన ఫొటోలు చూసి గుర్తించారు’ అనే వాదనలు వినిపిస్తున్న సందర్భాలున్నాయని న్యాయవాదులు పేర్కొంటున్నారు. అలాంటి వాదనలు వచ్చిన ప్రతిసారీ కోర్టులు గుర్తింపు సాక్ష్యాన్ని ఇతర ఆధారాలతో కలిపి పరిశీలిస్తాయి. కేవలం ఈ ఒక్క కారణంతోనే తీర్పు మారిపోతుందని చెప్పలేమని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు. చార్జ్షీట్ దాఖలయ్యే వరకు, కోర్టు దోషిగా నిర్ధారించే వరకు ప్రతి వ్యక్తి చట్టపరంగా నిందితుడే తప్ప దోషి కాదనే సూత్రాన్ని సుప్రీంకోర్టు పలుమార్లు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అరెస్ట్ట్ చేసిన వ్యక్తులను మీడియా ముందు ప్రదర్శించడంపై గతంలోనూ మానవ హక్కుల సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. న్యాయ నిపుణులు కూడా దర్యాప్తుపై ప్రభావం చూపే విధంగా ప్రచారం ఉండకూడదని సూచిస్తున్నారు. అధికారికంగా స్పష్టత లేదు.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రెస్మీట్లకు బదులుగా ప్రెస్నోట్లకు ప్రాధాన్యమివ్వాలనే అంశంపై పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. ఈ విషయమై వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతను ఫోన్లో సంప్రదించగా ‘కిందిస్థాయిలో జరిగే చర్చలపై అధికారికంగా స్పందించడం సాధ్యం కాదు’ అని బదులిచ్చారు. దీంతో ఈ అంశంపై అధికారిక ఽధ్రువీకరణ లేనప్పటికీ, న్యాయపరమైన పరిణామాల నేపథ్యంలో పోలీస్ వ్యవస్థలో చర్చ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిందితులను మీడియా ముందు ప్రదర్శించాల్సిన అవసరం ఎంత? కేసు వివరాలను ప్రెస్నోట్ల ద్వారా తెలియజేస్తే సరిపోదా? అనే చర్చ పోలీసు వర్గాలు, న్యాయవర్గాల్లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు ప్రజలకు సమాచారం చేరాలి. మరోవైపు దర్యాప్తు, గుర్తింపు ప్రక్రియ, నిందితుడికి లభించే న్యాయపరమైన హక్కులు కూడా పరిరక్షించాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యత ఎలా ఉండాలన్నదే ప్రధాన చర్చగా మారింది.వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ప్రెస్నోట్లకే పరిమితం కావాలనే చర్చ న్యాయపరమైన చిక్కులు, గుర్తింపు సాక్ష్యంపై కొనసాగుతున్న వాదనలు టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్కు ముందే మీడియాలో నిందితుల ఫొటోలపై చర్చ కొన్ని అప్పీళ్లు, ఎల్పీల్లో గుర్తింపు ప్రక్రియపై అభ్యంతరాలు ప్రెస్మీట్ల నిర్వహణలో మార్పులపై లేని అధికారిక ఉత్తర్వులు -
దేశ రక్షణకు కాంగ్రెస్తో పనిచేస్తాం
ఖిలా వరంగల్: దేశాన్ని కాపాడేందుకు కాంగ్రెస్తో కలిసి పనిచేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం వరంగల్లోని మార్కండేయ నగర్లో నిర్మించిన సీపీఐ కార్యాలయం ఏబీ బర్ధన్ భవనాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఆయూబ్, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనవాసరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ బాష్మియాతో కలిసి కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. పార్టీ నగరశాఖ కార్యదర్శి ఎండీ అక్బర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అసమర్థ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పోరాడతాయన్నారు. పేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని, వారికి ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలందరికీ పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఐ నేతలు మేకల రవి, విజయ్ సారథి, కర్రె భిక్షపతి,, జ్యోతి, మంజుల, రమేశ్, భిక్షపతి, దండు లక్ష్మణ్, పనాస ప్రసాద్, బద్రి, గన్నారపు రమేశ్, బుస్స రవీందర్, చెన్న కేశవులు, ఎలేందర్, శంకరయ్య, భవాని, కుమార్, రంజిత్, తస్లీమ్ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఘనంగా ఏబీ బర్ధన్ భవనం ప్రారంభం -
ప్రజా ఉద్యమంలా ‘తెలంగాణ జలసిరి’
● హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్ : రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం నేపథ్యంలో నీటిఎద్దడి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘తెలంగాణ జలసిరి’ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా చేపట్టి విజయవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎంపీడీఓలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జల సంరక్షణ పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ ప్రతీ వర్షపునీటి చుక్కను ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వీబీజీ–రామ్జీ పథకం కింద గ్రామాల్లో ఇంకుడుగుంతలు, ఊట కుంటలు, పంట కుంటలు, బోరుబావుల రీచార్జ్ నిర్మాణాలను విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు. అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు బోరుబావుల రీచార్జ్కు ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సరైన పంటలు, విత్తనాల ఎంపికపై సీడ్ మేళా సదస్సుల ద్వారా రైతులకు వివరించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సోమవారం నాటికి కాంటింజెన్సీ ప్రణాళిక నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో తెలంగాణ జలసిరి కార్యక్రమం కింద జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను డీఆర్డీఓ మేన శ్రీను వివరించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ శేషాద్రి, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీరమాకాంత్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. -
నిలిచిన నీరు.. ప్రయాణికుల బేజారు
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ ఆవరణ కంపుకొడుతోంది. సిటీ బస్ స్టేషన్లో హైదరాబాద్ రూట్ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు నిలిపే ప్లాట్ ఫాం–1, ప్లాట్ ఫాం–2 ప్రాంతంలో ఇటీవలి వర్షాలకు మురుగు నీరు నిలిచింది. చిన్నపాటి వర్షం కురిసినా బస్ స్టేషన్లోకి నీరు చేరుతోంది. ఏళ్లుగా ఈ సమస్య ఇలాగే ఉంటున్నప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం శాశ్వత పరిష్కారం చూపట్లేదనే విమర్శలున్నాయి. సిటీ బస్స్టేషన్లోని ప్లాట్ ఫాం–1, ప్లాట్ ఫాం–2లో మురుగు నీరు నిల్వ ఉండి బస్సులు నిలిపే పరిస్థితి లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధి చెందుతున్న ఈగలు, దోమలు సిటీ బస్ స్టేషన్ ప్లాట్ ఫాంల సమీపంలో మురుగు నీరు నిలిచి దోమలు, ఈగలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ కార్యాలయం అక్కడే పై అంతస్తులో ఉన్నప్పటికీ అధికారులు తమకేమీ పట్టదనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఎం, డిప్యూటీ ఆర్ఎంలు, ఇతర అధికారులకు సమస్య కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, బస్సులు ఎక్కి, దిగే క్రమంలో నీటి నిల్వ కారణంగా ప్రయాణికులు జారి కింద పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని వారు కోరుతున్నారు.● మురుగు నీటితో ప్రయాణికుల అవస్థలు ● శాశ్వత పరిష్కారం చూపడంలో ఆర్టీసీ విఫలం! -
దాశరథి జీవితం ఆదర్శప్రాయం
● అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరస్వామి విద్యారణ్యపురి: దాశరథి కృష్ణమాచార్య తెలంగాణ మహా కవిగా ఎదిగారని, ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లేరు వీరస్వామి అన్నారు. గురువారం హనుమకొండలోని సమత హైస్కూల్లో తెలంగాణ మహా కవి దాశరథి జయంతిని అభ్యుదయ రచయితల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దాశరథి రచనలు తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తిదాయకంగా నిలిచాయన్నారు. ప్రధాన వక్తగా అరసం వరంగల్ ప్రధాన కార్యదర్శి మార్కశంకర్నారాయణ మాట్లాడుతూ దాశరథి సాంప్రదా యక కుటుంబం నుంచి వచ్చినా వామపక్ష భావాలతో ఎదిగి ప్రత్యక్షంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న గొప్ప యోధుడన్నారు. ‘తిమరంతో సమచం’ అనే కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1974లో దాశరథికి వచ్చిందన్నారు. కాగా, గద్వాల సోమన్న రాసిన సిరిమల్లె చెట్టు 103వ పుస్తకాన్ని అరసం రాష్ట్ర అధ్యక్షుడు నిధి బ్రహ్మచారి ఆవిష్కరించారు. బాధ్యుడు పిట్ట సాంబయ్య పుస్తకాన్ని సమీక్షించగా దాశరథిపై మార్క శంకర్నారాయణ రాసిన పాటను వీరస్వామి ఆవిష్కరించారు. ఆ హైస్కూల్ కరస్పాండెంట్ కరుణాసాగర్రావు, అరసం బాధ్యులు రామబ్రహ్మం, మాజీ జిల్లా విద్యాశాఖాధికారి రామేశ్వర రాజు, రాజన్న, వెంకటేశ్వర్లు, కోటేశ్వర్రావు, రాంగారావు, అనిత, లావణ్య తదితరులు పాల్గొన్నారు. -
పర్యవేక్షణ లేకపోతే నష్టమే..
అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో బంగారు నగల కొనుగోలుదారుడికి రెండు విధాలా నష్టం జరిగే అవకాశం ఉంది. హాల్మార్క్ లేని లేదా నాణ్యతా ప్రమాణాలు లేని బంగారం కొనడం, టెస్టింగ్ సెంటర్ నివేదికల్లో వాస్తవానికి మించి నాణ్యత చూపించే అవకాశం ఉంటే, వినియోగదారుడు తప్పుడు ధ్రువీకరణ ఆధారంగా కొనుగోలు చేసే పరిస్థితి ఉంటుంది. లీగల్ మెట్రాలజీ విభాగానికి పర్యవేక్షణ అధికారులు ఉన్నా పట్టించుకోకపోవడంతోనే ఈ మోసాలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికై నా దృష్టి సారించాలి. – సాంబరాజు చక్రపాణి, వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి ● -
రూ.కోట్లలో పసిడి లావాదేవీలు.. నాణ్యత తనిఖీలు శూన్యం
● నిబంధనల అమలులో తూనికలు, కొలతల శాఖ నిర్లక్ష్యం ● బీఐఎస్ దాడులతో మరోసారి వెలుగులోకి వచ్చిన లోపాలు ● టెస్టింగ్ సెంటర్లపై నియంత్రణతో కొనుగోలుదారులకు భరోసాసాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్లో రూ.కోట్లలో బంగారు ఆభరణాల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. నాణ్యతా ప్రమాణాల తనిఖీల్లో తూనికలు, కొలతల శాఖల నిర్లక్ష్యంపై విమర్శలొస్తున్నాయి. బంగారు ఆభరణాల అమ్మకాల్లో బిల్లుల పారదర్శకత, నాణ్యతా ప్రమాణాల తనిఖీలు, టెస్టింగ్ సెంటర్ల నియంత్రణ వంటి కీలక బాధ్యతలు ఈ శాఖకు ఉన్నా.. వాటి అమలులో చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై అందరికీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల వరంగల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అధికారులు నిర్వహించిన దాడుల్లో హాల్మార్క్ లేని రూ.10 కోట్ల విలువైన 7.875 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. నాణ్యత తనిఖీలు, ప్రత్యేక డ్రైవ్లు, వినియోగదారుల అవగాహన సదస్సులు కనిపించకపోవడం గమనార్హం. తనిఖీలు లేవా? లీగల్ మెట్రాలజీ (జనరల్) రూల్స్–2011లోని రూల్ 9(4) ప్రకారం బంగారం విక్రయించే దుకాణాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించాలి. విక్రయ రశీదులో బంగారం స్వచ్ఛత, క్యారెట్ వివరాలు, నికర బంగారం బరువు, రాళ్ల బరువు, ఇతర లోహాల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయించే బాధ్యత అధికారులదే. అలాగే రూల్ 9(5) ప్రకారం అవసరమైతే బంగారం, వెండి ఆభరణాల నాణ్యతపై పరీక్షలు చేసి వినియోగదారుల ప్రయోజనాలను కాపాడాలి. 2011 నుంచి ఈ నిబంధనలు అమల్లో ఉన్నా.. జిల్లాలో ఇప్పటివరకు లీగల్ మెట్రాలజీ శాఖ నగల నాణ్యతపై తనిఖీలు, టెస్టింగ్ నిర్వహించిన దాఖలాలు లేవనే విమర్శలున్నాయి. నగరంలో 45 టెస్టింగ్ సెంటర్లు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పదుల సంఖ్యలో ప్రైవేట్ గోల్డ్ టెస్టింగ్ సెంటర్లు పనిచేస్తున్నాయి. వరంగల్లో 30, హనుమకొండలో 15 టెస్టింగ్ సెంటర్లు వరకు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో ఎక్స్రే ఫ్లోరోసెన్స్ (ఎక్స్ఆర్ఎఫ్) యంత్రాల ద్వారా బంగారం స్వచ్ఛతను పరీక్షించి నివేదికలు ఇస్తున్నారు. ఈ కేంద్రాలకు లీగల్ మెట్రాలజీ శాఖ లైసెన్సులు జారీ చేయ డం లేదనే ఆరోపణలున్నాయి. పరికరాల కచ్చితత్వాన్ని తనిఖీ చేయడం లేదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా 2013 మే 26న వరంగల్లో అప్పటి ప్రాంతీయ డిప్యూటీ కంట్రోలర్ రామ్కుమార్ త్వరలో బంగారం స్వచ్ఛత కొలిచే యంత్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 13 సంవత్సరాలు గడుస్తున్నా స్వచ్ఛత పరీక్ష కేంద్రం ఏర్పాటు కాలేదు. అతిపెద్ద మార్కెట్ వరంగల్..వరంగల్, హనుమకొండ, కాజీపేటలో సుమారు 500 వరకు చిన్నాపెద్ద బంగారు ఆభరణాల దుకాణాలున్నాయి. సాధారణ రోజుల్లో మొత్తం వ్యాపారం రూ.ఐదు కోట్ల నుంచి రూ.10 కోట్లపైగా ఉంటుంది. శుభ ముహూర్తాలు, అక్షయ తృతీయ, ధనత్రయోదశి, పెళ్లిళ్ల సీజన్లో ఈ విక్రయాలు రెట్టింపవుతాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరంగల్, హనుమకొండతో పాటు మహబూబాబాద్, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ప్రజలు కూడా బంగారం కొనుగోళ్ల కోసం ఇక్కడికే వస్తుంటారు. అందుకే వరంగల్ అతిపెద్ద మార్కెట్గా ఉంది. జిల్లాస్థాయిలో గోల్డ్ ప్యూరిటీ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు. అన్ని గోల్డ్ టెస్టింగ్ సెంటర్ల నమోదు, లైసెన్సింగ్. ఎక్స్ఆర్ఎఫ్ యంత్రాలకు కాలానుగుణ క్యాలిబ్రేషన్, ధ్రువీకరణ జ్యువెలరీ షాపులపై ప్రత్యేక తనిఖీ డ్రైవ్లు. బిల్లుల్లో నికర బంగారం, రాళ్ల బరువు, స్వచ్ఛత వివరాల పరిశీలన. వినియోగదారుల ఫిర్యాదులపై వేగవంతమైన పర్యవేక్షణ వ్యవస్థ -
31న నేషనల్ జావెలిన్ త్రో డే వేడుకలు
వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 31వ తేదీన 5వ నేషనల్ జావెలిన్్ త్రో డే వేడుకలు నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సారంగపాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అండర్–6 నుంచి అండర్–20 విభాగాల్లో మెన్ అండ్ ఉమెన్లో జావెలిన్ త్రో ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీలో పాల్గొనే క్రీడాకారులు తప్పనిసరిగా జనన ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని, ఇందులో ఎంపికై నవారు ఆగస్టు 7న హనుమకొండ జేఎన్ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు, ఇతర వివరాలకు 93901 04499, 99120 22188 నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు. ట్రిప్లింగ్ ప్రాజెక్టు పనులు పూర్తి ● రైళ్ల ట్రాఫిక్ క్లియర్ కాజీపేట రూరల్ : కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని దక్షిణ మధ్య రైల్వే గ్రాండ్ ట్రంక్ మార్గంలో కాజీపేట–బల్లార్షా ట్రిప్లింగ్ రైల్వే లైన్ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తయినట్లు గురువారం రైల్వే అధికారులు తెలిపారు. ఆసిఫాబాద్–సిర్పూర్కాగజ్నగర్ మధ్య 11 కిలో మీటర్లు మేర చివరి దశ పనులు విద్యుద్దీకరణతో సహా పూర్తయినట్లు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే సుమారు రూ.3,000 కోట్ల వ్యయంతో దశల వారీగా కాజీపేట–బల్లార్షా మధ్య 203 కిలోమీటర్ల మేర ట్రిప్లింగ్, విద్యుద్దీకరణ పనులు విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. దీంతో గ్రాండ్ ట్రంక్మార్గంలో ప్రయాణించే రైళ్లు, సరుకు రవాణా రైళ్ల రాకపోలకు అంతరాయం ఉండదన్నారు. కాజీపేట–బల్లార్షా మార్గం దేశంలోనే ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలిపే ఒక కీలక రైలు మార్గంగా నిలుస్తోందని అధికారులు తెలిపారు. -
ఢిల్లీ విద్యార్థులకు మద్దతుగా ధర్నా
హన్మకొండ: ఢిల్లీ విద్యార్థులకు మద్దతుగా గురువారం రాత్రి హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కులో విద్యార్థులు ధర్నా చేశారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించడంపై స్పందించిన వరంగల్ నగరానికి చెందిన, కిట్స్ కళాశాల విద్యార్థిని శ్రీనిత ‘ఢిల్లీలో పోరాటం చేస్తున్న విద్యార్థులకు మనం మద్దతు ఎందుకు ఇవ్వకూడదు.. వరంగల్ కేంద్రంగా ధర్నా చేద్దాం’ అని ఇన్స్టాలో రీల్ పోస్టు చేసింది. స్పందించిన విద్యార్థులు వరంగల్ మహానగరంతోపాటు వివిధ ప్రాంతాలనుంచి భారీగా తరలివచ్చారు. ధర్నా అనంతరం కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వీరికి తెలంగాణవాది సంగంరెడ్డి పృథ్వీరాజ్తోపాటు మరికొందరు సంఘీభావం తెలిపారు. ఇన్స్టాలో రీల్కు స్పందించి భారీగా చేరుకున్న విద్యార్థులు -
త్వరితగతిన పూర్తి చేయాలి
పీవీ విజ్ఞాన కేంద్ర పనులు భీమదేవరపల్లి : పీవీ విజ్ఞాన కేంద్ర పనులు త్వరితగతిన పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. ఈ మేరకు గురువారం భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని కస్తూర్బా విద్యాలయాన్ని తనిఖీ చేయడంతోపాటు వంగర గ్రామంలో నిర్మిస్తున్న పీవీ విజ్ఞాన కేంద్రం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అనంతరం మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావు స్వగ్రామం వంగరలో నిర్మిస్తున్న ‘పీవీ విజ్ఞాన కేంద్రం’ పనులను తనిఖీ చేశారు. నిర్మాణం తుది దశకు చేరుకోవడంతో ఆర్ట్ గ్యాలరీ, ఆడిటోరియం, విద్యుత్ దీపాలు, తాగునీటి సౌకర్యాలు, ప్రాంగణంలోని మొక్కల నిర్వహణను పరిశీలించారు. పనులను మరింత వేగవంతం చేసి త్వరలోనే ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సర్పంచ్ గజ్జెల సృజనరమేశ్, ‘కుడా’ సీపీఓ అజిత్ రెడ్డి, డీఈ రఘు, జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, తహసీల్దార్ రాజేశ్, ఎంపీడీఓ వీరేశం, ఎస్ఓ జ్యోతి పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ -
విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలి
కాళోజీ సెంటర్: విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని, ప్రాజెక్టుల రూపకల్పనలో విద్యార్థులను భాగస్వాములను చేయాలని వరంగల్ జిల్లా సైన్న్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్ అన్నారు. జాతీయ బాలల సైన్న్స్ కాంగ్రెస్ (ఎన్సీఎస్సీ) ప్రాజెక్టులపై తాళ్ల పద్మావతి ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రైవేట్ పాఠశాలల సైన్న్స్ ఉపాధ్యాయులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు తమ గ్రామం లేదా నివాస ప్రాంతాల్లోని స్థానిక సమస్యలను గుర్తించి, వాటికి శాసీ్త్రయ మార్గాల్లో పరిష్కారాలు చూపించేలా ఉపాధ్యాయులు మార్గదర్శనం చేయాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ కోఆర్డినేటర్ కటంగూరు రాంగోపాల్రెడ్డి, జిల్లా అకడమిక్ కోఆర్డినేటర్ చల్లా కృష్ణారెడ్డి, రిసోర్స్ పర్సన్ పెట్లోజు సురేశ్బాబు, టెక్నికల్ అసిస్టెంట్ శ్రవణ్కుమార్, పాఠశాల డైరెక్టర్ తాళ్ల వరుణ్, పలు పాఠశాలల ప్రిన్సిపాళ్లు, సైన్న్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
జ్ఞాన శక్తిని, కుల సుందరీ అలంకరణలో అమ్మవారు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో శాకంబరీ మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం 4 గంటలకు నిత్యాహ్నికం పూర్తి చేసి అమ్మవారి ఉత్సవమూర్తులను ఇచ్ఛాశక్తిని కాళీక్రమాన్ని అనుసరించి దీప్తా, కులసుందరి (రూపం) క్రమంలో అమ్మవారికి పూజలు చేశారు. షోడశీ క్రమాన్ని అనుసరించి భద్రకాళి మాతను జ్ఞానశక్తి కుల సుందరీదేవీగా అలంకరించగా.. ఆలయ పూజారులు అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అమ్మవారు జ్ఞాన శక్తి కుల సుందరీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ ఈఓ రాముల సునీత తీర్థప్రసాదాలు వితరణ చేశారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు పాల్గొన్నారు. వరంగల్ లీగల్: హైకోర్టు న్యాయమూర్తి, ఉభయ జిల్లాల పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేనారెడ్డి ఈనెల 25న (శనివారం) హనుమకొండ జిల్లా కోర్టుకు రానున్నారు. హనుమకొండ జిల్లాకు నూతనంగా మంజూరైన అదనపు జిల్లా కోర్టు, రెండు జూనియర్ సివిల్ కోర్టులను ప్రారంభించనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు అయన జిల్లా కోర్టు ప్రాంగణంలోని 10 కోర్టుల భవనంలో ఈ ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. వరంగల్ చౌరస్తా: రానున్న ఎన్నికల్లో గ్రేటర్ వరంగల్పై బీజేపీ జెండా ఎగురవేద్దామని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం వరంగల్ 28వ డివిజన్ రామన్నపేట పార్టీ వరంగల్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రేమేందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి, రైతుల సంక్షేమం కోసం బీజేపీ ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో పార్టీ కార్యవర్గ ప్రతినిధుల బృందం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాశిబుగ్గ: వరంగల్ తూర్పులోని ప్రతీ బూత్లో బీఎల్ఓతో బూత్ ఇన్చార్జ్లు కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జ్ అహ్మద్ నసీర్ అన్నారు. గురువారం తూర్పు నియోజకవర్గంలోని 24 డివిజన్ల కాంగ్రెస్ ఎస్ఐఆర్ ఇన్చార్జ్ల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు గోపాల నవీన్రాజు, వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ప్రక్రియ ఆగస్టు 3 వరకు చివరి తేదీ కావడంతో ఓటరు నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు. ఈసందర్భంగా ఆయన ప్రతీ పోలింగ్ బూత్లో జరుగుతున్న తీరును డివిజన్ ఇన్చార్జ్లను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో 24 డివిజన్ల ఇన్చార్జులు పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2026
కాజీపేట: కాజీపేట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు దశాబ్ద కాలంగా నత్తనడకన సాగుతున్నాయి. ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా మారాయి. 2017లో అప్పటి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కాజీపేట రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జికి భూమి పూజ చేశారు. ఇప్పటికీ ఆ పనులు తుది దశకు చేరుకోలేదు. దీంతో వాహనదారులు నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారు. నాలుగున్నర దశాబ్దాల క్రితం అప్పటి ప్రజల అవసరాలకు తగినట్లుగా నిర్మించిన ఈబ్రిడ్జి ప్రస్తుతం నెర్రెలు బారింది. పెచ్చులు ఊడి పడుతున్నాయి. బ్రిడ్జి పనులు కొనసాగుతున్నట్లుగా కనిపించినప్పటికీ పురోగతి ఏమాత్రం కనిపించట్లేదని వాహనదారులు వాపోతున్నారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అధికారులతో కలిసి పనులు పరిశీలంచడంతో పాటు పురోగతిపై సమీక్షించినప్పటికీ పనుల్లో ఆశించిన పురోగతి కనిపించట్లేదు. నిధుల కొరత, పరిపాలనా జాప్యం, శాఖల మధ్య సమన్వయ లోపం వంటి కారణాలతో బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఆలస్యమవుతున్నట్లుగా తెలుస్తోంది. నిత్యం బ్రిడ్జిపై ట్రాఫిక్ జామ్ అవుతోంది. రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖ దృష్టి సారించి పనులు పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సమన్వయ లోపం.. తరచూ ట్రాఫిక్ జామ్ వాహనదారులకు ఇబ్బందులు -
జర్మనీ బృందంతో వీసీ చర్చలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్రెడ్డి ఉన్నత విద్యాశాఖాధికారుల, పలువురి వీసీల బృందంతో కలిసి ఇటీవల జర్మనీలో పర్యటించిన విషయం విధితమే. అక్కడి రెట్లిన్జెన్ యూనివర్సిటీలో కూడా పర్యటించారు. ఈ సందర్భంగా సమర్పించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్కు కొనసాగింపుగా ఆ జర్మనీ యూనివర్సిటీ బృందం గురువారం తెలంగాణను సందర్శించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో ముందుస్తుగా హైదరాబాద్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ప్రతినిధి బృందంతో విద్య, పరిశోధన, అధ్యాపకుల, విద్యార్థుల పరస్పర మార్పిడి కార్యక్రమాలపై అభిప్రాయాలు పంచుకున్నట్లు వీసీ ప్రతాప్రెడ్డి తెలిపారు. ముఖ్యంగా కేయూలోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 3ప్లస్2 విధానంలో మూడు సంవత్సరాలు, కేయూలో బీటెక్ విద్యనభ్యసించి అనంతరం రెండు సంవత్సరాలు జర్మనీలోని ఆ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తిచేసేలా అవకాశాలపై చర్చించినట్లు తెలిపారు. వీసీ వెంట కేయూ ఓఎస్డీ బి. వెంకట్రామ్రెడ్డి, యూసీసీ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ ఆర్. మల్లికార్జున్రెడ్డి, కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎన్. రమణ, మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కె. భిక్షాలు పాల్గొన్నారు. -
‘ఎస్ఐఆర్’ ప్రక్రియకు సహకరించాలి
హన్మకొండ అర్బన్: గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కోరారు. జిల్లాలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిపై గురువారం కలెక్టరేట్లో అధికారులతో పాటు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఇందులో అదనపు కలెక్టర్ ఎన్.రవి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, హనుమకొండ ఆర్డీఓ వెంకటేశ్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్సింగ్, కాజీపేట తహసీల్దార్ రాజు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు రావు అమరేందర్ రెడ్డి, ఎండీ.నేహాల్, బి.ప్రవీణ్ కుమార్, గొడుగు వెంకట్, అంబాల ప్రశాంత్, కె.సంపత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినూత్న సాంకేతికతకు ప్రాధాన్యం జల వనరుల సమర్థ నిర్వహణ, నీటి వృథా నివారణ, మురుగునీటి శుద్ధి, భూగర్భ జలాల పరిరక్షణకు వినూత్న సాంకేతికతలను జీడబ్ల్యూఎంసీ పరిధిలో ప్రోత్సహిస్తున్నట్లు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఎన్ఐటీ వరంగల్ ఆధ్వర్యంలో రూపొందించిన మురుగునీటి శుద్ధి సాంకేతికత, ఐఓటీ ఆధారిత స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్ వ్యవస్థలపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. కలెక్టర్ పరిశీలించారు. ఇందులో సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎస్.రాజ్కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మహేందర్, సంజయ్, డీఈ స్పందన, ఎనన్ఐటీ వరంగల్ ప్రొఫెసర్ డాక్టర్ శిరీష్, స్టార్టప్ ప్రతినిధి హిరణ్య తల్లం, ఆస్కీ కో–ఆర్డినేటర్ రాజమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష -
భూ రీసర్వే పనులు పూర్తిచేయాలి
న్యూశాయంపేట: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని భూముల రీసర్వే పనులు పారదర్శకంగా, వేగంగా పూర్తిచేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. లైసెన్స్డ్ సర్వేయర్లకు కేటాయించిన గ్రామాల్లో సర్వే పనులు గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు. ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి ఎలినినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదవుతున్నందున తాగునీరు, సాగునీరు, పశుగ్రాసం విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టర్ చాంబర్లో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీడీలు, తహసీల్దార్లు, వ్యవసాయశాఖ అధికారులు ప్రతి గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని అంచనా వేసి రోజువారీ నివేదికలను సమర్పించాలని కోరారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, డీఆర్వో విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, వ్యవసాయశాఖాధికారి విజయభాస్కర్,, ఏడీ సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ రాజేంద్రచారి, సిబ్బంది, సర్వేయర్లు పాల్గొన్నారు. సమీక్షలో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
సూచికల ఆవిష్కరణలు
నేడు ప్రకృతి వైద్య గ్రంథ కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హ్యుమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ విభాగం విశ్రాంత ఆచార్యుడు గజ్జెల రామేశ్వరం హనుమకొండలోని ప్రకాశ్రెడ్డి పేటలో తన ఇంట్లోనే ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ నేచురోపతి లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్ శుక్రవారం ఏడు వసంతాలు పూర్తి చేసుకుని ఎనిమిదో వసంతంలోకి అడుగిడబోతుంది. దేశ, విదేశీ భాషల్లో 5 వేలకు పైగా ప్రకృతి వైద్యానికి సంబంధించిన పుస్తకాలు, జర్నల్స్ ఈ లైబ్రరీలో అందుబాటులో ఉంచారు. ఆసక్తి ఉన్న వారికి ఉచితంగానే చదువుకునే అవకాశం కల్పించిన విషయం విధితమే. అరుదైన ప్రకృతి వైద్య గ్రంథ సూచికలు రాసిన రామేశ్వరం నేచురోపతి లైబరీ రీసెర్చ్ సెంటర్లో ఉన్న అరుదైన ప్రకృతి వైద్య పుస్తకాలు, వివిధ జర్నల్స్ ముఖ్యంగా వివిధ రోగాలను ఎలా ప్రకృతి వైద్య పరంగా నివారించుకోవాలనే అంశంపై ఆచార్య రామేశ్వరం 25 గ్రంథ సూచికలు రాశారు. అందులో 11 వరకు ఈనెల 24న ఉదయం 10: 30 గంటలకు కేయూ పరిపాలన భవనంలోని సెనెట్హాల్లో ఆవిష్కరించబోతున్నారు. కేయూ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈ ప్రకృతి వైద్య గ్రంథ సూచికల ఆవిష్కరణ, రీసెర్చ్ సెంటర్ 8వ వార్షికోత్సవం నిర్వహించబోతున్నారు. ఆవిష్కరించనున్న ప్రకృతి వైద్య గ్రంథ సూచికలు ఇవే.. ప్రొఫెసర్ గజ్జెల రామేశ్వరం రాసిన గ్రంథ సూచికల్లో ముఖ్యంగా ప్రకృతిజీవన్ మాసపత్రిక వ్యాస సూచిక, ప్రకృతి వైద్యంలో రోగ నివారణ వృత్తాంతములు, డాక్టర్ వెంకట్రావు ప్రకృతి వైద్య వ్యాస సూచిక, ప్రకృతి వైద్య గ్రంథసూచి, డాక్టర్ విజయలక్ష్మి ప్రకృతి వైద్యవ్యాస సూచి, యోగా గ్రంథ సూచి, ఇంగ్లిష్లో ఇండెక్స్ టుది ఇండియన్ నేచురోపతి ఉన్నాయి. అలాగే, మరో రెండు హిందీ, మరొకటి మరాఠీ భాషలో ప్రకృతి వైద్య గ్రంథ సూచికలున్నాయి. వీటిని అతిథులు ఆవిష్కరించబోతున్నారు. రానున్న రెండు వర్సిటీల వీసీలు, ప్రముఖులు ప్రొఫెసర్ రామేశ్వరం రాసిన ఈ ప్రకృతి వైద్య గ్రంథాల వ్యాస సూచికల ఆవిష్కరణ కార్యకమంలో ముఖ్య అతిథిగా కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి, ప్రత్యేక అతిథులుగా మహాత్మాగాంధీ, తెలంగాణ యూనివర్సిటీల ఉప కులపతులు ఖాజాఅల్తాఫ్హుస్సేన్, టి. యాదగిరిరావు, రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రియాజ్, హైదరాబా ద్ సీసీఎంబీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ మోహన్రావు, హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ డైరెక్టర్ పి. ప్రసాద్, తదితరులు పాల్గొనబోతున్నారని రామేశ్వరం తెలిపారు. ఈ సభకకు కేయూ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సదానందం అధ్యక్షత వహిస్తారు. నేచురోపతి ఇంటర్నేషనల్ లైబ్రరీ రీసెర్చ్ సెంటర్ 8వ వార్షికోత్సవం కూడా.. కేయూకు రానున్న రెండు వర్సిటీల వీసీలు.. ప్రకృతి వైద్య ప్రముఖులు -
మహిళలను లక్షాధికారులను చేయండి
కాజీపేట అర్బన్: మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతీమహిళకు నెలకు రూ.2,500 అందజేసి లక్షాధికారులను చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. కాజీపేట మండలం మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్హాల్లో గురువారం పోచంపల్లి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా కేటీఆర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి 6,200 మంది మహిళలకు కుట్టుమిషన్లు అందజేసి మాట్లాడారు. పుట్టినరోజు ఆర్భాటంగా చేసుకుని వృథాగా డబ్బులు ఖర్చు చేయడం కంటే ఆత్మీయతతో ఓ చిరునవ్వు అందిస్తే చాలు అన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి గిఫ్ట్ ఏ స్మైల్ పేరిట కుట్టు మిషన్లు అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు. మహిళలు స్వయం ఉపాధి సాధించేందుకు కుట్టుమిషన్లను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని రవీందర్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, శంకర్నాయక్, సతీశ్బాబు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
పాఠశాలల అభివృద్ధిలో హెచ్ఎంలు కీలకం
● వరంగల్ విద్యాశాఖాధికారి రంగయ్యనాయుడుకాళోజీ సెంటర్: పాఠశాలల అభివృద్ధిలో ప్రధానోపాధ్యాయుల నాయకత్వం కీలకమని వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి బి.రంగయ్యనాయుడు అన్నారు. స్పెల్–3 కింద గెజిటెడ్ హెడ్మాస్టర్లు, ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్లు, గణిత ఉపాధ్యాయులకు మూడు రోజుల జిల్లాస్థాయి సామర్థ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం నగరంలోని శంభునిపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఈఓ రంగయ్యనాయుడు హాజరై మాట్లాడుతూ జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ–2020) లక్ష్యాలకు అనుగుణంగా విద్యార్థి కేంద్రిత బోధన, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్), అనుభవాత్మక అభ్యసనం అమలు చేయాలని సూచించారు. జిల్లా సైన్న్స్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ శిక్షణలో నాయకత్వ నైపుణ్యాలు, అకడమిక్ మానిటరింగ్, డిజిటల్ లెర్నింగ్, ఎన్ఈపీ–2020 అంశాలపై నిపుణులు అవగాహన కల్పిస్తారని తెలిపారు. విద్యాశాఖ అధికారులు, రిసోర్స్పర్సన్లు, ప్రధానోపాధ్యాయులు, గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మామునూరు ఎయిర్పోర్టు పనుల్లో కదలిక
సాక్షి, వరంగల్: మామునూరు విమానాశ్రయ నిర్మాణ పనులకు కీలక అడుగు పడింది. ఇప్పటికే రూ.203.49 కోట్లతో టెండర్ పిలిచిన ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు గురువారం మామునూరు విమానాశ్రయ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి అనంతరం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్లో ప్రీ–బిడ్ సమావేశం నిర్వహించారు. ఇందులో ఆరుగురు బిడ్డర్లు పాల్గొన్నారు. విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలను ఏఏఐ అధికారులు పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఒకేసారి 820మంది ప్రయాణికులకు సేవలందించే ఆధునిక టెర్మినల్ భవనం, రన్వే పునర్నిర్మాణం, గ్రౌండ్ సపోర్ట్ ఎక్విప్మెంట్ (జీఎస్ఈ) ఏరియా, మూడు ఆప్రాన్, లింక్ ట్యాక్సీవేలు, ఐసోలేషన్ బే, పెరీమీటర్ రోడ్డు, ఎమర్జెన్సీ యాక్సెస్ రోడ్డు తదితర పనుల రూపకల్పన, నాణ్యతా ప్రమాణాలు, అమలు విధానాన్ని వివరించినట్లు తెలిసింది. జూలై 29 నుంచి ఆగస్టు 12 వరకు బిడ్ దాఖలుకు అవకాశం ఉంటుందని, ఆగస్టు 18న బిడ్ ఓపెన్, సెప్టెంబర్ 7న ఫైనాన్షియల్ బిడ్ తెరుస్తారని వివరించారు. ఇప్పటికే ఖరారైన పెరీమీటర్ వాల్ టెండర్ ఇప్పటికే విమానాశ్రయ భద్రత దృష్ట్యా రూ.21 కోట్లతో పెరీమీటర్ వాల్ (ప్రహరీ గోడ) నిర్మాణానికి టెండర్ ఖరారైంది. అవసరమైన ప్రక్రియలు పూర్తికాగానే ఈ పనులు ప్రారంభం కానున్నాయి. భూమి రక్షణ, భద్రతా ప్రమాణాల పరిరక్షణలో ఈ పనులు కీలకంగా మారనున్నాయి. అలాగే రూ.270 కోట్ల అంచనా వ్యయంతో మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్మాల్, ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్, డ్రెయినేజీ వ్యవస్థ, విద్యుత్ మౌలిక సదుపాయాలు, యుటిలిటీ నెట్వర్క్లు, ఇతర అనుబంధ పనులకు అధికారులు మరో టెండర్ను త్వరలోనే పిలవనున్నారు. రూ.203.49 కోట్ల పనులపై ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారుల ప్రజంటేషన్ తొలుత మామునూరు ఎయిర్పోర్ట్ స్థల సందర్శన హనుమకొండలో ప్రీ–బిడ్ మీటింగ్ -
స్వీయ సంరక్షణే శ్రీరామ రక్ష..
జనగామ : తెలంగాణ రాష్ట్రంలో గుండె జబ్బులు, స్ట్రోక్ అత్యవసర కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరు స్వీయ రక్షణను జీవన శైలిలో భాగం చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యం భద్రంగా ఉంటుంది. అత్యవసర సమయంలో 108 సేవలను వినియోగించుకుని ఆరోగ్యం కాపాడుకోవాలి. వైద్యులు, ఆస్పత్రులపై పూర్తిగా ఆధారపడకుండా వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత. ఈ క్రమంలో జూలై 24న అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవం. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. 30 నుంచి 40 ఏళ్ల వయస్సు వారిలో పెరుగుతున్న గుండె సంబంధిత వ్యాధులు.. 108 ఈఎంఆర్ఐ అత్యవసర సేవల గణాంకాల ప్రకారం 2026 జనవరి నుంచి జూన్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 17,940 ఛాతి నొప్పి కేసులు, 5,025 స్ట్రోక్ అత్యవసర కేసులు నమోదవడం ఆందోళన కలిగించే అంశమని రాష్ట్ర 108 అంబులెన్స్ సేవల కార్యనిర్వాహక అధికారి బి.సుధాకర్ వెల్లడించారు. ముఖ్యంగా 30 నుంచి 40 ఏళ్ల వయస్సు వారిలో గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతుండగా, యువత కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నట్లు తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్లడ్ ప్రెషర్, రక్తంలో చక్కెర స్థాయి, లిపిడ్ ప్రొఫైల్ వంటి పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవడం, సమతుల ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం, పొగాకు, మద్యానికి దూరంగా ఉండడం, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం వంటి అలవాట్లు ఆరోగ్య రక్షణకు అత్యంత అవసరమని సూచిస్తున్నారు. హార్ట్ అనే ఐదు దశల స్వీయ సంరక్షణ ప్రణాళికను కూడా ప్రజలు పాటించాలని తెలిపారు. ప్రాణ రక్షణకు ముందస్తు జాగ్రత్తలే ముఖ్యం అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రా ల్, ఒత్తిడితో కూడిన జీవనశైలి స్ట్రోక్, గుండె జబ్బులకు ప్రధాన కారణాలుగా మారుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలే ప్రాణాలను కాపాడగలవని వైద్య నిపుణులు చెబుతున్నారు. శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యంపై సమాన శ్రద్ధతో పాటు డిజిటల్ డిటాక్స్ కూడా అవసరమని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా 108 అంబులెన్స్ సేవలకు వెంటనే కాల్ చేయడం కూడా స్వీయ సంరక్షణలో భాగమే కాకుండా సామాజిక బాధ్యత అని సుధాకర్ స్పష్టం చేశారు. ప్రజల్లో స్వీయ సంరక్షణపై అవగాహన పెరిగితే గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.ఉమ్మడి జిల్లాలో 108 అంబులెన్స్లు జిల్లా అంబులెన్స్ల సంఖ్య జనగామ 12 వరంగల్ 15 హనుమకొండ 16 జేఎస్ భూపాలపల్లి 11 మహబూబాబాద్ 15 ములుగు 14 అప్రమత్తతతోనే ఆరోగ్య భద్రత అత్యవసరంలో 108కు కాల్ చేయడం కీలకం పెరుగుతున్న గుండె జబ్బులు, స్ట్రోక్ కేసులు నేడు స్వీయ సంరక్షణ దినోత్సవం -
సహకార సంఘాన్ని
సందర్శించిన శ్రీలంక బృందంభీమదేవరపల్లి : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు సహకార గ్రామీణ బ్యాంకు, మార్కెటింగ్ సొసైటీని గురువారం శ్రీలంక ప్రజాప్రతినిధుల బృందం సందర్శించింది. భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10 రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో భాగంగా శ్రీలంకకు చెందిన 32 మంది ప్రజాప్రతినిధులు జూలై 20 నుంచి 29 వరకు భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ బృందం ముల్కనూరు సొసైటీని సందర్శించి పరిశీలించింది. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి శ్రీలంక ప్రతినిధులకు సొసైటీ చేపడుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, రైతుల ఆర్థిక బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి ప్రతినిధుల సందర్శన కోసం ముల్కనూరు కోఆపరేటివ్ సొసైటీని ఎంపిక చేయడం గర్వకారణమన్నారు. ముల్కనూరు మోడల్ ఇక్కడి సభ్య రైతుల జీవితాల్లో తెచ్చిన గణనీయమైన మార్పులకు ఈ సందర్శన నిదర్శనమన్నారు. శ్రీలంక ప్రతినిధులు తమ ప్రాంతాల్లో సాధ్యమైనంత వరకు ఈ మోడల్ విధానాలను అమలు చేసి రైతులకు మేలు చేకూర్చాలని సూచించారు. ఈ పర్యటనలో ముల్కనూరు సొసైటీ పాలకవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి
జనగామ/చిల్పూరు: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని వరంగల్ పోలీసు కమిషనర్ ఎన్. శ్వేత అన్నారు. ఈ మేరకు గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. జనగామ జిల్లా పరిధిలో జాతీయ రహదారి–163పై రఘునాథపల్లి మండలం నిడిగొండ–కోమళ్ల టోల్గేట్ ప్రాంతం, జనగామ మండలం యశ్వంతపూర్ వై–జంక్షన్తోపాటు ప్రమాదాలకు గురవుతున్న పలు బ్లాక్ స్పాట్లను పరిశీలించి ప్రమాదాలకు కారణమవుతున్న పరిస్థితులపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. జాతీయ రహదారి నుంచి గ్రామాలకు వెళ్లే అనుసంధాన రహదారులు, డివైడర్ ఓపెనింగ్ల వద్ద రాత్రి వేళల్లో వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా తగిన లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే, ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, దిశానిర్దేశ సూచికలు, రిఫ్లెక్టివ్ సైన్ బోర్డులను ఏర్పాటు చేసి వాహనదారులను అప్రమత్తం చేయాలన్నారు. హైవే వెంట ఉన్న మద్యం దుకాణాల వద్ద వాహనాల పార్కింగ్ను క్రమబద్ధీకరించి ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎకై ్సజ్ శాఖ అధికారులకు సూచించారు. పరిశీలన సందర్భంగా స్థానిక ప్రజలతోపాటు కరుణాపురం, వంగాలపల్లి, నష్కల్, చిన్నపెండ్యాల గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని హైవే అధికారులకు సూచించారు. అనంతరం ఎన్హెచ్–163పై రోడ్డు ప్రమాద బాధితులకు అత్యవసర సేవలు అంది స్తున్న అంబులెన్స్ను పరిశీలించి, అందులోని వైద్య సౌకర్యాలు, సిబ్బంది స్పందన తీరుపై ఆరా తీశారు. కార్యక్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ట్రాఫిక్ అదనపు డీసీపీ రాయల ప్రభాకర్ రావు, స్టేషన్ఘన్పూర్ ఏసీపీ భీంశర్మ, ఎన్హెచ్ఏఐ పీడీ భరద్వాజ్, మేనేజర్ లింగయ్య, జనగామ రూరల్, స్టేషన్ఘన్పూర్ సీఐలు శ్రీనివాస్రెడ్డి, వేణు, చేరాలు, ఎస్సైలు సిరిపురం నవీన్కుమార్, శ్రవణ్కుమార్, ఆర్ఎస్సై నవీన్, రోడ్డు రవాణా శాఖ, ఎకై ్సజ్ శాఖ, జాతీయ రహదారి అథారిటీ అధికారులు పాల్గొన్నారు. వరంగల్ పోలీసు కమిషనర్ ఎన్. శ్వేత జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్ల పరిశీలన -
ఆరంభంలోనే శిక్షణలా?
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలలు జూన్ 15 నుంచి పునఃప్రారంభమై తరగతులు కొనసాగుతున్నాయి. మరోవైపు అడ్మిషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. కొత్తగా చేరిన విద్యార్థులు కూడా పాఠశాలల్లో ఉంటారు. విద్యార్థుల హాజరు శాతం పెరిగేది కూడా ఇప్పుడిప్పుడే. ఇలాంటి కీలక సమయంలో దాదాపు 20 రోజులకు పైగా విద్యాశాఖ, (ఎస్సీఈఆర్టీ) టీచర్లకు శిక్షణ ఇస్తోంది. ఫలితంగా బోధనపై ప్రతికూల ప్రభావం పడనుంది. సాధారణంగా ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణలు వేసవిలోనే జరుగుతాయి. గతేడాది కూడా మే నెలలో నిర్వహించారు. ఇందుకు భిన్నంగా ఈసారి విద్యాప్రారంభ కీలక దశలో శిక్షణలు కూడా అవి కూడా ఆన్లైన్లో కాకుండా ప్రత్యక్షంగా నిర్వహిస్తున్నారు. ప్రతీ పాఠశాలలో విద్యార్థుల నమోదును గతేడాది కంటే పది శాతం పెంచాలనే లక్ష్యాన్ని రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నిర్దేశించారు. శిక్షణల కారణంగా ఉపాధ్యాయులు ప్రవేశాలపై దృష్టి సారించలేకపోతున్నారనే వాదనలున్నాయి. టీచర్లకు విడతల వారీగా శిక్షణలు కొనసాగుతున్నాయి. ఈ నెలాఖరు వరకు శిక్షణ.. ఉపాధ్యాయులకు గతంలో శిక్షణ ఇచ్చిన అంశాలను కొద్దిపాటి మార్పులతో శిక్షణ ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రతీసారి చెప్పిందే చెబుతున్నారని ఆసక్తి పోతోందని శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయుల నుంచి అసహనం వ్యక్తమవుతోంది. హనుమకొండ జిల్లాలోని యూపీఎస్, హైస్కూళ్ల స్కూల్ అసిస్టెంట్లకు కొద్దిరోజులుగా సబ్జెక్టుల వారీగా హనుమకొండ జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ హైస్కూళ్లు శిక్షణ కేంద్రాలుగా శిక్షణలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇంగ్లిష్, హిందీ, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్లకు ఒక్కక్కరికి మూడు రోజుల చొప్పున వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈనెల 20 నుంచి తెలుగు, బయోసైన్స్ రెండో బ్యాచ్లోని స్కూల్ అసిస్టెంట్లకు, మేథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్లకు మొదటి బ్యాచ్ వారికి జిల్లా కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నారు. సుమారు 1,050కి పైగానే.. హనుమకొండ జిల్లాలోని 14 మండలాల్లోని 50 శాతం మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) మండల కేంద్రాల్లో ఈనెల 21 నుంచి 23 వరకు శిక్షణ తరగతులకు హాజరవనున్నారు. 1,014 మంది ఎస్జీటీల్లో మొదటి విడతలో 806 మందికి ఈనెల 21 నుంచి 23 వరకు శిక్షణలు జరుగుతాయి. ఈనెల 29 నుంచి 30 వరకు మిగతా టీచర్లకు శిక్షణ ఉంటుంది. కాగా, ప్రాథమిక పాఠశాలల్లో సింగిల్ టీచర్, లేదా ఇద్దరు టీచర్లు మాత్రమే ఉండే పాఠశాలల్లో విద్యార్థులకు పూర్తి స్థాయిలో విద్య అందకపోవచ్చు. శిక్షణ తరగతుల్లో ఉపాధ్యాయులు కుంటుపడనున్న విద్యాబోధన! ఉపాధ్యాయ వర్గాల నుంచి విమర్శలు -
‘క్యాచ్ ది రెయిన్’పై సమావేశం
వరంగల్ అర్బన్: ఈనెల 17న ‘ఒడిసి పట్టడంలో ఓటమి’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి గ్రేటర్ వరంగల్ అధికార యంత్రాంగం స్పందించింది. వర్షపు నీటిని ఒడిసి పట్టడానికి గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో అధికారులు సమావేశమయ్యారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు కృషి చేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. అదేవిధంగా కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్యూఏ) ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్యూఏ) అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడనున్న నేపథ్యంలో భూగర్భ జలాలు పెంచేందుకు ఇంకుడు గుంతలు తవ్వించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకన్న, అడిషనల్ కమిషనర్ జోనా, ఎస్ఈ రాజ్కుమార్, మెప్మా పీడీ రాజేశ్వర్, డీఎఫ్ఓ శంకర్ లింగం, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, హెచ్ఓ లక్ష్మారెడ్డి, ఈఈలు మహేందర్, సంతోష్బాబు, మాధవీలత, ఏఐయూఏ ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి మహా నగర ప్రజల వ్యక్తిగత, ఆరోగ్య పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పారిశుద్ధ్య, ప్లాస్టిక్ నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న సూచించారు. గురువారం ఖాజీపేట సర్కిల్లోని 59వ మోడల్ డివిజన్లో అమలు చేస్తున్న పారిశుద్ధ్య విధానాలపై కమిషనర్, అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. అనంతరం స్థానిక కూరగాయల మార్కెట్ను పరిశీలించి ప్లాస్టిక్ సంచులు విక్రయిస్తున్న ఒక వ్యాపారికి రూ.2,000, రోడ్డుపై నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలు వేసిన ఇంటి యాజ మానికి రూ.5 వేలు జరిమానా విధించారు. తని ఖీల్లో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఎంహెచ్ఓ రాజేశ్, శానిటరీ సూపర్వైజర్లు గోల్కొండ శ్రీను, నరేందర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటేషన్, మలేరియా విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పన్ను వసూళ్లు వేగిరం చేయండిఆస్తి, నీటి, గార్బేజీ పన్నుల వసూళ్లను వేగవంతంగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న ఆదేశించారు. గురువారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్, ఉప కమిషనర్లతో కలిసి ట్యాక్సేషన్ అధికారులు, రెవెన్యూ సిబ్బందితో పన్ను వసూళ్ల పురోగతిపై కమిషనర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ జోనా, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నారాణి, బిర్రు శ్రీను, సమ్మయ్య, ట్యాక్సేషన్ అధికారి రామకృష్ణ, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు పాల్గొన్నారు. -
మౌలిక వసతులపై దృష్టి పెట్టండి
ఇంజనీర్లకు కమిషనర్ టి.వెంకన్న ఆదేశం వరంగల్ అర్బన్: మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తూ, నాణ్యతతో అభివృద్ధి పనులు పూర్తి చేసేలా ఇంజనీర్లు పర్యవేక్షించాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న ఆదేశించారు. బుధవారం వరంగల్ అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని ఉర్సుగుట్ట సమీపంలోని హిందూ శ్మశాన వాటికను సందర్శించి అక్కడ కొనసాగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. అనంతరం శివనగర్ అండర్బ్రిడ్జి సమీపంలోని నాలాను పరిశీలించారు. డ్రెయినేజీ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నీటి నిల్వ లు, మురుగు పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భద్రకాళి బండ్ సమీపంలోని నాలాతో పాటు భద్రకాళి బండ్పై కొనసాగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. బొంది వాగు నాలా నుంచి వచ్చే వరద నీరును నేరుగా భద్రకాళి చెరువులోకి మళ్లించేలా చర్యలు తీసుకోవాలని, నాలాలకు రిటైర్నింగ్ వాల్స్ నిర్మించాలని సమీప ప్రాంతాల హాకర్స్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట జీడబ్ల్యూఎంసీ సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంతోశ్బాబు, అధికారులు పాల్గొన్నారు. వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ పనులు వేగిరంవరంగల్ 3వ డివిజన్లోని పైడిపల్లి డంప్యార్డు పరిధిలోని ఏడెకరాల స్థలంలో రోజుకు 150 టన్నుల సామర్థ్యంతో నిర్మాణ వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. ప్రతిపాదిత బుధవారం సాయంత్రం బల్దియా ప్రధాన కార్యాలయంలో నిర్మాణ వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్లుపై సాంకేతిక సెమినార్ కమిషనర్ టి. వెంకన్న అధ్యక్షతన నిర్వహించారు. ఎస్ఎస్ఆర్ కన్సల్టెంట్స్ సంస్థ ప్రతినిధులు ప్లాంట్ రూపకల్ప న, నిర్వహణ విధానం, మౌలిక సదుపాయాలు, సాంకేతిక ప్రమాణాలు, వ్యర్థాల సేకరణ, ప్రాసెసింగ్, పునర్వినియోగం తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో బల్దియా ఎస్ఈ రాజ్కుమార్, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, సిటీ ప్లానర్ రవీందర్, ఈఈలు మహేందర్, సంతోశ్బాబు, రవికుమార్, సంజయ్కుమార్, రాజేశ్, ఎంహెచ్ఓ రాజేశ్, ఎస్ఎస్ఆర్ కన్సల్టెంట్స్ ప్రతినిధులు, జీడబ్ల్యూఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిష్టాత్మకంగా ఖేలో ఇండియా క్రీడలు
వరంగల్ స్పోర్ట్స్: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్–26 ఏర్పాట్లలో భాగంగా హనుమకొండలో ప్రతిపాదిత ఖోఖో, జూడో క్రీడా వేదికలను ఖేలో ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమర జ్యోతి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్లు బుధవారం పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ ఖేలో ఇండియా బృందం పర్యటనకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా క్రీడా మైదానాలు, మౌలిక సదుపాయాలు, పోటీల నిర్వహణకు అవసరమైన సాంకేతిక అంశాలు, ఆటగాళ్ల వసతి, రవాణా, ఇతర లాజిస్టిక్ ఏర్పాట్లపై అధికారులు సమీక్ష నిర్వహించారు. పోటీలు విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని హనుమకొండ యువజన క్రీడా అధికారి కొత్త ప్రశాంత్కు సూచించారు. ఈసందర్భంగా హనుమకొండ జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్, సంబంధిత క్రీడా అధికారులు, సిబ్బంది పాల్గొని హనుమకొండలోనీ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని ఖోఖో, జూడో పోటీల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్లకు వివరించారు. ఖేలో ఇండియా యూత్ క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అన్ని జిల్లాలతో సమన్వయం చేసుకుంటూ విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతోందని అధికారులు తెలిపారు. జేఎన్ఎస్లో ఖోఖో, జూడో వేదికలు పరిశీలించిన క్రీడాధికారులు -
విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం
హన్మకొండ : విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని రాష్ట్ర ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్ట్ను నిరసిస్తూ డీసీసీ ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద రాష్ట అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కె.ఆర్. నాగరాజుతో కలిసి మల్లు భట్టి విక్రమార్క ధర్నా నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీజేపీకి హఠావో.. దేశ్ కి బచావో అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువకులపై కేంద్ర ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించిందని, మహిళలు అని కూడా చూడకుండా విచక్షణారహితంగా పోలీసులు లాఠీ చార్జ్ చేశారన్నారు. విద్యార్థులపై పాశవికంగా వ్యవహరించినందుకు నిరసనగా వారికి అండగా ఉండేందుకు బాధ్యతగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికా ర్జున ఖర్గే ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇతర నాయకులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాం రెడ్డి, నాయకులు గుండు సుధారాణి, ఇ.వి.శ్రీనివాస్రావు, బత్తిని శ్రీనివాస్, పెరుమాండ్ల రామకృష్ణ, నాయిని లక్ష్మా రెడ్డి, బంక సంపత్ యాదవ్, కరాబు రాజేశ్వర్ రావు, అనిల్, అలువాల కార్తీక్, సతీశ్ పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హనుమకొండ అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా -
విద్యార్థుల భవిష్యత్తో కేంద్రం చెలగాటం
● రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నయీంనగర్: ప్రశ్నపత్రాల లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోకుండా, నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బుధవారం హనుమకొండ పశ్చిమ నియోజకవర్గం ఇందిరానగర్ సంక్షేమ హాస్టల్, కిషన్పురలో విద్యార్థులతో ముఖాముఖిగా ఏర్పాటు చేసిన ‘ఛాత్రోంకి గూంజ్’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశ భవిష్యత్ను నిర్మించే యువతకు నాణ్యమైన విద్య, పారదర్శక పరీక్ష విధానం నిర్వహించడం కేంద్ర ప్రభుత్వం బాధ్యతన్నారు. కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల రద్దులు, రీ–ఎగ్జామ్స్ ఘటనలు వరుసగా చోటుచేసుకుంటూ లక్షలాది మంది విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు సంవత్సరాలు కష్టపడి చదివి పరీక్షలు రాస్తే, ప్రశ్నపత్రాల లీకేజీల కారణంగా వారి కృషి వృథా అవుతోందని వాపోయారు. కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్.నాగరాజు, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం
హన్మకొండ: ప్రజలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో టీజీ ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో రూ.56కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్.నాగరాజుతో కలిసి ఆయన బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జరిగిన సమీక్ష సమావేశంలో ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సంస్థ అమలు చేస్తున్న కార్యక్రమాలు, ఆధునిక సాంకేతిక వినియోగం, భద్రతా చర్యలు, తదితర అంశాలను వివరించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ రంగానికి ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతను జోడించి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు. ప్రజలు అధికారుల వద్దకు రావడం కాదు.. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లాలనే ఆలోచనతో ‘ప్రజాబాట – పొలంబాట’ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నేరుగా అధికారులు వినియోగదారుల ముంగిటికి వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారన్నారు. అహర్నిశలు శ్రమిస్తున్న విద్యుత్ జీవితాల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. ప్రమాదవశాత్తు ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే ఆ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రూ.కోటి నుంచి రూ.1.20 కోట్ల వరకు బీమా సౌకర్యాన్ని కల్పించామన్నారు. అదేవిధంగా లైన్మన్లకు అవసరమైన సేఫ్టీ కిట్లు, యూనిఫాం, ఆధునిక పరికరాలను అందజేశామన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ వినతి మేరకు 132/33 కేవీ సబ్స్టేషన్ మంజూరు చేస్తున్నామని, స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్ను ఆదేశించారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ సోలార్తోపాటు, విండ్ పవర్ ఉత్పత్తిపై దృష్టి సారించాలని సూచించారు. సాంకేతికత వినియోగం వల్ల ఉద్యోగులకు రిస్క్ తగ్గడంతోపాటు సమయం, డబ్బు ఆదా అవుతున్నాయని, వినియోగదారులు, రైతులకు తక్షణ సేవలు అందుతున్నాయని తెలిపారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు దేవాదాయశాఖ పరిధిలోని భూములు కేటాయించడానికి తమ శాఖ సిద్ధంగా ఉందన్నారు. దీనివల్ల ఆక్రమణలు అరికట్టడంతోపాటు దేవాలయాలకు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, సమీకృత కలెక్టరేట్ భవనాలపై సోలార్ పలకలు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నారు. కార్యక్రమం చివరలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద, సీపీ శ్వేత, జిల్లా అటవీ శాఖాధికారి నిఖిత, ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు వి.మోహన్రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, అధికారులు పాల్గొన్నారు. ప్రజాబాట, పొలంబాట ద్వారా నేరుగా వినియోగదారుల ముంగిటికి ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క టీజీ ఎన్పీడీసీఎల్ చేపట్టిన రూ.56 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు పాల్గొన్న మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు -
బీజేపీ నిరసన ఉద్రిక్తం
రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం హన్మకొండ: హనుమకొండ అశోక చౌరస్తాలో బీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీ తీరుకు నిరసనగా బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి ఆధ్వర్యంలో హనుమకొండలోని అశోక చౌరస్తాలో బీజేపీ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు, కార్యకర్తలు దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు దిష్టిబొమ్మను లాకెళ్లేందుకు ప్రయత్నించగా.. బీజేపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. ఈక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వారించినా వినకపోవడంతో అరెస్ట్ చేసి హనుమకొండ పోలీస్స్టేషన్కు తరలించారు. ఈసందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మ మాట్లాడుతూ.. ఢిల్లీలోని ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ శ్రేణులు చేసిన వీధి నాటకాలకు, సృష్టించిన అరాచకాలకు దీటైన జవాబు ఇస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్ పగడాల కాళీప్రసాద్, జయంత్లాల్, చాడా స్వాతి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
భూపాలపల్లి వెనుకంజ
జనగామ ముందంజ..ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఎవరు ఏ విషయంలో ముందున్నారంటే.. అత్యధిక మొత్తం స్కోరు: జనగామ (49.73) ఉత్తమ ఓఐఎంఎస్: ములుగు (9.80) ఉత్తమ రైతుల నమోదు: హనుమకొండ (8.34) ఉత్తమ భూ ధ్రువీకరణ: వరంగల్ (9.54) (ఈ ఆరు జిల్లాల్లో) ఉత్తమ వ్యవసాయ విస్తరణ అధికారుల హాజరు: హనుమకొండ (6.01)సాక్షి, వరంగల్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అమలు, రైతుల నమోదుతో పాటు డిజిటల్ సేవల పురోగతిని ఏడు కీలక పారామీటర్ల ఆధారంగా అంచనా వేయగా, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో జనగామ అత్యుత్తమ పనితీరుతో రాష్ట్రంలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. హనుమకొండ మూడో స్థానంలో నిలవగా, ములుగు ఎనిమిదో స్థానం సాధించింది. వరంగల్ జిల్లా మాత్రం 16వ స్థానంలో నిలవడం గమనార్హం. మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు రాష్ట్ర సగటు కంటే వెనుకబడ్డాయి.జూన్ 30 నాటికి రూపొందించిన నివేదికలో రైతుల నమోదు, రైతు మరణాల నమోదు, క్లెయిమ్ల పరిష్కారం, భూ ధ్రువీకరణ, ఫైవ్స్ యాప్ వినియోగం, ఓఐఎంఎస్ అమలు, వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈఓ) హాజరును పరిశీలించి జిల్లాలకు మార్కులు కేటాయించారు. హనుమకొండకు మూడో స్థానం.. 48.80 పాయింట్లతో హనుమకొండ రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. రైతుల నమోదు (8.34), ఓఐఎంఎస్ (9.78), భూ ధ్రువీకరణ (9.19), ఏఈఓ హాజరు (6.01)లో మంచి మార్కులు సాధించింది. అయితే రైతు మరణ క్లెయిమ్ల పరిష్కారంలో (1.74) పనితీరు తక్కువగా నమోదైంది. ములుగు టాప్–10లో చోటు.. 46.06 పాయింట్లతో ములుగు రాష్ట్రంలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఓఐఎంఎస్ (9.80), భూ ధ్రువీకరణ (9.53)లో అత్యుత్తమ పనితీరు కనబర్చినా, రైతు మరణాల నమోదు (4.15), క్లెయిమ్లు (1.69)లో ఆశించిన పురోగతి కనిపించలేదు. వరంగల్కు మధ్యస్థానం.. 43.80 పాయింట్లతో వరంగల్ జిల్లా 16వ స్థానంలో నిలిచింది. రైతుల నమోదు (7.68), భూ ధ్రువీకరణ (9.54), ఓఐఎంఎస్ (8.83)లో మంచి మార్కులు వచ్చినప్పటికీ, రైతు మరణ క్లెయిమ్లు (1.67), ఏఈఓ హాజరు (3.68) తక్కువగా ఉండడం ర్యాంకును ప్రభావితం చేసింది. మహబూబాబాద్ వెనుకంజ.. 45.04 పాయింట్లతో మహబూబాబాద్ 13వ స్థానంలో నిలిచింది. రైతుల నమోదు (7.38), ఓఐఎమ్ఎస్ (8.92), ఏఈఓ హాజరు (5.54) సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, రైతు మరణాల నమోదు (4.05), క్లెయిమ్లు (1.46), భూ ధ్రువీకరణ (8.83)లో మెరుగుదల అవసరమని నివేదిక సూచిస్తోంది. జయశంకర్ భూపాలపల్లి పరిస్థితి.. 42.36 పాయింట్లతో 22వ స్థానంలో నిలిచిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైతుల నమోదు (6.98), భూ ధ్రువీకరణ (8.82), ఓఐఎంఎస్ (9.27) బాగున్నప్పటికీ, రైతు మరణ క్లెయిమ్లు (1.48), ఏఈఓల హాజరు (3.88)లో పనితీరు తక్కువగా నమోదైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డిజిటల్ సేవలు (ఓఐఎంఎస్, ఫైవ్స్), భూ ధ్రువీకరణలో చాలా జిల్లాలు మెరుగైన పనితీరు కనబర్చాయి. అయితే ‘రైతు మరణ క్లెయిమ్ల పరిష్కారం, ఫీల్డ్ స్థాయి పర్యవేక్షణ (ఏఈఓల హాజరు)’లో అన్ని జిల్లాల్లోనూ తక్కువ మార్కులు రావడం ఆందోళన కలిగించే అంశం. రైతు భరోసా పథకం పూర్తి స్థాయిలో అమలు కావాలంటే గ్రామ స్థాయిలో పెండింగ్ నమోదులు, క్లెయిమ్ల పరిశీలన వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. వ్యవసాయ విభాగాల్లో ఏడు కీలక పారామీటర్లలో జిల్లాల పనితీరుపై ప్రభుత్వం ర్యాంకింగ్ హనుమకొండకు మూడో స్థానం.. వరంగల్ 16వ స్థానానికి పరిమితంజనగామ అన్ని రంగాల్లో సమతూకం 49.73 పాయింట్లతో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిన జనగామ జిల్లా దాదాపు అన్ని పారామీటర్లలో సమతూక పనితీరు కనబర్చింది. రైతుల నమోదు (7.79), భూ ధ్రువీకరణ (9.63), ఫైవ్స్ యాప్ (9.61), ఓఐఎంఎస్ (9.09)లో అధిక మార్కులు సాధించింది. రైతు మరణ క్లెయిమ్లలో (1.67) మాత్రం ఇంకా మెరుగుదలకు అవకాశం ఉంది. -
గురువారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2026
హన్మకొండ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వ కుంట్ల తారక రామారావు గురువారం హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈనెల 23న (నేడు) మడికొండలోని సత్య సాయి కన్వెన్షన్లో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆయన ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి 10.30 గంటలకు సత్యసాయి కన్వెన్షన్కు చేరుకుంటారు. హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు బుధవారం ఉదయం అమ్మవారిని ఉగ్ర ప్రభ, త్వరితా క్రమాల్లో అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఉదయం నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం స్నపనమూర్తిని ఉగ్రప్రభ క్రమంలో, షోడశీక్రమంలో బోగభేరాన్ని త్వరితాక్రమంలో అలంకరించి చతుఃస్థానార్చన పూజలు జరిపారు. ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత, సిబ్బంది పర్యవేక్షించారు. కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ మీదుగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం గురువారం యశ్వంత్పూర్–కోటా వయా కాచిగూడ మీదుగా నడిపిస్తున్నట్లు బుధవారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ ఎ.శ్రీధర్ తెలిపారు. నేడు గురువారం యశ్వంత్పూర్–కోటా (06591) వెళ్లే వన్వే స్పెషల్ ట్రైన్ కాజీపేట జంక్షన్ చేరుకొని వెళ్తుంది. ఈ స్పెషల్ ట్రైన్కు యెలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూలు సిటీ, కాచిగూడ, కాజీపేట, బల్లార్షా, నాగ్పూర్, ఇటార్సీ, భోపాల్, షీహోర్, సుజల్పూర్, బెర్చా, ఉజ్జయిని, నాగ్డా, విక్రమ్ఘర్, ఆలోట్, చామహాల, షామ్ఘర్, భవానీ మండిలో హాల్టింగ్ కల్పించారు. కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో పలు పరీక్షలను వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు. ఈ నెల 25న నిర్వహించాల్సిన ఫార్మ్ డీ మూడో సంవత్సరం పరీక్షలు, ఈనెల 24న జరగాల్సిన ఫార్మ్ డీ నాలుగో సంవత్సరం పరీక్షలు, అదే రోజు జరగాల్సిన ఎంఈడీ నాలుగో సెమిస్టర్, ఈనెల 25న జరగాల్సిన బీటెక్ రెండో సెమిస్టర్ పరీక్షలు, బీఫార్మసీ ఆరో సెమిస్టర్, బీఫార్మసీ నాన్సీబీసీఎస్ మూడో సంవత్సరం మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు. ఉమ్మడి జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత హన్మకొండ కల్చరల్: దేవాలయాల అన్యాక్రాంతమైన భూముల గురించి, అర్చకులు అమ్ముకున్న భూముల గురించి, సీసీఎల్ఏ గుర్తించిన భూములను దేవాదాయశాఖలో నమోదు చేయాలని వరంగల్ ఉమ్మడి జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత ఆదేశించారు. ఈమేరకు బుధవారం వరంగల్ దేవాదాయశాఖ కార్యాలయంలో దేవాదాయశాఖ డివిజన్ ఇన్స్పెక్టర్లతో, కార్యనిర్వహణాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఏసీ రామల సునీత మాట్లాడుతూ.. మండల ఇన్చార్జ్ పరిధిలో ఉన్న భూముల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ భూముల ద్వారా లీజు వసూలు చేయాల్సిందిగా, అనధికారికంగా కౌలు చేసుకుంటున్న కౌలుదారుల నుంచి కౌలు వసూలు చేయలేని పక్షంలో ఆక్రమణదారులను గుర్తించి వారిపై ఎండోమెంట్ ట్రిబ్యునల్లో కేసులు దాఖలు చేయాలని ఆదేశించారు.కాజీపేట అర్బన్: దేశంలో ఇప్పుడన్నింటికీ ఆధారే ఆధారమైంది. అదే ఆ చిన్నారులకు అతి పెద్ద శాపంగా మారింది. తమ వయస్సు పిల్లలంతా భుజానికి బ్యాగేసుకుని బడికెళ్తుంటే.. ఆ చిన్నారులు మాత్రం చిన్నబోయి చూస్తున్నారు. స్కూల్లో చేరాలంటే యూడైస్లో పేరు నమోదు చేయాలి. అలా పేరు నమోదు కావాలన్నా.. పెన్ ఐడీ, అపార్ ఐడీ, ఇలా ఏది జనరేట్ చేయాలన్నా.. ఆఖరుకు యూనిఫాం ఇవ్వాలన్నా ఆధార్ కార్డు కంపల్సరీ కావడంతో కాజీపేట మండల పరిధి చిన్నారులు చదువుకు దూరమవుతున్నారు. బర్త్ సర్టిఫికెట్ లేక.. ఆధార్ రాక కాజీపేట మండలం మడికొండలోని మెట్టుగుట్ట దేవాలయం వెనుకాల అయోధ్యపురం వెళ్లే రోడ్డులో కొన్నేళ్ల క్రితం ఎంఎన్నగర్ పేరిట గుడిసెలు వేసుకుని బుడిగజంగాల కమ్యూనిటీకి చెందిన సుమారు 350 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. కాగా, వీరిలో 64 కుటుంబాలకు చెందిన 5 ఏళ్ల నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులు 37 మంది బర్త్ సర్టిఫికెట్ లేదనే కారణంతో విద్యకు దూరమ య్యారు. యూఐడీఏఐ నిబంధనల ప్రకారం.. కొత్తగా ఆధార్ కార్డు తీయాలంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కంపల్సరీ. సాధారణంగా ఆస్పత్రిలో శిశువు జన్మిస్తే.. హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరీ ఆధారంగా మీసేవలో దరఖాస్తు పెట్టుకుంటే మున్సిపల్ కార్యాలయం నుంచి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఇష్యూ అవుతుంది. దాని ఆధారంగా చిన్నారులకు ఆధార్ కార్డు తీయవచ్చు. కానీ, ఎంఎన్నగర్కు చెందిన చిన్నారులు ఇళ్లల్లో జన్మించడం, వారి తల్లిదండ్రులు బర్త్ సర్టిఫికెట్ తీసుకోకపోవడం కారణంగా చిన్నారులకు ఆధార్ కార్డు రావట్లేదు. వీరి తల్లిదండ్రులు పేపర్లు, స్క్రాప్ను ఏరుకునే వృత్తిలో ఉండడం, నిరక్షరాస్యులు కావడంతో ఎక్కడికి వెళ్తే.. ఏయే డాక్యుమెంట్లు రెడీ చేసుకుంటే ఆధార్ కార్డు వస్తుందో కూడా తెలియని పరిస్థితి. అయినప్పటికీ తమ పిల్లలు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన చెందుతూ ఆధార్ కార్డులు ఇప్పించాలని ఇప్పటికే చాలా సార్లు కలెక్టర్, తహసీల్దార్కు వినతులు అందజేశారు. ఆధార్ ఇవ్వండి.. చదువుకోనివ్వండి మా పిల్లలకు 12 ఏళ్లు వచ్చినా ఆధార్ కార్డులు లేక బడిలో చేర్పించలేదు. ఎంఎన్నగర్ పిల్లలకెవరికీ బర్త్ సర్టిఫికెట్ లేదు. దీంతో ఆధార్కార్డు రావట్లేదు. కలెక్టర్, తహసీల్దార్ చొరవ తీసుకుని ఆధార్ కార్డులు ఇప్పించాలి. మా పిల్లలకు చదువును అందించాలి. – కడమంచి కనకమ్మ, ఎంఎన్ నగర్నువ్వు మా బడిలోకి రాలేవు.. బడిలో చేరేందుకు వెళ్తే.. నువ్వు మా బడిలోకి రాలేవు.. నీకు ఆధార్ కార్డు లేదు అని సార్లు రానిస్తలేరు. నా తోటి మిత్రులు నాలుగో తరగతిలో ఉన్నారు. నేను మాత్రం చదువులేక ఇంట్లోనే ఉంటుండగా.. మాకోసం ఏర్పాటు చేసిన డాన్ బాస్కో స్కూల్లో చేరాను. – ఏసు, ఎంఎన్ నగర్, మడికొండఇంటింటికీ వెళ్లి తీసుకొస్తున్నాం.. ప్రతీ రోజు ఇంటింటికీ వెళ్లి పిల్ల లను బడికి తీసుకొస్తాం. నేను ఇంగ్లిష్ సబ్జెక్ట్ను బోధిస్తాను. చిన్నారులకు పూర్వ విద్యలేనందున్న బేసిక్స్ నేర్పిస్తున్నాను. ఏడాదిగా ప్రతీ రోజు పాఠశాలకు సంతోషంగా పిల్లలు వస్తున్నారు. పాఠ్యాంశాలను ఇష్టంగా నేర్చుకుంటున్నారు. – కేజియా, ఇంగ్లిష్ టీచర్●వరంగల్ 12వ డివిజన్లోని ఫిల్టర్ బెడ్ నుంచి లక్ష్మీ గార్డెన్ వైపు వచ్చే మెయిన్ పైప్లైన్ బుధవారం లీకయ్యింది. దీంతో తాగునీళ్లు పౌంటేన్ మాదిరిగా ఎగజిమ్మాయి. పాతకాలం నాటి పైప్లైన్ దెబ్బతినడంతో తాగునీళ్లు పొంగిపొర్లుతూ వృథాగా పోయాయి. – కాశిబుగ్గఆధార్ కార్డులేక బడికి దూరమవుతున్న చిన్నారులు అక్షరాలు నేర్పుతూ ఔదార్యం చాటుతున్న డాన్ బాస్కో సంస్థ బడిలో చేరేందుకు ఎదురుచూస్తున్న మడికొండలోని ఎంఎన్ నగర్ బాలలు ఆధార్కార్డు ఇప్పించాలని కలెక్టర్, తహసీల్దార్కు వినతులుఏసీబీ దాడులకూ వెరవని అవినీతి అధికారులు రవాణా, ఎకై ్సజ్, రెవెన్యూ శాఖల్లో ’ప్రైవేట్ వ్యక్తుల’ రాజ్యం అక్రమ వసూళ్లకు కొత్త ఎత్తుగడ ఐదేళ్లలో ఉమ్మడి జిల్లాలో 65 ఏసీబీ కేసులు.. అయినా మారని కొందరి తీరు న్యూశాయంపేట: గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి అర్హులైన గిరిజన విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా రీజినల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ డీఎస్ వెంకన్న బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్లోని బాలుర పాఠశాల, నర్సంపేటలో బాలుర పాఠశాలల్లో ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 27న సరైన ధ్రువపత్రాలతో వరంగల్ చింతల్ బ్రిడ్జి వద్ద యాకుత్పురాలోని బాలుర పాఠశాలలో కౌన్సెలింగ్కు హాజరుకావాలని ఆయన కోరారు. చదువును పరిచయం చేసిన డాన్ బాస్కో సంస్థ మడికొండలోని ఎంఎన్నగర్ కాలనీలోని 5 నుంచి 12 ఏళ్లలోపు బాలలకు విద్యనందించాలనే లక్ష్యంతో గతేడాది మే 5వ తేదీన వేసవిలో ఎంఎన్ నగర్లోని ఓ చర్చి ఆవరణలో డాన్ బాస్కో నవజీవన్ వరంగల్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన క్యాంపులో 37 మందికి పాఠశాల వాతావరణాన్ని అలవాటు చేశారు. సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ క్యాంపులో ఇద్దరు టీచర్లు, ఒక కౌన్సిలర్ ఉన్నారు. గణితం, తెలుగు, ఇంగ్లిష్ సబ్జెక్ట్లను బోధిస్తున్నారు. రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పాఠశాల నడుస్తోంది. మధ్యాహ్న భోజనం, బుక్స్, యూనిఫాంలతో పాటు ఉచితంగా వైద్యం అందజేస్తున్నట్లు డాన్ బాస్కో నవజీవన్ డైరెక్టర్ ఫాదర్ థామస్ తెలిపారు. -
31లోపు ఈ–కేవైసీ పూర్తిచేయాలి : కిష్టయ్య
ఖిలా వరంగల్: రేషన్షాపుల్లో కార్డుదారులు ఈనెల 31లోపు ఈ–కేవైసీ పూర్తి చేయాలని వరంగల్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి(డీఎస్ఓ) కిష్టయ్య సూచించారు. హనుమకొండలోని వరంగల్ జిల్లా పౌరసరఫరాల కార్యాలయంలో బుధవారం డీలర్లతో నిర్వహించిన సమావేశంలో డీఎస్ఓ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్కార్డులోని ప్రతీ సభ్యుడు తప్పనిసరిగా ఈ–కేవైసీ చేయించుకోవాలని స్పష్టం చేశారు. గతంలో చేసిన వారు ఆందోళన పడొద్దని, ఈ–కేవైసీ చేయని వారు సమీప రేషన్ దుకాణాలకు వెళ్లి పూర్తిచేసుకోవాలని సూచించారు. ఇప్పటికే 80 శాతానికి పైగా లబ్ధిదారులు ఈ–కేవైసీ పూర్తిచేశారని, మిగిలినవి వెంటనే పూర్తిచేయాలని కోరారు. సమావేశంలో సివిల్ సప్లయీస్ డీటీ కిరణ్కుమార్ వివిధ మండలాల రేషన్ డీలర్లు పాల్గొన్నారు. -
మూడేళ్లయినా మూడు వేల ఉద్యోగాలివ్వని సర్కారు
● మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హన్మకొండ : తెలంగాణలో కాంగ్రెస్ పా ర్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా మూడు వేల ఉద్యోగాలు ఇవ్వలేదని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని బుధవారం హనుమకొండ సుబేదారిలోని ఓ ఫంక్షన్ హాల్లో కేటీఆర్ భరోసా ఉచిత ఆన్లైన్ కోచింగ్ యాప్ను ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించి మాట్లాడారు. మాయమాటలతో నిరుద్యోగ యువత ఓట్లు దండుకున్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వంచిందని ధ్వజమెత్తారు. దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులు కేటీఆర్ నిరుద్యోగ భరోసా ఉచిత ఆన్లైన్ కోచింగ్ యాప్ శిక్షణ తరగతులను వినియోగించుకోవాలని కోరా రు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ అబద్ధాల పునాదులపై ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను తప్పుతోవ పట్టిస్తోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపు రెండు ల క్షల ఉద్యోగాలు, నిరుద్యోగ బృతి ఇస్తామ ని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, గండ్ర వెంకటరమణారెడ్డి, రాష్ట్ర రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, నాయకులు మర్రి యాదవరెడ్డి, జోరిక రమేశ్, సునీల్, లోహిత, సైదిరెడ్డి, వీరేందర్, శరత్శంద్ర, ప్రశాంత్, వీరస్వామి, మనోజ్, రామ్మూర్తి, రజిని, శ్రీధర్, రాజు, చిన్న, వినిల్ రావు పాల్గొన్నారు. -
చర్యలు వేగవంతం చేయాలి
సీబీఎం నిల్వల అభివృద్ధికిహన్మకొండ చౌరస్తా : తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు క్షేత్రాలు, ములుగు–భూపాలపల్లి ప్రాంతాల్లో ఉన్న కోల్ బెడ్ మిథేన్ (సీబీఎం) నిల్వల అన్వేషణ, అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య బుధవారం లోక్సభలో కోరారు. సీబీఎం వనరుల శాసీ్త్రయ అన్వేషణ, వాణిజ్యపరమైన వినియోగం ద్వారా తెలంగాణలోని బొగ్గు గని ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు పారిశ్రామిక అభివృద్ధికి ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. అయితే గణనీయ నిల్వలు ఉన్నా వాటి అన్వేషణ, అభివృద్ధి ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సీబీఎం వెలికితీత, వినియోగానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంతోపాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, ప్రాంతీయ అభివృద్ధి ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే, జాతీయ ఆహార భద్రత చట్టం అమలుపై కూడా ప్రశ్నించారు. జిల్లాలో ఎంత మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారో, అలాగే ఆహార ధాన్యాల కేటాయింపు, ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై వివరాలు కోరారు. ఆహార ధాన్యాల కేటాయింపులో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, భవిష్యత్లో లబ్ధిదారుల సంఖ్య పెరిగితే తగిన విధంగా కేటాయింపులు పెంచేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య -
తగ్గేదేలే..!
సాక్షి ప్రతినిధి, వరంగల్: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వరుస దాడులు నిర్వహిస్తూ లంచగొండి అధికారులను పట్టుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఏసీబీ వలలో అధికారులు చిక్కుతున్నా, మరుసటి రోజు అదే కార్యాలయాల్లో అక్రమ వసూళ్లు యథావిధిగా కొనసాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా రవాణా, ఎకై ్సజ్, పోలీస్, రెవెన్యూ శాఖల్లోని కొందరు అధికారులు డబ్బులు తీసుకోకుండా పనిచేయడం లేదన్న ఆరోపణలున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ టౌన్ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలపైనా కొందరిపై విమర్శలు ఉన్నాయి. అయితే నేరుగా చేతితో ముట్టకుండా.. ఆయా శాఖల్లోని వారి తరఫున ‘ప్రైవేట్ వ్యక్తులు‘, మధ్యవర్తులు వసూళ్లు నిర్వహించడం ఇప్పుడు కొత్త ట్రెండ్గా మారింది. అధికారులు లోపల, వసూళ్లు బయట.. వరుస దాడులతో మారిన వ్యూహం ఏసీబీ వరుసగా ట్రాప్లు నిర్వహించి పలువురు అధికారులను అరెస్ట్ చేస్తోంది. దీంతో నేరుగా లంచం తీసుకోవడం ప్రమాదమని భావించిన కొందరు అధికారులు నేరుగా డబ్బులు ముట్టుకోవడం తగ్గించారు. బదులుగా తమకు అత్యంత సన్నిహితులైన ప్రైవేట్ వ్యక్తులు, రిటైర్డ్ ఉద్యోగులు, డ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, దళారులను రంగంలోకి దింపుతున్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజలనుంచి వీరే రేట్లు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రవాణా శాఖలో వాహనాల తనిఖీలు, ఫిట్నెస్, పర్మిట్లు, ఓవర్లోడ్ వాహనాల వ్యవహారాల్లో నిబంధనల కంటే సెటిల్మెంట్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎకై ్సజ్లో సిండికేట్.. రెవెన్యూలో దళారుల దందా బెల్ట్షాపులు, అక్రమ మద్యం, బార్ల తనిఖీలు, లైసెన్సు అంశాల్లో మధ్యవర్తుల పాత్ర పెరిగిందని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. నెలవారీ వసూళ్ల వ్యవస్థ కొనసాగుతోందని, అధికారులను నేరుగా కలవాల్సిన అవసరం లేకుండానే వ్యవహారాలు ముగుస్తున్నాయని చెబుతున్నారు. రెవెన్యూశాఖలో మ్యుటేషన్లు, వారసత్వ ధ్రువీకరణలు, భూ వివాదాలు, పాస్బుక్లు, ఎన్ఓసీలు వంటి పనుల కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలను ముందుగానే దళారులు సంప్రదిస్తున్నారని సమాచారం. పోలీసుశాఖలో కొందరు అధికారులు ప్రైవేట్ డ్రైవర్లు, గన్మెన్లు, హోంగార్డులను వాడి వసూలు ఘటనలు పలు కేసుల్లో బయటపడిన సంగతి తెలిసిందే. లంచం అడిగితే ఫిర్యాదు చేయండి.. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చే యాలి. అవినీతి అధికారుల సమాచారం అందించే వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతాం. ట్రోల్ఫ్రీ నంబర్ 1064కు, వరంగల్ అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ నంబర్ 91543 88912కు కూడా ఫిర్యాదు చేయవచ్చు. – పి.సాంబయ్య, డీఎస్పీ, ఏసీబీ, వరంగల్ (జులై 22 వరకు)ఐదేళ్లలో ఉమ్మడి జిల్లాలో ఏసీబీ కేసులు ఇలా.. ఈ ఏడాది జనవరిలో కేయూసీ పోలీస్ స్టేషన్కు చెందిన ఓ ఎస్ఐ ప్రైవేట్ డ్రైవర్ నజీర్తో కలిసి చార్జ్షీట్ దాఖలు, వాహనాల విడుదలకు రూ.15 వేలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. అయినప్పటికీ తాజాగా సెంట్రల్ జోన్ పరిధిలోని ఓ ఠాణా అధికారులు మహిళలపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన ఓ ఎకై ్సజ్ కానిస్టేబు ల్ను పట్టుకుని డబ్బులు తీసుకుని వదిలేయడం చర్చనీయాంశం అవుతోంది. గతంలో హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)గా, ఇన్చార్జ్ డీఈఓగా ఉన్న వెంకట్రెడ్డి లంచం తీసుకోవడంతోపాటు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ కేసు నమోదు చేసింది. అంతకుముందు ఇద్దరు తహసీల్దార్లు కూడా ఏసీబీకి చిక్కారు. అయినప్పటికీ వరంగల్ నగరం చుట్టూ ఉన్న ఐదారు మండలాల రెవెన్యూ అధికారులు కొందరు నాలా కన్వర్షన్, సాదాబైనామాలు, రిజిస్ట్రేషన్లకు ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. -
యువకుడి ఆత్మహత్య ఘటనలో నిందితుడి అరెస్ట్
వేలేరు: వ్యాపార భాగస్వామి వేధింపులతో హనుమకొండ జిల్లా వేలేరు మండలం గొల్లకిష్టంపల్లి గ్రామానికి చెందిన ఏదునూరి నరేశ్(29) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి సూసైడ్ నోట్ ఆధారంగా నిందితుడు ఎల్.సురేశ్ను అరెస్ట్ చేసినట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. నరేశ్, సురేశ్ సుమారు 7 నెలల క్రితం డీజే సౌండ్స్, లైటింగ్, డెకరేషన్ వ్యాపారం ప్రారంభించారు. అయితే మూడు నెలల నుంచి వ్యాపారంలో లాభనష్టాలు, ఆర్థిక లావాదేవీల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి. దీంతో ఈనెల 9న సురేశ్ కొంతమందితో కలిసి నరేశ్ ఇంటికి వెళ్లి భార్యాపిల్లల ఎదుట చంపుతానని బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన నరేశ్ 16వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ 20వ తేదీన మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు విచారణ జరిపి సురేశ్ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల అరెస్టు
హన్మకొండ : రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు బుధవారం నిర్వహించ తలపెట్టిన ‘ఛలో మింట్ కాంపౌండ్’ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్లోని ఎస్పీడీసిఎల్ కంపెనీ కార్యాలయం ఎదుట చేపట్టనున్న ధర్నాకు వెళ్లకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలువురు ఆర్టిజన్ కార్మికులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని నిర్బంధించారు. ఆర్టిజన్ కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏప్రిల్లో కార్మికులు 10 రోజుల పాటు నిరవధిక సమ్మె నిర్వహించిన అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో కార్మికుల ప్రధాన సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. హామీ ఇచ్చి మూడు నెలలు గడిచినా ఎలాంటి పురోగతి కనిపించలేదని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం దృష్టికి మరోసారి తమ సమస్యలను తీసుకెళ్లేందుకు ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నాకు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ పిలుపునిచ్చిందన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఆర్టిజన్ కార్మికులను ఇళ్ల నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఘటనకు అధికారంలో ఉండి నిరసనలు తెలుపుతున్న కాంగ్రెస్.. తమ హక్కుల సాధనకు పోరాడుతున్న ఆర్టిజన్ కార్మికులను అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందని ఆయా సంఘాల నాయకులు విమర్శించారు. -
త్వరగా ప్రాజెక్టు పూర్తికి చర్యలు.. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి ఉమ్మడి జిల్లాలో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు అంతా సిద్ధం
హన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎల్నినోతో నెలకొన్న కరువు పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటలు, రైతుల ప్రయోజనాలు, సాగు, తాగునీటి లభ్యత, పశుసంపద రక్షణ తదితర అంశాలపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కలెకర్లు, అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. జిల్లాల వారీగా ప్రస్తుత పంటల పరిస్థితులపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఎమ్మెల్యేలు స్థానిక పరిస్థితులను వివరించారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారిగా ఐఏఎస్ అధికారి శ్రీదేవసేనను నియమించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఎల్నినో ప్రభావం, వర్షాభావం, వివిధ శాఖల సంసిద్ధతపై సుదీర్ఘ సమీక్ష హాజరైన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు దేవాదుల పూర్తికి ప్రభుత్వం చర్యలు : మంత్రి పొంగులేటి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సాగు, తాగునీటికి ప్రధాన ఆధారమైన దేవాదుల ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పంపింగ్ వ్యవస్థలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. తాగు, సాగునీరు, పశువులకు మేత, ఉపాధి హామీ పనులు, రైతులకు అవసరమైన విత్తనాల సరఫరాపై సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. లెమన్ గ్రాస్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై వచ్చిన సూచనలు పరిశీలిస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలిస్తే ప్రభుత్వం స్వాగతిస్తుందని, అవసరమైతే దేవాదులపై ప్రత్యేకంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రైతులకు శాసీ్త్రయ అవగాహన కల్పించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులపై శాస్త్రవేత్తల అంచనాలను గ్రామస్థాయికి తీసుకెళ్లి రైతులకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమన్నారు. ఈ సీజన్లో తీసుకునే నిర్ణయాలు వచ్చే ఏడాది జూన్ వరకు ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. కలెక్టర్ల నేతృత్వంలో ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో రైతులకు శాసీ్త్రయ ఆధారాలతో అవగాహన కల్పించాలని, కరపత్రాలు, ఇతర ప్రచార సాధనాల ద్వారా ప్రత్యామ్నాయ పంటలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. -
ఎమ్మెల్యేలు ఏమన్నారంటే..
● వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్లో మిషన్ భగీరథ పైప్లైన్ల లీకేజీలతో తాగునీటి సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. తక్షణం సరిచేయాలని కోరారు. ● స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు తాగునీరు, సాగునీటికి దేవాదుల ప్రాజెక్టే ప్రధాన ఆధారమని అన్నారు. మూడు దశల్లోని 10 మోటార్లను కనీసం 100 రోజులపాటు నిరంతరాయంగా నడిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక లోపాలు తలెత్తితే 48 గంటల్లోపు మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు. ● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మాట్లాడుతూ హసన్పర్తి మండలంతోపాటు విలీన గ్రామాల్లో తాగునీటి సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు. వర్ధన్నపేటలో అమృత్ పథకం పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ● భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ తక్కువ నీటితో అధిక ఆదాయం వచ్చే వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. దేవాదుల ప్రాజెక్టు, భీమ్ఘనపూర్, చలివాగు తదితర నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ ఎరువుల సరఫరాపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ● మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్ పట్టణంలో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయని, ముఖ్యంగా మెడికల్ కాలేజీకి ప్రత్యామ్నాయ వనరుల ద్వారా నీరు అందించాలని కోరారు. డ్రిప్ ఇరిగేషన్పై రైతులకు అవగాహన కల్పించి కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. సమీక్షలో పాల్గొన్న ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య, ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి, నాగరాజు, మురళీనాయక్ -
టీఎన్ఎస్ ముంబైతో ఎంఓయూ
కేయూ క్యాంపస్: టీఎన్ఎస్ ముంబై ఇండియా ఫౌండేషన్తో హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల ఎంఓయూ మంగళవారం కుదుర్చుకుంది. ఈ ఎంఓయూతో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులకు ఆ ఫౌండేషన్ ఉచితంగా 200 గంటల ఉచిత శిక్షణ ఇవ్వనుందని ఆకళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి తెలిపారు. సరైన కేరీర్ ఆప్షన్, కమ్యూనికేషన్ ప్రొఫెషనల్ స్కిల్స్తో పాటు అప్లై ఎ జాబ్, టూల్స్, కవరింగ్ లెటర్, మాక్ ఇంటర్వూలపై, అనేక నైపుణ్యాలు పెంచేందుకు ఆ ఫౌండేషన్ సహకారం అందించనుందని తెలిపారు. కార్యక్రమంలో ఆకళాశాల ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆఫీసర్ డాక్టర్ ఎల్.జితేందర్, ఏఆర్ శ్రీలత, కామర్స్ విభాగం అధ్యాపకుడు డాక్టర్ స్వామి, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ గిరిప్రసాద్, టీఎన్ఎస్ ముంబై ప్రతినిధులు ఆ మేనేజర్ కమ్ ట్రైనర్స్ సౌరవ్ పాండే, దేవిక, ఎస్.దీపు తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం అమ్మవారిని ఉగ్ర, శివదూతీ క్రమాల్లో అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం స్నపనమూర్తిని కాళీక్రమంలో ఉగ్రమాతగా, బోగభేరాన్ని షోడశీక్రమంలో శివదూతీమాతగా అలంకరించి పూజలు నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. వరంగల్ పోలీస్ కమీషనర్ శ్వేతరెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ అమ్మవారిని దర్శించుకున్నారు. మామునూరు: వరంగల్ మామునూరు టీజీఎస్పీ నాలుగో బెటాలియన్ను మంగళవారం సాయంత్రం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంజయ్కుమార్ జైన్ సందర్శించారు. ఈసందర్భంగా కమాండెంట్ శివప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది ఏడీజీపీకి గౌరవ వందనం సమర్పించి ఘన స్వాగతం పలికారు. అనంతరం బెటాలియన్ ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. అనంతరం మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఆవరణలో నూతనంగా నిర్మించిన ఎల్ఎంవీ హైడ్రాలిక్ లిఫ్ట్ షెడ్, వీల్ ఆలైన్మెంట్, టైర్ చేంజర్ షెడ్, దోబీ రూమ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం బెటాలియన్ అధికారులతో సమావేశమయ్యారు. ఏసీ బాలయ్య, వీరన్న, రాజేందర్, ఆర్ఐలు సురేశ్, బాబు, విజయ్, రాజిరెడ్డి, రవి, పురుషోత్తంరె డ్డి, సర్వర్, వెంకటేశ్వర్లు, రాజ్కుమార్, రామ్ప్రసాద్, కృష్ణ, అధికారులు ఉన్నారు. నెక్కొండ ఎస్సై మహేందర్ సస్పెన్షన్నెక్కొండ: సివిల్ వివాదంలో జోక్యం, పీఎస్కు వచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయని కారణంగా నెక్కొండ ఎస్సై మహేందర్ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన గాడ్దుల వెంకన్న.. నెక్కొండ తండాకు చెందిన బోడ అనిల్, బానోతు వాగ్యాకు రూ.50 వేలు గొర్రెల డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఈవిషయంలో తలెత్తిన వివాదం కారణంగా వెంకన్నకు చెందిన 90 గొర్రెలు, మేకలను వీరు తోలుకెళ్లారు. దీంతో వెంకన్న పీఎస్లో ఫిర్యాదు చేశాడు. అనిల్, వాగ్యాకు అనుకూలంగా ఎస్సై వ్యవహరించి తాను చెప్పినట్లు వినాలని, లేదంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తానని వెంకన్నను బెదిరించాడనే ఆరోపణలు ఉన్నాయి. -
కేవైసీ కష్టాలు
హన్మకొండ అర్బన్: ప్రభుత్వం త్వరలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనుంది. ఈనేపథ్యంలో రేషన్ కార్డులో పేరున్నవారంతా ఈ నెలాఖరు నాటికి తప్పనిసరిగా ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో జిల్లావ్యాప్తంగా రేషన్ దుకాణాల వద్ద కార్డుదారులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. సర్వర్, నెట్వర్క్ సమస్యల కారణంగా గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి తోడు రాష్ట్ర సేవల నుంచి కేంద్ర సేవలకు సాంకేతిక మార్పిడి (మైగ్రేషన్) చేపడుతున్న కారణంగా జూలై 21, 22, 23 తేదీల్లో ఈ–కేవైసీ, స్మార్ట్ పీడీఎస్ సేవలు అందుబాటులో ఉండవని పౌర సరఫరాల శాఖ ప్రకటించింది. ఆందోళనలో లబ్ధిదారులు వచ్చే నెలలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్కు సంబంధించిన మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడంతో ఈ–కేవైసీ పూర్తి చేసుకునేందుకు లబ్ధిదారులు రేషన్ దుకాణాల బాట పడుతున్నారు. మూడు రోజులు కేవైసీ సేవలు అందుబాటులో ఉండవని తెలియక రేషన్ షాపులకు వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు. మరోవైపు ప్రస్తుతం మూడు రోజులు సేవలు నిలిచిపోవడంతో మిగిలిన స్వల్ప గడువులో ఈ–కేవైసీ పూర్తి చేయడం కష్టంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే. ఆగస్టు 1 నుంచి బియ్యం పంపిణీ ప్రారంభం కానుండడంతో రేషన్ డీలర్లపైనా అదనపు పనిభారం పడనుంది. గడువు పొడిగించాలి.. మూడు రోజుల పాటు ఈ–కేవైసీ సేవలు నిలవడంతో గడువు ముగిసేలోపు ప్రక్రియ పూర్తి చేయడం కష్టమవనుంది. ఆగస్టు 1 నుంచి బియ్యం పంపిణీ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కార్డుదారులు, డీలర్ల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ–కేవైసీ గడువును పొడిగించాలి. – మహేశ్వరం గౌరీ శంకర్, రేషన్ డీలర్ల సంఘం నాయకుడు రేపటి వరకు కేవైసీ సేవల నిలిపివేత లబ్ధిదారులకు తప్పని తిప్పలు ఆగస్టులో మూడు నెలల బియ్యం పంపిణీ గడువులోగా ప్రక్రియ పూర్తయ్యేనా? -
అర్చకుల సంక్షేమానికి నిరంతర కృషి
హన్మకొండ కల్చరల్: ధూపదీప నైవేద్య అర్చకులకు పథకం నుంచి విముక్తి కలిగించి దేవాదాయశాఖ అర్చకులుగా ఉద్యోగ భద్రత కలిగేలా, అర్చకుల సంక్షేమమే పరమావధిగా నిరంతరం కృషి చేస్తానని తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ హామీ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని సారస్వత పరిషత్ భవన్లో తెలంగాణ ధూప దీప నైవేద్య అర్చక సంక్షేమ సంఘం ఆవిర్భావం జరిగింది. ఈకార్యక్రమానికి గంగు ఉపేంద్రశర్మ ముఖ్య అతిథిగా హాజరై సంఘం లోగోను ఆవిష్కరించి మాట్లాడారు. దోపిడీకి గురవకుండా డీడీఎన్ అర్చకులను కాపాడాలని, దానికి అనుగుణంగా అర్చకులంతా ఈ సంఘానికి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. సంఘం వ్యవస్థాపకులు వెగ్గళం సంతోష్ శాస్త్రి మాట్లాడుతూ.. అర్చకుల సంక్షేమం కోసం వారి సమస్యల పరిష్కారానికి సంఘం అన్ని విధాలా కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అర్చక సంఘాల నాయకులు ఓరుగంటి మాధవాచార్యులు, తాపాల వెంకటాద్రి, అన్నవజ్జుల ప్రసాద్శర్మ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ డీడీఎన్ అర్చక సంక్షేమ సంఘం లోగో ఆవిష్కరణ -
వర్షాలపై అప్రమత్తంగా ఉండండి
గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న వరంగల్ అర్బన్: వర్షాలు విస్తృతంగా కురవనున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి వింగ్ అధికారుల వరకు అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. నగర పరిధి లోతట్టు ప్రాంతాలైన హనుమకొండలోని తిరుమల బార్ జంక్షన్, ఎన్జీఓస్ రోడ్డు, ఎస్బీహెచ్ కాలనీ, రామకృష్ణ కాలనీ, కాకతీయ కాలనీ, వరంగల్లోని బొంది వాగు, శివనగర్, మైసయ్య నగర్, సాయి గణేశ్ నగర్ వడ్డేపల్లి చెరువు, 12 మోరీలు తదితర ప్రాంతాల్లో కమిషనర్ తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవకుండా ఇంజనీరింగ్కు చెందిన మాన్ సూన్ టీమ్స్ సహకారంతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా వెంటనే తొలగించాలన్నారు. ప్రధాన రోడ్లపై శానిటేషన్ పక్కాగా జరిగేలా చూడాలన్నారు. ఆయన వెంట కమిషనర్ ముఖ్య ఆరోగ్యాధికారి డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, శానిటరీ సూపర్వైజర్ గోల్కొండ శ్రీను ఉన్నారు. -
జయహో జగన్నాఽథ
జగన్నాథుడి రథయాత్ర సోమవారం నగరంలో కనుల పండువగా సాగింది. ములుగు రోడ్లోని ఇస్కాన్ దేవాలయంలో రథాన్ని కొబ్బరి మట్టలు, పూలదండలతో జగన్నాఽథ ఆలయం మాదిరిగా అలంకరించారు. రథంపై జగన్నాఽథ, సుభద్ర, బలరాముల విగ్రహాలను ప్రతిష్ఠించారు. మధ్యాహ్నం 2గంటలకు హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ నుంచి ప్రారంభమైన రథయాత్ర హనుమకొండ చౌరస్తా, ఎంజీఎం ఆస్పత్రి, పోచమ్మ మైదాన్నుంచి ఎంజీఎం రోడ్డు మీదుగా శ్రీవేంకటేశ్వర గార్డెన్స్కు చేరుకుంది. భక్తులు నెయ్యితో దీపాలను స్వామివారికి నివేదించారు. కీర్తనలు ఆలపిస్తూ నృత్యాలు చేశారు. అనంతరం భక్తులకు ప్రసాదవితరణ చేశారు. – హన్మకొండ కల్చరల్ -
మంగళవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2026
కాశిబుగ్గ: వరంగల్ మహాత్మాగాంధీ స్మారక వైద్యశాల (ఎంజీఎం) కు అధికారికంగా బాధ్యతలు చేపట్టిన సూపరింటెండెంట్ (ఎఫ్ఏసీ) డాక్టర్ రాంకుమార్రెడ్డికి పలు సమస్యలు సవాళ్లుగా మారనున్నాయి. దాదాపు రెండు నెలల పాటు ఇన్చార్జ్ సూపరింటెండెంట్ లేకుండానే ఆస్పత్రిని నెట్టుకొచ్చారు. చివరకు అదే ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్తో పాటు ఆర్థోపెడిక్ హెచ్ఓడీగా పనిచేసిన రాంకుమార్రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. డీఎంఈ నుంచి అధికారికంగా ఆర్డర్ వస్తే రెగ్యులర్ విధులు నిర్వహించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆయన ఎఫ్ఏసీ హోదాలో చెక్ పవర్ రావడంతో ఆస్పత్రిలోని ఆర్థిక సమస్యలు తీరనున్నాయి. పెండింగ్ బిల్లులపై దృష్టి పెట్టాలి ఆస్ప్రతిలో చాలాకాలం నుంచి పెండింగ్ బిల్లులు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డ్రగ్స్, స్టేషనరీ, తదితర పెండింగ్ బిల్లులు మూలుగుతున్నట్లు సమాచారం. డ్రగ్స్కు సంబంధించిన కొందరు కాంట్రాక్టర్లు రెగ్యులర్గా దవాఖానా చుట్టూ తిరుగుతున్నారు. అలాగే స్టేషనరీ సంబంధించి రూ.కోటి బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. బిల్లులు చెల్లించకపోవడంతో ల్యాబ్, ఎక్స్రే పరీక్షలకు సంబంధించిన రిక్విజేషన్ ఫారాలు సరఫరా లేక తెల్ల కాగితాలపైనే వైద్యులు రాయాల్సి వచ్చింది. భవనం ప్రారంభోత్సవంపై కసరత్తు... నగరంలో 24 అంతస్తుల నూతన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. దసరా నాటికి లేదా డిసెంబర్లో ప్రారంభమవుతుందనే ప్రచారం జరుగుతున్నందున అందులో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఎంజీఎంతో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటిపై ప్రత్యేక దృష్టి సారించాలి. డిప్యూటీ సూపరింటెండెంట్ను నియమించాలి కేఎంసీలోని సూపర్ స్పెషాలిటీ హాస్పటల్లో డిప్యూటీ సూపరింటెండెంట్ బదిలీ అయిన నెల రోజుల దాటిన ఎవరిని నియమించలేదు. కేవలం అక్కడ ఉన్న ఏకై క ఆర్ఎంవో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇన్చార్జి సూపరింటెండ్గా ఉన్న డాక్టర్ రాంకుమార్రెడ్డి సూపరింటెండెంట్ హోదాల్లో సూపర్కు డిప్యూటీ సూపరింటెండెంట్ను నియమించే అధికారం ఉంది. అదేవిధంగా ఆస్పత్రిలో రెండు నెలలనుంచి సీటీ స్కాన్ యంత్రం పనిచేయకపోవడంతో పరీక్షలు ఆగిపోయాయి. వారంరోజులనుంచి రోగుల లిఫ్ట్ పనిచేయడం లేదు. మరికొన్ని సమస్యలు ఇలా.. ఎంజీఎంలో పనిచేస్తున్న వందలాది మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందికి 3నెలల నుంచి వేతనాలు రావడం లేదు. చాలాకాలం నుంచి ఉన్న సెంట్రల్ ల్యాబ్ను పూర్తిగా మూసేశారు. ఇక ఆయా వార్డుల్లో చికిత్స పొందుతున్న ఇన్ పేషంట్ల బ్లడ్ పరీక్షల కోసం గతంలో శ్యాంపిల్ టేకర్స్ ఉండేవారు. ప్రస్తుతం వారినే ఎందుకో తీసేశారు. వార్డుల్లోని పేషంట్లు వివిధ పరీక్షల కోసం ల్యాబ్ల వద్దకు రాకుండా చూడాలి. ఆస్పత్రిలో ఉన్న పలు ఎక్స్రే మిషన్లు తరచూ రిపేర్కు గురవుతున్నాయి. డిజిటల్ ఎక్స్రే మిషన్ సైతం పనిచేసిన సందర్భాల్లో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా క్యాజువాలిటీలో ఉన్న ఎక్స్రే మిషన్ వద్ద ఇబ్బందులు లేకుండా చూడాలి. ల్యాబ్ల్లో అన్ని రకాల పరీక్షలు జరిగే ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇన్పేషంట్లకు డైట్ను సరఫరా జరిగే విధంగా ఏర్పాట్లు చేయాలి. డైటీషియన్ బదిలీ తర్వాత ఎవరినీ నియమించకపోవడంతో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంది. వైద్యులు లేకపోవడంతో డెంటల్ పరికరాలు నిరుపయోగంగా ఉన్నాయి. ఆస్పత్రిలో పేరుకుపోయిన పెండింగ్ బిల్లులు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందికి అందని వేతనాలు రోగుల సత్వర వైద్య పరీక్షలకు ల్యాబ్ల ఏర్పాట్లు ప్రారంభానికి సిద్ధంగా 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రేడియాలజీలో ఎక్స్రే మిషన్ల మరమ్మతు, సదుపాయాలు ఎంజీఎం సూపరింటెండెంట్ రాంకుమార్కు సవాలే..కాశిబుగ్గ: ఎట్టకేలకు వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్గా డాక్టర్ కాటం రాంకుమార్రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఎంజీఎం ఇన్చార్జి సూపరింటెండెంట్గా (ఎఫ్ఎసీ) నియమిస్తూ రెండు రోజుల క్రితం కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, సూపరింటెండెంట్గా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ రాంకుమార్రెడ్డికి ఆర్ఎంఓలు డాక్టర్ రఘురామయ్య, డాక్టర్ మధుకర్ యాదవ్, డాక్టర్ అశ్విని, ఏడీ బాలాజీ, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. -
జీతాలు తీసుకుంటున్నాం.. చిత్తశుద్ధి ఉండాలి
వరంగల్ అర్బన్ : ప్రజలు చెల్లించే పన్నులతోనే మనం జీతాలు తీసుకుంటున్నాం.. ప్రజా సమస్యలంటే ఎందుకు అలుసు?.. ప్రతి ఫిర్యాదుకు వారంలో పరిష్కారం లభించాలి.. లేదంటే ఆ సమస్యపై వివరణ ఇవ్వాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న అధికారులను, సిబ్బందిని హెచ్చరించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో కమిషనర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ‘పరిష్కారమా..పరిహాసమా? అనే వార్త కథనం సాక్షి దినపత్రిక’లో ప్రచురితమైంది. ఈ కథనంపై స్పందించిన కమిషనర్ గ్రీవెన్స్ అనంతరం అధికారులకు, సిబ్బందిని మందలించారు. గ్రీవెన్స్ ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యాన్ని సహించేది లేదన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఆశించిన పురోగతి లేదని ప్రతి వారం స్వీకరించిన ఫిర్యాదులు కచ్చితంగా పరిష్కారం కావాలన్నారు. ఆయా విభాగాల లాగిన్లలో ఫిర్యాదులు పేరుకుపోకుండా వెంటనే పరిష్కారం చూపాలన్నారు. ఇదిలా ఉండగా గ్రీవెన్ సెల్కు 118 ఫిర్యాదులు అందాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా, ఎస్ఈ రాజ్ కుమార్, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, డీఎఫ్ఓ శంకర్ లింగం, ఇన్చార్జ్ సీపీ రవీందర్ రాడేకర్, పన్నుల అధికారి రామకృష్ణ, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, సమ్మయ్య, సెక్రటరీ అనిల్ బాబు, హెచ్ఓ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రీవెన్స్ ఫిర్యాదుల్లో జాప్యాన్ని సహించను నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు గ్రేటర్ వరంగల్ కమిషనర్ వెంకన్న -
ప్రజావాణి అర్జీలు త్వరగా పరిష్కరించాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్ : ప్రజావాణిలో స్వీకరించిన ప్రతి అర్జీని ఆలస్యం చేయకుండా త్వరగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఆమె వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓలు, తహసీల్దార్లతో మాట్లాడిన కలెక్టర్, ప్రజావాణిలో సమర్పించిన దరఖాస్తులపై వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. ఆన్లైన్ పోర్టల్లో ప్రతి అర్జీ స్థితిని పరిశీలిస్తూ పెండింగ్ లేకుండా పరిష్కరించాలని స్పష్టం చేశారు. మొత్తం 268 ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, డీఆర్డీఓ మేన శ్రీను, జెడ్పీ సీఈఓ శేషాద్రి, సీపీఓ సత్యనారాయణ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వరంగల్ ప్రజావాణికి 192 ఫిర్యాదులు న్యూశాయంపేట : ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రెవెన్యూ శాఖ 51, మున్సిపల్శాఖ 6, హౌసింగ్ 65, డీఆర్డీఓ 18, ఇతర శాఖలకు సంబంధించి 52 దరఖాస్తులు (మొత్తం 192) రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఖిలా వరంగల్ మండల పరిధిలోని జిందా బిక్కన్ దర్వేష్ దర్గాకు సంబంధించిన భూమిలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని దర్గా కమిటీ బాధ్యులు విన్నవించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీసీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ నాగలక్ష్మి, డీఎంహెచ్ఓ ప్రకాష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
డెంటల్ విభాగంలో ఒకే డాక్టర్!
● ఎంజీఎం ఆస్పత్రిలో పరికరాలు ఉన్నా వేధిస్తున్న సిబ్బంది కొరత ● రోగులకు అరకొరగా వైద్యసేవలుకాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని డెంటల్ (దంత వైద్య) విభాగం నామమాత్రంగా నడుస్తోంది. ఇందులో ఒకే వైద్యురాలు అరకొర వసతుల మధ్య వైద్య సేవలు అందిస్తున్నారు. క్లినికల్ వైపు నుంచి ఓ డెంటల్ హైజినిస్టు ఓపీ పేషంట్లకు వైద్య చికిత్స చేస్తున్నారు. అయితే, వైద్య నిపుణుల కొరతతో రోగులకు సరైన సేవలు అందడం లేదని విమర్శలు వస్తున్నాయి. గతంలో ఆరోగ్యశ్రీ క్రింద ఇద్దరు వైద్యులుండగా వీరిని తొలగించి ఇంటర్యూలు నిర్వహించారు. ఈ ఇంటర్యూలకు నలుగురు వైద్యులు హాజరు కాగా.. ఇద్దరు వైద్యులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఏడాది దాటినా కూడా ఆ ఇద్దరు వైద్యుల నియామకం ఎంతవరకు వచ్చిందో తెలియదు. అలాగే, మరో గవర్నమెంట్ ఔట్సోర్సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ను సైతం టర్మినేషన్ చేశారు. ముఖ్యంగా డెంటల్ డిపార్ట్మెంట్కు హెచ్ఓడీగా ఉన్న ప్రొఫెసర్ సైతం నర్సంపేటకు బదిలీ అయ్యారు. దీంతో ఈ విభాగం నుంచి నలుగురు వెళ్లినా ఏ ఒక్కరు కూడా రాకపోవడంతో ఇద్దరిపై భారం పడుతోంది. ముఖ్యంగా పంటి వైద్యానికి సంబంధించిన ఎన్నో పరికరాలు ఉన్నా సిబ్బంది లేకపోవడంతో అవి మూలనపడి ఉంటున్నాయి. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి దంత వైద్యవిభాగంలో వైద్యులు, సిబ్బందిని నియమించాలని పేషంట్లు, అటెండెంట్లు కోరుతున్నారు. -
విరోధిని, వహ్నివాసిని క్రమాల్లో అమ్మవారు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో శాకంబరీ నవరాత్ర మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు ఆదివారం అమ్మవారిని విరోధిని, వహ్నివాసినిగా అలంకరించి పూజలు చేశారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం అమ్మవారికి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, క్షీరాన్ననివేదన, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. అనంతరం కాళీ క్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని విరోధిని క్రమంలో, షోడశీ క్రమాన్ని అనుసరించి బోగభేరాన్ని వహ్నివాసిని క్రమంలో అలంకరించి విశేష పూజలు చేశారు. మహిళలు హాజరై అమ్మవారికి చీర, సారె సమర్పించారు. సెలవు దినం కావడంతో అధికసంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ రామల సునీత ఏర్పాట్లను పర్యవేక్షించారు. నేడు హెచ్ఎంలకు ఓరియంటేషన్ విద్యారణ్యపురి: హైదరాబాద్లోని కొమురంభీమ్ ఆదివాసీ భవన్లో పీఎం శ్రీ స్కూల్స్ హెచ్ఎంలు, జిల్లాస్థాయి అధికారులు, ఎఫ్ఏఓ, ప్లానింగ్ కోఆర్డినేటర్, జీసీడీఓ, సిస్టం అనలిస్టులకు సోమవారం ఓరియంటేషన్ కార్యక్రమం ఉంటుందని హనుమకొండ జిల్లా విద్యాశాఖాధికారి ఎల్వీ గిరిరాజ్గౌడ్ తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఓరియెంటేషన్కు జిల్లాలోని 19 పీఎం శ్రీస్కూల్స్ హెచ్ఎంలు హాజరుకానున్నారని పేర్కొన్నారు. నాణ్యమైన విద్య, జాతీయ విద్యావిధానం, పీఎంశ్రీ పాఠశాలల అభివృద్ధి, ఆర్థిక నిర్వహణ, సమర్థంగా డిజిటల్ వ్యవస్థ వినియోగం, పాఠశాలల పనితీరుపై శిక్షణలో అవగాహన కల్పిస్తారని డీఈఓ తెలిపారు. ‘సర్’ ప్రక్రియ పరిశీలన కాశిబుగ్గ: కాశిబుగ్గ తిలక్ రోడ్డులో జరుగుతున్న సర్ కార్యక్రమాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ వైవీ గణేశ్ ఆదివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఫారాలను సకాలంలో అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్, తహసీల్దార్ శ్రీకాంత్, స్థానిక నాయకులు లక్కిరెడ్డి పూర్ణేందర్రెడ్డి, బొట్ల సదానందం, దాసరి రాజేశ్, శ్రీధర్రెడ్డి, రాజు, బీఎల్ఓలు విమల, యశోద, భాగ్యలక్ష్మి, శోభారాణి, రజిత తదితరులు పాల్గొన్నారు. టీచర్ల సర్దుబాటు పారదర్శకంగా చేపట్టాలి.. కాళోజీ సెంటర్: జిల్లాలోని పాఠశాలల్లో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను సర్దుబాటు చేసే ప్రక్రియ పారదర్శకంగా చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ప్రతినిధి బృందం సభ్యులు కోరారు. ఆదివారం ఆర్జేడీ కార్యాలయంలో డీఈఓ రంగయ్యనాయుడును కలిసి వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో జరిగిన అక్రమ సర్దుబాట్లను రద్దు చేసి అదనంగా ఉన్న ఉపాధ్యాయులను మొదటిగా కాంప్లెక్స్ పరిధి, ఆ తర్వాత మండల పరిధిలో సర్దుబాటు చేయాలన్నారు. ఘనంగా సౌరవృత్త తారావళి పుస్తకావిష్కరణ హన్మకొండ కల్చరల్: సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ వరంగల్ ఆధ్వర్యంలో అజో విభో కంధాళం ఫౌండేషన్ అధ్యక్షుడు అప్పాజోస్యుల సత్యనారాయణ రచించిన సౌర వృత్త తారావళి, వ్యాఖ్య పుస్తకాల ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ మేరకు ఆదివారం హనుమకొండ వడ్డేపల్లి రోడ్డులోని పీఆర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో సహృదయ సంస్థ అధ్యక్షుడు గన్నమరాజు గిరిజామనోహరబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ సాహితీ వేత్త, కవి విహారి, విశిష్ట అతిథులుగా తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి అనుమాండ్ల భూమయ్య, రచయిత, వ్యాఖ్యాత ఆచార్య తాడేపల్లి పతంజలి, సాహితీవేత్త డాక్టర్ దహగం సాంబమూర్తి పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేంద్ర సాహితీ అవార్డు గ్రహిత డాక్టర్ అంపశయ్య నవీన్, కవి రామచంద్రమౌళి, వీఆర్ విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాసరావు, వనం లక్ష్మీకాంతారావు, మల్యాల మనోహరరావు, కళా రాజేశ్వర్, డాక్టర్ టి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
నామినేట్.. లేట్!
సోమవారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2026సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీపై నెలకొన్న ఉత్కంఠకు మరికొంత కాలం తెరపడే అవకాశం కనిపించట్లేదు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడంతో నామినేటెడ్ పోస్టుల నియామకాల ప్రక్రియను ఆగస్టు 3వ తేదీ తర్వాత చేపట్టే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో పదవీకాలం ముగిసిన నేతలు, కొత్తగా అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారిలో అయోమయం నెలకొంది. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ.. ఇటీవలే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న నేతల పదవీకాలం పూర్తయ్యింది. మరోసారి కొనసాగిస్తారా? లేక కొత్తవారికి అవకాశం కల్పిస్తారా? అనే చర్చ కొనసాగుతుండగానే నియామకాలు వాయిదా పడతాయనే సంకేతాలు రావడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. సభ్యత్వ నమోదుపైనే దృష్టి ప్రస్తుతం పార్టీకి అత్యంత ప్రాధాన్యమైన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపైనే సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం. ఈకార్యక్రమం పూర్తయ్యే వరకు ఎలాంటి నామినేటెడ్ పోస్టుల నియామకాలపై నిర్ణయం తీసుకోకూడదని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆగస్టు 3 తర్వాతే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అధిష్టానం అప్రమత్తం నామినేటెడ్ పదవుల కోసం కొద్ది రోజులుగా ఆశావహులు పెద్దఎత్తున హైదరాబాద్కు వెళ్లి మంత్రులు, ముఖ్యనేతలను కలుస్తున్న నేపథ్యంలో.. పార్టీ అధిష్టానం కూడా అప్రమత్తమైనట్లు సమాచారం. సభ్యత్వ నమోదుపైనే దృష్టి పెట్టాలని, లాబీయింగ్ కోసం హైదరాబాద్కు రావొద్దని ముఖ్యనేతలు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. గాంధీభవన్లో కూడా ప్రస్తుతం నామినేటెడ్ పోస్టుల అంశంపై చర్చలకు పెద్దగా అవకాశం ఇవ్వడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విరోధిని, వహ్నివాసిని క్రమాల్లో అమ్మవారుఉమ్మడి జిల్లాలో ముగిసిన పలువురి పదవీకాలం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఉండగా, జంగా రాఘవరెడ్డి, ఇనగాల వెంకట్రాంరెడ్డి, బెల్లయ్యనాయక్, అయిత ప్రకాశ్రెడ్డి, పోదెం వీరయ్య, ఎండీ రియాజ్తోపాటు కీలక నామినేటెడ్ బాధ్యతల్లో ఉన్న నాయకుల పదవీకాలం ఇటీవల ముగిసింది. వీరిలో ఎవరిని కొనసాగిస్తారు? ఎవరికి కొత్త బాధ్యతలు అప్పగిస్తారు? అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఆగస్టు 3 తర్వాతే నామినేటెడ్ పోస్టులకు మోక్షం ’సర్’పై దృష్టి పెట్టాలన్న సీఎం,టీపీసీసీ చీఫ్ హైదరాబాద్కు రావొద్దని నేతలకు సూచన గాంధీభవన్లో లాబీయింగ్కు ఇక బ్రేక్ ఉమ్మడి వరంగల్లో పలువురి పదవీకాలం ముగింపు ఆశావహుల్లో అంతా అయోమయం -
పరిష్కారమా.. పరిహాసమా?
● పెండింగ్లో వందలాది గ్రీవెన్స్ అర్జీలు ● ఫిర్యాదుదారుల సహనానికి పరీక్ష ● జీడబ్ల్యూఎంసీ అధికారుల అలసత్వంవరంగల్ అర్బన్: ‘గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్లో వినతులకు పరిష్కారం దొరకట్లేదు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా బల్దియా అధికారులు పట్టించుకోవట్లేదు. క్షేత్రస్థాయిలో సమస్యలతో.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులతో విసిగివేసారి పోయాం’ అంటూ నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ మహా నగరపాలకసంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్లో ప్రజలు వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేస్తారు. ఒక వ్యక్తి దరఖాస్తు సమర్పించేందుకు దూరం ఆధారంగా సరాసరి అవుతున్న ఖర్చు అక్షరాలా రూ.50 నుంచి రూ.150. నడవలేని వారు కొందరైతే, కదల్లేని వారు ఇంకొందరు. ఇలా అనేక రకాల సమస్యలతో గ్రీవెన్స్కు వస్తారు. తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తారు. కానీ, వారిలో చాలామందికి నిరాశే మిగులుతోంది. కాగా, ఏ సమస్య అయినా నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని గ్రేటర్ అధికారులు గ్రీవెన్స్లో అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని అర్జీదారులు వాపోతున్నారు. పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు సైతం తమకేం పట్టదు అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఫిర్యాదుదారులకు సమస్యలు సవాల్గా మారుతున్నాయి. అన్ని విభాగాల్లో ఇదే పరిస్థితి! నల్లా కనెక్షన్ నుంచి డ్రెయినేజీలు, రోడ్లు, చెత్త సమస్య, అక్రమ నిర్మాణాలు, దోమలు, కోతులు, కుక్కలు, ట్రేడ్ లైసెన్స్, కొత్త ఇంటి నంబర్లు, సమాచార హక్కు చట్టం ఇలా సమస్య ఏదైనా నిర్ణీత గడువులోగా పరిష్కారం కావట్లేదు. అన్ని విభాగాల్లో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పట్లేదు. అండర్ ప్రాసెస్ పేరుతో కాలయాపన.. సమస్యలను పరిష్కరించినట్లు నమోదు చేస్తున్న దరఖాస్తుల్లో చాలా వరకు పరిష్కరించలేదని తెలుస్తోంది. కానీ, వాటిని పరిష్కరించినట్లు చూపెడుతున్నారు. మరికొన్నింటిని అండర్ ప్రాసెస్ అంటూ పక్కన పెడుతున్నారు. దీంతో ఉన్నతాధికారులు కూడా పెద్దగా దృష్టి కేంద్రీకరించడం లేదన్నది అర్థమవుతోంది. పదేపదే వినతులు అందజేస్తున్నా.. సమస్యలు ఎందుకు పరిష్కరించట్లేదనని ప్రశ్నిస్తే అధికారుల నుంచి సమాధానం కరువవుతోందని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలనేది? ఇది వరకు ప్రజల నుంచి వచ్చే సమస్యలను క్షేత్రస్థాయిలో ఉద్యోగులు, వింగ్ అధికారులు పరిశీలించేవారు. క్షేత్రస్థాయిలో గత కొద్ది నెలలుగా పరిశీలన కరువైంది. ఉద్యోగులు సమస్య పరిష్కరిస్తున్నారా? లేక పరిష్కరించకుండానే రికార్డుల్లో చూపిస్తున్నారా? అనే అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. గ్రీవెన్స్కు మానిటరింగ్ సిస్టం (జీఎంఎస్) లేదు. దీంతో అధికారుల నడుమ సమన్వయం లోపిస్తోంది. ఈ–పరిష్కారం లేకపోవడం వల్ల గ్రీవెన్స్పై ప్రజల్లో అపనమ్మకం పెరిగే అవకాశం ఉంది. మహానగర పాలకసంస్థ కమిషనర్ దృష్టి సారించి సమస్యలు పరిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై గ్రేటర్ అదనపు కమిషనర్ ఇసంపల్లి జోనాను వివరణ కోరగా సమస్య పరిష్కారానికి కృషిచేస్తాం... క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రీవెన్స్ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం అని పేర్కొన్నారు. పెండింగ్ దరఖాస్తులు ఇలా.. నేడు గ్రేటర్ గ్రీవెన్స్ వరంగల్ మహానగర పాలకసంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వంగా వినతులు స్వీకరించనున్నట్లు వారు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రజలు గ్రీవెన్స్ను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. (ఈ ఏడాది జనవరి 1 నుంచి) పరిధి దరఖాస్తులు తిరస్కరణ పరిష్కారం పెండింగ్ కాజీపేట సర్కిల్ కార్యాలయం 1,520 2 551 969 కాశిబుగ్గ సర్కిల్ కార్యాలయం 960 1 230 729 -
మోడల్ స్కూల్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
విద్యారణ్యపురి: మోడల్ స్కూల్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లాల మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయుల సమావేశాన్ని హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్లో నిర్వహించారు. ఈసమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. మోడల్ స్కూల్ వ్యవస్థను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసి జీరో వన్ జీరో పద్దు కింద వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.మహేశ్, ఉమ్మడి జిల్లా బాధ్యులు నార శ్రీనివాస్, టీఎస్యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు, బాధ్యులు సుజన్ ప్రసాద్రావు, టి.కుమార్ పాల్గొని సంఘీభావం తెలిపారు. సమావేశంలో టీఎస్ఎం ఎస్టీఎఫ్ రాష్ట్ర నాయకులు కె.వీలాద్రి మోహన్రావు, ఆయోస్కాన్, ఉషాపద్మిని, నాగలక్ష్మి, ప్రశాంతి, సత్యనారాయణ, అశోక్, విజయకుమారి, రఘుపతి, రవి, రాజేంద్రప్రసాద్, రాజు, విజయ్, మధు, వివిధ జిల్లాల మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
యూడైస్ ప్రకారమే యూనిఫామ్
● హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు క్లాత్ రాక ● పూర్తి కావొస్తున్న స్టిచ్చింగ్ ప్రక్రియ ● ఈసారి డిజైన్, కలర్ మార్చిన ప్రభుత్వంవిద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభించి 35 రోజులు అవుతోంది. ప్రతీ ఏడాది పాఠశాలలు తెరిచిన జూన్ 12వ తేదీనే ఒక్కో విద్యార్థికి ఒక్కోజత స్కూల్ యూనిఫామ్, ఆతర్వాత మరో జత అందించేవారు. ఈ విద్యాసంవత్సరంలో స్కూల్ యూనిఫామ్ క్లాత్ పంపిణీని ప్రభుత్వం ఓ సంస్థకు అప్పగించింది. డిజైన్, రంగులు మార్పు చేశారు. రెండు మూడు రోజులుగా హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్ స్కూల్స్ విద్యార్థులకు అందించే స్కూల్ యూనిఫామ్ క్లాత్ 14 మండల కేంద్రాలకు చేరుకుంది. అయితే, పలుచోట్ల సరిపడా క్లాత్ రాలేదని, ఇంకా కొంత క్లాత్ రావాల్సి ఉందని తెలుస్తోంది. సరిపడా రాకపోతే కొంతమంది విద్యార్థులకు తక్కువ పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, ఈసారి యూడైస్లో నమోదైన వివరాల ఆధారంగా యూనిఫామ్ అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు అప్పగింత జిల్లాలోని మండల కేంద్రాలకు స్కూల్ యూనిఫామ్ క్లాత్ వచ్చింది. ఈ క్లాత్ను ఆయా మండలాల స్కూళ్ల పరిధి మహిళా సంఘాలకు (సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల)కు స్టిచ్చింగ్ కోసం అప్పగించారు. ఇప్పటికే ఆయా విద్యార్థుల కొలతలను కూడా సేకరించారు. స్టిచ్చింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పట్టణ ప్రాంతాల్లో డీఆర్డీఏ పరిధిలోని మెప్మా ఆధర్వంలో మహిళా సంఘాల ద్వారా స్టిచ్చింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కేజీబీవీ విద్యార్థినులకు త్వరలో.. జిల్లాలోని 9 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థినుల కోసం యూనిఫామ్ క్లాత్ కొద్దిరోజుల క్రితమే వచ్చింది. ఆయా విద్యార్థినుల కోసం రెండుజతల స్కూల్ యూనిఫాం స్టిచ్చింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కొద్దిరోజుల్లోనే ఆయా విద్యార్థినులకు స్కూల్ యూనిఫామ్ అందించనున్నారు. ఒక్కోజతకు స్టిచ్చింగ్ చార్జి రూ.75 ఇవ్వనున్నారు. యూనిఫామ్ క్లాత్ తక్కువపడే అవకాశం.. యూడైస్ ప్రకారమే ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలోని విద్యార్థులకు రెండుజతల చొప్పున స్కూల్ యూనిఫామ్ అందించనున్నారు. అయితే ఈసారి క్లాత్ రావడం ఆలస్యమైంది. మరోవైపు పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మండలాల్లోని వివిధ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఇప్పటివరకు ఉన్నదాన్ని పరిగణనలోనికి తీసుకోవడం లేదు. గత యూడైస్ విద్యార్థుల సంఖ్యనే పరిగణనలోకి తీసుకొని క్లాత్ను ఆయా మండలాలకు పంపిస్తున్నారు. దీంతో పలు మండలాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగవచ్చు, మరికొన్నింటిలో తగ్గవచ్చు. ప్రస్తుతం ఉన్న సంఖ్యను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల కొందరి విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ క్లాత్ తక్కువపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు గత యూడైస్కు అనుగుణంగా కూడా వివిద మండలాల్లో క్లాత్ సరిపడా రాలేదని తెలు స్తో ంది. జూలైలో ఉన్న విద్యార్థుల సంఖ్యను పరిగణ లోనికి తీసుకొని క్లాత్ను పంపిణీ చేస్తే విద్యార్థులందరికీ రెండు జతల స్కూల్యూనిఫామ్ అందే అవకాశం ఉంటుంది. ఆదిశగా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విద్యాసంవత్సరం 29,157 మంది.. ఈ విద్యాసంవత్సరం హనుమకొండ జిల్లాలోని ఆయా పాఠశాలల్లో ఇప్పటివరకు 29,157మంది విద్యార్థులు 1 నుంచి 12వ తరగతివరకు చదువుతున్నారు. ఒక్కో మండలంలో ఒక్కో విధంగా విద్యార్థుల సంఖ్య ఉంటుంది. గత యూడైస్ ప్రకారం క్లాత్ వస్తుండడంతో పలుచోట్ల తక్కువపడే పరిస్థితి నెలకొని ఉంది. గత విద్యాసంవత్సరంలో ప్రారంభించిన 40కిపైగా ప్రాథమిక పాఠశాలల్లో ప్రీపైౖమరీ తరగతుల విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ వచ్చింది. కానీ, ఈవిద్యాసంవత్సరం జిల్లాలోని 39 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించారు. వీటిలో చదువుతున్న విద్యార్థులకు క్లాత్ రాలేదని తెలుస్తోంది. గత విద్యాసంవత్సరం 30,996 మంది విద్యార్థులు.. గత విద్యాసంవత్సరం యూడైస్ ప్రకారం హనుమకొండ జిల్లాలోని 483 ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 30,996 మంది విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ అందజేయాల్సి ఉంటుంది. అందులో బాలురు 15,117, బాలికలు 15,879 మంది ఉన్నారు. -
మరో మూడు నెలలు
● ఆగస్టులో ఒకేసారి మూడునెలల రేషన్ బియ్యం పంపిణీ ● ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులుఖిలా వరంగల్: వర్షాకాలం నేపథ్యంలో రేషన్ కోసం లబ్ధిదారులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని ముందుగా పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఆగస్టులో ఒకేసారి పంపిణీ చేయనున్నారు. కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. 16,782.804 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం వరంగల్ జిల్లాలో 509 షాపులున్నాయి. మొత్తం 2,93,824 రేషన్ కార్డులు ఉండగా.. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఆయా లబ్ధిదారులకు సన్న బియ్యం అందించేందుకు ప్రతీ నెల 5504.268 మెట్రిక్ టన్నులు మేర కేటాయిస్తున్నారు. జూలై నెలకు సంబంధించి నేటితో (సోమవారం) పంపిణీ గడువు ముగియనుంది. వచ్చే నెల ఆగస్టు 1 నుంచి ఒకేసారి మూడు నెలల బియ్యాన్ని పంపిణీ చేయాలంటే మొత్తం 16,782.804 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరం ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతున్నాయి. ఇటీవల జారీ అయిన నూతన కార్డులకు మరికొంత స్టాక్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. డీలర్లకు మరోసారి కష్టాలే! ఆగస్టు మాసంలో మూడు నెలల బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రేషన్ డీలర్లకు మరోసారి కష్టాలు తప్పేలాలేవంటున్నారు. మూడు నెలల స్టాక్ దించుకునేందుకు షాపుల్లో స్థలం లేక గతంలో ఇబ్బందులు పడ్డారు. అమ్మికొద్ది బియ్యం తెచ్చుకోవడంతో అదనపు ఖర్చులు భరించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని డీలర్లు అంటున్నారు. హమాలీ చార్జీలు, ఇతర ఖర్చులతో మోయలేని భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు చర్యలు.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు రాలేదు. జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశాలు రాగానే మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యం పంపిణీ చేసేలా చర్యలు చేపడుతాం. గోదాముల్లో సన్న బియ్యం నిల్వ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తాం. జూలై నెల మాసం పంపిణీ ముగిసిన తర్వాత జిల్లాలోని రేషన్ దుకాణాల్లో బియ్యం నిల్వలు ఏ మేరకు ఉన్నాయి.. ఎంత సరఫరా చేయాలనేది – కిష్టయ్య, డీఎస్ఓ, వరంగల్ -
తడి, పొడి చెత్త వేర్వేరుగా అందించాలి
జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న వరంగల్ అర్బన్: ప్రతీ ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం వరంగల్లోని పలు ప్రాంతాల్లో ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. కాకతీయ థియేటర్, పాపయ్యపేట చమన్, బట్టల బజార్, ఫ్లైఓవర్ బ్రిడ్జి, జ్యోతి కాలనీ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి పారిశుద్ధ్యంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. బట్టల బజార్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద పేరుకుపోయిన (కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్) వ్యర్థాలను గుర్తించి తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య జవాన్లు నిర్వహిస్తున్న హాజరు, విధుల రిజిస్టర్ను పరిశీలించారు. తనిఖీల్లో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, డీఈ రంగారావు, శానిటరీ సూపర్వైజర్ గోల్కొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎఫ్ఎస్టీపీ సమర్థ నిర్వహణకు సమన్వయంతో పనిచేయాలి నగరంలోని సెప్టిక్ ట్యాంకులనుంచి సేకరించే ఫీకల్ స్లడ్జ్ను తప్పనిసరిగా ‘ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్’ (ఎఫ్ఎస్టీపీ)లకే తరలించాలని, నిబంధనలు ఉల్లంఘించి ఎక్కడైన పారబోస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ టి.వెంకన్న హెచ్చరించారు. శుక్రవారం కమిషనర్ కార్యాలయంలో 15,150 కేఎల్డీ ఎఫ్ఎస్టీపీల నిర్వహణ ఏజెన్సీ ప్రతినిధులు, డీ–స్లడ్జింగ్ ఆపరేటర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లతో నిర్వహించిన సమీక్ష నిర్వహించారు. ఇందులో సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్వో డాక్టర్ రాజేష్, హస్కీ సంస్థ ప్రతినిధి డాక్టర్ జనార్దన్ మోహన్, డీ–స్లడ్జింగ్ ఆపరేటర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వరంగల్ స్పోర్ట్స్: క్రీడా అకాడమీలు, ప్రాంతీయ క్రీడా వసతి గృహాల్లో (2026–27) విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఎంపిక ప్రక్రియ చేపడుతున్నట్లు హనుమకొండ డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 27, 28 తేదీల్లో హనుమకొండలోని జేఎన్ఎస్లోని హ్యాండ్ బాల్, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, రెజ్లింగ్ అకాడమీల్లో ఎంపికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 97046 69637 మొబైల్ నంబర్లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
ఎంజీఎం సూపరింటెండెంట్గా డాక్టర్ రాంకుమార్రెడ్డి
వరంగల్ కలెక్టర్ సత్యశారద ఉత్తర్వులు కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ కాటం రాంకుమార్రెడ్డిని నియమిస్తూ శుక్రవారం కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఉత్తర్వులు జారీ చేశారు. ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెంటెండ్గా డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి హైదరాబాద్కు బదిలీ అయిన తర్వాత కొత్త సూపరింటెండెంట్ కోసం అందరూ ఎదురుచూశారు. పలువురు సీనియర్ వైద్యుల పేర్లు కూడా పరిగణనలోకి వచ్చాయి. డీఎంఈ నుంచి ఆదేశాలు రాకపోవడంతో ఎవరు సూపరింటెండెంట్గా వస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. దాదాపు 45 రోజుల నుంచి ఆస్పత్రిలో నెలకొన్న ఆర్థికపరమైన పలు సమస్యలు, బిల్లుల చెల్లింపులు, ఇతర వైద్యసేవల విషయంలో ఏర్పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ సత్యశారద ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్పర్సన్గా నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఆస్పత్రిలో ఎలాంటి ఆర్థిక సమస్యలు రాకుండా, పరిపాలనా పరంగా నిబంధనల మేరకు నిర్ణయం తీసుకునే విధంగా డాక్టర్ రాంకుమార్రెడ్డి సూపరింటెండెంట్గా (ఎఫ్ఏసీ) అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, సూపరింటెండెంట్ ర్యాటిఫికేషన్ కోసం డీఎంఈకి సమాచారం పంపినట్లు తెలుస్తోంది. ఏదేమైనా డీఎంఈ నుంచి కూడా ఉత్తర్వులు రావాల్సి ఉంది. కాగా, సూపరింటెండెంట్గా డాక్టర్ రాంకుమార్రెడ్డి ఽశనివారం చాంబర్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. మెడికల్ రికార్డు ఆఫీసర్గా రవీందర్ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి మెడికల్ రికార్డు ఆఫీసర్గా వంగ రవీందర్ను నియమించారు. రామకృష్ణ ఉద్యోగ విరమణ పొందడంతో ఆయన స్థానంలో రవీందర్ ఇన్చార్జ్గా వ్యహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మెడికల్ రికార్డు టెక్నీషియన్ నుంచి పదోన్నతి పొంది పూర్తిస్థాయి ఎంఆర్ఓగా రానున్నారు. కాగా, శనివారం ఆయన ఎంఆర్డీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. -
వేగంగా భూ రీ–సర్వే
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: భూ రీ–సర్వే కార్యక్రమాన్ని పారదర్శకంగా, వేగవంతంగా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. మొదటి దశలో ధర్మసాగర్ మండలం జానకీపురం, ముచ్చర్లలో జరుగుతున్న రీ–సర్వేను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని, రెండో దశలో ఎంపిక చేసిన 71 గ్రామాల్లో కూడా పనులు వేగవంతం చేయాలని సూచించారు. పరకాల మండలం రాజుపేట, ఐనవోలు మండలం పంథిని, భీమదేవరపల్లి, నడికూడ మండలం సర్వాపూర్, కాజీపేట మండలం అమ్మవారిపేట గ్రామాల్లో రీ–సర్వే కొనసాగుతోందని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అదనపు కలెక్టర్ ఎన్.రవి మాట్లాడుతూ, తహసీల్దార్లు ప్రణాళికాబద్ధంగా పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ నూర్ సింగ్, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు వెంకటేశ్, వెంకన్న, తహసీల్దార్లు, సర్వేయర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. నాణ్యమైన వైద్య సేవలందించి విశ్వాసం పెంచాలి..నయీంనగర్: ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలందిస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలని, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పోచమ్మకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూపీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవలు, ప్రాథమిక పరీక్షల గురించి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్.దీప్తిని అడిగి రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మదన్మోహన్ రావు, వైద్య సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బంది, సంబందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
వారాహిగా భద్రకాళి అమ్మవారు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో కొనసాగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం అమ్మవారికి కుల్లా క్రమంలో, నిత్యక్లిన్నా క్రమంలో పూజలు జరిపి వారాహి అమ్మవారుగా అలంకరించారు. శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ఉదయం నుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, చతుఃస్థానార్చన, అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరానికి కుల్లా క్రమంలో పూజలు నిర్వహించి వారాహి అమ్మవారుగా అలంకరించారు. షోఢశీక్రమాన్ని అనుసరించి స్నపన మందిరంలోని బోగభేరాన్ని నిత్యక్లిన్నాగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ రామల సునీత, సిబ్బంది పర్యవేక్షించారు. హన్మకొండ అర్బన్: జిల్లాలోని ప్రతీ రేషన్ కార్డులో నమోదైన సభ్యుడికి ఈనెల 31లోపు ఈ–కేవైసీ ప్రక్రియను వందశాతం పూర్తి చేయాలని రేషన్ డీలర్లను హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి ఆదేశించారు. ఈలక్ష్యాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయని ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్లపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టరేట్ నుంచి అన్ని మండలాల ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ల సంఘం అధ్యక్షులు, కార్యదర్శులతో శుక్రవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఈ–కేవైసీ పురోగతిని సమీక్షించారు. ఇంకా.. ఈ–కేవైసీ చేయించుకోని లబ్ధిదారులను వ్యక్తిగతంగా సంప్రదించి దుకాణాలకు రప్పించాలని, వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బయటకు రాలేని వారి ఇళ్లకు వెళ్లి ఈ–కేవైసీ పూర్తి చేయాలని డీలర్లను ఆదేశించారు. గడువులోగా ఈ–కేవైసీ పూర్తి చేయకపోతే భవిష్యత్లో రేషన్ సరుకుల పంపిణీలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. సమస్యలు ఎదురైతే సంబంధిత మండల పౌర సరఫరాల అధికారిని లేదా సమీప ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ను సంప్రదించాలని సూచించారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీని రాజకీయాలకు అడ్డాగా మార్చకుండా విద్యార్థుల భవిష్యత్ కోసం అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం కేయూని సందర్శించిన ఆయన గెస్ట్హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను రెచ్చగొట్టి యూనివర్సిటీ అభివృద్ధిని అడ్డుకునే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేయూలో నెలకొన్న సమస్యలపై గతంలో ఎంపీ, ఎమ్మెల్యేలు వర్సిటీ అధికారులతో కలిసి సమీక్షలు నిర్వహించాక అధికారులు సమగ్ర డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించారని, దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను కేయూలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా.. కొందరు కావాలనే వివాదం సృష్టించారని ఆరోపించారు. కేయూకు రావా ల్సిన నిధులు అభివృద్ధి పనులు వైస్ చాన్స్లర్ నిర్లక్ష్యం వల్లనే ఆలస్యమవుతున్నాయని విమర్శించారు. మామునూరు విమానాశ్రయంపై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే నైతిక హక్కులేదని రాజేందర్రెడ్డి అన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే పక్కనే కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, కేయూ ఓఎస్డీ వెంకట్రామ్రెడ్డి ఉన్నారు. కాళోజీ సెంటర్: ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు హెచ్సీఎల్ టెక్నాలజీ వారు నిర్వహిస్తున్న ‘టెక్ బీ ప్రోగ్రాం’ కోసం నేడు (శనివారం) మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు వరంగల్ డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.30 గంటలకు హనుమకొండ అంబేడ్కర్ విగ్రహం సమీపంలోని ఐసీఎస్ఎస్ కంప్యూటర్ కేంద్రంలో అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వివరాలకు జిల్లా ఇన్చార్జ్ నరేశ్ (75691 77071, 79818 34205)ను సంప్రదించాలని కోరారు. -
ఆషాఢంలోనూ రిజిస్ట్రేషన్ల జోరు!
● ఐదు రోజులు.. 481 దస్తావేజులు ● ఖజానాకు భారీగా ఆదాయం కాజీపేట అర్బన్: ఆషాఢ మాసంలోనూ రిజిస్ట్రేషన్ల జోరు తగ్గడం లేదు. వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కా ర్యాలయంలో భూక్రయవిక్రయదారులు రిజిస్ట్రేషన్లకు ఆసక్తి కనబరుస్తున్నారు. సాధారణంగా ఈ మాసంలో శుభకార్యాలు, నివాస స్థలాలు, ఇళ్లు, అ పార్ట్మెంట్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూప రు. కానీ, ఇందుకు భిన్నంగా వరంగల్ ఆర్వోలో స్లాట్స్ బుకింగ్కు పోటీ పడుతున్నట్లు సమాచారం. రూ.రెండు కోట్ల ఆదాయం.. ఆషాఢ మాసం ఈనెల 14 నుంచి ఆగస్టు 12 వరకు ఉంటుంది. ఈ మాసం ప్రారంభమైన ఐదు రోజుల్లోనే 481 దస్తావేజులు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నాయి. వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 108 స్లాట్ బుకింగ్స్ రిజిస్ట్రేషన్కు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ప్రతి రోజు 60 నుంచి 70 దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేస్తారు. 80 నుంచి 100కు పైగా దస్తావేజులు ప్రతిరోజు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవడం విశేషం. దీంతో ఐదు రోజుల్లో ఖజానాకు సుమారు రెండు కోట్ల ఆదాయం సమకూరినట్లు సమాచారం.తేదీలు -
అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న వరంగల్ అర్బన్: గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయకుంటే బిల్లుల్లో కోత విధిస్తామని గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న హెచ్చరించారు. నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండొద్దని స్పష్టం చేశారు. అనంతరం జవహర్లాల్ నెహ్రూ స్టేడియం పరిసరాలను సందర్శించారు. బస్స్టేషన్ వద్ద ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకుని స్టేడియం రహదారి విస్తరణ పనులు త్వరితగతిన చేపట్టాలని సూచించారు. హనుమకొండ అశోక థియేటర్ ఎదుట ప్రతిపాదించిన మల్టీ లెవల్ పార్కింగ్ స్థలాన్ని పరిశీలించిన కమిషనర్.. టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టులో దర్గాకాజీపేట ఉత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో దర్గా పీఠాధిపతి అఫ్జల్ బియాబానీ ఖుస్రూపాషాతో కలిసి దర్గా ప్రాంగణం, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఎస్ఈ రాజ్కుమార్, ఈఈలు రవికుమార్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. నగరంలో వీధిదీపాల నిర్వహణ పటిష్టం చేయాలి నగరంలో వీధిదీపాల నిర్వహణ పటిష్టం చేయాలని కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు. జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్కుమార్తో కలిసి ఎలక్ట్రికల్ విభాగం పనులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని ప్రాంతాల్లో వీధిదీపాలు నిరంతరం వెలిగేలా పర్యవేక్షించాలని సూచించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మాధవీలత, రవికుమార్, అసిస్టెంట్ ఇంజనీర్లు అబ్దుల్ గఫూర్, సరిత, రాంకీ పాల్గొన్నారు. -
గడువులోగా ఎస్ఐఆర్ను పూర్తిచేయాలి
రాష్ట్ర ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ హరి చందన దాసరి హన్మకొండ అర్బన్: ఎస్ఐఆర్ను పారదర్శకంగా, నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని రాష్ట్ర ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్, శక్తి శాఖ కార్యదర్శి హరిచందన దాసరి అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి బాలసముద్రం శ్రీనివాసకాలనీ ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను శనివారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హెల్ప్డెస్క్ల పనితీరు, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, నమోదు, డిజిటలైజేషన్ పురోగతిని పరిశీలించిన హరి చందన దాసరి.. బూత్స్థాయి అధికారులతో మాట్లాడి పలు అంశాలపై ఆరా తీశారు. ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రవీందర్రెడ్డి, జగత్సింగ్ పాల్గొన్నారు. ఆస్పత్రిలో సమస్యలు పరిష్కరించాలి కాశిబుగ్గ: రోగులకు నాణ్యమైన వైద్యసేవలందించాలని రాష్ట్ర ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్, కార్మిక, ఉపాధి, శిక్షణ అండ్ ఫ్యాక్టరీల శాఖ (శక్తి) సెక్రటరీ దాసరి హరిచందన అన్నారు. కలెక్టర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి వరంగల్ లేబర్ కాలనీలోని ఈఎస్ఐ ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం ఆమె సందర్శించారు. చికిత్స పొందుతున్న రోగులను కలిసి, వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవలు, మందుల సరఫరా, వైద్య సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ కాంతిసాగర్ ఉన్నారు. -
కురుకుల్లా, భేరుండా క్రమాల్లో భద్రకాళి
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్ర మహోత్సవాలు శనివారం నాలుగో రోజుకు చేరాయి. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం అమ్మవారికి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, క్షీరాన్ననివేదన, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని కురుకుల్లాక్రమంలో, షోడశీక్రమాన్ని అనుసరించి బోగభేరాన్ని భేరుండా క్రమంలో అలంకరించి నవరాత్ర విశేషపూజలు నిర్వహించారు. సాయంత్రం కార్మిక, ఉపాధి కల్పన శాఖ కార్యదర్శి హరిచందన, శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్ అమ్మవారిని దర్శించుకున్నారు. హన్మకొండ: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క ఈనెల 22న హనుమకొండ, వరంగల్ జిల్లాల పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. హనుమకొండ వాజ్పేయినగర్, లష్కర్బజార్ టీటీడీ కల్యాణ మండపం సమీపంలోని ఆర్అండ్బీ క్వార్టర్స్లో ఇండోర్ సబ్స్టేషన్న్లు, విద్యుత్నగర్, వడ్డేపల్లి ఫిల్టర్బెడ్ వద్ద సబ్స్టేషన్లు, హనుమకొండ సర్కిల్ నూతన కార్యాలయం భవనం, విద్యుత్ ఉద్యోగుల ట్రైనింగ్ సెంటర్, టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో విద్యుత్ భవన్ ఐదో అంతస్తు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా పెద్దమ్మగడ్డలో నూతనంగా నిర్మించిన వరంగల్ సర్కిల్ కార్యాలయం, హనుమకొండలోని న్యూశాయంపేట డబుల్బెడ్రూం ఇళ్ల వద్ద నిర్మించిన సబ్స్టేషన్ను ప్రారంభిస్తారు. హసన్పర్తి: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని హనుమకొండ డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య సూచించారు. హసన్పర్తిలోని ఉన్నత శ్రేణి ఆస్పత్రిని శనివారం ఆయన సందర్శించారు. స్క్రీనింగ్లో భాగంగా మహాత్మాజ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల నుంచి ఆస్పత్రికి వచ్చిన విద్యార్థినులతో మాట్లాడారు. సీజన్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం ఎర్రగట్టుగుట్ట, మునిపల్లిలో వ్యాధి నిరోధక టీకా అవుట్ రీచ్ సెషన్ను అప్పయ్య పరిశీలించారు. ఎన్పీడీ స్క్రీనింగ్ 95 శాతం పూర్తిచేసిన సిబ్బందిని అభినందించారు. జిల్లా మాస్మీడియా అధికారి వి.అశోక్రెడ్డి, వైద్యులు భార్గవ్, కృతిక, సురేశ్, సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. వరంగల్ లీగల్: వరంగల్, హనుమకొండ కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ శనివారం వేర్వేరుగా నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్కు విశేష స్పందన లభించింది. వరంగల్ జిల్లా కోర్టులో నాలుగు బెంచీలు, నర్సంపేటలో ఒక బెంచీ ఏర్పాటు చేశారు. పెండింగ్లో ఉన్న 26 ఎన్ఐ యాక్ట్ కేసులు, అచల చిట్ఫండ్ పీఎల్సీ కేసులు 31, గ్రామీణ వికాస్ బ్యాంకు కేసులు 5 పరిష్కరించారు. అలాగే, హనుమకొండలో 8, పరకాల 2 బెంచీలు ఏర్పాటు చేశారు. పెండింగ్లో ఉన్న 31 ఎన్ఐ యాక్ట్ కేసులు పరిష్కరించారు. ప్రత్యేక లోక్ అదాలత్ విజయవంతానికి కృషిచేసిన ప్రధాన న్యాయమూరి మంత్రి రామకృష్ణ సునీత, హనుమకొండ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రామలింగం, వరంగల్ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ప్రదీప్కు కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ స్పోర్ట్స్: జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 26న ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి అండర్–13 చదరంగం ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కార్యదర్శి కన్న శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ రెడ్డికాలనీలోని మాస్టర్జీ (వికాస్) హైస్కూల్లో బాలబాలికలకు వేర్వేరుగా ఈ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. 1 జనవరి 2013న, ఆ తర్వాత జన్మించిన వారు పోటీలకు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు 9059522986 నంబర్లో సంప్రదించాలని సూచించారు -
మాట్లాడుదామని పిలిచి..పెట్రోల్ పోసి నిప్పంటించాడు..
వరంగల్ క్రైం: కాంగ్రెస్ కార్యకర్త, వర్ధన్నపేట నియోజవర్గ సోషల్ మీడియా ఇన్చార్జ్ అడప మహేశ్పై రౌడీషీటర్ పత్తి కుమార్ శనివారం రాత్రి 10 గంటలకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ సంఘటన గీసుకొండ మండలం కోటిలింగాల ప్రాంతంలో జరిగింది. ఎన్టీఆర్ నగర్కు చెందిన అడప మహేశ్.. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుకు అత్యంత సన్నిహితుడు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడంతో అది జీర్ణించుకోలేని పత్తి కుమార్ మరో కాంగ్రెస్ కార్యకర్త జన్ను కుమార్తో మహేశ్ను శనివారం రాత్రి కోటిలింగాల ప్రాంతానికి పిలిపించాడు. ‘నా గురించి ఎమ్మెల్యేకు ఏం చెప్పావు’ అని మహేశ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లు బాధితుడు మహేశ్ దుఃఖంతో ఉన్న వీడియో వైరల్గా మారింది. స్థానికులు తీవ్ర గాయాలైన మహేశ్ను రాత్రి 11 గంటలకు చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. గతంలో కుమార్ తనపై హత్యాయత్నం చేసినట్లు బాధితుడు తెలిపాడు. అతన్ని ఎందుకు ఎన్కౌంటర్ చేయడం లేదు? ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే నాగరాజు, సీపీలు నిర్ణయం తీసుకుని అతన్ని ఎన్కౌంటర్ చేయాలని బాధితుడు వీడియోలో వేడుకున్నాడు. ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో నమ్మకమైన కార్యకర్తగా పనిచేస్తున్నానని, తన అవయవాలు పాడై పోయాయని, తెలియక ఏమైనా తప్పుచేస్తే క్షమించాలని ఎన్టీఆర్ నగర్ ప్రజలను కోరాడు. గతంలోనే కుమార్ చేసిన హత్య సంచలనం రౌడీషీటర్ పత్తి కుమార్ గతంలో ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలో చేసిన హత్య సంచలనం కలిగించింది. ఓ వ్యక్తిని చంపి తల, మొండెం వేరుచేశాడు. అదే రౌడీషీటర్ ఇప్పుడు మరోసారి పెట్రోల్ పోసి నిప్పు పెట్టడం సంచలనంగా మారింది. ఎంజీఎం ఆస్పత్రికి ఎమ్మెల్యే నాగరాజు.. మహేశ్పై జరిగిన దాడి విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హుటాహుటిన ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లారు. మహేశ్ను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. కుమార్ను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. కాంగ్రెస్ కార్యకర్తపై రౌడీ షీటర్ హత్యాయత్నం తీవ్రగాయాలు.. ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు బాధితుడు వర్ధన్నపేట పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జ్ ఫ్లాష్.. ఫ్లాష్ -
ఆత్మగౌరవానికి ప్రతీక పేరిణి
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హన్మకొండ అర్బన్/హన్మకొండ కల్చరల్: పేరి ణి నాట్యం తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని, సంప్రదాయ కళలను పరిరక్షించి భావితరాలకు అందించడం ప్రతిఒక్కరి బాధ్యత అని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, నట రాజ కళాకృష్ణ నృత్యజ్యోతి అకాడమీ, గజ్జెల రంజిత్కుమార్ హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో శనివారం నిర్వహించిన ‘పేరిణి నాట్య గురు–శిష్య పరంపర’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా కళాకారుల ప్రదర్శన తిలకించిన అనంతరం ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేరిణి నాట్యం కేవలం నృత్యరూపమే కాదని.. యుద్ధానికి వెళ్లే వీరుల్లో ధైర్యం, ఉత్సాహాన్ని నింపిన గొప్ప వారసత్వ కళారూపమని అన్నారు. కాళోజీ కళాక్షేత్రాన్ని రాష్ట్రంలో కళలకు శాశ్వత వేదికగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సీఎం రేవంత్రెడ్డి చొరవతో నిలిచిపోయిన కళాక్షేత్ర నిర్మాణం పూర్తికావడంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. నటరాజ కళాకృష్ణ, పద్మశ్రీ పురస్కార గ్రహీత ఉమామహేశ్వరి, ధరావత్ రాజ్కుమార్, విజయ రచన, పేరిణి నృత్య గురువులు, నాట్య కళాకారులు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2026
మామునూరు ఎయిర్పోర్ట్ నమూనా (ఏఐ చిత్రం)సాక్షి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మామునూరు విమానాశ్రయం కల సాకారం దిశగా కీలక అడుగు పడింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సుమారు రూ.203.49 కోట్లతో విమానాశ్రయ అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచింది. రన్వే ఆధునికీకరణ నుంచి టెర్మినల్కు అనుసంధాన రహదారులు, విమానాల పార్కింగ్ అప్రాన్, ట్యాక్సీ వేలు, గ్రౌండ్ సపోర్ట్ సదుపాయాల వరకు అన్ని పనులను 15 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ కూడా విడుదల చేసింది. ఈ ప్లాన్ ప్రకారం విమానాశ్రయానికి ప్రధాన ఎంట్రీ, ఎగ్జిట్ను వరంగల్–సూర్యాపేట జాతీయ రహదారి (ఎన్హెచ్–563) వైపు ప్రతిపాదించారు. అక్కడి నుంచి ప్రత్యేక యాక్సెస్ రోడ్డు ద్వారా టెర్మినల్ భవనానికి చేరుకునేలా డిజైన్ రూపొందించారు. టెర్మినల్ ఎదుట ఒకేసారి మూడు విమానాలు నిలిపే అప్రాన్, లింక్ ట్యాక్సీవే, గ్రౌండ్ సపోర్ట్ ఎక్విప్మెంట్ (జీఎస్ఈ) ప్రాంతం, పెరిమీటర్ రోడ్లు, అత్యవసర యాక్సెస్ రోడ్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. 1930లోనే నిజాం హయాంలోనే మామూనూరు ఎయిర్పోర్టు ఉండగా వివిధ కారణాలతో 1980లో మూతపడిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 7న ఫైనాన్షియల్ బిడ్... ఈ నెల 23న (గురువారం)ప్రీ–బిడ్ సమావేశాన్ని మామునూరు విమానాశ్రయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినట్టు టెండర్ నోట్లో పేర్కొన్నారు. జూలై 29 నుంచి ఆగస్టు 12 వరకూ బిడ్ దాఖలకు అవకాశం కల్పించారు. ఆగస్టు 18న బిడ్ ఓపెన్ చేయనున్నారు. సెప్టెంబరు 7న ఫైనాన్షియల్ బిడ్ను తెరవనున్నట్టు టెండర్ నోట్లో పొందుపరిచారు. మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్హాల్, ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ సహా మరికొన్ని నిర్మాణాలకు త్వరలో మరో టెండర్ను పిలిచేందుకు ఏఏఐ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. కాకతీయ వైభవం ఉట్టిపడేలా.. తెలంగాణకు చారిత్రక వారసత్వంగా నిలిచిన కాకతీయుల కళా సంపదను ప్రతిబింబించేలా మూమునూరు విమానాశ్రయ టెర్మినల్ భవనం, ప్రవేశ ద్వారాలు, అంతర్గత అలంకరణలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, అందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది టెర్మినల్ ముఖద్వారంలో కాకతీయ కళాతోరణం శైలిని ప్రతిబింబించే నమూనాలు, లోపలి గోడలపై కాకతీయుల చరిత్రను తెలియజేసే చిత్రాలు, శిల్పాల ప్రతిరూపాలు, తెలంగాణ జానపద సంస్కృతిని చాటిచెప్పే అలంకరణలు ఉండేలా ప్రణాళిక రూపొందించే అవకాశ ముంది. దీంతో వరంగల్కు వచ్చే దేశీయ, విదేశీ ప్రయాణికులకు విమానాశ్రయంలోనే కాకతీయుల గొప్పతనం పరిచయం కానుంది.2,800 మీటర్ల పొడవు, 75 మీటర్ల వెడల్పు గల రన్వే నిర్మాణంతో ఎయిర్బస్–320 వంటి పెద్ద ప్రయాణికుల విమానాలు, భారీ కార్గో విమానాలు కూడా దిగే అవకాశం ఉంటుంది. భవిష్యత్లో అంతర్జాతీయ విమానాశ్రయంగా విస్తరించే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని 949.44 ఎకరాల్లో ప్రణాళిక సిద్ధం చేశారు. వెడల్పు : 75 మీటర్లు అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచిన ఏఏఐ టెర్మినల్ ఎదుట ఒకేసారి మూడు విమానాలు నిలిపే అప్రాన్ కాకతీయ కళా వైభవం చాటేలా నిర్మాణాలు ఉండే అవకాశం 2028లో విమానాలు టేకాఫ్ అయ్యేలా కార్యాచరణ ఇక్కడి వ్యాపారవేత్తలు హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు ఒకే రోజులో వెళ్లి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో వ్యాపార సమావేశాలు, పెట్టుబడులు, స్టార్టప్లు, కార్పొరేట్ కార్యకలాపాలు మరింత వేగవంతం అవుతాయి. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్ రంగాలకు వేగవంతమైన రవాణా అందుబాటులోకి వస్తుంది. దేశీయ, విదేశీ కంపెనీలు వరంగల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉంది. వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులను దేశంలోని ఇతర ప్రాంతాలకు త్వరగా తరలించొచ్చు. దీంతో రైతులకు మెరుగైన మార్కెట్లు లభించడంతోపాటు ఎగుమతులకు కూడా మార్గం సుగమం అవుతుంది. రామప్ప ఆలయం, వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి, భద్రకాళి ఆలయానికి పర్యాటకుల రాక పెరుగుతుంది. ఎయిర్ అంబులెన్స్, అవయవ మార్పిడి, విపత్తుల సమయంలో సహాయక చర్యలు వేగంగా చేపట్టవచ్చు. రియాల్టీ రంగానికి కూడా రెక్కలు రానున్నాయి. మామునూరు విమానాశ్రయనిర్మాణం నుంచి నిర్వహణ వరకు ప్రత్యక్ష, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. నగరం దేశంలోని ప్రధాన నగరాలతో నేరుగా అనుసంధానమవుతుంది. దీంతో జాతీయస్థాయిలో గుర్తింపు వస్తుంది.రన్వే పొడవు : 2,800 మీటర్లు -
ర్యాగింగ్ రహిత సమాజమే లక్ష్యం
ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె.పూజ కాజీపేట అర్బన్: ర్యాగింగ్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ అడుగులు వేయాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె.పూజ సూచించారు. కాజీపేట మండలం భట్టుపల్లి గ్రామంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ర్యాగింగ్ వినోదంతో మొదలై మానసిక, శారీరక హింసకు, బలవన్మరణాలకు దారితీస్తుందని తెలిపారు. విద్యాసంస్థల్లో జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు భయభ్రాంతులకు గురిచేయడం, అవమానించడంతో మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడుతున్నారని తెలిపారు. చీఫ్ లీగల్ ఏయిడ్ కౌన్సిలర్ ఆర్.సురేశ్, అసిస్టెంట్ లీగల్ ఏయిడ్ ఆర్.రజిని, కళాశాల యాజమాన్యం, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. -
ఎక్స్ప్రెస్ రైళ్ల సర్వీస్ల పొడిగింపు
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ మీదుగా చర్లపల్లి –దానాపూర్–చర్లపల్లి మధ్య ప్రయాణించే పలు ఎక్స్ప్రెస్ రైళ్ల సర్వీస్లను మరికొన్ని రోజులపాటు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ గురువారం తెలిపారు. పొడిగింపు రైళ్ల వివరాలు.. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 26వ తేదీ వరకు 9 సర్వీస్లతో చర్లపల్లి–దానాపూర్ (07091) ఎక్స్ప్రెస్ కాజీపేటకు ప్రతీ సోమవారం 15:00 గంటలకు చేరుకుంటుంది. అదేవిధంగా ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు 9 సర్వీస్లతో దానాపూర్–చర్లపల్లి (07092) ఎక్స్ప్రెస్ ప్రతీ మంగళవారం 8:00 గంటలకు కాజీపేట జంక్షన్కు చేరుకుంటుంది. ఈ రైళ్ల సర్వీస్లకు కాజీపేట, రామగుండం, సిర్పూర్కాగజ్నగర్, బల్లార్షా, చాందాపోర్టు, గోండియా, బాల్ఘట్, నైన్పూర్, జబల్పూర్, కఠ్నీ, సంత, మాణిక్పూర్, ప్రయాగ్రాజ్, చౌకీ, పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ జంక్షన్, బాక్సర్, ఆరా స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. -
విజయం కోసం పట్టుదలతో పోరాడాలి
వరంగల్ స్పోర్ట్స్ : క్రీడల్లో గెలుపోటములు సహజమని, పట్టుదలతో పోరాడిన వారికే విజయం సొంతమవుతుందని టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (ఫైనాన్స్) వి. తిరుపతి రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండలో జేఎన్ఎస్లో తెలంగాణ ట్రాన్స్కో, టీజీఎన్పీడీసీఎల్, టీజీఎస్పీడీసీఎల్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి సంబంధించి నిర్వహిస్తున్న ఇంటర్ సర్కిల్ వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, క్యారం క్రీడా పోటీలను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి క్రీడలను ప్రోత్సహిస్తున్నారన్నారు. అనంతరం డైరెక్టర్ ఆపరేషన్స్ టి. మధుసూదన్ మాట్లాడుతూ పోటీల్లో విజయం వైపు అడుగులు వేయాలని క్రీడాకారులను ప్రోత్సహించారు. డైరెక్టర్ హెచ్ఆర్డీ సి. ప్రభాకర్ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులు సేవా కార్యక్రమాల్లోనే కాకుండా క్రీడారంగంలోనూ ముందుంటారన్నారు. ఈ పోటీల్లో వాలీబాల్ 20, బాల్ బ్యాడ్మింటన్ 11, క్యారం 15 జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. చీఫ్ ఇంజనీర్ రాజుచౌహాన్, సీజీఎం వేణు బాబు, ప్రెసిడెంట్ స్పోర్ట్స్ కౌన్సిల్, సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆపరేషన్ హనుమకొండ బి.సామ్యా నాయక్ , స్పోర్ట్స్ కౌన్సిల్ సభ్యులు, ఎస్ఈలు ఎ.ఆనందం, సి.హెచ్ సంపత్ రెడ్డి, పి.విజయేందర్ రెడ్డి, ఎ. రమేశ్ , బి.భిక్షపతి, స్పోర్ట్స్ ఆఫీసర్ ఎన్.జగన్నాథ్, కన్వీనర్ కె.దర్శన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ తిరుపతి రెడ్డి ట్రాన్స్కో – డిస్కంల ఇంటర్ సర్కిల్ క్రీడలు ప్రారంభం -
నాణ్యమైన విద్య అందించాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు గురువారం హనుమకొండ సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్లకు మూడు రోజులపాటు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను ఆమె పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తయారు చేస్తున్న వంట ను పరిశీలించారు. అనంతరం హనుమకొండలోని వడ్డేపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం తిన్నారు. కళాశాలలోని తరగతి గదిలో ఎంపీసీ, బైపీసీ ఒకేషనల్ కోర్సుల తరగతుల విద్యార్థులతో మాట్లాడారు. కలెక్టర్ వెంట ఇంటర్ విద్య డీఐఈఓ ఎ.గోపాల్, డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్, జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ డాక్టర్ మన్మోహన్, ఎంఈఓ నెహ్రూ, వడ్డేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కవిత పాల్గొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ పటిష్టంగా చేపట్టాలిహన్మకొండ అర్బన్: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ వరంగల్ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని హనుమకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్నతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ట్రేడ్ లైసెన్సుల వసూళ్లు, పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) యంత్రాల వినియోగం అమలు, తడి, పొడి చెత్త సేకరణ అమలు, నగర సుందరీకరణ, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్వహణ, డెంగ్యూ, మలేరియా నివారణ చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఇందులో జీడబ్ల్యూఎంసీ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ రాజారెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్కుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజేశ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్న్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
పసుపు.. ౖపైపెకి
కేసముద్రం: కొన్నేళ్ల క్రితం పసుపు పంటకు సరైన ధర లేక రైతులు నిరాశ చెందేవారు. ఫలితంగా కాలక్రమేనా సాగు విస్తీర్ణం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అమాంతం పడిపోయింది. ఒక పక్క సరైన ధర లేక, దిగుబడి రాక.. మరోవైపు పెట్టుబడులు పెట్టలేక రైతులు ఇతర పంటల సాగుపై దృష్టిసారించారు. అప్పటి వరకు మార్కెట్లో పసుపు పంటకు క్వింటాకు గరిష్ట ధర రూ.5 వేల నుంచి రూ.6వేల వరకే పలికేది. ఈ ఈక్రమంలో 2023–24 కాలంలో క్వింటాకు ఒక్కసారిగా ధర రూ.10వేలు దాటింది. దీంతో కొంత ఊరట కలగడంతో సంప్రదాయ పంటగా సాగు చేస్తున్న పలువురు రైతులు యథావిధిగా పసుపు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఈ ఏడాది మార్చి నుంచి పసుపు సీజన్ ప్రారంభం కాగా, మొదట్లో క్వింటాకు గరిష్ట ధర రూ.12 వేల వరకు పలికింది. మళ్లీ ధర కొంతమేర తగ్గుముఖం పడుతుండడంతో రైతులు ఆందోళనకు గురై పంటను అమ్ముకున్నారు. ఈ క్రమంలో నెల రోజుల నుంచి మళ్లీ పసుపు ధర పెరుగుతోంది. క్వింటాకు గరిష్ట ధర రూ.13 వేల నుంచి రూ.14వేల వరకు చేరింది. కాగా. బుధవారం(ఈనెల15న) మార్కెట్కు 306 బస్తాల పసుపు అమ్మకానికి రాగా, కాడిరకం పంటకు (పాలిష్ చేసిన పసుపు) క్వింటాకు గరిష్ట ధర రూ.16,159, గరిష్ట ధర రూ.10,300 పలికింది. గోళా రకానికి గరిష్ట ధర రూ.15,500, కనిష్ట ధర రూ.11,101 పలికింది. గురువారం మార్కెట్కు 606 బస్తాల పసుపు అమ్మకానికి రాగా, కాడిరకానికి గరిష్ట ధర రూ.15,555, కనిష్ట ధర రూ.10,239 పలికింది. గోళా రకానికి గరిష్ట ధర రూ.15వేలు, కనిష్ట ధర రూ.11,989 పలికింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే క్వింటాకు ధర రూ. వెయ్యి దాటింది. ఇప్పటి వరకు పసుపు పంటను భద్రపరుచుకున్న రైతులకు క్వింటాకు రూ.3వేలకు పైగా వరకు కలిసి రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ధర లేక తగ్గుతూ వచ్చిన పసుపు సాగు విస్తీర్ణం.. పసుపు పంటకు కేరాఫ్గా ఉన్న కేసముద్రంలో 2015 వరకు 6 వేల ఎకరాలకు పైగా రైతులు సాగు చేశారు. ఆ తర్వాత పంటకు ధరలేక, మరోవైపు దిగుబడులు రాకపోవడంతో, క్రమక్రమంగా విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. ఈ మేరకు ఈ వానాకాలం కేసముద్రం మండలంలో 66 ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తుండగా, మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 600 ఎకరాల్లోపు సాగు చేయనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఇదే రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా పసుపు సాగు చేసే ప్రాంతాల్లో విస్తీర్ణం అమాంతం తగ్గిపోయింది. పసుపునకు బదులు రైతులు ఇతర పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ధర పెగుతుండటంతో రైతుల్లో ఊరట కలుగుతున్నా, పసుపు విత్తనం దొరకపోవడంతో ఇతర పంటలనే రైతులు సాగు చేసుకుంటున్నారు. కేసముద్రం మార్కెట్కు వచ్చిన పసుపు, ధరల వివరాలు సంవత్సరం క్వింటాళ్లు గరిష్ట ధర కనిష్ట ధర 2018–19 85,378 రూ.7,713 రూ.4,000 2019–20 1,22,931 రూ.6,659 రూ.3,109 2020–21 9,7083 రూ.8,081 రూ.3,011 2021–22 62,646 రూ.7,811 రూ.2,952 2022–23 1,43,368 రూ.11,352 రూ.7,801 2023–24 11,992 రూ.13,221 రూ.5,000 2024–25 5,372 రూ.16,368 రూ.4,559 2025–26 16,306 రూ.13,852 రూ.5,000 2026–27 13,193 రూ.16,159 రూ.10,300 క్వింటా రూ.16 వేల పైనే దాచుకున్న రైతులకు పసుపు బంగారమే.. -
అంబేడ్కర్ భావజాల వ్యాప్తి జరగాలి
కేయూ క్యాంపస్ : భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భావ జాల వ్యాప్తి జరగాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. గురువారం కాకతీయ యూనివర్సిటీలో బీఆర్ అంబేడ్కర్ స్టడీ సెంటర్ జాయింట్ డైరెక్టర్గా డాక్టర్ పుల్లా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ హాజరై పుల్లాశ్రీనివాస్ను అభినందించి మాట్లాడారు. పుల్లా శ్రీనివాస్ నేతృత్వంలో అంబేడ్కర్ స్టడీస్సెంటర్ అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్, ప్రొఫెసర్ గాదె సమ్మయ్య, కేయూ పాలకమండలి సభ్యులు బి. సురేశ్లాల్, చిర్రరాజు,బీసీ సెల్డైరెక్టర్ బొడిగ సతీశ్, ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు రమణ, భిక్షాలు, అవెన్యూ ప్లాంటేషన్ ఇన్చార్జ్ బి. వెంకటగోపినాథ్, వివిధ సంఘాల బాధ్యులు సంగాల ఇప్రిమ్రాజు, మెట్టు రవి, చిరంజీవి, బొక్కమొగిలి, బొళ్లపాక ప్రభాకర్, కృష్ణమాచార్య, డిప్యూటీ రిజిస్ట్రార్ పంజాల శ్రీధర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు నేతాజీ, కోల శంకర్, ప్రణయ్కుమార్, నర్సింహారావు , ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మంద కుమార్, సుకుమార్ మాదిగ, పుట్టరవి, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు బి. తిరుపతి, మంద నరేశ్, మంద భాస్కర్, కలకోట్ల సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ -
అక్రమ లాటరీ స్థావరంపై టాస్క్ఫోర్స్ దాడి
ఖిలా వరంగల్: వరంగల్ ఉర్సు గుట్ట ప్రాంతంలో చట్టవిరుద్ధంగా లాటరీ నిర్వహిస్తూ అమాయక ప్రజల సొమ్ము కాజేస్తున్న అక్రమ లాటరీ స్థావరంపై వరంగల్ టాస్క్ఫోర్స్ అధికారులు గురువారం మెరుపు దాడులు నిర్వహించారు. అమాయక ప్రజల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తూ కార్ గిఫ్ట్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్లు వరంగల్ టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్కు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు.. వెంకటేశ్వర కార్ గిఫ్ట్ కాంటెస్ట్ కార్యాలయంలో ట్రాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. వరంగల్ పోచమ్మ మైదాన్లోని గాయత్రి కాలనీకి చెందిన పూజారి సుమన్, హనుమకొండ సుబేదారి దుర్గాకాలనీకి చెందిన సముద్రా రాజేశ్, సంగెం మండలం తీగరాజుపల్లి, శివనగర్ మెట్ల బావికి చెందిన కర్ణు గట్టి సురేశ్ను పట్టుకొని నిందితులపై కేసు నమోదు చేశారు. వారి నుంచి రూ.4,70 లక్షల విలువైన బ్రీజా కారు, రూ.11,50,000 లక్షల విలువైన 5,753 లాటరీ స్లిప్పులు. 6 స్మార్ట్ ఫోన్లు, రూ.53,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ తలిపారు. సుజుకీ బ్రీజా కారు, నగదు స్వాధీనం ముగ్గురు నిర్వాహకులపై కేసు -
ఉప్పరపల్లిలో హైటెన్షన్
● భాస్కర్ అంతిమయాత్రలో ఉద్రిక్త వాతావరణం ● అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తువర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సీనపెల్లి భాస్కర్(30)ను హైదరాబాద్లో ఇదే గ్రామానికి చెందిన వారు హత్య చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో భాస్కర్ మృతదేహం బుధవారం రాత్రి గ్రామానికి చేరుకోగా గురువారం దహన సంస్కారాలకు కుటుంబీకులు ఏర్పాట్లు చేశారు. ఈ సమయంలో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య ఆధ్వర్యంలో 100 మంది పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేశారు. పలు దళిత సంఘాలు సంఘీభావం పలికి భాస్కర్ అంతిమయాత్రలో పాల్గొన్నాయి. భాస్కర్ కుటుంబానికి న్యా యం జరిగే వరకూ పోరాటం చేస్తామని ఎమ్మార్పీఎస్ నాయకులు తెలిపారు. కాగా, పోలీసు బందోబస్తు మధ్య భాస్క ర్ అంత్యక్రియలు ప్రశాంతంగా ముగిశాయి. -
భోజనం చేయకుండా..
డైనింగ్ హాల్కు తాళం వేసి..కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని న్యూపీజీ బాయ్స్ హాస్టల్ విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆ హాస్టల్ వద్ద ఆందోళన చేపట్టారు. ప్రధానంగా హాస్టల్ భవనం నుంచి డ్రెయినేజీ సక్రమంగా లేదని, దీంతో మురుగునీరుతో దుర్వాసన వస్తోందన్నారు. దీనిని పలుమార్లు యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అలాగే, బాత్ రూమ్లు, టాయ్ లెట్స్లో సరిగా నల్లాలు లేవన్నారు. వివిధ గదుల్లోనూ సరిపడా ఫ్యాన్లు లేవని ఆరోపిస్తూ ఆందోళన కొనసాగించారు. ఈ సమస్యను పరిష్కరించే వరకూ ఆందోళన కొనసాగిస్తామని హాస్టల్ భవనం వద్ద ఉన్న డైనింగ్ హాల్కు తాళం వేశారు. ఆందోళనపై సమాచారం అదుకున్న రిజిస్ట్రార్ వి. రామచంద్రం, హాస్టళ్ల డైరెక్టర్ పి. శ్రీనివాస్, ఓఎస్డీ బి. వెంకట్రామ్రెడ్డి, కేయూ అభివృద్ధి అధికారి వాసువేదరెడ్డి ఘటనాస్థలికి చేరుకుని ఆయా సమస్యలను పరిశీలించారు. వీటిని పరిష్కరిస్తామని, దీనికి కొంత సమయం ఇవ్వాలని రిజిస్ట్రార్ కోరగా విద్యార్థులు ఆందోళన విరమించారు. ఈ విషయంపై రిజిస్ట్రార్ను వివరణ కోరగా డ్రెయినేజీతోపాటు ఇతర పలు సమస్యలున్నాయని, వాటిని రూ. 12లక్షల వ్యయంతో పరిష్కరిస్తామని వివరణ ఇచ్చారు. కాగా, విద్యార్థుల ఆందోళనతో పోలీసులు కూడా ఘటనాస్థలికి విచ్చేశారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ -
కపాలినీ, భగమాలినీ క్రమాల్లో భద్రకాళి అమ్మవారు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం అమ్మవారికి కపాలినీ, భగమాలినీ క్రమాల్లో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు ఉ దయం నుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, క్షీరాన్ననివేదన, చతుఃస్థానార్చన తదితర పూజలు నిర్వహించారు. దశమహావిద్యల్లోని కాళీక్రమాన్ని అనుసరించి అమ్మవారి స్నపన మూర్తిని కపాలినీగా, షోఢశీ క్రమాన్ని అనుసరించి అమ్మవారి బోగభేరాన్ని భగమాలినీగా అలంకరించి నవరాత్ర విశేష పూజలు జరిపారు. ఆలయ ఈఓ రామల సునీత, సిబ్బంది పర్యవేక్షించారు. కేయూ క్యాంపస్: తెలంగాణలోని తొమ్మిది యూనివర్సిటీల్లో 2026–27 విద్యాసంవత్సరంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకుగాను టీజీసీపీగెట్–26 ఈనెల 8 నుంచి ప్రారంభమై గురువారం ముగిసింది. 39 పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షలు ముగిసినట్లు సీపీ గెట్ కన్వీనర్ కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రొఫెసర్ కె.రాజేందర్ తెలిపారు. ప్రతీరోజు మూడు సెషన్లలో పలు కోర్సులకు రాష్ట్రంలో 22 పరీక్ష కేంద్రాల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 52,697 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 45,462 మంది పరీక్షలు రాసినట్లు పేర్కొన్నారు. 82.27 శాతం మంది హాజరైనట్లు తెలిపారు. చివరిరోజు గురువారం ఎమ్మెస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు మొదటి సెషన్లో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈకోర్సుకు 1,387 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా.. అందులో 1,237 మంది ప్రవేశ పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. ఈనెలాఖరుకల్లా టీజీసీపీగెట్ ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల చేయాలనే యోచనలో సంబంధిత అధికారులున్నారు. వరంగల్ లీగల్: హనుమకొండ జిల్లా న్యాయ శాఖ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. ఈమేరకు అధ్యక్షుడిగా చిలుకమారి రాజేందర్, ప్రధాన కార్యదర్శిగా కందుకూరి ఇమ్మానుయేల్, అసోసియేట్ అద్యక్షుడు ఈ.పి శ్రీధర్బాబు, ఉపాధ్యక్షులుగా జి.రమేశ్కుమార్, ఎస్.శ్రీనివాస్, డి.సంధ్యారాణి, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా దయాకర్, కోశాధికారిగా కార్తీక్, జాయింట్ సెక్రెటరీలుగా వి.సంతోశ్బాబు, రమేశ్, లక్ష్మీనారాయణ, ప్రమోద్కుమార్ ఎన్నికయ్యారు. న్యూశాయంపేట: తాగునీటి సరఫరా, సీజనల్ వ్యాధుల నియంత్రణ, విద్య, వాతావరణ పరిస్థితులు, ప్రజాపాలన తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజు గురువారం సాయంత్రం హైదరాబాద్ సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
పాత పెన్షన్ను పునరుద్ధరించాలి
టీజీ ఈజేఎసీ నాయకుల డిమాండ్కాళోజీ సెంటర్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) అమలు చేయాలని టీజీ ఈజేఎసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓపీఎస్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన జనజాగరణ యాత్ర ఈనెల 29న వరంగల్ చేరుకోనుంది. ఈ నేపథ్యంలో యాత్రకు సంబంధించిన పోస్టర్ను కలెక్టరేట్ ఆవరణలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీజీ ఈజేఎసీ జిల్లా అధ్యక్షుడు రవీందర్రెడ్డి మాట్లాడుతూ 2004లో ప్రవేశపెట్టిన సీపీఎస్ విధానంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని అన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం సామాజిక భద్రత కల్పించడంలో సీపీఎస్ పూర్తిగా విఫలమైందని, ఉద్యోగులకు గౌరవప్రదమైన జీవన భరోసా కల్పించాలంటే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాల్సిందేనని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జనజాగరణ యాత్ర జూలై 11 నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ యాత్ర ముగింపు సందర్భంగా ఆగస్టు 23న ‘చలో హైదరాబాద్‘ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించారు. టీజీ ఈజేఏసీ అధ్యక్షుడు వేణుగోపాల్, జిల్లా గౌరవ అధ్యక్షుడు రామకృష్ణ, జిల్లా కోశాధికారి వొల్లాజీ రాజేందర్, టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి సదానందం, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు గోవిందరావు, అశోక్, సృజన్ తేజ, ప్రేమలత, కృష్ణవేణి, మనోహర్, భవాని, రఘు, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.15,551 పలికింది
నేను పసుపు పంటను మొదటి నుంచి కొంతమేర అయినా సాగు చేస్తా. ఈ సారి ఎకరం భూమిలో సాగు చేశా. ఎ కరానికి రూ.75వేల ఖ ర్చు వచ్చింది. 23 క్వింటాళ్ల నంట చేతికొచ్చింది. గురువారం మార్కెట్లో అమ్ముకున్నా. క్వింటాకు ధర రూ.15,551 దక్కింది. ఈ సారి రేటు కలిసి రావడం ఆనందంగా ఉంది. –గడ్డం సుధాకర్, చింతనెక్కొండ గ్రామం విత్తనం దొరకడం లేదుమొదటి నుంచి నేను పసుపు పంట సాగు చేసేవాన్ని. కానీ మార్కెట్లో రేటు తగ్గడం, పంట దిగుబడి కూడా తగ్గుతుండడంతో చేసేది ఏమీలేక 5 ఏళ్లుగా పసుపు సాగు చేయడంలేదు. ఈ సారి మార్కెట్లో పసుపు ధర పెరగడం ఊరటనిస్తుంది. కానీ పంట సాగు చేద్దామంటే విత్తనం దొరకడం లేదు. అందుకే ఈసారి 6 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేస్తున్నా. –లక్కాకుల సత్యనారాయణ, కేసముద్రం విలేజ్ -
శుక్రవారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2026
ఏఐతో ప్రభుత్వ కార్యాలయాల్లో మార్పులు.. అంశం పనిభారం తగ్గే శాతంసాక్షి, వరంగల్: జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పరిపాలనా సౌలభ్యం కోసం తీసుకొస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రజాహితంగా సమూల మార్పులు తేనుంది. ప్రజా సమస్యలు, ఫైళ్లు, లెటర్ల తయారీ, సమావేశాల నిర్ణయాల అమలులో జాప్యాన్ని నియంత్రించేందుకు ఏఐ ఉపయోగపడనుంది. హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్లలో 250 మంది అధికారులకు ఏఐ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫీషియెన్సీ శిక్షణ ఇచ్చింది. రోజువారీ ప్రభుత్వ పనుల్లో అధికారులు ఏఐ వినియోగాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద కూడా చాలెంజ్గా తీసుకొని అధికారులు ఏఐ వినియోగిస్తే ప్రజల సత్వర సేవలకు మరింత దగ్గరవుతాయని భావిస్తున్నారు. ముఖ్యంగా అధికారిక లేఖల తయారీ, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు సమాధానాలు, ఉన్నతాధికారులకు సమర్పించే నివేదికలు, మీటింగ్ మినిట్స్, జీఓ ఉత్తర్వుల సారాంశం, వివిధ పథకాల అమలుకు ప్రజలకు సులభంగా అర్థమయ్యే సమాచారం రూపొందించడం వంటి పనుల్లో చాట్జీపీటీ, నోట్బుక్ఎల్ఎం, క్లాడ్, భాషిణి వంటి ఏఐ సాధనాలను వినియోగించనున్నారు. ఇలా నెలరోజుల్లో ఏఐ పనితీరుతో జిల్లా పరిపాలనలో వేగం, పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ సాంకేతికతను అమలుచేస్తే ‘మీ పని పూర్తయ్యింది‘ అనే సమాధానం ప్రజలకు చేరనుంది. అదే జరిగితే ప్రభుత్వ కార్యాలయాలపై ప్రజలకు నమ్మకం మరింత బలపడుతుంది. 80%పవర్పాయింట్/రిపోర్టులు ప్రజా ఫిర్యాదులు డేటా విశ్లేషణ తెలుగు అనువాదం మీటింగ్ మినిట్స్ డాక్యుమెంట్ సారాంశం లెటర్ల తయారీ82%85%88%90%92%95%ఏఐతో శాఖల వారీగా ప్రయోజనాలు ఇలా..ఏఐతో ప్రజా సమస్యల పరిష్కారం వివిధ విభాగాల అధికారులకు సమాచారం, ఆదేశాలను త్వరగా చేరవేసేందుకు ఏఐ ఎంతో ఉపయోగపడుతుంది. సాధారణంగా అయితే డ్రాఫ్ట్ రెడీ చేసుకునేందుకు గంటల సమయం తీసుకుంటుంది. అదే ఏఐకి సరైన ప్రాంప్ట్ ఇస్తే సెకన్ల వ్యవధిలోనే డ్రాఫ్ట్ రెడీ అవుతుంది. కోర్టు కేసుల్లోనూ 100 నుంచి 150 పేజీల డాక్యుమెంట్ ఉన్న కాపీలను గూగుల్ క్ల్లౌడ్లో స్కాన్ చేసి ఒక పేజీలో ముఖ్యమైన సారాంశం ఇవ్వాలని సరైన ప్రాంప్ట్ ఇస్తే సెకన్లలో సిద్ధమవుతుంది. అలాగే, అధికారులు కూడా తమ రోజువారీ పనుల్లో ఏఐ వాడితే ప్రజాసమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫైళ్ల కదలికలో వేగం పెరుగుతుంది. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం తగ్గుతుంది. ప్రభుత్వ సేవలు త్వరగా చేరువ అవుతాయి. పారదర్శకత పెరుగుతుంది. – డాక్టర్ సత్యశారద, వరంగల్ కలెక్టర్వరంగల్ కలెక్టరేట్లో అధికారులకు ఏఐపై శిక్షణ ఇస్తున్న ట్రైనర్ఏఐ నుంచి కచ్చితమైన, ఉపయోగకరమైన ఫలితాలు పొందాలంటే అధికారులు నాలుగు దశల ప్రాంప్ట్ ఫ్రేమ్వర్క్ పాటించాలి. ముందుగా మీ పాత్రను స్పష్టంగా పేర్కొనాలి. తర్వాత ఏ పనిచేయాలో టాస్క్ రూపంలో వివరించాలి. ఆపై సంబంధిత గణాంకాలు, తేదీలు, అవసరమైన సమాచారం వంటి వివరాలు ఇవ్వాలి. చివరగా సమాధానం ఏ రూపంలో కావాలో ఫార్మాట్ను సూచించాలి. ఈ నాలుగు అంశాలను స్పష్టంగా ఇవ్వడం ద్వారా ఏఐ మరింత కచ్చితమైన, అవసరానికి అనుగుణమైన సమాధానాలు అధికారులకు అందిస్తుంది. – వాసుదేవ నటరాజ్, ఏఐ ట్రైనర్, టీఫైబర్ ఇలా చేస్తేనే ఫలితం.. -
చిన్న కుటుంబంతోనే సంతోషకరమైన జీవనం
● వరంగల్ ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ ప్రకాశ్ కాశిబుగ్గ/ఖిలా వరంగల్: చిన్న కుటుంబంతోనే సంతోషకరమైన జీవనం కొనసాగించవచ్చని వరంగల్ ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రకాశ్ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా వరంగల్లోని ఉర్సు, సీకేఎం ఆస్పత్రుల్లో గురువారం పురుషుల కుటుంబ నియంత్రణ శాశ్వత శస్త్రచికిత్స శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ పద్ధతులను ప్రజలు స్వచ్ఛందంగా పాటించాలని, మాతాశిశు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఎన్ఎస్వీ అనేది సురక్షితమైన, సులభమైన, ప్రతిభావంతమైన శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతి అని పేర్కొన్నారు. శస్త్రచికిత్స అనంతరం పురుషులు సాధారణ జీవనం కొనసాగించవచ్చన్నారు. ప్రత్యేక శిబిరంలో 21 మంది పురుషులకు ఎన్ఎస్వీ శస్త్రచికిత్సలను డిప్యూటీ సివిల్ సర్జన్ కృష్ణారావు నిర్వహించినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ సాజిదాబేగం, వైద్యాధికారి ఎం.శ్రవణ్కుమార్, డాక్టర్ ప్రతీక్, స్టాటిస్టికల్ అధికారి ప్రసన్నకుమార్, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, ఫ్యామిలీ వెల్ఫేర్ వర్కర్ మసూద్ అలీ, నర్సింగ్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. -
‘నీట్’లో ఎస్సార్ విద్యార్థికి ఆలిండియా 9వ ర్యాంకు
హన్మకొండ: దేశవ్యాప్తంగా గురువారం విడుదలైన నీట్–2026 ఫలితాల్లో ఎస్సార్ విద్యాసంస్థలు మరోసారి ప్రతిభ చాటాయి. ఆ సంస్థ విద్యార్థి వీరయ్యగారి సహ్యూ ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 9వ ర్యాంకు సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాడు. 720 మార్కులకు గాను 705 మార్కులు సాధించి ఈ ఘనతను అందుకున్నట్లు ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని అభినందించిన ఆయన, క్రమశిక్షణతో కూడిన ప్రణాళికాబద్ధమైన శిక్షణ, అధ్యాపకుల నిరంతర మార్గదర్శకత్వం, విద్యార్థి పట్టుదల వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. అనంతరం విద్యార్థి వీరయ్యగారి సహ్యూను సంస్థ డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోష్రెడ్డి అభినందించి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
గత ప్రభుత్వంలోనే ఎయిర్పోర్టుకు అడుగులు
● జీఎంఆర్తో మాట్లాడి సమస్యను పరిష్కరించిన కేసీఆర్, కేటీఆర్ ● ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ హన్మకొండ: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మామునూరు ఎయిర్పోర్టుకు అడుగులు పడ్డాయని, ఎయిర్పోర్ట్ కోసం అప్పటి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మంజూరు చేయించారని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినయ్భాస్కర్ మాట్లాడుతూ.. మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధి కోసం మాజీ మంత్రి కేటీఆర్ అనేకసార్లు ఢిల్లీ వెళ్లి అప్పటి విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సిందియా, హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారని తెలిపారు. ఉడాన్ పథకంపై కేంద్రంతో నిరంతరం చర్చలు జరిపారన్నారు. ఎయిర్ పోర్టు అథారిటి ఆఫ్ ఇండియా, జీఎంఆర్ సంస్థతో కేసీఆర్, కేటీఆర్ చర్చించి సమస్యను పరిష్కరించి మామునూరులో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు లైన్ క్లియర్ చేశారన్నారు. 1.8 కి.మీ రన్న్వేను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 3.8 కి.మీగా విస్తరించేందుకు రైతులను ఒప్పించి భూసేకరణ చేపట్టామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ.. ఎయిర్పోర్ట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స్థల సేకరణకు కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధం లేదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. నాయిని రాజేందర్రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు ఊరుకోరన్నారు. సమావేశంలో నాయకులు మర్రి యాదవరెడ్డి, ఎల్లావుల లలితా యాదవ్, తాళ్లపల్లి జనార్దన్ గౌడ్ౠ మసూద్, నయిముద్దీన్, జోరిక రమేశ్, పోలెపల్లి రామ్మూర్తి, దూలం వెంకన్న పాల్గొన్నారు. -
అనధికారిక ప్రచారంపై ఉక్కుపాదం
వరంగల్ అర్బన్: మహా నగర పరిధి వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో బహిరంగ ప్రచారంపై బల్దియా సిబ్బంది ఉక్కుపాదం మోపుతున్నారు. మొన్న వరంగల్ సెంట్రల్ జైల్ స్థానంలో నిర్మితమైన బహుళ అంతస్తులకు ఎదురుగా ప్రధాన రహదారిపై చిరువ్యాపారులు, దళారులు ఏర్పాటు చేసిన డబ్బాలు, తాత్కాలిక గదులను తొలగించిన టౌన్ ప్లానింగ్, ప్రజారోగ్యం, డీఆర్ఎఫ్ అధికార యంత్రాంగం గురువారం హనుమకొండలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అంబేడ్కర్ సర్కిల్, మిషన్ హాస్పిటల్, సర్క్యూట్ గెస్ట్హౌస్, తదితర ప్రాంతాల్లో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, బిల్బోర్డులు, ప్రచార బోర్డులను తొలగించారు. పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, ప్రైవేట్ విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలు లేదా ఇతర సంస్థలు మున్సిపల్ అనుమతి లేకుండా ఎలాంటి ఫ్లెక్సీలు, బ్యానర్లు, ప్రచార బోర్డులు ఏర్పాటు చేయరాదని కమిషనర్ టి.వెంకన్న హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మున్సిపల్ చట్టాల ప్రకారం భారీ జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి
ఎస్ఎస్తాడ్వాయి: వచ్చే మేడారం మహా జాతరకు హాజరయ్యే కోట్లాది మంది భక్తులకు ఎలాంటి ఇ బ్బందులు తలెత్తకుండా అన్ని అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఆదేశించారు. ఈ మేరకు గురువారం మేడారంలో హరితహోటల్లో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్తో కలిసి జిల్లా అధి కారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతర సమయంలో ట్రాఫిక్ సమస్య లేకుండా మేడారం–తా డ్వాయి, పస్రా–మేడారం, చిన్నబోయినపల్లి–కొండాయి–ఊరట్టం రహదారుల విస్తరణకు వెంటనే అంచనాలు సిద్ధం చేసి అవసరమైన అనుమతులు పొందాలని ఆదేశించారు. క్యూలైన్ల ఆధునికీకరణ తోపాటు ఆలయ పరిసరాల్లో డ్రెయినేజీ పనులను వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. జంపన్న వాగు పరిసరాలను సుందరీకరించి, వాగుపై చెక్డ్యామ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూ చించారు. ఈ అంశంపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. భక్తుల కోసం కాటేజీలు, విశ్రాంతి కేంద్రాల ఏర్పాటుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, రవాణా, వైద్య సేవలు, భద్రత వంటి అన్ని మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ మేడారం అభివృద్ధి పనులను గడువులోగా నాణ్యతాప్రమాణాలతో పూర్తి చేయాలని ఆదేశించారు. ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో, డీఎఫ్ఓ వికాస్ మీనా, అదనపు కలెక్టర్లు సి.హెచ్ మహేందర్ జీ, సంపత్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఆర్డీఓ కృష్ణవేణి, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క మేడారంలో అధికారులతో సమీక్ష -
నేటినుంచి నవోదయలో అథ్లెటిక్స్ పోటీలు
మామునూరు : వరంగల్ మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో 17,18 తేదీల్లో క్లస్టర్ లెవెల్ అథ్లెటిక్స్ పోటీలు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు అట్టహాసంగా ప్రారంభం కానున్న ఈ పోటీల సందర్భంగా మైదాన్నాన్ని ముస్తాబు చేశారు. దీంతో క్రీడాకారులు ప్రాక్టీస్ మొదలు పెట్టారు. కాగా, గురువారం ఉదయం కరీంనగర్, ఆదిలాబాద్, సిద్దిపేట, మహబూబ్నగర్, కామారెడ్డి, ఖమ్మం, జగిత్యాల, నల్లగొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సుమారు 130 మంది క్రీడాకారులు నవోదయ ప్రాంగణానికి చేరుకుని ప్రాక్టీస్ చేశారు. దీంతో క్రీడాకారులతో మైదానంలో సందడి నెలకొంది. కాగా, ఇక్కడ రాణించే క్రీడాకారులు ఈనెల 22 నుంచి 25వ తేదీ వరకు కర్నాటకలోని మైసూర్ నవోదయ క్రీడామైదానంలో జరిగే రీజనల్ అథ్లెటిక్ పోటీల్లో పాల్గొననున్నట్లు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ ఎస్. ప్రవీణ్కుమార్ తెలిపారు. రెండు రోజుల పాటు నిర్వహణ 130 మంది క్రీడాకారుల హాజరు -
ధర్మాస్పత్రిలో ధర్మచిట్టీలు
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రిక్విజిషన్ లెటర్లు లేక ధర్మచిట్టీలపై రాస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వైద్య పరీక్షల కోసం వచ్చిన పేషెంట్లకు అవసరమైన ఎక్స్రే, ల్యాబ్ పరీక్షలకు ఇవ్వాల్సిన రిక్విజిషన్ల ఫామ్లు లేక చిన్న కాగితాలపై రాయడంతో సంబంధిత సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులు ఇలా రాస్తే మేం పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు ఎక్కడ రాయాలంటూ ఎక్స్రే, ల్యాబ్ సిబ్బంది వాపోతున్నారు. కనీసం ఖాళీ పేపర్ వెనుక కూడా ప్రింటింగ్ అక్షరాలు ఉండడంతో రిపోర్టు పరిస్థితి ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. దాదాపు వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొనడంతో ఎక్స్రేతో పాటు వివిధ ల్యాబ్ పరీక్షలకు సమస్యలు తప్పట్లేదు. కాగా, స్టేషనరీ విభాగానికి సంబంధించిన దాదాపు రూ.కోటి టెండర్దారుడికి చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. బకాయిలు ఇవ్వనిదే తాము స్టేషనరీ సరఫరా చేయలేమంటూ వారు చెబుతున్నట్లు సమచారం. దీనిపై అధికారులు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే. -
పని చేయని లిఫ్టులతో పరేషాన్!
సూపర్ ఆస్పత్రిలో పేషెంట్లకు తప్పనితిప్పలు కాశిబుగ్గ: హనుమకొండలోని కాకతీయ మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో లిఫ్టులు పనిచేయక పేషెంట్లకు తిప్పలు తప్పట్లేదు. బుధవారం హాస్పిటల్లోని ఐదో అంతస్తులో ఉన్న డయాలసిస్ కేంద్రానికి వెళ్లాల్సిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పని చేస్తున్న ఏకై క లిఫ్ట్ కూడా కదలకపోవడంతో పేషెంట్లు మెట్ల మార్గం ద్వారా అతికష్టమ్మీద డయాలసిస్ సెంటర్కు చేరుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి హాస్పిటల్లో ఉన్న ఆరు అంతస్తులకు ఆరు లిఫ్ట్లు ఉండగా, గతేడాది నుంచి ఒక్క లిఫ్ట్ మాత్రమే పనిచేస్తోంది. ప్రస్తుతం ఆ లిఫ్ట్ కూడా ఆగిపోవడంతో రోగులు ఇక్కట్లకు లోనయ్యారు. ఇకనైనా అధికారులు అన్ని లిఫ్టులకు మరమ్మతు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని పేషెంట్లు, అటెండెంట్లు కోరుతున్నారు. -
సాంకేతికతతో నేరాలు నియంత్రించాలి
వరంగల్ క్రైం: అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి నేరాల నియంత్రణ, ట్రాఫిక్ పర్యవేక్షణ, శాంతిభద్రతల నిర్వహణలో మరింత సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎస్.శ్వేత అధికారులను ఆదేశించారు. బుధవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్లోని పోలీస్ కంట్రోల్ రూం, కమాండ్ కంట్రోల్ రూంను సంబంధిత అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా కంట్రోల్ రూం సిబ్బంది పనితీరు, అత్యవసర కాల్స్ స్వీకరణ విధానం, సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ, నగరంలోని వివిధ ప్రాంతాలపై నిఘా, సాంకేతిక వ్యవస్థల పనితీరును కమిషనర్ సమీక్షించారు. సీపీ వెంట అదనపు డీసీపీలు ప్రభాకర్రావు, శ్రీనివాస్, ఏసీపీ జితేందర్రెడ్డి, ఆర్ఐ సతీశ్, క్లూస్ ఇన్స్పెక్టర్ రాజ్కుమార్, ఎస్సై రోహిత్, ఆర్ఎస్సై శ్రవణ్కుమార్ ఉన్నారు. వరంగల్ లీగల్: యునైటెడ్ వరంగల్ జిల్లా అడ్వకేట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ సొసైటీ నూతన కార్యవర్గం ఎన్నిక బుధవారం జరిగింది. అధ్యక్షుడిగా యు.కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి అజ్మీరా కిరణ్ సింగ్, ఉపాధ్యక్షులుగా చెన్నూరి రమేశ్, కోశాధికారిగా బండారి కవిత ఎన్నికయ్యారు. తమపై నమ్మకం ఉంచి ఎన్నుకున్నందుకు నూతన కమిటీ బాధ్యులు.. సభ్యులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. హన్మకొండ అర్బన్: భారత వైమానిక దళంలో ఎయిర్మెన్ (మెడికల్ అసిస్టెంట్), అగ్నివీర్ వాయు పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియను ప్రారంభించిందని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనియామకాలకు సంబంధించిన ఆన్లైన్ నమోదు ప్రక్రియ జూలై 6, 2026 ఉదయం 11 గంటలకు ప్రారంభమైందని, జూలై 26, 2026 రాత్రి 11:00 గంటలకు ముగుస్తుందని తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని అర్హులైన యువత ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకుని భారత వైమానిక దళంలో సేవలందించే అవకాశం పొందాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కోరారు. కేయూ క్యాంపస్: టీజీసీపీగెట్–26 బుధవారం కూడా రాష్ట్రంలోని 22 పరీక్ష కేంద్రాల్లో ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు కొనసాగాయి. ఉదయం సెషన్లో ఎంకామ్, ఎమ్మెస్సీ బాటనీ కోర్సులకు 6,037 మంది అభ్యర్థులు హాజరైనట్లు టీజీసీపీగెట్ కన్వీనర్, కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేందర్ తెలిపారు. మధ్యాహ్నం సెషన్లో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ అండ్ న్యూట్రిషన్ కోర్సులకు 3,294 మంది, సాయంత్రం సెషన్లో ఎంఏ ఇస్లామిక్ స్టడీస్ అండ్ హెచ్ఆర్ఏ కోర్సుకు 376 మంది హాజరైనట్లు రాజేందర్ తెలిపారు. ఈనెల 16న ఉదయం సెషన్లో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సు ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. -
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వథ్థామరెడ్డి హన్మకొండ: ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వథ్థామరెడ్డి అన్నారు. బుధవారం విద్యుత్ బస్సులు నడుపుతున్న హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్–2 డిపోను సందర్శించారు. ఎలక్ట్రిక్ బస్సులను పరిశీలించారు. కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వరంగల్–2 డిపో మేనేజర్ రవిచందర్ను కలిసి కార్మికులకు ఇబ్బంది లేకుండా డ్యూటీలు వేయాలని సూచించారు. అనంతరం వరంగల్–1 డిపోలో టీఎంయూ వరంగల్–1 డిపో కమిటీని డిపో మేనేజర్ పుప్పాల అర్పితకు పరిచయం చేశారు. అక్కడి నుంచి ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ కార్యాలయానికి చేరుకుని ఆర్ఎం భవానీప్రసాద్తో సమావేశమయ్యారు. వరంగల్–2 డిపో కార్మికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు. కార్యక్రమంలో టీఎంయూ వరంగల్ రీజియన్ అధ్యక్షుడు ఎస్.కె.వై.పాషా, కార్యదర్శి జితేందర్రెడ్డి, నాయకులు ఆర్వీ.గోపాల్, రాతిపల్లి సాంబయ్య, రంజిత్, యాదగిరి, శివరాత్రి దుర్గయ్య పాల్గొన్నారు. -
డిజిటలైజేషన్ పూర్తి చేయాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద మామునూరు: ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా ఎన్యూమరైజేషన్, డిజిటలైజేషన్ను త్వరగా పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. వర్ధన్నపేట నియోజకవర్గం పరిధి తిమ్మాపురం(హవేలీ), బెస్తం చెరువు కాలనీలో కలెక్టర్ బుధవారం పర్యటించి బూత్ లెవల్ అధికారుల పనితీరును కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో వరంగల్ ఆర్డీఓ సుమ, ఏఓ ఫణికుమార్, తహసీల్దార్లు ఇక్బాల్, శ్రీకాంత్, హసన్పర్తి తహసీల్దార్లు రవీందర్రెడ్డి, సూపర్వైజర్ రజిని పాల్గొన్నారు. ‘సర్’పై రాజకీయ పార్టీలతో సమీక్ష న్యూశాయంపేట: ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ (సర్)పై వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద బుధవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏఐ వినియోగంపై శిక్షణ ఏఐ వినియోగంపై వరంగల్ కలెక్టరేట్లో బుధవా రం అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఇందులో భాగంగా చాట్ జీపీటీ, గూగుల్ నోట్బుక్ కేఎల్ఎం, క్లాడ్తోపాటు మొత్తం 15 అధునాతన ఏఐ ఆధారిత ఉత్పాదక సాధనాల వినియోగంపై శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద, శిక్షకులు వాసుదేవన్ నటరాజన్, రాహుల్, ధీరజ్ పాల్గొన్నారు. -
కేయూ పీజీ, డిగ్రీ కోర్సుల నూతన సిలబస్కు ఆమోదం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఇటీవల ఆర్ట్స్, సైన్స్, కామర్స్ (నాన్ ప్రొఫెషనల్ ) పీజీ కోర్సుల నూతన సిలబస్ రూపొందించారు. దీన్ని కాకతీయ యూనివర్సిటీ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. బుధవారం అకడమిక్ కమిటీ హాల్లో నిర్వహించిన స్టాండింగ్ కమిటీలో చర్చించి ఆమోదించారు. అలాగే, రాష్ట్రంలో డిగ్రీ కళాశాలల్లో యూ జీ కోర్సులు (ఏఈడీపీ) అప్రెంటీస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ కింద పలు నూతన కోర్సులను ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఆయా కోర్సుల నూతన సిలబస్ను కూడా కేయూ స్టాండింగ్ కమిటీలో చర్చించి ఆమోదించారు. పీహెచ్డీ పూర్తి చేసుకునేందుకు అవకాశం.. కేయూలోని వివిధ విభాగాల్లో పీహెచ్డీలో కొన్నేళ్ల క్రితం ప్రవేశాలు పొంది ప్రీ పీహెచ్డీ పూర్తి చేసి ఉండి థీసెస్ సబ్మిట్ చేయకుండా ఉండి పీహెచ్డీ పూర్తి చేసే కాలపరిమితి పూర్తయిన వారికి అవకాశం ఇచ్చేందుకు కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకునే వారికి ఆరునెలల్లో పీహెచ్డీ పూర్తిచేసుకునేలా అవకాశం ఇవ్వాలని స్టాండింగ్ కమిటీ నిర్ణయించి ఆమోదించింది. పార్ట్టైంగా చదువుకునే అవకాశం.. కేయూలో బీటెక్, ఎంటెక్ కోర్సుల్లో పార్ట్టైంగా పాలిటెక్నిక్, వివిధ ఇంజనీరింగ్ రిలేటెడ్గా ఉండే డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వారు ప్రవేశాలు పొంది పార్ట్టైంగా చదువుకునే అవకాశం కల్పించాలనే విషయంపై స్టాండింగ్ కమిటీలో చర్చించారు. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ ఇలా అవకాశం కల్పించేలా ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో ఉత్తీర్ణులైన వారికి కేయూలో కూడా బీటెక్, ఎంటెక్లో పార్ట్టైంగా కోర్సులో చేరేలా సాయంత్రం వేళల్లో ఆయా కోర్సులను నడిపాలనేది చర్చించారు. అయితే ఇందుకు ఏఐసీటీ అనుమతి తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఈ విద్యాసంవత్సరంలో అవకాశం వస్తుందా? లేక వచ్చే ఏడాది అమలుచేయాలా అనే యోచనలో ఉన్నారు. ఈ స్టాండింగ్ కమిటీలో వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం, వీసీ, రిజిస్ట్రార్ ఓఎస్డీ బి.వెంకట్రామ్రెడ్డి, వివిధ విభాగాల డీన్లు, యూనివర్సిటీ కాలేజీల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. -
కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హన్మకొండ చౌరస్తా: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, టీఎంఆర్పీఎస్, టీబీఎంయూకేఎస్, ఓఎస్ జేఏసీతో పాటు వివిధ మున్సిపల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ముఖాముఖి నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా కార్మిక సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యేకు సమస్యలు, డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, సీహెచ్ఎంఓ అధికారులు, సంబంధిత శాఖల ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్యలను సమగ్రంగా చర్చించి పరిష్కార మార్గాలను ఖరారు చేస్తామని భరోసా కల్పించారు. ఐఎన్టీయూసీ గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు పాశం రవియాదవ్, ఏఐటీయూసీ మున్సిపల్ సంఘం అధ్యక్షుడు వేల్పుల సారంగపాణి యాదవ్, ప్రధాన కార్యదర్శి ఏల్పుల ధర్మరాజు, టీఎంఆర్పీఎస్ అధ్యక్షుడు బొట్ల భిక్షపతి మాదిగ, జీడబ్ల్యూఎంసీ అధ్యక్షుడు బొట్ల రమేశ్, ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామెర రాజుతో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు
వరంగల్ ఆర్ఓ: 84,651 భూపాలపల్లి: 17,004 నర్సంపేట: 6,550 భీమదేవరపల్లి: 6,147 కొడకండ్ల: 3,294 స్టేషన్ ఘన్పూర్: 3,754 ములుగు: 18,000 వర్ధన్నపేట: 6,550 డీఐజీ కార్యాలయం: 24,989కాజీపేట అర్బన్: సర్కారుకు ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తున్న రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ కార్యాలయాలకు శాశ్వత భవనాలను నిర్మించాలనే సంకల్పంతో ఈనెల 7న జీఓ ఆర్టీ నంబర్ 414ను ప్రభుత్వం విడుదల చేసింది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తే అద్దె మిగులుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎనిమిదితో పాటు డీఐజీ కార్యాలయం కూడా అద్దె భవనాల్లోనే కొనసాగుతుండగా కొడకండ్లలో నిర్మాణంలో ఉంది. కాగా, ఏడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు డీఐజీ కార్యాలయం అద్దెలో కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో పూర్తిస్థాయిలో శాశ్వత భవనాలు నిర్మాణంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు లభించే అవకాశం ఉంటుంది. స్థల సేకరణకు కలెక్టర్లకు వినతులు ఉమ్మడి జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నర్సంపేట, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ ఆర్ఓలో డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్ ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలకు భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సోమ, మంగళవారాల్లో వినతులు అందజేశారు. ఒక్కో కార్యాలయానికి ఒక్కో ఎకరం భూమి అందుబాటులోకి తెచ్చుకోవాలని, స్థల సేకరణ పూర్తి కాగానే ప్రభుత్వమే స్వయంగా శాశ్వత భవనాలను నిర్మించనున్నట్లు జీఓలో పేర్కొన్నారు. ప్రతీ నెల మిగలనున్న రూ.1,88,852 అద్దె ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని ఎనిమిది కార్యాలయాలు, డీఐజీ కార్యాలయం అద్దె భవనాల్లో కొనసాగుతుండడంతో ప్రతి నెల1,88,852 రూపాయలను అద్దె రూపంలో చెల్లిస్తున్నారు. ప్రభుత్వం శాశ్వత భవనాలను నిర్మిస్తే ఈ మొత్తం నగదు మిగలనుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల అద్దెలు (రూ.లో) స్థలం సేకరించాలని ప్రభుత్వం ఆదేశాలు కలెక్టర్లకు వినతుల అందజేత అద్దెలకు చెక్.. ఖజానాకు మిగలనున్న ఆదాయం -
లేని ఇంటికి 20 ఏళ్లుగా పన్ను!
హన్మకొండ అర్బన్: గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల బాధ్యతారాహిత్యంతో ఓ సామాన్య రైతు ఇరవై ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నాడు. ఐనవోలు మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన కలువాల వెంకటయ్య వృత్తిరీత్యా రైతు. గ్రామంలోని 6వ వార్డులో ఉన్న ఇంటి నంబర్ 5–31 ఇల్లు 40 ఏళ్లుగా వెంకటయ్య పేరిట రికార్డుల్లో ఉంది. 2006 జూలై 4న వారి ఇంటి ముందున్న (ఇంటి నంబర్ 5–30 గల) మరో పాత ఇంటిని కొన్నాడు. అనంతరం ఆ ఇంటిని కూల్చి, స్థలాన్ని స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. ఆ సమయంలో కూల్చిన ఇంటి నంబర్ 5–30 ను రద్దు చేయాలని గ్రామ పంచాయతీకి అధికారికంగా నోటీసులు ఇచ్చి, నిబంధనల ప్రకారం.. రూ.3,000 ఫీజు కూడా చెల్లించాడు. దాంతో రికార్డుల నుంచి ఆ నంబర్ను పూర్తిగా తొలగించినట్లు గ్రామ పంచాయతీ అధికారులు ప్రకటించి నోటీస్ బోర్డులో పెట్టారు. సిబ్బంది నిర్వాకం గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్వాకం వల్ల రద్దయిన ఇంటి నంబర్ 5–30కి ఏటా ఇంటి పన్ను డిమాండ్ నోటీసులు జారీ చేయడం ప్రారంభించారు. రవి కుటుంబ సభ్యులు పంచాయతీ వారు అడిగిన పన్ను కడుతూ వచ్చారు. ఇటీవల వెంకటయ్య మరణానంతరం కుమారుడు కలువాల రవి 5–31 ఇంటిని తన పేరు మీదకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి తన నివాస గృహమైన 5–31 నంబరుకు పన్ను కడతానని కోరగా, సిబ్బంది మాత్రం నిబంధనలకు విరుద్ధంగా 5–30 నంబర్తో కూడిన రశీదును చేతిలో పెట్టారు. దీంతో బాధితుడు రెండు నెలల క్రితం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశించినా సిబ్బందిలో మాత్రం చలనం రాలేదు. కాగా, ఇదే విషయమై డీఎల్పీఓ గంగాభవానీ మాట్లాడుతూ.. ‘పొరపాటు జరిగింది వాస్తవమే. ఆయన మాకు ఫిర్యాదు చేశాడు. దాన్ని పరిశీలించాం నివేదిక పంపించాం. తొందరపడితే కాదు దానికి టైం పడుతుంది. ఫైల్ కలెక్టర్ దగ్గరికి వెళ్లాలి. కలెక్టర్ చూసాక ఓకే అంటే ఇంటి నంబర్ మారుతుంది. ప్రాసెస్ ప్రకారం జరగాల్సిన పని పదేపదే ఫిర్యాదులు చేస్తే కాదు’ అని సమాధానం ఇచ్చారు. మార్చమని వేడుకున్నా అధికారుల నిర్లక్ష్యం బాధితుడి ఆవేదన.. కలెక్టరేట్లో ఫిర్యాదు -
ఉప్పరపల్లిలో ఉద్రిక్తత..
వర్ధన్నపేట : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లిలో బుధవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన భాస్కర్(30) హైదరాబాద్లో హత్యకు గురికావడంతో బంధువులు గ్రామంలో ఆందోళన చేపట్టారు. దీంతో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. భాస్కర్ హైదరాబాద్లోని మాదాపూర్లో నివాసముంటూ ఓ ప్రైవేట్ హాస్టల్లో కుక్గా పని చేస్తున్నాడు. కాగా, గతంలో భాస్కర్ ఇదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరి కులాలు వేరు కావడంతో ఆ యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. అనంతరం 3 సంవత్సరాల క్రితం వేరే వ్యక్తితో పెళ్లి జరిపించారు. పైళ్లెన అనంతరం ఆ యువతి భాస్కర్తో మాట్లాడుతుందనే అనుమానంతో భర్త ఇటీవల విడాకులు ఇచ్చాడు. దీంతో తమ కూతురు వైవాహిక జీవితం పాడవడానికి భాస్కర్ కారణమని యువతి కుటుంబీకులు అతడిపై కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి యువతి తండ్రి, మేనమామతోపాటు మరి కొందరు భాస్కర్ వద్దకెళ్లి అతడిని హత్య చేశారు. ఈ ఘటనపై కోపోద్రెకులైన మృతుడి బంధువులు, కులస్తులు బుధవారం స్వగ్రామం ఉప్పరపల్లిలో ఆ యువతి తండ్రి ఇంటిపై దాడికి దిగారు. ఇంటి తలుపులు పగులగొట్టి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కాగా, గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, భాస్కర్ మృతదేహాన్ని రాత్రి 11 గంటలకు స్వగ్రామానికి తీసుకువచ్చారు. ఆ సమయంలో కరెంట్ పోయి అరగంట తరువాత వచ్చింది పోలీసులే కరెంటు నిలిపివేశారని బంధువులు ఆరోపించడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. దళిత సంఘాల ధర్నా.. మృతుడి కుటుంబానికి న్యాయం చేయడంతోపాటు భాస్కర్ను హత్య చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల నాయకులు ధర్నా చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా ఆందోళన విరమించారు. మాదాపూర్ హత్యతో కలకలం మృతుడి బంధువుల ఆందోళన -
డీడీఎన్ అర్చకుల సమస్యలు పరిష్కరిస్తాం
హన్మకొండ కల్చరల్: ధూపదీపనైవేద్య అర్చకుల సమస్యలు పరిష్కరిస్తామని, వారి జీవనవిధానం మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం హనుమకొండ వేయిస్తంభాల దేవాలయం ఆవరణలో ధూపదీపనైవేద్య పథకం రాష్ట్ర శాఖ, తెలంగాణ అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాగా, డీడీఎన్ అర్చకులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెరంబదూర్ శ్రీకాంత్చారి, రాష్ట్ర కన్వీనర్ మహేంద్రాచారి, మాజీ అర్చక వెల్ఫేర్ బోర్డు మెంబర్ జక్కాపురం నారాయణచారి, అన్నావజ్జుల ప్రసాద్శర్మ, ఏటూరి ఆంజనేయచారి, మాజీ కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, సీతారాంశర్మ తదితరులు పాల్గొని తీర్మానాలు ప్రవేశ పెట్టారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న 6,600 మంది డీడీఎన్ అర్చకులకు ఉద్యోగభద్రత కల్పించాలని, పీఆర్సీ 99 వర్తింపజేయాలని, ఆరోగ్యబీమా, తదితర అంశాలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ అర్చకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సమావేశంలో 200మందికి పైగా అర్చకులు పాల్గొన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి -
చిరకాల ఆకాంక్ష నెరవేర్చిన కేంద్రం
ఖిలా వరంగల్ : ఓరుగల్లు, ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను ప్రధానమంత్రి నరేంద్రమోదీ నెరవేర్చారని, విమర్శలు పక్కన పెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తేనే ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి చెందుతుందని మాజీ ఎంపీ సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, టి.రాజేశ్వర్రావు, కొండేటి శ్రీధర్ అన్నారు. వరంగల్ మామునూరు విమానాశ్రయం అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ బుధవారం విమానాశ్రయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మోదీ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ అనేక దశాబ్దాలుగా ఎదురుచూసిన ఎన్నో కీలక అభివృద్ధి ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే వెనుక పడ్డాయని విమర్శించారు. 2014 నుంచి ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తోందన్నారు. దేశంలోనే 163 విమానాశ్రయాల అభివృద్ధి విషయంలో 2014లోనే కేంద్రం పార్లమెంట్లో నిర్ణయం తీసుకుందని, అందులో 16వ స్థానంలో మామునూరు ఎయిర్ పోర్టు ఉండడం విశేషమని తెలిపారు. ఎయిర్పోర్టు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.853 కోట్లు కేటాయించిందని, మూడు వారాల్లో పనులు ప్రారంభమవుతాయన్నారు. రూ. 520 కోట్ల వ్యయంతో 160 ఎకరాల విస్తీర్ణంలో కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు తుదిదశకు చేరుకున్నాయని, పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్క్ను రూ.500కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారని గుర్తు చేశారు. బీజేపీ రాష్ట్ర ప్రతినిధి వన్నాల వెంకటరమణ, నేతలు రావు పద్మ, రత్నం సతీశ్, మల్లాడి తిరుపతిరెడ్డి, బన్న ప్రభాకర్, జలగం రంజిత్, దేవేందర్రెడ్డి, మల్లాడి రాంరెడ్డి, సాంబార్ కిశోర్, నీరటి సుదర్శన్రెడ్డి, నల్లతీగల శ్రీనివాస్, ఆకటుకుల రమణ, సతీశ్, శివ పాల్గొన్నారు. సమన్వయంతో పనిచేస్తేనే జిల్లా అభివృద్ధి మాజీ ఎంపీ సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు -
మొబైల్స్ రికవరీ.. బాధితులకు అందజేత
హసన్పర్తి: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను బాధితులకు అందించారు. ఇటీవల హసన్పర్తి పోలీస్స్టేషన్లో మొబైల్ ఫోన్లు మాయమైనట్లు బాధితులు సీఈఐఆర్ పోర్టర్ ద్వారా ఫిర్యాదుచేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ మహేందర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.ఽ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటిని బుధవారం బాధితులకు అందించినట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ మహేందర్ తెలిపారు. మొబైల్ ఫోన్ చోరీకి గురైన, పోగొట్టుకున్న బాధితులు వెంటనే సీఈఐఆర్ పోర్టర్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. క్రైం బృంద సభ్యులు వెంకట్, తిరుపతి, పూర్ధాచారి, గీత,ప్రణవి తదితరులు పాల్గొన్నారు. -
గూడ్స్ వ్యాగన్లో పొగలు
● అప్రమత్తమై రైలును నిలిపిన సిబ్బంది స్టేషన్ఘన్పూర్: ఓ గూడ్స్ వ్యాగన్లో మంటలు అంటుకుని పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది రైలును స్టేషన్ఘన్పూర్లో నిలిపివేశారు. బుధవారం రామగుండం నుంచి రాయచూర్కు బొగ్గులోడ్తో వెళ్తున్న గూడ్స్ స్టేషన్ఘన్పూర్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఈ సమయంలో ఓ వ్యాగన్లో మంటలు అంటుకుని పొగలు వస్తుండగా రైల్వే సిబ్బంది గమనించారు. వెంటనే అప్రమత్తమై రైలును నిలిపి ఫైర్స్టేషన్కు సమాచారం అందించారు. అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని వ్యాగన్పైకి ఎక్కి మంటలను ఆర్పా రు. కాగా, గూడ్స్ వ్యాగన్లో పొగలు రావడంతో స్టేషన్లో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేయగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయమై రైల్వే అధికారులను సంప్రదించగా బొ గ్గులోడ్లతో వెళ్తున్న గూడ్స్లో ఇలా మంటలతో పొగలు వ్యాపించడం సాధారణమని, ఎండ తీవ్రత, వేడితో ఇలా జరుగుతుంటాయని, ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. ‘ఇంగ్లిష్ ఫర్ మాస్టరీ’ పుస్తకావిష్కరణ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం నూతన సిలబస్కు అనుగుణంగా రూపొందించిన ‘ఇంగ్లిష్ ఫర్ మాస్టరీ’ పుస్తకాన్ని బుధవారం వీసీ కె. ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి ఇంగ్లిష్ విభాగం అధిపతి ఆర్. మేఘనారావు, దీపాజ్యోతి, పి. నిర్మల సంపాదకులుగా వ్యవహరించారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించేలా ఈపుస్తకాన్ని రూపొందించినట్లు మేఘనారావు తెలిపారు. కేయూ పాలకమండలి సభ్యుడు బి. సురేశ్లాల్, నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లం నవీన్, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్, ఓఎస్డీ బి.వెంకట్రామ్రెడ్డి,కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. నర్సింహాచారి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోలాశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అండ
హన్మకొండ: ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ, ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ ఆయిల్ సీడ్స్ అండ్ గ్రోవర్ ఫెడరేషన్ చైర్మన్, తె లంగాణ మజ్దూర్ యూనియన్ వరంగల్ రీజియన్ గౌరవ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అన్నారు. బుఽ దవారం హనుమకొండ సుబేదారిలోని ఓ ఫంక్షన్ హాల్లో టీఎంయూ వరంగల్ రీజియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందులో జంగా రాఘ వ రెడ్డిని టీఎంయూ వరంగల్ రీజియన్ గౌరవాధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి గౌరవ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల సమస్యలు సీఎం, రవాఖ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. త్వరలోనే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన సమస్య కూడా క్లియర్ అవుతుందని అన్నా రు. టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి టీఎంయూ కృషి చేస్తుందన్నారు. యూనియన్ను మరింత బలోపేతం చేయాలన్నా రు. టీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్, వరంగల్ రీజియన్ అధ్యక్షుడు ఎస్.కె.వై.పాషా, కార్యదర్శి జి తేందర్ రెడ్డి, నాయకులు ఎం.ఆర్ రెడ్డి, నిరంజన్, రవీందర్, ఎండీ గౌస్, దామోదర్ రెడ్డి, సత్యనారా యణ, నాగశేషు, చంద్రయ్య, కేతిడి అశోక్ రెడ్డి, ఎంఎస్రావు, ఆర్.వి గోపాల్, శ్రావణి, మల్లికార్జున్, ఆర్.సాంబయ్య. టి.విద్యాసాగర్ పాల్గొన్నారు. తెలంగాణ ఆయిల్ సీడ్స్ అండ్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి -
‘టెస్కో’ ఎన్నికల సందడి షురూ!
కాశిబుగ్గ: టెస్కో (తెలంగాణ రాష్ట్ర చేనేత కార్మికుల సహకారం సంఘం లిమిటెడ్) ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడక ముందే ఆశావహులు సన్నాహాలు చేసుకుంటున్నారు. ముందుగా డైరెక్టర్ల పదవుల కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్రస్థాయిలో చైర్మన్తో పాటు డైరెక్టర్లను ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటికే చాలా చోట్ల ఆయా ప్రాంతాల్లో చేనేత సహకార సంఘాల నూతన కార్యవర్గం, అధ్యక్ష, కార్యదర్శులు ఎంపిక పూర్తయింది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఈ నెల 20 వరకు చేనేత ఎన్నికల కోసం పోలింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా చోట్ల ఎన్నికల ప్రక్రియ పూర్తయి అధ్యక్ష స్థానంలో ఆసీనులయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని చేనేత సహకార సంఘాల్లో నూతన కార్యవర్గాన్ని రిటర్నింగ్ అధికారులు ఎంపిక చేశారు. హనుమకొండ జిల్లాలో 18, జనగామ జిల్లాలో 11, వరంగల్ జిల్లాలో 27, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 6, సిద్దిపేట జిల్లాలో (గతంలోని చేర్యాల) 1 చొప్పున మొత్తం 63 సంఘాలకు చాలా చోట్ల ఏకగ్రీవంగా డైరెక్టర్లను ఎన్నుకోవడంతో కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. కాగా, సిద్దిపేట జిల్లాలోని చేర్యాల చేనేత సహకార సంఘానికి ఈ నెల 20న పోలింగ్ జరుగనుంది. డైరెక్టర్ పదవి కోసం ముందు వరుసలో ఉన్న అధ్యక్షులు.. ఉమ్మడి వరంగల్లో జిల్లాలో అప్పుడే డైరెక్టర్ పదవి కోసం ఆయా సంఘాల్లో గెలిచిన అధ్యక్షులు ముందు వరుసలో వస్తున్నారు. గతంలో ఆప్కో మాజీ చైర్మన్గా పనిచేసినవారు, టెస్కోలో రిటైర్డు అయిన వారు సైతం డైరెక్టర్ పోటీలో ఉన్నట్లు సమాచారం. కాగా, టెస్కో డైరెక్టర్ల పదవుల పోటీలో మాజీ ఆప్కో చైర్మన్ మండల శ్రీరాములు, టెస్కో రిటైర్డు అధికారి ఎస్.వెంకట్రాంనర్సయ్య, కొత్తవాడ షతరంజ చేనేత సహకార సంఘం అధ్యక్షుడు యెలుగం సాంబయ్య, దేశాయిపేట, సెకండ్ డాక్టర్స్ కాలనీ విశాలాక్ష్మి చేనేత సహకారం సంఘం అధ్యక్షుడు అడిగొప్పుల సంపత్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఆప్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములు చేర్యాల చేనేత సహకార సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక కావాల్సి ఉంది.గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆప్కో చైర్మన్ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున చేనేత సహకార సంఘాల అధ్యక్షులను డైరెక్టర్లుగా ఎన్నుకునేవారు. ప్రస్తుతం తెలంగాణ ఏర్పడిన తర్వాత టెస్కోగా ఏర్పడింది. దీనికోసం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పది ఉమ్మడి జిల్లాలకు గాను ఒక్కో డైరెక్టర్ను, మహబూబ్నగర్లోని జిల్లాలోని ఓ ఉన్ని సహకార సంఘానికి మరో డైరెక్టర్ను ఎన్నుకోవాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరిని పరోక్ష పద్దతి ద్వారా టెస్కో చైర్మన్గా ఎంపిక చేయాల్సి ఉంది. డైరెక్టర్ల పోస్టుల బరిలో ఉంటామని చెప్పుకుంటున్న సంఘాల అధ్యక్షులు ఇంకా వెలువడని నోటిఫికేషన్.. అయినా అంతర్గతంగా ప్రచారం చేసుకుంటున్న ఆశావహులు -
నేటినుంచి ట్రాన్స్కో, డిస్కంల ఇంటర్ సర్కిల్ క్రీడలు
హన్మకొండ : తెలంగాణ ట్రాన్స్కో, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్ సంయుక్తంగా ఈ నెల 16 నుంచి ట్రాన్స్కో, డిస్కంల ఇంటర్ సర్కిల్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్, హనుమకొండ ఎస్ఈ బి.సామ్యా నాయక్ తెలిపారు. 2026–2027 ఇంటర్ సర్కిల్ వాలీ బాల్, బాల్ బ్యాడ్మింటన్, క్యారం పోటీలు ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ఆయన బుధవారం ఒక ప్రకటనలో వివరించారు. గురువారం ఉద యం 9 గంటలకు క్రీడా పోటీలు ప్రారంభమవుతాయన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభిస్తారన్నారు. 18న మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ముగింపు కా ర్యక్రమంలో విజేతలకు బహుమతులు, ట్రోఫీలు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. అతివేగానికి వృద్ధుడు బలి ● నెల్లుట్ల వద్ద టీవీఎస్ ఎక్సెల్ను ఢీకొన్న కారు ● వృద్ధుడి దుర్మరణం లింగాలఘణపురం: అతి వేగంగా వచ్చిన కారు ఓ వృద్ధుడిని బలి తీసుకుంది.. టీవీఎస్ ఎక్సెల్పై వస్తూ రోడ్డు క్రాస్ చేస్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఆ వృద్ధుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన బుధవారం జనగామ– సూర్యాపేట రోడ్డులో నెల్లుట్ల వద్ద చో టు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జనగా మ జిల్లా లింగాలఘణపురం మండలం బండ్లగూడెం గ్రామానికి చెందిన బండి రాంనర్సయ్య(60) టీవీఎస్ ఎక్సెల్పై నెల్లుట్ల గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు క్రాస్ చేస్తున్నాడు. ఈ సమయంలో కారులో జనగామ నుంచి దేవరుప్పులకు వెళ్తున్న బ్యాంకు ఉద్యోగి శ్రీనివాస్నాయక్ అతివేగంగా వచ్చి ఎక్సెల్ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో రాంనర్సయ్య గాలిలో ఎగిరి పడగా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే జనగామ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.బ్యాంకు ఉద్యోగి శ్రీనివాస్కు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రావణ్కుమార్ తెలిపారు. కాజీపేట అర్బన్: కాజీపేట మండలం కడిపికొండలోని పీ ఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ కు చెందిన 9వ తరగతి విద్యార్థి దేవులపల్లి ప్రీతం అండర్–17 విభాగంలో 55వ కేవీ నేషనల్ క్రికెట్ పోటీలకు ఎంపికై నట్లు కేవీ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ స్మీత టిప్లే బుధవారం తెలిపారు. ఈఏడాది అక్టోబర్ 26న మ హారాష్ట్రలోని పూణేలో జరిగే ఫైనల్ పోటీల్లో లెగ్ స్పి న్నర్గా తన ప్రతిభను కనబర్చనున్నట్లు తెలిపారు. పీడీఎస్ బియ్యం సీజ్ హసన్పర్తి : హసన్పర్తి మండలం ఎల్లాపురంలో ఓ ప్రాంతంలో నిల్వ ఉన్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఎల్లాపురంలోని డి.రమేశ్ ఇంట్లో రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయనే పక్కా సమాచారంతో బుధవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 16 ప్లాస్టిక్ బ్యాగ్ల్లో రేషన్ బియ్యం లభ్యమైనట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ మహేందర్ తెలిపారు. అక్రమ రేషన్ బియ్యం వ్యాపారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈదాడుల్లో కానిస్టేబుల్ వెంకట్ పాల్గొన్నారు. పాముకాటుతో కౌలురైతు మృతి పాలకుర్తి టౌన్:(దేవరుప్పు) : పాముకాటుకు గురైన ఓ కౌ లురైతు చికిత్స పొందుతూ బుఽ దవారం చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. దేవరుప్పల మండలం ధర్మగడ్డకు చెందిన పంగ ప్రవీణ్(27) రెండేళ్ల క్రితం వివాహం చేసుకోగా ఓ పసికందు(11నెలలు) జన్మించింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూ రు మండలం కూరెళ్లలో తన బావతో కలిసి కౌలుకు భూమిని తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గత శుక్రవారం వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రవీణ్ పాముకాటుకు గురయ్యాడు. దీంతో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ప్రైవే ట్ ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందిన ట్లు గ్రా మస్తులు తెలిపా రు. ఈఘటన స్థానికంగా విషా దం నింపిది. -
అంతరాయాలు లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా
హన్మకొండ: వినియోగదారులకు అంతరాయాలు లేని నాణ్యమైన, మెరుగైన విద్యుత్ సరఫరాకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రాజెక్ట్స్ డైరక్టర్ వి.మోహన్ రావు, ఆపరేషన్ డైరెక్టర్ టి.మధుసూదన్ అన్నారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ రూరల్ డివిజన్ కార్యాలయం నుంచి డివిజన్లోని మానవ రహిత నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునికీకరించిన విశ్వనాథపూర్, కాకతీయ మెగాటె క్స్ టైల్స్ పార్కు, కాపుల కనపర్తి సబ్ స్టేషన్లను ప్రారంభించి మాట్లాడారు. నూతన సాంకేతిక పరి జ్ఞానంతో ఆటోమేషన్ విధానంలో ఈ సబ్స్టేషన్లు పని చేస్తాయన్నారు. సబ్ స్టేషన్లో అమర్చిన సీసీ కెమెరాల ద్వారా డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్క్రీన్ను ఉద్యోగులు పరిశీలిస్తూ సబ్ స్టేషన్ కు సంబంధించిన సరఫరా, అంతరాయాలు, ఇతర సమస్యలు ఏర్పడితే సంబంధిత అధికారులకు స మాచారం అందిస్తారన్నారు. దీంతో వెంటనే లోపాలు సరిదిద్ది విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తారన్నా రు. టీజీ ఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ రాజు చౌహాన్, వరంగల్ సర్కిల్ ఎస్ఈ ఆనందం, డీఈలు దానయ్య, మల్లికార్జున్, రాంబాబు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వి.మోహన్ రావు, ఆపరేషన్ డైరెక్టర్ టి.మధుసూదన్ -
భద్రకాళీ.. శరణు.. శరణు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో శాకంబరీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారికి సహస్ర కలశాభిషేకోత్సవం శోభాయమానంగా నిర్వహించారు. ఉత్సవకార్యక్రమాలు బుధవారం ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో నిర్మాల్య సేవలు అమ్మవారికి ఉద యం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, నీలిమా దంపతులు అమ్మవారి సన్నిధిలో జ్యోతిప్రజ్వలనం చేసి ఉత్సవాలు ప్రారంభించారు. ఆలయ మాజీ ధర్మకర్త తొనుపూనూరి వీరన్న అమ్మవారిని దర్శించుకున్నారు. పంచమూర్తులకు సహస్ర కలశాభిషేకం.. సహస్రకలశాభిషేకం మధ్యాహ్నం ప్రారంభమైంది. అగ్నిపురాణంలో చెప్పినట్లుగా వేదపండితులు నా లుగు వేదాల మూలమంత్రాలు పఠించారు. భక్తులు.. భద్రకాళీ శరణంమమ అంటూ ప్రార్థనలు చే శారు. భద్రకాళి పంచమూర్తులకు, శ్రీచక్రానికి అభిషేకం శోభాయమానంగా జరిగింది. హనుమకొండకు చెందిన బాసాని విశ్వప్రకాశ్, శోభ దపంతులు, డాక్టర్ సాయి విక్షిత్, డాక్టర్ నిహంతి, కావ్యత్, కుంచనకుంట్ల సాంబశివరెడ్డి, వినోద దంపతులు, శ్రీధర్రెడ్డి, కీర్తి దంపతులు సహస్రకళశాభిషేకం దాతలుగా వ్యవహరించారు. అనంతరం అమ్మవారిని కాళీక్రమంలో అలంకరించారు. భోగభేరాన్ని కామేశ్వరీనిత్యాక్రమంలో అలంకరించి ఆవరణార్చనలు, సాయంతనపూజ, నీరాజన మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ జరిపారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. భద్రకాళి శరణం మమ అంటూ జయజయధ్వానాలు చేస్తూ పులకించిపోయారు. ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత ఏర్పాట్లు పర్యవేక్షించారు. శాకంబరీ ఉత్సవాలు ప్రారంభించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాయిని శోభాయమానంగా సహస్ర కలశాభిషేకం -
అధరహో..
● పసుపు పంటకు రికార్డు ధర ● కేసముద్రం మార్కెట్లో క్వింటా రూ.16 వేలు కేసముద్రం : కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో బుధవారం పసుపు పంటకు (కాడిరకం) రికార్డు స్థాయిలో రూ.16వేల ధర పలికింది. మార్కెట్లో సీజన్ ప్రారంభంలో క్వింటాకు గరిష్ట ధర రూ.12వేల వరకు పలికింది. ఆ తర్వాత క్రమక్రమంగా ధర పెరుగుతూ ఇటీవల రూ.13 వేల నుంచి రూ.14వేల వరకు చేరింది. ఈ నెల 10వ తేదీన కాడి రకం పసుపు పంటకు గరిష్ట ధర రూ.14,300, కనిష్ట ధర రూ.8,400 పలుకగా, గోళా రకం పసుపు పంటకు గరిష్ట ధర రూ.14,201, కనిష్ట ధర రూ.10వేలు పలికింది. కాగా, బుధవారం మార్కెట్కు 306 బస్తాల పసుపు అమ్మకానికి రాగా, కాడిరకం పంటకు (పాలిష్ చేసిన పసుపు) క్వింటాకు గరిష్ట ధర రూ.16,159, కనిష్ట ధర రూ.10,300 పలికింది. గోళా రకానికి గరిష్ట ధర రూ.15,500, కనిష్ట ధర రూ.11,101 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. -
నేటి నుంచి శాకంబరీ ఉత్సవాలు
● భద్రకాళి దేవాలయంలో ఏర్పాట్లు చేసిన అధికారులు హన్మకొండ కల్చరల్: వరంగల్ భద్రకాళి ఆలయంలో బుధవారం శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం భద్రకాళి అమ్మవారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించి ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు సహస్ర కలశాభిషేకంలో ఉపయోగించే వేయి మృత్తికా ఘటాలకు సూత్ర వేష్ఠనం (కుండలకు దారాలు చుట్టడం) జరిపారు. రాత్రి 7 గంటలకు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు రంగులలో సర్వాంగసుందరంగా మండల రచన చేశారు. ఉత్సవానుజ్ఞ ప్రార్థనతో ప్రారంభం.. ఉదయం 5 గంటలకు నిర్మాల్య సేవలు, నిత్యాహ్నికం, ఉత్సవానుజ్ఞ ప్రార్థనతో అమ్మవారికి పూజలు ప్రారంభమవుతాయి. ఉదయం, సాయంత్రం కాళీ క్రమాల్లో పూజలు ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అమ్మవారిని వివిధ కాళీక్రమాల్లో ఆరాధిస్తారు. ప్రతీ క్రమానికో ప్రత్యేకత ఉండడం విశేషం. జూలై 29 వరకు జరిగే శాకంబరీ పూజల్లో భాగంగా బుధవారం ఉదయం కాళీ క్రమం, కామేశ్వరీ నిత్యాక్రమంలో పూజలు చేస్తారు. 16న కపాలినీ క్రమం, భగమాలినీ క్రమం, 17న కుల్లా క్రమం, నిత్యక్లిన్నా క్రమం, 18న కురుకుల్లా క్రమం, భేరుండా క్రమం, 19న విరోధిని క్రమం, వహ్నివాసినీ క్రమం, 20న విప్రచిత్తా క్రమం, మహావజ్రేశ్వరి క్రమం, 21న ఉగ్రా క్రమం, శివదూతీ క్రమం, 22న ఉగ్రాప్రభా క్రమం, త్వరితా క్రమం, 23న దీప్తా క్రమం, కులసుందరీ క్రమం, 24న నీలా క్రమం, నిత్యా క్రమం, 25న ఘనా క్రమం, నీలపతాకా క్రమం, 26న బలాకా క్రమం, విజయా క్రమం, 27న మాత్రా క్రమం, సర్వమంగళా క్రమం, 28న ముద్రా క్రమం, జ్వాలామాలినీ క్రమం, 29న మితాక్రమం, చిత్రానిత్యా క్రమాలలో పూజలు నిర్వహించనున్నారు. 29న శాకంబరీగా అలంకరణ.. ఈ నెల 29న ఉదయం 4 గంటలకు శ్రీభద్రకాళి అమ్మవారిని వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలతో శాకంబరీగా అలంకరిస్తారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. -
ప్రజల భద్రతే పోలీస్ శాఖ లక్ష్యం
నెలవారీ నేర సమీక్షలో వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత హసన్పర్తి: ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత అన్నారు. కిట్స్ కళాశాల సమావేశపు మందిరంలో పోలీస్ అధికారుల నెలవారీ నేర సమీక్ష మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధిలో పెండింగ్ కేసులు, వివిధ నేరాల దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతల పరిస్థితి, మహిళలు, చిన్నారులపై దాడులు, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలపై సీపీ సమీక్షించారు. అనంతరం కమిషనర్ శ్వేత మాట్లాడుతూ ప్రతి కేసును పాదర్శకంగా దర్యాప్తు చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ కేసులు త్వరితగతిన పూర్తి చేయడంతోపాటు కేసుల్లో నిందితుల అరెస్టుపై ప్రత్యేక దృష్టి సారించాలని, చోరీ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సొత్తును చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసి బాఽధితులకు అందించాలని, డయల్ 100 ద్వారా వచ్చే ప్రతికాల్పై తక్షణమే స్పందించి బాధితులకు సకాలంలో సేవలు అందించాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచాలని, అవసరమైతే రౌడీషీట్ తెరవాలని పేర్కొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన, పోగొట్టుకున్న సుమారు రూ.50 లక్షల విలువైన 352 సెల్ఫోన్లను సీపీ బాధితులకు అందజేశారు. సమావేశంలో డీసీపీలు అంకిత్ కుమార్, దారా కవిత, రాజమహేంద్రనాయక్, కిశోర్సింగ్, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2026
పుట్టుక.. చావులో పురుషులే ఎక్కువసాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పుట్టుకై నా.. చావైనా.. మగవారిదే పైచేయి ఉంటోంది. అదే సమయంలో ఆడబిడ్డల జననాలు తగ్గడం కాస్త ఆందోళన కలిగే అంశంగా ఉంది. కేంద్ర జనగణన విభాగం ఇటీవల విడుదల చేసిన సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్) 2024 నివేదిక ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో నమోదైన 57,156 జననాల్లో 30,421 మంది మగ శిశువులు, 26,735 మంది ఆడ శిశువులు ఉన్నారు. అంటే 3,686 మంది మగ శిశువులు ఎక్కువగా జన్మించారు. ప్రతి వెయ్యి మంది మగ శిశువులకు కేవలం 879 మంది ఆడ శిశువులే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. చిన్న కుటుంబాలవ్వడం, సంతానోత్పత్తి రేటు క్షీణించడం, కొన్ని ప్రాంతాల్లో సామాజిక అంశాలు ఆడపిల్లల జననాలపై ప్రభావం చూపుతున్నాయని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలాగే, ఉమ్మడి జిల్లాలో నమోదైన 28,649 మరణాల్లో 17,441 మంది పురుషులు, 11,208 మంది మహిళలు ఉన్నారు. అంటే 6,233 మంది పురుషులు ఎక్కువగా మరణించారు. మహిళలతో పోలిస్తే పురుషులు వ్యవసాయం, నిర్మాణం, రవాణా, పరిశ్రమలు వంటి ప్రమాదకర వృత్తుల్లో ఎక్కువగా ఉండడం, రోడ్డు ప్రమాదాలు, గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు, మద్యం, పొగాకు వినియోగం వంటి జీవనశైలి వల్ల మరణాలు ఎక్కువగా ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. హనుమకొండలోనే ఎక్కువ హనుమకొండ జిల్లాలో జనన, మరణాలు రెండూ అత్యధికంగా నమోదవగా, వరంగల్లో అత్యల్పంగా మరణాలు, ములుగులో అత్యల్ప జననాలు నమోదయ్యాయి. జననాల్లో ములుగు జిల్లాలో ప్రతి వెయ్యి మంది మగ శిశువులకు 991 మంది ఆడ శిశువులున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఈ నిష్పత్తి 805కే పరిమితమైంది. ఆడపిల్లల జననాలు ప్రోత్సహించాలి.. సీఆర్ఎస్–24 గణాంకాల ప్రకారం ఉమ్మడి వరంగల్లో ప్రతీ వెయ్యి మంది మగ శిశువులకు 879 మంది ఆడ శిశువులు నమోదవడం ఆందోళన కలిగించే అంశమే. బాలికల పుట్టుకను ప్రోత్సహించే పథకాలతో పాటు చట్టవిరుద్ధ లింగ నిర్ధారణపై కఠిన చర్యలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు, బాలికల విద్య సంక్షేమానికి ప్రోత్సాహకాలు ప్రభుత్వాలు మరింత బలోపేతం చేయాలి. – మండల పరశురాములు, సామాజికవేత్త, వరంగల్ మొత్తం జననాలు 57,156 మగ శిశువులు 30,421 ఆడ శిశువులు 26,735మొత్తం మరణాలు 28,649పురుషులు 17,441మహిళలు 11,208అత్యధిక జననాలు, మరణాలు: హనుమకొండజననం మరణంఆడమగ11,920 5,286 3,383 2,875 1,822 1,44913,464 6,568 3,682 3,189 2,056 1,462హనుమకొండ మహబూబాబాద్ జనగామ జయశంకర్ వరంగల్ ములుగు8,032 3,185 2,896 1,198 774 1,3564,800 2,139 1,977 740 447 1,1052024లో జనన, మరణ వివరాలు.. -
కేయూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతిగా శ్రీనివాస్రావు
కేయూ క్యాంపస్: కేయూలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హెచ్ఆర్ఎం విభా గాధిపతిగా ఆ విభాగం ప్రొఫెసర్ పి.శ్రీనివాస్రా వును నియమిస్తూ మంగళవారం కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఆ విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎ.శ్రీనివాసులు విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన స్థానంలో ప్రొఫెసర్ శ్రీనివాస్రావును నియమించారు. గతంలో శ్రీనివాస్రావు కేయూ డిసేబుల్డ్ సెల్ డైరెక్టర్, అడ్మిషన్ల డైరెక్టరేట్ జాయింట్ డైరెక్టర్, యూనివర్సిటీ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్, యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ, హాస్టళ్ల డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆవిభాగాధిపతిగా, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని అంబేడ్కర్ స్టడీస్ సెంటర్ ఇన్చార్జ్ డైరెక్టర్గా రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం బాధ్యతలు నిర్వర్తించనున్నారు. హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ చిలువేరు రాజ్కుమార్ ఇప్పటివరకు బాధ్యతలు నిర్వర్తించారు. ఇకనుంచి రిజిస్ట్రార్ రామచంద్రం అంబేడ్కర్ స్టడీస్ సెంటర్ ఇన్చార్జ్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించనున్నారు. ఈ విషయాన్ని మంగళవారం ఆయన ధ్రువీకరించారు. విద్యారణ్యపురి: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి అన్నారు. మంగళవారం హనుమకొండ సుబేదారిలోని ప్రభుత్వ హైస్కూల్లో సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహిస్తున్న శిక్షణను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చైల్డ్ సెంటర్ టీచింగ్కు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. ఏఐ టూల్స్ను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హనుమకొండ డీఈఓ ఎల్వీ.గిరిరాజ్గౌడ్, ట్రైనింగ్ సెంటర్ ఇన్చార్జ్ ఎంఈఓ నెహ్రూ, జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ డాక్టర్ బండారు మన్మోహన్, రిసోర్స్పర్సన్లు, సోషల్ స్టడీస్ టీచర్లు పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: సీ్త్ర, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికిఅందించనున్న రాష్ట్రీయ బాల పురస్కార్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఎఫ్ఏసీ అధికారి విశ్వజ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 ఏళ్లలోపు బాలబాలికలు ఆవిష్కరణ, సృజనాత్మకత, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్, టెక్నాలజీ రంగాల్లో ప్రతిభ కనబర్చిన బాలలు ఆన్లైన్ల్లో awards.gov.in వెబ్సైట్లో ఈనెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రామన్నపేట: ఇంటింటి జ్వర సర్వే సందర్భంగా ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, డ్రై డే నిర్వహణ ప్రాముఖ్యంపై అవగాహన కల్పించాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య సూచించారు. మంగళవారం పోచమ్మకుంట పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వేను అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్. టి.మదన్మోహన్రావుతో కలిసి డీఎంహెచ్ఓ పరిశీలించారు. అనంతరం పట్టణ ఆరోగ్య కేంద్రంలోని ఆరోగ్య మహిళా క్లినిక్ను సందర్శించి మెప్మా రిసోర్స్పర్సన్లు ఆరోగ్య సిబ్బంది మహిళా క్లినిక్ సేవలపై మరింత అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం లష్కర్ సింగారం పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో నిర్వహిస్తున్న హెచ్పీవీ వ్యాక్సినేషన్ శిబిరాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి, వైద్యాదికారి హైదర్, సబ్ యూనిట్ అఽధికారి ఖాదర్ అబ్బాస్, సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. -
స్మార్ట్ రోబోటిక్ నేటి సాంకేతిక యుగం
కేయూ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి కేయూ క్యాంపస్: నేర్చుకుంటూ స్వయంగా నిర్ణయాలు తీసుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా సేవలందించే రోబోటిక్ అనేది నేటి సాంకేతిక యుగం అని కేయూ వీసీ ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం కేయూలోని గణితశాస్త్ర విభాగంలోని శ్రీనివాసరామానుజం సెమినార్హాల్లో డిప్లాయిబుల్ రోబోటిక్స్ దట్ లెర్న్ అంశంపై నిర్వహించిన విస్తృతోపన్యాసంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనేక ప్రధాన రంగాల్లో రోబొటిక్స్, కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతికతల్లో దేశ విదేశాల్లో అపారమైన ఉపాధి అవకాశాలున్నాయన్నారు. ప్రభుత్వం, యూనివర్సిటీలు కల్పించే స్టూడెంట్ ఎక్చేంజ్ కార్యక్రమాలను విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. కేయూ నుంచి 10 నుంచి 20 వరకు స్టార్టప్లు అవిర్భవించే అవకాశాలున్నట్లు తెలిపారు. పరిమితులు అధిగమించే దిశగా.. కేయూ విస్తృతోపన్యాసంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల జార్జిమెషన్ యూనివర్సిటీ రోబోటిక్స్ ల్యాబ్ పరిశోధకులు డాక్టర్ ష్యూనుషియానో మాట్లాడుతూ.. సాధారణ వినియోగదారుల సూచనలతో రోబోల చలన ప్రణాళికలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడం, విధి నిర్వహణ సమయంలో భూభాగ పరిస్థితులకు అనుగుణంగా రోబోలు స్వయంగా పని తీరును మార్చుకొని స్థిరంగా ప్రయాణించే సామర్థ్యాన్ని పెంపొందుంచుకోవడం వంటి అంశాలను ఆయన వివరించారు. అనంతరం డాక్టర్ షియావోను శాలువాతో సత్కరించారు. సమావేశంలో కేయూ కో–ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రమణ, కేయూ పాలక మండలి సభ్యురాలు డాక్టర్ బి.రమ, మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భిక్షాలు, కేయూ మాజీ రిజిస్ట్రార్ ఆచార్య పి.మల్లారెడ్డి మాట్లాడారు. -
గుంతలు.. కుదుపులు!
హన్మకొండ: హనుమకొండ బస్స్టేషన్ గుంతలమయమై ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. గుంతల నుంచి బస్సులు వెళ్తుండడంతో కుదుపులకు ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు పొరుగున ఉన్న కరీంనగర్, సిద్దిపేట జిల్లా ల ప్రయాణికులకు సేవలందిస్తున్న హనుమకొండ జిల్లా బస్స్టేషన్ ఆవరణ అధ్వానంగా తయారైంది. రోడ్లపై గుంతలు ఏర్పడి ఇబ్బంది పడే ప్రయాణికులు బస్స్టేషన్లో భారీస్థాయిలో గుంతలు పడడంతో అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజు రెండు వేల కు పైగా బస్సులు హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ కు వచ్చి వెళ్తుంటాయి. దాదాపు 60 వేల మంది ఈ బస్స్టేషన్ నుంచి వివిధ గమ్యస్థానాలకు వెళ్తారు. ఎంతో ప్రాధాన్యం కలిగిన హనుమకొండ జిల్లా బస్స్టేషన్ నిర్వహణను యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని ప్రయాణికులు మండిపడుతున్నారు. మరమ్మతులకు గురవుతున్న బస్సులు బస్స్టేషన్లో ఏర్పడిన గుంతలతో బస్సులు తరచూ మరమ్మతులకు వస్తున్నాయి. గుంతల్లో నుంచి బస్సులు వచ్చి వెళ్తుండడంతో బస్సుల టైర్లు పగిలిపోవడంతో పాటు మెయిన్లు, కమాన్ పట్టీలు విరిగి సంస్థకు నష్టం కలుగుతోంది. ఒక్కోసారి ఆర్టీసీ అధికారులు టైర్లు పగిలినా, మెయిన్, కమాన్ పట్టీలు విరిగితే నిర్లక్షపు డ్రైవింగ్ అని తమపై పెనాల్టీలు విధిస్తున్నారని డ్రైవర్లు మొత్తుకుంటున్నారు. పెనాల్టీలను కోత పెట్టడంతో తమకు వచ్చే జీతం సరిపోవడం లేదని వాపోతున్నారు. మరో వైపు అద్దె బస్సు యజమానులు కూడా తమ బస్సుల మెయిన్లు, కమాన్ పట్టీలు విరిగి నష్టం జరుగుతోందని, తమకు వచ్చిన లాభం అంతా మరమ్మతులకే పోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంతలు పడి సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యారని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఆదాయంపై ఉన్న శ్రద్ధ, సౌకర్యాల కల్పనపై లేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి హనుమకొండ జిల్లా బస్స్టేషన్పై ప్రత్యేక శ్రద్ధ కనబర్చి బస్స్టేషన్ను బాగు చేయాలని, గుంతలు పడుకుండా శాశ్వత ప్రాతిపదికన పటిష్టంగా బస్స్టేషన్ ఆవరణను తీర్చిదిద్దాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. అధ్వానంగా హనుమకొండ ఆర్టీసీ బస్స్టేషన్ బస్సుల కుదుపుతో ప్రయాణికుల అవస్థలు పగులుతున్న టైర్లు, విరుగుతున్న మెయిన్లు, కమాన్ పట్టీలు బస్సులకు మరమ్మతులు వస్తే డ్రైవర్ల వేతనాల్లోంచి కోత -
క్రీడల్లో రాణించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ వరంగల్ స్పోర్ట్స్: విద్య, క్రీడలు రెండింట్లోనూ రాణించేలా విద్యార్థులు ఎదగాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. మంగళవారం జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ఎస్)లో యువజన సేవలు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ క్రీడా పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల అభ్యసన స్థాయి, అందుతున్న వసతులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సుమారు రూ.70 లక్షల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని యువజన సేవలు, క్రీడల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి కొత్త ప్రశాంత్, జీడబ్ల్యూఎంసీ ఎస్ఈ రాజ్కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాధవి, రవికుమార్, డీఈ రాజ్కుమార్, యువజన సేవలు, క్రీడల శాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణకు మణికిరీటం ‘తాడిచర్ల–2’
మల్హర్: తాడిచర్ల–2 కోల్బ్లాక్ తెలంగాణకు మణికిరీటంగా నిలుస్తుందని, తాడిచర్ల–2 కోల్బ్లాక్ను సింగరేణికి అప్పగించడం సంతోషకరమైన విషయమని కేంద్రమంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. సింగరేణి భరోసాయాత్రలో భాగంగా మంగళవారం మండల కేంద్రం తాడిచర్లలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్రెడ్డి మాట్లాడారు. తాడిచర్ల–2 నుంచి త్వరలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కానుందన్నారు. ఈ గని ద్వారా సుమారు 2,000 శాశ్వత ఉద్యోగాలు, మరో 5,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఈ ప్రాంతంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ బ్లాక్ద్వారా సుమారు రూ.1.20 లక్షల కోట్ల టర్నోవర్ జరిగే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. అవసరమైన అన్ని అనుమతులు, క్లియరెన్స్లు త్వరగా పొందిన అనంతరం సింగరేణి పనులు ప్రారంభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, నాయకులు సునీల్రెడ్డి, నారాయణరెడ్డి, కీర్తిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ని షిధర్రెడ్డి, మల్క మోహన్రావు, శ్రీకాంత్ ఉన్నారు. కోల్బ్లాక్ ద్వారా రూ.1.20 లక్షల కోట్ల టర్నోవర్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి -
ఆటపాటలతోనే అభ్యాసానికి బాట
కాళోజీ సెంటర్/ఖిలా వరంగల్: చిన్నారులకు ఆటపాటలు, కథల ద్వారా బోధన చేస్తేనే నేర్చుకోవాలనే ఆసక్తి పెరిగి సమగ్ర వికాసం సాధ్యమవుతుందని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కరీమాబాద్ పాఠశాలలోని ప్రీప్రైమరీ విభాగంతో పాటు ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కరీమాబాద్ ప్రీప్రైమరీ తరగతి గదిలో చిన్నారులకు ‘ప్లే వే మెథడ్’ బోధన, బోధన అభ్యాస సామగ్రి వినియోగం, పిల్ల ల భాగస్వామ్యాన్ని కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. క్లాస్రూమ్లో చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించారు. విద్యార్థులతో రైమ్స్ చెప్పిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం కరీమాబాద్, శంభునిపేట జీహెచ్ఎస్లో కొనసాగుతున్న ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్య శిక్షణను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్యనాయుడు, ఏఎంఓ సుజన్ తేజ, ఉల్లాస్ కో–ఆర్డినేటర్ నాగేశ్వర్రావు, హెచ్ఎం జయప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. బీఎల్ఓలకు సహకరించాలి ఖిలా వరంగల్: ఎస్ఐఆర్ ప్రక్రియకు ప్రతిఒక్కరూ సహకరించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం వరంగల్ నగరంలోని లెనిన్నగర్, రంగశాయిపేట ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు. ఎస్ఐఆర్ నమోదు కార్యక్రమాన్ని ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు. బూత్ లెవల్ అధికారులకు (బీఎల్ఓలు) పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ ఇక్బాల్, ఎంసీపీఐ నగర ప్రధాన కార్యదర్శి సాగర్ పాల్గొన్నారు. -
చర్లపల్లి–దానాపూర్ ప్రత్యేక రైళ్ల సర్వీస్ల పొడిగింపు
కాజీపేట రూరల్ : ప్రయాణికుల సౌకర్యార్థం కాజీపేట జంక్షన్ మీదుగా నడిపిస్తున్న చర్లపల్లి–దానాపూర్ నాలుగు ఎక్స్ప్రెస్ రైళ్లను మరికొన్ని రోజుల పాటు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ మంగళవారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. ఈ నెల 18, 25వ తేదీల్లో చర్లపల్లి–దానాపూర్ (07091) ఎక్స్ప్రెస్ చర్లపల్లిలో 13:00 గంటలకు బయలుదేరి కాజీపేటకు 15:00 గంటలకు చేరుతుంది. ఈ నెల 20, 27వ తేదీల్లో ప్రయాణించే దానాపూర్–చర్లపల్లి (07092) ఎక్స్ప్రెస్ దానాపూర్లో సోమవారం 03:00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు కాజీపేటకు 08:00 గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది. 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సె కండ్క్లాస్ కోచ్లతో ప్రయాణించే ఈ రైళ్ల సర్వీ స్లను కాజీపేట, రామగుండం, సిర్పూర్కాగజ్నగర్, బల్లార్షా, చందాపోర్టు, గోండియా, బాలఘట్, నైన్పూర్, జబల్పూర్, కఠ్నీ, సంత, మాణిక్పూర్, ప్రయాగ్రాజ్, చౌఖీ, పండిట్ ధీన్దయాల్ ఉపాధ్యాయ జంక్షన్, బాక్సర్, ఆరా స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. హత్య కేసులో జీవిత ఖైదుఖమ్మం లీగల్: హత్య కేసులో హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామానికి చెందిన రాపోలు వెంకటేశ్వర్లు అలియాస్ రాజుకు జీవిత ఖైదు విధిస్తూ ఖమ్మం నాలుగో అదనపు సెషన్స్ జడ్జి డాక్టర్ జీవీ మహేశ్నాథ్ తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ఖమ్మంలోని ప్రకాశ్నగర్కు చెందిన దుగ్యాల అంజిబాబు ఇంటికి ఆయన బావమరిది శీలం వెంకటేశ్ 2021, ఫిబ్రవరి 13న వచ్చాడు. సాయంత్రం బయటకు వెళ్లగా, రాత్రి 9–30 గంటల సమయాన కత్తిపోట్లకు గురైన ఆయనను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఈక్రమంలో అంజిబాబు భార్య వెంకటేశ్ను వివరాలు ఆరా తీయగా.. ఖమ్మం వినోద థియేటర్ వద్ద ఓ మహిళతో మాట్లాడుతుండగా.. రాపోలు వెంకటేశ్వర్లు వచ్చి తనతో సన్నిహితంగా ఉండే ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావంటూ కత్తితో పొడిచాడని వెల్లడించాడు. దీంతో ఖమ్మం వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంకటేశ్వర్లును అరెస్ట్ చేశారు. చికిత్స పొందుతూ వెంకటేశ్ మరణించడంతో హత్య కేసుగా మార్చి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో 12 మంది సాక్షులను విచారించాక వెంకటేశ్వర్లుపై నేరం రుజువు కావడంతో జీవితఖైదు విధించడమే కాక రూ.10 వేలు జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాలని పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ తరపున పి.స్వప్న వాదించగా ఉద్యోగులు శ్రీకాంత్, మారగాని రామకృష్ణ, ఓరుగంటి శ్రీను సహకరించారు. రాష్ట్ర అసోసియేషన్లో ఉండలేం..● ఉమ్మడి జిల్లా రైస్మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధుల వెల్లడి వరంగల్ చౌరస్తా: రైస్మిల్లర్స్ రాష్ట్ర అసోసియేషన్ నుంచి వరంగల్ ఉమ్మడి జిల్లా కార్యవర్గం వైదొలుగుతున్నట్లు ప్రతినిధులు ప్రకటించారు. హంటర్ రోడ్డులో మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. మిల్లర్ల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించిన రాష్ట్ర నాయకత్వంపై అవిశ్వాసం పెడుతున్నట్లు ప్రకటించారు. మిల్లర్ల హక్కుల పరిరక్షణ కోసం స్వతంత్రంగా ముందుకు సాగాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గోనెల రవీందర్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ , కోశాధికారి ఇరుకుల కోటేశ్వర్ రావు, గౌరవ అధ్యక్షుడు తోట సంపత్ కుమార్, సలహాదారులు ప్రభాకర్రావు, దుబ్బా రమేశ్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పెద్ది ప్రవీణ్ కుమార్, మాటేటి ప్రదీప్చంద్ర పాల్గొన్నారు. -
‘మోడల్’ పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలి
హన్మకొండ : మోడల్ సోలార్ గ్రామాల్లో పనులు ఈ నెలఖరులోపు పూర్తి చేయాలని రెడ్ కో వైస్ చైర్మన్, ఎండీ ముషారఫ్ ఫారూఖీ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 37 మోడల్ సోలార్ విలేజ్ల పనుల పురోగతిపై మంగళవారం హైదరాబాద్ నుంచి టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని జిల్లాల ఎస్ఈలతో వీడియో కా న్ఫరెన్స్లో సమీక్షించారు. ఇందులో టీజీఎన్పీడీసీఎ ల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, పది సర్కిళ్ల సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్లు, సంబంధిత అధికా రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎండీ ముషా రఫ్ ఫారూఖీ మాట్లాడుతూ రెడ్కో, ఎన్పీడీసీఎల్, సంబంధిత ఏజెన్సీలు నిరంతరం సమన్వయంతో ముందుకెళ్తూ పనులు పూర్తి చేయాలని సూచించారు. టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డితో కలిసి త్వరలో ఉమ్మడిగా ఖమ్మం జిల్లాలోని బోనకల్లు మోడల్ సోలార్ గ్రామాలను సందర్శించనున్నట్లు తెలిపారు. అధికారులు ఆ లోగా పనులన్నీ సి ద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం ఎన్పీడీసీ ఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ నిర్దేశిత లో గా సోలార్ గ్రామాల్లో ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెళ్ల బిగింపు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. కావాల్సిన మీటర్లు అందుబాటులో ఉన్నాయని, యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని ఎస్ ఈలను ఆదేశించారు. డైరెక్టర్ వి.మోహన్ రావు, చీఫ్ ఇంజినీర్లు వెంకటరమణ, అశోక్, జీఎం గౌత మ్ రెడ్డి, మల్లికార్జున్, అధికారులు పాల్గొన్నారు. రెడ్కో వైస్ చైర్మన్, ఎండీ ముషారఫ్ ఫారూఖీ -
క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీగా బొడ్డుచింతలపల్లి
● దేశంలోనే ద్వితీయ స్థానంలో నిలిచిన గ్రామం గీసుకొండ: మండలంలోని బొడ్డుచింతలపల్లి గ్రామం దేశంలోనే క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీగా నిలిచింది. ప్రతీ నెల కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా క్లీన్ అండ్ గ్రీన్ విభాగంలో పంచాయతీలను ఎంపిక చేసి అవార్డులను ప్రకటిస్తోంది. ఈ మేరకు గత జూన్ నెలకు గా ను గీసుకొండ మండలం బొడ్డుచింతలపల్లి సర్పంచ్ పోగుల వనిత చేపట్టిన పచ్చదనం, పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ముందు వరుసలో నిలిచినట్లు పంచాయత్ వెబ్సైట్లో వెల్లడించింది. కాగా, మొదటి బహుమతి అసోం రాష్ట్రానికి చెందిన మోరిడాల్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కంగుకనా చేతియా నిలవగా ద్వితీయ బహుమతి పోగుల వనితకు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడి అరెస్ట్ ఖిలా వరంగల్ : జల్సాలు, విలాసాల కోసం చో రీ లకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వరంగల్ ఏనుమాముల ఇన్స్పెక్టర్ జవ్వాజి సురేశ్ మంగళవారం తెలిపా రు. వరంగల్ శంభునిపేటకు చెందిన ఎండీ సొహె ల్ జల్సాలు, విలాసాల కోసం పరకాల, ఏనుమాముల పీఎస్ల పరిధిలో సెల్ఫోన్లు చోరీ చేసి అరైస్టె జైలుకెళ్లొచ్చాడు. తర్వాత కూడా చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 11న రాత్రి ఆరెపల్లి అయ్యప్ప కాలనీలోని ఓ ఇంట్లోకి ప్రవేశించి 2 సెల్ ఫోన్లు, 2 చేతి గడియారాలు, రూ.11,500 నగదు చోరీ చేశాడు. ఆ సొమ్మును విక్రయించడానికి ఏనుమాముల వైపునకు వస్తున్నాడు. అదే సమయంలో బాలాజీ నగర్ జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసులను చూ సి పారిపోయేందుకు యత్నించగా పట్టుకుని విచా రించగా నేరం అంగీకరించాడు. దీంతో రెండు సెల్ఫోన్లు, వాచ్, రూ.11,500 నగదు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
ఫ్యాన్సీ..యమ క్రేజీ!
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫ్యాన్సీ వాహన నంబర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఒకప్పుడు విలాసవంతమైన కార్ల యజమానులు మాత్రమే ఫ్యాన్సీ నంబర్లపై ఆసక్తి చూపేవారు. ప్రస్తుతం ద్విచక్ర వాహనాల నుంచి లగ్జరీ కార్ల వరకు అన్ని వర్గాల వాహనదారులు తమ అదృష్ట సంఖ్య (లక్కీ నంబర్) కోసం రూ.వేల నుంచి రూ.లక్షలు వెచ్చించేందుకు వెనుకాడడం లేదు. ఒకే నంబర్కు పలువురు పోటీ పడుతుండటంతో రవాణాశాఖ ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా నంబర్లను కేటాయిస్తోంది. ఇలా ఉమ్మడి వరంగల్లో ఏడాదిగా ఆర్టీఏకు రూ.4,17,07,550 ఆదాయం సమకూరింది. వాహనం కొనుగోలు చేసిన తర్వాత చాలా మంది జ్యోతిష్యులు, న్యూమరాలజీ నిపుణుల సలహాలతో తమకు అనుకూలంగా భావించే సంఖ్యలను ఎంపిక చేసుకుంటున్నారు. ముఖ్యంగా 1, 9, 9999, 1111, 7777, 8888 వంటి సంఖ్యలకు భారీ డిమాండ్ నెలకొంది. ఒకే నంబర్కు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే ఆన్లైన్ వేలం నిర్వహించి, అత్యధిక మొత్తం చెల్లించేందుకు ముందుకొచ్చిన వ్యక్తికి ఆర్టీఏ అధికారులు లక్కీ నంబర్ను కేటాయిస్తున్నారు. జిల్లాల వారీగా ఫ్యాన్సీ నంబర్ల ద్వారా వచ్చిన ఆదాయం జిల్లా (రూ.లక్షల్లో..) హనుమకొండ 1,84,41,796 వరంగల్ 98,12,148 జనగామ 49,59,928 జేఎస్ భూపాలపల్లి 41,35,012 మహబూబాబాద్ 31,45,066 ములుగు 12,13,600 వాహనానికి ఫ్యాన్సీ నంబర్ కావాలనుకునే వారు తెలంగాణ రవాణాశాఖ పోర్టల్లో మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఒకే నంబర్కు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఆన్లైన్ బిడ్డింగ్ నిర్వహించి, అత్యధిక మొత్తం బిడ్ చేసిన వారికి నంబర్ను కేటాయిస్తారు. రిజర్వ్ అయిన నంబర్ను 15 రోజుల్లోపు వాహన రిజిస్ట్రేషన్కు వినియోగించాలి. ఒకే నంబర్కు పోటీ ఎక్కువైతే నిర్ణయించిన కనీస ఫీజు కంటే అధిక మొత్తాన్ని బిడ్డింగ్లో చెల్లించి ఫ్యాన్సీ నంబర్ను దక్కించుకోవాలని వరంగల్, హనుమకొండ డీటీసీ సురేష్ రెడ్డి తెలిపారు. లక్కీ నంబర్ చేజిక్కించుకునేందుకు రూ.లక్షల్లో ఖర్చు కారు యజమానులతోపాటు ద్విచక్ర వాహనదారుల సైతం పోటీ ఏడాదిలోనే ఆర్టీఏకు రూ.4 కోట్లకుపైగా ఆదాయం


