వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్
సర్వసభ్య సమావేశంలో తీర్మానం
వరంగల్ లీగల్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలస సుధీర్ అధ్యక్షతన కోర్టు హాల్లో బుధవారం జరిగిన వరంగల్ బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో మహిళా న్యాయవాదులకు 30శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఐదు పదవులను వారికి కేటాయిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ కార్యవర్గ కమిటీ తీసుకున్న నిర్ణయాలను సర్వసభ్య సభలో ప్రవేశపెట్టారు. చర్చల అనంతరం పలు తీర్మానాలను సార్వత్రిక సభ ఆమోదించింది. మహిళా న్యాయవాదులకు ఉపాధ్యక్షురాలు, కోశాధికారి పదవులను ఈసారి కొత్తగా ఇవ్వడంతో పాటు గతంలో ఉన్న సంయుక్త కార్యదర్శి, సీనియర్ కార్యవర్గ సభ్యురాలు, జూనియర్ కార్యవర్గ సభ్యురాలు మొత్తం కలిపి ఐదు పదవులను కేటాయించినట్లు వలస సుధీర్ తెలిపారు. మహిళా పదవులతో కలిపి మొత్తం 16 పోస్టులకు వరంగల్ బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈనెల చివరలో నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. సమావేశంలో వరంగల్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డి.రమాకాంత్, ఉపాధ్యక్షుడు మైదం జయపాల్, సంయుక్త కార్యదర్శులు ఎం.శ్రీధర్ గౌడ్, శశిరేఖ, క్రీడా సంయుక్త కార్యదర్శి శివప్రసాద్, కార్యనిర్వాహక సభ్యులు సురేశ్, నిర్మలజ్యోతి, రాజు, మహేందర్, తోట అరుణ, కార్యవర్గ సభ్యులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.


