వరంగల్: తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ.. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, పంచాయతీరాజ్శాఖ మంత్రి ధనసరి సీతక్క, అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖను బుధవారం హైదరాబాద్లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఆమె వెంట కాంగ్రెస్ నాయకుడు ఎర్రబెల్లి వరద రాజేశ్వర్రావు ఉన్నారు.
హసన్పర్తి: క్రమశిక్షణ, నిరంతర సాధన, పట్టుదలతో ఉన్నతస్థాయికి చేరుకుంటారని అంతర్జాతీయ అథ్లెట్ నందిని అన్నారు. ఎస్సార్ యూనివర్సిటీలో బుధవారం నిర్వహించిన 24వ వార్షిక క్రీడోత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకుని శ్రమిస్తే విజయం సాధ్యమని పేర్కొన్నారు. బాల్యం నుంచే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని కోరారు. ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్లర్ ఎ.వరదారెడ్డి మాట్లాడుతూ క్రీడలతో ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా అవసరమన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడోత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ దీపక్గార్గ్, ప్రొ వైస్చాన్స్లర్ డాక్టర్ మహేశ్, రిజిస్ట్రార్ పీవీ.రమణారావు, ప్రొఫెసర్ సుధాకర్ పాల్గొన్నారు.
హన్మకొండ: ఆర్థిక స్వేచ్ఛ లభిస్తే మహిళలు మరింత అభివృద్ధి సాధించవచ్చని హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి రాజమణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, టైలరింగ్, బ్యూటిషియన్ కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న 300 మందికి హనుమకొండ సుబేదారిలోని అసుంత భవన్లో బుధవారం సర్టిఫికెట్లు, కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా ఆమె హాజరై మాట్లాడుతూ మహిళలు నైపుణ్యాలు అందిపుచ్చుకుని సాధికారత సాధించాలన్నారు. ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్స్పెక్టర్ శ్యాం సుందర్, సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ అశోక్కుమార్, వరంగల్, మహబూబాబాద్ బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ నాగవాణి, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ కోఆర్డినేటర్లు ఎర్ర శ్రీకాంత్, బత్తుల కరుణ పాల్గొన్నారు.
హన్మకొండ: వ్యాక్సినేషన్తో పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారించవచ్చని హనుమకొండ జిల్లా పశువైద్యాధికారి రాధాకిషన్ అన్నారు. హనుమకొండ వడ్డేపల్లిలోని పశువైద్యశాలలో బుధవారం పశువులకు గాలికుంటు నివారణ వ్యాక్సినేషన్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో ఆరు నెలలకోసారి పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేస్తున్నట్లు వివరించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఏప్రిల్ 9 వరకు టీకాల కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. జిల్లా పశువైద్య, పశుసంవర్థకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.సత్యప్రసాద్రెడ్డి, వడ్డేపల్లి పశువైద్యాధికారి సీహెచ్ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు.


