హసన్పర్తి: వేసవి ప్రారంభంలోనే హసన్పర్తిలోని 66వ డివిజన్లో నీటి ఎద్దడి సమస్య మొదలైంది. తమ ప్రాంతానికి తాగునీరు సరఫరా కావడం లేదని హసన్పర్తి పాత గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. ఈసందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై దేవేందర్ ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈసందర్భంగా జీడబ్ల్యూఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ సురేందర్తో మాట్లాడి తాగునీటి ఎద్దడికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, విషయం తెలుసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అధికారులపై సీరియస్ అయ్యారు. తాగు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు డీఈ రవికిరణ్ 66వ డివిజన్లో క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించి తాగు నీటి సమస్యలను పరిష్కరిస్తానని స్థానికులకు భరోసా ఇచ్చారు.
ఎంజీఎం: హెచ్పీవీ వ్యాక్సినేషన్తో బాలికల్లో గర్భస్థ ముఖ ద్వార క్యాన్సర్ రాకుండా నివారించగలమని హెచ్పీవీ వాక్సిన్ జిల్లా పర్యవేక్షణాధికారి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ప్రకాశ్ అన్నారు. మంగళవారం ఎంజీఎంలో ఆర్ఎంఓ మధుకర్తో కలిసి అయన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సమగ్ర ఆలోచనలతో
స్థిరాభివృద్ధి
కేయూ క్యాంపస్: దూర దృష్టి, బాధ్యతాయుత సమగ్ర ఆలోచలనతోనే స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని వరంగల్ నిట్ ప్రొఫెసర్ శైలజకుమారి అన్నారు. కేయూలోని మహిళా ఆధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో ‘లిటరేచర్ లీడర్షిప్ అండ్ ఇన్నోవేషన్ షేపింగ్ వికసిత్ భారత్ 2047’ అంశంపై రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సు మంగళవారం సాయంత్రం ముగిసింది. సదస్సుకు ముఖ్య అతిథిగా వారు హాజరై మాట్లాడారు. నిజమైన నాయకత్వం ధైర్యమైన నిర్ణయాలతో కూడి ఉండాలన్నారు. అనిశ్చితి పరిస్థితులకు ముందుగానే సిద్ధంగా ఉండాలన్నారు. ఇందులో కేయూ పాలకమండలి సభ్యుడు డాక్టర్ చిర్రరాజు, కేయూ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణవేణి, సోషియాలజీ విభాగాధిపతి, ఎం.స్వర్ణలత, కేయూ మహిళా అధ్యయన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ దీపాజ్యోతి, కేయూ అడ్మిషన్ల డైరెక్టర్ సీజే శ్రీలత పాల్గొన్నారు.
దర్గాలో ఇఫ్తార్ విందు
కాజీపేట రూరల్: కాజీపేట హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గా ప్రాంగణంలో మంగళవారం రాత్రి ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది. దర్గా పీఠాధిపతి, తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రుపాషా ముస్లిం మతపెద్దలకు, ఆలయ అర్చకులకు, క్రైస్తవ పాస్టర్లకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈసందర్భంగా ఖుస్రు పాషా మాట్లాడుతూ.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అల్లాను ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, కాజీపేట తహసీల్దార్ సీహెచ్.రాజు, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అఽధికారి గౌస్ హైదర్, భక్తియార్ బియాబానీ, వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ అయూబ్, మాజీ కార్పొరేటర్ అబుబక్కర్, అర్చకులు, పాస్టర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


