● మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: ఈఎల్ఎస్ఆర్ (ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్) ట్యాంక్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని మేయర్ గుండు సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు నీటి సరఫరా సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని సమర్థవంతంగా నిర్వహించేందుకు మేయర్ సూచనలిచ్చారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగర పరిధి 11వ డివిజన్లోని ఐ హాస్పిటల్ వాటర్ ట్యాంక్, కేఎంసీ హాస్పిటల్లో ఈఎల్ఎస్ఆర్, 24వ డివిజన్ మట్టెవాడ ప్రాంతంలోని ఈ ఎల్ఎస్ఆర్తో పాటు 28వ డివిజన్లోని గాయత్రి ఆలయం సమీపంలోని ఈఎల్ఎస్ఆర్లకు చెందిన వర్క్ ఇన్స్పెక్టర్లు లైన్మెన్లు, ఏఈలు, డీఈలు, ఈఈలతో సమావేశం ఏర్పాటు చేసి తగు సూచనలిచ్చారు. సమావేశంలో ఈఈలు రవికుమార్, సంతోశ్బాబు, డీఈలు రాజ్కుమార్, సతీశ్, రాగి శ్రీకాంత్, మొజామిల్, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.


