ఆజంజాహి మిల్లు కార్మికుల రాస్తారోకో
కాశిబుగ్గ: గత ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆజంజాహి మిల్లు కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మిల్లు కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు వరంగల్ వెంకట్రామ జంక్షన్లో గంటపాటు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళన విరమింపజేశారు. ఈ సందర్భంగా విశ్రాంత కార్మికుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఇనుముల శ్రీనివాస్, ఆరెల్లి కృష్ణ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 318 మంది కార్మికులకు ఒక్కొక్కరికి 200 గజాల ఇంటిస్థలం కేటాయిస్తానని సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చారన్నారు. ఇంతవరకు ఆ హామీ నెరవేర్చలేదని తెలిపారు. దశలవారీగా అనేక రూపాల్లో ఆందోళనలు చేపడుతున్నప్పటికీ ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా సీఎం రేవంత్రెడ్డి కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేసి, కార్మిక సంక్షేమ భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్, సామాజిక కార్యకర్త జనగాం కుమారస్వామి, హరినారాయణ, యశోద, సందీప్, శ్యాం, ప్రవీణ్, సూర్య, భాను, భిక్షపతి, సంజీవ, ప్రభావతి, సనా, ఉమా, ప్రమీల, కుమారస్వామి, మల్లేశం, రాజేశం తదితరులు పాల్గొన్నారు.


