● మాజీ మావోయిస్టు ఆశన్న
వెంకటాపురం(ఎం): యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం అద్భుత కళా సంపదకు నిదర్శనమని మాజీ మావోయిస్టు తక్కళ్లపల్లి వాసుదేవారావు అలియాస్ ఆశన్న పేర్కొన్నారు. గురువారం మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆశన్నతో పాటు లొంగిపోయిన మావోయిస్టులు సందర్శించి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పాకళాసంపద బాగుందని వారు కొనియాడారు.
భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్
● వివరాలు వెల్లడించిన పోలీసులు
వరంగల్: వరంగల్ 14 డివిజన్ ఎస్ఆర్నగర్లో ఈనెల 9వ తేదీన భార్యను హత్య చేసిన ఘటనలో భర్తను అరెస్ట్ చేసినట్లు ఏనుమాముల ఇన్స్పెక్టర్ జువ్వాజీ సురేశ్ తెలిపారు. ఈ మేరకు గురువారం పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గాంధీనగర్–2కు చెందిన చిలుకలపల్లి అనిత (40)కు వడ్లకొండ గ్రామానికి చెందిన అబ్బరబోయిన రాజుతో 23 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా వీరు ప్రస్తుతం 14వ డివిజన్లోని ఎస్ఆర్ నగర్లో నివాసం ఉంటున్నారు. రాజు కొంతకాలంగా మద్యం, జూదానికి బానిసై భార్యను నిత్యం వేధిస్తున్నాడు. ఈక్రమంలో ఈనెల 9వ తేదీన బంధువుల దశదిన కర్మకు వెళ్లి వచ్చిన భార్యతో రాజు గొడవపడ్డాడు. అనంతరం రోకలితో ఆమె తలపై కొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అనితను వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందారు. ఈ ఘటనపై మృతురాలి సోదరి సునీత ఫిర్యాదు మేరకు రాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ సురేశ్ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థి సంఘాలకు
ఎన్నికలు నిర్వహించాలి
● కేయూ రౌండ్టేబుల్
సమావేశంలో వక్తల డిమాండ్
కేయూ క్యాంపస్ : విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. గురువారం కేయూ సెమినార్హాల్లో పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలనే అంశంపై రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి కేయూ తెలుగు విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. నాగరాజు ముఖ్యవక్తలుగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహణపై నిషేధం విధించారన్నారు. నిషేధం విధించి 38 ఏళ్లు గడిచాయన్నారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక కూడా విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. శాంతిభద్రతల సమస్య అయితే సాధారణ ఎన్నికలు ఎలా నిర్వహిస్తున్నాని ప్రశ్నించారు. ఇప్పటికై నా విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలని, లేని పక్షంలో ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. వివిధ విద్యార్థి సంఘాల నేతలు మర్రి మహేశ్, గుర్రం అజయ్, బాలరాజు, రాజ్మహ్మద్, కుమారస్వామి, తిరుపతి, బొట్ల మనోహర్, వినయ్, అనూష, ఠాగూర్, రాకేశ్, శివ తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేట్ స్కూల్
ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు
కాజీపేట రూరల్ : నగరంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో బాలికపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సుబేదారి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న బాలికపై ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక విషయం తల్లిదండ్రులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సుబేదారి పోలీసులు తెలిపారు.


