హన్మకొండ అర్బన్ : హనుమకొండ జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమన్వయంతో అమలుచేస్తూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంతోపాటు విద్య, వైద్య రంగాల ప్రాధాన్యతను ఇస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ఎంపీ కడియం కావ్య అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. సమావేశంలో మహిళా శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య, విద్య, వ్యవసాయం, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, రహదారులు తదితర శాఖల పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ కావ్య మాట్లాడుతూ పాఠశాలల్లో డ్రాపౌట్లను తగ్గించి విద్యార్థుల ప్రవేశాలను పెంచాలని సూచించారు. బాల్యవివాహాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని, వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పదో తరగతి ఫలితాల్లో జిల్లా అగ్రస్థానంలో నిలవాలని సూచించారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుకు అధికారులు సమష్టిగా పనిచేయాలని సూచించారు. వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా కార్యాచరణతో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చై ర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, మేయర్ సుధారాణి, అదనపు కలెక్టర్ రవి, తదితరులు పాల్గొన్నారు.
స్పోర్ట్స్ స్కూల్స్ అడ్మిషన్ల పోస్టర్ ఆవిష్కరణ
హన్మకొండ అర్బన్ : రాష్ట్రంలోని క్రీడా పాఠశాలలలో 2026–27 విద్యాసంవత్సరానికి ప్రవేశాల సంబంధించిన పోస్టర్ను శనివారం జిల్లా కలెక్టరేట్లో హనుమకొండ కలెక్టర్ చాహత్ జాబ్పాయ్, ప్రజా ప్రతినిధులు ఆవిష్కరించారు. రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్, హనుమకొండ, తదితర క్రీడా పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. క్రీడల్లో ప్రతిభ కలిగిన విద్యార్థులను గుర్తించి వారికి నాణ్యమైన విద్యతోపాటు ప్రత్యేక క్రీడా శిక్షణ అందించడమే స్పోర్ట్స్ స్కూల్స్ లక్ష్యమని తెలిపారు.
‘దిశ’ సమావేశంలో వరంగల్
ఎంపీ డాక్టర్ కడియం కావ్య


