సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలి..
వరంగల్ క్రైం: మహిళలు పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, సమాన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగుతున్నారని వరంగల్ పోలీస్ కమి షనరేట్ సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత పేర్కొన్నారు. అప్రమత్తతే ఆయుధమని, పరిచయం లే ని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాల ని సూచించారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల భద్రత, సవాళ్లు, సమస్యలను అధిగమించడం ఎలా తదితర అంశాలపై డీసీపీ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
ప్రతి పోలీస్స్టేషన్లో ‘సన్నిహిత’
కేంద్రం ఏర్పాటు..
గతంతో పోలిస్తే ఇప్పుడు పోలీస్ స్టేషన్ పరిసరాలు, పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం బాధిత మహిళలు వారి కష్టాలు, ఇబ్బందులను ధైర్యంగా చెప్పుకునేందుకు ప్రతి పోలీస్ స్టేషన్లో ‘సన్నిహిత’ కేందంర ఏర్పాటు చేశాం. సన్నిహిత విధులను మహిళా పోలీస్ అధికారి నిర్వహిస్తారు. దీంతో పోలీస్ స్టేషన్కు వచ్చే మహిళలు ఎవరికి సమస్యలను సన్నిహితతో చెప్పుకుంటారు.
మహిళల కేసుల ఛేదనలో పురోగతి..
మహిళలు, యువతులు, బాలికలకు సంబంధించిన కేసుల ఛేదనలో పురోగతి ఉంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో మహిళల కేసుల్లో కన్వెక్షన్ గతంలో 11 శాతం ఉండేది. గతేడాది కన్వెక్షన్ శాతం 16కు పెరిగింది. పోక్సో కేసుల్లో 35 శాతం ఉంది.
అన్యాయం జరిగితే ఫిర్యాదు చేయాలి..
సుబేదారి పీఎస్ పరిధిలో తల్లిదండ్రులు లేని ఓబాలిక తన పెద్దమ్మ దగ్గర ఉంటోంది. 43 ఏళ్ల వ్యక్తి ఓరాత్రి బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలిక పరిస్థితిని చూసి అడగడంతో విషయం వెలుగు చూసింది. దీంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించాం. ఎల్కతుర్తి పోలీస్స్టేషన్ పరిధిలో ఓ గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని ఓ యువతిపై యువకుడు అత్యాచారం చేశాడు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశాం. అన్యాయం జరిగితే ఫిర్యాదు చేయాలి. సమాచారం ఇస్తే ఇంటి వద్దకే వచ్చి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు.
చాలామంది యువతులు వివిధ ప్రాంతాల నుంచి నగరానికి చదువు, ఉద్యోగాల కోసం వస్తున్నారు. అందులో కొంతమంది పరిచయం లేని వ్యక్తులతో దగ్గరవుతున్నారు. ఇలాంటివి చివరకు బాధను మిగిలుస్తున్నాయి. సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలి. యువకులతో ఇష్టారాజ్యంగా తిరిగితే ఫొటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తారు. కొంతమంది బాలికలతో డ్రగ్స్ తెప్పించుకుని వాడుతున్నారు. హాస్టళ్లలో ఉంటున్న వారు ఒకటికి రెండుసార్లు ఎక్కడైనా సీక్రెట్ కెమెరాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.
పరిచయం లేని వ్యక్తులతో
జాగ్రత్తగా ఉండాలి
సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత


