● సబ్బుల వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతున్న ఆదివాసీ మహిళలు
● రూ. కోట్ల టర్నోవర్ సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న అతివలు
ఏటూరునాగారం : పట్టుదల, ఆసక్తి ఉంటే ఏదైనా సాధించొచ్చు. ఎంతటి కష్టతర లక్ష్యమైనా సులువుగా అధిరోహించొచ్చు. దీనికి నిదర్శమే ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శివాపురం గ్రామానికి చెందిన ఆదివాసీ నిరక్షరాస్య మహిళలు. నిత్యం కూలీ, వ్యవసాయ పనుల్లో లీనమయ్యేవాళ్లంతా సాధికారత దిశగా అడుగులు వేశారు. స్వయం ప్రతిపత్తి సాధించాలనే ఉద్దేశంతో సబ్బుల (డిటర్జెంట్) తయారీకి శ్రీకారం చుట్టారు. ‘సమ్మక్క సారలమ్మ’ జాయింట్ లయబిలిటీ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఆరంభంలో ఒడుదొడుకులు ఎదురైనా తట్టుకొని నిలబడ్డారు. ప్రస్తుతం ఆర్థికంగా బలపడి పల్లెల్లో పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా వారిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
చేయి చేయి కలిపి
గ్రామానికి చెందిన ధనసరి సౌజన్య, పూనెం రమ, పూనెం సీతమ్మ, కోసం సమ్మక్క, చింత జ్యోతి, సిద్ధబోయిన శరత్, ధనసరి నర్సయ్యకు ఐటీడీఏ ద్వారా 2019లో రూ.23 లక్షలతో ఎంఎస్ఎంఈ పథకంలో భాగంగా సబ్బుల తయారీ యూనిట్ మంజూరైంది. గ్రామంలోనే ఈ కేంద్రాన్ని నెలకొల్పారు. వాళ్లు తయారు చేసిన సబ్బులను గిరిజన సహకార సంస్థ కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. ఈ సబ్బులను ఉట్నూరు, భద్రాచలం, మన్ననూరు, ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమశాఖ పాఠశాలలు, హాస్టళ్లకు సరఫరా చేసేవాళ్లు. అలా ఆదాయం సమకూరడంతో ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేశారు. పొదుపు మంత్రం పఠిస్తూ జీవితంలో పైకి ఎదుగుతున్నారు.
సమష్టిగా పని చేస్తూ సబ్బులను తయారు చేస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నాం. రోజూ పది వేల వరకు సబ్బులు తయారు చేస్తున్నాం. ఇప్పుడు కూలీకి స్వస్తి పలికాం. ప్రభుత్వం సహకరిస్తే పెద్ద యూనిట్ నెలకొల్పుతాం.
– పూనెం రమ,
గ్రూపు ప్రధాన కార్యదర్శి


