వేతనాలు ఎక్కువగా ఉన్నాయనడం సరికాదు
హన్మకొండ: ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయని ఆకునూరి మురళి విద్యా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తూ చెప్పడం సరికాదని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు తూపురాణి సీతారం అన్నారు. ఈ వ్యాఖ్యల్ని తమ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. హనుమకొండలోని సెయింట్ పీటర్స్ పబ్లిక్ స్కూల్లో ఆదివారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాంనగర్ యూనిట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తూపురాణి సీతారాం మాట్లాడుతూ పెరిగిన ధరల గురించి ఆకునూరు మురళికి తెలియదా అని ప్రశ్నించారు. 1966లో 10 గ్రాముల బంగారం ధర సెకండరీ గ్రేడ్ టీచర్ స్కేల్ మూలవేతనంతో సమానంగా ఉండేదని, ఇప్పుడు ఆ ధరల ప్రకారం ఉపాధ్యాయుల వేతనాలు ఉన్నాయా అని ఆలోచించాలని సూచించారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో గరిష్టంగా రూ.500తో వైద్యం అందిస్తుంటే మనకు ఎందుకు సరిపోదని నిలదీశారు. ఒక శాతానికి మించి కాంట్రిబ్యూషన్ విధిస్తే పోరాటాలు తప్పవని ఆయన హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఆకునూరు విద్యాదేవి, జిల్లా బాధ్యులు జన్నపురెడ్డి ప్రభాకర్ రెడ్డి, నారాయణగిరి వీరన్న, కాంతాల లక్ష్మారెడ్డి, రహమాన్, సమ్మోహి ధర్మయ్య, సిరంగి రాజయ్య, మందల వెంకట్ రెడ్డి, నాగపురి రాజయ్య, కొంపెల్లి రామచంద్రం, రామానుజం, తుమ్మ రమేశ్బాబు, తదితరులు పాల్గొన్నారు.


