‘అరైవ్.. అలైవ్’ను ఉద్యమంగా సాగించాలి
జనగామ/ వరంగల్ క్రైం: రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరెవ్.. అలైవ్ కార్యక్రమాన్ని ఉద్యమంగా కొనసాగించాలని డీజీపీ శివధర్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం జనగామ జిల్లా కేంద్రం వెస్ట్ జోన్ పరిధి లోని ఏసీపీ కార్యాలయంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయన్నారు. నేరస్తులు ఎక్కడో ఉండి టెక్నాలజీ వినియోగించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ క్రమంలో ప్రతీ అధికారి సైబర్ నేరాలపై అవగా హన కల్పించాలన్నారు. ప్రధానంగా స్టేషన్ అధికా రులు రికార్డుల నమోదుపై దృష్టి సారించాలని, రౌడీ షీటర్లు, అనుమానితులను ప్రత్యక్షంగా వెళ్లి తనిఖీ చేయాలన్నారు. ప్రతీ అధికారి తన స్టేషన్ పరిధిలోని హిస్టరీ పై అవగాహన కలిగి ఉండాలని, ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు సామాజిక సమస్యగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్డు ప్రమాదాలపై మరింత అవగాహన కల్పించాలని, ఇందుకోసం ప్రతీనెల చివరివారం అరైవ్.. అలైవ్ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. అలాగే ఇసుక, రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపాలన్నారు. సమావేశంలో డీసీపీలు రాజమహేంద్ర నాయక్, అంకిత్ కుమార్, దార కవిత, ఏఎస్పీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు
డీజీపీ శివధర్ రెడ్డి
పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష
‘అరైవ్.. అలైవ్’ను ఉద్యమంగా సాగించాలి


