వరంగల్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. నగర మేయర్ గుండు సుధారాణి, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, హనుమకొండ కలెక్టర్, ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, ప్రజాప్రతినిధులు, అధికారులు బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో చీపుర్లు చేతబూని చెత్తను తొలగించి పరిసరాలు శుభ్రం చేశారు. శానిటేషన్ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. 99 రోజులపాటు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మేయర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి–ప్రణాళికను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. వారం రోజుల పాటు పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. అంతేకాకుండా నీటి సరఫరాతోపాటు మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలన్నారు. హనుమకొండ కలెక్టర్, ఇన్చార్జ్ కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. పీహెచ్సీల స్థాయిలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రేటర్ పరిధిలో 90 శాతం ప్రాజెక్టులు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని, ఉర్సు, భద్రకాళి, వడ్డేపల్లి బండ్ను ప్రారంభించేలా చూస్తామన్నారు. స్థానిక కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, సీహెచ్ఓ రమేశ్, అకౌంట్స్ ఆఫీసర్ శివ లింగం, ఇన్చార్జ్ సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, బిర్రు శ్రీనివాస్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, హెచ్ఓ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
చీపుర్లతో చెత్తను తొలగించిన
మేయర్, కలెక్టర్, ఎమ్మెల్యే
భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, అధికారగణం


