హన్మకొండ అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్న్స్ హాలులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై గ్రామీణ, పట్టణ ప్రజాప్రతినిధులకు నిర్వహించిన అవగాహన సదస్సును మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం గ్రామాలు, డివిజన్ల అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఇందులో పూర్వ విద్యార్థులు, ఎన్ఆర్ఐలను గ్రామాభివృద్ధిలో భాగస్వాములను చేయాలని సూచించారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీరమాకాంత్, డీఆర్డీఓ మేన శ్రీను, తదితర అధికారులు 99 రోజుల కార్యాచరణపై ప్రజాప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు, పారిశుద్ధ్యం, ఇతర అంశాలపై జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రతిబింబించే విధంగా ఏర్పాటుచేసిన ఫొటోప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఎండీ అజీజ్ ఖాన్, పరకాల మున్సిపల్ చైర్మన్ సునీల్ కుమార్, జడ్పీ సీఈఓ శేషాద్రి, అధికారులు, సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి


